June 24, 2015

పుష్కరం అంటే ఏమిటి, పుష్కర సమయంలో దానాలు, పూజలు

పుష్కరం అంటే ఏమిటి, స్నానం ఎలా చెయ్యాలి..... స్నానం చేయటం వలన ఫలితమేమిటి వంటి వివరాలు

పుష్కర సమయంలో పుష్కర నది నీటిలో అనిర్వచనీయమైన దైవశక్తి నిఘూడమై ఉంటుంది. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానం చేయటం వలన మనిషికి ఎన్నో ఆయుష్మిక ప్రయోజనాలు లభిస్తాయి. పుష్కర స్నానం చేసేముందు గంగాస్తుతి చదువుకుంటూ,
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ.. 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు"
దోసిళ్ళతో నీళ్ళు తీసుకొని, తలపై మూడుసార్లు పోసుకొని అప్పుడు స్నానం చెయ్యాలి.

స్నానం చేయటం వలన ఫలితం ఏమిటంటే - ఒక పుష్కర దినంలో (గోదావరి) స్నానంచేస్తే ప్రతిరోజు ప్రాతఃకాలంలో గంగానదిలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది. గంగ, యమున నదుల సంగమంలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నర్మదా నది ఒడ్డున తపమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది. 

పుష్కర వ్రతం - అంటే పుష్కరం 12 రోజుల్లో మన యథాశక్తి స్నానాలు, దానాలు, సూర్యార్చనలు, ధ్యానం, హోమాలు, తర్పణాలు, అర్ఘ్యాలు, అనుష్టానాలు, పితృ పిండప్రదానాలు చెయ్యాలి. ఈవిధంగా 12 రోజులు చేస్తే, 12 ముఖ్య మహాకల్పాల్లో జరిపే వ్రతానికి ఇవి సమానం అని పెద్దలు అంటారు. 

పుష్కర సమయంలో 12 రోజుల్లో దానాలు, పూజలు ఏవి చేస్తే మంచిదో తెలుసుకుందాం 

రోజులు                          దేవుడు                          దానాలు          
1వ రోజు                   నారాయణుడు                     బంగారం, ధాన్యం, రజితం
2వ రోజు                   భాస్కరుడు                         వస్త్రాలు, ఉప్పు, గోవు, రత్నం
3వ రోజు                   మహాలక్ష్మీ                         బెల్లం, కూరలు, (ఏదైనా) వాహనం
4వ రోజు                   గణపతి                              నెయ్యి, నువ్వులు, తేనె, పాలు,వెన్న
5వ రోజు                   శ్రీకృష్ణుడు ----- ధాన్యము, (ఏదైనా)బండి, గేదె(బర్రె), ఎద్దు, నాగలి
6వ రోజు                   సరస్వతి                           కస్తూరి, మంచిగంధం చెక్క, కర్పూరం
7వ రోజు                  పార్వతీదేవి                         గృహదానం, ఆసనం, శయ్య
8వ రోజు                  పరమేశ్వరుడు                    కందమూలాలు, పుష్పమాలలు, అల్లం
9వ రోజు                  అనంతుడు                        కన్య, దాసదాసీ, పరుపు, చాప
10వ రోజు               నరసింహస్వామి                 దుర్గాదేవి, లక్ష్మీదేవి, దేవీపూజ, సాలగ్రామం
11వ రోజు               వామనుడు ----- కంబళి, సరస్వతి, యజ్ఞోపవీతం, వస్త్రం, తాంబూలం
12వ రోజు               శ్రీరాముడు                       దశ, షోడశ మహాదానాలు
(ఈ దానాలు చేయడం వలన కోటిజన్మల పాపాలు నశిస్తాయని దైవజ్ఞులైన పెద్దలు చెప్పియున్నారు.)  

గోదావరి నది "గో  కళేబరం"ను ఆవరించి ప్రవహించిన కారణం వలన "గోదావరి" అని పేరు వచ్చింది. 
కృతయుగంలో 'తుందిలుడు' అనే మహాతపస్వి చేసిన తపస్సును చూసి మెచ్చి పరమశివుడు అతనికి మూడు కోట్ల ఏభై లక్షల పుణ్యతీర్ధాలకు ఆధిపత్యాన్ని ఇస్తూ 'తుందిలిని' అధిపతిగా చేసాడు. అంతే కాకుండా శివుడు తన అష్టమ స్థానంలో ఒకడైన జలస్థానం తుందిలునకు శాశ్వత స్థానంగా కల్పించాడు. ఆ విషయాన్నీ తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మ...పరమశివుని ప్రసన్నం చేసుకొని ఆ జలసార్వభౌముడు - పుష్కరుని తన సృష్టి కార్యనిర్వహణకు సహకరించే విధంగా తనకు ఇవ్వమని ప్రార్థించాడు. వెంటనే శివుడు సంతోషించి ఆ పుష్కరుడిని వరప్రసాదంగా బ్రహ్మకు ఇచ్చాడు. ఎన్నో మహిమలున్న ఆ పుష్కరుని తన కమండలములో ఉంచి 'సృస్తికార్యం' ప్రారంభించాడు బ్రహ్మ. 

ఒకనాడు బృహస్పతి బ్రహ్మకోసం ఘోరతపస్సు చేసి సకల ప్రాణులకు జీవాధారుడైన పుష్కరుని తనకు వరంగా అనుగ్రహించమని కోరుతాడు. అది విన్న పుష్కరుడు బ్రహ్మను వీడి వెళ్ళనంటాడు. ఇంక చేసిదిలేక బ్రహస్పతిని, పుస్కరుని ఇద్దరికీ సమన్యాయం చెయ్యాలని నిర్ణయించి ఈవిధంగా చెప్పాడు. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదులలో పుష్కరుడు కూడా ప్రవేసిస్తాడు. ఆ సమయాన్ని 'పుష్కర కాలం' అంటారు. 

బ్రహ్మ నియమానికి వారు కట్టుబడడం వల్ల  ఒక్కొక్క సంవత్సరం, ఒక్కో నదికి పుష్కర సమయంగా నిర్ణయించబడింది. పత్నీ సమేతుడై ఇంద్రుడు 33 కోట్ల దేవతులు, సర్వగ్రహాలు, 50 లక్షల తీర్థాలు, ఆ పుష్కరకాలలో నివసిస్తూ ఉంటారు. అందుకే ఆయా నదుల పుష్కరకాలంలో మొదటి పన్నెండు రోజులూ మహా పుణ్యప్రదమైన పుష్కరరోజులుగా నిర్ణయిస్తారు. 

పుష్కరం వచ్చే నది                బృహస్పతి ప్రవేసించే రాశి               పుష్కరం వచ్చే ప్రాంతం 

1) గంగానది                          మేషరాశి                                           కాశీ 
2) నర్మదానది                      వృషభం                           అహ్మదాబాద్ లోని నారీశ్వర్ 
3) సరస్వతి నది                   మిధునరాశి                      ఉత్తరప్రదేశ్ లోని భీంపూర్      
4) యమునానది                 కర్కాటకరాశి                                 మధుర           
5) గోదావరినది                    సింహరాశి                         రాజమండ్రి & భద్రాచలం    
6) కృష్ణానది                        కన్యారాశి                             విజయవాడ, శ్రీశైలం 
7) కావేరీనది                      తులారాశి                                   శ్రీరంగం         
8) తామ్రపర్ణీనది                 వృశ్చికరాశి                       తమిళనాడులోని బాణతీర్థం  
9) బ్రహ్మపుత్రానది              ధనూరాశి                           రాజస్థాన్ (అజ్మీర్ ప్రాంతం)
10) తుంగభద్రానది             మకరరాశి                         మంత్రాలయం - కర్నూల్ జిల్లా 
11) సింధూనది                  కుంభరాశి        ఇది పాకిస్తాన్లో ఉన్నందున గంగానదిలో చేస్తారు 
12) ప్రణీతనది                    మీనరాశి                   చోప్రా (కాళేశ్వరం సమీపంలో ఉంది)  

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా పవిత్రమైన పుణ్యకాలం. అటువంటిది  గోదావరి నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం 12 సంవత్సరాలుగా ఇతర నదులలో చేసిన పుణ్యం కంటే వెయ్యిరెట్లు ఎక్కువని, పుష్కర స్నానం చేస్తే - ఏడు జన్మలుగా చేసిన పాపాలు కూడా నశిస్తాయని, గంగానదిలో స్నానం చేయటం, నర్మదా తీరంలో తపస్సు చేయటం, కురుక్షేత్రంలో దానం చేయటం, కాశీలో (మరణం)మోక్షాన్ని ఇస్తాయని పెద్దలు చెప్పారు. 
పుష్కరకాలంలో చేసే ప్రతీపని(పుణ్యకార్యము) ఎంతటి అధిక ఫలాన్ని అందిస్తుందో..... ఆ రోజుల్లో చేసే పాపకార్యాలు కూడా వందరెట్లై నరక కూపంలోకి తోసెయ్యటం కూడా అంతేనని చెప్పారు. 
                         
జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కరాలలో పాల్గొందాం ..... మన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం 

No comments:

Post a Comment