April 22, 2014

మానవ ధర్మం --- మన ధర్మం

మానవ ధర్మం --- మన ధర్మం

అన్ని జన్మలలోనూ మానవజన్మ ఉత్తమమైనది. అలంటి జన్మను పొందటం ఆజీవి చేసుకున్న పుణ్యఫలం.

"ప్రాణినాం నరజన్మ దుర్లభం" , "దుర్లభో మానుషోదేహః" , "నరత్వం దుర్లభంలోకే". అనే ఆరోక్తులు మానవజన్మను పొందటం ఎంత అదృష్టమో వివరిస్తున్నాయి. మంచి, చెడులను తెలుసుకొనే విచక్షణాజ్ఞానం , ఆపదల నుండి విముక్తిని పొందే ఆలోచనాశక్తి, సమస్యలను పరిష్కరించుకొనే మేధాశక్తిని కల్గిన మానవుడు ఐహిక ఆనందంతో పాటు పారమార్థిక శ్రేయస్సును కూడా పొందాలి.

"ఆహార నిద్రాభయమైధునంచ సమాన మేతత్ పశుభిర్నరాణం l
ధర్మోహితేషామధకోవిశేషః ధర్మేణహీనా పశుభిస్సమానాః  ll"                    

ఆహారాన్ని స్వీకరించటం, నిద్రించటం, భయాందోళనలు చెందటం , సంతానాన్ని పొందటం, వంటివి, పశువులకు -- మనుష్యులకు సాదృశ్యధర్మాలే. తన ధర్మాన్ని తెల్సుకోవటం,  ఆచరించి జన్మను సార్థకం చేసుకోవటమే మనిషి విశిష్టత.

ఒకనాడు ఒకయోగి పుంగవుడు నదీతీరాన వెడుతూ ఉండగా, ఒక తేలు నీళ్ళలో కొట్టుకొనిపోతూ ఉంది. దానిని చూచినా ఆ యోగిపుంగవుడు తన చేతిని చాచి, నీళ్ళనుండి రక్షించే ప్రయత్నం చేసాడు.  ఆ తేలు అతన్ని కుట్టింది. వెంటనే బాధతో నీళ్ళలోకి వదిలేశాడు. మళ్ళీ అదే రీతిలో తేలుని రక్షించే యత్నం చేయగా మళ్ళీ అది  అతనిని కుట్టింది. మళ్ళీ వదిలేశాడు. ఇలా నాలుగైదుసార్లు చేస్తూ ఉండగా, ఒక బాటసారి ఆ యోగిని చూసి "ఆర్యా ! మీరు జ్ఞానుల వాలే ఉన్నారు. ఆ తేలు మళ్ళీ మళ్ళీ కుడుతూ ఉన్నా మూర్ఖంగా అదే ప్రయత్నాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు ???" అని అడుగగా,  అపుడు ఆ యోగి  "నాయనా ! కుట్టటం దాని ధర్మం ---- రక్షించటం మనధర్మం కదా ! దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తోంది.  ధర్మాన్ని నేను ఎలా విడిచిపెట్టగలను???" అని సమాధానం ఈయగా , ఆ బాటసారి మానవధర్మంలోని అంతరార్థాన్ని తెల్సుకొని వెళ్ళిపోయాడు.

ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి అన్న అర్థం ఈ క్రింది శ్లోకంలో మనకు తెలుస్తుంది.

ధర్మాధర్థం ప్రభవతే ! ధర్మాత్ ప్రభవతే సుఖం !
ధర్మేణసాధ్యతే సర్వం, ధర్మ సంసారమిదం జగత్ ll

ధర్మాచరణ వలన అర్థ ప్రాప్తి , ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మము యొక్క సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. ఆదర్శపుత్రునిగా గరుక్మంతుడు మాతృసేవలో తన పుత్రధర్మాన్ని ఆచరించి "మాతృదేవోభవ" అన్న మంత్రానికి సార్ధక్యం చేకూర్చాడు. తండ్రికోరిక మేరకు బ్రహ్మచర్యం ద్వారా భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు "పితృదేవోభవ" అన్న మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపాడు. "ఆచార్యదేవోభవ" అన్న మంత్రాన్ని ఆరుణి, ఉపమన్యుడు, ఉరంకుడు అనే ఆదర్శ శిష్యులు.   "అతిధిదేవోభవ" అన్న మంత్రాన్ని రంతిదేవుడు, రఘుమహారాజు , మానవులుగా ఆచరిస్తే, కపోతము తన జీవితాన్ని అర్పించి, గృహస్థు ధర్మాన్ని నిరూపించింది.

ఓం తత్ సత్                                          


No comments:

Post a Comment