February 27, 2014

మహాశివరాత్రి జాగరణ

మహాశివరాత్రి జాగరణ

జాగరణ అంటే నిద్రని మాని(వదిలేసి) మెలకువగా ఉండటం అని అర్థం. తప్పులు అనేవి శారీరకంగా, మానసికంగా చేయకుండా ఉండటాన్ని మెలకువ అని అంటారు. మెలకువగా ఉన్నవారు, ప్రమాదాలు లేకుండా,(చేయకుండా) వారి  గమ్యాన్ని చేరుకున్నట్టుగా ..... మానసికంగా మెలకువగా ఉన్నవారు, ఎటువంటి దోషము చేయకుండా - జీవనగమ్యాన్ని చేరుకుంటారు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉంటే, శారీరకంగా మెలకువని ఇవ్వవు, జాగరణ చేయనియ్యవు. అదేవిధంగా మానసికంగా ఉన్న తమకం - గర్వం మొదలైనవి మానవునికి మానసికంగా మెలకువని ఇవ్వవు. కనుక శరీరానికి మెలకువని ఇచ్చుటకు ఉపవాసం మరియు భగవంతుని సాన్నిధ్యం చాలా అవసరం అని పెద్దలు చెప్పారు. ఆ విధంగా ఉంటే మానసికంగా మెలకువ - గర్వము లేకుండా ఉండటం - వినయంగా ఉండటం అలవడతాయి. అందుకే జన్మనికి ఒక రాత్రి అయినా శారీరిక వికారాలని, మానసిక వికారాలని, అదుపులో ఉంచుకుంటూ, స్వచ్ఛతని పొందితే.....శివము - శుభము కలిగే రాత్రిని 'శివరాత్రి' అని అంటారు. అంటే  మానవుడు తన జీవితంలో సంవత్సరానికి ఒకసారైన మాఘమాసంలో ...మాఘవ్రతాన్ని చేసి, ఒక శివరాత్రి ఐనా ఉపవాసం - జాగరణ ఉండి, పూజ చేసినట్లయితే త్రికరణాల పరిశుద్ధత కలిగి, తరిస్తాడు అని అంటారు. ఆ విధంగా చేయకపోతే శరీరానికి బాధ, శ్రమ తప్పించి మరేమీ లభించదు. మనం ఈ లోకాన్ని - ముఖ్యం (పగలు) అనుకొని అనుకోకుండా కొన్ని కొన్ని తప్పులను చేస్తాము. ధర్మాన్ని - జ్ఞానాన్ని (రాత్రిని) నిర్లక్ష్యం చేస్తాం. అశాంతికి గురి అవుతాము. కానీ ధార్మికులు జ్ఞానాన్ని (పగలు) ముఖ్యం అనుకొని .... ఈలోకధర్మాలని (రాత్రి) అనుకొని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ధర్మం -జ్ఞానం ముఖ్యం అనుకోవటం వలన శాంతిని పొందుతున్నారు. అజ్ఞానులు పగలు అనుకునేది విలువైనది ఇహలోకసుఖం --- రాత్రి అనుకునేది జ్ఞానం. జ్ఞానం జ్ఞానులకు పగలుగా - ఇహలోకం రాత్రిగా ఉంటుంది.

                            

No comments:

Post a Comment