August 19, 2013

శ్రావణ పౌర్ణమి---హయగ్రీవ జయంతి----జంధ్యాల పౌర్ణమి --- రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం)

శ్రావణ పౌర్ణమి---హయగ్రీవ జయంతి----జంధ్యాల పౌర్ణమి --- రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం)

శ్రావణమాసంలో శ్రవణా నక్షత్రంతో కూడుకొని యున్న పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి, --హయగ్రీవ జయంతి----జంధ్యాల పౌర్ణమి --- రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం) అని వివిధ పేర్లతో చెప్పుకుంటూ ఉంటారు. 

హయగ్రీవ జయంతి

జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే || 

వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||

శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకేల్ల ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతరము". ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని(శ్రీమన్నారాయణుని) ఉఛ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేముడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైఠభులు అనే రాక్షసులు అవతరించి, తమజన్మకారకులెవరో తెలియక మూల ప్రకృతియైన ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరిరి. జగన్మాత అట్లు జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి వలన వరం పొందిరి.


వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైఠభులు బ్రహ్మ వద్ద నుండి వేదములనపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాగియుండిరి. మధ్య మధ్య బ్రహ్మను యుద్దమునకు రమ్మని బాధించు చుండిరి. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టె బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవిష్ణువుకి మొరపెట్టుకొనెను. నారాయణుడు బ్రహ్మ ప్రార్థనను విని, తనదివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, "ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదములను తెచ్చి నీకు అప్పగించెదను. వేదములందిన తరవాత సృష్టిని ప్రారంభించుము. అంతవరకూ నన్ను ఆరాధించుము" అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపెను. 

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్ఛ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన అశ్వముఖధారి అయినటువంటి "హయగ్రీవ స్వామి" అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదములను, వేదవిద్యలను ఉద్ధరించి, బ్రహ్మకప్పగించెను. వేదాధిపత్యమును బ్రహ్మకును, సకలవిద్యాధిపత్యమును సరస్వతికిని అప్పగించెను. అప్పటినుండి బ్రహ్మ వేదప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యెను. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.


ఈ హయగ్రీవ జయంతి నాడు విద్యార్థులు ఈ స్వామిని పూజించినచో మంచి విద్యావంతులు కాగలరు.


జంధ్యాల పౌర్ణమి

శ్రావణ పౌర్ణమి నాడు యజ్నోపవీతధారులందరూ నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. ఎందుకంటే సంవత్సరం అంతా ఏమైనా గాయత్రీ జపలోపం జరిగినా, అనుష్టాన లోపాలేమైనా ఉన్నా వాటికి ప్రాయశ్చిత్తంగా  ఉపాకర్మ చేసి నూతన యజ్ఞోపవీతధారణ జరుపుతారు. 

విద్యాధిపతి హయగ్రీవుడు కనుక వేదవిద్యను అభ్యసించేవారు స్వరలోపం, ఉచ్ఛారణ లోపం జరిగినా దాని ప్రాయశ్చిత్తార్థం గురుహోమం, ఉపాకర్మ జరిపి యజ్ఞోపవీతధారణ చేస్తారు. 

ఉపవీతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే. అనుపవీతుల రక్షలూ దారపు పోగులే. స్త్రీల వ్రత తోరాలూ దారపు పోగులే. మంగళ సూత్రాలూ దారపు పోగులే. ఇలా హిందువు ఎంతటి వారైనా ధర్మం కోసం దారపు పోగుకి కూడా జీవితాంతం కట్టుబడి ఉంటారనే ఉదాత్త భావం ఈ పర్వ దినాల్లో ఇమిడి ఉంది.  







రాఖీ పౌర్ణమి (రక్షా బంధనం)

 రక్ష కట్టుకునేటప్పుడు చదివే  శ్లోకం:-- 

“యేన బద్ధో బలీ రాజా – దానవేంద్రో మహాబలః
తేనత్వాం అభి బధ్నామి – రక్షే మాచల మాచల”

భావం:--
ఓ రక్షబంధమా ! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను.

రాఖీ కట్టే విధానం---పళ్ళెంలో రాఖీ, కుంకుమా, కర్పూరం, స్వీట్స్, మొదలైనవి ఉంచుతారు. సోదరునికి నుదుట బొట్టుపెట్టి, హారతిచ్చి, రక్షకట్టి, తీపి తినిపిస్తారు. సోదరుడు అప్పుడు అక్కచెల్లెళ్ళకు బహుమతులు ఇస్తారు.            

రక్షాబంధన్ కు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉంది.  ఈ రోజు రాఖీ పండుగను సోదరసోదరీమణుల అన్యోన్యతకు గుర్తుగా జరుపుకుంటారు. అక్కచెల్లెళ్ళు తమ సోదరుల నుండి రక్ష కోరుతూ, సోదరులకు రక్ష కడతారు. పదికాలాలు తమను చల్లగా కాపాడమని కోరుకుంటారు. ఇంతే కాక ఈ రక్షవలన సోదరునికి అపమృత్యుదోషాలు పూర్తిగా తొలగింపబడుతాయని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సుఖ సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ కూడా ఈ రక్ష కడతారు. తమ క్షేమాన్ని ఎల్లపుడూ కోరుకునే సోదరీమణులకు, సోదరులు తమ శక్తి కొలది బహుతములు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.దీనికి రక్తసంబంధంతో పనిలేదు, ఎవరైనా సరే, తన సోదరుడిగా భావించుకునే సోదరి కేవలం రక్షాబంధనంతో ఆ బంధాన్ని శాశ్వితం చేసుకుంటుంది. 

"సర్వ రోగోపశమనం సర్వాశుభ వినాశకమ్
సకృత్కృతే నాబ్దమేకం యేన రక్షా కృతాభవేతీ"

పూర్ణిమ రోజున కట్టిన రక్షా సూత్రం సమస్త రోగాలను, అశుభాలను నశింపజేస్తుంది. ఏడాదిలో ఒకసారి దీనిని ధరిస్తే సంవత్సరమంతా రక్షణ లభిస్తుంది. జన్మతః సోదరులు కాని వారందరినీ ఏకత్రాటిపైకి తెచ్చే సౌభ్రాతృత్వం ‘రక్షాబంధన్’లో ఇమిడి ఉంది.










పౌరాణిక చరిత్రలు

(1)

శ్రీకృష్ణుడికి ఒకసారి మణికట్టు వద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర పమిటకొంగును చింపి, కట్టుకడుతుంది. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని చీరలాగుతుండగా శ్రీకృష్ణుడు తన శ్రేయస్సు కోరిన సోదరికి నిండుసభలో అవమానము జరగకుండా చీరలను ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడేడు. ఇంకా వివిధ సందర్భాల్లో ఆమెకు రక్షణను కలిగించేడు.  


(2)

వామనుడిగా వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి తొక్కగా, అతని మనవి మేరకు రాజ్యానికి రక్షగా అక్కడే ఉన్నాడట. లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని బ్రహ్మణ స్ర్తి రూపంలో పాతాళానికి వెళ్లి శ్రావణ పౌర్ణమి రోజునే బలికి రక్ష కట్టగా, దీంతో ఏమి బహుమతి కావాలో కోరుకోమని చక్రవర్తి  అడుగగా,  వెంటనే మహాలక్ష్మి తన నిజస్వరూపంలోకి వచ్చి తన స్వామిని విడిచి పెట్టాలని కోరుతుంది. దీంతో బలిచక్రవర్తి,  శ్రీహరిని విడిచిపెడతాడు. 


చారిత్రక కథనాలు

(1) 

గ్రీకు దేశస్తుడు అలేగ్జాందర్ భార్య , మన భారత దేశమును పరిపాలిస్తున్న రాజైన పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. ఇది ఆ దేశపు రాచరిక సాంప్రదాయము.అన్నా చెల్లెళ్ళ సంబందమును నిశ్చయముగా తెలియ చెప్పే పండుగ.
(2)

కర్ణావతి అనే మహిళ చిత్తోర్‌గడ్‌ రాణిగా ఉండేవారు. భర్త అకాల మరణంతో రాజ్యభారం ఆమె మీద పడుతుంది. అది అవకాశంగా భావించిన గుజరాత్‌ సుల్తాన్‌ బహుదూర్‌ షా చిత్తోర్‌ గడ్ పై తన సేనలతో దండెత్తుతాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి సాయం కోరుతూ మొఘల్‌ చక్రవర్తి అయిన హుమాయూన్‌కు ఒక రాఖీని పంపి తనను, తన రాజ్యాన్ని రక్షించమని కోరింది. ఈ రాఖీతో కర్ణావతిని తన సోదరిగా భావించి చక్రవర్తి ఆమెకు అండగా నిలువడమే కాకుండా బహుదూర్‌షాను యుద్ధంలో ఓడిస్తాడు. 

ఈవిధంగా దేశం నలుమూలలా కులమతాలకతీతంగా అందరూ ఎంతో ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది.  


సోదరులందరకు రాఖీ (రక్షాబంధన) శుభాకాంక్షలు  

6 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు సుబ్బారావ్ గారు __//\\__

      Delete
  2. Very Good information, timely given, thanks madamji

    ReplyDelete
  3. చక్కటి విషయాలు తెలిపారు. కృతఙ్ఞతలు .

    ReplyDelete