January 27, 2025

రజకుడు గుర్తించిన శ్రీరంగం ఉత్సవమూర్తి నంపెరుమాళ్ విగ్రహం

 రజకుడు గుర్తించిన శ్రీరంగం ఉత్సవమూర్తి నంపెరుమాళ్ విగ్రహం

బట్టలు శుభ్రం చేసే రజకుడు త్రేతాయుగం మరియు ద్వాపర యుగంలో చేసిన పాపాలకు తగిన పరిహారం కలియుగంలో చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ రజకుడు వలన మనం ఈరోజు నంపెరుమాళ్ను కన్నుల పండుగగా చూడగలుగుతున్నాము. భూలోక వైకుంఠం అని కీర్తించబడే శ్రీరంగం దాని ప్రియమైన చక్రవర్తిని కోల్పోయి దాని వైభవమును కోల్పోయి యుండెడిది. కానీ ఈ రజకుడు చేసిన అద్భుతమైన సేవ వలన మనం ఆ వైభవమును తిరిగి నోచుకోగలుగుచున్నాము. శ్రీరంగాన్ని ముస్లిం ఆక్రమణదారుడు అబ్దుల్ గఫూర్ ఖాన్ ఆక్రమించుకోవడానికి ముందు పెరియ పెరుమాళ్ సన్నిధిని రక్షించడానికి ఒక రాతి గోడను ఆలయ గర్భగుడి ముందు నిర్మించి..

అర్చావతార విగ్రహమును ముస్లిములకు కానరాక కుండ చేసి తర్వాత శ్రీ పిళ్లైలోకాచార్యులు మరియు ఆయన భక్త బృందం నంపెరుమాళ్ను శ్రీరంగమునుండి దూర దూర ప్రదేశాలకు తీసుకెళ్లారు. నంపెరుమాళ్ భద్రత గురించి భయపడి భక్తులు ఆ విగ్రహాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చాలా దూరం తీసుకువెళ్లారు. అలా అరవై ఏళ్లు గడిచిపోయాయి. భక్త బృందం నంపెరుమాళ్తో దాదాపుగా కర్ణాటకలో కొంచం భాగం మరియు ఆంధ్రప్రదేశ్లతో సహా దక్షిణ భారతదేశం అంతటా పర్యటించారు. ఈలోగా శ్రీరంగంలో దోపిడిదారులు నిష్క్రమించిన తరువాత పూర్తిగా కొత్త తరం వారు వచ్చి ఆలయములో ఉత్సవ విగ్రహము (నాంపెరుమాళ్) లేకపోవడంతో ఆందోళన చెందిన భక్తులు శ్రీరంగం సన్నిధిలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు చేశారు. ఆలయం తన పూర్వపు వైభవాన్ని నెమ్మదిగా సంతరించుకొని ఉత్సవాలు కూడా వాటి పూర్వపు వైభవంతో తిరిగి ప్రారంభమయ్యాయి.

ఒకరోజు ఒక వర్తకుల గుంపు ఒక అడవిలో దారి తప్పి అటూ ఇటూ తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చి అచట ఉన్న ఖాళీ స్థలము మధ్యలో ఒక అద్భుతమైన శ్రీ మహావిష్ణువు విగ్రహమును చూచారు. వ్యాపారులలో వయసులో పెద్దవాడైన శ్రీరంగ నివాసి ఒకరు శ్రీ రంగనాథుని విగ్రహాన్నిచూసి శ్రీరంగనాధుడిని పోలి ఉన్నదని అరిచాడు. ఇది స్పష్టంగా స్వామి తన ఆచూకీ గురించి ప్రజలకు తెలియజేసే ఒక మార్గం. వ్యాపారులు అద్భుతమైన విగ్రహాన్ని శ్రీరంగానికి తీసుకురాగా ఆలయ సిబ్బంది భట్టర్లు మరియు భక్తులందరికీ పెద్ద సందేహం వచ్చినది. శ్రీరంగంలో నాంపెరుమాళ్ విగ్రహం ఒకటి ఇప్పటికే స్థాపించబడినది మరియు నాంపెరుమాళ్గా పూజించబడుతోంది: ఇప్పుడు మరొక విగ్రహం ఉద్భవించింది. ఆళ్వార్లు మరియు ఆచార్యుల మహిమాన్వితమైన నివాళులర్పించిన కొత్త మూర్తి యొక్క ఆధారాలను కనుగొనడం మరియు నిజమైన నాంపెరుమాళ్ అని నిర్ధారించుకోవడం ఎలా? అసమానమైన అందంతో అందరి మనసులను దోచుకున్న నాంపెరుమాళ్ కొత్త విగ్రహంలో ఎటువంటి దోషం లేకపోయినా ఆళ్వారుల ఆరాధనకు పాత్రుడైన సాక్షాత్తు నాంపెరుమాళ్కు పూజలు చేసేందుకు సార్వభౌమాధికారులు మరియు సామాన్యులు శ్రీరంగం వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. భక్తుల సందిగ్ధం చివరికి ముస్లిం దండయాత్రకు ముందు తన యవ్వనంలో శ్రీరంగం ఆలయానికి నిజాయితీగా సేవ చేసిన ఒక ముదుసలి శ్రీరంగ నివాసి అయిన రజకుడి చెవికి చేరినది. అతను ఇప్పుడు అంధుడు మరియు సగం చెవిటివాడు, కానీ అతని మిగిలిన ఇంద్రియాలు పూర్తిగా చురుకుగా పనిచేస్తున్నాయి. అతను సన్నిధికి చేరుకొని.. భట్టర్లతో మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ అతని వయస్సు మరియు వృద్ధాప్యం కారణంగా ఎవరూ అతనిని పట్టించుకోలేదు. అయితే చివరికి అతను ఆలయ సిబ్బందిలో వయసులో పెద్దవాడైన ఒక అధికారి దృష్టిని ఆకర్షించగలిగి నిజమైన నాంపెరుమాళ్ను గుర్తించగలనని అతనికి ప్రతిపాదించాడు.

వృద్ధుడి ప్రతిపాదనపై అనుమానం వచ్చినప్పటికీ ఆ ఆలయ సిబ్బంది అతన్ని రెండు విగ్రహాల వద్దకు తీసుకెళ్లారు. రజకుడు ఉత్సవ మూర్తులిద్దరికీ తిరుమంజనం చేసి ఆ తిరుమంజనమును తీర్ధముగా ప్రసాదించమని కోరాడు. అతను రెండవ మూర్తి యొక్క పవిత్ర స్నానపు నీటిని తీర్థముగా స్వీకరించినపుడు, రజకుడు ఉల్లాసంగా కేకలు వేసి..

ఇదే నిజమైన నంపెరుమాళ్ అని అధికారులకు చెప్పాడు. ఖచ్చితంగా ఆ విగ్రహమే నాంపెరుమాళ్ అని ఎలా తెలుసుకో గలిగావని ప్రశ్నించగా.... అద్భుతమైన నాంపెరుమాళ్ బట్టల నుండి వెలువడే అద్బుతమైన కస్తూరి వాసన తనకు ఏ రోజునైనను తెలుస్తుంది అని రజకుడు సమాధానమిచ్చాడు. వృద్ధుడు తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు తన తండ్రి (శ్రీరంగనాథునికి అధికారిక రజకుడు) ఉతకడానికి ఇవ్వబడ్డ నంపెరుమాళ్ బట్టల నుండి పిండిన నీరు ప్రతి దినము తనకు తీర్థముగా ఇవ్వబడెనని మరియు అది కస్తూరి పరిమళాన్ని కలిగి ఉండెడిది.

రెండవ ఉత్సవ మూర్తి తిరుమంజన తీర్థం నుండి వెలువడిన అదే కస్తూరి పరిమళం వలన అదే నిజమైన నంపెరుమాళ్ అని రజకుడు సానుకూలంగా భావించాడు. మిగిలిన కథ సహజంగానే చరిత్ర. కాబట్టి, ఆళ్వార్లను, ఆచార్యులను ప్రేమతో పిచ్చివాళ్లను చేసిన నంపెరుమాళ్ వైభవాన్ని ఈరోజు మనం సేవించగలుగుతున్నామంటే, ఆ రజకులకు మన కృతజ్ఞతలు తెలపాలు, మరియు రజకుడు ఆ రోజు భక్తులకు చెప్పినది కట్టు కథ కాదు.

ఎందుకంటే, నంపెరుమాళ్ బట్టలు ఉతికి, ఎండబెట్టి మరియు ఒత్తి (ఇస్త్రీ)ఒక రజకుడు చేసేవాడనేది నిజానికి నిజం. నాణ్యమైన శుభ్రపరిచిన వస్త్రములు అందించే రజకుని పనితనము శ్రీరామానుజాచార్యులను చాలా ఆకట్టుకున్నట్లు ఈడు వాఖ్యానమునుండి మనం దీనిని నేర్చుకుంటాము.

సన్యాసుల చక్రవర్తి శ్రీ రామానుజలవారు ఈ బట్టలు శుభ్రపరిచే నిష్కళంకమైన సేవలకు చాలా సంతోషించి రజకుడిని పెరియ పెరుమాళ్ వద్దకు తీసుకువెళ్ళి అతని యొక్క పని నాణ్యతను ప్రశంసిస్తూ మాట్లాడారు.

భాష్యకారుడికి శ్రీ రంగనాథుడు, అతను రజకుడి సేవతో నిజంగా సంతోషిస్తున్నాడని మరియు రామావతారం మరియు కృష్ణావతారం సమయంలో చేసిన నేరాలను క్షమించాలని నిర్ణయించుకున్నాను అని జవాబిచ్చాడు. 

శ్రీ రామానుజుల వారి కంటే తక్కువ స్థాయి వ్యక్తి నుండి రజకుడికి లభించిన ప్రశంసలను వివరిస్తూ ఈడు నుండి అద్భుతమైన వాఖ్యలు ఇక్కడ ఉన్నాయి: “ఓరు నాళ్ శ్రీ వైష్ణవ వన్నత్తాన్ తిరుప్పరివట్టంగలై అళగియదగా వాట్టిక్కొండు వాండు ఎమ్పెరుమానరుక్కు కట్టా, పోరా త్రిప్పరాయ్, అవనై పెరుమాళ్తిరువడిగళిలే కైప్పిడిట్టుక్ కొండు పుక్కు,

“నాయంతే! ఇవన్ తిరువరైక్కు ఈడామ్ పడివత్తిన పడి తిరుక్కన్ సాథి అరుళ వేణుమ్”ఉగాందరుళి, ఉదయవరై అరుళపడిత్తు అరుళీ, “ఇవనుక్కగా రాజకన్ నామ్ తిరత్తిల్సీద కుట్రం పొరుత్తొం” ఎండ్రు తిరువుల్లం ఆగి అరుళినారు “ స్వస్తి.

జై శ్రీమన్నారాయణ


పన్నిద్దరాళ్వారుల చరిత్ర , చరితామృతం

పన్నిద్దరాళ్వారుల చరిత్ర, చరితామృతం

భక్తి ప్రవృత్తి శరణాగతి భావాలు అసలు లేనిచో మానవులు నైతికంగా పతనమవుతారని 

తలచిన ఆళ్వారులు. ప్రజలలో భక్తి ప్రవత్తులు పెంపొందించేందుకై కృషి చేసారు. వారు చూపిన భక్తి మార్గాలన్నీ లోక కల్యాణం కోసమే ! నిత్యం భగవంతునే తలుస్తూ, కొలుస్తూ, స్మరిస్తూ, తన్మయంతో సర్వం మరచి, అలౌకికమైన ఆనందానుభూతితో, భగవత్ చరణాలనే సర్వస్వమని భావించి తరించిన మహానుభావులు, సర్వవిశ్వపౌరులు మహామహిమాన్వితులైన మహానుభావులు ఎందరో ! నిరవదికమైన భగవత్ ప్రేమ సాగరంలో మునిగి, ఆర్తితో , పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ తరించేవారే ఆళ్వారులు. కారణజన్ములు. 

మానవకోటికంతటికీ ఆదర్శంగా నిలిచినా భాక్తాగ్రేసురులు. ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సత్యం లోతులను , ఆనందం లోతులను అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని , 

యామునాచార్యులు , రామానుజాచార్యులు ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. 

(ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) 

ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. 

కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824 లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందువారే గాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. 

ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం , పన్నెండు మంది అని మరో వాదం ఉంది. 

పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడింది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది. 

‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ , శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. కాని , ఇందులో పదాలను చీల్చి శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ, యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి, మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల ఆళ్వారులు పన్నిద్దరైనారు. 

పదుగురి పేర్లివి:

1. భూత ఆళ్వారు  - పూదత్త ఆళ్వారు అని వాడుక. 

కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం

2. పొయగై ఆళ్వారు. - పాంచజన్యం అనే శంఖం అంశ. సరోయోగ అని కూడా అంటారు.

3. పేయాళ్వార్‌. - మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. నందకం అనే ఖడ్గం అంశ.

4. తిరుమళిశై ఆళ్వారు. భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ.

5. కులశేఖ రాళ్వారు. కౌస్తుభమణి అంశ.

6. తొందర డిప్పొడి ఆళ్వారు. విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. తులసీదళాలు , పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల.. వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం.

7. తిరుప్పాణి ఆళ్వారు. యోగి వాహన ఆళ్వారు. ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు. 

విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.

8. తిరుమంగై ఆళ్వారు. పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం.

9. పెరియాళ్వారు. భట్టనాథ ఆళ్వారు. ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. వైకుంఠంలోని విష్ణువు రథం అంశ. 

10. నమ్మాళ్వారు. పరాంకుశ ఆళ్వారు. విష్వక్సేనుడి అంశ. శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.

ఈ పదిమందిగాక ఆండాళును , మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. 

పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. 

పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. 

మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. గరుడాంశగా చెపుతారు. 

భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. కాని, ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.   

వైష్ణవ సాంప్రదాయానికి, భక్తిని జోడించి, ప్రచారం చేసిన ఆళ్వారులు 12 మంది. వారు.

1. పుదత్తాళ్వారు

2. పాయ్ గైయాళ్వారు

3. పేయళ్వారు

4. పెరియాళ్వారు

5. ఆండాళ్

6. తిరుమళిశైయాళ్వారు

7. కులశేఖరాళ్వారు

8. తిరుప్పాణియాళ్వారు

9. తొండరడిప్పాయాళ్వారు

10. తిరుమంగైయాళ్వారు

11. మధురకవియాళ్వారు

12. నమ్మాళ్వారు

అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు , 

వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి

పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి

పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి

పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు

తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు

కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు

తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు

తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు

తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి

ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)

ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి

నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని .

వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. 

కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం క్రీ.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు. పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.

భక్తి ప్రపత్తి యోగముల పరమానందభరితులుగా ఉన్న ఆళ్వారుల దివ్యజీవిత చరితలు, వారి రచనలు దక్షిణాన వైష్ణవ భక్తిప్రాధాన్యతకు, విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలమయ్యాయి.

1. పుదత్తాళ్వారు 

2. పొయ్’గైయాళ్వారు 

3. పేయళ్వారు

వీరు ముగ్గురుని మూలాళ్వారులు అంటారు. 

కాంచీపురంలో ఒక సరోవరంలో కమలం మధ్యన పొయ్’గైయాళ్వారు జన్మించారు. 

వీరిని ‘కాసారయోగి’ అంటారు. 

ఇప్పుడు మహాబలిపురం ఐన మామల్లపురంలో మాధవీపుష్పంలో పూదత్తాళ్వారు జన్మించారు. 

వీరిని ‘భూతయోగి’ అంటారు. 

ఇప్పుడు మైలాపురం అనబడే మయురపురంలో ఒక సరస్సులోని తెల్లకలువ నుండి పేయాళ్వారు జన్మించారు. వీరిని ‘మహాయోగి’ అని అంటారు. 

ఈ ముగ్గురులో పాయ్’గైయాళ్వారు ఆళ్వారు పరంపరలో మొదటివారుగా చెప్పుకుంటారు. ఈ ముగ్గురు మహానీయుల జన్మ ఒక్కొక్కరోజు వ్యత్యాసంతో జరగటం ఆశ్చర్యకరం. ముందు జన్మించింది పాయ్’గైయాళ్వారు. తర్వాత ఒక్కొక్క రోజు తేడాతో పూదత్తాళ్వారు , పేయాళ్వారు చెబుతారు.

ఈ ముగ్గురు మహాయోగుల కలయిక చాలా ఆసక్తికరంగా జరిగింది. ఒకసారి పాయ్’గైయాళ్వారు, తిరుక్కొమూర్ అనే గ్రామానికి వచ్చారు. చీకటి పడింది. ఆ రాత్రి విశాంత్రి తీసుకోవడానికి ఓ చోటికి చేరుకున్నారు. అనుకోకుండా ఆ చోటికే పూదత్తాళ్వారు వచ్చి , కొంచెం చోటిమ్మని అడిగారు. ఇద్దరు సర్దుకొని కూర్చున్నారు. కొంచెంసేపు తర్వాత పేయాళ్వారు వచ్చి , కొంచెం చోటిమ్మని అడిగారు. ఆ ముగ్గురు విష్ణుభక్తులూ సంతోషంగా , ఆ చిన్నచోటులోనే నిలుచుని సర్దుకున్నారు. గాఢాంధకారం , ఎటు చూసినా కటిక చీకటి. కొంచెంసేపటికి వారికి నాలుగోమనిషి వచ్చి తమ మధ్యన నిల్చున్నాడనే అనుభూతి కలిగింది. కానీ , ఎవరూ కనపడలేదు. వారు ఆశ్చర్యంతో పరంధాముని ప్రార్ధించగా , శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించాడు. ఆ మహాయోగులు , ఆనంద పరవశులై తమిళంలో ఆశువుగా మూడు పాశురాలతో ఆ దేవదేవుని స్తుతించి ధన్యులైనారు.

4. తిరుమళిశైయాళ్వారు.

వీరి జన్మ గురించి కొంత విచిత్రంగా చెబుతారు. కాంచీపురానికి దగ్గరలో మహిషాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో భార్గవుడు కనకాంగి దంపతులకు తిరుమళిశైయాళ్వారు జన్మించారు. పుట్టినప్పుడు ఆ బాలునిలో కదలిక లేదట. దుఃఖితులైన తల్లిదండ్రులు ఆ బాలుని అడవిలో ఒక పొదలో పడేశారు. తిరువాలన్ అనే వ్యక్తి అడవి వేటకొచ్చాడు. పొదలో పసిపిల్లాడి ఏడుపు విన్న తిరువాలన్ , ఆ బాలుడ్ని తీసుకెళ్ళి తన భార్య పంకజవల్లి చేతుల్లో పెట్టాడు. ఆ దంపతులు ఆ పిల్లవానికి శివక్కియార్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే ఆ పసివాడి ప్రవర్తన ఆశ్చర్యకరంగా ఉండేది. పాలు తాగేవాడు కాదు. ఆనోటా ఈనోటా ఈవిషయం పల్లెలోని వృద్ధదంపతుల చెవిన పడింది. వారు పాలు తెచ్చి పట్టగానే శివక్కియార్ పాలు తాగేశాడు. ఆ దంపతులు ఆనందంగా , రోజూ పాలు తెచ్చి శివక్కియార్ కి పట్టి , కొంచెం పాలు ప్రసాదంగా తీసుకునేవారు. అధ్బుతమైన సంఘటన. వృద్ధ దంపతులకు కొంత కాలానికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి కణ్ణకృష్ణుడు అని పేరు పెట్టుకున్నారు.

శివక్కియార్ పెద్దవాడైనాడు. ఎన్నో విద్యలు నేర్చాడు. దేశాటన చేస్తూ తిరువళ్ళిక్కేణికి చేరుకున్నాడు. అక్కడే తపోదీక్ష స్వీకరించి ఎన్నో సిద్ధులు సాధించాడు. తిరువళ్ళిక్కేణికి మైలాపురం దగ్గరే. మైలాపురంలోనే పేయాళ్వారు నివాసం. వారు ఆనోట ఈనోట శివక్కియార్ గురించి విన్నారు. అతనిని ఎలాగైనా వైష్ణవునిగా చేయాలని సంకల్పించుకున్నారు. ఒకసారి శివక్కియార్ అటువైపుగా వెళుతుండగా , పేయాళ్వారు చూశారు. అదే మంచి సమయమని శివక్కియార్ చూస్తుండగా , తోటలో చెట్లను తల్లక్రిందులుగా పాతారు. అది చూసి పరిహసించిన శివక్కియార్ తో వాదించి వైష్ణవునిగా మార్చారు పేయాళ్వారు. అప్పటినుంచి శివక్కియార్ ని భక్తిసారుడు అని పిలిచేవారు. భక్తిసారుడు కాంచీపురం వచ్చాడు. అప్పుడే కణ్ణకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. కాంచీపురం దేవాలయం వద్ద ఒక వృద్ధురాలైన దేవాంగన ఉండేది. ఆమె రోజూ దేవాలయాన్ని , భక్తిసారుని ఆశ్రమ పరిసరాలని శుభ్రం చేస్తుండేది. ఆమె శ్రద్దకి తృప్తి చెందిన భక్తిసారుడు , ఆ దేవాంగనకి యవ్వనాన్ని ప్రసాదించాడు. ఆ దేవాంగన అందాన్ని చూసి మోహించిన కాంచీపురం రాజు ఆమెని పెళ్ళాడాడు. తనకు కూడా యౌవ్వనాన్ని ప్రసాదించమని భక్తిసారుని బ్రతిమాలాడాడు. కానీ భక్తిసారుడు నిరాకరించాడు. రాజు కోపంతో భక్తిసారుని కాంచీపురం వదలి వెళ్ళి పోవలసిందిగా ఆజ్ఞాపించాడు. భక్తిసారుడు రాజాజ్ఞను శిరసావహించి , కణ్ణకృష్ణునితో పాటు కాంచీపురం నుండి వెళ్ళిపోయాడు. ఆలయంలో శేషశాయి కూడా అదృశ్యమయ్యాడు. తన తప్పు తెలుసుకున్న రాజు భక్తిసారునికి క్షమాపణలు చెప్పి , కాంచీపురానికి రావలసిందని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత తిరుమళిశై ఆళ్వారు అని పిలవబడే భక్తిసారుడు కుంభకోణం చేరి , ఎన్నో మహిమలు చూపించాడు. విష్ణుదేవుని కీర్తిస్తూ , ఎన్నో రచనలు చేసాడు. ‘తిరుచ్చందవిరుత్తం’, ‘నాన్ముఖం తిరు అందాది’ – ఈ రెండు గ్రంథాలు ప్రసిద్ధాలు. 

వీరు కుంభకోణంలోనే ఎన్నో ఏళ్లు తపస్సు చేసి , ఎన్నో మహిమలు చూపి , భక్తితత్త్వాన్ని ప్రచారం చేసి విష్ణుసాయుజ్యం పొందారు.

5.నమ్మాళ్వారు , 

6.మధుర కవి.

వైష్ణవ సంప్రదాయ గురువులలో నమ్మాళ్వారు స్థానం విశిష్టమైంది. వీరి తండ్రి తిరుక్కూరుగూరు పాలకుడైన శూద్ర ప్రభువుకారుడు. తల్లి ఉజయనంగ. సంతానం లేని వీరు తిరుక్కురుల గుడికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా, భక్తికి మెచ్చి, తానే స్వయంగా కుమారుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. కొన్నాళ్ళకు వారి కలలపంటగా కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి మారుడు అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎంతకాలమో లేదు. ఆ పిల్లవాడు కళ్ళు తెరవడు. పాలు తాగాడు. ఇదంతా చూసిన మంత్రులు పిల్లవాడిని స్వామి ఆలయానికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. రాజుకీ అదే మంచిది అనిపించి , మారుడిని తీసుకొని ఆలయానికి వెళ్లాడు. పిల్లవాడిని విష్ణుసన్నిధిలో పడుకోబెట్టారు. మారుడు కళ్ళు తెరచి , స్వామిని చూసి పాక్కుంటూ దగ్గరలో ఉన్న చింతచెట్టు దగ్గరకెళ్ళాడు. తొర్రలో దూరాడు. పద్మాసనంతో తపోనిష్ణుడైనాడు. ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని , కారణజన్ముడని , దైవాంశసంభూతుడని అందరికీ అర్థమైపోయింది. కారుడు కూడా చింతపడకుండా , మనస్సు గట్టి చేసుకొని , మారుడికి తపోభంగం కలగకుండా కట్టుదిట్టం చేశాడు. నిద్రాహారాలు లేకుండా తీవ్రమైన తపోదీక్షలో ఉన్న మారుని చుట్టూ గొప్ప తేజస్సు ప్రకాశించింది. అతనే నమ్మాళ్వారు.

పాండ్యదేశంలో గోళూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నారాయణుడు అనే బ్రాహ్మణునికి ఒకే పుత్రుడు. ఆ పిల్లవాడు అతి చిన్న వయసులోనే వేదవేదాంగాలు , చదివాడు. సంసార తాపత్రయాలకు విముఖుడై , దేశాటన చేస్తూ బదిరికాశ్రమం చేరాడు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసి అయోధ్యా నగరానికి వచ్చాడు. ఒకరాత్రి అతనికి దక్షిణ దిశనుంచి మహాతేజస్సు కనబడింది. దానికి కారణం అన్వేషిస్తూ తిరుక్కడూరు చేరాడు. ఆయనే మధురకవి. విష్ణ్వాలయంలో చింతచెట్టు తొర్రలో తపోదీక్షలో ఉన్న తేజోమూర్తిని చూసి పరవశించి పోయాడు. వారితో మాట్లాడాలనే ఉత్సాహముతో పెద్దగా శబ్దం చేశాడు. తపోభంగమై కళ్ళు తెరిచిన నమ్మాళ్వారు , మధురకవి అడిగిన సందేహాలకన్నింటికి చక్కని వివరణలు ఇచ్చారు. మధురకవి అయన చెంత మోకరిల్లి తన గురువుగా స్వీకరించాడు. 

సంవత్సరాలు గడిచిపోయాయి. భక్తి పరిపక్వత చెందిన నమ్మాళ్వారు తనలో ఉప్పొంగే భావాలను, గ్రంథస్థం చేశాడు. ‘తిరువిరుత్తం’, ‘తిరువాశరియం’, ‘తిరువందాది’, ‘తిరువయిమొళి’ వీరి ముఖ్య గ్రంథాలు. శఠులను అంటే వంచకులను అణచుటచే, సంసారదోషాలను నిర్జించుటచే ఈయనకు ‘శఠకోపుడు’ అని, ఆదినాధ స్వామి ప్రసాదించిన పొగడపూల మాల ధరించటంచే ‘వకుళాభరణుడు’ అని, పరమతాలను విరసించటంవల్ల ‘వరాంకుశుడని’ పిలవబడేవాడు. ఎందరికో సన్నిహితుడై , ముక్తి పొందే తరుణోపాయం ఉపదేశించటం వల్ల ‘నమ్మాళ్వారు’ అన్నారు.

‘నమ్’ అంటే మన. నమ్ + ఆళ్వార్ = మన ఆళ్వార్. 

వైష్ణవ ప్రచారంలో అతి ముఖమైన మహానీయులలో ఒకరైన నమ్మాళ్వార్ 35వ ఏట పరమపదం చేరారు. నమ్మాళ్వారుకి ముఖ్యశిష్యులై , ఆయన అడుగుజాడలలో నడిచి , వైష్ణవ సాంప్రదాయానికి అశేషమైన ప్రాచుర్యానికి తోడ్పడిన మధురకవి , జీవితమంతా విష్ణు చరణ సేవలో గడిపి భగవదైక్యం చెందారు. వారు రచించిన భగవన్నుతి ‘కణ్ణిమణ్ శిరుత్తాయి’.

7. కులశేఖరాళ్వారు

భక్తకోటికి , భక్తిసంభరితమైన ‘ముకుందమాల’ ను అందించిన కులశేఖరాళ్వారుని ఎరుగనివారు, తలచని వారు ఉండరు. కులశేఖరాళ్వారుల తండ్రి ‘కొల్ల’ (నేటి క్విలన్) పరిపాలకుడు ధృఢవ్రతుడు. అల్లారుముద్దుగా పెరిగిన బిడ్డ సకల శాస్త్రపారంగతుడైనాడు. తండ్రి దృష్టి వానప్రస్థాశ్రమం స్వీకరించిన తరువాత రాజ్యభారాన్ని తాను తీసుకున్నాడు. రాజ్యపాలనలో క్షణం తీరికలేక తలమునకలై ఉన్నా , కులశేఖరుల దృష్టి ఆధ్యాత్మికత్వం పైనే ఉండేది. ప్రాపంచిక సుఖాలకు విముఖుడై, శ్రీరామచంద్రుని శరణంటూ ‘పెరుమాల్ తిరుమొళి’ అనే దివ్య ప్రబంధాన్ని రచించారు. ఈయన భక్తికి మెచ్చిన స్సేనముదలి అనే వైష్ణవాచార్యులు పంచసంస్కార దీక్షను ఇచ్చి అనుగ్రహించారు. అది మొదలు కులశేఖరాళ్వారులో భక్తి రెట్టింపైంది. శ్రీరంగనాథుని దర్శించాలని తపనపడ్డాడు. కానీ , మంత్రులు ఈయనవెళితే మళ్ళీ తిరిగిరాడని శంకించి, వైష్ణవాచార్యునే దూరం చెయ్యాలని ఆలోచించారు. పూజాగృహంలోని రత్నహారాన్ని దాచి, ఆ నేరం ఆచార్యుని మీద మోపారు. నేరాన్ని నిర్ధారించుకోవటానికి ఒక కుండలో విషసర్పాన్ని ఉంచి , తన ఉంగరాన్ని అందులో వేసి, తన గురువుపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి , కులశేఖరులు ఉంగరాన్ని పైకి తీసారు. మంత్రులు తమ తప్పిదానికి సిగ్గుపడి క్షమాపణలు అడిగారు. జీవితకాలమంతా పరమాత్మ సేవలో తరించినారాయన.ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు. తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.

8.పెరియాళ్వారు , 

9.ఆండాళ్ళు.

పెరియాళ్వారు అసలు పేరు విష్ణుచిత్తుడు. ఈయన తల్లిదండ్రులు ముకుందా చార్యులు , పద్మావతీదేవి. ముకుందాచార్యులు శ్రీవిల్లిపుత్తూరు విష్ణ్వాలయంలో పరిచారకుడు. చిన్నప్పటినుంచి విష్ణుచిత్తుడు తిరుమంత్రమైన అష్టాక్షరీమంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఒకసారి విష్ణుచిత్తుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ, మాలాకారుని తరింప చేసిన ఘట్టం విన్నాడు. తాను కూడా అట్లాగే తరించాలని , స్వయంగా చక్కటి పూలతోట పెంచి, ఆ తోటలో పూలతో విష్ణుమూర్తిని పూజించి ఆనందించేవాడు. ఆ కాలంలో మధురను వల్లభరాయుడు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు రాత్రి పూట మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్ణసుఖాలను కనిపెడుతుండేవాడు. ఒకరోజు రాత్రి తిరుగుతూ తిరుగుతూ , ఒక అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుని చూశాడు. ఆ బ్రహ్మానుడు మహాజ్ఞాని అని గ్రహించి , నమస్కరించి , తనకేదైనా ఉపదేశించమని అర్థించాడు. ఆ బ్రాహ్మణుడు వార్థక్యం రాకముందే పరమాత్మ యందు అనురక్తి పెంచుకొమ్మని సోదాహారణగా బోధించాడు. రాజు నిజమందిరం చేరి ఆ రాత్రంతా ఆలోచించాడు. మర్నాడు పొద్దున్నే పండితసభ ఏర్పాటు చేశాడు. సభ మధ్యలో స్తంభం పాతించి, దాని మీద బంగారు నాణేలు నింపిన సంచి కట్టించాడు. పండిత సభలో గెలిచిన వారికి ఆ నాణేల సంచి బహుకరించబడుతుందని, ఆ విజేతయే తన గురువని ప్రకటించాడు. ఎందరో పండిత ప్రకాండులు వచ్చారు. 

విష్ణుచిత్తుడు (పెరియాళ్వారు) కూడా వచ్చారు. పరమేశ్వర ప్రేరణతో పండితులతో వాదించి విజయం పొందారు. పరమానంద భారితుడైన రాజు, పెరియాళ్వారును గురుపీఠం పై ఉపవిష్టులను చేసి, గజారోహణం చేయించాడు.

ఒకరోజు పెరియాళ్వారు తోటపని చేస్తుండగా , వారికి , జనకమహారాజుకి సీతమ్మ లభించినట్లు , ఒక బాలిక దొరికింది. ఆ బాలికను భాగవత్ప్రసాదంగా భావించి , గోదాదేవి అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కారణజన్మురాలు గోదాదేవి , నిత్యం విష్ణునామం స్మరిస్తూనే ఉండేది. బాలిక పెరిగి పెద్దదైంది. మహావిష్ణువునే మనసులో భర్తగా భావించి తన్మయత్వం చెందేది. తండ్రితోపాటు మాలలల్లేది. తండ్రి లేనపుడు ఆ మాలను తాను తలలో మురిపెంగా ధరించి , ఆపై శ్రీరంగనాథునికి అలంకరించేది. అనుకోకుండా ఒకరోజు పెరియాళ్వారు అది గమనించారు. గోదాదేవిని మందలించి , ఆ రోజు మాలను శ్రీరంగనాథునికి అలంకరించలేదు. ఆ రాత్రి శ్రీరంగనాథుడు పెరియాళ్వారుకి కలలో కనిపించి , తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని , వాటినే తనకు అలంకరించమని ఆదేశించాడు. గోదాదేవి వయసుతో పాటు భక్తి కూడా పెరిగింది. శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ‘తిరుప్పావై’ అనే 30 పాశురాలు ,   ‘నాచ్చియార్ తిరుమొళి’ అనే 140 పాశురాలు వ్రాసింది. ఆ పాశురాలను పాడుకుంటూ తనను తాను మరిచిపోయేది.గోదాదేవికి వివాహ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె శ్రీమహావిష్ణువును తప్ప ఎవరినీ వివాహమాడనని ఖచ్చితంగా చెప్పింది. 

108 శ్రీమహావిష్ణుక్షేత్రాలలో , శ్రీరంగంలో శ్రీరంగానాథుడే తనకు ఇష్టుడని , ఆయనకిచ్చి వివాహం చేయమని కోరింది. మహదానందంగా విష్ణుచిత్తుడు గోదాదేవికి , శ్రీరంగనాథుడికి వివాహం జరిపించాడు. వివాహానంతరం ఆలయం లోనికి వెళ్ళిన గోదాదేవి క్షణమాత్రంలో ఆర్చామూర్తిలో ఐక్యం అయింది. గోదాదేవికే భక్తులను రక్షించేది అనే అర్థంతో ‘ఆండాళ్ళు’ అని , స్వామికి తాను ధరించిన మాలలే అలంకరింపజేయటం చేత ‘శూదికొడుత్తాళి’ అని పేర్లతో ప్రసిద్ధికెక్కింది.

10. నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని

క్రీ.శ. 798 కలంవాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం , నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని, మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును, సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.

11. మధురకవి యాళ్వార్.

ఇతను బ్రాహ్మణుడు. తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.

🙏🙏🌷🙏🙏🌷🙏🙏🌷🙏🙏

January 25, 2025

95 దివ్యదేశాల యాత్ర Day - 2

 95 దివ్యదేశాల యాత్ర Day - 2

Day - 2  (13/12/24)

ముందుగా (91వ దివ్యదేశం) తిరునీర్మలై ని దర్శించుకున్నాము. 

నీరవణ్ణన్ పెరుమాళ్ - అణిమామలార్ మంగైనాయకి  

ఈ క్షేత్రాన్ని తోయాద్రి లేదా తోతాద్రి అని కూడా అంటారు. మహావిష్ణువు స్వయంభూగా వెలసిన 8 క్షేత్రాలలో ఇది ఒకటి. 

శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రాలని స్వయం వ్యక్త క్షేత్రాలు అని అంటారు. అవి ఎనిమిది ఉన్నాయి. వాటిలో తిరునీర్మలై ఒకటి. మిగిలినవి శ్రీరంగం, తిరుమల, శ్రీముష్ణం, బదరీ, నైమిశారణ్యం, పుష్కరం & ముక్తినాథ్. 

ఇక్కడ కొండపైన & దిగువున 2 ఆలయాలు ఉన్నాయి. 

కొండ ఎక్కాలి అంటే 200 మెట్లు ఎక్కాలి. కొండదిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా అన్ని మెట్లని లెక్కపెట్టుకుంటూ వచ్చాను. అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.  ఓపిక ఉన్నవాళ్ళు కొండా ఎక్కవచ్చు, లేనివాళ్ళు దిగువున ఉన్న ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చును. 










ఇవన్నీ కొండపైన ఆలయం ఫోటోలు 



ఇవి కొండా దిగువన ఉన్న ఆలయం ఫోటోలు 

2) తరువాత తిరునిన్రవూర్ (89వ దివ్యదేశం)

భక్తవత్సల పెరుమాళ్ - ఎన్నపెత్త తాయార్ 



3) తరవాత (90వ దివ్యదేశం)  తిరువళ్ళూరు

వీరరాఘవ పెరుమాళ్ - కనకవల్లీ తాయారు 

తిరువళ్ళూరు చేరుకునేసరికి 12.30 దాటింది ఆలయం మూసివేశారు. అక్కడే ఒక ఫంక్షనుహాలులో భోజనాలు ముగించుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొన్నాము. ఆలయం తెరిచే సమయానికి ముందు అక్కడ ఉన్న హృత్పాపనాశ పుష్కరిణికి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి ఆలయం తెరిచారు. స్వామిని దర్శించుకున్నాము. ఆలయంలో ఉన్న వీరరాఘవ పెరుమాళ్ ని వైద్యనాథ పెరుమాళ్ అని కూడా అంటారు. 





తరవాత అభిమానదేశమైన శ్రీ పెరంబుదూరు వెళ్ళాము 

ఆదికేశవ పెరుమాళ్ - యతిరాజనాథవల్లతాయార్ 

శ్రీవైష్ణవులకు ఇష్టమైన క్షేత్రం - శ్రీమత్ భగవత్ రామానుజులు అవతార స్థలం ఇది. ఈ క్షేత్రాన్నే భూతపురి అని కూడా అంటారు. 

ఇక్కడ ఉన్న రామానుజుల మూర్తి విశేషం ఏమిటంటే,

ఒకరోజు రామానుజల భక్తులు ఒకరు వచ్చి భక్తితో సమీపించి, ఆచార్య మీరు ఈ భూమిపై శ్రీ వైష్ణవ ధర్మమును ప్రచారం చేయుటకు అవతరించారు. తర్వాత తరములవారికి మీ గురించి తెలియజేయుటకు, మిమ్మల్ని పూజించుటకు, మీ విగ్రహము ఈ భూతపురిలో ప్రతిష్టించుటకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. భక్తుని కోరికను రామానుజులు అంగీకరించారు. వెంటనే వారి విగ్రహము లోహంతో తయారు చేయించారు భక్తులు. వారు ఆ విగ్రహమును తెచ్చి ఆచార్యులకి చూపించారు అంతట రామానుజులవారు ఆ విగ్రహమును పైనుంచి కింద వరకు పరిశీలనగా చూసి సంతోషము వ్యక్తపరిచి, ఆ విగ్రహమును ఆలింగనం చేసుకుని తమ దివ్య శక్తిని అందులో ప్రవేశపెట్టిరి. అంతట ఆ విగ్రహమును ఒక పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్లి పుష్య మాసంలో, పుష్యమి నక్షత్రంలో, గురువారం నాడు ఆ విగ్రహమును శ్రీపెరంబుదూరులో ప్రతిష్టించరి. అక్కడ శ్రీపెరంబుదూరులో అభిషేకం చేసినప్పుడు, ఇక్కడ శ్రీరంగంలో రామానుజులవారు ఉక్కిరిబిక్కిరి అయ్యిరి. అంటే శ్రీపెరంబుదూరులో ఉన్న మూర్తి సజీవ మూర్తి అని మనకు తెలుస్తున్నది. 

రామానుజులు వేంచేసియున్న కాలంలో ప్రతిష్టించబడిన దివ్య మంగళ మూర్తులు మూడు. మొదటిది శ్రీపెరంబుదూరులో తాను అభిమానించిన దివ్యమంగళ విగ్రహం. రెండవది తిరునారాయణపురం అంటే మేల్కోటలో భక్తులు అభిమానించి ప్రతిష్టించిన తిరుమేని విగ్రహం. మూడవది శ్రీరంగం ఇది తానాన తిరుమేని అంటారు అంటే తానే అయి తానే అయినా తిరుమేని. 

మేము శ్రీపెరంబుదూరు ఆలయానికి చేరే సమయానికి తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం ఆ రోజున. తిరుమంగై ఆళ్వార్ మరియు రామానుజుల వారు ఊరేగింపు అయ్యి పల్లకీలలో ఆలయానికి తిరిగి వచ్చే సమయానికి మేము ఆలయానికి వెళ్ళాము. ఇద్దరు ఆళ్వార్ లకి గజరాజు వింజామర వీస్తున్న దృశ్యం చూస్తుంటే చాలా కన్నుల పండుగగా ఉందో. 











అక్కడితో మా రెండవరోజు యాత్ర ముగిసింది.  91, 90 & 89  అంటే 3 దివ్యదేశాలు 1 అభిమాన దేశం దర్శనాలు అయ్యాయి. 




January 24, 2025

95 దివ్యదేశాల యాత్ర Day - 1

 95 దివ్యదేశాల యాత్ర Day - 1

జై శ్రీమన్నారాయణ 🙏

95 దివ్యదేశాల యాత్రకి 2024 డిసెంబర్ 11 సాయంత్రం బయలుదేరాము. 28 సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నాము. 

హైదరాబాద్ నుండి ముగ్గురం, వైజాగ్ నుండి ఇద్దరూ మొత్తం మా బ్యాచ్ ఐదుగురం వెళ్ళాము. యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. 

ఏలూరు "లీలా ట్రావెల్స్" వాళ్ళతో వెళ్ళాము. ఆర్గనైజర్ "దానకర్ణ" గారు. మాకు గైడ్ లాగా వచ్చిన ఆవిడ "ధనలక్ష్మి" గారు. ఆవిడ ప్రతీ దివ్య దేశానికి (ఆలయానికి) వెళ్ళే ముందు ఆ ఆలయ చరిత్ర & వివరాలు  అన్నీ వివరంగా చెప్పారు. అలా చెప్పటం వలన అక్కడ ఉన్న పెరుమాళ్ళని చక్కగా సేవించుకోవటం అయ్యేది. 

11/12/24 సాయంత్రం 6.30 కి సికింద్రాబాద్ లో ట్రెయిన్ ఎక్కి, 12 ఉదయం 6.50 కి చెన్నై ఎగ్మోర్ లో దిగాము. అక్కడే వెయిటింగ్ రూమ్స్ లో స్నానాలు చేసి, పక్కనే ఉన్న హోటల్ లో ట్రావెల్స్ వాళ్ళు ఫలహారాలు పెట్టించారు, తినేసి 10.15 కి బస్ ఎక్కి మా యాత్రని మొదలుపెట్టాము. 

యాత్రలో మొత్తం 30 మంది యాత్రికులము ఉన్నాము. అందరికీ సౌకర్యంగా ఉంటుందని 2 బస్సులలో అందరినీ తీసుకొనివెళ్ళారు. ముందుగా

Day -1 (12/12/24)

1). తిరువల్లిక్కేణి  (94 వ దివ్యదేశం) 








మూలవరులు .... పార్థసారథి పెరుమాళ్ - రుక్మిణీ తాయార్ 
దీనినే పార్థసారథి ఆలయం అని అంటారు. చెన్నైలోని ట్రిప్లికేన్లో ఈ దివ్యదేశము ఉన్నది. 
ఆలయ చరిత్రని కొంచెం తెలుసుకుందాము.  

పురాణగాథ/పార్థసారధి: పూర్వము సుమతి అను రాజు వెంకటేశ్వరస్వామిని దర్శించి "మహాభారత యుద్ధ సమయమున అర్జునునకు సారథిపై గీతోపదేశము చేయుచున్న రూపములో దర్శనము కావలెను" అని కోరెను. కలలో సుమతికి దర్శనమొసగి బృందారణ్యమును సందర్శించినచో నీ కోరిక నెరవేరును అని స్వామి చెప్పెను. కలియుగములో వ్యాస మహర్షి తన శిష్యుడైన ఆత్రేయ ఋషిని బృందారణ్యమునకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పెను. వ్యాస మహర్షి తన శిష్యునకు శ్రీమన్నారాయణుని సుందర విగ్రహమును ఆరాధన కొరకు ఇచ్చెను. అత్రి బృందారణ్యము చేరి కైరవేణి తీరమున తపస్సు ప్రారంభించెను. అదే సమయమునకు అచ్చట చేరుకొన్న సుమతి గీతోపదేశము చేయు పార్థసారధి స్వామివారి దివ్యమంగళ విగ్రహముగా గుర్తించి స్తుతించెను.

ఆనాటి మూర్తే నేడు ఉత్సవ మూర్తిగా మనకు దర్శన మిస్తారు. అంతేకాదు ఆనాటి భారతయుద్ధంలో తగిలిన బాణపు గుర్తులు నేటికి కనుపిస్తాయి. ఉత్సవ మూర్తిలో ఒక విశేషం ఉన్నది. ఎప్పుడు నీల వర్ణంలో ప్రకాశించే ఈ ఉత్సవమూర్తి ముఖ పద్మం అభిషేకానంతరం రెండు గంటల పాటు బంగారు రంగులో దర్శన మివ్వడం ఒక విశేషం. ఇక్కడ శ్రీకృష్ణుడు సకుటుంబంగా అన్న బలరాముడు, దేవేరి రుక్మిణి, తమ్ముడు సాత్యకి, కుమారుడు ప్రద్యుముడు, మనుమడు అనిరుద్దుడు వారితో కలసి ఇక్కడ సాక్షాత్కరించాడు. అత్రి మహా మునికి ప్రత్యక్షమైన నరసింహస్వామిని కూడ మనం ఇక్కడ దర్శించవచ్చు. మూలవర్లు యోగ నరసింహం ఉత్సవమూర్తి శాంత నరసింహుడు వీరినే తెళ్ళియళగియ సింగర్ అని పేరు.      

రంగనాథులు : శ్రీరంగంలో పడమర దిశగా పవళించిన స్వామి ఇచ్చట దక్షిణ దిశగా శిరస్సు వంచి పవళించుట గమనించవలసిన విశేషము. మాసి మాసము శుక్లపక్షములో స్వామి వారి కళ్యాణము వైభవంగా జరుగును. ఒకసారి శ్రీ మహలక్ష్మి శ్రీహరిపై అలుక పూని ఈబృందావన క్షేత్రములో ఒక చందన వృక్షము ఛాయలో పసి పాపగా అవతరించి పవళించింది. అచ్చట ఉన్న సప్త ఋషులు పాపను కనుగొని వేదవల్లి అని నామకరణము చేసి పెంచ సాగిరి. యుక్తవయస్కురాలైన దేవకన్యను పోలిన ఆమెను కనుగొని ఋషులు ఆనందించారు. శ్రీహరి యువరాజు వలె ఆమెకు దర్శన మిచ్చెను. ఆమె ఆయనను మన్నాధన్ అని పిలిచినది. మన్నాధన్ అనగా "శాశ్వతుడైన పతి దేవా” అని అర్థము. భృగు మహర్షి ఆ యువరాజును శ్రీమన్నారాయణునిగా గుర్తించి వారిరువురికీ వివాహం జరిపెను. భృగు మహర్షి కోరికపై రంగనాథ, వేదవల్లులు ఇచ్చట వేంచేసి వెలసినారు. స్వామిని మన్నధర్ స్వామి అని కూడా పిలుస్తారు.


గజేంద్రవరదన్ పూర్వము సప్తరోమనుడు అను భక్తుడు శ్రీమన్నారాయణుని దర్శనము కోరి బృందారణ్యములో తపమాచరించెను. స్వామి దర్శనమీయగా గజేంద్రుని రక్షణ సమయంలో నున్న రూపములో దర్శనమివ్వమని కోరెను. వారి కోరికను మన్నించి గరుడవాహనా రూఢుడై వెలసి స్వామి తన భక్తుని కటాక్షించెను.

చక్రవర్తి తిరుమగన్ : పాండ్యనాడులో పండరము అను పర్వతము కలదు. అచట శశి వదనుడు అను ముని తపస్సు చేయుచుండెను. విశ్వామిత్రుని తపస్సు భంగపరచినటుల శశివదనుని తపము భంగపరచుటకై హైలై అను అప్సరసను ఇంద్రుడు పంపెను. శశివదనుడు హైలైను మోహించి ఆమె ద్వారా ఒక కుమారుని పొందెను, శశివదనుడు, హైలై కుమారుని ఒక గుహలో వదలి ఎవరి దారిన వారు వెళ్ళి పోయిరి. గుహలో యున్న తేనె తుట్టెల నుండి తేనె చుక్కలుగా శిశువు నోటిలో పడగా వాని ఆకలి తీరినది. తేనె త్రాగి పెరిగి పెద్ద వాడైన వానిని మధుమన్ అని పిలువసాగిరి. కాలక్రమంలో వానికి గార్గేయ మహర్షి దర్శనమొసగి బృందారణ్యములో తపము నాచరించిన శ్రీరామ సాక్షాత్కారము లభించునని ఆదేశించెను. మధుమన్ బృందారణ్యము చేరి తపము చేయనారంభించెను. వాని తపమునకు మెచ్చి శ్రీరామచంద్రుడు సతీ, సోదర సమేతంగా దర్శనమొసగెను. అటుల మధుమన్ తపఃఫలముగా శ్రీరామచంద్రులు నేటికీ మనందరకు యీ కోవెలలో దర్శనభాగ్యము కలిగించుచున్నారు.


2) తరువాత రెండవ (93 వ)దివ్యదేశాన్ని  స్థలశయన పెరుమాళ్ ని దర్శించాము 

ఉలగ ఉయ్యనిండ్రాణ్ పెరుమాళ్ -  నీలమంగై నాచ్చియర్ 

ఇది మహాబలిపురంలోని సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.  



పూదత్తాళ్వార్ అవతరించిన స్థలము.  



3). తిరువిడవేందై (92 వ దివ్యదేశం)

 శ్రీలక్ష్మీ ఆదివరాహస్వామి (నిత్యకళ్యాణ పెరుమాళ్) - కోమలవల్లీ తయార్


చెన్నైకి 47 కిమీ దూరంలో, మహాబలిపురానికి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి పెళ్ళికాని వారు వచ్చి స్వామిని దర్శిస్తే పెళ్ళి అవుతుంది అని అంటారు. అందుకే ఈ ప్రాంతానికి నిత్యకల్యాణపురి అని అంటారు.      

మొదటిరోజు 3 దివ్యదేశాలని (94, 93, 92)  దర్శించుకున్నాము.