August 23, 2014

పావగడ శీతలాదేవి - శనీశ్వర ఆలయం

పావగడ శీతలాదేవి - శనీశ్వర ఆలయం

పావగడ పుణ్యక్షేత్రం - అనంతపూర్ - హిందూపూర్ జిల్లాలకి  45 కి. మీ. దూరంలో,  ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో టుముకూరు జిల్లాలో ఉంది.



పౌరాణిక గాథ 

పావగడ - కోట, తోటలతో ప్రకృతి సౌందర్యంతో సదా పచ్చగా ఉండే చిన్ని ఊరు.



హొయసల రాజులు, మొగల్ చక్రవర్తులు, మైసూర్ మహారాజులు మొదలైనవారు పాలించిన ఈ ఊళ్ళో 400 ఏళ్ళకు పూర్వం వర్షాలు లేక  కరువు కాటకాలు తాండవించాయి. పచ్చని పైర్లన్ని ఎండిపోయాయి. జంతువులు, పక్షులు కరువు కాటకాలు వాళ్ళ ఆహరం నీళ్ళు లేక పరితపించసాగాయి. ప్రజలు ఆకలి దప్పులతో అలమటించసాగారు. 

ఏం చెయ్యాలో దిక్కుతోచక ప్రజలందరూ ఆ ఊరికి సమీపాన ఉన్న ఒక అరణ్యాన్ని చేరుకొని, అక్క కఠిన తపస్సు చేస్తున్న మునులతో తమ కష్టాలను తీర్చమని ప్రాధేయపడసాగేరు. 

దయార్ద్ర హృదయులైన మునులు, యోగులు, అందరూ కలుసుకొని, ఆ ఊరిని కాపాడటానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. 

ఒక నల్లరాతిని తీసుకొని, దానిపై శీతలాదేవి మహాబీజాక్షర మంత్రాన్ని రాసారు. దానిపై అమ్మవారిని ఆవాహనం కావించి, భూమిపై ప్రతిష్ఠ జరిపారు. తరవాత ఎన్నో అభిషేకాలు, పూజలు చేసారు. భువిని కాపాడే ఆ తల్లి ఆ ప్రాంతాన్ని కూడా కాపాడాలని నిశ్చయించుకుంది. వర్షాలు బాగా పడ్డాయి, జీవజంతువులు సంతోషపడ్డాయి. ఊరు బాగుపడి ప్రజలంతా సంతోషంగా జీవించసాగారు. ఆనాటి నుండి ఈ యంత్రాన్ని పూజిస్తే అసాధ్యమైన ఎన్నో కోరికలు కూడా సఫలం అయ్యాయి. చుట్టుపక్కల కరువు తాండవించినా ఈ యంత్రాన్ని పూజించటం మొదలుపెట్టారు. అపారమైన నమ్మకంతో వరుణజపం చేస్తే తప్పక వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఏర్పడింది. ఇక పూజలు చేస్తే ఏ ఊళ్ళోనైనా వర్షం పడగలదన్న నమ్మకం ప్రజలకు ఏర్పడింది. యంత్ర ప్రతిష్ఠ జరిపిన అదే ప్రాంతంలో అమ్మవారికి ఒక గర్భగుడిని నిర్మించారు. 

కొన్ని శతాబ్దాల తరవాత కొంతమంది భక్తులు అమ్మవారి పక్కనే శనీశ్వర స్వామిని కూడా ప్రతిష్టించాలని సంకల్పించారు. ఒక భక్తుడు తన కోరికను మిగిలిన భక్తులతో ప్రస్తావించగా అందరి మనస్సులలోనూ అదే ఆలోచన ఉన్నట్టు తెలుసుకొని సంతోషపడి, భక్తులందరూ కలసి ఆలయం నిర్మించారు. ఆ స్వామిని ప్రతిష్టించాక శీతలాదేవి ఆలయం కాస్తా శనీశ్వరస్వామి నెలకొన్న పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది.

ఆలయ విశేషాలు 

ఎన్నో దేవతా విగ్రహాలతో నిండిన శీతలాదేవి ఆలయం, ఒక పెద్ద మండపంలో నెలకొంది. ఆ మండపం కింద చుట్టూ ఎన్నో రంగు రంగుల దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. 

ఈ ఆలయం ఎల్లప్పుడూ భక్తజనసందోహంతో కిక్కిరిసి ఉంటుంది.  ఆలయం లోపలి ప్రవేశించగానే ఎడమవైపున ఒక మహాగణపతి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ముందుగా విఘ్ననాయకుడిని దర్శించాకే మిగిలిన దేవుళ్ళను దర్శిస్తారు.

గణపతికి కుడివైపున ఒక అశ్వర్థ చెట్టు క్రింద శీతలాదేవి విగ్రహం, ఉత్సవ విగ్రహం మనకు కనిపిస్తాయి. అక్కడ రాతిపై చెక్కిన బీజాక్షర మంత్రమున్న యంత్రాన్ని దర్శించవచ్చును. ఆ విగ్రహం పసుపు రాసి, కుంకుమ బొట్టుపెట్టి, ఎంతో మంగళకరంగా కనిపిస్తుంది. అమ్మవారికి చేతులనిండా రంగురంగు గాజులు వేస్తారు. సంతానం కొరకు స్త్రీలు మొక్కుకొని, అమ్మవారికి గాజులు సమర్పించి, తరవాత ఆలయానికి వచ్చిన ముత్తైదువలకి ఇస్తారు.ఆ యంత్రం, ఆ దేవిని చూసినవారికి ఎవరికీ అది ఒక రాయి అన్న భావన కలుగదు. భక్తిభావం ఉప్పొంగి, ఒళ్ళు పులకరిస్తుంది.



శీతలాదేవిని పూజించిన భక్తులకు ఆయురారోగ్య ఐస్వర్యాలు సమకూరుతాయి. వారికి సంబంధించిన జీవ జంతువులు, పిల్లాపాపలు, పక్షులు ఇలా అందరినీ అన్ని వేళల్లో కరువు కాటకాల నుండి కాపాడుతుంది ఈ తల్లి.

వర్షాలు లేక చెరువులు ఎండిపోయినప్పుడు - ఆ దేవికి 101 కొబ్బరి బొండాలు, 101 నిమ్మకాయలు, 101 బిందెలతో అభిషేకం చేస్తారు. వేదమంత్రాలు పఠిస్తారు. పూజ ముగిసిన తరవాత మంగళ హారతులు ఇచ్చి పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. పశువులకు, పక్షులకు కూడా అనారోగ్య సమయంలో ఆ తల్లికి పాలాభిషేకం చేస్తారు. శీతలాష్టకం, శీతలాంబ సుప్రభాతం చదివితే మనసుకి ప్రశాంతత లభించి, జీవితం సంతోషంగా గడిచిపోతుంది.

ఆలయం వెనుక శనీశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధిని దర్శించవచ్చును. నవగ్రహాల మధ్యన, కవచం ధరించి ఉన్న శనీశ్వరుని మనం చూడవచ్చును. ఈ సన్నిధిలో మూలవిగ్రహం శనీశ్వరుడు. ఈ స్వామి ముందు ఉత్సవ మూర్తి జ్యేష్ఠాదేవితో పాటు కొలువై ఉంటాడు. పూజలు, అభిషేకాలు, అలంకారాలు అన్నీ ఈ ఉత్సవ విగ్రహం శనీశ్వరునికే.


వివాహం జరగాలని, లేదా సంతానం కలగాలని, వేడుకున్న వారికీ, తప్పక ఆ స్వామి ఆశీస్సులు లభించి, కోరికలు నెరవేరుతాయి. మాంగల్య పూజ జరిపిస్తే మూడు నెలల నుండి ఆరు నెలల లోపు తప్పక పెళ్ళి జరుగుతుందని భక్తులు ఏంటో సంతోషంగా చెబుతుంటారు.

వ్యాపారం బాగా జరగాలంటే ప్రాకారపూజ జరిపిస్తారు. ప్రాకారపూజ జరిపించే వారికి శనీశ్వరుని గదని ఇస్తారు. ఆ గదని చేతపట్టుకొని ప్రాకారం చుట్టూ ప్రదక్షిణం గ్రహదోషాలు తొలగిపోతాయంట. వ్యాపారము తప్పక అభివృద్ధి చెంది లాభాలు పొందుతారంట.

శీతలాదేవిని, శనీశ్వరుని పూజించే భక్తులు తమ కోరికలు నెరవేరటం వలన సంతోషంతో పొంగిపోతుంటారు. ఆతరువాత మళ్ళీ స్వామిని దర్శించి ఆనందిస్తారు.


                                                       

No comments:

Post a Comment