April 11, 2015

జొన్నవాడ కామాక్షిదేవి

జొన్నవాడ కామాక్షిదేవి


ఋషులలో సర్వశ్రేష్టుడైన కాశ్యప మహర్షి లోకహితం కొరకు పినాకిని నది ఒడ్డున ఒకదానికొకటి చేరువగా ఉన్న తల్పగిరి, రజితగిరి, వేదగిరి అనే కొండలు పవిత్రమైనవని తెలుసుకొని అక్కడే యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు.

యాగం ముగిసిన అనంతరం మల్లికార్జునస్వామి ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుడు ఒంటరిగా ప్రత్యక్షమైనందువల్ల కాశ్యప మహర్షి “స్వామి ! లోకహితం కొరకు తొందరపడి ఒంటరిగా వచ్చారే ! దేవి కూడా ప్రత్యక్షమైతే మహదానందం కలుగుతుంది” అని అన్నాడు.

పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షీదేవి ప్రత్యక్షమైంది. మహర్షి మల్లికార్జునస్వామిని, కామాక్షీదేవిని అక్కడే ప్రతిష్టించి పూజలు చేసాడు. ఆ సమయంలో తీర్థయాత్రలకు బయలుదేరిన దూర్వాసమహాముని రాజగిరికి చేరుకుని, మల్లికార్జునస్వామికి, కామాక్షీదేవికి నమస్కరించాడు. ముని రాకను గమనించలేదు శివుడు. అందుకు ఆగ్రహించిన ముని “”ప్రేమతో పిలవగానే వెంటనే ప్రత్యక్షమయ్యే ఈ ప్రదేశంలో ఆలయం యొక్క పుట్టుపూర్వోత్తరాలు లేకుండా పోతాయి” అని శపించాడు. ప్రళయం వచ్చి, పినాకిని నది ఉప్పొంగి, ఆ  ఉప్పెనలో మల్లికార్జునస్వామి, కామాక్షీదేవి విగ్రహాలు కొట్టుకుపోయాయి.  
          
కలియుగం:-
పచ్చని పైర్లతో, ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నవాడ ప్రదేశంలో పశువులకాపర్లు, తమ పశువులను మేపుతున్నారు. వారిలో ఒక చిన్నపిల్లవాడు భూమి నుండి ఏదో ప్రకాశాన్ని చూసాడు. అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం ఎంతో ప్రకాశవంతంగా కనిపించింది. వెంటనే ఆ బాలుడు పరుగెత్తుకొనివెళ్ళి గ్రామప్రజలను పిలిచుకొనివచ్చి ఆ శివలింగాన్ని చూపించాడు. ఉప్పెనలో కొట్టుకుపోయిన శివలింగం అని గుర్తించి ప్రజలు దానిని అక్కడే ప్రతిష్ఠించారు. స్వామితోపాటుగా దేవి కనిపించలేదని బాధపడ్డారు. మరికొద్ది రోజులలోనే ఆమె జాడ తెలిసింది వారికి. పినాకిని నదిలో చేపలు పట్టడానికి ఒకరు విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది. అది చూసి సంతోషించిన ప్రజలు స్వామి పక్కనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, వారు తినే చేపలు, మాంసములనే స్వామికి నైవేద్యం చేసేవారు. ఆ మాంసాహార నైవేద్యం అమ్మవారికి బాగా నచ్చినట్టుంది. దాంతో రాత్రిపూట బిగ్గరగా నవ్వుతూ, ఉగ్రరూపంలో  అరుస్తూ, సన్నిధి వదలి, ఊరిలోకి వచ్చి, ఆవులను, కొంగలను, కోళ్ళను చంపి ఆహారంగా తినేది. ప్రపంచాన్ని కాపాడవలసిన ఆ తల్లే ఇలా జీవరాశులను నాశనం చేయడం చూసి ఈ సంగతిని ఎవరికి చెప్పాలో తెలియక  ప్రజలు అయోమయంలో పడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరాచార్యులు వచ్చారు. మల్లికార్జునస్వామిని, కామాక్షిదేవిని దర్శించుకుని పూజించారు. ఆరోజు రాత్రి ఆ ఆలయంలోనే ఉండి ఉదయాన్నే బయలుదేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దేవి ఆదిశంకరుణ్ణి కూడా హింసిస్తుందేమోనన్న అనుమానంతో ప్రజలు భయపడ్డారు. అమ్మవారి గురించి, ఆమె మాంసాహార్రపీతి గురించి వారు ఆదిశంకరునికి తెలిపారు. ఆమె వెళ్లే మార్గంలో ఆదిశంకరుడు పడుకొని ఉంటే  ఆయన ప్రాణాలకు హాని జరుగుతుందని ప్రజలు వారించారు, జాగ్రత్తగా ఉండమనిచెప్పారు. ఆదిశంకరుడు ‘మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా చేస్తాను’ అని మాటిచ్చారు. 

అర్ధరాత్రి... దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయంనుండి బయటికి వెళ్లింది. దారిలో పడుకొని ఉన్న ఆదిశంకరాచార్యులనితప్పుకోమని హెచ్చరించింది. ఆదిశంకరుడు ఆ దేవినిప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు. ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి కోపం తగ్గసాగింది. ఆమె మొహం ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీ చక్రాన్ని స్థాపించారు. ఆ తర్వాత దేవిని చూసి ‘‘తల్లీ! భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై వికటాట్టహాసం చేయకూడదు. మాట్లాడకూడదు. ఆలయంనుండి బయటికి వెళ్లకూడదు’’ అని ఆంక్ష విధించారు. దేవి ‘‘నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరములివ్వడం, ఆశీర్వదించడం ఎలా’’ అని ప్రశ్నించింది. 

‘‘భక్తుల కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు. వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి, వారు సంతోషంగా జీవించడానికి సాయపడు’’ అన్నాడు ఆదిశంకరుడు.

కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది. తన సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకుని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని వరమిచ్చింది.


నెల్లూరునుండి 15 కిలోమీటర్ల దూరంలో వున్న జొన్నవాడలో శాంతస్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున వున్న మార్గంలో వెడితే పినాకిని నదికి వెళ్ళవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన మహిళా ద్వారపాలకులు కనిపిస్తారు. లోపలికి వెడితే విశాలమైన లోగిలి. 

దాన్ని దాటి వెడితే ముందుగా కల్యాణ మండపం వస్తుంది. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్థంభం ఉంటాయి.


ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దానిపక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే ఆలయమండపంలో చాలా స్తంభాలుంటాయి. ఆలయ పురాణం శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు. అర్ధమండపం తర్వాత వరసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీగణపతి, ఎడమవైపున చిన్న మహలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జునస్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం, వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్టు మనకు దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతులలో అంకుశం, పాశం ఉంటాయి. కింది రెండు చేతులలో ఒకటి అభయ హస్తంగాను, మరొకటి శరణాగతి పొందమని చూపినట్టు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీ చక్రం స్థాపించిన ఆది శంకరాచార్యుల వారు చేతిలో ఒక దండంతో దర్శనమిస్తారు. బయట ప్రాకారంలో గణపతి, వల్లి, దేవయాని సమేతుడైన సుబ్రహ్మణ్యస్వామి, పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపాలలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలుంటాయి. ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలలో పదిరోజులపాటు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి పెద్దఎత్తున ముత్తయిదువలు చేరుకుని పూజలు చేస్తారు.

కామాక్షి అమ్మవారి వార్షిక కళ్యాణం 

No comments:

Post a Comment