June 11, 2025

Naa Swamy Telugu Padyalu

"నా స్వామి" తెలుగు పద్యాలు 

రచన - శ్రీ కోడూరి శేషఫణి శర్మ గారు 

గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి గారు 

01

 తే.గీ. 

శ్రీ గజాస్యుని మద్భావ సీమ నిల్పి,

శ్రీ సరస్వతీ మాతను చిత్తమెంచి

స్వామి శతకమ్ము వ్రాయగా భావమూని

కలము పట్టితి తుదిదాక కదలుమనుచు!

02

ఆ.వె. 

వెదురు బుట్ట యనుచు విలువ జూడకుమయ్య!

స్వర్ణ పాత్ర దెచ్చు శక్తి లేదు!

పదముల కడ నిడుదు మదిని పూవుల తోడ!

స్వీకరించు స్వామి! విన్నప మిదె!

03

తే.గీ. సర్వకాలములందు నీ సన్నిధాన

మందు నిలువగ గోరుచు నుందు స్వామి!

గుడిని దీపమ్మునై వెల్గ గడప చెంత

నుండు వరము ప్రసాదింపు మోయి దేవ!

04

ఆ.వె. 

మేను పులకరించు నీ నామమును విన్న!

తలచినంత మనము తన్మయమగు

నీవు లేని నేను, నేనుగా మనలేను!

స్వామి! నిన్ను నేను వదల లేను!

05

ఆ.వె. 

మదిని చేసినాను మంటపమ్ముగ నీకు!

నిల్పినాను స్వామి! నెమ్మి మీర!

మంటపమును వీడి మరలి పోబోకుమా!

కాళ్ల వ్రేళ్ల బడెద! కనికరించు!

06

తే.గీ. 

ఎన్ని యిడుముల బడనౌనొ నన్ను జేర?

సలుపగలనయ్య నీ పాద సంవహనము!

తరలి రావయ్య నాపైన దయను జూపి!

వేచియుండెద నో స్వామి! వేయి కనుల!

07

తే.గీ. 

విశ్వమంతయు నీవని విశ్వసించి

నీవె విశ్వమ్ము కద యను భావనమున

మెలగు చుంటిని గాని స్వామి! కనులకును

నేను గోరెడ్డి రీతిగా గాన బడవె?

08

ఆ.వె. 

కొండ కోన దిరిగి కోసి తెచ్చిన పూలు

వాడి పోకముందె వచ్చి నిలిచి

చేయు నాదు పూజ స్వీకరించుము స్వామి!

కాలు మోపవయ్య గడప ముందు!

09

ఆ.వె. 

సంస్కృతమ్ము నెఱుగ, సంస్తుతుల నెఱుంగ;

పలుకరించు టొకటె తెలియు నాకు!

పలువ రించు చుంటి పలుమార్లు నిను గూర్చి!

పలకవేమి స్వామి? అలిగి నావె?

10

ఆ.వె. 

మదిని చేసినాను మృదుశయ్యగా నీకు;

పవ్వళింపు సేవ పదిలముగను

సలుపగలను స్వామి! శయ్యపై జేరుమా!

నిదురకేమి లోటు నీకు రాదు!

11

ఆ.వె. 

పళ్లెరమ్ము నిండ బహువిధ ఫలముల

బేర్చినాను స్వామి! ప్రీతి మీర

నారగించుమయ్య యనువైన వానిని!

కనుల విందు నాకు! కడుపునిండు!

12

ఆ.వె. 

వకుళమాల కలదు వంట యింటిని జూడ;

నువిద తోడ నూయలూగ గలవు!

పెట్టి పుట్టు బిడ్డ పెనిమిటి వీవయా!

స్వామి! నీదు భాగ్యమేమొ? భళిర!

13

ఆ.వె. 

ఆలు గలదు నీకు నల్లంత దూరాన;

భార్య చెంత నున్న బాధ తెలియు!

చేరబోయె దీవు తీరు బాటున్ననే!

భాగ్యమనిన నీదె! స్వామి! భళిర!

14

తే.గీ. 

లక్షలాదిగ నుంద్రు నిరీక్షతోడ!

నన్ను గుర్తించి యెట్టుల నెన్న గలవు?

నీదు పాదాల ముద్రలు నాదు కనుల

గాంచ గలుగుదు వో స్వామి! కనుల గనుము!

15

తే.గీ. 

నిన్ను స్మరియింపనేరని నిముషములను

లెక్కగట్టంగనేవియు లేనె లేవు!

నిన్ను స్మరియించుకాలమ్ము నెన్న బూన

సాధ్యపడదయ్య లెక్కించ స్వామి! యెపుడు.

16

తే.గీ. 

అప్పు చేగొని పెండ్లియా? అందుకొఱకు

వడ్డీ చెల్లింపు మాదియా? బాగు బాగు!

ఋణము తీరుట యెప్పుడో? యెటుల స్వామి!

చెల్లు వేయుట కెన్నేళ్లు చెప్పవయ్య!

17

తే.గీ. 

అమ్మ నలివేలు మంగమ్మ నాదరమున

జేరు సమయాన నప్పులు చిత్తమందు

కలత గలిగించవా స్వామి? కంటి కెటుల

నిదుర వచ్చుట సాధ్యమ్ము నీకు? చెపుమ!

18

తే.గీ. 

పరగ శ్రీశైల మైనను, తిరుమలైన

నీశుడైనను, శ్రీవేంకటేశుడైన

నొక్కడే యని నమ్ముచు నుందు స్వామి!

వమ్ము కాలేదు నా నమ్మకమ్ము లెపుడు!

19

తే.గీ. 

శంఖమూదగ నిర్వురసాధ్యు లౌర!

ఆయుధమ్ములు నిర్వుర కమరి యుండె?

వరము లిచ్చుట యందును స్వామి! నాకు

భేదమేమియు గన్పడ లేదు సుమ్ము!

20

ఆ.వె. 

మనసు మాయజేసి మనుజుని యాడించు;

అదుపులోన నుంచు నంతరాత్మ!

ఆత్మసాక్షి వీవె! యనుసరించెద స్వామి!

మార్గదర్శివగుచు మన్ననలిడు!

21

తే.గీ. 

తెలిసి కొన్నియు నటులనే తెలియకుండ

చేసి యుండిన పాపాల ద్రోసి వేసి

క్షమను జూపుచు నొసగుమా శమము స్వామి!

పాపమను మాటయే లేని బ్రతుకు నిమ్ము!

22

ఆ.వె. 

పరవశమున నీదు పాదాల నొత్తంగ

దలచి స్వామి! కొంత కలత బడితి

కఱకు బారియున్న కరములు నావని!

నచ్చియోర్వగలవొ? నొచ్చు కొనెదొ?

23

ఆ.వె. 

మదిని నిన్ను గూర్చి స్మరియించుటే తప్ప

యెఱుగనయ్య యితర మేమి నేను!

దరికి జేర్చుకొనగ దగనని యందువా?

ఏమి చేయగలను స్వామి? చెపుమ?

24

తే.గీ. 

ఆల వర్ణము లెన్నున్న పాలు తెలుపు!

పుత్తడియు నొక్కటే గాని భూష లెన్నో!

ఎన్ని రూపులు గొల్చిన నేమి స్వామి?

నీవు నొక్కండవే నని నేను దలతు!

25

తే.గీ. 

వచ్చు నప్పుడు పాదాలు నొచ్చుననుచు

పూల బాటను ముంగిట పూన్కి తోడ

బరచి యుంచెదనో స్వామి! కఱకునేల!

తెలియ జేయుము ముందుగ, తెమలి యుందు!

26

ఆ.వె. 

పూల, కంటకముల బుట్టించి నట్లుగా

మంచి చెడుల నేల నుంచినావు

స్వామి? యేలనయ్య వైరుధ్య మిట్టుల?

మంచి నుంచి చెడును ద్రుంచరాదె?

27

తే.గీ. 

నేను నైవేద్య మిడెదను నీకటంచు

బల్కు టెట్టుల దగునయ్య స్వామి? కనగ

నాకు గల్గిన దేదైన నాది కాదు!

నీ విభూతియె! నీకిడ నేనెవరిని?

28

ఆ.వె. 

బాల భక్తుడైన ప్రహ్లాదు గరుణించి

నావుగాని స్వామి! నాకు గాన

రావదేమి? పగలు రాతిరనక నేను

పలువరించు చుంటి; పలుకవేమి?

29

ఆ.వె. 

జీవకోటి గావ నీవ యుందువు గాని

చివర నున్న నన్ను జేరుటెపుడు?

ఎన్ని జన్మలెత్తి నిన్ను గాంచగ నౌనా?

తెలియకుంటే స్వామి! తెలుపవలదె?

30

తే.గీ. 

ఎందరెందరి కేవేవొ యిడుము లెన్నొ

తొలగ జేసితి వీవను పలుకు వింటి!

స్వామి! కలిగించి తొలగించు పనుల నిటుల

జేయ బూనుట యేలనో చెప్పవయ్య!

31

తే.గీ. 

ఉన్నదానిని నీకిడ నుంటి స్వామి!

నీకు వలసిన దేదియో నాకు దెలియ

కుంటి; నటు లౌట నద్దాని నుచిత రీతి

నీయ గోరెద నోదేవ! ఇదియె వినతి!

32

తే.గీ. 

వడలు, లడ్లు, ప్రసాదాలు, వసతి గదులు

క్షేత్రముల యందు భక్తుల చేతి కనువు

గాను లేకపోయెను గదా! కనుక యెటుల

స్వామి! నిను జూడ వచ్చుట సాధ్యమౌను?

33

ఆ.వె. 

యత్నపూర్వకముగ నజ్ఞానమును వీడ

జేయుమయ్య! గురుని జేర్చవయ్య!

కత్తిమీది నడక కష్టమైనను సరే!

నడుపుమయ్య స్వామి! ఒడుపు దెలిపి!

34

ఆ.వె. 

చేతనున్న చిన్న చెంబెడు మాత్రమే

యుదక మొదవు నాకు నుదధి నుండి!

పెద్ద చెంబు నిచ్చి పేర్మిజూపుము స్వామి!

నీదు దయను నేను నింపుకొనగ!

35

ఆ.వె. 

రెక్కలున్న యెడల రెపరెప మని వచ్చి

తమరి జూడ వచ్చు త్వరిత గతిన!

రెక్క లీయకుండ చిక్కులన్ బెడితివి!

మనసు నిన్ను జేరె! గనుము స్వామి!

36

ఆ.వె. 

పండితుడను గాను; భక్తితో నిను గూర్చి

పద్యమల్ల నేర్చి బ్రతుకు చుంటి!

తప్పు లొప్పు లనుచు దిప్పలు బెట్టకు!

సర్దుకొనుము స్వామి! సంతసమున!

37

తే.గీ. 

నీవు పల్కించు పల్కులే నేను బల్కు

చుందు నో స్వామి! నాదేమి యిందు లేదు!

కలము సాగంగ జేయుమా సులభముగను!

పద్యముల వ్రాత జూడుము హృద్యమగను!

38

తే.గీ. 

పిడికెడటుకుల కీవిడు విలువ తెలిసె!

మదిని నీకిడి నిల్చితి; మరచినావె?

మోక్షమే గాని వేటొండు ముదము నిడదు!

గురుతు జేసెద నో స్వామి! కరుణ జూడు!

39

తే.గీ. 

అమృతమును ద్రావు వారల కాకలియెటు

తెలియ గలదయ్య? పేదల గలయ జూడు!

చేయవలసిన దేదియో చేయవయ్య!

నీదు సంతానమే స్వామి! నెమ్మిగనవె?

40

తే.గీ. 

డొక్క లెండిన లోకులు పెక్కురిలను

గలరు చూడవె నా స్వామి! కనులు తెరచి;

“బల”యు “నతిబల” విద్యలు వారి కొఱకు

గాక యింకేల కో దేవ? కనికరించు!

41

ఆ.వె. 

పుండ్రములను బట్టి పుణ్యమ్ము పాపమ్ము

లొదవు ననుట జూడ నుత్తమాట!

ఉన్న మాట జెప్ప నూకొట్టరో స్వామి!

తెలియ జెప్పు టెటులొ తెలియ దాయె!

42

ఆ.వె. 

నడక లిచ్చి తీవు! నడచితి నీ వైపు!

పలుకు లిచ్చి తీవు! ప్రణతు లిడితి!

చేతు లిచ్చి తీవు! చేసితి నీ పూజ!

లింత కన్న స్వామి! యేమి చేతు!

43

తే.గీ. 

త్రికరణమ్ముల శుద్ధిగ దేవ! నిన్ను

స్మరణ జేయుచు, నుతియింతు! చక్కగాను

సేవ జేసెద నో స్వామి! చిత్తగించి

కంట జూడగ వేడెద! గావుమనుచు!

44

ఆ.వె. 

నీదు ప్రాంగణమున పాదమూనిన చాలు

మధుర భావములవి మదికి దోచు!

క్షణము నిలువ నీక స్వచ్ఛంద సేవకుల్

స్వామి! వెడల ద్రోయ బాధ కలుగు!

45

తే.గీ. 

రాకపోకల దెలుపక, లక్ష్యమేమొ

తెలియ జేయక పుట్టించి యిలను స్వామి!

ఆట లాడించు చున్నావు; యవనికలను

దించు టెత్తుట యన్నది తెలుపవేమి?

46

ఆ.వె. 

మల్లెపూల జేరు మధుపమ్ము వోలెను,

కడలి వైపు నదులు కదలు నట్లు,

నీదు గడప జేర మోదమ్ము నొందును

స్వామి! నాదు మనము నేమనందు?

47

ఆ.వె. 

తావళమును ద్రిప్పు తహతహయే గాని,

మనము నిలువ బోదు మంత్ర మందు!

మంత్రమేమి కలదు మదిని కట్టడి జేయ?

చెప్పవయ్య స్వామి! చేతు నతులు!

48

ఆ.వె. 

అర్చనమున కింత, యభిషేకమున కింత;

పాద దర్శనంపు భక్తి కింత;

నేత్ర దర్శనంపు నియమాల కింతని

యందు రెటుల స్వామి? అంత వలెనె?

49

ఆ.వె. 

వేలు పెట్టలేని పేదలసంగతి

పట్టదేమి స్వామి? గిట్ట దేమి?

క్షణము నిలువనీక సాగద్రోయుచు నుంద్రు!

దర్శనమ్ము గూడ దక్కనీరె?

50

ఆ.వె. 

వినుట కుదర లేదొ? వినిపించు కోలేదొ?

ఏవగించు కొంటివేమొ స్వామి?

విడువ బోను నిన్ను వినినంత వరకును!

దిక్కులేదు, నీవె దక్క నాకు!

51

ఆ.వె. 

పిలిచినంత పలుకు వేల్పు వనుచు నుంద్రు;

వేయి పేర్ల నిన్ను బిలిచినాను!

మరచినావొ స్వామి మరి నీదు నామాలు?

ఉలుకు పలుకు లేక యుందు వేల?

52

తే.గీ. 

స్వామి! నీ దయ జగమెల్ల చల్లగాను

వెన్నెలట్లుగ ప్రసరించు చున్న దౌర!

మానసమ్మను వాకిలి మానవుండు

తెరచినను గాక నీ కృప తెలియుటెట్లు?

53

ఆ.వె. 

కరము బట్టి నడుపు ఘనుడవు నీవుండ

దిగులు లేదు నాకు! వగపు లేదు!

క్రిందు మీదు లయిన, కేలు నందించగా

స్వామి! నీదె కదర బాధ్యతయును!

54

ఆ.వె. 

వేద విదుడ గాను; వేదాంత మెఱుగను!

చెవుల కెక్క నెవరు చెప్పలేదు!

ఆస్తి కుండ ననెడు నర్హత నాకుండె!

స్వామి! నన్ను బ్రోవ జాలు గదర!

55

ఆ.వె. 

అక్రమార్జనమున నారి తేరిన వారు

మ్రొక్కు చుందురయ్య ముడుపు లొసగి!

దోచుకొనగ బ్రజల జూచుచు నుందురు!

వరము లొసగనేల స్వామి! నీవు!

56

ఆ.వె. 

నీదు సొమ్ము మెక్కి నిక్కి నీల్గెడి వారు

పెక్కు రుండిరయ్య! నిక్క మిద్ది!

తగదు వారి సైచ తగదయ్య! ఓ స్వామి!

తాట దీయవలదె తగిన రీతి!

57

ఆ.వె. 

'స్వామి' యనుచు వ్రాయ, జదువ జాలని వారు

'సాములోరి' మనుచు సంఘమందు

చెల్లు బాటు నగుచు జెలరేగు చుండిరి!

కంట జూడు స్వామి! తుంటరులను!

58

ఆ.వె. 

కోట్ల కొలది ప్రజల కోర్కెలు విని విని

విసుగు జెందబోకు! వినుము స్వామి!

వెదకి చూడుమయ్య, విన్నవించెడి వారి

వరుసలోనె నేను వచ్చియుంటి!

59

ఆ.వె. 

పుష్కరాల మునగ బుణ్యమ్ము గలదను

పెద్దవారి మాట వింటి స్వామి!

అహరహమ్ము తావకా రాధనమ్ములో

మునిగి యున్న నాకు

బుణ్య మిడవె?

60

తే.గీ. 

పద్యముల వ్రాయ బల్కునే వాసుదేవు

డనుచు నున్నారు బంధువు; లౌన స్వామి?

నీవు నెట్టుల బల్కెదో నెమ్మి నాకు

చెప్ప గోరెద; నట్టులే చేయగలను!

61

తే.గీ. 

నాకు వలసిన దేదియో నీకు దెలుసు!

నెట్లు నడిపించగా నన్ను నెంచినావొ?

స్వామి! నా మది నిను గూర్చి నీమముగను

వర్తిలంగను జేయుమా! వందనములు!

62

ఆ.వె. 

ఆయుధమ్ము లైదు సాయ మందించవే?

నేటి వార లేమి మేటి వారె?

కంటకనగ రాని తుంటరి దైత్యుల

స్వామి! మదమడంచి చంపవేమి?

63

ఆ.వె. 

నాటి రాక్షసులను నలిపి వేసితివయ్య!

కలియుగాన నేడు తెలివి మీరి

యున్నవారి దునుమ కున్న కారణమేమి?

వారి కంటె ఘనులె వీరు స్వామి?

64

ఆ.వె. 

సాత్వికతను జూప చవటగా నెంతురు!

రజము జూపినంత 'రౌడీ' యంద్రు

తమము జూపు వారి తలదన్ని పోదురు!

స్వామి! కష్టమయ్యె! బ్రతుకు గనవె!

65

ఆ.వె. 

అధికమౌచు వర్ష మదియు న భావమై

హాలికులకు గలుగు హాని గనిన

చెదరి పోవు గుండె! చెమ్మగిల్లును కళ్లు!

కంట జూడు స్వామి! కర్షకులను!

66

ఆ.వె. 

తల్లి, తండ్రి, గురువు తరువాత నీవని

పలుకు చుంద్రుగాని వారి యందు

నిన్నె గంటి నేను; నీ దయ కనుగొంటి!

నర్థమయ్యె స్వామి! అన్ని నీవె!

67

ఆ.వె. 

నల్గురున్న యట్టి నాదు సంసారమ్ము

నడుపు చుండి నేను నలిగిపోదు!

స్వామి! నిన్ను జూడ బహుళ సంసారివి!

ఎంత నలుగు చుందు వీవు సతము?

68

ఆ.వె. 

కోట్ల కొలది ప్రజకు కోట్ల సమస్యల

గలుగ జేసి తీర్చగలవు స్వామి!

ఎంత కష్టపడేదొ? ఇన్ని సమస్యల

కల్పనమ్ము జేయు కష్టమేల?

69

ఆ.వె. 

నీవు గానబడగ నేను గుర్తించెడు

విధము దెల్పు స్వామి! విశ్వరూప!

పిదప వగచకుండ మొదటె వేడుచు నుంటి!

పలకరించవయ్య! పులకరింతు!

70

ఆ.వె. 

లయము జేయుటనెడు లక్ష్యమ్ము నీదైన

మహిని ఘోరమగు ప్రమాద మేల?

బాధ తెలియ కుండ పైకి గైకొని పోవె?

స్వామి! వారి గూర్చి బాధలేదె?

71

తే.గీ. 

ప్రకృతి సంపద మాకెంతొ వరము స్వామి!

స్వార్థమును జూపి దాని నాశనము జేయు

ఖలుల నూరక వదలక ఖండనమ్ము

జేసి యుపకారమును మాకు చేయుమయ్య!

72

తే.గీ. 

నీకు మాత్రమె ఋణపడి నేను నుండు

నటుల, పరుల ఋణములు నీ యవని పైనె

తీరి పోయెడి రీతిగా దీవెన లిడి

కనుల జూడుము! నా స్వామి! కనికరించు!

73

ఆ.వె. 

నాలుగక్షరములు నా చేత వ్రాయంగ

చేయు చుంటివయ్య! చేసినట్టి

పుణ్యమేమొ గాని పొగడుదు నిను స్వామి!

వ్రాయ నేర్పమందు రమ్యముగను!

74

ఆ.వె. 

కూడు, గూడు, గుడ్డ కొఱత లేనట్లుగా

నున్న చాలు గాని యుర్వి జనులు

కోట్లు కూడ బెట్ట గోరగ నేలనో?

బుద్ధి చెప్పు స్వామి! భువిని ప్రజకు!

75

ఆ.వె. 

కనులు చూచినాను; తనువు తడిమినాను;

చిత్తమలర జేసె చేతి స్పర్శ!

పాదమంటి నేను పరవశించితి స్వామి!

కలను నిజము చేసి కరుణ గనుము!

76

ఆ.వె. 

నాకు కనుల ముందు నఖశిఖ పర్యంత

మద్భుతముగ మీర లవతరించి

విందు గూర్చినారు! వేలనతులు స్వామి!

చెరగి పోదు ముద్ర చిత్తమందు!

77

ఆ.వె. 

నిన్ను తలచినంత నెరవేరు పనులన్ని;

మ్రొక్కినంత సుఖము దక్కగలదు!

పెక్కుమాటలేల? దిక్కునీవే స్వామి!

యనుచు చాటుచుందు నహరహమ్ము!

78

ఆ.వె. 

సాగరమును బోలు సంసార మిడితివి!

కలత బడగనౌనె యలల వడికి!

రత్న నిధిగ దలచి రంజిలగా నౌనె?

సందియమ్ము వొడమె స్వామి! నాకు!

79

ఆ.వె. 

అర్థమేమి కాని యాధ్యాత్మికమ్ములౌ

పలుకులేవొ సతము పలికి, వినిచి

వాయగొట్టుచుండు వారి నే మనవలె?

స్వామి! చెప్పవయ్య! వందనములు!

80

ఆ.వె. 

విసుగు బుట్టజేయు వేదాంత మేలనో?

తెలిసి కొందమనిన తెమల బోదు!

సరళమైన యట్టి పరిభాష లేదేల?

నిన్ను దెలియ స్వామి, యెన్ని నేర్తు?

81

ఆ.వె. 

పలుకరించి నేను పలుమార్లు నిన్నిటు

పలుచనైతి నేమొ స్వామి! వెఱతు!

పిలిచినంత లోనె పలికెడు వాడని

పేరుగలదు నీకు! విడువ గలనె?

82

ఆ.వె. 

నల్ల మబ్బు తాను తెల్లని మెరపును

రువ్వెననగ నీదు నవ్వు నన్ను

సంతసింపజేసె స్వామి! నాకిది చాలు!

పదిలపరచుకొందు మదిని చిరము!

83

ఆ.వె. 

దిక్కు తోచనపుడు దిక్కు నీవే యని

దిక్కునీవే

విన్నవించుకొంటి నెన్నో మార్లు!

అవసరమును బట్టి యాదుకొంటివి స్వామి!

మరువగలనె నీదు కరుణ నేను!

84

తే.గీ. 

తెలిసి తెలియక తప్పులు సలిపి యుందు

సగటు మానవ మాత్రుడ నగుట స్వామి!

నన్ను ఋజుమార్గమందున నడుపు మనుచు

కోరి వేడు చుంటి కూర్మి తోడ!

85

తే.గీ. 

నీవు నేనను వేర్వేరు భావమెపుడు

లేదు మన మధ్య నా స్వామి! లేక యుంట

నిన్ని యూసుల నీతోడ నిటుల నాడ

గలిగినాడను! నాకిద్ది ఘనత గాదె!

86

తే.గీ. 

చాల విసిగించి నానేమొ చనువు కొలది

లౌకి కమ్మగు విషయాల నీకు వినిచి!

వేర లెవ్వారు గలరయ్య వినగ స్వామి!

నీవె హితుడవు! బంధుడ వీవె దేవ!

87

తే.గీ. 

మంచి గంధపు చెక్కల మందసమున

బెట్టి నామనుచును విర్రవీగు చుంద్రు

నీదు రూపమ్ము గనని కబోదు లౌచు!

తెలియ జెప్పుట యెట్టులొ తెలుపు స్వామి!

88

ఆ.వె. 

పెట్టెయందు బట్టు పిట్టవా నీవేమి

మందసమున బెట్ట మందులకట!

నిన్ను గొల్వ దరమె యెన్ని జన్మలకైన?

స్వామి! యూహనైన సాధ్యమగునె?

89

ఆ.వె. 

సాధు జనుల పట్ల సాగెడి దౌష్ట్యమున్

సైచె దేల స్వామి? క్షణమునైన

నాలసించనేల? అణచివేయగ రాదె

ఖలుల దౌష్ట్య బుద్ధి మొలవ కుండ!

90

ఆ.వె. 

బిచ్చగాడు బయట బొచ్చె పట్టుచు నుండు

భక్తుడేమొ లోన వరము లడుగు!

భేదమెచట స్వామి? భేదమే కనిపించు!

గుడికి బయట లోన నడుగు కొనుటె!

91

ఆ.వె. 

పంచె కట్టు టనిన పనికి మాలినదని

పలుకు చుంద్రు నేడు తెలుగు వారు!

సంప్రదాయ మెటకు సాగిపోయెనొ స్వామి!

తెలుగు దనము నిలుచు తెఱవు గలదె?

92

ఆ.వె. 

మాతృభాష పట్ల మమకారమే లేదు!

వ్రాయలేరు నాల్గు వాక్యములను!

చెప్పుకొనగ స్వామి! సిగ్గుగా నున్నది

నాదు జాతి గూర్చి నలుదెసలును!

93

తే.గీ. 

పరశు రామావతారమ్ము మరల భువిని

యెత్తుటకుగాను వేగ మా యత్తపడుము!

నీవు గలవన్న సత్యమ్ము నేతలకును

స్వామి! తెలుపంగ వలయు నీ సమయమునను!

94

ఆ.వె. 

ఖలులు గద్దె మీద కొలువు దీరినయంత

లెక్కలేని తనము నెక్కువైన

చక్కదిద్దవలెను సత్వరమ్ముగ నీవు!

ప్రజల క్షేమమరయ వలయు స్వామి!

95

ఆ.వె. 

మనుజ లోకమందు మరుజన్మ మిడినను

వగపు లేదు కాని స్వామి! నిన్ను

మరవకుండునట్లు వరము నిచ్చిన జాలు!

మోక్షమంది నటుల మురిసి పోదు!

96

తే.గీ. 

నిన్ను నమ్మిన భక్తులు నీకు వలెనె

భాగ్యవంతులు నౌచును వరలు చుందు

రనుటకే నీవు నిండుగా నట్టి వైభ

వమును చాటుచు నుంటివో స్వామి! నిజము!

97

ఆ.వె. 

గడప నొక్కటొకటి గడచి నీ దరి జేరి

నిలిచినంత జాలు; నీ కటాక్ష

వీక్షణాల వెలుగు రక్షగా దోచును!

ధైర్యమదియె స్వామి! ధరణి నాకు!

98

ఆ.వె. 

శుక్రవార మద్ది; సోమవారమ్మిది!

యనుచు నేను నీకు ననువగు నటు

లిడగలేను స్వామి! యే నివేదన మైన

స్వీకరించి తృప్తి జెందవయ్య!

99

ఆ.వె. 

వైద్యశాలలనిన వ్యాపారమే యయ్యె!

రోగి బ్రతికి కూడ రోదనమ్మె!

అప్పు దీర్చలేక యతడు చావును గోరు!

స్వామి! ట్రీటుమెంటు వైద్యుల కిడు!

100

ఆ.వె. 

నిన్ను గనిన యపుడు నేత్ర పర్వమ్ముగా

నడుగ దలచినవియు నుడిగిపోవు!

నీదు పాద యుగళి నాదు కాణాచిగా

కాను పించు స్వామి! మేను మఱతు!

101

ఆ.వె. 

తలచితేని నీవు తగిన రూపమ్మున

వచ్చిప్రోవ గలవు స్వామి! నాడు

హస్తి రూపమునను నా హథీ రాముని

కాచినావు మిగుల కరుణ జూపి!

102

ఆ.వె. 

రూప్య మొక్కటొకటి ఆప్యాయతను జూపి

ముడుపు పేర నీకు ముట్ట జెప్ప

నీ

స్వామి! నీ వొసంగు వరము వందల రెట్లు!

కరుణ జూపు నీవు ఘనుడవయ్య

103

ఆ.వె. 

పుష్కరిణిని మునుగ పుష్కలమ్ముగ మాకు

సర్వ సంపదలును చక్కగాను

దక్కుననుచు దెలిసి తరియించితిని స్వామి!

భక్త సులభ నీకు వందనములు!

104

ఆ.వె. 

నీ యనుగ్రహమ్ము నిండుగా నున్నచో

గ్రహము లేమి చేయ గలవు స్వామి!

గ్రహములన్ని నీదు కను సన్నలందుండు!

భయము లేదు నాకు భక్త వరద!

105

ఆ.వె. 

నీ ప్రసాదమైన నేతి లడ్డుల కంటె

నీదు కీర్తనమ్మె స్వాదు తరము!

గొంతు నెత్తి స్వామి “గోవింద” యనినచో

జీవితమ్ము తీపి! జిహ్వ తీపి!

106

ఆ.వె. 

అనుదినమ్ము స్వామి! అష్టోత్తరమ్మగు

నీదు నామ శతము నియమముగను

జపము సల్పుచున్న సాధ్యమే యేదైన!

వేంకటాద్రి నిలయ! విబుధ వినుత!

107

ఆ.వె. 

కొలిచి గెలిచె నిన్ను కుమ్మరి యొక్కడు

మట్టి పూల పూజ మనసు బెట్టి!

స్వర్ణసుమములేల స్వామి! నీ పూజకు!

ముక్తి నిడెదవయ్య భక్తి జూప!

108

ఆ.వె. 

కదలకుండ నిన్ను గట్టి, పల్లకియందు

త్రిప్పు చుంద్రు స్వామి! తిరుమలేశ!

కట్టుబడుదువయ్య గట్టి భక్తి యనెడు

బంధమందు దేవ! భక్త వరద!

109

ఆ.వె. 

సాధనమ్ము జేసి జ్ఞానమున్ బడయంగ

మెట్టు నొక్కటొకటి యెట్టులైన

నెక్కినిన్ను జేరు నేర్పాటుగా దోచె!

స్వామి! అర్థమయ్యె? వందనములు!

*****************************************************************

January 27, 2025

రజకుడు గుర్తించిన శ్రీరంగం ఉత్సవమూర్తి నంపెరుమాళ్ విగ్రహం

 రజకుడు గుర్తించిన శ్రీరంగం ఉత్సవమూర్తి నంపెరుమాళ్ విగ్రహం

బట్టలు శుభ్రం చేసే రజకుడు త్రేతాయుగం మరియు ద్వాపర యుగంలో చేసిన పాపాలకు తగిన పరిహారం కలియుగంలో చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ రజకుడు వలన మనం ఈరోజు నంపెరుమాళ్ను కన్నుల పండుగగా చూడగలుగుతున్నాము. భూలోక వైకుంఠం అని కీర్తించబడే శ్రీరంగం దాని ప్రియమైన చక్రవర్తిని కోల్పోయి దాని వైభవమును కోల్పోయి యుండెడిది. కానీ ఈ రజకుడు చేసిన అద్భుతమైన సేవ వలన మనం ఆ వైభవమును తిరిగి నోచుకోగలుగుచున్నాము. శ్రీరంగాన్ని ముస్లిం ఆక్రమణదారుడు అబ్దుల్ గఫూర్ ఖాన్ ఆక్రమించుకోవడానికి ముందు పెరియ పెరుమాళ్ సన్నిధిని రక్షించడానికి ఒక రాతి గోడను ఆలయ గర్భగుడి ముందు నిర్మించి..

అర్చావతార విగ్రహమును ముస్లిములకు కానరాక కుండ చేసి తర్వాత శ్రీ పిళ్లైలోకాచార్యులు మరియు ఆయన భక్త బృందం నంపెరుమాళ్ను శ్రీరంగమునుండి దూర దూర ప్రదేశాలకు తీసుకెళ్లారు. నంపెరుమాళ్ భద్రత గురించి భయపడి భక్తులు ఆ విగ్రహాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చాలా దూరం తీసుకువెళ్లారు. అలా అరవై ఏళ్లు గడిచిపోయాయి. భక్త బృందం నంపెరుమాళ్తో దాదాపుగా కర్ణాటకలో కొంచం భాగం మరియు ఆంధ్రప్రదేశ్లతో సహా దక్షిణ భారతదేశం అంతటా పర్యటించారు. ఈలోగా శ్రీరంగంలో దోపిడిదారులు నిష్క్రమించిన తరువాత పూర్తిగా కొత్త తరం వారు వచ్చి ఆలయములో ఉత్సవ విగ్రహము (నాంపెరుమాళ్) లేకపోవడంతో ఆందోళన చెందిన భక్తులు శ్రీరంగం సన్నిధిలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయం తన పూర్వపు వైభవాన్ని నెమ్మదిగా సంతరించుకొని ఉత్సవాలు కూడా వాటి పూర్వపు వైభవంతో తిరిగి ప్రారంభమయ్యాయి.

ఒకరోజు ఒక వర్తకుల గుంపు ఒక అడవిలో దారి తప్పి అటూ ఇటూ తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చి అచట ఉన్న ఖాళీ స్థలము మధ్యలో ఒక అద్భుతమైన శ్రీ మహావిష్ణువు విగ్రహమును చూచారు. వ్యాపారులలో వయసులో పెద్దవాడైన శ్రీరంగ నివాసి ఒకరు శ్రీ రంగనాథుని విగ్రహాన్నిచూసి శ్రీరంగనాధుడిని పోలి ఉన్నదని అరిచాడు. ఇది స్పష్టంగా స్వామి తన ఆచూకీ గురించి ప్రజలకు తెలియజేసే ఒక మార్గం. వ్యాపారులు అద్భుతమైన విగ్రహాన్ని శ్రీరంగానికి తీసుకురాగా ఆలయ సిబ్బంది భట్టర్లు మరియు భక్తులందరికీ పెద్ద సందేహం వచ్చినది. శ్రీరంగంలో నాంపెరుమాళ్ విగ్రహం ఒకటి ఇప్పటికే స్థాపించబడినది మరియు నాంపెరుమాళ్గా పూజించబడుతోంది: ఇప్పుడు మరొక విగ్రహం ఉద్భవించింది. ఆళ్వార్లు మరియు ఆచార్యుల మహిమాన్వితమైన నివాళులర్పించిన కొత్త మూర్తి యొక్క ఆధారాలను కనుగొనడం మరియు నిజమైన నాంపెరుమాళ్ అని నిర్ధారించుకోవడం ఎలా? అసమానమైన అందంతో అందరి మనసులను దోచుకున్న నాంపెరుమాళ్ కొత్త విగ్రహంలో ఎటువంటి దోషం లేకపోయినా ఆళ్వారుల ఆరాధనకు పాత్రుడైన సాక్షాత్తు నాంపెరుమాళ్కు పూజలు చేసేందుకు సార్వభౌమాధికారులు మరియు సామాన్యులు శ్రీరంగం వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. భక్తుల సందిగ్ధం చివరికి ముస్లిం దండయాత్రకు ముందు తన యవ్వనంలో శ్రీరంగం ఆలయానికి నిజాయితీగా సేవ చేసిన ఒక ముదుసలి శ్రీరంగ నివాసి అయిన రజకుడి చెవికి చేరినది. అతను ఇప్పుడు అంధుడు మరియు సగం చెవిటివాడు, కానీ అతని మిగిలిన ఇంద్రియాలు పూర్తిగా చురుకుగా పనిచేస్తున్నాయి. అతను సన్నిధికి చేరుకొని.. భట్టర్లతో మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ అతని వయస్సు మరియు వృద్ధాప్యం కారణంగా ఎవరూ అతనిని పట్టించుకోలేదు. అయితే చివరికి అతను ఆలయ సిబ్బందిలో వయసులో పెద్దవాడైన ఒక అధికారి దృష్టిని ఆకర్షించగలిగి నిజమైన నాంపెరుమాళ్ను గుర్తించగలనని అతనికి ప్రతిపాదించాడు.

వృద్ధుడి ప్రతిపాదనపై అనుమానం వచ్చినప్పటికీ ఆ ఆలయ సిబ్బంది అతన్ని రెండు విగ్రహాల వద్దకు తీసుకెళ్లారు. రజకుడు ఉత్సవ మూర్తులిద్దరికీ తిరుమంజనం చేసి ఆ తిరుమంజనమును తీర్ధముగా ప్రసాదించమని కోరాడు. అతను రెండవ మూర్తి యొక్క పవిత్ర స్నానపు నీటిని తీర్థముగా స్వీకరించినపుడు, రజకుడు ఉల్లాసంగా కేకలు వేసి..

ఇదే నిజమైన నంపెరుమాళ్ అని అధికారులకు చెప్పాడు. ఖచ్చితంగా ఆ విగ్రహమే నాంపెరుమాళ్ అని ఎలా తెలుసుకో గలిగావని ప్రశ్నించగా.... అద్భుతమైన నాంపెరుమాళ్ బట్టల నుండి వెలువడే అద్బుతమైన కస్తూరి వాసన తనకు ఏ రోజునైనను తెలుస్తుంది అని రజకుడు సమాధానమిచ్చాడు. వృద్ధుడు తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు తన తండ్రి (శ్రీరంగనాథునికి అధికారిక రజకుడు) ఉతకడానికి ఇవ్వబడ్డ నంపెరుమాళ్ బట్టల నుండి పిండిన నీరు ప్రతి దినము తనకు తీర్థముగా ఇవ్వబడెనని మరియు అది కస్తూరి పరిమళాన్ని కలిగి ఉండెడిది.

రెండవ ఉత్సవ మూర్తి తిరుమంజన తీర్థం నుండి వెలువడిన అదే కస్తూరి పరిమళం వలన అదే నిజమైన నంపెరుమాళ్ అని రజకుడు సానుకూలంగా భావించాడు. మిగిలిన కథ సహజంగానే చరిత్ర. కాబట్టి, ఆళ్వార్లను, ఆచార్యులను ప్రేమతో పిచ్చివాళ్లను చేసిన నంపెరుమాళ్ వైభవాన్ని ఈరోజు మనం సేవించగలుగుతున్నామంటే, ఆ రజకులకు మన కృతజ్ఞతలు తెలపాలు, మరియు రజకుడు ఆ రోజు భక్తులకు చెప్పినది కట్టు కథ కాదు.

ఎందుకంటే, నంపెరుమాళ్ బట్టలు ఉతికి, ఎండబెట్టి మరియు ఒత్తి (ఇస్త్రీ)ఒక రజకుడు చేసేవాడనేది నిజానికి నిజం. నాణ్యమైన శుభ్రపరిచిన వస్త్రములు అందించే రజకుని పనితనము శ్రీరామానుజాచార్యులను చాలా ఆకట్టుకున్నట్లు ఈడు వాఖ్యానమునుండి మనం దీనిని నేర్చుకుంటాము.

సన్యాసుల చక్రవర్తి శ్రీ రామానుజలవారు ఈ బట్టలు శుభ్రపరిచే నిష్కళంకమైన సేవలకు చాలా సంతోషించి రజకుడిని పెరియ పెరుమాళ్ వద్దకు తీసుకువెళ్ళి అతని యొక్క పని నాణ్యతను ప్రశంసిస్తూ మాట్లాడారు.

భాష్యకారుడికి శ్రీ రంగనాథుడు, అతను రజకుడి సేవతో నిజంగా సంతోషిస్తున్నాడని మరియు రామావతారం మరియు కృష్ణావతారం సమయంలో చేసిన నేరాలను క్షమించాలని నిర్ణయించుకున్నాను అని జవాబిచ్చాడు. 

శ్రీ రామానుజుల వారి కంటే తక్కువ స్థాయి వ్యక్తి నుండి రజకుడికి లభించిన ప్రశంసలను వివరిస్తూ ఈడు నుండి అద్భుతమైన వాఖ్యలు ఇక్కడ ఉన్నాయి: “ఓరు నాళ్ శ్రీ వైష్ణవ వన్నత్తాన్ తిరుప్పరివట్టంగలై అళగియదగా వాట్టిక్కొండు వాండు ఎమ్పెరుమానరుక్కు కట్టా, పోరా త్రిప్పరాయ్, అవనై పెరుమాళ్తిరువడిగళిలే కైప్పిడిట్టుక్ కొండు పుక్కు,

“నాయంతే! ఇవన్ తిరువరైక్కు ఈడామ్ పడివత్తిన పడి తిరుక్కన్ సాథి అరుళ వేణుమ్”ఉగాందరుళి, ఉదయవరై అరుళపడిత్తు అరుళీ, “ఇవనుక్కగా రాజకన్ నామ్ తిరత్తిల్సీద కుట్రం పొరుత్తొం” ఎండ్రు తిరువుల్లం ఆగి అరుళినారు “ స్వస్తి.

జై శ్రీమన్నారాయణ


పన్నిద్దరాళ్వారుల చరిత్ర , చరితామృతం

పన్నిద్దరాళ్వారుల చరిత్ర, చరితామృతం

భక్తి ప్రవృత్తి శరణాగతి భావాలు అసలు లేనిచో మానవులు నైతికంగా పతనమవుతారని 

తలచిన ఆళ్వారులు. ప్రజలలో భక్తి ప్రవత్తులు పెంపొందించేందుకై కృషి చేసారు. వారు చూపిన భక్తి మార్గాలన్నీ లోక కల్యాణం కోసమే ! నిత్యం భగవంతునే తలుస్తూ, కొలుస్తూ, స్మరిస్తూ, తన్మయంతో సర్వం మరచి, అలౌకికమైన ఆనందానుభూతితో, భగవత్ చరణాలనే సర్వస్వమని భావించి తరించిన మహానుభావులు, సర్వవిశ్వపౌరులు మహామహిమాన్వితులైన మహానుభావులు ఎందరో ! నిరవదికమైన భగవత్ ప్రేమ సాగరంలో మునిగి, ఆర్తితో , పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ తరించేవారే ఆళ్వారులు. కారణజన్ములు. 

మానవకోటికంతటికీ ఆదర్శంగా నిలిచినా భాక్తాగ్రేసురులు. ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సత్యం లోతులను , ఆనందం లోతులను అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని , 

యామునాచార్యులు , రామానుజాచార్యులు ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. 

(ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) 

ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. 

కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824 లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందువారే గాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. 

ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం , పన్నెండు మంది అని మరో వాదం ఉంది. 

పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడింది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది. 

‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ , శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. కాని , ఇందులో పదాలను చీల్చి శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ, యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి, మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల ఆళ్వారులు పన్నిద్దరైనారు. 

పదుగురి పేర్లివి:

1. భూత ఆళ్వారు  - పూదత్త ఆళ్వారు అని వాడుక. 

కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం

2. పొయగై ఆళ్వారు. - పాంచజన్యం అనే శంఖం అంశ. సరోయోగ అని కూడా అంటారు.

3. పేయాళ్వార్‌. - మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. నందకం అనే ఖడ్గం అంశ.

4. తిరుమళిశై ఆళ్వారు. భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ.

5. కులశేఖ రాళ్వారు. కౌస్తుభమణి అంశ.

6. తొందర డిప్పొడి ఆళ్వారు. విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. తులసీదళాలు , పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల.. వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం.

7. తిరుప్పాణి ఆళ్వారు. యోగి వాహన ఆళ్వారు. ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు. 

విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.

8. తిరుమంగై ఆళ్వారు. పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం.

9. పెరియాళ్వారు. భట్టనాథ ఆళ్వారు. ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. వైకుంఠంలోని విష్ణువు రథం అంశ. 

10. నమ్మాళ్వారు. పరాంకుశ ఆళ్వారు. విష్వక్సేనుడి అంశ. శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.

ఈ పదిమందిగాక ఆండాళును , మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. 

పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. 

పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. 

మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. గరుడాంశగా చెపుతారు. 

భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. కాని, ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.   

వైష్ణవ సాంప్రదాయానికి, భక్తిని జోడించి, ప్రచారం చేసిన ఆళ్వారులు 12 మంది. వారు.

1. పుదత్తాళ్వారు

2. పాయ్ గైయాళ్వారు

3. పేయళ్వారు

4. పెరియాళ్వారు

5. ఆండాళ్

6. తిరుమళిశైయాళ్వారు

7. కులశేఖరాళ్వారు

8. తిరుప్పాణియాళ్వారు

9. తొండరడిప్పాయాళ్వారు

10. తిరుమంగైయాళ్వారు

11. మధురకవియాళ్వారు

12. నమ్మాళ్వారు

అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు , 

వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి

పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి

పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి

పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు

తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు

కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు

తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు

తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు

తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి

ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)

ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి

నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని .

వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. 

కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.

భక్తి ప్రపత్తి యోగముల పరమానందభరితులుగా ఉన్న ఆళ్వారుల దివ్యజీవిత చరితలు, వారి రచనలు దక్షిణాన వైష్ణవ భక్తిప్రాధాన్యతకు, విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలమయ్యాయి.

1. పుదత్తాళ్వారు 

2. పొయ్’గైయాళ్వారు 

3. పేయళ్వారు

వీరు ముగ్గురుని మూలాళ్వారులు అంటారు. 

కాంచీపురంలో ఒక సరోవరంలో కమలం మధ్యన పొయ్’గైయాళ్వారు జన్మించారు. 

వీరిని ‘కాసారయోగి’ అంటారు. 

ఇప్పుడు మహాబలిపురం ఐన మామల్లపురంలో మాధవీపుష్పంలో పూదత్తాళ్వారు జన్మించారు. 

వీరిని ‘భూతయోగి’ అంటారు. 

ఇప్పుడు మైలాపురం అనబడే మయురపురంలో ఒక సరస్సులోని తెల్లకలువ నుండి పేయాళ్వారు జన్మించారు. వీరిని ‘మహాయోగి’ అని అంటారు. 

ఈ ముగ్గురులో పాయ్’గైయాళ్వారు ఆళ్వారు పరంపరలో మొదటివారుగా చెప్పుకుంటారు. ఈ ముగ్గురు మహానీయుల జన్మ ఒక్కొక్కరోజు వ్యత్యాసంతో జరగటం ఆశ్చర్యకరం. ముందు జన్మించింది పాయ్’గైయాళ్వారు. తర్వాత ఒక్కొక్క రోజు తేడాతో పూదత్తాళ్వారు , పేయాళ్వారు చెబుతారు.

ఈ ముగ్గురు మహాయోగుల కలయిక చాలా ఆసక్తికరంగా జరిగింది. ఒకసారి పాయ్’గైయాళ్వారు, తిరుక్కొమూర్ అనే గ్రామానికి వచ్చారు. చీకటి పడింది. ఆ రాత్రి విశాంత్రి తీసుకోవడానికి ఓ చోటికి చేరుకున్నారు. అనుకోకుండా ఆ చోటికే పూదత్తాళ్వారు వచ్చి , కొంచెం చోటిమ్మని అడిగారు. ఇద్దరు సర్దుకొని కూర్చున్నారు. కొంచెంసేపు తర్వాత పేయాళ్వారు వచ్చి , కొంచెం చోటిమ్మని అడిగారు. ఆ ముగ్గురు విష్ణుభక్తులూ సంతోషంగా , ఆ చిన్నచోటులోనే నిలుచుని సర్దుకున్నారు. గాఢాంధకారం , ఎటు చూసినా కటిక చీకటి. కొంచెంసేపటికి వారికి నాలుగోమనిషి వచ్చి తమ మధ్యన నిల్చున్నాడనే అనుభూతి కలిగింది. కానీ , ఎవరూ కనపడలేదు. వారు ఆశ్చర్యంతో పరంధాముని ప్రార్ధించగా , శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. ఆ మహాయోగులు , ఆనంద పరవశులై తమిళంలో ఆశువుగా మూడు పాశురాలతో ఆ దేవదేవుని స్తుతించి ధన్యులైనారు.

4. తిరుమళిశైయాళ్వారు.

వీరి జన్మ గురించి కొంత విచిత్రంగా చెబుతారు. కాంచీపురానికి దగ్గరలో మహిషాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో భార్గవుడు కనకాంగి దంపతులకు తిరుమళిశైయాళ్వారు జన్మించారు. పుట్టినప్పుడు ఆ బాలునిలో కదలిక లేదట. దుఃఖితులైన తల్లిదండ్రులు ఆ బాలుని అడవిలో ఒక పొదలో పడేశారు. తిరువాలన్ అనే వ్యక్తి అడవి వేటకొచ్చాడు. పొదలో పసిపిల్లాడి ఏడుపు విన్న తిరువాలన్ , ఆ బాలుడ్ని తీసుకెళ్ళి తన భార్య పంకజవల్లి చేతుల్లో పెట్టాడు. ఆ దంపతులు ఆ పిల్లవానికి శివక్కియార్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఆ పసివాడి ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండేది. పాలు తాగేవాడు కాదు. ఆనోటా ఈనోటా ఈవిషయం పల్లెలోని వృద్ధదంపతుల చెవిన పడింది. వారు పాలు తెచ్చి పట్టగానే శివక్కియార్ పాలు తాగేశాడు. ఆ దంపతులు ఆనందంగా , రోజూ పాలు తెచ్చి శివక్కియార్ కి పట్టి , కొంచెం పాలు ప్రసాదంగా తీసుకునేవారు. అధ్బుతమైన సంఘటన. వృద్ధ దంపతులకు కొంత కాలానికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి కణ్ణకృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు.

శివక్కియార్ పెద్దవాడైనాడు. ఎన్నో విద్యలు నేర్చాడు. దేశాటన చేస్తూ తిరువళ్ళిక్కేణికి చేరుకున్నాడు. అక్కడే తపోదీక్ష స్వీకరించి ఎన్నో సిద్ధులు సాధించాడు. తిరువళ్ళిక్కేణికి మైలాపురం దగ్గరే. మైలాపురంలోనే పేయాళ్వారు నివాసం. వారు ఆనోట ఈనోట శివక్కియార్ గురించి విన్నారు. అతనిని ఎలాగైనా వైష్ణవునిగా చేయాలని సంకల్పించుకున్నారు. ఒకసారి శివక్కియార్ అటువైపుగా వెళుతుండగా , పేయాళ్వారు చూశారు. అదే మంచి సమయమని శివక్కియార్ చూస్తుండగా , తోటలో చెట్లను తల్లక్రిందులుగా పాతారు. అది చూసి పరిహసించిన శివక్కియార్ తో వాదించి వైష్ణవునిగా మార్చారు పేయాళ్వారు. అప్పటినుంచి శివక్కియార్ ని భక్తిసారుడు అని పిలిచేవారు. భక్తిసారుడు కాంచీపురం వచ్చాడు. అప్పుడే కణ్ణకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. కాంచీపురం దేవాలయం వద్ద ఒక వృద్ధురాలైన దేవాంగన ఉండేది. ఆమె రోజూ దేవాలయాన్ని , భక్తిసారుని ఆశ్రమ పరిసరాలని శుభ్రం చేస్తుండేది. ఆమె శ్రద్దకి తృప్తి చెందిన భక్తిసారుడు , ఆ దేవాంగనకి యవ్వనాన్ని ప్రసాదించాడు. ఆ దేవాంగన అందాన్ని చూసి మోహించిన కాంచీపురం రాజు ఆమెని పెళ్ళాడాడు. తనకు కూడా యౌవ్వనాన్ని ప్రసాదించమని భక్తిసారుని బ్రతిమాలాడాడు. కానీ భక్తిసారుడు నిరాకరించాడు. రాజు కోపంతో భక్తిసారుని కాంచీపురం వదలి వెళ్ళి పోవలసిందిగా ఆజ్ఞాపించాడు. భక్తిసారుడు రాజాజ్ఞను శిరసావహించి , కణ్ణకృష్ణునితో పాటు కాంచీపురం నుండి వెళ్ళిపోయాడు. ఆలయంలో శేషశాయి కూడా అదృశ్యమయ్యాడు. తన తప్పు తెలుసుకున్న రాజు భక్తిసారునికి క్షమాపణలు చెప్పి , కాంచీపురానికి రావలసిందని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత తిరుమళిశై ఆళ్వారు అని పిలవబడే భక్తిసారుడు కుంభకోణం చేరి , ఎన్నో మహిమలు చూపించాడు. విష్ణుదేవుని కీర్తిస్తూ , ఎన్నో రచనలు చేసాడు. ‘తిరుచ్చందవిరుత్తం’, ‘నాన్ముఖం తిరు అందాది’ – ఈ రెండు గ్రంథాలు ప్రసిద్ధాలు. 

వీరు కుంభకోణంలోనే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి , ఎన్నో మహిమలు చూపి , భక్తితత్త్వాన్ని ప్రచారం చేసి విష్ణుసాయుజ్యం పొందారు.

5.నమ్మాళ్వారు , 

6.మధుర కవి.

వైష్ణవ సంప్రదాయ గురువులలో నమ్మాళ్వారు స్థానం విశిష్టమైంది. వీరి తండ్రి తిరుక్కూరుగూరు పాలకుడైన శూద్ర ప్రభువుకారుడు. తల్లి ఉజయనంగ. సంతానం లేని వీరు తిరుక్కురుల గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా, భక్తికి మెచ్చి, తానే స్వయంగా కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. కొన్నాళ్ళకు వారి కలలపంటగా కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మారుడు అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతకాలమో లేదు. ఆ పిల్లవాడు కళ్ళు తెరవడు. పాలు తాగాడు. ఇదంతా చూసిన మంత్రులు పిల్లవాడిని స్వామి ఆలయానికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. రాజుకీ అదే మంచిది అనిపించి , మారుడిని తీసుకొని ఆలయానికి వెళ్లాడు. పిల్లవాడిని విష్ణుసన్నిధిలో పడుకోబెట్టారు. మారుడు కళ్ళు తెరచి , స్వామిని చూసి పాక్కుంటూ దగ్గరలో ఉన్న చింతచెట్టు దగ్గరకెళ్ళాడు. తొర్రలో దూరాడు. పద్మాసనంతో తపోనిష్ణుడైనాడు. ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని , కారణజన్ముడని , దైవాంశసంభూతుడని అందరికీ అర్థమైపోయింది. కారుడు కూడా చింతపడకుండా , మనస్సు గట్టి చేసుకొని , మారుడికి తపోభంగం కలగకుండా కట్టుదిట్టం చేశాడు. నిద్రాహారాలు లేకుండా తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మారుని చుట్టూ గొప్ప తేజస్సు ప్రకాశించింది. అతనే నమ్మాళ్వారు.

పాండ్యదేశంలో గోళూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నారాయణుడు అనే బ్రాహ్మణునికి ఒకే పుత్రుడు. ఆ పిల్లవాడు అతి చిన్న వయసులోనే వేదవేదాంగాలు , చదివాడు. సంసార తాపత్రయాలకు విముఖుడై , దేశాటన చేస్తూ బదిరికాశ్రమం చేరాడు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసి అయోధ్యా నగరానికి వచ్చాడు. ఒకరాత్రి అతనికి దక్షిణ దిశనుంచి మహాతేజస్సు కనబడింది. దానికి కారణం అన్వేషిస్తూ తిరుక్కడూరు చేరాడు. ఆయనే మధురకవి. విష్ణ్వాలయంలో చింతచెట్టు తొర్రలో తపోదీక్షలో ఉన్న తేజోమూర్తిని చూసి పరవశించి పోయాడు. వారితో మాట్లాడాలనే ఉత్సాహముతో పెద్దగా శబ్దం చేశాడు. తపోభంగమై కళ్ళు తెరిచిన నమ్మాళ్వారు , మధురకవి అడిగిన సందేహాలకన్నింటికి చక్కని వివరణలు ఇచ్చారు. మధురకవి అయన చెంత మోకరిల్లి తన గురువుగా స్వీకరించాడు. 

సంవత్సరాలు గడిచిపోయాయి. భక్తి పరిపక్వత చెందిన నమ్మాళ్వారు తనలో ఉప్పొంగే భావాలను, గ్రంథస్థం చేశాడు. ‘తిరువిరుత్తం’, ‘తిరువాశరియం’, ‘తిరువందాది’, ‘తిరువయిమొళి’ వీరి ముఖ్య గ్రంథాలు. శఠులను అంటే వంచకులను అణచుటచే, సంసారదోషాలను నిర్జించుటచే ఈయనకు ‘శఠకోపుడు’ అని, ఆదినాధ స్వామి ప్రసాదించిన పొగడపూల మాల ధరించటంచే ‘వకుళాభరణుడు’ అని, పరమతాలను విరసించటంవల్ల ‘వరాంకుశుడని’ పిలవబడేవాడు. ఎందరికో సన్నిహితుడై , ముక్తి పొందే తరుణోపాయం ఉపదేశించటం వల్ల ‘నమ్మాళ్వారు’ అన్నారు.

‘నమ్’ అంటే మన. నమ్ + ఆళ్వార్ = మన ఆళ్వార్. 

వైష్ణవ ప్రచారంలో అతి ముఖమైన మహానీయులలో ఒకరైన నమ్మాళ్వార్ 35వ ఏట పరమపదం చేరారు. నమ్మాళ్వారుకి ముఖ్యశిష్యులై , ఆయన అడుగుజాడలలో నడిచి , వైష్ణవ సాంప్రదాయానికి అశేషమైన ప్రాచుర్యానికి తోడ్పడిన మధురకవి , జీవితమంతా విష్ణు చరణ సేవలో గడిపి భగవదైక్యం చెందారు. వారు రచించిన భగవన్నుతి ‘కణ్ణిమణ్ శిరుత్తాయి’.

7. కులశేఖరాళ్వారు

భక్తకోటికి , భక్తిసంభరితమైన ‘ముకుందమాల’ ను అందించిన కులశేఖరాళ్వారుని ఎరుగనివారు, తలచని వారు ఉండరు. కులశేఖరాళ్వారుల తండ్రి ‘కొల్ల’ (నేటి క్విలన్) పరిపాలకుడు ధృఢవ్రతుడు. అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ సకల శాస్త్రపారంగతుడైనాడు. తండ్రి దృష్టి వానప్రస్థాశ్రమం స్వీకరించిన తరువాత రాజ్యభారాన్ని తాను తీసుకున్నాడు. రాజ్యపాలనలో క్షణం తీరికలేక తలమునకలై ఉన్నా , కులశేఖరుల దృష్టి ఆధ్యాత్మికత్వం పైనే ఉండేది. ప్రాపంచిక సుఖాలకు విముఖుడై, శ్రీరామచంద్రుని శరణంటూ ‘పెరుమాల్ తిరుమొళి’ అనే దివ్య ప్రబంధాన్ని రచించారు. ఈయన భక్తికి మెచ్చిన స్సేనముదలి అనే వైష్ణవాచార్యులు పంచసంస్కార దీక్షను ఇచ్చి అనుగ్రహించారు. అది మొదలు కులశేఖరాళ్వారులో భక్తి రెట్టింపైంది. శ్రీరంగనాథుని దర్శించాలని తపనపడ్డాడు. కానీ , మంత్రులు ఈయనవెళితే మళ్ళీ తిరిగిరాడని శంకించి, వైష్ణవాచార్యునే దూరం చెయ్యాలని ఆలోచించారు. పూజాగృహంలోని రత్నహారాన్ని దాచి, ఆ నేరం ఆచార్యుని మీద మోపారు. నేరాన్ని నిర్ధారించుకోవటానికి ఒక కుండలో విషసర్పాన్ని ఉంచి , తన ఉంగరాన్ని అందులో వేసి, తన గురువుపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి , కులశేఖరులు ఉంగరాన్ని పైకి తీసారు. మంత్రులు తమ తప్పిదానికి సిగ్గుపడి క్షమాపణలు అడిగారు. జీవితకాలమంతా పరమాత్మ సేవలో తరించినారాయన.ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు. తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.

8.పెరియాళ్వారు , 

9.ఆండాళ్ళు.

పెరియాళ్వారు అసలు పేరు విష్ణుచిత్తుడు. ఈయన తల్లిదండ్రులు ముకుందా చార్యులు , పద్మావతీదేవి. ముకుందాచార్యులు శ్రీవిల్లిపుత్తూరు విష్ణ్వాలయంలో పరిచారకుడు. చిన్నప్పటినుంచి విష్ణుచిత్తుడు తిరుమంత్రమైన అష్టాక్షరీమంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఒకసారి విష్ణుచిత్తుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ, మాలాకారుని తరింప చేసిన ఘట్టం విన్నాడు. తాను కూడా అట్లాగే తరించాలని , స్వయంగా చక్కటి పూలతోట పెంచి, ఆ తోటలో పూలతో విష్ణుమూర్తిని పూజించి ఆనందించేవాడు. ఆ కాలంలో మధురను వల్లభరాయుడు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు రాత్రి పూట మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ణసుఖాలను కనిపెడుతుండేవాడు. ఒకరోజు రాత్రి తిరుగుతూ తిరుగుతూ , ఒక అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుని చూశాడు. ఆ బ్రహ్మానుడు మహాజ్ఞాని అని గ్రహించి , నమస్కరించి , తనకేదైనా ఉపదేశించమని అర్థించాడు. ఆ బ్రాహ్మణుడు వార్థక్యం రాకముందే పరమాత్మ యందు అనురక్తి పెంచుకొమ్మని సోదాహారణగా బోధించాడు. రాజు నిజమందిరం చేరి ఆ రాత్రంతా ఆలోచించాడు. మర్నాడు పొద్దున్నే పండితసభ ఏర్పాటు చేశాడు. సభ మధ్యలో స్తంభం పాతించి, దాని మీద బంగారు నాణేలు నింపిన సంచి కట్టించాడు. పండిత సభలో గెలిచిన వారికి ఆ నాణేల సంచి బహుకరించబడుతుందని, ఆ విజేతయే తన గురువని ప్రకటించాడు. ఎందరో పండిత ప్రకాండులు వచ్చారు. 

విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) కూడా వచ్చారు. పరమేశ్వర ప్రేరణతో పండితులతో వాదించి విజయం పొందారు. పరమానంద భారితుడైన రాజు, పెరియాళ్వారును గురుపీఠం పై ఉపవిష్టులను చేసి, గజారోహణం చేయించాడు.

ఒకరోజు పెరియాళ్వారు తోటపని చేస్తుండగా , వారికి , జనకమహారాజుకి సీతమ్మ లభించినట్లు , ఒక బాలిక దొరికింది. ఆ బాలికను భాగవత్ప్రసాదంగా భావించి , గోదాదేవి అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కారణజన్మురాలు గోదాదేవి , నిత్యం విష్ణునామం స్మరిస్తూనే ఉండేది. బాలిక పెరిగి పెద్దదైంది. మహావిష్ణువునే మనసులో భర్తగా భావించి తన్మయత్వం చెందేది. తండ్రితోపాటు మాలలల్లేది. తండ్రి లేనపుడు ఆ మాలను తాను తలలో మురిపెంగా ధరించి , ఆపై శ్రీరంగనాథునికి అలంకరించేది. అనుకోకుండా ఒకరోజు పెరియాళ్వారు అది గమనించారు. గోదాదేవిని మందలించి , ఆ రోజు మాలను శ్రీరంగనాథునికి అలంకరించలేదు. ఆ రాత్రి శ్రీరంగనాథుడు పెరియాళ్వారుకి కలలో కనిపించి , తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని , వాటినే తనకు అలంకరించమని ఆదేశించాడు. గోదాదేవి వయసుతో పాటు భక్తి కూడా పెరిగింది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ‘తిరుప్పావై’ అనే 30 పాశురాలు ,   ‘నాచ్చియార్ తిరుమొళి’ అనే 140 పాశురాలు వ్రాసింది. ఆ పాశురాలను పాడుకుంటూ తనను తాను మరిచిపోయేది.గోదాదేవికి వివాహ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె శ్రీమహావిష్ణువును తప్ప ఎవరినీ వివాహమాడనని ఖచ్చితంగా చెప్పింది. 

108 శ్రీమహావిష్ణుక్షేత్రాలలో , శ్రీరంగంలో శ్రీరంగానాథుడే తనకు ఇష్టుడని , ఆయనకిచ్చి వివాహం చేయమని కోరింది. మహదానందంగా విష్ణుచిత్తుడు గోదాదేవికి , శ్రీరంగనాథుడికి వివాహం జరిపించాడు. వివాహానంతరం ఆలయం లోనికి వెళ్ళిన గోదాదేవి క్షణమాత్రంలో ఆర్చామూర్తిలో ఐక్యం అయింది. గోదాదేవికే భక్తులను రక్షించేది అనే అర్థంతో ‘ఆండాళ్ళు’ అని , స్వామికి తాను ధరించిన మాలలే అలంకరింపజేయటం చేత ‘శూదికొడుత్తాళి’ అని పేర్లతో ప్రసిద్ధికెక్కింది.

10. నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని

క్రీ.శ. 798 కలంవాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం , నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని, మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును, సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.

11. మధురకవి యాళ్వార్.

ఇతను బ్రాహ్మణుడు. తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

January 25, 2025

95 దివ్యదేశాల యాత్ర Day - 2

 95 దివ్యదేశాల యాత్ర Day - 2

Day - 2  (13/12/24)

ముందుగా (91వ దివ్యదేశం) తిరునీర్మలై ని దర్శించుకున్నాము. 

నీరవణ్ణన్ పెరుమాళ్ - అణిమామలార్ మంగైనాయకి  

ఈ క్షేత్రాన్ని తోయాద్రి లేదా తోతాద్రి అని కూడా అంటారు. మహావిష్ణువు స్వయంభూగా వెలసిన 8 క్షేత్రాలలో ఇది ఒకటి. 

శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రాలని స్వయం వ్యక్త క్షేత్రాలు అని అంటారు. అవి ఎనిమిది ఉన్నాయి. వాటిలో తిరునీర్మలై ఒకటి. మిగిలినవి శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, బదరీ, నైమిశారణ్యం, పుష్కరం & ముక్తినాథ్. 

ఇక్కడ కొండపైన & దిగువున 2 ఆలయాలు ఉన్నాయి. 

కొండ ఎక్కాలి అంటే 200 మెట్లు ఎక్కాలి. కొండదిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా అన్ని మెట్లని లెక్కపెట్టుకుంటూ వచ్చాను. అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.  ఓపిక ఉన్నవాళ్ళు కొండా ఎక్కవచ్చు, లేనివాళ్ళు దిగువున ఉన్న ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చును. 










ఇవన్నీ కొండపైన ఆలయం ఫోటోలు 



ఇవి కొండా దిగువన ఉన్న ఆలయం ఫోటోలు 

2) తరువాత తిరునిన్రవూర్ (89వ దివ్యదేశం)

భక్తవత్సల పెరుమాళ్ - ఎన్నపెత్త తాయార్ 



3) తరవాత (90వ దివ్యదేశం)  తిరువళ్ళూరు

వీరరాఘవ పెరుమాళ్ - కనకవల్లీ తాయారు 

తిరువళ్ళూరు చేరుకునేసరికి 12.30 దాటింది ఆలయం మూసివేశారు. అక్కడే ఒక ఫంక్షనుహాలులో భోజనాలు ముగించుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొన్నాము. ఆలయం తెరిచే సమయానికి ముందు అక్కడ ఉన్న హృత్పాపనాశ పుష్కరిణికి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఆలయం తెరిచారు. స్వామిని దర్శించుకున్నాము. ఆలయంలో ఉన్న వీరరాఘవ పెరుమాళ్ ని వైద్యనాథ పెరుమాళ్ అని కూడా అంటారు. 





తరవాత అభిమానదేశమైన శ్రీ పెరంబుదూరు వెళ్ళాము 

ఆదికేశవ పెరుమాళ్ - యతిరాజనాథవల్లతాయార్ 

శ్రీవైష్ణవులకు ఇష్టమైన క్షేత్రం - శ్రీమత్ భగవత్ రామానుజులు అవతార స్థలం ఇది. ఈ క్షేత్రాన్నే భూతపురి అని కూడా అంటారు. 

ఇక్కడ ఉన్న రామానుజుల మూర్తి విశేషం ఏమిటంటే,

ఒకరోజు రామానుజల భక్తులు ఒకరు వచ్చి భక్తితో సమీపించి, ఆచార్య మీరు ఈ భూమిపై శ్రీ వైష్ణవ ధర్మమును ప్రచారం చేయుటకు అవతరించారు. తర్వాత తరములవారికి మీ గురించి తెలియజేయుటకు, మిమ్మల్ని పూజించుటకు, మీ విగ్రహము ఈ భూతపురిలో ప్రతిష్టించుటకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. భక్తుని కోరికను రామానుజులు అంగీకరించారు. వెంటనే వారి విగ్రహము లోహంతో తయారు చేయించారు భక్తులు. వారు ఆ విగ్రహమును తెచ్చి ఆచార్యులకి చూపించారు అంతట రామానుజులవారు ఆ విగ్రహమును పైనుంచి కింద వరకు పరిశీలనగా చూసి సంతోషము వ్యక్తపరిచి, ఆ విగ్రహమును ఆలింగనం చేసుకుని తమ దివ్య శక్తిని అందులో ప్రవేశపెట్టిరి. అంతట ఆ విగ్రహమును ఒక పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి పుష్య మాసంలో, పుష్యమి నక్షత్రంలో, గురువారం నాడు ఆ విగ్రహమును శ్రీపెరంబుదూరులో ప్రతిష్టించరి. అక్కడ శ్రీపెరంబుదూరులో అభిషేకం చేసినప్పుడు, ఇక్కడ శ్రీరంగంలో రామానుజులవారు ఉక్కిరిబిక్కిరి అయ్యిరి. అంటే శ్రీపెరంబుదూరులో ఉన్న మూర్తి సజీవ మూర్తి అని మనకు తెలుస్తున్నది. 

రామానుజులు వేంచేసియున్న కాలంలో ప్రతిష్టించబడిన దివ్య మంగళ మూర్తులు మూడు. మొదటిది శ్రీపెరంబుదూరులో తాను అభిమానించిన దివ్యమంగళ విగ్రహం. రెండవది తిరునారాయణపురం అంటే మేల్కోటలో భక్తులు అభిమానించి ప్రతిష్టించిన తిరుమేని విగ్రహం. మూడవది శ్రీరంగం ఇది తానాన తిరుమేని అంటారు అంటే తానే అయి తానే అయినా తిరుమేని. 

మేము శ్రీపెరంబుదూరు ఆలయానికి చేరే సమయానికి తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం ఆ రోజున. తిరుమంగై ఆళ్వార్ మరియు రామానుజుల వారు ఊరేగింపు అయ్యి పల్లకీలలో ఆలయానికి తిరిగి వచ్చే సమయానికి మేము ఆలయానికి వెళ్ళాము. ఇద్దరు ఆళ్వార్ లకి గజరాజు వింజామర వీస్తున్న దృశ్యం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉందో. 











అక్కడితో మా రెండవరోజు యాత్ర ముగిసింది.  91, 90 & 89  అంటే 3 దివ్యదేశాలు 1 అభిమాన దేశం దర్శనాలు అయ్యాయి. 




January 24, 2025

95 దివ్యదేశాల యాత్ర Day - 1

 95 దివ్యదేశాల యాత్ర Day - 1

జై శ్రీమన్నారాయణ 🙏

95 దివ్యదేశాల యాత్రకి 2024 డిసెంబర్ 11 సాయంత్రం బయలుదేరాము. 28 సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నాము. 

హైదరాబాద్ నుండి ముగ్గురం, వైజాగ్ నుండి ఇద్దరూ మొత్తం మా బ్యాచ్ ఐదుగురం వెళ్ళాము. యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. 

ఏలూరు "లీలా ట్రావెల్స్" వాళ్ళతో వెళ్ళాము. ఆర్గనైజర్ "దానకర్ణ" గారు. మాకు గైడ్ లాగా వచ్చిన ఆవిడ "ధనలక్ష్మి" గారు. ఆవిడ ప్రతీ దివ్య దేశానికి (ఆలయానికి) వెళ్ళే ముందు ఆ ఆలయ చరిత్ర & వివరాలు  అన్నీ వివరంగా చెప్పారు. అలా చెప్పటం వలన అక్కడ ఉన్న పెరుమాళ్ళని చక్కగా సేవించుకోవటం అయ్యేది. 

11/12/24 సాయంత్రం 6.30 కి సికింద్రాబాద్ లో ట్రెయిన్ ఎక్కి, 12 ఉదయం 6.50 కి చెన్నై ఎగ్మోర్ లో దిగాము. అక్కడే వెయిటింగ్ రూమ్స్ లో స్నానాలు చేసి, పక్కనే ఉన్న హోటల్ లో ట్రావెల్స్ వాళ్ళు ఫలహారాలు పెట్టించారు, తినేసి 10.15 కి బస్ ఎక్కి మా యాత్రని మొదలుపెట్టాము. 

యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. అందరికీ సౌకర్యంగా ఉంటుందని 2 బస్సులలో అందరినీ తీసుకొనివెళ్ళారు. ముందుగా

Day -1 (12/12/24)

1). తిరువల్లిక్కేణి  (94 వ దివ్యదేశం) 








మూలవరులు .... పార్థసారథి పెరుమాళ్ - రుక్మిణీ తాయార్ 
దీనినే పార్థసారథి ఆలయం అని అంటారు. చెన్నైలోని ట్రిప్లికేన్లో ఈ దివ్యదేశము ఉన్నది. 
ఆలయ చరిత్రని కొంచెం తెలుసుకుందాము.  

పురాణగాథ/పార్థసారధి: పూర్వము సుమతి అను రాజు వెంకటేశ్వరస్వామిని దర్శించి "మహాభారత యుద్ధ సమయమున అర్జునునకు సారథిపై గీతోపదేశము చేయుచున్న రూపములో దర్శనము కావలెను" అని కోరెను. కలలో సుమతికి దర్శనమొసగి బృందారణ్యమును సందర్శించినచో నీ కోరిక నెరవేరును అని స్వామి చెప్పెను. కలియుగములో వ్యాస మహర్షి తన శిష్యుడైన ఆత్రేయ ఋషిని బృందారణ్యమునకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పెను. వ్యాస మహర్షి తన శిష్యునకు శ్రీమన్నారాయణుని సుందర విగ్రహమును ఆరాధన కొరకు ఇచ్చెను. అత్రి బృందారణ్యము చేరి కైరవేణి తీరమున తపస్సు ప్రారంభించెను. అదే సమయమునకు అచ్చట చేరుకొన్న సుమతి గీతోపదేశము చేయు పార్థసారధి స్వామివారి దివ్యమంగళ విగ్రహముగా గుర్తించి స్తుతించెను.

ఆనాటి మూర్తే నేడు ఉత్సవ మూర్తిగా మనకు దర్శన మిస్తారు. అంతేకాదు ఆనాటి భారతయుద్ధంలో తగిలిన బాణపు గుర్తులు నేటికి కనుపిస్తాయి. ఉత్సవ మూర్తిలో ఒక విశేషం ఉన్నది. ఎప్పుడు నీల వర్ణంలో ప్రకాశించే ఈ ఉత్సవమూర్తి ముఖ పద్మం అభిషేకానంతరం రెండు గంటల పాటు బంగారు రంగులో దర్శన మివ్వడం ఒక విశేషం. ఇక్కడ శ్రీకృష్ణుడు సకుటుంబంగా అన్న బలరాముడు, దేవేరి రుక్మిణి, తమ్ముడు సాత్యకి, కుమారుడు ప్రద్యుముడు, మనుమడు అనిరుద్దుడు వారితో కలసి ఇక్కడ సాక్షాత్కరించాడు. అత్రి మహా మునికి ప్రత్యక్షమైన నరసింహస్వామిని కూడ మనం ఇక్కడ దర్శించవచ్చు. మూలవర్లు యోగ నరసింహం ఉత్సవమూర్తి శాంత నరసింహుడు వీరినే తెళ్ళియళగియ సింగర్ అని పేరు.      

రంగనాథులు : శ్రీరంగంలో పడమర దిశగా పవళించిన స్వామి ఇచ్చట దక్షిణ దిశగా శిరస్సు వంచి పవళించుట గమనించవలసిన విశేషము. మాసి మాసము శుక్లపక్షములో స్వామి వారి కళ్యాణము వైభవంగా జరుగును. ఒకసారి శ్రీ మహలక్ష్మి శ్రీహరిపై అలుక పూని ఈబృందావన క్షేత్రములో ఒక చందన వృక్షము ఛాయలో పసి పాపగా అవతరించి పవళించింది. అచ్చట ఉన్న సప్త ఋషులు పాపను కనుగొని వేదవల్లి అని నామకరణము చేసి పెంచ సాగిరి. యుక్తవయస్కురాలైన దేవకన్యను పోలిన ఆమెను కనుగొని ఋషులు ఆనందించారు. శ్రీహరి యువరాజు వలె ఆమెకు దర్శన మిచ్చెను. ఆమె ఆయనను మన్నాధన్ అని పిలిచినది. మన్నాధన్ అనగా "శాశ్వతుడైన పతి దేవా” అని అర్థము. భృగు మహర్షి ఆ యువరాజును శ్రీమన్నారాయణునిగా గుర్తించి వారిరువురికీ వివాహం జరిపెను. భృగు మహర్షి కోరికపై రంగనాథ, వేదవల్లులు ఇచ్చట వేంచేసి వెలసినారు. స్వామిని మన్నధర్ స్వామి అని కూడా పిలుస్తారు.


గజేంద్రవరదన్ పూర్వము సప్తరోమనుడు అను భక్తుడు శ్రీమన్నారాయణుని దర్శనము కోరి బృందారణ్యములో తపమాచరించెను. స్వామి దర్శనమీయగా గజేంద్రుని రక్షణ సమయంలో నున్న రూపములో దర్శనమివ్వమని కోరెను. వారి కోరికను మన్నించి గరుడవాహనా రూఢుడై వెలసి స్వామి తన భక్తుని కటాక్షించెను.

చక్రవర్తి తిరుమగన్ : పాండ్యనాడులో పండరము అను పర్వతము కలదు. అచట శశి వదనుడు అను ముని తపస్సు చేయుచుండెను. విశ్వామిత్రుని తపస్సు భంగపరచినటుల శశివదనుని తపము భంగపరచుటకై హైలై అను అప్సరసను ఇంద్రుడు పంపెను. శశివదనుడు హైలైను మోహించి ఆమె ద్వారా ఒక కుమారుని పొందెను, శశివదనుడు, హైలై కుమారుని ఒక గుహలో వదలి ఎవరి దారిన వారు వెళ్ళి పోయిరి. గుహలో యున్న తేనె తుట్టెల నుండి తేనె చుక్కలుగా శిశువు నోటిలో పడగా వాని ఆకలి తీరినది. తేనె త్రాగి పెరిగి పెద్ద వాడైన వానిని మధుమన్ అని పిలువసాగిరి. కాలక్రమంలో వానికి గార్గేయ మహర్షి దర్శనమొసగి బృందారణ్యములో తపము నాచరించిన శ్రీరామ సాక్షాత్కారము లభించునని ఆదేశించెను. మధుమన్ బృందారణ్యము చేరి తపము చేయనారంభించెను. వాని తపమునకు మెచ్చి శ్రీరామచంద్రుడు సతీ, సోదర సమేతంగా దర్శనమొసగెను. అటుల మధుమన్ తపఃఫలముగా శ్రీరామచంద్రులు నేటికీ మనందరకు యీ కోవెలలో దర్శనభాగ్యము కలిగించుచున్నారు.


2) తరువాత రెండవ (93 వ)దివ్యదేశాన్ని  స్థలశయన పెరుమాళ్ ని దర్శించాము 

ఉలగ ఉయ్యనిండ్రాణ్ పెరుమాళ్ -  నీలమంగై నాచ్చియర్ 

ఇది మహాబలిపురంలోని సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.  



పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.  



3). తిరువిడవేందై (92 వ దివ్యదేశం)

 శ్రీలక్ష్మీ ఆదివరాహస్వామి (నిత్యకళ్యాణ పెరుమాళ్) - కోమలవల్లీ తయార్


చెన్నైకి 47 కిమీ దూరంలో, మహాబలిపురానికి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి పెళ్ళికాని వారు వచ్చి స్వామిని దర్శిస్తే పెళ్ళి అవుతుంది అని అంటారు. అందుకే ఈ ప్రాంతానికి నిత్యకల్యాణపురి అని అంటారు.      

మొదటిరోజు 3 దివ్యదేశాలని (94, 93, 92)  దర్శించుకున్నాము.

January 20, 2025

శ్రీవైష్ణవ 108 దివ్య దేశముల వైభవము

 శ్రీమతే రామానుజాయనమః

శ్రీవైష్ణవ అష్టోత్తర శత దివ్య దేశముల వైభవము

01. శ్రీరంగం

ఈ దివ్యక్షేత్రంలో శయనించినమూర్తికి పెరియపెరుమాళ్ అని పేరు. ఉత్సవమూర్తి శ్రీరంగనాథుడు. వీరికి నంబెరుమాళ్ అని పేరు. అమ్మవారు శ్రీరంగనాయకి. ఉభయకావేరీ నదుల నడుమ చంద్ర పుష్కరిణీ తీరంలో ప్రణవాకార విమానంలో ఐదు తలల ఆదిశేషునిపై దక్షిణ ముఖంగా శయనించి భక్త జనుల హృదయాలను దోచుకుంటున్న శ్రీరంగనాథుడు విభీషణునకు, ధర్మవర్మ రవివర్మకు ప్రత్యక్షము. గోదాదేవి, ఆళ్వార్లు అందరు కీర్తించిన దివ్య తిరుపతి ఈ శ్రీరంగము. ఇచట ఆంతరంగిక కైంకర్యపరులు తిరుప్పాణి ఆళ్వార్.

02. ఉరైయూర్

ఉరైయూర్ లో వేంచేసి ఉండే పెరుమాళ్ళకు అళగియ మణవాళన్ అని పేరు. వీరినే సంస్కృతంలో సుందరజామాత అని అంటారు. అమ్మ వారి పేరు వాసలక్ష్మి, కమలవల్లి. కుడమురుట్టి నదీ తీరంలో కల్యాణ తీర్థ సమీపంలో కల్యాణ విమానంలో ఉత్తర ముఖంగా నిలుచుని ముప్పది మూడు కోట్ల దేవతలను అనుగ్రహించాడు స్వామి. ధర్మవర్మకు రవివర్మకు ప్రత్యక్షము. తిరుమంగైయాళ్వార్ కీర్తించిరి. ఇక్కడ పెరుమాళ్ళు ప్రయోగ చక్రంతో ఉండడం ఒక విశేషం.

03. తంజమామణిక్కోయిల్

ఇక్కడ వేంచేసి ఉన్న స్వామికి నీలమేఘప్పెరుమాళ్ అని పేరు. అమ్మ వారు శంగమలవల్లి. కన్యా పుష్కరిణి, అమృత తీర్థముల సమీపంలో సౌందర్య విమానంలో తూర్పు ముఖంగా సుఖాసీనుడై భక్తులకు దర్శనం ఇస్తున్న స్వామి పరాశర మహర్షికి ప్రత్యక్షం. తిరుమంగైయాళ్వార్ల మంగళాశాసనం. తంజయాళి ఆలయంలో సూర్య పుష్కరిణీ తీరంలో శ్రీరామ తీర్థ సమీపాన వేద సుందర విమానంలో తంజనాయకీ అనే అమ్మవారితో శ్రీనరసింహ రూపంలో తూర్పు ముఖంగా కూర్చుని దర్శనం ఇస్తున్న స్వామి మార్కండేయ మహర్షికి ప్రత్యక్షమైనాడు.


04. అన్బిల్

ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న పెరుమాళ్ళు తిరువడి అళగియనంబి. అంటే అత్యంత సుందరుడని అర్థం.అమ్మవారు సౌందర్యవల్లి (అళగియవల్లి). ప్లవాఖ్య పుష్కరిణీ తీరంలో తారక మాసంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై  శయనించిన స్వామి వాల్మీకి మహర్షికి బ్రహ్మకు ప్రత్యక్షం. తిరుమళి శైయాళ్వార్ల మంగళాశాసనం.

మార్గము - శ్రీరంగమునకు సుమారు 18 కిలోమీటర్లు. తిరుచ్చి నుండి లాల్గుడి చేరి అక్కడి నుండి వేరు బస్సులో చేరవచ్చును. తిరుచ్చి నుండి కూడ నేరుగా బస్సు వసతి కలదు.


05. తిరు కరంబనూరు(ఉత్తమర్ కోయిల్)

(శ్రీహరి ప్రియ గోష్టి నుంచీ) (పి.యల్.నరసింహా చార్య దాసన్: & Edited by శ్రీ ఫణిహారం రంగనాత్ )

(29.5.23)

శ్లో: రంభా వృక్షయుతే కదంబనగరే కాదంబ తీర్తాంచితే

       పూర్వాఖ్యాప్రియయా భుజంగశయనో హ్యుద్యోగ వైమానగః

       ధ్యాత శ్శ్రీస్సనకాది యోగి కలిజిత్ కాదంబ వస్వాదిభిః

       ప్రాగాస్యః  పురుషోత్తమో విజయతే కీర్త్యః  కలిద్వేషిణిః

ఎక్కడుందీ క్షేత్రము?  - శ్రీరంగ క్షేత్రానికి‌ రెండు kms దూరములో ఉంది. భక్తులు శ్రీరంగములోనే బస చేయాలి.‌ రైల్వే స్టేషను కూడా ఉందిక్కడ. దగ్గరలో కొల్లిడం నది ఉంది.

మూలవర్లు - పురుషోత్తమ పెరుమాళ్ తూర్పు ముఖంగా భుజంగశయనునిగా దర్శనమిస్తారు. ఈ ఆలయములో శివునకు కూడా ఒక సన్నిధి ఉంది. 

బ్రహ్మకూ ఒక సన్నిధి ఉంది. సరస్వతికి ఒక సన్నిధి ఉంది. కార్తీక దీపోత్సవాలలో శివుణ్ణీ, పెరుమాళ్ళనూ కలిపి భక్తులకు(పురప్పడు) ఆలయ వీధులలో దర్శనమిస్తారు.

తాయారు - పూర్వాదేవి తాయారు.

తీర్థము - కదంబ తీర్థము. ఇక్కడ పురాతనమైన అరటి చెట్లు ఉన్నాయి. ఈ అరటి చెట్లే స్థలవృక్షము.

విమానము - ఉద్యోగ విమానము.

సనకసనందాదులకూ, కదంబ మహర్షికీ, ఉపరిచరవసు మహారాజుకు, తిరుమంగై ఆళ్వార్లకు పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారు.

స్థలపురాణము ప్రకారము: 

బ్రహ్మకు ఐదు తలలను చూచి అసూయచెంది ఒక‌ తలను గిల్లివేసి బ్రహ్మహత్యాదోషానికి శివుడు గురి అయ్యాడు‌. దానితో బ్రహ్మ‌కపాలము ‌శివుని వ్రేళ్ళకు చిక్కుకుంది. దాన్ని తొలగించుకోలేక ఇక్కడికి ~ కదంబ క్షేత్రానికి వస్తే పెరుమాళ్ళు తాయారుకు ఏమైనా భిక్ష శివునికి ఇవ్వమని చెబితే, ఆమె కటాక్షముతో దోషపరిహారమయ్యింది. అందుకే శివుడు ఇక్కడే ఉండిపోయినాడు. దీన్ని భిక్షాందర్ కోయిల్ అ‌ని‌ అంటారు.

తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ బస చేసి శ్రీరంగ ప్రాకారాలనూ గోపురాలనూ పునరుద్దరించే కార్యక్రములు పర్యవేక్షించినపుడున్న మండపాన్ని 

Aalwar  Partta Varthi అని పిలుస్తారు.

తిరుమంగై ఆళ్వార్లు వారి పె‌.తి.మొ. 5-6-2 లో ఉన్న మంగళాశాసన పాశురము:

పేరానై! కుఱుఙ్గుడి యెంబెరుమానై!  తిరుత్తణ్గాల్!!

ఊరానై! క్కరంబనూరుత్తమనై! ముత్తిలఙ్గు

కారార్ తిణ్ కడలేழுమ్! మలైయేழ் ఇవ్వులగేழுణ్డుమ్!!

ఆరాదెన్ఱు ఇరుందానై! క్కణ్డదు తెన్నరఙ్గత్తే!!

పురుషోత్తమ పెరుమాళ్ తిరువడిగళే శరణం 

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణమ్)


06. తిరువెళ్ళరై (శ్వేతగిరి)  (30.5.23)

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)

(పి.యల్.నరసింహాచార్య దాసన్:& Edited by. శ్రీ ఫణిహారం రంగనాత్ )

శ్లో:  తీర్థైః పుష్కల పద్మ చక్ర కుశకై స్సంశోభ మానస్థితే

        రమ్యే శ్రీమణికర్ణి కాహ్వయ వరాహాఖ్యాత తీర్ధాంచితే

        గంధ క్షీరసు దివ్య పుష్కరి‌ణికా యుక్తే సితాద్రాహ్వయే

        రాజంతం నగరేతు వెళ్ళర పదే ప్రాగ్రాస్య సంస్థానగమ్

      శ్రీమచ్చంపక వల్లికా పరిగతం శ్రీపంగయచ్చెల్వికా

     నాయక్యా విమలాకృతిం సురుచిరం వైమాన వర్యశ్రితమ్

    మార్కండేయ శిబిక్షితీశ గరుడక్షోణీ దృశాం గోచర

   పద్మాక్షాహ్వయ మాశ్రయే కలిరిపు శ్రీ విష్ణుచిత్త సుతమ్

ఎక్కడుందీ క్షేత్రము? శ్రీరంగానికి 15 kms దూరములో ఉత్తమర్ కోయిల్‌ మీదుగా తిరుచ్చ్బి~ఉరైయూర్ బస్సు మార్గములో ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లభించవు; శ్రీరంగములోనే బస చేయాలి. ఈ క్షేత్రానికి 

శ్వేతగిరి అ‌ని పేరు;  ఒక చిన్న కొండమీద ఉన్నది; దాదాపు 59 మెట్లున్నాయి~ వంద అడుగుల ఎత్తులో ఉందీ ఆలయము. ఇక్కడి కొండమీది రాళ్లన్నీ తెల్లగా ఉన్నందున శ్వేతగిరి అని పేరొచ్చిందని కథనము.

మూలవర్లు - పుండరీకాక్షులు తూర్పు ముఖంగా నిలుచున్న మూర్తిగా దర్శనమిస్తారు. శిబిచక్రవర్తి ప్రార్థనచే స్వామి ప్రయోగచక్రముతో పుండరీకాక్షులను పేర సేవ సాయించినారు. స్వామికి ఇరుప్రక్కలా సూర్యచంద్రులు వింజామరలు వీస్తూంటారు. 

తాయార్లు - పంగయచ్చెల్వి తాయారు.(చెంపకవల్లి) అభయ హస్తముతో దర్శనమిస్తుంది.

విమానము - శ్వేతాద్రి ~ విమాలాకృతి విమానము.

తీర్థాలు - పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణికర్ణిక, వరాహ, గంధ, క్షీర పుష్కరణిలు. మార్కండేయ,  శిబి, గరుడ, భూదేవికి స్వామి ప్రత్యక్షమయ్యారు.

ఉత్సవాలు - ఇక్కడ ఉత్తరాయణ దక్షిణాయణ (వాసల్ ) ద్వారాలున్నాయి.  మీనమాసాన, ఫాల్గుణ మాసాన బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

పెరియాళ్వావార్లు(11), తిరుమంగైయ్యాళ్వార్లు(13) పాశురాలను  కీర్తించినారు.

పెరుమాళ్ళకు కుడివైపున గరుడ, ఎడమవైపున ఆదిశేషుడు, మార్కండేయుడు కుడివైపు, భూదేవి ఎడమవైపునా కూర్చిని సేవచేస్తుంటారు స్వామికి.

పెరియాళ్వార్ల పాశురము ~ 2-8-1:

ఇన్దిరనోడు పిరమన్! ఈశన్ ఇమైయవరెల్లామ్!!

మందిర మామలర్ కొణ్డు! మఱైన్దు ఉవరాయ్ వన్దునిన్ఱార్!!

శందిరన్ మాళిగై శేరుమ్! శదురర్ కళ్ వెళ్ళరై నిన్ఱాయ్!!

అన్దియమ్ పోదు ఇదువాకుమ్!  అళగనే కాప్పిడవారాయ్!!

ఓం  పుండరీకాక్షాయ తిరువడిగళే శరణమ్ 


07. తిరుప్పళ్ళం పూతంగుడి 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ పి.యల్.నరసింహాచార్య దాసన్ &  Edited by  శ్రీ ఫ‌‌ణిహారం రంగనాత్)

(31.5.23)

శ్లో: శ్రీ గృధ్రాబిధ తీర్థ సుందర తటే భోగేశయః ప్రాగ్ముఖః

       పుళ్ళంపూద పురే తు శోభనపదం వైమాన మాభ్యాగతః

       శ్రీమాన్ వల్విలిరామ నామక విభుః పొత్తామరాఖ్యాప్రియః

       గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం  తు రారాజతే

ఎక్కడుందీ క్షేత్రము?  కుంభకోణము ~ తిరువైకావూర్ రోడ్డుమార్గములో స్వామిమలై కు ఐదు kms దూరములో ఉన్నది. ఈ సన్నిధి అహోబలమఠం వారి నిర్వహణలో ఉంది‌. భక్తులను సకల సదుపాయాలున్నాయి ఇక్కడ.

మూలవర్లు ~ వల్ విల్లి రామ‌‌‌న్ తూర్పు ముఖంగా భుజంగశయనంగా దర్శనమిస్తారు. ఉత్సవర్లు నిలుచున్న భంగిమలో చతుర్భుజాలతో ఉంటారు. సీతమ్మ‌ ఉండరిక్కడ. రావణుడు అప్పటికే అపహరించినాడు కనుక.‌ కానీ భూదేవి విగ్రహాన్ని‌చూడవచ్చు.

తాయారు - పొత్తామరైయాళ్ తాయారు. హేమాంబుజవల్లి అ‌ని కూడా పేరు.

విమానము - శోభన విమానము.

తీర్థము - గృధ్ర తీర్థము.

జటాయువుకు ప్రత్యక్షమై మోక్షాన్నిచ్చినారు రాములవారిక్కడ వేదాంతదేశికులవారు ఇక్కడ పరమాత్మ స్థుతిని అనుగ్రహించినారు. తొండరడిప్పొడి ఆళ్వార్ల జన్మస్థలమైన మ‌ణ్డుంగుడి ~  తిరువాదనూర్ దివ్యదేశానికి  ఒక కిలోమీటరు దూరములో ఉంది.

తిరుమంగై ఆళ్వార్లు కీర్తించిన పాశురమిది ~ 5-1-1

అఱివదరియాన్ అనైత్తులగుముడై యాన్! ఎన్నెయాళుడైయాన్!!

కుఱియమాణురుగియ! కూత్తన్ మన్ని యమరుమిడమ్!!

నఱియ మలర్ మేల్ శురుమ్బార్క‌! ఎழிలార్ మఙ్గైనడమాడ!!

పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్! పుళ్ళమ్ బూదఙ్గుడితానే!!

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్)


08. తిరుప్పేర్ నగర్ 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by శ్రీ ఫణిహారము రంగనాథ్)

శ్లో: ఇంద్రాఖ్యాయుత తీర్థ శోభిత తలే శ్రీమత్తిరుప్పేర్ పురే

      పశ్చాద్ర్వక్త్రయుతో భుజంగశయనో హీంద్రాఖ్య వైమానగః

      ఆలింగన్ కమలోప పూర్వలతికా మప్పక్కుడుత్తాన్ విభుః

      దృశ్యశ్చోపమనోః పరాశరమునే ర్విభ్రాజతే సర్వదా


శ్లో: భక్తిసార శఠారాతి కలిజిత్ రథయోగిభిః

     సంస్తుతః కుంభ సంరాజ ద్వామేతర కరాంబుజః

ఎక్కడుందీ క్షేత్రము? ఈ క్షేత్రాన్ని అప్పక్కుడుత్తాన్ అనీ కోవిలడి అనీ పేర్లు. తిరూన్బిల్ దాటిన తరువాత ఎడమవైపుకు పోతే వస్తుంది. తిరుచ్చి నుండీ 24 kms, లాల్గుడి నుండీ 10 kms. దూరములో ఉందీ క్షేత్రము. కుంభకోణము నుండీ తిరుక్కాట్టుపళ్ళి ~ తిరువైయూర్ బస్సు మార్గములో కల్గణై కు పోవు బస్సులో కూడా వెళ్ళవచ్చును. ఈ క్షేత్రానికి పెరునగర్ (పెద్ద నగరము) అను విలక్షణమైన తిరునామముంది‌.

మూలవర్లు - అప్పక్కుడుత్తాన్ అనీ,  ఆది అప్పల రంగనాథన్ అని నామధేయాలు. పడమటి ముఖంగా భుజంగశయనుడిగా దర్శనమిస్తారు. పెరుమాళ్ళు అప్పాలున్న ఒక పాత్రను తన కుడి చేతిలో పట్టుకుని, మరొక చేత్తో మార్కండేయమహర్షి తలమీద అభయమిస్తున్నట్లుగా ఉన్నారు.

ఉత్సవర్లు ~ ఆదిరంగనాథార్ ~శ్రీరంగానికి వెళ్ళడానికి ముందు స్వామి ఇక్కడ ఉండినారని స్థలపురాణము.

తాయార్లు - కమలవల్లి తాయారు అనీ ఇందిరాదేవి  అనీ పేర్లు.

ఇందిరా తీర్థము ~ ఇందిరా విమానము ~ బిల్వ వృక్షము

పరాశర మహర్షికి,  ఉపమన్యుకూ ప్రత్యక్షమయ్యారు ఇక్కడ

నమ్మాళ్వార్లు తమ తి.మొ.లో - తిరుమాలిరుంశోలై మలై అను‌ దశకములో *తిరుమాల్ వన్దెన్నెంజు నిరైయ పుకుందాన్ ~ ఆ సర్వేశ్వరుడే వచ్చి నా హృదయము నిండునట్లు ~ అని పెరుమాళ్ళయొక్క స్వామితత్త్వాన్ని ప్రకాశింపచేసినారు.

పాశురాలు - పెరియాళ్వార్లు 2; తిరుమంగై ఆళ్వార్లు 19; తిరుమళిశై ఆళ్వార్లు 1; నమ్మాళ్వార్లు 11; 

మొత్తము 33 పాశురాలను గానము చేసినారీ స్వామిని కీర్తిస్తూ. నమ్మాళ్వార్లకు ఇక్కడే మోక్షప్రాప్తి కలిగింది.  ఇక్కడ పెరుమాళ్ళకు అప్పాలు నైవేద్యము చేస్తారు ప్రతి సాయంకాలము.

నమ్మాళ్వార్లు చెప్పిన పాశురమిది  10-8-1:

తిరుమాలిరుఞ్జోలైమలై! ఎన్ఱే నెన్న!!

తిరుమాల్వందు! ఎన్నెఞ్జునిఱైయప్పుకుందాన్!!

కురమామణి ఉందుపునల్! పొన్నిత్తెన్ పాల్!!

తిరుమాల్ శెన్ఱు శేర్విడమ్! తెన్ తిరుప్పేరే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


09.తిరువాదనూర్ 

(శ్రీహరి ప్రియ గోష్టి నున్చీ పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by శ్రీ ఫణిహారమ్ రంగనాథ్)

శ్లో: ఆదనూర్ నగరే దివ్యే సూర్య పుష్కరిణీయుతే

      శ్రీరంగనాయకీ నాధః  ప్రణవాఖ్య విమానగః

      ఆండళక్కుం మెయ్యనాఖ్యః  ప్రాగ్ముఖో భుజగేశయః

     రాజతే కామధేన్వక్షి గోచరో కలిజిన్నుతః

ఎక్కడుందీ క్షేత్రము? - సామిమలై కు 3 kms దూరములో ఉంది. కుంబకోణము నుండీ 8 kms. ఇక్కడ ఎలాంటి వసతులూ లభించవు భక్తులకు. పూజాద్రవ్యాలన్నిటినీ స్వామిమలై నుంచీ తీసుకుని పోవాలి భక్తులు.

మూలవర్లు - ఆండళక్కుం మెయ్యన్ భుజంగశయనములో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. కొలత కొలిచే పడిని తన తల కింద పెట్టుకుని‌, ఒక చేతిలో‌ తాళపత్రాన్ని, రెండవ చేతిలో ఒక కలాన్ని పట్టుకుని ఉంటారు.

తాయారు - కమలవాసిని/భార్గవి/ శ్రీచక్రవాసిని/అని పేర్లు. ఈ ఒక్క దివ్యదేశములోనే తాయారును భార్గవి అని పిలుస్తారు. ఉత్సవమూర్తిని‌ శ్రీరంగనాయకి అని పిలుస్తారు; చతుర్భుజాలలో రెండు చేతులతో పుష్పాలను,  మరో రెండు చేతులలో‌ అభయ వరద ముద్రలతో దర్శనమిస్తారు.

విమానము - ప్రణవాకార విమానము.

పుష్కరిణి - సూర్య / చంద్ర పుష్కరిణి.

కామధేనువుకు ప్రత్యక్షమయ్యారు ~ అందుకే ఈ ప్రదేశానికి ~ ఆదనూరు అని పేరొచ్చింది‌. భృగుమహర్షికీ, అగ్నిదేవునికీ కూడా దర్శనమిచ్చినారు. గర్భగృహములో కామధేనువు, తిరుమంగై ఆళ్వార్ల విగ్రహాలుండడము ఒక విశేషము.

ఉత్సవాలు - ప్రతి సంవత్సరమూ వైశాఖమాసములో పదిరోజులపాటూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు‌.

ఈ దేవాలయము అహోబల మఠము వారి నిర్వహణలో ఉంది.

తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని కీర్తించి ఒక పాశురాన్ని గానము చేసినారు.:

అన్నవనై ఆదనూర్ ఆణ్డళక్కుమైయనై

నెన్నలై యిన్రినై నాళై యై ~ నీర్మలమేల్

(పెరియ *తిరుమడల్‌ ~ 130):

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


10. తిరువళందూరు 

(శ్రీహరి ప్రియ గోష్టి నుంచీ పి.యల్.నరసింహా చార్య దాసన్: & Edited by ఫణిహారం రంగనాత్)

(3.6.23)

శ్లో: దివ్యే దర్శన పద్మినీ తటగతే శశ్రీమత్యళందూర్ పురే

      రాజత్యామరువి ప్రభుర్గరుడ ఇత్యాఖ్యే విమానే స్థితః

      ప్రాప్త శ్శెంగమలోప పూర్వలతికాం ప్రాచీముఖ స్సహ్యాజా

      ధర్మ శ్రీ వసురాజ సేవిత వవపు స్ శ్రీ మత్కలిఘ్న స్థుతః

ఎక్కడుందీ క్షేత్రము?  - ఈ క్షేత్రాన్ని తేరళందూర్  అని కూడా అంటారు. మాయవరానికి 12 kms. దూరములో ఉంది. బస్సు రవాణా సౌకర్యాలున్నాయి. అహోబిలమఠం వారి నిర్వహణలో ఉందీ క్షేత్రము.‌ ఇది పంచ/ సప్త కృష్ణ క్షేత్రాలలో ఒకటని అంటారు. 

మూలవర్లు: - దేవాదిరాజన్ స్థానిక భంగిమలో తూర్పు ముఖంగా ఎడమ చేతిలో గద పట్టుకుని దర్శనమిస్తారు.  ఎడమ వైపు గరుడ, కావేరీ తాయారు మోకాళ్ళమీద ఉండి సేవిస్తూ ఉంటారు‌. పెరుమాళ్ళకు ప్రహ్లాదుడు ఉంటారు.

ఉత్సవర్: అమరవియప్పన్ శ్రీదేవి, భూదేవి లతో ఆవు దూడలతో ఉంటారు. శ్రీకృష్ణ స్వామి చతుర్భుజాలతో రుక్మిణీ సత్యభామలతో ఉంటారు. ఇక్కడ పార్వతిని‌ ఈశ్వరుడు గోవుకమ్మని శపిస్తే, ఆమె పెరుమాళ్ళను ప్రార్థిస్తే గోపాలుడుగా వచ్చి ఉన్నాడని అందుకే అమరవియప్పన్ అని పేరు వచ్చిందని కథనము.

తాయార్లు: - శెంగమలవల్లి తాయారు.


విమానము: - గరుడ విమానము

పుష్కరిణి: - దర్శన పుష్కరిణి.

ఉపరిచర వసువుకూ, యముడికీ, కావేరికీ, వసుమహారాజుకూ స్వామి ప్రత్యక్షమయ్యారు.‌ తమిళ కవి కంబన్ జన్మస్థలమిది. ధ్వజస్థంభానికి ఎడమవైపున కంబన్ దంపతుల విగ్రహాలున్నాయి. కోవెల వీధిలో రంగనాథుల సన్నిధి, గోవిందరాజ సన్నిధి ఉన్నాయి.

ఉత్సవాలు: - ఫంగుణి నెలలో(డిసెంబర్ ~ జనవరి) కంబన్ ఉత్సవాలు మూడు రోజులు, వృషభమాసములో హస్తా నక్షత్రమున బ్రహ్మోత్సవాలను‌ నిర్వహిస్తారు. 

పాశురాలు: - తిరుమంగై ఆళ్వార్లు 45 పాశురాలతో కీర్తించినారు. వారి పెరియ తిరుమొళి లోని‌ 7-7 పాశురమిది:

తిరువుక్కుమ్ తిరువాగియ శెల్వా! తెయ్ వత్తుక్కు అరశే శెయ్యకణ్ణా!!

ఉరువచ్చెఞ్జుడరాழி వల్లానే!  ఉలగుణ్డ ఒరువా తిరుమార్బా!!

ఒరువర్ క్కార్ట్రి ఉయ్యుంవగై యెన్ఱాల్! ఉడనిన్ఱుఐవరెన్నుళ్ పుగుందు! ఒழிయాదు

అరువిత్తిన్ఱిడ అఞ్జి నిన్నడైన్దేన్!  అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


11. శిరుపులియూర్  

(15.8.22 - నరసింహ గోష్టి నుంచీ పి.యల్.నరసింహాచార్యదాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్ 

శ్లో: దివ్యేనంత సరస్సుమానస బిసి నృత్యద్భుతే సంస్థితం

      రాజాంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్

      నాయక్యా తతిరుమామళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం

      సేవేహం త్వరుమాకడల్ విభుమహం శారాంగయోగిస్తుమ్

నందవర్ధన వైమాన మధిష్టాయ జగత్పతిః

తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే

ఎక్కడుందీ క్షేత్రము? - మాయవరము‌ ~ తిరువారూర్ రైల్వే మార్గములో కొల్లుమాంగుడి లో దిగి తూర్పుగా 3 kms. నడిచి వెళ్ళాలి.‌ ఇక్కడ ఎటువంటి‌‌ సౌకర్యాలూ లేవు భక్తులకు. వారు మాయవరములోనే బస చేయవలెను. సన్నిధిలో ప్రసాదము లభించును. ఈ క్షేత్రానికి  తిరుచిరుపులియూర్ అని కూడా పేరుంది.

మూలవర్లు: - అరుళ్ మాకడల్ ఆముధన్ పెరుమాల్భు జంగశయనుడిగా తూర్పు ముఖంగా దర్శనమిస్తారు.‌

ఉత్సవర్లు: - కృపా సముద్ర పెరుమాళ్

మూలవర్ల తాయారు:  - తిరుమామకళ్  నాచ్చియార్.

ఉత్సవర్ల తాయారు - దయానాయకి; నందవర్ధని.

విమానము - నందవర్ధన విమానము.

తీర్థము - అనంత సరస్సు‌ ~ మానస పుష్కరిణి.

స్థలవృక్షము - బిల్వ వృక్షము.

వ్యాసునికీ, వ్యాఘ్రపాదునికీ, కణ్వమహర్షికీ ప్రత్యక్షమయ్యారు.

ఇక్కడ పెరుమాళ్ళు వ్యాఘ్రపాద(బాల)మునికి మోక్షాన్ని ఇచ్చినారు. పెరుమాళ్ళ ) పాదాలవద్ద బాలవ్యాఘ్రముని, కణ్వమహర్షి విగ్రహాలున్నాయి. తిరుమంగై ఆళ్వార్లు పది మంగళాశాసన పాశురాలను గానము చేసినారు.

వారి పెరియ తిరుమొళి ~ 7-9-9 పాశురమిది:

కరు మాముకిలురవా! కనలురువా పునలురువా!!

పెరు మాల్వరైయురువా! పిఱవురువా నినదురువా!!

తిరుమామగళ్ మరువుమ్! శిరుపులియూర్ చ్చల శయనత్తు!!

అరుమాకడలముదే! ఉనదడియే శరణామే!!

ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


12 . తిరుచ్చేరై  

(నరసింహ గోష్టి నుండీ పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by ఫణిహారమ్ రంగనాథ్)

(16.8.22)

శ్లో: శ్రీసారాఖ్య సరోజనీ కృతరుచౌ సారాభిధానే పురే

      సారాఖ్యాయుత నాయకీ ప్రియ వైపు స్సారాఖ్య వైమానగః

      ప్రాగ్వక్త్రాంబుజ సంస్థితి ర్విజయతే శ్రీ సారనాథో విభుః

      కావేరీ నయనా తిథిః కలిరిపు స్తుత్య శ్శ్రితాభీష్టదః

ఎక్కడుందీ క్షేత్రము? - కుంభకోణము నుండీ వాశల్ కు పోవు దారిలో 12 kms దూరములో ఉంది‌. ఈ క్షేత్రానికి 5 kms దూరములో నాచ్చియార్ కోయిల్ ఉంది‌. ఉప్పిలియప్పన్ (తిరువిణ్ణగర్) దివ్య దేశము(16/108) నుంచీ కూడా పోవచ్చును.‌ ఈ క్షేత్రము రెండు నదుల మధ్యన ~ ముడికొండన్ మరియూ కుడమురిట్టి నదులు ~ ఉంది‌. హోటళ్ళూ, సత్రాలు ఉన్నాయి భక్తుల సౌకర్యాలకు‌.

మూలవర్లు:- సారనాథ పెరుమాళ్ స్తానక భంగిమలో తూర్పు దిశగా దర్శనమిస్తారు. స్వామికిరువైపులా కావేరీ తాయారు, శ్రీ,భూ, నీళాదేవేరులతోనూ, మార్కండేయ మహర్షి తోనూ ఉంటారు సన్నిధిలో

ఉత్సవర్లు - మామడాలైపిరాన్ ~ తవళుమ్ తిరుక్కోలమ్.

తాయారు - సారనాయకి తాయారు.

పుష్కరిణి -సార పుష్కరిణి. 

ప్రత్యక్షము: - కావేరీ తాయారుకూ మార్కండేయ మహర్షికీ ప్రత్యక్షమయ్యారు పెరుమాళ్ళు ఇక్కడ. రాజగోపాల పెరుమాళ్ళకూ వారి నాచ్చియార్లకూ ఒక సన్నిధి ఉందిక్కడ. పుష్కరిణి వద్ద ఆంజనేయునికి ఒక సన్నిధి ఉంది. ఇక్కడి విశేషమేమిటంటే, ఈ క్షేత్రములో పెరుమాళ్ళు తన ఐదు మంది ~ శ్రీ, భూ, నీళా, సారనాయకి, మహాలక్ష్మీదేవులతో దర్శనమిస్తారు భక్తులకు‌.

ఉత్సవాలు: - తాయ్ పూసమ్ ...ఇక్కడ నిర్వహిస్తారు‌. మకరమాసములో‌ రథోత్సవము జరుగుతుంది‌. పెరుమాళ్ళు ఐదు మంది దేవేరులతో భక్తులకు ఈ ఉత్సవ సమయములో దర్శనమిస్తారు. నరసింహస్వామికీ, శ్రీనివాసులకూ, మానవాళమహామునులకూ,  శరభేశ్వర్లకూ(శెన్నిరియప్పార్)  సన్నిధులున్నాయి‌.

పాశురాలు: - తిరుమంగై ఆళ్వార్లు 13 పాశురాలతో పెరుమాళ్ళకు మంగళా శాసనము చేసినారిక్కడ. వారి పెరియ తిరుమొళి లోని (7-4-1) పాశురమిది:

కణ్ శోర వెఙ్గురుది వన్దిழீయ!  వెన్దழల్ పోల్ కూన్దలాళై!!

మణ్ శేర ములై యుణ్డ మామదలాయ్! వానవర్ తమ్ కోవేయెన్రు!!

విణ్ శేరుమ్ ఇళన్దిఙ్గళ్ అగడురిఞ్జు! మణిమాడమల్గు! శెల్వ

త్తణ్ శేరై యెమ్బెరుమాన్ తాళ్ తొழுవార్ కాణ్మిన్! ఎన్ తలై మేలారే!!

శ్రీ సారనాథ పెరుమాళ్ తిరువడిగళే శరణమ్


13  (తలైచ్చగాండ్రు) తలైచ్చంగణాణ్మదియమ్ 

(నరసింహ గోష్టి నుండీ పి. యల్. నరసింహాచార్య దాసన్:& Edited by ఫణిహారం రంగనాత్)

శ్లో: శ్రీచంద్రాహ్వయ పద్మినీ తటతలే  శశ్రీమత్తలచ్చంగమి

      త్యాఖ్యే దివ్య పురేతు చంద్రపదకే వైమానవర్యే స్థితః

      దేవో నాణ్మతియ ప్రభుర్విజయతే దేవ్యా పురాఖ్యాయుజా

      ప్రాగాస్య శ్శశిదేవ సేవిత తను శ్శార్గాంశ మౌని స్తుతః

ఎక్కడుందీ క్షేత్రము?  - శీర్కాళి~ నాగపట్టణము రోడ్డు మార్గములో శీర్కాళికి  13 kms దూరములో ఉన్న చిన్న గ్రామమిది. శిలప్పాధికారము లో‌ఈ క్షేత్రము చెప్పబడింది. మాయవరము నుండీ అక్కూరు చేరి అక్కడినుండీ శీర్కాళికి‌‌పోవు మార్గములో 3 kms దూరములో ఈ సన్నిధి ఉంది. ఈ క్షేత్రాన్ని తల‌చ్చంగాడు అనియే చెప్పాలి. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు మితముగా లభిస్తాయి. ఈ ప్రదేశానికి అరుణవనము అని కూడా పేరు.

మూలవర్లు - నాణ్మదియ ప్పెరుమాళ్ అనీ వెణ్ శుడర్ పెరుమాళ్ అని వ్యవహరిస్తారు.  స్వామి తూర్పు దిశగా స్థానిక భంగిమలో దర్శనమిస్తారు.  ఇక్కడ స్వామివారు తమ తల క్రింద ఒక conch ను  ఒక pillow గా ఉంచుకుని ఉంటారు. ఆండాళ్ విగ్రహము కూడా వుందిక్కడ.

ఉత్సవర్లు - వ్యోమజ్యోతి పిరాన్/ వెణ్ సుందర పిరాన్/ లోగనాథన్.

తాయార్లు - సెంగమలవల్లి తాయారు/ తలైచ్చంగ నాచ్చియార్.

విమానము - చంద్ర/ వేద చక్ర విమానము. 

పుష్జరిణి - చంద్ర పుష్కరిణి. చంద్రునికీ దేవతలకూ పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారిక్కడ.

తిరుమంగై ఆళ్వార్లు పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసిన పాశురము~(8-9):

కణ్ణార్ కణ్ణపురమ్! కడిగై కడి కమழுమ్!!

తణ్ణార్ తామరై శూழ்! తలైచ్చఙ్గమేల్  తిశైయుళ్!!

విణ్ణోర్ నాణ్మదియై! విరికిన్ఱ వెఞ్జుడరై!!

కణ్ణారక్కణ్డుకొణ్డు! కళిక్కిన్ఱ దిఙ్గెన్రు కొలో!!

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్)


తిరుక్కుడందై  14 part 2

(పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by ఫణిహారం రంగనాథ్)

తిరుమంగై ఆళ్వార్లు కూడా తమ పెరియతిరుమొళిలో అవియే యుముదే అను పాశురములో (1-1-2) శూళ్ పునల్ కుడందైయే తొళుదు అని ఈ క్షేత్రాన్ని ప్రస్తుతించినారు. తిరునెడుందాణ్డగము లో తణ్కుడందక్కిడందమాలై అని ప్రస్తుతించి ముగించినారు.‌ ఈ క్షేత్రస్వామి విషయముగా తిరువెళ్ క్కూత్తిరుక్కై అను ప్రభంధాన్ని అనుగ్రహించినారు.

తిరుమళిశై ఆళ్వార్లు నడందకాల్ గళ్ నొందవో అను పాశురమున ~ స్వామీ! కావేరీ తీరాన పవళించివుంటివే! ముల్లోకాలను కొలిచినందువల్ల నీ శ్రీపాదాలు నొచ్చినందుకా, లేక వరాహావతారమున భూదేవిని పైకి ఎత్తుటవల్ల కలిగిన శ్రమ వల్లనా, లేచి కూర్చుని చెప్పుమా? అని అడిగినారు. అప్పుడు స్వామి లేవడానికి సిద్దపడగా వాళీ అని శయన తిరుక్కోలమునకు మంగళాన్ని పాడినారు. అందుకే ఇక్కడ స్వామి ఉత్తానశాయి గా సేవ సాయించుచున్నారు.

ఇక్కడ చూడదగినవి: 1) సారంగపాణి ఆలయము, ఇది పట్టణ మధ్యనే ఉంది. 360 feet పొడువు, 285 feet వెడల్పు ఉన్న విష్ణాలయము. 12 అంతస్తులు, 160 feet ఎత్తున్న ఆలయము.‌ 

2) చక్రపాణి ఆలయము, ఇక్కడ స్వామినీ, విజయవల్లి తాయారునూ స్వామి చేతిలోని సుదర్శన చక్రాన్నీ చూడదగినది. మాఘమాసములో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి‌. మాఘకుళం కోనేరు అన్ని కోనేరులలోకెల్లా చాలా పవిత్రమైనది‌. దీని‌ విస్తీర్ణము 20 ఎకరాలు. దీని చుట్టూ 16 మండపాలున్నాయి.

నమ్మాళ్వార్ల పాశురము ~ (5-8-1,8):

ఆరా అముతే అడియేన్ ఉడలుమ్! నిన్బాల్ అన్బాయే!!

నీరాయ్ అలైందు కరైయ! ఉరుక్కుకిన్ఱ నెడుమాలే!!

శీరార్ శెన్నెల్ కవరి వీశుమ్! శెழுనీర్ తిరుక్కుడందై!!

ఏరార్ కోలమ్ తికழక్కిడందాయ! కణ్డేన్ ఎమ్మానే!!


కళైవాయ్ తున్బమ్ కళై యాతొழீవాయ్! కళైకణ్ మర్ట్రిలేన్!!

వళైవాయ్ నే మిప్పడై యాయ్! కుడందై క్కిడంద మామాయా! ! 

తళరా ఉడలమ్ ఎనతు ఆవి! శరిందు పోమ్బోదు!!

ఇళైయాదు ఉనతాళ్ ఒరుఙ్గ ప్పిడిత్తు! ప్పోద ఇశైనీయే!!


తిరుక్కండియూర్ ~ 15

(నరసింహ గోష్టి నుండీ 18.8.22 పి.యల్.నరసింహా చార్య దాసన్: & Edited by ఫణిహారం రంగనాథ్)

శ్లో: నిత్యం భాతి కపాల తీర్థ రుచిరే శ్రీకండియూర్ పట్టణే

       వైమానే కమలాకృతౌ స్థితియుతః ప్రాచీముఖాలంకృతః

       నాయక్యా హర శాపనాశక విభు శ్శ్రీపద్మవల్ల్యాశ్రితః

       ప్రత్యక్షోవర కుంభసంభవ మునేః కీర్త్యః కలిద్వేషిణః

ఎక్కడుందీ క్షేత్రము? - తంజావూరు నుండీ తిరువైయ్యారుకు  వెళ్ళే మార్గములో తంజావూరుకు 10 kms దూరములో ఉన్నదీ క్షేత్రము.‌ ఇది కుముద్వతి,  వెన్నార్ నదుల మధ్యప్రదేశములో ఉంది. ఇక్కడ భక్తులకెలాంటి సౌకర్యాలూ లభించవు. తంజావూరులో బస చేసి ఈ ఆలయ పెరుమాళ్ళను దర్శించుకోవాలి. ఈ దేవాలయ గోపురానికి మూడు అంతస్తులు, ఐదు కలశాలున్నాయి.

మూలవర్లు: - హర శాపం తీర్త పెరుమాళ్లు(హర శాప విమోచన పెరుమాళ్ళు).

బలినాథన్, శ్రీదేవి, భూదేవి లతో దర్శనమిస్తారు‌ ~ స్వామి స్థానక(నిలుచున్న) భంగిమలో శంఖు చక్ర గద అభయ ముద్రలతో నాలుగు హస్తాలతో తూర్పుదిశగా  వెలసినారు.

స్థలవృక్షము: - అశ్వద్థ వృక్షము.

బ్రహ్మకూ, శివునకూ, భృగువుకూ, అగస్త్యునకూ ప్రత్యక్షమయ్యారిక్కడ.

స్థలపురాణము: - బ్రహ్మకుండిన ఐదు తలలో ఒకదానిని శివుడు త్రెంపగా ఆ కపాలము శివుని చేతికి అతుక్కుంది;   బ్రహ్మయొక్క ఐదవ తలను నరికినందుకు వచ్చిన  పాపానికి శివుడు తపస్సు చేయగా, స్వామి ప్రత్యక్షమై  శాపవిమోచనాన్ని ప్రసాదించినారు. అందుకే స్వామికి హర(శివుడు) శాప విమోచన పెరుమాళ్ళు అని పేరొచ్చింది. ఇదే కథను తిరుకరంబనూరుకు కూడా చెబుతారు‌. ఈ క్షేత్రానికి త్రిమూర్తి క్షేత్రము అని అంటారు.

ఉత్సవర్లు: - సంతానగోపాలన్/ నవనీత కృష్ణన్‌ అని పేరు.

తాయారు: - కమలవల్లి తాయారు వేరొక సన్నిధిలో నాలుగు హస్తాలతో ఉన్నారు.‌ రెండు హస్తాలలో కమలాలను, మరో రెండు హస్తాలతో అభయముద్రలతో ఉన్నారు.

విమానము: - కమలాకృతి విమానము.

తీర్థము: - కంద, కపాల, గదా తీర్థాలు‌.

ఈ క్షేత్రానికి పంచకమల క్షేత్రమని కూడా అంటారు: కమల తీర్థము ~ కమలవిమానము ~ కమలనాథన్ ~ కమలవల్లి ~ కమల క్షేత్రము;

నరసింహస్వామికీ, సుదర్శనాళ్వార్లకు, గోదాదేవికీ, ఉపాలయాలున్నాయి. బ్రహ్మకూ, శివునికీ సన్నిధులున్నాయి పెరుమాళ్ళ సన్నిధికి‌ ఎదురుగా

పాశురాలు: - తిరుమంగై ఆళ్వార్లు ఒక పాశురాన్ని పాడినారిక్కడ👇

పిణ్డియార్ మణ్ డై యేంది! ప్పిఱర్ మనై తిరితన్దు ఉణ్ణుమ్!

ఉణ్డియాన్ శాబమ్ తీర్త! ఒరువనూర్! ఉలగమేత్తుమ్

కణ్డియూర్ అరఙ్గమ్మెయ్యమ్! కచ్చి పేర్ మల్లైయెన్ఱు

మణ్డినార్! ఉయ్యలల్లాల్! మర్ట్రైయార్కు ఉయ్యలామే!!

(తిరుక్కురుందాణ్డగమ్ ~ 19)

ఉత్సవాలు: - పంగుని మాసములో(మార్చి- ఏప్రిల్ ) పది రోజులు బ్రహ్మోత్సవాలు‌ నిర్వహిస్తారు. Oct-Nov లో పవిత్రోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు కూడా జరుగుతాయిక్కడ!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


తిరువిణ్ణగర్ (ఉప్పిలియప్పన్ కోయిల్) 16

(నరసింహగోష్టి  నుంచీ పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by ఫణిహారం రంగనాత్)

(19.8.22)

శ్లో: భాతి శ్రీ తిరువిణ్ణగర్ పురవరే హార్త్యబ్జినీ శోభితే

       శ్రీ మద్విష్ణు విమాన సంస్థిత లసన్ శ్రీభూమి దేవీ పతిః

       శ్రీమానుప్పిలియప్ప నాహ్వయ యుతః పక్షీంద్ర కావేరికా

       ధర్మైర్దృష్ట వైపు శ్శఠారి కలిజిత్ సమ్యక్ స్థుతః ప్రాజ్ఙుఖః

ఎక్కడుందీ క్షేత్రము? - ఈ సన్నిధి తిరునాగేశ్వరానికి 1 km దూరములో‌ఉంది. ఇక్కడినుంచే తిరుచ్చేరై(12/108) నాచ్చియార్ కోయిల్ కు పోయి సేవించవచ్చును. కుంభకోణానికి 7kms దూరములో‌ఉందీ సన్నిధి. ఇక్కడ భక్తులకు సకల వసతి సౌకర్యాలు లభ్యమౌతాయి‌.

మూలవర్లు: - ఉప్పిలియప్పన్/ శ్రీనివాసన్ అని పేరు. ఈ క్షేత్రాన్ని‌ ‌దక్షిణ తిరుపతి అని కూడా పిలుస్తారు. స్వామివారు తూర్పు దిశగా స్థానిక (నిలుచున్న) భంగిమలో దర్శనమిస్తారు.

ఉత్సవర్లు: - ఉప్పిలియప్పన్- తిరువిన్నగరప్పన్ అని మరొక నామధేయముంది. సన్నిధిలో‌ ఐదు ఉత్సవ విగ్రహాలున్నాయి(పంచబేరాలు).

తాయార్లు: - భూమిదేవి నాచ్చియార్/ధరణీదేవి/ వసుంధరాదేవి అని‌ పేర్లు.

తాయారు ఉత్తర దిశగా మోకాలిమీద వంగి కూర్చుని ఉంటుంది (మండియిట్టు వనంగుమ్ కోలమ్). తాయార్లకు  ఎదురుగా మార్కండేయ మహర్షి దక్షిణ  దిశగా కూర్చుని  కన్యాదానము చేసే భంగిమలో‌ ఉంటారు. వీరే తాయారును పెంచి పెద్ద చేసినారు.

విమానము: - విష్ణు విమానము. సుధానంద విమానమని కూడా‌ అంటారు.

పుష్కరిణి: - ఆర్తి(అహోరాత్ర) పుష్కరిణి.

మార్కండేయునికీ, కావేరికీ, గరుత్మంతునికీ ప్రత్యక్షమయ్యారు.

ఈ క్షేత్రానికి - నణ్ణగర్* అను విలక్షణమైన తిరునామముంది. తంజావూర్ జిల్లాలో ప్రసిద్దమైన క్షేత్రమిది‌. ఇక్కడే పెరుమాళ్ళు మార్కండేయ మహర్షి యొక్క పెంపుడు పుత్రికను వివాహమాడినారు. అమ్మవారు తన చిన్నప్పుడు తళిహ చేయునపుడు ఉప్పు వేయడము మరచిందట! ఆ నాటినుండీ స్వామి ఉప్పులేని ప్రసాదాన్నే ఆరగించెడివారు. నేటికినీ స్వామివారికి చేసే ఆరగింపులలో ‌ఉప్పు‌వేయరు. ఈ క్షేత్రానికి మరొక పేరు తులసీ వనము.

స్థలపురాణము: - ఇక్కడ మూలవర్లు అచ్చము తిరుమలలో‌ ఉన్న వేంకటేశ్వర స్వామి వలె ఉంటారు; వారికి వీరు  పెద్దన్నయ్య గారని అంటారు. ఒక సారి మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండగా ఒక చిన్న పాపాయి దొరికింది.‌ ఆ పాపను తన కూతురిగా పెంచి పెద్దచేసాడు‌ భూమాదేవి అనే పేరుతో. ఒక ఏకాదశి నాటి రాత్రి ఫంగుణి మాసములో పెరుమాళ్ళు ఒక వృద్ద బ్రాహ్మణునిగా వచ్చి ఆకలిగా ఉందనీ ఏదైనా తినడానికి పెట్టమని అడిగినారట.‌ అథితి వయస్సును చూచి కాదనలేక భోజనాన్ని వడ్డించినాడట! కూతురికి తళిహ చెయ్యడము‌సరిగా రాదు కనుక‌ అందులో ఉప్పును (లవణాన్ని) వెయ్యలేదట! స్వామి దాన్ని‌ అలానే ఆరగించి‌ ఆ అమ్మాయిని  వివాహమాడుతానని చెప్పగా, ఏమి చేయాలో తెలియక మహర్షి ఉంటే, స్వామివారు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించినారు. మహర్షి స్వామిని‌ అదే రూపములో వుండి భక్తులకు దర్శనమివ్వమని అడగ్గా, స్వామి‌ సరేనని‌ అక్కడే ఉండిపోయినారు. అందుకే స్వామికి‌ ఉప్పిలియప్పన్ అని పేరొచ్చింది. వైఖాసనస ఆగమ విధానముగా ఇక్కడ స్వామి వారికి‌ సేవాకైంకర్యాలు‌ జరిపిస్తారు‌‌.  ఈ స్వామివారి కల్యాణ గుణాలను పొగడుతూ పల్ వకయుంపరంద అని‌ స్వామి అఘటిత ఘటనా సామర్త్యాన్ని ప్రకాశింపచేసినారు వారి తి.వా.మొ.  6-3-2 లో.

శ్రీసీతారామలక్ష్మణులకు విడిగా సన్నిధులున్నాయి ఇక్కడ.‌ వేదాంతదేశికులవారికి కూడా గర్భగృహానికి దగ్గరలో ఒక సన్నిధి ఉంది. పన్నిద్దరళ్వాల విగ్రహాలున్నాయిక్కడ. నలుగురు ఆళ్వార్లు (పోయ్ గై, పేయాళ్వార్లు, నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ స్వామికి‌ మంగళాశాసన పాశురాలతో కీర్తించినారు. మొత్తము 47 పాశురాలను నాలాయిర‌ ప్రభంధములో చూడవచ్చును‌. ప్రతి సంవత్సరమూ రెండు బ్రహ్మో‌త్సవాలు నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రము నాడు శ్రవణ దీపాన్ని ప్రాకారము చుట్టూ తిప్పుతారు. పలు కల్యాణ‌ మండపాలున్నాయి వివాహాలు చేయించేవారి సౌకర్యార్థమిక్కడ!

నమ్మాళ్వార్ల తి‌‌. మొ.6-3-7:

పరఞ్జుడరుడమ్బాయ్! అழுక్కు ప్పదిత్త ఉడమ్బాయ్!

కరందుమ్ తోన్ఱియుమ్ నిన్ఱుమ్! కైతవఙ్గల్ శెయ్ దుమ్! విణ్ణోర్

శిరఙ్గళాల్ వణఙ్గుమ్! తిరువిణ్ణగర్ చ్చేర్ న్ద పిరాన్!

వరమ్ కొళ్ పాదమల్లాల్ ఇల్లై! యావర్కుమ్ వన్ శరణే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


17. తిరువాలి & తిరునగరి 

(శ్రీహరి ప్రియ గోష్టి నుంచీ)

 (పి.యల్. నరసింహాచార్య దాసన్:& Edited by ఫణిహారం రంగనాత్ )

(10.6.23)

శ్లో: దివ్యేలాతని పద్మనీ తటగతే హ్యష్టాక్షరాగారగః

       భాతి శ్రీ తిరువాలి పట్టణ వరే పాశ్చాత్య వక్త్రాసనః

       సంప్రోప్తో మృత కుంభపూర్వ లతికాం శ్రీకర్దమాలాతని

       ప్రత్యక్షో మణవాళ నాహ్వయ విభుః కీర్త్యం కలిధ్వంసినః

ఎక్కడుందీ క్షేత్రము? 

తిరువాలి ~ తిరునగరి~ అనేవి రెండు క్షేత్రాలు ~ వీటి మధ్య 3 kms దూరముంటుంది. కానీ ఈ రెండింటినీ ఒకే దివ్యదేశముగా వ్యవహరిస్తారు. తిరువాలిని లక్ష్మీపురము అని కూడా అంటారు. శీర్కాళికి 7 kms దూరములో ఉందీ తిరువాలి క్షేత్రము. శీర్కాళి ‌నుంచీ తిరువెంగాడుకు పోయే బస్సు మార్గములో ఉంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి వసతి సౌకర్యాలు లభించవు‌.


మూలవర్లు: వయలాలి మణవాళన్/ లక్ష్మీనరసింహన్/ వేదరాజన్ అని పేర్లు. పెరుమాళ్ళు పశ్చిమదిశగా ఆసీన భంగిమలో దర్శనమిస్తారు.

ఉత్సవర్లు: తిరువాలి అళగన్.

తాయారు - అమృతఘటవల్లి తాయారు.

విమానము - అష్టాక్షర/ సంసార విమానము.

స్థలవృక్షము - బిల్వ వృక్షము.

తిరుమంగై ఆళ్వార్లకు, అలాతనికీ, కర్ధమ ప్రజాపతికీ ప్రత్యక్షమయ్యారు 

వైఖానస ఆగమ సంప్రదాయాన్ని పాటిస్తారు.

ఈ తిరువాలి క్షేత్రము పంచనారసింహ క్షేత్రాలలో ఒకటి. - పరాశర మహర్షికి పుత్రికగా ఉన్న తాయారును వెతుకుతూ పెరుమాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు స్థలపురాణము

పుష్కరిణి: - అలాతని పుష్కరిణి.

ఈ క్షేత్రము తిరుమంగై ఆళ్వార్ల అఅవతారస్థలమైన తిరుక్కురైయలూర్కు సమీపములో ఉంది. వృశ్చికమాసములో కృత్తికా నక్షత్రమునకు ముందు పది రోజులు వీరి తిరునక్షత్రము అతి వైభవముగా జరుగుతుంది.

తిరునగరి: - మూలవర్లు వేదరాజన్ వాయలాల మనవాళన్ ఆశీన భంగిమలో పశ్చిమదిశగా ఉంటారు.

ఉత్సవర్: - కల్యాణ నాథన్.

తాయారు:  - అమృతవల్లి తాయారు‌.

తిరుక్కురైయలయూర్ ఇక్కడికి 3 kms దూరములో ఉంది; ఇది తిరుమంగై ఆళ్వార్ల జన్మస్థలము.  నాథముని, రామానుజులు, మానవాళమామునిగళ్ ఈ క్షేత్రాన్ని దర్శించినారు‌. దీన్ని అష్టాక్షర క్షేత్రము అని అంటారు. తిరుమంగై గారికి తిరుమంత్ర రహస్యాన్ని విశదంగా చెప్పడానికి శ్రీమన్నారాయణుడే వచ్చినారట ఇక్కడికి. తిరుమంగై ఆళ్వార్లకు ఒక సన్నిధి ఉందిక్కడ.

ఉత్సవాలు ~ ఫంగుణి  మాసములో ఉత్తర నక్షత్రములో అవసాన దినముగా ఉత్సవము బ్రహ్మోత్సవాన్ని జరుపుతారు. ఇందులో ఎనిమిదవ నాటి రాత్రి తిరుమంగై ఆళ్వార్ ఆడల్ మా అ‌ను అశ్వము మీద వేంచేసి పెరుమాళ్ళ తిరువాభరణాలను అఅపహరించు సమయమున జరుగు సంవాదము ‌అతి మనోహరముగా ఉంటుంది. కావేరీ నది ఇక్కడ ప్రవహిస్తుంది ~ దీన్ని అష్టాక్షర గంగ అని పిలుస్తారు‌. తిరువాలికి దక్షిణాన తిరునాంగూర్ దివ్యదేశముంది.

పాశురాలు: - కులశేఖరులు, తిరుమంగై ఆళ్వార్లు ఈ పెరుమాళ్ళకు 42 పాసురాలతో మంగళాశాసనాలు చేసినారు ఈ క్షేత్రములో...

తూవిరియ మలర్ ఉழక్కి! తుణైయోడుమ్ పిరియాదే!

పూవిరియ మదునుగరుమ్! పొఱివరియ శిరువణ్డే!

తీవిరియ మఱై వళర్కుమ్! పుగழாళర్ తిరువాలి!

ఏవరి వెఞ్జిలై యానుక్కు! ఎన్నిలైమై యురైయాయే!!

నిలైయాళా నిన్ వణఙ్గ! వేణ్డాయేయాగిలుమ్! ఎన్

ములై యాళ వొరునాళ్! ఉన్ అగలత్తాల్ ఆళాయే!

శిలైయాళా మరయెయ్ ద తిఱలాళా! తిరుమెయ్య

మలైయాళా! నీయాళ! వళై యాళమాట్టోమే!!

(తిరుమంగై పెరియ తిరుమొళి ~ 3-6-1;9)

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


18. పంచ కృష్ణారణ్య క్షేత్రాలు. తిరుక్కణ్ణపురము 

(శ్రీహరి ప్రియ గోష్టి  నుంచీ)
(పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్)
(11.6.23)

శ్లోకము : శ్రీమత్కణ్ణపురేతు నిత్య సరసీ సంశోభితే  ప్రాఙ్ముఖం
                దేవ్యా కణ్ణ పురాభిధాన సుయుజా శ్రీశౌరి రాజప్రభుమ్
                వైమానే స్థితముత్పలా వతక మిత్యాఖ్యేతు కణ్వేక్షితం
               సేవే విష్ణు మనశ్శఠారి కలిజిత్ శ్రీ కౌస్తుభాంశ స్తుతమ

ఎక్కడుందీ క్షేత్రము? 
తమిళనాడులో నాగపట్టణానికి 25 kms, కుంభకోణము నుంచీ 42 kms,  దూరములో ఉందీ క్షేత్రము. ఈ రెండు పట్టణాలనుంచీ బస్సు/ రైలు రవాణా సౌకర్యాలున్నాయి. యాత్రీకులకు పెద్దగా వసతి సౌకర్యాలు ఇక్కడ లేవు.

పంచ కృష్ణ క్ధేత్రాలుగా పిలువబడే ఐదు క్షేత్రాలకో ఇది ఒకటి. మిగతావి ~తిరుకణ్ణన్ గుడి ~ తిరుక్కపిస్థలం ~  తిరుక్కోవిలూరు ~ తిరుక్కణ్ణమంగై‌ క్షేత్రాలు.  
ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకోవడమువల్ల శ్రీకృష్ణ భగవానుని కృప కలుగుతుందని ఇక్కడి కథనము. నాగపట్నమునుంచీ నన్నిలమ్ పోవు బస్సులో తిరుప్పుగழூరు లో దిగి ఒక మైలు నడవాలి. మాయవరం ~ నల్లూరు బస్సులో కూడా తిరుప్పుగழூరుకు చేరుకోవచ్చు.

మూలవర్లు: - ఇక్కడ స్వామికి నీలమేఘ పెరుమాళ్  అని పేరు. ప్రధాన గర్భాలయములో శ్రీనీలమేఘపెరుమాళ్ళు స్థానక భంగిమలో చతుర్భుజాలతో శంఖు ~ చక్ర ~ గద ~ వరద హస్తాలతో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు.

ఉత్సవర్:  ~  శౌరిరాజ పెరుమాళ్.

తాయార్లు: - మూలవర్లు: *కృష్ణపురనాయకి.

 ఉత్సవర్లు: - కణ్ణపుర నాయకి.

ఇక్కడ పెరుమాళ్ళు, కణ్ణపురనాయకి, భూదేవి, నీళాదేవి, గోదాదేవి , పద్మిని,లతో వేంచేసి ఉన్నారు.

పుష్కరిణి: - నిత్య పుష్కరిణి ~ ఇది కాక మరో నాలుగు పుష్కరిణులున్నాయి.

గోపురము: - నూరు అడుగుల ఎత్తులో రాజగోపురముంది. పైభాగములో 11 గోపుర కళశాలతో శిల్పకళాశోభితమై ఉంటుంది. బలిపీఠం, ధ్వజస్తంభము, గరుడాழ்వార్ల మండపముంది.

విమానము: - ఉత్పలావతక విమానము.

స్థల పురాణము: 
ఒక సమయాన ఇంద్రుడు  భూలోకాన గొప్పయాగం చేస్తుండగా, స్వర్గాన్ని అసురులు ఆక్రమించజూశారు. యాగదీక్షలోవున్న యింద్రుడికి యుద్ధానికి అనుమతిలేనందున వసుమహారాజు యింద్రుని తరపున దేవలోకరక్షణ బాధ్యత చేపట్టి దేవతలకు సాయపడ్డాడు. ఇంద్రుడు ఆతన సాయానికి కృతజ్ఞతలుతెలిపి తన విమానంలో సాగనంపాడు. తిరిగివచ్చే సమయాన రాజుకు ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక నిర్మలమైన నీటిసరస్సు పక్కన పచ్చనిపొలాలు చూచి దిగి తన దప్పిక తీర్చుకుని ధాన్యపు కంకులు తుంచబోయాడు. అప్పుడు ఒక చిన్నపిల్లవాడు ఆతడిని వారించి తనతో పోరుకు పిలిచాడు. క్రోధావేశపూరితుడై వసురాజు యెన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించినా  బాలుడిపై పనిచేయలేదు. చివరకు నారాయణాస్త్ర ప్రయోగంచేయబోగా ధ్యానావస్థలో నారాయణుడి బదులు పంటపొలాల నడుమ గుడిసెలో బాలుడు కనుపించాడు. తన తప్పు తెలుసుకొన్న వసురాజుకు నారాయణుడు తన నిజరూపదర్శనం కలిగించి ఆ పంటపొలము ఋషులతపోక్షేత్రమని, ధాన్యపు కంకులు వారి శుష్కశరీరాలని తెలిపి తాను వారి రక్షణకై అక్కడ కాపున్నానని తెలిపాడు. ‌పెరుమాళ్ళ ఆజ్ఞచొప్పున వసురాజు ఉత్పలావతక విమాన నిర్మాణం చేసి  స్వామిని ప్రతిష్టించాడు. 

పద్మిని కల్యాణం :

చేర రాజైన మిత్రవర్మ పుత్రిక సుందరిని చేపట్టిన ఇక్ష్వాకు వంశీకుడైన వసురాజుకు బిడ్డలు లేనందున వశిష్టుడి సూచనమేరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగఫలంగా పద్మిని అనే లక్ష్మిఅంశ అయిన పుత్రిక, పద్మదుడనే పుత్రుడు కలిగారు. పద్మిని చిన్నతనాన తనకు విష్ణువే పతిగా కావాలని తీర్మానించుకున్నదై  తండ్రికి తన నిర్ణయం తెలియజేసింది. వసురాజు ప్రార్థన మన్నించిన పెరుమాళ్ళు తిరుక్కణ్ణపురనాధునిగావచ్చి పద్మినిని వివాహంచేసుకున్నాడు. వసురాజు కోరికననుసరించి తిరుక్కణ్ణపురాన లోకానికి దర్శనమిస్తూ వేంచేశాడు. 
       
మరొక కథనము ప్రకారమూ పూర్వము ఉత్సవ సమయములో  అర్చకుడు స్వామికి వేసిన పూలమాలను రాజుకు ఇచ్చేవాడు. ఒకసారి ఆ పూలమాలలో కొన్ని తలవెండ్రుకలను చూచి రాజు ఆగ్రహించడంతో అర్చకుడు అవి స్వామివారివే అ వెండ్రుకలని చెప్పగా, మరుసటి రోజున రాజు వచ్చి స్వామికి ఉన్న వెండ్రుకలను చూపించమన్నాడు. మరునాటి అభిషేక సమయములో చూడవచ్చునని చెప్పినాడు అర్చకుడు. ఆరాత్రి అర్చకుడు  స్వామి తిరువడిలో శరణాగతిచేసి తన మానప్రాణాలను రక్షించమని వేడుకున్నాడు. భక్తపరాధీనుడైన స్వామివారు అభిషేకసమయములో తలవెండ్రుకలతో దర్శనమిచ్చాడు; అందుకే స్వామికి శౌరిరాజస్వామి గా పేరొచ్చింది. 

మరొక కథనమేమిటంటే:  ఒకసారి విభీషణుడు ~  
స్వామీ!  శయనమూర్తిగావున్న నీ అందమైన నడకను చూపించుము అని ప్రార్తించగా,  తిరుక్కణ్ణపురంలో పున్నమి నాడు చూడమని చెప్పి ఆ నాడు నడుస్తూ వచ్చి విభీషణునికి ఆలయం  ముందు దర్శనమిచ్చారు. అందుకే ఉత్సవర్లను పున్నమినాడు మధ్యాహ్నము ప్రధాన ద్వారమువద్దకు తీసుకుని వస్తారు.

తిరుమంగై అళ్వార్లు కుణపాల మదయానై (ప్రాగ్దిశా దిగ్గజము)అని కీర్తించినారు. దీన్ని కీళైవీడు (క్రిందినగరము) అని అభివర్ణించినారు. ఈ క్షేత్రానికి కృష్ణారణ్య క్షేత్రమనే గాక, సప్తపుణ్యక్షేత్రమను కూడా పేరు. అవి యీ విధంగా వున్నాయి:

1. స్థలము:కృష్ణస్థలము
2. అరణ్యము :దండకారణ్యము 
3. నది: కావేరి
4. సముద్రము: తూర్పుసముద్రము (కీழை కడల్) (తిరుమలయపట్టణందగ్గర. )
5. నగరం: కణ్ణ పురము
6. పుష్కరిణి: నిత్యపుష్కరిణి. 
7. విమానము: ఉత్పలవాదక విమానము.

ఈక్షేత్రానికి అష్టాక్షరమహామన్త్ర సిద్ధి స్థలము అనికూడా పేరున్నది. 
తిరుమఙ్గైయాழ்వార్ల కు పెరుమాళ్ళు వుపదేశించిన అష్టాక్షరి మన్త్ర సిద్ధి పొందిన స్థలమని ప్రసిద్ధి. 

ఇక్కడ అధ్యయనోత్సవాన్ని తప్పక దర్శించాలి. ఆలయములో నాట్యకృష్ణుడు, విష్వక్సేనుడు, శ్రీపద్మినీతాయారు, గోధాదేవి, శ్రీరామచంద్రమూర్తిని , ఆళ్వార్లనూ
దర్శించుకోవచ్చు.  ఇక్కడ పెరియ తిరువడి (గరుత్మాన్)గొప్ప తపమాచరించి
స్వామి ఎదుట ఉన్నారు.  మినియన్ అనే భక్తుని భక్తికి వశుడైన పెరుమాళ్ళు ఆతడి మానసికనైవేద్సాన్ని లోకానికి చాటి తన సన్నిధిచుట్టూ ఆతడు మానసికంగా నివేదించిన పొంగలిని చల్లుకున్నారు.  నేటికి  ప్రతినిత్యము రాత్రి బియ్యముతో సమానముగా నేతిని ఉపయోగించి చేసిన పొంగలిని పెరుమాళ్ళు ఆరగిస్తున్నారు. 

పాశురాలు: - వంద పాశురాలను తిరుమంగ ఆళ్వార్లు ~ 11 నమ్మాళ్వార్లు ~ పది కులశేఖరాళ్వార్లు ~ ఒకటి గోధాదేవి ~ ఒకటి పెరియాళ్వార్లు మంగళాశాసనాలు చేసినారు.

ఉత్సవాలు: తమిళ వైశాఖంలో 12 దినాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.‌మాసి మాసములో మాసి మహోత్సవాలు నిర్వహిస్తారు.

నమ్మాళ్వార్ల తిరువాయ్ మొళి ~( 9-10- 1):
(నాలాయిర దివ్య  ప్రభంధములో 3656 to 3666 వరకూ చూడవచ్చును)

మాలై నణ్ణి! తొழுదెழுమినో వినై కెడ!
  కాలై మాలై! కమల మలరిట్టు  నీర్!
  వేలై మోదుమ్మదిళ్ శూழ்! తిరుక్కణ్ణపురత్తు!
   ఆలిన్ మేలాల మర్ న్దాన్! ఆడియిణైగళే!

            నీలమేఘ‌ పెరుమాళ్ తిరువడి గళే శరణం 

19 తిరునాగై 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
( పి.యల్.నరసింహాచార్య దాసన్: Edited by ఫణిహారం రంగనాత్)
(12.6.23)

శ్లో: సౌందర్య రాజ భగవాన్ తిరునాగపుర్యాం సారాభిధాన సరసీ తటశోభితాయామ్
సౌందర్య పూర్వ లతికా మహిషీ సమేత స్సౌందర్య నామ వరమందిర మధ్యవాసః
సంస్థాన వేష రుచిరో  భుజగాధి రాజః శ్రీమత్కలిఘ్న మునిసేవిత దివ్యమూర్తిః
ప్రాచీముఖః కలిజిదాహ్వయ సూరి కీర్త్యః భక్తేష్ట దాన నిపుణో భువిరాజతే సౌ

ఎక్కడుందీ క్షేత్రము? 

 తమిళనాడులోని నాగపట్టణములో ఉంది.‌ రైల్వే ష్టేషనుకు 2 kms దూరములో ఉంది.. తంజావూరు జిల్లాలో ఉందీ నాగపట్టణము. ఇక్కడినుంచీ 10 kms దూరములో తిరుక్కణంగుడి దివ్య దేశముంది (26 వ క్షేత్రము). భక్తులకు సకల సౌకర్యాలు లభ్యమవుతాయి.

మూలవర్లు - నీలమేఘ పెరుమాళ్ చతుర్భుజాలతో స్థానక భంగిమలో చేతిలో‌‌ గద పట్టుకుని తూర్పు దిశగా ఉంటారు.

ఉత్సవర్లు - సౌందర రాజ పెరుమాళ్ శ్రీదేవి‌ భూదేవి‌లతో ఉన్నారు.

తాయారు - సౌందర్య వల్లి తాయారు ~ గజలక్ష్మిలా ఉంటుంది.

విమానము - సౌందర్య విమానము ~ 90 ft. ఎత్తున్న రాజగోపురము మీద ఐదు కలశాలున్నాయి.

పుష్కరిణి - సార పుష్కరిణి.

నాగరాజుకూ, ధృవునికీ, బ్రహ్మకు ప్రత్యక్షమయ్యారు.

విశేషము 
ఇక్కడ స్వామి మూడు భంగిమలలో ~ శయన రంగనాథునిగా; కూర్చున్న గోవిందరాజుగా, స్థానక భంగిమలో సౌందర్యరాజు గా; ఎనిమిది హస్థాలతో అష్టభుజ నరసింహ మూర్తిని చూడవచ్చును. నాగరాజుకు దర్శనమిచ్చాడు కనుక ఈ క్షేత్రానికి నాగపట్టణము అని పేరొచ్చింది అని కథనము.
ఆదిశేషుడు విష్ణుమూర్తి కోసము వెదుకుతూ ఇక్కడ కనుగొన్నాడు. ఇక్కడ కొన్ని‌ ఉపాలయాలున్నాయి: పచ్చైవణ్ణార్ ~ పవలవణ్ణార్ ~ వరదరాజ ~ శ్రీరామన్ ~ శ్రీనివాసన్ ~ వైకుంఠనాథన్ ~ ఆంజనేయార్ ~ ఆండాళ్; 

ఉత్సవాలు:
మీన మాసములో ఉత్తర నక్షత్రమునాడు తీెర్ర్థోత్సవము, చైత్రమాసములో పది రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

పాశురాలు

తిరుమంగై ఆళ్వార్ పెరుమాళ్ళను కీర్తిస్తూ పది పాశురాలను పాడినారు.
 
పొన్ ఇవర్ మేని మరగదత్తిన్! పొఙ్గు ఇళఞ్జోతి అకలత్తు ఆరమ్

మిన్!! ఇవర్ వాయిల్ నల్వేదమోదుమ్! వేదియర్ వానవరావర్ తోழீ!!

ఎన్నైయుమ్ నోక్కి ఎన్నల్కులుమ్ నోక్కి! ఏందు ఇళంకొంగై యుమ్ నోక్కుకిన్ఱార్!

అన్నై ఎన్నోక్కు మెన్ఱు అఞ్జుగిన్ఱేన్!  అచ్చో ఒరువర్ అழగియవా!!
( పెరియ తిరుమొళి ~ 9-2-1)
(నాలాయిరమ్ లో 1758 to 1767 వరకూ చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

20 తిరునరైయూర్ 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి.యల్. నరసింహాచార్య దాసన్:& Edited by ఫణిహారం రంగనాత్)

శ్లో: నరయూర్ పరిపూర్ణనామకే  మణిమక్తాఖ్య తరంగిణీ తటే
      త్రిదశే ప్రదిశాముఖస్థితిః వరనంబిక్కలతా సమన్వితః
      శ్రీనివాసే విమానస్దో మేధావీ మునిసేవితః
      కలిజిన్ముని సంకీర్త్య రాజతే భక్తవత్సలః

ఎక్కడుందీ క్షేత్రము? 

 కుంభకోణానికి 9 to 10 kms దూరములో తిరువారూర్ కు వెళ్ళే దారిలో ఉంది. 
భక్తులకు సకల సౌకర్యాలు లభిస్తాయిక్కడ. 
ఈ క్షేత్రానికి అనేక పేర్లున్నాయి: అవి: నాచ్చియార్ కోయిల్; మణిమాడక్కోయిల్;
 శ్రీనివాస క్షేత్రము;
 సుగంధవన క్షేత్రము; నంబియూర్; శిద్దిక్షేత్రము; పంచవ్యూహ స్థలము; ద్వాదశాక్షర క్షేత్రము; సుగంధగిరి.‌
 తిరునరైయూర్‌ అని తమిళములో అంటారు.‌ కుంభకోణము నుండీ టౌను బస్సు ఉంది‌. ఉప్పిలియప్పన్, తిరుచ్చేరై ల నుండీ కూడా సేవింపవచ్చును.

మూలవర్లు 
నరైయూర్ నిన్రనంబి; శ్రీనివాసన్; పరవాసుదేవ‌న్; అని తిరునామాలున్నాయి.  స్థానక భంగిమలో తూర్పు దిశగా దర్శనమిస్తారు‌ రెండు హస్తాలతో.‌ కల్యాణ తురుక్కోలమ్. పెరుమాళ్ళతో పాటూ సంకర్షణ, ప్రద్యుమ్న, అ‌నిరుద్ద, పురుషోత్తములు వేంచేసి ఉన్నారు.

తాయారు 
నంబుగై నాచ్చియార్; వంజువల్లి తాయారు‌ అని ఉత్సవర్లకు పేరు. స్థానక భంగిమలో మూలవర్ల ప్రక్కనే ఉంటారు కక్యాణ తిరుక్కోలములో.

విమానము - శ్రీనివాస / హేమ విమానము.

గోపురాలు - దాదాపు పది గోపురాలున్నాయి పెద్దవీ చిన్నవీ కలిసి.

స్థలవృక్షము - బిల్వ/పీపుల్ వృక్షము.

తీర్థాలు ~ మణిముక్త/ సంకర్షణ / ప్రద్యుమ్న/అనురుద్ద/సాంబ తీర్థాలు.

ప్రత్యక్షము 

మేధావి మునికీ, బ్రహ్మకూ, వాయు, సూర్య దేవులకూ, చోళరాజుకూ.

ఇక్కడవున్న విశేషమేమిటంటే ~ 108 దివ్య దేశాలలో వెలసిన పెరుమాళ్ళ చ్బిత్రాలను చూడవచ్చును భక్తులు.  గర్భగృహము కాస్త ఎత్తైన ప్రదేశములో ఉంది, అందుకే దీన్ని‌ సుగంధగురి /మణిమాడకోయిల్ అని అంటారు. మూలవర్లను గోపురప్రవేశ ద్వారమునుంచే చూడవచ్చును. మూడంస్తుల గోపురముంది. ఇక్కడ పెరుమాళ్ళు లక్ష్మి అంశ కల వంజులవల్లి ~ మేధావి ముని పెంపుడు కూతురు ~ వివాహమాడడానికి వచ్చినారు. గరుత్మంతుడు ఈ ఇద్దరినీ కలిపినాడు కనుక గరుడిడికి ప్రాధాన్యతను ఇచ్చినారు. వరప్రసాది అని గరుడిడిని‌ పిలుస్తారు. మరొక సన్నిద్గిలో గరుడవాహనముంది. ఈ సన్నిధి మూలవర్ల సన్నిధి కంటే కాస్త  కిందికి ఉంటుంది. గరుడ విగ్రహాన్ని ఒకే ఒక సాలగ్రామ శిలతో తయారు చేసినారు. ఐదడుగుల చతురశ్రము మీద ఎనిమిదడుగుల గరుడ విగ్రహాన్ని భక్తులు‌ చూడవచ్చు. ఆముదకలశాన్ని ఇక్కడ నైవేద్యంగా పెడుతారు.‌ పెరుమాళ్ళను సంవత్సరములో రెండు సార్లు మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు‌. మరొక విశేషమేమిటంటే ~ సన్నిధి నుండీ గరుడవాహనాన్ని బయటికి తేవాలంటే నలుగురు మోసుకురావచ్చు; ఆ తరువాత గరుడిడిమీద స్వామి కూర్చున్న తరువాత ఆ వాహనాన్ని లేపడానికి 64 మంది కావాలి. తాయార్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారిక్కడ; 
ఎందుకంటే స్వామి వివాహానికి ముందు మేధావి ముని కిచ్చిన వరమది. తాయారు హంస వాహనముమీద వస్తారు; పెరుమాళ్ళు గరుడ వాహనము మీద. దీన్ని నాచ్చియార్ కోయిల్ (పెన్ అరసు నాడు). 
12 స్వయంవ్యక్త క్షేత్రాలలో ఇది ఒక క్షేత్రము. ఇక్కడ తిరుమంగై మన్నన్ ను వైష్ణవుడుగా మార్చడానికి పెరుమాళ్ళే గురువుగా వచ్చినారు. అందుకే ఆళ్వార్లు స్వామిని నంబి అని అన్నారు‌; వారికి సమాశ్రయణమూ, మంత్రోపదేశాన్ని పెరుమాళ్ళే చేసినారు. ఆళ్వార్లు ఇక్కడ 111 పాశురాలను గానము చేసినారు.

ఉత్సవాలు 

 200 మంది శ్రీపాత్తాంగులతో తిరువీధి ఉత్సవము జరుగు సందర్భము అతి విలక్షణమైనది‌.  ఈ ఉత్సవము వైకుంఠద్వాదశి నాడూ, కుంభమాస బ్రహ్మోత్సవములో ఐదవ రోజునా రాత్రి జరుగుతుంది.


పాశురము 

 పెరియ తిరుమొళి లోని  పాశురము (6-9-1):

పెడైయడర్త మడ వన్నమ్! పిరియాదు! మలర్కమలమ్
మడలెడుత్తు మదునుకరుమ్! వయలుడుత్త తిరునఱైయూర్!

ముడైయడర్త శిరమేన్ది! మూవులగుమ్ పలి తిరివోన్!
ఇడర్ కెడుత్త తిరువాళన్! ఇణై యడియేయడై  నైఞ్జే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

21 తిరునందిపుర విణ్ణగరమ్:(నాథన్ కోయిల్)

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్ )

శ్లో: నందిపూర్వ పుర విణ్ణగర్ పురే నంది తీర్థయుజి పశ్చిమానసః
       నాధనాధ ఇతి నామ సంయుతో నంది భక్తశిబిరాజ సేవితః
       శ్రీమచ్చంపక వల్లీతి నాయక్యా పరిశోభితః
       మధ్యే మన్దార వైమాన మాస్తే శ్రీకలిజిన్నుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

 కుంభకోణము నుండీ టౌను బస్సు ఉంది 10 kms. దూరములో ఉన్న  ఈ క్షేత్రానికి పోవుటకు‌. కుంభకోణము నుండీ కొడుక్కి అను చోట దిగి 2 kms. నడిచి సన్నిధిని చేరవచ్చును. ఈ క్షేేత్రానికి దక్షిణ జగన్నాథము అని పేరు. ఈ క్షేత్రానికి 1 km. దూరములో నందివనము అను చోట పెరుమాళ్ళ సన్నిధి ఒకటి శిథిలంగా ఉంది. నాథన్ కోయిల్ అని కూడా అంటారు.

మూలవర్లు: - విణ్ణగర పెరుమాళ్ ~ నాథ నాథ పెరుమాళ్ ~ నందినాథన్ ~  అనీ వ్యవహరిస్తారు. పశ్చిమ దిశగా దర్శనమిస్తారు ఆశీన భంగిమలో...

తాయారు: - చంపకవల్లి తాయారు.

విమానము: - మందార విమానము.

పుష్కరిణి: - నంది తీర్థ పుష్కరిణి.
నందికి, శిబిచక్రవర్తికీ, మార్కండేయునికీ ప్రత్యక్షమయ్యారు

నంది ఇక్కడ తపస్సు చేయగా శాపవిమోచనమయిందని స్థలపురాణము.
మూలాస్థానములో ఎడమవైపు గోడమీద అధికార నంది  చిత్రాన్ని‌ చూడవచ్చు భక్తులు‌. ఈ దేవాలయము వానమామలై మఠ అధ్వర్యములో నిర్వహిస్తున్నారు.
ఇక్కడ నాచ్చియార్లకూ, ఆంజనేయుడికీ సన్నిధులున్నాయి.

పాశురాలు: 

 తిరుమంగై ఆళ్వార్లు కీర్తించిన పాశురము ~ పెరియ తిరుమొళి:5-10-1:

తీద అఱు  నిలత్తొడు ఎరి కాలినొడు! నీర్ కెழுవిశమ్బు మవైయాయ్!

మాశు అఱుమనత్తినొడు ఉఱక్క మొడు ఇఱక్కై! అవైయాయ పెరుమాన్!

తాయ్ శెఱ ఉళైన్దు తయిరుణ్డు కుడమాడు! తడమార్వర్ తగైశేర్!

నాదనుఱైకిన్ఱనకర్! నందిపురవిణ్ణగరమ్ నణ్ణు మనమే!!

(ఈ పాశురాలను నాలాయిరమ్ లో 1438 to 1447 వరకూ చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

22. తిరు విందళూరు 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 *(పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్)

మనకున్న 108 వైష్ణవ దివ్యదేశాలలో ఇది 22 వ క్షేత్రము‌. తిరువళందూర్ అని కూడా పిలుస్తారు.

శ్రో: శ్రీమదిందు సరసీకృతధ్భుతా విందళూర్ పురి సురేంద్ర దిగ్ముఖః
      దివ్యగంధ వననాత నామకః చంద్రశాప వినివర్తన ప్రియః
     వేద చక్రపద దేవయానగో వీరనామ శయంసవలాంచనః
     చంద్రసేవిత తనుర్విరాజతే కౌస్తుభాంశ కలిజిన్ముని‌ స్తుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

ఈ క్షేత్రము మాయవరం నగరములో ఒక భాగము. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలున్నాయి.

తమిళనాడులోని చెన్నైకు 281 kms దూరములో ఉంది. చెన్నై, మదురై, తిరుచ్చి, చిదంబరము నుండీ రవాణా సౌకర్యాలున్నాయి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి. పంచరంగ క్షేత్రాలలో ఇది ఒకటి.

మూలవర్లు:  
సుగంధ వననాథుడు; మరువినియమైన్ద పెరుమాళ్; *పరిమళ రంగన్; అని నామధేయాలు‌. తూర్పు దిశగా వీర శయనంగా దర్శనమిస్తారు. సుమారు 12 అడుగుల పొడవు కలిగి పచ్చని శిలతో చేసిన మూర్తి ఈ పెరుమాళ్ళు.

తాయారు: - చంద్ర శాపవిమోచన నాచ్చియార్ అనీ పుండరీకవల్లి నాచ్చియార్ అనీ పిలుస్తారు.

విమానము: - వేద చక్ర విమానము.

పుష్కరిణి:  - చంద్ర పుష్కరిణి.

 పెరుమాళ్ళు ఇక్కడ చంద్రునికి ప్రత్యక్షమయ్యారు.

మీనమాసములో బ్రహ్మోత్సవాలు హస్త తీర్తోత్సవంగా నిర్వహిస్తారు. భక్తులు ఇక్కడి కావేరీ నదిలో తులామాసములో స్నానాలు చేస్తారు.

తిరుమంగై ఆళ్వార్లు తమ పెరియతిరుమొళి లో (4-9-1) స్వామికి చేసిన మంగళాశాసన పాశురమిది:
(ఈ పాశురాలను 1328 to 1337 వరకూ చూడవచ్చును)

నుమ్మై త్తొழுదోమ్! నున్దమ్ పణిశెయ్ దిరుక్కుమ్ నుమ్మడియోమ్!

ఇమ్మైక్కిన్బమ్ పెర్ట్రోమ్! ఎన్దాయ్ ఇన్దళూరీరే!

ఎమ్మై క్కడితా క్కరుమమరుళి! ఆవా ఎన్ఱిరఙ్గి!

నమ్మై ఒరుకాల్ కాట్టి నడన్దాల్! నాఙ్గళ్ ఉయ్యోమే!

     ఈ క్షేత్రము విష్ణువు అంబరీషుని రక్షించిన ప్రదేశము. పరిమళ రంగనాథస్వామిగ కొలువు దీరి ఉంటారు. పదో శతాబ్దములో పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినారు. తంజావూరు నాయకరాజులు, విజయనగర చక్రవర్తులు  ఆలయ అభివృద్దికి కృషి చేసినారు. ఈ పంచ రంగ క్షేత్రాన్ని అందరు వైష్ణవ భక్తులూ తప్పక దర్శించి సేవించాలి.

(ఆళ్వార్ దివ్యతిరువడి గళే శరణమ్)

23. తిరుచిత్తిర కూటము

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్)

(శ్రీమతే రామానుజాయ నమ:)

శ్లో: శ్రీ పుండరీకసరసీ పరిశోభమానే శ్రీచిత్రకూట నగరే భుజగేంద్ర శాయీ
శ్రీ పుండరీక లతికా ప్రియదివ్యరూపః శ్రీసాత్త్వికాఖ్య వరమన్ది రవాస లోలః

ప్రాచీముఖశ్శివముఖా మర కణ్వ తిల్యా ప్రత్యక్షమంగళ తనుః కులశేఖరేణ
సంకీర్తితః కలిజితా మునినా చ నిత్యం గోవిందరాజ భగవానవనౌ విభాతి!

ఎక్కడుందీ క్షేత్రము?: 
తమిళనాట చిదంబర పట్టణములో చెన్నై~తిరుచినాపల్లి మార్గములో ఉందీ క్షేత్రము.  
రైల్వే ష్టేషనుకు 2 kms దూరములో ఉంది‌. 
చిదంబరము ఇటు వైష్ణవులకూ,  అటు శైవులకూ, ముఖ్యమైన పట్టణము.
 వైష్ణవులు తిల్లైనగర్ తిరుచ్చిత్రకూడమ్  అనీ, శైవులు పుండరీకపురము
అనీ వ్యవహరిస్తారు. ఈ క్షేత్రానికి పడమట దిశగా 40 kms లో స్వయంవ్యక్తాలలో ఒకటైన శ్రీముష్ణము,  నైరుతి దిశగా 25 kms. దూరాన కొట్టుమన్నార్ కోవెల ఉన్నాయి‌.  చిదంబరములో నటరాజ శివాలయముంది. 
ఇక్కడ భక్తులకు సకల సౌకర్యాలు లభ్యమవుతాయి.

మూలవర్లు:
గోవిందరాజ పెరుమాళ్ళు ఆదిశేషునిమీద భుజంగశయనంగా తూర్పు దిశగా దర్శనమిస్తారు.‌ బ్రహ్మ, శ్రీదేవి, భూదేవి కూడా పెరుమాళ్ళ ప్రక్కనే ఉంటారు.

ఉత్సవర్లు:
పార్థసారధి/ దేవాధిదేన్  ఆశీన భంగిమలో చతుర్భుజాలతో కుడి హస్తము  కాస్త పైకెత్తి ఉపదేశ ముద్రలో ఉంటారు. ఉభయ నాంచారులూ వారి ప్రక్కనే ఉంటారు. మరొక ఉత్సవర్లు చిత్రకుడత్తుల్లన్ పేరుతో ఉభయ దేవేరులతో ఉంటారు. 

తాయార్లు: - పుండరీకవల్లి తాయారు.

విమానము: - సాత్త్విక విమానము.

పుష్జరిణి: - పుండరీక సరస్సు.

ప్రత్యక్షము: 

తిల్లై, కణ్వ మహర్షులకు, పతంజలికి, వ్యాఘ్రపాదునకూ ప్రత్యక్షమయ్యారు.

పెరుమాళ్ళు మాసి మఘమ్ నాడు తిల్లై సముద్రాన్ని తీర్థవారికి విచ్చేస్తారు. భరతముని గారు నాట్యశాస్త్రాన్ని ఇక్కడే రచించినారు. పశ్చిమ వీధిలో కోదండరామన్ సన్నిధిని కూడా భక్తులు దర్శించవచ్చు.

పాశురాలు: 

 కులశేఖరాళ్వార్లు 11,(741 to 751);

 తిరుమంగై ఆళ్వార్లు 21(1158 to 1177) మొత్తము 32 పాశురాలను వీరు కీర్తిస్తూ మంగళాశాసనాలు చేసినారు. నాథముని గారి అవరారస్థలమైన కట్టుమన్నార్ కోయిల్ ఇక్కడికి  దగ్గరలో ఉంది‌. వారు తమ శిష్యులకు పాశురాలను నేర్పించినారిక్కడ.  శివ పార్వతుల నృత్య ప్రదర్శనకు పెరుమాళ్ళు వచ్చి న్యాయనిర్ణేతగా వచ్చారట! ఏడవరోజుకు శివుడు పార్వతితో  సమానంగా ఆడలేకుండా వుంటే, పెరుమాళ్ళు తన ఎడమ కాలిని కాస్త పైకెత్తి సైగ చేయగా, శివుడు ఆ సూచనను గ్రహించి తన కదా లి ని పైకెత్తి ఊర్ధ్వ నృత్యాన్ని‌ చేయగా,  పార్వతి అలా చేయలేక ఓటమిని అంగీకరించిందని స్తలపురాణము. పార్వతి తిల్లైని‌విడిచి వెళ్ళింది. ఆ తరువాత ఆమె శివకామసుందరిగా వచ్చి శివుణ్ణి చేబట్టింది. ఈ ఆలయాన్ని క్రిమికాంతచోళరాజు నాశనము చేయించగా, ఆ తరువాత పునర్మింపబడింది. అప్పుడు  కొంతకాలము అక్కడి ఉత్సవమూర్తులను తిరుపతిలోని గోవిందరాజాలయములో ఉంచి ఆరాధించేవారు రామానుజుల సూచనతో.

కులశేఖరుల పెరుమాళ్ తిరుమొళి లోని 5-10-1 వ పాశురమిది:

అఙ్గణ్ నెడు మదిళ్ పుడై శూழ்! అయోత్తియెన్నుమ్!

అణి నగరత్తు ఉలగనైత్తుమ్! విళక్కుమ్ శోది!

వెఙ్గదిరోన్ కులత్తుక్కు! ఓర్ విలక్కాయ్ త్తోన్ఱి!

విణ్ ముழுదుమ్ ఉయ్యక్కొణ్డ! వీరన్ తన్నై!

శెఙ్గణ్ నెడుమ్ కరుముగిలై! ఇరామన్  తన్నై!

త్తిల్లైనగర్ తిరుచ్చిత్తర! కూడన్దన్నుళ్!

ఎఙ్గళ్ తనిముదల్వనై! ఎమ్బెరుమాన్ తన్నై!

ఎన్ఱు కొలో కణ్ కుళిర! క్కాణునాళే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

24. తిరుక్కాళిచ్చీరామ విణ్ణగరము 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ) (పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్)

శ్లో: శంఖ‌ పుష్కరిణీ చక్ర తీర్థ సుందరవైభవే
      కాట్చీరామపురే శ్రీమాన్ తాడాళన్నితి విశ్రుతః
   మరంద స్యంది కబరీ నాయకీ భాగలోలిపః
   పుష్కలావర్తకాఖ్యాన విమానస్థితి శోభితః
       అష్టకోణ మహర్షీణాం ప్రత్యక్షః  ప్రాగ్దిశాముఖః
        పరకాల వచోదివ్య సుధాప్రీతో విరాజతే

ఎక్కడుందీ క్షేత్రము? 
శీర్కాళి పట్టణములో ఉందీ క్షేత్రము.‌ చెన్నై~తిరుచీ మార్గములో ఉన్న పెద్ద పట్టణము‌. భక్తులకు సకల వసతి సౌకర్యాలు లభిస్తాయి.

మూలవర్లు: 
త్రివిక్రమన్/ తాడాలన్/లోకనాథన్ అని పేర్లు పెరుమాళ్ళకు. స్థానిక భంగిమలో తూర్పు దిశగా దర్శనమిస్తారు.

ఉత్సవర్లు: -త్రివిక్రమ నారాయణన్.

 తాయార్లు: - మత్తవిళంకుళి నాచ్చియార్/లోకనాయకి తాయారు.

విమానము: -పుష్కలావర్తక విమానము.

పుష్కరిణి: - శంఖ/చక్ర పుష్కరిణి.

ప్రత్యక్షము: 

అష్టావక్ర(అష్టకోణ) మహర్షికి.

స్థల పురాణ విశేషాలు:

ఇక్కడ పెరుమాళ్ళు తన ఎడమ కాలిని పైకెత్తి ఉంటారు. వామనావతారములో లోకాలను తన మూడడుగులతో కొలిచినట్లు ఉంటారు. తిరుక్కోవలూరు లో త్రివిక్రమ పెరుమాళ్ళు తన కుడి కాలిని పైకెత్తి‌‌ ఉంటారు. దేవనాయకన్ పెరుమాళ్ళకు ఒక సన్నిధి ఉంది. ఇక్కడ తిరుమంగై ఆళ్వార్లు ఒరు కురళాయ్ (పె.తి. 3-4) దశకమును అనుగ్రహించినారు.
తిరుజ్ఞాన సంబంధర్ అను శైవ కవిని మెప్పించి చతుష్కవి అను బిరుదును పొందినారు. శ్రీవైష్ణవ సిద్దాంత స్థాపన చేసి తాడాళన్ పెరుమాళ్ళను‌
పునః ప్రతిష్ట చేసినారు.

పాశురాలు: 

 తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ మంగళాశాసనము చేసినారు‌.
మాణవాళమామునులు కూడా ఇక్కడికి వేంచేసి మంగళాశాసనము చేసినారు.

(నాలాయిరమ్ లో 1178 to 1187 వరకూ వీరి పాశురాలను చూడవచ్చు)


పెరియ తిరుమొழி 3.4.1

ఒరుకుఱళాయిరు నిలమ్మూవడిమణ్ వేణ్డి!

ఉలకనైత్తుమీరడియా లొడిక్కి! ఒన్ఱుమ్
తరుగవెనా మావలియై చ్చిఱైయిల్ వైత్త!

తాడాళన్తాళణై వీర్ తక్క కీర్తి!

అరుమఱైయిన్ తిరళ్ నాన్గుమ్ వేళ్వియైన్దుమ్!

అఙ్గఙ్గళవై ఆరుం ఇశైగళ్ ఏழమ్!

తెరువిల్ మలి విழாవళముమ్ శిరక్కుమ్! కాழி
చ్చీరామవిణ్ణగరే శెర్మిన్ నీరే!!

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణం)

25 తిరుక్కూడలూరు:(అడుదురై పెరుమాళ్ కోయిల్)

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 (పి.యల్. నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్)

శ్లో: చక్రతీర్థాంచితే రమ్యే కూడలూర్ నగరీవరే
       పద్మాసన లతానాధో వైయ్యంకాత్త విభుస్సదా
శుద్ద సత్త్వ విమానస్థః ప్రాంగ్ముఖో నందకర్షిణా
ప్రత్యక్షితః కలిధ్వంసి స్తుతి ప్రీతో విరాజితే

ఎక్కడుందీ క్షేత్రము? 

 తమిళనాడులోని తిరువయ్యారు నుంచీ కుంభకోణము పోవు ఇస్ సు లో 12 kms. దూరములో ఉందీ క్షేత్రము. చెన్నై~తిరుచి రైల్వే మార్గములో అయ్యమ్ పేట స్టేషను నుండీ 7 kms. దూరములో ఉంటుంది.

 ఇక్కడ భక్తులకు ఏ సదుపాయాలూ లేవు. తిరువయ్యూరులో గానీ, అయ్యమ్‌పేటలోగానీ బస చేసి సన్నిధికి వెళ్లాలి.

అర్చక స్వాములుండు  సమయాలను కనుక్కుని వెళ్ళి సేవించుకోవాలి.

మూలవర్లు & ఉత్సవర్లు 

వైయ్యమ్ కాత్త పెరుమాల్/ జగద్రక్షకన్/ఉయ్యక్కొండార్ స్థానక భంగిమలో తూర్పు దిశగా దర్శనమిస్తారు. స్వామి ఒక హస్తముతో  ఒక కొరడా పట్టుకుని  జగద్రక్షణకొరకు  ఉంటారు.

తాయారు:

 పద్మాసనవల్లి/పుష్పవల్లి తాయారు.

తీర్థము:

 చక్ర తీర్థము.

విమానము: 

శుద్ద సత్త్వ విమానము.

నందక మహర్షికి ప్రత్యక్షమయ్యారు. ఈ క్షేత్రములో దేవతలు నందక మునితో కూడి స్వామిని అర్చించినారు; అందుకే ఈ క్షేత్రానికి *కూడలూరు
అని పేరు వచ్చింది. వైకాశి లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకసారి సన్నిధిలోని‌ విగ్రహాలు కొల్లిడము నది వరదలలో కొట్టుకుపోతే, రాణీ మంగమ్మాళ్ వాటిని ఎలాగో వెతికించి తెప్పించి పునఃప్రతిష్ట చేయించిందని‌ స్థల ‌పురాణము.
ఆలయ స్థంబాలమీద రా‌ణి, వారి అమాత్యుల చిత్రాలను భక్తులు చూడవచ్చును.

పాశురాలు: 

 తిరుమంగై ఆళ్వారు ఇక్కడ పది పాశురాలను గానము చేసినారు. నాలాయిర దివ్య ప్రబంధములో 1358-67 వరకూ ఉన్నాయి.

తా‌‌మ్! తమ్పెపెరుమై యఱియార్! తూదు వేన్దర్కాయ!వేన్దరూర్ పోల్!
కాన్దళ్ విరల్! మెన్ కలై నన్మడవార్!
కూన్దల్ కమழுమ్! కూడలూరే!


తక్కన్ వేళ్వి! తకర్తతలై వన్!
తుక్కన్తుడైత్త! తుణైవర్ ఊర్ పోల్
ఎక్కలిడు! ను‌ణ్ మణల్ మేల్!  ఎఙ్గుమ్
కొక్కి‌న్ పழమ్ వీழ்! కూడలూరే!!
( పెరిియ తిరుమొళి ~ 5-2-1; 6)]

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


తిరుక్కణ్ణంగుడి: 26

వైష్ణవ దివ్య దేశాలలో రెండవ శ్రీకృష్ణారణ్యక్షేత్రము తిరుక్కణ్ణంగుడి క్ధేత్రము; ఆ క్షేత్ర వివరాలను ఇక్కడ పొందుపరస్తున్నాను.

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్యదాసన్: Edited by:ఫణిహారం రంగనాత్)
(19.6.23)

శ్లో: శ్రీమచ్చ్రవణ కాసారే తిరుక్కణ్ణంగుడీరితే 
      పురే శ్తామళ తన్వాఖ్యః  అరవిందలతాయుతః
      ఉత్పలాఖ్య విమానస్తః  ప్రాజ్ఙముఖో గౌత్స్మర్షిణా
      ప్రత్యక్షితః  కలిఘ్నార్య సంస్తుతో భువి భాసతే

ఎక్క డుందీ క్షేత్రము?

  పంచ కృష్ణారణ్య క్షేత్రాలలో ఇది నాలుగవది. నాగపట్టణము~శిక్కిల్~
కీవళూరు
మధ్యనగల ఆழிయ్యర్ అను చోట‌ బస్సు దిగి 1 km నడచి సన్నిధిని
 చేరుకోవచ్చును.‌ నాగపట్టణానికి 8 kms దూరములో ఉంది. తంజావూరు ~ కీవళూరు మార్గములో
 కీవళూరు నుంచీ 3 kms దూరము. 
ఇక్కడ యాత్రీకులకు వసతులు చాలా స్వల్పము.
నాగపట్టణములో బసచేస స్వామిని దర్శించుకోవాలి.

 తంజావూరు నుంచీ 76, 
కంభకోణమునుంచీ 70 kms. దూరము.

మూలవర్లు 

 శ్రీలోకనాథ స్వామి. 
ఆళ్వార్లు ఉంచిన తిరునామము శ్యామలమేని యెన్ తలైవన్ 
తూర్పు ముఖముగా స్తానక భంగిమలో దర్శనమిస్తారు ~ చతుర్భుజాలతో శంఖ చక్ర అభయ
 హస్త ముద్రలతో కటిహస్తులై మనోహర రూపముతో వెలసినారు. వీరి తిరుముఖము
 వాత్సల్యపూరితమై శాంతోదితముగా దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువుదీరి పూజలందుకుంటున్నారు. మూలవిరాట్టుకు ముందువైపు ఉత్సవమూర్తులను దర్శించుకోవచ్చు.

ఉత్సవమూర్తులు: 

 స్వామివారు శ్రీదామోదర నారాయణ స్వామి‌ అనే పేరుతో ఆరాధిస్తారు. వీరిని శుభాశ్రయమని పెద్దలంటారు.  మూలమూర్తి రూపాననే ఉత్సవమూర్తి ఉండడము ఒక విశేషము.  

తాయార్లు 
మూలవర్: 

 లోకనాయకి దేవి.

ఉత్సవర్: 

అరవింద నాయకి. అమ్మవారు ఆశీన భంగిమలో ఉన్నారు. చతుర్భుజి ~ రెండు చేతులతో కమలాలనూ, మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలతో  భకులపై కరుణాకటాక్షాలను
వర్షింపచేస్తున్నారు. 

విమానము: 

ఉత్ఫల విమానము.

పుష్క రిణి: 

శ్రవణ పుష్కరిణి.

స్తలపురాణము 

 ఒకప్పుడు గౌతమ ఋషి, మద్ర ఋషి, భృగు ఋషి,  ఉపరిచరవసువు, శ్రవణ పుష్కరిణి
ఒడ్డున తపస్సు చేస్తుండగా వారికి బ్రహ్మ ప్రత్యక్షమై ఒక వరాన్ని కోరమన్నాడు. వారి తపస్సు తప్పక ఫలిస్తుందని చెప్పి,  తాను కూడా తపస్సు చేయసాగాడు. వారికి ఫంగుణీ మాసములో  రోహణి నక్షత్రము నాడు పెరుమాళ్ళు తాయారుతో దర్శనమిచ్చినారు. అక్కడే వెలసి భక్తులకు దర్శనమిస్తూ ఉండమని వారు కోరగా ఆ దివ్యదంపతులు అంగీకరించినారు.
వశిష్ట మహర్షి శ్రీమన్నారాయణుని చిన్ని కృష్ణుని రూపములో ఆరాధించినారు కనుక ఈ క్షేత్రానికి తిరుక్కణ్ణంగుడి అని పేరొచ్చింది. వశిష్టుడు  వెన్నతో కృష్ణుడిని తయారు చేసుకుని తపస్సు చేయగా,  వారి తపోబలముతో ఆ వెన్న కరిగేది కాదు. ఆ సమయములో వారి తపస్సును పరీక్షించ తలచి చిన్ని‌ కృష్ణుడు చిన్న పిల్లవానిగా ఆశ్రమములోకి వచ్చి వెన్నను తిన్నాడు. తపోభంగమై వశిష్టుడు చూస్తే తనకు ఆ పిల్లవాడు వెన్న తింటూ కనిపించినాడు. పట్టుకోవాలని ప్రయత్నిస్తే కన్నయ్య పరిగెత్తినాడు. అక్కడి వారు ఆ బాలుడిని చెట్టుకు కట్టివేసినారు.‌ అప్పుడు తన నిజరూపములో‌ దర్శనమిచ్చినాడు.
స్వామివారు లోకాలనన్నిటినీ  కంటికి రెప్పలా రక్షిస్తుంటారని విశ్వసిస్తుంటారు భకులు. ఇక్కడ
 స్వామివారిని తాయార్లనూ పూజిస్తే కోర్టు కేెసులు గెలుస్తారనీ ~ చదువులో వెనుకబడి
ఉన్నవారు సేవిస్తే ఉపయోగముంటుంద‌నీ భక్తుల నమ్మకము. అమ్మవారినిపూజిస్తే మహిళలకు సౌభాగ్యము జీవితాంతమూ వర్ధిల్లుతుందని నమ్మకము.
మామూలుగా ఆలయాలలో గరుడాళ్వారు స్వామికి ఎదురుగా రెండు చేతులను నమస్కార భంగిమలో ఉంటారు ~ ఇక్కడ తన శరీరముపై చేతులుంచుకుని కొలువుదీరి ఉన్నారు.
 ఇక్కడ ఆకులు ముడుచుకొనని చింతచెట్టు (ఉరాంగాప్పుళి) ~  తిరుమంగై ఆళ్వారులు రాయి
విసిరిన చోట ఏర్పడిన  ఊరాకిణర్ అను మంచినీటి చెరువును ఉండెడిది. పుష్పించియు 
కాయలు కాయని పొగడచెట్టు ఉందిక్కడ.
కీ.శ. 9 వ శతాబ్దములో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. 
పల్లవులు,  పాండ్యులు,  విజయ నగర చక్రవర్తులు,  మధుర నాయక రాజులు,
ఆలయాభివృదికి   కృషిచేసినారు.

ఉత్సవాలు: 

ప్రతి నెలా మఘ నక్షత్రమునాడు స్వామివారు ఊరేగింపుగా సముద్ర తీరానికి వెళ్ళి భక్తుల పూజలను అందుకుంటారు. ధనుర్మాసములో 
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తారు. 

పాశురము: 

 తిరుమంగై ఆళ్వార్లు పది పాశురాలతో మంగళాశాసనాలు చేసినారు
 అందులో ఒక పాశురమిది:👇

వఙ్గ మా  మున్నీర్ వరినిఱప్పెరియ! వాళ్ అరవినణైమేవి!
శఙ్గమ్ ఆర్ అమ్ కైతడ  మలర్  ఉన్ది! శామమామేని యెన్ తలైవన్!
అఙ్గమారు ఐన్దువేళ్వి నాల్ వేదమ్! అరుమ్  కలైపయిన్ఱు! ఎరిమూన్ఱుమ్ 
శఙ్గెయాల్ వళర్కుం తుళక్కమిల్ మనత్తోర్! తిరుక్కణ్ణఙ్గుడియుళ్  నిన్ఱానే!!

(పెఱియ తిరుమొழி 9-1-1)
(వీరి పాశురాలను నాలాయిరమ్ లో 1748 to 1757 వరకూ చూడవచ్చును)

(ఆళ్వార్  దివ్య తిరువడి గళే శరణమ్)


తిరుక్కణ్ణమంగై: 27

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 (పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్ )

     ఇది పంచకృష్ణ క్షేత్రాలలోని 108 వైష్ణవ దివ్యదేశాలలోని పంచకృష్ణారణ్య
క్షేత్రాలలో రెండవదీ క్షేత్రము. సన్నిధికి కావలసిన అంశాలు ఏడు. అవి:

క్షేత్రకము,
రథము ,
మండపము,
విమానము,
నది,
నగరము,
అరణ్యము.
ఈ ఏడు కలిగి ఉండుటచే ఈ క్షేత్రానికి సప్తామృత క్షేత్రమనికూడా పేరు వచ్చింది. 

శ్లో: దర్శనాఖ్య సరో రమ్యే కణ్ణామంగై పురీవరే
అభిషేక లతాయుక్త భక్తవత్సల నాయకః
ఉత్పలాఖ్య విమానసస్తః సురనాత దిశాముఖః
రోమశర్షి ప్రచేతాభ్యాం సేవితః కలిజిన్నుతః

ఎక్క డుందీ క్షేత్రం? 

 తమిళనాడులో నాగపట్ణణానికి 33 kms, తంజావూరి నుంచీ 76kms, దూరములో ఉంది; తిరుచిరాపల్లి నుంచీ 147 kms దూరములో ఉంది.

మూలవర్:

 భక్తవత్సలపెరుమాళ్. స్వామివారు చతుర్భుజాలతో
శంఖు చక్ర గదా అభయ ముద్రలతో స్తానక భంగిమలో తూర్పు
ముఖముగా వలస ఉన్నారు. 14 అడుగుల ఎత్తుగా మూలమూర్తిగా సేవలందిస్తున్నారు. ఆழ்వార్ వుంచిన తిరునామము  పెఱుంబురక్కడళ్.‌

ఉత్సవర్: 

  భక్తర్ ఆవి పెరుమాళ్  ~ (భక్తులకు ఆత్మవంటివాడు) స్వామికి ఇరువైపుా శ్రీదేవి, భూదేవిలు కొలువుదీరి ఉన్నారు.

తాయారు:
మూలవర్: 

శ్రీకణ్ణమంగై నాయకి. ఆశీన భంగిమలో రెండు హస్తాలలో పువ్వులనూ, మరో రెండుహస్తాలలో  అభయ వరద ముద్రలతో వెలసినారు.
 అమ్మవారు ప్రత్యేకముగా ఒక సన్నిధిలో ఉన్నారు.

ఉత్సవర్:  

అభిషేక వల్లి తాయార్ ద్విభుజయై నిలబడ్డ భంగిమలో   ఉన్నారు.  ఈ సన్నిధిలో ఒక
తేనెగూడు ఉంది ~ దేవతలు, మహర్షులు పెరుమాళ్ళ కల్యాణాన్ని సేవించవచ్చి ఇక్కడనే ఉండి సేవించవచ్చి  తేనెటీగల
రూపములో యిక్కడే వుండి స్వామిని ఆరాధించే వరంపొందార‌‌ట. నేటికీ ఆ తేనెగూటికి తిరువారాధన జరుగుతుంది. తేనెటీగల వల్ల ఎవ్వరూ ఈ నాటికీ ఎవరూ ఇబ్బందిపడిినది లేదు. 

విమానము: 

ఉత్పల విమానము;

పుష్కరిణి: 

దర్శన పుష్కరిణి:
పూర్వము వామనుడి  పాదాలను బ్రహ్మ కడిగినపుడు ఆయన కమండలములోని నీరు
కిందపడి  ఈ పుష్కరణి ఏర్పడిందని కథనం. లక్ష్మీదేవి ఈ పుష్క రణిలోనే స్నానమాచించి
 తపస్సు చేసింది. ఇందులో భకులు స్నానమాచరించ్బి సకల పాపాలు నశించి అనంతమైన
‌పుణ్య ఫలాలు కలుగుతాయని ఒక నమ్మకము.

స్థల పురాణము: 

 స్కందపురాణము, పద్మ పురాణము, ప్రకారమూ, కృష్ణుడు,  మంగై అంటే భార్య అని ~ శ్రీమన్నారాయణుడి దేవేిరి అయిన లక్ష్మీ దేవి తపస్సు చేసిన ప్రదేశము కనుక దీనికి తిరుకణ్ణమంగై అని పిలుస్తారు. ఆమె చేసన తపస్సుకు మెచ్చి ఇక్కడే శ్రీభక్తవత్సల స్వామిగా వచ్చి ఆమెను పరిణయమాడి కొలువు దీరినట్లు కథనము.
108 దివ్య దేశాలలో ఒకటైన తిరునిన్రవూరు లో కూడా స్వామిగా ఆరాధనలను అందుకుంటున్నారు. వరుణుడు కూడా ఇక్కడ స్వామిని సేవించి ప్రత్యక్షము
 చేసుకున్నాడు. ఈ క్షేత్రకములో ఒక రాత్రి  గడిపితే మోక్షము సిద్దిస్తుందని కథనము. క్రీ..శ. 8 - 9 శతాబ్ధాలలో  చోళులు ఆలయ నిర్మాణము చేసినట్లు ~ 17 వ శతాబ్ధములో తంజావూరి నాయక రాజులు
ఆలయాభివృదికి కృషి చేసినారు.

గోపురము: 

90 అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులతో ఉంది గోపురము~ తూర్పు వైపు గోపురముతో పాటూ పడమర వైపున మూడు అంతస్తుల గోపురముంది~ఆలయములో రామానుజాచార్యులు, 
వైకంఠనాథస్వామి, నరసింహస్వామి, హయగ్రీవుడు, శ్రీనివాసుడూ,  హనుమంత
విగ్రహాలున్నాయి. గరుడ మండపములో గరుడుడు శంఖు చక్రాలు ముకుళిత హస్తాలతో
 ఉన్నారు. 
గురు ~ శనివారాలు ~ స్వాతి నక్షత్రము రోజులలో గరుడాళావార్లకు  తిరుతంజనము
నిర్వహిస్తారు. హస్వురు ~ మహా మండప ద్వారానికి ఇరువైపులా శంఖనిధి ~ పద్మనిధి ~ ద్వారపాలకులుగా ఉన్నారు.

ఉత్సవాలు: 

తమిళ మాసమైన చిత్తిరైలో పది రోజులు బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. శ్రీకృష్ణ జయంతి,  వైకుంఠఏకాదశి ~ శరన్నవరాత్రులలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. 

మరొక గొప్ప ఆచార్య పురుషుల సంబంధము కలిగినదీ క్షేత్రము. తిరుకణ్ణన్మంగై అణ్డాన్ అను వారు ఒకనాడు రెండు కుక్కలు కొట్టుకొనుచుండగా గమనించి, ఆ కుక్కలకై వాటి
 యజమానులుసైతం గొడవపడి ప్రాణాలుకోల్పోవడం చూచి, తమ కుక్కలకై వాటి
యజమానులింతగా తెగించినారే, మరి మనము పెరుమాళ్ళ సొత్తై ఉండగా పెరుమాళ్ళు మనను కావరా? అని యోచించి ఆ క్షణాన్నుండీ  తమ భారాన్ని పూర్తిగా పెరుమాళ్ళమీద వేసి నిబ్బరంగా ఉన్నారట! 

తిరుతంగైయాళ్వారుల పెరముబురుక్కడలై (పె.తి.10-10) అను దశకమును
అనుగ్రహించు చుండగా నాలుగు పాశురాలు అనుగ్రహించు సమయమున తిరునిన్రవూర్ భక్తవత్సల పెరుమాళ్ యెదురుగా సేవ సాదించగా కరుమామణి కున్రినై నిన్రవూర్ నిత్తిలతొత్తినై అని మంగళాశాసనము చేసినారు.
1970లో ఒక నూతన రథాన్ని ప్రారంభించినారు.

పాశురము: 

 తిరుమంగై ఆళ్వార్ ~ పెరియ తిరుమొళి ~ (7-10-1):


తిరు కపిస్థలము: 28

(శ్రీహరి ప్రియ  గోష్టి నుండీ)
 (పి. యల్. నరసింహాచార్య దాసన్: &  Edited by ఫణిహారం రంగనాత్)

108 వైష్ణవ దివ్య దేశాలలోని పంచ కృష్ణారణ్య క్షేత్రాలలో యిది మూడవ క్షేత్రము

శ్రీ: శ్రీ మద్గజేంద్ర సరసీ కపిలాఖ్య తీర్థ సంశోభితే శుభ కపిస్థలే దివ్యదేశే
    దేవ్యా రమామణి లతాహ్వయయా సమేతో దేవో గజేంద్ర వరదో భుజంగశాయీ
వైమానమస్య వరకారక నామధేయం దేవేశ దిగ్వదన సంస్థితి శోభమానః
నాగాధిరాజ మరుదాత్మజ సేవితాంగ భక్తిసార మునిరాజ నుతో విభాతి

ఎక్క డుందీ క్షేత్రము?

 కుంభకోణము‌ ~ పాపనాశం బస్సులో పోవలెను. పాపనాశం నుంచీ 3 kms;
కుంభకోణము ~తిరువయ్యూరు  మార్గమున కూడా వెళ్ళవచ్చును. 

మూలవర్లు: 

గజేంద్ర వరద పెరుమాళ్ళు‌~  ఆற்றఙరాయ్ కణ్ణన్‌ అనికూడా పేరు.
 శయన భంగిమలో తూర్పు  దిశగా దర్శన మిస్తారు. 

తాయారు:

 రమామణి తాయార్ ~ పొర్తామరైయళ్ అనికూడా పేరు.

పుష్కరణి: 

గజేంద్ర పుష్కరణి. ~ కపిల తీర్థము.

విమానము: 

 గగనాకార విమానము.

స్థల పురాణము: 

 ఇంద్రద్యుమ్న మహారాజు పాండ్య దేశపురాజు. గొప్ప విష్ణుభక్తుడు. 
 ఒకనాడాయన నారాయణ ధ్యాన తత్పరుడై ఉండి అగస్త్య మహర్షి రాకను గమనించనందున యేనుగువై పొమ్మని మహర్షి శాపమిచ్చినాడు.   
ఆ రాజు గజేంద్రుడై యిక్కడి కొలనులో ప్రతి దినమూ స్నానము చేసి తామరలను కోసి పెరుమాళ్ళను అర్చించేవాడు. ఒకనాటికి పెరుమాళ్ళకు అతనిపై కృపకలిగి ఆ గజేంద్రుడిని ఒక మొసలి పట్టి పీడించింది. భగవంతుడు కష్ణాన్నిచ్చేదీ,  పరమసుఖాన్ని అనుగ్రహించడానికే కదా! గజేంద్రుడు మొసలితో తన స్వశక్తిమీద ఆధారపడి 1000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాడు.
తన సన్నగిల్లి తన పుణ్య ఫలము పక్వమవడముచేత, భగవంతుడిని శరణువేడాలనే తలపు
కలిగింది. తన పాత అలవాటు చొప్పున తామరపూవును త్రుంచి తన తొండంతో
 పైకెత్త పెరుమాళ్ళ తిరువడిలో శరణాగతి చేశాడు గజేంద్రుడు.
 అవ్యాజ కరుణామూర్తి అయిన పెరుమాళ్ళు గజేంద్రుడి పిలుపు విని బిడ్డమీద మమకారంతో
 పరుగునవచ్చి  రక్షించే తండ్రి వలె వేగంగా గరుడారూఢుడై వచ్చి గజేంద్తుడిని తన
చేతితో స్పృశించి బాధలు  పోగొట్టి  కొలనులోనుండి పైకిలాగాడు; ఆపైన గజేంద్రుడిని
పీడిస్తున్న మెసలిని సుదర్శన చక్రప్రయోగంతో సంహరించివేశాడు. గజేంద్రుడికి, మొసలికి
కూడా సారూప్య ముక్తినిచ్చాడు.  గజేంద్రుని మకరి బారినుండీ కాపాడినందుకు గజేంద్రవరదుడు అని కీర్తిస్తారు.   వాలి, సుగ్రీవులు ఇక్కడ స్వామిని దర్శించినారని  కథనము.

ఉత్సవాలు:

తమిళ మాసమైన ఫంగుణి లో గజేంద్రమోక్షాన్ని ప్రదర్శిస్తారు.‌ శ్రీరామనవమి, అక్షయ తదియ నాడు విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ.‌

ఇక్కడి విశేషము

ఈ దివ్య దేశానికి 5 kms దూరములో ఉమయార్పురమునకు పోవు మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల అవతార స్థలమయిన
మణ్డజ్ఞుడి  క్షేత్రము కలదు.

పాశురాలు:  

 తిరుమంగై ఆళ్వార్లు తమ తిరువందాది లోని 50వ పాశురమిది: (No. 2431 పాశురము నాలాయిర దివ్య ప్రభంధములో)

కూర్ట్రముమ్ శారా! కొడువినై యుం శారా! తీ
మార్ట్రముుమ్ శారా! వగై అఱిన్దేన్! ఆర్ట్ర
ఙ్గరైకిడక్కుమ్! కణ్ణన్ కడల్ కిడుక్కుమ్! మాయన్
ఉరైక్కిడక్కుమ్! ఉళ్ళత్తెనక్కు!! 

విశేషము: 

ఈ దివ్యదేశానికి 5 kms దూరములో ఉమయాపురమునకు పోవు
మార్గములో తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరు అవతారస్థల మైన
మణ్డంగుడి క్షేత్ర ముంది. యాత్రీకులు బస చేయుటకు‌  కొన్ని‌ సత్రాలున్నాయక్కడ!

          గజేంద్ర వరద పెరుమాళ్ తిరువడిగళే శరణమ్

29 తిరువెళ్ళియంగుడి

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి.యల్.నరసింహాచార్యదాసన్:& Edited by:ఫణిహారం రంగనాత్ )

శ్లో: వెళ్ళియంగుడి పురే విరాజితే బ్రహ్మతీర్థ కవి పద్మినీయుతే
       కోలవిల్లి రఘునాథ నామకో నాయకీం మరతకాభిధాం శ్రితః
శోభనాభిద విమాన మధ్యగో భోగిరాజ శయితేంద్ర దింగ్ముఖః
ఇంద్ర శుక్ర విధిశక్తి సూనుభిః సేవితః  కలిహ సంస్తుతోనిశమ్

ఎక్కడుందీ క్షేత్రము? 

 కుంభకోణానికి 16 kms దూరములో ఉంది. కుంభకోణము నుండీ  శంగనల్లూరుకు వెళ్ళి,  అక్కడినుంచీ 1 km నడిచి వెళ్ళి చేరుకోవచ్చును. ఈ క్షేత్రానికి భార్గవ పురి అనీ, బ్రహ్మపురము అనీ, ఇంద్రపురము అనీ, పరాశర క్షేత్రము ~  అనీ  కూడా వ్యవహరిస్తారు. 
మాయవరము నుంచీ  రవాణా సౌకర్యాలున్నాయి.

 తమిళములో వెళ్ళి అంటే శుక్ర అని. శుక్రుడు ఇక్కడ తపస్సు చేస్తే విష్ణువు యారు కనుక ఈ క్షేత్రానికి తిరువెళ్ళియంగుడి అని పేరు వచ్చింది. వామనావతారములో బలి దానమివ్వడానికి తయారవుతూంటే శుక్రుడు అడ్డు తగిలి ఒక కన్ను పోగొట్టుకుని నందున‌ తపస్సు చేస్తే స్వామి శ్రీరామునిగా దర్శనమిచ్చి పోయిన కంటిని తిరిగి ఇచ్చినాడని కథనము. శుక్రుడు స్వామిని అక్కడే ఉండి భక్తులను కటాక్షించమని వేడగా కోలవిల్లి రామునిగా వెలసినారు. శుక్రుడు,  మయాసురుడిని
స్వామికి ఆలయాన్ని ఏర్పాటు చెయమని అడగ్గా, ఆలయాన్ని తయారయ్యేంతవరకూ  నామీద ఉండమని ఆదిశేషుడు ప్రార్థించగా ఐదు పడగల శేషుని మీద వెలసినారు.

మూలవర్లు: 

కోలవిల్లి రామన్.


ఉత్సవర్లు: 

శృంగార సుందరన్ భుజంగ శయనుడిగా తూర్పు దిశగా ఉన్నారు.

తాయారు: 

 మరకతవల్లి చతుర్భుజాలతో ఉంటారు. శ్రీదేవి,  భూదేవి కూడా ఉన్నారు.

విమానము: 

శోభన (పుష్కలావర్తక విమానము).

తీర్థము: 

శుక్ర పుష్కరిణి ~ బ్రహ్మ తీర్థము.

స్థలవృక్షము: 

కదళీ వృక్షము.

ఇక్కడ స్వామి ఇంద్ర ~ శుక్ర ~ బ్రహ్మ ~ పరాశర ~ భృఘు ~ మయాసుర ~ మార్కండేయులకు ప్రత్యక్షమయ్యారు.

తన శంఖు చక్రాలను గరుడునికి  ఇవ్వగా ఇక్కడ వెలసిన‌ గరుడాళ్వార్లు శంఖు చక్రాలతో ఉన్నారు. ఈ క్షేత్రము పరమపదానికి సమానమనీ,  108 దివ్యదేశాలలో సేవించిన పుణ్యమొస్తుందని భక్తుల నమ్మకము. స్వామి గర్భగృహములో అఖండ దీపము ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది.   యోగా నారసింహునికీ గోదాదేవికీ ఇక్కడ ఉపాలయాలున్నాయి. ఇక్కడికి సమీపములో పెరియవాచ్చాం పిళ్ళై (శ్రీకృష్ణసూరి) అవతార స్థలమగు శెంగనల్లూరు ఉంది.

తిరుమంగై ఆళ్వార్లు కీర్తించినాఇక్కడ ~ వారి పెరియ తిరుమొళి (4-10-5) లోని పాశురము

పారినైయుణ్డు పారినై యుమిழ்దు! పారదమ్ కై యెఱిందు! ఒరుకాల్
తేరినైయూర్ న్దు తేరినై త్తురంద! శెఙ్గణ్ మాల్ శెన్ఱు ఉఱై కోయిల్!
ఏర్ నిరైవయలుళ్ వాళైగళ్ మరుగి!  ఎమక్కిడమన్ఱు ఇదెన్ఱెణ్ణి!
శీర్ మలి పొయ్ గై శెన్ఱణై గిన్ఱ! తిరువెళ్ళియఙ్గుడి యదువే!!

(ఈ ఆళ్వార్ల  పాశురాలను నాలాయిర దివ్య ప్రభంధము లో 1338 to 1347 వరకూ చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్యతిరువడి గళే శరణమ్)


తిరుమణిమాడక్కోయిల్:30 (తిరునాంగూరు)
 
(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 (పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by:ఫ‌‌ణిహారం రంగనాత్)

శ్లో: భాభాతి దివ్యమణిమాడపురే సురేంద్ర్ రుద్రాభిధాన్ నళినీద్వయ శోభమానే
శ్రీపుండరీక లతికామహిషీ సమేతో నన్దాప్రదీప భగవానితి నామధేయః

ప్రాచీముఖాసనలసన్ ప్రణవాభిధాన వైమానవాస రసిక శ్శ్రిత పారిజాతః
ఏకాదశేశ మఘవన్నయనానుభూత శ్రీమత్ కలిఘ్ను మునిపుంగవ కీర్తిత శ్రీః

ఎక్కడుందీ క్షేత్రము? 

 శీర్కాళికి  10 kms. దూరములో ఉంది. 
భక్తులు శీర్కాళిలో బస చేసి ఇక్కడి పెరుమాళ్ళను చేవించుకోవాలి. రామానుజకూటముంది. భోజనాది విషయాలు సన్నిధిలో ఏర్పాటు చేసుకోవాలి.

మూలవర్లు: 

నందా విళక్కు పెరుమాళ్(నరనారాయణార్), ఆశీన భంగిమలో తూర్పు దిశగా దర్శనమిస్తారు తన ఇద్దరు దేవేరులతో.

తాయారు: 

 పుండరీకవల్లి తాయారు.

పుష్కరిణి:

ఇంద్ర  ~ రుద్ర పుష్కరిణులు.

విమానము: 

 ప్రణవాకార విమానము. ఏడంస్తుల గోపురము పైన  ఏడు కలశాలు.

      మకరమాస అమావాస్య నాడు జరుగు 12 గరుడ సేవలను చూచి తీరాలి భక్తులు.  తిరునాంగూర్ తిరుపతులలో ఇది మొదటిది. మిగిలినవి: 
వైకుంఠవిణ్ణగరమ్ ~ అరిమేయ విణ్ణగరమ్ ~ వణ్ పురుషోత్తమమ్ ~ శెెంబొన శెయ్ కోయిల్ ~ తిరత్తైట్రి అంబలమ్. 

        ఈ సన్నిధిలో తిరుక్కోట్టియూర్ నంబి(గోష్టీ పూర్ణులు) వేంచేసి ఉన్నారు. 
 అర్చక స్వాములను ముందుగా కలిసి సేవించాలి.

 మేషం చిత్తా నక్షత్రము నాడు తీర్తోత్సవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరమూ మకరమాస అమావాస్య నాడు తిరుమంగై ఆళ్వార్లు తిరువాలి తిరునగరి నుంచీ పల్లకీలో వేంచేసి తిరుక్కురైయలూర్ కు చేరి అక్క ఉన్న పంచ నరసింహమూర్తులకు 
వాడినేన్ వాడి పాశురాతో మంగళాశాసనము చేస్తారు. మంగై మఠము చేరి 
అంగణ్ జ్ఙాలం  అను పాశురములతో శింగవేల్ కుంరమ్ (అహోబిలము) పెరుమాళ్ళకు మంగళాశాసనము చేస్తారు.  ఆ తరువాత తిరుక్కావళంబాడి, తిరుమణిక్కూడమ్, తిరుపార్తమ్ పళ్ళి మొదలగు సన్నిధులకు వేంచేసి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి కావేరి నది ఒడ్డున మంజక్కుళి మంటపమునందు తిరుమంజనం జరుగుతుంది.

 తిరుమణి మాడక్కోయిల్ (తిరునాంగూర్) 30

ఆ తరువాత తుళంగునీణ్ముడి అను పాశురముతో నంబెరుమాళ్ళకు (శ్రీరంగనాథునకు) కులైయార్ న్ద అను పాశురముచే తిరునరైయూర్ నంబిగారికి మంగళాశాసనాన్ని చేసి, సాయంత్రానికి
తిరునాంగూర్ కు వేంచేస్తారు. ఇక్కడ ఉన్న ఆరు తిరుపతులలోని పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసి అక్కడనే ఉంటారు.‌ మరునాడు తిరునాంగూరు ఆదిగా ఉన్న 11 క్షేత్రాల పెరుమాళ్ళు మణిమాడక్కోయిల్ కు వేంచేసి ఆళ్వార్లచే మంగళా శాసనములను పొందుదురు. అందరు పెరుమాళ్ళకూ తిరుమంజనాలు చేసిన ‌తరువాత నాటి రాత్రి అందరు పెరుమాళ్ళు గరుడ వాహనాలమీదనూ, ఆళ్వార్లు హంస వాహనము మీద వేంచేయగా తిరువీధి ఉత్సవము జరుగుంతుంది.
ఆ మరునాడు పెరుమాళ్ళు తమ తమ సన్నిధులకు వేంచేయగా ఆళ్వార్లు
తిరుత్తేవనార్ తుగై మొదలు దివ్యదేశాలకు మంగళాశాసనము చేసి తిరువాలిని చేరగా, అక్కడ వేంచేసి ఉన్న నరసింహస్వామికి గరుడవాహన సేవ కావిస్తారు. వారికి మంగళాశాసనము చేసి తిరుమంగై ఆళ్వార్లు తిరునగరికి వేంచేస్తారు. ఈ 12 గరుడ సేవలూ తప్పక సేవింపదగినవి.

ఇక్కడి పెరుమాళ్ళు ఏకాదశ రుద్రులకూ, ఇంద్తునికి, మతంగమహర్షికీ ప్రత్యక్షమయ్యారు. 

తిరుమంగై ఆళ్వార్లు కీర్తించిన పాశురములు:

నన్దావిళక్కే  అళత్తర్కు అరియాయ్! నరనారణనే కరు మా ముగిల్ పోళ్
ఎన్దాయ్! ఎమక్కే యరుళా యెననిన్ఱు! ఇమైయోర్ పరవుమిడమ్! ఎత్తిశైయుమ్;
కన్దారమ్ అన్దేన్ ఇశై పాడ మాడే! కళివణ్డు మిழర్ట్రనిழల్  తుదైన్దు;
మన్దారనిన్ఱు  మణమల్కు నాఙ్గూర్! మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే!!

విడై ఓడ వెన్ఱు ఆయ్ చ్చి మెన్ తోళ్  నయన్ద! వికిర్ తావిళఙ్గుశుడర్ ఆழி యెన్నుమ్!

పడైయోడు శఙ్గోన్ఱుడై యాయెననిన్ఱు! ఇమైయోర్ పరవుమిడమ్! పైన్దడత్తు
పెడైయోడు శెఙ్గాల అన్నమ్ తుగైప్ప! తొగైప్పుణ్డరీకత్తిడై ! చ్చెఙ్గழுనీర్!

మడైయోడనిన్ఱుమదు విమ్ము నాంగూర్! మణిమాడక్కోయిల్ వణఙ్గెన్మననే!!

(పెరియతిరుమొళి ~ 3-8-1, 9):

(ఈ ఆళ్వార్లు కీర్తించిన  పాశురాలు 1218 to 1227; 1850; 2674 వరకూ నాలాయిర దివ్య ప్రభంధము లో చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణమ్)


తిరువైకుంద విణ్ణగరమ్: 31

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ) (పి.యల్.నరసింహాచార్య దాసన్:Edited by:ఫణిహారం రంగనాత్)

శ్లో: ఆనందతీర్థ కమలాసరసీ మనోజ్ఙే వైకుంఠ విణ్ణగర నామని దివ్యదేశే
 వైకుంఠ పూర్వ వరవల్లికయా సమేతో వైకుంఠనాథ విభురాసన సన్నివిష్టః

సత్యాభివర్ధన విమాన ముపాశ్రితస్సన్ శ్రీమానుదంక వసురాజ నిరీక్షితాజ్ఙః
జ్ఙానాలవాల పరకాల మునీంద్ర కీర్త్యః రాజ్యతమందు మతిమానస రాజహంసః

ఎక్కడుందీ క్షేత్రము? 

 తిరుమణిమాడ కోయిల్(౩౦/108) దివ్య దేశానికి‌ 1 km. దూరములో ఉందీ క్షేత్రము. ఇది తిరునాంగూర్ పది తిరుపతులలో ‌ఒకటి. 
అర్చక స్వాములు ఎప్పుడుంటారో సమయాలను కనుక్కొని‌ పెరుమాళ్ళను సేవించుకోవాలి.
 మిగతా తొమ్మిది తిరుపతులేవో దివ్యదేశము 30/108 లో ఇవ్వబడినవి. 

భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యాలు లేవు; శీర్కాళిలో ఉండి ఈ క్షేత్రానికి వచ్చి సేవించుకోవాలి.

మూలవర్లు: 

 వైకుంఠనాథ పెరుమాళ్ ఆశీన భంగిమలో తూర్పు ముఖంగా  ఉభయ నాచ్చియార్లతో చతుర్భుజాలతో శంఖు చక్రాలు రెండు హస్తాలలో, మూడవ హస్తములో ఒక పుష్పాన్ని నాలుగవ హస్తమును‌ తన ఎడమ‌మోకాలిపైన పెట్టుకుని దర్శనమిస్తారు. ఈ పెరుమాళ్ళను తామరై కణ్డుడైయ పెరుమాళ్ అని‌ కూడా వ్యవహరిస్తారు.

తాయారు: 

 వైకుంఠవల్లి తాయారు చతుర్భుజాలతో ~ రెండు చేతుల్లో‌ పుష్పాలతో, మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలతో దర్శనమిస్తారు.

విమానము: 

అనంత సత్యవర్ధన విమానము.

తీర్థాలు:

 ఆనంద ~ లక్ష్మీ ~ ఉదంక ~ విరాజ తీర్థాలు.
ఉపరిచర వసువుకూ, ఉదంక మహర్ధికి, వసు మహారాజుకూ స్వామి‌ ప్రత్యక్షమయ్యారు

స్థలపురాణము:

 శ్వేతకేతు అనే ఇక్ష్వాకు రాజు తన భార్యతో పాటీ ఇక్కడ తపస్సు నారాయణుని కోసము చేసినారు‌. మొదలు వారు శివుని‌ గురించి తపస్సు చేస్తే, శివుడు తాను నారాయణుని దర్శనమిప్పించలేనని‌ తాను కూడా వారితోపాటూ తపస్సు చేసినాడు‌. పెరుమాళ్ళు చివరకు ప్రత్యక్షమై వారిద్దరికీ మోక్షప్రాప్తిని ప్రసాదించి శ్రీవైష్ణవులకు అన్నదానాలను చేయమన్నారు. శివుడు అప్పుడు పెరుమాళ్ళను పది ప్రదేశాలలో పది రూపాలలో వెలసి ఉండమని కోరినారు. అందుకే ఇవి పది తిరునాంగూర్ తిరుపతులయ్యాయి.

ఉత్సవాలు:  

వైశాఖ మాసములో (May-June) పది రోజులపాటూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు‌.  తాయ్ మాసములో (Jan-Feb) తిరుమంగై ఆళ్వార్ల మంగళాశాసన ఉత్సవాలు జరుగుతాయి.‌

తిరుమంగై ఆళ్వార్లు పది మంగళాశాసన పాశురాలతో కీర్తించినారు.

(ఈ ఆళ్వార్లు కీర్తించిన పాశురాలను నాలాయిరమ్ లో 1178 to 1187 వరకు లభిస్తాయి)

శలఙ్గొణ్డ ఇరణియన్ అదు అగల్ మార్వమ్ కీణ్డు!
తడఙ్గడలై క్కడైన్దు అముదఙ్గొణ్డు ఉకన్ద కాళై
నలఙ్గొణ్డ కరుముగిల్ పోల్ తిరుమేనియమ్మాన్!
నాడోఱుమ్ మకిழ்దు ఇనిదు మరువి యుఱైకోయిల్!
శలఙ్గొణ్డు మలర్ శొరియుమ్ మల్లిగై ఒణ్ శెరున్ది!
శెణ్బకఙ్గళ్ మఱునాఱుమ్ వణ్ పొழிలినూడే!
వలఙ్గొణ్డు కయలోడి విళైయాడు నాంగూర్!
వైకున్ద విణ్ణకరమ్ వణఙ్గు మడనెఞ్జే!!

(తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళి ~ 3.9.1)

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


తిరు అరిమేయ విణ్ణగరమ్ ~ 32

(శ్రీహరి ప్రియ గోష్టి  నుండీ)
(పి.యల్. నరసింహాచార్య దాసన్: Edited by:ఫణిహారం రంగనాత్ )


శ్లో: దేశేస్మిన్నరిమేయ విణ్ణగరకే కోట్యాఖ్య తీర్థాంచితే
      సంప్రాప్తోలసదుచ్య శృంగ మతులం వైమానమేంద్రె ముఖః
      నాయక్యామృత కుంభవల్లి విలాసన్నామ్న్యా కలిఘ్నుస్తుతః
      ఆశీనఃకుడమాడు కూత్త పెరుమాళ్ రాజత్యుదంకేక్షితః

ఎక్కడుందీ క్షేత్రము? 

 ఈ క్షేత్రము తిరునాంగూరు పదకొండు తిరుపతులలో ఒకటి‌. మ‌ణిమాడక్కోయిల్(30/108)  దివ్య దేశానికి దగ్గరలో ఉంది. శీర్కాళికి 8 kms దూరములో ఉంది.
 అరి అంటే శ్రీహరి.   మేయమ్
 అంటే నివాసము అంటే హరి నివాసము అని అర్థము‌. దీన్నే కొడమాడు కూత్తర్ కోయిల్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రములో ధ్వజస్థంభము లేదు.

మూలవర్లు: 

 కొడమాడు కూత్తర్ పెరుమాళ్ ~ ఆశీన భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు.

ఉత్సవర్లు:  

చతుర్భుజ గోపాలన్.

తాయార్లు:

 అమృతఘటవల్లి తాయారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది‌.

విమానము: 

 ఉచ్చ్యశృంగ విమానము.

తీర్థాలు: 

కొడి ~ అమృత తీర్థాలు.


ఉదంక మహర్షికి స్వామి దర్శనమిచ్చినారు.

స్థలపురాణము: 

 ఇక్కడ విష్ణువు ఉద్దంక మహర్షికి కృష్ణమూర్తిని దర్శించే మనో నేత్రాన్నిచ్చినారు. శివుడు ఇక్కడ ఏకాదశ రుద్ర అశ్వమేధా‌న్ని‌ తనకు కలిగిన‌ బ్రహ్మహత్యా పాపాన్ని పోగొట్టుకోడానికి చేసినాడు. 
యాగ సమాప్తానికి విష్ణువు తన దేవేరులు శ్రీ, భూ, నీళా దేవులతో దర్శనమిచ్చినారు. 
శివుని కోరికమేరకు విష్ణువు ఇక్కడ పదకొండు రూపాలతో భక్తులకు దర్శన భాగ్యమిమ్మని‌ అడగ్గా అలానే అని వెలసినారు ఈ పదకొండు తిరునాంగూరు తిరుపతులలో.

          మరొక కథనము ప్రకారము కశ్యపమహర్షి కి  ఇద్దరు భార్యలు ~ వినత ~ కద్రువ  లకు వచ్చిన తగవు కారణంగా వినత కద్రువకు బానిసగా ఉండాల్సివ‌చ్చింది‌‌. 
ఆ బానిసత్వము పోవడానికి అమృతాన్ని తెచ్చిమ్మని వినతాసుతుణ్ణి అడిగిందట! అలాగేనని గరుడుడు అమృతాన్ని‌ తెచ్చి కద్రువ పుత్రులనందరినీ స్నానాలను చేసి వచ్చి తీసుకోవచ్చని చెప్పి ఆ  అమృతభాండాన్ని ధర్భలమీద ఉంచినాడు. దాన్ని‌ ఒక మాయావి అపహరించినాడు. పెరుమాళ్ళు చూచి వాడి హస్తాన్ని ఖండించగా, కొన్ని‌ చుక్కల అమృతము ఇక్కడ పడింది ~ ఇదే అమృత తీర్థము   అయ్యింది. పెరుమాళ్ళు ఇక్కడ ఆ కలశాన్ని‌ పట్టుకుని నాట్యము చేసినాడు.‌ తమిళములో కూడమ్ అంటే కలశము; కూత్తు అంటే నాట్యము.‌ అందుకే పెరుమాళ్ళకు కూడమ్ కూత్తర్ అని పేరొచ్చింది‌; ఇక్కడ స్వామి తన ఒక పాదాన్ని‌ ఆ కలశము మీద ఉంచి ఉన్నారు.

ఉత్సవాలు:

ఆడి మాసములో(July-Aug)  బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తాయ్ మాసములో తిరుమంగళా శాసన ఉత్సవాలు నిర్వహిస్తారు.

(తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలను పాడినారు.-వాటిని నాలాయిరమ్ లో 1248 to 1247 వరకూ చూడవచ్చును)

తిరుమడందై మణ్ మడందై యిరుపాలుమ్ తిగழ!

తీవనైగళ్ పోయ్ అగల అడియవర్ గట్కు ఎన్ఱుమ్
అరుళ్ నడన్దు!  ఇవ్వేழுలగత్తవర్ పణియ! వానోర్
అమర్ న్దేత్త  ఇరున్దవిడమ్ పెరుమ్ పుగழ் వేతియర్ వాழ்
తరుమ్ ఇడంగళ్! మలర్ కళ్ మికు కైతైగళ్ శెంగழு నీర్!

తామరైగళ్ తడఙ్గళ్ తొఱుమ్ ఇడఙ్గళ్ తొఱుమ్ తిగழ!

అరువిడఙ్గళ్  పొழிల్ తழுవి యెழிల్ తిగழுనాంగూర్!

అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే!!

(తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళి ~ 3-10-1)


తిరువణ్ పురుషోత్తమమ్: 34

(శ్రీహరి ప్రియ  గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్:Edited by:ఫణిహారం రంగనాత్)


శ్లో: సేవ్య శ్శ్రీ పురుషోత్తమాఖ్య నగరే క్షీరాబ్ధి తీర్థాంచితే
      నాయక్యా పురుషోత్తమాహ్వయుజా ప్రాగాస్య సంస్థానగమ్
      సంజీవిగ్రహ దేవయాన విలస ద్రూపోపమన్యుః ప్రియం
      శ్రీమంతం పురుషోత్తమ ప్రభుమహం శార్ఙ్గాంశ యోగిస్తుతమ్!

ఎక్కడుందీ క్షేత్రము?

 శీర్కాళి నుంచీ 8 kms దూరములో ఉంది.
 పదకొండు  తిరునాంగూర్ తిరుపతులలో ఇది ఒకటి. మణిమాడక్కోయిల్, అరిమేయ విణ్ణగరమ్, తిరుత్తెట్రియంబలమ్, ఈ క్షేత్రమూ ఒకే మార్గములో ఉన్నాయి.

 సౌకర్యాలేవీ ఇక్కడ భక్తులకు లభించవు. అర్చకులెప్పుడుంటారో కనుక్కుని వెళ్ళి  దర్శించాలి.

మూలవర్లు: 

 పురుషోత్తమన్ పెరుమాళ్ చతుర్భుజాలతో శంఖు చక్ర గదా అభయ ముద్రలతో తూర్పుముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తారు.

తాయారు: 

 పురుషోత్తమ నాయకి చతుర్భుజాలతో రెండు హస్తాలలో పుష్పాలనూ మరో రెండు హస్తాలలో అభయ వరద ముద్రలతో ఉంటారు.

విమానము: 

 సంజీవి విగ్రహ ఐదు అంతస్తుల విమానము. దీన్ని హనుమ సంజీవి మూలికా పర్వతా‌న్ని లంకకు  తీసుకుపోతుండగా క్రిందపడిన ఒక శిలతో చేయబదిందీ విమానము.

తీర్థము:

 క్షీరాబ్ధి పుష్కరిణి.

స్తలపురాణము: 

 వ్యాఘ్రపాద మహర్షి తన పసిబాలునితో సంచారము చేస్తూ  ఇక్కడికి వచ్చి ఒక వృక్షము క్రింద బాలుడిని పడుకోబెట్టి దగ్గరలోనున్న పూతోటకు పూలు తీసుకురావడానికి వెళ్ళినాడు‌; ఆ బాలుడికి ఆకలై ఏడుస్తూ ఉంటే మహర్షి పరుగున వచ్చేలోపే, మహావిష్ణువు క్షీరాబ్ధి తీర్థాన్ని సృష్టించి అందులోని తీర్థాన్ని‌ ఆ బాలునికిచ్చి ఏడుపు మాన్పించినాడు. మహర్షికి శ్రీహరి దర్శనమిస్తే అక్కడే వెలసి భక్తులకు దర్శనమివ్వమని అడగ్గా సరే నన్నాడు.  ఆ బాలుడు ఉపమన్యుడు పెద్దవాదైనాక విషయాన్ని తెలుసుకుని పెరుమాళ్ళను ప్రార్థించగా  శ్రీరామునిగా దర్శనమిచ్చినాడు‌ ~ గర్భాలయములో శ్రీ, భూ దేవి ఉత్సవమూర్తులున్నాయి.
శ్రీరామునికీ, సీతమ్మకూ, హనుమకూ విడి విడిగా ఉపాలయాలున్నాయి.

ఉత్సవాలు: 

 మిగతా తిరునాంగూరు తిరుపతులలో ఎలా ఉత్సవాలు చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి.

తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ పది పాశురాలను గానము చేసినారు స్వామిని కీర్తిస్తూ ~ వారి పెరియ తిరుమొళి లోని 4-2-1 పాశురామిది:

కమ్బ మా కడల్ అడైత్తు ఇలంగైక్కుమన్! కదిర్ ముడియవైపత్తుమ్
అమ్బినాల్ అఱుత్తు! అరశు అవన్ తమ్బిక్కు! అళిత్తవన్ ఉఱైకోయిల్!

శెమ్బలా నిరై శెణ్బగమ్ మాదవి! శూతకమ్ వాழைగళ్ శూழ்!

వమ్బు ఉలామ్ కముకు ఓఙ్గియ నాఙ్గూర్! వణ్ పురుడోత్తమమే!!

(ఈ ఆళ్వార్ల పాశురాలను నాలాయిరమ్ లో 1258 to 1267 వరకూ చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణమ్)


తిరుతైత్తింబలమ్ : 36

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్:& Edited by:ఫణిహారం రంగనాత్)


శ్లో: సూర్యాఖ్యాబ్జిని తెత్తియంపలపురే వేదాఖ్య వైమానగః
      శెంగణ్మాలితి విశ్రుత స్సురదిశా వక్త్రో భుజంగే శయః
      నాయక్యా స్పృహణీయ పద్మలతికా నామ్న్యా తయైవేక్షితో
      స్తు త్యశ్రీ కలిజిన్మునే ర్విజయతే శ్రీమన్ననంతాక్షి గః

ఎక్కడుందీ క్షేత్రము? 

 ఇది పదకొండు తిరునాంగూరు దివ్య తిరుపతులలో ఒక దివ్య దేశము. తిరుదేవనార్ తొగై(33/108) దివ్యదేశానికి 2 kms. దక్షిణాన, శీర్కాళికి‌ 6 kms. దూరములో ఉంది. ఈ క్షేత్రానికి పల్లికొండ పెరుమాళ్ కోయిల్ అని కూడా పిలుస్తారు‌.

మూలవర్లు:

 శెంగణ్ మాల్ రంగనాథార్~ చతుర్భుజాలతో తూర్పు ముఖంగా ఆదిశేస్బునిపై భుజంగశయనుడిగా దర్శనమిస్తారు.

తాయారు: 

 శెంగమలవల్లి తాయారు.

విమానము: 

వేద విమానము.

పుష్కరిణి:

సూర్య పుష్కరిణి.

తాయార్లకూ, అనంతాళ్వార్లకూ ప్రత్యక్షమయ్యారు

ఉత్సవాలు: 

 తిరునాంగూర్ లో జరిగే ఉత్సవాలన్నీ ఆ యా సమయాలలో ఇక్కడ కూడా నిర్వహిస్తారు‌.

తిరుమంగై ఆళ్వార్లు ఈ పెరుమాళ్ళకు పది‌పాశురాలతో మంగళాశాసనాలు చేసినారు‌. నాలాయిర ప్రభంధములో 1278-87 వరకూ ఉన్నాయి.‌ వారి పెరియ తిరుమొళి  లోని ఒక పాశురము 4-4-1 & 9:

మార్ట్రరశర్ మణి ముడియుమ్ తిఱలుమ్ తేశుమ్!
మర్ట్రవర్ తమ్ కాదలిమార్ కుழைయుమ్! తన్దై
కాల్తళైయుమ్ ఉడన్  కழల వన్దు తోన్ఱి!
క్కద నాకమ్ కాత్తళిత్త కణ్ణర్ కణ్డీర్!
నూర్ట్రిదழ்క్కొళ్ అరవిన్దమ్ నుழைన్ద పళ్ళత్తు!
ఇళఙ్గముగిన్ ముతుపాళై పగువాయ్ నణ్డిన్!
శేర్ట్రళైయిల్ వెణ్ ముత్తమ్ శిన్దు నాంగూర్!
తిరుతైర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే!!


ఏழுలగుమ్ తాழ்వరైయుమ్ ఎఙ్గుమ్ మూడి!
ఎణ్డిశైయుమ్ మణ్డలముమ్ మణ్డి!  అణ్డమ్
మోழை యెழுన్దాழிమిగుమూழி వెళ్ళమ్!
మున్ అకట్టిల్ ఒడుక్కియ ఎమ్మూర్తికణ్డీర్!
ఊழிదొఱుమూழிదొఱుమ్ ఉయర్ న్ద శెల్వత్తు!
ఓఙ్గియ నాన్మఱైయనైత్తుమ్ తాఙ్గు నావర్!
శేழுయర్ న్ద మణిమాడమ్ తికழுనాంగూర్!
తిరుతైర్ట్రియమ్బలత్తు ఎన్ శైఙ్గణ్ మాలే!!


తిరుక్కావళంపాడి:38

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 (పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫణిహారం రంగనాత్)
(2. 7.23)

శ్లో: పృధు పుష్ప సరోరమ్యే కావళంబాడి  పట్టణే
      స్వయంభు వరవైమాన స్థాయీం శెంగమలాభిధామ్
      నాయకీ మాశ్రితశ్శ్రీమాన్ ప్రాజ్ఞుఖో రుద్రసేవితః
      గోపాలకృష్ణ భగవాన్ రాజతే కలిజిన్నుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

 ఈ క్షేత్రము కూడా పదకొండు తిరునాంగూర్ తిరులతులలో ఒకటి. తిరుత్తేవన్నార్ తొగై  (33/108) కి 1 km దూరము, శీర్కాళికి 11 kms దూరములో ఉంది. భక్తులకు ఇక్కడ వసతులు‌ శూన్యము.
అర్చకులతో సంప్రదించి వారెప్పుడుంటారో అప్పుడే వెళ్ళి సేవించుకోవాలి.

తిరుమంగై ఆళ్వార్ల తిరు అవతారస్థలమైన తిరుక్కురైయలూర్ ~ తదీయారాధన చేసిన ప్రదేశమగు మంగై మఠం ఈ సమీపముననే ఉంది‌. ఈ మఠమునందు శ్రీవీర నరసింహస్వామి సన్నిధి ఉంది. 

మూలవర్లు: 

 గోపాలకృష్ణన్ పెరుమాళ్ రుక్మిణి సత్యభామలతో  నిలుచున్న భంగిమలో రెండు హస్తాలతో, ఒక చేతిలో చెర్నకోలనూ, రెండవ చేతిని గోవుపై ఉంచి దర్శనమిస్తారు.

తాయారు: 

 శెంగమల నాచ్చియార్ ~ మాడవరన్ మంగై అని పేర్లు.  తాయారుకు విడిగా సన్నిధి లేదిక్కడ.

విమానము:

 స్వయంభూ విమానము.

పుష్కరి‌ణి:

 తడమలర్ పోయ్ గై పుష్కరిణి.

విష్వక్శేనునికి, రుద్రునికీ ప్రత్యక్షమయ్యారు

స్థలపురాణము:

 దూర్వాస మహర్షి తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఒక అప్సరసను పంపి తపోభంగాన్ని చేయమన్నాడు.  మహర్షికి ఆగ్రహమొచ్చి ఒక వేటగాడికి పుత్రికగా పుట్టమ‌ని ఆ అప్సరసకు శాపమిచ్చినాడు‌. ఆమె అలాగే జన్మించింది. వరుణుడు ఆమెను చూచి ప్రేమించి వివాహము చేసుకోగా వారికి విష్వక్శేనుడు జన్మించినాడు. ఆ విష్వక్శేనుడు తీవ్రమైన తపస్సు చేయగా, మహావిష్ణువు దర్శనమిచ్చి తనకు సేనానాయకునిగా ఉండమని ఆ పదవిని ఇచ్చినాడు‌. అతని విన్నపము ప్రకారము స్వామివారు ఇక్కడ గోపాలకృష్ణుడుగా రుక్మిణీ సత్యభామలతో వెలసినాడు.

పాశురాలు:

తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ పది పాశురాలతో స్వామికి మంగళాశాసనాలు చేసినారు
వాటిని నాలాయిరమ్ లో 1298 to 1307 వరకూ చూడవచ్చును

వారి పెరియ తిరుమొళి లోఒక పాశురము ~ 4-6-9 ఇది..

మావళమ్ పెరుగి మన్ను! మఱైయవర్ వాழுమ్ నాంగై!
క్కావళమ్బాడిమేయ! క్కణ్ణనై క్కలియన్ శొన్న!

పావళమ్ పత్తుమ్ వల్లార్! పార్ మిశై అరశరాగి!

కో ఇళమన్నర్ తాழ! క్కుడైనిழల్ పొలివర్ తామే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


తిరువెళ్ళక్కుళమ్: 39 (అణ్ణన్ కోయిల్‌) 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫ‌‌ణిహారం రంగనాత్‌)


శ్లో: పురేతు వెళ్ళక్కొళ మిత్యభిశ్రుతే తన్నామ తీర్థే సుర దిగ్ముఖ స్థితిః
      నారాయణాఖ్యో పరతత్త్వబోధ వైమానమాసాద్య విరాజతే హి

      ఇక్ష్వాకు శ్వేతరాజోగ్ర ప్రత్యక్షత ముపాగతః
      పూమార్ తిరుమకళ్ దేవీ మాశ్రితః కలిహస్తుతః

ఎక్కడుందీ క్షేత్రము?:

 తిరుత్తేవనార్ తొగై(33/108) కు పశ్చిమంగా 1 km దూరములో ఉంది. శీర్కాళి (24/108)  నించీ 11 kms దూరము. ఇక్కడికి వెళ్ళే భక్తులు అణ్ణన్ కోయిల్ అని చెప్పాలి. 
ఇక్కడ వారికి ఎలాంటి వసతులు లేవు.

మూలవర్లు: 

 శ్రీనివాసన్ పెరుమాళ్/ అణ్ణన్ పెరుమాళ్  నిలుచున్న భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు‌.‌ కణ్ణన్ నారాయణ‌న్ పెరుమాళ్  అ‌ని‌ కూడా పిలుస్తారు. ఈ స్వామిని తిరుమలలో వెలసిన శ్రీనివాస పెరుమాళ్ళకు అన్నగారనీ, అందుకే ఈ క్షేత్రానికి తెన్ తిరుపతి అని వ్యవహరిస్తారు.

తాయార్లు: 

పూవార్ తిరుమంగై నాచ్చియార్ / అలర్మేల్ మంగై నాచ్చియార్.

ఉత్సవర్లు: 

పద్మావతీ పూవార్ తిరుమంగై నాచ్చియార్.

విమానము: 

స్వేత/వెళ్ళక్కొళమ్ తత్త్వభోధ విమానము.

పుష్కరిణి: 

స్వేత పుష్కరిణి.

ప్రత్యక్షము: 

ఇక్ష్వాకు వంశీయుడైన శ్వేతకేతు మహారాజునకూ, పరమశివునకూ  ప్రత్యక్షమయ్యారు.

తిరుమంగై ఆళ్వార్ల భార్య కుముదవల్లి నాచ్చియార్ ఈ క్షేత్రమునందే జన్మించినది.

స్థల పురాణము: 

 తిరుమలకు వెళ్ళలేనివారు ఇక్కడ ముడుపులు చెల్లించవచ్చని  భక్తుల విశ్వాసము. భక్తులు ఇక్కడ వారి బరువుకు సమానముగా బియ్యము గానీ, చక్కెర గానీ, బెల్లము గానీ, లేక చిల్లర నాణాలు గానీ,  తులాభారమిస్తారు. 

          ఈ ప్రాంతాన్ని పాలించిన మహారాజు దుందుమారన్ కుమారుడు స్వేతన్ జీవితము తొమ్మిది సంవత్సరాలని జాతకములో ఉన్నందున, వశిష్ట మహర్షి సలహా మేరకు ఒక బిల్వ వృక్షము నీడలో  మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయగా విష్ణువు ఈశ్వరుడూ ప్రత్యక్షమై బాలునికి దీర్ఘాయుస్సును ప్రసాదించినారు.‌ పెరుమాళ్ళు ఇక్కడ వరద హస్తముతో ఉన్నందున వరదరాజన్ అని కూడా పిలుస్తారు.

ఉత్సవాలు:

పురటాసి నెలలో పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

పాశురాలు:

 తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ పది పాశురాలను కీర్తించినారు. వారి పెరియ తిరుమొళి లోనిదీ పాశురము(4-7-1). నాలాయిర ప్రబంధములో 1308 to 1317  వరకూ వీటిని చూడవచ్చును.

కణ్ణార్ కడల్ పోల్! తిరుమేని కరియాయ్!
నణ్ణార్మునై! వెన్ఱికొళ్వార్మన్నునాఙ్గూర్!!

తిణ్ణార్మదిల్ శూழ்! తిరువెళ్ళక్కుళత్తుళ్
అణ్ణా! అడియేనిడరై!క్కళైయాయే!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


తిరుపార్థాన్ పళ్ళి~40

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫణిహారం  రంగనాత్ )


శ్లో: పార్తన్ పళ్ళి పురేతు శంఖ సరసీ యుక్తే తు నారాయణం
 వైమానం సమధిశ్శ్రిత స్స్థితిలసన్ ప్రాచేత సాశీముఖః
 దేవస్తామరయాళ్ ప్రియోర్జు‌న జలేశైకాదశేశేక్షితః
  ప్రాప్తస్తామర నాయకీం విజయతే శార్ఙ్గాంశ యోగిస్తుతః 

ఎక్కడుందీ క్షేత్రము? 

 తిరునాంగూర్ (30/108) దక్షిణాన ‌3 kms దూరములో ఉంది.‌
 చాలా చిన్న గ్రామము కనుక యాత్రీకులకు సదుపాయాలు లేవు. 
శీర్కాళికి 11 kms దూరము. ఇది కూడా పదకొండు తిరునాంగూర్
తిరుపతులలో ఒకటి.

మూలవర్లు: 

 తామరైయాళ్ కేళ్వాన్ నిలుచున్న‌ భంగిమలో పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు.
 శ్రీ భూ నీళా దేవేర్లతో ఉంటారు.‌ ఇక్కడ శంఖ చక్ర గదలతో కోలవిల్లి రామన్ ఉన్నారు. 
ఇక్కడ అర్జునునికి వేరే సన్నిధి ఉంది.
ఒకే గర్భాలయములో కృష్ణుడు రాముడు ఉన్నారు. అగస్థ్యునికి ఒక‌ సన్నిధి ఉన్నది‌.

ఉత్సవర్లు: 

 చతుర్భుజాలతో పశ్చిమంగా ఉన్న పార్థసారధి

తాయారు:

తామరై నాయకి 

విమానము:

 నారాయణ‌ విమానము.‌

తీర్థము:

గంగా తీర్థము; శంఖ సరస్సు(విష్ణుపాద తీర్థము).

గోపురం: 

 రాజగోపురానికి మూడు అఅంతస్తులు ~ ఐదు కళశాలున్నాయి.

ప్రత్యక్షము: 

 అర్జునుడు, వరుణుడు, ఏకాదశ రుద్రులకు.

అర్జునునికి చరమ శ్లోకార్థాన్ని ప్రకాశించిన స్థలమిది.

విశేషాలు: 

 అగస్థ్యమహర్షి తపస్సు చాలా కాలము చేసినారిక్కడ‌ ~ ఆ సమయములో తీవ్రమైన కరువు రాగా అర్జు‌నుడు రాగా, మహర్షి అతణ్ణి  ఒక తీర్థాన్ని సృష్టించమ‌‌ని అడగ్గా అతడు ఒక సరస్సును ఏర్పాటు చేసినాడు. అప్పుడు ప్రార్థించగా కృష్ణుడు తామరైయాల్ కెల్వన్  గా ప్రత్యక్షమైనాడు.
మరొక కథనము ప్రకారము: బృహస్పతి భార్యను  బలవంతంగా వరుణుడు తీసుకుపోగా తనకు వచ్చిన బ్రహ్మ హత్యాదోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ తపస్సు చేస్తే విష్ణువు దర్శనమిచ్చి ఇక్కడే వెలసినాడు.

ఉత్సవాలు:
 తిరునాంగూరు లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా నిర్వహిస్తారు.

పాశురాలు:

 తిరుమంగై ఆళ్వార్లు ఇక్కడ పది పాశురాలతో కీర్థించినారు. నాలాయిరములో 1318-1327 వరకూ ఉన్నాయి. అందులో ఒక పాశురము ~ 4-8-1 ఇది:

కవళయానై కొమ్బుశిత్త! కణ్ణనెన్ఱుమ్ కామరుశీర్!

క్కువళై మేగమన్న మేని! కొణ్డకోన్ ఎన్నానై యెన్ఱుమ్!

తవళ మాడ నీడు నాంగై! తామరైయాళ్ కేళ్వనెన్ఱుమ్!

పవళయావాళ్ ఎన్ మడందై! పార్తన్ పళ్ళి పాడువాళే!!
 

ఇంతటితో చోళదేశపు దివ్య దేశ  తిరుపతులు నలుబది సమాప్తము

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణమ్)

తిరుమాలిరుం శోలైమలై(అళగర్ కోయిల్‌):41/108: Part 1 

(శ్రీహరి ప్రియ గోష్టినుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫణిహారం రంగనాత్ )

శ్లో: శ్రీ మద్వనాద్రి పథనూపుర నిమ్నగాంతే దేశేస్థితో వృషభ పర్వత చందనాడ్యే
      ధర్మేక్షితస్తు మలయధ్వజ పాండ్య దృష్టః ప్రాగాననో లసతి సుందరబాహు నాథః

     సోమసుందర విమాన మథ్యగః సుందరోప పదవల్లికాయుతః
     విష్ణుచిత్త కలిజిత్ పరాంకుశైః గోదయా మణి మహర్షిణాస్తుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

 మధురకు 15 - 20 kms. దూరములో ఉందీ క్షేత్రము.
దీనికి దక్షిణ తిరుపతి అనీ, వనగిరి అనీ వ్యవహరిస్తారు. అంతే కాక మయల్ మిగు పొళీల్ ~ అంటే దట్టమైన తోటలు గల దివ్యదేశము అను 
విశిష్టమైన తిరునామము ఉంది‌. ఈ సన్నిధి చాలా పెద్దది. ఆలయము సముద్రమట్టానికి 900 ft. ఎత్తులో ఉంది. ఇది 5,000 సంవత్సరాలనాటిది. గుండ్రని ఆకారములో నిర్మింపబడినది. 

మూలవర్లు: 

 సుందరబాహు పెరుమాళ్~ వైకుంఠనాథన్ అనీ ~ పరమస్వామి  అనీ తిరునామాలున్నాయి. మూలవర్లు, ఉత్సవర్లు  కూడా పంచాయుధాలతో వేంచేసి ఉంటారు.  స్వామి ప్రయోగ చక్రహస్తులై నిలుచున్న భంగిమలో తూర్పు ముఖంగా  ఉంటారు.

తాయార్లు 

 సుందరవల్లి తాయారు ~  కల్యాణవల్లి తాయార్ అని తిరునామాలు.

విమానము: 

 నూపురగంగ (శిలమ్బారు) సోమసుందర విమానము. 

స్థలవృక్షము: 

 చందన వృక్షము.

ధర్మదేవతకు, మలయధ్వజ పాండ్యరాజుకు, ప్రత్యక్షమయ్యారు.

స్థలపురాణము: 

 ఆండాళ్ పెరుమాళ్ళకు వంద గంగాళాల అక్కారవడిశల్ (పాయసాన్నము), వంద గిన్నెలతో వెన్న  ఆరగింపు చేస్తానని మాట ఇచ్చి దాన్ని‌ తీర్చకనే శ్రీరంగనాథుని తిరుమేనిలో ఐక్యమయ్యారు. ఈ విషయాన్ని రామానుజులవారు తెలుసుకుని ఆండాళ్ శ్రీసూక్తి సఫలమగునట్లుగా మొక్కు తీర్చినారు. ఆండాళమ్మ సంతోషపడి ఉడయవర్లను చూచి ఎన్ కోయిల్ అణ్ణనే అ‌ని పిలిచి ఆదరించి గౌరవించిందట!  అది మొదలు వారికి గోదాగ్రజ
అనీ కోయిల్ అణ్ణన్ అనీ తిరునామాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఆండాళ్
వీత్తురుంద తిరుక్కోలము లో ~ కూర్చున్న భంగిమలో వేంచేసి ఉన్నారు.
తిరుమంగై ఆళ్వార్లు ఈ పెరుమాళ్ళను తెన్నానై (తెర్కే ఆనై) దక్షిణ దిగ్గజముగా అభివర్ణించినారు.‌ స్వామివారికి కళ్ళళగర్ అను తిరునామముంది. నమ్మాళ్వార్లు ఈ స్వామిని నెంగుమయిరుముల్ కలందు
(మనస్సునందును ప్రాణము నందునూ కలిసిపోయి) అని అశ్రిత వ్యామోహమనెడి గుణాన్ని అభివర్ణించినారు. స్వామిని ~ ఈ దేహముపై మోహాన్ని విడువుమని కోరగా స్వామి అట్లే అ‌ని అంగీకరించినారట!  దానికి వారు సంతోషపడి శొంగొల్ కవిగాళ్ అను దశకమున ప్రకటించినారు. ఈ సన్నిధికి అళగర్ కోట అని పేరు.  సన్నిధికి ఉత్తరాన కొండమీద నూపురగంగ ఉంది. గోపుర ద్వారమున 18 వ పడికట్టులో కరుప్పణన్‌ అనువారు సన్నిధికి  కావలిగా ఉంటారు. (సశేషము..)

 తిరుమాలిరుంశోలైమలై~41 Part 2 
   
          బ్రహ్మోత్సవ సమయములో చక్రత్తాళ్వా‌న్ మాత్రమే గోపురద్వారమునుండీ వేంచేస్తారు; పెరుమాళ్ళు ప్రక్కనున్న ద్వారమునుంచీ వేంచేస్తారు. మేష‌ పున్నమి నాడు ఏటి ఉత్సవమునకు పెరుమాళ్ళు వేంచేయగా తాయార్లకు కోపమొచ్చిందట! అనువల్ల‌ ఆనాడు మొదలు బ్రహ్మోత్సవము వరకూ స‌న్నిధి ప్రాకారములో ఉన్న ఒక మండపములో వేంచేసి తిరువారాధనను స్వీకరిస్తారు.
పవ్వళింపు మందిరాన తిరుమలనాయకునిచే బహూకరింపబడిన దంతపు
పనితనా‌‌న్ని చూపు పాన్పు ఇప్పటికీ ఉంది. ఆలయానికి 2.5 miles దూరములో కొండమీద నూపురగంగ ఉంది; ఇది సముద్రమట్టానికి 1500 ft ఎత్తులో ఉంది: ఇందులో స్నానము చాలా పవిత్రము.

ఉత్సవాలు: 

 మేషమాసములో పౌర్ణమి నాడు మధురలో ఉన్న‌ వైగై నదిలో ఏటి ఉత్సవము జరుగుతుంది  ~ ‌ కూరత్తళ్వా‌న్ సుందర బాహు స్తవాన్ని‌ స్వామి కి అనుగ్రహించినారు. కర్కాటక మాసములో బ్రహ్మోత్సవము జరుగుతుంది.‌ బస చేయడానికి సత్రాలున్నాయి. సన్నిధిలో ప్రసాదము లభిస్తుంది భక్తులకు. చిత్రోత్సవము,  ఆది ఉత్సవము, తొట్టి ఉత్సవము అక్టోబరులో జరుపుతారు. అళగర్  పెరుమాళ్లను కొండమీద ఉన్న జలపాతములో స్నానాన్ని చేయిస్తారు~ఆ సమయములో చాలామంది భక్తులు ఆ జలపాతములో స్నానాలు చేస్తారు.‌

చూడతగ్గవి: 
1) శ్రీరక్కాయి అమ్మన్ కోయిల్ ~ ఇది జలపాతానికి పైన ఉంది; 

2) హనుమా‌ తీర్థము ~ 1 km దూరములో కొండమీద ఉంది; 

3) గరుడ తీర్థం ~ ఇది కొండకిందినుంచీ 2 miles దూరములో ఉంది;

 4) శ్రీపడినెత్తమ్ పడికరుప్పన్న
స్వామి; 

5) గోపుర ముఖద్వారాలు చందనముతో తయారు చేయబడినవి.‌

పాశురాలు: 

 ఏడు పాశురాలను కింద చెప్పిన ఐదు మంది ఆళ్వార్లు గానము చేసినారిక్కడ: 
నమ్మాళ్వార్లు ~ పెరియవార్లు ~ ఆండాళ్ ~ తిరుమంగై‌ఆళ్వార్లు ~ కూరత్తాళ్వా‌న్:
నమ్మాళ్వార్లు గానము చేసిన పాశురము ~ 2-10-1 ఇది:

కిళర్ ఒళిఇళమై! కెడువదన్ మున్నమ్!
వళరొళిమాయోన్! మరువియకోయిల్!
వళర్ ఇళమ్ పొழிల్ శూழ்! మాలిరుఞ్జోలై!
తళర్వు ఇలరాకిల్! శార్వదు శదిరే!!
ఇంకా 2886;2918:3733  to 3744; 3748;

పెరియాళ్వార్: 71;258;338 to 359; 453 to 462;

ఆణ్డాళ్: 534;587 to 596:

తిరుమంగై ఆళ్వార్: 1032;1114;1329; 1573 to 1634; 1760;1765;1818 to 1837;

కూరత్తాళ్వాన్: 2227;2229; 2235;

పెయాళ్వార్: 2342;
వీరి పాశురాలనూ నాలాయిరమ్‌ లో చూడవచ్చును

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

తిరుక్కోట్టియూర్ ~ 42

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫణిహరం రంగనాత్ )


శ్లో:  శ్రీమద్దేవ సరోజినీ విలసితే గోష్టీపురే ప్రాగ్ముఖ
       స్త్వష్టాంగాఖ్య విమానమధ్య నిలయ నారాయణః
       ఆలింగన్ తిరుమామకళ్ పదయుతాం దేవీంతు నాట్య స్థితిః
       కాదంబేంద్ర బిలోచనాతిథివపు ర్విద్యోతతే సర్వదా

       భక్తిసార మహాయోగి పరకాల గదాంశజైః
       విష్ణుచిత్తేన మునినా మంగళాశాసనైః స్తుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

 తిరుపత్తూర్ నుంచీ 10 kms; మధుర నించీ 70 kms దూరములో ఉంది.‌ దగ్గరలోని రైల్వే ష్టేషన్లు మధుర, కరైకుడి. ఈ క్షేత్రాన్ని తిరుక్కోష్టియూర్ అనీ, తిరుగోష్టియూర్  అనీ, వ్యవహరిస్తారు. హిరణ్యకశిపుని బాధలను తట్టుకోలేక  దేవతలు కదంబమునిని ‌ప్రార్థించగా
ప్రాంతానికి హిరణ్యకశిపుడు రాడు కనుక దేవతలు, మహర్షులూ ఇక్కడ సమావేశాలు జరుపుకోవచ్చని అన్నారు ~ అలాగే ఇక్కడ వారు సమావేశమ
య్యేవారు. అటువంటి సమావేశాలను గోష్టి అని అంటారు. అందుకే ఈ క్షేత్రానికి తిరుగోష్టియూర్  అని పేరొచ్చింది. కదంబమహర్షి ఇక్కడ తపస్సు చేసి మోక్షాన్ని‌ పొందినారు. స్వామిని ఇక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తుండమని అడగ్గా, అలానే నని స్వామివారు ఇక్కడే వెలసినారు. తిరుక్కోష్టి నంబి  శ్రీమద్రామానుజులకు గురువు. అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని ఎన్నోసార్లు అడిగినా వారు చెప్పక, చివరగా చెప్పి, ఎవరికీ దీన్ని చెప్పవద్దని  చెప్పినా, రామానుజులవారు ఆలయగోపురమెక్కి అందరు భక్తులకు ఉపదేశించినారు. గురువుగారు కోప్పడితే, తాను నరకానికి పోయినా పరవాలేదు,  భక్తులందరూ మోక్షా‌న్ని పొందితే తనకు సంతోషమని అన్నారు. గురువుగారు సంతోషపడి రామానుజులకు ఎంబెరుమానార్ అని పిలువసాగినారు.‌ 

మూలవర్లు: 

 సౌమ్యనారాయణన్ స్వామి. ఇక్కడ స్వామివారు మూడు అంతస్తులలో దర్శనమిస్తారు.‌మొదటి అంతస్తును క్షీరాబ్ధి అనీ, స్వామివారు భుజంగశయనునిగా  ఇద్దరు దేవేరులూ తన పాదాల వద్ద కూర్చుని వుంటారు.
రెండవ అంతస్తును ఇంద్రలోకము అనీ, స్వామిని ఉపేంద్రనారాయణ స్వామి‌ అనీ, ఇద్దరు దేవేర్లు ~ ముగ్గురూ నిలుచున్న భంగిమలోనూ, మూడవ అంతస్తును
పరమపదం అనీ స్వామిని పరమపదనాథన్ అనీ ఇద్దరు దేవేర్లతో ఉంటారు.

తాయారు: 

 తిరుమాకల్ నాచ్చియార్.

విమానము: 

అష్టాంగ విమానము.

పుష్కరిణి:

హేమ/దేవ పుష్కరి‌ణి.

గోపురము:

ఐదు అంతస్తులు ~ ఏడు కలశాలున్నాయి.

పాశురాలు:

 మొత్తము 48 పాశురాలను గానము చేసినారు:
నమ్మాళ్వార్లు ~ 10;

పెయ్యళ్వార్లు ~ 1;(2343);

పూదత్తాళ్వార్లు ~ 2;(2227;2268;)

తిరుమణిశై ఆళ్వార్లు ~ 1;(2415);

పెరియాళ్వార్లు ~ 21;(13-22;173; 360-70)

తిరుమంగై ఆళ్వార్లు ~ 13;(1550; 1838-47;2674(225);

పూదత్తాళ్వార్ల పాశురము ~ వారి ఇరండాం తిరునందాది: 87:

ఇన్ఱా! అఱికిన్ఱే నల్లేన్! ఇరునిలత్తై
చ్చైన్ఱాఙ్గళన్ద! తిరువడియై! అన్ఱు
కరుక్కోట్టియుళ్ కిడన్దు! కైతొழுదేన్ కండేన్!

తిరుక్కోట్టియెన్దై! తిఱమ్!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

తిరుమెయ్యమ్~43

(శ్రీహరి ప్రియ గోష్టి)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: Edited by: ఫణిహారం రంగనాత్ )


శ్లో:  రమ్యే మెయ్యపురే కదంబసరసీ సత్యాఖ్య తీర్థాంచితే
       సత్యాద్ర్యాఖ్య విమాన మాప్య పనస క్షోణీరుహాలంకృతే
       దేవస్సత్యగిరి ప్రభుర్విజయతే దేవ్యోయ్యవన్తాళితి
       ప్రాగాస్యో వర సత్యదేవ నయనానన్దః కలిఘ్నః స్థుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

 పుదుక్కోటకు 20 kms, తిరుక్కోష్టియూర్ కు (42/108) 10 kms. దూరములో ఉంది. పుదుక్కోట ~ కరైక్కుడి రైల్వే మార్గములో ఉంది.‌  

మూలవర్లు: 

 సత్యగిరినాథన్  నిలుచున్న భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. 

తాయార్లు: 

 ఉయ్యవ‌డాళ్ తాయారు. ఉజ్జీవనీ తాయారనీ  పేరు.

పుష్కరిణి:

కదంబ / సత్య  పుష్కరి‌‌ణి.

విమానము:

సత్యగిరి విమానము.

స్థల వృక్షము: 

 పనస వృక్షము.

సత్యదేవునికి ప్రత్యక్షమయ్యారు ~ ఇక్కడ శ్రీరంగనాథునివలె పెరియ తిరుమేనితో పవ్వళించిన స్వామి ఉన్నారు. ఈ క్షేత్రాన్ని *సత్యవ్రత క్షేత్రం అనీ అంటారు.  తిరుమెయ్యపు రాజు ఊమైయ్యన్ దాగి ఉండిన ప్రదేశము చూడదగినది.

తిరుమంగై ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన పాశురము వారి పెరియ తిరుమొళి లోని 3-6-9 వ పాశురమిది

నిలైయాళా నిన్ వణఙ్గ! వేణ్డాయేయాకిలుమ్!  ఎన్
ములై యాళ ఒరునాళ్! ఉన్ అగలత్తాల్ ఆళాయే!

శిలైయాళా మరమెయ్ ద తిఱలాళా! తిరుమెయ్య
మలైయాళా! నీయాళ! వళైయాళమాట్టోమే!!

(ఆళ్వార్లు కీర్తించిన పాశురాలను నాలాయిరములో 1206;1524;1660; 1760; 1852; 2016; 2050; 2674(126)
చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

తిరుప్పుల్లాణి~ 44 (ధర్భ శయనము)

(శ్రీహరి ప్రియ గోష్టి)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by:ఫణిహారం రంగనాత్ )


శ్లో: శ్రీపుల్లాణిపురేతు పిప్పలనగ శ్రీచక్రతీర్థాంచితే
కల్యాణాఖ్య విమానమధ్య నిలయః కల్యాణవల్లీ ప్రియః
కల్యాణాఖ్య జగత్ప్రభుర్విజయతే ప్రాగాననో రాజతే
పుల్లారణ్య మహర్షి సేవిత తనుః కీర్త్యః కలిద్వేషిణః

ఎక్కడుందీ క్షేత్రము?

తమిళనాడులోని రామనాథపురానికి  10 kms. దూరములో ఉంది. 
కారైకుడి నుంచీ రామనాథపురానికి బస్సులో పోవచ్చును. రామేశ్వరానికి 70 kms. దూరము లో ఉంది.

Note:
 భక్తులకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు‌ లభించవు.‌

మూలవర్లు:

ఆది జగన్నాథస్వామి
ఆశీన భంగిమలో తూర్పు ము‌ఖంగా చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ చిన్ముద్రలతో తన ఇద్దరు దేవేరులతో దర్శనమిస్తారు.

తాయార్లు: 

కల్యాణవల్లి తాయారు రెండు చేతులలో పూలతో, మరో రెండు చేతులలో అభయ వరద ముద్రలతో ఉంటారు.

విమానము: 

కల్యాణ విమానము.

తీర్థము:   

చక్ర తీర్థము.

గోపురము:  

ఐదు అంతస్తులతో ఐదు కలశాలతో ఉంది.

స్థల వృక్షము:   

అశ్వత్థ వృక్షము.

స్తలపురాణము: 

పుల్లార్ మహర్షి తపస్సు చేస్తే మహా విష్ణువు ప్రత్యక్షమయ్యారు.‌ తన ఇద్దరు దేవేరులతో ఇక్కడే  ఉండమని ప్రార్థించగా ఇక్కడ వెలసినారు.‌ అందుకే ఈ ప్రాంతము పుల్లార్ అరణ్యము అని ప్రసిద్ది. 

శ్రీరాముడు లంకకు పోతూ ఇక్కడ ఆగి సముద్రానికి వారధి కట్టడానికి సహాయము చెయ్యమని‌ ప్రార్థన చేసినాడు పెరుమాళ్ళను.

మరొక కథనము ప్రకారము, దేవార్షి మహర్షి ఒకనాడు పుష్కరిణిలో స్నానము చేయడానికి పోతే, అక్కడ ఏడు మంది దేవకన్యలు ఆ పుష్కరిణిలో స్నానాలాడుతూ మహర్షిని  చూచినా వారు అలా జలకాలాడుతూనే ఉన్నారు.‌ మహర్షికి‌ కోపమొచ్చి వారిని మానవ కన్యలుగా ఉండమని శపించినారు.‌ వారు శాపవిమోచనమడగగా 
పుల్లార్ మహర్షి శాప విమోచనమిస్తారని చెప్పి,  కొంతకాలానికి శ్రీరాముడు అక్కడికి వస్తాడనీ  ఆయన పాదాలను తాకితే శాప‌విమోచనమవుతుందని సెలవిచ్చినాడు. వారందరూ అలా శ్రీరాముని శరణువేడగా వారు తిరిగి దేవకన్యలయ్యారట.

మరొక విషయమేమిటంటే ఇక్కడే విభీషణుడు శ్రీరాముణ్ణి  శరణుజొచ్చినాడు.  అందువల్ల ఈ క్షేత్రానికి శరణాగతి క్షేత్రము అని‌ వ్యవహరిస్తారు.

ఈ క్షేేత్రానికి దగ్గరలో రామేశ్వరము, ధనుష్కోటి ఉన్నాయి.‌ ఈ సన్నిధిలో ఉన్న అశ్వత్థ వృక్షము క్రింద నాగ ప్రతిష్ట వేసిన వారికి సంతానము కలుగుతుందని ఇక్కడి వారి విశ్వాసము. పెరుమాళ్ళకు ఆరగింపు చేసిన పాయసాన్ని తప్పక‌‌ స్వీకరించాలి.

ఉత్సవాలు: 

ప్రతి సంవత్సరమూ చిత్తిరై మాసములో బ్రహ్మో‌త్సవాలు  నిర్వహిస్తారు పది రోజులపాటు.

పుల్లార్ మహర్షికి పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారు

తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామికి మంగళాశాసనాలు చేసినారు.‌  వారి పాశురాలు నాలాయిరములో 1768-87; 2674(131) లో ఉన్నాయి.


విల్లాల్  ఇలంగైమలఙ్గ! చ్చరంతురన్ద!
వల్లాళన్ పిన్ పోన! నెఞ్జంవరుమళవుమ్!
ఎల్లారుం ఎన్దన్నై! ఏశిలుంపేశిడినుం!
పుల్లాణిఎమ్బెరుమాన్! పొయ్ కేట్టిరున్దేనే!!


కనైయార్ ఇడి కురలిన్! కార్ మణియిన్ నావాడల్!
తినైయేనుమ్ నిల్లాదు! తీయిల్  కొడిదాలో!
పునైయార్ మణిమాడ! ప్పుల్లాణి  కైతొழுదేన్!
వినైయేన్ మేల్ వేలైయుమ్! వెన్దழలే వీశుమే!!


వేదముమ్ వేళ్వియుమ్! విణ్ణుమ్ ఇరుశుడరుమ్!
ఆదియుమానాన్! అరుళ్ తన్దవానమక్కు!
పోద అలరుమ్ పున్నై శూழ்! పుల్లాణికైతొழுదేన్!
ఓదముమ్ నానుమ్! ఉఱఙ్గాదిరున్దేనే!!

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్)

తిరుత్తంగాల్ ~ 45 (తిరుత్తంగాలూర్) 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: Edited by: ఫణిహారం రంగనాత్ )


శ్లో: దివ్యే పాప వినాశ తీర్థ రుచిరే తన్ గాల్ పురే ప్రాంగ్ముఖః
శ్రీమానప్పనితి ప్రియామనుభవన్ ఆనందనామ్నీం స్థితః
దేవీభిస్తు దిశా సమాన గణనాభిర్దేవ చంద్రాలయః
శ్రీమద్వల్లభదేవ ససేవిత వపూరేజే కలిఘ్నుస్తుతః



ఎక్కడుందీ క్షేత్రము?

శివకాశి నుండి 5 kms, శ్రీవిల్లిపుత్తూర్  నుండి 25 kms, విరుదునగర్ నుండి 24 kms, తిరునల్వేలి నుండి 93 kms, మధుర నుండి 74 kms. దూరములో ఉందీ క్షేత్రము. విరుదునగర్, రైల్వే మార్గములో ఉంది.
భక్తులు సకల సదుపాయాలున్న శివకాశిలో బస చేయడము మంచిది.‌ తిరుత్తంగాల్ లో రామానుజ కూటముంది.

స్థల పురాణము:

 శ్రీ అంటే లక్ష్మీదేవి; తంగాల్ అంటే ప్రదేశము. ఇక్కడ లక్ష్మీదేవి మహావిష్ణువును గురించి తపస్సు చేసింది.  విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు, లక్ష్మి, భూదేవి, నీళాదేవికీ ఒక సమస్య  ఆ ముగ్గురిలో ఎవరు గొప్ప అని. లక్ష్మి నేనే గొప్ప అనీ, అందుకే స్వామికి శ్రీపతి అనే పేరొచ్చిందని చెప్పింది.
భూదేవి ఇలా అన్నది. నేను ఈ భూమండలాన్ని మోస్తున్నాననీ, సకల జీవులకూ  ఆహారము, నీరు వగైరా ఇస్తున్నాననీ  అందుకు తానే గొప్ప అనీ అన్నది. ఇక నీళాదేవి అన్నది  నేను నీటికి అధిష్టాన దేవత అనీ, ఆ నీరు లేకపోతే  ఈ భూప్రపంచములో  ఎవరూ బ్రతకలేరనీ అందుకే తానే గొప్ప అని అన్నది. లక్ష్మికి కోపమొచ్చి తపస్సు చేయగా విష్ణువు ముగ్గురిలోనూ  లక్ష్మీ నే గొప్పదని చెప్పగా
భూదేవి,  నీళాదేవి సరేనని ఒప్పుకున్నారు. వారు ప్రార్థించగా స్వామి ఇక్కడ‌ 
ఆ ముగ్గురు దేవేర్లతో వెలసినారు.

మరొక కథనము ప్రకారము, బాణాసురుని కూతురు ఉష కు  శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్దుడికీ ఇక్కడ వివాహము జరిగింది. 

ఈ క్షేత్రము తంగమలై కొండ మీద ఉంది.

మూలవర్లు:

 నిన్రనారాయణ స్వామి/ అప్పన్ / తణ్ గాలప్పన్ అనీ పేర్లు.‌ చతుర్భుజాలతో శంఖు చక్ర వరద కటి హస్తాలతో నిలుచున్న భంగిమలో తూర్పు ముఖంగా ఉంటారు.

తాయారు:
 
అన్న నాయకి, అనంత నాయకి, అమృత‌నాయకి, జాంబవతి  అని నలుగురు దర్శనమిస్తారు. అర్జున, విశ్వకర్మ, గరుడ, మార్కండేయన్  స్వామికి కుడి వైపునా, ఎడమ వైపున ఉష, అనిరుద్ద,  భృఘుమహర్షి ఉన్నారు. విడిగా ఒక సన్నిధి ఉంది శెంగమలాదేవికి. మామూలుగా తాయార్లు కూర్చునే ఉంటారు; కానీ ఇక్కడ ఆమె నిలుచుని రెండు చేతులతోనే అభయ ముద్రను ఒక చేతితో, మరో చేతితో తన పాదాలను చూపుతూ ఉంటుంది. ఆమెను అన్న నాయకి అని అంటారు.

తీర్థము:

 పాపవినాశ తీర్థము. ఇందులో లక్ష్మీదేవి తపస్సు చేసినపుడు స్నానాలు చేసేదని కథనము. ఇది కాక భాస్కర, సంగ, పద్మ తీర్థాలున్నాయి.

విమానము: 

దేవచంద్ర విమానము.

పెరుమాళ్ళ సన్నిధికెదురుగా గరుడాళ్వార్ చతుర్భుజాలతో ఒక చేత్తో అమృతకలశాన్ని~ మరొక చేత్తో ఒక సర్పాన్ని ~  రెండు చేతులతో నమస్కార భంగిమలో ఉన్నారు.

ఉత్సవాలు: 

ఆణి మాసములో పది రోజులపాటూ బ్రహ్మత్సవాలు. చైత్రములో వసంతోత్సవము జరుగుతాయి . ఈ పెరుమాళ్ళని సేవిస్తే పునర్జన్మ ఉండదని కథనము. 

తిరుమంగై ఆళ్వారు ~ భూతద్ ఆళ్వారు(2251) ఇక్కడ పాశురలను గానము చేసినారు. తిరుమంగై ఆళ్వార్లు కొన్ని మంగళాశాసన పాశురాలను గానము చేసినవాటిని నాలాయిరములో 1399, 2068, 2673, 2674 చూడవచ్చు. వారి పెరియ తిరుమొళి లో 5-6-2 లోనిది ఇది:

పేరానై! కురుఙ్గుడి యెంబెరు మానై! తిరుత్తణ్గాల్!

ఊరానై! క్కరమ్బనూరుత్తమనై! ముత్తిలఙ్గు
కారార్ తిణ్ కడలేழுమ్! మలైయేழ் ఇవ్వులగేழுణ్డుమ్!

ఆరాదెన్ఱు ఇరున్దానై! క్కణ్డతు తెన్నరఙ్గత్తే!!

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్)


తిరుమోగూర్ 46
 

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: Edited by: ఫణిహారం రంగనాత్ )


శ్లో: మోకూర్ నామ్నిపురే పయోబ్ధి సరసీ సంశోభితే ప్రాంగ్ముఖః
స్థాయీ మేఘలతా పరిష్కృ వైపు శ్శ్రీకాళమేఘ‌ప్రభుః
శ్రీమత్కేతక దేవయాన వసతి ర్విద్యోతతే పద్మభూ
రుద్రేంద్రాదిమ సేవితః కలిజితః పాత్రం శఠారేస్ప్తుతేః

ఎక్కడుందీ క్షేత్రము?

మధురకు 10 kms, తిరుప్పరకుండ్రమ్ కు 18 kms, పలముదిర్ శోలై కు 22 kms,  శ్రీరంగానికి 120 kms.దూరములో ఉంది. భక్తులు మధురలోనే బస చేసి ఆలయాన్ని దర్శించవచ్చు  మధురనుండీ టౌను బస్సులుంటాయి‌.  మధుర నుండీ మేలూర్ కు పోయే బస్సులో ఒత్తక్కరై అను చోట దిగి అక్కడినుండీ నడిచిగానీ లేక తిరువాదపూర్ పోయే బస్సులో 1-1/2 kms నడిచి పోవచ్చును. ఈ స్థలాన్ని మోహనపురము అని కూడా పిలుస్తారు.

మూలవర్లు:

కాలమేఘస్వామి  చతుర్భుజాలతో  శంఖు చక్ర గద వరద ముద్రలతో తూర్పు దిశగా నిలుచున్న భంగిమలో  ఇరువైపులా ఇద్దరు దేవేర్లతో ఉంటారు.

తాయారు:

 మోహనవల్లి చతుర్భుజాలతో  పూలు అభయ వరద ముద్రలతో  మరొక సన్నిధిలో ఉంటారు.‌
తిరుమోగూర్ తాయార్
అని  కూడా అంటారు.

తీర్థము:

 క్షీరాబ్ధి తీర్థము.

విమానము:

కేతకీ విమానము.

బ్రహ్మకూ రుద్రునికీ ఇంద్రునికీ ప్రత్యక్షమయ్యారు.
ఇక్కడ ఒక సన్నిధిలో సుదర్శనాళ్వారులు షోడశ (16) హస్తాలలో (16) ఆయుధాలను ధరించి, ఎప్పుడైనా భక్తులను రక్షించడానికి  తయారుగా ఉన్నట్లుగా walking భంగిమలో ఉంటారు. ఆ మూర్తి వెనుకవైపున యోగ నరసింహస్వామివారు నాలుగు చేతుల్లో నాలుగు చక్రాలను పట్టుకుని ఉంటారు.

స్థలపురాణము:

 క్షీరసాగర మధనములో అమృత పాత్రను పట్టుకుని  విష్ణువు మోహినీ అవతారములో నీలమేఘరంగులో వచ్చారు కనుక పెరుమాళ్ళకు కాలమేఘ స్వామి అని పేరు వచ్చింది.

గోపురము: 

ఐదంతస్తులు ఐదు కలశాలతో ఉంది.

ఇక్కడి మహామండపానికి స్తంభ మండపమని పేరు.  భక్తులు సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరాములనూ, రతీ మన్మధ విగ్రహలను చూడవచ్చును. గరుడాళ్వార్ల మండపము  ఉంది‌. దక్షిణాన మహావిష్ణువు శయన భంగిమలో స్వామి పాదాల వద్ద ఇద్దరు దేవేర్లతో చూడవచ్చును. ఇంతే కాక, భక్తులు స్వామివారి ఏడు భంగిమలలో  భోగ, వీర, స్థల, ఆనంద, బాల, ఉత్సవర్, ప్రధాన శయన భంగిమలలో చూడవచ్చును.

ఉత్సవాలు:

 వైశాఖములో పదిరోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఏడవ శతాబ్దములో ఈ ఆలయాన్ని కట్టించినారు. 1259 లో‌ సుందర‌పాండ్య రాజు అభివృద్ది చేసినారు.

పాశురాలు:

 తిరుమంగై ఆళ్వార్లు 2(2673+74)
 నమ్మాళ్వార్లు 11(3667 to 3677) పాశురాలను గానము చేసినారు. నమ్మాళ్వార్ల పాశురము,  10-1-1  ఇది:

తాళతామరై! తడమ్ అణి వయల్   తిరుమోగూర్!

నాళుమేవి నన్గమర్ న్దు నిన్ఱు! అశురరైత్త గర్కుమ్!

తోళునాన్గుడై! చ్చురికుழళ్ కమలక్కణ్ కనివాయ్!

కాళమేగత్తై అన్ఱి! మర్ట్రొన్ఱిలమ్ కతియే!!

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్)


 తెన్ మధురై 47

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: : & Edited by: ఫణిహారం రంగనాత్ )


శ్లో: శ్రీమద్దేమ సరోవరేణ కలితే చక్రాఖ్య తీర్థాంచితే
      శ్రీమత్యై మధురాపురే సురదిశా వక్త్రాసనాలంకృతః
      దేవ్యా సుందర నాయకో వకులయా త్వష్టాంగ వైమానగః
      దృష్ట శ్శౌనక భార్గవాది మునిభిర్భక్తార్థ ముజ్జృంభతే

     భక్తిసార కలిఘ్నాభ్యాం విష్ణుచిత్త మహర్షిణా
     నీళయాపి చ తత్పుత్ర్యా మంగళావాసిత స్సదా

ఎక్కడుందీ క్షేత్రము? 

 ఈ క్షేత్రము మధుర పట్టణములోనే ఉంది. మధుర మీనాక్షి దేవాలయానికి 1-1/2 kms. దూరములో ఉంది. తిరుమోగూర్ (46/108) నుండీ 10 kms., తిరుమాలిరుం శోలైమలై (41/108) నుండీ 20 kms. దూరములో ఉంది.  ఈ క్షేత్రానికి దక్షిణ తిరుపతి  అనీ, వనగిరి అనీ పేర్లు ~ పూర్వకాలములో  మహర్షులందరూ ఇక్కడ సమవేశమయ్యారు మీనాక్షీ‌  సుందరేశ్వరుల కల్యాణానాన్ని  తిలకించడానికి. తమిళములో కూడల్ అంటే సమావేశ ప్రదేశము అని అర్థము. అందుకే ఇక్కడి పెరుమాళ్ళకు కూడళ్ అళగర్ అ‌ని తిరునామము. అప్పుడు శ్రీమహావిష్ణువు మీనాక్షిని సుందరేశ్వరునికి ఇచ్చి కల్యాణము చేయడాన్ని తిలకించడానికి వచ్చినారు. అందుకే ఈ పెరుమాళ్ళకు కూడల్ అళగర్ అని తిరునామము.

మూలవర్లు: 

 కూడల్ అళగర్ అని పేరు; సౌందర రాజన్ అని  ఒక పేరుంది. క్రింది అంతస్తులో ఆశీన భంగిమలో సూర్యనారాయణలాగా ఉషా చాయా దేవేరులతోనూ 

 రెండో అంతస్తులో నిలుచున్న భంగిమలో 

 మూడవ అంతస్తులో ఆదిశేషునిమీద శయన భంగిమలో చతుర్భుజాలతో శంఖు చక్ర అభయ ముద్రలతోనూ ~ నాలుగవ చేతిని తన పాదాలను శరణాగతి చేయమని చూపిస్తూ ఉంటారు‌.

తాయార్లు: 

 స్వామివారు ఇరువురు దేవేర్లతో (శ్రీదేవి~భూదేవి) ఉన్నారు.
మధురవల్లి ~ వకుళవల్లి ~ మరకతవల్లి ~ వరగుణవల్లి అని పేర్లు.

పుష్కరిణి:

హేమ పుష్కరిణి ~ చక్ర తీర్థము.

గోపురము: 

 ఐదు అంతస్తులు ~ ఏడు కలశాలతో ఉంది.  మూడు అంతస్తులతో అష్టాంగ విమానముంది.

ఉత్సవాలు: 

 వృషభమాసములో (వైయాశి)  అనూరాధా నక్షత్రములో తీర్తోత్సవము~ బ్రహ్మోత్సవాలు పది రోజులు జరుగుతాయి. ఫంగుణిలో తిరుక్కళ్యాణము~ తమిళ మాశి నెలలో తెప్పోత్సవము నిర్వహిస్తారు.

స్థల పురాణము: 

 స్వామి వామనావతాములో  బ్రహ్మ స్వామి పాదాలను కడిగినప్పుడు ఆయన కమండలములోని నీరు‌‌ క్రింద‌ పడగా,  ఆ నీరు కిిరుతమలై నదిగా మారి ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలముగావించగా  ఈ ప్రాంతానికి కదళీవనము అని పేరొచ్చింది. శ్రీహరి మీనాక్షి  కల్యాణానికి వచ్చినపుడు మహర్షులందరూ స్వామిని ఇక్కడే వెలసివుండమని అడగ్గా సరే‌నని ఈ క్షేత్రములో భక్తుల సేవలందుకుంటున్నారు.

ఈ నగరానికి మదురై అన్న పేరు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 
ఈ నగాన్ని మదురై, నాలు మాడ కూడలి, కూడఒల్ నగర్, తిరువలవై, ఆలవై అని పలు విధములుగా పిలువబడింది. 
మదురై అన్న పేరు రావడానికి కారణంగా చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మదురై అంటే తమిళంలో తీయనిది అని అర్ధం. 
మరొక కథనాన్ని అనుసరించి మారుతము అనే మాట మదురగా మారిందని అభిప్రాయపడుతున్నారు. 
వైగై నదీతీరాన ఉన్న వృక్షముల నుండి వచ్చే మనసును పరవశింపజేసే మారుతం కారణంగా సంగకాలంలో ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.
 
💠 మరొక పురాణంలో పరమశివుడు ఈ నగరాన్ని ఆశీర్వదించి  దివ్య మకరందాన్ని కురిపించాడని సంస్కృతంలో మకరందానికి మధువు అన్న పేరు ఉన్న కారణంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.

💠 నవగ్రహ మందిరం సాధారణంగా శైవ దేవాలయాలలో మాత్రమే కనిపిస్తుంది . వైష్ణవ దేవాలయాలలో, నవగ్రహాలకు బదులుగా, చక్రధర్వర్ మందిరం  ఉంటుంది. వైష్ణవ మతం ఉన్న ఈ ఆలయంలో నవగ్రహాలకు ఒక మందిరం ఉంది. దశావతార నినాదం మొత్తం తొమ్మిది గ్రహాలను ఆరాధించే మార్గం .

శ్రీ రామావతరం - సూర్యుడు.
శ్రీ కృష్ణవతరం - చంద్రుడు
శ్రీ నరసింహవతరం - మంగళవారం
శ్రీ కల్కియవతరం - బుధవారం
శ్రీ వామనవతరం - గురు
శ్రీ పరశురామావతరం - సుక్రాన్
శ్రీ కుర్మవతరం - శని.
శ్రీ మచవతరం - కేతు
శ్రీ వరాగవతారం - రాహు
శ్రీ బలరామావతరం - కులిగాన్
అంటే, పెరుమాల్ అవతారాలు గ్రహాలకు సంబంధించినవిగా చెబుతారు.

💠 మదురై మరియు తిరునెల్వేలి పరిసరాల్లో పద్దెనిమిది శ్రీ వైష్ణవ దేవాలయాల సమూహం ఉన్నాయి. 
ఈ దివ్య దేశాలలో ప్రసిద్ధ నవ తిరుపతి దేవాలయాలు కూడా లెక్కించబడ్డాయి. .

💠 కూడల్ అలగర్ ఆలయం" గా పూజించబడిన తిరుక్కూడాల్ దివ్యదేసము మదురై పట్టణం నడిబొడ్డున ఉంది మరియు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి చాలా దగ్గరగా ఉంది, ఈ మూడు అంచెల ఆలయంలో, సర్వశక్తిమంతుడు తన మూడు భంగిమలలోనూ ఆశీర్వదిస్తున్నాడు. 

తొలి అంచులో అతను అభయ హస్తం ముద్రతో, 
కింది అంతస్తులో కూర్చునే భంగిమలో “కూడల్ అజగర్” గా ఆశీర్వదిస్తున్నాడు, 
మరియు తదుపరి దశలో  శ్రీ రంగనాథ స్వామివలె  శయన భంగిమలో ఆశీర్వదిస్తున్నాడు.

ఈ క్షేత్రానికి ఒక విశేషముంది. మధుర పాండ్యరాజు సభలో విష్ణు పరతత్వ నిర్ణయాన్ని గావించి విజయులైన పెరియాళ్వార్లకు పెరుమాళ్ళు గరుడవాహనారూడుడై సాక్షాత్కరించగా, విష్ణుచిత్తులవారు  12 పాశురాలతో తిరుప్పల్లాండు పాడిన ప్రదేశమిది.

      ఈ సన్నిధికి మూడు ప్రాకారాలున్నాయి. రెండవ ప్రాకారములో నవగ్రహాలను  ప్రతిష్టించినారు. మూడవ ప్రాకారములో తాయార్ ఆండాళ్  మణవాళమామునుల సన్నిధులున్నాయి. సన్నిధిలో భక్తులకు ప్రసాదము లభించును‌. రామానుజ కూటమున్నదిక్కడ. ఈ పట్టణానికి ప్రక్కనే వైఘా నది ప్రవహిస్తుంది. ఈ పట్టణము చారిత్రాత్మికంగానూ, శిల్పనైపుణ్యంగానూ, విద్యాపరజ్ఞానముగానూ పేరుగాంచినది.‌ 12 వ శతాబ్దమువరకూ పాండ్య చోళ రాజులు పరిపాలించినారు. 14 వ శతాబ్దము నుంచీ మహమ్మదీయులు  ఆ తరువాత విజయ నగర రాజులు మహమ్మదీయులను పారద్రోలి పరిపాలించినారు.


 పాశురాలు: 

తిరుమంగై ఆళ్వార్లు, ఆండాళ్ తల్లి, తిరుమళిశై ఆళ్వార్లు చెరి ఒక పాశురాన్ని ~ పాడినారు పెరుమాళ్ళకు మంగళాశాసనాలు చేస్తూ గానము చేసినారు.

వారు  కీర్తించిన పాశురాలను నాలాయిరమ్ లో 2420(తిరుమళిశై ఆళ్వార్); 1762 ~ తిరుమంగై ఆళ్వార్) లను చూడవచ్చును.

తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళిలోని 9-2-5 పాశురమిది‌.

కోழிయుమ్ కూడలుమ్ కోయిల్ కొణ్డ! కోవలరే యొప్పర్!  కున్ఱమన్న
పాழிయమ్ తోళుమ్ ఓర్ నాన్గుడైయర్! పణ్డు ఇవర్ తమ్మైయుమ్ కణ్డరియోమ్!

వాழிయరో ఇవర్ వణ్ణమెణ్ణిల్! మాకడల్ పోన్ఱుళర్ కైయిల్ వెయ్య!

ఆழிయొన్ఱేన్ది ఓర్ శఙ్గుపట్ట్రి! అచ్చో ఒరువర్ అழగియవా!!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశము 48

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
( పి.యల్.నరసింహాచార్య దాసన్: & Edited by ఫణిహారం రంగనాథ్)


     గోదమ్మ తల్లి ఆవిర్భవించిన ఈ దివ్యదేశ వివరాలను తెలుసుకుందామా?

శ్లో: దివ్యే ముక్కళ తీర్థసుందరతటే శ్రీవిల్లిపుత్తూర్ పురే
      శ్రీమత్సంశన దేవయాన నిలయః  ప్రాచీముఖ స్సంస్థితః
      భాతి శ్రీవటపత్రశాయి భగవా‌న్ శ్రీగోదయా సంస్తుతః
      శ్రీ మద్విష్ణుహృదా ప్రశస్య విభవో మండూక యోగీక్షితః

      ఈ దివ్యదేశము మధురై నుంచీ దాదాపు 65 kms దూరములో ఉంది( శివకాశి మీదుగా ప్రయా‌ణిస్తే). 
భక్తులకు అవసరమైన వసతి భోజన సదుపాయాలున్నాయి ఇక్కడ!!

20 kms దూరములో కాట్టళగర్ సన్నిధి ఉంది‌. 5 kms దూరములో శ్రీనివాసన్ సన్నిధి ఉంది. శ్రీవిల్లిపుత్తూర్ కి 24 kms దూరములో ఉన్న తిరుత్తణ్ గాల్  దివ్యదేశాన్ని కూడా దర్శించవచ్చు.

మూలవర్లు: 

 వటపత్రశాయి ఆదిశేషునిమీద శయన భంగిమలోనూ, రంగమన్నారు స్థానక భంగిమలోనూ, ఇరువురు తూర్పు ముఖంగా దర్శనమిస్తారు.

తాయారు: 

ఆండాళ్ తాయారు.

ఉత్సవర్లు: 

 వటపత్రశాయి స్థానక భంగిమలో శంఖ చక్రాలు రెండు హస్తాలలో వరద హస్తము ఒక చేతిలో మరొక చేతిలో గదతో, ఉభయనాచ్చియార్ సమేతుడై  దర్శనమిస్తారు‌.

మరొక సన్నిధి ఆండాళ్ రంగమన్నార్ సన్నిధి, దీన్ని నాచ్చియార్ తిరుమాళిగై అని అంటారు. శ్రీరంగమన్నార్ నిలుచున్న భంగిమలో  తన కుడివైపు ఆండాళ్, తన‌ ఎడమవైపున గరుడాళ్వార్ తో ఒకే పీఠం(ఏకాసనము) మీద తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. ఆణ్డాళ్ ప్రార్థనమేరకు శ్రీరంగనాథుని గోపావరూపాన రంగమన్నార్ గా త్వరితగతిని వేంచేపు చేసుకునివచ్చిన గరుడాழ்వార్ కు ఆణ్డాళ్ చేసిన మర్యాద ఇక్కడి ఏకాసనం  ఈ సన్నిధి పెరియాழ்వార్ల సన్నిధి ప్రక్కనే పెరియాழ்వార్ల నందనవనం వద్ద ఉంది.

పుష్కరిణి: 

ముక్కళ తీర్థము.

 విమానము: 

 సంశన విమానము.

మండూక మహర్షికి ప్రత్యక్షమయ్యారు.

స్థలపురాణము: 

విల్లి, పుత్తర్ అని ఇద్దరు కిరాత రాజులచే కట్టబడుటచే శ్రీవిల్లిపుత్తూర్ అని పేరు వచ్చింది. వీరికి పెరుమాళ్ ఒక పుట్టలో దొరికారు. అందుచేత అక్కడే ఆలయాన్ని కట్టించారు. ఇది పెరియాళ్వార్ (విష్ణుచిత్తుడు) జన్మస్థలము.
వారు ఇప్పుడు నడుస్తున్న కలియుగములో 47 వ సంవత్సరములో క్రోధన నామ మిథున (ఆ‌ణి) మాస శుక్ల ఏకాదశి స్వాతి నక్షత్రాన రవివారము నాడు జన్మించినారు. ఆండాళ్ అమ్మవారు 93 వ సంవత్సరములో నల నామ సంవత్సరము కర్కాటక మాసము(ఆడి మాసము)చతుర్థి, మంగళవారము పూర్వఫల్గుణి నక్షత్రము నాడు  తులసి వనములోని ఒక తులసి పాదులో  విష్ణుచిత్తులవారికి దొరికింది; ఆ పాపకు  కోదై అని నామకరణము చేసి పెంచి పెద్ద చేసినారు‌. కోదై కి  తండ్రి రోజూ విష్ణువు కథలను వివరిస్తూ తులసి మాలలు కట్టేవారు.    రోజూ ఆ తులసీ మాలను కోదై తాను ధరించి అక్కడ ఉన్న బావినీటిలో తన ప్రతిబింబాన్ని చూచి మురిసి ఆ మాలను తన తండ్రి ఆలయానికి  తీసుకుపోయే బుట్టలో ఉంచేది.  ఒక రోజు తులసీ మాలను స్వామికి సమర్పించబోగా అందులో ఒక వెండ్రుక కనపడింది‌.
 ఈ అపరాధానికి విష్ణుచిత్తులవారు చాలా మధనపడుతూ ఉంటే, ఆ రాత్రి కలలో స్వామి వారికి కనపడి గోద ధరించి ఇచ్చిన మాలనే తాను ఇష్టపడుతాననీ ఆ మాలలనే తనకు సమర్పించాల‌ని చెప్పినారు. గోదమ్మ‌ శ్రీమన్నారాయణునే వివాహమాడుతానని తండ్రితో చెప్పింది. మనము మానవమాత్రులము ~ పరమాత్మతో ఎలా వివాహము చేసుకోవడము? ~ అలా వీలు కాదు ~ అని చెప్పినా వినక ఇంతకు ముందు ఎవరైనా అలాగా పెరుమాళ్ ను వివాహమాడారా? అని తెలుసుకున్న  గోద,  గోపికలు కృష్ణుని పతిగా కోరి కాత్యాయినీ వ్రతాన్ని నెలరోజులు ఆచరించారని తెలుసుకున్నదై తన తోటి స్నేహితులతో ద్వాపరములో గోపికలెలా ఆ గోపాలుణ్ణి కోరి వ్రతాన్ని చేసినారో అలానే మార్గశీర్ష స్నానవ్రతము ఆచరించింది. అయితే గోపికలు కృష్ణుని కోరి కాత్యాయినిని పూజించారు. గోద మాత్రం అన్యదేవతా సమాశ్రయణం చేయక  నారాయణుని చేరడానికి నారాయణుడే మార్గమని నిష్కర్ష చేసి నారాయణనే నమక్కే పఱైతఱువాన్ అని చెప్పింది.  వ్రతము ముగిసిన తరువాత  స్వామివారు కలలో కనపడి గోదాదేవిని తాను వివాహమాడుతానని పెరియాళ్వార్లకు చెప్పినారు. వారిద్దరి వివాహము ఫంగుణి ఉత్తిరమ్ నాడు జరిగింది.  వివాహము కొంత ఆలస్యమవుతూంటే  నాచ్చియార్ తిరుమొழி రచించి స్వామికి 108 గంగాళాల చక్కెరపొంగలిని‌, వెన్ననూ నివేదిస్తానని స్వామిని ప్రార్థించింది ఆండాళ్ తల్లి. 
 కానీ వివాహమయిన తరువాత స్వామి తిరుమేనిలో ఐక్యమవడముతో చేయలేక పోయింది. శ్రీమద్రామా‌నుజులు ఈ విషయాన్ని తెలుసుకొ‌ని‌ 108 గంగాళాల నైవేద్యాన్ని ఆండాళ్ తరఫున సమర్పించినారు స్వామికి. అందుకే వారిని ఎన్ కోయిల్ అణ్ణన్  అని ఆండాళ్ తల్లి పిలిచి స్వాగతించింది. అప్పటినుంచీ రామానుజులవారిని కోయిల్ అణ్ణార్ అని పిలిచేవారు.

మిధున మాస ఉత్సవములో ఐదవ రోజు ఉదయము రంగమన్నార్,  వటపత్రశాయి, కాట్టళగర్, శ్రీనివాసన్, తణ్ గాలప్పన్ వేంచేయగా పెరియాళ్వార్లు మంగళాశాసనాన్ని చేస్తారు. నాటి రాత్రి ఆండాళ్ హంసవాహనారూఢులై పెరుమాళ్ళు అందరు గరుడవాహనముపై వేంచేయుట సేవింపదగినది. పంగుణి ఉత్తర నక్షత్రమున ఆండాళ్ రంగమన్నార్ ల తిరుక్కల్యాణాన్ని నిర్వహిస్తారు.                   వటపత్రశాయి సన్నిధిలో ఆదిశేషన్, నాభికమలమున బ్రహ్మ, తిరువడివద్ద శ్రీదేవి, భూదేవి ఉంటారు.
ప్రతినిత్యమూ ఇక్కడ పెరియాழ்వార్ కు తిరుమంజనము జరుగుతుంది. ‌ఆ తరువాత పెరియాழ்వార్ పెరుమాళ్ళకు మంగళాశాసనాన్ని చేస్తారు. శ్రీరంగములో వలె ఇక్కడ కూడా అరయర్ సేవ ఉంటుంది. స్వామి విషయమై శ్రీపరాశరభట్టర్ వారు గోదా చతుశ్లోకీ శ్రీవేదాంత దేశికుల వారు గోదాస్తుతి అనుగ్రహించియున్నారు. 

        పెరియాழ்వార్,  ఆండాళ్ ఈ దివ్యదేశమునకు మంగళాశాసనము చేసినారు.

మిన్ననైయ నుణ్ ఇడైయార్! విరికుழల్ మేల్ నుழைన్ద వణ్డు
ఇన్ ఇశైక్కుమ్ విల్లిపుత్తూర్! ఇనిదుఅమర్ న్దాయ్! ఉన్నైక్కణ్డార్
ఎన్న నోన్బు నోற்றாళ్ కొలో! ఇవనై పెற்ற వయిఱ్ ఉడైయాళ్
ఎన్నుమ్ వార్తై ఎయ్ దువిత్త!  ఇరుడీకేశా! ములై ఉణాయే!!

(పెరియాழ்వార్ తిరుమొழி  2-2-6)
(వీరి పాశురాన్ని నాలాయిరమ్ లో 133 లో చూడవచ్చును

మెన్నడై అన్నమ్ పరన్దు విళైయాడుమ్! విల్లి పుత్తూర్ ఉఱైవాన్  తన్!

పొన్నడి కాణ్బదోర్ ఆశైయినాల్!  ఎన్ పొరుకయల్ కణ్ ఇణై తుఞ్జా!

ఇన్నడిశిలొడు పాలముదూట్టి! ఎడుత్తు ఎన్ కోలక్కిళియై!

ఉన్నొడు తోழమైక్కొళ్ళువన్ కుయిలే! ఉలగు అళన్దాన్ వరక్కూవాయ్!!

 (ఆండాళ్ - నాచ్చియార్ తిరుమొழி ~ 5-5)
(ఆండాళ్ పాశురాన్ని నాలాయిరమ్ లో 549 లో చూడవచ్చును

(ఆండాళ్ తిరువడి గళే శరణం)


 వైష్ణవ దివ్య దేశాలు ~ ఆళ్వార్ తిరునగరి దివ్యక్షేత్రము~ 49/108



(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫణిహారం రంగనాత్ )


 తామ్రపర్ణి నదికి పుష్కరాలొస్తాయి 12 సంవత్సరాలకొకసారి ~ ఆ నదీ తీరములో 
నవ తిరుపరుతులు అని తొమ్మిది వైష్ణవ దివ్య దేశాలున్నాయి. ఈ క్షేత్రాల‌ గురించి కొన్ని విషయాలను నేను వాటిని దర్శించినపుడు అక్కడి అర్చకుడు నాకు వివరించిన వివరాలను మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు తిరుక్కురుగూరు లేదా ఆళ్వార్ తిరునగరి గురించి తెలుసుకుందాము.

 ఆళ్వార్ తిరునగరి దివ్య క్షేత్రము:49

శ్లోకము: *భాతి శ్రీ కురుకాపురే పురవరే శ్రీ తామ్రపర్ణీ నదీ
             తీరస్థే సురదిఙ్ముఖ స్థితిరసౌ గోవింద వైమానగః
             దేవ్యా సంతత మాదినాధలతయా యుక్త శ్శఠ ద్వేషిణాం
             దృష్టస్తత్వ్యవ లోలుపో నవరతం దేవాధినాథ ప్రభుః

ఎక్కడుందీ క్షేత్రము?:

        తిరునల్వేలి ~ తిరుచ్చందూర్  రైలు మార్గములో ఆళ్వార్ తిరునగరి  స్టేషన్ శ్రీ వైకుంఠ స్టేషన్ నుంచీ 5 kms. తామ్రపర్ణీ నదీ తీరములో నమ్మాళ్వార్ల జన్మ స్థలమైన  అప్పన్ కోయిల్ కు ఒక కిలోమీటరు దూరములో ఉంది. దీనిని ఉరైకోయిల్ (సర్వేశ్వరుడు నిత్య నివాసము చేయుచున్న అలయము )అను విలక్షణమైన నామముంది. ఈ క్షేత్రానికి చుట్టూ ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలున్నాయి. ఆ ఎనిమిదీ ఇవి: 👇

తిరుత్తులైవెల్లి మంగళం; 
 శీరివరమంగై; 
తిరుప్పుళింగుడి; 
తెన్ తిరుప్పేరై; 
శ్రీవైకుంఠం; 
తిరువరగుణమంగై;
తిరుక్కుళందై;
తిరుక్కోళూర్. 
ఆళ్వార్ తిరునగరి అను అష్టాక్షరీ మంత్రరూప‌పద్మమునకు ఎనిమిది పద్మ దళములవలె ఉన్నాయీ ఎనిమిది తిరుపతులు.

మూలవర్లు:

ఆదినాథన్ పెరుమాళ్ళు (పొలిందునిన్ఱ పిరాన్) తూర్పు ముఖముగా స్థానక భంగిమలో వేంచేసి ఉన్నారు.

తాయార్లు:

 ఆదినాథవల్లి తాయారు.

విమానము:

గోవింద విమానము.

ఇక్కడ ఒక నిర్ణిద్ర తింత్రిణి ~ నిద్రపోని చింతచెట్టు  ఒకటి ఉంది. ఇది ఆదిశేషుని అవతారమని  చెబుతారు. ఈ చ్గెట్టు క్రిందనే నమ్మాళ్వార్లు యోగనిష్టలో వేంచేసిఉండిరి. నమ్మళ్వార్లు విష్వక్సేనుని అంశము. వృషభం  విశాఖ వీరి తిరునక్షత్రము. పుట్టిన 12 దినాల బాలుడుగా వీరు ప్రాకుతూ వచ్చి  ఈ చెట్టు తొర్రలో  ఉన్నారు. కొంతకాలము నమ్మాళ్వార్లు యోగనిద్రలో ఉండి సరియైన భక్తుడికొరకు ఆ చింతచెట్టు తొర్రలో  ధ్యానసమాధియందుండినారు. వీరి శిష్యుడే మధురకవి ఆళ్వారు. ఇక్కడ జ్ఙానప్పిరాన్(వరాహ పెరుమాళ్) కు సన్నిధి ఉన్నది. పెరుమాళ్ళు నమ్మాళ్వార్లకు శేషమాలను వేసి ఆశీర్వదించినారు.  ఇంద్రుడు పితరులను సేవింపనందున వారిచే శపింపబడితే, ఇక్కడికి వచ్చి ఆదినాథ పెరుమాళ్ళను సేవించి శాపవిముక్తి పొందినారని స్థలపురాణము. సర్వేశ్వరుని పరతత్వమును తెలిసికొనలేక సంసారులు నశించి పోరాదు ~ అను ఔదార్యముతో  ఆళ్వార్లు ఒన్ఱుమ్ తేవుమ్  అను దశకాన్ని ఉపదేశించి సర్వేశ్వరుడే సమస్త కారణభూతుడు అని పరతత్వమును ప్రకటించి మనకొరకే ఈ దివ్యదేశమున వేంచేసి ఉన్నారని సర్వేశ్వరుని పరతత్వ సౌలభ్యములు అను గుణములను ప్రకటించినారు.  

ఆళ్వార్ల పాశురాలు: 

 నమ్మాళ్వార్లు వారి తిరువాయ్ మొழிలో చాలా దివ్యదేశాల పెరుమాళ్ళకు మంగళా శాసనములు చేసినారు::
 అందులో ఒక  పాశురమిది. 4-10-1:

ఒన్ఱున్తేవుమ్  ఉలగు  ముయిరుమ్ మర్ట్రుమ్! యాదుమ్  ఇల్లా
అన్ఱు! నాన్ముగన్ తన్నొడు!తేవర్  ఉలకోడు ఉయిర్ పడైత్తాన్!
కున్ఱమ్ పోల్ మణిమాడ నీడు! తిరుక్కురుగూర్ అదనుళ్!

నిన్ఱ ఆదిప్పిరాన్ నిఱ్క! మర్ట్రు ఎత్ తైవమ్ నాడుదిరే!!

(ఇవి కాక నాలాయిరము లో 3106 to 3116 వరకూ ఉన్న పాశురాలను చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


తిరుత్తలై విల్లి మంగలమ్ ~ 50 వ వైష్ణవ దివ్య దేశము) (శ్రీహరి ప్రియ గోష్టి నుండీ) 
( పి. యల్. నరసింహాచార్య దాస‌న్:& Edited by: ఫణిహారం రంగనాత్)


నవ తిరుపతులలో రెండవది తిరుతులై విల్లి మంగలమ్
 
శ్లో:  దివ్యేీ శ్రీ తొలవిల్లి మంగలపుర శ్రీ తామ్రపర్ణీతటే 
       ప్రాప్తే  వారుణ తీర్థకం శఠరిపు స్తుత్య స్సురేశాసనః
       నాయక్యా మరవింద లోచన విభూ రక్తః కరుంకణ్ణితి
       ప్రాప్యేంధే కుముదం విమాన మనిల స్తీర్తేశశక్రేక్షితః

ఎక్కడుందీ క్షేత్ర్రము? 

తామ్రపర్ణీ నదీ తీరములో ఆళ్వార్ తిరునగరి(49/108) క్షేత్రానికి 3 kms  దూరములో వెలసింది. ఒక సన్నిధి నదీ తీరాన, రెండవ సన్నిధి దాని కాలువ గట్టున ఉన్నాయి. అందువలన ఈ క్షేత్రానికి ఇరాట్టై తిరుపతి అని పేరు. 
ఈ క్షేత్రము  అర‌ణ్య మధ్యమున ఉన్నందువల్ల అర్చకులు ఇక్కడ  నివాసముండరు.
దగ్గర ఉన్న పల్లెలో ఉండి రెండు పూటలా వచ్చి అర్చనలు చేసిపోతారు.

ఈక్షేత్రానికి సమీపమున నమ్మాళ్వార్ల తిరు అవతార స్థలము అప్పన్ సన్నిధి ఉంది. నమ్మాళ్వార్లు ఈ క్షేత్రానికి అవ్వూర్ (ఆ దివ్యదేశము) అను (6-5-9)
విలక్షణమైన తిరునామాన్ని అనుగ్రహించినారు  తువళిల్ మామణి మాడమ్ అను దశకములో ( తిరువాయ్ మొళి ~ (6-5-11)

తేవపిరానైయ తన్దెతాయ్ అని (దేవపిరాన్ సర్వేశ్వ‌‌‌రుడే  తల్లి తండ్రి అని) సర్వేశ్వరుని సకలవిధ బంధువుగా కీర్తించి బంధువుగా కీర్తించి బంధుత్వ గుణమును ప్రకాశింపజేసిరి. 

మూలవర్లు:

దేవపిరాన్ అరవిందలోచనన్ పెరుమాళ్ ఆసీన భంగిమ
 
తూర్పు దిశగా చూస్తూ వేంచేసి ఉన్నారు‌.

తాయారు:

కరుందడమ్ కణ్ణి  నాచ్చియార్. 

తీర్థము:

వరుణ తీర్థము.

విమానము: 

కుముద విమానం.

ఇంద్రునికి  వరుణునికి   వాయుదేవునికి
ప్రత్యక్షమయ్యారు.

నమ్మాళ్వార్లు చాలా పాశురాలను ఇక్కడ మంగళాశాసనములుగా
పాడినారు. ఇవన్నీ వారి తిరువాయ్ మొళిలో ఉన్నాయి. అందులో
ఒకటి ఇది:

తిరు‌న్దు వేదముమ్ వేళ్వియుమ్! తిరుమామక ళిరున్దామ్! మలిన్దు 
ఇరున్దు వాழ் పొరునల్! వడకరై వణ్  తులైవిల్లి మఙ్గలమ్!

కరుమ్  తడమ్ కణ్ణి కైతొழுద!  అన్నాళ్ తొడఙ్గి ఇన్నాళ్  దొఱుమ్!

ఇరున్దు ఇరున్దు అరవిన్దలోశన! ఎన్ఱెన్ఱే నైన్దు ఇరఙ్గుమే!!

మిగిలిన పాశురాలను నాలాయిర దివ్య ప్రభంధములో 3271 to 3281 వరకూ చూడవచ్చును

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)


 వైష్ణవ దివ్య దేశాలు~శిరీవరమంగై(నాంగునేరి) (వానమామలై) 51/108
🌹
(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
 (పి. యల్. నరసింహాచార్య దాసన్: & Edited by: ఫణిహరం రంగనాత్ ) 🌹

శ్లో: తోతాద్రౌ వర పంకసార సరస స్సంవోభితేంద్రాబ్జినీ
      రమ్యే నందన వర్ధనం సముపయన్ వైమాన్ మైంద్రాననః
      దేవ్యా శ్రీ వరమంగనామ యుతయా తోతాద్రినాథః కు మా
      నీళా, సేనప తార్ధ్య చామర ధరా సూర్యేందుభీ రాజతే
      భృగు రోమశ మౌనిభ్యాం మార్కండేయ మహర్షిణా 
      బ్రహ్మణాపిచ దృష్టాంగ శ్శఠా రాతి మునిస్థుతః

వైష్ణవ 108 దివ్య దేశాలు ~ నవ తిరుపతులు ~ మూడవ క్షేత్రము:
శిరీవరమంగై (నాంగునేరి) ~ (వానమామలై): (51 వ దివ్య దేశము)

ఎక్కడుందీ క్షేత్రము? 

యాత్రీకులు ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకున్నప్పుడు  నాంగునేరి అని అడగాలి; లేనిచో అక్కడివారికి  ఎవరికీ తెలియదు. ఈ క్షేత్రము తిరునల్వేలికీ తిరుక్కురుంగుడికీ మధ్యన ఉంది. తిరునల్వేలికి 30 kms. దూరము.‌ యాత్రీకులకు సకల సౌకర్యాలు ఉన్నాయిక్కడ.‌ సత్రాలు‌  రామానుజ కూటమి ఉన్నాయి.‌ ప్రతిరోజూ ఇక్కడి జీయరు మఠములో ప్రసాద వితరణ జరుగుతుంది. కన్యాకుమారి నుంచీ కూడా ఇక్కడికి చేరుకోవచ్చును రోడ్డుమార్గములో.

మూలవర్లు:  వానమామలై పెరుమాళ్ళు ~ దేవనాయక పెరుమాళ్ళు ~ తైవనాయకన్ అని నామధేయాలు. స్వామి ఇక్కడ ఆశీన భంగిమలో తూర్పు దిశగా దర్శనమిస్తారు.

తాయార్లు:  శిరివరమంగై తాయార్ అని కొలుస్తారు. శ్రీదేవి ~ భూదేవి ~ నీళాదేవి ~ విష్వక్సేనులు ~ పెరియ రువడి(గరుత్మాన్) ~ చామరములు ధరించిన కన్యలు ~ సూర్యుడు  ~ చంద్రుడు ~ వీరందరితో కలసి వేంచేసి  ఉంటారు.

విశేషము:  ఇక్కడ పెరుమాళ్ళను పునరుద్దరించు సమయమున భూమినుండి
ఎత్తునపుడు దెబ్బ  తగులుటచే, ప్రతి రోజూ తైలముతో తిరుమంజనము  జరుపుతారు. ఈ తైలము సకల రోగ నివారిణి. అష్ట‌స్వయమ్ వ్యక్త క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న వానమామలై మఠము జగత్ప్రసిద్దము.

సింధు దేశపు రాజు కుశాసన మహర్షిచే శపింపబడి శునక స్వరూపుడై శేత్తుత్తమరై పుష్కరిణిలో స్నానమాడి తన పూర్వ రూపాన్ని పొందినారు.‌ ఇక్కడ‌ శఠారిలో నమ్మాళ్వార్ల తిరుమేని వేంచేసి ఉండడము విశేషము.  

ఊర్వశి, తిలోత్తమ అను దేవకన్యలు ఇక్కడ తపమాచరించి పెరుమాళ్ల అనుగ్రహమున చామర కన్యలుగా వేంచేసి ఉన్నారు. మణవాళ మామునుల‌ స్వర్ణ ముద్రిక (ఉంగరము) ఇక్కడ ఉంది. తులామాసాన మూలా నక్షత్రములో జీయరు గారు దీన్ని ధరించి శ్రీపాదతీర్థాన్ని అనుగ్రహిస్తారు భక్తులందరికీ.

నమ్మాళ్వార్లు నోత్తనోంబు అను తిరువాయ్ మొళి లో  (5-7-10) 
ఆరెనక్కు నింపాదమే నీ పాదములే నకు  ఉపాయము ఓ
దేవనాయకా!
 ఏవిధమైన ఉపాయములేని నాకు నీశ్రీపాదములనే
ఉజ్జీవనోపాయముగా ప్రసాదించినావు.
 దీనికి నేను ఏమి ప్రత్యుపకృతిని గావించెదను. 
నా ఆత్మ కూడా నీదే గాన దానిని కూడా నీకు సమర్పించు అధికారము నాకు లేదు కదా! 
అ‌ని పెరుమాళ్ళ ఔదార్యాన్ని ప్రకాశింపజేసినారు.

పుష్కరిణి:  శెత్తుత్తమారై మరియూ ఇంద్ర పుష్కరిణి ఉన్నాయి.  

విమానము: నంద వర్ధన విమానము.

ప్రత్యక్షము:  

భృగువు ~ రోమస~ బ్రహ్మ ~ మార్కండేయ మహర్షికి ఇక్కడ పెరుమాళ్ళు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడి మొదటి జీయరు గారు మాణవాళమాముని గారి ప్రియ శిష్యుడు.

ఉత్సవాలు:

 మీనమాసములో ఉత్తర తీర్తోత్సవముగా బ్రహ్మోత్సవాలు చేస్తారు.‌
పవిత్రోత్సవాలు  ~ ఆండాళ్ ఉత్సవాలు ~ 
దీపోత్సవాలు ఇక్కడ జరుగుతాయి.
ఇక్కడ తోతాప్రదినాథ ఆలయం ~ 
నూనెలో నిండిన కొలను (ఎంతనూనె ఇందులో చేరినా~ 
(అభిషేకముచేసిన నూనె)  ఒక్క చీమ కూడా దీని దరిదాపులలో
ఉండదు. అభిషేక తైలానన్ని ఈ కొలనులోకి పట్టుటకు ఒక పైపు లైను వేసినారు. తేనమాంపొళీల్ (తేనెచే సమృద్దమయిన మామిడి తోటలు) అను
పెరుమాళ్ళ ఉద్యానవనము స్వర్ణ గోరథము సేవింప దగినవి ఇక్కడ. 

శ్లో: పరమంగే శుభోత్తుంగే వర పంకేరుహేక్షణే
      పదపంకేరు హే నిత్యం తవ భృంగం కురుష్వమామ్
      మాత శ్శ్రీవరమంగే మధురిపు వాంచిత మనోహరాపాంగే
      మంగళ వదన శశాంకే మామవ విద్యుల్లతా సమానాంగే 

పాశురము: 

ఏనమాయ్ నిలమ్ కీణ్డ! ఎన్ అప్పనే కణ్ణా! ఎన్నుమ్ ఎన్నై ఆళుడై
వాన నాయకనే!మణి మాణిక్క చ్చుడరే!

తేన మామ్బొழிల్ ; తణ్ శిరీవరమఙ్గలత్తవర్ కైతొழ ఉఱై;

వానమామలైయే! అడియేన్  తొழ వన్దు అరుళే!!


 ఆఱు ఎనక్కు! నిన్ పాదమే శరణాగత్తన్దొழுన్దాయ్! ఉనక్కు ఓర్ కై
మ్మాఱు నాన్ ఒన్ఱు ఇలేన్! ఎనదు ఆవియుమ్ ఉనదే!

శేఱుకొళ్ కరుమ్బుమ్ పెరుమ్ శెన్నెలుమ్! మలి తణ్ శిరీవరమఙ్గై!

నాఱు పూమ్ తణ్ తుழாయ్ ముడియాయ్! తెయ్ వనాయకనే!


           నమమ్మాళ్వార్ల తిరువాయ్ మొళి ~ (5-7-6; 10)

(ఇంకా నమ్మాళ్వార్ల పాశురాలను నాలాయిరమ్ లో 3183 to 3193 వరకూ ఉన్నాయి- చూడవచ్చును)

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణమ్)

108 వైష్ణవ దివ్యదేశాలలోని నవ తిరుపతులలోని ~ 4వ దివ్య దేశము
 తిరుప్పుళింగుడి ~ *52/108  🌹


(నరసింహ గోష్టి నుండీ)

( పి. యల్. నరసింహాచార్య దాసన్:& Edited by:ఫ‌ణిహారం రంగనాత్)
(25.9.22)

శ్లోకము: శ్రీమత్కాశిన వేందనాహ్వయ విభు స్తీర్థాంచితే నిర్ఋతేః 

ప్రాచీ వక్త్రయుతః పుళిఙ్గుడి పురే భోగీంద్ర భోగేశయః

నాయక్యా తు మలర్ మకళ్ పదయుజా శ్రీ వేద సారంగతో

వైమానం వరుణాశరాతిధి వపూ రేజే శఠారి స్తుతః

ఎక్కడుందీ  క్షేత్రము? 

నవ తిరుపతులలో  ఇది నాలుగవది. తిరువరగుణ మంగై క్షేత్రమునుండి ఒక
కిలోమీటరు దూరములో ఉందీ క్షేత్రము. 

నమ్మాళ్వార్ పణ్డనాళాల్ అ‌ను తిరువాయ్ మొళిలో (9-2-4)  *పుళిఙ్గుడిక్కిడన్దు అ‌ని‌ సర్వేశ్వరుని భోగ్యపాక త్వర అను గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రానికి తెళిన్దశిన్దెక్కు ము‌న్నిల్ మూన్ఱు (9-2-4) అను
 విలక్షణమైన తిరునామముంది. మిగిలిన రెండు క్షేత్రములు వరగుణమంగై~ 
శ్రీ వైకుంఠం. 
ఇంద్రునకు బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టిన స్థలమిది.‌ స్వామి ఇక్కడ శయనించి ఉన్నారు. శ్రీ వైకుంఠం లో నిలచి ఉన్నారు. ఆళ్వార్లు స్వామిని  ఒక్క మారైనా సుఖాసీనుడవై దర్శనాన్ని అనుగ్రహించుము. సంసారులందరూ నీ 
పాదాలపై పడి నిన్ను స్తోత్రము చేస్తారు.  ఆ కమనీయ దృశ్యమును సేవింప ఆశగా ఉన్నది అని ప్రార్థించినారు. 

మూలవర్లు:

కాయశినవేందన్ అని పెరుమాళ్ల పేరు. స్వామి భుజంగశయనుడు. తూర్పు దిశగా వేంచేసి ఉంటారు.

తాయార్లు :  

పుళిఙ్గుడి వల్లి తాయారు  మలర్ మకళ్ తాయారు.

తీర్థము:

వరుణ  నిర్ఋతి తీర్థాలు.

విమానము :

వేదసార విమానము.

వరుణునికి, నిర్ఋతికీ ప్రత్యక్ష మయ్యారిక్కడ పెరుమాళ్ళు.

స్థలపురాణము:

 ప్రకారము ఈ క్షేత్రాన్ని తెళిన్దశిన్దెక్కు ము‌న్నిల్ మూన్ఱు అని కూడా అంటారు.(తిరువాయ్‌మొళి  9-2-4) ఒక ఐతిహ్యము ప్రకారము  ఒకనాడు సన్నిధిలో శ్రీవైష్ణవులు  ఒకవైపు,  మరొక వైపు గొల్లవాళ్ళు, నిలిచి
పెరుమాళ్ళను సేవించుచుండగా  వంగి పురత్తునంబి అను భక్తుడు శ్రీవైష్ణవగోష్టిని వీడి గొల్లలవైపు చేరినారట! దీనిని చూచిన ముదలి యాండాన్  ఇట్లేల
చేసినారని అడుగగా ఎట్లైననూ మనకు అభిమానము  అభిజనాహంకారము ఉండియే తీరును,  గొల్లలకవి ఉండవు  పెరుమాళ్ళ దృష్టి వారితోపాటు నాపైనకూడా పడుతుందని చెప్పినారట! పెరుమాళ్ళ దృష్టి 
మనమీద పడుట నీరు మెరకకు పారుటవలె కష్టము. వీరిపై పడుట నీరు
పల్లమునకు పారుటవలె సుకరము కదా అ‌ని అన్నారట! 

గొల్లలు స్వామిని  నూరేళ్ళు సిరిసంపదలతో తులతూగుమనినారట!
ముదలియాండాన్ స్వామి వంగిపురత్తునంబిని మీరేమని వేడుకున్నారని అడుగగా  విజయీభవ  అని పలికితిని అని అన్నారట! 

అప్పుడు ముదలియాండాన్ -స్వామి మనమే గోష్టిలోనున్న మనము మనమే వారువారే. మన సంస్కృతమును వదలనైతిమి కదా అని శెలవిచ్చినారట!

పాశురము:

 నమ్మాళ్వార్ల తిరువాయ్ మొళి ~ 9-2-1:

   పణ్డైనాళాలే నిన్  తిరు అరుళుమ్! పఙ్గయత్తాళ్ తిరు అరుళుమ్
కొణ్డు! నిన్ కోయిల్  శీయ్ త్తుప్పల్  పడికాల్! కుడికుడి     వழிవన్దు ఆట్బెయ్యుమ్!

తొణ్డరోర్కరుళి చ్చోతివాయ్  తిఱన్దు! ఉన్ తామరైక్కణ్గళాల్ నోక్కాయ్!
తెణ్ తిరై ప్పొరునల్ తణ్ పణై శూழ்న్ద! తిరుప్పుళిఙ్గుడి క్కిడన్దానే!!

నమ్మాళ్వార్ల పాశురాలను నాలాయిర దివ్యప్రభంధములో 3473; 3568 to 3578 వరకూ చూడవచ్చును.

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్)

వైష్ణవ దివ్యదేశాలు : తెన్ తిరుప్పేరై. 53/108  

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)
(పి.యల్. నరసింహాచార్య దాసన్:& Edited by: ఫ‌ణిహారం రంగనాత్ )


శ్లోకం:

శ్రీతెన్ తిరుప్పేర పురేతు శుక్ర సరస్సు రమ్యే సురదిగ్ముఖాసనః
శ్రీమత్కుళైకోద లతాదినాథో విరించి నేశానగ విప్ర సేవితః
మకరాయత కర్ణ భూషణ శ్శుభ భద్రాఖ్య విమాన మాశ్రితః
శఠవైరి మహర్షిణాస్తుతో భువి భక్తేష్ట కృతే విరాజతే

ఎక్కడుందీ క్షేత్రము?

తిరునల్వేలి-తిరుచెండూర్ మార్గములో ఆళ్వార్ తిరునగరి నుంచీ 5 kms. దూరములో ఉంది. దీనికి తిరుప్పొరై అని వాడుక పేరు.‌

 భక్తులకు ఇక్కడ   వసతి సౌకర్యాలు చాలా తక్కువ.

 తామ్రపర్ణీ నదీ దక్షిణ తీరాన ఉంది. తిరునల్వేలికి 35 kms. దూరములో ఉంది. 16/06/1999 లో మహాసంప్రోక్షణము జరిగింది.

స్థలపురాణము 

ఈ క్షేత్రా‌నికి మానగర్ (మహానగరమ్ ~ తి.మొ.7-3-9) అనే విలక్షణమైన తిరునామముంది. నమ్మళ్వార్లు వెళ్ళచ్చురిశంగొడు అను దశకములో శెంగనివాయిన్ ఎర్రని పండు వంటి అధరము అను పాశురమున‌~ 
ఓ సఖీ! తిరుప్పేరై దివ్యదేశమున వేంచేసి ఉన్న స్వామి ఎర్రని పండు వంటి అధరమును  తేజోవంతమైన కిరీటమును‌  శంఖచక్రాది‌ అధరములను ధరిించి
నా మనస్సును వశపరచుకొన్నాడు‌ ‌అని స్వామి సౌందర్యాన్ని‌ సేవించి‌ ప్రకాశింప‌చేసినారు. 
 ఒక కథనము ప్రకారము, ఒకసారి మహాలక్ష్మీదేవి
దుర్వాస మహర్షితో  స్వామి భూదేవికి సానుకూలంగా ఉన్నాడని చెప్పితే  మహర్షి భూదేవి వద్దకు పోతే ఆమె స్వామి అంకముమీద కూర్చుని మహర్షి రాకను 
గమనించలేదు. 
దానికి మహర్షి ఆమెను శపించినాడు.
 ఆమె నారాయణుని గురించి తపస్సు చేసి ఒక ఫంగుణి పౌర్ణిమ నాడు నది నీటిని తీసుకునేటప్పుడు రెండు మకరకుండలాలు దొిరికినాయి. వాటిని స్వామికి ఇచ్చింది. అందుకే ఇక్కడ స్వామికి మకరనెడుంకుళైక్కాద పెరుమాళ్ అనీ నిగరిల్ ముకిల్ వణ్ణన్ అనీ పేర్లు. స్వామివారు ఇద్దరు దేవేరులూ తనకు సమానమే అ‌ని‌  ఒకరెక్కువ  ఒకరు తక్కువ అనే భేదభావన తనకు లేదని ఇద్దరినీ శాంతపరిచినారట!

మూలవర్లు:

మకరనెడుమ్ కుళైక్కాద పెరుమాళ్
 ఆశీన భంగిమలో తూర్పు ముఖంగా
వేంచేసి ఉంటారు.

తాయార్లు:

కుళైకోదైవల్లి తాయారు  తిరుప్పేరై నాచ్చియార్ అనీ ఇద్దరు దేవేర్లకు పేర్లు.

పుష్కరిణి: 

శుక్ర పుష్కరిణి.

విమానము: 

భద్ర విమానము

బ్రహ్మకూ శివునికీ ~ శుక్రునికీ ప్రత్యక్షమయ్యారు.

ఉత్సవాలు:

 ఉత్తర తీర్తోత్సవము మీన మాసములో ప్రతి సంవత్సరమూ జరుపుతారు.

పాశురాలు:

నమ్మాళ్వార్లు మంగళాశాసనాలు చేసిన పాశురాలు 3359-69 వరకూ నాలాయిర దివ్య ప్రభంధములో ఉన్నాయి. అందులో ఒక పాశురము 7-3-3 ఇది :


శెమ్  కనివాయ్ ఇన్ తిఱత్తదాయుమ్! శెమ్ శుడర్ నీళ్ ముడిత్తాழ்న్దదాయుమ్!

శఙ్గొడుశక్కరమ్ కణ్డుగన్దుమ్! తామరైక్కణ్గళుక్కు అర్ట్రు తీర్ న్దుమ్!

తిఙ్గళుమ్ నాళుం విழாఅఱాద! తెన్ తిరుప్పేరైయిల్ వీర్ట్రిరున్ద!

నఙ్గళ్ పిరానుక్కెన్ నెఞ్జమ్ తోழி! నాణుం నిఱైయుం ఇழన్దదువే!

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

వైష్ణవ 108 దివ్య  దేశాలలోని నవ తిరుపతులు~ 6వ దివ్య దేశము  శ్రీవైకుంఠం ~ 54/108

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ)

(పి.యల్. నరసింహాచార్య దాసన్:& Edited by: ఫణిహారం రంగనాత్)

శ్లో: శ్రీవైకుంఠ పురే పృథోస్తు సరసా శ్రీ తామ్రపర్ణీ తటే

యుక్తే చంద్ర విమాన మధ్య నిలయో వైకుంఠనాథః ప్రభుః

ప్రాగాస్య స్థితి రాశ్రితః ప్రియతమాం వైకుంఠ వల్లీం ముదా

భాతి శ్రీ పృథురాజ శక్రనయనా గంతు శ్శఠారి స్తుతః

ఎక్కడుందీ క్షేత్రము? 

తిరునల్వేలి-తిరుచెండూర్ రైలు మార్గములో శ్రీవైకుంఠము స్టేషను నుండీ 2 kms. దూరములో ఉంది.  

ఈ క్షేత్రము తామ్రపర్ణీ నదీ తీరాన ఉంది.  

ఈ క్షేత్రానికి 5 kms. దూరాన తూర్పున ఆళ్వార్ తిరునగరి; 1 km దూరాన తిరువరగుణ మంగై (55/108), తిరుప్పుళింగుడి (52/108) సన్నిధులున్నాయి.

ఈ క్షేత్రములో భక్తులకు సకల సౌకర్యాలు లభ్యమవుతాయి. భోజన శాలలు ఉన్నాయి.

మూలవర్లు: 

వైకుంఠనాథ పెరుమాళ్ళు కళ్ళప్పిరాన్ అని కూడా అంటారు.  

స్వామివారు స్థానక భంగిమలో తూర్పు వైపు చూస్తూ దర్శనమిస్తారు.

తాయారు:  వైకుంఠ వల్లి తాయార్

విమానము:- చంద్ర విమానము. 

తీర్థము - పృధు తీర్థము.

ఇంద్రునికీ  పృథు చక్రవర్తికీ ప్రత్యక్షమయ్యారు.

శ్రీరంగాన్ని ~  తిరువరంగం అని అనవచ్చును. 

మరే దివ్యక్షేత్రాన్నైనా శ్రీ అనే శబ్దాన్ని తిరు గా మార్చి చెప్పవచ్చును.

 కానీ శ్రీవిల్లిపుత్తూర్‌  నూ ఈ శ్రీవైకుంఠాన్ని మాత్రమూ శ్రీ కారముతోనే చెప్పాలి.

ఇక్కడి స్తలపురాణాన్ని బట్టి కాలదూషకుడు  అనే ఒక దొంగ ప్రతి రోజూ స్వామిని సేవించి ఆ పై దొంగతనానికి బయలుదేరి,  తాను కొల్లగొట్టిన దానిలో సగము స్వామికి సమర్పించేవాడట! ఒక నాడు అతడు రాజప్రాసాదములో భటులకు పట్టుబడక తప్లించుకుని వచ్చి పెరుమాళ్ళ తిరువడిలో శరణు వేడినాడట! అప్పుడు కరుణాంతరంగుడైన స్వామివారు కాలదూషకుని వేషములో భటులకు చిక్కి  రాజు శిక్ష వేయనుండగా స్వామివారు ఆ రాజుతో వాదించి సంపదలోని‌ నాలుగవ వంతు ధర్మభాగము కనుక, రాజు ధర్మబద్దుడై ధర్మాచరణ చేయనందున, తాను ఇలా దొంగతనము చేసినానని, ఈ దొంగతనము ధర్మబద్దము అ‌ని నిరూపించినాడట!  ఆ వాదన విన్న ఆ రాజు ఆ దొంగను తన అసలు రూపు తెలుపుమనగా, తాను వైకుంఠనాథుడననీ, తన అసలు రూపాన దర్శనమిచ్చినాడట! అందుకే ఈ స్వామివారికి కళ్ళప్పిరాన్ అని పేరు వచ్చిందట!

ఇదికాక, సోమముడనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించగా బ్రహ్మ ప్రార్థించగా స్వామివారు ఆ దానవుణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకు ఇచ్చినారు.  మొదట బ్రహ్మ ఈ స్వామికి నిర్మించిన సన్నిధి కొంతకాలానికి భూమిలోకి దిగిపోయి అడవిగా మారింది. 

పాండ్య రాజు ఏలుబడిలో రాజుగారి ఆవులను ఈ అడవిలోనికి మేతకు తీసుకువచ్చేవారట!  ఒక రోజు ఒక ఆవు వట్టి పొదుగుతో మందలోకి చేరేదట!  దీన్ని గమనించగా ఆ ఆవు ప్రతి రోజూ అక్కడి పుట్టలోకి పాలు విడుస్తున్నదని తెలిసిందట!  ఆ విషయాన్ని తెలుసుకున్న రాజు ఆ పుట్టను త్రవ్వి చూడగా 

కళ్ళప్పిరాన్ సన్నిధి బయట పడిందట!  ఆ రాజు స్వామికి ఆలాయాన్ని నిర్మించి ప్రతిరోజూ స్వామికి క్షీరాభిషేకాన్ని జరిపించేవాడట!  ఈ నాటికీ స్వామికి నిత్యమూ పాలతో అభిషేకము జరుపుతున్నారు. ఈ స్వామివారికి 

పాల్ పాండ్యన్ అని కూడా పేరు ఉన్నది.

నమ్మాళ్వార్లు తమ పణ్డనాళాలే అనే దశకములో (9-2) పుళింగుడింకిడన్దు వరగుణ మంగైయిరందు వైమిందత్తుళ్ నిన్రు అను‌ తావున తిరుప్పళింగుడి లో శయనించి ఉండుట;  వరగుణమంగై లో‌ కూర్చుని, ఇక్కడ నిలచి ఉండుటలో చేతనులగు మనలను పొందుటకై స్వామి పడు తొందరను ప్రస్తుతించి వారి భోగ్యపాకత్వర అను గుణమును ప్రకాశింపచేసిరి.

నమ్మాళ్వార్ల తిరువాయ్ మొళి  (9-2-8) లోని మంగళా శాసన పాశురాన్ని చూడండి. 

వారి పాశురము నాలాయిరములో 3571; 3575 లో చూడవచ్చును

ఎఙ్గళ్ క‌ణ్ ముగప్పే ఉలగర్ కళెల్లామ్!  ఇణై అడితొழுదు ఎழுదు  ఇఱైఞ్జి!

తఙ్గళ్  అన్బు ఆరత్తమదు శొల్  వలత్తాళ్! తలైత్తలై చ్చిఱన్దు పూశిప్ప

తిఙ్గళ్ శేర్ మాడ త్తిరుప్పుళిఙ్గుడియాయ్! తిరువైకున్దత్తుళ్ళాయ్ దేవా!

ఇఙ్గణ్ మాఞాలత్తు ఇదనుళుమొరునాళ్! ఇరున్దిడాయ్ వీర్ట్రిడఙ్గొణ్డే!


ఈ ఆలయములో చిత్తిరై  ~ ఐప్పసి  మాసాలలో సూర్యకిరణాలు ఆరవ రోజున స్వామివారిపై పడుతాయి. చిత్తిరై మాసములో బ్రహ్మోత్సవాలు పదిరోజులు జరుగుతాయి ~ ఐదవ రోజున గరుడసేవలు చూడవచ్చును.  ఇక్కడ భూదేవికి‌ వేరొక సన్నిధి ఉంది. మహా సంప్రోక్షణాన్ని ఇక్కడ 15-6-1996 లో జరిిపినారు.

(ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణమ్)


వైష్ణవ 108 వైష్ణవ  దివ్య దేశాలలోని నవ తిరుపతులు. తిరువరగుమంగై 7వ దివ్యదేశము ~ 55/108: 🌹

(శ్రీహరి ప్రియ గోష్టి నుండీ పి. యల్. నరసింహాచార్య దాసన్ & Edited by ఫణిగారమ్ రంగనాథ్)

శ్రీమతే రామానుజాయ నమ:

శ్లో: శ్రీమత్యాం  వరగుణ మంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే

నాయక్యా వరగుణమంగై నామ వత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూపః

విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచః ప్రియః

సుజన సేవిత పాద సరోరుహః విజయతే ధరణౌ విజయాసనః


ఎక్కడుందీ క్షేత్రము?


శ్రీవైకుంఠం (54/108) నుంచీ తూర్పుగా 2.5 kms దూరములో ఉంది. 

‌ఈ క్షేత్రానికి నత్తం అని కూడా అంటారు. 


ఇక్కడ యాత్రీకులకు వసతులు చాలా స్వల్పము.  అర్చకుడు ఇక్కడ నివాసముండడు కనుక

ఆలయము ఎప్పుడు భక్తులకు దర్శనార్థము  తెరిచి ఉంటారో  కనుక్కుని అప్పుడే వెళ్ళి  సేవించుకోవాలి. 


క్షేత్ర విశేషాలు:  


ఆకలిగొన్న వాడు అన్నము పచనమగు వరకు  అక్కడనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురు చూచుచున్నట్లుగా భక్తునకు పరమభక్తి రూపమగు పరిపక్వ

 దశ వచ్చువరకూ సర్వేశ్వరుడు  కూడా  పై విధముగా త్వరపడుచుండునట!

ఆళ్వార్ల విషయమై సర్వేశ్వరునకు గల ఈ భోగ్యపాకత్వరత ను ఆళ్వార్లు పుళింగుడి

(52/108) నందు శయనించి  ఈ సన్నిధినందు(55/108) కూర్చుండి  శ్రీవైకుంఠము (54/108) నందు నిలబడి  ప్రకాశింపచేసినారు.   

స్థలపురాణము ప్రకారము ఇక్కడ ఒకప్పుడు మేధావి మహర్షి తపస్సు చేయాలని సంకల్పించగా, పెరుమాళ్ళు ఒక బ్రాహ్మణునిగా వచ్చి తపస్సు చేయుటకు వరగుణమంగై చాలా శ్రేష్టమైన ప్రదేశమని చెప్పగా  అక్కడికి వెళ్ళి తపస్సు చేసి  స్వామివారు ప్రత్యక్షమవ్వగా ఇక్కడనే ఉండి భక్తులకు దర్శనభాగ్యమివ్వమని వేడుకొనగా ఇక్కడనే వేంచేసినారు. మేధావి మహర్షికి మోక్షాన్ని ప్రసాదించినారు. రోమశ మహర్షి  కూడా ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ ఉండి చివరి శ్వాశ విడిస్తే తప్ప‌క మోక్ష ప్రాప్తి కలుగుతుందని సెలవిచ్చినారు.

మూలవర్లు: విజయాసన పెరుమాళ్ళు

తూర్పు దిశగా  ఆశీన భంగిమలో వేంచేసినారు.

తాయారు: వరగుణమంగై తాయారు.

తీర్థము:  అగ్ని తీర్థము.

విమానము:  విజయకోటి విమానం. 

ప్రత్యక్షము: 

రోమశ  మేధావి మహర్షులకూ, అగ్ని హోత్రునికీ ప్రత్యక్షమయ్యారు.

నమ్మాళ్వార్లు ఒక పాశురాన్ని ఇక్కడ మంగళాశాసనము చేసినారు. 

దాన్ని నాలాయిరములో 3571 లో చూడవచ్చును

వారి తిరువాయ్మొழி లోని ఒక పాశురము ~ 9-2-4:

పుళిఙ్గుడి క్కిడన్దు వరగుణ మఙ్గైయిరున్దు! వైకున్దత్తుళ్ నిన్ఱు!

తెళిన్ద ఎన్ శిన్దైయగమ్ కழிయాదే!  ఎన్నై ఆళ్వాయ్ ఎనక్కు అరుళి!

నళిర్ న్ద శీర్ ఉలగమూన్ఱుడన్ వియప్ప! నాఙ్గళ్ కూత్తాడినిన్ఱు ఆర్ ప్ప!

ప్పళిఙ్గు నీర్ ముకిలిన్ పవళమ్ పోల్ కనివాయ్ శివప్ప! నీకాణవారాయే!

మానవాళ మామునిగళ్ గారు కూడా కొన్ని పాశురాలను ఇక్కడ కీర్తించినారు

(ఆళ్వార్ దివ్యతిరువడిగళే శరణమ్ )


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు : - వరగుణమంగై  (55వ దివ్యదేశము) శ్రీ వైకుంఠం 

నవ తిరుపతులలో 




శ్రీ విజయసన పెరుమాళ్ ఆలయం 

తిరునెల్వేలి.నత్తం 

⚜ ప్రధాన దైవం : విజయాసన పెరుమాళ్

⚜ ప్రధాన దేవత : వరగుణమంగై తాయార్

⚜ పుష్కరిణి :అగ్నితీర్థం

⚜ విమానం : విజయకోటి విమానo 

తిరువరగుణమంగై (నాతం) -  చంద్ర గ్రహ క్షేత్రం :

నవతిరుపతులలో ఇది చంద్రగ్రహ క్షేత్రం. ఉండటానికి శ్రీ వైకుంఠానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆలయ సమయాలలో తేడా వలన వెంటవెంటనే దర్శించుకోడానికి కుదరదు. 

పురాతన గ్రంధాలలో, పాశురాల్లో " తిరువరగుణమంగై" అని పేర్కొన్నా స్థానిక నామం మాత్రం "నాతం".

శ్రీ విజయాసన పెరుమాళ్ కొలువైన ఈ ఆలయాన్ని పాండ్య రాజులు నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి. 

తామ్రపర్ని  నదీ తీరంలో ఈ ఆలయ పరిసరాలలో " శ్రీ రోమశ మహర్షి" తపస్సు చేసుకొనేవారట. ఆయన ఇష్టదైవం శ్రీ విజయాసనుడే !

అగ్నిదేవుడు శాపవిమోచన కొరకు పన్నగ శయనుని గురించి ఈ క్షేత్రంలో తపమాచరించి విముక్తి పొందారట. ఆయన నిర్మించినందున ఆలయ కోనేరును "అగ్ని పుష్కరణి" అంటారు. 

నాతం మోక్ష స్థలం. 

ఎవరైతే శ్రీ విజయాసన పెరుమాళ్ని సేవించుకొంటారో వారికి పునర్జన్మ ఉండదని స్థానికులు విశ్వసిస్తారు.

 తిరువరగుణమంగై సర్వసిద్ది స్థలం కూడా ! ఆలయంలో స్వామి వారి ఎదుట నేతి దీపం వెలిగించి మదిలోని కోరిక విన్నవించుకొంటే తప్పక సిద్ధిస్తుంది అని క్షేత్ర మహత్యం తెలుపుతోంది అంటారు.

 ప్రతి నిత్యం ఎందరో భక్తులు వచ్చి దీపాలు వెలిగిస్తుంటారు. 

నాతం చంద్ర గ్రహ పరిహార స్థలం. జాతకరీత్యా చంద్ర గ్రహ దోషాలను ఎదుర్కొంటున్నవారు గ్రహ శాంతికి నిర్ణయించిన పూజలు, శాంతులు జరిపించుకొంటుంటారు.

గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ విజయాసన పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో ఇరుపక్కలా శ్రీదేవి, శ్రీ వరగుణ వల్లి తాయారులతో వెన్నెలకు ప్రతిరూపమైన వెండి ఆభరణాల అలంకరణలో నయనమనోహరంగా దర్శనమిస్తారు. శ్రీవారు  ఒక చేత్తో రమ్మని పిలుస్తూ, మరో చేత్తో పాదాలను చూపిస్తూ " శరణాగతే శరణ్యం " అన్న సందేశానిస్తుంటారు. 

రోమాశ మహర్షి ఇచట ఈ క్షెత్రములో మరణించిన వారికి మరు జన్మ లేదని తన కుమారునికి తెలిపి బెస్త వాని కధ విన్నవించెను. ఒక బెస్త వాడు వలతో చాపలు ఈ సరస్సులో పట్టుచుండ ఒక విషపు సర్పము అతనిని కాటు వేయగా అతను మరణించెను.

 రాబందులు మరియు కాకులు అతని శరీరాన్ని కొరకడం  ప్రారంభించాయి. ఆ సమయంలో దేవగణాలు ఆకాశం నుండి వచ్చి అతని శరీరాన్ని స్వర్గనికి తీసుకువెళ్ళాయి. ఇది చూస్తూ, రోమర్షి మహర్షి  యొక్క ఒక శిష్యుడు తన గురువు వద్దకు వచ్చి, ఇంత చెడ్డ వ్యక్తిని ఎలా స్వర్గానికి తీసుకెళ్లగలడు అని అడిగాడు.  రొమార్ష మహర్షి అప్పుడు వివరిస్తూ,.అతను మరణించి మోక్షమును పొందెను.  

అతను తన పూర్వ జన్మలో రాజుగా యుండి క్రూరముగా రాజ్య పాలన చేయుట వలన మరుజన్మలో బెస్త వానిగా జన్మించెను కాని బెస్త కులములో పుట్టినను పాపములు చేయకుండ ధర్మముగా జీవించుట వల ఆయనకు మోక్షము లభించెనని రోమాశ మహర్షి తెలిపెను. 

తన పూర్వీకుల మంచి పని కారణంగా మరియు వరగుణ మంగైలో  జన్మించడం ద్వారా అతన్ని స్వర్గానికి తీసుకువెళ్ళారని సమాధానం ఇచ్చారు. 

అలాంటి దైవిక ప్రదేశం వరగుణమంగై ....... జై శ్రీమన్నారాయణ 


56వ దివ్యదేశము -  శ్రీ మాయక్కూత్తన్  ఆలయం. తిరుకుళందై , తిరునెల్వేలి. (పెరుంకుళమ్)

⚜ ప్రధాన దైవం :మాయక్కూత్తన్

⚜ ప్రధాన దేవత :కుళందవల్లి తాయార్

⚜ పుష్కరిణి : పెరుంకుళ తీర్థం

⚜ విమానం.: ఆనందనిలయ విమానము

🌀  స్థలపురాణం 🌀 (పెరుంగుళం ) శని క్షేత్రం. 

💠 తిరుకుళందై క్షేత్రం నవ-తిరుపతులలో నాలుగోది.

శని క్షేత్రం.

స్ధానికంగా పెరుంగుళం అని పిలుస్తారు.

 💠 దీనికి కారణమేమంటే పురాణకాలం నాటి ఆలయ కోనేరు కాలగతిలో అదృశ్యమైనదిట. దానిని తిరిగి పుష్కరిణి ఉండిన స్ధలాన్ని గుర్తించారట.అలా ప్రస్తుతం మనకు కనిపించే కోనేరును పునః నిర్మించారట. అప్పట్లో దాని పేరు పెరుంగుళం. నేడు ఊరు కూడా అదే పేరుతో ప్రసిద్ధి చెందింది.

💠 మూలవిరాట్టు స్ధానక భంగిమలో చతుర్భుజాలలోని వెనుక హస్తాలతో శంఖు చక్రాలను ధరించి ముందు కుడి చేతిని వరద హస్తంగా, ఎడమ హస్తాన్ని నడుము పైన ఉంచుకొని విశేష పుష్పాలంకరణతో ప్రత్యేకంగా  కనిపిస్తారు.

 శ్రీ వెంకటవణ్ణన్ పెరుమాళ్ భక్తవత్సలుడని నిజ భక్తులను, ఆర్తితో అర్ధించిన వారిని కాపాడుతారని తెలిపే గాధలు చాలా స్థానికంగా వినబడతాయి.

💠వాటిల్లో ముఖ్యమైనది "వేదసారన్" కధ.  వేదసారన్ , కుముదవల్లి అనే దంపతులు

 శ్రీ వెంకటవణ్ణన్ భక్తులు. నిర్మలమైన భక్తితో స్వామిని ఆరాధించేవారట. వారి ఏకైక కుమార్తె కూడా తల్లితండ్రుల బాటలో నడుస్తూ తిరుకుళందైనాధర్ ని ఆరాధించేదట. వయస్సుతో పాటు ఆమె భక్తి కూడా పెరిగిపోయిందిట. 

గోదాదేవి మాదిరి ఈమె కూడా శ్రీవారిని నాధునిగా చేసుకోవాలని తలపోసిందట. పెద్దలు అది సాధ్యం కాదని నచ్చచెప్ప ప్రయత్నించారట. కానీ బాలిక వారి అనుమతితోనే తీవ్ర తపస్సు చేసిందట. ఆమె భక్తికి సంతసించిన గరుడ వాహనుడు దర్శనమిచ్చి ఆమెకు తన హృదయంలో శాశ్విత స్థానం అనుగ్రహించారట. శ్రీ వెంకటవణ్ణన్ మూలవిరాట్టు వక్షస్థలంలో కౌస్తుభ మణితో పాటు ఈమె రూపాన్ని చూడవచ్చును. 

💠"అస్మాసురన్ "అనే అసురుడు విష్ణు ద్వేషి. విష్ణు భక్తుల పట్ల అకారణ ద్వేషం కలవాడట. వేదసారన్ కుమార్తె కుముదవల్లిని  అపహరించుకొని పోయాడట. వేదసారన్ స్వామిని శరణు కోరాడట. జగద్రక్షకుడు గరుడ వాహనం మీద తరలి వచారట. అసురుని అంతం చేసి అతని దేహం మీద మహోగ్రనాట్యం చేశారట.

 ఈ కారణంగా ఉత్సవమూర్తిని రాక్షసుని మీద తాండవం చేసిన వాడు అని అర్ధం వచ్చేలా "మాయాకూతన్" అని పిలుస్తారు. శ్రీదేవి, భూదేవిల మధ్య చిద్విలాసంగా దర్శనమిస్తారు మాయాకూతన్. 

💠వినతాతనయుని విశేషం  :

పై రెండు సంఘటనలలో పెరుమాళ్ గరుడుడిని అధిరోహించి వచ్చారు. అందువలన స్వామివారు ఎప్పుడు ఏ భక్తుని కాపాడటానికి బయలుదేరుతారో అన్నది తెలియదు.  కనుక "నిత్యసూరి" అన్న తన పదవి, బిరుదును సార్ధకం చేసుకొంటూ గరుత్మంతుడు తన రెక్కలు చాపి ఎగరడానికి సిద్ధం అన్న భంగిమలో కనపడతాడు. వినతాసుతుని ఇలాంటి భంగిమలో మరెక్కడా చూడము. మిగిలిన  అన్ని చోట్లా ధ్వజస్థంభం వద్ద ముకుళిత హస్తాలతో ఉంటాడు. 

🙏 జై శ్రీమన్నారాయణ 🙏


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 57వ దివ్యదేశము 

శ్రీ నింద్రనంబి పెరుమాళ్ ఆలయం - తిరుక్కురుంగుడి, తిరునెల్వేలి, తిరుకురుంగుడి


⚜ ప్రధాన దైవం: నింద్ర నంబి పెరుమాళ్ ,  శ్రీ సుందర పరిపూర్ణన్ పెరుమాళ్

⚜ ప్రధాన దేవత:శ్రీ కురుంగుడి వల్లి తాయర్

⚜ పుష్కరిణి:కరంద మాడు పుష్కరిణి

⚜ విమానం:పంచకేతక విమానం

అదితి , కశ్యప మహరులకు శ్రీ మహావిష్ణువు వామనునిగా జన్మించి , రాక్షస చక్రవర్తి అయిన మహాబలి నుండి దేవతలను ఉద్ధరించుటకై అవతరించిన పురాణగాధ అందరకూ తెలిసినదే . 

 ఆ వామనమూర్తి  ఈ స్థలమున భరద్వాజ మహర్షి వద్ద వేద అభ్యాసము గావించెను . పరాశక్తి నుండి భిక్ష గ్రహించెను . బలి చక్రవర్తి నుండి సర్వమును గ్రహించిన త్రివిక్రమమూర్తి శ్రీమన్నారాయణుడు ఈ స్థలమున నిలిచియున్న వామన మూర్తిగా దర్శనమిచ్చును . 

ఇక్కడివాళ్ళు ఈ ఊరిని దక్షిణ వైకుంఠం అని పిలుస్తారు. వరాహస్వామి ఇక్కడ తన తాయారుతో పాటు చిన్న మూర్తిగా ఉండాలని భావిస్తాడు. అందుకని ఈ క్షేత్రానికి తిరుక్కురుంగుడి (అంటే చిన్న ఇల్లు అని అర్థం) అని పేరు వచ్చినది.

తమిళమున " నంబు " అనగా నమ్ముట అని అర్ధము . " నంబి " అనగా అందరిచే నమ్మబడిన వాడు . పెరుమాళ్ నిలిచియున్న మూర్తి గావున ,   "నింద్ర నంబి" అని కొలిచెదరు . వైష్ణవనంబి , నడందనంబి , మలైమేల్ నంబి , ఇరుంద నంబి , కిదంత నంబి , తిరుప్పాట కడల్ నంబి అని కూడ అందురు .

ఈ స్థలమునకు కొద్ది దూరమున బాణన్ అను భక్తుడు నివసించు చుండెను . ఒక ఏకాదశి దినమున ఆ భక్తుడు పెరుమాళ్ ను కొలుచుటకై పోవుచుండగా మార్గ మధ్యమున ఒక బ్రహ్మ రాక్షసుడు అడ్డగించి ఆకలి తీర్చుకొనుటకు భక్షించెదనని చెప్పగా , బాణన్ , తాను పెరుమాళ్ ను అర్చించుటకై పొవుచున్నానని , అందువలన అర్చన గావించి తిరిగి వచ్చునప్పుడు భక్షించి ఆకలి తీర్చుకొనుము అని , తాను ఆడిన మాట తప్పక నెరవేర్చు వాడను అని బ్రతిమిలాడగా రాక్షసుడు విశ్వసించి అటులనే కానిమ్ము అనెను . 

బాణన్ ఆలయమునకు పోయి , నమ్మాళ్వార్ ల పాశురములను ముఖద్వారము నుండియే పరిసరములనే మరచి అతిలోకోత్తరమైన సంగీతమున భక్తిరస పూర్ణముగా గానము చేసెను . ఆ గాన మాధుర్యమునకు భక్తి పారవశ్యమునకు అతి సంతోషముతో , బాణను పెరుమాళ్ దర్శనము కలుగు విధముగా అచ్చటి ధ్వజస్తంభము కొంచము ప్రక్కకు తొలగెను .

బాణన్ భక్తికి గానమునకు ప్రీతినొంది పెరుమాళ్ అనుగ్రహించి ఎల్లప్పుడు అదేవిధముగా గానము చేయుము అని బాణను చెప్పెను . “ నామ్ పాడువన్ " అని బిరుదము నిచ్చి అనుగ్రహించెను . తదుపరి అతి సంతోషముతో బాణన్ నేఱుగా బ్రహ్మరాక్షసుని వద్దకు బోయి భక్షించుమనెను . బాణస్ యొక్క సంతోషాతిరేకమునకు , మృత్యు భయము లేక పోవుటకు ఆశ్చర్యము చెంది బ్రహ్మరాక్షసుడు అడుగగా బాణన్ వృత్తాంతము నంతయు చెప్పెను . అంతట బ్రహ్మరాక్షసుడు " పెరుమాళ్ ను ఏ విధముగా కొలిచితివి ? ఏమి గానము చేసితివి ? ” అని అడుగగా బాణన్ తిరిగి గానము చేసి నమ్మాళ్వార్ ల పాశురములను వినిపించెను . బ్రహ్మ రాక్షసునికి హృదయాంతరాళములలో ఈ గానము చేరి ఆకలి పోయి ఆనంద పారవశ్యము , గొప్ప భక్తి కలిగెను . పెరుమాళ్ ఆదేశము ప్రకారము బాణన్ బ్రహ్మరాక్షసునికి ఆ పాశురమును ఇచ్చెను . 

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::  58వ దివ్యదేశము 

"వైత్తమానిది" పెరుమాళ్ ఆలయం. తిరుక్కోళూరు 

⚜ ప్రధాన దైవం : "వైత్తమానిది" పెరుమాళ్

⚜ ప్రధాన దేవత : కోళూర్ వల్లి తాయార్

⚜ పుష్కరిణి : కుబేర పుష్కరిణి, తామ్రపర్ణీనది

⚜ విమానం : శ్రీకర విమానము

స్థల పురాణం - ధనాధిపతి , నవనిధులు కల్గిన వాడు అయిన కుబేరుడు .

ఒకప్పుడు పరమేశ్వరునికై తపస్సు చేసి మెప్పించగా శివపార్వతులు ప్రత్యక్షమైరి. పరాశక్తి అయిన పార్వతీదేవి వర్చస్సు చూడలేక కుబేరుని కళ్లు దృశ్యశక్తి కోల్పోయినవి . 

అంతట కుబేరునికి పరమేశ్వరుడు బంగారు కళ్లు , దృశ్యశక్తిని అను గ్రహించెను . కుబేరుడు అలకాపురమును పాలించుచూ శివుని ఆప్తవర్గములో ఒకనిగా నుండెను . కుబేరుని ఆది వైశ్యునిగా చెప్పుదురు .

ధనము , నాణ్యమైన ఇతర ద్రవ్యములకై పలుప్రదేశములలో తిరుగుచూ , సంపదలను వృద్ధి పొందించుకొను వారలను వైశ్యులందురు . 

మరియొక సమయమున కుబేరుని వాచాలతకై పార్వతీ దేవి కోపించి నందు వలన ఆ ధనాధిపతి తన నవనిధులను నష్టపోయి , తిరిగి సదుపదేశము కరుణతో నొసంగిన పిమ్మట , ఈ దివ్య దేశమున శ్రీ మహావిష్ణువు కై తపస్సు చేసి పెరుమాళ్ అనుగ్రహమున నవనిధులను తిరిగి పొందెను .

ఇందలి ధర్మ సూక్ష్మమును సర్వులు తెలిసికొన వలయును . అది ఏమనగా - ధనముగాని , మరి ఏ ఇతర అమూల్య సంపదలు , ద్రవ్యములుగాని మనము సంపాదించు కొంటిమి . అని తలచుట సత్యదూరము , అంతయూ పరమాత్ముని అనుగ్రహ విశేషములే , మన వాచాలత వలన భగవంతుని అనుగ్రహ విశేషములను పోగొట్టుకొనుటకు తృటి మాత్రపు కాలము కూడ ఎక్కువయే అని , కదా !

ధర్మమును , ధర్మార్జిత ధనమును రక్షించు దేవునిగా ఈ స్థల పెరుమాళ్ ను అర్చించుదురు . .

ఈ స్థలం అజ్వర్ తిరునగరి సమీపంలో తిరునెల్వేలి జిల్లాలో ఉంది. అజ్వర్ తిరునగరి నుండి రెండు మైళ్ళ దూరంలో. బస సౌకర్యాలు అందుబాటులో లేవు. 

ఈ స్థలం నవతిరుపతిలో ఒకటి.

ఈ పెరుమాల్ ఎడమ చేతిలో శంఖం కలిగి ఉంది మరియు కుడి చేతిలో తిరు చక్రం ఉంది, దీని ద్వారా అతను అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఈ స్థలం యొక్క మూలవర్ శ్రీ వైతా మణిత పెరుమాల్. దీనిని "నిషోపవిట్టన్" అని కూడా పిలుస్తారు. 

ఇది నవతీరుపతుల ఎనిమిదవ తిరుపతి, నూట ఎనిమిది దివ్య దేశాలలో 58 మరియు నవగ్రహాల అంగారకుడు. సంపదలో రాణించడానికి మరియు కోల్పోయిన సంపదను తిరిగి పొందడానికి ఈ మందిరం వద్దకు వచ్చి పూజలు చేయడం కూడా విశేషం. 

జై శ్రీమన్నారాయణ  


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 59వ దివ్యదేశము 

శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురం. ( Trivandrum). కేరళ.

💠 ప్రధాన దైవం పేరు : శ్రీ అనంత పద్మనాభస్వామి 

💠 ప్రధాన దేవత :శ్రీహరిలక్ష్మీతాయార్

💠 పుష్కరిణి : మత్స్య పుష్కరిణి 

💠 విమానం : హేమకూట విమానము .

స్థలపురాణం - అనంతునిపై శయనించిన పెరుమాళ్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో , పద్మము యొక్క రేకుల వంటి నేత్రములతో మహా శోభాయమానముగా దర్శనమిచ్చు చుండుటచే అనంత పద్మనాభ స్వామిగా ప్రసిద్ధి నొందెను . 

పెరుమాళ్ మూర్తి నిడివి 18 అడుగులు .

 బిళ్వ మంగళ స్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై యుండెను . అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపము ప్రత్యక్షమునిచ్చెను.

అంతట ఆ బ్రాహ్మణుడు సంతోషాతిరేకమున ఏమయినా పెరుమాళ్ కు నివేదించ వలయునన్న తపనతో ఇటునటు చూచి , పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమియు లేక పోయినందు వలన ప్రక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కలనుంచి స్వామికి అర్పించెను . ఈ ఆలయమున ఇప్పటికినీ అది ఆచారముగా కొనసాగించుచున్నారు . 

కాని పచ్చి మామిడి కాయల ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదించుచున్నారు . నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికినీ సుప్రభాత సేవ చేయుదురు . 

ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి.  అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.

ఈ మధ్యనే ఈ దేవాలయం లోని నేలమాళిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. 

అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం.

 ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. 

 నేపాల్‌లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. 

 ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి.

జై శ్రీమన్నారాయణ 

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :  61వ దివ్యదేశము

శ్రీ కాట్కరై అప్ప పెరుమాళ్ ఆలయం- తిరుకట్కరై,  కేరళ 

🔅 ప్రధాన దైవం : కాట్కరయప్పన్

🔅 ప్రధాన దేవత : పెరుంశెల్వ నాయకి 

🔅 పుష్కరిణి : కపిల తీర్థము

🔅 విమానం : పుష్కల విమానము

స్థల పురాణం - విష్ణువు యొక్క 10 అవతారాలలో ఒకటైన వామనమూర్తికి అంకితం చేసిన కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం కేరళ శైలిలో వృత్తాకారంగా ఉంది. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించాడని చెబుతారు.

ఓనం పండుగ జరుపుకునే మొదటి ఆలయం ఇదే. బలి చక్రవర్తిని వామనుడు పాతలలోకం లోనికి తొక్కివేసిన ప్రదేశంలోనే తిరుక్కడ్కరై ఆలయం నిర్మించబడింది. వామనుడు బలి చక్రవర్తి కథ జరిగింది  ఇక్కడే అని చరిత్ర.

మరోవైపు, మహాబలి నాశనమైన తరువాత, కపిలముని మహావిష్ణుని మరగుజ్జు  వామనుడు రూపంలో చూడాలని అనుకున్నాడని, మరియు అతని కోరిక నెరవేర్చడానికి, మహావిష్ణువు వామనుడు రూపంలో ఇక్కడ కనిపించాడని, మరియు ఈ ఆలయం ఆనాడు  కపిలమునికి స్వామి దర్శనం ఇచ్చిన  ప్రదేశంలో నిర్మింపబడఁది. 

స్వాయంభువు మనువు కుమార్తె దేవహూతిని కర్దమ ప్రజాపతి నివాహమాడెను . దేవహూతి శ్రీమన్నారాయణునికై తపము చేసి ప్రత్యక్షము పొంది విష్ణు అంశముననే తనకు సంతానము కలుగవలయునని ప్రార్థించగా ఆ పరమాత్ముడు అట్లే అనుగ్రహించెను . ఆ విధముగా శ్రీమహావిష్ణువు అంశమున ఆ దంపతులకు పుత్రుడు కలుగగా కపిలుడు అని పేరు పెట్టిరి .ఆయనే కపిలమహర్షి.

 కపిల మహర్శి  తపస్సు చేసి శేష జీవితము గడుపుటకు అడవికి పోయెను . కపిల మహర్షి  తల్లి దేవహూతికి ఆత్మ జ్ఞానమును బోధించి ( ఆమె ద్వారా సర్వజగమునకు ఆత్మ జ్ఞానమును కపిలుడు అనగా స్వయముగా శ్రీమన్నారాయణుడే ఆ విధముగా ప్రసాదించెను . ) ఆమెను కూడా తపస్సు చేయుమని చెప్పి ఆమెను మానసికముగా ఆయత్త పరచి , తాను వెడలిపోయెను .ఆ కపిల ముని ఈ దివ్య దేశమున తపస్సు చేయగా శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమునిచ్చెను . 

ఒక భక్తుడు కపిల మునికి ప్రత్యక్షము నిచ్చిన పెరుమాళను ఆర్చించు చుండెను . అతడు తాను నాటిన పెద్ద అరటితోట పంట ఏమియూ ఈయనందున ఈ పెరుమాళ్ యొక్క దృష్టి తన తోటపై ప్రసరించినచో ఫలించును అని భావించి పెరుమాళ్ ను ఆ విధముగా ప్రార్థించెను . 

పెరుమాళ్ తన భక్తుని అనుగ్రహించెను . తన నేత్రములతో భక్తుని అరటి తోట వైపుగా చూచి ఆ తోట గొప్పగా ఫలించునట్లు చేసెను .అందువలననే ఆ అరటి పండ్లకు " నేత్రమ్ " అని పేరు కలిగినది .కేరళ రాష్ట్రము గొప్ప అరటి పండ్లకు ప్రసిద్ధి .వాటిలో " నేత్రమ్ " రకము పండ్లు చాల గొప్పవి . 

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 62వ దివ్యదేశము


శ్రీ మూళికూలతాన్ ( శ్రీసూక్తి నాథన్)-పెరుమాళ్ ఆలయం- తిరుమూళికలమ్, కేరళ 

 🔅 ప్రధాన దైవం : తిరుమూళిక్కళత్తాన్ (అప్పన్, శ్రీసూక్తి నాథన్)-

🔅 ప్రధాన దేవత : మధురవేణి తాయార్

🔅 పుష్కరిణి : పెరుంకొళ తీర్థం

🔅 విమానం : సౌందర్య విమానము.

స్థల పురాణం - విశ్వామిత్ర మహర్పి కుమారుడైన ఆరీత మహర్షికి ప్రత్యక్షమునిచ్చి అతని ప్రార్థన మేరకు " శ్రీశక్తి " మంత్రమును వివరించిన కారణమున " శ్రీ సూక్తినాథ పెరుమాళ్ " అని అందురు .

మూలవిరాట్ :  “అప్పన్ " "మూళిక్కళ్ళన్ " అను నామములతో పెరుమాళ్ తూర్పు ముఖముగా నిలిచి యున్న మూర్తి . 

కలియుగంలో సమస్యలను అధిగమించడానికి విష్ణువు ఆరీత మహర్షికి కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ సలహాలను "తిరు మోజి" గా సూచిస్తారు, అంటే 'పవిత్ర పదాలు'.

 శ్రీరాముడిని అడవులకు పంపినట్లు విన్న భరతుడు అతని కోసం పట్టాభిషేకం చేయడానికి, అయోధ్యకు తిరిగి వెళ్లేందుకు వెతుకుతాడు. అయోధ్య నుండి వస్తున్న భరతుడిని చూసి, లక్ష్మణుడు అతనిపై విసుగు చెంది అతడిని చంపడానికి ప్రయత్నించాడు. లక్ష్మణుడు వనవాసంలో భరతుని రాకను గమనించిన క్షణములో తనలో రేగిన తప్పుడు ఆలోచనలకు బాధపడి అట్టి పాప చింతన వలన సంక్రమించు దోష పరిహారార్థము ఇచ్చటి పెరుమాళ్ ను అర్చించి , గొప్ప ధ్యానము , భక్తితో సేవించి  మనస్సును స్థిమిత పరచుకొనెను .

భరతుడు శ్రీరాముని పాదుకలను తీసికొని తలపై నుంచుకొని , శ్రీరాముని ప్రతినిధిగా రాజ్యభారము వహించుటకై అయోధ్యకు పోయెను .చక్కని మాటలతో భరత లక్ష్మణులు సంభాషించుకొనిన స్థలము కావున "మోళిక్కళమ్" అని ఈ స్థలమునకు నామమై క్రమేణ తిరుమూళిక్కళమ్ అని స్థిరమైనది . భరతుడు లక్ష్మణుని తప్పుడు , పాప చింతనను మన్నించి క్షమించిన స్థలము కావున “ పాపమన్నిప్పు " అని కూడ అందురు . 

ఈ ఆలయము యొక్క గోపురము , మండపము , ప్రాకారము లక్ష్మణునిచే నిర్మితము . మరియు అతను ఈ దేవాలయానికి వివిధ సమర్పణలు చేసాడు. ఈ ఆలయం యొక్క మూలవర్ తిరుమూజిక్కలతన్. విష్ణువును అప్పన్, శ్రీ శక్తినాథపెరుమల్ అని కూడా పిలుస్తారు.

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::  63వ దివ్యదేశము


శ్రీ మాయాపిరణ్ పెరుమాళ్ ఆలయం. తిరుపులియూర్, కేరళ.

🔅 ప్రధాన దైవం: మాయప్పిరాన్

🔅 ప్రధాన దేవత: పొఱ్కొడినాయకి

🔅 పుష్కరిణి: పూంశునై తీర్థము

🔅 విమానం: పురుషోత్తమ విమానము

🔅ప్రత్యక్షం: సప్తర్షులకు

స్థల పురాణం - ఈ క్షేత్రము భీమ సేనుడు ప్రతిష్ఠించాడని భావిస్తున్నారు. పెరుమాళ్ల ముఖమండలము రజిత కవచముచే కప్పబడి ఉంటుంది.

ఈ దివ్య దేశము కూడ మహాభారత కాలమునకు ముందటిదే . ఇచ్చట సప్తఋషులకు దర్శనమిచ్చి శ్రీ మహావిష్ణువు వెలసి యుండెను .

 పంచపాండవులలో ఒకడైన భీమునిచే కురుక్షేత్ర యుద్ధములో అశ్వత్థామ అను పేరుగల ఒక ఏనుగును చంపించి , ధర్మరాజుచే అశ్వత్థామ చనిపోయెనని చెప్పించిరి . ధర్మరాజు నోటి ఆ మాటను విని ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామయే చనిపోయెనని నమ్మి అస్త్రసన్యాసము చేసి మరణించెను . కాని , ఈ చర్య భీముని బాధించు చుండెను. ఇచ్చట పెరుమాళను అర్చించి మందిరమును నిర్మించి శాంతిని పొందెను .

 శిబి చక్రవర్తి కుమారుడైన వృక్షదర్బి అను రాజు సద్గుణ సంపన్నుడే అయిననూ రాజ్యములో వరదలు వచ్చి పంటలు నశించి , తదుపరి వర్షాభావము వలన పంటలు లేక , వృక్షసంతతియు నశించగా ఏమి చేయుటకును తోచక సప్తఋషులకు దానమిచ్చినచో దేశములో తిరిగి మంచి వర్షములు కురిసి పంటలు , వృక్ష , పశు సంతతులు వృద్ధియగునని భావించి సప్త ఋషులను ఆమంత్రితులను చేసి వారికి దానమీయ బూనెను . 

 కాని ఆ ఋషులు ( అత్రి , వశిష్ఠుడు కశ్యపుడు , గౌతముడు , భరద్వాజుడు , విశ్వామిత్రుడు , జమదగ్ని)  రాజులో ఏదియో దోషము లేనిదే ఈ దుర్భిక్ష పరిస్థితి సంభవించదని తలచినవారై , అట్టి రాజు నుండి దానము గ్రహించుట అనర్థదాయకము అని భావించి దానమును నిరాకరించిరి . 

 వృక్షదర్భి రాజు కోపముతో ఋషులను వధించుటకై యాగము చేసి యజ్ఞగుండము నుండి " కృత్య " అను పిశాచి శక్తిని సృష్టించి సప్త ఋషులను వధించుమని నిర్దేశించెను . సప్త ఋషులకు ఆ శక్తిని వధించుట లేక అంత మొందించుట ఏమియు కష్టము కాదు . అయిననూ వారు శాంత చిత్తులు అయి శ్రీమన్నారాయణుని ధ్యానించి ప్రార్థించిరి . అంతట ఆ విధముగా శరణు కోరిన సప్త ఋషులకు రక్షగా యుండుము అని దేవేంద్రుని శ్రీమన్నారాయణుడు ఆదేశించెను . 

ఆ దేవుని తరుపున వచ్చి దేవేంద్రుడు కృత్యను అంతమొందించెను . శ్రీమన్నారాయణుడు సప్తఋషులకు వారి ప్రార్థన , అభ్యర్థన అంగీకరించి దర్శనమిచ్చి వారి కోరిక ప్రకారము దేవేంద్రుని ఈ స్థలములో మంచి వర్షములు కురిసి వృక్ష , పశు సంపదలు వృద్ధి యగునట్లు చేయవలసినదిగా ఆదేశించెను .

వృక్షదర్బి రాజు ఋషులు ఉపదేశించిన విధముగా యాగములు చేసి శ్రీమహావిష్ణువును ప్రార్థించగా దేశము సుభిక్షమయి , ఈతిబాధలు పోయి శాంతి వర్ధిల్లెను .

ఈ దివ్యదేశ మందిరము ప్రాకారములోనికి పోయినంతనే భువనేశ్వరి అమ్మ సన్నిధి . మూలవిరాట్ గర్భగృహమునకు బయట ఇరువురు ద్వారపాలకులు , గోడపై గణపతి విగ్రహమూర్తి గలవు .

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు : :  64వ దివ్యదేశము

శ్రీ ఇమయ్యవర్ అప్పన్ దేవాలయం, తిరుచెంకుండ్రూర్, (తిరుచిత్రారు), alleppey  కేరళ 

⚜ ప్రధాన దైవం:.ఇమయవరప్పన్

⚜ప్రధాన దేవత: శెంగమలవల్లి

⚜ పుష్కరిణి: శంఖ పుష్కరిణి 

⚜విమానం: జగజ్ఱ్యోతి విమానం

⚜ ప్రత్యక్షం:.భస్మాసుర కారణంగా పరమశివునకు

స్థలపురాణం - ఈ దివ్యదేశము ఉన్న స్థలము "తిరుచిత్రారు" అని పిలువబడుచున్నది . భస్మాసురుని చరిత్రము సుపరిచితమే కదా ! పద్మాసురుడు అను రాక్షసుడు గురించి ఘోర తపస్సు చేసి మెప్పించెను . 

శివుడు ప్రత్యక్ష మిచ్చి వరము కోరుకొను శివుని మనగా , తాను ఎవరి తలపై చేయి ఉంచునో అతడు భస్మమై పోవునట్లు వరమీయ వలయునని కోరినంత , శివుడు చేయునది లేక అట్లే వరమిచ్చెను . అందుచేతనే ఆ పద్మాసురునికి భస్మాసురుడు అని పేరు వచ్చినది .

వరము పొందిన ఆ అసురుడు పరమశివుని తలపైననే చేయి ఉంచి పరీక్షించబోయెను . శివుడు ఉపాయము తోచక పరుగెత్త నారంభించెను . 

అంతట శ్రీమహావిష్ణువు శివుని అవస్థ తెలుసుకొని చతుర్దశ భువనమోహనమైన తన మోహినీ రూపమున ఆ అసురుని కంటబడునట్లు పోయెను . 

పద్మాసురుడు మోహిని రూప లావణ్యములను చూచి , సర్వమును మరచి , తనను వరించి తనతో సుఖింపుము అని మోహినిని కోరెను . మోహిని రూపమున ఉన్న విష్ణువు అట్లే అని అంగీకరించి , తనతో సుఖము పొందుటకై ముందు సుగంధమునిచ్చు తైలమును ఆపాదమస్తకము మర్దించుకొని అభ్యంగస్నానము చేసిరావలయునని కోరగా , మహా ఆనందముతో ఆ అసురుడు తైలమును తలపై మర్దించుకొనుటకై చేయి ఉంచు కొనినంతనే భస్మమై పోయెను . 

 ఈ పురాణమును మరియొక విధముగా కూడ చెప్పుదురు . మోహిని , అసురుడు తనతో సుఖించుటకు ముందు తన వలెనే నాట్యముచేయ వలయునని కోరి , 

ఆ నాట్యములో తన్మయుడైన సమయమున తలపై చేయి ఉంచుకొను నట్లు చేయగా అసురుడు భస్మమై పోయెను . ఏది ఏమయినను శివుని రక్షించుటకై శ్రీమహావిష్ణువు తన మోహిని అవతారము గ్రహించిన తరుణమున ఆ రూపమును చూచి మతిచంచలుడైన శివుడు పరవశుడై అయ్యప్పస్వామి జన్మమునకు కారణ భూతుడయ్యెను . 

ఆ విధముగా పద్మాసురుని వధ నిమిత్తమై శ్రీమన్నారాయణుడు పరమేశ్వరునికి ప్రత్యక్షము నిచ్చిన స్థలమిది . 

 మహాభారత యుద్ధమున పాండవ అగ్రజుడైన యుధిష్ఠిరుడు ( ధర్మరాజు ) ఎల్లప్పుడు సత్యవర్తనుడు , ధర్మమును ఆచరించు వాడు అయి కూడ సమయావసరమున అశ్వత్థామ చని పోయెనని బిగ్గరగా అరచెను. నిజముగా అశ్వత్థామ అను ఒక ఏనుగు హతమైనది . ఆ విధముగా ధర్మరాజు పలికినది నిజమే కాని ఉద్దేశ్యము వేరుగా నుండినది . అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. అది నమ్మి , ధర్మరాజు అసత్యములు చెప్పడు అను నమ్మిక వలన , తన కుమారుడు మరణించెనని దుఃఖముతో ద్రోణుడు అస్త్రములను వదలి వెంటనే చనిపోయెను . 

ధర్మరాజు అశ్వత్థామ అను పేరుగల ఏనుగు చనిపోయి తన ఉచ్చారణాను సారము సత్యమునే వచించినను , ఉద్దేశ్యము వేరొకటి కావున , తనను అపరాధిగానే భావించుకొని పరిహారార్థమై 

ఈ దివ్యదేశమున పెరుమాళ్ ను పూజించి , గొప్ప ధ్యానము చేసి , పెరుమాళ్ కు గొప్ప మందిరమును నిర్మించెను . ఆ విధముగా ఈ దివ్యదేశము మహాభారత యుద్ధమునకు ముందే వెలసినది అని తెలియు చున్నది .

పశ్చాత్తాపం, గందరగోళం మరియు వారు చేసిన తప్పుడు పనుల గురించి ఆలోచిస్తూ మనశ్శాంతిని కోరుకునే వారు ఈ దేవాలయానికి వచ్చి భగవంతుడిని పూజించి, మనశ్శాంతి మరియు ప్రశాంతతను పొందవచ్చు. ఇవే కాకుండా, భక్తులు భయాన్ని వదిలించుకోవడానికి, రోగాల నుండి విముక్తి పొందడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మరియు అడ్డంకులను తొలగించడానికి పూజ కోసం కూడా ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలో భక్తులకు పాలను సమర్పిస్తారు.

ఈ ఆలయం రోజూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  :: 65వ దివ్యదేశము 

నవ ముకుందన్ పెరుమాళ్ ఆలయం, తిరునవాయి, కేరళ 

⚜ ప్రధాన దైవం: నవముకుందన్

⚜ప్రధాన దేవత: మలర్ మంగై తాయార్ 

⚜పుష్కరిణి: శెంగమల పుష్కరిణి

⚜ విమానం: వేద విమానం

స్థలపురాణం - మనోహరమైన భరతపుళ అను నదీ తటమున వెలసిన ఈ దివ్యదేశమున శ్రీమహాలక్ష్మి శ్రీమన్నారాయణుని సుందర మూర్తిని ప్రతిష్ఠించుకొని ప్రక్కనే యున్న ఒక కొలను నుండి కమలములను కోసి తెచ్చి పెరుమాళ్ కు సమర్పించి , అలకరించి , అర్చించు చుండెను .

ఒక గజేంద్రుడు ( ఏనుగు) కూడ ఆ పెరుమాళ్ యందు మహాభక్తి తత్పరుడై ఉండెను. శ్రీమన్నారాయణుని ధ్యానమునే సదా కాలము గడుపుచు ఆ గజేంద్రుడు ఆ కొలను నుండియే కమలములను కోసి తెచ్చి పెరుమాళ్కు సమర్పించి అర్చించుచుండెను . 

కాని గజేంద్రుడు ఈ విధముగా చేయుట లక్ష్మీదేవికి ఇష్టములేకుండెను .

శ్రీమన్నారాయణుని వక్షస్థలవాసియై శోభనొందు ఆ శ్రీదేవి , తాను స్వయముగా ప్రతిష్ఠించి తన ఆనందము కొరకు తనకు నచ్చిన రీతిలో పెరుమాళ్ ను అలకరించుకొని భక్తితో ప్రేమతో అర్చించుకొనుచున్న సుందరమూర్తిమంతమైన పెరుమాళ్ ను మరియొకరు అలంకరించుట , అర్చించుట , తను ఏ కొలనులో కమలములు కోయుచున్నదో ఆ కొలనులోని కమలములను ఇంకొకరు కోసి పెరుమాళ్కు సమర్పించుట అనునవి అన్నియు సహించ లేకుండెను . 

అందువలన ఆ దేవి చాలా ముందుగా పోయి కొలను లోని కమలములను కోసివేసి పెరుమాళ్ పూజకు , అలంకరణకు వినియోగించు చుండెను . 

కొలనులో ఒక కమలము కూడ లేకుండుట గజేంద్రునికి చాలా బాధకలిగి , శ్రీమన్నారాయణుని అర్చించుటలో తాను చేసిన లోపములే అందుకు కారణమని భావించుకొని అతి దీనముగా పెరుమాళ్ ముందు మ్రోకరిల్లి హృదయమున గాఢముగా పెరుమాళ్ ను ప్రతిష్ఠించుకొని గొప్ప ధ్యానమున ప్రార్థించుచుండెను . 

గజేంద్రుని అట్టి నిర్మల భక్తికి సంతోషించిన పెరుమాళ్ శ్రీమహాలక్ష్మి యొక్క ఆలోచన సరియైనది కాదు అని తలచి , “ దేవీ ! ఆ గజేంద్రుడు మన భక్తుడు . తనను , తన భక్తిని సంపూర్ణముగా నాయందు సమర్పించుకొని నిర్మలమైన అంతరంగమున నిండుగా నన్ను ప్రతిష్ఠించుకొని తన్మయుడై అర్చించి మహానందమును పొందువాడు . నీకు నాయందు గల అమిత అనురాగము వలన నన్ను ఎంత చూచుకొని అలంకరించి అర్చించుకొనినను తనివి తీరని నీ అంతరంగము నాకు తెలియనిదా !  దేవీ ! నా ప్రక్కనే ఆసీనురాలివై గజేంద్రుని పూజలను స్వీకరించుము . 

ఈ గజేంద్రుడు మనకు పుత్రసమానుడు . పుత్రవాత్సల్యముతో అతనిని చూడుము . నీకును ఎంతయో ఆనందదాయక మగును " అని బోధించెను . అంతట లక్ష్మీదేవి తన ఆలోచనలోని సంకుచితత్వమునకు చింతించి , గజేంద్రుని నిర్మలమైన భక్తి ముందు తన భావనలు ఎంత నిమ్నమైనవో గ్రహించి , తన నాథుని యెదుట లజ్జిత వదనయై నిలిచియుండెను . శ్రీమన్నారాయణుడు ఆమెను బుజ్జగించి , “ దీనికి అంతకును నీకు నాయందుగల స్త్రీ సహజ ప్రేమయే కారణము బాధపడకుము " అని చెప్పి లక్ష్మీదేవిని తనచెంతనే కూర్చుండ బెట్టుకొనెను . 

 పెరుమాళ్ ఈ విధముగనే గజేంద్రునికి దర్శనమిచ్చి అనుగ్రహించెను . 

పురాణాల ప్రకారం తొమ్మిది మంది యోగులు పెద్ద యజ్ఞం చేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకున్నారు. మొదటి ఎనిమిది విగ్రహాలు భూమిలోకి మునిగిపోయాయి మరియు తొమ్మిదవది దాని మోకాళ్ల వరకు మునిగిపోయింది. అలాంటి తొమ్మిదవ విగ్రహం కనుక, ఇక్కడ పెరుమాళ్ "నవముకుండ పెరుమాళ్" అని పిలువబడుతుంది. 

పెరుమాళ్ ప్రీతితో దర్శనమిచ్చిన కారణమున ఈ దివ్యదేశమునకు “ తిరునవయోగై " అని పేరు కలిగి కాలక్రమమున " తిరునావాయ్ " అని స్థిరపడినది .

 మునిగిపోయిన విగ్రహాల ప్రదేశం తెలియదు కాబట్టి, స్థానిక భక్తులు మోకాళ్లపై ప్రదీక్షిణ చేస్తారు.

మలైనాడు సన్నిధులలో తాయార్లకు వేరుగా సన్నిధి ఇచట మాత్రమే ఉంది. సర్వేశ్వరుని వియోగముచే కలిగిన దుఃఖ సముద్రమును దాటించు నావ వంటి వాడు ఈ స్వామి.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 66వ దివ్యదేశము 

కోలపిరాన్ /శ్రీవల్లభన్ పెరుమాళ్ ఆలయం, తిరువల్లాయ్, కేరళ





⚜ ప్రధాన దైవం: తిరువాళ్ మార్బన్ , కోలపిరాన్ , శ్రీవల్లభన్

⚜ ప్రధాన దేవత: షేల్వ తిరుకొలందు నాచియార్, వత్స్యల్య దేవి .

⚜ పుష్కరిణి: ఘంటా కర్ణ తీర్థం, పంపానది.

⚜ విమానం: చతురంగ కోలా విమానం

స్థలపురాణం - పరమేశ్వరుని గణనాయకులలో అతి రూపుడు , భయంకరుడు అయిన ఒకడు ఉండెను . అతడు పరమశివుని భక్తితో పూజించి నరబలి చేసి నైవేద్యము పెట్టి ఆరగింపు చేయుచుండెడి వాడు . అంతట పరమేశ్వరుడు నరబలి చేయుట చాలా పాపము అని వివరించి చెప్పి ఇకపై అట్టి పాపకృత్యములు చేయకుండుటకై నిర్దేశించి మరియు " సంచితపాప నివృత్తికై శ్రీమన్నారాయణుని అష్టాక్షరీ మంత్రమును నిష్ఠతో జపము చేయుచు , నారాయణ ధ్యానము చేసి ముక్తిని పొందుము . 

శ్రీ మహావిష్ణువును ఆ విధముగా ధ్యానించి , జపించి , స్తుతించిననే నీకు మోక్షము దొరకును " అని ఉపదేశించెను . తదుపరి ఆ శివగణనాయకుడు “ ఓం నమో నారాయణాయ " అను అష్టాక్షరి మంత్రమును జపించుచు , విష్ణువు నందు మాత్రమే భక్తి కలిగి యుండుటకై , తన చెవులకు గంటలు కట్టుకొని ఆ గంటల శబ్దములో శివ శబ్దము వినబడకుండునట్లు కాలము గడపుచు శివుని మరచి విష్ణువు నందు మాత్రమే ధారణ కుదుర్చుకొను యత్నము చేయు చుండెను .

విష్ణు పూజలు క్రమము తప్పక చేయుచుండెను . కాని ఎల్లప్పుడు శివుని మరచి పోవుటకై చేయు యత్నములో నిరంతరము అతనికి శివుని యందే ధ్యాస నిలుచుచుండెను . 

అయినను అష్టాక్షరీ మంత్రము ( ఓం నమో నారాయణాయ ) ను జపించుచు , విష్ణువునకై తపించుచు , ఎల్లప్పుడు విష్ణు పూజలు చేయుచుండెను . 

ఆ విధముగా ఇరువురు దేవుళ్లనూ పూజించిన గొప్పఫలము కలిగి , శ్రీమన్నారాయణుని కరుణా వృష్టి అతనిపై పడి పెరుమాళ్ దర్శనమును పొందెను . అతనిని ఘంటా కర్ణుడు అందురు . చక్కని ఆదర్శవంత జీవితము గడపి దేహాంతమున మోక్షమును పొందెను .

విష్ణుమందిరములలో తులసీ చందనములను , శివమందిరములలో విభూతిని ప్రసాదముగా ఇచ్చెదరు . కాని , పైన వివరించిన అన్యోన్యత , అభేద వివరణలకు ప్రతీకగా ఈ దివ్యదేశమున విభూతిని ప్రసాదముగా ఇచ్చెదరు . 

 ఈ దివ్యదేశములో పెరుమాళ్ ను శంకర మంగళ తన్మయి అను ఒక స్త్రీ గొప్ప భక్తితో పూజించుచు ఏకాదశీ వ్రతమును ధర్మము తప్పక ఆచరించుచు వ్రతనియమము ప్రకారము ఒక బ్రహ్మచారికి ద్వాదశియందు భోజనము పెట్టి తరువాత తాను భుజించు చుండెను .

 కాని ఒక ద్వాదశి దినమున బ్రహ్మచారి ఎవరును కనిపించక చింతతో నుండి వేళ అతిక్రమమగుచుండుటచే ఆ విష్ణుభక్తురాలు శ్రీమహావిష్ణువును ప్రార్థించి తన వ్రతము నియమము తప్పక సాగునట్లు కరుణించుమని కోరెను . 

ఆ ప్రదేశములో తోళకాసురుడు అను ఒక రాక్షసుడు మార్గమును నిరోధించి ఎవ్వరినీ శంకర మంగళ తన్మయి యుండు చోటునకు పోనీయకుండెను . ఆ భక్తురాలి ప్రార్థనను మన్నించిన శ్రీమహావిష్ణువు స్వయముగా ఒక బ్రహ్మచారి రూపమున వచ్చు చుండగా మార్గమున అడ్డగించిన  తోళకాసురుని వధించి ఆమె ముందునకు వచ్చెను. శంకర మంగళ తన్మయి వచ్చిన ఆ బ్రహ్మచారిని అర్థించి కాళ్లు కడిగి భోజనము వడ్డించెను . 

బ్రహ్మచారి రూపమున వచ్చి భోజనము చేయుచున్న శ్రీమహావిష్ణువును గమనించుచున్న శంకర మంగళ తన్మయి తన జ్ఞాననే త్రమునకు పెరుమాళ్ వలె తోచి , బ్రహ్మచారి హృదయము పై నున్న వస్త్రమును తొలగించుమని కోరెను . బ్రహ్మచారి ఆ విధముగా వస్త్రమును తొలగించగానే వక్షస్థలవాసియైన శ్రీమహాలక్ష్మి కనిపించెను . 

పెరుమాళ్ ను దర్శించిన ఆ భక్తురాలి ఆనందమునకు అవధులు లేకుండెను . తన్మయమున స్తుతించి గానము చేసెను . అట్లు దర్శన మిచ్చిన పెరుమాళ్ “ శ్రీవల్లభన్ ” అనునామమున ప్రసిద్ధి నొందెను .

ఈ సన్నిధి లోపలకు స్త్రీలను రానీయరు. వెలుపలనుండియే సేవింపవలెను. కానీ ధనుర్మాసములో ఆర్ద్ర నక్షత్రమునాడు, మేష సంక్రాంతినాడు మాత్రము లోపలకు రానిత్తురు.

ఈ క్షేత్రమునకు శ్రీవల్లభ క్షేత్రమని తిరునామము ఉంది.

ఈ స్థలం యొక్క థాయర్ సెల్వ తిరుక్కొజుండు నాచియార్, దీనిని వాత్సల్య దేవి అని కూడా అంటారు

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  :: 67వ దివ్యదేశము 

తిరువన్వందూర్ - శ్రీ పాంబనయ్యప్ప పెరుమాళ్ ఆలయం; తిరువణ్ వండూరు 

 @ ప్రధాన దైవం: పాంబణయప్పన్

@ ప్రధాన దేవత: కమలవల్లి త్తాయార్

@ పుష్కరిణి: పాపనాశపుష్కరిణి

@ విమానం: వేదాలయ విమానము

@ ప్రత్యక్షం: మార్కండేయునకు, నారదునకు

స్థలపురాణం :  - ఈ క్షేత్రము నకులునిచే ప్రతిష్ఠ చేయబడినదని భావిస్తున్నారు. ఆళ్వార్లు అనేక విధముల సర్వేశ్వరుని ప్రార్థించియు అభీష్టము లభింపక "దానికేమి కారణమని" ఆలోచించి "శ్రియ:పతి తిరువణ్ వణ్డూరులో ఉండి అచటి పూజలకు పరవశుడై తనను మరచి యుండు" నని భావించి స్వామియొక్క ఆర్తరక్షణ దీక్షను గుర్తుచేయదలచి సముద్రతీరమున సంచరించు పక్షులను శ్రియ:పతి యొద్దకు దూతలుగా పంపారు.

మహాభారతం ప్రకారం, పంచ పాండవులు కేరళకు వచ్చినప్పుడు చాలా శిథిలావస్థలో ఉన్న ఈ స్థలాన్ని నకులు పునర్నిర్మించారు మరియు మరమ్మతులు చేయడంతో ఈ ప్రదేశం నకులచే సృష్టించబడిందని చెబుతారు. 

ఇది వృత్తాకార గర్భాలయంతో కనుగొనబడింది. 

ఒకసారి నారద మహర్షి బ్రహ్మ చేత శాపానికి గురయ్యాడని మరియు నారదుడు శ్రీ నారాయణుడిని పూజించడానికి ఇక్కడికి వచ్చాడని అంటారు. 

శ్రీ మన్నారాయణుడు 'జ్ఞానo' తో ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయమని నారదునికి సలహా ఇచ్చాడు మరియు ఇక్కడ నారద పురాణం ఇక్కడ వ్రాయమని అతడిని ప్రేరేపించాడు.

ప్రధాన దైవం పాంబనయ్యప్పన్ నిలబడి ఉన్న భంగిమలో తన కుడి చేతిలో శ్రీ చక్రం మరియు ఎడమ చేతిలో తామరతో అద్భుతంగా కనిపిస్తాడు. అతడిని "కమలనాథన్" అని కూడా అంటారు.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు : :  68వ దివ్యదేశము 








శ్రీ ఆదికేశవ పెరుమాళ్ దేవాలయం, తిరువట్టర్. కేరళ. 

⚜ మూలవర్ : ఆదికేశవ పెరుమాళ్ 

⚜ తాయార్: మరకతవల్లి నాచ్చియార్

⚜ పుష్కరణి: కదల్వాయి తీర్థం, వాట్టారు తీర్థం, రామ తీర్థం

⚜ విమానం: అష్టాంగ, అష్టాక్షర విమానం

🌀స్థలపురాణం 🌀

💠 తిరువనంతపురము వలెనే ఇచ్చటనూ పెరుమాళ్ దర్శనము 3 ద్వారముల ద్వారా చేయవలయును .

💠 పెరుమాళ్ మూర్తి నిడివి 22 అడుగులు . అనగా తిరువనంతపురము అనంత పద్మనాభ స్వామి మూర్తి కంటే 4 అడుగులు ఎక్కువ .ఈ దేశమున పెరుమాళ్ నామము ఆదికేశవస్వామి .

💠కేశి అను రాక్షసుడు జనులను చాల బాధలకు గురి చేయుచుండగా శ్రీమన్నారాయణుడు వానిని యుద్ధమున ఓడించి అతని దేహముపై పరుండెను . 

💠 పద్మనాభుడు నాభి లోంచి ఉద్భవించిన బ్రహ్మ ఈ తిరువట్టార్ పెరుమాళ్ కి లేడు.  నాభి స్థానములో నిలువెత్తు శ్రీదేవి భూదేవి విగ్రహములు దర్శనమిస్తాయి. అనంత పద్మనాభుడు వీరికి తమ్ముడు అని ఇక్కడి వారి అభిప్రాయము. సన్నిధి కూడా తిరువనంతపురములో లాగే ఉంటుంది. గర్భాలయమునకు  ముందు ఉండే మండపమునకు ఉదయ మార్తాండ మండపము అని పేరు. ఈ మండపములో వేణుగోపాలుడు, చతుర్ముఖుడు, నమ్మాళ్వార్ ఆరు అడుగుల విగ్రహములు దర్శనము. ఇక్కడ సూర్యాస్తమయమున సూర్యుని కిరాణాలు స్వామి తిరుముగంను తాకును. చంద్రోదయం తో చంద్రుడు స్వామి దర్శనం చేసుకొనును. 

💠 ఒకప్పుడు బ్రహ్మ ఈ ప్రాంతములో యజ్ఞము తలపెట్టారు. ఈ విషయము సరస్వతి దేవికి చెప్పలేదు. దానితో ఆమెకు కోపము వచ్చింది. ఋత్వికులు మంత్రాలు ఉచ్చరిస్తుండగా స్వరస్వతి దేవి వారి మంత్రోచ్ఛారణ లో తప్పిదములు వచ్చినట్ట్లు చేయగ, యజ్ఞం  నుండి యజ్ఞ పురుషుని బదులు  కేసు, కేసి అనే రాక్షషులు పుట్టారు. వీరు లోకాలను పీడించ సాగారు. యజ్ఞ గుండము నుండి పుట్టినందువల్ల వారిని ఎవ్వరూ సంహరించలేకపోయినారు.  విధాత శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. 

💠పెరుమాళ్ ఇక్కడ కేసు అనే బ్రహ్మరాక్షసుడినితో ఏడు దినములు యుద్ధము చేసెను. కేశు వధించబడలేదు. శ్రీమన్నారాయణునికి కోపము వచ్చి కేశును మహేంద్రగిరి నుండి విసిరి వేసి వాని గుండెలు పగిలేలా పాంచజన్యమును పూరించాడు. వాడు ఆ ధ్వనికి వెంటనే లేవలేకపోయాడు. ఇది ఆదిశేషుడు గమనించి వానిని తన శరీరముతో చుట్టివేసేను. శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై శయనించేను.   కేసు చెల్లెలు కేసి ఇది గమనించి తన స్నేహితురాలితో కలసి నదులుగా మారి పెను ప్రళయముగా వచ్చి ముంపునకు గురి చేయును. అప్పుడు పెరుమాళ్ భూదేవిని తన స్థలమును పైకి లేపమని ఆదేశించేను. పెరుమాళ్ కోపగించి కెశిని నది గానే ఇచ్చట ఉండమని శపించేను. 

💠అందువలన ఈ రెండు నదులు కోవిల చుట్టూ పెరుమాళ్ ని మ్రొక్కుతూ వెళ్తున్నట్టు వెళ్ళును. కానీ పెరుమాళ్ ని నీట ముంచ లేకపోయినవి  కానీ అది కేసు శారీరమును నీరు తాకడము వలన రాక్షసుడు మోక్షము పొందెను అందుకే ఈ పెరుమాళ్ ని ఆది కేశవ పెరుమాళ్ అని పేరు. 

💠 ఈ స్వామి తిరువనంతపుర రాజులకు ఇష్ట దైవము. పూర్వము వీరు 1200 కేజీల ప్రసాదము నైవేధ్యముగా ప్రతి నిత్యము పెరుమాళ్ కి సమర్పించేవారుట కానీ ఇప్పుడు ఆ వైభోఘము మనకి కనిపించదు. తైల దీపాల వెలుగులో స్వామి అద్భుతముగా దర్శనము ఇచ్చును.

💠అనంతపద్మభన్/ఆదికేశవపెరుమాళ్ ఆకారంలో ఉన్న విష్ణువు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం కంటే పాతదిగా భావిస్తారు.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  ::  69వ దివ్యదేశము


శ్రీ ఉయ్యవంత పెరుమాళ్ ఆలయం;  తిరువిత్తువక్కోడు 

⚜ ప్రధాన దైవం:.ఉయ్యవంద పెరుమాళ్

⚜ ప్రధాన దేవత: విత్తువక్కోడువల్లి త్తాయార్

⚜పుష్కరిణి: చక్రతీర్థము

⚜విమానం: తత్త్వకాంచన విమానము

⚜ ప్రత్యక్షం: అంబరీషునకు

🌀 స్థలపురాణం 🌀

💠 ఈ ఆలయము శైవ , వైష్ణవ సంప్రదాయముల పరస్పర సదవగాహనమునకు , సద్భావమైత్రికి ప్రతీక అయి ఉన్నది . 

💠ఆలయమున ప్రవేశించగానే శివుని సన్నిధి ఆ వెనుక వైష్ణవ సన్నిధి కలదు.

 💠ఈ స్థల పెరుమాలను శివాంశము కూడ కలిగియున్నట్లుగా వర్ణింతురు .

💠అంబరీషునకు ప్రత్యక్షమైన ఈ పెరుమాళను పంచపాండవులు అర్చించిది . అంబరీషుని ప్రార్ధనపై నాలుగు దిశల నుండి అర్చింపబడుట కై పెరుమాళ్ అంగీకరించి వరమిచ్చిన కారణమున ఆ విధముగానే వెలసిన పెరుమాళను నాలుగు ద్వారముల నుండి దర్శించుకొన వచ్చును .

💠ధర్మరాజు మధ్యనున్న పెరుమాళ్ మూర్తిని , ఎడమ ప్రక్క మూర్తిని భీముడు , పశ్చిమ మూర్తిని అర్జునుడు , కుడి ప్రక్క మూర్తిని నకుల సహదేవులు అర్చించిరి . 

💠 ఈ స్థలము అంబరీషుని ముక్తి స్థలము అని పురాణము .

💠ఇది శ్రీవైష్ణవుల మలైనాడు దివ్యదేశాలలో ఒకటి. శివుడికి సన్నది వెనుక భాగంలో, ఉయ్యవంత పెరుమాళ్ యొక్క సన్నిధి ఉన్నది.

💠 భగవంతుడు ఉయ్యవంతను అభయ ప్రథన్ అని కూడా అంటారు. ఈ ఆలయం మహాభారత కాలం నుండి ఉంది మరియు పంచ పాండవుల ద్వారా పూజించబడే ఒకే ఆలయంలో లోపల నాలుగు సన్నిధులు ఉన్నాయి.

💠అంబరీషడు శ్రీ ఉయ్యవంత పెరుమాళను స్తుతించి, తన 'వ్యూహాత్మక దృష్టి' తనకు అనుగ్రహించమని కోరాడు. వ్యూహాత్మక దృష్టి అంటే ఏ కోణం నుండి చూసినా పెరుమాళ్ కనిపించే రూపం.

💠 పెరుమాళ్ అంబరీషన్‌కు వ్యూహాత్మక దృష్టిని ఇచ్చినప్పుడు, పంచ పాండవులు కూడా ఆ దర్శనాన్ని చూసే విశేషాన్ని పొందారు. దానిని దృష్టిలో పెట్టుకుని వారు పెరుమాళ్ విగ్రహాన్ని విడిగా సమర్పించారు. ఇది భక్తుడు అంబరీషడు మోక్షం పొందిన ప్రదేశం మరియు పంచపాండీలకు మోక్షం లభించింది.

💠ఈ స్థలంలో దీపాలను వెలిగించి, తులసితో పెరుమాళ్‌తో పూజించడం విశేషం! 

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 70వ దివ్యదేశము  


శ్రీ అద్బుత నారాయణ పెరుమాళ్ ఆలయం-తిరుక్కడితానం,  కేరళ 

⚜ ప్రధాన దైవం:అద్బుత నారాయణన్

⚜ ప్రధాన దేవత:.కల్పకవల్లి త్తాయార్

⚜ పుష్కరిణి: భూమి పుష్కరిణి

⚜ విమానం: పుణ్యకోటి విమానము

🌀 స్థలపురాణం 🌀

💠రుక్మాందుడు అను సూర్య వంశ చక్రవర్తికి మహా సద్గుణ సంపన్నుడు , విష్ణుభక్తుడు , జ్ఞానులను, యోగులను విష్ణుభక్తులను గొప్పగా ఆదరించి పూజించి సత్సంగములను చేయు చుండెడివాడు . ఆ రుక్మాంగదుని గొప్ప గుణములను వశిష్ఠ మహర్షి చెప్పుచుండగా దేవేంద్రుడు విని పరీక్షించుటకై నారద మహర్షిని కోరెను .

💠నారద మహర్షి రుక్మాంగదుని వద్దకు విచారించుటకై పోయెను . రుక్మాంగదుడు నారదమునికి పాద పూజ చేసి ఘనముగా సత్కారములు చేసి , ఒక విశిష్టమైన పూలమాలను నారదుని కంఠమున అలంకరించి , వైకుంఠమున విరాజమానుడై యుండు శ్రీ , భూ సమేత శ్రీమన్నారాయణుని రూప లావణ్యములను , అనేక ఇతర సమాచారములను సకల దేవ , దేవతా గణముల వివరములను వినయముతో అడిగి , శ్రద్ధతో విని , తన్మయుడై ఆనందించెను , నారద మహర్షి రుక్మాంగదుని శ్రద్ధ , భక్తి , వినయములకు సంతసించిన వాడై దేవలోకమునకు పోయి సకల దేవతా సమక్షమున దేవేంద్రునకు , వశిష్ఠ మహర్షి చెప్పిన వివరములను సమర్థించి చెప్పెను . 

💠రుక్మాంగదుడు నారద మహర్షి కంఠమున అలంకరించిన పుష్పమాల అతి మనోహారమైన సువాసనలను వెదజల్లు చుండుట గమనించిన దేవేంద్రుడు నారదుని వలన విని ఆ పుష్పములు రుక్మాంగదుని పూవుల తోటలోనివి అని తెలుసుకొని , ప్రతిరోజు ఆ పుష్పములను కోసి తెచ్చుటకై తన గణమునకు ఆదేశించెను . 

💠గురు ఉప దేశమున రుక్మాంగదుడు తదుపరి రాత్రి తెల్ల ఉల్లి మొక్కలను తోటలో నాటి కావలి యుండుటకై నిర్దేశించెను . తెల్ల ఉల్లి ( వెల్లుల్లి ) మొక్కలు నాటినచో వాటినుండి వెలువడు కాంతి , వాసనల వలన విషయము తేట తెల్లమగును అని రాజగురువు ఉపాయమును బోధించగా రుక్మాంగదుడు ఆ విధముగా ఆదేశించెను . భటులు ఆ తెల్ల ఉల్లి మొక్కలను నాటి కావలికాయగా ఆ రాత్రి తెల్ల ఉల్లి వాసనలకు దేవతాగణము యొక్క శక్తులు హరించిపోయి రాజ భటులకు కనిపించగా వారిని రాజు వద్దకు తీసికొని పోయిరి . రుక్మాంగదుడు వివరములను వారి నుండి విని ఏమియూ కోపించక వారిని సత్కరించెను . 

💠ఆ దేవతా గణముకి ఎవరైనా తమ ఏకాదశి ఉపవాస పుణ్య ఫలములో కొంత భాగము దానమిచ్చినచో తమ శక్తులను తిరిగి పొందవచ్చు అని, రుక్మాంగదునితో ఆ రోజు ఏకాదశి కావున , ఉపవాసము ఉండిన ఎవరైన తమ ఉపవాస ఫలం ఇస్తే  తము దేవలోకమునకు పోవగలుగుదుము అని విన్నవించగా , రుక్మాంగదుడు అట్టి వారికై విచారించి తెమ్మని భటులకు ఆనతిచ్చెను .

💠భటులకు ఎంత విచారించినను ఎవరూ ఉపవాసముండిన వారు తటస్థించలేదు . కాని ఒక చాకలి స్త్రీ తన భర్తతో ఇంటిలో తగవు వలన అలిగి భోజనము చేయక ఉండుట గమనించి ఆమెతో విషయమును చెప్పి రాజు వద్దకు తీసికొని వచ్చిరి . ఆ చాకలి స్త్రీ ఏకాదశి ఉపవాస పుణ్యఫలము యొక్క మహత్వమును తెలిసికొనినదై ఆ ఫలములో కొంత భాగము దానమిచ్చుటకు అంగీకరించి ఇవ్వగా ఆ దేవతాగణము తమ తమ శక్తులను తిరిగి పొంది దేవలోకమునకు పోయిరి . 

💠ఈ విధముగా ఏకాదశీ వ్రత పుణ్య ఫలము యొక్క విశిష్టతను శ్రీమన్నారాయణుడు రుక్మాంగద చక్రవర్తి ద్వారా లోకమునకు తెలియ జేసెను .

💠 అప్పటినుండి రుక్మాంగదుడును ఏకాదశీవ్రత మాచరించి అమిత భక్తి ప్రపత్తులతో శ్రీమహావిష్ణువును కొలిచి అర్చించుచుండెను . పెరుమాళ్ అతని భక్తికి సంతసించి ప్రత్యక్షమునిచ్చి ఇచ్చట వెలసి యుండి భక్తులను బ్రోచుచున్నాడు .

💠ఇది కేరళలో  పంచ పాండవులు నిర్మించిన ఐదు దేవాలయాలలో ఒకటిగా భావిస్తారు. తిరుచిత్తత్ మహా విష్ణు దేవాలయం యుధిష్ఠిరుడు, తిరుపులియూర్ మహావిష్ణు దేవాలయం భీముడు, అరణ్ముల పార్థసారథి దేవాలయం అర్జునుడు, తిరుమలవందూర్ మహావిష్ణు ఆలయం నకుల. సహదేవుని ద్వారా ఈ త్రికోడితనం మహావిష్ణువు ఆలయం.

💠పురాణాల ప్రకారం, సహదేవుడు తప్ప పంచపాండవులు మహావిష్ణువు విగ్రహాలను పొందారు. సహదేవుడు సుదీర్ఘ అన్వేషణలో పాల్గొని తపస్సు చేసాడు, కానీ అతని గుడికి విగ్రహం లభించలేదు. అణగారిన సహదేవుడు అగ్నిగుండం మీదకు దూకి తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. అకస్మాత్తుగా అగ్ని నుండి చతుర్భుజంతో (నాలుగు చేతులు) ఉన్న మహా విష్ణు విగ్రహం బయటపడింది. విగ్రహం గొప్ప ఆశ్చర్యం కలిగించేది, దీనిని అద్భుత నారాయణ (అద్భుత విగ్రహం) అని పిలుస్తారు.

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 71వ దివ్యదేశము 

తిరుక్కుఱళప్పన్ దేవలవమ్, ( పందళం ),  తిరువాఱన్ విళై, కేరళ 

⚜ ప్రధాన దైవం : తిరుక్కుఱళప్పన్

⚜ ప్రధాన దేవత : పద్మాసనవల్లి త్తాయార్

⚜ పుష్కరిణి : వ్యాస పుష్కరిణి

⚜ విమానం : వామన విమానము

🌀  స్థలపురాణం 🌀

💠 ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన జ్ఞాన గ్రంథమును పోగొట్టుకొని ఈ స్థలమున తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షము నిచ్చి పోయిన జ్ఞానము , జ్ఞాన గ్రంథము తిరిగి పొందునట్లు బ్రహ్మదేవుని ఆశీర్వదించి , బ్రహ్మదేవుని ప్రార్థనపై ఇచ్చట వెలసి యుండి భక్తులను బ్రోచుచున్న దివ్యదేశమిది . 

💠ఆ విధముగా వెలసిన పెరుమాళు పంచ పాండవులలో ఒకడు అయిన అర్జునుడు కర్ణుని చంపుటలో తాను అధర్మముగా వర్తించిన తీరునకు సిగ్గు , బాధ , పాపకర్మము చేసితినను భావము అన్నియు కలిగి చాలా దుఃఖించి , ఆ పాపనివృత్తికై ఇచ్చట పెరుమాళ్ మందిరమును నిర్మించి అర్చించెను . 

  💠 వామన రూపునిగా వెలసి యున్న శ్రీమన్నారాయణుని పార్థసారథిగా కూడ కొలిచెదరు . మహాభారత యుద్ధ సమయమున అర్జునుడు కర్ణునితో యుద్ధము చేయుచుండగా కర్ణుని రథము భూమిలో దిగిపోయి కదల కుండెను. ఆ రథమును కర్ణుడు లేవనెత్తుకొనుచుండగా అర్జునుడు కర్ణునిపై బాణములు వేసి వధించెను .ఇది అంతయూ కర్ణునికి గల శాపము కారణముగా విధి లిఖితమే అని అర్జునుని సారథి ( పార్థసారథి ) శ్రీకృష్ణుడు బోధించి కర్ణునిపై బాణములు వేసి చంపుము పాపము కాదు , ఇదియే మంచి అవకాశము అని చెప్పగా ఆ విధముగా కర్ణునిపై బాణములు వేసి చంపెను. కాని మనస్సున బాధతో అధర్మ యుద్ధము చేసితినని దుఃఖించెను. ఇచ్చట పెరుమాళ్ ను అర్చించి శాంతిని పొందెను .

💠 ఈ ఆలయంలో అజీర్ణ ఉత్సవము ఇంకొకటి జరుపుదురు . అగ్నిదేవుడు తన రోగ నివృత్తికై ఔషధ సేవనమునకై ఖాండవ వనమును దహించు చుండగా వర్షము వలన కష్టమునకు లోను కాకుండుటకై శ్రీకృష్ణుని , అర్జునుని ప్రార్థించెను. శ్రీకృష్ణుని నిర్దేశానుసారము అర్జునుడు ఆకాశములో శరములతో పందిరి వేసి ఖాండవ వన దహనమున తోడ్పడిన సందర్భముగా , డిసెంబరు - జనవరి నెలలో ఈ ఉత్సవమును జరిపెదరు .

💠 ఈ స్థలమునకు మరియొక మహా విశిష్టత కలదు . మహిషాసురుని సోదరి మహిషి అను రక్కసిని వధించుటకై , శివ - విష్ణు సంభూతుడై జన్మించిన అయ్యప్పస్వామి , సంతానము లేక అనేక పూజలు చేయుచున్న పందల రాజుకు లభించి ఆ రాజదంపతుల కుమారుని గా పెరిగిలోక కంటకి అయిన మహిషిని వధించెను. తదుపరి తన అవతార కారణము ముగిసినందున శివసాయుజ్యమునకు వెడలి పోయెను . ఈ స్థలమే ఆ పందల రాజు నివసించిన స్థలము . ఈ ఈ స్థలమును పందలము అనియే వ్యవహరింతురు . ఇచ్చట పందల రాజు భవనమున అయ్యప్పస్వామి ఆ భరణములను భద్రపరచి ఉంచుదురు . శబరిమల కొండపై వెలసిన లక్షలాది భక్తుల పూజలను స్వీకరించుచున్న స్వామిని అలంకరించుటకై మకరజ్యోతి దినమున ఈ ఆభరణములను తీసికొని పోయి తిరిగి తెచ్చి ఇచ్చట ఉంచి సంరక్షించుదురు .

💠 అర్జునుడు ఆరు వెదురు ముక్కలతో చేసిన పడవ  మీద భగవంతుని విగ్రహాన్ని తీసుకువచ్చినందున ఈ స్థలం  తిరువరన్విలై (ఆరు వెదురు ముక్కలు) అని కూడా పిలువబడుతుoది.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 72వ దివ్యదేశము 





దేవనాథ స్వామి పెరుమాళ్ ఆలయం ; తిరువహీందిపురం

⚜ ప్రధాన దైవం: (దేవనాథన్)

⚜ ప్రధాన దేవత: వైకుంఠనాయకి (హేమాబ్జవల్లి)

⚜పుష్కరిణి: గరుడనది,  శేషపుష్కరిణి

⚜ విమానం:చంద్రవిమానము

⚜బిప్రత్యక్షం: చంద్రునకు, గరుత్మంతునుకు

🌀 స్థలపురాణం 🌀

💠 ఆలయమునకు ప్రక్కన ఒక ఔషధగిరి కలదు . ఇది గొప్ప మహిమగల మూలికలకు నిలయము . రామాయణ కాలమున అంజనేయుడు సంజీవని పర్వతమును తీసికొని పోవుచున్నప్పుడు కొద్ది భాగము విరిగి ఈ స్థలమున పడి ఈ ఔషధగిరి వెలసినది అని చెప్పుదురు . 

💠వేదాంత దేశికులు ఈ ఔషధగిరి యందే శ్రీమన్నారాయణుని దర్శించుటకై తపస్సు చేయగా అతని తపస్సుకు పెరుమాళ్ మెచ్చి గరుడవాహనుడై హయగ్రీవమూర్తిగా దర్శన మిచ్చెను . ఈ గిరిపై యోగ హయగ్రీవ మూర్తి సన్నిది కలదు . వేదాంత దేశికులు ఈ స్థలమున 40 సంవత్సరములు నివసించిరి .

  💠 వేదాంతదేశికోత్సవములు ఇచ్చట సెప్టెంబరు - అక్టోబరు నెలలో గొప్పగా జరుగును . సాధారణముగా సర్పపూజలు చేసి సర్పముల మట్టి పుట్టలలో పాలు పోసి నివేదించుదురు . కాని ఈ స్థలమున ఆలయమున గల శేష తీర్థము అను బావిలో పాలు పోయుదురు . ఈ బావిలోని నీటితో వంటచేసి పెరుమాళ్ కు నైవేద్యము చేయుట , గరుడ తీర్థముతో తిరుమంజనము చేయుట ఇచ్చటి ఆచారము .

   💠 పాండ్యనాడున గల వానమామలై దివ్యదేశము బావిలోని నీటిలో నుండు ఒక నూనె వలన సకల రోగములు నయమగు విధముగా ,ఈ దివ్య దేశముననూ పెరుమాళ్ సకల రోగములను నయము చేయును . వానమామలై మరియు ఈ తిరు వహీంద్రపురముననూ పెరుమాళ్ దేవనాయకన్ పేరున దర్శనమిచ్చును .

💠శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారమును గ్రహించిన పురాణమును ఈ సందర్భమున స్మరించుకొన వలయును . అదేమనగా - ఒక సమయమున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ముఖమును ఆట పట్టించెను . అంతట ఆ దేవి కోపములో శ్రీ మహావిష్ణువు ముఖము మారిపోవునట్లు నుడివెను . ఆ దంపతులు ఏమి ఆచరించినను సర్వము లోక కళ్యాణమునకే కదా ! జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడు భవిష్యత్తును అంతరంగమున భావించియే ఈ సన్నివేశమును సృష్టించెను . 

హయగ్రీవుడు అను రాక్షసుని వధించుటకై అవసరమగు రీతిని తన ముఖమును హయగ్రీవ మూర్తి వలె మార్చుకొని ఆ రాక్షసుని వధించెను . హయగ్రీవ రాక్షసుడు వేయి సంవత్సరములు పరాశక్తి అనుగ్రహమునకై తపస్సు చేసి ప్రకృతి విరుద్ధముగా , తనకు మరణము అసంభవము అగునట్లు వరమును కోరుకొనెను . పరాశక్తి అది సృష్టి విరుద్ధము అని బోధించెను . 

అంతట ఆ రాక్షసుడు తప్పనిసరి అయినచో తనకు సరియగు తన రూపము గలవాని వలననే మరణము సంభవించునట్లు కోరగా పరాశక్తి ఆ వరమును అనుగ్రహించెను . తదుపరి ఆ హయగ్రీవ రాక్షసుడు దేవతలను జయించి సకల జగత్తును కల్లోల పరచుచూ , మునులను ప్రజలను

నానావిధముగా హింసకు గురి చేయుచుండెను . దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మను ఆదేశించి తనకు హయగ్రీవ రాక్షసుని వలె ముఖము , తల ఇమ్మని అడిగి అవి గ్రహించి ఆ రాక్షసుని వధించెను . ఆ విధముగ లక్ష్మీదేవి కోపమున నుడివిన మాటలు లోకకళ్యాణము కొరకే ఉపయోగపడినవి . 

💠మరియొక సమయమున ఒక చోళ చక్రవర్తి శైవమతానుయాయి అయి మందిరములను నాశనము చేయుచు ఈ స్థలమున గల హయగ్రీవ ఆలయమును నిర్మూలించు యత్నము చేయగా శ్రీ మహావిష్ణువు అతనికి శివుని రూపమున త్రిశూలధారియై త్రినేత్రునిగా జటాధారిగా దర్శన మిచ్చి , శివ - విష్ణు రూపములు వేరైననూ భగవంతుని ఒక్కనిగానే భావించుకొనవలయునని ఉపదేశించి , వైరములు మహాదోషము అని బోధించెను .

💠అందుచే ఈ స్థలమున దేవనాయక పెరుమాళ్ ఫాలనేత్రముతో త్రినేత్రునిగ జటాధారియై శంఖ చక్రములు , పద్మములు ధరించి అతి దుర్లభము , సందేశాత్మకము ఐన అతిరమణీయమైన దర్శనమిచ్చును . గరుడుడు , నర్పములు వైరులే అయినను ఈ దివ్య దేశమున జాతృభావము కలిగి శ్రీమన్నారాయణుని అర్చింతురు .

💠ఈ పట్టణం పేరు నాలుగు వేల శతాబ్దంలో 'తిరువాయింద్రాపురం' అని చెప్పబడింది. పురాణాలలో దీనిని 'తిరువకీంద్రాపురం' అని కూడా అంటారు పురాణాల ప్రకారం, విష్ణువు యొక్క ఐదు తలల పాము అయిన ఆది శేషన్ ఈ దేవాలయాన్ని సృష్టించాడు, అందుకే దీనికి తిరు వహీంద్రపురం అనే పేరు వచ్చింది (ఆది శేషునికి మరొక పేరు వహీంద్రన్).

జై శ్రీమన్నారాయణ 


భూవరాహ క్షేత్రం-  శ్రీమూష్ణం - తమిళనాడు..

శ్రీ మహావిష్ణువు భారతదేశంలో 8 ప్రదేశాలలో స్వయంభువుగా ఆవిర్భవించాడు.  

1. శ్రీరంగం 2. శ్రీ మూష్ణం3. తిరుపతి 4. వానమామలై  5. సాలగ్రామం 6. పుష్కరం7. నైమిశారణ్యం  8.బదరికాశ్రమం

 భూ వరాహస్వామి స్వయంభువుగా వెలిసిన శ్రీమూష్ణం పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది.  ద్రావిడ శైలి శిల్పకళలో నిర్మించిన ఈ ఆలయంలో  వరాహ స్వామి, అతని భార్య అంబుజవల్లి తాయార్ లు కొలువై ఉన్నారు. 

10 వ శతాబ్దానికి చెందిన చోళులు నిర్మించగా, తంజావూర్ నాయక్ రాజు అచుతప్ప నాయక్ విస్తరించారు. ఇప్పటికీ చెక్కు చెదరకున్నా ఉన్న సౌందర్య శిల్పాలు ఆనాటి శిల్పుల కళాత్మకత దృష్టికి, ప్రతభకు తార్కాణాలుగా నిలుస్తాయి.

క్షేత్రం విశేషాలు..

హిందూ పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలిసిన తొమ్మిది క్షేత్రాల్లో శ్రీ మూష్నం కూడా ఒకటి. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్ధాచలానికి 

19 కిలోమీటర్ల దూరంలో, మరో పుణ్యక్షేత్రమైన చిదంబరానికి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హిరణ్యకశిపుడి సోదరుడైన హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రంలో ఉంచుతాడు. భూదేవి ప్రార్థనతో కరిగిపోయిన విష్ణువు వరాహ రూపంలో వచ్చి ఆమెను రక్షిస్తాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని అంబుజవల్లీ పేరుతో కొలుస్తారు. విష్ణువు దశావతారాల్లో వరహావతారం రెండవది. హిరణ్యాక్షుడిని యుద్ధంలో చంపిన తర్వాత సాలగ్రామ శిలలో వరాహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు.  యుద్ధం చేసే సమయంలో స్వామి వారి శరీరం నుంచి చిందిన చెమట వల్ల ఇక్కడ పుష్కరిణి ఏర్పడింది నమ్మకం. దీనిని నిత్య పుష్కరిణి అని అంటారు.

నిత్య పుష్కరిణి లో స్నానం చేస్తే చర్మరోగాలు పూర్తిగా సమసి పోతాయని చెబుతారు. అదే విధంగా స్వామి వారి రెండు కన్నుల నుంచి తులసి, అశ్వర్థ వృక్షం ఏర్పడినట్లు స్థల పురాణం వివరిస్తుంది. అశ్వర్ధ వృక్షాన్ని పూజిస్తే సంతానం లేనివారికి త్వరగా పిల్లలు పుడతారని నమ్మకం. ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి అశ్వర్థ వృక్షం కింద గాయత్రి మంత్రం జపిస్తే చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణకథనం. స్వామివారి విగ్రహం చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారి శరీరం పశ్చిమ ముఖంగా ఉండగా ముఖం మాత్రం దక్షిణం వైపు ఉంటుంది. హిరణ్యాక్షుడు తన ఆఖరి ఘడియల్లో స్వామివారిని తనవైపు చూడమని ప్రార్థించాడు. అందువల్లే స్వామి శరీరం పడమర వైపుగా ఉన్న మొహం దక్షిణం వైపు ఉంటుంది. స్వామి వారు నడుం పై చేయ్యి పెట్టుకొని గంభీరంగా కనిపిస్తాడు.

ఇక ఇక్కడ వెలిసిన అంబుజవల్లీ అమ్మవారికి స్వామి వారిని అందమైన రూపంలో చూడాలని కోరుకొంటుంది. దీంతో స్వామి వారు శంఖ, చక్రాలను కలిగి అందమైన నారాయణుడి రూపంలో వెలిశాడు. అందువల్లే ఇక్కడ ఉత్సవ మూర్తి విగ్రహం వరాహ రూపంలో కాక, నారాయణుడి రూపంలో ఉంటుంది. ఉత్సవ విగ్రహాలు గర్భగుడిలో కాకుండా ఆలయంలోని వేరొక మండపంలో ఉండటం ఇక్కడ విశేషం.

వరాహ స్వామితో పాటు చిన్న గోపాలుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. వరాహ స్వామితో పాటు గోపాలుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఈ ఆలయంలో పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు భరణీ నక్షత్రంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లో ఉన్న సముద్రం వద్దకు తీసుకువెళతారు. అక్కడకు చేరుకొనే లోపు తాయ్ కల్ అనే గ్రామంలో ఒక మసీదు దగ్గర ఊరేగింపు ఆగిపోతుంది. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మసీదుకు చెందిన కాజీ, స్వామి వారికి పూల దండ సమర్పించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మసీదులో కర్పూరం వెలిగించి తర్వాత ఖురాన్ చదువుతారు. బాణా సంచా కూడా కాల్చిన తర్వాత ఊరేగింపు యథావిధిగా సాగుతుంది.

ఇందుకు సంబంధించిన కథనం కూడా ఉంది. ఒక సారి ఇక్కడి నవాబుకి జబ్బు చేస్తుంది. విషయం తెలుసుకొన్ని స్థానిక మధ్వ బ్రాహ్మణుడు నవాబుని కలిసి స్వామి వారి గుడి నుంచి తెచ్చిన ప్రసాదాన్ని ఇస్తాడు. క్షణాల్లో రాజు రోగం తగ్గిపోతుంది. దీంతో నవాబు మిక్కిలి సంతోషంతో ఆ ఆలయానికి  అనేక ఎకరాల సారవంతమైన భూమిని దానం చేశారు. ఈ భూమి ఇప్పటికీ మధ్వ బ్రాహ్మణుల రక్షణలో ఉంది. ఇక్కడ చిత్రై ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. శ్రీదేవి ,భూదేవి సమేతంగా స్వామి వారిని ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడల వీధుల్లో ఊరేగిస్తారు. అటు పై ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఉత్సవాల్లో దేవేరులతో కలిసి స్వామి వారు చుట్టు పక్కల గ్రామాలకు వెళుతుంటారు. ఆ సమయంలో ఆయా గ్రామాల వారు గ్రామ పండుగను చేస్తారు. ఇక్కడ కొలువై ఉన్న అంబుజవల్లికి నవరాత్రుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమిళ నెలలైన అడి, తాయ్ లలో ఆఖరి శుక్రవారంనాడు అమ్మవారిని సువాసన భరితమైన పుష్పాలతో అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఇక్కడ స్వామివారిని పూజించడం వల్ల సకల సంపదలూ లభిస్తాయని చెబుతారు. గ్రహ దోషాలున్నవారు ఇక్కడ స్వామివారిని కొలిస్తే ఆ బాధలన్నీ తొలిగిపోతాయని స్థానికుల నమ్మకం...స్వస్తి..


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  :: 73వ దివ్యదేశము 



శ్రీ తిరువిక్రమ పెరుమాళ్ ఆలయం (తిరుక్కోవిలూరు)  విలుప్పురం

⚜ ప్రధాన దైవం: ఆయనార్. (త్రివిక్రముడు)

⚜ ప్రధాన దేవత: పూంగోవల్ నాచ్చియార్

⚜పుష్కరిణి: కృష్ణ పుష్కరిణి

⚜విమానం: శ్రీకర విమానము

⚜ ప్రత్యక్షం: మృకండు మహర్షికి, బలిచక్రవర్తికి

🌀స్థల పురాణం 🌀

💠 శ్రీ మహావిష్ణువు యొక్క శంఖము అంశముగా శ్రీ పొయ్ గై ఆళ్వార్ బరువెగా కాలో , గద అంశముగా శ్రీ పూదత్తాళ్వార్ మహాబలిపురములో , మరియు ఖడ్గము అంశముగా శ్రీ పేయ్ ఆళ్వార్ మయూరపురము ( చెన్నైలో మైలాపురము ) లో జన్మించిననూ , మువ్వురు ఆళ్వారులు ఈ తిరుక్కోవలూర్ దివ్యదేశములో ఒకే సమయమున కలసి కొనిరి . మరియు ఇచటనే పరమపదమును పొందిరి . 

💠 శ్రీ మహావిష్ణువును స్తుతించుచూ గానము చేయసాగిరి . అంతట వారి భక్తికి , గానమునకు ఆనందించి శ్రీ మహావిష్ణువు వారు మువ్వురకు ఒకేసారి దర్శనమిచ్చెను .

💠" కో " అనగా గోవు . గోమహిమలు , గోవు ఎన్ని విధములుగా ఉపయోగపడునో బోధింపబడిన కారణమున ఈ ప్రదేశము " కోవలూర్ " గా పేరొంది తిరుక్కోవలూర్ గా ప్రసిద్ధి అయినది .

💠 @ మూలవిరాట్ : త్రివిక్రమ పెరుమాళ్ తూర్పు ముఖముగ నిలిచియున్న మహనీయ దర్శనము . 

కుడికాలు ఆకాశము వైపు ఎత్తబడి ఉండి , సాధారణముగ ఎడమ చేతియందు ధరించు శంఖమును కుడిచేతి యందు , కుడి చేతియందు ధరించు చక్రమును ఎడమచేతి యందు ధరించుట ఇచ్చటి విశేషము

💠 'తిరు' + 'కోవిల్ + 'ఊరు' = పవిత్రమైన ఆలయ గ్రామం అని తమిళంలో అర్ధం.

💠 అయితే అందుకు కారణం లేకపోలేదని అంటున్నారు స్థానికులు. అలాగే విచిత్ర భంగిమలో నిల్చొని దర్శనమించిచ్చే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న నదికి చాలా ప్రత్యేకత ఉంది. మరి స్వామివారు ఇలా దర్శన ఇవ్వడం వెనుక పురాణం కథ ..

💠 ఇక్కడ విష్ణువును 'ఉలగలంత పెరుమాళ్' గా, లక్ష్మి దేవిని 'పూంగుతై' గా కొలుస్తున్నారు.

💠 ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి. ఈ స్వామి వారు సుమారు 21 అడుగుల ఎత్తు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు. కుడిచేత శంఖం, ఎడమచేత చక్రం ధరించి ఉంటుంది. స్వామి వారి యొక్క కుడి చేతి చూపుడు వేలు పైకి చూపెడుతూ భక్తులకు దర్శనిమిస్తారు.

💠 పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత ఇచట వెలసినారు. అందువల్లే స్వామి వారు ఒంటికాలిపైన నిలబడి ఉన్నారని స్థలపురాణం తెలియజేస్తున్నది.

💠 ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఈ ఆలయానికి ఆనుకుని పెన్నానది ప్రవహిస్తుంది. అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కుని ఇక్కడికి వచ్చి త్రివిక్రమస్వామికి ఆరాధన చేసేవాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదములకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నా నదిగా మారినది.

అందుకే ఈ నదిని కూడా గంగా నది అంత పవిత్రంగా భావిస్తారు. ఈ పెన్నానదిని దర్శించినవారికి సర్వపాపాలు హరించుకుపోతాయి. 

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::  74వ దివ్యదేశము 

శ్రీ వరదరాజ పెరుమాళ్ కోయిల్, కంచి.

⚜ ప్రధాన దైవం: వరదరాజస్వామి

⚜ ప్రధాన దేవత: పెరుందేవి త్తాయార్

⚜ పుష్కరిణి: వేగవతీ నది-అనంత పుష్కరిణి,శేష, వరాహ, పద్మ, కుశక, బ్రహ్మతీర్థములు

⚜విమానం: పుణ్యకోటి విమానము

🌀 స్థలపురాణం 🌀

💠 తిరుక్కచ్చి లేదా కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని వైష్ణవులు పెరుమాళ్ దేవాలయంగా పిలుస్తారు. 

వైష్ణవ సంప్రదాయంలో తిరువరంగం మరియు తిరువెంకడం తర్వాత ఇది మూడవ అతి ముఖ్యమైన ప్రదేశం. 

💠108 దివ్య దేశాలలో వైష్ణవులకు శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం చాలా ముఖ్యమైనది. 

💠 ఇది శ్రీమన్నారాయణుడు బ్రహ్మ, నారద, బృగు , ఆదిశేషుడు మరియు గజేద్రలకు దర్శనం ఇచ్చిన ప్రదేశం. ఇది కాంచీపురంలో విష్ణు కంచిలో ఉంది.

💠పురాణల ప్రకారం, బ్రహ్మ దేవుడు నాలుగు చేతులతో ఉన్న శ్రీ నారాయణుని దర్శనం పొందాలనుకున్నాడు. శ్రీ నారాయణుని దర్శనం కావాలంటే బ్రహ్మ తప్పక 100 అశ్వమేథ యాగం చేయాలని అశరీరవాణి (స్వర్గం నుండి వచ్చిన స్వరం) పలికింది . ఇది విన్న బ్రహ్మ 100 అశ్వమేథ యాగం చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకే పెరుమాళ్ దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.  అదే సమయంలో ఆశరీరవాణ్ణి పలికింది. కాంచీపురంలో ఒక అశ్వమేథ యాగం చేయడం మరెక్కడైనా 100 అశ్వమేథ యాగాలు చేయడంతో సమానమని బ్రహ్మకు సూచించాడు.  బ్రహ్మ అప్పుడు  కంచిలో అశ్వమేథ యాగాన్ని పూర్తి చేశాడు.

💠 శ్రీ మనారాయణుడు తన నాలుగు చేతులతో యాగంలో కనిపించి, అతని కోరిక మేరకు బ్రహ్మకు దర్శనం ఇచ్చాడు. బ్రహ్మ కోరిక తీర్చబడినందున అతను వరదరాజర్ (వరం - కోరిక) అని పిలువబడ్డాడు.

🔅 బంగారు బల్లి 🔅

💠 మీరు వరదరాజ పెరుమాళ్ వైపు ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు, మీరు ఒక చిన్న కారిడార్ గుండా ఒక గదికి వెళ్లవలసి ఉంటుంది, అక్కడ మీరు సూర్యుడు మరియు చంద్రుడిని చూస్తున్న బల్లి యొక్క రూపాన్ని చూడవచ్చు. దీని వెనుక ఉన్న ఒక కథ ఉంది.

అయోధ్య రాజు సగర కుమారుడు అసమంజుడు మరియు అతని భార్య బల్లులుగా మారాలని శపించబడ్డారు. కంచిని సందర్శించడం వల్ల వారికి శాప విమోచన లభిస్తుందని వారికి చెప్పబడింది. 

వారు అలా చేసారు మరియు వారి రూపాన్ని తిరిగి పొందారు మరియు మోక్షాన్ని పొందారు. 

💠ఇక్కడి బల్లిని ఎవరు తాకినా వారి జబ్బులు నయమవుతాయని నమ్ముతారు. 

దీని కారణంగా, రద్దీగా ఉండే క్యూలో ప్రజలు రూ .2 టిక్కెట్‌గా చెల్లించి ఇక్కడ దర్శనము చేస్తారు.

💠నారాయణుడు అతి వృక్షం (అత్తి చెట్టు) తో తయారు చేయబడ్డాడు మరియు అందుకే అత్తివరథర్ అని పిలువబడుతుంది.

💠 "కా" అంటే బ్రహ్మ మరియు "అంజితం" - అంటే ఎవరు పూజించబడ్డారు. 

బ్రహ్మ ఎమ్పెరుమాన్‌ను వరధరాజర్‌గా ఆరాధించినందున, ఈ స్థలాన్ని "కంచి" అని పిలుస్తారు.

💠ఈ ఆలయం విష్ణు కంచిలో ఉంది, దీనిని "చిన్న (లేదా) చిన్న కాంచీపురం" అని కూడా అంటారు మరియు పెద్ద (లేదా) శివ కాంచీపురంలో, అన్ని శివాలయాలు కనిపిస్తాయి.

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు  : : 75వ దివ్యదేశము 

అష్ట భుజ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం , కంచి 

⚜ ప్రధాన దైవం: ఆదికేశవ పెరుమాళ్

⚜ ప్రధాన దేవత: అలర్‌మేల్ మంగై త్తాయార్

⚜పుష్కరిణి: గజేంద్ర పుష్కరిణి

⚜ విమానం:గగనాకృతి విమానము

⚜ ప్రత్యక్షం: గజేంద్రునకు

🌀స్థలపురాణం 🌀

💠 విష్ణుకంచిలో గలక్షేత్రము. వరదరాజస్వామి సన్నిధికి 1/2 కి.మీ. దూరములో ఉంది. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీ వేదాంత దేశికన్ అష్ట భుజాష్టకమును రచించాడు.

💠 కాంచీపురంలో ఉన్న  దివ్య దేశ దేవాలయాలలో అష్టభుజ పెరుమాళ్ ఆలయం ఒకటి. 

💠 ఈ స్థలంలోని పెరుమాళ్‌ను 'అష్టభుజాంగ పెరుమాళ్' అని పిలుస్తారు మరియు అతను ఎనిమిది చేతులతో (అష్ట - ఎనిమిది) కనిపిస్తాడు.

అతడిని ఆదికేశవ పెరుమాళ్ అని కూడా అంటారు మరియు అతను చక్రం, ఖడ్గం, ఒక పుష్పం మరియు బాణం అతని నాలుగు కుడి చేతులపై మరియు శంఖం, విల్లు, కవచం మరియు గధ.

💠 ఈ దేవాలయంలోని స్థల పురాణంకి సరస్వతి మరియు బ్రహ్మదేవునితో సంబంధం కలిగి ఉంది. బ్రహ్మ చేసిన యాగాన్ని ధ్వంసం చేయడానికి సరస్వతి దేవి పంపిన అసురులందరూ శ్రీ నారాయణునిచే చంపబడ్డారు. సరస్వతి చివరికి క్రూరమైన పామును పంపింది. ఆ పాముని చంపడానికి నారాయణుడు   ఎనిమిది రకాల ఆయుధాలను పట్టుకుని అష్టభుజ పెరుమాళ్ రూపాన్ని పొందాడు. ఆ పాము అప్పుడు విష్ణువుకు లొంగిపోయింది మరియు శివుని యాగాన్ని గూర్చుకోవడానికి పాముని "శరబేశ్వర" గా యాగశాల వాయు చివరలో ఉండమని ఆదేశించాడు.

🌀 గజేంద్ర మోక్షం 🌀

💠 పురాణాల ప్రకారం గజేంద్ర అనే ఏనుగు ఈ చెరువు నుండి తామర పువ్వులను ఉపయోగించి మహా విష్ణువుకు పూజలు చేసేది. ఒక రోజు ఒక మొసలి గజేంద్రుడిని పట్టుకుంది మరియు అక్కడ పెద్ద పోరాటం జరిగింది. ఏనుగు శ్రీ శ్రీమన్నారాయణ సహాయం కోరుతూ 'ఆదిమూలమే నువ్వే ' అని అరిచి యుద్ధంలో ఓడిపోయింది.  శ్రీ మన్నారాయణమూర్తి మొసలి మెడను కోసే తన 'చక్రం' ఉపయోగించి మొసలి నోటి నుండి గజేంద్ర అనే ఏనుగును రక్షించాడు. అతను ఇక్కడ ఏనుగుకు మోక్షం ఇచ్చాడు.

💠ఈ స్థావరంలోని మూలవారు శ్రీ ఆదికేశవ పెరుమాళ్.  ఇతర పేర్లు గజేంద్రవరధన్, చక్రథరార్. మూలవర్... పశ్చిమానికి ఎదురుగా నిలబడి ఉన్నారు. ఏనుగు గజేంద్రునికి ప్రత్యక్షం.

💠ఈ స్థలానికి చెందిన తాయార్ అలర్మెల్మంగై తాయార్.

💠ఇతర సన్నిధులు: భూవరాహ స్వామికు మరియు  ఆంజనేయుడికి సన్నిధులు ఉన్నాయి

💠 ఆలయ సమయం ఆలయం ఉదయం 7:00 నుండి 11:00 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 7:00 వరకు తెరిచి ఉంటుంది

💠 కంచి ఒక దేవాలయల పట్టణం, ఇక్కడ 108 దివ్య దేశాలలో 15 ఉన్నాయి.

💠 కాంచీపురం దేవాలయాల భూమి, దీనిలో శివ, విష్ణు, శక్తి దేవాలయాలు మరియు పవిత్ర పరిసరాలుతో కాంచీపురం భారతదేశంలోని "దేవాలయ మహానగరం" అని చెప్పబడింది. 

 జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 76వ దివ్యదేశము 

 శ్రీ దీప ప్రకాశం పెరుమాళ్ ఆలయం - తిరుత్తంకల్,  కాంచీపురం 

⚜ ప్రధాన దైవం: దీపప్రకాశర్

⚜ ప్రధాన దేవత:మరకతవల్లి తాయర్

⚜ పుష్కరిణి: సరస్వతీ తీర్థం

⚜ విమానం: శ్రీకర విమానము

⚜ ప్రత్యక్షం: సరస్వతీదేవికి

🌀 స్థలపురాణం 🌀

💠 ఈ  దివ్యదేశము ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ గాధ .. ఒకసారి తామిరువరులలో ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తినది శ్రీ మహాలక్ష్మి మరియు సరస్వతి దేవిల నడుమ.

💠 ఆ వివాదాన్ని పరిష్కరించుకోడానికి తొలుత  దేవేంద్రుని వద్దకు పిదప బ్రహ్మ వద్దకు వెళ్లారు.

వారి ఇద్దరి తీర్పు సరస్వతీ దేవికి నిరాశ కలిగించినది. ఆమె ఆగ్రహం తో సత్య లోకం విడిచిపెట్టి అజ్ఞాతంలో ఉండసాగింది. అదే సమయంలో సృష్టి కర్త శ్రీమన్నారాయణుని సహకారం అపేక్షిస్తూ త్రీవ్ర తపస్సు చేసి ఆయన సలహా మేరకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టారు. 

కానీ ధర్మపత్నితో కలిసి చేయవలసిన యాగము అది. ఏమి చేయాలో తెలియక అందరి సలహా మేరకు గాయత్రీ దేవిని సరసన పెట్టుకొని యాగం ఆరంభించారు బ్రహ్మ.

💠 అసలే తాను  మహాలక్ష్మి కన్నా తక్కువ దానినని స్వయంగా తెలిపిన భర్త తానూ లేకున్నా యాగం ఆపకుండా మరో స్త్రీని సరసన పెట్టుకొనడంతో  సరస్వతీ దేవి ఆగ్రహం రెట్టింపు అయినది.

 అదుపు తప్పిన ఆవేశంతో యాగాన్ని భగ్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాటిని అడ్డుకొని యాగాన్ని రక్షించిన శ్రీహరి వివిధ ఆలయాలలో కొలువు తీరారు అని తెలుస్తోంది.  

💠 శ్రీమద్వేదాంతదేశికులు జన్మస్థానమిది. ఆయన శరీరం ఇచట ఉంది. దేశికర్ పూజించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవుల సన్నిధి ఇక్కడ ఉంది.

💠 ఈ ప్రదేశంలోని పెరుమాళ్‌ను 'దీప ప్రకాశర్' (దీపం- కాంతి) లేదా 'విలకోలి పెరుమాళ్' (విలకోలి - కాంతి) అని పిలుస్తారు.

💠 ఈ స్థలం వెనుక ఉన్న పురాణం ఇలా ఉంది. బ్రహ్మ దేవుడు కాంచీపురంలో అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. సరస్వతి దేవి అసురులు ద్వారా ఆ యాగాన్ని ఆపాలనుకున్నారు. అసురులు ఆకాశాన్ని కప్పి కాంతిని ఆపి చీకటిని వ్యాప్తి చేశారు. ప్రపంచాన్ని మరియు యాగాన్ని కాపాడటానికి శ్రీమన్నారాయణ మూర్తి అక్కడ "వెలుగు" గా కనిపించి చీకటిని తొలగించాడు. 

💠 భగవంతుడు ఒక ప్రకాశవంతమైన కాంతి వలె కనిపించాడు కాబట్టి, ఇక్కడి పెరుమాళ్‌ను "దీపప్రకాశర్" అని పిలుస్తారు. దీపం అంటే కాంతి మరియు ప్రకాశం ప్రకాశం. పెరుమాళ్ కాంతి వలె ప్రకాశించినందున, అతడిని "విలక్కు ఒలి పెరుమాళ్" అని కూడా అంటారు.

💠ఇది కాంచీపురంలో అష్టపూజంగా ఆలయానికి సమీపంలో ఉంది.

ఆలయ సమయం ఆలయం ఉదయం 7:00 నుండి 11:00 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 7:00 వరకు తెరిచి ఉంటుంది

💠 ఆలయ తొట్టెను సరస్వతి పుష్కర్ణిగా సూచిస్తారు మరియు విమానమును శ్రీకర విమానం అంటారు.

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 77వ దివ్యదేశము 


శ్రీ తిరువెలుక్కై శ్రీ అళగియ సింగ పెరుమాళ్ ఆలయం, 

కాంచీపురం 

⚜ప్రధాన దైవం: ముకుందనాయకన్

⚜ ప్రధాన దేవత: వేళుక్కైవల్లి తాయార్

⚜ పుష్కరిణి: కనక సరస్సు

⚜ విమానం: హేమ విమానం

⚜ ప్రత్యక్షం: భృగుమహర్షికి

🔔 స్థలపురాణం 🔔

💠కాంచీపురంలో ఉన్న 108 దివ్య దేశ దేవాలయాలలో తిరువెలుక్కై ఒకటి. "వెల్" అంటే కోరిక మరియు "ఇరుక్కై" అంటే స్థలము.

భగవంతుడు తన భక్తులకు సహాయం చేయడానికి అక్కడే ఉండాలని కోరుకున్నాడు కాబట్టి, ఈ ప్రదేశాన్ని "వెల్లుక్కై", "తిరు వెల్లుక్కై" అని పిలుస్తారు.

💠తిరు వెలుక్కై స్థలం వెనుక ఉన్న పురాణం ఇలా ఉంది.  అసురులు (రాక్షసులు) ప్రబలిపోయి, మనిషిని బెదిరించడం మొదలుపెట్టినప్పుడు, విష్ణువు తన నరసింహ అవతారంలో వారిని తరిమికొట్టాడు.  అతను తన స్వంత కోరికతో ఈ అందమైన ప్రదేశంలో స్థిరపడ్డాడు.

💠 పురాణాల ప్రకారం, భృగువు యొక్క అభ్యర్థన మేరకు, కనక విమానంలో పెరుమాళ్ నరసింహమూర్తిగా కనిపించాడు.

 💠 వైష్ణవ ఆచార్యులు శ్రీ మహాదేశికన్ పెరుమాళ్‌ను తన ఇష్టమైన కామశికాష్టకం (కామసి - కామ + ఆసిక) లో స్తుతించాడు. ప్రతిరోజూ ఈ శ్లోకాన్ని జపించడం వల్ల నరసింహ భగవానుడి ఆశీర్వాదాల వల్ల అపారమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఈ క్షేత్రాన్ని కామశిక నరసింహ సన్నిధి అని కూడా అంటారు.

💠 ప్రతిష్టాత్మకమైన దివ్య దేశాలలో ఇది ఒకటి అయినప్పటికీ, ఆలయం శిథిలావస్థలో ఉంది. 

💠 ఆలయ ప్రదేశం ..ఇది కాంచీపురంలో అష్టభుజ పెరుమాళ్  ఆలయానికి సమీపంలో ఉంది.

💠 ఆలయం ఉదయం 7:00 నుండి 10:00 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 7:00 వరకు తెరిచి ఉంటుంది

💠దీనిని కామాసిక నరసింహ అభయారణ్యం అని కూడా అంటారు.

💠 ఏమీ చేయలేమనే భయంతో వణికిపోతున్న వ్యక్తులు, పీడకలలతో బాధపడుతున్నవారు, దుండగులు, దుండగులు, నిరక్షరాస్యులైన విద్యార్ధులు తెలిసో తెలియకో తప్పు చేస్తే తమ భవిష్యత్తు జీవితం వృథా అవుతుందని అనుకుంటారు, ఇక్కడ వారికి నరసింహ దర్శనం ఉంటుంది. 

స్వామి దయతో మంచిగా మారుతారు మరియు మనస్సులోని భయం వెంటనే పోతుంది.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  :: 78వ దివ్యదేశము 


🙏 శ్రీ పాండవదూత పెరుమాళ్ ఆలయం - తిరు పాదగం, 

కాంచీపురం 🙏

⚜ప్రధాన దైవం: పాండవదూత పెరుమాళ్ 

⚜ప్రధాన దేవత: రుక్మిణీదేవి, సత్యభామ

⚜పుష్కరిణి: మత్స్య తీర్థము

⚜విమానం: భద్ర విమానము

🌀 స్థలపురాణం 🌀

💠  పాండవదుత పెరుమాళ్ ఆలయం 108 వైష్ణవ ఆలయాలలో ఒకటి . ఈ స్థలం కాంచీపురం జిల్లాలోని తిరుపదగంలో ఉంది .

 💠 ఈ స్థలం సుమారు 2000 సంవత్సరాల నాటిదని చెబుతారు.

ప్రధాన ఆలయంలో కూర్చొని  ఉన్న 25 అడుగుల ఎత్తులో సింహాసనంపై కృష్ణుడి విగ్రహం వర్ణనాతీతం.

💠 పంచపాండవులకు దూతగా వెళ్లడంతో ఇచట గల దేవుడిని "పాండవ ధూత పెరుమాళ్" అని పిలుస్తారు. 

ఇక్కడి శాసనాలు అతడిని "దూతహరి" గా సూచిస్తున్నాయి.

💠 ఆళ్వారులు ఈ క్షేత్రాన్ని "తిరుప్పాదగం " ( శ్రీ +పెద్ద +క్షేత్రం ) అని పాశురాలలో సంభోధించారు. 

పేరుకు తగ్గట్టుగా కొలువైన "శ్రీ పాండవదూత పెరుమాళ్ " అర్చామూర్తి పాతిక అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో దర్శన మిస్తారు.

💠 కురుక్షేత్ర యుద్దానికి ముందు వాసుదేవుడు పాండవుల తరుఫున రాయబారిగా కౌరవ సభకు వెళతారు. ఆయన హితోపదేశాలు,  హెచ్చరికలు రారాజు కు ఆగ్రహం కలిగించాయి. దూతను గౌరవించాలని తెలిసినా కోపంతో శ్రీ కృష్ణుని భంధించ యత్నించాడు.

 నిజ భక్తులకు కన్నుల పండుగ కలిగించేలా, దూర్తులను భయకంపితులను చేసేలా జగద్రక్షకుడు విశ్వరూపాన్ని ప్రదర్శించారు.  

 💠 తదనంతరకాలంలో పాండవుల ముని మనుమడైన జనమేజయుడు ఈ వృత్తాంతం విని శ్రీ హరి విశ్వరూప దర్శనాన్ని ఆకాంక్షించారట.  

గురువైన హరిత మహర్షి సలహ మేరకు కాంచీపురం లో యజ్ఞం చేసి తన ఆకాంక్ష నెరవేర్చుకొన్నారట. 

ఆయన కోరిక మేరకు స్వామి ఇక్కడ 

శ్రీ పాండవదూత పెరుమాళ్ గా కొలువు తీరానికి క్షేత్ర గాధ తెలుపుతోంది.

💠 తూర్పు ముఖంగా ఉండే ఆలయ గర్బాలయంలో సింహసనం మీద ఉపస్థిత భంగిమలో అభయ ముద్ర తో ఆకాశాన్ని తాకుతుందా అనిపించే రూపంతో కనిపించే మూలవిరాట్టు నేత్ర పర్వంగా దర్శనమిస్తారు.

💠 అమ్మవారు,  శ్రీ చక్రత్తి ఆళ్వారు తమ తమ సన్నిధులలో కొలువై  ఉంటారు. 

 💠 పల్లవులు నిర్మించిన ఆలయాన్ని చోళులు,  విజయనగర రాజులు అభివృద్ధి చేసారు అనడానికి ఆలయంలో లభించిన ఎనిమిదో శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దానికి చెందిన శాసనాలు నిదర్శనంగా కనిపిస్తాయి. 

💠 శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ పాండవదూత పెరుమాళ్  క్షేత్రంలో మూలవిరాట్టు ప్రధాన ఆకర్షణ.

💠 ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు తన పాదాలను నేలపై నొక్కి తన విశ్వపథ యోగ శక్తిని ప్రయోగించాడు. అందువల్ల, ఇక్కడ తపస్సు చేసేవారు అన్ని బాధల నుండి విముక్తి పొందుతారు మరియు పాపం నుండి విముక్తి పొందుతారని నమ్మకం.

 జై శ్రీమన్నారాయణ 

108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 79వ దివ్యదేశము  



తిరు నీరగన్- 

శ్రీ ఉలగలంత పెరుమాళ్ ఆలయం, కాంచీపురం 

🔅 ప్రధాన దైవం: జగదీశ్వర పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: నిలమంగైవల్లి త్తాయార్

🔅పుష్కరిణి: అక్రూర తీర్థము

🔅 విమానం: జగదీశ్వర విమానము

🔅ప్రత్యక్షం: అక్రూరనకు

🔔 స్థలపురాణం 🔔

💠 సృష్టిలో జీవరాశి మనుగడకు నీరు ముఖ్య అవసరము . 

అటులనే పరమాత్మ అనుగ్రహము లేనిదే సృష్టి మనుగడలేదు . 

నీరు అతి చిన్న రంధ్రము ద్వారా కూడా పోవగల్గును . 

ఆకాశము నుండి నీరు వర్షముగా కొండలు , సముద్రము , అడవులు ఎడారులు . ఊళ్లు ఎల్లెడల కురియును .

 జలరాశి పల్లము , మిట్ట ప్రదేశము , పర్వతము , సముద్రము అను తేడా లేక వర్షరూపమున కురియునట్లు , పేద - ధనిక , ఉచ్చ - నీచ , జాతి - మత , బలహీన - బలవంత , స్త్రీ - పురుష , వృక్ష - జంతు సంతుతులు అన్నింటి యందు పుణ్యకర్మ - భక్తి - విశ్వాస - ప్రేమ విశేషమే కొలమానముగా భగవంతుని అనుగ్రహము ఎట్టి వ్యత్యాసము లేక నిశ్చయముగా యుండును . 

ఎవరి హృదయము నందు అతి చిన్న రంధ్రము ద్వారా అయినను భక్తి ఉదయించి భగవద్భావము ప్రవేశించునో , పరమాత్ముని అనుగ్రహమును అదే విధముగా అందు ప్రవేశించును 

వేరొక విధముగా - అతి చిన్న రంధ్రము ద్వారా కూడ నీరు ఎట్లు పాత్ర నుండి బయటకు పోవునో , అటులనే చిన్న అవిశ్వాసము - అకృతజ్ఞతలకు మనస్సులో తావిచ్చినచో భగవదనుగ్రహము పోవును . 

💠 నీరు ఉపమానముగా ఈ సత్యములను బోధించు విధముగా శ్రీమహావిష్ణువు స్థలమున నీరగదన్ పెరుమాళ్ గా వెలసి భక్తులను అనుగ్రహించు చున్నాడు . 

💠 ఈ స్తలంలో  పెరుమాళ్ ఎడమ కాలు ఎత్తి ,కుడి కాలిపై కూర్చుని ఉండటం ఆసక్తికరంగా ఉంటుంది. 

ఆలయం ముందు ఆంజనేయ స్వామి విగ్రహం చేతిలో శంఖం మరియు ఒక చక్రంతో ఆశీర్వదిస్తారు.

💠తిరు నీరగన్, కాంచీపురంలో ఉన్న 108 దివ్య దేశ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం తిరు ఊరగం (ఉలగలంత పెరుమాళ్) ఆలయంలో ఉంది. 

💠ఉలగళంత పెరుమాళ్ మరియు అతని భార్య లక్ష్మిని ఆముదవల్లిగా పూజించే విష్ణువుకు అంకితమైన 108 దివ్యదేశంలో ఇది ఒకటి. 

💠 ఈ ఆలయం పెద్ద కాంచీపురంలో ఉంది మరియు కామాక్షి అమ్మన్ దేవాలయానికి దగ్గరగా ఉంది. తిరుక్కర్వణం, తిరుకరాగం, తిరుఓరాగం మరియు తిరునీరాగం అనే నాలుగు విభిన్న దివ్యదేశాలను కలిగి ఉన్న ఏకైక దేవాలయ సముదాయం ఇది దివ్య దేశాలలో ప్రత్యేకమైనది.

💠 ఈ దేవాలయంలోని 5 తలల  ఆదిశేషుని రూపంలో ఎమ్పెరుమాన్ వ్యక్తమయ్యాడు. అతను తిరు ఊరగంలోని ఉలగళాంద పెరుమాళ్ పక్కన ఉన్న ప్రత్యేక సన్నిధిలో కనిపిస్తాడు. ఊరగాం అంటే పాము మరియు భగవంతుడు విష్ణువు మహాబలికి సర్పదేవుడిగా దర్శనం ఇచ్చారు, 

ఈ ప్రాంతాన్ని ఊరగం అని పిలుస్తారు మరియు స్వామిని ఊరగథాన్ అని పిలుస్తారు.

💠 ఈ ఆలయంలో  ఉత్సవ మూర్తి (ఊరేగింపు దేవత) లేదా ఏ తాయారు లేదు.

💠 అవివాహిత స్త్రీలు మరియు సంతానం లేని జంటల ప్రార్థనలను ఈ  స్వామి  నెరవేరుస్తాడని భావించబడుతుంది.

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు:: 80వ దివ్యదేశము 



శ్రీ తిరునిలాత్తింగళ్ తుండత్తాన్పెరుమాళ్ ఆలయం, 

ఏకామ్రేశ్వర ఆలయంలో కాంచీపురం 

🔅 ప్రధాన దైవం: నిలాత్తిజ్గళ్ తుండత్తాన్ పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: వేరొరు వన్ఱిల్లా తాయార్

🔅 పుష్కరిణి: చంద్రపుష్కరిణి

🔅విమానం: పురుష సూక్త విమానము

🔅ప్రత్యక్షం: రుద్రుడు

🔔 స్థలపురాణం 🔔

💠  ఒకప్పుడు సహస్రాధిక ఆలయాలతో అలరారిన కాంచీపురం లో ప్రస్తుతం కొద్ది మాత్రమే మిగిలాయి.

 వాటిల్లో ప్రముఖమైనవి  శ్రీ ఏకాంబరేశ్వర,  శ్రీ కైలాసనాధ, శ్రీ కామాక్షి అమ్మన్, 

శ్రీ వరదరాజ పెరుమాళ్ ఇలా ఉన్నది జాబితా!  

💠 నగరంలో ఉన్న శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటి ప్రసిద్ధ శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

💠ఒకనాడు కైలాసంలో సరస సల్లాపాల మధ్య పార్వతీదేవి త్రినేత్రుని నేత్రాలను తన కోమల హస్తాలతో క్షణకాలం మూసిందట. జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులు ఆ నేత్రాలు. క్షణకాలం అయినా లోకాలన్నీ తల్లడిల్లిపోయాయట. తెలియక చేసినా తప్పు తప్పే కనుక పరిహరం చెల్లించుకోడానికి అర్దనారీశ్వరుని అనుమతితో కాంచీపురం చేరుకొన్నదట గౌరీదేవి.

 ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి భక్తి శ్రద్దలతో సేవించసాగిందట. శివుడు కొంతకాలానికి ఆమె పరీక్షింపనెంచారట.

💠తన జటాజూటాల నుండి గంగను వదిలారట. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహవేగానికి సైకతలింగం ఎక్కడ మునిగి పోతుందో అని భయపడిందట. ఆందోళనతో కామాక్షి దేవి శ్రీ మహవిష్ణువు ను శరణు కోరిందట. 

ఆయన ఆమెను లింగాన్ని ఆలింగనము చేసుకోమని చెప్పి తాను విశ్వరూపాన్ని ధరించి ప్రవాహనికి అడ్డుగా శయనించారట. ముల్లోకాలకు విస్తరించిన శ్రీహరి ని దేవతలు,  మహర్షులు స్థుతించసాగారట.

💠 ఆ సమయంలో చంద్రుని కిరణాలు సోకి శ్రీ వారి కంఠం నీలంగా మారిందట. 

అందుకే స్వామిని "శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ "అని పిలుస్తారు.

💠 శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ని అమ్మవారు కౌగలించుకోవడం వలన లింగం పైన ఆమె కరకంకళాల మరియు వక్షోజాల ముద్రలు పడినాయట. వాటిని నేటికీ లింగం మీద చూడవచ్చని చెబుతారు. ఉమా దేవి తపమాచరించిన మామిడి చెట్టు కూడా ప్రాంగణంలో ఉన్నది. 

💠ప్రదక్షిణా మార్గంలో ఉన్న 

గర్భాలయానికి ఎదురుగా చిన్న మందిరంలో దర్శనమిస్తారు పెరుమాళ్. 

దేవేరులు, ధ్వజస్తంభం, బలిపీఠం,  గరుడుడు ఏమీ ఉండవు. 

శైవార్చకులే పూజలు చేసే ఈ మందిరంలో ఆదిశేషుని పడగ ను ఛత్రం చేసుకుని చతుర్భుజాలతో స్తానక భంగిమలో రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు

 శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్. 

💠శ్రీ నీలతింగళ్ తుండతాన్ పెరుమాళ్ ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం ఆవరణలో  ఉంది; 

శివుని పంచ బూత స్థలాలలో ఈ క్షేత్రం భూమికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 

ఈ ఆలయం తమిళనాడులోని కాంచీపురం లో ఉంది. 

💠 శైవ పూజారులు పూజలు చేస్తున్న ఏకైక  వైష్ణవ దివ్యదేశం ఇది. ఈ స్థలాన్ని తిరునేడుతంగడం అంటారు.

💠 మూలవర్ తన అభయ హస్తంతో పురుష సూత్రం విమానం కింద పడమర ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో "నిలతిథింగ్‌తుల్తాథన్" మరియు "చంద్రసూదప్ పెరుమాళ్" గా పూజలు అందుకుంటున్నారు. థాయర్ నేర్ ఒరువర్ ఇల్లా వల్లి నాచియర్ (నీలాతింగళ్ తుండం థాయర్)

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 81వ దివ్యదేశము 



తిరు ఊరగం (ఊరగథాన్) -

 శ్రీ ఉలగలంత పెరుమాళ్ ఆలయం (  త్రివిక్రమ అవతారం ),

 కాంచీపురం 🙏

🔅 ప్రధాన దైవం: త్రివిక్రముడు(ఉళగన్ద పెరుమాళ్)

🔅ప్రధాన దేవత: అమృతవల్లి త్తాయార్

🔅పుష్కరిణి: నాగతీర్థము

🔅 విమానం: సారశ్రీకర విమానము

🔅ప్రత్యక్షం: ఆదిశేషులకు(ఊరగమ్‌)

🔔స్థలపురాణం 🔔

💠 ప్రహ్లాదుడు మహా భాగవతోత్తముడు . అతని మనుమడు బలి చక్రవర్తియును విష్ణుభక్తి పరాయణుడే . 

ఆ బలి చక్రవర్తి గొప్ప యజ్ఞములు చేసి మహాబలవంతుడై జాతి వైరము స్వర్గలోక వైభవ లోభము , రాజ్యకాంక్షల వలన దేవేంద్రుని స్వర్గలోకముతో సహా సకల భువనములను జయించిన తరువాత శ్రీమహావిష్ణువు వామన రూపమున పోయి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల ( పాదముల ) భూమిని దానము అడిగి త్రివిక్రమరూపమున 2 పాదములతో సకల భువనములను గ్రహించి మూడవ పాదమునకు బలిచక్రవర్తి తన శిరస్సును చూపగా అతని శిరస్సుపై పాదము నుంచి పాతాళమునకు పంపి అచ్చట ఉండుము అని చెప్పి అంతమున మోక్షమును పొందెదవు అని అనుగ్రహించెను . 

ఈ పురాణము అందరికీ తెలిసినే కదా ! 

💠ఈ దివ్యదేశము యొక్క పురాణ మేమనగా - మహాబలి చక్రవర్తి శ్రీమన్నారాయణుని ఆ త్రివిక్రమ రూపమును దర్శించ కోరెను . 

అది సాధ్యము కాలేదు . 

అందువలన శ్రీమహావిష్ణువును ధ్యానించి ప్రార్థించగా అనుగ్రహించి ఆదిశేషావతారునిగా ( ఉరగదన్ ) దర్శనమిచ్చెను . 

పెరుమాళ్ త్రివిక్రమ రూపము ప్రక్క ఆదిశేషుని కూడ దర్శించుకొనగలము . ఆవిధముగా ఆదిశేషునికి పెరుమాళ్ త్రివిక్రమ రూప ప్రత్యక్షము నిచ్చినట్లు కూడ నగును .

💠గంభీరమైన శ్రీ ఉలగలంత పెరుమాళ్ విగ్రహం కాంచీపురానికి ప్రత్యేకమైనది మరియు ఈ పరిమాణంలోని భగవంతుడు, ఏ ఇతర దివ్య దేశంలోనూ చూడలేడు

💠ఈ ఆలయం పెద్ద కాంచీపురంలో ఉంది మరియు కామాక్షి అమ్మన్ దేవాలయానికి దగ్గరగా ఉంది. తిరుక్కర్వణం, తిరుకరాగం, తిరుఓరాగం మరియు తిరునీరాగం అనే నాలుగు విభిన్న దివ్యదేశాలను కలిగి ఉన్న ఏకైక దేవాలయ సముదాయం ఇది .

వైష్ణవ దివ్య దేశాలలో ప్రత్యేకమైనది.

💠ఈ దేవాలయంలోని 5 తలల పాము ఆదిశేషుని రూపంలో ఎమ్పెరుమాన్ వ్యక్తమయ్యాడు. 

అతను తిరు ఊరగంలోని ఉలగళాంద పెరుమాళ్ పక్కన ఉన్న ప్రత్యేక సన్నిధిలో కనిపిస్తాడు.

 ఊరగం పామును సూచిస్తుంది మరియు విష్ణువు మహాబలికి సర్పదేవుడిగా దర్శనం ఇచ్చాడు, 

ఈ ప్రాంతాన్ని ఊరగం అని పిలుస్తారు మరియు స్వామిని ఊరగథాన్ అని పిలుస్తారు.

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 83వ దివ్యదేశము 



🙏 శ్రీ కరుణాకర పెరుమాళ్ ఆలయం - తిరుకారగం ,

కాంచీపురం 🙏

🔅 ప్రధాన దైవం: కరుణాకర పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: పద్మామణి త్తాయార్

🔅 పుష్కరిణి: అక్రాయ పుష్కరిణి

🔅 విమానం: వామన విమానము,

      రమ్య విమానం.

🔔 స్థలపురాణం 🔔

💠 వర్షములేనిచో సృష్టి మనుగడకు ముఖ్య అవసరమైన నీరు ఉండదు . 

మేఘము లేనిచో వర్షము కురియదు . వర్షము యొక్క అవసరము ఎంత ఉన్ననూ ఎన్నియో సమయములలో ఆకాశములో మేఘములు ఉండియు వర్షము కురియకపోవుట గమనించెదము . 

 చల్లని గాలి లేనిచో వర్షము కురియదు . మేఘములు చల్లని గాలి తగిలిననే ఘనీభవించి వర్షించును . 

 💠 జీవులు తమ హృదయములలో భక్తి అను చల్లని గాలిని వీచునట్లు చేయగల్గిననే పరమాత్ముని అనుగ్రహ వర్షము కురియును . 

వర్షము నిచ్చు మేఘము వలె ,

 ఈ దివ్య దేశమున కరుణను కురియు పరమాత్ముడు " కరుణాకర పెరుమాళ్ " నామమున వెలసి భక్తులను అనుగ్రహించుచున్నాడు . 

 💠 ఏవిధముగా చల్లని గాలి లేనిచో మేఘములు ఉండియు వర్షము కురియదో , అదేవిధముగా , కల్మషరహిత భక్తి అను చల్లని గాలి లేనిచో భగవదనుగ్రహము అను వర్షము కురియదు . 

సమస్యలతో సతమత మగు చున్నను కుకర్మజీవులను భగవంతుడు పట్టించుకొన కుండును . నిష్కళంకభక్తి , పుణ్య - పాపముల లెక్కలు సరి చూసిన తదుపరి మాత్రమే అనుగ్రహ వర్షమును పరమాత్ముడు కురియును .

💠 మేఘము ఉపమానముగా పైన చెప్పిన సత్యములను బోధించు విధముగా శ్రీమహావిష్ణువు వెలసినందువలన ఈ దివ్యదేశమునకు తిరుక్కారగమ్ ( కార్ = మేఘము ) అని నామము .

💠 ఈ ఆలయం తిరు ఊరగం (ఉలగలంత పెరుమాళ్) ఆలయంలో ఉంది. 

💠 మూలవర్‌ని దక్షిణాభిముఖంగా ఉన్న శ్రీ కరుణాకరన్‌గా పిలుస్తారు.

💠 దేవాలయంలోని తాయార్ పద్మమణి నాచియర్, దీనిని రమమణి తాయర్ అని కూడా అంటారు

💠ఆలయంలో 3 వేర్వేరు దివ్య దేశాలు ఉన్నాయి - అవి తిరుక్కర్వణం, తిరు నీరాగం, తిరు ఊరగం.

💠 ఇక్కడి గోపుర విమానం పేరు వామన విమానం. 

అమిత రమ్యముగా ఉండుటచే రమ్య విమానం అని కూడా అందురు.

 ఈ రమ్య విమాన నామమును అనుసరించియే ఇక్కడి తాయర్ కు రమ్యమణి నాచియార్ నామము కలిగినది అని పురాణము.

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::  84వ దివ్యదేశము  



🙏శ్రీ కళ్వర్ పెరుమాల్ ఆలయం, 

తిరుకార్వానమ్. 

కంచి 🙏

🔅ప్రధాన దైవం: కళ్వర్ పెరుమాల్

🔅ప్రధాన దేవత: కమలవల్లి

🔅 పుష్కరిణి:.గౌరీపుష్కరిణి

🔅విమానం: పుష్కల విమానము

🔅 ప్రత్యక్షం:.పార్వతీదేవికి

🔔 స్థలపురాణం 🔔

💠 సృష్టిలో జీవరాశి మనుగడకు నీరు ముఖ్య అవసరము . 

ఆ నీరు వర్ష రూపమున కాల మేఘముల వలన మాత్రమే లభ్యమగును . 

ఈ విధముగా జగములో జీవుల మనుగడకు నిత్యావసరమగు నీరు నందు , ఆయన నీటిని వర్షించు నల్లని మేఘముల యందు తన విభూతిని ప్రదర్శించు శ్రీమన్నారాయణుని ఈ దివ్యదేశమున “ తిరుక్కార్ వాణ కళ్వర్ " అను అందురు . 

💠 ( కార్ = మేఘము ) 

💠 ఈ పెరుమాళ్ గౌరి దేవికి ప్రత్యక్షము .

💠పార్వతీదేవి కోరిన విధమును , శ్రీమన్నారాయణుడు అనేక విధములుగా 

ఆ దేవి చేయు తపస్సునకు భంగము కలుగకుండునట్లు సహాయపడిన వివరములను నిలాతింగళ్ తుండమ్ ( ది.దే. 80 ) స్థలపురాణములో చెప్పుకొంటిమి .

💠కాంచీపురంలో ఉన్న 108 దివ్య దేశ దేవాలయాలలో తిరు కార్వన్నం ఒకటి. ఈ ఆలయం తిరు ఊరగం (ఉలగలంత పెరుమాళ్) ఆలయంలో ఉంది. 

ఈ దివ్య దేశం వెనుక ఉన్న పురాణం ఏమిటంటే, కార్, కృష్ణ మేఘాలు శ్రీ నారాయణుడు. మేఘాలు ప్రపంచానికి వర్షాన్ని ఇస్తాయి. 

సమస్త జీవరాశులు మనుగడ సాగించడానికి వర్షాన్ని ఇచ్చే నల్లని మేఘాలు శ్రీమన్ నారాయణన్ అని వివరించారు.

 అందువల్ల ఈ పెరుమాళ్‌ను "తిరుక్కర్ వానక్కల్వర్" అని పిలుస్తారు.

💠కార్ అంటే మేఘాలు మరియు నీర్ అంటే వర్షం (లేదా) నీరు. 

💠 ఈ ప్రపంచంలోని నీరు శ్రీమన్నారాయణని పోలి ఉంటుందని  ప్రపంచానికి వివరిస్తుంది.

 మరియు ప్రపంచానికి కార్ (వర్షం ఇచ్చే నల్లని మేఘాలు) కూడా అతని ప్రతిబింబం మరియు ఆకాశంలో కనిపించే మేఘాలు కూడా అతని ప్రతిబింబమే.

  💠 నీరు లేకుండా, ప్రపంచం మనుగడ సాగించదు. కాబట్టి, అతను వర్షంలా ప్రపంచానికి వస్తాడు మరియు అన్నింటినీ మనుగడకి సహకారాన్ని అందిస్తారు.

కాబట్టి, శ్రీమన్నారాయణు డు తాను కూడా నల్లటి మేఘాలు అని, మానవులకు మరియు అన్నిటికీ మనుగడ కోసం వర్షాన్ని ఇస్తాడని వివరించారు. కాబట్టి, ఈ పెరుమాళ్‌ను "తిరుక్కర్ వానక్కల్వర్" అని పిలుస్తారు.

💠 ఆలయంలోని తాయార్ కోమలవల్లి తాయార్, దీనిని తామరాయల్ అని కూడా అంటారు.

💠ఆలయం లోపల 3 ఇతర దివ్య దేశాలు ఉన్నాయి - అవి తిరుక్కారాగం , తిరు నీరాగం , తిరు ఊరగం.

💠ఆలయ ప్రదేశం కాంచీపురం పట్టణం నడిబొడ్డున మరియు కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉంది. 

💠 ఆలయ సమయం ఆలయం ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు తెరిచి ఉంటుంది


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు  :: 86వ దివ్యదేశము 




🙏శ్రీ పావళ వన్నార్ ఆలయం -

 తిరుపావలా వన్నన్, 

కాంచీపురం🙏


🔅 ప్రధాన దైవం: పవళవణ్ణ పెరుమాళ్

🔅ప్రధాన దేవత: పవళవల్లి త్తాయార్

🔅 పుష్కరిణి: చక్రపుష్కరిణి

🔅 విమానం: ప్రవాళ విమానము

🔅 ప్రత్యక్షం: పార్వతీదేవికి,  అశ్వనీదేవతలకు

🔔 స్థలపురాణం 🔔

💠 కామాక్షి ఆలయమునకు 1 కి.మీ దూరములో గలదు. ఈ సన్నిధి ఎదురు వీధిలో పచ్చవణ్ణర్ సన్నిధి కలదు

💠 ఈ దివ్య దేశమునకు పశ్చిమ దిశలో కొంత దూరమున తిరుప్పచ్చివణార్ సన్నిధి యున్నది . 

తిరుప్పవళ వణ్ణర్ , తిరుప్పచ్చివణ్ణర్ అను ఇరువురనూ ఏ ఒక్కరినీ వదలకు దర్శించ వలయును . 

💠 తిరుప్పచ్చి వన్నారకు మంగళా శాసనము చేయబడలేదు . 

అయినను ఈ రెండు సన్నిధిలను ఒకే దివ్య దేశముగా భావించ వలయును అని స్థల పురాణము . తిరుప్పచ్చివణ్ణరకు మరకత వణర్ అని కూడ నామము కలదు . పవళ వణార్ శివాంశ శక్తిగా , పచ్చివణర్ను పరాశక్తి అంశగా చెప్పుదురు . 

💠 అందువలన ఈ పెరుమాళ్ ఇరువురను అర్చించినచో ,  శ్రీ మహా విష్ణువు - పరమేశ్వరుడు - పరాశక్తి ముగ్గురను అర్చించిన ఫలము పొందుదురు అని చెప్పుదురు . 

💠 పార్వతీ దేవి ప్రార్థించిన విధముగా ఆ దేవికి , భృగుమహర్షికి , అశ్వినీ దేవతలకు ప్రత్యక్షము .

💠భృగు మహర్షి మరియు పార్వతి విష్ణువును ఇక్కడే పూజించారని పురాణాలు చెబుతున్నాయి.

🙏జై శ్రీమన్నారాయణ 🙏


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 87వ దివ్యదేశము  






🙏శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం : పరమేశ్వర విన్నగరం దేవాలయం, కాంచీపురం 🙏

🔅 ప్రధాన దైవం:.వైకుంఠ పెరుమాళ్

🔅 ప్రధాన దేవత:వైకుంఠ నాయకి

🔅 పుష్కరిణి: ఐరంమద తీర్థము

🔅 విమానం: ముకుంద విమానము

🔔స్థలపురాణం 🔔

విరోచనుడు అను ఒక మహారాజు సంతానము లేక కాంచీపురమున కైలాస పతి పరమేశ్వరుని పూజించి ప్రార్థించు చుండెను . అతనికి ఇద్దరు కుమారులు కలిగిరి . 

వారికి ఆ రాజు పల్లవన్ , వల్లవన్ అని నామకరణము చేసి పెంచెను .

 పల్లవన్ , వల్లవన్ పెద్దవారై గొప్ప విష్ణు భక్తి కలిగి తమ ప్రజలను మంచి దక్షతతో జన రంజకముగా పరిపాలించుచు గొప్ప రాజులుగా పేరుపొందిరి . 

వారు ఒక సమయమున ఈ పురమున ప్రజాహితమే కామ్యముగా అశ్వమేథ యాగమును చేసిరి .

 అంతట శ్రీమహావిష్ణువు వారికి పరపద నాథన్ ( వైకుంఠనాథన్ ) గా ప్రత్యక్షము నిచ్చి అనుగ్రహించి వారి జీవితమును ధన్యము చేసెను . వారు ఇరువురు శ్రీమహావిష్ణువు యొక్క ద్వారపాలకులే . కారణ విశేషమున భూలోకములో జన్మించవలని , విరోచన మహారాజునకు సంతానముగా జన్మించి గొప్ప విష్ణు భక్తులుగా జీవితమును సాగించి మంచి రాజులుగా రాణించి , పెరుమాళ్ దర్శన భాగ్యము పొంది , అంతమున విష్ణులోకమునకు తిరిగి ప్రస్థానము చేసిరి . 

 ఈ స్థలపురాణములో విశేమేమనగా - విరోచన మహారాజు సంతానమునకై పరమేశ్వరునికి పూజార్చనలు చేసి ప్రార్థించగా విష్ణుభక్తి పరాయణులైన కుమారులు జన్మించిరి . 

ఈ విధముగా మనలో శివ - వైష్ణవ అనుయాయులందు పరస్పర సామరస్యము , సద్భావములే ఉండవలయును విభేదములు . అనంగీకారభావములు , కలహములు ఉండుట సరికాదు అని పరమాత్ముడు సందేశము నొసంగుటయే కదా ! 

ఈ ఆలయము మూడు అంతస్థులలో ఉండును .

 పెరుమాళ్ భూతలమున ఆసీనమూర్తి , మధ్య తలమున శయన మూర్తి , ఆ పైన నిలిచి యున్న మూర్తిగా దర్శన మిచ్చును . 

నిలిచి యున్న మూర్తికి నిత్య పూజా లేవు . ఈ ఆలయమును సింహ వర్మ అను పల్లవ రాజు కుమారుడు పరమేశ్వర వర్మ నిర్మించెను . అందువలన " పరమేశ్వర విణ్ణగరమ్ " అని ప్రసిద్ధి చెంది యున్నది .

గొప్ప శిల్ప కళా సంపద ఉన్న అత్యద్భుత క్షేత్రము. కంచి రైల్వే స్టేషన్‌కు 1 కి.మీ. దూరములో ఉంది.

శుక్రవారం శ్రీ వైకుంఠవల్లి తన తల్లిని ప్రార్థిస్తే వివాహం త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు.

🙏జై శ్రీమన్నారాయణ 🙏


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 88వ దివ్యదేశము  




🙏శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దేవాలయం,    

తిరుప్పుళ్ కుళి, కాంచీపురం 🙏


🔅ప్రధాన దైవం: విజయరాఘవ ప్పెరుమాళ్

🔅 ప్రధాన దేవత: మరకతవల్లి

🔅 పుష్కరిణి: జటాయుతీర్థం

🔅విమానం: విజయకోటి విమానము

🔅 జటాయువునకు

🔔 స్థలపురాణం 🔔

పరంధాముని  భక్తవత్సలతకు ఎల్లలు లేవు అని తెలిపే ఈ ఆలయ గాధ శ్రీ మద్రామయణం నాటి సంఘటనతో ముడిపడి ఉన్నది. 

శ్రీమహావిష్ణువు రాక్షస సంహారార్ధము ఇక్ష్వాకు వంశమున దశరథ మహారాజు తనయునిగా జన్మించిన శ్రీరామ అవతారమున తన పినతల్లి కైకేయికి తండ్రి ఇచ్చిన వరము నెరవేర్చుటకై 14 సంవత్సరములు వనవాసము చేయుచుండగా ( భార్య సీతాదేవి , తమ్ముడు లక్ష్మణుడు కూడ శ్రీమునితో బాటు వనవాసమున యుండిరి ) . 

 ఆ సమయమున రావణాసురుడు సీతాదేవిని మాయోపాయము చేసి బలవంతముగా తన లంకాపురికి తీసికొని పోయి బంధించెను . సీతను వెదకుచూ రామలక్ష్మణులు అడవులలో తిరుగుచుండగా జటాయువు అను ఒక గరుడజాతి పక్షి నేలపై పడి మూలుగుచుండుట చూచి ఆ పక్షి దగ్గరకు పోయిరి . ఆ జటాయువు ..రావణుడు సీతను అపహరించి బలవంతముగా తీసికొని పోయెనని చెప్పెను . 

ఆ విషయము శ్రీరాముడు ఎప్పటికైనా వచ్చునప్పుడు తెలియ జేయుటకే వేచియుండినట్లు తెలియ జెప్పి తన కర్తవ్యము పాటించిన తృప్తితో శ్రీరాముడు తనను చేతులలో తీసికొని నిమురు చుండగా ప్రాణములు విడిచెను . 


💠శ్రీరాముడు జటాయువును తన తండ్రి స్థానమున భావించుకొని తండ్రికి ( దశరథునకు ) అంత్యక్రియలు చేయలేక పోవుటచే , జటాయువునకు అంత సంస్కారములు చేసి భూమిలో గోయితీసి పాతి పెట్టెను . 

శ్రీరామునిలో జటాయువు శ్రీమహావిష్ణువును దర్శించెను .

కార్యక్రమానికి కావలసిన నీటి కొరకు శరప్రయోగం తో పాతాళగంగ ను రప్పించారు. అదే ఈ ఆలయంలో ఉన్న "జటాయువు పుష్కరిణి ". 


💠వేగావతి నదీతీరం లో ప్రశాంత రమణీయ వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో తూర్పు ముఖంగా దేవేరులు శ్రీ దేవి భూదేవి తో కలిసి దర్శనమిస్తారు. మూలవిరాట్టు ఒడిలో జటాయువు ను చూడవచ్చును. 

 పక్షిరాజు మరణానికి చింతిస్తున్నట్లుగా అమ్మవార్లు తమ ముఖాలను పక్కకు తిప్పుకొన్న భంగిమలో కనిపిస్తారు. 

కొద్ది దూరంలో ఉన్న చిన్న కొండ మీద జటాయువు ఆలయం కలదు.

పక్షిరాజు జటాయువు ప్రభుసేవలో ప్రాణం విడిచిన ప్రదేశం కనుక "తిరుపహిషి "(శ్రీ పక్షి ) అన్న పేరుతో పిలవసాగారు.


💠" పుల్ " అనగా గరుడజాతి పక్షి , " కుళి " అనగా గోయి . 

 జటాయువును గోయిలో పూడ్చి పెట్టిన స్థలము కావున " తిరుపుల్ కుళి ” అని పేరు పొందినది.

 

💠 శ్రీరాముడు జీవులనందరను ఎట్టి తారతమ్యము లేని విధముగా చూచుకొను పరమాత్మావతారము . 

శబరి , అహల్యలకు తన మాతృ స్థానమునిచ్చి గౌరవించి ఉద్ధరించెను . సుగ్రీవుడు , గుహుడు మరియు విభీషణులను తన సోదర స్థానమున ఉంచుకొని ప్రత్యేక గౌరవముతో చూచుకొనెను . 

భక్తికి , శరణాగతికి , ప్రేమకు బద్ధుడై పరమాత్ముడు సర్వజనులను అనుగ్రహించును అని బోధించు అవతారము శ్రీరాముడు , సచ్ఛీలత , కర్తవ్యపాలనము , నిస్వార్థపరత్వము భూతదయ మొదలగు సర్వ సద్గుణ రాశి శ్రీరాముడు . 


💠ఈ క్షేత్రంలో గల ఈ దేవాలయంలో, పిల్లలు లేని స్త్రీలు, పప్పును (పరుప్పు) మాడపల్లికి (భగవంతుని భోజనం తయారు చేసిన ప్రదేశం) ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత, పప్పును నీటిలో నానబెట్టి, వారి కడుపు చుట్టూ కట్టి, నిద్రపోమని  చెప్తారు. వారి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, విత్తన మొగ్గలు ఏర్పడితే, వారు ఒక బిడ్డకు జన్మనిస్తారని నిర్ధారించబడింది.

ప్రతి అమావాస్య నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి.

🙏 జై శ్రీమన్నారాయణ 🙏


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 89వ దివ్యదేశము  




శ్రీ భక్తవత్సల పెరుమల్ ఆలయం, తిరునీంద్రవూర్, 

చెన్నై 

🔅 ప్రధాన దైవం: భక్తవత్సల పెరుమాళ్ (విష్ణువు)

🔅ప్రధాన దేవత: నన్నుగన్నతల్లి

🔅 పుష్కరిణి: వరుణ పుష్కరిణి

🔅 విమానం: శ్రీనివాస విమానము

🔅 ప్రత్యక్షం: వరుణుడు

🔔 స్థలపురాణం 🔔

శ్రీ బక్తవత్సల పెరుమాళ్ ఆలయం చెన్నై శివారులో, తిరునిన్రావూర్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఇది 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం దాని పేరు మహాలక్ష్మి నుండి వచ్చింది - తిరు అంటే లక్ష్మి మరియు నిన్రావూర్ ఆమె ఎప్పటికీ నిలిచే ప్రదేశం. 

ఈ ఆలయంలో మూలవార్ శ్రీ భక్తవత్సల పెరుమాళ్ మరియు ఇక్కడ ఉన్న లక్ష్మీ దేవిని 'ఎన్నై పెట్ర తాయర్' అని పిలుస్తారు.

పురాణం ప్రకారం, సముద్రరాజు (మహాసముద్ర రాజు) ఒక బిడ్డ కోసం ఆరాటపడి  మరియు మహాలక్ష్మి దేవి తన కుమార్తెగా జన్మించాలని అతని కోరిక. అతను చాలా సంవత్సరాలు ఆమెను ప్రార్థించాడు, ఆ తర్వాత దేవత అతని ముందు ప్రత్యక్షమై అతని కోరికను తీర్చారు. ఒక రోజు, అతను సముద్రంలో తామర పువ్వు మధ్యలో ఒక అందమైన ఆడపిల్లని కనుగొన్నాడు.

 లక్ష్మీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ అతను "ఎన్నై పెట్రా తాయే" (నాకు జన్మనిచ్చిన తల్లి) బిడ్డకు ఎన్నై పెట్ర తయార్ అని పేరు పెట్టాడు.

తిరుమంగై ఆళ్వారు ఇచ్చటకు పెరుమాళను దర్శించుటకు వచ్చిన సమయమున శ్రీమహాలక్ష్మితో ముచ్చటించుచున్న పెరుమాళ్ ఆళ్వారు రాకను గమనించ లేదు . 

అంతట తిరుమంగై ఆళ్వారు కోపముతో పెరుమాళ్ పూజ మాత్రమే చేసి మంగళాశాసనము చేయకనే తిరిగిపోయిరి.

పెరుమాళ్ కి ఆళ్వార్ చేత మంగళా శాసనం చేయించుకోవాలి అనే ఆశ... పరమాత్మ ఆళ్వార్ వెనుక పరుగున వెళ్లి....అప్పటికే  మహాబలిపురమున కడల్ మలై  పెరుమాళ్ వద్ద ఉన్న తిరుమంగై ఆళ్వారుని బుజ్జగించి...అచటనే  భక్త వస్థల పెరుమాళ్ గా  దర్శనం ఇచ్చాడు. అప్పుడు ఆనందంతో  తిరుమంగై ఆళ్వార్ ఈ తిరునిణ్ణపూర్ పెరుమాళ్ పై మంగళాశాసనము చేసెను .

ఇక్కడి ఆలయ విశిష్టత..ప్రత్యేక లక్ష్మీదేవి పూజ(వ్రతం)

లక్ష్మీ పూజ పేరు సూచించినట్లుగా, ఇది సంపద, శ్రేయస్సు మరియు ప్రపంచంలోని అన్ని సంపదలకు ఆలయం. 

 ఎన్నై పెట్రా తయార్ సన్నిధి ముందు గీసిన తొమ్మిది చతురస్ర మాతృక ఉంది, ఇందులో నిర్దిష్ట సంఖ్యలు ఉన్నాయి. 

మీ పూజ గదిలో ఈ మాతృకను ప్రతిబింబించడం ద్వారా మరియు ప్రతి చతురస్రంపై ఒక రూపాయి నాణేలు ఉంచాలి. పూజ గదిలో తెల్లటి ముగ్గు పిండితో ముగ్గులు వేసి  , ఆలయంలో ప్రదర్శించే కార్డ్‌ని నమూనా ఉపయోగించి ఆ ముగ్గు మీద  యంత్రాన్ని గీయడం ద్వారా పూజ చేయవచ్చు. 

ప్రతి పెట్టెలో ఒక రూపాయి నాణేలు (ఒకే విలువ కలిగిన నాణేలు) ఉంచడం, మాతృకపై  కుంకుమ మరియు పూలను వేయడం మరియు లక్ష్మీ అష్టోత్రం పఠించడం ద్వారా తొమ్మిది రోజులు పూజ చేయాలి. మునుపటి రోజు నాణేలు తీసి సురక్షితంగా నిల్వ చెయ్యాలి. మరియు మరుసటి రోజు కొత్త నాణేలు ఉపయోగించాలి.

 అలా తొమ్మిది రోజుల పూజ పూర్తయిన తర్వాత తొమ్మిది సుమంగళీల కోసం తాంబూలంతో పాటు 81 నాణేలను ఆలయానికి తీసుకువెళతారు. 

ఆలయ పూజారి నాణేలను తాయారు పాదాల వద్ద ఉంచి అర్చన చేస్తారు. తర్వాత మొదటి తాంబూలం అమ్మవారికి సమర్పించబడుతుంది. ఆ తరువాత, అతను భక్తులకు నాణేలను తిరిగి ఇస్తాడు, ఆ తర్వాత నాణేలను మందిరం వెలుపల ఉన్న హుండీలో జమ చేస్తారు.

శుక్రవారం నాడు పూజను ప్రారంభించడం ఉత్తమం. శుక్రవారం పౌర్ణమి రోజు అయితే, అది మరింత పవిత్రమైనది.

వివాహ సమస్యలు  ఉన్నవారు ఇక్కడికి వస్తే  ఆ కల్యాణ సమస్యలు తీరుతాయని  భావిస్తున్నారు. ఆదిశేషునికి ప్రత్యేక సన్నిధి  ఉంది మరియు ఆయనను పూజిస్తే రాహు-కేతు మరియు సర్ప దోషం తొలగిపోతాయని మరియు మాంగళ్యానికి ప్రయోజనం చేకూరుతుందని నమ్ముతారు.

🙏జై శ్రీమన్నారాయణ 🙏


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 90వ దివ్యదేశము 🕉




శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం-

తిరువళ్లూరు, చెన్నై 

🔅 ప్రధాన దైవం : వీరరాఘవ పెరుమాళ్

🔅 ప్రధాన దేవి : కనకవల్లితాయార్

🔅 తీర్థం : హృత్తాప నాశతీర్థం 

🔅 విమానం : విజయకోటి విమానము

  🔔స్థలపురాణం 🔔

ఈయన  విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. 

వీర రాఘవ స్వామి మందులు తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.


🔅 స్థలపురాణం అనుసరించి  తమిళ తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున శాలిహోత్రుడు మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు.


🔅అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. శని-ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది. ఈ ఆలయంలో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిధి కలదు. రాముల వారికి, శ్రీ కృష్ణుడికి కూడా ప్రత్యేక సన్నిధి ఉన్నాయి. ఆలయంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది.


🔅భగవంతుడు వైద్య వీర రాఘవార్ అని పిలువబడతాడు , భక్తులు తమ రోగాలను నయం చేయడానికి ఇక్కడకు వస్తారు. ఈ దేవాలయంలో ప్రజలు  అవయవాల అనారోగ్యం సమస్యలను నయం చేయమని దేవుడిని అభ్యర్థించినట్లుగా వాటిపై చెక్కబడిన నిర్దిష్ట మానవ అవయవాన్ని పోలి ఉండే చిన్న లోహపు షీట్లను అంటిస్తారు. . కోలుకోలేని వ్యాధులతో బాధపడేవారు మూడు అమావాస్య రోజులు (అమావాసయి) స్వామిని దర్శించుకుంటే నయమవుతాయని నమ్ముతారు.


జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 91వ దివ్యదేశము  



🙏శ్రీ నీర్వన్న పెరుమాళ్ ఆలయం -

తిరు నీర్మలై, 

 చెన్నై 🙏

⚜ ప్రధాన దైవం: నీర్‌వణ్ణన్ స్వామి

⚜ ప్రధాన దేవత: ఆణిమామలర్ మంగై తాయార్

⚜పుష్కరిణి: మణికర్ణిక పుష్కరిణి

⚜ విమానం:తోయగిరి విమానము

⚜ ప్రత్యక్షం: తొండమాన్ చక్రవర్తి, మార్కండేయుడు, భృగు మహర్షి.

🔔 స్థల పురాణం 🔔

తిరునీర్మలై ఒక విలక్షణమైన దివ్యక్షేత్రము. ఇది వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైనది.

నీర్ మలై పర్వతముపై వెలసియున్న శ్రీ మహావిష్ణువు నాలుగు రీతులలో దర్శనమిచ్చును .

1. నిలిచియున్న మూర్తి 

2. ఆసీన మూర్తి

3. శయన మూర్తి

4. త్రివిక్రమమూర్తి 

వాల్మీకి మహర్షి శ్రీ మహావిష్ణువును ఈ నాలుగు రీతులలో దర్శించుకొని పర్వతము దిగి క్రిందకు చేరినంతనే - శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా , శ్రీదేవి సీతాదేవిగా , ఆదిశేషుడు లక్ష్మణునిగా , శంఖచక్రములు భరతశతృఘ్నులుగా , విఘ్నేశ్వరుడు సుగ్రీవునిగా , గరుడుడు హనుమాన్‌గా దర్శనమిచ్చిరి . 

ఈ విధముగా అనేక రూపములలో దర్శించుకొని అర్చించుకొను భాగ్యమును పెరుమాళ్ మనకు అనుగ్రహించి యున్నాడు . 

తిరుమంగై ఆళ్వారు ఈ క్షేత్రాన్ని  పెరుమాళ్ ను దర్శించుకొనుటకై వచ్చి , నీర్ మలై పర్వతము చుట్టు నీరు నిండి యుండిన కారణమున 6 మాసములు వేచి యుండి నీరు తగ్గిన తరువాత పర్వతము పైకి పోయి పెరుమాళ్ ను దర్శించుకొని సేవించెను .

మూలవిరాట్ -

1. నిలిచియున్నమూర్తి తూర్పు ముఖముగా నీర్వళర్ పెరుమాళ్ భృగు మహర్షి , మార్కండేయ మహర్షి , వాల్మీకి , తొండై మానులకు ప్రత్యక్షము ; 

2. ఆసీన మూర్తి - నరసింహస్వామి . 3. శయనమూర్తి - ఆదిశేషునిపై దక్షిణ ముఖముగా రంగనాథుడు ( మాణిక్యశయనము ) , 

4. త్రివిక్రమ మూర్తి - త్రివిక్రమన్ . 

పుష్కరిణిలు : 

నిలిచియున్న మూర్తికి కారుణ్య పుష్కరిణి ,

శయన మూర్తికి క్షీర పుష్కరిణి , ఆసీన మూర్తికి స్వర్ణ పుష్కరిణి , త్రివిక్రమమూర్తికి సిద్ధ పుష్కరిణి

కలవు . 

  విమానములు :

 శ్రీరంగనాథునికి రంగ విమానము , నరసింహునికి శాంత విమానము , త్రివిక్రమునకు తోయగిరి విమానము గలవు .

తిరునీర్మలై ఆలయం ఒక చిన్న కొండపై ఉంది .

ఈ దివ్య దేశాన్ని "తోయగిరి క్షేత్రం" అని కూడా అంటారు మరియు దీనిని "తోతాద్రి" అని కూడా అంటారు.

 తోయా అంటే "నీరు" మరియు అధిరి అంటే "పర్వతం" (మలై). 

కొండ చుట్టూ ఒకప్పుడు నీరు ఉండేది కాబట్టి, ఈ ప్రదేశానికి "తిరు నీర్మలై" అని పేరు పెట్టారు.  

ఇక్కడ ఈ ఆలయంలో, పాత మర్రి  చెట్టు ఉంది. ధూమం అంటే "రాహు".

ధూమకేతు గణపతిగా పిలువబడే వినాయకుడు, ఈ చెట్టు కింద సప్తకానికతో పాటు కనిపిస్తారు. సంతాన హోమం..( బిడ్డ కోసం ప్రార్థిస్తున్న హోమం), భక్తులచే చతుర్థి రోజున మీరు రాహు కాలంలో ఈ గణపతిని పూజిస్తే, ఇక్కడ వినాయకుడిని ప్రార్థించడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయని, పిల్లలు పుడతారు అని నమ్ముతారు. 

జై శ్రీమన్నారాయణ 



108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు :: 92వ దివ్యదేశము 

శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం - 

తిరువేదంతై, 

మహాబలిపురం 🙏


⚜ ప్రధాన దైవం: నిత్యకల్యాణ, శ్రీ లక్ష్మీ వరాహస్వామి పెరుమాళ్

⚜ ప్రధాన దేవత: కోమలవల్లి నచ్చియార్

⚜ పుష్కరిణి: కళ్యాణ తీర్థం

⚜ విమానం: కళ్యాణ విమానం

⚜ ప్రత్యక్షం: మార్కండేయ మహర్షి


🔔 స్థలపురాణం 🔔

 శంభుద్వీపము అను ప్రదేశమున సరస్వతీనది తటమున " కుని " అను మునీశ్వరుడు తన శిష్యులతో నివసించు చుండెను . ఒక ముసలి స్త్రీ ఆ మునికి అవసరమైన పనులు , సహాయము చేయుచుండెను . కొంతకాలమున ఆమె కూడ పరిపక్వత నొంది తపస్సు చేయుట ప్రారంభించెను . ఆ సమయమున ఆమె వద్దకు నారదమహర్షి వచ్చి వివాహస్త్రీలు తపస్సు చేసిననే అది ఆమోదయోగ్యము అగును , మరియు మోక్షమును పొందుదురు అని చెప్పగా ఆమె ముని వద్దకు పోయి , ఎవరైన తనను వివాహమాడుదురా అని అడిగెను . 

అంతట " కలవ ముని " తన సమ్మతిని తెలియజేసి వివాహము చేసుకొని ఒక సంవత్సరములో ఆమె యందు 360 స్త్రీ శిశువులకు జన్మనిచ్చెను . ఆ బిడ్డలకు వయస్సు రాగా యోగ్యులగు వరులకిచ్చి వివాహము చేయు విషయమై చింతించుచూ , ఈ స్థలమునకు వచ్చి ఆదివరాహమూర్తి రూపమును ధ్యానములో నుంచుకొని శ్రీ మహావిష్ణువును పూజించెను .

ఒక దినమున శ్రీ మహావిష్ణువు బ్రహ్మచారిగా వచ్చి 360 కన్యలను వివాహము చేసికొందునని కలవమునికి చెప్పి రోజుకి ఒక కన్య చొప్పున 360 రోజులలో వివాహమాడెను . అందువలన శ్రీమన్నారాయణుడు ఇచ్చట “ నిత్య కళ్యాణ పెరుమాళ్ " గా వెలసెను . 

ఆ కారణమున ఈ స్థలమునకు " నిత్య కళ్యాణపురి " అనియు , మరియు 360 కన్యలలో ఒక కన్యగా శ్రీ మహాలక్ష్మి " పెరియపిరట్టియార్ " గా అవతరించి నందున " శ్రీపురి " అనియు పేర్లు కలవు . ఇంకనూ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమూర్తిగా కూడ వెలసినందున " వరాహపురి " అను పేరుకూడ కలదు . 360 మందిని వివాహమాడిన పిమ్మట వారెల్లరిని ఒక్కరిగ మార్చెను కావున అమ్మవారికి "అఖిలవల్లి " అను పేరు వచ్చెను. అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొనెను. కావున ఈ ప్రెదేశమునకు తిరువిడందై అను పేరు ఏర్పడెను.

నిత్య కళ్యాణ మూర్తి కావున స్వామి గడ్డమున ఒక పెద్ద బొట్టు తెలుపు రంగులో ఉండును . 360 కన్యలలో మొదటిది కోమలవల్లి . కోమలవల్లి తాయారు సన్నిధి వేరుగా నున్నది . అఖిలవల్లి తాయారు స్వామి వామ భుజమువైపు , భూమిదేవి కూడ ప్రక్కనే ఉండి దర్శనమిత్తురు . ఇది వరాహ క్షేత్రము. వివాహార్థులు ఇచట స్వామి వారిని కొలిచెనేని వివాహములు శిఘ్రముగ కుదురునని ఆస్తికుల నమ్మిక. వివాహం చేసుకోవాలని చూస్తున్న భక్తులు పాటించాల్సిన ఆచారం:

అబ్బాయి అయినా, అమ్మాయి అయినా వారు అర్చన పదార్థాలతో పాటు రెండు దండలు తీసుకోవాలి. పెరుమాళ్ మరియు తాయార్‌కు పూలమాల వేసిన తరువాత, పూజారి దండలలో ఒకదాన్ని తిరిగి ఇస్తాడు. వివాహం చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి లేదా అమ్మాయి దండ ధరించాలి మరియు వారి నిజాయితీ ప్రార్థనలు చేసిన తర్వాత తొమ్మిది సార్లు ప్రదక్షిణలు (ఆలయం లోపలి సమ్మేళనం) చేసి  రావాలి. వివాహం స్థిరపడే వరకు వారు తమ ఇంటిలో దండను భద్రపరచాలి. 

వివాహం పూర్తయిన తర్వాత, వివాహిత జంట మళ్లీ దేవాలయాన్ని సందర్శించి, ఆలయ లో ఉన్న 'చెట్టుపై పూలమాల వేయాలి.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు 93వ దివ్యదేశము 



స్థలశయన పెరుమాళ్ ఆలయం, 

మహాబలిపురం (తిరుక్కడల్‌మలై) 

⚜ప్రధాన దైవం: స్థలశయన పెరుమాల్

⚜ ప్రధాన దేవత:నిలమంగై తాయార్

⚜ పుష్కరిణి:.పుండరిక పుష్కరిణి

⚜ విమానం:.గగనాకార విమానము

⚜ ప్రత్యక్షం:.పుండరీక మహర్షి

స్థలపురాణం  --- శ్రీ మహావిష్ణువు వామన అవతారమున బలి చక్రవర్తి నుండి 3 అడుగుల ప్రదేశము దానము అడిగి , త్రివిక్రమమూర్తిగా భూలోకము , ఊర్ధ్వలోకములన్నింటిని రెండు పాదములతో ఆక్రమించి మూడవ పాదమునకు బలిచక్రవర్తి తన తలపై నుంచమని కోరగా ఆ విధమున మూడు అడుగుల ప్రదేశమును గ్రహించి అతని దాననిరతికి అమితముగ సంతోషించి అభినందించి , ఈ ప్రదేశమును తిరిగి వరమొసగెను . 

ఆ వర ప్రసాదముగ ఈ ప్రదేశమును బలి చక్రవర్తి పాలించుటచే మహాబలిపురము అని పేరొందిన ఈ స్థలమును తదుపరి కాలమున పల్లవరాజు మహేంద్ర వర్మ కుమారుడు నరసింహవర్మ , అతని కుమారుడు మామల్లుడు పాలించిరి . ఆ కారణమున ఈ ప్రదేశము మామల్లపురము అని కూడ పేరు పొందినది . 

పుండరీక మహర్షి ఈ ప్రదేశమున ఒక గొప్ప పువ్వుల తోటను పెంచి అందు గొప్పకొలనులో చాల పద్మములను పూజింప చేసి ఆ పద్మములను ఒక పెద్ద బుట్టలో నుంచుకొని క్షీరసాగర శయన మూర్తి శ్రీ మహావిష్ణువునకు సమర్పించి పూజించుటకై బయలు దేరెను .

 కాని సముద్రము గొప్ప కెరటములతో అడ్డువచ్చుటచే దాటలేక ఆ సముద్రము నందలి నీటిని అంతటిని తన చేతులతో తోడి సముద్రమును ఎండింప చేయుటకై తీవ్ర యత్నము చేయుచుండెను . ఆ సమయమున తీవ్రముగా శ్రీమన్నారాయణ మంత్రోచ్చారణము కూడ చేయుచుండెను . 

అంతట శ్రీ మహావిష్ణువు అతని భక్తికి మెచ్చి ఒక ముసలివాని రూపమున వచ్చి తనకు చాల ఆకలిగానున్నదని ఏమయిన తినుటకు ఇమ్మని అడిగెను . “ నీకు భోజనము పెట్టెదను , కాని సముద్రపు నీరు తోడి ఎండించుటలో సహాయము చేయవలయును " అని పుండరీకుడు కోరి అందులకు అంగీకరించిన పిమ్మట తన ఇంటికి పోయి భోజనము తెచ్చి వచ్చునంతలో ఆ ముసలివానిని మరి కానలేక పోయెను . మరియు అచ్చట సముద్రములోని నీరు కూడ పూర్తిగా ఎండిపోయి యుండెను . ఇంకను శ్రీ మహావిష్ణువు పద్మములను అన్నింటిని భుజములపై ధరించి , క్షీర సాగరమునుండు విధమున తూర్పు ముఖమున శయన మూర్తిగా పుండరీకునకు ఈ స్థలమున దర్శన మిచ్చెను . 

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  --- 94వ దివ్యదేశము 

శ్రీ పార్థసారథి ఆలయం, తిరువల్లిక్కేణి ( Triplicane) , ,చెన్నై 

⚜ ప్రధాన దైవం: వేంకట క్రిష్ణ, పార్థసారథి 

⚜ ప్రధాన దేవత: శ్రీ రుక్మిణీ తాయార్

⚜ ఉత్సవ దైవం: శ్రీ పార్థసారథి పెరుమాళ్

⚜ ఉత్సవ దేవత:శ్రీదేవి, భూదేవి నాచియార్, శ్రీ ఆండాళ్

⚜ పుష్కరిణి: కైరవేని సరస్సు

⚜ విమానం: 5 విమానాలు..( అనంత, ప్రణవమని, పుష్పక, శేష, దైవక విమానం)

స్థల పురాణం  ---- తిరువల్లిక్కేణి (ట్రిప్లికేన్) పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి.  చెన్నై మహానగరంలో ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రధాన దైవం-  పార్థసారథి (శ్రీకృష్ణుడు). మరెక్కడా లేని విధంగా, ఇక్కడ శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తాడు. 

కురుక్షేత్రం యుద్ధంలో కొన్ని బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం వల్ల, ఇక్కడ నెలకొన్న స్వామివారి ముఖంపై వాటి తాలూకు మచ్చలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు కురుక్షేత్రం యుద్ధంలో శంఖం తప్ప వేరే ఆయుధం పట్టకపోవడంతో, ఇక్కడి మూలవిరాట్ చేతిలో సుదర్శన చక్రం ఉండదు. ప్రధాన దైవం అయిన పార్థసారథితో పాటు రామచంద్ర మూర్తిని నిల్చున్న విధంగా, నరసింహ స్వామిని కూర్చున్న విధంగా, రంగనాథ స్వామిని శయనించిన విధంగా, గజేంద్ర వరదరాజుని పయనించుచున్న విధంగా పంచమూర్తులను ఒకే క్షేత్రంలో దర్శించుకోవడం అనేది మన పూర్వ జన్మ సుకృతమే!!!

ఇది దక్షిణ బృందావన క్షేత్రము అని పేరు. ఇక్కడ పార్థసారథి పెరుమాళ్-రుక్మిణీదేవి తాయార్, బలరామ, సాత్యకి, అనిరుద్ద, ప్రద్యుమ్నులు వేంచేసియున్నారు. 

తమిళములో కలువపువ్వును "అల్లి" అంటారు. కలువపూవులు మెండుగా గల పుష్కరిణి యగుటచే "తిరు అల్లిక్కేణి" అని ప్రసిద్ధి చెందినది. బృందారణ్య క్షేత్రమనియు పేరు ఉంది. తొండమాన్ చక్రవర్తి ప్రార్థనచే తిరుమలై తిరువేంగడముడైయాన్ (శ్రీనివాసుడు) కృష్ణావతారముగా సకుటుంబముగా సేవ సేయించిన ప్రదేశము. కావున స్వామి వేంకటేశ్వరుని తిరునామముతో "వేంకటకృష్ణన్" అను తిరునామమేర్పడినది. ఈ దివ్యదేశమున స్వామి రుక్మిణీదేవితోను, బలరాముడు సాత్యకి (సోదరులు) ప్రద్యుమ్నుడు (కుమారుడు) అనిరుద్దుడు (మనుమడు) వీరితో కలసి సకుటుంబముగా సేవ సాయించును.

ఇచటనే ఆసూరి కేశవాచార్యులవారు పుత్రకామేష్ఠి చేసి "భగవద్రామానుజులను" పుత్రులుగా పొందిరి.

సంస్కృత భాషలో పార్థసారథి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క

సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.

బ్రహ్మాండ పురాణం ప్రకారము ఈ క్షేత్రానికి తిరువల్లిక్కేణి అని పేరు. ఆంగ్లేయులు తిరువల్లిక్కేణిని ట్రిప్లికేన్ అని అంటారు. భీష్ముడు విడిచిన అస్త్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడం వల్ల స్వామి ముఖంపై కొన్ని మచ్చలు ఉంటాయి. సాధారణానికి భిన్నంగా స్వామికి మీసాలు ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది. పార్థసారథి యాదవుల వంశంలో జన్మించడం వల్ల ఉత్సవ మూర్తిగా ఒక దారుశిల్పం (చెక్క బొమ్మ) మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఉత్సవ మూర్తుల విగ్రహాలను పంచలోహాలతో గాని రాతితో గాని తయారు చేస్తారు

 జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు  - 95వ దివ్యదేశము 

ఘటికాచాలం: శ్రీ యోగ నరసింహ స్వామి దేవాలయం, షోలంగిర్ (తిరుక్కడిగై ) 

⚜ప్రధాన దైవం: యోగ నరసింహ స్వామి 

⚜ ప్రధాన దేవత: అమృతవల్లి

⚜ పుష్కరిణి:.తిరుక్కావేరి

⚜ విమానం:.సింహకోష్ట విమానము

⚜ ప్రత్యక్షం: ఆంజనేయస్వామి

స్థలపురాణం --- (ఘటికాచలము) : హిరణ్యకశిపుని సంహరించుటకై శ్రీ మహావిష్ణువు తాల్చిన నరసింహ అవతారమూర్తిని దర్శించుటకై ఈ ప్రదేశమున సప్తఋషులు తపస్సు చేయగా ఒక ఘటిక సమయములోనే యోగ నరసింహుడు దర్శన మిచ్చెను . అందువలన ఈ స్థలమును ఘటికా చలము అందురు . 

తమిళములో కడిగై అనగా ఘడియ లేక ఘటిక అర్థము కావున ఈ ప్రదేశము తిరుక్కడి అయినది ఈ పర్వతమును పెద్దకొండ అందురు .

 ఇంద్రద్యుమ్నుడు అను మదురై రాజు ఋషుల తపస్సునకు భంగము కలిగించు అసురులను వధించుచుండెను .ఆ కార్యములో సహాయపడుటకై దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నునకు తన వజ్రాయుధమును ఇచ్చెను . 

యోగ నరసింహునిగా వెలసిన శ్రీమన్నారాయణుడు ఇంద్రద్యుమ్నునికి సహాయ పడవలసినదిగా ఆంజనేయునకు చెప్పెను . పెరుమాళ్ ఆంజనేయునికి దర్శనమిచ్చిన కొండ దగ్గరలోనే చిన్న కొండ అను పేరు తో నున్నది . చిన్నకొండపై కూడ యోగ నరసింహమూర్తిగా వెలసిన శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ ఆంజనేయస్వామి ఆలయములు కలవు . ఈ స్థలములో ఒక ఘడియకాలము నిద్రించినను మోక్షము సిద్ధించునందురు .

 భైరవముని ఆజ్ఞ ప్రకారము ఈ క్షేత్రము ఉన్న పర్వతము ఎత్తు పెరుగుచూ ఆకాశమున దూసుకొని పోవుచుండగా ఇంద్రుడు బలరాముని ప్రార్థించి పర్వతపు పెరుగుదలను నివారింపుమని కోరెను . బలరాముడు అటులనే నివారించెను . 

చిన్న కొండపై వెలసిన ఆంజనేయ స్వామి కూర్చుని యుండి శంఖ చక్రములు ధరించి దర్శనమిచ్చుట ఇచ్చటి విశేషము . మరియు దుష్టశక్తులబారి నుండి రక్షించు గొప్ప శక్తి ఈ స్థలమున యున్న హనుమతీర్థమునకు గలదు . అందుచేత ఈ తీర్థమున అందరు స్నానము చేయుదురు . పెద్దకొండ 400 అడుగుల ఎత్తు , చిన్నకొండ 200 అడుగుల ఎత్తు కలిగి యున్నవి . 

దీనిని చోళసింహపురము అని, చోళంగిపురము అని కూడా పిలుస్తారు. ఇది తిరుత్తణి నుండి 30 కి.మీ. దూరములో ఉంది.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు --- 96వ దివ్యదేశము 

కలియుగ వైకుంఠపురి ..శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం; తిరుమల (తిరువేంగడం)  

స్థలపురాణం ---- ఈ దివ్యదేశము తిరుపతి - తిరుమల నామములతో ప్రపంచ ఖ్యాతి పొందియున్న మహా పుణ్యక్షేత్రము. ఇది కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిని పొందింది. దీనిని వరాహ క్షేత్రమని పిలుస్తారు. తొండమానుడు.అనే రాజు ఈ ఆలయాన్ని మొదట కట్టించాడట. 

"వేం" కారము అమృత బీజము, కటము అనగా ఐశ్వర్యము. అమృత ఐశ్వర్యముల సంగమముగా ఈ గిరి వేంకటాద్రి అయినది అనునది ఒక వివరము కాగా, "వేం" అనగా పాపము, "కట" అనగా హరించునది, కావున వేంకటాద్రి పాపహారిణి అనునది మరియొక వివరణము. 

నారాయణుడు అను ఒక విప్రుడు ఈ అద్రియందు తపమాచరించి శ్రీమహావిష్ణువును ప్రత్యక్షము పొందినంత, ఆ విప్రుని పేరున నారాయణాద్రిగా ఈ గిరి వెలయునట్లు శ్రీమహావిష్ణువు అనుగ్రహించెను.  మరియు చింతించిన దానిని ఇచ్చునది కావున "చింతామణి", జ్ఞానము నిచ్చునది యగుటచే " జ్ఞానాద్రి", సర్వ తీర్థమయము అగుటచే “తీర్థాద్రి", పుష్కరిణులు మిక్కిలిగా నుండుటచే "పుష్కరాద్రి", ఈ విధములుగా ఎన్నియో నామములతో ఈ గిరి విలసితమై యున్నది.

హిరణ్యాక్షుడు అను రాక్షసుని వధించి శ్వేతవరాహ రూపి అయిన శ్రీమహావిష్ణువు ఈ భూలోకమున విహరించి వినోదించి క్రీడించుటకు అనువుగా ఎంచుకొని గరుడుని ఆదేశించగా, గరుడుడు వైకుంఠమున ఉండు " క్రీడాద్రి'  అను శ్రీమహావిష్ణువు యొక్క క్రీడా శైలమును పరమాత్ముని పరిచారక బృందముతో బాటు తెచ్చి ఇచ్చట ప్రతిష్టించెను. 

ఆ విధముగా శ్వేత వరాహ రూపియైన శ్రీమహావిష్ణువు స్వామి పుష్కరిణి సమీపమున పశ్చిమ భాగమున వెలసెను, మరికొంత కాలమునకు శ్రీమహావిష్ణువు వైకుంఠమును వీడి శ్రీనివాసునిగా ఈ గిరి యందు తిరుగుచూ శ్వేత వరాహరూపి అయిన తన అన్య అవతారమును కలియగా ఇద్దరూ తమను తాము అభినందించుకొని, యుగావసరముగా, ధర్మావసరముగా, మరియు అనేక సమయములలో భక్తులకు ఇచ్చిన వరములను కార్యరూపము నొందించుటకై తమ శక్తులను, మాయలను, అనుగ్రహములను ప్రసరింప చేయుచూ జగత్కళ్యాణ కర్తలుగా విలసిల్లు చున్నారు.

ఆ విధముగా శంఖచక్రధారియై చతుర్భుజుడై శ్రీనివాసునిగా స్వామి పుష్కరిణికి దక్షిణ భాగమున శ్రీ వేంకటేశ్వర స్వామి అనే పేరుతో  వెలసెను.

మూలవర్లు  శ్రీనివాసుడు లేదా శ్రీ వెంకటా చలపతి  లేదా బాలాజీ లేదా తిరు వెంకట ముడియన్  లేదా గోవిందా అని  ప్రేమగా అనేక పేర్లతో  పిలువబడే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం.

శ్రీ వేంకటేశ్వర స్వామి నల్లని వర్ణంతో, తొమ్మిది అడుగుల ఎత్తులో, శంఖ, చక్ర, వరద, కట్యవలంచిత ముద్రలతో, కర్పూర తిలకంతో, సమదృష్టితో దర్శనమిస్తాడు. సాలగ్రామశిలా మూర్తి, ఆగమశాస్త్రాలకు అతీతంగా   ఉంటుందని చెబుతారు.

కృతయుగంలో వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయడం వల్ల వృషభాద్రియని, త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు వల్ల అంజనాచలమని, ద్వాపరంలో ఆదిశేషుడు దాగియుండడం వల్ల శేషాచలమని, కలియుగంలో పాపాలను పోగొట్టే పర్వతంబట్టి వేంకటాచలమని ప్రసిద్ధి. 

దాదాపు ఏడాది పొడవునా అనేక పండుగలు జరుపుకుంటారు. 9 రోజుల  శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో జరుపుకుంటారు, ఇది శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రధాన ఘట్టం. బ్రహ్మోత్సవాలలో మలయప్పస్వామి తన భార్యలు శ్రీదేవి మరియు భూదేవితో కలిసి ఆలయం చుట్టూ 4మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగింపుగా తీసుకువెళతారు. హంస వాహనం, సింహ వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణ రథోత్సవం (బంగారు రథం), గజవాహనం, అశ్వ వాహనం మరియు అనేక ఇతర వాహనాలు.

వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైనది. రథసప్తమి ఫిబ్రవరిలో జరుపుకునే మరో పండుగ. ఇతర వార్షిక ఉత్సవాలలో రామ నవమి, జన్మాష్టమి, ఉగాది, శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, పుష్ప యాగం, పుష్ప పల్లకీ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఉన్నాయి.

ఏడుకొండలవాడ వేంకట రమణ గోవిందా గోవిందా..

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు  -  97వ దివ్యదేశము

హిరణ్యకశిపుడుని చంపడానికి స్వామి స్తంభం నుండి ఆవిర్భవించిన స్థలం......ప్రహ్లాద వరదుడు శ్రీ  ఉగ్రనరసింహ స్వామి ఆలయం : అహోబిలం ( శింగవేళ్ కుండ్రం) 

స్థలపురాణం  --- శ్రీ వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈనాటికి 

శ్రీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు. 

ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసింహ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. 

ఈ స్తోత్రము "20" శ్లోకాలలో నరసిం హ స్వామిని వర్ణించాడు.

అహోబిల నవనారసింహ వైభవం : అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు. అవి ముక్తి కాంత విలాసాలు. అహోబిల క్షేత్రం లో నవ నారసింహులకు ప్రత్యేక సన్నిధానములున్నవి. 

వరుసగా రౌద్ర, వీర, కరుణ, శాంత, భీభత్స, శృంగార, అద్భుత, భయానక, సంతోషం అని తొమ్మిది రసాలుని 9 రూపాలుగా చేసుకొని స్వామీ ఇక్కడ వెలిసియున్నాడు

ప్రహ్లాదుడు విద్యాబుద్ధులు నేర్చిన బడి..ఇప్పటికి ఎగువ అహోబిలంలో కలదు. "ప్రహ్లాద పడి" అని దాని పేరు. ఇప్పటికీ అక్కడి రాళ్లలో అక్షర గుర్తులు కలవు.

రక్తంతో తడిసిన తన చేతులను నరసింహ స్వామి కడిగినటువంటి చిన్న కొలను..ఇప్పటికి కలదు. "రక్త గుండం"అంటారు... ఆ కొలనులోకి నీరు ఇప్పటికీ ఎర్రగా వస్తూ ఉంటాయి...భక్తులు వాటిని చేతులలో తీసుకోగానే మాములు నీటిగా మారిపోవడం...స్వామి వారి మహిమే కదా మరి. స్వామి ఉద్బవించిన ఉగ్ర స్తంభం నేటికి కలదు( శిలా రూపములో)..

అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు.  వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి ఉన్నాయి. 

ఈ క్షేత్రానికి నగరి, నిధి, వేదాద్రీ, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.

ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది

అహోబల క్షేత్రములో నరసింహులు : 

1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.

2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.

3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.

 4. కారంజ నరసింహుడు :.అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.

5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.

6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.

7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు .

8. భార్గవ నరసింహుడు : పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము

9. వరాహ నరసింహస్వరూపము :  భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము.

ఈ తొమ్మిది నరసింహస్వామి స్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి

 జై శ్రీమన్నారాయణ


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు  98వ దివ్యదేశము శ్రీరామ జన్మభూమి : అయోధ్య.




⚜ మూలవిరాట్: శ్రీరామచంద్ర మూర్తి, రఘునాయక్, శ్రీరామచంద్ర పెరుమాళ్.

⚜ తాయార్ : సీతాదేవి.

⚜ పుష్కరిణి : రామగంగ గా పేరు పొందిన సరయునది.

⚜ విమానము: పుష్కల విమానము

స్థలపురాణం ---- మహాభారతం,  శ్రీమద్భాగవత పురాణముల వలెనే శ్రీరాముని చరిత్రము , శ్రీమద్రామాయణము లను తెలియని జనులు ముఖ్యముగా పెరుమాళ్ భక్తులు ఉండరు అనుట అతిశయోక్తి కానేరదు . అందువలన అయోధ్య నగరము యొక్క స్థలపురాణమునకు సంబంధించిన కొన్ని అంశములను మాత్రము ప్రస్తావించుకొందాము.

అయోధ్యను సాకేతపురమని కూడా అంటారు. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇక్ష్వాకు చక్రవర్తి తమ కుల గురువు వశిష్ఠుని ప్రార్ధించి ఒక చక్కని నది తమ రాజ్యమున ప్రవహించినచో తమ నగరము . రాజ్యము ధన్యమగునని విన్నవించెను . 

వశిష్ఠుడు ఇక్ష్వాకుని ప్రజల శ్రేయమునకై వచించిన ఆలోచన , కోరికను ప్రశంసించినవాడై , సత్యలోకమునకు పోయి సృష్టి కర్త అయిన చతుర్ముఖుని ప్రార్ధించి బ్రహ్మ మానస సరస్సు నుండి ఒక చక్కని నది ప్రవహించునట్లు అనుగ్రహింప బడెను . అందువలననే ఆ నది " సరయు " నదిగా పేరు పొంది ఇక్ష్వాకుని రాజ్యములో అయోధ్య నగర సమీపవర్తి అయి ఆ రాజ్యమును సస్యశ్యామలము చేసినది . 

మానస సరోవరము నుండి జన్మించిన సరయు నది ఒక సమయమున శ్రీరామునికి స్త్రీ రూపమున దర్శన మిచ్చి మరియు శ్రీరామదర్శనమున తాను కూడ ఆనందించిన కారణమున " రామగంగ " గా ఖ్యాతి నొందినది . 

అయోధ్యలో  శ్రీరాముడుగా వెలసిన శ్రీమన్నారాయణుడు రావణాది దైత్య సంహారానంతరమున అవతార సమాప్తి కాలమున అయోధ్య నుండియే వైకుంఠమునకు తిరోధానము చేసెను.

స్కంద, ఇతర పురాణాలు భారతదేశం లోని ఏడు మోక్షపురాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి.  ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని అది స్వర్గసమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి.

ఈ వంశం వాడైన పృథు మహారాజు వలన భూమికి పృథ్వి అనే పేరు వచ్చింది. తారువాత రాజు మాంధాత. సూర్యవంశం లోని 31వ రాజు హరిశ్చరంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన వాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్పరిపాలనతో ఘనతను తీసుకు వచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించిన కలిగిన విఘ్నం వైదొలగించి ఆయన ముని మనుమడైన భగీరథుడు గంగానదిని విశేషప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. 

తర్వాత వచ్చిన రఘుమహారాజు రాజ్యావిస్తరణ చేసి పేరుగడించి సూర్యంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడు రామచంద్రుడు.

వాల్మికి విరచితమైన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. తులసీ దాసు తిరిగి రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. 

తమిళకవి కంబర్ వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. 

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు --- 99వ దివ్యదేశము శ్రీ దేవరాజ పెరుమాళ్ ఆలయం -నైమిశారణ్యం, ఉత్తర ప్రదేశ్. 

⚜మూలవిరాట్ : దేవరాజన్ 

⚜ తాయార్ : శ్రీహరి లక్ష్మి , పుండరీకవల్లి 

⚜ పుష్కరిణి : చక్ర తీర్థము , గోమతీ నది , దివ్య విశ్రాంత తీర్ధము 

⚜విమానము :  శ్రీహరి విమానము 

స్థలపురాణం ---- శ్రీమహావిష్ణువు యొక్క అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో ఇది ఒకటి . ( మిగిలినవి - శ్రీరంగము , శ్రీముష్ణము , సాలగ్రామము . తోతాద్రి అనబడు వానమామలై , తిరుపతి , పుష్కరము . బదరీక్షేత్రము ) .

వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. 

వ్యాస భగవానుడు 18 పురాణాలు ఇక్కడే రచించారు.

అసంఖ్యాకముగా నుండిన వేదరాశిని , ఋగ్వేదము , యజుర్వేదము , సామవేదము , మరియు అధర్వణవేదముగా నాలుగు భాగములు చేసిన వ్యాసమహర్షి తమ శిష్యులగు పైల , వైశంపాయన , జెమినీ , సుమంతులకు వాటిని క్రమముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదమును బోధించి ఉచిత రీతిలో బహుళ ప్రచారము చేయుటకు ఆదేశించినదీ ఈ ప్రదేశముననే . 

నైమిశారణ్యం (Naimisha Forest) వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి నైమిశారణ్యానికి దాదాపు 100 కి.మీ. దూరం ఉంటుంది.

పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. 

లోకహితార్ధమై బ్రహ్మ నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రము కమ్మి విచ్చి పోయిన ప్రదేశములో "నైమిశ" మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది.

సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలి తాదేవిని దర్శించి 'లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.

నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలా రణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రి శిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరు గాంచాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడకు 9 కి.మీ.దూరంలో మిశ్రిక్‌ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యాడు.

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ . లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి 'సీతాపురం' అని అంటారు. 

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  - 100వ దివ్యదేశము శ్రీ మూర్తి పెరుమాళ్ ఆలయం -  సాలగ్రామం, ముక్తినాథ్, నేపాల్ 



⚜ ప్రధాన దైవం :  శ్రీమూర్తి పెరుమాళ్

⚜ ప్రధాన దేవి :  శ్రీదేవి తాయార్ 

⚜తీర్థం  :  గండకీ నది, చంద్ర తీర్థము

⚜ విమానం  : కనక విమానము 

స్థలపురాణం --- ముక్తినాథ్ దేవాలయం : 

నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయపర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్.

హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ముక్తిక్షేత్రం అంటే మోక్షాన్ని ఇచ్చే ప్రదేశం అని అర్ధం. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉన్నదని తరువాత బౌద్ధుల ఆరాధనా క్షేత్రంగా మారిందని భావిస్తున్నారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 

51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారు. టిబెట్ భాషలో చుమింగ్ గ్యాస్థా అంటే నూరు జలాలు అని అర్ధం. టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తున్నారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తున్నారు.

ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అలాగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా శ్రీరంగం, శ్రీవైకుంఠం, తిరుమల, నైమిశారణ్యం, తోతాద్రి, పుష్కర్, బద్రీనాథ్. 

ఈ ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. 

ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భవిస్తున్నారు. భక్తులు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు.

కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. 

అందుచేతే గృహ దేవతార్చనలలో గానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. 

సాలిగ్రామాలు అన్నవి నునుపుగా, గుండ్రముగా గానీ కోడిగుడ్డు ఆకారములో కాల్వల్లో, నదీ తీరాల్లో దొరికే రాళ్ళు.  సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి .

ఇవి సాధారణముగా నదీ తీరాల వెంట దొరుకుతూ ఉంటాయి. పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు - నదుల్లో స్నానాలకి వెళ్ళినపుడు చాలామంది వీటిని ఇంటికి తెచ్చుకొని, పూజామందిరాల్లో పెట్టుకుంటారు. ప్రవహించే నదుల ప్రవాహ ఒరవడికి నదీ జలాలతోటే కొట్టుకవచ్చే చిన్న చిన్న రాళ్ళు ఒకదానితో మరొకటి తగిలి, కాలక్రమాన ఇలా నునుపుగా మారి, ఆకర్షణీయముగా అగుపిస్తాయి. వీటినే సాలిగ్రామాలుగా పరిగణలోకి తీసుకోవడం కద్దు.

వీటిని పూజల్లో పెట్టుకొని వీటికి పూజలు చెయ్యడం మొదలెట్టాక - ఇక వాటికి ఎల్లప్పుడూ పూజలు చెయ్యడం చాలా మంచిది. అలాగే కొనసాగాలి కూడా. ఆ పూజల ధనాత్మక శక్తి వీటికి బాగా అంటుకొని, అవి ఉన్న చోట అంతా శుభమే కలుగుతుంది. 

ఏదైనా కారణాల వల్ల వీటికి ఆ పూజలను కొనసాగించలేమో - అప్పుడు ఆ ధనాత్మక శక్తి హరించుకపోయి, ఋణాత్మక శక్తిని వెదజల్లుతుంది. అప్పుడు ఆ రాళ్ళు ఉన్న చోట అంతా చెడు జరుగుతుందని చెబుతుంటారు. వీటికి మొదట ఏదైతే నైవేద్యముగా సమర్పిస్తామో, వాటినే ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండాలి. అంటే పాయసం పెట్టడం మొదలెడితే అదే ఎల్లప్పుడూ పెడుతూనే ఉండాలి. అందుకే చాలామంది నీటినే - నైవేద్యముగా పెడుతూ ఉంటారు.

జై శ్రీమన్నారాయణ


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  - 101వ దివ్యదేశము - శ్రీ బద్రినారాయణ  ఆలయం, బద్రీనాథ్ 


⚜ ప్రధాన దైవం : బదరీ నారాయణుడు

⚜ ప్రధాన దేవి : అరవిందవల్లి

⚜ తీర్థం : తప్తకుండ తీర్థము 

⚜ విమానం : తప్తకాంచన విమానము

⚜ నరునకు మంత్రోపదేశము చేసిన స్థలము

స్థలపురాణం  - బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. చార్ ధామ్ (నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. 

 (బదరికాశ్రమం) ప్రస్తుతము బదరీనాథ్ గా వ్యవహరించ బడుచున్న ఈ స్థలము శ్రీమన్నారాయణుడు తాను రెండు రూపములను నరుడు , నారాయణుడు అను నామములతో గైకొని సహస్ర కవచ కుండలుడు అను రాక్షసుని వధించు నిమిత్తము తపస్సు చేసినది . బదరి అనగా రేగు . రేగు చెట్లు ఉండియుండుట వలన ఈ నర నారాయణ తపఃప్రదేశము బదరికా ఆశ్రమముగా ఇచ్చట తపోస్తలిగా వర్ధిల్లినది . 

సహస్ర కవచ కుండలుడు తన పరాక్రమమునకు , శక్తికి తగినవారు  నర నారాయణులు అయియుందురు  అని తలచి యుద్ధ ప్రీతితో వచ్చి నర నారాయణులతో కోరి గొడవ పడి యుద్ధము ప్రారంభించెను . ఒక పథకము ప్రకారము నారాయణుడు తపము చేయుచుండగా నరుడు యుద్ధము చేయుచు రోజునకు ఒక కవచ కుండలము చొప్పున 999 రోజులలో 999 కవచకుండలములను నాశనము చేయగా మిగిలిన ఒక్క కవచ కుండలముతో ఆ రాక్షసుడు బ్రతుకు తీపితో పారి పోయి సూర్యుని శరణు కోరెను . శరణాగతుడై వచ్చిన ఆ రాక్షసునికి సూర్యదేవుడు అభయమిచ్చి తన వద్దనే యుండు మనెను . అంతట నర నారాయణులు వచ్చి ఆ రాక్షసుని వదలివేయుమని చెప్పగా , వీని వలన జగమున ఎట్టి కష్టములు సంభవించవు , ఇతడు నా వద్దనే యుండును , భవిష్యత్తులో సమయము వచ్చినప్పుడు వధించుదురు , అని చెప్పగా నరనారాయణులు సరేయని వెడలిరి . 

ఆ రాక్షసుడే సూర్యుని అనుగ్రహమున కుంతీ గర్భమున జన్మించి కర్ణునిగా పెరిగి మహాభారత యుద్ధమున శ్రీకృష్ణార్జునుల వలన మరణము పొందెను . దేవ రహస్య మెరిగిన శ్రీకృష్ణుడు కర్ణునికి జన్మము నుండి యుండిన సహజ కవచకుండలములను ధర్మ సంస్థాపనార్థము ఇంద్రుడిచే దానము అడిగించి  అర్జుని ద్వారా చంపించెను. శ్రీకృష్ణార్జునులు నర నారాయణులే కదా !

 భగీరథుని ప్రార్థనపై విష్ణు పాదము నుండి ప్రవహించిన గంగను పరమేశ్వరుడు బందించిన స్థలం ఇదే.. ఇచ్చట బ్రహ్మకపాలము అను పేరున ఒక పెద్ద శిల అలకనందనది ఒడ్డుననే కలదు . ఒక సమయమున బ్రహ్మదేవుని గర్వము పోగొట్టుటకై బ్రహ్మకు మొదటనున్న పంచ ముఖములలో ఒక దానిని శివుడు తన వ్రేలితో తృంచి వేసెను . 

 ఆ హత్యాపాతకము వలన బ్రహ్మ హత్యా దోషము కలిగి ఆ బ్రహ్మ శిరస్సు శివుని అరచేతిలో అంటుకొనియుండి విడివడనిదై , శ్రీమన్నారాయణుని ఉపదేశము మేరకు శివుడు శ్రీమహాలక్ష్మి నుండి ఆ బ్రహ్మ కపాలములో భిక్షలు గ్రహించుచు కాలము గడపుచు వివిధ ప్రయాగలలో స్నానము చేయగా ఆ కపాలము విడి ఇచ్చట పడినది . పితృదేవతలకు ఈ బ్రహ్మకపాలము వద్ద పిండదానము చేసినచో వారు బ్రహ్మలోకమునకు పోవుదురు , ఇచ్చట పిండదానము చేసిన తరువాత ఆ పితృదేవతలకు మరి వార్షిక శ్రాద్ధములు చేయనవసరము ఉండదు అని పురాణము . 

 ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగసిద్దిద అని, ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి. జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటిని జ్ఞానం వలన నశింపచేసే క్షేత్రం కనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.

ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది. బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శివుడు కుమారస్వామికి వివరించాడు. ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది. ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.

ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.

సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు  వివరిస్తున్నాయి.

ఇది స్వయం వ్యక్తక్షేత్రము. అష్టాక్షరీ మంత్రము అవతరించిన స్థలం.ఇచట స్వామి అగ్నితప్త కుండముగా ఉన్నాడు. ముందుగా నారద కుండములో స్నానముచేసి పిమ్మట అగ్నికుండములో స్నానమాచరించవలెను. 

ఇచట పెరుమాళ్లు మాత్రమే ధ్రువమూర్తిగా ఉపస్థితమై ఉన్నాడు. మిగతావారు ఉత్సవమూర్తులు. ఈస్వామి ఎదుట తెరవేయరు. తిరుమంజనాదులన్నియు బహిరంగముగనే జరుగును. మంచు పడుట వలన తులమాసం పౌర్ణమినాడు (వెణ్ణకాప్పు) వెన్న సమర్పించి తలుపులు వేయుదురు.తిరిగి మేష మాసం పౌర్ణమినాడు తలుపులు తీయుదురు.

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  ::


102వ దివ్యదేశము 🕉


🙏 శ్రీ నీలమేగ పెరుమాళ్ ఆలయం - దేవప్రయాగ 🙏


⚜ ప్రధాన దైవం: నీలమేఘ పెరుమాళ్

⚜ ప్రధాన దేవత: పుండరీకవల్లి

⚜ పుష్కరిణి: మంగళతీర్థం

⚜ విమానం: మంగళ విమానం

⚜ ప్రత్యక్షం: భరద్వాజమహర్షికి


🔔స్థలపురాణం🔔


దేవప్రయాగ (త్రివేణి సంగమం)


💠ప్రయాగ అంటే రెండుగాని అంతకన్నా యెక్కువ నదులు సంగమించే ప్రదేశాన్ని 

ప్రయాగ అని అంటారు . 

హిందూ పురాణాల ప్రకారం పంచపురములు , పంచకైలాసాలు , పంచ కేదారాలు , పంచబదరీలు , పంచధారలు , పంచశిలలు , పంచప్రయాగలు దర్శనీయ పుణ్యతీర్థాలుగా వర్ణింపబడ్డాయి . 

ఇవాళ మనం చెప్పుకొనే దేవప్రయాగ పంచప్ర యాగలలో ఒకటి , నందప్రయాగ , కర్ణ ప్రయాగ , రుద్ర ప్రయాగ మరియు విష్ణు ప్రయాగలను పంచ ప్రయాగలు అని అంటారు . 

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాగ అన్న పదానికి తపస్సు చేసే ప్రదేశం అని కూడా అర్ధం వుంది . దేవతలు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దేవప్రయాగ అనే పేరు వచ్చింది.

 

💠ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు సంగమాలలో అత్యంత ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఈ దేవప్రయాగ. ఇక్కడ అలకనంద, సరస్వతీ నదులు రుద్రప్రయాగలో సంగమించి ఆ రెండిటితో పాటు భాగీరథి నది కలిసి ఈ మూడు నదులు కూడా సంగమించి గంగనదిగా ఏర్పడే  ప్రదేశమే ఈ దేవప్రయాగ (త్రివేణీ సంగమం)


💠ఈ ప్రాంతాన్ని "తిరుక్కండం" మరియు "కాండెవన్నం కాడినగర్" అని కూడా అంటారు. ఈ ప్రదేశానికి ప్రాచీన నామం "సుదర్శన క్షేత్రం". ఇది కొండల లోపల ఉన్న ఐదు పవిత్ర సంగమాలలో ఒకటి మరియు ఇది భక్తులైన హిందువులు మరియు శ్రీ వైష్ణవుల తీర్థయాత్రకు కీలకమైన ప్రాంతం.


💠త్రేతాయుగంలో రామరావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరిస్తాడు . 

రావణుడు జన్మతః బ్రాహ్మణుడు కావడంతో రామునకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తిస్తుంది . దానిని పోగొట్టుకొనుటకు వ్యాసుని సలహాననుసరించి రాముడు దేవ ప్రయాగలో తపస్సాచరించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొని రాజ్యభారం నిర్వహించేందుకు అయోధ్య కు వెళతాడు రాముడు . 

మహాభారత యుద్ధానికి ముందు పాండవులు శ్రీకృష్ణుని సూచన మేరకు దేవప్రయాగ లో తపస్సాచరించి యుద్ధానికి వెళ్లి విజయం పొందారు.


💠ఈ  ప్రాంతీయులు శ్రీరాముని రఘునాధుడుగా వ్యవహరిస్తారు కాబట్టి యీ మందిరాన్ని రఘునాధ్ మందిరం అంటారు . వైష్ణవుల అతి పవిత్రమైన 108 దివ్యదేశాలలో రఘునాధ్ మందిరం ఒకటి .


💠ప్రతి ప్రత్యేక రోజున రఘునాథ భగవానుని ఈ క్రింది రంగులతో అలంకరిస్తారు: తెలుపు (సోమవారం మరియు శుక్రవారం), ఎరుపు (మంగళవారం మరియు ఆదివారం), ఆకుపచ్చ (బుధవారం) మరియు శనివారం నలుపు.


💠శివుని జటాఝూటం నుండి భగీరథుని కొరకు భూలోకంలోకి వచ్చిన గంగ

 .. గంగోత్రి హిమనీనదము నుండి ఉద్భవించి ప్రవహిస్తూ సోన్ గంగ మొదలయిన నదులతో సంగమించి టెహ్రీ మీదుగా ప్రవహించి దేవప్రయాగ చేరి భగీరథితో సంగమించి యిక్కడ నుంచి గంగ గా పిలువబడుతూ కాశీ మొదలైన పుణ్య క్షేత్రాలలో ప్రవహించి బంగాళాఖాతం లో కలుస్తోంది . 

దీనిని అత్తా కోడళ్ల సంగమం ( సాస్ బహు సంగమ్ ) అని కూడా అంటారు . ఎందుకంటే అలకనంద విష్ణపత్ని లక్ష్మీ స్వరూపమని , గంగ శివుని భార్య కాబట్టి వీరు అత్తా కోడళ్ల వరస . ఇక్కడ వున్న మరో నమ్మకం యేమిటంటే అత్తాకోడళ్ల సంబంధాలు బాగులేని వారు ఈ సంగమంలో పూజలు చేసుకొని పసుపు కుంకుమ సమర్పించుకుంటే వారి సంబంధాలు బాగుపడి కలకాలం 

కలిసుంటారని అంటారు . 


💠 దేవ ప్రయాగ.. బదరీనాథ్ కోవెల పూజారులు శీతాకాలంలో నివసించే ప్రదేశం . వీరు యిక్కడకు వచ్చే ప్రతీ యాత్రీకుల వివరాలు గ్రంధస్థం చేస్తూ వుంటారు . ఇక్కడ బస చెయ్యడానికి 

 కనీస సౌకర్యాలతో వుండే గదులు లభ్య మౌతాయి . ముందుగా అనుకోకుండా ఏవో కారణాల వల్ల యిక్కడ బస చేయ దల్చుకుంటే స్థానికంగా వుండే బ్రాహ్మణులు భోజన సదుపాయాలతో బసలను వారి యిళ్లల్లోనే యేర్పాటు చేస్తారు . ఇలాంటి వాటిల్లో వుండడం వల్ల యాత్రీకులకు హోటలు భోజనం కాకుండా ఇంటి భోజనం దొరుకుతుంది .


💠చంద్రబాదాని ఆలయం :

చంద్రబాదాని ఆలయం శివుని భార్య సతీదేవి యొక్క మొందెము  పడిన ప్రదేశము. ఆమె యొక్క ఆయుధములు మరియు త్రిశూలములు ఆలయము లోపల బయట చెల్లా చెదురుగా కనపడును.

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు  ::


    103వ దివ్యదేశము 🕉


🙏శ్రీ పరమపురుష పెరుమాళ్ ఆలయం -( తిరుప్పిరుధి)  ,

జోషిమట్, ఉత్తరాఖండ్.🙏


⚜ ప్రధాన దైవం: పరమ పురుషన్

⚜ ప్రధాన దేవత:పరిమళ వల్లి

⚜ పుష్కరిణి:గోవర్ధన-ఇంద్ర తీర్థములు, మానస సరస్సు

⚜ విమానం: గోవర్ధన విమానము

⚜ ప్రత్యక్షం: పార్వతీదేవికి


🔔స్థలపురాణం 🔔


💠సముద్రమట్టమునకు 1890 మీ . ఎత్తున ఉన్న జ్యోషియర్ అనునదే తిరుప్పిరితి దివ్యదేశము . దీనినే జ్యోతిర్మఠము అని కూడ అందురు . 

భక్తులు ఎంతో ప్రీతితో పోయెదరు , లేక ఇచ్చటకు వచ్చు భక్తులను శ్రీమన్నారాయణుడు అమిత ప్రీతితో చూచును - కావున ఈ దివ్యదేశము తిరుప్రీతి అను పేరుపొంది అనంతరము తిరుప్పిరితి అయినది .


💠 నందుడు అను ఒక రాజు గొప్ప యాగములు చేసిన ప్రదేశము నంద ప్రయాగ గా పేరు పొందినది . శ్రీమన్నారాయణుడు రెండు రూపములు గ్రహించి , నర - నారాయణులు గా తపము చేసిన ప్రదేశము బదరికాశ్రమము , లేక బదరీనాథ్ . బదరీనాలో ఆ విధముగా వెలసిన పెరుమాళ్ ఉత్సవ విగ్రహములను శీతాకాలమున బదరీనాథ్ మందిరము నుండి దీపావళి మరు రోజున తీసికొని వచ్చి ఇచ్చట జ్యోషిమర్ మందిరములో ఉంచి పూజా విధులు జరుపుదురు . తిరిగి అక్షయ తృతీయ దినమున తీసికొని పోయి బదరీనాథ్ మందిరములో ఉంచెదరు . 

 

💠ఇక్కడే శివపత్ని పార్వతీ దేవికి పెరుమాళ్ క్షీరసాగర శయనమూర్తిగా ప్రత్యక్షము నిచ్చెను . 


💠ఆదిశంకరాచార్యులు వేద ధర్మ ఉద్ధరణ - ప్రచారమునకై స్థాపించిన నాలుగు మఠములలో ( పీఠములు ) జ్యోతిర్మఠము ఒకటి . అదియే కాలక్రమమున జ్యోషిమర్ అయినది . మిగిలిన మూడు మఠములు ఏవియన - ద్వారకలో శారదా మఠము , జగన్నాథపురి ( పూరి ) లో గోవర్ధన మఠము , శృంగేరిలో శృంగేరి మఠము .


💠మూలవిరాట్ :  : క్షీరసాగరమున ఆదిశేషునిపై వలె తూర్పు ముఖముగా పరమ పురుష పెరుమాళ్ భుజంగ శయనమూర్తి - పార్వతీ దేవికి ప్రత్యక్షము .


💠తాయార్ : పరిమళవల్లి నాచియార్ .


💠ఈ దివ్యదేశ పెరుమాళ్ ను పరమపురుషోత్తమ నామమున ధ్యానించ వలయునే కాని మన ఈ చర్మ చక్షువులతో దర్శించలేము . 

క్షీరసాగరమున శ్రీమహావిష్ణువును ఈ భౌతిక శరీరముతో పోయి దర్శించలేము కదా ! అటులనే పార్వతీ దేవికి ప్రత్యక్షమునిచ్చిన క్షీరసాగరమున ఆదిశేషునిపై శయన మూర్తిని ఈ నేత్రములతో దర్శించలేము . ఆళ్వార్ గానము చేసిన విధముగా ధ్యానముననే ప్రతిష్ఠించుకొని దర్శించ వలయును . 


💠పుష్కరిణి : చర్మచక్షువులతో ఈ దివ్యదేశ పెరుమాళ్ ను దర్శించుట సాధ్యపడనట్లుగా పుష్కరిణియును ఈ నేత్రములకు గోచరించదు . అందువలన పుష్కరిణి నామమును మానస సరస్సు అందురు . మరియు గోవర్ధన తీర్థము , ఇంద్ర తీర్థము .


💠విమానము : శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి దాని క్రింద గోవులను గోపకులను ఉంచి రక్షించినట్లు ఇచ్చట పెరుమాళ్ భక్తులను రక్షించు చుండును . అందుచే విమానము నామము గోవర్ధన విమానము . 

 

💠ఈ జోషిమఠ్ సమీపముననే విష్ణుప్రయాగ ఉంది. అక్కడ నారదునిచే ప్రతిష్ఠింపబడిన సన్నిధి ఉంది. దీనికి సమీపముననే పాండుకేశ్వరం ఉంది. బదరీ సన్నిధి మూసిన తరువాత ఉత్సవమూర్తులను ఈ పాండికేశ్వరంలో ఉంది. వాసుదేవుల సన్నిధిలో నుంచి పూజిస్తారు ఈ పాండికేశ్వరానికి 25 కి.మీ. దూరమున బదరికాశ్రమం ఉంది.


💠ఈ ఆలయంలోని తీర్థాలు మానససార తీర్థం, గోవర్ధన తీర్థం మరియు ఇందిర తీర్థం.

మరియు ఈ ఆలయం యొక్క విమానం గోవర్ధన విమానం అని పేరు.


జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


 104వ దివ్యదేశము 🕉


🙏శ్రీ కల్యాణ నారాయణ  ఆలయం – ద్వారక, 

గుజరాత్ 🙏


⚜ మూలవిరాట్ : కళ్యాణ నారాయణ్ /ద్వారకాధీశ్ / ద్వారకానాద్.

⚜ తాయార్ : కళ్యాణి నాచియార్ ( శ్రీలక్ష్మి నాచియార్ ) . అష్ట పట్ట మహిషిలు అయిన రుక్మిణి దేవి , సత్యభామ , జాంబవతి , భద్ర . లక్షణ , కాళింది . మిత్రవింద , నాగ్నజితిలను కూడ దర్శించ గలము . 

⚜ పుష్కరిణి : గోమతీ నది . 

⚜ విమానము : హేమకూట విమానము


🔔 స్థలపురాణం 🔔


💠ప్రస్తుత ఆలయం 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. నిజమైన ద్వారక సముద్రంలో మునిగిపోయింది.

శ్రీకృష్ణుని ద్వారకా  సముద్ర గర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం


💠ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు. జరాసంధుని బారినుండి తప్పింకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది.


💠మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక"  భారతదేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనది.


💠మధుర పురజనుల యోగ క్షేమములు దృష్టిలో నుంచుకొని , జన నష్టము , ధన నష్టము మధురలో కలుగ నీయకుండుటకై గొప్ప యోచన చేసి శ్రీకృష్ణుడు దుర్భేద్యమగు రీతిలో పశ్చిమ సముద్రమున ఒక గొప్ప నగరమును దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు.

 అదే ఈనాటి మన దివ్యదేశము " ద్వారక "


💠ద్వారక చేరిన కొన్ని నాళ్లకు బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడు అను రాజు తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి వివాహము చేసెను .

 తరువాత శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణీ దేవిని రాక్షస వివాహ రీతిలో వివాహము చేసికొని ద్వారకకు కొనిపోయెను . 

 రుక్మిణి శ్రీమహాలక్ష్మి అంశము , శ్రీకృష్ణుని పట్టపురాణి అయినది . 


💠తదుపరి సత్యభామ , జాంబవతి , కాళింది , భద్ర , లక్షణ , మిత్రవింద , నాగ్నజితి అనువారిని శ్రీకృష్ణుడు వివాహము చేసికొనెను . 

 ఆ విధముగా అష్ట భార్యలతో ద్వారకలో శ్రీకృష్ణుడు యాదవులతో గొప్ప జీవితమును గడపుచుండెను . 


💠ద్వారక లో ఉన్నప్పుడే  సత్యభామా సమేతుడై నరకాసురునితో యుద్ధమున వధించి,  నరకుని మందిరములో ఉన్న 16,000 మంది అందగత్తెలు అయిన రాజకన్యలను అంతఃపురమునకు చేర్పించుకొని, తరువాత శాస్తోక్తముగా వివాహము చేసికొనెను.


💠ద్వారక లోనే పారిజాత వృక్షమును స్వర్గము నుండి తెచ్చుట .ఆ దేవతలందరితో యుద్ధము చేసి దేవేంద్రుని తరిమిగొట్టుట ,


💠ద్వారక లోనే  పరమభాగవతోత్తముడైన బాల్యమిత్రుడు సుదాముడు ( కుచేలుడు ) దారిద్ర్య బాధవలన భార్య పంపున రాగా అతని నుండి పిడికెడు అటుకులు అతి ప్రీతితో ఆరగించి సకల సంపదలను మోక్షమును అనుగ్రహించుట .


💠ద్వారక లోనే అర్జునునిచే ఖాండవ దహనము చేయించి గాండీవమును అక్షయ తూణీరములను సంపాదించి పెట్టుట , మహాభారత యుద్ధమున సర్వము తానే అయి ధర్మ సంస్థాపనార్థము పాండవుల పక్షమున ఉండి కౌరవులను నిర్జింపచేసి భూభారమును తగ్గించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేయుట . ఇంకను ఎన్నియో కలాపముల రచన ఈ ద్వారకా నగరమున ఉండియే కావించి నిర్వహించెను . 


💠 ద్వారక లోనే తన అవతార సమాప్తి సమయమున   నిర్వికారుడై ప్రభాస తీర్థమునకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని యుండి తన పాదము ఒక కిరాతకునికి  పక్షి వలె కనిపించునట్లు ఉంచి ఆ కిరాతకుడు బాణము వేయగా దేహమును వీడి అవతార సమాప్తి గావించుకొని శ్రీవైకుంఠమునకు పోయెను .

ఈ మహోత్తర ఘట్టం కూడా ద్వారక లోనే.


💠శ్రీకృష్ణ నిర్యాణము తరువాత ద్వారక సముద్ర గర్భములో కలిసి పోయెను .


💠 ఆ సముద్ర మధ్యమమును బేట్ ద్వారక అని ప్రస్తుతము వ్యవహరించుచున్నారు . లాంచిలో దర్శించ వచ్చును . సముద్రాంతరమైన ద్వారక మనకు కనిపించదు . ఒక చిన్న ద్వీప భాగమున బేట్ ద్వారకలో శ్రీకృష్ణ మందిరము ఉన్నది . శంఖచక్రములను ధరించిన శ్రీకృష్ణుడు , కళ్యాణ కృష్ణ సన్నిధి . త్రివిక్రమ సన్నిధి , లక్ష్మీనారాయణ సన్నిధి . దేవకి సన్నిధి , జాంబవతి సన్నిధి కలవు .


💠ఈ ఆలయం తెల్లవారుజామున 5 గంటల నుండి పూజ కోసం తెరవబడుతుంది మరియు పెరుమాల్ కోసం అన్ని అలంగారాలు  భక్తల ముందునే పూర్తవుతాయి. ఉదయం, ద్వారక్నాథ్జీని చిన్నపిల్లగా ధరిస్తారు, తరువాత రాజుగా మరియు ఆ తరువాత పురాతన వృద్ధ మహర్షి గా దర్శనం ఇస్తారు..

 

💠ప్రభాస తీర్థము పరమేశ్వరుని జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ నుండి 3 కి.మీ. దూరమున ఉన్నది . ప్రభాస తీర్థమును చేరినంతనే శ్రీకృష్ణుని చెంత చేరిన మహా అనుభూతి కలుగును . మహా ఆనందము , మహా దుఃఖము సమ్మిళితమైన ఉద్వేగమును పొందుదుము . 

ఇందు ఇసుమంతయు అతిశయోక్తి లేదు .

 జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


     105వ దివ్యదేశము 🕉


🙏 శ్రీ  గోపాలక్రిష్ణ ఆలయం,

     మధుర 🙏


⚜ మూలవిరాట్ : గోపాలక్రిష్ణన్ , గోవర్ధనోద్గారి , గోవర్ధనేశన్ అను నామములతో పెరుమాళ్.

⚜ తాయార్ : సత్యభామ నాచియార్ , రుక్మిణి నాచియార్ 

⚜ పుష్కరిణి : ఇంద్ర తీర్థము , గోవర్ధన తీర్ధము , యమునా నది . 

⚜ విమానము : గోవర్ధన విమానము ( భద్ర విమానము )

⚜ ప్రత్యక్షం :  దేవకీ వసుదేవులకు , బ్రహ్మదేవునకు , దేవేంద్రునకు ప్రత్యక్షము .


 

🔔 స్థలపురాణం 🔔


💠 నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణిని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.


💠 మథురకు పురాణ కాలంనుండి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడూ దశరథ చక్రవర్తి కుమారుడూ రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కథనం. 

తరువాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనం గానూ, మథుపురంగానూ మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం. 


💠 మధుడు అనే రాక్షసుడు మధురను పరిపాలించాడు. 

అతను గొప్ప శివభక్తుడు, శివుణ్ణి ప్రార్థించి భయంకరమైన అజేయమైన త్రిశూలాన్ని పొందాడు. మధువుకు రావణుడు స్వయానా బావమరిది అవుతాడు. ఈ ప్రాంతానికి అతని వల్లనే మధువనము, మధుపురి, మధుర, మథుర అనే పేర్లు వచ్చాయి. మధుని మరణానంతరం శూలం పారంపర్యంగా లవణుడు పొందాడు. దానితో మునులను, ప్రజలను హింసించడం ప్రారంభించగా, ప్రజలు చ్యవనమహర్షికి, ఆయన రామచంద్రునికి మొరపెట్టుకున్నారు. రాముడు అప్పటికే రావణాసుర సంహారం, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్నాడు. 


💠 రాముడు లవణాసురునిపై యుద్ధానికి తమ్ముడు శత్రుఘ్నుని పంపుతాడు. శూలం లేనప్పుడు లవణాసురుని చంపి మధురను శత్రుఘ్నుడు వశం చేసుకున్నాడు. శత్రుఘ్నుని అనంతరం ఆయన కొడుకు శూరసేనుడు, పరంపరాగతంగా వారి వారసులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు.


💠 మహాభారత, భాగవతాల్లో శూరసేన దేశం ప్రసక్తి పలుమార్లు కనిపిస్తుంది.

 ఆ శూరసేన దేశానికి మథుర రాజధాని. మహాభారతగాథకు కేంద్రబిందువైన కురుభూములకు ఈ శూరసేన దేశం దక్షిణంగా ఉంటుంది. 

శత్రుఘ్నుని వంశీకుల తర్వాత యదువంశీకుల అధీనంలోకి వచ్చింది. మధురను నిర్మించినట్టుగా పురాణాల్లో చెప్పబడిన ఆయువు కుమారుడు నహుషుడు. ఆయన కొడుకు యయాతికి, ఆయన భార్య దేవయానికి జన్మించిన వాడు యదువు. ఆ యదువు వారసులైన యదువంశీకుల అధీనంలోకి భారత భాగవతాల కాలంలో మధుర అధీనంలోకి వచ్చింది. యయాతి కొడుకు యదువు, అతని కుమారుడు క్రోష్ఠుడు. వారికి 42 తరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. 


💠 అతని కుమారుడు శ్రీకృష్ణుడు. 

ఆయన ఉగ్రసేనుడి కుమారుడు, తనకు మేనమామ అయిన కంసుని సంహరించాడు. 

కృష్ణుని అన్న బలరాముడు మధుర పరిపాలకుడయ్యాడు. 

కృష్ణుడు పశ్చిమదిక్కుకు వెళ్ళి ద్వారకను నిర్మించేంతవరకూ యదువంశీకులకు మధురే కేంద్రంగా ఉండేది.

 జరాసంధుని దాడుల్లో దెబ్బతిన్న మధురను తిరిగి కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుని కాలంలో పునర్నించబడింది.


💠 తదుపరి కాలములో బృందావనమున శ్రీకృష్ణ భగవానునికి ఎన్నియో మందిరములు నిర్మించబడినవి . 

ద్వారకా నాథ్ మందిరము , మదన మోహన మందిరము , బంకె బిహారి మందిరము , రాధారమణ మందిరము , గోపీనాథ్ మందిరము , షాహాజీ మందిరము , రంగనాథ మందిరము ( దక్షిణ దేశమునగల శ్రీ రంగనాథుని వలె నుండును ) , 

గోవర్ధన గిరి దిగువన శ్రీరామానుజులు దయచేసిన రీతులలో అర్చనాదులు జరుప బడుచున్న లక్ష్మీ నారాయణ మందిరము , ఇంకను ఎన్నియో మందిరములు గలవు . దర్శించి నంతనే జన్మ ధన్యమగును . 


జై శ్రీకృష్ణ 

జై శ్రీమన్నారాయణ 


108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు  ::


     106వ దివ్యదేశము 🕉


🙏శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం – ( తిరువాయిపాడి ),

గోకులము.

ఉత్తర ప్రదేశ్ 🙏


@ ప్రధాన దైవం: నవమోహన కృష్ణ

@ ప్రధాన దేవత: రుక్మిణీ-సత్యభామ

@ పుష్కరిణి: యమునానది

@ విమానం: హేమకూట విమానము

@ ప్రత్యక్షం:

నందగోపునకు, యశోధకు (విశ్వరూపం) ప్రత్యక్షము.


🛎 స్థలపురాణం : 


👉శ్రీమహావిష్ణువు యొక్క శ్రీకృష్ణావతారమును సంపూర్ణావతారము.


👉 ఆ కృష్ణ భగవానుడు కంసునిచే కారాగృహమున బంధించబడిన దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి , వసుదేవుని ద్వారా నంద గ్రామమున యశోద పొత్తిళ్లలోనికి చేర్పించుకొని , నందరాజు యశోదలకు ఆనందము నిచ్చు విధముగా వారి వద్ద పెరుగుచు బాల్యము నుండియే ఎన్నియో మహిమలను ప్రదర్శించెను .

 ఎందరో రాక్షసులను హతమొనర్చి జన కళ్యాణ కార్యములను చేసెను . బ్రహ్మదేవేంద్రాదులకు విశ్వాసము కలుగచేసి , వారి అజ్ఞానమును పారద్రోలి పరమాత్ముడైన తన విభూతులను దర్శింప చేసి . మాయా లీలా వినోదుడై గోవులతో ఆనందించుచు , గోవులను మందలుగా మేతకు కొనిపోవుచు ఇతర గోపాలకులతో క్రీడించెను . 

 

👉త్రేతాయుగమున శ్రీరామావతార సమయమున లక్ష్మణునిగా అవతరింప చేసిన ఆదిశేషుని ఈ కృష్ణావతారమున అన్న బలరామునిగా అవతరింప చేసి ( తమ్మునిగా లక్ష్మణుడు చేసిన సేవలకు ప్రతిగా , బలరాముని అగ్రజునిగా గౌరవించి సేవించు నిమిత్తము ) , బాల్య క్రీడలలో బలరామాది ఇతర బృందములతో గొల్లవాడలో వెన్న దొంగిలించి తాను తిని స్నేహబృందములో అందరకు తినిపించి గొల్ల భామలను ఆట పట్టించెను . గోప స్త్రీలకు పరతత్వమును గోపికా వస్త్రాపహరణ సందర్భమున బోధించెను . తల్లి యశోదకు నోటిలో చతుర్దశ భువనములను మన్ను తినిన సన్నివేశమున చూపించెను . తన ఆగడములకు తల్లి యశోద రోలునకు కట్టి వేయగా లాగుకొని మద్ది చెట్ల నడుమకుపోయి ఆ చెట్లను కూలద్రోసి గంధర్వులకు శాప విమోచనమును ప్రసాదించెను . నీటి మడుగులో విషము వెలువరించుచుండిన సర్పరాజు కాళీయుని పడగలపై నాట్యము చేసి ఆసర్పమును సకల భార్యలు పరివారముతో సహా పాతాళమునకు తరిమివేసెను . అసంఖ్యాక మహిమాన్విత , పరాక్రమోపేత లోక కళ్యాణ కార్యములొనర్చి బాల్యమును గడపినదే ఈ దివ్య దేశము అయిన గోకులము - నందగ్రామము .


👉రాధ కృష్ణుల పవిత్ర ప్రేమకు పుట్టినిల్లు గోకులం.

ఆ గోకులమును ప్రస్తుతము పురాతన గోకులము అను నామమున వ్యవహరించుచున్నారు . ఆ స్థలమును దర్శించుకొనుటలో ఎంతో అనుభూతికి లోనై మహదానందమును పొందుదుము .


👉శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లా యమునా నది ఒడ్డున ఉంది.


👉ఈ దేవాలయాన్ని గోకులం, తిరువైపాది దేవాలయం, గోకుల్ దేవాలయం, అయ్యర్‌పాది దేవాలయం మరియు బ్రజ భూమి అని కూడా పిలుస్తారు.


👉గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు-ఊయలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. ఇచట రెండు సన్నిధులు ఉన్నాయి. భక్తులు రెండింటిని దర్శిస్తారు. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము-బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగుతుంటాయి.

🔔 గోపికాలోలా.... శ్రితజనపాలా...🔔


ద్వాపరయుగం శ్రీకృష్ణుడు పేరు చెప్పగానే వెంటనే మన కళ్ళముందు  వ్రేపల్లె , గోకులం,కృష్ణుని అష్టమహిషులు, రాసక్రీడలాడే పదహారువేలమంది గోపికలు  గోచరిస్తారు.

గోకులంలో జన్మించిన ఈ గోపీ జనమంతా శ్రీమహావిష్ణువు ఎత్తిన పలు అవతారాలలోని ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూసి సమ్మోహితులై ఆ భగవానుడి కరుణా కటాక్షాలతో ఆయన పొందులో శాశ్వతంగా తరించాలని తపించిపోయినవారే.


ఈ గోపికలలో రకరకాల గోపికలు వున్నారు.


🔅శృతి గోపికలు 

🔅ఋషి గోపికలు

🔅మైధిలి గోపికలు 

🔅కోసల గోపికలు 

🔅అయోధ్యా గోపికలు అని అనేక వర్గాలు.


వారిలో ముఖ్యమైన వారి వివరాలేమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాము.

👉ఋషి గోపికలు..

త్రేతాయుగంలో మహావిష్ణువు రామావతారం ధరించి వనవాసం చేసిన సమయంలో, ఆయా వనాలలోని  ఋషి పుంగవులంతా రాముని సౌందర్యం చూసి " పుంసా మోహన రూపాయ" అని

మోహితులైనారు. తామంతా రామునికి దేవేరులై సేవచేసే భాగ్యం కల్పించమని వేడుకున్నారు. రాముడు తాను ఏకపత్నీ వ్రతుడనని వారి కోరిక కృష్ణావతారంలో

నెరవేరగలదని వాగ్దానం చేశాడు. 

ఆ వాగ్దానం ప్రకారం వంగ దేశంలో మంగళుడు అనే గొల్లవానికి పుత్రికలుగా

రామాయణ కాలం నాటి ఋషులంతా జన్మించారు.

పుత్రికలు జన్మించగానే తన ప్రారబ్ధ కర్మ వలన మంగళుని సంపదలన్నీ తరగిపోయాయి. వారిని పెంచి పెద్ద చేయలేక తన పుత్రికలందరినీ రాజైన జయుడి ద్వారా నందగోపుని వద్దకు పంపించివేశాడు. అక్కడ ఆ గోపికలకు తమ పూర్వజన్మ స్మృతి కలిగింది.

శ్రీ కృష్ణుని పొందాలనే కోరికతో కృష్ణుడు మేపే గోవుల పేడతో మహావిష్ణువు మూర్తిని తయారు చేసి యమునా నదీతీరాన ప్రతిష్టించి విష్ణువు అంశయైన కృష్ణునిలో లీనమవ్వాలనే కోరికతో పూజలు చేశారు. వారి పూజల ఫలితంగా, పూర్వపుణ్య ఫలితంగా వారు కోరుకున్నది లభించింది..


👉మైధిలి గోపికలు..

మహాబలవంతుడైన రావణుడు ఎత్తలేక పోయిన శివ ధనస్సును  శ్రీరాముడు సునాయాసంగా ఎత్తిన రాముని భుజ బల వీర పరాక్రమాన్ని , సౌందర్యాన్ని చూసి మోహించిన మిధిలా నగర  సుందరీమణులు రాముని భర్త కావాలని తపమాచరించారు.

వారి తపో ఫలితంగా నవ నందనులు పేరిట తొమ్మిదిమంది గృహాలలో  జన్మించి మార్గశిర మాసంలో  యమునానదీ తీరాన కాత్యాయనీ వ్రతం చేయ ఆరంభించారు. 

ఈ గోపికల వస్త్రాలనే కృష్ణుడు దాచివేసి వారి భక్తిని పరీక్షించినట్లు భాగవతపురాణం వివరిస్తోంది.   విల్లిపుత్తూరు ఆండాళ్ కూడా యీ గోపికలను మార్గదర్శకం చేసుకుని మార్గశిర మాసంలో   కాత్యాయనీ నోము నోచి భగవంతుని చేరుకున్నది.


👉కోసల గోపికలు,

అయోధ్యా గోపికలు, ..

వీరు అయోధ్య రాజ్యంలో  నివసించే ప్రజలు శ్రీరాముని రూపలావణ్యం కి మోహితులై ఇటువంటి భర్తని పొందాలి అనుకున్నారు....అలాంటి వారు కూడా గోపికలు గా గోకులం లో పుట్టారు.


👉శృతి గోపికలు : 

సకల వేదాలు, శాస్త్రాలు , శృతి, పురాణాలు సైతం..ఆ వేద పురుషుని తమ భర్తగా పొందాలి అనుకున్నాయి.

వాటి తర్వాత అంశ అవతారమే శృతి గోపికలు.

జై శ్రీమన్నారాయణ 

జై రాదా కృష్ణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


      107వ దివ్యదేశము 🕉


🙏 తిరుప్పార్ కడల్ ( పాల కడలి). 

క్షీరసాగరం/ పాల సముద్రం.. వైకుంఠం. 🙏


🔅 ప్రధాన దైవం:.క్షీరాబ్దినాథ పెరుమాళ్ (వ్యూహమూర్తి)

🔅 ప్రధాన దేవత: శ్రీ మహాలక్ష్మీ , 

క్షీరాబ్దిపుత్రి .

🔅 తీర్థం : అమృత తీర్థం

🔅 విమానం: అష్టాంగ విమానము

🔅 ప్రత్యక్షం: బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము


🔔 స్థలపురాణం 🔔


" ఖ్యాతం క్షీరాబ్దినాథం కలశజలదిజా భూమి సంవాహితాంఘ్రిం

 తీర్థం దివ్యం సుదాఖ్యం కలశభవ దిశం వీక్షమాణం సురేడ్యమ్‌|

అష్టాంగాఖ్యే విమానే దవళమృదుతరే శేషభోగేశయానం

ప్రాదుర్బూతం విభూత్యై శ్రుతి విమలహృదాం విశ్వరూపం ప్రపద్యే "||


💠దేవతలకు, సనకసనందనాది యోగులకు మాత్రము దర్శింపవీలైనది


💠పాలకడలిలో ఉన్న పురుష స్వరూపం శుద్ద సత్త్వ రూపం - అది అవతారాలకు భీజం


💠యస్యావయావ సంస్థానైః కల్పితో లోక విస్తరః |

తద్వై భగవతో రూపమ్ విశుద్ధమ్ సత్త్వమ్ ఊర్జితమ్ ||


💠నాభి కమలం లోంచి చతుర్ముఖుడిని తీసుకువచ్చిన రూపం భగవంతుడి మొదటి రూపం.

 "విశుద్ధమ్ సత్త్వమ్ ఊర్జితమ్", అది కేవలం సత్త్వం తప్ప మరొకటి ఏదీ లేనిది. 

సృష్టి చేయాలంటే రజో గుణం  ఉండాలి. 

ఈ సృష్టి చేసే చతుర్ముఖాదులనందరినీ వెలికి తీసిన ఆ పాలకడలిలో ఉన్న స్వామి స్వరూపం ఏదైతే ఉందో అది ఏరకమైన రజో గుణం చేత కానీ, తమో గుణం చేత కానీ ధూషితమైనది కాదు. అది కేవలం విశుద్ధం. పరమ సత్త్వమైనది. 


💠మనలో కూడా సత్త్వం ఉంది కానీ అది రజస్సు తమస్సులచే ధూషితమైనది. దేవతలకీ సత్త్వం ఉంది కానీ వారి సత్త్వం కూడా రజస్సు తమస్సులచే ధూషితమైనది. రజస్సు తమస్సులతో కలిసినదే తప్ప విశుద్ద సత్త్వం కాదు.


💠 పాల కడలిలో పవళించి ఉన్న స్వామిది మాత్రమే విశుద్ద సత్త్వం. 

సహజమైన రూపంలోంచి వచ్చాడు కనుక అక్కడ ఎట్లాంటి దోషాలు ఉండవు. 

చాలా ఉత్కృష్టమైనది.


ఏతన్ నానావతారాణామ్ నిధానమ్ బీజమ్ అవ్యయమ్ |

యస్యాంశాంశేన సృజ్యంతే దేవ తిర్యన్ నరాదయః ||


💠ఈనాడు మనం వింటున్న దేవతా శరీరాలు కల వాళ్ళు ఎందరు ఉన్నా నర దేహాలు కల వాళ్ళు ఎవరున్నా తిర్యగాదులు ఎన్నున్నా స్థావరాదులు ఎన్నున్నా ఇవన్నీ కూడా ఆ పాలకడలిలో ఉన్న పురుష స్వరూపంలోంచి వచ్చినవే. 

అందులో ఉన్న జ్ఞానంలోంచి ఒక చిన్న అంశ.ఏయే అవతారాల గురించి వింటున్నామో అవన్నీ దాంట్లోచి వచ్చినవే. "నానావతారాణామ్ నిధానమ్", వీటన్నింటికీ కూడా ఆది కారణం ఆ పాలకడలిలో ఉండే స్వరూపం.

 "బీజమ్", అది భీజం. అందులోంచే అన్నీ బయటికి వస్తాయి. అట్లా బయటికి వస్తే అది తరుగుతుందా ? "అవ్యయమ్", అది ఎప్పుడూ తరిగిపోదు, అది మార్పు చెందకనే ఉంటుంది. ఇది భగవంతుడు మొట్ట మొదట ధరించిన స్వరూపం.   


💠ఈ దివ్య క్షేత్రం ఖగోళ ప్రపంచంలో ఉంది.

ఈ భూమిపై లేదు.


💠మానవ శరీరం తో దర్శించడం అసాధ్యం.

కేవలం పరమ భాగవతోతములు మాత్రమే మరణం తర్వాత దర్శించే వీలు ఉన్న దివ్యదేశం.


💠దీనికి విష్ణులోకం అని కూడా పేరు.   వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషునిపై విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటాడు. వైకుంఠం పైన ఉండేది  పరమపదం ( శ్రీమన్నారాయణ ప్రత్యక్ష చరణ సన్నిధి)   అది సమస్త లోకాల కంటే పైన ఉంటుంది, దానికి ఆవల మరింకేమీ లేదని శ్రీమద్రామానుజులు ప్రవచించారు. వైకుంఠానికి జయ విజయులు ద్వార పాలకులు. 


💠వైకుంఠం 2,62,00,000 యోజనాల దూరంలో, సత్యలోకానికి (బ్రహ్మలోకం) ఆవల మకరరాశిలో ఉంటుంది. 

విశ్వానికి దక్షిణాగ్రం విష్ణుమూర్తి నేత్రమనీ, అక్కడి నుండే విష్ణువు విశ్వాన్ని పాలిస్తూంటాడనీ ఒక భావన..

జై శ్రీమన్నారాయణ 


108  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


      108వ దివ్యదేశము 🕉


🙏 శ్రీమన్నారాయణ పాద సన్నిధి...


తిరు పరమపదం / శ్రీ వైకుంఠము 🙏


⚜ ప్రధాన దైవం: పరమ పదనాథన్

⚜ ప్రధాన దేవత:  శ్రీ మహాలక్ష్మీ, భూదేవి, నీలాదేవి.

⚜ విమానం: అనంత విమానము

⚜ ప్రత్యక్షం: మోక్షం పొందిన వారికి.

⚜ తీర్ధం: విరాజా నది


🔔 స్థలపురాణం :  పరమపథం 🔔


💠తిరు పరమపదం లేక శ్రీ వైకుంఠం దివ్యక్షేత్రము స్వర్గలోకమున ఉంది. 

ఇచ్చటి మూలవర్లు పరమపద నాథుడు, తాయార్లు –  శ్రీ, భూ, నీలా దేవి సమేతంగా దర్శనం ఇచ్చే పరమాత్మ.

ఇచ్చటి  తీర్థమును విరాజానది అని, విమానమును అనంత విమానమని పిలిచెదరు.


💠 వైకుంఠం,  వైకుంఠ లోకం, విష్ణులోకం, పరమపదం,  నిత్యవిభూతి లేక వైకుంఠసాగర్ అనునది స్వర్గలోకమున ఉండు విష్ణుమూర్తి యొక్క నివాస స్థానముగా, సర్వలోక ప్రభువుగా, అన్ని వేదములలోనూ, హిందూ పురాణములలోనూ, వైష్ణవ మతాచారములలోనూ కొనియాడబడింది.


💠వైకుంఠం  విష్ణుమూర్తి యొక్క నివాస స్థానముగా ఎల్లప్పుడూ తన దేవేరులు అయిన లక్ష్మీదేవి, భూదేవి, నీలదేవిలతో  కూడి ఉంటాడు.

 శ్రీ రామానుజులవారు “పరమపదం లేక నిత్య విభూతి అనునది  పరమాత్మ నివసించు స్వర్గలోకము, విడదీయలేని భక్తితో కూడిన ప్రపంచము. సర్వలోకముల కంటెను దూరముగా ఉండునది, ఇంతకు మించి మరేదియు లేదు. దీనిని జయ విజయులు ద్వారపాలకులుగా కాపాడుతూ ఉంటారు.”  అని స్వర్గలోకమును గురించి వివరించారు.


💠భాగవతము ప్రకారము వైకుంఠము అన్ని లోకములకంటెను అత్యున్నతమైన లోకముగా, విష్ణుమూర్తి నివాస స్థానముగా తెలుపబడెను.  ఇది అన్నిటికంటే అతీతమైనది; చీకటి, జనన మరణ సంసారము కంటెను అతీతమైనది;  త్రిగుణములకంటెను (మూడు గుణములు) అతీతమైనది;,  ప్రశాంతతను కోరు సన్యాసులు అచ్చటికి చేరి  తిరిగిరాని ప్రదేశము. 


💠వైకుంఠములో నివసించువారికి ప్రాకృతిక శరీరము ఉండదు, కానీ పరిశుధ్ధ ఆత్మలుగా ఉంటారు. ఈ ఆత్మలు విష్ణుమూర్తిలాగే ఉండి, నారాయణ గానే పరిగణింపబడుతారు. 

విష్ణుమూర్తి/నారాయణ వైకుంఠములో శ్రీ తో  – అనగా అదృష్ట దేవతలతో, రత్నములతో పొదగబడిన గోడలుగల భవనములలో, సిరి  సంపదలతో నివసిస్తారు. అచ్చటి ఉద్యానవనములలో మన మనో కోరికలు తీర్చు చెట్లతో సంవత్సరము పొడవునా, వాటంతట అవే వెలుగులు చిందిస్తూ ఉంటాయి,  పరిమళ భరితమైన గాలులు వీస్తూ ఉంటాయి.  తుమ్మెదలు వివిధ రకాలైన పూల చెట్లపై వాలి ఆ పూవులలోని మకరందమును గ్రోలుతూ ఉంటాయి. విష్ణు భక్తులు తమ అందమైన భార్యలతో వజ్ర వైడూర్యములు పొదిగిన వాహనములపై సంచరిస్తూ ఉంటారు.


💠భగవంతుడు బ్రహ్మ యొక్క సృష్టికి సంతసించి,  తన భక్తులకు అన్నిటికంటే ఉత్తమమైన  వైకుంఠములో స్థానము కల్పిస్తాడు. 

 ఈ స్వర్గలోకమునకు చేరినవారు అన్ని విధాలైన  పాపములనుండి, భయముల నుండి విముక్తులగుదురు.  భేదములేమియు లేక అందరూ సమానముగానే చూడబడతారు. వైకుంఠమునకు చేరిన తరువాత వారి శరీరం  ఆకాశపు నీలిరంగుతో వెలిగిపోతూ ఉంటుంది. వారి కళ్ళు కమలములవలే ఉంటాయి. వారి శరీరముపై పసుపు రంగు వస్త్రములతో చాలా ఆకర్షణీయముగా ఉంటారు. 

అందరూ యవ్వనవంతులుగానే ఉండి,  నాలుగు చేతులతో, మెడకు, చేతులకు, చెవులకు, భుజములకూ అనేక ఆభరణములతో దేదీప్యమానముగా వెలిగిపోతూ ఉంటారు.


💠వైకుంఠములో అనేక చోట్ల పుష్పక విమానములు ఎగురుతూ కనిపిస్తాయి. 

ఈ విమానములు గొప్ప మహాత్ములు, భగవద్భక్తులకూ లభిస్తాయి. ఇచ్చటి యువతులు కాంతి కంటే మెరుపైన దివ్య సౌందర్యముతో వెలిగిపోతుంటారు. ఇచ్చట వీరందరినీ చూస్తుంటే, ఆకాశము మేఘములు, మెరుపులతో అలంకరించబడినట్లుగా ఉంటుంది.


💠విష్ణుమూర్తి తనను చేరుకొన్నవారిని ఎంతో ప్రేమతోనూ, వారివైపు ఆకర్షింపబడినవాడిగా, ఎంతో సంతోషముగా  చూస్తాడు. తన చిరునవ్వు ముఖముతో భక్తులను ఆకర్షిస్తాడు. పసుపు వర్ణపు దుస్తులతో, తలపై కిరీటముతో  కనిపిస్తాడు. నాలుగు చేతులతో, వక్షస్థలమున శ్రీదేవి గుర్తులతో అలరిస్తూ సింహాసనముపై కూర్చుని ఉంటాడు.


💠ఈ దివ్యదేశం పరమాత్మ యొక్క ఆత్మీయులకు చివరకు ముక్తి లభించే ప్రదేశంగా చెప్పబడింది. ఈ దివ్యదేశానికి కూడా, మన శరీరంతో పాటు మనం ప్రవేశించలేము, కానీ మన ఆత్మలు మాత్రమే ప్రవేశించవచ్చు. ఈ దివ్యదేశం భూమిలో లేదు. పరమపధం అంటే ముక్తిని (మోక్షం) సాధించడం.


పరమపధంలో, అన్ని సమయాలు ఒకేలా ఉంటాయి, ఉదయం, సాయంత్రం మరియు రాత్రి ఉండదు మరియు పరమపధం పొందినట్లయితే, అతనికి నిద్ర, ఆకలి అనిపించదు.

పరమపధంలో శ్రీమన్నారాయనుడి ముందు, ధనవంతుడు లేదా పేదవాడు లేడు మరియు జాతివివక్ష లేదు. కాబట్టి ఇకపై, కుల, మతాలకు అతీతంగా అందరూ ఒకే దేవుడి గురించి ఆలోచించాలి, .. మన అంతిమ లక్ష్యం శ్రీమన్నారాయణుడి యొక్క దైవిక పరంజ్యోతి స్వరూపoలో విలీనం కావాలి. ఓం నమో నారాయణాయ" అని చెప్పడం ద్వారా , అందరూ అతని తిరువడిని చేరుకోగలరని నమ్ముదాము.

 జై శ్రీమన్నారాయణ