Showing posts with label పర్వ దినములు. Show all posts
Showing posts with label పర్వ దినములు. Show all posts

April 30, 2024

నర్మదా స్తోత్రం

నర్మదా స్తోత్రం (నర్మదా పుష్కరాల సందర్భంగా)




రచన - శ్రీ సీ.ఎన్. నాగేశ్వర్రావు గారు


సంగీతం & గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి

వింధ్య మహాచల సాత్పుర శ్రేణి మహామరకంటక శైలసుతే, 
నర్మద కుండ సరోవర నిత్య జలాశయ లింగ మహజ్జనితే, 
ఋష్య మహీధర శృంగ తపస్థిత శంకర స్వేద మహోల్లలితే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 1 

‘కంకర కంకర శంకర శంకర’ సర్వ నదిస్థల శర్వమయే, 
బ్రహ్మ మురారి సదాశివ శాంకరి సర్వ సురాలయ దివ్య తటే, 
పాద పరిక్రమ యాత్ర సముద్యత భక్త మహార్చిత దేవి సురే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 2 

భూరుహ బంధుర కానన సుందర మండల గామిని నర్మ గతే, 
సాత్పుర వింధ్య ధరాధర శృంఖల మధ్య మహోద్ధృత వేగవతే, 
పశ్చిమ సాగర సంగమ కామిని, దివ్య తరంగిణి పుణ్య నదే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 3 

భారత, రామకథా, రఘువంశ శతాధిక కావ్య మహోల్లిఖితే, 
స్కంధ, సువిష్ణు, సుమత్స్య, సుకూర్మ, సుపద్మ పురాణ మహత్కథితే, 
మైకల కన్యక, రేవ, మహజ్జటశంకరి, దేవి, కృపా, సురసే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 4 

గంగ మహాసతి సంతత దర్శిత బ్రహ్మ చతుర్ముఖ అశ్రు ఝరే 
వామన, పిప్పల, పుష్కరిణీ, భృగు తీర్థ తటాధిక భక్త నుతే, 
భూధర నిర్జర భిన్న మహోపనదీ జల సంగమ చారు చరే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 5 

భారత పంచ నదీనద మానిత, హైహయ, వర్ధన రాజ్య తటే, 
పుష్కర ఘాట బృహత్తర, సజ్జలపాత సమున్నత రుద్రసుతే
పాండవ వాస గుహాలయ పర్వత దృశ్య మనోహార తీర యుగే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 6 

సోమ సముద్భవ, సూన సహోద్గమ, సుస్వన సుందర సత్సరితే, 
శంభు వరామర, దక్షిణ గంగ, తపస్విని యోగిని, పుణ్యమయే, 
ధార్మిక వేదిక శ్రాద్ధ కృతాలయ, నిర్మల వేణి మహా మహితే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే. 7 

రావణ బ్రహ్మ పరాజిత పూర్వ మహిష్మతి పట్టణ తీర ఘనే, 
అంధక సూదన శంకర కంటక శైలజ సుందరి మోక్షకరే, 
సంకట పాప విమోచన కారిణి, భక్తవశంకరి, ‘నాగ’ నుతే, 
మాతరుమాపతి నందిని, దివ్య మహానద నర్మద, శైవమయే.8

January 5, 2021

వైష్ణవ జనతో song తెలుగులో

మహాత్మా గాంధీ గారికి ఎంతో ఇష్టమైన పాట వైష్ణవ జనతో హిందీలో ఉంది ఆ పాటని ఆచార్య ఫణీంద్రగారు తెలుగులో అనువదించి మనకు అందించారు. నాకు చాలాబాగా నచ్చింది. అందుకే ఆ పాటని అతని అనుమతితో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.     

వైష్ణవ జనతో ... (తెలుగులో)

రచన : డా. ఆచార్య ఫణీంద్ర 

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -

వాడె గదా భువి - వైష్ణవుడనగ!


ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -

ఎరిగి, సహాయము నెవ్వడు సేయు -

చిత్త మహంకృతి చేరగనీడు -

వాడె గదా భువి - వైష్ణవుడనగ!


ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -

వాడె గదా భువి - వైష్ణవుడనగ!


సకల లోకుల గను సాదరంబుగను -

పరులను నిందల పాల్జేయకుండు -

బుద్ధి వాక్కర్మల శుద్ధిగ నుంచు -

తత్పురుషుని గను తల్లి ధన్యయగు!


ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -

వాడె గదా భువి - వైష్ణవుడనగ!


సమదృష్టి గలుగు - తృష్ణల త్యజియించు -

పర కాంతలను మాత పగిదిగ జూచు -

జిహ్వ యసత్యము చెప్ప దెప్పుడును -

అన్యుల ధనముల నంట డెప్పుడును -


ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -

వాడె గదా భువి - వైష్ణవుడనగ!


కామ మోహ క్రోధ కపట లోభముల

మునుగకుండ మదిని ముక్తిని గోరు -

రామ నామమును నిరతము ధ్యానించు -

తనువున పుణ్య తీర్థముల ధరించు -


ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు -

వాడె గదా భువి - వైష్ణవుడనగ! 

April 7, 2016

December 20, 2015

ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి)

ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి)

ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు
చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది
చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు
వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - ఆహార సమృద్ధి
జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - పాపములను హరిస్తుంది

ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి)
ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' కోరిన కోర్కెలు ఫలిస్తాయి

శ్రావణ శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి
శ్రావణ బహుళ ఏకాదశి - 'ఆజా' - రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ

భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి)       భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి - 'పాపంకుశ' - పుణ్యప్రదం
ఆశ్వయుజము బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి

కార్తీక శుద్ధ ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి
కార్తీక బహుళ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు)

మార్గశిర శుద్ధ ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
మార్గశిర బహుళ ఏకాదశి - 'విమలా' -(సఫలా) - అజ్ఞాన నివృత్తి

పుష్య శుద్ధ ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి)
పుష్య బహుళ ఏకాదశి - 'కళ్యాణీ' (షట్ తిలా) ఈతిబాధా నివారణం

మాఘ శుద్ధ ఏకాదశి - 'కామదా' (జయా) - శాపవిముక్తి   
మాఘ బహుళ ఏకాదశి - 'విజయా' - సకలకార్య విజయం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'ఆమలకీ' - ఆరోగ్యప్రదం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - 'సౌమ్య' - పాపవిముక్తి
(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్లవిషయంలో కొన్ని బేధాలున్నాయి.)

24 ఏకాదశులలోనూ - సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని "వైకుంఠ ఏకాదశి"గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సౌరమానం ధనుర్మాసం కాగా, అందువచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నరాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా --- కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.


ఏకాదశి ప్రాశస్త్యం                                   
భారతీయులకు ఉన్నన్ని పండుగలు ఇతర దేశస్థులకు లేవు. ప్రతీ పండుగలోనూ ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, ఆరోగ్యాది విశేషాలు లీనమై ఉంటాయి. వాటిని గుర్తించి, ఆంతర్యాన్ని గ్రహించి, ఆయా పండుగలు, వ్రతాలు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే ఐహికముష్మిక ఫలాలు సిద్ధిస్తాయి.

సర్వమూ కాలాధీనం. “కాలః కలయతా మహమ్” అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది. కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు. అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం, చాంద్రం, సావనం, నక్షత్రం – అని నలుగు విధాలుగా సూచించి, గణించడం జరిగింది. దక్షిణాదిలో సౌరచాంద్రమానాలే గణనీయాలు. మనం చైత్ర వైశాఖ మాసాలని, పాడ్యమి, విదియ తిథులని చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాము. చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు. సూర్యుణ్ణి ఆధారంగా – సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించి ఉండే నెలరోజులకూ ఆయా మాసంగా చెప్పబడుతుంది. సౌరమానం మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలినవై ఎక్కువ శాతం ఆయా తేదీలలోనే వస్తుంటాయి. కనుకనే తమిళులకు ఏప్రియాల్ ఒకటవ తేదీన మేషమాసం ఆరంభమై సంవత్సరాది అవుతుంది. “రవేః సంక్రమణం రాశౌ సంక్రాంతి రితి కథ్యతే” అనుటచేత ఒక్కొక్క మాసమూ ఒక్కొక్క సంక్రాంతి అవుతుంది. అదే విధంగా మకర సంక్రాంతి జనవరి 14 నుండి, కర్కాటక సంక్రాంతి జూలై 16 వరకు ఉత్తరాయణం... జూలై 17 నుండి జనవరి 13 వరకు దక్షిణాయనం అని అంటున్నాం.
“ఆయనే దక్షిణే రాత్రి రుత్తరే తు దివా భవేత్” అని కపింజల సంహిత వాక్యం. దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు మానవులకు ఒక సంవత్సర కాలమైతే, దేవతలకు ఒక అహోరాత్రమైన దినం. సూర్యుడు ధనూరాశిలో ఉండే మాసం ధనుర్మాసం. ఈ నెలలో ఉషఃకాలం చాలా ప్రాముఖ్యమైనది. “ధనుః సంక్రాంతి మారభ్య మాస మేకం వ్రతం చరేత్” అనుటచే ధనుర్మాసం నెలరోజులూ శ్రీహరిని విధిగా బ్రాహ్మీకాలంలో పూజించాలి. ఈవిధంగా ఆచరిస్తే

“కోదండస్థే సవితరి ప్రత్యూషః పూజయే ద్ధరిమ్
సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతి”

ధనుర్మాసంలో ఒక్కరోజు ఉషఃకాలంలో శ్రీహరిని అర్చిస్తే వెయ్యేళ్ళు నిత్యమూ అర్చించిన ఫలితం సిద్ధిస్తుంది. 30 రోజులు అర్చించేవారికి ౩౦ వేలయేళ్ళు అర్చించిన అనంత ఫలం లభిస్తుంది. అనంతుడిని అనంతంగా అర్చిస్తే అనంత ఫలమే సిద్ధిస్తుంది.

ధనుర్మాసం సౌరమాసానుసారం రాగా, శుక్లపక్ష ఏకాదశి చాంద్రమానమైన తిథి ప్రతీమాసంలోనూ రెండు ఏకాదశులు(శుక్ల-బహుళ) వస్తాయి. (అధికమాసంలో మరో రెండు అధికం) మొత్తమ్మీద సంవత్సరానికి 24 ఏకాదశులు. ప్రతి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. 

గృహస్థో బ్రహ్మచారీన ఆహితాగ్నిస్తథైవచ 
ఏకాదశ్యాం న భుంజీత పక్షయో రుభయోరపి 

బ్రహ్మచారి, గృహస్థుడు, నిత్యాగ్నిహోత్రుడు ఎవరైనా కావచ్చు, ఉభయ ఏకాదశులలో భోజనం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఇంత నిష్ఠతో కూడుకున్న ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమైనది.అందుకే ఏకాదశిని "హరివాసరం" అన్నారు పెద్దలు. 

మరో వృత్తాంతం ---- మధుకైటభులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్యరూపాలు ధరించి, దివ్యజ్ఞాన్నాన్ని పొంది, "దేవా ! వైకుంఠము వంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పూజ చేసి, నిన్ను దర్శించి, నమస్కరించి, ఉత్తరద్వారమార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీవైకుంఠప్రాప్తి కలిగించు" అని ప్రార్థించిరి. స్వామి "తథాస్తు" అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి "మోక్షోత్సవదినం" అని కూడా అంటారు. ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక "ముక్కోటి ఏకాదశి" అని పేరు(ముక్కోటి అనేది 33 కోట్లకు సంకేతమని అంటారు). వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక "వైకుంఠ ఏకాదశి", భగవద్దర్శనం కలిగిస్తుంది కనుక "భగవదవలోకనదినం" అని పిలుస్తుంటారు. 

సుకేతుడనే రాజు విశ్వేదేవతలా ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, భగవదనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడు. 

సకల పాపాల నుండి విముక్తి పొంది, శ్రీకైవల్యప్రాప్తితో జన్మరాహిత్యం చెందటానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతాచరణ లేదు. 

దేవదానవులు ఈ ఏకాదశిరోజున ఉపవాసంతో రాత్రింబవళ్ళు శ్రమించి, క్షీరసాగరాన్ని మధించగా, ద్వాదశినాడు మహాలక్ష్మీ సముద్రం నుండి ఉద్భవించి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది.

ఆనాటి నుండి ఏకాదశినాడు పగలు, రాత్రి ఉపవాసంతో ఉండి, జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృపవల్ల ముక్తి లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది. 

శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవకళ చంద్రునిలోకి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్రమండలం నుండి పదకొండవకళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకల వలెనే ఏకాదశి అనే పేరు సార్థకమైనది. "ఏకాదశ్యా ముపవస్యే న్న కదాచి దతిక్రమేత్" - ఏకాదశినాడు తప్పక ఉపవాసం చెయ్యాలి. ఉపవాసంనాడు "ఉపవాసః స విజ్ఞేయః సర్వభోగవివర్జితః" --- పాపకృత్యాలకు దూరంగా(చేయకుండా) ఉండి, సకలభోగాలను వదిలి, పుణ్యకార్యాలు చేయటమే ఉపవాసం అని పెద్దలమాట. 11 ఇంద్రియాలను(పంచ కర్మేంద్రియ+ పంచ జ్ఞానేంద్రియ + మనస్సులు = 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపచేయునదియే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈవ్రతాన్ని ఆచరించవచ్చు. ఎనిమిదేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు, ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు ఉపవాసం చేయాల్సిన పనిలేదని కొన్ని శాస్త్రాలలో పేర్కొనబడ్డాయి. 

ఏకాదశీ దేవి జననము 
పూర్వం కృతయుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురుడు' అనే రాక్షసుడుండేవాడు. దేవతలని జయించి, వేధించేవాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధం చేసి, అలసి, విశ్రాంతికై బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలో చేరి నిద్రించాడు. మురుడు శ్రీహరిని చేరి సంహరించడానికి సిద్ధపడగా, స్వామి శరీరంనుండి దివ్యతేజస్సులతో ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య దివ్యాశ్త్రాలతో యుద్ధంచేసి, మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని కన్యను, మరణించిన మురుణ్ణి చూసి ఆశ్చర్యపడినాడు. కన్య నమస్కరించి, జరిగినదంతా వివరించింది. సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి వరం కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో "దేవా ! నేను ఏకాదశినాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక ఈనాడు నా వ్రతం చేస్తూ,  ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుంచి తరించేట్లుగా వరమిచ్చి, అనుగ్రహించండి" అని ప్రార్థించింది. స్వామి "అట్లే అగుగాక" అని వరమిచ్చి, అదృశ్యమైనాడు. నాటి నుండి ఏకాదశీ వ్రతం భక్తితో ఆచరించేవారు సకలపాపాలనుండి విముక్తులై, విష్ణులోకాన్ని పొందుతారని ప్రశస్తి ఏర్పడింది. ఏకాదశి తిథికి అధిదేవత ఏకాదశీదేవి. ఈమె విష్ణు దేహము నుండి ఉత్పన్నమైనది కనుక, ఈమె స్త్రీమూర్తియైన మహావిష్ణువే. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసంఉంటుంది కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బ తీస్తుందని  అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఈరోజు గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు.

ఏకాదశీ వ్రత ప్రభావాన్ని వివరించే కథలు 

పుత్రద ఏకాదశి 
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ.... పూర్వం మహారాజు "సుకేతుడు" 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.

కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడు. 
ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టేక్కాడు. 
రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తినొందాడు. సకల దేవతా కృపాపాత్రుడైనాడు. మోక్షగామి అయినాడు. 
వైఖానసరాజు ఆచరించి పితరులకు ఉత్తమలోకప్రాప్తి చేకూర్చాడు. 
అంబరీషుని వ్రత ప్రభావం జగద్విదితమే.  
క్షీరసాగర మథనం - లక్ష్మీదేవి ఆవిర్భావం ఏకాదశినాడే జరిగింది. 

ఆధ్యాత్మిక స్ఫూర్తి 
వ్రతాలూ, పూజలూ అన్నీ ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై, జ్ఞానవిజ్ఞాన ఘనులై ముక్తులగుట కొరకే ఏర్పడిన విశిష్టసాధనాలు. ఆధ్యాత్మికతత్వం అంతర్లీనం కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధింపదు. సర్వకర్మలు జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయన్నది భగవద్గీత. కనుక వైకుంఠ ఏకాదశీ వ్రతంలోనూ ఆధ్యాత్మిక నిధి విధిగా ఉంటుంది. యథాశక్తిగా ఏకాదశి అంతర్గత తాత్విక ఆనందాన్ని ఆస్వాదిస్తాం.           

తాత్త్విక సందేశం
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు "నిహితం గుహాయాం విభ్రాజతే". అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం, ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

వైకుంఠ ఏకాదశి నాడు చేయవలసిన విధివిధానాలు                                    
ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటిఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి, శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పెద్దలు చెబుతున్నారు.

ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చేసిన పాపలు తొలగుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి మొదలైన వైష్ణవ ఆలయాలను దర్శించుకోవచ్చు.

వైకుంఠ + ఏకాదశి అర్థ వివరణ
వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ - ఏకాదశి అని రెండు పదాలున్నాయి. 'వైకుంఠ' - అంటే 'విష్ణువును', విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. 'చాక్షుషమన్వంతరం' లో 'వికుంఠ' అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠుడు" అయ్యాడు. వైకుంఠము - శ్వేతదీపమైన విష్ణుదేవుని స్థానం, పునరావృత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరమధామం. జీవులు వైకుంఠుడుని అర్చించి, ఉపాసించి, వైకుంఠానికి చేరుటే ముక్తి. ఇంద్రియాలు ఇంద్రియాధిస్ఠాన నారాయణున్ని సేవించుటే భక్తి కదా ! వైకుంఠము అంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం.    

"మనః షష్టా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి" - అంటే గీతావాక్యానుసారం మనస్సు+10 ఇంద్రియములు అనగా పదకొండు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా జీవాత్మ ఆకర్షిస్తుంది. అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాలను+ప్రాణాలను+బుద్ధిని కూడా తనతో తీసుకొని పోతుంది. జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు మొదటి శరీరం నుండి మనస్సుతో ఇంద్రియాలనూ ఆకర్షించి తీసుకువెళుతుంది. మనస్సంటే 'అంతఃకరణం'.
ఈ పదకొండు ఇంద్రియాలు వైకుంఠునికి అర్పింపబడి, వైకుంఠుడిని అర్చించి, సేవించి  ఉపాసించినప్పుడే అవి పవిత్రములై వాటిద్వారా సుఖానుభూతి పొందే జీవుణ్ణి వైకుంఠములో చేరుస్తాయి. కాగా "ఏకాదశేంద్రియాలను వైకుంఠార్పణం చేసి, వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తిని పొంది, ధన్యులవ్వండి - అని బోధిస్తుంది.          

"వైకుంఠ ఏకాదశి" - వికుంఠమంటే ... దెబ్బతిననిది. ఇంద్రియాలు "వికుంఠాలు" అయినప్పుడే వైకుంఠ సమర్చన ప్రశాంతంగా జరుగుతుంది.
ద్వాదశి - 12వ స్థితి. ఇదే ఇంద్రియాతీతదివ్యానంద స్థితి. ఏకాదశినాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం. ఒక వస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొక వస్తువు ఉంచినప్పుడే మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండవదానిపై ప్రభావం చూపిస్తాయి కదా ! అదేవిధంగా ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ  వైకుంఠునికి - ఉప = సమీపంలో, వాసః =నివసించటం వలన అత్యంత దగ్గర సాన్నిధ్య ప్రభావం కారణంగా, జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. అంతట జీవుడు శుద్ధుడవుతాడు.


 ఇంతటి ప్రభావసంపన్నమైన వైకుంఠ ఏకాదశినీ, ద్వాదశినీ భక్తిశ్రద్దలతో ఆచరించినవారికి పునర్జన్మ ఉండదు.      
సర్వేజనా సుఖినోభవంతు                        

October 19, 2015

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు





శరత్కాలంలో ప్రకృతి ఆరాధనతో ముడిపడిన పండుగ బతుకమ్మ వేడుక. బొడ్డెమ్మ సందడితో మొదలై 21 రోజులపాటు సాగే పువ్వుల పులకింత, సంస్కృతి సంప్రదాయాల పూలపుంత - బతుకమ్మ సంబరం. భాద్రపదమాసం చివరి రోజైన అమావాస్య మొదలు తొమ్మిదిరోజులపాటు కనువిందుగా ఈ పర్వం పరిమళిస్తుంది. సమిష్టితత్వం, సమైక్య జీవన సౌందర్య నేపథ్యంగా జానపదుల సందళ్ళు శోభిల్లుతాయి. ఆ పరంపరలోనిదే బతుకమ్మ ఆరాధనం. శిష్ట సంప్రదాయంలో ఉపాసనరీతిలో, మంత్రపూర్వకంగా శరన్నవరాత్రుల్ని నిర్వహించుకుంటారు. జానపదులు ఆటలపాటల అలరింతలతో ఈ వేడుకలని కొనసాగిస్తారు. 

అమ్మతల్లిని ప్రకృతి స్వరూపిణిగా, పూలమ్మగా పేర్చి బతుకమ్మగా పూజిస్తారు. ప్రకృతిని పూజించండి.... ప్రేమించండి ...... పరిరక్షించండి ..... అనే ఆత్మీయ సందేశ ఆలంబనగా ఈ వేడుకలు విలసిల్లుతున్నాయి. ప్రకృతిలోని పుష్ప వైవిధ్యాన్ని ఏకీకృతంచేసి అమ్మకు చేసే పుష్ప కైంకర్యం బతుకమ్మ వైభవం. 

తెలంగాణా ప్రాంతంలో మహాళయ అమావాస్య నుండి సాగే బతుకమ్మ వేడుకలు ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు ఆకట్టుకుంటాయి. పెద్దల అమావాస్య, ఎంగిలి పూల అమావాస్యగా వ్యవహరించే మహాళయ అమావాస్య నుండి ఎనిమిది రోజులు ఓ సిబ్బి(వెదురు అల్లిక పళ్ళెం)లో గుమ్మిడి ఆకులు పరచి, బతుకమ్మను పేరుస్తారు. గుమ్మిడి, తంగేడు, గునుగు, రుద్రాక్ష, బీర, గన్నేరు, బంతి, గోరింట, సొర మొదలైన పుష్పాలని క్రమపద్దతిలో అమరుస్తారు. 

ఈ పుష్పరాశిపై తమలపాకుల్లో పసుపు గౌరమ్మను ఉంచుతారు. 

పూలసోయగంతో పరిఢవిల్లే ఈ సముదాయమే బతుకమ్మ. ప్రకృతి రూపధారి బతుకమ్మను ఆడపడుచులు పసుపుకుంకుమలతో పూజిస్తారు. బతుకమ్మ చుట్టూ గుండ్రంగా  తిరుగుతూ సామూహికంగా పాటలని పాడుతుంటారు. 

నైవేద్యాలని సమర్పించి, ప్రతీరోజూ బతుకమ్మను దగ్గరలో ఉండే చెరువులలో నిమజ్జనం చేస్తారు. దుర్గాష్టమిరోజు జరిగేది పెద్ద బతుకమ్మ సంబరం. దీన్నే సద్దుల బతుకమ్మ అంటారు. ఆరోజు సిబ్బిలో కాకుండా ఇత్తడి పళ్ళెంలో బతుకమ్మను పేర్చుతారు. ఏటేటా పూలపోదరిళ్ళలోకి బతుకమ్మను ఆహ్వానించి, తమ ఊరువాడలని క్షేమంగా చూడమని ఆడపడుచులు ఆమెకు విన్నవించుకుంటారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి..ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. 

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో


బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట

ఒక్కొక్క వువ్వేసి [[చంద మామ||
ఒక జాము అయే [[చంద మామ||

రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
రెండు జాము లాయె ||చంద మామ||

బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది.. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

జానపదుల ఇలవేల్పు అయిన బతుకమ్మకు, నవరాత్రి సంబరాలకు సన్నిహిత సంబంధం ఉందని ఎన్నో గాథల ద్వారా వెల్లడవుతుంది. మహిషాసురిడితో యుద్ధంచేసి దుర్గమ్మ అలసి, సొమ్మసిల్లింది. లోకరక్షణ కోసం అవతరించిన దుర్గమ్మను స్త్రీలు సేదదీర్చి, తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి సేవలు చేసారు. ఆమె మనోల్లాసం కోసం  పాటలు పాడారు. తొమ్మిదోరోజుకు అమ్మకు అలసట తీరి, మహిషాసురిడిని వధించి, కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించింది. లోక శుభంకరిణిగా దుర్గమ్మ జనులకు కొత్త జీవితాన్ని, బతుకును ప్రసాదించింది. ప్రజలకు బతుకునిచ్చిన అమ్మ కనుక గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిలుస్తున్నారు.



దక్షప్రజాపతి వాళ్ళ అవమానం పొందిన సతీదేవి అగ్నికి ఆహుతయ్యింది. శివుడు ఆగ్రహించి, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. యజ్ఞగుండంలోపడి భస్మీపటలమైన సతీదేవికి ప్రతీకగా పసుపు గౌరమ్మను సృష్టించారు. అందరికీ బతుకునిచ్చేతల్లి ఆమె కాబట్టి సతీదేవే బతుకమ్మ అయ్యిందనేదే మరో కథ. 

చోళరాజు ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు ఓ ఆడ శిశువుగా జన్మించింది. అమ్మ ఆశీర్వాదంతో పుట్టిన ఆ బిడ్డ పదికాలాలపాటు బతకాలన్న ఆశతో పాపకు బతుకమ్మ(బతుకు+అమ్మ) అని పేరు పెట్టుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది. లక్ష్మీ పార్వతుల సమ్మిళిత స్వరూపంగా జానపదుల బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రకృతితో మమేకమై జీవన సరళిని జానపదులు కొనసాగిస్తారు. ఆ ప్రకృతే దైవంగా, దైవాన్నే ప్రకృతిగా పూజించే విశిష్ట పర్వం బతుకమ్మ సంబరం. 


                                                                                        -డాక్టర్ కావూరి రాజేష్ పటేల్                                                                             

August 7, 2015

ఉపాధ్యాయ దినిత్సవం

ఉపాధ్యాయ దినిత్సవం ....... (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి)
(జననం 05-09-1888 - 17-04-1975)


సుప్రసిద్ధ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, అసాధారణ మేధావి, విశ్వవిఖ్యాతి గాంచిన రచయిత భారతదేశ రాశ్రపటిగా (1962-67) పనిచేసిన ప్రజానాయకుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ కు దక్షిణపు సరిహద్దును ఆనుకొని తమిళనాడులో ఉన్న తిరుత్తనిలో ఒక తెలుగు కుటుంబంలో 1888 సెప్టెంబర్ 05న జన్మించారు. తిరుత్తనిలో హైస్కూలు విద్యనూ, నెల్లూరులో FA ను పూర్తిచేసి మద్రాసులో క్రైస్తవ కాలేజీలో  తత్వశాస్త్రంలో MA పట్టాను పొందారు. అనంతరం మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో 1909 న తత్వశాస్త్ర అధ్యాపకునిగా చేరి, 1918లో ఆ పదవిని వదులుకొని, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర శాఖా అధ్యక్షునిగా పనిచేసి, విద్యాబోధనలో అగ్రశ్రేణికి చెందిన ఆచార్యునిగా పేరు గడించారు. 1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో మానసిక, తత్వశాస్త్ర శాఖలకు ఆచార్యునిగా నియమితులయ్యారు. అదే సమయంలో "హిందూతత్వశాస్త్రము" అనే అర్థం వచ్చే పేరుతొ ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథాన్ని రచించారు. 1926లో Oxford University లో భారతీయ జీవిత దృక్పథంను గురించి ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. 1927లో 31వ భారతీయ తత్వశాస్త్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 

1929లో గ్రేట్ బ్రిటనులో మాంచెస్టర్ కాలేజీ (Oxford) రాధాకృష్ణన్ ను ఆచార్య పదవిలో నియమించి గౌరవించింది. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యలమునకు, 1939 నుండి 1948 వరకు కాశీలోని హిందూ విస్వవిద్యాలయమునకు ఉపాధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. ఆ పండితుని పదవీ నిర్వహణ కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిని అందుకొంది. 

నిర్భయతకు, స్వతంత్ర భావాలకు పేరుగన్న వారు రాధాకృష్ణన్. బ్రిటీషు ప్రభుత్వం ఆయనకు "సర్" అనే బిరుదునిచ్చి గౌరవించింది. అయినను భారతదేశమునందలి బ్రిటీషు పాలనను నిరాఘాటంగా విమర్శించి, గాంధీజీ నాయకత్వంలో సాగిన స్వాతంత్ర్య పోరాటాన్ని ఆయన సమర్థించారు. గాంధీజీ 75వ జన్మదినోత్సవం సందర్భంలో అభినందన గ్రంథ సంకలనమున రాధాకృష్ణన్ సారథ్యం వహించి, ఆ గ్రంథమును గాంధీజీకి సమర్పించెను. విశ్వకవి రవీంద్రుని కవిత్వ తత్వమును వివరిస్తూ బృహద్గ్రంథమును రచించి ప్రచురించెను. ప్రపంచ దేశాలన్నింటిని దర్శించి భరతవాణిని వినిపించి, ఆయన శ్రోతలను ముగ్ధులను కవించెను. 1946లో అంతర్జాతీయ వైజ్ఞానిక సమితిలో పాల్గొనిన భారత రాయబారమునకు ఆయన నాయకత్వము వహించెను. 

రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యునిగా ఆయన చేసిన ప్రసంగములు ఆయన రాజనీతిజ్ఞతకు, లౌకిక ప్రజ్ఞకు మచ్చుతునకలు. భారతదేశం స్వతంత్రతను ఆర్జించిన తరవాత, విజయలక్ష్మీ పండిట్ తరువాత రాధాకృష్ణన్, సోవియట్ దేశంలో, భారతదేశ రాయబారిగా నియుక్తులయ్యారు. ఆనాటి రష్యాకు అధినేతగా ఉండిన స్టాలిన్, రాధాకృష్ణన్ ఎదల అత్యంత మన్ననను ప్రదర్శించి, తన కార్యాలయమునకు ఆయనను 2సార్లు పిలిపించుకొని రాజకీయ సాంస్కృతిక విషయములను ఎన్నింటినో చర్చించెను. 

భారతదేశ తోలి ఉపరాష్టపతిగ రాధాకృష్ణన్ 1952లో ఎన్నికై 1962 వరకు ఆ పదవిని నిర్వహించెను. ఆ కాలంలో రాజ్యసభలో అధ్యక్షపీఠంలో ఉండి, సభా నిర్వహణలో ఆయన తన అసమాన చాతుర్యాన్ని ప్రదర్శించి, అన్ని రాజకీయ పక్షాల మన్ననలను ఆర్జించెను. అధ్యక్ష పదవి నుండి రాజేంద్రప్రసాద్ వైదొలగగానే, 1962లో భారతదేశానికి రాధాకృష్ణన్ అధ్యక్షునిగా ఎన్నుకొనబడి 1967 వరకు ఆ పదవిలో ఉండెను. ఆ పదవీకాలంలో భారతదేశం పలు సంఘటనలను ..... 1) భారతదేశపు సరిహద్దులపై చైనా దండయాత్ర, 2) పండిత జవహర్లాల్ మరణించడం, 3)భారతదేశంపై పాకిస్తాన్ దండయాత్ర. ---- ఎదుర్కొనవలసి వచ్చిననూ, వాటి నుండి భారత ప్రజాస్వామ్యం మొక్కపోకుండా బయట పాడటానికి రాధాకృష్ణన్ ప్రజాస్వామ్య నిరతి, భావ స్వాతంత్ర్యం, కార్యచాతుర్యం ఎక్కువగా తోడ్పడ్డాయి. 

రాధాకృష్ణన్ అసమాన వక్తగా పేరుగాంచారు. ఆంగ్లభాషపై అతనికిగల అభిమానం సాటిలేనిది. ఆంగ్లమే మాతృభాషగా కలిగిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ వంటి వక్తలు సైతం అతని పాండిత్యానికి, వచో విన్యాసానికి, ఆంగ్లభాషా పరిజ్ఞానికి ఆశ్చర్యపడ్డారు, పైన పేర్కొనబడినవేగాక రాధాకృష్ణన్ పండితుడు, ఇతర గ్రంథాలని చాలావాటిని ఆంగ్లంలోకి రచించారు. మాస్కోలో ఉన్నప్పుడు 'దమ్మపదము' పై వ్యాఖ్యానమును రచించెను. 'నాగరికతా భవిష్యత్తు' అను గ్రంథమును రచించి తన సహధర్మచారిణికి అంకితమిచ్చెను. తక్కిన రచనలో హైందవ జీవిత దృక్పధం - ప్రాక్పశ్చిమములు, గౌతమ బుద్ధుడు, గాంధీ, భగవద్గీత, ఉపనిషత్తులు ఎక్కువగా వ్యాప్తిని, ఆదరణను ఆర్జించాయి. 




దేశ సేవారంగమున ముఖ్యంగా విద్యారంగమున రాధాకృష్ణన్ చేసిన కృషికి కృతజ్ఞతను వెల్లడించుటకై ఆయన జన్మదినము అయిన సెప్టెంబర్ 05 ను అధ్యాపక దినోత్సవం(Teacher's Day)గా దేశం పాటిస్తోంది. ఆ మహామనిషి రాధాకృష్ణన్ 1975 ఏప్రియల్ 17న మద్రాసులో పరమపదించారు.                                                                 


November 11, 2014

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ



బాలల దినోత్సవం (నవంబర్ 14) అనగానే చాచాజీనే మనకు గుర్తుకు వస్తాడు. అతనికి పిల్లలు అంటే మహా ఇష్టం. ఐతే అతని ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అతని జీవిత విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం.




నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఒక కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను 'నెహర్' అంటారు. అలా వారికి నెహ్రూ అనే పేరు ఇంటిపేరుగా మారింది. నిజానికి వారి ఇంటిపేరు 'కౌల్'. 

నెహ్రూ తల్లిదండ్రులు మోతీలాల్ , స్వరూపారాణి. నెహ్రూ అలహాబాద్ లో స్కూలుకి వెళ్ళి చదివింది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడిక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటు చేశారు మోతీలాల్. ఒక విదేశీ టీచర్ నెహ్రూకు సైన్సు, ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. చాచాకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవే. కొడుకు కోసం మోతీలాల్ ఇంట్లోనే ఒక సైన్సు ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. 15వ సంవత్సరంలో నెహ్రూ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ ఎనిమిది సంవత్సరములు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్ తో వివాహము జరిగింది. 

నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె. ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్ర్యం కోసం నెహ్రూ పోరాటం చేసినప్పుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సి వచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేమి చెప్పాలి అనుకునేవారో వాటినన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాలని చదివి భద్రపరచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేది. ఆ ఉత్తరాలని "Letters from a father to his daughter" అనే పేరుతో పుస్తకంగా ముద్రించారు. 

నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ ఎప్పుడూ ఉంటుంది. అది పెట్టుకోవటం ఆయనకు ఎలా అలవాటైందంటే .... ఒకరోజు ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అది చూసి ఆనందంతో నవ్విన ఆ చిన్నారి అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగానే కనిపించాయంట. తనకు అంత ఇష్టమైన పిల్లల గుర్తుగా ఆ తరువాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు అయ్యిందని చెబుతారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లలను తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు.


నెహ్రూ పుట్టినరోజు చాలా వైభవంగా జరిగేది. అయన చిన్నతనంలో ఐతే ఆ రోజున కొత్తబట్టలు వేసుకునేవారు. ఎందఱో రకరకాల బహుమతులు తెచ్చి ఇచ్చేవారు. త్రాసులో ఒకవైపున నెహ్రూని కూర్చోబెట్టి, మరోవైపు అయన బరువుకి సరిపడే గోధుమలు మొదలైన ధాన్యాలు ఉంచేవారు. అనంతరం ఆ ధాన్యాన్ని పేదసాదలకు పంచిపెట్టేవాళ్ళు. ఆ రోజంతా వాళ్ళ ఇల్లు పండుగ రోజుగా ఉండేది. గొప్ప విందు జరిగేది. 'ఈ పుట్టినరోజు సంవత్సరానికి ఒక్కరోజు కాకుండా రోజూ ఉంటే ఎంత బాగుండును' అని అనుకొనేవాడంట బాల నెహ్రూ. 

జవహర్ అనే మాటకు రత్నం అని అర్థం. నెహ్రూ నిజంగానే రత్నం వంటివాడు. 'భారతరత్న' అనే బిరుదు ఆయనకు లభించింది. మన భారత ప్రభుత్వంవారు ఇచ్చే బిరుదులలోకెల్లా ఇది చాలా గొప్పది.


ఒకసారి జపానుకు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే అయన వారికీ ఒక ఏనుగును పంపించి, 'భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా' అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారంట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచిది. 

పిల్లలంతా బడికి వెళ్ళాలనేది చాచా కోరిక. ఒకసారి బాలల సినిమా చూసిన చాచాకు అందులో నటించిన ఏడేళ్ళ పాపని మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి 'థ్యాంక్స్' చెప్పడం కూడా రాలేదు. దానితో చాచాకు సందేహం వచ్చి పాపను బడికి పంపడం లేదా ? అని వాళ్ళ అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.

ఒకసారి ఢిల్లీలో స్కూలు పిల్లలు ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. దానికి ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు. పిల్లలు దానిని దూరం నుంచి చూసాక కళ్ళు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి. అదీ ఆట. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించటానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ ఆట ఆడినందుకు అక్కడున్న పిల్లవాడు రెండు అణాలు ఫీజుగా అడిగితె నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేసి, తన సహాయకులను అడిగి డబ్బు ఇప్పించుకొని ఆట ఆడినందుకు ఫీజు చెల్లించారట.

నెహ్రూ ప్రముఖ ప్రజా నాయకుడు. ప్రజలే దైవం, ప్రజాసేవే పరమాత్ముని సేవ, ప్రజలకు ఉపయోగపడే నాగార్జునసాగర్ వంటి ఆనకట్టలు, కర్మాగారాలు మొదలైనవి ఆయనకు పవిత్ర దేవాలయాలు. ప్రజలు కూడా నెహ్రూని తమ సొంత అన్నయ్యలా గౌరవించారు, ప్రేమించారు. అయన వెళ్ళిన చోటల్లా పిల్లలూ, పెద్దలూ తండోపతండాలుగా గుమిగూడేవారు. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా ప్రజల శ్రేయస్సునే మనస్సులో ఉంచుకోనేవారు. మనదేశంలో పెద్దపెద్ద పరిశ్రమలు త్వరితంగా వృద్ధి కావాలని, విజ్ఞానశాస్త్రం మూడు పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని బీదా బిక్కీ అనే భేదం లేని ఒక కొత్త సమాజం వెలుగులోకి రావాలనీ ఆయన ఆశించారు. అందుకు ప్రయత్నించారు కూడా. అన్ని దేశాల వారితోనూ, అన్ని మతాలవారితోనూ స్నేహంగా ఉండాలని  బోధించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నెహ్రూ గొప్ప మానవతావాది. మానవ శ్రేయస్సే ఆయన లక్ష్యం.


స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నెహ్రూ చాలాసార్లు జైలుకి వెళ్ళారు. జైలులో కాలాన్ని వృథా చెయ్యకుండా నాలుగు కాలాలపాటు నిలిచే గొప్ప పుస్తకాలు ఇంగ్లీషులో రాశారు. కాలాన్ని వృథా చెయ్యడమంటే ఆయనకు తగని అసహ్యం. లిఫ్టులో వెళుతూ కూడా ఆయన పుస్తకం చదివేవారంట. పుస్తకాలు చదవటం అంటే ఆయనకు అంత ఇష్టం, ఆసక్తి. "నేను నా జీవితంలో తగ్గించుకోలేకపోయిన పెద్ద ఖర్చు పుస్తకాలెన్నో కొంటూ ఉండడమే". అని ఒకసారి నెహ్రూ పేర్కొన్నారు.


నెహ్రూ కాంగ్రెసు పార్టీ అధ్యక్షునిగా చాలాసార్లు ఎన్నుకోబడ్డారు. ఆయన ఎంత గొప్ప రాజనీతి శాస్త్రవేత్తయో, అంతగొప్ప సాహితీవేత్త కూడా. ఆయన వ్రాసిన గ్రంథాలలో "గ్లింప్సన్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ" (ప్రపంచ చరిత్ర) "డిస్కవరీ ఆఫ్ ఇండియా". "ఆటో బయాగ్రఫీ" (స్వీయచరిత్ర) మొదలైనవి ముఖ్యమైనవి. వీటిని కనుక చదివితే అనేక విషయాలలో ఆయనకుగల గొప్ప పాండిత్యం మనకు తెలిసివస్తుంది. మనదేశంలోని వివిధ భాషలలోనూ అభివృద్ధి పరిచేందుకు 1954 లో 'సాహిత్య అకాడమీ' అనే ఒక సంస్థ స్థాపించబడింది. ఆ సంస్థకు తోలి అధ్యక్షునిగా నెహ్రూ ఎన్నుకోబడ్డారు. అప్పటినుంచీ మరణించే వరకూ ఆయనే అకాడమీకి అధ్యక్షునిగా ఉన్నారు. ఒకసారి ఆయన ఈ విధంగా అన్నారు, 'అకాడమీ అధ్యక్షుడినయిన నా కార్యకలాపాలలో భారత ప్రధానమంత్రి (అప్పట్లో ఆయనే ప్రధానమంత్రి) జోక్యం కల్పించుకోవటం నాకంత ఇష్టంగా లేదు.' సాహిత్యమంటే ఆయనకుగల అపారమైన ఆదర్శభావాన్ని పై వాక్యం స్పష్టం చేస్తుంది. ఒక్క సాహిత్యమంటేనే కాదు, విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.


మనదేశంలో అవతరించిన మహనీయుల్లో మహామనీషీ, 17 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశానికి ప్రధమంత్రిగా వ్యవహరించిన ప్రముఖులు. శాంతిదూత, ప్రముఖ రచయిత, నవభారత నిర్మాత, మానవతావాది, ప్రపంచ మహా పురుషుడు, రాజనీతి శాస్త్రజ్ఞుడు అయిన నెహ్రూ 1964 లో మే 27 న కాలధర్మం చెందారు.


చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవటానికి ఆ సంవత్సరం నుంచీ ఆయన పుట్టినరోజైన నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.    


చరిత్ర అంటే మానవుని ముందడుగు, మన మేధస్సు వికాసానికి పడే తపన, తెలిసిన తెలియని విషయాల వరకూ అన్వేషణ. ---- నెహ్రూ.