November 21, 2014

Socrates Qutations .....My Slideshow

Socrates Qutations .....My Slideshow......I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload) By ~~~~~Sweta Vasuki

Om Namo Narayanaya (ఓం నమో నారాయణాయ)

Om Namo Narayanaya  Chanting (ఓం నమో నారాయణాయ)
By ~~~~ Sweta Vasuki

Ganapati Slokam (గణపతి శ్లోకం)

Ganapati Slokam (గణపతి శ్లోకం)
By.... Sweta Vasuki

Thagore Quotations .... My Slideshow

Thagore Quotations .... My Slideshow ------- I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload).... By ~~~~ Sweta Vasuki

Definition of Poetry....... My Slideshow

Definition of Poetry....... My Slideshow.....I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload) By~~~~ Sweta Vasuki

Aanimutyalu (ఆణిముత్యాలు) My Slideshow

Aanimutyalu (ఆణిముత్యాలు) My Slideshow....... I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload) By~~~~~ Sweta Vasuki

Shakespeare Quotations ......My Slideshow

I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload) By~~~~ Sweta Vasuki

సోక్రటీస్ సూక్తులు 15

సోక్రటీస్ సూక్తులు 15


సోక్రటీస్ సూక్తులు 14

సోక్రటీస్ సూక్తులు 14


సోక్రటీస్ సూక్తులు 13

సోక్రటీస్ సూక్తులు 13


సోక్రటీస్ సూక్తులు 12

సోక్రటీస్ సూక్తులు 12


సోక్రటీస్ సూక్తులు 11

సోక్రటీస్ సూక్తులు 11


సోక్రటీస్ సూక్తులు 10

సోక్రటీస్ సూక్తులు 10


సోక్రటీస్ సూక్తులు 09

సోక్రటీస్ సూక్తులు 09


సోక్రటీస్ సూక్తులు 08

సోక్రటీస్ సూక్తులు 08


సోక్రటీస్ సూక్తులు 07

సోక్రటీస్ సూక్తులు 07


సోక్రటీస్ సూక్తులు 06

సోక్రటీస్ సూక్తులు 06


సోక్రటీస్ సూక్తులు 05

సోక్రటీస్ సూక్తులు 05


సోక్రటీస్ సూక్తులు 04

సోక్రటీస్ సూక్తులు 04


సోక్రటీస్ సూక్తులు 03

సోక్రటీస్ సూక్తులు 03


సోక్రటీస్ సూక్తులు 02

సోక్రటీస్ సూక్తులు 02


సోక్రటీస్ సూక్తులు 01

సోక్రటీస్ సూక్తులు 01


Gayatri mantram (Gayatri chanting) ........ గాయత్రి మంత్రం

Gayatri mantram (Gayatri chanting) ........  గాయత్రి మంత్రం

November 19, 2014

చిన్న 'సారీ' చెప్పేయండి

చిన్న 'సారీ' చెప్పేయండి


మీరు మీ భార్య లేదా భర్తతో...హ్యాపీగా మంచి రిలేషన్ లో వుండాలను కు౦టున్నారా? అయితే ఓకే ఒక్క సూత్రం వుంది. దానిని పాటించ౦డి చాలు అంటున్నారు పరిశోధకులు..! ''సారీ'' ( Sorry ) ని కాస్త విరివిగా వాడితే చాలు బంధం బలపడుతుంది అంటున్నారు వీరు. సుదీర్ఘ౦గా కొన్ని వందల జంటలపై సాగించిన అధ్యయనంలో భార్య భర్తలకి ఒకరిపై ఒకరికి ఉండే ఆరోపణల్లో మొదటిస్థానంలో ఈ 'సారీ' చెప్పకపోవడమే నిలిచి౦దిట.

 మనసు గాయం చిన్నదైనా, పెద్దదైనా ఎదుటవ్యక్తి దానికి 'సారీ' చెప్పకపోతే దానిని తమపై ప్రేమ లేనట్లుగానే భావిస్తారట. భార్య అయినా భర్త అయినా.. నిర్లక్ష్యం, ప్రేమ లేకపోవడం, బాధ్యతారాహిత్యం, ఇలా అ ఫీలింగ్ కి రకరకాల మాస్కులు తొడిగేసి బాధ పడిపోతారట. ఇక ఆ భావనలు మనసుని పట్టి కుదిపెస్తుంటే అనుబంధం బీటలు వారక ఏమవుతుంది చెప్పండి?

చిన్న సారీ పెద్ద ఉపద్రవాలని ఆపెయ్యగలదు అంటున్నారు పరిశోధకులు. చిన్న చిన్న మనస్పర్ధలు ఒకొటోకటిగా చేరి మనసును విరిచేస్తాయి కాబట్టి ఎదుటి వ్యక్తి మనసు నొప్పి౦చగానే సిన్సియర్ గా సారీ చెప్పండి..బంధాన్ని కాపాడుకోండి అని సలహా ఇస్తున్నారు. మరి కాస్త ఇగో పక్కన పెట్టి సారీ చెప్పేయడం ప్రారంభించ౦డి.     

By~~~~~~రమ

http://www.teluguone.com/news/content/sorry-will-solve-the-issues-35-39713.html#.VGxbqzSUdQA


మన కోపమే మన శత్రువు

మన కోపమే మన శత్రువు


మంచి వంటకం కుదరాలంటే అన్ని రుచులు వేటికవి సమపాళ్ళలో పడాలి. అప్పుడే కమ్మని వంటకం తయారవుతుంది. పొరపాటున ఏ ఒక్క రుచి ఎక్కువైనా వంటకంమొత్తం పాడైపోయినట్టే. జీవితం కూడా అంతే కదా! అన్ని భావావేశాలు వేటి స్థాయిలో అవి ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ ఒక్క భావావేశం మనసుని అతిగా ఆక్రమించినా మొత్తం చికాకుగా తయారవుతుంది. మనం గుర్తించంగానీ, కొన్నిసార్లు కొన్ని భావావేశాలు మనల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బందిపెడతాయి. ఎటొచ్చీ అలవాటు పడిపోయిన మనం వాటిని గుర్తించడానికి, వాటిని వదిలించుకోవడానికి, మనం మారడానికి ఇష్టపడం.

కోపం మనల్నే దహిస్తుంది..
చాలామందిని ఇబ్బందిపెట్టే కోపాన్నే తీసుకోండి. ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలవుతుందో తెలీదు. అప్పటి వరకు ప్రశాంతంగా వున్న మనసు ఒక్క నిమిషంలో అల్లకల్లోలంగా మారిపోతుంది. సర్దుకుందామని, ఆ కోపాన్ని దూరంగా నెట్టేద్దామని ప్రయత్నించిన కొద్దీ మరికొంచెం ఎక్కువవుతుందే గానీ తగ్గదు. ఒకోసారి ఆ కోపాన్ని అంత తొందరగా వదులుకోవడం ఇష్టంలేనట్టు మనం కూడా ఒకదానిపై నుంచి మరో దానిపైకి మన కోపాన్ని మళ్ళిస్తూనే వుంటాం. మండే కట్టె మంటని ఎగజిమ్ముతూనే తనని తాను దహించుకున్నట్టు కోపం వచ్చినప్పుడు ఎవరిమీదో కోపం చూపిస్తున్నాం అనుకుంటాం. కానీ, అది మనల్నే ఎక్కువ బాధపెడుతుంది.

కోపంతో జీవితం శూన్యం..
ఆ నిమిషానికి వచ్చిపోయే కోపం పెద్దగా హాని చేయకపోయినా కొంతకాలం పాటు కొందరిపై నిలిచిపోయే కోపం తప్పకుండా బంధాలను బలహీనపరుస్తుంది. ఒకోసారి మన మనసుని, జీవితాన్ని కూడా శూన్యంగా మార్చేస్తుంది. ఒక్కసారి గుర్తుచేసుకోండి ఎప్పుడైనా ఎవరిపైన అయినా వచ్చిన కోపానికి కారణం మొదట చిన్నదే అవుతుంది. రానురాను ఒకదానికి ఒకటి చేరుతూ మందమైపోతుంది. మనసుని రాయిగా మార్చేస్తుంది. మనకి తెలీకుండానే ఎదుటి వ్యక్తిని బాధపెడతాం. విసుక్కుంటాం. విసిరికొడతాం. ఫలితం తెలిసిందే. కానీ, ఎంత కోపం వచ్చినా మనం అంత తీవ్రంగా ఒక వ్యక్తిని బాధపెట్టడం కరెక్టేనా?

మనసులని గాయపరచొద్దు..
మనసులో ఎక్కడో దాగున్న అక్కసుని తీర్చుకునేందుకు కోపాన్ని సాధనంగా వాడుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు ఇంకోటుండదు. ఒకరిని చూసి మరొకరు, ఒకరు చేశారు కదా అని మరొకరు ఇలా మనసుల్ని గాయపరచుకుంటూ వెళుతుంటే కొన్నాళ్ళకు గాయపడ్డ మనసులు, దూరమైన బంధాలు మిగులుతాయి. పరిగెట్టే కాలంతో అన్నీ సవ్యంగా వుంటేనే బంధాలని కాపాడుకోవడం కష్టంగా మారిన కాలంలో మనసుల్ని గాయపర్చుకుంటూ వెళితే ఆత్మీయత అనే లేపనాన్ని రాసేపాటి అవకాశం కూడా వుండదు.

ఒక మంచి మాట చాలు...
క్షమించడం లాంటి పెద్ద పదాలు వాడక్కర్లేదుగానీ, చెదిరిపోయిన మనసుల్ని, బంధాల్ని సరిచేసే ఒక మంచి మాట మనసు లోతులోంచి వస్తేచాలు అద్భుతాలు జరగక మానవు. కోపం, పగ, ప్రతీకారం వంటి లక్షణాలను ప్రత్యేకంగా అలవర్చుకోనక్కర్లేదు. ముందు తరాల వారికి అలవాటు చేయక్కర్లేదు. వద్దన్నా అవి మన మనసుపై దాడి చేస్తూనే వుంటాయి. ఆత్మీయత అనే కవచాన్ని ధరిస్తే వాటి దాడి నుంచి తప్పించుకోవచ్చు. ద్వేషాని ద్వేషించి దూరంగా తరిమికొట్ట గలిగితే మనకి మనం మంచి చేసుకున్నవారమవుతాం. ప్రేమాప్యాయతలనే మంచి గంధాన్ని మనసు మూలల్లో దాచినా చాలు.. అది సువాసనలు వెదజల్లకపోదు. చుట్టూ తన పరిమళాన్ని నింపకపోదు. ఏమంటారు.. ఆలోచించండి!

By~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/anger-is-your-worst-enemy-35-40356.html#.VGxYZjSUdQA


ఆరోగ్యానికి ఆ నాలుగూ...

ఆరోగ్యానికి ఆ నాలుగూ


డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ ఈ నాలుగూ అందరూ తప్పక తినితీరాలి అంటూ పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోం. వీలయినప్పుడు తింటాం. లేదంటే లేదు. అవునా! కానీ గుండె ఆరోగ్యంగా వుండాలంటే జీడిపప్పులు రోజూ ఓ నాలుగు అయినా తినాలిట. వీటిలో వుండే ఒలోయిక్ ఆమ్లం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమై. రాగి, మెగ్నీషియమ్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఈ జీడిపప్పుల నుంచి లభిస్తాయిట. కాబట్టి ఏ పనిలో వున్నా ఓ నాలుగు జీడిపప్పులను టక్కున నోట్లో వేసుకోవడం మరచిపోవద్దు.

ఇక బాదం ఎందుకు తినాలో తెలుసా? శరీరంలోని హానికర కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది కాబట్టి. వీటిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి లాంటి ఖనిజ లవణాలు, ఇ విటమిన్ గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయిట. గర్భవతులు రోజూ ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలెట్, బి విటమిన్లు బొజ్జలోని పాపాయికి బర్త్ డిఫెక్ట్ లేకుండా చూసుకుంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, మెనోపాజ్ దశలో వున్నవారు ఎండుద్రాక్షని రోజూ తప్పనిసరిగా తినాలిట. ఎందుకంటే, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటిలో కూడా యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇక వాల్ నట్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగటమే కాదు. క్యాన్సర్ల వంటివీ దరిచేరవు. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు, హానికారక కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో వుంటాయి. గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటన్నిటికీ కారణం వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా వుండటమే.

By~~~~~~~~-రమ ఇరగవరపు

http://www.teluguone.com/news/content/dried-fruit-health-benefits-34-35447.html#.VGxWCzSUdQA


ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు...

ఆత్మబంధువులా నిలిస్తే ఆత్మహత్యలే వుండవు


సంవత్సరానికి 1,35,445 మంది... ప్రతిరోజూ సగటున 242 మంది మగవారు, 129 ఆడవారు జీవితాన్ని వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు మన భారతదేశంలో. అందులోనూ 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నవారే ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పాటిస్తున్న ఈరోజున ఆత్మహత్యలని నివారించడానికి మనంగా ఏం చేయాలని ఆలోచించి తీరాలి. సమాజం, సామాజిక సంస్థలు, ప్రభుత్వం బాధ్యత ఎంతవుందో.. వ్యక్తులుగా, మన బాధ్యత కూడా అంతే వుందన్నది నిజం. అందుకే పెద్ద పెద్ద సిద్ధాంతాలని పక్కనపెట్టి సగటు మనిషిగా ఆలోచిస్తే మనతోపాటు మసలే మన కుటుంబంలోని వ్యక్తి లేదా స్నేహితుడు, బంధువు, సహోద్యోగి లేదా పక్కింటివారు... ఇలా మన పరిధుల్లో మనకి పరిచయం వున్నవారు, నిన్నటిదాకా మనతో వున్నవారు హఠాత్తుగా చడీచప్పుడు లేకుండా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అందులో మన పాత్ర ఏం లేదా? మనం చేయగలిగింది ఏం లేదా? వీటిని ఆపడం సాధ్యం కాదా?

చిన్న విషయమే.. అందరికీ తెలిసిన విషయమే.. మనందరి అనుభవంలోనిదే. మనసుకి బాధ కలిగితే పంచుకోవడానికి ఒక వ్యక్తి కావలసి వుంటుంది. ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కేవలం మనసుపెట్టి వినే ఒక్క వ్యక్తి చాలు ఆ నిమిషానికి దేవుడిలా కనిపిస్తాడు. అందుకే వినటం నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమిద్దాం. మనసులోని బాధనంతా వెళ్ళగక్కేందుకు కొంచెం సమయం ఇద్దాం. సత్సంబంధాలు, సాన్నిహిత్యం మనుషుల్లో భరోసాని, ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. ఆపద రాగానే పరిగెట్టుకు రాగలరు. బాధని పంచుకోగలరు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే.. కొంచెం మానవ సంబంధాలపై దృష్టి పెడదాం. ఉదయం లేచి మనకి ఎదురుపడే ప్రతి ఒక్కరిని చిన్న చిరునవ్వుతో పలకరిద్దాం. ఇంట్లోని పనిమనిషి నుంచి ఆఫీసులోని ప్యూను దాకా అందరినీ కుశలం అడుగుదాం. నాలుగు కబుర్లు చెబుదాం. మన జీవితంలోని విశేషాలని పంచుకుందాం. వాళ్ళ జీవితంలోని విశేషాలని అడుగుదాం.

బలమైన మానవ సంబంధాలు ఎప్పుడూ ధైర్యాన్నిస్తాయి. ఆత్మహత్య అనే భూతం ఎప్పుడు ఎవర్ని నిశ్శబ్దంగా కబళిస్తుందో తెలీదు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమని తెలిసీ ఆ క్షణానికి నైరాశ్యానికి లొంగిపోయే వారెందరో! సహాయం చేయగలమా, వారి సమస్యలని తీర్చగలమా అన్నది పక్కన పెడితే, తన బాధలనయితే వినగలం కదా! నాలుగు ధైర్య వచనాలు పలకగలం కదా! ఏదో ఒక దారినైతే చూపించగలం కదా!

ఇలా జరగాలంటే ముందు మనం నలుగురికి అందుబాటులో వుండాలి. ఒంటరితనపు కంచుకోటని బద్దలు కొట్టుకుని బయటకి రావాలి. ఈరోజున ఆ నిర్ణయం తీసుకుందాం. ‘‘ఆత్మహత్యల నివారణకి వ్యక్తిగా నేనేం చేయగలను’’ అన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. నలుగురితో ఆ ఆలోచని పంచుకుందాం. నిస్సహాయంగా, నిర్వేదంగా జీవితానికి వీడ్కోలు పలికే దుస్థితి ఎవరికీ రావద్దు అంటే కొంచెం మానవత్వంతో ఆలోచిద్దాం. మానవ సంబంధాలని బలపర్చుకుందాం.

By~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/-world-suicide-prevention-day-34-38154.html#.VGxUpjSUdQA


బ్రెయిన్ జిమ్... ఇలా చేయాలి...

బ్రెయిన్ జిమ్... ఇలా చేయాలి


ఈమధ్య కాలంలో జ్ఞాపకశక్తికి బ్రెయిన్ జిమ్ చేయాల్సిందేనని నిపుణులు తరచూ చెప్పటం వింటున్నాం. అసలు ఈ బ్రెయిన్ జిమ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి అంటే...

* మన మెదడుని కుడి, ఎడమలుగా విడదీసి కుడి మెదలు, ఎడమ మెదడు అంటారు. ఈ రెండు మెదడులు చురుకుగా వుంటే మంచి జ్ఞాపకశక్తి సొంతమవుతుంది. మరి ఈ రెండు మెదడులు చురుకుగా వుంచటమెలా అంటే, వాటికి పని కల్పించటమే...

* ఎడమచేయి, ఎడమకాలు పనిచేస్తే కుడివైపు మెదడు పనిచేస్తుంది. చురుకుగా వుంటుంది. కుడికాలు, కుడిచేయి పనిచేస్తే ఎడమ మెదడు పనిచేయడం మొదలుపెడుతుంది. సాధారణంగా మనందరం కుడి చేయి, కుడికాలునే ఎక్కువగా కదిలిస్తుంటాం. వాటితోనే పనిచేస్తుంటాం. అలా కాకుండా రెండు చేతులు, కాళ్ళను సమానంగా పనిచేయించ గలిగితే మెదడులోని రెండు భాగాలు చురుకుగా వుంటాయి. కాబట్టి ప్రతిరోజూ రెండు చేతులు, రెండు కాళ్ళను కదిలించేలా వ్యాయామం చేయాలి.

* ఇక పంచేంద్రియాలకు వ్యాయామం ఇవ్వగలిగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చెవులని బ్రెయిన్ క్యాప్స్ అంటారు. వీటికి రోజూ మసాజ్ చేసుకోవాలి. అలాగే కళ్ళు మూసుకుని ఏదైనా పని చేయడం ద్వారా కళ్ళకు వ్యాయామం అయినట్టే. కళ్ళు మూసుకుని వాసనబట్టి వస్తువుని గుర్తుపట్టడం, రుచితో ఆహారాన్ని గుర్తించడం ఇలా చిన్న చిన్న ఛాలెంజెస్‌ని మన పంచేంద్రియాలకు రోజూ ఇస్తూ వెళ్తే వాటికి కావల్సినంత ఎక్సర్‌సైజ్ ఇచ్చినట్టే.

By~~~~~~~ రమ 

http://www.teluguone.com/news/content/brain-gym-exercises-34-38261.html#.VGxSjTSUdQA


సూక్ష్మ వ్యాయామాలతో వెన్నునెప్పి నుంచి మోక్షం

సూక్ష్మ వ్యాయామాలతో వెన్నునెప్పి నుంచి మోక్షం


నడుం నెప్పి ఒకోసారి ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, రోజువారి పనులు కూడా చేయలేక, ఇతరులపై ఆధారపడేంతగా మనల్ని అసహాయులని చేస్తుంది. ప్రతీ పదిమందిలో ఏడుగురు నడుం నెప్పి బాధితులే అంటున్నారు వైద్యులు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ నడుం నెప్పి నుంచి తప్పించుకోవచ్చని కూడా చెబుతున్నారు.
* ఏ కదలికా లేకుండా ఒకేచోట కూర్చుని వుంటే నడుం నెప్పి వచ్చే అవకాశాలు ఎక్కువట. వెన్నెముకకి ఎలాంటి కదలికలు లేక క్రమంగా బిగుసుకుపోవటమే అందుకు కారణం.

* వెన్నెముకకి బలం రావాలంటే రోజూ కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే చాలుట. వెన్నెముక, పొట్ట చుట్టూ వుండే కండరాలు, పక్కటెముకల చుట్టూ వుండే కండరాలకు ఆ వ్యాయామం అందితే వెన్ను గట్టిపడి నడుం నెప్పి వచ్చే అవకాశమే వుండదు అంటున్నారు వైద్య నిపుణులు.

* ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా రోజూ ఓ 20 నిమిషాల పాటు ఈ కింద చెప్పే వ్యాయామాలు చేయగలిగింతే బావుంటుంది.

1. ఓ కుర్చీలో కూర్చుని నేలకు పాదాలను ఆనించండి.
2. ఎదురుగా వున్న టేబుల్ అంచుల దగ్గర చేతుల్ని వుంచాలి.
3. శరీరాన్ని వెనక్కి వంచి, మళ్ళీ ముందుకు తేవాలి. అంటే ఓ విధంగా శరీరాన్ని సాగదీస్తూ ముందుకు, వెనక్కి కదల డం. ఆ స్థితిలోభారమంతా చేతులపై పడేలా చూసుకోవాలి.
4. గోడకి అభిముఖంగా నిలబడి, రెండు చేతుల్ని భుజాల ఎత్తులో గోడకి ఆనించాలి. పాదాల వేళ్ళపై పైకి లేస్తూ, కిందకి దించాలి. ఇలా చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా వుంచడం ముఖ్యం.


నడుం నెప్పి వున్నప్పుడు వైద్యుల సలహా లేనిదే ఏ వ్యాయామమూ చేయకూడదు. సమస్య తీవ్రత తగ్గాక అప్పుడు చిన్నపాటి కదలికలతో మొదలుపెట్టి క్రమంగా వ్యాయామాల స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి.

మనం నిటారుగా నిలబడాలంటే వెన్ను గట్టిగా వుండాల్సిందే. అలా వుండాలంటే మనం రోజూ వ్యాయామం చేయక తప్పదు. సమస్య రాకముందే జాగ్రత్త పడితే మంచిదే కదా. ఇప్పటి మన జీవనశైలిలో రోజంతా కుర్చీకే అతుక్కుపోక తప్పడం లేదు. మరి అలాంటప్పడు మధ్య మధ్యలో పైన చెప్పిన వ్యాయామాల లాంటివి ఆఫీసులో కూడా చేస్తూ వెన్నుదన్నుగా వుంటుంది. ఏమంటారు?

By~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/low-back-pain-exercise-34-38596.html#.VGxP8zSUdQA


నడకలోని నిజాలివి

నడకలోని నిజాలివి


* నడక శరీరంలో ఎముకలు, కండరాలకు మెదడుతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. నడకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కండరాలు తరిగిపోతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే అలవాటు లేనివాళ్ళ శరీరంలో నిత్యం ఉపయోగించగలిగే కీళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఎక్కువశాతం కీళ్ళు బిగుసుకుపోతాయి.

* బరువు తగ్గాలనుకునేవారు నడకకి వెళ్ళేముందు ఏమీ తినకూడదు. ఎందుకంటే, ఓ ముప్ఫై నిమిషాలపాటు నెమ్మదిగా నడవటానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి 45 శాతం, కొవ్వు నుంచి 65 శాతం విడుదలవుతుంది. అంటే నడుస్తుంటే మరింత శక్తి కావాలన్న సంకేతం అందుకున్న శరీరం కొవ్వు నిల్వల్ని కరిగిస్తుంది అన్నమాట.

* నడక మంచిది అన్నారు కదా అని మొదలుపెడుతూనే వేగంగా నడవకూడదు. మొదట 5 - 10 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే ఏ వ్యాయామానికైనా కాసేపటికీ ముందు నుంచీ శరీరాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ వెళ్ళాలి. ఎంత వేగంగా నడవాలీ అంటే, నడుస్తూ కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడనంత వేగం మంచింది. అలాగే నడక ముగించేటప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రిలాక్సింగ్‌గా నడక ముగించాలి.

* నిజానికి నడకతోపాటు కొన్ని వేరే వ్యాయామాలూ శరీరానికి అవసరం. ఎందుకంటే, నడక కొన్ని కండరాలపై ఎక్కువగానూ, కొన్ని కండరాలపై తక్కువగానూ ఒత్తిడి పడేట్ట చేస్తుంది. అందుకని వారంలో ఐదురోజులు నడిస్తే, రెండు రోజులు మీకు నచ్చిన వ్యాయామాలను చేయండి. ఈత, యోగా, ఏరోబిక్స్, జిమ్ ఇలా...

* రోజూ నడిచే అలవాటు వున్నవారికి గుండె, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు 10 నుంచి 20 సంవత్సరాల పాటు వాయిదా పడితీరతాయి అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.

* ఎంతసేపు నడవాలి? దీనికి పరిమితి లేదు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు అన్నది సూత్రం. కాబట్టి 24 నిమిషాలకు తగ్గకుండా వీలునుబట్టి, ఆరోగ్యాన్నిబట్టి ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చుకావాలని నడిచేవారు మాత్రం ఎంత దూరం నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని నడక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి.

* ఇక ఒకసారి నడవటం మొదలుపెట్టాక 12 వారాలపాటు అయినా కొనసాగించాలి. రెండు రోజులో మూడు రోజులో నడిచి మానేస్తే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా వుంటాయట.

* చివరిగా ఒక్కమాట... క్రమం తప్పకుండా మూడు నాలుగు నెలలపాటు నడిస్తే ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇక అప్పుడు మానేద్దామన్నా మానలేరు. కాబట్టి ఒక్క నాలుగు నెలలపాటు ఓపికపట్టి నడిచారంటే ఇక ఆ తర్వాత ఆ నడకే మిమ్మల్ని ముందుకు నడిపించుకుని వెళ్తుంది.

By~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/facts-about-walking-34-38876.html#.VGxMzzSUdQA


మహారాజశ్రీ మిరపకాయ... శ్రీశ్రీశ్రీ యాపిల్!

మహారాజశ్రీ మిరపకాయ... శ్రీశ్రీశ్రీ యాపిల్!


'మిరపకాయ’ చూడటానికి చిన్నదే అయినా మన వంటల్లో దాని స్థానం మాత్రం పెద్దదే. కారం లేనిదే ఏ వంటకం పూర్తి కాదు. కేవలం రుచికి మాత్రమే కాదు... ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయట. మిరపకాయలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు పొటాషియం, మాంగనీసు, ఫోలేట్ వంటి పోషకాలు బాగా లభిస్తాయట. మన ఆరోగ్యానికి మేలు చేసే కాప్సాసిన్ అనే పదార్ధం పచ్చిమిర్చిలో మనకు దొరుకుతుంది. శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడి ఆరోగ్యం చేకూర్చే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పచ్చిమిరపకాయలో ఉన్నాయట.


 తొక్కే కదా అని తీసిపారేయకండి...

ఇక మిరపకాయలలోని విటమిన్ బి శరీరంలో హోమోసిస్టిన్ పరిమాణాన్ని తగ్గించడమే కాదు.. హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందిట. సరే మరి, ఘాటైన మిరపకాయలోనే ఇన్ని సుగుణాలు వుంటే తియ్యటి యాపిల్ పండులో ఎన్ని ఉండాలి? రోజుకో యాపిల్ తింటే ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవు అంటారు కదా. చివరికి రోజుకో యాపిల్ తింటే క్యాన్సర్ కూడా దరిచేరదుట. యాపిల్ పండు తొక్కలో వుండే దాదాపు పన్నెండు రకాల రసాయన పదార్ధాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రీసెర్చ్‌లో తేలింది. ‘ట్రిటర్ పెనాయిడ్స్’గా వ్యవహరించే ఈ పదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయిట. కేవలం క్యాన్సర్ కణాలను అడ్డుకోవడమే కాదు.. ధ్వంసమైన క్యాన్సర్ కణాలను శరీరం నుంచి బయటకి పంపించడంలోనూ యాపిల్ పై తొక్కులు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు పరిశోధకులు. తొక్కులోనే కాదు.. యాపిల్ పండులోనూ అనేక రకాల క్యాన్సర్ నిరోధక ఫ్లేవనాయిడ్‌లూ, ఫినోలిక్ ఆమ్లాలూ ఉంటాయి కాబట్టి తరచుగా యాపిల్ తింటే క్యాన్సర్‌కి చెక్ చెప్పవచ్చని వీరు సూచిస్తున్నారు. సో.. రోజుకో యాపిల్ తినడం అలవాటుగా మార్చుకోవాలి.


హాయిగా ఊపిరి తీయండిలా...

మన శరీరం మొత్తానికి రోజంతా ప్రాణవాయువు సరఫరా అవ్వాలంటే ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేయాల్సిందే. ఈ ఊపిరితిత్తులు బలహీనమైతే జలుబు, దగ్గు వంటివి తరచూ పట్టి పీడిస్తుంటాయి. వీటి బారిన పడకుండా వుండాలంటే వారానికి కనీసం 5 యాపిల్స్ తినడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే వెల్లుల్లిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయిట. అలాగే ఉల్లిపాయలో వుండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, గ్రీన్ టీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది అని తేలింది పరిశోధనల్లో.

మోకాళ్ళ నొప్పులు హుష్ కాకి...

మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి వాటితో బాధపడేవారు రోజూ ఒక యాపిల్ తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అలాగే నువ్వులని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. ములగాకుని సాధారణంగా చాలామంది వంటకాలలో వాడరుగానీ, మునగాకుని వీలైనంత ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల కీళ్ళ నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుందట. ఇవండీ.. చక్కటి ఆరోగ్యానికి కొన్ని మంచి సూత్రాలు.. మరి పాటిస్తారు కదూ!


By~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/apple-and-mirchi-34-40185.html#.VGxI_jSUdQA


ఉద్యోగమే కాదు.. ఆరోగ్యమూ ముఖ్యమే

ఉద్యోగమే కాదు.. ఆరోగ్యమూ ముఖ్యమే


కాస్త ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి... అంటూ స్త్రీలకు ఓ హెచ్చరిక చేస్తున్నారు అధ్యయనకర్తలు. ‘‘అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్’’ ఓ అధ్యయనం నిర్వహించింది. సుమారు మూడువేల మంది మహిళలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికర అంశాలు తెలిశాయి.

1. ఉద్యోగం చేసే మహిళల్లో 70 శాతం మంది కన్నా ఎక్కువమంది అనారోగ్యం బారిన పడుతున్నారనీ, అదీ 32 సంవత్సరాల వయసు  నుంచేనని తెలిసింది.

2. ఊబకాయం, నడుం నొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్టు కూడా తెలిసింది.

3. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య ఇంచుమించు 22 శాతంగా వుంటే, 14 శాతం మహిళలు తీవ్ర సమస్యలతో పోరాడుతున్నట్టు వెల్లడైంది.

4. ఇక శారీరక అనారోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా మహిళలు తక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళన వంటివన్నీ మహిళలను తీవ్రస్థాయిలో ఇబ్బందిపెట్టే అంశాలని, వాటి నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని చెబుతున్నారు నిపుణులు.

ఈ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా మహిళలకి కొన్ని సూచనలు చెప్తున్నారు. అవి ఏంటంటే...

1. పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
2. వ్యాయామం, ధ్యానం వంటివి జీవన శైలిలో భాగం కావాలి.


 కుటుంబాన్ని, ఉద్యోగాన్ని రెండింటినీ సమర్థవంతంగా నిర్వహించాలంటే మహిళలు తప్పకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. మరి ఆలోచించండి. మహిళల ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో ఉందని అధ్యయనాలు చెబుతున్నప్పుడు ఆరోగ్యకర జీవనశైలిని ఆచరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అలాగే... మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తూ, వారికి ఇంటి పనుల్లో సహాయపడితే ఇంటి ఇల్లాలు ఆరోగ్యం వుంటుంది.

By~~~~~~~~~~~-రమ

http://www.teluguone.com/news/content/health-tips-for-women-34-40354.html#.VGxHXzSUdQA


ఈ అయిదు.. ఆ మూడు రోజుల కోసం

ఈ అయిదు.. ఆ మూడు రోజుల కోసం



పిరియడ్స్ సమయంలో విపరీతమైన చికాకు, నీరసం, కడుపునొప్పి, తలనొప్పి వంటివి సాధారణం. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్నిటిని చేర్చడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చుట. అవి ఏంటంటే....

1. నీరు బాగా తాగాలి
శరీరం ఫ్లూయిడ్స్‌ని కోల్పోతుంది కాబట్టి తగినంత నీరు శరీరానికి అందేలా చూసుకోవాలి. కాబట్టి మిగతా రోజుల కన్నా పిరియడ్స్ రోజులలో మంచినీరు కాస్త ఎక్కువగా తగాలి. కాఫీ, టీలని దూరంగా పెట్టడం మంచిది.

2.  ఆకు కూరలు
ఆకు కూరలలో కావలసినంత ఐరన్ వుంటుంది. పిరియడ్స్ సమయంలో శరీరానికి అందాల్సిన పోషకాలని ఈ ఆకుకూరలు అందిస్తాయి. కాబట్టి ఆకు కూరలను ఆ మూడు రోజులూ తప్పనిసరంగా ఆహారంలో చేర్చండి.

3. అరటి పండు
పిరియడ్స్ రోజులలో మూడు స్వింగ్స్ ఉంటాయన్న విషయం తెలిసిందేగా. వాటి నుంచి బయటపడటానికి అరటి పండు మంచి ఔషధం. పొటాషియం, బి6 విటమిన్‌తోపాటు అరటిపండులో వుండే ఇతర విటమిన్లు రక్తంలోని గ్లూకోజ్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి. దాని వలన మూడ్ స్వింగ్స్ తగ్గి హుషారుగా వుంటారు.

4. లెగ్యూమ్స్ (గింజధాన్యాలు)
చిక్కుడు కుటుంబానికి చెందిన బీన్స్ వంటి గింజ ధాన్యాలలో ఐరన్ శాతం ఎక్కువ. వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శారీరక సమతౌల్యం త్వరగా పొందచ్చు.

5. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో వుండే మెగ్నీషియం వుండటమే కాకుండా, ఫీల్‌గుడ్ కెమికల్ అయిన సెరిటోటిని కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి పిరియడ్స్ సమయంలో ఓ చిన్న డార్క్ చాక్లెట్ తింటే చికాకు పోయి హాయిగా అనిపిస్తుంది.

మొత్తానికి పిరియడ్స్ రోజులలో మెగ్నీషియం, ఐరన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, చేపలు, నట్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, పండ్లు వంటివి ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యంగా వుండచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లల ఆహారం విషయంలో అమ్మలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

By~~~~~~ రమ 

http://www.teluguone.com/vanitha/content/ladies-menstrual-pain-944-31157.html#.VGxE2zSUdQA



పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష



పిల్లల్ని ‘పిల్లలు’ అంటూ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రెండేళ్ళ సిసింద్రీ నుంచి ఇష్టాలు, అయిష్టాలు, కోపం, విసుగు అన్నీ ప్రదర్శిస్తూ వుంటారు. మన స్పందన బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతూ వుంటుంది. చాలాసార్లు మీరు గమనించే వుంటారు.. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఏదన్నా కావాలంటే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతారు. మనకి కోపం వచ్చేస్తుంది అది చూసి. వేలెడంత లేవు - ఏదన్నా కావాలంటే నెమ్మదిగా అడగకూడదా.. నామీదే అరుస్తావా అంటూ పిల్లాడిని కోప్పడతాం.కానీ నిజానికి ‘మాన్యుపులేషన్’ ఇంకా అలవాటు కాని వయసది. నెమ్మదిగా బతిమాలితేనే బావుంటుందని వాళ్ళింకా నేర్చుకోని అమాయకత్వం మరి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని అనుకరించడమే కరెక్టు అనుకునే సందర్భమది. మనం పిల్లలకి ఏదన్నా చెప్పాలంటే గొంతు పెంచి అరిచేకదా చెబుతాం. వాళ్ళూ అదే చేస్తున్నారు. కానీ, దానికి మనకి కోపం వస్తుంది. అయితే ఇక్కడే మని వాళ్ళని పెద్ద కన్ఫ్యూజన్‌లో పడేస్తాం. అమ్మ అరిస్తే తప్పులేదుగానీ, నేను అరిస్తే తప్పేంటి? అలాగే కదా చెప్పాలి? అని ఆ పసిపాపల మనసులు ఆలోచనలో పడిపోతాయి.

పెద్దల్లాగే పిల్లలూనూ:  ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే వారిని పెంచడానికి మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ వుండాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సాధారణంగా పిల్లల ప్రవర్తనను అంచనా వేసే విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు, చేసుకోవాల్సిన సర్దుబాట్లు కొన్ని ఉన్నాయంటూ పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘వాటికి మొండితనం చాలా ఎక్కువ’’ అంటూ మనం పిల్లల్ని పదేపదే అంటుంటాం కదా, ఆ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా? కొంతమంది పిల్లలు ప్రతీ పనిని చాలా చక్కగా చేయాలని తాపత్రయపడతారు. ఎక్కడా రాజీపడరు. అలాగే వాళ్ళ పనులన్నీ కూడా మనం అలా పద్ధతిగా చేయాలని ఆశిస్తారు. దాంతో మొండిగా ప్రవర్తిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది.

ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించండి:  మనం పిల్లల్ని నిందించే ముందు వారిలో వున్న ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించాలి. దానిని సరైన దారిలోకి మళ్ళించాలి. ‘‘రాజీలేని మనస్తత్వం’’ ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కావల్సిందల్లా పట్టు విడుపులు నేర్చుకోవడమే. పిల్లలకు ఆ విషయంపై క్లాసు తీసుకుంటే వాళ్ళకేం అర్థం కాదు. అలాకాక ప్రాక్టికల్‌గా ఆ మనస్తత్వాన్ని వాళ్ళకి వాళ్ళే ఎలా గుర్తించాలో, మనసుని ఎలా మలచుకోవాలో నేర్పించాలి. ఉదాహరణకి స్కూలులో ఇచ్చిన ఏదో ప్రాజెక్టు పనిని ఎంత చేసినా సరిగా రాలేదంటూ పిల్లలు విసుగు పడుతుంటే లేదా మిమ్మల్ని విసుగెత్తిస్తుంటే తేలిగ్గా తీసుకుని కొట్టిపారేయకూడదు. 

సమస్యపై పనిచేయడం నేర్పాలి:  పిల్లల దగ్గరకి వెళ్ళి కూర్చుని ఇది కొంచెం కష్టమే కానీ, నువ్వు చేయగలవు - ఎటొచ్చీ నువ్వు కాస్త టెన్షన్ పడకుండా చేయాలి. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టావనుకో చురుగ్గా చేయగలవు.... ఇలా చెప్పి చూడండి. అలాగే, పిల్లలు ఏదన్నా కావాలని మొండిపట్టు పడితే ‘‘నేను ఇవ్వను’’ అని కచ్చితంగా చెప్పకుండా ‘‘తప్పకుండా ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు.. అది ఎందుకు అవసరం... ఇప్పుడే ఎందుకు కావాలి... ఆలోచించి నాకు చెప్పు’’ అనాలిట. ఇలా చేయడం వలన సమస్యపై పనిచేయడం నేర్చుకుంటారుట పిల్లలు. అంటే, రాజీలేని మనస్తత్వం మంచిది కాదు - అది మొండితనమని మనం విమర్శించటం లేదు - కానీ అలా రాజీ పడలేనప్పుడు దానిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాం. అలాగే తన ప్రవర్తనకి కారణాన్ని తానే ఆలోచించుకునేలా చేస్తున్నాం.

మనవంతు సహకారం చాలా ముఖ్యం:  పిల్లలు ఎదుగుతూ, చుట్టూ పరిశీలిస్తూ తమ అనుభవాలని సమీక్షించుకుంటూ ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఆ ప్రయత్నానికి మన వంతు సహకారం అందిస్తే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాకాక పిల్లల ప్రతి చర్యనీ విమర్శిస్తూ, అతిగా స్పందిస్తూ, వారిని నిందిస్తూ వుంటే అది క్రమశిక్షణ అని మనం అనుకున్నా, అది పిల్లల సహజ నైజాన్ని, వ్యక్తిత్వాన్ని చిదిమేయడమే అవుతుంది. అందుకే వారిని విమర్శించేముందు, ఎలా సరిచేయొచ్చో ఆలోచించమంటున్నారు నిపుణులు.

By~~~~~ రమ 

http://www.teluguone.com/vanitha/content/how-to-suggest-child-good-behaviour-76-30684.html#.VGxBqjSUdQA


వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు!

వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు!


‘‘పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరగాలంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు.. మీరు గట్టిగా పట్టుకున్న వారి వేలుని వదిలేయండి చాలు’’ ఈ మాటలు అన్నది 12 ఏళ్ళపాటు సుదీర్ఘంగా తల్లిదండ్రులు, పిల్లలపై అధ్యయనం చేసిన ఓ యూనివర్సీటీ బృంద సభ్యులు.పిల్లల్లో ఆత్మవిశ్వాసం అన్న అంశంపై వీరి అధ్యయనం సాగింది. అందులో పిల్లల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించారు. అందులో తల్లిదండ్రుల అతి జాగ్రత్త, ప్రేమ కూడా కారణమని తేలింది.


సాధారణంగా పిల్లల మీద ప్రేమకొద్దీ వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటారు పేరెంట్స్. వారికి తెలీదని, చేతకాదని అంటూ దగ్గరుండి అన్నీ చేస్తారు. సలహాలు, సూచనలు, నీకేం తెలీదనే అదిలింపులు సరేసరి. అయితే ఇది సరికాదని, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిని నెమ్మది నెమ్మదిగా స్వతంత్రంగా పనులు చేసేలా, ఆలోచించేలా వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు నిపుణులు. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుని తిరిగి ప్రయత్నించమనాలి. పిల్లలు చేసే పొరపాట్లు వారి ఎదుగుదలలో ఓ తప్పనిసరి ప్రాసెస్ అని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వారు సలహా అడిగితేనే ఇవ్వాలి అంటున్నారు వీరు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ప్రయత్నాన్ని, తప్పొప్పులని విమర్శించకూడదట. నీవల్ల కాదులే అని చొరబడి వారి పని కూడా చేయకూడదట. అది మూడేళ్ళవాడు కావొచ్చు.. పదమూడేళ్ళవాడు కావొచ్చు.. వాడి పరిధిలో వాడి పనేదో వాడికి చేతనైనట్టు చేయనివ్వాలి. అప్పుడే వారు ‘ఆత్మవిశ్వాసం’ అనే కవచాన్ని పొందగలరు అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. పిల్లల ఎదుగుదల క్రమమంతా ఓ చక్కటి ఆట. ఆ ఆటలో వారు ఒకసారి గెలుస్తారు. మరోసారి ఓడిపోతారు. ఆ ఓటమిలోనే మళ్ళీ ఎలా గెలవాలో వాళ్ళే నేర్చుకుంటారు.

తల్లిదండ్రులుగా ఆ ఆటని చూస్తూ ఆనందించడమే మనం వారికివ్వగలిగే అమూల్యమైన బహుమతి. ఏమంటారు?

By~~~~~~ రమ

http://www.teluguone.com/vanitha/content/-tips-on-helping-your-child-develop-confidence-76-30025.html#.VGw_1jSUdQA


పిల్లల మెను

పిల్లల మెను



పిల్లలకి పోషకాహారం ఇస్తున్నామా లేదా.. క్యాలరీలు, ప్రొటీన్లు సరిగ్గా అందుతున్నాయా లేదా.. అమ్మకి అన్నీ సందేహాలే! అందుకే మూడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ పిల్లలకు రోజుకెన్ని క్యాలరీలు తప్పనిసరిగా అందాలి. ఎంత ప్రొటీన్ ఆహారంలో వుండేలా చూసుకోవాలి... వంటి వివరాలు వివరంగా ‘అమ్మకోసం’.

* 3 సంవత్సరాల చిన్నారులకు రోజుకు 1200 క్యాలరీల ఆహారం అందులో 22 గ్రాముల ప్రొటీన్లు వుండాలి.

* ఇక 4 నుంచి 6 ఏళ్ళ వయసు వారికి రోజూ 1700 క్యాలరీలు, అందులో 40 గ్రాముల ప్రొటీన్లు తప్పనిసరి.

* ఇక ఏడేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ వయసు చిన్నారులకు రోజూ 1950 క్యాలరీలు అందులో 41 గ్రాముల ప్రొటీన్లు వుండాలి.

కేవలం ప్రొటీన్లనే కాకుండా కాల్షియం, ఐరన్... తదితర పోషకాలూ పిల్లలకి సమానంగా అందినప్పుడే వారి శారీరక, మానసిక ఎదుగుదల సంపూర్ణంగా వుంటుంది.

ఈ లెక్కలన్నీ ఎలా సరిచూసుకోవటం అంటే నిపుణులు కొన్ని ఆహార పదార్ధాలని సూచిస్తున్నారు. వీటిని పిల్లలకి తయారుచేసి పెట్టడం ద్వారా పిల్లలకు తగినన్ని క్యాలరీలు, ప్రొటీన్లు అందించవచ్చు.

ఉదయాన్నే...
పాలు తాగించాలి. ఆ తర్వాత ఈ క్రిందివాటిల్లో రోజుకు ఓ రకం వారికి తినిపించాలి.

ఉడకబట్టిన కోడిగుడ్డు
బ్రెడ్ ఆమ్లెట్
గుడ్డు పొరటు
పాలక్ రోటీ
ఆలూ రోటీ
ఇడ్లీ
క్యారట్ ఇడ్లీ
మేతీ రోటీ
సోయా జావ
సోయా, గోధుమపిండి కలిపిన చపాతీ.

పై వాటిల్లోంచి ప్రొటీన్లతోపాటు విటమిన్-ఎ పుష్కలంగా లభించి పిల్లలు చురుకుగా వుంటారు. కంటి చూపు బావుంటుంది.


బ్రేక్ టైమ్‌లో...
ఇక స్కూలు విరామ సమయంలో పిల్లలకు స్నాక్స్ ఇవ్వాల్సినప్పుడు...
1. టమాటో సూప్
2. వెజ్ సూప్
3. పండ్ల రసాలు
4. కస్టర్డ్
5. బాదం పాలు
6. రాగిజావ

వీటిల్లో రోజుకు ఒకటి ఇవ్వగలిగితే చాలు. అలానే వీటిని తయారు చేసేప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే పిల్లలకి తగినంత ఐరన్ కూడా అంది శక్తి లభిస్తుంది.


మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో....
లంచ్ బాక్స్‌లో వీలయినంత వరకు రోజుకు ఒక వెరైటీ అందించడానికి ప్రయత్నించాలిట. రంగు, రుచి ఈ రెండూ పిల్లలని ఆకర్షించే అంశాలు కాబట్టి బాక్స్‌లో పెట్టే భోజనం రుచిగానే కాక ఆకర్షణీయంగా కూడా వుండేలా చూసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్‌లో భోజనం వదిలేయడం వంటివి చేయరు.

లంచ్ బాక్స్‌లో తప్పనిసరిగా ఆకుకూర, కూరగాయలు, పప్పు వుండాలి. ఆకుకూర పప్పు, కూరలతో బాక్స్ కట్టవచ్చు. లేదంటే....

1. కిచిడి
2. వెజ్ రైస్
3. ఆకు కూరలతో రైస్ ఐటమ్స్. ఉదాహరణకి పాలక్ రైస్, మేతీ రైస్...
4. టమాటా రైస్ లాంటివి

ఇలా రైస్ ఐటమ్స్ పెట్టినప్పుడు తప్పనిసరిగా క్యారట్, టమాట వంటి కూరగాయలతో చేసిన రైతాను ఇవ్వాలి. మొత్తానికి ఆకుకూరలు, కూరగాయలు పిల్లలకు రోజు అందేలా చూసుకుంటే చాలు వాళ్ళ ఎదుగుదలకి కావలసిన పోషకాలు అందినట్టే.


సాయంత్రం ఏం పెట్టొచ్చు అంటే...
పాలతోపాటు కార్న్ ఫ్లేక్స్ ఇవ్వచ్చు. లేదా అటుకులు, పాలు, బెల్లంతో తయారుచేసే కీర్ వంటివి పిల్లల ఆకలిని తీర్చడంతోపాటు వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి.


రాత్రి భోజనానికి...
పప్పులతో చేసే కిచిడీ, పన్నీర్‌తో చేసిన రోటీ, కూరగాయలతో భోజనం ఇస్తూ తప్పనిసరిగా ఓ కప్పు పెరుగు తినిపించాలి. రాత్రిపూట భోజనం పడుకునే ముందు కాక రాత్రి ఏడు గంటలకల్లా పెట్టి పడుకునే ముందు ఓ గ్లాసు పాలు తాగిస్తే ఆ రోజుకి పిల్లలకి అందాల్సిన పోషకాలన్నీ అందినట్టే.


ఇటీవలి కాలంలో పిల్లల్లో పోషక లోపం ఎక్కువైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం అవగాహన వున్నా పాటించకపోవటం అంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి పిల్లలు పేచీ పెట్టకుండా తింటే చాలని కాకుండా ఎదుగుదలకి అవసరమైన పోషకాలన్నీ వారికి అందేట్టు రోజువారీ ఆహారాన్ని ముందే ప్లాన్ చేసుకుని అందిస్తే పిల్లలు ఉత్సాహంగా, ఆరోగ్యంగా వుంటారు. ఆట పాటల్లో, చదువులో రాణిస్తారు అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ‘అమ్మలూ’ ఆలోచించండి.

By ~~~~~~ రమ

http://www.teluguone.com/vanitha/content/-pillala-menu-76-30185.html#.VGw7oTSUdQA