April 24, 2023

కపాల మోక్షం

కపాలమోక్షం - 01

నా ఏడుపే నా తొలి సాధన – గురువు

అది 1977వ సంవత్సరంలో …ఒకసారి దివిసీమ ఉప్పెన వచ్చినపుడు నేను పుట్టలేదు...మళ్ళీ రెండవసారి వచ్చినపుడు నాకు 12 సం!! రాల వయస్సులో అనగా అది 1990వ సంవత్సరంలో మే నెలలో 4 - 10 తేదిలలో … మళ్ళీ దివిసీమ తుఫాను భీభత్స రోజులు…. చీకటి రోజులు….. అన్నమును పండించే అన్నదాతలు అన్నం కోసం పరితపించే భయంకర రోజులు…… బయటకి వెళ్లిన వారు కాడికి కి వెళ్తున్న రోజులు … అన్నం కోసం, పాడిపంటలు, పశువులు కోసం పరితపించే లాగా మారిన రోజులు… ఇలా 7 రోజులు 7 యుగాలుగా గడిపిన రోజులు ….మా నాన్న పని చేసిన శివాలయంలో అన్నదాతల అన్నం కోసం ప్రయత్నాలు ఒక పక్క…. నా అనే వాళ్ళు పోతున్నారని బాధ మరోపక్క …. మరోప్రక్క ఆస్తులు పోతున్నాయని…. జీవన ఉపాధి మార్గాలు మూసుకుని పోతున్నాయని… బతుకులు గల్లంతవుతుందని ఆర్తనాదాలు …. ఇలాంటి ఆవేదనల ఆర్తనాదాలు మధ్య నాకు శివాలయంలో 12 సంవత్సరాల వయస్సులో చిన్న పూజారిగా ప్రవేశ మార్గం ఏర్పడింది!

గుడిలో ఉన్న శివలింగం మాట్లాడదు ! ఎందుకు ఈ జలప్రళయము జరిగిందో తెలియదు? తెలియని వయసులో ఏదో తెలియని తపన మొదలైంది! ఏదో చెయ్యాలని…. ఏదో తెలుసుకోవాలనే తపన మొదలైంది! శవాలుగా మార్చేసిన శివయ్య మీద శివతాండవం మొదలైనది! మా నాన్న ఒక చీపురుకట్ట చేతికిచ్చి గుడిని శుభ్రం చేయమని మొట్టమొదటి పనిగా అప్పగించారు! శుభ్రం చేయవలసినది గుడి ని కాదని గుడిలో ఉన్న లింగమూర్తి ని అని సంకల్పించాను! దైవంగా చెప్పుకుంటున్న.... పూజలందుకుంటున్న… పుష్టిగా నైవేద్యాలు తింటున్న ….శివలింగ మూర్తిని ప్రశ్నించాలని నాలో నేను ఎదురు తిరిగాను! ఏ పాపం చేశారని ఇంతమందిని బాధ పెట్టినాడు? సృష్టించడం ఎందుకు? నాశనం చేయడం ఎందుకు? మమ్మల్ని సృష్టించమని అడిగామా ? నన్ను సృష్టించమని అడిగానా ? నన్ను బాధ పెట్టమని చెప్పామా? జననాలు మరణాలు ఇవ్వమని అడిగానా? నాశనం చేసే కాడికి మమ్మల్ని ఎందుకు సృష్టించావు? నీకు కళ్యాణ మహోత్సవాలు …మాకు బాధలు నరకయాతనలు…. నా నా చంకలు నాకి మేము కష్టపడి సంపాదించిన వాటిని నేనే ప్రసాదించాను కదా… నాకు ఇవ్వమని అడగటం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అడుక్కునే వాడిదగ్గర గీరుకునేవాడివి నువ్వు… మనస్సులేని రాయి నువ్వు ….చలనములేని బండరాతివి నువ్వు…. అందుకే నిన్ను శిలగా తయారుచేసి శిలువ గా బంధించి శిలాఫలక సమాధులు చేసినారు కదా! నేను అడిగిన వాటికి సమాధానం చెప్పలేని మౌన బ్రహ్మం గా ఉన్నావు! ఏమీ తెలియనట్లుగా ఏమీ జరగనట్లుగా ఉండటానికి మౌన ముద్ర లో ఉండి ఎవరిని ఉద్ధరించాలి ! ఉద్ధరణ చెయ్య లేని వాడికి …. లేనివాడికి… గుడిలో ఎందుకు పూజలు? ఎందుకు ప్రసాదాలు? ఎందుకు నువ్వు లేని కాడికి మమ్మల్ని కాడికి పంపించే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అసలు నన్ను సృష్టించింది ఎవరు ?ఎందుకు సృష్టి? సృష్టి నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు?

ఏమయ్యా! శివయ్య ! నాకన్నా ఎన్నో కోట్ల మందిని సృష్టించావు! వారికి నవరసాలు… నవ భక్తులు… నవ సిద్ధులు… నవమాసాలు ఇచ్చి లాలించి పాలించి చేసినావు కదా! మళ్ళీ ఏదో కొరతగా నన్ను ఎందుకు సృష్టించావు? ఇంతకుముందు చేసిన పని నేను చేసినదే కదా! చేసిన పనిని ఎన్నాళ్ళు చేస్తావు! చూస్తావు! ఆనంద పడతావు! మేము బాధలో ఉంటే ఆనందపడతావు! మేము సుఖాల్లో ఉంటే బాధ పడతావు! బాధల్లో గుర్తుకు వచ్చేలాగా చేసుకుంటావు! ఆనందంలో మరిచిపోయేలా చేస్తావు! అసలు నీవు చూసిన నాటకం ఎన్ని సార్లు చూస్తావు! దేవయ్య ..జంగమయ్య.. నీకు విసుగు అనిపించదా? విరక్తి కలగడం లేదా? అయినా నా పిచ్చి గాని నీకు నిజంగా వైరాగ్యం ఎప్పుడు వచ్చినది! మన్మధుడు ని చంపి కామముని జయించావు అంటావు! అమ్మ కనపడితే మోహం కలిగింది అని అంటావు! నీలాంటి చపలచిత్తుడుని నేను ఇంతవరకు చూడలేదు! నువ్వు గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేసే వాడివి! నువ్వు ఓ పక్క నీతులు చెబుతావు! మరొక పక్క వాటికి గోతులు తీస్తావు! అసలు నువ్వు ఉన్నావో లేదో తెలియని వారితో వాదించి కూడా దండగ! నీకు దండాలు పెట్టటం.. దండలు వేయటం కూడా దండగ ! పనికి మాలిన ధర్మాలు పెట్టించి జ్ఞాన కాండను కాస్త కర్మకాండ గా… దీనిని భక్తి కాండ గా మార్చి వేసుకుని నీకు నీవే విధాత గా… విలయ కర్తగా… లోకానికి ప్రచారం చేసుకున్నావు! చేసుకునే విధంగా ప్రచారం చేసుకుంటున్నావు! అడిగిన వాడిని రాక్షసుడు అంటావు! అడగని వాడిని భక్తులు అంటారు! ఇంకా ఎన్నాళ్లు సాగుతాయో నీ నాటకాలు నేను చూస్తాను కదా అంటూ ఆవేదన కన్నీళ్ళ రూపంలో శివ లింగ మూర్తి మీద నా కన్నీటి ధార కాస్త లింగ ధార గా అభిషేకం చేయబడినాయి! నా ఆవేదనే నా ఏడుపే…. నా ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికి ఆనాటి నుండి నాంది అయినాయి! సమాధానం లేని ప్రశ్నలు వెంటపడి ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు అయినాయి! నా ఏడుపే నన్ను ఓదార్చి సమాధానం లేని ప్రశ్నలు… ప్రశ్న లేని సమాధానం చూడాలనే తపన కసి నాలో తొలి గురువు గా ప్రోత్సహించినది! సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నాకు హితబోధ చేసింది! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

కపాలమోక్షం - 02

సాధన సాధ్యతే సర్వం సాధ్యం

వ్రాయటానికి ఈ వాక్యం చాలా బాగుంటుంది! చదవటానికి ఉత్సాహానిస్తుంది! ఆచరించే సమయానికి నాకు ఈ వాక్యం చాలా కష్టాలు ఇచ్చినది! ప్రశ్నించడం బాగానే ఉంది! ప్రశ్న లేని సమాధానాలు నాకు ఎవరు చెబుతారు? ఎలా చెబుతారు? నాకు తెలియటం లేదు! ప్రశ్నించే జీవుడికి తెలియటం లేదు? సమాధానం ఇచ్చే శివుడు చెప్పడంలేదు? రాను రాను నాలో తెలియని ఆవేదన, ఆవేశం, ఏదో చేయాలనే తపన, ఏదో తెలుసుకోవాలని తాపత్రయం, ఏమి తెలుసుకోవాలో… ఎలా తెలుసుకోవాలో తెలియనితనము నన్ను వెంటాడింది! సమాధానం లేని ప్రశ్నగా నా ముందు అడ్డంగా వచ్చినాయి! ఈ ఆవేదన చింతగా మారి చితికి తీసుకుని వెళ్తుంది తప్ప …. ఆవేదన నుండి బయటపడి ఆవేశమును తగ్గించుకునే మార్గం చూడాలని అనిపించింది! అందుకు భక్తిమార్గమే దోహదపడుతుందని…. అసలు ఉన్నాడో లేడో తెలియని శివుని చూడాలనే తపన మొదలైంది!

ఆనాటినుండి ఇష్టము లేని శివలింగారాధన మొదలయింది! మంత్రాలు, పూజలు మొదలైనాయి! లింగమూర్తి లోకంలో లేడు… దేవుడు లేడు అని లోకానికి తెలియజేయాలని… శివుడు లేడు అంటూనే మరో పక్క శివుడు ఉన్నాడని చెబుతున్నాని తెలియని నా అమాయకత్వం పూజ మొదలైంది! కోరికలు లేని శివలింగారాధన ఆరంభమైంది! నాకు తీరని కోరికలు ఇప్పటికే చాలా ఇచ్చినావు! వాటిని తీర్చలేక… తీర్చుకోలేక నానా అవస్థలు పడుతున్నాను! నా ఇష్ట కోరిక ఏమిటో నీకు తెలుసు! దానిని తీర్చు! అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకు అగుపించు! రూపం లేని నా మనస్సు రూపం ఉన్న నిన్ను కోరుతుంది! దాని దాహార్తి తీర్చేయి ! నువ్వు ఉన్నావో లేవో లోకానికి తెలియజేస్తూ నాకు అనుభవ అనుభూతి ఇవ్వు …. నీవు లేని వాడివి అయితే నీ కోసం ఎందుకు ఇంత తపన పడతారు? ఒకవేళ ఉంటే ఎలా ఉన్నావు ?ఎక్కడ ఉన్నావు? నాకు చెప్పు… నీ అడ్రస్ చెప్పు? నేనే వస్తాను.. అంటూ నా మానసిక ఆవేదనతో నాకు తెలియకుండానే మానసిక పూజ చేయడం ఆరంభించాను! అయినా ఒక పక్క తిడుతూనే ఆయన తలుచుకోని క్షణం లేకుండా పూజ చేస్తున్నాను! నా మాటే మంత్రం అని …ఒక లేని వాడి కోసం లేనివాడిని తిడుతూనే …ఉన్నాడు అని… చెబుతున్నాను అని… తెలుసుకో లేక పోతున్నాను! శివలింగ ఆరాధన చేసిన… ఎన్నిసార్లు అభిషేకం చేసిన.. ఎన్నిసార్లు పంచామృతాలతో పదార్థాలతో అర్చించిన… నైవేద్యాలు పెట్టి అర్చించిన… ఇలా మూడున్నర సంవత్సరాలు చేసిన… నా ప్రశ్నకు సమాధానం రాలేదు ! లేనివాడిని.. ఉన్నాడని శిలమూర్తిని అయినా లింగమూర్తి ని ఆరాధన చేస్తున్నానేమోనని నాలో ధర్మ సందేహం ఏర్పడింది! నా పూజా విధానంలో గాని… మంత్ర భాగంలో గాని.. ఎలాంటి తప్పులు జరగలేదు!

పరమేశ్వరా...!!!

చెప్పకుండా ఊపిరి పోస్తావు!

తెలియకుండా ఊపిరి తీస్తావు!

ఎందుకో బంధాలు కలిగిస్తావు!

మరెందుకో బంధాలు తొలగిస్తావు!

మనస్సును ప్రేమతో మురిపిస్తావు!

అదే మనస్సును గాయాల మయం చేస్తావు!

నిన్ను పూజించమని అడుగవు!

నిన్ను ద్వేషించమని చెప్పవు!

స్వర్గం నాలోనే ఉన్నట్లు అనిపిస్తావు!

నరకం నాలోనే చూపిస్తావు!

ఇన్ని చేసిన

నువ్వు ఉన్న సత్యాన్ని

ఎందుకు తెలియనీయక

మాయలో ముంచేస్తావు ??......

కానీ ఏవైనా తప్పులు వలనే ఈ నాకు లింగమూర్తి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు అని తప్పుడు సంకేతాలతో నా మనస్సు… మంత్రాలు చదవాలనే తపన తో జ్ఞానమార్గం వైపు మరలినది! ఇంకా ఏం జరిగిందో మీరే చూడండి! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

కపాలమోక్షం - 03

గాయత్రి మహా మంత్రం ఉపదేశం

శివయ్య లింగారాధన లో భక్తి లోపం గాని ,మంత్రం లోపం గాని ఉందేమో అని భావించి మంత్ర ,తంత్ర, యంత్ర పుస్తకాలు – గ్రంథాలు - పారాయణ గ్రంధాలు చదవడం ప్రారంభించాను! అంటే నాకు తెలియకుండానే నేను శబ్ద పాండిత్యం లోకి అడుగు పెట్టాను అన్నమాట! ఈ పుస్తకాల గ్రంథాలు అన్నిట్లోనూ యోగసాధన ఆరంభానికి తప్పనిసరిగా గురువు ద్వారా మంత్రోపదేశముగా గురుమంత్రమును పొందాలని…. దానిని 3, 5, 7, 9, 12 సంవత్సరాల పాటు చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందని… తద్వారా అనుకున్న కోరికలు, ఇష్ట కోరికలు తీరుతాయని తెలిసింది! వెనువెంటనే శిలా రూపంలో ఉన్న శివలింగం మూర్తిని మంత్రోపదేశం మార్గం చూపమని అడగడం జరిగింది!

కొన్ని రోజులకి నాకు శ్రీశైల క్షేత్రం లో అంగరంగ వైభవంగా గాయత్రి మంత్రోపదేశం అనగా ఉపనయన కార్యక్రమం జరిగినది ! ఈ కార్యక్రమం జరిగే చోటికి 27 మంది బాల వేద పండితులు వేద గురువులుగా అనుకోకుండా వచ్చి వారి ఆశీర్వాదాలు ఇవ్వటం నాకు జరిగినది! నాలో ఏదో తెలియని ఆనందానుభూతి మాటల్లోనూ.. చేతల్లోనూ చెప్పలేని స్థితి కొన్ని క్షణాలపాటు పొందడం జరిగినది! ఇంతటి ఆనంద స్థితి ఎప్పుడు కూడా నాకు చదువులో ఫస్ట్ ర్యాంకులు వచ్చిన లేదా నా ఇష్ట కోరిక తీరిన కూడా కలగలేదు! ఏదో తెలియని ఈ ఆనందానుభూతి క్షణాలు ఇంకా పొందాలని … గావాలని ఆ క్షణం నుండి నాలో నాకే తెలియని తపన తాపత్రయం మొదలయ్యింది! తెలియని ఈ వింత అనుభూతి ఏమిటో … ఎందుకు కలిగిందో నాకు తెలియ రాలేదు! కానీ ఒక విషయం గమనించాను! ఈ 27 మంది బాల వేదపండితులు ఉన్నంత వరకే ఈ వింత అనుభూతిని నేను పొందడం జరిగింది! వారి వలనే నాకు ఈ అనుభూతి కలిగిందని తెలిసింది! నాకు ఉపనయన కార్యక్రమం చేయించిన పూజారిని నా ధర్మ సందేహం అడగడం జరిగింది! దానికి ఆయన ” మంత్ర సిద్ధి కి ఆనవాళ్ళు అయిన శ్రీశైల క్షేత్రం లో మల్లన్న సన్నిధిలో ఈ ప్రశ్న అడుగుతున్నారు… విచిత్రంగా వుందే…. ఎవరికైతే గురువు ద్వారా పొందిన మంత్రమును ఇష్టానిష్టాలను క్రమం తప్పకుండా… వేళ తప్పకుండా మంత్రసాధన చేస్తారో వారికి మూడు నుండి 12 సంవత్సరాల లోపల మంత్ర దేవత కనపడుతుంది ! అప్పుడే దానిని మంత్రసిద్ది కలిగినట్లుగా చెప్పడం జరుగుతుంది! ఇప్పుడు ఈ 27 మంది బాల వేద పండితులు కూడా వారి మంత్రసిద్ధి ప్రయత్నంలో ఉండటం వలన వారి మంత్ర ఆకర్షణ శక్తి వలయాలు నిన్ను చేరి తద్వారా నీలో కుండలిని జాగృతి అవ్వడము వలన కొన్ని నిమిషాల పాటు మాటల్లో చెప్పలేని నువ్వు పొందిన వింత అనుభూతికి కారణము అయింది! దానినే ఆనంద అనుభూతి అంటారు! యోగ శాస్త్రాల్లో చదివితే అన్నీ నీకు అర్థం అవుతాయి” అని చెప్పి వెళ్ళిపోయినారు! దాంతో మరికొన్ని ఇతర ధర్మ ప్రశ్నలు వెంట పడినాయి! నాకు గాయత్రి మంత్రమును ఉపదేశము చేసినారు! దేన్ని …దేనితో …ఎవరిని… ఎలా.. పూజించాలి? ఎలా ఆరాధన చేయాలి? రోజు తిట్టేది శివుడిని… ఇష్టం లేకపోయినా భుక్తికోసం భక్తిగా ఆరాధన చేసేది శివలింగం మూర్తిని… ఆయనేమో పురుషుడు… నాకు మంత్రం ఉపదేశం స్త్రీ మూర్తిది ? మరి వేదమాత గాయత్రి పూజించాలా…. లేక… వేదాలు అధినేత శివయ్యను పూజించాలా… స్త్రీ మంత్రముతో పురుషుడిని ఎలా పూజించాలి? పూజించడం జరగదు కదా! తెలియకుండా తప్పుడు మంత్రం ఉపదేశం ఇచ్చినారా? ఏమో అర్థం కావటంలేదు? అయోమయంగా గందరగోళంగా ఉన్నది! యోగ శాస్త్రాలు, కుండలిని శక్తి జాగృతి.. అంటూ ఇంకా ఏమో నాకు తెలియని పదాలకు అర్థం కాని స్థితిలో నేను ఉన్నాను! ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు మా నాన్న నా దగ్గరకు వచ్చి “ఒరేయ్ బుల్లిబాబు! ఎక్కువ సేపు పసుపు కాళ్ళ పారాయణంతో ఉండకు! వీటితో బయటకు తిరగకు! దయ్యాలు పట్టుకుంటాయి! అవి పట్టుకుంటే వాటిని వదిలించుకోలేక నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది” అని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు! మనము మన పేరుకు తగ్గట్లుగా కోతి గంతులు వేయడం చేశాను! లేని దేవుడు ఉన్నాడని ఈయన పూజలు చేస్తున్నది చాలక… లేని దయ్యాలు ఉన్నాయని పైగా ప్రేతాత్మలుగా పట్టుకుంటే కష్టాలు పడా లా? రమ్మని చెప్పు? ఉంటే నన్ను పట్టుకుని చూడమని చెప్పు? ఈ ముసలాడికి రానురాను చాదస్తం పెరిగిపోతుంది! లేని వాటిని ఉన్న వాటిగా చెప్పటం దండగ! పైగా నాకు హిత బోధనలు… ఆ క్షణం నరుడిగా ఉన్నవాడిని కాస్త వానరుడిగా నాకు తెలియకుండానే నేను మారిపోయాను! పసుపు కాళ్ళ పారాయణము తో రాత్రి తిరిగితే ఏం జరుగుతుందో చూద్దామని.. ఆ రోజు అందరు నిద్ర పోతున్న వేళలో… శ్రీశైల వీధుల వెంట రాత్రి 12 గంటల తర్వాత పసుపు పారాయణ కాళ్లతో ఒంటరిగా తిరగటం ప్రారంభించాను! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

కపాలమోక్షం - 04

ఊర్లో దయ్యం- ఒంటి లో దడ

ఆ రోజు రాత్రి పూట 12:00 తర్వాత పసుపు పారాయణ కాళ్ళుతో శ్రీశైలం వీధుల్లో తిరగడం ఆరంభించానని మీకు తెలుసు కదా! ఇంతకుముందు అధ్యాయం చదివినారు కదా! అక్కడ ఉన్న కొంతమంది చిరువ్యాపారులు నన్ను వింతగాను… నా ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటం చూసి.. నా దగ్గరకు వచ్చి “స్వామి! మీకు ఈరోజు ఫలానా సత్రములో ఉపనయనం జరిగినది గదా! ఈ సమయంలో నిద్ర పోకుండా రాత్రులు వీధుల వెంట ఎందుకు గస్తీ తిరుగుతున్నారు? మా అమ్మ భ్రమరాంబికా దేవి తిరిగే సమయం ఇది! ఆవిడ కంటపడితే రక్తం కక్కుకుని ఛస్తారు! అసలు బ్రహ్మచారి లాగా ఉన్నారు! ఏమీ అనుభవించకుండా పైకి పోతారు! మా మాట విని మీ సత్రానికి వెళ్లి పడుకోండి” అని చెప్పి వెళ్ళిపోయారు! అప్పటికే నేను సంపూర్తిగా వానరుడై ఉన్నాను కదా! వీరి మాటలు కూడా నా బుర్రకి ఎక్కలేదు! లేని శివయ్య కోసం ఎన్నో సంవత్సరాల నుండి పూజలు చేసిన కనిపించలేదు! కాళ్ళకి పసుపు పారాయణం వేసుకున్నంత మాత్రాన ఆయన కట్టుకున్న మహాతల్లి ఊరికే కనపడుతుందా? కాళ్ళకి పసుపు పారాయణాలు రాసుకుని అర్ధరాత్రి పూట ఊరి పొలిమేరలలో తిరిగితే దేవుడు కనపడితే … దయ్యాలు కనపడితే… ఎందుకు సాధనలు? సన్యాసులు అవ్వటమెందుకు? నా బొంద! రానురాను పిచ్చి భక్తి కాస్తా మూఢభక్తి గాను మారినట్లుగా …భయభక్తులు మారినట్లుగా ఉంది అనుకున్నాను! పొద్దున మా ముసలాయన ప్రేత శక్తి ఉంది అన్నాడు! ఇప్పుడేమో వీళ్ళు దైవ శక్తి ఉంది అన్నారు! వీటిలో ఏది నిజం? ఏది ఉంది? ఈ రెండు ఉన్నాయా? లేవా? ఉన్నాయని లేని వాటిని లోకానికి చెబుతున్నారా…. ప్రచారం చేస్తున్నారా…. నా బొంద? కాళ్ళ పారాయణకి ప్రేత శక్తి లేదా దైవశక్తి ఒకవేళ ఉంటే నా ముందు కనపడని …దీనమ్మ జీవితం… నేనో ... అదో ...తేల్చుకుంటా.. అనుకుంటూ ..ఏదో తెలియని జగమొండి ధైర్యంతో వీరభద్రుడి లాగా వీరావేశంతో

నాకు తెలియకుండా కటిక చీకటి వీధిలోనికి గుడికి దూరంగా …. అగుపించని దూరంలో నాకు తెలియకుండానే వెళ్ళిపోయాను! అక్కడ ఒక వీధి చివర చిమ్మచీకటి ఎవరు లేని నిశ్శబ్దం తాండవిస్తున్న సమయంలో నాకు చిన్నపాటి ఏడుపు లాంటి మూలుగు సన్నగా వినపడుతోంది! గాజులు కదులుతున్న శబ్దం… గజ్జెల సవ్వడి… వింత శబ్దం తో నాకు వినపడుతోంది! ఇలాంటి సమయంలో ఇంత చీకటిలో ఎవరున్నారని తెలుసుకోవాలనే… నాలో తపన …ఏదో తెలియని అనుమానం… భయం… నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి మన లాగానే గజ్జెలు వేసుకుంటాయా? మరి వింత శబ్దాలు ఏమిటి? నా బొంద! ఉంటే చూద్దాం! లేదంటే లోకానికి లేవని చెపుదాం ! ఏదో ఒక అనుభవం మిగులుతుంది కదా! తెలుగు వీర లేవరా …సాహసము చేయరా… ధైర్యం చేయరా డింభకా అనే పాటను గుర్తు చేసుకుని ఆ మూలుగు శబ్దాలు వచ్చే దిశ వైపు అడుగులు వేసినాను! అక్కడ నాకు ఒక పండు ముసలావిడ సుమారుగా 80 సంవత్సరాల వయస్సున్న ఆవిడ ఎరుపురంగు చీరకు నలుపు రంగు జాకెట్ తో…. గాజులు తడుముకుంటూ…. గజ్జెలు ఊపుతూ… బాధతో మూలుగుతూ కనపడినది! దాంతో నాలో తెలియని మొండి ధైర్యం వచ్చింది! నాలో ఉన్న భయం నుండి విముక్తి కలిగి ఆనందంగా… వెనుకా ముందు ఆలోచించకుండా ఆవిడ దగ్గరికి వెళ్లి ” అవ్వ! ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏమన్నా కావాలా?” అని అడిగాను! దానికి ఆవిడ నా వైపు తిరిగి “బిడ్డ ఎవరు నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీకు భయం లేదా? ధైర్యముగా ఇక్కడదాకా వచ్చినవా?” అని అన్నది! దానికి నేను “ అవ్వ …నేను ఎవరో నాకు తెలియదు! ఇది తెలియక ఛస్తున్నాను! కానీ ఎందుకు ఈ నిశ్శబ్ద ప్రాంతంలో ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావు?” అని అడిగాను! దానికి ఆమె “ఏమీ లేదురా! నాకు బాగా ఆకలిగా ఉంది! మా ఆయన్ని తొందరగా వండి పెట్టమని అడుగుతున్నాను! ఆయన నా మాట వినడం లేదు రా! ఆకలి బాధ తట్టుకోలేక ఏడుపు వస్తుంది రా! ఏమీ చేయను! చేసుకోవడానికి ఆరాటపడతాడు కానీ అన్నం పెట్టడానికి నానా వంకలు వెతుకుతున్నాడు రా!” అన్నది! నేను వెంటనే “ఎక్కడ అవ్వ! మీ ఆయన… నాకు ఇంతవరకు కనిపించలేదు! ఎక్కడున్నాడు? నిన్ను ఇంత బాధ పెట్టిన వాడిని నేను అడుగుతాను! కడిగి పారేస్తాను! “అన్నాను! దానికి ఆవిడ మౌనంగా ఒకవైపు తన చేతి ఎత్తి చూపింది! నేను ఆ దిశ వైపు చూడగా ఒక పెద్ద గంగాళంలో నీళ్లు తిప్పుతూ దూరంగా ఒక వయోవృద్ధుడు కనపడినాడు! నా అడుగులు ఆ ముసలాయన వైపుకి తిరిగి నాయి! ఆయన వైపు తిరిగి “ ఏమయ్యా! అవ్వను ఆకలితో మాడ్చడం అవసరమా? వంట ముందుగానే చేసి ఉంటే ఆవిడకి ఈపాటికి పెట్టి ఉండే వాడివి కదా! అది అర్ధరాత్రి పూట అన్నం తింటే అరుగుతుందా? అనారోగ్యాలు వస్తాయి గదా!! చూస్తే మీరు ఇద్దరు ముసలి వారిలాగా ఉన్నారు! వంటరిగా ఉన్నారు! పైగా తోడు ఎవరు లేరు! ఇంత అర్ధరాత్రి మీ ఇద్దరికీ ఏమైనా జరిగితే ఎవరికి దిక్కు! ఎవరు సమాధానం చెప్పాలి! నేను మాట్లాడుతూ ఉంటే నీవు నీ నీళ్ల గంగాళం తిప్పుతూనే వున్నావు? నా ప్రశ్నకు సమాధానం చెప్పు? అనగానే ఆ వృద్ధుడు నా వైపు తిరిగి “వంటకి వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయి! వండే పదార్థమే లేదు ! ఉడికించటానికి… తినటానికి పదార్థం కావాలి కదా! దాని కోసం ఎదురు చూస్తున్నాను!

కపాలమోక్షం - 05

నాగ పాముల అర్చన

నమ్మకం లేని గాయత్రి మంత్రమును భక్తిలేకుండా… అనురక్తి లేకుండా ..అపనమ్మకంతో ..ఆవేదనతో …ఏమీ చేయలేని… ఉపయోగం లేని… మంత్రాలు కనిపెట్టారని ఆవేశపడుతూ… మొక్కుబడిగా …క్రమం తప్పకుండా… శ్రీశైల క్షేత్రంలో కొన్ని రోజులుగా చేస్తున్నాను! నాకు కలిగిన వయోవృద్ధుల అనుభవం గురించి ఆలోచిస్తున్నాను! ఎవరికీ చెప్పుకోలేని…. ఎవరికీ చెప్పకుండా ఉండలేను! ఒకపక్క భయంతో కూడిన అవమాన సంఘటన అది! మరోపక్క లోకానికి తెలియని ఏదో శక్తి ఉందని అనుమానం! ఏదో జరుగుతోంది… ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని… ఇలాంటి వింత అనుభవం మరొకటి చూడాలని తపన తాపత్రయం నాలో మొదలైంది! శ్రీశైల క్షేత్రం లో ఏదో తెలియని శక్తి ఉంది! అది ఏదో తెలుసుకోవాలని… ఏదో విధంగా ప్రయత్నించాలని… అనుకుంటున్న సమయంలో మళ్లీ నా కాళ్ళకి పసుపు పారాయణంతో రాత్రి ఏడు గంటల తర్వాత పంచమఠాల వైపు అడుగులు వేసినాను! అది రాత్రి 10 గంటలకు అన్ని మఠాలు తిరగటం పూర్తి అయినది!

చివరికి మళ్లీ మొదలైన ఘంటా మఠమునకు చేరుకున్నాను! ఎందుకంటే అక్కడ ఉన్న ఒక సిద్ధియోగి విగ్రహము అలాగే పెద్ద గంట మీద ఉన్న శిలాఫలకం నన్ను బాగా ఆకర్షించింది! ఆ గంట మీద ఆకాశ తత్వం సిద్ది ఎలా పొందాలో అని … ఈ ఆకాశ సాధన సిద్ధి ఎలా చేయాలో బొమ్మలు గీసి చెప్పి ఉన్నది! శిలా ఫలకం మీద ఉన్న వివరాల్లోకి వెళితే ఆ పక్కనే ఉన్న నీటి గుండం లోనే ఉన్న నీటిని తీసుకుని…. అక్కడే ఉన్న శివలింగం మీద పోస్తూ ఉంటే … అక్కడే ఉన్న పెద్ద గంట మోగిస్తూ ఉంటే …శివ పంచాక్షరి మంత్రంతో ప్రాణాయామం చేస్తూ ఉంటే….. అక్కడ ఈ ప్రాణాయామం చేస్తున్నవారికి ఆకాశంలో ఎగిరే సిద్ది వస్తుందని రాసినట్లుగా కనపడింది!

ఈ ఆకాశ సాధన సిద్ధి కోసం …1. నీళ్ళు తోడేవారు, 2. శివలింగం మీద నీళ్ళు పోసే వారు, 3. పెద్ద గంట మోగిస్తూ ఉండేవారు, 4. ప్రాణాయామం చేసే వారు అంటే మొత్తం నలుగురు వ్యక్తులు కావాల్సి వస్తుంది ! చివరికి ప్రాణాయామం సిద్ది పొందిన వారికి మాత్రమే ఆకాశంలో ఎగిరే శక్తి వస్తుందని తెలిసింది! ఇది చదివిన వెంటనే నాకు తెలియని ఆనందం వేసింది! అంతవరకు ఉందో లేదో తెలియని ఆకాశ సిద్ది పరిశీలించ వచ్చు కదా! ఏదో ఒక ప్రయత్నం చేస్తే గానీ లోకానికి కొత్త విషయం చెప్పలేము కదా! లేదా మనకి కొత్త అనుభవము మిగిలి పోతుంది కదా ! కాకపోతే ఈ నలుగురు వ్యక్తులు కావాలని తెలుసుకుని కొంతమేర నిరుత్సాహపడినాను! నాకు నేను తోడుగా ఒంటరిగా ఉన్నాను! ఈ విషయంలో నాకు ఎవరు తోడు వస్తారు అని అనుకుని అక్కడే ఉన్న నీళ్ళు త్రాగి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను! ఇంతలో నిద్ర మత్తు వచ్చి నిద్ర పోయాను! ఏదో శబ్దాలు వినపడటంతో నాకు మెలుకువ వచ్చింది!

అక్కడ ఉన్న సిద్ధి లింగం పై నాగుపాములు తిరుగుతున్నట్లుగా నాకు కనిపించింది! కప్పలు ఎలకలు ఆహారం కోసం పాడుపడిన దేవాలయానికి వచ్చి ఉంటాయని… కదలకుండా మెదలకుండా మౌనంగా నిద్రపోతున్నట్లు నటిస్తూ అవి నన్ను ఎక్కడ కాటు వేస్తాయో అని భయంతో నేత్రాలతో ఓరకంట వాటిని చూస్తూ ఉండగానే అక్కడ ఉన్న సమాధిలో నుండి ఏదో తెలియని జ్యోతి ఈ సిద్ధి లింగ లో కి వెళ్ళటం… ఆనందంతో ఈ పాములు ఈ లింగం చుట్టూ నాట్యమాడుతూ వాటి పడగలు విప్పి తలలు ఊపుతూ నాదస్వరం వింటే ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తున్నాయి! కొంతసేపటికి ఆ జ్యోతి కాంతి తిరిగి అక్కడున్న సమాధి లోనికి వెళ్లి పోవడం నేను గమనించాను! అసలు ఈ జ్యోతి కాంతి ఏమిటి? సమాధి నుండి బయటకి రావడం ఏమిటి? ఈ సిద్ధి లింగం లోకి వెళ్లి తిరిగి రావడం ఏమిటి? గాయత్రి మంత్రము బాగా చెయ్యడము వలన నాకు పిచ్చి కాని ఎక్కలేదు గదా? ఒకవేళ మతి చెడినదా? పాములు అర్చన చేయడము ఏమిటి?

ఈ జ్యోతి దర్శనము ఏమిటి? అసలు సమాధి నుండి దీపజ్యోతి రావడము సంగతి ఏమిటి? వీటి గురించి ఎవరికీ చెప్పటానికి వీలులేని దృశ్యాలు కనపడుతున్నాయి! ఎవరికీ చెప్పుకోలేని.. చెప్పుకుంటే పిచ్చివాడికింద చూస్తారు! వీటి సంబంధించిన శాస్త్ర గ్రంథాలు తిరగేస్తే ఏమైనా సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి అని అనుకుంటూ ….నాగ పాములు నా వైపు రావడం గమనించేసరికి నాలో భయముతో …చావు భయంతో …మాటలు రాని స్థితిలో… శరీరం కదలలేని స్థితిలో… గుండె ఆగిపోయిందా? అనే భయభ్రాంతులలో ఉండగానే నేను గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగినది! అప్పుడు ఏం జరిగిందో చూడాలని…. వినాలని అనుకుంటున్నారా అయితే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

కపాలమోక్షం - 06

నా శవదర్శనము

నేను చూసిన పాములు చేసిన లింగార్చన దెబ్బకి ఆ రాత్రి ఘంఠా మఠములో గాఢనిద్రలో ఉండిపోయాను! ఆ నిద్రలో నిజముగా జరిగిన అనుభవం లాంటి కల ఒకటి వచ్చింది! అది ఏమిటంటే నేను నిద్రలో ఉండగానే సుమారుగా ఇరవై ఏడు సంవత్సరాల వయసున్న ఒక నగ్న యువకుడు ఒక శవమును భుజం మీద పెట్టుకుని స్మశానానికి వెళ్లడం జరిగింది! అక్కడ ఉన్న అనేక పుర్రెలు, ఎముకలు, వింత శబ్దాలు చేస్తున్న జంతువుల అరుపులు దాటుకుంటూ ,చితి మంటల్లో కాలుతున్న శవాలను దాటుకుంటూ… చితికి సిద్ధంగా ఉన్న కట్టెపుల్లలు మీద ఆ యువకుడు తాను తీసుకువచ్చిన శవమును పెట్టి … ఆ యువకుడు నిప్పు కోసం వెళ్లటం జరిగింది! విచిత్రంగా నాకు కలలో కూడా వెంట్రుకలు కాలుతున్న వాసన… శవాలు తగలబడుతున్న వాసనలు… జంతువుల అరుపుల శబ్దాలు వినబడటం వింతగాను...ఆశ్చర్యముగాను ఉంది! ఇంతలో ఆ యువకుడు మండే కట్టెను ఈ చనిపోయిన శవం వద్దకు తీసుకుని రావడం జరుగుతుంది! నేను ఇదంతా ఒక స్మశానంలో చాటుగా ఉండి నిజం చూస్తున్నట్లుగా అనిపిస్తోంది! ఇంతకీ ఆ శవము ఎవరిది అనుకుని ఆ శవం కేసి చూడగానే అది నా శవమని తెలుసుకుని గతుక్కుమన్నాను!

అంటే నాగ పాములు చేసిన లింగార్చన చూడటం వలన లేదా వెళుతున్న పాములు కాటు వేయటం వల్ల నేను చనిపోయానా? ఎవరు లేకుండా… ప్రేత శవము లాగా చనిపోయానా? అయ్యో ? నా ముసలి వాళ్లకి… నా బంధువులకు… ఈ విషయం అనగా నేను చచ్చిపోయిన విషయం తెలుసా? తెలియదా? నేను చచ్చిపోయాను! వామ్మో ! ఈ అబ్బాయి నన్ను కాల్చడానికి వస్తున్నాడు! ఇప్పుడు ఏం చేయాలి? నేను అనాథ శవంలాగా దహనం కాకూడదు! నేను వెళ్లి మా వాళ్ళకి చెప్పాలి! నేను చనిపోయానని మనవాళ్ళకి చెప్పి… నా దహనం కార్యక్రమాలు చేయించుకోవాలి! వామ్మో! నువ్వు నన్ను దహనం చేయకు! మా వాళ్ళు వస్తారు ! నేను అనాథ కాను ! నన్ను దహనం చేయకు! చేయకు! “ ఏరా వెధవా బడుద్దాయి ! నిన్ను ఎవరు దహనం చేయడం లేదు రా ! పిచ్చి తిరుగుళ్ళు తిరగటం… పిచ్చి కలలు కనటం… పిచ్చి మాలోకం లాగా మాట్లాడటం… అంటూ ఎవరో తిడుతూ నామీద చన్నీళ్లు చల్లటం జరిగినది! నేను కళ్ళు తెరిచి చూస్తే నా సత్రంలో నేను ఉన్నాను! నాకు నిజం లాంటి కల వచ్చిందా? నేను చనిపోలేదా? మరి నేను ఘంఠా మఠములో నాగుల లింగార్చన చూశాను కదా! మరి నేను ఈ మఠములో ఉండాలి కదా! మరి నేను ఎప్పుడు ఈ సత్రానికి వచ్చి నాను అనుకుంటూ ఉండేసరికి…. నిన్న రాత్రి తమరు ఎంత సేపటికి సత్రానికి రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ పంచమఠాల వైపు వెళ్ళినపుడు తమరు ఘంఠా మఠములో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళితే ఈ మఠములో ఒళ్లు తెలియని నిద్ర మత్తులో ఉంటే భుజాన వేసుకుని శవము లాగా సత్రానికి తీసుకురావడం జరిగిందని మా మావయ్య చెప్పడంతో అసలు విషయం అర్థం అయింది!

నాలో తెలియని చావు భయం మొదలయింది! అర్ధరాత్రి వచ్చిన కలలు నిజమవుతాయని కలల శాస్త్రం చెప్పిన విషయములు గుర్తుకు రావడంతో ఏదో తెలియని భయం తో కూడిన మగత నిద్ర నన్ను తిరిగి ఆవహించిందని నేను తెలుసుకునే లోపల నిద్ర దేవత నన్ను తిరిగి తన ఒడిలో చేర్చుకున్నది! ఆ తర్వాత మరుసటి ఉదయం నేను అక్కడే ఉన్న పంచ మఠములో ఒక్కటి అయిన విభూతి మఠంలో ఒక సాధువుని ఇదే ప్రశ్న వేశాను! అది ఏమిటంటే నిజంగానే దైవశక్తి అలాగే ప్రేత శక్తి ఉన్నదా? అని దానికి ఆయన చిరునవ్వు నవ్వుతూ” నువ్వు ఎలా ఉంటావో? అవి కూడా అలాగే ఉంటాయి! ఈ సృష్టిలో దైవ శక్తి అలాగే ప్రేత శక్తి ఈ రెండు కూడా ఆయా సూక్ష్మ శరీరాలను ధరించి ఉంటాయి ! అవి మన కంటికి కనిపించవు! ఎవరికైతే త్రినేత్రం అనగా మూడో కన్ను తెరుచుకుంటుందో వారికి మాత్రమే ఈ శరీరాలు దర్శనం అవుతాయి! నా తపోశక్తి వల్ల నీకు కొన్ని క్షణాలపాటు త్రినేత్రం తెరుచుకునేటట్లు చేస్తాను చూడు.. అంటూ నా మీద విభూది చల్లి కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకో మన్నాడు! అప్పుడు నాకు కోడిగుడ్డు ఆకారంలో ఎవరో పండుముసలి 85 సంవత్సరాల ఆవిడ కనపడింది! నెమలి కంఠం రంగు చీరతో… ఎరుపు పూలతో… నల్లని జాకెట్టు… ఎరుపు రంగు జరీతో… ముడతలు ఉన్న శరీరంతో …. రూపాయి బిళ్ళ ఉన్న ఎరుపు బొట్టు తో నవ్వుతూ… నా మీద కూర్చున్నట్లుగా కనపడింది! దాంతో నాకు కొన్ని క్షణాలపాటు నాలో తెలియని భయం వేసింది! ఆ తర్వాత మరికొన్ని క్షణాలకి తెల్లని శరీరం తో ఉగ్రమైన చూపులతో నన్ను తినేసేటట్లుగా చూస్తూ నా మీదకు ఇంకో స్త్రీ మూర్తి రావడం జరిగింది! దానితో ఏవో రెండు రకాల శక్తులు ఉన్నాయి అని నాకు అర్థం అయింది! ఆ తర్వాత ఆ సాధువు కి నమస్కారం చేసి నేను మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను!

ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

కపాలమోక్షం - 07

ఆకాశంలోకి ఎగరటానికి ప్రయత్నించటం

సత్రంలో నిద్ర లేచి కాఫీ తాగుతూ …శ్రీశైలంలో జరిగిన వయోవృద్ధుల సంఘటన మరియు కలగా వచ్చిన నగ్న యువకుడి దర్శనము సంఘటనను గుర్తు చేసుకుంటూ… నిజంగా వీళ్లు ఎవరు? దేవుళ్ళు ఉన్నారా లేదా? దేవుళ్ళు లేదా దయ్యాలు ఉంటే మనుషుల్లాగే ఎందుకు లేరు? బాగా వృద్ధులుగా ఎందుకు ఉన్నారు ?లేదా కాపాలికులు అయితే నిజంగా వండుకుని తినొచ్చు కదా! నేను చూసిన దృశ్యం నిజం కాకపోతే నేను ఎందుకు భయపడాలి? నిజమైతే నాకు అనిపించాలి కదా అవి నిజంగా జరిగిన సంఘటన అని…. నాకు అలా అనిపించడం లేదు… అంటే ఈ సంఘటన జరిగిన జరగలేదా… జరిగి జరగనట్లుగా ఉన్నాయా… ఏమీ అర్థం కావడం లేదు? ఇప్పుడు ఏం చేయాలి?

గుడి లోపల ఉన్న త్రిఫలా చెట్టు కిందకి చేరుకుని ఆ రోజు చేయవలసిన గాయత్రి అనుష్టానము పూర్తి చేసుకుని ధ్యానము చేసుకోగానే … అప్పుడు యధాలాపంగా ఘంఠా మఠము లో ఉన్న ఆకాశ సిద్ధి గురించి చెప్పే శిలాఫలకం నా కళ్ళముందు కదలాడింది! దానితో సత్రానికి చేరుకున్నాను! ఇక్కడ ఉన్న నా వయస్సు ఉన్న బంధువులు అందరితో … వారితో ఈ విషయం గురించి అనగా ఆకాశ సిద్ధి గురించి చెప్పే శిలాఫలకం చెప్పి విమాన ఖర్చు లేకుండా విమానంలో లాగా ఆకాశంలో ఎగర వచ్చునని… నేను వారితో నాకే తెలియని విషయం గురించి వారికి ఆశ కల్పించి… ఆకాశ సిద్ధి ప్రయత్నం చేయాలని పురికొల్పడం జరిగినది! నాతో పాటుగా ధైర్యవంతులు అని… ఉత్సాహవంతులను ముగ్గురిని ఎంపిక చేసుకుని మధ్యాహ్నము 12:00 గంటలకి ఘంఠా మఠము వైపు అడుగులు వేయడం జరిగినది! అక్కడ మేము చేసే పనికి అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో… నాకు మాత్రం తెలియని భయంతో ఆ చెప్పిన విధంగా నేను ఆ పెద్ద గంట ను ఆపకుండా మ్రోగించే విధంగా … మాలో ఒకడు 108 నీటి బిందులు నీళ్ళు తోడే టట్లుగా… అలాగే మరొకడు ఆ నీటిని అక్కడ ఉన్న శివలింగం మూర్తి మీద పోసేటట్లుగా… మరొకడు శివ పంచాక్షరి మంత్ర ప్రాణాయామం చేసేటట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము! ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆకాశంలోకి వెళతాడని తెలుసుకుని మాలో ఉన్న ఒక ధైర్యవంతుడికి ఈ పని అప్పజెప్పి … అందరూ తలా ఒక పని చేయడం ప్రారంభించాము!

ఈ క్రతువు పూజ మొదలైంది! రాత్రి ఇక్కడ జరిగిన అనుభవాల దృష్ట్యా నాలో తెలియని భయం మొదలైంది! ఎవరికీ చెప్పుకోలేని… బయటికి కనిపించకుండా ఉండటానికి… నాలో నేను తంటాలు పడుతూ ఆ పెద్ద గంట మోగిస్తున్నాను! ఈ పెద్ద గంట శబ్ధానికి ఎవరైనా బయటి వాళ్లు వచ్చి తిట్లు తిడతారేమోనని భయం… అయినా ఏదో తెలియని ధైర్యం … ఆ రోడ్డు వెంట యాత్రికులు, అక్కడ ఉన్న వారు మమ్మల్ని చూసిన … ఏమి అనకుండా, ఏమి చూడనట్లుగా, ఏమి గమనించనట్లుగా, తెలిసి తెలియనట్లు, ఏమీ తెలియనట్లుగా వెళ్ళటం నేను నా ఓరకంట ద్వారా చూస్తున్నాను! నాకైతే నోట మాట రాలేదు!

గంట మోగుతూనే ఉంది! శివయ్యకి అభిషేకం జరుగుతుంది! నీళ్ళు తోడేవాడు తోడుతూనే ఉన్నారు! అభిషేకం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు! గంట మోగిస్తూనే ఉన్నాను! ప్రాణాయామం చేసే వ్యక్తి చేస్తూనే ఉన్నాడు! ఒక అనుకోని సంఘటన ఎదురైంది! మావాడు 98 నీటి బిందె శివ అభిషేకం జరుగుతుండగా… ప్రాణాయామం చేస్తున్న వాడు.. కాస్త ఒక అడుగు ఎత్తుగా గాలిలో ఉండటం గమనించి మిగిలిన వాళ్ళకి నేను చెప్పేసరికి …. వారికి భయంతో కూడిన ముచ్చెమటలు పోయటం… ఒకవేళ వీడు ఆకాశంలో ఎగిరిపోతే ఎలా కిందకి దించాలి నాకే తెలీదు అనుకుంటూ ఆలోచన నాకు వచ్చేసరికి … నాలో తెలియని భయం… మిగిలిన ముగ్గురికీ ఒకేసారి స్పష్టంగా కనపడినాయి! ఏకాగ్రతగా ప్రాణాయామం వ్యక్తికి గాలిలో ఉన్న విషయం తెలియడం లేదని…. గమనించే సరికి మాలో తెలియని భయం వచ్చి … మేము చేస్తున్న పనులు ఆపి ఆ ప్రాణాయామం చేస్తున్న వ్యక్తి వైపుకి వెళ్లడం …. ఆ పనులు ఆగిపోవటంతో … గాలిలో ఎగురుతున్న వ్యక్తి దబ్బున నేల మీద పడటం ఏకకాలంలో జరిగినాయి! ఆ దెబ్బకి అతడి మూత్ర కోశం దెబ్బతిని మల మూత్ర ద్వారం నుండి రక్తం రావడం నేను గమనించే సరికి భయంతో … ఏమి జరిగిందో తెలుసుకునే లోపల నేను కళ్లు తిరిగి పడిపోవడం జరిగింది!

నేను కళ్ళు తెరిచే సరికి ఆసుపత్రిలో ఉన్నాను! ప్రాణాయామం వ్యక్తికి చికిత్స తర్వాత క్షేమంగా ఉన్నాడని తెలిసి నాలో తెలియని ఆనంద భయాలు వేసినది! ఇంట్లో వాళ్ళు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టినారు! అయిన బాధ లేదు! ఎందుకంటే శక్తులు ఉన్నాయని… వాటిలో ఆకాశ సిద్ధి ఒకటి ఉన్నదని… వెళ్లే విధానం తప్పు కావచ్చు కానీ చేసే విధానం నిజము గావడముతో … నాకు ఏదో తెలియని ఆనందం వేసింది! ఏదో తెలియని విషయాన్ని అంతవరకు పుస్తకాలలో… శిలాఫలకాలలో ఉన్న విషయం నిజంగా మా కళ్ళ ముందు ఒక నిజ సంఘటన లాగా అగుపించి… జరిగేసరికి నాలో నాకే తెలియని ఆనందం వేసింది! లేని వాడి కోసం వెతకడానికి మంత్ర శక్తి ఉపయోగపడుతుందని…. ఈ యోగ శక్తి అనుభవం నాకు ఏదో తెలియని ధైర్యం ఇస్తున్నట్లుగా అనిపించసాగింది! దానితో నేను మళ్ళీ మగత నిద్రలోకి జారుకోవడం జరిగినది! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! శుభం భూయాత్.!!

కపాలమోక్షం - 08

కాపాలికుడు దర్శనం

ఘంఠా మఠము లో జరిగిన సంఘటన కి నేను ఆసుపత్రి పాలవడం మీకు తెలిసిన విషయమే కదా! కొన్ని రోజులకి మా ఊరికి తిరిగి రావడం జరిగింది! విధిగా లింగ మూర్తి ని… కనిపించటం లేదని… ఆవేదన ఆవేశంతో… ఆయన మీద…. ఇష్టం లేని… భక్తిలేని… పూజ కార్యక్రమాలు చేస్తున్న సమయంలో… ఆరు నెలల తర్వాత ప్రాణాయామం చేసిన వ్యక్తి కిడ్నీ వ్యాధితో చనిపోయాడని నాకు తెలిసింది! నాలో తెలియని మనోవేదన ,ఆవేదన, ఆవేశం బాధ మొదలైనాయి! ఆ కనిపించని దేవుడిని…. కనిపించే లింగమూర్తిని… తిట్టటం ఎక్కువైంది! నా కోరిక ప్రయత్నం వలన ఆయన చనిపోయాడు అనే మనోవేదన నన్ను ఒక సైకో భక్తుడు లాగా… దేవుని చంపే రాక్షసుడు లాగా… మార్చివేసింది! దాంతో ఎక్కడ పోగొట్టుకున్నమో… అక్కడే రాబట్టుకోవాలని… తపన… మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను ఒక్కడినే వంటరిగా శ్రీశైల యాత్ర కి వెళ్లడం జరిగింది! శ్రీశైలమల్లన్న ను చూడకుండా నేరుగా ఈసారి ఘంఠా మఠముకు చేరుకోవడం జరిగినది! అక్కడ అన్నీ ఉన్నాయి! జరిగిన యదార్థ సంఘటనకి సాక్షిగా…. గుర్తు చేయడానికి సాక్ష్యంగా… ఉన్నట్లు కనిపించింది!

ఇంతలో నన్ను అక్కడ ఒక భిక్షకుడు వ్యక్తి గుర్తుపట్టి “ స్వామి… గాల్లోకి ఎగిరారా? మీరు చేసిన ప్రయత్నాలు …. నేను ఓరకంట గమనించాను! నేను ఒకప్పుడు యోగసిద్ధులు కోసం ప్రయత్నించి మతి భ్రమణం చెందే పిచ్చివాడిలాగా… బిచ్చగాడి గా మారినాను! నాకు తెలిసినంతవరకు మీకు సాధన శక్తి సరిపోయినట్లుగా లేదు… అనగానే ఏదో తెలియని నాకు ఒక యోగ ఆప్తుడు దొరికినట్లు అనిపించి జరిగిన విషయం చెప్పే సరికి… అతను వెంటనే “స్వామి… సాధనలో ఇలాంటి విఘ్నాలు కలుగుతాయి! మీకు లాగా బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి ! పుట్టించడం… చంపడము… పై వాడికి తెలిసినంతగా మనకు తెలియదు కదా!

మీకు నిజముగా సాధన మీద ఇంకా ఆసక్తి ఉంటే ఈ శ్రీశైల క్షేత్రానికి పదమూడు కిలోమీటర్ల (13) దూరంలో ఉన్న భైరవ సేల కి వెళ్ళండి! అక్కడ పిచ్చివాడిలాగా… అర్థం కాని పిచ్చి మాటలతో … యోగవంతమైన అర్థవంతంగా మాట్లాడే పిచ్చి వాళ్ళ రూపంలో ఉన్న కాపాలికులు ఉంటారు! వారి భాష, చేష్టలు అన్నిగూడ మతిభ్రమణం చెందిన పిచ్చివాడిలాగా ఉంటాయని గుర్తు పెట్టుకోండి! మీరు వారిని గమనించారో లేదో తెలుసుకున్నారో అనగానే ఏదో పని ఉన్నవాడి లాగా మీ నుండి పారిపోతారు లేదా మిమ్మల్ని భయపెట్టి పారిపోయేటట్లుగా చేస్తారు! వీటి ఆధారంగా ఆ కాపాలికుడు ని పట్టుకోండి! సాధన శక్తి మర్మాలు తెలుసుకోండి” అని చెప్పి ఏదో పిచ్చి వాగుడు వాగుతూ వెళ్ళిపోయాడు! అంటే వీడు అర్థకాపాలికుడు ఏమోనని సందేహం వచ్చే లోపల నా కనుచూపు నుండి దూరమైనాడు ! సరే అతను చెప్పిన వివరాలను పట్టుకుని ఒక మానవ ప్రయత్నం చేస్తే కనిపించని దేవుడున్నాడో లేదో మనకు తెలుస్తుంది కదా అనుకుంటూ ఆ కాపాలికులు ఉండే భైరవ సేల వైపుకి వెళ్లడం జరిగింది!

అర్థ కాపాలికుడు చెప్పిన భైరవ సేలకి నేను వెళ్లే సరికి సాయంత్రం 6:00 అయినది! చీకటి ముదురుతోంది! కాఫీ తాగుదామని కాఫీలు అమ్ముతున్న వాడి దగ్గర ఉండగా …..

అక్కడ ఉన్న ఒక భిక్షకుడు చుట్ట తాగుతూ అమ్ముతున్న వాడి ముందు ఠీవిగా నిలబడి ఉండటము చూసి ఆ కాఫీల వాడు బిచ్చగాడితో “ ఏరా ! చుట్ట త్రాగాటానికి నేను ఉన్న చోటు కావాల్సి వచ్చిందా? పైగా దేవుడి గుహ ఎదురుగా పెట్టుకుని అంత ధైర్యంగా చుట్ట ఎలా తాగుతున్నావురా? వేరేచోట దొరకలేదా? ఇక్కడి నుండి పోరా… ఎదవ నాయాల” అంటూ ఉండగానే … ఆ బిచ్చగాడు వెనువెంటనే “అయ్యా! దేవుడు లేని చోటు నాకు చూపించు! అక్కడికి వెళ్లి తాపీగా నా చుట్ట నేను కాల్చుకుంటాను… చూపిస్తావా… చూపించు.. అంటూ ఉండగానే … ఆ షాపు వాడు వెంటనే “అయ్యా! ప్రతి వెధవా! వేదాంతే! నాలుగు మాటలు నేర్చుకుని… కడుపు కోసం నానా చంకలు నాకుతారు! వీళ్ళకి బుద్ధి లేదు… వీళ్లను చూస్తే నాకు బుద్ధి రాదు” అంటూ నా వైపు తిరిగి నాకు కావలసిన కాపీ ఇచ్చినాడు! నేను ఆ కాఫీని సేవిస్తూ ఆ బిచ్చగాడివైపు ఓరకంట గమనిస్తున్నాను!

వాడు నేను గమనిస్తున్న విషయం గమనించి… గమనించనట్లుగా పెద్దగా బూతులు తిడుతూ నా కనుచూపు నుండి తప్పుకోవాలని ప్రయత్నించే సరికి నాలో తెలియని ఆనందం వేసింది! ఒకవేళ వీడు నిజమైన కాపాలికుడు కాదు కదా అనుకుంటూ తాగుతున్న కాఫీని వదిలేసి… ఈ బిచ్చగాడి వైపు వెళ్లడం… వాడు నన్ను చూసి వేగంగా అడుగులు వేస్తూ దూరంగా వెళ్ళి పోతూ… ఉండటం గమనించి నేను వెంటనే “స్వామి… స్వామి! మీరు కాపాలిక స్వామి దీక్షా పరులే గదా! అంటూ ఉండగానే … వాడు వెంటనే “కాపాలిక? వాడెవడు? వాడితో నాకు ఎలాంటి సంబంధం లేదు! వాడు ఎవడో నాకు తెలియదు! నన్ను వదిలేయ్” అంటూ ఉండగా… నేను వెంటనే ఆ బిచ్చగాడి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసాను!

కపాలమోక్షం - 09

కపాల భోజనం

ఆ బిచ్చ కాపాలికుడు తో నేను వెళ్లడం… భైరవ సేల లోనికి అంతర్గతంగా ఉన్న చిన్నపాటి చీకటిలో గుహలోనికి నన్ను తీసుకుని వెళ్లడం జరిగింది! ఆ గుహ లోపల కపాలము ధరించిన ఆరడుగుల కాలభైరవ విగ్రహము కనబడినది! దానిని చూడగానే నమస్కారం చేయాలని అనిపించలేదు! నాకు లాగానే అగుపించని లింగమూర్తి నేను ఆరాధన చేస్తున్నట్లుగానే … కానీ వీరు కూడా కనిపించని కాపాలిక దైవాన్ని కాపాలికుడు ఆరాధన చేస్తున్నారని నా మనస్సుకు అనిపించింది!

నా మనస్సులోని భావాలు చదివినట్లుగా ఆ కాపాలికుడు వెంటనే “ మీ జీవితంలో జరిగిన అనుకోని ఒక సంఘటన ఆధారంగా చేసుకుని… భయోత్పాత (తుఫాను)సంఘటనను ఆధారంగా చేసుకుని….. ఈ సృష్టికి ఆధారభూతమైన నాథుడు లేడని అనుకుంటున్నావా…. ఉన్నాడని నేనంటే …. నువ్వు లేవని అంటావు …అంటావా… ఎవరి విశ్వాసం బట్టి వారికి ఈ విశ్వం కనపడుతుందని గ్రహించు ! ఎందుకంటే ఈ విశ్వమును విశ్వాసమే నడిపిస్తోంది గదా! లేనివాడు ఉంటే…. ఉన్నవాడు లేకుండా పోతాడు అని…. కనిపించేది అసత్యమని...కనిపించనిది సత్యమని…. రాబోవు కాలంలో ఈ సాధన అనుభవాల ద్వారా తెలుసుకుంటావు ! అందాక మేము చెప్పిన… వినే స్థితి కానీ… నీకు అర్థం చేసుకునే పరిస్థితి కానీ… నీకు ఉండదు అని నాకు తెలుసు! దెబ్బ తగిలిన తర్వాత నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది! సమ్మెటపోటు తర్వాతే బంగారమునకు వన్నె వస్తుందని గ్రహించు! నీకు బాగా ఆకలి వేస్తోంది అని నాకు తెలుస్తోంది! నిజముగానే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఆకలి మొదలైంది! ఈయనకి ఈ విషయము ఎలా తెలిసినది అనుకుంటుండగా...

“ఇదిగో ఈ భోజనం తిని ఆకలి తీర్చుకో!” అంటూ ఒక సగం ఉన్న మానవ కపాలము చేతికిచ్చినాడు! అందులో పురుగులున్న పసుపు,ఎరుపు రంగుల ఆహారమున్నది! పైగా పురుగులు కదులుతున్నాయి! నాకు భయం వేసింది! ఇక్కడ ఈ కపాలంలో భోజనం చెయ్యాలా? ఇక్కడ పచ్చటి అరటి ఆకులు గాని విస్తరాకులు కాని దొరకవా? పోయి పోయి చచ్చినవాడి యొక్క కపాలంలో భోజనమా? పైగా పురుగుల ఆహారమా? వామ్మో దీనిని చూస్తుంటే వాంతి వచ్చేటట్లుగా ఉంది! ఇంకా ఇది తింటే నా గతి అధోగతి అవుతుందేమో … వామ్మో… ఏం చేయాలో? నేను తినను అంటే వీరు శాపం ఇస్తారేమో … తింటే ఏం జరుగుతుందో… ముందు గొయ్యి … వెనుక నుయ్యిలా గా ఉంది…. వామ్మో ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనుకుంటున్న గానే…..

“ఏం స్వామి? కపాల భోజనం అంటే భయమేస్తుందా…. భోజనం మీద విరక్తి కలుగుతుందా… జీవితం మీద అనురక్తి పోయిందా… పైగా పురుగుల ఆహారము చూస్తే ఆకలి చచ్చిపోయిందా… నీ పొట్టలో బోలెడు పురుగులున్నాయి! బయట వున్న ఈ కొద్దిపాటిని తింటే ఏమి అవదులే! ఎంత చేసిన కూటికే…. ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే ! మనిషి చచ్చిపోయిన తర్వాత మిగిలేది కపాలమే కదా! ఈ కపాలాభివృద్ధి కోసమే… జీవుడు జానెడు పొట్ట కోసం… నానా అగచాట్లు పడి చచ్చి కపాలంగా మారిపోతున్నాడు! అలాంటి పవిత్రమైన కపాలమును తక్కువగా చూడకు… చూడమాకు! ఇక ఈ కపాలములో మన పాపాలు దహించి వేసే చితాగ్ని ఉంటుంది! ఇదిగో చూడు! ఇక్కడ… ఇక్కడ అగుపించని చిన్న రంధ్రం ఉంటుంది… దీనినే బ్రహ్మరంధ్రం అంటారు! ఇందులోనే చితాగ్ని అని ఉంటుంది! ఇది చింతల వల్లనే చితికిపోయిన నీ దేహ చితికి ఈ చితాగ్ని కాల్చటానికి ఉపయోగపడుతుంది! ఈ అగ్ని వెలుగు వలన ….నువ్వు … నేను… కనబడుతున్నాము! ఈ ప్రపంచమంతా… ఈ విశ్వమంతా ఈ వెలుగులో ఉంటుంది! అందరూ సూర్యుడి వల్ల కాంతి వెలుగు వస్తుంది అని అనుకుంటారు! కానీ ఆ సూర్యుడికి కాంతిని ఇచ్చేది ఏమిటో తెలుసా? ఈ కపాలము లోని బ్రహ్మరంధ్రం లోని చితాగ్ని… స్వామి… నన్ను నమ్ము… నేను చెప్పింది అర్థం అయితే సిద్ధాంతం… అర్థం కాకపోతే వేదాంతం… అర్థమై అర్థం కానట్లుగా ఉంటే రాద్ధాంతం… ఒకటి గుర్తుంచుకో! నువ్వు ఉంటే దేవుడు ఉన్నట్లే! నువ్వు లేకపోతే దేవుడు లేనట్లే! నువ్వు ఉన్నావో లేవో నువ్వే తెలుసుకో! నీకు నువ్వు ఏమిటో తెలుసుకో… నేనంటే ఏమిటో గ్రహించు! నువ్వంటే ఏమిటో తెలుసుకో! నీకు నువ్వే పరిభ్రమించు… పరిక్రమించే…. వెతుకు… విచారించు… ఆలోచించు… వేదన అనుభవించి… అనుమానించు… నువ్వు తెలుసుకో… దేవుని తెలుసుకున్నట్లే! దేవుడు ఎక్కడో లేడు… నీలోనే ఉన్నాడు! నీ హృదయంలో హృదయ కమలం మీద ఉన్నాడు! నీకోసం ఎదురు చూస్తున్నాడు! నీవే వాడు… వాడే నువ్వు! వాడికి అడుగు దూరంలో ఉన్నావు! GOD NO WHERE….GOD NOW HERE.. రాసి… నాకు తెలియని భాష…. తెలియని మనిషి… తెలియని మనస్సు లేదు… తెలియని ఆలోచన లేదు… నేనే నువ్వు నువ్వే నేను…. స్వామి! నేను తెలుసుకున్నాను! నువ్వు ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు! నా దృష్టిలో నాకు కపాలభోజనము అయిన… కంచంభోజనము అయిన… ఒక్కటే! నాకు ఈ రెండు కూడా ఆహారమును తినే పాత్రలు మాత్రమే! పాత్రలు మారిన పాత్రధారి ఒకటే అని తెలుసుకోవడమే కాపాలిక సంప్రదాయము!

ఆహారము- మలము అలాగే మంచినీళ్లు - ఉచ్చ నీకు బేధాలు కనబడితే… మాకు అవి ఒకటిగా … ఆకలి తీర్చే పదార్థం గాను… దాహం తీర్చే దాహార్తి గాను ఉపయోగపడతాయి” అంటూ తన మూత్రమును తను తినే కపాల భోజనములో కలుపుకుని ఈ రెండిటిని ఎన్నో సంవత్సరాల పాటు ఆహారము, నీరు లేని వాడికి లాగా… ఒకసారి ఈ రెండు కనపడితే ఎంతో ఆర్తిగా, ఆప్యాయతగా,ప్రేమగా,అబగా తింటూన్న ఈ కాపాలికుడుని చూసేసరికి….

నా కడుపులో ఏకకాలంలో గ్రైండర్… మిక్సీలో వేసి తిప్పినట్లుగా తిప్పి అతడి మీద వాంతి చేసుకున్నాను! మూడు రోజులపాటు తిన్న ఆహారమంతా జీర్ణం కాక … అరగక ముందే బయటకు వస్తే… దానిని కూడా ప్రేమగా నాకుతున్న కాపాలికుని చూడగానే నాకు నోట మాట రాలేదు! నాలో చెప్పలేని భయము, వణుకు మొదలైనది! “స్వామి! నీ వాంతి ఆహారం చాలా బాగుంది! రుచికరమైన ఆహారం ఇచ్చినావు! పెట్టినావు! నాకు చాలా సంతోషంగా ఉంది!” అని ఆ కాపాలిక స్వామి అంటూండగానే … నేను కాళ్ళకు బుద్ధి చెప్పి… పరిగెత్తుతూ… ఎందుకో… వెనక్కి తిరిగి చూడగానే…

ఆ కాపాలికుడు వెనుక భాగము అనగా వీపు భాగం మూడు తలలు ఉన్న ఆ స్వామి అనగా దత్తాత్రేయ స్వామి యొక్క నీడ లాంటి ఆకారం కనిపించటంతో… నాలో తెలియని భయంతో… బయటికి పరిగెత్తిన… గుహ బయటికి ఎదురుగా మళ్ళీ ఈ కాపాలికుడు కనిపించి చిరునవ్వు నవ్వుతూ చేతితో ఆశీర్వాదం చేస్తున్నట్లుగా కనిపించింది! నేను మౌనంగా ఆయనకి నమస్కరించి… అక్కడి నుండి మా ఊరి వైపు ప్రయాణం కొనసాగించాను! మీరు భయపడకండి! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! శుభం భూయాత్

కపాలమోక్షం - 10

ఆ చెరువులో చూస్తే

కపాల భోజనం దెబ్బకి భయమేసి ఆ గుహ నుండి బయటకు వచ్చి మా ఊరి వైపు వెళ్లే బస్సులు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను! ఎంత సేపటికి మా ఊరి బస్సులు రాలేదు! దాదాపుగా 350 కిలోమీటర్లు మా ఊరికి ప్రయాణం ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు! ఇంతలో ఒక టాక్సీ వాడు ఒకటి వచ్చి ఈ క్షేత్రానికి ఉత్తర దిక్కులో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న “ఉమామహేశ్వరం” క్షేత్రానికి వెళ్తున్నానని…. ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉన్నారా” అని అడుగుతూ కనిపించాడు! వీడి బండి ఎక్కితే మా ఊరికి కొంత దూరమైనా వెళ్ళవచ్చు కదా అనుకుని…. అక్కడికి వెళ్లి మా ఊరి బస్సు ఎక్కవచ్చునని ఆలోచనతో ఈ బండి ఎక్కి నాను! నాతో పాటు మరో నలుగురు కూడా ఎక్కిన తర్వాత ఈ టాక్సీ బయలుదేరింది! రాత్రి పది గంటలకి ఈ ప్రాంతానికి చేరుకున్నాను! బస్టాండ్ లో మా ఊరికి వెళ్ళే బస్సు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది అని తెలిసి నాలో తెలియని విసుగు, చికాకు, అసహనం మొదలైంది! మళ్లీ రేపు పొద్దునే మా ఊరి బస్సు ఉందని తెలుసుకుని…. ఏమి చేసేది లేక ఆ రోజు రాత్రి బస్టాండ్ లో పడుకోవాలని నిర్ణయించుకుని… ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని ఆ బస్టాండ్ దాటి బయటికి వచ్చినాను! ఆ ఊరికి రావడం నేను అదే మొదటిసారి! పైగా ఇది బాగా పల్లెటూరు లాగా ఉంది! అక్కడ హోటల్స్ ఏమీ కనిపించలేదు! కనీసం తినుబండారాలు అమ్మే కొట్టులు అన్నీ మూసేసి ఉన్నాయి! అప్పుడు నాకు ఒక పెద్ద దేవాలయం కనబడింది! అది శివాలయం లాగా ఉంది! ఈ దేవాలయానికి పరిసరాలలో ఏదో మంచి నీరు ఉన్న చెరువు ఒకటి కనిపించింది! కనీసం ఇందులో ఉన్న నీళ్లు త్రాగి ఆకలి తీర్చుకోవాలని ఆ చెరువు దగ్గరకి వెళ్ళినాను!

ఈ చెరువు లో అడుగు పెట్టాను! అప్పుడు సమయం దాదాపుగా అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది! ఇంతలో నీళ్లలో ఏవో శబ్దాలు… ఏదో కదలతున్న నీటి సవ్వడులు లీలగా వినిపించాయి! ఏవో చేపలు నీటిలో కదులుతున్నాయని… చేతిలో చెరువులో నీళ్లు తీసుకోబోతుండగా… నాకు లీలగా వినిపించిన నీటి సవ్వడులు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వినిపించే సరికి… ఒక్కసారిగా నేను ఉలిక్కిపడ్డాను! చూస్తే ఏమీ కనిపించలేదు! కనీసం చేపలు లేదా మొసళ్ళు లేదా నీటి పాములు కదులుతున్న దాఖలాలు ఏమీ కనిపించలేదు! కానీ ఏదో కారణం వల్ల నీళ్లు బాగా కదులుతున్నాయని బుడగల శబ్దాలు చేస్తున్నాయి! అది ఏమై ఉంటుందో నాకైతే అర్థం కాలేదు! ఏమీ లేదు అనుకుని మళ్ళీ నీళ్లు తాగటానికి చేతులు పెట్టే సరికి… ఈ సారి మళ్ళీ నీళ్లు బాగా పెద్ద శబ్దంతో వినిపించాయి! దీనమ్మ జీవితం! నీళ్లు లోనే చేతులు పెడుతుండగానే ఈ నీటి శబ్దాలు బాగా వినిపిస్తున్నాయని నెమ్మదిగా నేను గ్రహించాను! కొంపతీసి ఇందులో ఒకవేళ ఏమైనా ఉందా? ఇందులో ఒకవేళ కథలలో చెప్పే నీటి భూతమేదైనా వుందా?ఎవరికి తెలుసు? నా సామీ రంగా? ఇది ఇంత అర్ధరాత్రి కనబడితే నీటిలో దూకి చావడమే! అసలే పొద్దున మన కాపాలికుడు దెబ్బకి అన్నం మీద విరక్తి కలిగింది! దీని వల్లన జీవితమే అంతమవుతుందా… అసలే విపరీతంగా దాహం వేస్తుంది! ఏమి చేయాలి? ఊరికే ఏమీ లేని దానికి… నేను ఏదో ఊహించుకుని… అనవసరంగా కంగారు పడుతున్నాను అనుకుంటా? ఏమీ ఉండదు! కప్పలు కానీ చేపలు కానీ నీటి శబ్దాలు చేస్తూ ఉంటాయి! అనుకుని మళ్ళీ నీరు తాగాలని ప్రయత్నించాను!

ఈసారి శబ్దాలు వచ్చే చోట పెద్ద సుడిగుండములాగా ఏర్పడి “ఎవర్రా అది! నా అనుమతి లేకుండా … నా చెరువులో నీటిని తాగడానికి వచ్చినది” అనే మాటలు వినేసరికి నేను గతుక్కుమన్నాను! వామ్మో ! నిజంగానే ఈ చెరువులో ఏదో దయ్యం ఉంది! ఈ చెరువుకి కాపలా కాస్తోంది అనుకుంటా! దీని అనుమతి తీసుకోవాలని తెలిస్తే ఇక్కడ దాక ఎందుకు వస్తాను? నేను ఊహించినట్లుగానే ఇదేదో నిజంగానే భూతమా? లేక నా భ్రమా? …అనుకుంటూ భయపడుతూ… కళ్ళు తెరిచి చెరువులో సుడిగుండంలాగా…. వచ్చిన చోట చూసేసరికి నేను నోరు వెళ్ళబెట్టి వలసి వచ్చింది! విచిత్రంగా ఆ చెరువులో నీళ్లతో ఉన్న ఒక చెయ్యి బయటికి వచ్చి… దాని పైన సుమారుగా ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఎరుపు లంగా జాకెట్ లో ఉన్న ఒక పాప ఉగ్రరూపంగా కనిపించింది! అసలు నేను చూస్తున్నది నిజమా.. అబద్దమా.. అర్థం కాని స్థితిలో ఉండగా నాకు లీలగా …అమ్మోరు తల్లి సినిమాలో … కళ్ళ చిదంబరానికి కనిపించిన ఇలాంటి దృశ్యం లాగా నాకు కనిపిస్తోంది అనుకునేసరికి… నాలో తీవ్రమైన భయాందోళన వలన నాకు తెలియకుండానే… తీవ్ర భయంతో కళ్ళు మూతలు పడిపోతున్నాయి! ఆ తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాను! తెల్లవారి ఆ ఆలయ పూజారి అభిషేకానికి నీరు కోసం ఈ చెరువు దగ్గరికి వచ్చి…. అక్కడ ఒక శవం లాగా పడుకుని ఉన్న నన్ను చూసి… నా మీద నీళ్లు పోసి… నన్ను నిద్ర నుండి లేపినాడు! మెలుకువ వచ్చేసరికి… నా కళ్ళలో కనిపించిన భయం చూసి… రాత్రి జరిగిన విషయమంతా తెలుసుకుని… కన్నీళ్లు పెట్టుకుంటూ.. “నాయన! రాత్రి నువ్వు చూసిన దృశ్యం చూడాలని… ఎన్నో సంవత్సరాల నుండి నేను పరితపిస్తున్నాను…నువ్వు చూసిన దృశ్యం నిజమే! నువ్వు చూసిన పాప ఎవరో కాదు నాయనా… ఆ చిన్నారి బాల… నాయనా బాలాదేవి! ఆవిడే నిత్యం పూజించే నా భ్రమరాంబికాదేవి నాయన! ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తుందో ఆవిడకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు! నువ్వు నిజంగానే కారణజన్ముడువి! నీ ఈ జన్మ ధన్యమైనది! మా ముత్తాత గారికి ఒకసారి అమ్మ వారిని చూడాలని పరితపిస్తూ.. శ్రీశైలమునకు వెళుతూ… ఈ ప్రాంతము నందు అనుకోకుండా ఆగవలసి వచ్చింది! అప్పుడు ఆయన గుడి దగ్గర పడుకుంటే… రాత్రి కలలో ఒక చిన్న పాప కనిపించి “నన్ను చూడాలని ఉందా నీకు! అయితే ఈ గుడి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి రా” అన్నది! వెంటనే ఈయనకి మెలుకువ వచ్చింది! ఇది కలా… నిజమా అని ఆయనకు అర్థం కాలేదు! సరేలే అనుకుని ఒక్కసారి ఈ చెరువు దగ్గరికి వెళితే ఏం జరుగుతుందో …చూస్తే పోలా అనుకుని వెళ్ళితే… అచ్చంగా రాత్రి నీకు కనిపించిన దృశ్యం… ఆయనకి కూడా కనిపించినది! ఆ తర్వాత మా వాళ్ళు ఇది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే నేను వినడము జరిగినది! ఎప్పటికైనా నేను కూడా ఈ మహత్తర దృశ్యం చూడలేక పోతానా అని ఎన్నో సంవత్సరాలుగా అమ్మకి సేవ చేస్తున్నాను! అది నిజమే రా నాయనా! నీకు అమ్మవారు అనుగ్రహం కలిగినది! అందుకే ఈ చెరువుకు భ్రమరాంబిక చెరువు అంటారని… ఆయన ఏదో ఆనంద పూరితమైన మాటలు మాట్లాడుతున్నారు! నాకైతే అసలు రాత్రి ఏమి జరిగినది? అది నిజమా… అబద్దమా అర్థం కాని స్థితిలో… అయోమయస్థితిలో … ఆ పూజారికి అలాగే ఆ చెరువుకి నమస్కారం చేసి జేబులో ఉన్న కొంత డబ్బులు దక్షిణగా చెరువులో నాకు తెలియకుండానే వేసి… అక్కడ నుండి మా ఊరికి వెళ్ళే బస్సులు కోసం మౌనంగా వెళ్ళి పోతుంటే… నాలో నా ముఖంలో ఏ మాత్రం కూడా ఆనందపూరిత భావాలు కనిపించక పోవడంతో… ఆయన అయోమయ స్థితికి గురై… ఆ పూజారి నేను అర్థం కాని స్థితిలో ఉన్నానని తెలుసుకుని… అభిషేకానికి నీళ్ల కోసం ఆ భ్రమరాంబిక చెరువులోకి దిగినాడు!

నాకు కావలసిన బస్సు రావడంతో ఎక్కి సీటులో కూర్చుని ఉండగా నాలో ఆలోచనలు మొదలయ్యాయి! అనగా కపాల భోజనం దెబ్బకి అలాగే చెరువులో అమ్మవారు దర్శనం దెబ్బకి నాలో తెలియని భయం మొదలయింది! దేవుని చూడాలంటే ఆనాడు వయోవృద్ధులు నన్ను వండుకొని తినాలని చూసినారు! అలాగే ఆ తర్వాత నగ్న యువకుడు ఒక్కడు నన్ను కాల్చుకుని తినాలని చూశాడు! మొన్న కపాలములో భోజనం చేసే పరిస్థితి! నిన్న చెరువులో ఎవరో బాలిక బెదిరించడం? అవసరమా! దేవుడు చూడటానికి వెళ్తే అందరూ భయ పెడుతున్నారు! దేవుడు అంటే భయమా లేదా భక్తా నాకైతే అర్థం కాలేదు! వామ్మో! ఆధ్యాత్మిక జీవితం ఇంత భయంకరంగా ఉంటుం దా? దీనికన్నా బతికుంటే బలుసాకు తిని బ్రతక వచ్చు కదా ! హాయిగా బ్రతకకుండా… దేవుడు ఉన్నాడో లేదో వాడి మీద పరిశోధన చేయడం అంత అవసరమా? అనవసరమైన సమస్యలు…. లేనిపోని భయాలు కొని తెచ్చుకోవడము అవసరమా? ఇంకా వద్దు! దేవుడు ఉన్నాడా లేడా ఎవరికి కావాలి? నేను ఎవరికి చెప్పాలి? హాయిగా భోగ జీవితమే నాకు చాలా మంచిది! హాయిగా చీకు చింతా లేని భోగ జీవితము వైపుకి నా మనస్సు లాగడం నాకు తెలియకుండానే మొదలయ్యింది! ఆ తర్వాత ఏమి జరిగిందో మీకు తెలియాలంటే… ఏం చేయాలో మీకు తెలుసు కదా! అదేనండి! నాతో పాటు మీరు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి! ఇప్పటిదాకా నా ఆధ్యాత్మిక విషయాలను చూశారు! ఇకపై నా భోగ జీవిత విషయ అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దురు రండి !

శుభం భూయాత్

గమనిక:

కొన్ని సంవత్సరాల తరువాత ఈ దైవ అనుభవం నిజమైనదని అనుటకు నిదర్శనముగా… దత్తావతారమైన సాయి ఖేడా నివాసి అయిన ధునివాలా దాదాజీ జీవిత చరిత్ర లో ఇలాంటి సంఘటన ఉన్నట్లుగా చదవడము జరిగినది! ఆయన ఆవాసం ఉండే నర్మదానది పరిసరాల్లో… భక్తులు కోరికలు అవసరాల కోసం.. ఆయన ఈ నది దగ్గరికి పంపించి… వారికి గావాలసినవి ఈ నది నుండి ఒక నీటి హస్తము బయటికి వచ్చి ఇచ్చి వెళ్ళుతుందని నేను తెలుసుకున్నాను! ఒక పేద భక్తురాలు తన కుమార్తె వివాహం కోసం డబ్బులు లేకపోతే ఈయన దగ్గరికి వస్తే…. ఈ నర్మదానది దగ్గరికి పంపిస్తే… ఆ నది నుండి ఒక నీటి హస్తము బయటికి వచ్చి…. డబ్బులు ఇచ్చినట్లుగా వారి జీవిత చరిత్ర లో నేను చదవడం జరిగింది!

అలాగే కాపాలిక కపాల భోజనం వలన మరియు ఈ భ్రమరాంబిక చెరువులో వేసిన డబ్బులు వలన నాకు ఆహారము అలాగే ధనము యందు నాకు ఎలాంటి లోటు రాకుండా … ఈ క్షేత్రము నుండే మౌనయోగి అయినా పూర్ణానంద స్వామి వారి చేత మంత్రించిన అక్షయ బియ్యము అలాగే మంత్రించిన అక్షయ 5 రూపాయల నోటు నాకు మా గుడిలో వీరి ద్వారా నాకు ఇవ్వడం జరిగినది! రాబోవు అధ్యాయాలలో ఈ మహానుభావుడి గురించి మీకు తెలుస్తుంది! అలాగే ఈ చెరువులో బాల మంత్ర ఉపాసన సిద్ధి పొందిన వారికి ఇప్పటికీ అమ్మవారు బాలరూపంలో నాకు కనిపించినట్టుగానే కనిపిస్తుందని… వివిధ పూజారులు అనుభవాల ద్వారా అలాగే బాల ఉపాసకుల ద్వారా తెలుసుకున్నాను! గత జన్మలో నేను బాల ఉపాసకుడు కావడం వలన… ఆ జన్మలో అమ్మవారు దర్శనం బాకీ ఉండటం వలన … అది ఈ జన్మలో ఈవిధంగా తీరినదని నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి ద్వారా తెలుసుకున్నాను! ఏది ఏమైనప్పటికీ అన్ని రకాల దృశ్యాలు కూడా భ్రమలే అనుకుని ముందుకు దాటుకొని ఎక్కడ ఆగకుండా సాధనలోనికి వెళ్లి పోయాను! వీటితో ఆగిపోతే మన సాధన కూడా ఆగిపోతుంది కదా!

ఇక్కడ మీకు ఒక చిన్న ధర్మ సందేహం వచ్చి ఉండాలి! ఈయనకి కలిగిన అన్ని రకాల దైవ అనుభవాలన్నీ కూడా ఎందుకు శ్రీశైల క్షేత్రం చుట్టునే జరిగినాయి? దీనికి సమాధానం ఏమిటంటే మేము పనిచేసే దేవాలయం పేరు కూడా భ్రమరీ బాల సుందరి సమేత శ్రీ మల్లికార్జున దేవాలయం! శ్రీశైలం లో ఉన్నది కూడా వీరే కదా! అది కాకుండా నేను పూజించే వారు పలకరు… ఉలకరు… పలకరు… స్పందించరు… ఉన్నారో లేదో కూడా తెలియదు! కాని ఇదే పేరుతో ఉన్న శ్రీశైలంలో మాత్రం నేను వాళ్ళు ఉన్నారో లేదో అని పరిశోధనలు చేయగానే…. గుయ్య మంటూ… భయపెట్టే దృశ్యాలతో భయంకరంగా భయపెట్టినారు! అది స్వయంభూ లింగం అయితే మేము పూజించేది ప్రతిష్ట లింగము అదే తేడా అని అనుకుంటాను! పైగా అర్థనారీశ్వర తత్వం లో ఇద్దరు కలిసి ఈ శ్రీశైలం క్షేత్రం నందు ఆవాసము చేస్తున్నారు గదా! మరి మహిమలు చూపించకుండా ఎలా ఉంటారు! అలాగే వీరిని ప్రశ్నించే వారిని…లేరని వాదించేవారిని… బాధించే వారిని భయపెట్టకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళు ఉనికి కోసము మనల్ని ఉలికిపడేటట్లుగా అపుడపుడు చేస్తుంటారు! నిజమే గదా!

కపాలమోక్షం - 11

నేను ఒంటరి వాడిని అయ్యాను!

ఇదిలా ఉంటే… నాతో అనుబంధం పెంచుకునే వాళ్ళు… ఒక్కొక్కళ్ళు గా దూరం అవ్వటం మొదలైంది! నా తొలి ప్రాణస్నేహితుడు, అత్యంత సన్నిహితుడు, ఆత్మబంధువైన మా మేనత్త కొడుకు… అనుకోని పరిస్థితుల్లో మా నాన్నగారితోను… మా మేనత్త కి విభేదాలు రావడంతో… మా రెండు కుటుంబాలు శత్రువులుగా మారటంతో.. నేను వాడు కాస్త దూరం అయినాము! అదే నా జీవితం యొక్క తొలి వైరాగ్య దెబ్బ! ప్రేమ బంధాల మీద కోలుకోలేని తొలి దెబ్బ అయినది! అలాగే నా తోటి విద్యార్థులు, స్నేహితులు, సన్నిహితులు కూడా ఏదో కారణాల వలన దూరమవుతూ వచ్చినారు! నన్ను ఆప్యాయంగా ప్రేమగా… బాగా మెచ్చుకొని ప్రొత్సహించిన నారాయణమూర్తి మాస్టర్ గారు, శ్రీనివాస్ మాస్టర్ గారు, మేరీ మేడం గారు కూడా తమ ఉద్యోగాల బదిలీల కారణంగా నన్ను వదిలి వెళ్ళి పోవడం జరగడంతో… అది కాకుండా నా అన్నయ్య, అక్కయ్య కూడా మంచి చదువులు పేరుతో రాష్ట్రాలు మారి వెళ్లిపోవడంతో… నేను ఒంటరిగా మిగిలి పోయాను! దాంతో నా అనుకునే వాళ్లంతా మానసికంగా, శారీరకంగా దూరం అయ్యే సరికి తెలియని లేత వయస్సులో నా మనస్సు కాస్త… నాకు తెలియకుండానే వైరాగ్య భావాలు పెంచుకోవడం ఆరంభించినది!

కలిసేది విడిపోవడానికి… విడిపోయేది ఎన్నటికి కలవటానికి కాదని అని… అలాగే ఈ బంధాలన్నీ కూడా ఆర్థిక, అవసర బంధాలని… మానసికంగా నాలో బలంగా నాటుకు పోవడంతో …అందరూ ఉన్నా కూడా ఏకాంత జీవితము ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవడం ఆరంభించాను!

ఇంతలో రేడియో నుండి దేవదాసు చిత్రంలోని

మనస్సున్న మనిషి గతి ఇంతే…

మనస్సు గతి ఇంతే…

తెలిసి విలపించడములో

ఉన్న ఆనందము ఎందరికి తెలుసు…

అనే పాట రావడం మొదలైంది! శుభం భూయాత్

==========================================

గమనిక:

ఈ విశ్వంలో కారణం లేనిదే కార్యం జరగదని నా ప్రగాఢ విశ్వాసం! ఎందుకంటే నా లేత వయస్సులో నాకు బంధాలు ఎందుకు దూరం చేసినాడో నాకు ఆనాడు తెలియ రాలేదు! కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే నేను చేసిన గాయత్రి మంత్రం వలన నా చూపులో తెలియని ఆకర్షణ శక్తి, నా ముఖంలో బ్రహ్మవర్చస్సు, మాటల్లో తెలియని సమ్మోహనం…

నా చుట్టూ ఉన్న స్త్రీ మూర్తులను, పురుషులను ఆకర్షించడం మొదలుపెట్టినాయి! పెళ్లయిన ఆంటీలు, పెళ్లి కావలసిన అమ్మాయిలు, ప్రేమలో ఉన్న అమ్మాయిలు ,భర్తలు లేని స్త్రీలు, నా మాటలు.. నా చేతలకి ఆకర్షించబడటం మొదలుపెట్టినారు! నేను తెలిసిన ప్రతి స్త్రీ మూర్తి నాకు వన్ ఫోర్ త్రీ చెప్పటం ఆఖరి అంకంగా జరుగుతూ ఉండేది! నేను చూడని స్త్రీలు కూడా నా ఫోను సంభాషణకు ఆకర్షితులవ్వడము మొదలయ్యేసరికి… దీనిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక కొన్ని గతజన్మలలో ప్రారబ్ధ కర్మల కారణంగా వీరితో అనగా కొంతమందితో చంచల మనస్తత్వం తో ఉండటం జరిగేది!

కానీ వీరందరి ప్రేమ, మాయ, వ్యామోహాలు గమనించి వారందరినీ సాధన యోగమాయ పరీక్షలని గ్రహించి…. లేత వయస్సులో కలిగిన వైరాగ్య భావాలు మనస్సులో బాగా నాటుకుని పోవడంతో… ప్రారబ్ధ కర్మలగా భావించుకుని వీరిని దాటుకొని ముందుకు వెళ్లి పోయే మానసిక పరిస్థితి నాకు కలిగినది! చిన్న వయస్సులోనే వైరాగ్య భావాల దెబ్బలు తినటం వలన యుక్తవయస్సులో ఇవి నాకు ఎన్నో విధాలుగా సహాయపడినాయని గ్రహించాను!

అప్పుడు నాకు రేడియో నుండి చక్రము సినిమాలోని ……

జగమంత కుటుంబం నాది…ఏకాకి జీవితం నాది…సంసార సాగరం నాదే…సన్యాస శూన్యం నాదే…

అంటూ పాట పాడుకుంటూ నా జీవితమును ముందుకు కొనసాగించాను!

కపాలమోక్షం - 12

తొలి ప్రేమలు

నా అనుకునే వాళ్లంతా… ఒక్కొక్కరుగా… నా నుండి దూరంగా అవ్వడం మొదలయ్యే సరికి… నేను ఒంటరిగా మిగిలి పోయే సమయంలో… తోడుగా తొలిప్రేమలు మొదలైనాయి! నేను ఒక విషయం నిజం చెబుతున్నాను! ఒక పక్కన యోగసాధన మీద ఎన్నో రకాల పరిశోధన చేస్తూనే… మరోపక్క చదువులూ… ఉద్యోగాలూ… వ్యాపారాలూ… పెళ్లి సంసార బాధ్యతలు అనుభవిస్తూనే యోగసాధనను పరిసమాప్తి చేసుకున్నాను! అన్ని రకాల సుఖ భోగాలు అనుభవిస్తూ…. శివారాధన చేసే వాడిని! మనస్సుకి యోగమును… శరీరానికి భోగమును ఇచ్చాను… అనగా దత్తాత్రేయస్వామి లాగా ఉండే వాడిని! మనస్సుకి ధర్మం తప్పకుండా, అన్నివిధాలుగానూ, ఇష్టమైన కోరికలు తీర్చే వాడిని! ఆనందపడే వాడిని! ఆ తర్వాత బాధపడే వాడిని! ఇబ్బందులు పడే వాడిని! అనుభవ పాఠాలు నేర్చుకునే వాడిని! ఆపై వాటికి స్వస్తి చెప్పే వాడిని! అది ఎందుకు చేయకూడదు? ఎందుకు ఇలా చేయాలి? అలా ఎందుకు చేయకూడదు? ఇలా నాకు నేనే ప్రశ్నలు వేసుకుని నానా తంటాలు పడే వాడిని! పరిశోధన చేసే వాడిని! ఫలితాలను రాసుకునే వాడిని! నమ్మినవారికి చెప్పేవాడిని! నమ్మిన వారి వద్దనుండి వారి కొత్త కోణాలను తెలుసుకుని ఆ విధంగా కూడా ఎందుకు పరిశోధించ కూడదని మళ్లీ పరిశోధన చేసే వాడిని! తిరిగి ఫలితాలు మార్చి రాసుకునే వాడిని! ఎవరికీ అర్థం కాని వాటిని ఎవరితోనూ చర్చించేవాడిని కాదు! నాలో నేను ప్రయత్నించేవాడిని! అమ్మ ప్రేమ నుండి అమ్మను చేసే ప్రేమ (భార్య ప్రేమ) దాకా అన్ని రకాల ప్రేమ భావాలు అనుభూతి పొందాను! ఇన్ని రకాల ప్రేమ లో నాకు బాగా నచ్చిన ప్రేమ మాత్రం ప్రేమికుల మధ్య నుండే ప్రేమ భావానికి ప్రథమ స్థానం ఇస్తాను! వారి కోసం ఎదురు చూ సే ఎదురుచూపులు ,తీయని బాధలు, విరహవేదనను,అలకలు,కవ్వింపు చూపులు,కవ్వింపు చర్యలు,కవ్వింపు మాటలు,బుంగమూతులు,వెటకారపు మాటలు, ఇలా ఎన్నో భావాలు నాకు ఈ ప్రేమభావములో కనిపించినాయి! మిగిలిన ప్రేమభావములో అవసర ప్రేమలు, ఆర్థిక ప్రేమలు మాత్రమే కనిపించాయి!

నేను ఎనిమిదో తరగతిలో ఉండగా మా ఇంగ్లీష్ మాస్టర్ గారి కూతురుతో నాకు మొట్టమొదటి బాలా స్త్రీ మూర్తి పరిచయం అయింది! పేరు తారావళి! అందంగా, సన్నగా, నాజూగ్గా ఉండేది! ఎందుకో తెలియదు గాని… నాకు చిన్నప్పటినుండి చదివే ఆడపిల్లలన్నా, తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉంటే ఆడపిల్లల న్నా ,సంగీతం నేర్చుకునే వారు ,లలిత కళలు అనగా కూచిపూడి, నాట్య కళలు నేర్చుకునే వారంటే నాకు ఇష్టంగా ఉండేది! వారితో మాటలు కలపాలని… వారితో స్నేహం చేయాలని ఉండేది! కానీ నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు! అలాంటి వారు చాలా అరుదుగా నాకు అగుపించేవారు! ఇలాంటి కోవకి ఈ అమ్మాయి చెందినది! ఎందుకో తెలియదు! ఈమెతో స్నేహం చేయాలని బాగా అనిపించింది! ఆమెకు తెలుగు రాదు! నాకు హిందీ రాదు! మా ఇద్దరి మధ్య వచ్చీ రాని భాష ఆధారమైనది! ఎక్కువగా సైగ భాష నడిచేది! ఆమెకు కూడా తెలివైన బాగా చదివేవారు అంటే విపరీతమైన ఇష్టం అని గ్రహించాను! ప్రేమ అంటే ఏమిటో… తెలియని నూనుగు మీసాలు వయస్సులో… మీసాల రాయుడు లాగా ప్రవర్తించేవాడిని! ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా… శివ పూజారిని కాస్త ప్రేమ పూజారి గా మారి నాను!

ఒకరోజు లెక్కల క్లాసు జరుగుతోంది! మాస్టర్ గారు ఒక లెక్కకి జవాబు చెప్పమని అందరిని అడగటం మొదలుపెట్టారు! నాకు దీనికి జవాబు రావడం లేదు! ఇంతలో నేను తారావళి కేసి చూస్తే … అది చేతి మీద వన్ ఫోర్ త్రీ…143… అని రాసి చూపించినది! అదే జవాబు అనుకుని నేను మా మాస్టర్ గారికి చెప్పటం… ఆపై తన్నులు తినడం జరిగినది! వన్ ఫోర్ త్రీ అనేది లెక్క జవాబు కాదని తెలిసి గతుక్కుమన్నాను! అప్పుడు ఆమెను అడిగితే …మొద్దు! అది జవాబు కాదు!

143 అంటే ఐ లైక్ యు అన్నది! అంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనేసరికి… ఇది నీకు ఎలా తెలుసు అంటే… దానికి ఆమె వెంటనే “ మా బావ నాకు చెప్పినాడు! అదే నేను నీకు చెప్తున్నాను! మీకు ఇష్టమేనా వన్ ఫోర్ త్రీ “ అన్నది! దీనమ్మ … దీని బావ దీనికి చెప్తే… అది వాడికి చెప్పకుండా నాకు చెప్పినది! నాలో ఏదో తెలియనితనం బాగా నచ్చి ఉంటుంది అనుకున్నాను! ఇలా ప్రతి రోజు బడికి రావడం… ప్రతి పిరియడ్ ఖాళీ సమయాలలో… ఎవరూ చూడని సమయాలలో… మా పుస్తకాలలో వన్ ఫోర్ త్రీ పేజిని తీసి ఒకరినొకరు చూపించుకొనేవాళ్ళం! దేవుడు ఆనందంగా ఉంటే ఊరుకోడు కదా! మా స్నేహం.. ఇష్టముగా మారి… అది కాస్తా ఏదో తెలియని ప్రేమగా మారే లోపల…. మా మాస్టర్ గారికి ఆ ఊరు నుండి బదిలీ అయి వెళ్లిపోయారని…. వేసవి సెలవులు పూర్తి అయిన తర్వాత నాకు తెలిసినది! మళ్లీ మరో రెండు సంవత్సరాల దాకా నాలో మన్మధుడు నిద్రలేవలేదు!

నేను పదవ తరగతి చదివే సమయంలో మా స్నేహితుడు దూరపు బంధువైన జ్యోతిర్మయి అని నాకు పరిచయం అయింది! ఇది విచిత్రమైన స్నేహం! ఈమె సంవత్సరంలో మా ఊరి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చి అయిదు గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేది! మళ్లీ సంవత్సరానికి జరిగే జాతర సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించేది కాదు! అంటే ఇది జాతర స్నేహం! మొదట్లో మాట్లాడేది కాదు! వాళ్ల ఇంటి బయటకు వచ్చి… మా ఇంటి కేసి చూస్తూ… నేను ఎప్పుడు బయటకు వస్తానని గంటల కొద్ది ఎదురుచూపులు ఎదురు చూస్తూ ఉండేది! నేను కనబడితే అదోలా చూస్తూ… కనుసైగలతో అన్నీ మాట్లాడేది! కవ్వింపు చర్యలు… కవ్వింపు చూపులు ఉండేవి! గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి నాకు టాటా చెప్పి వెళ్లి పోయేది! అదియే ఆ సంవత్సరానికి ఆఖరి చూపు!! అంటే మళ్ళీ ఈమె కోసం సంవత్సరమంతా ఎదురుచూసే వాడిని! మళ్లీ యధావిధి అంతే! మాటలు ఉండవు! కనపడితే నవ్వటం! కవ్వింపు కళ్లతో ఎదురు చూపులు ఉండేవి! నేను మాట్లాడాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన ఉపయోగం ఉండేది కాదు! అలాంటి సమయంలో మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఒకరోజు ఈమె నుండి ఒక ప్రేమ లేఖ అందుకోవడం జరిగినది! అదే నా జీవితంలో తొలి ప్రేమ లేఖ! అయితే ఆమె రాసిన భాష విధానం నాకు అర్థం కాలేదు! నా స్నేహితులు చాలా కష్టపడి చదివి నాకు వినిపించారు! అది తెలుగే కానీ తెగులు పట్టినది! తొలిప్రేమ సినిమాలో తమ్ముడు తన అన్న ప్రేమ కోసం రాసిన ఉత్తరం లాగా అర్ధమై అర్ధముగానట్లుగా వున్నది! నేను వెంటనే “ఏదైనా ఉంటే మాటల్లో చెప్పు… కానీ మళ్లీ ఎన్నటికి ఉత్తరం రాసి మమ్మల్ని చంపవద్దని… ఆమెకి తిరిగి ఉత్తరం రాసి ఇచ్చినాను! మాటలు కలిసినాయి! పరీక్ష ఫలితాలు వచ్చాయి! స్కూల్ ర్యాంకు రావాల్సిన చోట… ఫస్ట్ క్లాస్ మాత్రమే వచ్చింది! ఇంట్లో తిట్లు! మనస్సులో తీయని దురద! మరుసటి సంవత్సరం ఆమె నుండి ఉత్తరం రావాల్సిన చోట… శుభలేఖ వచ్చింది! నేను గతుక్కుమన్నాను! ఆమె మరో ఇంటిది అయినది! అయినా నాకు ఆనాడు బాగా బాధ అనిపించలేదు! ప్రేమంటే ఏమిటో తెలిసే వయస్సులు కాదని నాకు తెలుసు! కానీ ఏదో తెలియని బాధ అనిపించింది! మళ్లీ ఒంటరి వాడిని అయ్యాను!

కాలేజీ చదువులకు వచ్చినాను! నూనుగు మీసాలు కాస్తా నల్ల మీసాలు అయినాయి! ఏదో తెలుసుకోవాలని వయస్సులో… ఏవో అనుభవ అనుభూతులు పొందాలనే… తపన తాపత్రయాలు నా మనస్సుకి వచ్చేవి! రాత్రివేళలో మన మన్మధుడి ప్రభావం వల్ల… నాకు తెలియకుండానే అర్ధరాత్రిపూట గాఢనిద్రలో జరిగే ఒక విధమైన చర్య వలన నిద్ర పట్టేది కాదు! మనస్సు, వయస్సు ఉరకలు వే సే స్థితి! జీవితం ఉన్నత స్థితికి… అలాగే అధమ స్థితికి మధ్య వయస్సులో ఉన్నామని తెలుసుకోలేని స్థితి! ఏదో కావాలని… ఏదో ఒకటి పొందాలని… ఏవో అనుభవాల పొందాలని… స్నేహం కావాలని… ఓదార్పు మాటలు కావాలని… సానుభూతి కావాలని… మనస్సు మధన పడుతున్న సమయంలో… నా చదువు కొనసాగుతుండగా …

ఒకరోజు నాకు లాగానే ర్యాంకు కోసం తపనపడే నా సహచర విద్యార్థి అయిన రాధాదేవి నా దగ్గరకు వచ్చి నోట్ పుస్తకాలు కావాలని అడిగి తీసుకుంది! మాటలు కలిశాయి! స్నేహం పెరిగింది! ఆమె చెప్పే తీయని తీపి మాటలు వినాలని మనస్సు ఆరాటపడటం జరిగింది! ఆమెకి,నాకు ప్రేమ గురించి ఎంతో కొంత జ్ఞానము కలిగి ఉండేది! సినిమాల ప్రభావం వలన నాకు ప్రేమ మీద, శృంగార సాహిత్య పుస్తకాలు చదవడం వలన వీటి మీద అవగాహన సహజసిద్ధంగానే ఏర్పడినది! అలాంటి సమయంలో… ఏదో తెలీదు… ఆమెను చూడాలని… ఆమెతో మాట్లాడాలని… నాలో తపన మొదలైంది! ఒక రోజు ఆమెకి జ్వరము వచ్చినదని అని తెలిసి నా మనస్సు విలవిలలాడింది! ఆమె కాలేజీకి రానిరోజులు నాకు మరణయాతన లాగా ఉండేది! ఒక రకంగా చెప్పాలంటే తియ్యని దురదలాగా ఉండేది! ఉంటే వెళ్ళిపోతుందని… వెళ్ళిపోతే అపుడే రాదని… ఇలా పలు రకాల నా మనస్సు ఆరాటపడేది! ఇలాంటి సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది! అది ఏమిటో తెలుసుకోవాలంటే… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే….. మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

కపాలమోక్షం - 13

నా జాతకము – జీవితము

ఇలా నేను ప్రేమలో… అర్థం కాని అనుభవాలతో… అయోమయ పరిస్థితిలో ఉండగా… నా ప్రేమ ఏమవుతుందో… నా చదువులు ఎలా ముందుకు సాగుతాయి అని జాతకాలు చెప్పే జ్యోతిష్కునిని తొలిసారిగా కలవడం జరిగింది! నాకు చదువులో ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోవాలి అని అనిపించింది! ఈయన జాతకాలు బాగా చెబుతారని… బంధు మిత్రుల ద్వారా తెలుసుకుని.. ఆయన దగ్గరికి వెళ్లడం జరిగింది! వారిని కలిసి… వచ్చిన విషయం చెప్పగానే ఆయన నా జాతక చక్రం వేసి ఏవో గణింతాలు వేస్తూ...ఏవో గ్రహదశలు వేసి … మధ్య మధ్యలో12 గవ్వల తీసుకుని పంట వేస్తూ… మధ్యమధ్యలో… నన్ను నాకిష్టమైన అంకెలు, పూలు ,పండ్లు, రంగులు, అడుగుతూ… ఏదో చేసి చివరికి నా వైపు దీనంగా తిరిగి “ నాయనా నువ్విచ్చిన జాతకం ప్రకారంగా చూస్తే నువ్వు ఫలానా సబ్జెక్ట్ లో తప్పుతావు అని…నీకు ఫలానా మార్కులు వస్తాయని” చెప్పడంతో నా మెదడు మొద్దు బారి పోయింది! ఏమిటి స్టేట్ ర్యాంక్ రావలసిన చోట నాకు పాస్ మార్కులు కూడా రావా? అసలు వీడికి జాతకం తెలుసా? భవిష్యత్ చెప్పడము వచ్చా? అయినాగానీ…. గ్రహాలు చూసి….. వాటి స్థితి చూసి…. నోటికి వచ్చినట్టుగా చెప్పే సోది… జాతకం అయిపోతుందా? అది జరుగుతుందని నమ్మకం ఏంటి? అని అనుకుంటుండగానే “ నాయనా నీ లోని ధర్మసందేహాలు తీరుస్తాను! నువ్వు ఐఏఎస్ కావాలని అనుకున్నావా లేదా” అని అడిగాడు ! “అవును” అన్నాను! అలాగే “ప్రస్తుతం నువ్వు ఫలానా పేరుతో ఉన్న అమ్మాయి ప్రేమలో ఉన్నావా లేదా” అని అడిగాడు! దానికి నేను ఆశ్చర్యపోతూ “అవును” అన్నాను! అలాగే “నీకు ఫలానా సబ్జెక్ట్ అంటే ఇష్టం… ఫలానా మార్కులు వస్తాయని” అని ఖచ్చితంగా చెప్పే సరికి గతుక్కుమన్నాను!

అప్పుడు నువ్వు అదే ఐఏఎస్ (IAS)కావాలి అనుకుంటున్నావు !కానీ దానిని తిరగేస్తే వచ్చే ఎస్.ఏ.ఐ (S.A.I) సాయి అవుతావు! ఏ జ్యోతిష జ్ఞానము తక్కువగా చూసినావో అది నీకు భుక్తిగా ఇచ్చే వృత్తిగా మారుతుంది! ఏ దేవతల కోసము తపన పడుతున్నా వో వారిని హోమ దేవతలుగా చూస్తావు! నువ్వు ఏమి గావాలని అనుకుంటున్నావో అది అవ్వవు! ఏది వద్దు అని తపనపడుతున్నావో దానిగా మారిపోతావు! ఇది సత్యం! నా వాక్కు బ్రహ్మ వాక్కు ! విధి లిఖితం! నీ విధి రాతను ఏనాడో ఆ బ్రహ్మ లిఖించి నాడని తెలుసుకో! కొత్తగా చేయడానికి… నువ్వు కొత్తగా తెలుసుకోవడానికి ఈ లోకంలో ఏమీ లేదని గ్రహించే సమయం త్వరలో ఆసన్నమవుతోంది! కామి కాస్త మోక్షగామి గా మారుతావు! త్వరలో నువ్వు లేనివాడివి నువ్వే అని తెలుసుకుంటావు! చెయ్యని వృత్తి అంటూ ఉండదు! సర్వ సుఖాలు, సర్వభోగాలు అనుభవించే కారణజన్మ యోగివని త్వరలో గ్రహిస్తావు! దైవమే నీ మాట వినే స్థాయికి వస్తావు! నీ వాక్కు శాసనంగా మార్చుకుంటావు! మంత్ర, తంత్ర, యంత్ర సిద్ధి పొందుతావు! శ్రీ చక్ర ఆరాధకుడువి అవుతావు! శారీరిక యోగి కన్నా మానసిక యోగిగా మర్కట సన్యాసమును తీసుకుని నీ నామమును సార్థకం చేసుకుంటావు!అన్ని రకాల యోగసిద్ధులు పరిశీలిస్తావు! అన్ని రకాల అనుభూతులు పొందుతావు! దైవ శక్తులను కనుక్కుంటావు! దైవ శక్తులను ఆధీనం చేసుకుంటావు! వీటిని మీ స్వార్థం కోసము ఉపయోగించవు !అన్ని రకాల దైవిక వస్తువులను, మహత్తర వస్తువులను పొందుతావు !వాటిని పట్టించుకోవు! వాటిని ఉపయోగించే లేని స్థితికి చేరుకుంటావు! మూలాలు తెలుసుకుంటావు! మాయల దగ్గర బోల్తా పడతావు! మాయల రహస్యాల దగ్గర తల ఒగ్గి దాటుతావు! తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటూ నీటి బొట్టు లాగానే నశించిపోతావు! కోరికలు అనుభవిస్తావు! సంతాన తాపత్రయాలు ఉండవు! ఇక సంతానమే ఉండదు! వివాహ యోగం ఉన్నది! ప్రేమ వివాహము చేసుకుంటావు! లేచి పోయే వివాహము చేసుకుంటావు! ప్రస్తుతము నీవు ప్రేమించే అమ్మాయి నిన్ను వివాహాము చేసుకోదు! కోరిక వాసనలు పడవు! కోరికలో పడ్డామని లోకానికి చెబుతావు… చూపిస్తావు…అందరిని మాయలో ముంచి…. మీరు మాయ నుండి బయటపడతావు! లోకానికి తెలియకుండానే నీ సాధన స్థాయి పరమ గురువు స్థాయి దాకా వెళుతుంది! అయినా లోకానికి మాత్రం ఏనాడూ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటావు! కర్మలు చేసే స్థాయి నుండి ఆ కర్మలు ఆడించే వాటిని నాశనం చేసే మనో యోగ సాధన స్థాయికి చేరుకుని పరిపూర్ణ జ్ఞానిగా మారి సంపూర్ణంగా అంతరించిపోతావు! మోక్షప్రాప్తికి కొత్త సాధన విధానమును కనిపెడతావు! నవ బ్రహ్మలను కలుపుతావు! బ్రహ్మ తదాకార స్థితి గల బ్రహ్మ సిద్ధాంతమును లోకానికి తెలియజేస్తావు!త్వరలో మోక్షగామిగా మారతావు! త్వరలో జరిగే ఈ విద్యా పరీక్ష యందు తప్పి ఆవేదన చెంది భోగి కావాల్సిన వాడి కాస్త యోగిగా మారకపోతే ఇక నేను నా జీవితంలో ఎవరికి జాతకం చూడను! చెప్పను!

తన వాగ్దాటి నా ముందు ప్రదర్శించే సరికి వాటిని నమ్మాలా వద్దా? నమ్మితే జరిగే వాటిని చూసి నవ్వాలా.. ఏడవాలా.. నా బతుకు ఇంత చిందరవందరగా ఉంటుందా? చక్కగా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని పెళ్ళాం పిల్లలతో గడపవలసిన వాడిని… గృహస్థాశ్రమం చేస్తూ సంతానము లేకుండా మర్కట సన్యా సిగా జీవించడమా? ఐఏఎస్ కావాల్సిన వాడిని కాస్త తిరగేసి సాయి గా మారుతానా? ఇవన్నీ జరిగే సంఘటనలనే? నా బొంద! జాతకాలు అని లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్లుగా ఉందే? అయినా భవిష్యత్తు ముందే తెలిస్తే కిక్ ఇంకేముంటుంది! కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో! జాతకాలు నమ్మని వాడిని జాతకాలు చెప్పి బ్రతకడమా? ఏమిటి … వామ్మో నా జీవితం ఏమిటి? వీటిని నమ్మాలా వద్దా? అయినా ముందు పరీక్షలు జరగని! అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చిన వాటిని చూసి నిర్ణయం తీసుకుందాం! అప్పటిదాకా వీటిని నమ్మ కూడదు అనుకుంటూ… వారికి నమస్కారం చేసి …అర్ధం కాని అయోమయంలో అక్కడి నుండి ఇంటి వైపు అడుగులు వేశాను! ఏమిటి ఆలోచిస్తున్నారా? ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు నా జీవితంలో జరిగినాయా లేదా? …. అయితే వాటిని తెలుసుకోవాలంటే ఇంకా ఏం జరిగిందో మీరే చూడండి! ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! శుభం భూయాత్

గమనిక::

ఇలా ఈయన నాకు చెప్పిన జాతకము అంతాగూడ పొల్లుపోకుండా యధావిధిగా నా జీవితములో జరిగినాయి.ఇలా నా జాతకమును చెప్పినవారు ఎవరో గాదు...మా భౌతిక గురువైనా విచిత్ర వేదాంతి అన్నమాట. ఈయన ఎవరో ...వీరి వివరాలు ఏమిటో మీకు రాబోవు “విచిత్ర వేదాంతి” అనే అధ్యాయములో చెప్పడము జరిగినది.గమనించగలరు.

కపాలమోక్షం - 14

నా జాతక ఫలితాలు

కాలేజీ పరీక్షలు దగ్గరకు వస్తూ ఉండటంతో శ్రద్ధగా చదవడం ఆరంభించాను! జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు నా స్నేహితులకు చెప్పగానే “స్టేట్ ర్యాంకు వచ్చే వాడికి పాస్ మార్కులు రాకపోవడమేమిటిరా? ఆయన చెప్పినవి తప్పు అని నిరూపించడానికైనా చదువు” అన్నారు! అధ్యాపకులతో నా జాతక విషయాలు చర్చించే సరికి వారు కూడా ఫక్కున నవ్వి “మా కాలేజీకి నీవలన ఒక ర్యాంకు వస్తుందని సంబరాలు చేసుకుంటుంటే… నువ్వేంటి స్వామి.. ఇలాంటి తప్పుడు జాతకాలు నమ్ముతున్నావు? వాటిని పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టి బుద్ధిగాచదువుకో… ర్యాంక్ నీ లక్ష్యం అని గ్రహించు”! అని హితబోధ చేసినారు! దాంతో నాలో ఉన్న అన్ని రకాల అపోహలు, భయాలు తొలగినాయి! యధావిధిగా నా చదువు కొనసాగిస్తుండగా… నాలో మన్మధుడు నిద్రలేచాడు!

అప్పటిదాకా రాధాదేవితో స్నేహ భావం కాస్తా ప్రేమ భావముగా మారే అవకాశాలు ఏర్పడ్డాయి! దాంతో నాకు తెలియకుండానే నా చదువు ధ్యాస తగ్గి ఆమె ధ్యాస పెరగటం నేను గమనించే స్థితిలో ఉన్నా…. ఏమీ చేయలేని గందరగోళ స్థితిలో ఉండే వాడిని! చదువుకోవాలని అనుకుని పుస్తకాల తీయగానే ఆమె తలంపులు వచ్చేవి! పుస్తకం తెరిచే ఉంటుంది కానీ మనస్సు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్లుగా తెరిచే ఉండేది! ఆమె కూడా ఇలాంటి స్థితిలో ఉన్నదని తెలియగానే నా మనస్సు ఆనంద పడినది! ఏదో తెలియని వయస్సులో… అనుభవం లేని మనస్సు… కాస్తా … హీరో అనుభవాలు పొందాలని చదువు పాఠాలు కోసం తపన పడటం పోయి ప్రేమ పాటల కోసం తపన మొదలైంది! దాంతో గుళ్లో పూజారిని కాస్తా ప్రేమపూజారిగా మారిపోయాను ! పుస్తక పఠనం కాస్త కామశాస్త్ర పఠనం గా మారింది! ప్రణవ మంత్రము కాస్తా ప్రణయ మంత్రముగా మారింది! ఇంతలో పరీక్షలు దగ్గర పడ్డాయి! మొక్కుబడిగా పరీక్షలు వ్రాస్తున్నానని నాకు తెలుసు… కానీ ఏమీ చేయలేను ! అప్పుడు ఆమె నుండి నాకు తొలి ప్రేమ ఉత్తరం అందినది! రేపటి పరీక్షకు ప్రిపేర్ అవ్వకుండానే ఈ ప్రేమ పరీక్ష కి సన్నిహితుడిగా మారినాను! నేను కూడా ప్రేమ లేఖలు రాయడం ఆరంభించాను! లేఖలు మారినాయి ! పరీక్ష ఫలితాలు వచ్చినాయి! నా రాత మారినది ! నేను అందుకున్న తొలి ప్రేమ లేఖ సమయములో నేను రాసిన పరీక్ష తప్పడం జరిగినది! కానీ విచిత్రం ఏమిటంటే ఆమెకి కాలేజీ ఫస్ట్ ర్యాంకు వచ్చినది! నాకేమో పరీక్ష తప్పిన మెమో వచ్చినది! నాకు ఆశ్చర్యం వేసింది!మేమిద్దరం ప్రేమలో ఉంటే ఆమె కూడా పరీక్షలో తప్పాలి కదా! మరి ఎలా పాస్ అయినదని విచారించగా… తనకి కాలేజీ ఫస్ట్ ర్యాంకు వస్తే ఉన్నత చదువులు చదివిస్తాం అని…. డాక్టర్ చేయిస్తాడని వాళ్ళ నాన్న మాట ఇచ్చాడట! ఎక్కడ తనకి కాలేజీ ఫస్ట్ ర్యాంకు నావల్ల రాదేమో అని భయమేసి… ప్రేమ పేరుతో వంచించి … నన్ను తన ప్రేమ మాయ లో ఉంచి…. తను కష్టపడి చదివి ర్యాంకు సంపాదించుకున్నది అని తెలియగానే నా గుండె బ్రద్ధలయినట్లుగా అనిపించింది!

అభినందన సినిమాలోని ప్రేమ మధురం… ప్రియురాలు మనస్సు కఠినం అనే పాట లీలగా నా చెవిలో వినబడసాగినది! ఇంతకి జ్యోతిష్కుడు చెప్పినట్లుగా జరిగినదా లేక ఈ తొలిప్రేమ వల్ల నా చదువు అటకెక్కిందా? నాకే తెలియని అయోమయ స్థితిలో…. ఇంటిదారి పట్టి బాత్రూంలో ఏడవడం తప్ప ఏమి చేయలేకపోయాను!

ఇంత చేసిన ఆమె మీద కోపం రాలేదు! ఎందుకంటే తను ఇష్ట పడిన చదువు కోసం ఆమె చేసిన మంచి ప్రయత్నమే కదా! ఆడ పిల్లలు ఉన్నత చదువులు చదివించకూడదని అనుకొనే తల్లిదండ్రులు ఉన్నంతవరకు పాపం ఇలాంటి సరస్వతీ పుత్రికలకు ఇబ్బందులు పడవలసిందేనని నాకు అనిపించినది! ఆమె వెళ్ళిన విధానం మంచిది కాకపోవచ్చు కానీ ఆమె దేని కోసమో ఇదంతా చేసిన ఉద్దేశం మంచిదే కదా అని మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రేమ దెబ్బ నుండి కోలుకొని తెలుసుకున్నాను! తను ఇప్పుడు అమెరికాలో ఒక గొప్ప సర్జన్ గా మారినది! నేను జాతకాలు చెప్పే జ్యోతిష్యుడు గా మారినాను! అది ఎలా జరిగింది అనే కదా మీ సందేహం? ఇంకెందుకు ఆలస్యం… ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే….. మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

గమనిక:

నిజప్రేమతో కాకుండా కామప్రేమతో ప్రేమ పేరుతో ఈనాడు అబ్బాయిలు, అమ్మాయిలు మోసం చేసుకుంటున్నారు! పెళ్లి అయిన వారు అక్రమ సంబంధాలు పెట్టుకుని వివాహ దాంపత్య జీవితమును నాశనం చేసుకుంటున్నారు! మోసము చేసుకొని జీవిస్తున్నారు! కొందరు దొరలుగా ఈ తప్పు చేస్తూంటే...మరికొందరు చాటుమాటుగా చేస్తున్నారు! పిల్లల్ని అనాధలు చేస్తున్నారు! ఇది మంచి పద్ధతి కాదు!

విచిత్రం ఏమిటంటే నేను ప్రేమించానని అనుకునే వాళ్ళ పెళ్ళి శుభలేఖలు నాకు వచ్చేవి! దాంతో మా స్నేహితులంతా నేను ప్రేమ పూజారిని కాదని… పెళ్లిళ్లు పూజారిని అనేవారు! నన్ను ప్రేమించే అమ్మాయిలను నేను కాదనుకుంటే… వాళ్ళు నా కళ్ళముందు వివాహం చేసుకుని… “ఏమండీ! ఏమండీ” అని వేరే వ్యక్తిని భర్తగా పిలుస్తూ ఉంటే… నా స్వామి రంగా…ఉంటుంది.. ఏదో తెలియని నరకయాతన! ఇది ఇలా ఉంటే నేను ప్రేమించిన అమ్మాయిలు నన్ను కాదనుకుని వేరే వ్యక్తిని భర్తగా ఏమండీ ఏమండీ అని నా కళ్ళముందు పిలుస్తుంటే ఇదో రకమైన మరణయాతన! నేను ప్రేమించిన అమ్మాయిలు ప్రేమను పొందలేక… అటు నన్ను ప్రేమించిన అమ్మాయిల ప్రేమను పొందలేక… నానా అగచాట్లు పడి ఈ రెండు రకాల ప్రేమ అనుభవాల వల్ల నా మనస్సు నాకు తెలియకుండానే వివేక వైరాగ్య భావాలు వైపు దారితీసింది!

ఇష్టము లేని ప్రేమగా… ప్రేమలో ప్రే అంటే ప్రేమించడమే … మ అంటే మరిచిపోవడం అని అనుకునే సమయంలో… ఎలాగైనా ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాను! ఇష్టం లేని ప్రేమతో ఎదురు చూశాను! నాకు లాగనే ప్రేమ మీద విరక్తి చెందిన ఒక స్త్రీమూర్తిని చూడటం… ఆమెకి ప్రేమ ప్రతిపాదన చెప్పడం కన్నా వివాహ ప్రతిపాదన పెట్టడం… ఆమె దానికి సరే అనడం.. వివాహం జరిగి పోయిన తర్వాత ప్రేమించుకోవడం ఆరంభించినాము! పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి పిచ్చి అని… పెళ్లయిన తర్వాత ఒకరి వలన మరొకరికి పిచ్చికెక్కుతుందని అనుభవసారం ద్వారా తెలుసుకున్నాము!

ఇక జ్యోతిష్యశాస్త్రము వలన రాబోవు విపరీత సమస్యలకి పరిహారాలు అలాగే రాబోవు పరిస్ధితులకి మనల్ని సిద్ధపడేటట్లుగా చేస్తుందని నా జ్యోతిష్య అనుభవము ద్వారా తెలుసుకోవడమైనది!

కపాలమోక్షం - 15

మంత్రాలకి మహత్తుందా?

భోగజీవితములో ఎదురైనా అమ్మాయిల ప్రేమ చేదు అనుభవాల కన్నా యోగ జీవితములో ఎదురైన అమ్మవారి మాయలు మిన్నయని గ్రహించి తిరిగి యోగ జీవితములోనికి ప్రవేశించాను!అపుడు అసలు నిజంగానే మంత్రాలకు మహత్తుందా? అనే ధర్మ సందేహం నాకు ఎప్పుడు నన్ను వెంటాడేది! ఎందుకంటే ప్రతి నిత్యం ఈ మంత్రాలు చదవలేక… ఒత్తులు సరిగా పలకలేక….ఇబ్బందులు పడేవాడిని! పైగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్ర విధి విధానాలు ఉంటాయి! శివయ్య, బాలమ్మ, గణపతి, కుమారస్వామి, వీరభద్ర, హనుమాన్, సుబ్రహ్మణ్య ,నవగ్రహాలు ఇలా ప్రతి విగ్రహమూర్తికి మంత్రాలతో అభిషేకాలు, మంత్రాలతో పూజలు చేసే సరికి నాకు నిజంగానే ఈ మంత్రాల మీద సందేహాలు వచ్చేవి! విసుగు, చికాకు వచ్చి ఈ మంత్రాలు కనిపెట్టిన వారిని…. ఈ పూజా విధానాలు కనిపెట్టిన వారిని …ఈ విగ్రహారాధన కనిపెట్టిన వారిని… ప్రతిరోజు తిట్టుకుంటూ బాధపడుతూ చేసేవాడిని! అప్పుడు నాకు తెలిసి తెలియని వయస్సు! ఇన్ని విధాలుగా, ఎన్ని సార్లు పూజలు చేస్తున్న, విగ్రహాలు మాట్లాడక పోయేసరికి నాకు విసుగు, చికాకు బాగా పెరుగుతూ వచ్చింది! మహా నైవేద్యమును చెప్పి విగ్రహమూర్తికి అన్నం తినిపించాలని… ఆయనే స్వయంగా వచ్చి అన్నం తింటాడు అని… ఆలోచనలో ఉండేవాడిని! కానీ ఎప్పుడూ కూడా, ఎక్కడా కూడా, పూజించిన ఏ విగ్రహమూర్తి వచ్చి నేను పెట్టిన మహా నైవేద్యాలు, ప్రసాదాలు తిన్నట్లుగా ఎక్కడ కనిపించలేదు …అనిపించలేదు! అనగా అనుభవం గాని, అనుభూతి కాని కలగలేదు! దాంతో రాను రాను నాకు విగ్రహం భక్తి మీద, మంత్రాల మీద వైరాగ్య భావాలు కలగటం మొదలైనాయి! పనికిరాని వాటిని కనిపెట్టి సమయము, డబ్బులు దండగ చేస్తున్నారని ఆలోచనలు విపరీతంగా వచ్చేవి!

మహాశివరాత్రి నాడు రుద్ర నమకాలతో 11సార్లు ఏకాదశ రుద్రాభిషేకము మూడు గంటలపాటు జరిగేది! ఇలా చెప్పిన మంత్రం 11 సార్లు చెప్పటం ఎందుకో అర్థం అయ్యేది కాదు! పైగా ఈ మంత్రం ఉఛ్చారణ జరుగుతున్నంతసేపు ….శివ లింగ మూర్తి మీద పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండాలి! పైగా ఏమీ తినకుండా, ఉపవాస దీక్షతో శ్రద్ధగా, ఓపికగా చేయాలి ! నా సామిరంగా ఇక చూడండి ! ఒక పక్క ఆకలి… మరొక పక్క పంచామృతాలతో అభిషేకం పని… మరోపక్క మంత్రం ఉఛ్చారణ… కదలకుండా, మెదలకుండా శివాభిషేకం చేయాలి! మూత్రమునకు వెళ్ళవలసి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి! అదే మలమునకు వెళ్ళవలసి వస్తే ఏకంగా స్నానం చేసి రావాలి! దాంతో ఇవి వచ్చేటట్లు ఉన్నా కూడా ఈ పనులు చేసే ఓపిక లేక బలవంతంగా ఆపుకొని రుద్రాభిషేకము చేసే వాడిని! దాంతో నాకు విసుగు వచ్చేది! ఇదిలా ఉంటే… దేవీ నవరాత్రులను చేసే దసరా పండుగ వచ్చేది! ఇక చూడండి నా సామిరంగా! అమ్మవారికి ప్రతిరోజు అలంకారాలు మార్చాలి! సాయంత్రం లలితా సహస్రనామాలతో శ్రీ చక్రార్చన! వచ్చిన వారందరికీ ప్రసాదాలు పంచేసరికి నా ప్రాణం తోకకి వచ్చేది! దీనమ్మ! అసలు మంత్రాలలో మహత్తుందా అనేది ఉందా… ఇంతమంది ఇన్ని సార్లు లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు…. ఒక్కనాడు ఒక్కసారైనా పూజ చేయించుకున్న అమ్మవారు నాకే కాదు …చేసినవారికి ఎవరికి కూడా కనిపించకపోయేసరికి విసుగు, చికాకు వచ్చేది! నా భక్తిలో లోపం ఉంటే ….మిగతా వారి అందరి భక్తుల భక్తిలో లోపాలు ఉంటాయా లేక అసలు మంత్రాలలో లోపాలు ఉన్నాయా నాకైతే అర్థం అయ్యేది కాదు! అర్థమై, అర్థంలేని, అర్థంకాని మంత్రాలతో అర్థం - పర్థం లేని పూజలతో కాలం గడుపుతున్నాని నాకు తీవ్రంగా అనిపించే సమయంలో …. ఒక మహత్తర సంఘటన జరిగినది!

మా ఊరిలో ఒక ఆయనకి ఒకసారి పాము కరిచింది! అది పైగా విషసర్పం! మా ఊరి వైద్యులు ఇతను బతకడం చాలా కష్టమని చేతులెత్తేశారు! దాంతో వాళ్లు గుడి దగ్గరికి వచ్చి ….ఉన్నాడో లేడో తెలియని శివ లింగ మూర్తి దగ్గరికి వచ్చి ….”మా వాడిని ఎలాగైనా బతికించు స్వామి! ఈ జాతరలో వాడి పేరు మీద ఒక ప్రభ కట్టి ఊరేగింపు చేస్తాము! మాకు వాడు ఒక్కడే కొడుకు! రక్షించు దేవా”! రక్షించమని వేడుకున్నారు! నాకైతే అతను చనిపోవడం ఖాయమని అనిపించినది! ఇంతలో ఆ గుంపులో నుంచి ఒక పెద్దాయన వెంటనే “రేయ్! మనము పాము మంత్రం వేస్తే పాములస్వామి దగ్గరికి తీసుకుని వెళ్లి మన వాడి బతికిద్దాం! వాడు ఖచ్చితంగా బతుకుతాడు! పదండి” అనగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది! ఏమిటి ఇక్కడ ప్రతిరోజూ క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా, నిత్యము చేస్తున్న ఈ ఒక్క దేవుడు మహత్తు చూపలేదు! అలాంటిది ఎవరో స్వామి… పైగా ఆయన పాము మంత్రం వేస్తే… పాముకాటుకు గురైన వ్యక్తి బతుకుతాడుట! పైగా వైద్యులు బ్రతికించలేమని చెప్పి చేతులెత్తేస్తే… పాము మంత్రం వేసే వాడు ఎలా బతికిస్తాడు? వీరి పిచ్చి గాని అనుకుని… అసలు ఏమి జరుగుతుందో ఒకసారి వీరి వెంట వెళితే పోలా అనిపించడంతో …. ఈ గుంపు వెంట… పాములు స్వామి దగ్గరికి వెళ్లాను!

ఆయన చూస్తే 80 సంవత్సరాల వయస్సున్న వాడి లాగా ఉన్నాడు! బయటకు వచ్చి.. పాము కరిచిన వాడి దగ్గరికి వచ్చి… పాము కాటు వేసిన చోట చూసి… చిరునవ్వు నవ్వి “కంగారుపడకండి! తగ్గిపోతుందిలే ! ఎలా ఎక్కినదో....అలా కిందకి దిగిపోతుందిలే! తగ్గిపోతుందిలే” అంటూ లోపలికి వెళ్లి… ఏదో వేరు లాంటిది తెచ్చి… ఈ పాము కాటు వేసిన చోట దీనిని పెట్టి… ఏదో మంత్రం చదువుతుండగానే … సృహ కోల్పోయిన వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి… నేను గతుక్కుమన్నాను! వామ్మో! ఇది విచిత్రంగా ఉందే! ఎవరో చెప్పినట్లుగా.. నిద్రలో లేచినట్లుగా లేస్తున్నాడు! ఆయన ఏదో మంత్రం చదువుతూంటే పాము కాటు వ్యక్తి శరీరం నీలం రంగు నుండి మామూలు స్థితికి రావడం చూసేసరికి… నాకు నోట మాట రాలేదు! పాము కాటు వ్యక్తికి ప్రాణాలు తిరిగివచ్చి… లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసి అందరితో మనిషిలాగే వెళుతున్న వాడికేసి చూసి నమ్మాలా వద్దా అనే సందేహం కలిగింది! కళ్ళు ముందు జరిగిన ఈ యదార్ధ సంఘటన కి నాకు బుర్ర తిరిగింది!

ఇందులో ఏదో తెలియని రహస్యం ఉందని నాకు అనిపించి ఆ తాత దగ్గరికి వెళ్లి “నిజంగానే మంత్రాలకు మహత్తులు ఉందా” అని అడిగినప్పుడు…. ఆయన నాకేసి అదోలా చూసి … “ఎందుకు లేవు నాయనా.. ఉంటాయి! ఈ విశ్వములో మంత్రము, తంత్రము, యంత్రము అనేవి ఉన్నాయి! ప్రతి మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి! వీటికి మన శరీరంలోని నాడీ ఉత్తేజం కలిగించే శక్తిని కలిగి ఉంటాయి ! వీటికి ఆ శక్తిని ఆయా మంత్ర దేవతలు ఇస్తారు! వీరికి మన విశ్వంలో ఉన్న దైవ శక్తి వారికి ఇస్తుంది! ఈ దైవ శక్తికి మనం నిత్యం చేసే హోమాలు, యజ్ఞాలు, యాగాల వలన వాటిలో వేసే ప్రతి పదార్థం వలన అనగా ఆవు నెయ్యి, ఆవు పిడకలు, ఆవు పాలు, కొబ్బరికాయలు, నవధాన్యాలు, నవగ్రహ సమిధులు, పట్టువస్త్రాలు సుగంధ ద్రవ్యాలు… ఇలా వాడే ప్రతి పదార్థం వలన హోమ దేవతలకు దైవ శక్తి వస్తుంది! ఎలా అంటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ ను తీసుకొని మళ్ళీ మనకి ఆక్సిజన్ ఇచ్చే మహత్తర శక్తి ఉన్న ఒక్క గోమాతకే ఉంది !అనగా ఆవు జాతికే ఇట్టి అవకాశం ఉన్నది! నువ్వు నిత్యం చేసే పంచామృతాలు అనగా ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె పంచదార వాడుతున్నావు కదా! అంటే మన శరీరంలోని మనకు తెలియకుండా ప్రాణ శక్తి స్థాయిలు తగ్గినప్పుడు… మనలో ఉన్న వివిధ రకాల చక్రాలు బలహీనపడతాయి! దాని వలన వీటికి సంబంధించిన అంగాలు దెబ్బతినటం మొదలై… వ్యాధుల రూపంలో బయటికి తెలుస్తాయి! ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి… మనం మనకి పున:ప్రాణశక్తి ఇచ్చే పదార్థాలను, వస్తువులను ఏర్పరచడం జరిగింది! ఇలాంటి శక్తిని ఇవ్వటంలో ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవుపేడ కి ప్రథమ స్థానం ఉన్నదని మన పూర్వీకులు గ్రహించి… వాటిని నిత్య పూజా విధానాలలో ఉండేటట్లుగా ఏర్పాటు చేసినారు! అందుకే ఆవు పేడ నుండి విభూధిని తయారుచేస్తారు! ఆవునెయ్యి ని నిత్య దీపారాధనలో వాడేటట్లుగా చేసినారు! ఆవుపాలు, ఆవు పెరుగును నిత్యాభిషేకాలకు వాడేటట్లు ఏర్పాటు చేసినారు! గో మూత్రం త్రాగే విధానం ఏర్పాటు చేసినారు! ఆవుపేడను గొబ్బెమ్మల రూపంలో పండగల సమయంలో వాడేటట్లు ఏర్పాటు చేసినారు! ఎందుకంటే మనిషికి ప్రాణ శక్తి కోసం ఒక పూజలో కాకపోయినా మరో పూజలో అందుకునే ఉద్దేశంతో ఇన్ని రకాల పూజా విధానాలు ఏర్పరచినారు! పైగా ఇలా వచ్చిన ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న 72వేల నాడులకు వెళ్ళటానికి మంత్రాలను ఏర్పరచినారు! ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క నాడులు స్పందించి… ఆయా ప్రాణశక్తిని తీసుకుని… ఆయా చక్రాలు ఆయా భావాలు కలిగిస్తాయి! ఉదాహరణకి శివ పంచాక్షరి మంత్రం చదివితే… ఆవు పాల అభిషేకం వలన మనకి జ్ఞానము ఏర్పడి వైరాగ్య భావాలు కలుగుతాయి! అనగా ఆజ్ఞాచక్రము శుద్ధి అవ్వటం మొదలవుతుందన్నమాట! అలాగే శివ పంచాయతన పూజ వలన… మనలోని పంచ చక్రాలు శుద్ధి… వీటికి ఆయా పదార్థాల వలన… అలాగే నివేదన వలన మనకి తిరిగి ప్రాణ శక్తి కలుగుతుంది! ఏ చక్రానికి ఏ దేవత ఉండాలో దానికి సంబంధించిన నిత్య పూజా విధానాలు ఏవిధంగా ఉండాలో…. దానికి తగ్గట్లుగా నాడులు ఎలా స్పందిస్తాయో…. గమనించి …. ఏ పదార్థాలు తింటే అది బలంగా ఉందో తెలుసుకుని ఆ విగ్రహ పూజా విధానాలు ఏర్పాటు చేశారు!

ఇలాగే పాము మంత్రం, తేలు మంత్రాలు కూడా వచ్చినాయి! వీటికి వీటి విషానికి విరుగుడుగా సంజీవిని వేరు మొక్క అలాగే పాము కోరల్లో ఉండే నల్ల రాళ్లు అన్నమాట! వీటిని ఉపయోగించి ఎంతటి విషమునైనా హరించి వెయ్యవచ్చును! కాకపోతే వీటిని ఉపయోగించేటప్పుడు… కాటు తిన్న వ్యక్తి నుండి…. వైద్యం చేసే వ్యక్తికి ఈ విషము వచ్చే అవకాశం ఉండటం వలన… దీని నిరోధించుటకు పాము అలాగే తేలు మంత్రాలను కనిపెట్టారు! వీటిని నిష్టతో 12 సంవత్సరాల పాటు ఈ మంత్రాలను ఆరాధన చేసిన వారికి… ఈ మంత్ర సిద్ధి కలిగి… ఎలాంటి విషము వీరిని ఏమీ చేయదు! పాములు లేదా తేలు కాటు వేస్తే అవి చనిపోతాయి కానీ ఈ మంత్ర సిద్ధి పొందిన వారికి ఏమీ కాదు” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు! నా కళ్ళు తెరిపించి నాడు!

అంటే మనము నిత్యం చేసే పూజలలో చదివే మంత్రాలలో, దైవిక పదార్థాలలో, ఎంతో మహత్తు ఉన్నదని గ్రహించి…. వాటిని ఒక వరుస క్రమంలో… ఒక పూజా విధి విధానాలతో… మనకి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేసిన మన భారతీయ ఆగమశాస్త్ర విధి విధానాలకి నమస్కారం చేసినాను! ఈ పూజావిధానాలలో ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి మూలికా వైద్యము, రేకి వైద్య విధానం… మనకి అలాగే రాబోవు మానసిక, శారీరిక మనోవ్యాధులు తొలగించారని…. అందుకే కాబోలు 24 బీజాక్షరాలను తీసుకుని… 24 దేవతశక్తులను అమర్చి… వారికి 24 గురువులను అనుసంధానం చేసి… 24చేతిముద్రాలను ఏర్పరిచి… దానిని గాయత్రి మహా మంత్రం గా రూపు దాల్చి….సర్వదేవతలకి అనుసంధానము చేసి… త్రికాలాల్లో (మూడు కాలాలలోనూ) ఆరోగ్య ప్రదాత అయిన సూర్య దేవుని… నిత్యారాధన చేసే గాయత్రి మహా మంత్రం యొక్క గొప్పతనం ఇప్పుడు తెలిసింది అని అనుకుంటూ…. ఇక నుంచి ప్రతి నిత్యం మనస్ఫూర్తిగా, ఆర్తిగా, సహనముతో, భక్తివిశ్వాసాలతో, శ్రద్ధగా మంత్రోఛ్ఛారణ చేయాలని… నిర్ణయించుకుని ఆనందంగా గుడికి బయలుదేరాను! నిత్య గాయత్రి మంత్రాష్టానము వలన నా జీవితములో జరిగిన మార్పులు ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఏమి చెయ్యాలో మీకు తెలుసు గదా!

శుభం భూయాత్

గమనిక:

పాము మరియు తేలు మంత్రాలను అలాగే ఈ మంత్రవాదులను ప్రోత్సహించాలని నా ఉద్దేశ్యము గాదని గ్రహించండి! ఎందుకంటే ఇలాంటి నిజ మంత్రవాదులను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చును! భారతీయ మంత్రశాస్త్రము యొక్క గొప్పతనము నేను తెలుసుకున్నదానిని లోకానికి తెలియచెయ్యాలని చెప్పడము జరిగినది!చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పాము మంత్రముకి ఆరాధ్యుడిగా… “పాముల నరసయ్య” అనే సిద్ధపురుషుడు ఉన్నారని… చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి కాశీక్షేత్రంలో వీరిని ఆనాటి కంచి పీఠాధిపతి అయిన చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి వారు చూసి… ఇతని చేతిలో గరుడ రేఖ ఉండటం చూసి …ఇతని వలన లోకోద్ధరణ జరగాలని భావించి… వీరికి పాము మంత్రోపదేశం చేసినారు! అలా పాముల నరసయ్య 12 సం!!రాలు పాటు బ్రహ్మచర్య దీక్షతో...అత్యంత కఠిన నియమాలు పాటించి..ఆపై మంత్ర సిద్ధి పొందిన తర్వాత ఉచితంగా అందరికీ పాముకాటు పడిన వారిని లక్షలాది మందిని రక్షించినారని… అందుబాటులో లేని సమయంలో ఫోను ద్వారా ఈ మంత్రోచ్చారణ చేస్తూ… ఎక్కడో దూరాన ఉన్న పాము కాటు వ్యక్తిని… తిరిగి ఆరోగ్యవంతులు చేసే వారని… వారి చరిత్ర చదివితే నాకు తెలిసింది! మంత్రమును మనసుపెట్టి చేస్తే… ఆ మంత్ర సిద్ధి కలిగితే… నిజంగానే మంత్రాలకి చింతకాయలు రాలతాయని... చింతకాయలేం ఖర్మ చింతమణులే రాలతాయని నేను గ్రహించాను! అంతెందుకు ఆదిశంకరాచార్యుడు ఒకసారి చేసిన కనకధార స్తోత్రం వలన బంగారు ఉసిరికాయలు రాలినాయి గదా! ఆలోచించండి! కాకపోతే ఆయా మంత్రాలను, ఆయా మంత్ర విధానాలను, శ్రద్ధాసక్తులతో, భక్తివిశ్వాసాలతో, నియమనిష్టలతో, చేస్తే… ఆ మంత్ర దేవతలు వారికి ప్రత్యక్షమై వారికి కావలసినవి ఇచ్చి వెళతాయని నా స్వానుభవములో చాలాసార్లు రుజువైంది! నామీద నమ్మకం లేదా… అయితే మీకు నచ్చిన మంత్రమును ఎంచుకుని ఆరాధన చేయండి! విషయం మీకే తెలుస్తుంది! లోపం మనలో ఉంటుంది గానీ మంత్రంలో ఉండదని గ్రహిస్తారు !

కపాలమోక్షం - 16 (వాక్సిద్ది)

నా జీవితంలో నెమ్మది నెమ్మదిగా జ్యోతిష్కుడు చెప్పిన సంఘటనలు ఒకదాని వెంట మరొకటి జరుగుతూ ఉండే సరికి…. నా జీవితం నా చేతుల్లో లేదని… గ్రహాలు ఆధీనంలో ఉందని నమ్మకం బలపడటం జరుగుతోంది! ఎవరు తన విధిరాతను మార్చలేరని… విధిరాతను తెలుసుకునే జ్యోతిష్యుడిగా అవతరించే పరిస్థితులు నా జీవితంలో ఎలా వచ్చినాయో మీరే చూడండి!

నేను గాయత్రి ఉపాసన సిద్ది పొందుతున్న సమయములో… నెమ్మది నెమ్మదిగా నా వాక్కు దైవవాక్కు గా మారినది! ఎదుటి వాడి మొహం చూడగానే నాలో ఏదో తెలియని ఉద్దేశం కలిగి వాక్ రూపంలో … వారికి జరిగిన నాలుగు సంఘటనలు… జరగబోయే పది సంఘటనలు వారికి చెప్పడం జరిగేది! అది నా ప్రమేయం లేకుండానే జరిగేది! అవి వారికి అక్షరసత్యంగా జరిగినాయని తెలిసేసరికి… నామీద నాకే అనుమానం వచ్చేది! భయం వేసేది! నేను ఎలా వీరికి వారి భవిష్యత్తు సూచనలు చెపుతున్నాను అంటే నాకు అర్థమయ్యేది కాదు! అంటే ఈ లెక్కన భవిష్యత్తు ముందే వ్రాసి ఉంటుందా? మన జీవితం జాతకాల మీద ఆధారపడి ఉంటుందా? గ్రహాల మీద ఆధారపడి ఉంటుందా ?భవిష్యత్తు దర్శిని చేయించడం వీలవుతుందా? అనే సందేహాలు నన్ను వెంటాడినాయి! నేను ఇంటర్ తప్పడంతో… నాలో అప్పటి దాకా చదువు మీద ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గినది! నిజము చెప్పాలంటే దొబ్బినది! కానీ నా తల్లిదండ్రులు పడే బాధను చూడలేక…

తప్పిన పరీక్ష కోసం తిరిగి చదవడం మొదలు పెట్టాను! ఈ ఆరు నెలల సమయంలో చదివే పుస్తకాలు పక్కనపెట్టి… భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య గ్రంథాలు పుస్తకాలు… వందల పుస్తకాలు చదవడం ఆరంభించాను!

గుడిలోకి వచ్చే భక్తులకు నాకు వచ్చిన వాక్సిద్ధి ద్వారా వారి భవిష్యత్తు చిన్నగా నాకు తెలియకుండానే సరదాగా చెప్పడం ఆరంభించాను! నా భవిష్యత్తులో జరగబోయే భవిష్య జ్యోతిష్యవేత్తగా అక్కడే బీజం పడుతుందని గ్రహించే వయస్సు కానీ మనస్సు కాని నాకు లేదు! ఎందుకంటే నా చేత చెప్పించుకుని వారంతా అచ్చం నువ్వు చెప్పినట్టుగానే జరుగుతోంది! అక్షరం కూడా పొల్లు పోవడం లేదు! నువ్వు చాలా చక్కగా ఖచ్చితంగా చెబుతున్నావు! నువ్వు అంతా! నువ్వు ఇంత! నువ్వు పెద్ద తోపు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటే… నా వయస్సు కన్నా పెద్ద వారే… నా ముందు చేతులు కట్టుకుని… నేను చెప్పే నాలుగు వాక్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటే… చీదరింపులు, అవమానాలు మిగిల్చిన ఇంగ్లీషు చదువులు ఇంకా నా బుర్రకి ఏమి ఎక్కుతాయి? ఇలాంటి సమయంలో ఒక జిజ్ఞాసి పరిచయము అయినాడు! వాడు వచ్చి నా చదువు భోగ జీవితాన్ని ఎలా యోగ జీవితంగా మార్చినాడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! శుభం భూయాత్

కపాలమోక్షం 17 (జిజ్ఞాసి పరిచయం)

ఒకరోజు నేను గుడిలో పూజా కార్యక్రమాలు చేసుకుని ….ఆరు బయట కూర్చుని ఉండగా… సాయంత్రం వేళ రాత్రి 7 గంటల సమయంలో… నా కన్నా రెండు సంవత్సరాల తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ని తీసుకుని… నా కన్నా వయసులో పెద్దవాడైన నా మిత్రుడు ఇతనిని తీసుకుని వచ్చినాడు! మా మధ్య పరిచయాలు అయిపోయినాయి! మాటల మధ్యలో కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా దేవుడంటే ద్వేషి అని… దేవుడిని చూడాలనే తపన, కసితో ఉన్నాడని… కనపడితే చంపడానికి వెనుకంజ వేసే వాడు కాదని నేను గ్రహించాను! నేను అతనికి నా వాక్సిద్ధి ప్రతిభ ప్రదర్శించాలని నాలో ఆరాటం మొదలయింది! ఆట మొదలైంది! అతనికి నాలుగు వాక్యాలు జరిగినవి చెప్పాను! జరగబోయేది చెప్పాను! అతను పెద్దగా స్పందించలేదు! అవునా అన్నట్లుగా అమాయకత్వం మొహం పెట్టి నవ్వి ఊరుకున్నాడు! వీడేంటి చాలా తేడాగా ఉన్నాడు! వీటిని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది! అనుకుంటున్న సమయములో అతను వెంటనే “స్వామి! ఒక రోజు, రెండురోజులు జరగబోయే విషయాలు చెప్పడం గొప్ప కాదు! జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనను నిమిషాలలో..క్షణాలలో కూడా చెప్పగలరా? అంతా విధి ప్రకారం జరిగితే ఇంకా పూజలు ఎందుకు? ఈ దేవాలయాలు ఎందుకు? ఎందుకు ఈ దేవుడు? ఏవో గ్రహ సంచారమును బట్టి నాలుగు వాక్యాలు జరిగితే అది విధి వ్రాత తెలుసుకోవడమేనా? నా భవిష్యత్తు ఏమిటో… రేపు ఏం జరుగుతుందో… అంతెందుకు రాబోయే నిమిషాలలో, క్షణాలలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి చూద్దాం? మనుషుల మనస్తత్వం ఆధారంగా చేసుకుని చెప్పే నాలుగు వాక్యాల జరిగినంత మాత్రాన భవిష్యత్తు చెప్పినట్లు కాదని ఘంటాపధంగా చెప్పగలను! ఈ క్షణంలో నేను ఏమి చేస్తానో చెప్పండి చూద్దాం! మీరు చెప్పినది ఖచ్చితంగా జరిగితే … మీరు విధాత అని నమ్మి… జ్ఞాన సిద్ధుడువని నమస్కారం చేసి వెళ్ళిపోతాను” అనగానే నేను అయోమయం పడిపోయాను! నన్నే ఈ స్థితిలో పడేశాడు అంటే వీడు సామాన్యుడు కాదని… ఏదో కార్యం మీద అకారణంగా నా దగ్గరకు వచ్చిన కారణజన్ములు అని నాకు అర్థమయింది!

వాడికి భవిష్యత్తు చెప్పడం సమస్య కాదు! నేను చెప్పి నదానికి వాడు వ్యతిరేకంగా చేస్తే… నేను చెప్పిన దానికి కావాలని వాడు వ్యతిరేకంగా చేస్తే అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది! ఈ క్షణమే నువ్వు నుంచుని ఉంటావని నేను చెప్పితే… వాడు కదలకుండా కూర్చుంటే… నా పరిస్థితి ఏమిటి? పోనీ కూర్చుని ఉంటావని నేను చెప్పితే… వాడు నుంచుని ఉంటే నా స్థితి ఏమిటి? అప్పటిదాకా నా వాక్సిద్ధి వలన పెద్ద తోపు గాడిని అనే బిరుదు చంక నాకి పోతుంది కదా! వామ్మో అలా జరగడానికి వీలు లేదు! పరువు పోకూడదు! పాము చావకూడదు… కర్ర విరగ కూడదు అని అనుకుంటూ వాడితో “మిత్రమా! నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు! నీ భవిష్యత్తు క్షణాలలో ఏమి జరుగుతుందో నేను చెబుతాను! ప్రస్తుతం నా నాకున్న వాక్సిద్ధి ద్వారానే భవిష్యత్తు సూచనలు ఇంతవరకు చెప్పినాను! సంపూర్ణ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యజ్ఞానం నాకు లేదు అని చెప్పి ఊరుకున్నాను! నా నిజాయితీ మాటలకి అతను సంతృప్తి చెంది… నీతో స్నేహం చేయాలని ఉందని చెప్పి ఆప్తమిత్రుడుగా మారినాడు! ఆనాటి నుండి అతనిని జిజ్ఞాసి గా నేనే పిలవడం ఆరంభించాను! నాలో అంతవరకు ఉన్న భవిష్యత్తు చెప్పే జ్ఞాన అహంకారము… ఇతని మాటల వలన దొబ్బినది! నాలో ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆరంభమైనది! పొగడ్తలు మాయ నుండి బయట పడటం జరిగినది! ఆ తర్వాత కొన్ని రోజులకు జ్యోతిష్య గ్రంథాల ద్వారా జాతక చక్రములో గ్రహస్థితుల ఆధారంగా జాతక ఫలితాలు చూడటం ఆరంభించాను! నాకు తెలియకుండానే జ్యోతిషం వైపు నా మనసు లాగడం ఆరంభమైనది! ఎక్కడో రేడియోలో అంతులేని కథ సినిమాలోని “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి… ఇంక ఊరేల … సొంత ఇల్లేల… ఓ చెల్లెలా… ఏది స్వార్ధం.. ఏది పరమార్ధం అనే పాట లీలగా వినబడసాగినది! మీరు కూడా ఆ పాటను గుర్తు చేసుకుని…. అయితే ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి ! శుభం భూయాత్

గమనిక:-

కొన్ని నెలలకు గాని ఇతనికున్న అపార శాస్త్ర విజ్ఞానము నాకు అర్థం కాలేదు! ఏవో అర్థంపర్థంలేని ధర్మసందేహాలు నన్ను అడిగి విసుగు తెప్పిస్తున్నాడని అనుకున్నాను! ఉదాహరణకు నేను అంటే ఎవరు? మాయ అంటే ఏమిటి? ఆత్మ ఒకటేనా … వేరు వేరా? దేవుడు ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఏమి చేస్తూ ఉంటాడు? దేవుడిని చూసారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీకు కనిపించాడా? కనపడితే ఎలా కనబడ్డాడు? ఏ విధంగా కనబడ్డాడు ?మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా భక్తి అంటే ఏమిటి? మాయ అంటే ఏమిటి? అనేక ధర్మ సందేహాలు, సాధనా సందేహాలు నన్ను అడుగుతుండేవాడు! కానీ ఇతనికున్న శాస్త్రాల మీద, పురాణాల మీద, ఇతిహాసాల విషయాలు మీద ఉన్న జ్ఞానము, అంతటి జ్ఞానము సైన్సు విషయాలమీద కూడా ఉందని గ్రహించాను! అంటే ఒక రకంగా శబ్ధ పాండిత్యము ఉన్న అపార బ్రహ్మజ్ఞాని అన్నమాట! కానీ పురాణ ఇతిహాసాల విషయాలు చెప్పిన విషయాలను సైన్స్ విజ్ఞాన విషయాలు పోల్చుకుని సంతృప్తి పడే తత్వం ఉన్నాడని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను! నిజానికి ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి… చెప్పుకోవాలి! అది ఏమిటంటే నేను ఇలా అనుభవం పాండిత్య జ్ఞానము పొందటానికి అలాగే నా ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాయి ఇతను అని గర్వంగా చెప్పగలను! విచిత్రమేమిటంటే ఇతను ఏదో ఒక ఆధ్యాత్మిక ధర్మసందేహము నా దగ్గరికి తీసుకుని వచ్చేవాడు ! దీనికి సంబంధించిన గ్రంథాలలో చదివిన విషయం అతనికి ఒకే ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నప్పటికీ… ఏది నిజమైన సమాధానము అతనికి అర్థం అయ్యేది కాదు! ఉదా: మాయ అంటే కొంతమంది భ్రమ భ్రాంతి అని, మరికొంతమంది మనో భ్రాంతి అని, కొంతమంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు గానే చూచేది, మరికొంతమంది త్రాడు కాస్త పాముగా కనిపించేటట్లుగా చేస్తుందని చెప్పేది మాయ అని ఇలా ఒక మాయ మీదే అతనికి అనేక సమాధానాలు దొరికేవి! తెలుసుకోవటం జరిగేది! ఇందులో ఏది సత్యమో అతనికి అర్థమయ్యేది కాదు! నా దగ్గరకు వచ్చి ఈ సందేహ నివృత్తి చేసుకునే వాడు! నేను ఇతనికున్న శబ్ద పాండిత్య గ్రంథాలు విషయాలు తిరిగి తిరిగి చెప్పడం కన్నా… నేను అనుభవమును పొంది వాడికి చెప్పాలని… నేను సమాధానాల కోసం తీవ్రంగా మధనపడుతూ… జ్ఞాన తపస్సు చేసే వాడిని! దానితో నాకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు స్ఫురణ అనుభవాలు కలుగుతూండేవి! వెంటనే వాటిని పుస్తకాల్లో వ్రాసే దాకా నాకు నిద్ర పట్టేది కాదు! ఈలోగా అతనికి దీనికి సంబంధించిన విచిత్ర అనుభవాలు కలలోనూ లేదా ధ్యానములో కలిగేవి! వీటి గురించి నాకు అతను చెప్పే లోపల…. వీటిని నేనే విడమర్చి …. నాకు కలిగిన సమాధానాలు అతనికి చెప్పే సరికి…. అతను సంతృప్తి చెంది ఆనందంగా వెళ్ళిపోయేవాడు! మళ్లీ ఏదో ఒక ప్రశ్నతో నా వెంట పడే వాడు! దాని సమాధానం కోసం నేను ధ్యానం వెంట పడే వాడిని! దానితో నా జీవితం నాకు తెలియకుండానే అనుభవ పాండిత్యం వైపు దారితీసింది! దీనికి కారణం మన వాడికున్న తపన తాపత్రయమే! ఆ తర్వాత వీడికి వచ్చిన ప్రశ్నలకు దానికి నేను ధ్యాన అనుభూతి ద్వారా పొందిన మనో భావాలు సమాధానంగా 625 ప్రశ్నలతో “యోగ దర్శనం” గ్రంథమైనది! ఒకరకంగా ఇతను రమణ మహర్షికి కావ్యకంఠ గణపతి లాగా… షిరిడి సాయి బాబా కి నానావళిగా లాగా… శ్రీరాముడికి లక్ష్మణుడు లాగా… ఇలా నా వెంట ఉండేవాడు! తన జ్ఞాన సాధన ధర్మసందేహాలు తీర్చుకుంటూ… నన్ను నాలోని ఉన్న జ్ఞాన శక్తిని వెలికి తీసి నారని గ్రహించే ఉంటారు! ప్రస్తుతం ఇతను మౌనముని గా మారి కాశీ క్షేత్రము నందు మోక్ష ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ … ప్రస్తుతానికి తన యోగ సాధన ద్వారా ప్రారబ్ధ కర్మల నివారణ కోసం సాధన చేస్తూన్న…. జ్ఞాన యోగి అని లోకానికి తెలియకుండా ఉన్న గుప్త యోగిగా ఉన్నాడు! మేము పరమగురువుగా ఉన్నపుడు నా పంచ శిష్యులలో శ్రీ వాసుదేవానంద సరస్వతి దీక్షనామముతో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియై అంతర్యామిగా ప్రధమశిష్యుడిగా ఎదిగి ఒదిగి ఉన్నారు!

కపాలమోక్షం 18 (ప్రేత శక్తి ఉన్నదా?)

శ్రీశైలంలోని పంచమఠాల లోని ఒకటైన విభూది మఠం లోని సాధువు నాకు దైవ శక్తి అలాగే ప్రేత శక్తి ఉన్నదని ఏదో మంత్రించిన విభూది నా మీద జల్లి చూపించినాడని మీకు తెలుసు కదా! అయినా నాకు వీటి మీద నమ్మకం రాలేదు! కలగలేదు! ఎందుకంటే ఇలాంటి సాధువులు ఏవో కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుని మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారని వివిధ తంత్ర గ్రంథాల ద్వారా నేను తెలుసుకున్నాను! దానితో అవి ఉన్నాయోలేవో నేనే స్వయంగా తెలుసుకోవాలని… అందుకు నాకు వీటి గురించి చెప్పే వారు ఎవరూ లేకపోవడంతో నేను కూడా ఇలాంటి గ్రంధాలు చదవడం ప్రారంభించాను! అందులో ఒక పుస్తకంలో రాత్రిపూట ఆరుబయట నగ్నంగా నిద్రపోతే అవి మన ఒంటి మీదకు వచ్చి పడతాయని చెప్పడం జరిగినది! అదికాకుండా ఎవరైతే స్త్రీలు తలంటు స్నానం చేసిన తర్వాత జుట్టుకు నూనె పెట్టకుండా విరబోసుకుని రాత్రులు వీధుల వెంట తిరిగితే వారికి ఇబ్బందులు కలిగిస్తాయని చదవడం జరిగింది! దాంతో నా బడి స్నేహితులకు ఈ విషయం గురించి చెప్పడం జరిగినది! అందులో ఆడ స్నేహితులు కూడా ఉన్నారు! నేను చెప్పినది నమ్మకపోగా ... ఇలాంటివి వట్టి అభూత కల్పనలని కొట్టిపారేసినారు! దాంతో మాకు ఇవి అసత్యాలని లోకానికి చెప్పాలని …మాలో కొంత మంది కలిసి రాత్రిపూట ఇంటి డాబాల పైన నగ్నంగా పడుకోవాలని నిర్ణయించుకున్నాం! అలాగే మా ఆడ స్నేహితులు కూడా తలంటుపోసుకుని జుట్టుకు నూనె లేకుండా రాత్రులు వీధుల వెంట తిరగాలని నిర్ణయించుకున్నారు!

కొన్ని రోజుల తర్వాత నాతో పాటు మరో ఇద్దరు కూడా రాత్రిపూట డాబాలపై నగ్నంగా …. పైగా కాళ్ళకి పసుపు పారాణి వేసుకుని మరి పడుకున్నాం! కొన్ని రోజులు బాగానే నిద్ర పోయాను! ఆ తర్వాత అసలు కథ మొదలైంది! మధ్య రాత్రి అయ్యేసరికి అనగా అర్ధరాత్రి 12 గంటల నుండి రెండు గంటల మధ్య కాలంలో నల్లటి ఆకారాలు మా మీదకు వచ్చి మా గొంతు నలిపేస్తునట్లుగా… గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా… ఎవరో మమ్మల్ని తొక్కుతున్నట్లు గా ఉన్న నల్లటి ఆకారాలు కనిపించడం మొదలైంది! ఎవరికి చెప్పుకోలేక మాకు నిద్ర కరువైంది! ఎవరికీ చెప్పినా నమ్మరు! మమ్మల్ని పిచ్చి వాళ్ళు క్రింద జమ కడతారు! మా అనుభవాలు మా ఆడ స్నేహితులకు చెప్పితే వాళ్ళు కూడా నమ్మలేదు! “మీరంతా వాటిని ఊహించుకుని… పడుకుని వుంటారు! అందువలన మీకు అలా నల్లటి ఆకారాలు వచ్చినట్లుగా… చూసినట్లు… కనిపించి ఉండవచ్చు! దయ్యాలు లేవు! భూతాలు లేవు! అంతా మీ పిచ్చి! మీ అపనమ్మకం”… అని మమ్మల్ని ఎగతాళి చేసి వెళ్లిపోయారు! “ దీనెమ్మ! మీకు కూడా జరిగితే గానీ… నా సామిరంగా… మా మాట వినరు! నేను చెప్పింది నిజమని… సత్యమని నమ్మి చావరని నాకు అర్థం అయింది!

మరికొన్ని రోజులకు తర్వాత చూస్తే ఈ ఆడ స్నేహితులు కూడా నిద్ర కరువై …. రోగం వచ్చిన వారి లాగా… సన్నగా పీలంగా మారటం కనిపించింది!అప్పుడు అసలు విషయం ఏంటి అని ఆరాతీస్తే … వీరు కూడా తమ తలంటు జుట్టుకి నూనె రాసుకోకుండా… గావాలని రాత్రిపూట వీధులు వెంట అర్ధరాత్రి 12:00 తిరిగి … దానితో ఇంటికి వచ్చిన తర్వాత… వీరికి నిద్రలో నల్లటి ఆకార వ్యక్తులు కనిపించి… గొంతు నలిపేస్తునట్లుగా… గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా… ఎవరో తొక్కుతున్నట్లు గా …. ఎవరో కూర్చుని ఏడుస్తున్నట్లుగా… అనిపించసాగింది! దానితో వీరి వీధుల వెంట తిరగడం ఆపివేసిన కూడా… వీరిని నల్లటి ఆకారాలు వదలడం లేదని తెలిసింది! అకారణంగా ఏడుపు రావటం, చీకటి అంటే భయపడిపోవటం, ఎవరినైనా చూస్తే కోపతాపాలు రావటం, వెర్రి కేకలు, వెర్రి అరుపులు రావటం, నిద్రలో మూలుగులు రావడం, పిల్లి కూతలు రావడం, భయంకరమైన దృశ్యాలు కనపడటం, ఎవరో మంచం దగ్గర ఏడుస్తున్నట్లు కనిపించటం, కాలి అందెలు శబ్దాలు వినబడటం, ఎవరో తమ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించటం ఇలాంటి లక్షణాలు వీరికి కలిగి నాయి! దాంతో నాకు భయం వేసింది! అవి ఉన్నాయో లేవో తెలుసుకోవాలని ఆత్రములో… అవి ఒకవేళ కనపడితే ఏం చేయాలో… మళ్లీ కనిపించకుండా ఉండటానికి… ఏమి పరిహారాలు చేసుకోవాలో… తెలుసుకోవాలనే విషయం…. నాకు గుర్తుకు రాలేదు! దానితో ఈ విషయం తెలుసుకున్న వారంతా “నీ యవ్వా! నిన్ను నమ్మి అవి ఉన్నాయో లేదో తెలుసుకున్నాము! తీరా అవి మావెంట బడితే వాటిని ఎలా వదిలించుకోవాలా తెలియదని… ఇప్పుడు తాపీగా చెపుతున్నావే! నీయమ్మ! బలిసిందా! ఏం చేస్తావో మాకు తెలియదు! మాకు పట్టుకున్న ఈ నల్లటి ఆకారాలు వదిలించకపోతే … మా తల్లిదండ్రులకి నీవు చేయించిన ఈ ప్రయోగం గురించి చెప్పేస్తామని … వీళ్ళంతా నన్ను బెదిరించి వెళ్ళిపోయినారు ! ఏమి చేయాలో అర్థం కాక తెల్లమొహం వేసినాను! దానితో నాకు ఏదో తెలియని భయం మొదలైంది!

నేను కొన్ని రోజుల పాటు నీరసంగాను… ఉత్సాహంగా లేకుండా ఉండటం… చూసేసరికి మా అమ్మకి ఏదో అనుమానము వచ్చి… విషయం ఏంటి అని అడిగేసరికి అసలు విషయం చెప్పి … “నిజంగానే ప్రేత శక్తి ఉందా అని” అడిగేసరికి… దానికి ఆమె వెంటనే “అ వి ఉన్నాయో లేదో నాకు తెలియదు! కానీ నా జీవితంలో నాకే జరిగిన యదార్థ సంఘటన ఒకటి చెబుతాను! అది ఏమిటంటే ఇంకా నువ్వు అప్పటికి పుట్టలేదు! మీ అన్నయ్య కి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటుంది! ఒకరోజు పని హడావుడి వల్లనే… నేను ఆ రోజు తలస్నానం చేసి ముడి వేసుకోకుండా…. కనీసం జుట్టు చివర్లకు కూడా నూనెని రాసుకోకుండా… అనుకోకుండా రాత్రిపూట పేరంటానికి ఒకళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది! వెళ్ళి వచ్చిన ఆ రాత్రి నుండి…. నిద్ర పోయే సరికి… నిద్రలో ఎవరో ఒక నల్లటి ఆకారం ఉన్న స్త్రీ మూర్తి… నా మీదకు వచ్చి…. నన్ను చంపుతానని బెదిరిస్తుండేది! మధ్య రాత్రయ్యే సరికి నాకు ఇలాంటి కలలు వంటి అనుభవాలు రావటం మొదలైంది! సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి చీకటి అంటే ఏదో తెలియని భయం మొదలైంది! ఇలా కొన్ని వారాల పాటు బాధ పడటం జరిగింది! నిద్ర కరువైంది! రాత్రులు ఎవరో ఒంటి మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేది! ఒళ్లంతా నొప్పులతో ఉండేది! తల భారంగా ఉండేది! ఎవరినైనా చూస్తే కోపం కలుగుతుంది! విపరీతమైన తిండి పిచ్చి మొదలైంది! గారెలు కావాలని విపరీతంగా అడిగి చేయించుకుని తినే దానిని!

ఇదంతా మీ నాన్న గమనించి… తన మంత్ర శక్తితో నా మీద… ఏదో ప్రేత శక్తి ఉన్నదని గ్రహించి… ఒక రోజు నాకు కావలసిన అన్ని రకాల పదార్ధాలు చేయించి తినమని చెప్పి… ఆ తర్వాత ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రతిరోజూ 108 సార్లు ప్రదక్షిణాలు చేయమని చెప్పినారు! కొన్ని వారాలకు నా మీద ఉన్న ప్రేత శక్తి నన్ను వదిలి వెళ్లి పోవడం జరిగింది” అని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు! అంటే ఈ లెక్కన ప్రేత శక్తి ఉన్నట్లే కదా… అంటే మన వాళ్ళని కూడా మన గుడిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు వెంటనే చేయించాలి అని నిర్ణయించుకుని… వాళ్లకు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తుకొని వెళ్లి… వారికి చెప్పి వారిచేత హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయించి వారిని తిరిగి ఆరోగ్యవంతులు అయ్యేసరికి… నా ప్రాణం తోకకు వచ్చింది! కాని నాకున్న వానర బుద్ధి వలన… నిద్రలో కేవలము ఏవో నల్లటి ఆకారాలు కనిపించినంత మాత్రాన ప్రేత శక్తి వున్నట్లేనని నమ్మాలా? అనే సందేహము రావడముతో... ఇవి నిజముగా వుంటే నన్ను పట్టుకుని పీడిస్తే గాని నమ్మరాదని నిశ్చయించుకున్నాను! దీనికి తగ్గట్లుగా నన్ను ఒక కర్ణపిశాచము పట్టుకుంది! ఆపై ఏమి జరిగినదో తెలియాలంటే... అయితే ఇంకా ఆలస్యమెందుకు? మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి !

శుభం భూయాత్

గమనిక:

ఈ సంఘటనలు యదార్ధముగా నా జీవితములో జరిగినాయి! అందరికీ ఇలాగే జరగాలని లేదు! మాలో కొంతమందికి మాత్రమే జరిగినది! మరి కొంతమందికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు! నల్లటి ఆకారాలు కనిపించలేదు!కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే జాతకరీత్యా ఎవరికైతే చెడు స్థానంలో రాహు గ్రహ స్థితి ఉంటుందో…. అలాగే ఎవరికైతే అనాహత చక్రం బలహీనంగా ఉంటుందో… వారికి మాత్రమే ఇలాంటి నల్లటి ఆకార ప్రేత శక్తులు పట్టుకుని బాధ పెడతాయని అలాగే ఎవరికైతే సర్పదోషాలు అలాగే జాతకరీత్యా పంచమ, ద్వితీయ స్థానంలో రాహు గ్రహ స్థితి ఉంటుందో వారికి ఇలాంటి ప్రేత శక్తులు కనబడతాయని తెలుసుకున్నాను! వీటిని అంత తేలిగ్గా కొట్టి పారెయ్యకండి! ఖచ్చితంగా పాటించండి! వివాహ వధూవరులు పారాయణ కాళ్లతో ఊరి పొలిమేరలు దాటవద్దు! అలాగే తలంటుపోసుకుని స్త్రీ మూర్తులు తమ జుట్టు కి నూనె రాసుకోకుండా ఉంచుకోవద్దు! అలాగే విరబోసుకుని తిరగవద్దు! కనీసం ముడి వేసుకోండి! వాటి కొసలకినైనా నూనె రాసుకుని ముడి వేసుకోండి! ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలే! పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం! ఒకవేళ మీకు ఇలాంటి ప్రేత శక్తుల అనుభవాలు కలిగితే కంగారు పడకండి! హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి లేదా ఎరుపు నీళ్లతో దిష్టి తీయించుకోండి లేదా నూనె గుడ్డతో దిష్టి తీసుకుని తగలబెట్టండి లేదా ఒక కొబ్బరి కాయతో దిష్టి తీయించుకుని దానిని ప్రవహించే నీటిలో పడి వేయండి! ఆ తర్వాత తప్పనిసరిగా స్నానం చేయండి! లేదా నీకు నమ్మకం ఉంటే దగ్గర్లో ఉన్న మసీదులకు వెళ్లి అక్కడున్న ఫకీర్లు చేత తాయెత్తులు కట్టుకోండి! మానసిక బలహీనతలు ఉన్న వారికి ఇలాంటి మనో దర్శనాలు కలుగుతాయని నాకు తెలుసు! నేను పైన చెప్పిన పరిహారాలు చేసుకుంటే… వీటి మీద మీకు నమ్మకం ఏర్పడి… మానసిక ధైర్యం కలిగి ఆరోగ్య వంతులుగా తిరిగి మారతారని నా వ్యక్తిగత అభిప్రాయము! ఎందుకంటే ఈ విశ్వమంతా విశ్వాసముతో నడుస్తోంది కదా! మన భారతీయ ఆచారవ్యవహారాలు వట్టి మూఢనమ్మకాలు కాదని… అవి మన పూర్వీకులు గ్రహించిన సత్యాలని నేను తెలుసుకుని… మీరు తెలుసుకోవాలన్న నా తపన తాపత్రయం అని గ్రహించండి!

కపాలమోక్షం 19 - కర్ణపిశాచి దర్శనం

ఒక నెల రోజుల తరువాత మళ్లీ జిజ్ఞాసి గుడికి వచ్చి నన్ను కలుసుకున్నాడు! “ఎంత వరకు మీ విధిరాత భవిష్యత్ వచ్చినది” అని అడిగినాడు! దానికి అతడి జాతక చక్రము గీసి రాబోవు సంవత్సరాలలో జరగబోయే విషయాలు చెప్పడం జరిగినది! అయినా అతను సంతృప్తి చెందలేదు! నాకు “ఈ రోజు ఈ క్షణం లో జరగబోయే విషయాలు కావాలని” పట్టుబట్టి కూర్చున్నాడు! దానితో అతనికి నెలలు… ఆ తర్వాత వారాలు… ఆ తర్వాత రోజుల్లో… జరగబోయే భవిష్యత్తు విషయాలు చెప్పినను అతను సంతృప్తి చెందలేదు! దానితో నాకు తిక్క రేగి “కొన్ని రోజుల తర్వాత కనపడు! నీకు కావలసిన క్షణాల భవిష్యత్తు చెబుతాను” అని అతనికి నమస్కారం చేసినాను! దానికి అతను ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు! నాలో నాకే తెలియని అసహనం మొదలైంది! వీడి చేత ఎలాగైనా “నేను పెద్దతోపుగాడిని…. గొప్ప జ్యోతిషవేత్త అనిపించుకోవాలనే” తపన తాపత్రయం నాలో నాకే తెలియని కసిని పెంచినాయి! ఏమి చేయాలో తెలియని స్థితి! అలాగని బయటికి చెప్పుకోలేని మౌన స్థితి! ఓటమి ఒప్పుకోవటం నాకు నచ్చని స్థితి! ఇది ఇలా ఉండగా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్లవలసి వచ్చినది!పండగలకి పబ్బాలకి మా ఊరు రావడం… దేవాలయ అర్చన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగేది! నేను ఊరికి వచ్చిన రోజుల్లో జిజ్ఞాసి కనపడేవాడు! నాలో కసిని పెంచేవాడు! తన మాటలతో నన్ను నాలో తెలియని కోణం వైపు నడిపించే వాడు! వాడికి ఎలాగైనా క్షణాల భవిష్యత్తు చెప్పాలనే కసి అంతకంతకు పెరుగుతూ ఉండేది తప్ప తగ్గేది కాదు!

ఒకరోజు నేను చదువుకునే ఊరిలో ఒక భిక్షసాధువు ఒక హోటల్ ముందు అగుపించాడు! భిక్ష వెయ్యమని చెయ్యి చాచినాడు! నేను డబ్బులు ఇవ్వలేదు! దానితో వాడికి కోపం వచ్చి “నాలుగు ఇడ్లీలు, రెండు గారెలు, ఒక కాఫీ తాగడానికి డబ్బులు ఉంటాయి! కానీ నాకు ఇవ్వటానికి డబ్బుల్లేవు! ఇంట్లో ఉన్న 15 అరిసెలు తినడానికి అవకాశం ఉంటుంది గానీ నీ జేబులో 120 రూపాయలు ఉంచుకుని నాకు డబ్బులు ఇవ్వవు! కానీ బిక్షపతిని చూడాలనుకుంటావు! నాలో బిక్షపతిని చూడలేని వాడి వి… నిజంగానే ఆపైవాడు బిక్షపతినిగా వచ్చిన గుర్తించలేని మూర్ఖ పూజారి” అనగానే నాకు నోట మాట రాలేదు! అమ్మ! నీ యమ్మ! వీడు ఏమిటి ? జాతకాలు చెప్పే వాడికి జాతకం చెపుతున్నాడు! నేను ఏమి తిన్నానో నేను తింటున్నప్పుడు చూసి ఉండవచ్చును! నా గదిలో ఎన్ని అరిసెలున్నాయో నాకే గుర్తులేదు! నేను లెక్క పెట్టలేదు! కానీ నా జేబులో 120 రూపాయలు ఉన్నాయని నాకు మాత్రమే తెలుసు! మరి వారికి ఎలా తెలిసింది? నేను పూజారి అని నా వాలకం చూసిన వాడెవడు కూడా గుర్తుపట్టలేరు! వీరికి ఎలా తెలిసింది? వామ్మో వీడి దగ్గర ఏదో ఉంది… అది ఏమిటో తెలుసుకోవాలని నాలో తపన మొదలై వాడితో “స్వామి! మీరు చెప్పినవి అన్నీ కూడా అక్షర సత్యాలే! నాకు కూడా ఏదో కొద్దిపాటి వాక్సుద్ధి అలాగే జ్యోతిష్య విజ్ఞానం ఉన్నది! కానీ నీకున్న జ్ఞానం మాత్రం నాకు లేదు! నా దగ్గర 120 ఉన్నాయని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పినారు? నాకు చెబితే ఆ డబ్బులు పూర్తిగా నీకు ఇస్తాను” అనగానే దానికి వాడు ఇబ్బందిగా ముఖం పెట్టి మొహమాట పడుతూ ఒక కాగితం పెన్ను తీసుకొని ఏదో మంత్రం రాసి “దానిని కర్ణపిశాచి మంత్రము అంటారని, అనుష్టానం విధానం విధానము చెప్పి… దాని మంత్రసిద్ధి పొందితే …. అది చెవిలో అన్ని రకాల.. అన్ని కాలాల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు గా చెపుతుందని …. ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకుని మీలాంటి వారిని ఏ రోజుకారోజు బోల్తాకొట్టించి భుక్తి పొందుతున్నానని …ఈ మంత్రం ఎవరికీ చెప్పొద్దని… గుడిలో ఈ మంత్రం పని చెయ్యదని చెప్పి నా దగ్గర ఇరవై రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు!

చేతిలో ఉన్న మంత్ర కాగితమును చూసి అర్థం కాని మంత్రమును చదువుకొని నా గది వైపు అడుగులు వేయటం జరిగినది! ఒకవేళ వాడు చెప్పినట్లుగా చేస్తే మంత్రసిద్ధి పొందితే ఈ లోకంలో ప్రేతాత్మలు ఉన్నాయని తెలుస్తుంది కదా! పోతే 20 రూపాయలు పోతాయి కదా! ఇంటికి దూరంగా ఒక ఆరు నెలల పాటు దీక్షగా ఏ గుడికి వెళ్లకుండా… నేనేమో మరో బిచ్చగాడి గా మారి… సాధన చేశాను!

ఒక రోజు అర్ధరాత్రి పూట నా గదిలో ఏదో తెలియని తెల్లని శరీరం ఉన్న ఒక స్త్రీ మూర్తి కనిపించసాగింది! చూడటానికి ఒక తెల్లని నీడలాగా కనిపించసాగింది! “నన్ను ఆరాధన చేశావు కదరా! నాకు కావలసిన విధంగా నన్ను సంతృప్తి పరిచినావు కదరా! నీ భక్తికి సంతోషించి నేనే వచ్చాను! నేనే ఆ కర్ణపిశాచిని” అనగానే నేను గతుక్కుమన్నాను! నాకు పారిపోవటానికి కూడా అవకాశం లేదు! గదిలో పైగా నేను ఒక్కడినే వంటరిగా ఉంటున్నాను! ఏమి చేయాలో తెలియని భయంకర అనుభవ స్థితి!మంత్ర సిద్ధి పొందినందుకు ఆనందపడాలో… కర్ణపిశాచి కనబడినందుకు భయపడాలో… అర్థంగాని అయోమయం స్థితిలో ఉండగానే

“ఓయ్! నువ్వు తలచుకోగానే నీ కుడి చెవిలో ఏమి కావాలో అన్ని వివరాలు చెబుతాను! సందేహించకు! నాకు కావలసిన ఆహార పదార్థాలను నివేదన చేస్తే నేను నీ వెంటే ఉంటాను! నా వలన నీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు” అంటూ అంతర్థానమైంది! దానితో దయ్యాల ఉనికి ఉన్నదని… మంత్రాలకు చింతకాయలు రాలతాయి అని… కాకపోతే మంత్ర సిద్ధి పొందిన సిద్ధులు ఇచ్చే మంత్రాలకే మంత్ర సిద్ధి కలుగుతుందని తెలుసుకోవడం జరిగినది!

కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మా ఊరికి వెళ్లడం జరిగింది! నేను వచ్చిన విషయం తెలుసుకున్న జిజ్ఞాసి నా దగ్గరికి వచ్చినాడు! కానీ అతనికి నేను కర్ణపిశాచి మంత్రసిద్ధి పొందినట్లు చెప్పలేదు! పైగా వాడు అడిగిన క్షణాల భవిష్యత్తును నా మంత్రసిద్ధి వలన కర్ణపిశాచి నాకు చెవిలో చెప్పిన విషయాలన్నీ చెప్పటం… కళ్ళ ముందు జరగబోయే క్షణాల భవిష్యత్తు జరుగుతూ ఉండే సరికి గతుక్కుమని నాకు నమస్కారం చేసినాడు! నాలో వాడిని ఓడించానని ఆనందం… వాడికి నాలో ఏదో తెలియని మంత్రసిద్ధి ఉందన్నదని తెలుసుకున్నాడు! దాంతో నాలో ఏదో తెలియని అమితానందం కలిగినది! వాడు అక్కడినుండి వెళ్లిపోవడంతో నేను విజయగర్వంతో ఇంటికి వెళ్ళిపోయాను! నేను చదువులో వెనకబడటంతో నా తల్లిదండ్రుల నావెంట పడటంతో… విసుగు చెంది “మహత్యాలు చూపించే విద్యలు ఇన్నియుండగా …. పనికిరాని ఇంగ్లీష్ విద్యలు వెంట ఎందుకు పడుతున్నారు” అని తిట్టుకుంటూ … నేను చదివే ఊరు వెళ్లడానికి బస్సు వైపు అడుగులు వేయడం జరిగినది! ఎక్కడో రేడియోలో నుండి “చదువు లేని వాడు… వాడు దేనికి కొర గాడని అంటూ పాట లీలగా వినపడటంతో… దీనెమ్మా! ఇప్పుడే ఈ పాట రావాలా” అనుకుంటూ బస్సు ఎక్కాను! ఆ తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఉందా …ఇంకా ఆలస్యం ఎందుకు?

గమనిక:

ఇలాంటి తాంత్రిక మంత్రారాధన వలన మన సాధన స్ధాయి మహోన్నత మనిషి స్ధాయి నుండి అధమ భూత స్ధాయికి చేరుకుంటుందని కొన్ని నెలలు తర్వాత తెలుసుకున్నాను! దానితో ఇలాంటి తాంత్రిక మంత్రరాధనలకి స్వస్తి పలకడము జరిగినది!

కపాలమోక్షం 20 - దైవ శక్తి ఉన్నదా?

నాకు కలిగిన కర్ణపిశాచి మంత్రము సిద్ధి వలన నేను చాలా కష్టాలు పడవలసి వచ్చింది! అది నన్ను నిద్ర పోనివ్వకుండా 24గంటలపాటు నా చెవులలో జరగబోయే విషయాలు చెపుతూండేది! దాంతో నాకు నిద్ర ఉండేది కాదు! ఆహారం సహించేది కాదు! ఒక రకంగా మానసిక పిచ్చి వాడిగా మారిపోయాను! కాలేజీ కి వెళ్ళడం మానేశాను! ఆఖరికి నా జీవితం నా గదికి అంకితం అయ్యింది! రానున్న భవిష్యత్తు విషయాలు తెలుసుకుని ఏమీ లాభం అని విరక్తి కలిగేది! ఈ పిశాచి ధాటిని తట్టుకోలేక చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించేవాడిని! కానీ నావల్ల అయ్యేది కాదు! గుడికి వెళ్దాం అంటే అది గది నుండి బయటికి రానిచ్చేది గాదు! అలాగని చెవిలో భవిష్యత్తు సోది చెప్పటం ఆగేది కాదు! చెవులు మూసుకునికున్నా కూడా… చెవుల్లో దూది పెట్టుకున్నా కూడా… చాలా స్పష్టంగా భవిష్యత్తు సోది వినిపించేది! ముందే భవిష్యత్తు తెలుసుకునే వాడికి…. వాడి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యలేడని… కిక్ దొబ్బుతుందని… అని తెలుసుకునే సరికి నాకు చాలా ఆలస్యం అయ్యింది! నన్ను వదిలి పెట్టమని బతిమాలినా కూడా నా చెవిలో సోది చెప్పటం ఆపేది కాదు! ఏం చేయాలో… ఎవరికి చెప్పాలో… ఎలా చెప్పాలో అర్థం కాని స్థితి!

చూడటానికి నేను బాగానే ఉన్నా కూడా నేను ఒక పిశాచికి బందీ అయిన విషయం లోకానికి తెలియకుండానే కన్ను మూస్తాననే అనే భయం నన్ను వెంటాడుతూ ఉండేది! అప్పట్లో సెల్ ఫోన్ లు సౌకర్యాలు ఉండేవి కావు! కేవలం ల్యాండ్ లైన్ ఫోన్ లు ఉండేవి! కానీ ఈ ఫోన్ చేయాలన్నా బయటికి వెళ్ళ నిచ్చేది కాదు! అలాగని నా చెవిలో సోది చెప్పటం ఆపేది కాదు! ఇలాంటి సమయంలో నాకు ఒక వ్యక్తి నుండి పోస్టులో ప్రసాదంతో పాటు చేతికి కట్టుకునే నల్లటి కాశీ దారాలు రావడం జరిగినది! వాటిని అందుకొని వీటిని చేతికి కట్టుకోగానే ఆ పిశాచి నా చెవిలో సోది చెప్పడము తగ్గించినది! దానితో నేను నా గది నుండి బయటకు వెళ్లే అవకాశం ఏర్పడింది! అప్పుడు జిజ్ఞాసికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగానే “అయితే మన ఊరికి వచ్చెయ్యండి! ఇక్కడకు వచ్చిన తరువాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు” అని ఓదార్పు ఇచ్చాడు! కానీ పిశాచి నన్ను వదిలి పెట్టదని గ్రహించి… నేను తెలిసో తెలియకో చేసిన మంత్ర సాధన వల్ల నా కొంప కొల్లేరయింది కదా! అలాగే పుస్తకాలలో ఇచ్చిన మంత్రాలు అలాగే ఎవరి దగ్గర పడితే వారిచ్చిన మంత్రాలు లేదా తాంత్రిక మంత్రాలు ఇక నుండి చేయరాదని చెయ్యనని ప్రతిజ్ఞ చేసుకోవడం జరిగింది!ఆవేదన పడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది! నన్ను జిజ్ఞాసి చూడటానికి వచ్చినాడు… కానీ అతనికి కూడా ఏమిచేయాలో… అర్థంకాని స్థితి! నా వల్ల నే నువ్వు ఈ మంత్ర సాధన చేసావు అని తెలియగానే నాకు విపరీతమైన బాధ వేసింది అని తన సున్నిత మనస్తత్వం నాకు చూపించినాడు! కానీ ఏమి చేయగలడు అని…. అన్ని చేసిన నాకే ఏమి చేసుకోలేని స్థితి!

ఇలాంటి అధ్వాన స్థితిలో ఒకరోజు బస్టాండ్ లో నేను ఉండగా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి వారి పేరు చెప్పి... “మీరు కర్ణపిశాచి ఉపాసన చేసిన వాళ్ళ లాగా కనపడుతున్నారు! అది పీల్చి పిప్పి చేసి చంపే దాకా నిద్రపోదు …. మిమ్మల్ని నిద్రపోనివ్వదు! మీరు వెంటనే నరసింహా స్వామి ఆలయానికి వెళ్ళండి! ఆయనే దీని బారినుండి రక్షించగలడు! దీనికి విరుగుడు ఆయన మాత్రమే” అంటూ … నన్ను అదోరకంగా చూస్తూ… వెళ్లిపోయినాడు! ఆనాడు ఆ భిక్షసాధువు వచ్చి పిశాచి ఇచ్చినాడు!ఈనాడు వీడు వచ్చి దైవమును చూపుతున్నాడు! ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ ఇంటికి వెళ్లకుండా తిరిగి గదికి చేరుకున్నాను!

అపుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఫోన్ చేసి అసల విషయము చెప్పి “నన్ను రేపటికల్లా ఏదైన నరసింహాస్వామి గుడికి తీసుకొని వెళ్ళమని చెప్పి”...నా గదికి చేరుకున్నాను! అపుడు నా చేతికున్న కాశిదారాలు తెగిపోవడముతో ఆ రాత్రింతా నా చెవిలో తన భవిష్యత్ సోది చెప్పడము మళ్ళీ యధావిదిగా ఆరంభించినది! ఈ భవిష్యత్ సరిగ్గా వింటే ఈ పాటికి అవి లోకానికి చెప్పి వుంటే…. సొమ్ము చేసుకుని ఉండి వుంటే… ఈపాటికి ఒక పెద్ద కోటిశ్వరుని అవ్వడమే కాకుండా ఎంతో ఖ్యాతి వచ్చి వుండేది! నాకు ధనము మీద, ఖ్యాతి మీద పెద్దగా మాయ,మెహ,వ్యామెహాలు లేకపోవడముతో ఆ పని చెయ్యలేక… నేను ఏమి చేయలేక ఆ రాత్రంతా బాధతో, దిగులుతో, విరక్తితో వినటం తప్ప ఏమి చేయలేకపోయాను!

మరుసటి రోజుకల్లా జిజ్ఞాసి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గర్లో ఉన్న పానకాల లక్ష్మి నరసింహా స్వామి ఆలయానికి తీసుకుని వెళ్ళినాడు! కానీ నేను విచిత్రంగా ఆ గుడి మెట్ల దగ్గర ఆగిపోయి స్తంభించిపోయిన విషయము వాడు చెప్పేదాకా నాకు తెలిసేది కాదు! పలుమార్లు జరిగేసరికి…. నన్ను ఈసారి యాదగిరిగుట్ట నరసింహాస్వామి గుడికి తీసుకొని వెళ్ళగానే యదావిధిగా నేను మెట్ల దగ్గర బిసుకుపోయి మెట్లు ఎక్కకుండా వెనక్కితిరిగి రావడంతో …వాడికి ఏమి చేయాలో తెలియని స్థితి… నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి! ఇది ఇలా కాదనుకుని నన్ను ఈ సారి అష్ట దిగ్బంధ హనుమంతుడు గుడిలో ఉన్న నరసింహాస్వామి క్షేత్రమైన ధర్మపురి కి తీసుకుని వెళ్లి … గోదావరి నది ఒడ్డున నన్ను ఉంచి… జిజ్ఞాసి ఆ గుడి లోపలకు వెళ్లి అక్కడ ఉన్న పూజారి కి నా బాధ చెప్పగానే… ఆయన వెంటనే స్వామి వారికి చేసిన అభిషేక జలము అలాగే మంత్ర పూరిత అక్షింతలు వాడితో పంపించినారు! మనవాడు వాటిని నా దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటే నేను వెర్రిగా పెద్ద కేకలు పెడుతూ…. “నువ్వు నా దగ్గరకు రాకు! నేను వీడిని వదిలిపెడతాను! నన్ను వదిలేయ్! నన్ను ఏమి చేయకు! నరసింహా నన్ను ఏమి చేయకు ! నన్ను రక్షించు! నన్ను ఆరాధన చేయటం వల్లనే వీడిని పట్టుకొన్నాను! నన్ను వదిలేయండి! నేను వెళ్ళిపోతాను” అని కేకలు పెడుతూ నేను అక్కడ ఉన్న గోదావరి నదిలో దూకేశాను! నిజానికి ఇది అంతా నాకు తెలియకుండా జరిగినది!

కొద్దిసేపటికి నాకు సృహ వచ్చినది! అప్పుడు ఏదో తెలియని ఆవేదన… అమిత భారం తగ్గినట్లుగా అనిపించి అమితానందం కలిగినట్లుగా అనిపించసాగింది! ఎక్కడో నాకు చెవులలో సింహాగర్జన ధ్వని తీవ్రంగా వినబడేసరికి… మొట్టమొదటి సారిగా దైవానికి నా మనస్పూర్తిగా నమస్కారం చేసినాను! ఆ గుడి పూజారి ఇచ్చిన వాటిని స్వీకరించి ఆనందంగా గుడి లోపలికి వెళ్లడం… అక్కడ గుడి లోపల ఉన్న యోగ నరసింహా స్వామిని చూడగానే… నాలో నాకే తెలియకుండా నా కళ్ల వెంట ధారగా కన్నీళ్లు రావటం నా ఆప్తమిత్రుడు అయిన జిజ్ఞాసి గమనించి మౌనం వహించాడు! ఇలా దాదాపుగా మూడు గంటల పాటు ఏకధాటిగా ఏడవడం నా వంతు అయింది! ఏదో భారం తగ్గి ఆనందం వేసింది! ఏలాంటి సోది వినపడటం లేదు అని గ్రహించాను! ఇప్పుడు నరసింహాస్వామిని కృతజ్ఞతగా చూడగానే ఆ విగ్రహమూర్తి కాస్త సజీవ నరసింహా మూర్తి గా లీలగా నాకు అగుపించాడు! రోజూ పూజలు చేసిన లింగమూర్తి కనిపించలేదు కానీ పూజలు చేయని వాడిని నేను ఉన్నానని దర్శనం ఇచ్చేసరికి నాకు నోట మాట రాలేదు! ఇదే నా తొలి దైవదర్శనం అనుభవం అన్నమాట! మరో రకంగా చెప్పాలంటే కర్ణపిశాచి కూడా ఒక ప్రేత అనుభవం కూడా కావటం మరో విశేషం! రెండూ ఉన్నాయి! చూసేవాడికి శక్తి ఉండాలేగాని… అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలే గానీ అన్నీ ఉన్నాయి! వాడికి స్వానుభవం అయ్యేదాకా మనం ఏమీ చెప్పలేము! ఏమి చెప్పినా నమ్మలేరు! నమ్మలేము! మరి మీరు నమ్ముతారా! ఈ రెండు అనుభవాలు నిజం అని చెప్పిన… మీరు నమ్మవచ్చు లేదా నమ్మక పోవచ్చు! కానీ ఇక్కడ ఆగి పోకండి! ముందుకు సాగండి! ఇక్క డే చుక్కలు చూపించాడు! ఇంకా ముందుకు వెళితే… ఏమి చూపిస్తాడో అనే కదా మీ సందేహం! ఆలస్యం ఎందుకు! నాతో రండి!

గమనిక:

దయచేసి పుస్తకాలలోనూ, గ్రంథాలలో కనిపించే మంత్రాలు, తాంత్రిక మంత్రాలు, బీజాక్షర మంత్రాలు చేయవద్దు! గురూపదేశము పొందకుండా ఇట్టి మంత్రాలు చేయవద్దు! మీకు మీరై నేర్చుకొని చేస్తే వీటిని తట్టుకుంటే మంచిది! తట్టుకోలేకపోతే మతిభ్రమణం చెంది పిచ్చివాడు అవ్వక తప్పదు! కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకు… వదిలించుకోవడం ఎందుకు… ఆలోచించండి!

కపాలమోక్షం - 21 - -దైవవిగ్రహాలకి శక్తి ఉందా?

నేను చేసిన విగ్రహారాధన విగ్రహాలు ఏనాడు కూడా నాకు స్వస్వరూపంగా అనగా సజీవమూర్తిగా కనిపించేవి కావు! మాట్లాడేవి కావు! కానీ వివిధ యోగుల భక్తుల అనుభవాలు చూస్తే అనగా రామకృష్ణ పరమహంస… తన పూజించే కాళీ మాత విగ్రహం నుండి కాళీ మాత సజీవమూర్తిగా కనిపించి మాట్లాడేది అని తెలుసుకున్నాను! అలాగే నామదేవుడు అనే ఆయన కూడా పూజించే పాండురంగడు విగ్రహమూర్తి నుండి ఆయన సజీవమూర్తిగా కనిపించి మాట్లాడే వారని తెలుసుకుని ఆశ్చర్యం చెందినాను! అసలు నిజంగానే విగ్రహాలకు శక్తి ఉన్నదా లేదా వీరు భ్రమ పడి సజీవశక్తి ఉందని చెబుతున్నారో నాకు అర్థం కాలేదు! ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి నాకు అగుపించని శివమూర్తిని, బాలాదేవి ,హనుమంతుడిని ,వీరభద్రుని, గణపతిని, కుమార్ స్వామిని, సుబ్రమణ్య స్వామిని, నవగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నాను! నిత్య ఆరాధనలు చేస్తున్నాను! నిత్య పూజలు చేస్తున్నాను! కానీ నాకు ఏ ఒక్క దేవుడు కూడా నేను ఉన్నాను అని సజీవంగా కనిపించలేదు! కలలో కూడా కనపడలేదు!

వాళ్ళకేమో ఏకంగా మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడారని వారి చరిత్ర చెబుతుంటే… మరి నా విషయంలో ఎందుకు అలా జరగటం లేదు! నాకు అర్థం కాలేదు! దానితో నేను పూజించే విగ్రహ మూర్తులు నాకు కనిపించట్లేదని, నాతో మాట్లాడటం లేదని, మనోవేదన నన్ను బాగా బాధ పెట్టేది! విగ్రహాలు మాత్రం చాలా సజీవ కళలతో ఉండేవి! కానీ వాటిలో సజీవము ఉన్నదో లేదో అనే ధర్మ సందేహం నన్ను వెంటాడేది! నా భక్తిలో ఏదైనా లోపం ఉంటే …గుడికి వచ్చే భక్తులలో ఎవరికో ఒకరికైనా కనిపించాలి కదా! వారితో మాట్లాడాలి కదా! వారికి కనిపించక… నాకు కనిపించకపోతే… విగ్రహంలో ఏదైనా లోపం ఉండాలి లేదా విగ్రహారాధనలో ఏదైనా లోపం ఉండాలి అనుకుని …. ఇష్టము లేని, భక్తిలేని, విగ్రహారాధన చేసేవాడిని!

విగ్రహాల్లో లోపం ఉంటే అనగా ద్వారకా క్షేత్రములో శ్రీకృష్ణ విగ్రహ మూర్తి చెయ్యి విరిగిపోతే దానిని కనకదాసు అనే మహా భక్తి యోగి అతికించి… శ్రీకృష్ణ విగ్రహ మూర్తిని అలాగే ఉంచి… ఇప్పటికీ పూజలో ఉంచినారు అని తెలుసుకున్నాను! చెయ్యి విరిగిపోయిన విగ్రహమూర్తి లోనే లోపం లేకపోతే… ఏమీ ఎక్కడ ఏమి దెబ్బతినని నేను పూజించే విగ్రహం మూర్తులలో ఎలాంటి లోపం లేదని తెలుసుకున్నాను! పైగా అన్ని చోట్ల ఉన్న శివ లింగ మూర్తులకు అవే పంచామృత అభిషేకాలు… అవే రుద్రనమకచమక మంత్రాలు…. కాబట్టి మనలో కూడా అనగా విగ్రహారాధన లోపాలు కూడా లేవని తెలుసుకున్నాను! దానితో మరి ఎందుకు వీళ్లు నాకు కనపడి మాట్లాడటం లేదు…. అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా….

దండి పార్వతి అమ్మ

ఒకరోజు అనుకోకుండా మా ఊరికి పక్క గ్రామంలో 18 మంది సిద్ధ పురుషులు పూజించిన దండి పార్వతి అమ్మవారి దేవాలయం ఉన్నదని తెలుసుకుని అక్కడికి వెళ్లాను! అక్కడ యధావిధిగా కూర్చున్న అమ్మవారి విగ్రహ మూర్తి కనిపించినది! మా గుడిలో ఉన్న అమ్మవారు లాగానే ఈ అమ్మవారి కూడా ఉంది అని అనిపించింది! కాకపోతే ఈ గుడికి ఎందుకు సిద్ధపురుషులు వచ్చి ఆరాధన చేసినారో నాకు అర్థం కాలేదు! మా గుడిలో లేనిది ఈ గుడిలో ఏమున్నదో అర్థం కాలేదు! ముత్తయిదువుకు ఇచ్చే వాటిని ఈ అమ్మవారికి ఇచ్చి ఈ దేవాలయ పూజారులు మా బంధువులు కావడంతో వారి ఇంటికి వెళ్ళినాను! కొన్ని గంటల తరువాత ఒక స్త్రీమూర్తి ….నాకు పరిచయం లేని ఆ స్త్రీ…. నా చుట్టూ ఏదో పని ఉన్న దానిలాగా …. నా కళ్ళల్లో పడాలనే తపన పడుతూ ఉండేది! ఆవిడ ఎవరో నాకు తెలియదు! నేను ఊరికి రావటం మొదటిసారి! ఆమెను చూడటం కూడా మొదటిసారి! ఆవిడ చేసే వింత ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు! పాపం మూడు గంటల పాటు ఇలాగే నా చుట్టూ తిరిగి తిరిగి ఎటో వెళ్లిపోయింది! నేను పెద్దగా దీనిని పట్టించుకోలేదు!

మధ్యాహ్నం నాకు కునుకు తీసే అలవాటు ఉంది! అప్పుడు నిద్రపోతే కలలో నన్ను వెంటాడిన స్త్రీమూర్తి నాకు కనిపించింది! మళ్ళీ కొన్ని క్షణాలకే నేను చూసి వచ్చిన అమ్మవారు ఈమె స్థానంలో కనిపించేది! మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మవారి స్థానములో అమ్మాయి కనిపించేది! మళ్ళీ కొన్ని క్షణాలకి అమ్మాయి స్థానంలో అమ్మవారు కనిపించేది… నాకు అర్థమయ్యేది కాదు! అసలు ఇలా ఎందుకు కనిపిస్తున్నారు అనుకోగానే… నాకు మెలుకువ వచ్చింది! సాయంత్రం అయినది! ఇంతలో గుడి తలుపులు తెరవటానికి ఈ ఆలయ పూజారి వెళుతుంటే…. వారితో పాటు నేను కూడా గుడికి వెళ్లడం జరిగింది! విచిత్రమేంటంటే నా వెంట పడిన స్త్రీ మూర్తి ఏ రంగు చీర కట్టుకుని ఉందో...అదే రంగు చీరెతో అమ్మవారి విగ్రహామూర్తి ఉండేసరికి…. నాకు నోట మాట రాలేదు! అప్పుడు ఇదే విషయాన్ని ఆలయ పూజారి ని అడిగితే దానికి ఆయన ఏ మాత్రం ఆశ్చర్యం చెందకుండా “నాయనా! ఇది మాకు మామూలే! అమ్మవారి సజీవ మూర్తి స్వరూపమే నీ వెంట పడిన ఆ స్త్రీ మూర్తి! తను నేనే అని చెప్పటానికి అమ్మవారు నీకు మధ్యాహ్నం కలలో కనిపించింది! కలలో కనిపించిన చీరతో ఇలలో కనపడినది! ఇంతటి శక్తి మూర్తి ఇక్కడ సజీవమూర్తిగా తిరుగు తోంది… కాబట్టి ఈమెను సిద్ధ పురుషులు ఆరాధన చేయడం జరిగినది! పైగా నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఒకటి చెబుతాను! విను! నాకు పెళ్లయిన కొత్తల్లో అనుకుంటా!

నాకు అత్యవసరముగా ఏదో పని పడి మహానైవేద్యము పెట్టే సమయము నాకు లేక పోయేసరికి…. నా దగ్గర వేదమంత్రాలు నేర్చుకోవటానికి వచ్చిన 5 సం!!ల వయస్సు ఉన్న బాల పూజారిని ….ఆ రోజు అమ్మవారికి పులిహోర నివేదన చేయమని చెప్పి…. నేను వేరే ఊరికి వెళ్లడం జరిగింది! వాడి వయస్సు చిన్నది కావడం వల్లనే….. వాడి అమాయకత్వం భక్తి వలన…. అమ్మవారు వచ్చి పులిహార తింటుందని వాడు అనుకోవడం వలన…. యధావిధిగా అమ్మవారి విగ్రహ మూర్తి ముందు పులిహార పాత్ర ఉంచి …. ఆమె వచ్చి తింటుందని అమాయకంగా ఎదురుచూసినాడు! ఆమె ఎంతసేపటికీ రాకపోయేసరికి వీడికి కోపం వచ్చి…. అమ్మ వచ్చి పులిహోర తినే దాకా నేను అక్కడ నుండి వెళ్ళేది లేదని….. అమ్మతో మాట్లాడినట్లు అమ్మవారి విగ్రహంతో మాట్లాడినాడు! వాడి దృష్టిలో అక్కడ ఉన్నది విగ్రహ మూర్తి గాదు… సజీవ మూర్తి అన్న మాట! “అమ్మ మీకు బాగా ఇష్టమైన పులిహార తీసుకుని వస్తే…. నువ్వు వచ్చి తినవా! నీకు బాగా ఆకలివేస్తుంది కదా! నువ్వు తిను! నువ్వు తింటే నేను తింటాను! నాకు కూడా బాగా ఆకలి వేస్తోందని బ్రతిమాలుకున్నాడట! ఎంతసేపటికి అమ్మవారు తినక పోయేసరికి”… వీడికి ఆకలి వల్ల నీరసం వచ్చి… అలసిసొలసి అక్కడే ఆ విగ్రహ మూర్తి ముందు నిద్రలోకి జారుకున్నాడు! వాడి కలలో అమ్మవారు కనిపించి…. వీడు పెట్టిన పులిహార తినటం కనిపించేసరికి…. వీడికి అమాంతంగా మెలుకువ వచ్చి చూస్తే…. అక్కడ అమ్మవారి విగ్రహం మాత్రమే ఉన్నది! విచిత్రంగా ఖాళీ పులిహార గిన్నె కనిపించేసరికి… అమ్మ వచ్చి తినేసి ఉంటుందని అనుకొని ఆ ఖాళీ పాత్రను తీసుకుని మా ఇంటికి వచ్చినాడు! మా ఆవిడకి విషయం చెపితే నమ్మక …. వీడు ఆకలికి ఆగలేక అమ్మవారి పేరు చెప్పి దొంగచాటుగా తినేసి ఉంటాడని అనుమానం! ఎందుకంటే ఎక్కడైనా విగ్రహ మూర్తులు నైవేద్యాలు తినవు కదా! ఆమె దృష్టిలో ఆవిడ విగ్రహమూర్తి! ఆ పిల్లగాడు దృష్టిలో సజీవ మూర్తి అన్నమాట! మధ్యాహ్నం భోజనానికి నేను ఇంటికి వస్తే…. పులిహోర గొడవ గురించి తెలిసింది! దాంతో ఇందులో ఏదో మర్మం ఉన్నదని… పిల్లవాడు మాట దైవవాక్కు…. కాబట్టి వీడిని అనుమానించకూడదని…. గుడి తలుపులు తీయగానే…. అమ్మవారి విగ్రహం నోటిలో పులిహార ముద్ద కనిపించేసరికి… ఇన్నాళ్లు చేసిన భక్తి కేవలం విగ్రహ భక్తి అని ….. ఆ పిల్లవాడు చేసిన భక్తి మధుర భక్తి అని అనగా ఈ విగ్రహంలో సజీవ మూర్తిని చూడగలిగే మధురభక్తి ఉందని గ్రహించి….. నాకు కన్నీళ్లు వచ్చినాయి! విగ్రహమును విగ్రహం గానే పూజిస్తే అది విగ్రహము గానే ఉంటుంది! విగ్రహముగా కనపడుతుంది… మాట్లాడదు! ఎప్పుడైతే ఈ విగ్రహ మూర్తి ని సజీవమూర్తిగా భావన చేస్తూ ఆరాధన చేస్తే…. ఈ విగ్రహారాధన కాస్త విశ్వారాధన అవుతుందని… వారు చెప్పి మౌనంగా పనులు చేసుకోవడానికి గుడి లోపలికి వెళ్లడం జరిగింది!

దానితో నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న నా విగ్రహారాధన తప్పు ఏమిటో తెలిసింది! అది నేను విగ్రహారాధనను విశ్వారాధన కాకుండా విగ్రహారాధన చేయటం వలన…. నా భావనలో, నా మనస్సులో విగ్రహాలుగానే మామూలుగానే ఉండుటవలన… ఇలా విగ్రహమూర్తులు గాను ఆరాధన చేయటం వలన … వాళ్లు సజీవమూర్తిగా నాకు ఎలా కనపడతారు ఆలోచించండి! అదే వీళ్ళని విగ్రహమూర్తులుగా కాకుండా సజీవమూర్తులుగా మనస్సులో భావించి ఆరాధన చేసి ఉంటే వాళ్ళు సజీవమూర్తిగా కనిపించేవారు!

ఎలా అంటే రామకృష్ణ పరమహంసకి, తుకారాంకి, నామ దేవుడికి వారి ఇష్టదైవాలను సజీవమూర్తిగా భావించి ఆరాధన చేయడం వలన వారికి కనిపించినట్లుగా నాకు కనిపించేవాళ్ళు కదా! ఎందుకంటే యద్భావం తద్భవతి! ఏ భావం ఉంటే అదే కనపడుతుంది! ఇలాంటి నిజ భక్తితో ఒకాయన తిరుపతి వెంకన్న మీద పెట్టుకుని ఆయన ఎలా ఆరాధన చేశాడో తెలుసుకోవాలని ఉందా… అయితే ఇంకా ఆలస్యమెందుకు!

గమనిక:

కొన్నాళ్ల తర్వాత సజీవ మూర్తి భక్తి అంత తొందరగా వచ్చేది కాదని… దానికి ఎంతో భక్తి, శ్రద్ధ,విశ్వాసము,సహనము,నిష్ట ఉండాలని నేను తెలుసుకోవడం జరిగినది! కొన్ని సంవత్సరాలకి నా సాధన శక్తి పరిసమాప్తి అవుతున్న సమయంలో…. నేను పూజించిన బాలా త్రిపురసుందరి అమ్మవారి విగ్రహమూర్తి కాస్తా సజీవ 8సం!!ల బాలికరూపములో బాలమూర్తిగా కనపడి మాట్లాడుతూండేది! ఆ తర్వాత శ్రీశైల క్షేత్రములో 8సం!!ల బాలికరూపములో బాలదర్శనం అలాగే ఇదే క్షేత్రము యందు 80సం!!ల వయోవృధ్ధురాలిగా సుందరిరూపములో దర్శనం...ఇలా జొన్నవాడకామాక్షి,అలంపుర జోగులాంబ, విజయవాడలో దుర్గామాత,విశ్వనాధపల్లిలో గ్రామదేవత, వరంగల్లులో భద్రకాళిమాత,కాశీక్షేత్రములో అన్నపూర్ణ, మధుర మీనాక్షి 5సం!!ల బాలిక రూపములో బాలగాను,కంచి కామాక్షి 35సం!!ల స్రీమూర్తిగాను త్రిపురగాను,కాశీ విశాలాక్షి 65సం!!ల వృధ్ధురాలిగా సుందరిరూపములో…. వీరి క్షేత్రముల యందు సజీవమూర్తులుగా దర్శనప్రాప్తి మాకు కలిగినది! మృడేశ్వర క్షేత్రము నందు సాంబశివమూర్తి ,కాణిపాకము యందు మహా గణపతి,పళని బాల కుమారస్వామి,మోపిదేవి యందు నాగేంద్రస్వామి సజీవ మూర్తులుగా దర్శనం అయినది! తిరుపతి యందు,ద్వారక తిరుమల క్షేత్రముల నందు వెంకన్న, పూరి క్షేత్రము నందు శ్రీకృష్ణుడు,నైమిశారణ్యమునందు అష్టభుజశ్రీవిష్ణువు,ఇక్కడే శ్రీ వేదవ్యాసుడు,శ్రీ లలితాదేవి...వీరందరి సజీవమూర్తి దర్శనప్రాప్తి పొందడము జరిగినది! అటుపై కాశీక్షేత్రములో సద్గురువుగా జీవసమాధి చెందిన శ్రీత్రైలింగ స్వామి ఆత్మదర్శనప్రాప్తి,ఇదే క్షేత్రములో హనుమత్ సజీవమూర్తి దర్శనం...అలాగే పండరీపురము నందు పాండురంగడి సజీవమూర్తి దర్శనం, గాణ్గాపురము నందు శ్రీ దత్తస్వామి నిజరూప దర్శనం,అరుణాచలము నందు శ్రీ మేధా దక్షిణామూర్తి నిజరూప దర్శనం, కైలాష్ పర్వతము యందు సదాశివమూర్తి నిజరూప దర్శనం,శ్రీశైలము నందు జీవసమాధి చెందిన శ్రీపూర్ణానంద స్వామి ఆత్మదర్శనప్రాప్తి కల్గడము జరినది! ఈ దర్శనానుభవాలు అన్నియుగూడ మాకు ఆజ్ఞా,సహస్ర చక్ర స్ధితి యందు జరిగినాయి! ఎందుకంటే ఈ చక్రముల నందు దైవ, ఆత్మ సాక్షాత్కర స్ధితి ఉంటుంది! ఈ అనుభవాలు అన్నియుగూడ మా ఆజ్ఞా అలాగే సహస్ర చక్ర స్ధితి యందు చెప్పడం జరిగినది!

ఇలా మేము ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉన్న విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా నాకు కనిపించి…. నావెంట రక్షణగా, తోడుగా, నాతోపాటు తిరిగేవారు! నేను అక్కడ ఉన్నంతసేపు నా వెంట ఉండేవారు! నాకు కల్గిన ఈ దైవ అనుభవాలకి సాక్ష్యముగా నా భార్యకి,నాతో ఉన్న నా కుటుంబ సభ్యులకి,నా బంధుమిత్రులకి సమక్షములో జరుగుతుండేవి! గావాలని ఇలాంటి సజీవ దైవశక్తి చూడటానికి నా వెంట వచ్చి ఆ సజీవమూర్తి రూపాలను చూసి నమ్మకమేర్పడి అమిత ఆనందము పడేవాళ్ళు! కొన్నిసం!!తర్వాత నాకు తెలిసినది ఏమిటంటే ఇలా వీరందరు నాకు దర్శనము ఇవ్వటానికి కారణము ఇలా వీరందరిలో ఎవరో ఒకరి భక్తి లేదా సాక్షాత్కర మాయలో నన్ను పడవెయ్యాలని ప్రయత్నించినారని తెలిసినది!ఎందుకంటే వీరంతా సత్యముగా కనిపించే అసత్యమూర్తులు! పైగా వీరంతా పరమశూన్యము యొక్క స్వప్నమూర్తులు!ఈ జ్ఞానమును పొందటముతో రామకృష్ణపరమహంస,కబీర్ దాసు,నామదేవుడు,ఘోరలాంటి నిజభక్తియోగులు...వీరంతా భ్రమ,భ్రాంతిలని వారి సద్గురువుల వద్ద తెలుసుకుని...వీరి సాక్షాత్కరమాయలను దాటుకోవడము జరిగినది! విచిత్రము ఏమిటంటే నాకు ఇటు వైపు దైవాలు...అటు వైపు గురువులు నన్ను వారి మహా మాయలో పడవెయ్యాలని ప్రయత్నించడము జరిగినది! నాకు అపుడికే ఈ సాక్షాత్కరాలు మహమాయలని వివిధ యోగుల జీవితచరిత్రలు చదవడము ద్వారా మేము పొందిన శబ్ధపాండిత్యము ద్వారా తెలుసుకోవడముతో వీరి మాయలని చిరునవ్వుతో దాటడము జరిగినది! అనగా వీరి యందు నాకు ప్రేమ,మోహ,వ్యామోహ,మాయభక్తి కల్గకుండా ఉండటానికి నానా ఇబ్బందులు పడవలసివచ్చినది!ఒకవేళ వీరి మాయభక్తిలో పడితే...వాళ్ళే నిజమని...వారికి భక్తిపూజలు చేస్తూ...దాసోహం చేయ్యవలసి వచ్చేది! నిజానికి ఇలా వీరంతాగూడ తమకున్న ఇష్టకోరిక మాయ అనగా హృదయచక్రము వద్ద ఈ మహామాయను దాటలేకపోవడముతో...స్వప్నశరీరధారిగా మారడము జరిగినది! దానితో మోక్షప్రాప్తి పొందకపోవడముతో...అనగా నిశ్చిలస్ధితి పొందకపోవడముతో...ఏవో సంకల్పములు పెట్టుకొని మనలాంటి సాధన జీవాత్మలకి కనిపించి మనల్ని వారి భక్తిమాయలో ఉంచి వారికి గావాలసిన సేవలు చేయించుకుంటారని గ్రహించండి! అంటే సోహం (నేనే దేవుడిని ) అనవలసిన చోట వారికి దాసోహం(నువ్వే దేవుడివి) అవుతున్నామని తెలుసుకొండి! అందుకే దైవ,గురుభక్తి మాయలు దాటి మీరే గురుదేవుడిగా మారండి! దానితో ఇలా దైవవిగ్రహామూర్తుల వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ క్షేత్రాలకు, దేవాలయాలకు వెళ్ళడం పూర్తిగా మానివేశాను! పైగా దేహమే దేవాలయమని గ్రహించాను! ఆత్మయే ఆత్మలింగం అని తెలుసుకున్నాను! ఇది నేను అహంతో చెప్పడం లేదు! ఒక పిల్లవాడి భక్తి కూడా నాకు లేదని… కసితో… బాధతో ఎన్నో రకాల మాయలు, మర్మాలు దాటుకుని మధురభక్తిని అలవర్చుకుని….

భక్తిమార్గంలో పురోగతి సాధించడం జరిగింది! చేసేదెవరు చేయించుకునేదెవరు …. అందరూ ఒకటే కదా… అంతా ఒకటే కదా… ఉన్నది నేనే కదా! లేనిది నేనే కదా! పోయేది నేనే కదా! ఉండేది నేనే కదా! అంతా నేనే ఉన్నాను! నేను కానిది… ఏమీ లేదని… అసలు నేనే లేనని....సర్వం ఏమిలేదని...సర్వంశూన్యమని నా సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవ అనుభూతి పొందడం జరిగినది!

ప్రతి విగ్రహంలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ, ప్రతి చోట పంచభూత నిర్మితం శక్తి ఉంటుందని గ్రహించండి! ఈ పంచభూత శక్తి కి మనస్సు యొక్క భావ శక్తి లేదా ఆలోచన శక్తి లేదా సంకల్పశక్తి ఇవ్వగలిగితే…. అది కాస్త స్పందించి భక్తి శక్తి గా మారి అనుకున్న కోరికలు తీరుస్తుంది! ఇలాంటి శక్తి కలగాలి అంటే మన విగ్రహారాధన కాస్త సజీవ మూర్తి భావన శక్తిని పెంపొందించుకోవాలి! అంత తేలికైన విషయం కాదని గ్రహించండి! ఈ మధురభక్తి అలవడితే నిజభక్తులు లేదంటే కేవలం ప్రసాదభక్తులు అవుతామని గ్రహించండి! ఇలాంటి వారికి దేవుళ్ళు అనేవాళ్ళు కోరికలు తీర్చే యంత్రాలన్నమాట! అదే నిజ భక్తి ఉన్న వాడి విషయానికి వస్తే తమకు కావలసినవి అడక్కుండానే ఇచ్చే వరాల దేవతలు అన్నమాట! మనస్సుకి ఏ భావం ఇస్తే అది మనకు చూపిస్తుంది! ఎందుకంటే యద్భావం తద్భవతి! ఏ భావం ఉంటే అదే కనపడుతుంది ! ఆ చిన్న పిల్లవాడి భక్తిని పెంచుకోండి! ఎందుకంటే పసిపాప మనస్సున్న వాడిలో పరమాత్మ ఉంటాడని షిరిడి సాయి బాబా వారు ఇప్పటికే బోధించినారు కదా! ఇంకెందుకాలస్యం! మీ భక్తితో విగ్రహారాధన భక్తి మాయ దగ్గర ఆగిపోకుండా… దీని నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి!

విగ్రహారాధన అనేది అక్షరాలు లాంటిది! భాషకి ఈ అక్షరాలు ఎంత అవసరమో...మన ప్రారంభ సాధనకి ఈ విగ్రహారాధన అంతే అవసరము! ఎందుకంటే నిగ్రహము కోసము! అనగా మన దశేంద్రియాలు అనగా కన్ను,ముక్కు,చెవి,నోరు,చర్మము అలాగే ఇవి చేసే చూచుట,వాసన,వినుట,రుచి,స్ఫర్శ....ఇలా పదింటిని కలిపి ఈ దశేంద్రియాలు… మనకి ఈ విశ్వములో సత్యముగా కనిపించే వాటి మహామాయలలో పడకుండా ఉండటానికి మనకి నిగ్రహశక్తి పొందవలసి వస్తుంది!ఈ నిగ్రహము మనకి వస్తే విగ్రహముతో పని ఉండదు! ఎందుకంటే భాష వచ్చిన వాడికి అక్షరములతో ఏమి పని ఉంటుంది! అంటే మీరు మొదట మీ ఇష్టవిగ్రహరాధన చేసి...అందులో వారి సజీవ సాక్షాత్కరమును పొంది...ఆపై నిగ్రహశక్తితో..వీరి మహాభక్తి మహామాయలో పడకుండా...వీరిని దాటుకుని సాధనలో ముందుకి అనగా విగ్రహారాధన నుండి విశ్వారాధన చేసే స్థాయికి ఎదగండి! ఒకటి గుర్తుపెట్టుకోండి! నాస్వానుభవముతో చెపుతున్నాను!అది ఏమిటంటే మన మూలధారచక్రము నుండి అనగా మహాగణపతి నుండి చిట్టచివరిదైన బ్రహ్మరంధ్రము దాకా ఉన్న పరమశూన్యమైనా సర్వేశ్వరుడి దాకా మనము ఇలాంటి సాక్షాత్కారమహామాయలు దాటవలసి వస్తోంది!తస్మాత్ జాగ్రత్త! ఈ మాయలకి నూటికి 90 శాతము మంది దాటడము లేదని మేము తెలుసుకోవడము జరినది!మేము దాటినాము! మీరు గూడ దాటాలని మీకు ఇంత వివరముగా చెప్పడము జరిగినది! ఎందుకంటే బుద్ధుడి లాగా మీరు ఆగిపోకూడదు!అనగా ఈయన సాధన చేసి సర్వమాయలకి కోరికయే మహాకారణమని జ్ఞానప్రాప్తి పొంది...చివరికి కోరికలు లేని సమాజమును చూడాలనే ఇష్టకోరిక కోసము మళ్ళీ తిరిగి తనకి తెలియకుండానే కోరిక మహామాయలో పడినారని తెలుసుకొండి! దీనికి కారణము మన బుద్ధుడు సాధన చేస్తున్నపుడు ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు! ఈ యవ్వన స్రీమూర్తి రూపములో కామమాయగా త్రిపుర దేవి అన్నమాట! మాయ మన సాధనను ఆపటానికి సాక్షాత్కర, సిద్ధులు,దైవిక శక్తులు,యోగశక్తులు,ఇష్టకోరిక, అనుభవ,అనుభూతిలలో ఏదైన తీసుకొని మన నిగ్రహశక్తికి పరీక్ష పెడుతుంది! ఈ పరీక్షలు అన్నీ గూడ మహామాయ పరీక్షలని మీరు జ్ఞానము పొందితే...మాయ మాయం అవుతుంది!

ఈ మాయలకి ప్రతిరూపమే ఆదిపరాశక్తి! మొదట బాలికరూపములో కూతురిగా భక్తి మాయగా బాలగా...ఈ సాక్షాత్కర మాయదాటితే...ఒక యవ్వన స్రీమూర్తి రూపములో కామమాయగా త్రిపురగా…. ఈ సాక్షాత్కర మాయదాటితే... 65సం!! వృద్ధ స్త్రీమూర్తిగా ఇష్టకోరిక మాయగా సుందరి రూపములో వస్తుంది! ఈ సాక్షాత్కర మాయదాటితే… 85సం!! వయోవృద్ధురాలిగా సహనశక్తి మాయతో... దేవిగా ఆదిపరాశక్తి వస్తుంది! ఈ సాక్షాత్కర మాయదాటితే గాని మనకి మహామృత్యువైన శ్వాశతమరణస్ధితి యైన కపాలమోక్షం మనకి కల్గదు! అందుకే బాలా త్రిపుర సుందరి దేవిని మన యోగసాధన స్ధాయిలు చెప్పే అమ్మవారిగా గుర్తించడము జరిగినది! అంటే మన సాధన చేస్తునపుడు బాల వస్తే...మన సాధన ప్రారంభ స్ధాయిలో...అదే త్రిపురగా వస్తే మధ్యమ స్ధాయిలో..అదే సుందరిగా వస్తే అంతిమ స్ధాయిలో... అదే చిట్టచివరి అంతిమ రూపముగా దేవిగా ఆదిపరాశక్తి సాక్షాత్కరమైతే కపాలమోక్ష స్ధాయికి అనగా బ్రహ్మరంధ్రం వద్దకి మన సాధన ఉంటుందని తెలుసుకొండి! ఈ విధంగా మన సాధన స్ధాయిలుంటాయని లోకానికి తెలియచెయ్యటానికి ఆదిపరాశక్తికి బాలా-త్రిపుర-సుందరి-దేవిగా నామకరణ చేసినారని తెలుసుకొండి!

అంతెందుకు మాకు ఇన్ని తెలిసిన గూడ బాల రూపమును దాటినాము గాని కామరూపిణి అయిన త్రిపుర మాయ దాటలేకపోయినాము! ఆ పై త్రిపురదేవి వలన మాకు కలిగిన కామమాయను దాటుకోవటానికి మేము దీక్షాదేవిని వివాహము చేసుకొని…. త్రిపురదేవి కామమాయను దాటడము జరిగినది! ఆతర్వాత సుందరి, దేవి రూపములను దాటి...మహ మృత్యువైనా కపాలమోక్షస్ధితి ఈ సం!! అనగా 2019 మార్చి 11 మహశివరాత్రి పర్వదినమున ఉదయం 10:05 లకి మా సూక్ష్మ,కారణ, సంకల్ప, మా మూలకపాలము యొక్క చితాగ్నిలో ఈ మూడు శరీరాలు దహనమై...విభూదిగా మారడముగా మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చలస్ధితి పొందడము జరిగిన ట్లుగా మాకు ఆ రోజు ధ్యానానుభవమైనది! ఇదే ధ్యానములో పైగా ఎవరో అన్నట్లుగా బాబా విభూతినాధ్ కి జై...అంటూ...స్వయంగా గోమయ విభూది చేసుకొని వాడుకో అని ఆదేశము రావడముతో....

ఇదే రోజు బాగా ఎండిన ఆవుపేడను సేకరించి...దానికి ఆవునెయ్యి,కర్పూరం వేసి కాల్చడము...ఆపై వచ్చిన భస్మమునకు కొంతమేర నాముపొడిని ఆవుపాలతో కలిపి ఎండిపెట్టి...దీనినే విభూతిగా వాడటము జరుగుతోంది! దీనిని స్నానము చేసే నీళ్ళలలో చిటికెడు కలుపుకొని విభూధి స్నామము చెయ్యడము అలాగే ఈ విభూధితో ధారణ చేసుకోవడము చేస్తున్నాను! అలాగే ప్రతి సం!! వచ్చే మహాశివరాత్రినాడు ఈ విధంగా విభూధిని తయారు చేసుకోవాలని...వీలు అయితే అందరికి ఈ నిజమైన గోమయ విభూధిని ఉచితంగా పంచాలని నిశ్చయించుకోవడము జరిగినది! దానితో మా దీక్ష నామము అయిన శ్రీ పవనానంద సరస్వతి నామము కాస్తా బాబా విభూతినాధ్ గా మారడము జరిగినది! దీనితో మేము సంపూర్ణ అద్వైత సిద్దాంతము అలాగే సమాధి గీత రచించడము జరిగినది! కాని మా స్ధూల శరీరానికి నా చిట్టచివరి ప్రారబ్ధకర్మగా మా అమ్మగారి అంతిమ యాత్ర పూర్తి అయితే గాని మాకు ఈ స్ధూల దేహవిముక్తి కల్గదని… అమ్మ తన ఆఖరి కోరికగా తన అంతిమ సంస్కారము మా చేతులలో జరగాలని ఆమె కోరడముతో...నాకు ఇంతటి సంపూర్ణ సాధన జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా...ఆమె అడిగిన కోరికను తీర్చడము కోసము మా స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా ఆగిపోవడము జరిగినది! ఆమె మరణము తర్వాత ఆమె ఇచ్చిన ఈ స్ధూల శరీరము…. ఆపై ఇది గూడ కాశీక్షేత్రములో మా అస్ధిక చితాభస్మము ఈ క్షేత్ర గంగానదిలో కలిపితే...ఈ శరీరమునకు బంధవిముక్తి కల్గి మనోనిశ్చలస్ధితి పొంది స్ధూల కపాలమోక్షస్ధితి పొందడము జరుగుతుంది! అనగా జీవసమాధి స్ధితి పొందడము జరుగుతుంది! అంటే దీనితో స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి వచ్చినట్లే అవుతుంది!కాని ఆకాశ శరీర కపాలమోక్షస్ధితి అర్హతకోసము కాశీక్షేత్రములో పంచకోశ ప్రాంతములో ఆకాశకోశములో జీవసమాధి స్ధితి పొంది...ఆపై మణికర్ణిక ఘాట్ యందు దహనము లేదా సమాధి చేయబడితే...అటుపై ఆదిగురువు విశ్వనాధుడి తారకరామబ్రహ్మ మంత్రమును గురూపదేశముగా పొందితే… రేణువు పరిమాణములో ఆకాశ శరీరముతో...మన మూలకపాలములోని చితాగ్ని యొక్క 10లక్షల దహనశక్తి తట్టుకోగలిగితే ...అపుడు మనకి ఆనందరహిత సమాధి స్ధితి కలిగి… అటుపై పరమప్రశాంత స్ధితి అనగా సంపూర్ణ మూలకపాల మోక్షస్ధితి పొందడము జరుగుతుంది!కాని ఇట్టి కపాలస్ధితిని ఇంతవరకు ఎవరుగూడ పొందలేదు!కేవలము ఇట్టి కపాలస్ధితిని పొందుటకు అర్హత మాత్రమే సంపాదించడము జరిగినది! అనగా చితాగ్ని 10 లక్షల దహనశక్తిని తట్టుకుని ఆ ఆదియోగియే నిలబడలేకపోయినారు! దానితో సంపూర్ణ మూలకపాల మోక్షస్ధితి పొందడము జరుగలేదు! కేవలము స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి పొందడము జరుగు తోంది! మేము గూడ కాశీ క్షేత్రము నందు 41 రోజులపాటు ఉండి ఈ చితాగ్ని దహనశక్తిని 96 ని!!లకి 48ని!! పాటు మాత్రమే అనగా 10 లక్షల దహనశక్తిలో 5 లక్షల శక్తిని తట్టుకొని...ఆపై సహనశక్తిని ఒక లిప్తకాలము పాటు కోల్పోయి...ఆకాశశరీర కపాలమోక్షస్ధితి పొందకుండా వెనుతిరగడము జరిగినది! అంటే ప్రస్తుతానికి సూక్ష్మ,కారణ,సంకల్ప శరీరాలకి కపాలమోక్షస్ధితి పొందడము జరిగినది!అలాగే ఆకాశకపాలమోక్షస్ధితిలో విఫలము చెందడము జరిగినది!ఇక స్ధూలశరీర కపాలమోక్షస్ధితి కోసము రాబోవు సం!!లో అనగా జీవసమాధి స్ధితి పొందడము జరుగుతుంది! ఒకవేళ కాశీక్షేత్రములో మరణము పొందితే...ఆకాశశరీరానికి మళ్ళీ కపాలమోక్షస్ధితి పొందటానికి అలాగే ఈ సాధన చేసుకోవటానికి అర్హత వస్తుంది! అంటే ఈ లెక్కన మన పంచశరీరాలకి అనగా స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప, ఆకాశ శరీరాలకి పంచ కపాలమోక్షస్ధితిని పొందవలసి ఉంటుందని గ్రహించండి! అందులో మేము నాలుగు కపాలమోక్షస్ధితిని పొంది...ఆకాశ కపాల మోక్షస్ధితిని పొందలేకపోవడము జరిగినది! మోక్షమంటే చనిపోవడము గాదని తెలుసుకొండి! ఆయా శరీరాలు ఆయా ప్రారబ్ధకర్మలను కర్మశేషము లేకుండా పూర్తిచేసుకుని...వాటి నుండి విముక్తి పొంది...ఆ శరీరము మనో నిశ్చలస్ధితి పొందినట్లు అన్నమాట! అనగా ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో...అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే అన్నమాట ! ఇలా మన శరీరములో ఉన్న పంచశరీరాలు అనగా స్ధూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలకి మోక్షస్ధితిని పొందాలి అన్నమాట! అదే జీవసమాధి అంటే మరణించడము అన్నమాట!

అనగా మన పంచశరీరాలు పంచకపాలస్ధితికి చేరుకొని ఏకకాలములో ఒకదానితర్వాత మరొకటి విభేదనము చెందుతూ పరమశూన్యము నందు ఐక్యం చెందడమే జీవసమాధి అవుతుంది! అనగా యోగసిద్ధి పొందటం అవుతుంది! దానితో ప్రస్తుతము మాకున్న ప్రారబ్ధ కర్మనివారణ చేసుకుంటూ...అందరికి మేము చేసిన గోమయ విభూది అలాగే మేము చేసిన నిమ్మపాల కుంకుమను ఉచితంగా పంచుతూ...మాకు ఆకాశకపాలమోక్షప్రాప్తి కోసము...ఆకాశశరీరముతో... స్వప్నసాధన కోసము...కాలమును ఈ స్ధూలశరీరముతో...నీలి ఆకాశము కేసిచూస్తూ... అన్నింటిని సాక్షిభూతముగా చూస్తున్నాము! విచిత్రము ఏమిటంటే మా భౌతిక గురుదేవుడు అలాగే మా ప్రధమ శిష్యుడైన జిజ్ఞాసి గూడ వారి తల్లి మాయ దగ్గర మాకు లాగానే తాత్కాలికముగా ఆగిపోవడము జరిగినది! నేను త్రిపురమాయ దగ్గర బోల్తా పడితే...జిజ్ఞాసి మాత్రము సుందరి రూపము దగ్గర ఇష్టకోరిక మాయ కి స్పందించడము …. అలాగే ఆదిపరాశక్తి దగ్గర సహనశక్తి మాయ దగ్గర సహనశక్తి కోల్పోవడముతో బోల్తా పడి...ఇపుడు సహనశక్తిని కోల్పోకుండా ఉండటానికి నిగ్రహశక్తి కోసము సాధనను కొనసాగిస్తున్నాడు! అనగా వీరికి సూక్ష్మ,కారణ శరీరాలకి మోక్షప్రాప్తి అనగా మనోనిశ్చలస్ధితి పొందినాయి గాని ఇంక సంకల్ప శరీరాలకి మోక్షప్రాప్తి ఈ సం!! అనగా 2019 నవంబరు 25 కార్తీక సోమవార పర్వదినము నాడు సాయంత్రము 7గం!! లకి తన సంకల్ప శరీరానికి మోక్షప్రాప్తి …. అలాగే మహాస్శశాన క్షేత్రమైన కాశీయందు ఈ క్షేత్ర గంగానదిలో అస్ధిక చితాభస్మము కలిపితే తన స్ధూల శరీరానికి మోక్షప్రాప్తి పొందడము జరుగుతుంది! అలాగే కాశీయందు మరణమును పొందితే...ఆకాశ శరీరానికి మోక్షప్రాప్తికి అర్హత పొందడము జరుగుతుంది!

పాల మోక్షం - 22 -నిజ వెంకన్న భక్తుడి దర్శనం

కర్ణపిశాచి దెబ్బకి నా చదువు అటకెక్కింది! చదువులో విఘ్నాలు ఏర్పడినాయి! ఇంటిలో అనుమానాలు అవమానాలు పెరిగినాయి! నేను ఏదో చేస్తున్నాను అని ఏదో దాస్తున్నానని సందేహాలు నా తల్లిదండ్రులను వెంటాడిన కానీ నన్ను అడగలేదు! అలాగని నన్ను తిట్టకుండా ఉండలేరు! వయస్సుకి వచ్చిన ప్రతి వారికి ఎదురైన అనుమానపు అనుభవాలే అని నాకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది! ఇంతలో నా చదువుకు విఘ్నాలు రావడంతో తిరిగి నేను గుడిలో పూజాది కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఏర్పడింది! దాంతో ప్రతి రోజు జిజ్ఞాసి నన్ను కలవడానికి గుడికి వచ్చేవాడు! రెండు లేదా మూడు గంటల పాటు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ గడిపేవాడిని! మాకు ఆ ధ్యాస తప్ప వేరే విషయం ఉండేది కాదు! అమ్మాయిలను చూసి చొంగ కార్చుకొనే వయసులో ఉన్న మేము… వారి మీద వైరాగ్య భావాలు ఎలా పెంపొందించుకోవాలి అని ఆలోచనలు చేసేవాళ్లం! ఒకరోజు అనుకోకుండా జిజ్ఞాసికి నా శ్రీశైల క్షేత్రం లో జరిగిన అన్ని రకాల దైవధ్యాన అనుభవాలు చెప్పి …. “నాలాంటి నిజ భక్తుడిని నువ్వు ఇంత వరకు ఎవరిని చూసి ఉండవు”… అని చెప్పి వాడి వైపు గర్వంగా చూస్తూ చూశాను! వాడు నన్ను చూసి “అవునా? నిజమా! ఈ మాత్రానికే నువ్వు నిజ భక్తుడివి అనుకుంటే సరిపోతుందా! మాకు తెలియాలి కదా! మాకు అనిపించాలి కదా! నిన్ను చూస్తుంటే పుస్తక వాక్యాలు చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగి లాగానే కనబడుతున్నావ్! నువ్వు ఇంకా భక్తి మార్గం లోనికి ప్రవేశించలేదు లేదా జ్ఞానమార్గంలో ను ప్రవేశించలేదు! అలాగే ధ్యాన మార్గంలోను కూడా ప్రవేశించలేదు! ఏ మార్గంలో నువ్వు ఎక్కడా ప్రవేశించినట్లుగా నాకు అనిపించడం లేదు! ఏ సాధనామార్గంలో లేనివాడివి! నీకు నువ్వే నిజ భక్తుడు అనుకుంటే సరిపోతుందా… కేవలం నువ్వు ప్రసాదాలు పంచే ప్రసాదభక్తుడివేనని తెలుసుకో ! అంతెందుకు నీకు నిజభక్తులను చూడాలంటే చెప్పు! మా ఇంటి దగ్గరలో ఉన్న రమణ అనే తిరుపతి వెంకన్న నిజ భక్తుడిని తీసుకుని వస్తాను! ఆయనను చూసి నీవే తెల్చుకో! నువ్వు నిజభక్తుడివో...ఆయనో తెల్చుకో!” అని చెప్పి వెళ్ళిపోయాడు! దీని యమ్మ! ఏమిటి? నా ఊరిలో నాకు తెలియకుండానే వెంకన్న భక్తుడు ఉన్నాడా! వామ్మో! వాడు నన్ను మించిన భక్తుడా? నామ దేవుడికి.. ఘోరా భక్తుడి చేతిలో జరిగిన అవమానం…. రేపు నా జీవితంలో జరగదు కదా! వామ్మో! ఈ జిజ్ఞాసి ఏదో ఒక మాట అనేసి నన్ను రెచ్చగొట్టి వెళ్లిపోతాడు! ఆ తర్వాత నేను జుట్టు పీక్కుకోవడమే తప్ప ఏమీ చేయలేను! సరే రేపు ఏం జరుగుతుందో చూద్దాం…. అనుకుని ఆ రాత్రి నిద్ర పట్టని రాత్రి అయినది!

మరుసటి రోజు సాయంత్రానికి గుడికి జిజ్ఞాసి ఒక మధ్య వయస్సుఉన్న వ్యక్తిని చేతబట్టుకుని వచ్చినాడు! వెంకన్న స్వామి లాగానే నామాలు పెట్టుకున్నాడు! వెంకన్న ఎత్తు లాగానే ఆరడుగులు ఉన్నాడు! చేతిలో ఏకతార ఉన్నది! బాగా జుట్టున్న కూడ ముడి వేసుకున్నాడు! చూడగానే ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ, తేజస్సు కొట్టుకువచ్చినట్లుగా కనబడసాగింది! సాక్షాత్తు తిరుపతి వెంకన్నను చూసినట్లుగా… ఇతనిని చూడగానే అనిపించినది! వామ్మో! ఏమి మంత్రోపాసన! సాక్షాత్తు వెంకన్నను తనలో ఇముడ్చుకున్నాడు! అతడు నవ్వుతుంటే ఏదో మోహన శక్తి నాకు ఆ నవ్వులో కనపడింది! అదే ముఖం చూడకుండా ఉండలేని స్థితి! అదే ఆయన ఆడపిల్లయితే ముద్దుపెట్టుకోకుండా ఉండలేని స్థితి! ఖచ్చితంగా ఎంతటి బ్రహ్మచారి కూడా ఇతను ఆడపిల్ల అయితే సంసారి కావాల్సిందేనని నాలో నేను అనుకున్నాను! నా దీనావస్థను గమనించిన జిజ్ఞాసి చిరునవ్వు నవ్వే సరికి నేను ఈ లోకమునకు రావడం జరిగినది! ఆయన అమాయకముగా తన పేరు రమణ అని… తన సాధన భక్తి వివరాలు నాతో చెప్పడం చూస్తుంటే… అతని నిశ్చల భక్తికి నేనే దాసోహం అవుతానేమో అని నాకు అనిపించింది! అతడు అన్నమయ్య రాగాలు ఆలపించే సరికి కళ్ళముందు లీలామాత్రంగా తిరుపతి వెంకన్న స్వామి సజీవమూర్తిగా కనిపిస్తాడని… ఆ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో గుర్తు పెట్టుకుని…. ఆయన రూపమును ఒక తెల్లని దుప్పటి మీద ఆయన మనో రూపమును గీసినాడని నాతో చెప్పడం జరిగింది! దాంతో ఆయన గీసిన వస్త్రమును… రేపు మర్చిపోకుండా తీసుకుని రమ్మని చెప్పి… ప్రతిరోజు గుడికి రమ్మని చెప్పి… నా జిజ్ఞాసి వైపు తిరిగి చిరునవ్వు నవ్వి ఆ రోజు మాత్రం మా సత్సాంగానికి స్వస్తి పలికినాము!

మరుసటి రోజు జిజ్ఞాసి మరియు రమణ ఇద్దరూ కలిసి గుడికి రావటం… నేను కోరినట్లుగానే రమణ గీసిన వెంకన్న బొమ్మ ఉన్న దుప్పటి చూపించేసరికి నా మతి పోయింది! గావాలంటే పైన పెట్టిన ఫోటో నిజమైన తిరుపతి వెంకన్న ఫోటో(1978)...అలాగే క్రింద పెట్టిన ఫోటో ఈయన గీసిన బొమ్మ...ఈ రెండింటికి మీకు ఏమైనా తేడా కనపడుతోందా...లేదు కదా! ఇంత దగ్గరగా తిరుపతి వెంకన్నను చూస్తున్నానని నాకు కొన్ని క్షణాలపాటు అనిపించింది! అంతవరకు ఈ గీసిన వెంకన్న దుప్పటి ని చూడని జిజ్ఞాసిగూడ అదే పరిస్థితిలో ఉన్నారని… నేను తెలుసుకునే సరికి నాకు నవ్వు వచ్చింది! ఆనందమేసింది! ఇలాంటి నిష్కామ భక్తునిని కలిసినందుకు… ఏదో తెలియని ఆనందానుభూతి కొన్ని క్షణాల పాటు ఉన్నది! మాటల మధ్యలో నేను జాతకాలు చెపుతానని తెలుసుకుని… అతడు సాధనా జీవిత విషయాలను చెప్పమని ఒత్తిడి చేయడంతో…. అతడి జాతకము లో జరిగిన విషయాలు ….జరగబోయే విషయాలను చూడటం జరిగింది! గతజన్మలో యోగి అని… కానీ ఒక యోగినిని వివాహమాడతానని ఆమెకు మాట ఇచ్చి… ఆ జన్మలో ఆమెను వివాహాము చేసుకోకుండా తనువు చాలించారని… ప్రస్తుత జన్మలో ఆ యోగిని ఒక స్త్రీ మూర్తిగా జన్మించి… ఇతడు యోగసాధనకు మాయగా మారుతుందని…. రాబోవు కాలంలో ఏ స్త్రీ మూర్తిని వివాహమును చేసుకోకపోతే యోగ సాధన పరిసమాప్తి చెందుతుందని లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉందని నా వాక్కు ద్వారా చెప్పడం జరిగినది!

నేను ఉన్నది ఉన్నట్లుగా ఏమి దాచకుండా చెప్పినందుకు ఆయన సంతోషించి నన్ను పూర్తిగా నమ్మటం ఆరంభించాడు! నన్ను ఒక యోగసాధన గురువుగా భావించుకుని అతను సాధన ధర్మసందేహాలు తీర్చుకునే వారు! కాని నాకు మాత్రం ఏమాత్రం తెలిసేది కాదు !కానీ నన్ను జిజ్ఞాసి అలాగే యోగి రమణ ఎన్నో ఆధ్యాత్మిక ధర్మసందేహాలు తీర్చుకునేవారు! ఎన్నో సాధన సందేహాలు తీర్చుకునేవారు! నాకున్న వాక్సిద్ధి వలన నాకే తెలియని ఎన్నో విషయాలు నా వాక్ నుండి అనర్గళంగా వచ్చేవి! ఏమి వస్తున్నాయో నాకు తెలిసేది కాదు! అలాగని గుర్తుపెట్టుకుని స్థితి ఉండేది కాదు! వారి అడిగినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఉత్తేజము కలిగి నా వాక్ ద్వారా వారికి కావాల్సిన విషయాలు బయటికి వచ్చేవి! ఒకవేళ తెలియకపోతే వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయా పుస్తకాలు నా దగ్గర రావటం…. వాటిని చదవటం…. వారికి తెలియని విషయాలను తెలుసుకుని… ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ప్రతి రోజు ముగ్గురం చర్చించుకునేవాళ్ళం! వాదించుకునే వాళ్ళు ! ఒక సమాధానం కట్టుబడి ఉండే వాళ్ళం! ఇలా మా ముగ్గురు స్నేహం జరుగుతున్న సమయంలో ఊర్లో వాళ్ళ దృష్టి అలాగే ఇంట్లో వాళ్ళ దృష్టికి మా ఆధ్యాత్మిక ప్రసంగాలు విషయాలు తెలిసినాయి! దాంతో వీళ్లంతా సన్యాసులుగా కాకుండా సన్నాసులు గా మారతారు! పుట్టుక లేని దేవుడి గురించి వివరించే స్థాయిలో మీరు ఉన్నారా అంటూ మా ముందే ఎగతాళి చేయడం ఆరంభించారు! మా మీద జోకులు వేసుకుని వాళ్లు! అయినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు! మాకు ఆధ్యాత్మిక విషయం తప్ప మరే ఏ విషయం మా చర్చకి వచ్చేది కాదు! మేము ముగ్గురము కలిస్తే కనిపించని దైవమును ఎలా కనిపిస్తాడని ఆలోచనలు చేసేవాళ్లం! పుస్తకాల్లో చెప్పిన సంప్రదాయాలు…. గ్రంథ పారాయణాలు చేసేవాళ్లం! కానీ ఎలాంటి అనుభవాలు కలిగేవి కావు! సంతృప్తినిచ్చేది కావు! ఇలాంటి స్థితిలో మేము ఉండగానే మేం ముగ్గురం కలుసుకో కూడదని…. ఎక్కడా కూడా మాట్లాడకూడదని నా మీద ఆంక్షలు పెట్టేవారు! మమ్మల్ని కలవనీయకుండా బంధించేవారు! తిట్టేవారు! రానురాను మా మీద బాగా తీవ్రమైన ఒత్తిడి పెంచారు! ఎక్కడ మేము సన్యాసులు అవుతామని వీళ్ళ భయం అని మాకు తెలిసింది! యోగ ముంటే యోగి కాకుండా ఎవరు ఆపలేరని నాకు ఒక్కడికే తెలుసు! కానీ ప్రకృతి కూడా నాతో ఆడుకోవడం ఆరంభించినది!మేము మాట్లాడుకునే సమయానికి అకాల వర్షాలు లేదా అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కలిగి విఘ్నాలు ఉండేవి! దాంతో మాకు ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి సమయం రానురాను తగ్గిపోతూ వచ్చింది! ఉన్నత చదువుల నిమిత్తం జిజ్ఞాసి వేరే ఊరికి వెళ్ళి పోవడం అలాగే ఉన్నత ఉద్యోగం కోసం యోగి రమణ వేరే ఊరికి పోయే సరికి మా ఆధ్యాత్మికత పాండిత్యమునకు ఆటంకం ఏర్పడింది! వీరు లేకపోయేసరికి నన్ను పట్టించుకునే వాడు… నన్ను గుర్తించేవాడు లేకపోయే సరికి.. నేను నా చదువు మీద ఏకాగ్రత పెట్టటం ఆరంభించాను!

కొన్ని నెలల తర్వాత యోగి రమణకి తల్లిదండ్రుల ఒత్తిడి మేర…. ఒక స్త్రీమూర్తిని ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం జరిపించినారని … శోభనం గదిలో అమ్మాయిని చూసి…. అమ్మవారి లాగా భావించి స్తోత్రము చేయగానే…. ఆమె భయపడి అతడిని వదిలి పెట్టి వెళ్ళిపోయింది అని తెలిసినది! దాంతో అతను వైరాగ్యం చెంది… మిడిమిడి జ్ఞానంతో పుస్తకములో ఉన్న అన్ని రకాల యోగ సాధనలు చేసి …ఉన్న దంతాలు కూడా… ఊడి పోయేటట్లుగా సాధన చేసి…. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో…. తెలియని సాధన స్థితిలో ఉండి…. అయోమయానికి గురవుతున్నారు అని తెలిసింది! ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో… ఎలా ఉన్నాడో కూడా తెలియని స్థితి! నాకు అందనంత దూరంలో ఉన్నాడు అని అనుకున్నాను! ఏమి చేయగలం! విధిరాతను ఎవరూ మార్చలేరని… ఉన్నది తెలుసుకుని ఆచరించడం తప్ప….. ఏమీ చేయలేమని తెలిసిన…. జరిగే దానిని జరగకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరని ఆయన జీవితమే అందుకు ఉదాహరణ గా నిలిచిపోయింది! వివాహ ప్రక్రియ వలన తన యోగ సాధన ఆగిపోతుందని…. ఎన్నో సంవత్సరాలు ముందుగా తెలుసుకున్న కూడా ఏమీ లాభం? కనిపించని దేవుడు …. అతనికి ప్రత్యక్ష అనుభవ అనుభూతి ఎంతకూ కనిపించకపోయేసరికి ఆస్తికుడు కాస్తా నాస్తికుడిగా మారిపోయినాడని తెలిసి… ఏమీ చేయలేని స్థితిలో మేమిద్దరం ఉండిపోయాము! అప్పుడు యోగి రమణ జీవితం లాగా మా యోగసాధన జీవితం స్రీమూర్తుల మహా మాయ దగ్గర ఆగిపోకూడదని మేము నిర్ణయించుకున్నాము! ఇలా అసలు మనము ఈయనకిలాగా నిజముగానే దైవ చింతన దేనికి? అసలు అవసరమా? అనే సాధన సందేహము మా మదిలో వచ్చినది! దీనికోసము మేము పుస్తక-గ్రంధాలు చదవడము ఆరంభించినాము! అంటే నేను ఆధ్యాత్మిక శబ్ధపాండిత్యములోనికి అడుగుపెట్టడము జరిగినది! నాకు వచ్చిన సాధన ధర్మసందేహలకి శబ్ధపాండిత్యము వలన సమాధానాలు దొరికినాయి! నాకు వచ్చిన ధర్మసందేహలు ఏమిటో...వాటికి నేను తెలుసుకున్న సమాధానాలు ఏమిటో తెలుసుకోవాలని ఉందా... మీకు తెలియాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా! శుభంభూయాత్

గమనిక:

యోగసాధన చెయ్యాలని అనుకునేవారు ఎన్నటికి వివాహాము చేసుకోవద్దు! ఒకవేళ చేసుకొనే పరిస్ధితి వస్తే మాత్రము యోగసాధన చేసేవారిని లేదా ఆధ్యాతిక విషయాలయందు అమితాసక్తి ఉన్న వారిని మాత్రమే వివాహాము చేసుకొండి!లేదంటే మీ జీవితము ఇటు భోగ జీవితానికి లేదా యోగ జీవితానికి పనికి రాకుండా పోతుంది!అలాగే బ్రహ్మచారి పేరుతో లేదా గృహస్ధ ధర్మము పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు! పెట్టుకొని మీరు నాశనమవ్వడమే గాకుండా కుటుంబ వ్యవస్ధను అలాగే సమాజ వ్యవస్ధను నాశనము చేసినవారు అవుతారని గ్రహించండి! ఇలా తమ జీవితాలను నాశనము చేసుకున్న తల్లిదండ్రులను, బ్రహ్మచారులను, యోగసాధకులను, పీఠాధిపతులను,మంత్రోపసాకులను నా స్వానుభవములో చాలామందిని చూడటము జరిగినది!తస్మాత్ జాగ్రత్త!

ఇక యోగిరమణ విషయానికి వస్తే...జిజ్ఞాసి నేను ఉన్నచోట తను ఉంటే నన్ను చూడటానికి మాత్రము వచ్చేవాడు! కాని యోగి రమణ మాత్రము నేను ఎక్కడ ఉన్న అనగా ఊళ్ళో ఉన్న లేదా లేకపోయిన నేను ఉన్నచోటు తెలుసుకొని అక్కడకి ప్రతివారము నాకోసము వచ్చేవాడు! కొన్ని సం!!రాల తర్వాత నాకు వచ్చిన జన్మాంతర జ్ఞాన సిద్ధి వలన ఇతను నా పంచశిష్యులలో మూడోవాడని...ఇతనికి యోగి రమణ దీక్షనామముతో సాధన చేయించి మోక్షప్రాప్తిని మేము కలిగించాలని తెలుసుకున్నాము!ఇది కాస్తా నాకు ప్రారబ్ధ కర్మగా మారడముతో… మాతోపాటుగా ఇతనికి కాశివాసము చేయించి...అక్కడే కపాలమోక్షప్రాప్తి కలిగించాలని...ఇతనికి మాయందు చూపిన భక్తివిశ్వాసమునకు సంతసించి పరమగురువుగా మేము అనుగ్రహించిన వరము! ఇక అతనికి ఈ యోగమున్నదో లేదో అతనికే తెలియాలి! కాలమే సమాధానమివ్వాలి! అందాకా ఈ నిజ శిష్యుడికోసము ఒక యోగగురువుగా మేము ఎదురుచూడక తప్పదుగదా! ఇతనికున్న తిరుపతి వెంకన్న నిజభక్తి వలన అది కాస్తా గురుభక్తిగా మారి ఒక గురువే ఈ శిష్యుడి కోసము ఎదురుచూస్తూన్నాడు అంటే...నిజభక్తి యెట్టిదో ఆలోచించండి!

కపాల మోక్షం - 23 - భగవంతుడిని మనము చూడగలమా?

( నీ గూర్చి నీవు తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్లే!)

భగవంతుడు ఉన్నాడని… నమ్మటానికి ఆ భగవంతుడిని మనం చూడగలమా? ఇది వరకు ఎవరైనా భగవంతుడిని చూచారా? అనే ప్రశ్నలు వస్తాయి! మనకు కనపడని దానిని నమ్మడమెలాగ? అన్నపుడు దానికి జవాబు తెలుసుకోవడం చాలా అవసరం కదా! మనకు ప్రత్యక్ష అనుభవం, పరోక్ష అనుభవం అని రెండు రకాల అనుభవాలు ఉన్నాయి! ప్రత్యక్ష అనుభవం అంటే మనం స్వయంగా అనుభవంతో తెలుసుకునేది! ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు! ఉదాహరణకు ఒక వ్యక్తి తన ముత్తాతను చూడలేకపోవచ్చు !కానీ తాత, తండ్రి మొదలైనవారు ఆ ముత్తాతను గురించి తెలిపినప్పుడు నమ్ముతాము! అనగా మనము చూడకపోయినా చూసినవారు అందులోనూ మనం నమ్మేవారు చెప్పినప్పుడు తప్పక నమ్ముతాము! అలాగే ప్రతివారు విదేశాలకు వెళ్లి అక్కడ వింతలు-విశేషాలు చూడలేరు కానీ అక్కడికి వెళ్లి వచ్చిన వారు చెప్పితే నమ్ముతాము కదా! దీనినే పరోక్ష అనుభవం అంటారు! అనగా ఇతరులు చెప్పింది నమ్మటం అన్నమాట! మనం భగవంతుడిని దర్శించ లేదు కానీ భగవంతుడిని దర్శించిన సిద్ధపురుషులు అన్ని దేశాలలో, అన్ని కాలాల్లోనూ ఉన్నారు! భగవంతుడు ఉన్నారని తాము దర్శించామని చెప్పినప్పుడు మనము నమ్మకం తప్పదు కదా!

ఇక ప్రత్యక్ష అనుభవం గురించి చూస్తే దేనినైనా మనం ఎలా చూస్తామో? అందుకు మొదట వస్తువు గురించి తెలియాలి! అంటే అది ఎక్కడ ఉందో మనకి తెలియాలి! లేకపోతే చూడటం అనేది జరగదు! ఇంకా రెండోది ఆ వస్తువును చూడాలి అంటే అది మనకి కళ్ళకి కనపడే దూరంలో ఉండాలి! మూడవది ఆ వస్తువును చూడాలి అంటే ఆ వస్తువు పై కాంతి ప్రసరించి… కాంతి పరావర్తనం చెంది మన కంటిని తిరిగి చేరాలి! అలాగే కంటి వెనుక గల రెటీనా అనే తెరపైకి కాంతికిరణం పడాలి! రెటీనా కు కలపబడిన నాడుల ద్వారా… మెదడులోని తత్సంబంధిత భాగానికి వార్త అందుతుంది! అప్పుడు ఆ వస్తువును చూచిన అనుభూతిని పొందుతాము! కాబట్టి వస్తువుని చూడటానికి కాంతి అవసరం! ఇక నాలుగవది మన కంటి పరిస్థితి సరైన స్థితిలో ఉండాలి! అనగా గుడ్డివాడు చూడలేక పోవడానికి వాడి కంటి నిర్మాణ స్థితి సరైన స్థితిలో లేకపోవడం వల్లనే కదా! పైగా విచిత్రమైన విషయం ఏంటంటే దేనినైనా చూడటం అనేది ప్రయత్నం వల్ల సాధ్యపడుతుంది! ఉదాహరణకు మనం గావాలని కళ్లు మూసుకుంటే…. దగ్గర్లో ఉన్న వస్తువును సహితం చూడలేము! ఒకసారి మన కళ్ళు తెరుచుకుని ఉంటాయి! కానీ మన కళ్ళ ఎదుట జరుగుతున్న వాటిని గమనించలేము! ఎందుకంటే మన మనస్సు దానిని చూచే ప్రయత్నంలో ఉండదు! కనుక చూడదలుచుకోలేదు! కాబట్టి చూడటం అనేది జరగడానికి కేవలం పైన చెప్పిన విషయాలే కాక మనస్సు కూడా ప్రధానమని గ్రహించాలి!

ఉదాహరణకు విద్యుచ్ఛక్తి ఉన్నది గదా! ఆ విద్యుత్తును మనం చూడలేము! అలాగే విద్యుత్ చూడలేకపోయినా దానిని ఉత్పత్తి చేయగలము! కొలవగలము! అలాగే దానిని మన ఆధీనంలో ఉంచుకోవచ్చును! కానీ మనము వీటిని చూడలేము కానీ వాటి వల్ల కలుగుతున్న కార్యాలను బట్టి అవి ఉన్నాయని నమ్ముతున్నాము! కాబట్టి మన కళ్ళు అన్నిటిని చూడాలనుకోవడం ఒక పెద్దభ్రమ! అలాగే భగవంతుడు కూడా ఒక వస్తువు కాదు! ఒక పదార్థం కాదు! కనుక మన కంటికి కనిపించే అవకాశం లేదు! భగవంతుడు మన ఆధీనంలో ఉండడు! ఆయనను మనం కొలవలేము! నియంత్రించలేవు! మరి భగవంతుడిని చూడటం ఎలా? ఇంతకు భగవంతుడు ఎక్కడ ఏ విధంగా ఉన్నాడో తెలుసుకుంటే కదా అప్పుడు భగవంతుడిని చూడటం అనేది చర్చకు అవకాశం ఉంటుంది!

ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎందెందు వెతికినా అందందే కలడు అని భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు! మనం వెతికితే అనగా ప్రయత్నిస్తే ఆయనను చూడగలమని అర్థంతో ప్రయత్నం చేయాలి! ఎక్కడ వెతకాలి? అన్నపుడు ఉపనిషత్తుల ప్రకారంగా చూస్తే… అంగుష్ఠ మాత్రుడు పురుషుడు అంతరాత్మగా ఎల్లప్పుడూ వ్యక్తుల హృదయములో నివసిస్తు ఉన్నాడని చెప్పడం జరిగింది! అంటే పరమాత్మను మన హృదయంలో ఆత్మ గా ఉన్నాడని అర్థమవుతోంది! అంటే ఆత్మను చూడటం అంటే పరమాత్మను చూడటం అన్నమాట! మరి ఆత్మను చూడాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు… మనలో ఉన్న ఆజ్ఞాచక్రము లో ఉన్న త్రినేత్రము అనగా పీనియల్ గ్రంథి తెరుచుకోవాలి అన్నమాట! ఇది తెరుచుకోవాలి అంటే సాధకుడు యోగ సాధన చేసి యోగ సిద్ధుడై ఆత్మ సాక్షాత్కారమును పొందితే అనగా భగవంతుడిని చూడటం జరుగుతుందని నేను తెలుసుకున్నాను!

సాధనలు తప్పక చేసి తీరాలి. భగవద్దర్శనం హఠాత్తుగా కలుగుతుందా ఏమిటి...? భగవంతుణ్ణి చూడలేకపోతున్నానే ఎందుకు... అని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అప్పుడు నా మనస్సులో స్పురించింది అతనికి చెప్పాను. పెద్ద చేపను పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు. అందుకు కావలసిన ఏర్పాట్లు గావించు. గాలం, ఎర అన్నీ సిద్దం చేసుకో. ఎర వాసన పట్టి చేప నీటి అడుగు నుండి పైకి వస్తుంది. నీళ్లు కదలడం నుండి పెద్ద చేప వస్తుంది అని తెలుసుకోవచ్చు.

వెన్న తినగోరుతున్నావు... పాలల్లో వెన్న ఉంది, పాలల్లో వెన్న ఉంది.... అని పదేపదే అనడంలో ప్రయోజనం ఏముంది. శ్రమ పడితేనే కదా వెన్న లబించేది. భగవంతుడు ఉన్నాడు.... భగవంతుడు ఉన్నాడు.... అని చెప్పడం వల్ల భగవంతుడిని దర్శించగలవా.... కావలసింది సాధనే....

లోకోపదేశార్దం జగజ్జననియే పంచముండి ఆసనం అదిష్టించి కఠోరమైన తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు పూర్ణబ్రహ్మ స్వరూపుడు. ఆయన కూడా లోకానికి మార్గం చూపడానికై రాధా యంత్రాన్ని రూపొందించి తపస్సు చేశాడు.కాబట్టి భగవంతుడుని చూడాలన్నా, అనుగ్రహం పొందాలన్నా సాధనలు తప్పక చేసి తీరాలి.

-శ్రీరామకృష్ణ పరమహంస

అంటే ఇది జరగలంటే మనకి ఆత్మ అంటే ఏమిటో...దాని స్వభావమేమిటో తెలుసుకోవాలని నేను తెలుసుకున్నాను! దానితో నేను ఆత్మ మీద పరిశోధనలు చెయ్యడము ఆరంభించాను!ఆ వివరాలు మీకు తెలియాలంటే...మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

నీ యదార్ధస్వరూపమును దర్శిస్తే...భగవంతుడిని దర్శించినట్లే!

మాయ స్వరూపము వలన నేను వేరు...నువ్వు వేరు అనుకుంటున్నాము! ఈ పిల్లికి లాగా అన్నమాట! నిజానికి పులి అనేది పిల్లి యొక్క ఉగ్ర స్వరూపమే...ఈ రెండు ఒకే జాతివి! అందుకే మన పెద్దలు పిల్లిని గదిలో బంధించి కొడితే అది పులిగా తిరగబడుతుందని చెప్పడము జరిగినది! కాని పిల్లికున్న మాయ వలన తను వేరు...పులి వేరు అనుకుంటుంది! మనకి లాగా నేను వేరు - నువ్వు వేరు అన్నమాట!

ఎపుడైతే పిల్లి తన యదార్ద జ్ఞానమును పొందుతుందో...అపుడిదాకా అద్ధంలో పులి కనిపించేది కాస్తా తన యదార్ధ స్వరూపమును చూసుకొని ఆనందస్ధితి పొందుతుంది! అనగా మనము పొందే సమాధి స్ధితి లాగా…అంటే నిజ బ్రహ్మజ్ఞానం పొందితే...మనకున్న మాయ మాయం అవుతుంది! ఈ పిల్లికి లాగా...మన యదార్ద స్వరూపమును ఆత్మసాక్షాత్కర స్ధితి ద్వారా స్వానుభవానుభూతి పొందడము జరుగుతుంది! ఇదియే భగవంతుడిని చూడటము అవుతుంది!

కపాల మోక్షం - 24 - ఆత్మ అంటే…?

అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది? ఆత్మ అంటే ఏమిటో చాలా మందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు. దాదాపు చాలా మందికి ఆత్మ అంటే తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ యొక్క అర్ధాన్ని చివరకు ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.

నిజానికి ఆత్మ అంటే దైవమా? లేక దయ్యమా? ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు! కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక… సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక … దానికి నానార్ధాలు చెబుతూ…. చాలామంది వారు అయోమయం అవడమే కాక ….అందరిని అయోమయంలో నెట్టేస్తున్నారు! దానితో అసలు ఆత్మ అంటే ఏమిటో వివరంగా తెలుసుకోవాలని ఆలోచన మా ఇద్దరిలోనూ మిగిలింది! దీనిని గురించి శాస్త్ర, పురాణ, ఇతిహాసాలే కాకుండా సైన్సు, విజ్ఞానశాస్త్రాల్లో ఏమైనా చెప్పినారో అని పరిశోధన చేయడం ఆరంభించాము! వివిధ రకాల పుస్తక, గ్రంధాలు చదవడం ప్రారంభించినాము! ఆత్మ మీద పరిశోధన చేస్తూ ఆత్మ పరిశోధకుడిగా మారిపోయాను! ఆత్మకి సంబంధించి నేను రాసుకున్న నోట్స్ నీకేమైనా ఉపయోగపడుతుందని ఇవ్వడం జరిగినది! ఎందుకంటే యోగ సాధనలో కూడా ఆత్మ జ్ఞానము, ఆత్మ నివేదన భక్తి, ఆత్మ దర్శనం, ఆత్మ జ్యోతి, ఆత్మసాక్షాత్కారం లాంటి మాటలు వినబడతాయి! ఇది తెలియాలంటే అసలు ఆత్మ అంటే ఏమిటో మీకు తెలియాలి కదా! కానీ ఆత్మ పరిశోధన అనేది ఒక అంతులేని, కనిపెట్టలేని, పరిధిలో అవధులు లేనిదని నాకర్థమైంది!

ఆత్మవాదుల దృష్టిలో ఆత్మ అనేది....

ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీని గురించి వివిధ గ్రంథాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును.

ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప భేదాలు ఉండవు. దీనినే "అంతరాత్మ" అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ-అన్యాయాలు, తప్పు-ఒప్పులను నిష్పక్షపాతంగా చెపుతూ, ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది.ఇది ఎప్పుడూ, మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగ, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగ, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవులలో ఏవిధమైన తేడాలూ లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక. ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి, వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలయితే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు. అది ఒక దివ్య శక్తి . ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. మరి మానవుల ఆలోచనావిధానం లోనూ, ఆచరణావిధానం లోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి? సాధారణంగా మానవులు రూపంలోకానీ, చేష్టలలో కానీ, ఆలోచనా విధానంలోకానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు. ఎక్కడో అక్కడ చిన్న తేడా అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా, అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగ, ఒకే పోలికతో ఉంటారు. తేడా అల్లా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు? అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది. ఈ పరిస్థితికి కారణం "మనస్సు". ఇది కూడా మనలో ఆత్మచేసే బోధకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు పరిస్థితులకు, కారణాలకు, ఇంద్రియాలకు, పురుషార్థాలకు, గుణాలకు లోబడి మనకు మార్గము చూపుతూ ఉంటుంది. ఈ మార్గం సమయాను సారంగా మారుతూ ఉంటుంది. ఈ మార్గమును ఎవరు, ఎంత శాతం వరకూ అనుసరిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంది. మరి, ఆత్మ, దేనికి లోబడక, ఏ పరిస్థితులకూ, సమయానికీ కూడా లోబడకుండా ఎప్పుడూ న్యాయమార్గాన్నే చూపుతూ ఉంటుంది. మనుషులలో తేడాలు, ఈ రెండు మార్గాలలో దేనికి ఎంత విలువనిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంటాయి. వివిధ గ్రంథాలలో ఆత్మగురించి మరియు పరమాత్మ గురిమ్ఛి !

మనలోభావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనస్సు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారమే ఈ నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి.

ఆ మహావాక్యాలు :-

ప్రజ్ఞానం బ్రహ్మ- ఐతరీయోపనిషత్తు - ఋగ్వేదము

అహం బ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు - యజుర్వేదము

తత్ త్వమసి – ఛాందోగ్యోపనిషత్తు - సామవేదము

అయమాత్మా బ్రహ్మ - ముండకోపనిషత్తు - అధర్వణవేదము

ఈ మహావాక్యాలు ఆత్మ తత్వాన్ని సూచిస్తున్నాయి.

అయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మయే బ్రహ్మము)

ఇక్కడ ఆత్మ, బ్రహ్మము అనేవి ఒకటే అని చెప్పబడింది. ఇందుకు సముద్రము, అందులోని కెరటము దృష్టాంతముగా తీసికొన్నారు. ఒకో కెరటము ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది. కాని ఆకెరటం ఒడ్డును తాకి పడిన తరువాత కెరటానికి, సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది.

ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి - ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము (పరమాత్మ). అద్వితీయము. గుణ రహితము. ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానము లభించినవారికి మోక్షం (బంధనాలనుండివిముక్తి) సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి!

ద్వైతం, భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరు వేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి. అందరికీ ప్రభువైనందున భగవంతుడు పరమేశ్వరుడు. కాని ఆయా వేదాంత సూత్రాలను బట్టీ, వాటి వివరణను బట్టీ "బ్రహ్మ", "బ్రహ్మము", "ఈశ్వరుడు", "దేవుడు" వంటి పదాలను అర్ధం చేసుకొనే విధానంలో వైవిధ్యం ఉంటుంది. సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తిక వాదం, ఆస్తిక వాదం, ద్వైతం, అద్వైతం, లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్ట మైన భావాలు బహుశా మరే మతంలోనూ కనిపించవు. ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది.

హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైన బ్రహ్మం నకు చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం (ద్వైతం కానిది)అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మ స్వరూపులని, బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని, సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్ష ప్రాప్తినొందగలరు.

అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు, భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మ స్వరూపులు మనుషులౌతారు. ఈ మార్గాన పయనించేవారు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే, మోక్షం దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినపుడు ఆయనను ఈశ్వరుడు, లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు.

భగవద్గీత :

శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు. 1. జీవాత్మ 2. పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి 'పరమాత్మ'అని, జీవులలో ఉండే తన అంశను 'జీవాత్మ'అని వివరించాడు. ఈ జీవాత్మే 'ఆత్మ. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక "అహం బ్రహ్మస్మి" అయమాత్మ బహ్మ" అనే ఉపనిషద్ వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి.

ఆయుధాలు, అగ్ని, వాయువు, నీరు మొదలైనవి ఏవీ ఆత్మను సంహరించలేవు. నింగి, నేల, నీరు, అగ్ని, వాయువు మొదలైన పంచ భూతాలతో చేసి ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటితో పాటు ఆధునిక యుగంలో అగ్నిని కూడా జోడించి తయారు చేస్తున్నారు. అణ్వాయుధాలు ఈ కోవకు చెందినవే. అయితే గతంలో భౌతిక పదార్థాలను ఉపయోగించి ఆయుధాలను తయారు చేసేవారు. పూర్వం ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిని జ్వలింపజేస్తే దానికి బదులుగా వరుణాస్త్రాన్ని ప్రయోగించి జలధారలతో వాటిని ఆర్పివేసేవారు. ఆధునిక సైన్సులో దీనికి సంబంధించిన ఙ్ఞానం కనిపించదు. తుఫాను లాంటి ఆయుధాల గురించి శాస్త్రవేత్తలకు అవగాహన కూడా ఉండదు.

ఆత్మను నశింపజేయడం అసాధ్యం. మాయాశక్తికి లోబడి ఉండటం వల్ల అఙ్ఞానంతో కూడుకున్న ఆత్మ ఏ విధంగా విడదీయబడుతుందో మాయావాదులు వివరించలేరు. ఎందుకంటే జీవులందరూ అణుమాత్ర రూపులైన సనాతన ఆత్మలు అయినప్పటికీ మాయా ప్రభావితులై భగవంతుని సాహచర్యం నుంచి విడిపోయారు. నిప్పు కణికలు ఏవిధంగా అయితే పైకి లేచినప్పుడు, దానికి దూరం కాగానే ఆరిపోయినట్టు, భగవంతునిలోని సనాతన అంశాలైన జీవులు వాస్తవానికి తమ ఉనికిని కోల్పోయిన జీవాత్మలు. వరాహ పురాణంలో జీవులను భగవంతుని నుంచి విడిపోయిన అంశలుగా వర్ణించారు. భగవద్గీత ప్రకారం కూడా ఆత్మ నిత్యం, శాశ్వతం. కాబట్టి అఙ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందినప్పటికీ ‘జీవులు తమ ప్రత్యేకమైన ఉనికిని పోగొట్టుకోవు’అనడానికి గీతోపదేశం చక్కటి తార్కాణం. కృష్ణుడి ద్వారా పొందిన ఙ్ఞానంతో అర్జునుడు ఙ్ఞానవంతుడయ్యాడే గాని భగవానుడిలో ఐక్యం మాత్రం కాలేదు.

ఇదే విషయాన్ని పార్థుడుకి పరమాత్ముడు బోధించారు. ‘ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడూ ఇద్దరును అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు. ఆత్మకు చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యం, శాశ్వతం, పురాతనం, శరీరం ఉనికి కోల్పోయినా ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితం, నిత్యమనియు జననమరణములు లేనిది, మార్పులేనిది, శాశ్వతమైంది, సర్వవ్యాప్తిచెందింది, చలింపనిది, స్థిరమైంది, సనాతనమైనది. ఇంద్రియాలకు కనిపించనిది... మనస్సునకు అందనిది. వికారములు లేనిది’ అని భగవానుడు తెలిపాడు.

భగవద్గీత ప్రకారము చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.

ఖురాన్ :

· రాత్రివేళ మీఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు, పగటివేళ మీరుచేసే పనులు గమనించేవాడు దేవుడే. (6:60)

· మరణ సమయంలో ఆత్మలు స్వాధీనం చేసుకునేవాడు దేవుడే (39:41)

ఆత్మ మీద వివిధ అభిప్రాయాలు:

మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? పురాణాల్లో చెప్పినట్టు స్వర్గం - నరకం లాంటివి ఉంటాయా? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతుంటాయి. ప్రతి ఒక్కరినీ ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది. అయితే, అది ఇప్పటికీ ఓ రహస్యంలానే ఉండిపోయింది. జీవి మరణానంతరం ఆత్మ కొంతసేపు విశ్రాంతి స్థితిలో ఉంటుందట. ఆ తర్వాత మరో కొత్త జన్మ ఎత్తుతుందట.

- ప్రాచీన బాబిలోనియా, ఈజిప్టుల్లో మరణానంతరం శవాలకు లేపనాలు పూసి, శవపేటికల్లో దాచిపెట్టేవారు. ఆత్మ మళ్లీ వెనక్కి వస్తుందని, అదే శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు.

- పరమహంస యోగానంద ఆత్మకథ ‘యోగి కథామృతం’లో కూడా ఈ ఆత్మ గురించి ప్రస్తావన ఉంది. దానిప్రకారం మరణం తర్వాత అన్ని ఆత్మలు సూక్ష్మలోకానికి చేరతాయి. అక్కడ ఆధ్మాత్మిక దృష్టి, పుణ్యమూర్తులను హిరణ్యలోకానికి పంపుతారు. అక్కడకు వెళ్లిన వారు పుణ్యజన్మలు ఎత్తి ముక్తి పొందుతారు.

- ఆత్మల గురించిన చర్చ ఎప్పుడూ ఉంటుంది. కొందరు ఆత్మలు ఉన్నాయంటారు. మరికొందరు శరీరం ఉన్నంత వరకే ఆత్మ ఉంటుందంటారు. కానీ, ఆత్మ అనంతమైనది, అమరమైనదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రార్థనల్లో ఆత్మ నిక్షిప్తమై ఉంటుందని రుగ్వేదంలో రాసి ఉంది.

- ప్రాచీన కాలం నుంచి ఆర్యులు కూడా స్వర్గం - నరకం అనే భావనలను నమ్మేవారు. బ్రహ్మలోకం ఉంటుందని విశ్వసిస్తారు. ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వారు అన్వయించుకుంటారు. కానీ, ఖచ్చితంగా ఇలా జరుగుతుందని ఎక్కడా ఆధారాలు లేవు.

ఇది అజ్ఞానపు ఆలోచన! ఎవరో ఒకరు తెలిసితెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు.అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనస్సులల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనస్సులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు.కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం.

శ్రీకృష్ణుడు ఏం చెప్పారు..? మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు "ఎవరో ఒక మహా పురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో చూచినవారిలో చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు.

ఎవరికీ తెలియదు. ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాళ్ళకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు.

అలాంటి వారికే ఆత్మ సాక్షాత్కారం ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు! గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని, చాలా శాస్త్రాలఅధ్యయనం చేయడం వలనగాని, ఎన్నో గూడార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన గాని, ఆత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మ కోసం హృదయ పూర్వకంగా ఆరాటపడి మనననిధి ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది.

భగవద్గీతలో ఇలా.. ఆత్మ మనోబలం లేనివారికి అజాగ్రత్త పరులకు శాస్త్ర విరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు. ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును ఆ ఇద్దరును అజ్ఞానులే.

నాశనం లేనిది.. ఏలాగంటే వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు. ఎవ్వరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పులేనిదనియు శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది.

( 2:19-25) ఉపనిషత్తులు: ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడినది.ఆత్మ ప్రకాశం జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది. అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది. అపరిమితమైన జ్యోతి స్వరూపం అయిన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మంను ప్రకాశిస్తుంది. అది సూక్ష్మాతి సూక్ష్మం అది ఈ శరీరములోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు తారలు (చుక్కలు) వెలుగు నీయవు. మెరుపులు కూడ కాంతి నీయవు. స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది.ఈ ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్య మానమవుతూ ఉన్నది.

స్వయం ప్రకాశితం స్వయం ప్రకాశిత మైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటలచేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్చ మైనపుడు అతని ప్రాణ మనః శరీరాలు సర్వం విశుద్ది పొందుతాయి. అపుడు ధ్యాన నిమగ్నుడైనవాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు. ఆత్మ అంటే ఒక శక్తి. మనం అర్ధం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి శక్తిస్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది. సంపూర్ణమైన ఆ దివ్య శక్తి స్వరూపమైన ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతి వంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని, నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్ధకం చేసుకుందాం.

కాని తత్వవేత్తల దృష్టిలో ఆత్మ ఉందా?

పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు! కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మేవాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మేవాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు. ఆత్మ ఉందా? ఉంటే శాస్త్రీయంగా నిరూపితమయిందా? పునర్జన్మ వుందా? పరకాయ ప్రవేశం సాధ్యమా? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతుంటాయి. ప్రతి ఒక్కరినీ ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది.

అయితే ఉన్నదాన్నే ఉన్నదన్నట్లు శాస్త్రీయంగా ఋజువుల కోసం శాస్త్రజ్ఞులు అన్వేషిస్తారు. ఉన్నదనుకొన్నది ఏ విధమైన పరిశోధనల ద్వారానూ ఋజువు కానప్పుడు ఆ ఉన్నదనుకొన్నది కేవలం అబద్దమని శాస్త్రం చెబుతుంది. దాని ఉనికికి ఏ విధమైన ఆధారాలు లేవని వ్యక్తీకరిస్తుంది. ఉన్నదనుకొన్నదేదీ? దాని లక్షణాలు ఏ విధంగా వున్నాయనుకొంటున్నారు? వంటి ప్రశ్నలకు వచ్చే జవాబుల ఆధారంగానే ఉన్నదనుకొంటున్నది ఉందా లేదా అని ప్రయోగాలు చేస్తారు. అదే శాస్త్రీయ పద్దతి. ఆత్మ కూడా ఈ కోవలోకే చెందింది.

'ఆత్మ' అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం ఆధారంగానే ఆత్మ వుందాలేదా అన్న విషయం విదితం అవుతుంది. మనం విన్న కథలు, పురాణాలు, ఉపదేశాలు, విశ్వాసాలు ప్రకారం 'ఆత్మ' అనేది ప్రతి జీవిలోనూ ఉన్న జీవానికి ప్రతినిధి. 'ఆత్మ' అనేది లేకుంటే ప్రతి జీవి మృతజీవి లేదా నిర్జీవ పదార్థమే. పని చేస్తున్న సెల్‌ఫోన్‌లోని పనితనానికి, జీవంతో వున్న మీరు, నేను మనలోని జీవన కార్యకలాపాలకి కాసేపు సంధాని ద్దాం. బాగా చార్జింగ్‌ అయిన సెల్‌ఫోన్‌ ను ఆన్‌ చేసిన వెంటనే ఎన్నో కార్యకలా పాల్ని అది చేస్తుంది. అది నిర్వర్తించే కార్యకలాపాలు, పనులు, అనువర్తనాలు అన్నింటిని కలగలిపి 'పనిచేస్తున్న' సెల్‌ఫోన్‌ అంటాము. ఎవరయినా 'నీ సెల్‌ఫోన్‌ పనిచేస్తోందా? పాడయ్యిం దా? అంటే మనం ఏమంటాము?' 'పని చేస్తోంది' అంటాము. లేదా 'పనిచేయడంలేదు పాడయ్యింది' అంటాము. ఓవరాల్‌గా ఫోన్‌ పని చేయడాన్ని 'ప్రాణి జీవం'గాను ఏ పని చేయని స్థితిని 'మరణం'గాను భావిద్దాం. మొబైల్‌ ఫోన్‌లాగే ప్రాణి ఎన్నో పనులు చేస్తుంది. నడుస్తుంది, మాట్లాడుతుంది, ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఆలోచిస్తుంది, పడుకొని మళ్లీ లేస్తుంది, కోపిస్తుంది, నవ్వుతుంది. ఇవన్నీ చేసే ప్రాణిలో ఓవరాల్‌గా 'జీవం వుంది'అంటాము.

సెల్‌ఫోన్‌లోని పదార్థాల, నిర్మాణాల, అమరికల, సర్క్యూట్ల, విద్యుత్ప్రవాహక, కాంతి విద్యుద్ధర్మాల, యాంత్రికతల తీరుతెన్నుల సమాహారంగానే సెల్‌ఫోన్‌ అన్ని విధాలయిన సంక్లిష్ట కార్యకలాపాలను నిర్వర్తిస్తోంది. అందుకే సెల్‌ఫోన్‌ 'పనిచేస్తోంది' అంటాము. మరి ఆ పని దేనివల్ల వీలయ్యింది. కేవలం బ్యాటరీల వల్లనా? అయితే బ్యాటరీలను చెంబులో పెడితే చెంబు మరి సెల్ ఫోన్ లాగా పని చేయదు కదా! మరి సెల్‌ఫోన్‌ సంక్లిష్ట పనితీరుకు కారణం కేవలం ఆ సెల్‌ఫోన్‌లోని తెర మాత్రమే కారణమా? మరి బ్యాటరీలను తీసేసిన తర్వాత తెర వెలగదే? మరి తెర, బ్యాటరీలు రెండూ వుంటే సెల్‌ఫోన్‌ పనిచేస్తుందా? లోపలున్న ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు మాత్రమే సెల్‌ఫోన్‌ను పనిచేయిస్తున్నదా? ఆ ఐసిబిని తీసుకెళ్లి జామెట్రీ బాక్సులో పెడితే ఆ జామెట్రీ బాక్సు సెల్‌ఫోన్‌ లాగా పనిచేస్తుందా? పోనీ ఆ జామెట్రీ బాక్సుపైన సెల్‌ఫోన్‌ తెరను, మరో పక్క బ్యాటరీలను పెడితే అపుడయినా అది సెల్‌ఫోన్‌ అవుతుందా? అలాగే తల మాత్రమే జీవం కాదు, గుండె మాత్రమే జీవం కాదు. కానీ గుండె లేకుండా జీవంలేదు. తెరలేకుండా సెల్‌ఫోన్‌ లేదు. కానీ తెర మాత్రమే సెల్‌ఫోన్‌ కాదు. బ్యాటరీ లేకుండా సెల్‌ఫోన్‌ పనిచేయదు. కానీ బ్యాటరీ మాత్రమే సెల్‌ఫోన్‌ కాదు. అలాగే తల లేకుండా మనిషి లేకున్నా తల మాత్రమే మనిషి కాదు. ఊపిరితిత్తులు లేకుండా మనిషి జీవంతో వుండడు. కానీ ఊపిరితిత్తులు మాత్రమే జీవంతో ఉన్నాయని కాదు.

కాబట్టి ఎన్నో కణ జాలాల, శరీరభాగాల, అవయవాల, జీవ రసాయనాల, జీవ భౌతిక వ్యవస్థల సమిష్టి వ్యవస్థే జీవంతో ఉన్న మనిషి. ఇందులో కీలకమైన అంశాలు లేనట్లయితే మనిషి జీవంతో వుండడు. లేదా కీలకమైన అంశాల మధ్య సమన్వయం లేకున్నా మనిషి జీవంతో వుండడు. అంటే 'జీవం' అనే పదం ఏక వచనమే అయినా జీవం ఒక వస్తువో, ఒక నిర్థిష్ట పరికరమో హద్దులు, పరిమాణాలు వున్న శిల్పం కాదు. 'దేశం' అన్న పదము ఏకవచనమే. కానీ దేశమంటే ఒక వస్తువా? 'ప్రభుత్వం' అన్న పదమూ ఏకవచనమే. కానీ 'ప్రభుత్వం' అంటే ఒక కంప్యూటరా? అలాగే జీవం అనేది కూడా సంక్లిష్ట పదార్థిక, వివిధ శక్తి వినిమయాల, భౌతిక రసాయనిక ప్రక్రియల సమిష్టి వ్యవస్థ. అయితే 'ఆత్మ' వాదులు మనిషి లేదా జీవిలోని జీవాన్ని ఒక ఏకవచన నిర్దిష్ట పరికరం లేదా నిర్దిష్ట ఏకీకృత వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఆ వస్తువుకు రూపం వుండదు. 'జీవం' వున్న స్థితికి కూడా రూపం వుండదు. 'ఆత్మ'కు నిర్దిష్ట హద్దులు ఉండవంటారు. జీవం అన్న స్థితికి కూడా నిర్దిష్ట హద్దులు వుండవు. 'ఆత్మ'కు నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదంటారు. 'జీవం' అనే స్థితికి కూడా నిర్ధిష్ట ద్రవ్యరాశి వుండదు. ఇలా సంక్లిష్ట ధర్మాల, నిర్మాణాల, వ్యవస్థల, రసాయనాల, యాంత్రికతల సమిష్టి ప్రతినిధిగా 'జీవం' అన్న పదాన్ని పరిగణిస్తాము. అదే 'జీవం' అన్న పదానికి 'ఆత్మ' అన్న పదాన్ని పర్యాయ పదంగా వాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. వచ్చిన గొడవల్లా అక్కడ కాదు. కానీ 'ఆత్మ'వాదుల ప్రకారం 'ఆత్మ' బరువు, హద్దులు, రూపంలేని ఓ నిర్దిష్ట పరికరం. అది చెంబులో నీళ్లున్నట్లు (ఆ నీళ్లకు బరువు ఉండదనే విధంగా, ఆ నీళ్లకు ఘన పరిమాణం వుండదనే విధంగా, ఆ నీళ్లు మంటలో పోసినా ఆవిరి కావన్న విధంగా) వుంటుంది. ఆ చెంబులో నీళ్లను మరో చెంబులోనో, బకెట్లోనో, తొట్టిలోనో పోసే విధంగా 'ఆత్మ' ఒక జీవి నుంచి మరో జీవికి బదలాయించుకొంటుంది. ద్రవ్యరాశి, కాలం, రూపం (స్థల విస్తారం) అన్న రాశులు లేకుండా ఈ విశ్వంలో ఏదీ లేదన్నది శాస్త్రం (ఉన్న ప్రతి వ్యవస్థకు ద్రవ్యరాశి గానీ, రూపంగానీ, కాలానుగుణ వ్యక్తీకరణ గానీ, విద్యుదావేశం గానీ ఉండితీరాలి. లేదా కొన్ని గానీ, అన్నీ గానీ వుండాలి) ఈ నిర్వచనానికి 'ఆత్మ' వాదుల 'ఆత్మ' పొసగదు. 'కుక్క' అంటే ఫలానిది అన్న తర్వాత ఓ రూపానికి తోక వుండకుండా, శరీరం వుండకుండా, కాళ్లు ఉండకుండా, నోరు ఉండకుండా, మొరగకుండా, చెవులు లేకుండా ఉంటే ఆ రూపాన్ని 'కుక్క' అనలేము. అలాగే ఓ 'వ్యవస్థ'కు రూపం, స్థలం కాలానుగుణ పదార్థిక పరిమాణం లేనట్లయితే ఆ వ్యవస్థే లేదన్నది శాస్త్రం. కాబట్టి 'ఆత్మ' అనేది కూడా లేదు. ఎందుకంటే 'ఆత్మ' వాదులు ఆపాదించిన ధర్మాలున్న వ్యవస్థకు వైజ్ఞానిక నిరూపణలు లేవు. ఒక జీవి చనిపోయాక మరో జీవికి ఆత్మ బదలాయించుకొంటుందన్నది వారి వాదన. 'ఎ' అనే జీవిలో 'ఆత్మ' వుంది. అది బయటపడితే 'ఎ' మరణించినట్లు అర్థం. అది 'బి' అనే పదార్థంలోకి వెళితే 'బి'లో జీవం వున్నట్లు అర్థం. 'బి' అనే రూపం సిద్ధంగా లేకుంటే 'ఎ' నుంచి బయటపడ్డ 'ఆత్మ' కొంతకాలం 'దయ్యంగా' వుంటుంది. లేదా మరో కుక్క కడుపులోనో, స్త్రీ గర్భంలోనో ఉన్న 'బి' పిండంలోకో వెళ్లి 'బి' అనే జీవిగా జన్మిస్తుంది. ఇదే 'ఎ' జన్మ 'బి' జన్మగా పునర్జన్మించినట్లు వారివాదన.

ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన భౌతిక (ద్రవ్యరాశి, స్థలం, కాలానుగుణ పదార్థిక రూపం, విద్యుదావేశాల ప్రోదిక్త రూపం DNA (Deoxy Ribonucleic Acid). లేదా కనీసంలో కనీసం RNA (Ribo Nucleic Acid) అయినా వుండాలి. DNA లేదా RNA లేకుండా జీవం అనే మాటకు అర్థం లేదు. నిర్మాణంతో సంబంధం లేకుండా ఆత్మ మాత్రమే జీవం అయినట్లయితే బల్ల రూపంలో జీవులు ఎందుకు లేవు. ఉన్నట్లుండి ఓ శిల్పంలోకి ఆత్మ వెళ్లడం వల్ల శిల్పం జీవంతో వున్న శిల్పంగా మారడంలేదు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు వున్నాడు. ఎన్నడయినా మట్టిరాయి మాట్లాడిందా? కానీ మట్టి రాయి రూపంలో వున్న జీవులు వున్నాయి గానీ అందులో మట్టి రాయిలాగా ముద్దగా లేదే. అందులో కణాలు, కణాల్లో కణాంగాలు, కణాంగాల్లో ధర్మాలు, రసాయనాలు, ద్రవాలు, అణువులు, అణువులలో పరమాణు పొందికలు, పరమాణు పొందికల్లో నిర్దిష్ట అమరిక ఎందుకు ఉండాలి? ఆ నిర్మాణాల్ని అటూ యిటూ కదిపితే ఆ 'ఆత్మ' (జీవం) ఎందుకు పారిపోవాలి? (జీవి మరణించాలి?) మంటలో మండనిది, నీళ్లలో తడవనిది లేశ మాత్రం పొటాషియం సైనైడు పడగానే పారిపోయే పిరికిపందగా ఎందుకుంది? 'ఆత్మ'కు మార్పు లేనట్లయితే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఎందుకు వస్తున్నాయి? జబ్బులు ఎందుకు వస్తున్నాయి? బల్లి తోక తెగితే తోక కూడా కదులుతుంది. తోక తెంచుకున్న బల్లి కదులుతుంది. బల్లి తోకలోని కదలికలకు కారణమైన ఆత్మ ఎవరిది? తోక తెంచుకున్న బల్లి కదలికలోని ఆత్మ ఎవరిది? ఆత్మను కత్తితో కోయలే మన్నారు కదా! అది ఎలా విభజించబడింది? ఇలా ఎన్నో ప్రశ్నలకు రవంతయినా ఆమోద యోగ్యమై న సమాధానం ఆత్మవాదులు యివ్వరు. 'ఆత్మ' అన్న ఆలోచనకు, నిర్వచనానికే అస్తిత్వంలేనపుడు, ఆత్మల బదలాయింపు తో జరుగుతాయన్న 'పునర్జన్మ' అన్న భావన పూర్తి అసంబద్ద ఆలోచన. పరకా య ప్రవేశం అన్న దానికీ అర్థం పర్థం లేదు.

ఆత్మను చూడగలమా?

శాస్త్ర వచనము అలాగే సాక్షాత్కారవాదము ప్రకారము ఆత్మాన్వేషణ ద్వారా ఆత్మను చూడవచ్చును! మరి ఆత్మాన్వేషణ అంటే ఏమిటి? అనగా గురుదేవులు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారంటే… వ్యక్తి సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురుచూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. ఎన్నాళ్లున్నా చివరకు దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే. ముత్యం కావాలంటే లోపలికి దూకాలి, ఈదాలి, వెదకాలి, ఆల్చిప్పలను పట్టాలి. అప్పుడే కొన్నైన ముత్యాలు లభిస్తాయి.

అన్నిటికి మూలం ఆత్మే అని ఆగిపోకుండా ఆ ఆత్మను దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి అంటే భగవద్గీత ప్రకారము:

" చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. " ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.

బ్రహ్మ సత్యం జగన్మిధ్య

జీవొ బ్రహ్మైవ నా పరః

బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య.

ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.

భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు -

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

పూర్వ జన్మలలోని కర్మ వలన.

కర్మ ఎందుకు జరుగుతుంది?

రాగం (కోరిక) వలన.

రాగాదులు ఎందుకు కలుగుతాయి?

అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.

అభిమానం ఎందుకు కలుగుతుంది?

అవివేకం వలన

అవివేకం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానం వలన

అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం. అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి. ఈ దు:ఖము పోవాలంటే పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.జీవితము యొక్క పరమార్థము మోక్షము అనగా పరమాత్మతో ఐక్యము కావడము అని చెప్పబడుతోంది.అనగా ఆత్మ సాక్షాత్కారము, జీవేశ్వరుల ఐక్యత, ఆత్మ యొక్క పరిపూర్ణ నిస్వార్థత, అమాయకత్వము నుండి విడుదల మరియు పరిపూర్ణ మనశ్శాంతి. ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారము నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలురకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు "అద్వైతం" ప్రకారము మోక్షము పొందిన తర్వాత వ్యక్తిత్వము నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని మరియు మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు. అయితే ద్వైతుల ప్రకారము మోక్షము అనగా " చక్కెరను రుచి చూడడము", అద్వైతుల ప్రకారము " చక్కెర గా మారిపోవడము" అని అర్థము.

దీనికి అసలు మనకు లోచూపుకావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి చూచి అనుభవించి అనుభూతిని పొంది విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మీ నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు. తెలియదంటున్నవాడు, తెలిసి తెలియనట్లు ఉన్నదన్నవాడు, తెలుసుకుంటున్నానన్న వాడు ఉన్నారు. తెలుసుకున్న వాడు మాత్రం ఏమీ అనటం లేదు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు. అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్నా తనతో తాను ఉంటున్నాడు.

కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు. సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు. తామరాకుపై నీటిబొట్టు వలె అంటక ఉండగలుగుతున్నాడు. ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని, చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు.

వస్తువు వెనుక ఉన్న యదార్థాన్ని దర్శిస్తున్నాడు. ఆ కారణంగా పైపైన జరుగుతున్న విషయాలను అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్వానుభూతిని పొందుతున్నాడు. ఆ అనుభవమే, ఈ అభ్యాసమే ప్రకృతి రహస్యాలను చూడగల, చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను చేస్తున్నది. ఆ కారణంగా జాతి, మత, వర్గ, వర్ణాతీతమైన మానవతావాదం, శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.

ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి, ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే! ఇదంతా నిత్య పరిశీలన, అనుష్ఠానం, సాధన వల్ల సాధ్యమయ్యేదే. సర్వత్రా ఆత్మనీ దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు. గుణగుణాలు లేవు. అనేకం లేవు. ఏమీ లేవు. ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరమవుతుంది. ఆనందం స్వభావమవుతుంది. ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు.

ఎన్ని అలలు పుట్టనీ, ఎన్ని కెరటాలు ఎగిసిపడనీ, ఎన్ని తుంపరులు తాకనీ, తాను మాత్రం అచలుడై ఉంటాడు. కేనోపనిషత్ ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది. సాధ్యమైతే, నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది. సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది. ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించమంటుంది. ఆత్మను ఎరిగినవాడు మృత్యు భావనను జయిస్తాడు. భయం లేకుండా ఉంటాడు. ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడు అవుతాడు. ఆత్మను ఎరుక అవుట సాధనతోనే సాధ్యమౌతుంది.

ఆత్మనే సర్వాంతర్యామి అనే విషయం తెలుసుకున్నవారు, ఆత్మ రూపంలో భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని అంగీకరించినవారు, ఆత్మానందాన్ని అనుభవించడానికి మాత్రం మానసికంగా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కనిపించేవన్నీ ఆ ఆత్మ లేక అనంత శక్తిలో నుండే పరిణమిస్తూ ఉద్భవించాయని తెలిసినవారు నిజ జీవితంలో అద్వైత ఆనందాన్ని పొందడం అంత సులభమేమీ కాదు.

ఈశా వాస్యోపనిషత్తులో సర్వ భూతాలలో అంతర్యామిని దర్శించిన వారికి మానసిక వైకల్యాలు కలగవు అనడం సులభంగా అనిపించినా అది నిరంతర చింతన, తపన వలననే సాధ్యం.ఆది శంకరులు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన అనంతరకాలంలో గంగా స్నానమాచరించి విశ్వనాథుని దర్శనం కోసం కదులుతూ ఉంటే ఒక కాటి కాపరి ఎదురైనప్పుడు పక్కకు తప్పుకో అని అనడం విచిత్రం. అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు అత్యంత మేథాశక్తి గల మహిమాన్వితుడు, వేదవేదాంతాలను ఔపోసనపట్టిన బ్రహ్మజ్ఞాని ఆచరణ విషయం వచ్చే సరికి భంగ పడ్డాడంటే ఎంత ఆశ్చర్యకరమో ఆలోచించండి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నవాడు. ఆత్మ స్వరూపుడై ఉన్నవాడని తెలిసినా అంగీకరించినా అనుభవించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంతోనే ఆదిశంకరులవారు అప్పటికప్పుడు 'మనీషా పంచకం' ప్రవచించి బ్రహ్మ జ్ఞాని ఎవరైననేమి అతడు నా గురువంటూ నిశ్చయించుకొన్నాడు.

ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే చాలు కదా… ఎందుకు అనుభవించడం? అనే ప్రశ్న తలెత్తవచ్చు. అరిషడ్వర్గరూపంలో ఉన్న మనస్సులోని మాలిన్యాలు తొలగేందుకు శ్రీ కృష్ణుని నిష్కామకర్మ సాధించేందుకు సనాతన ధర్మ జీవితం జీవించేందుకు సుఖ దుఃఖాలను నిర్మూలించేందుకు ముఖ్యంగా మృత్యుంజయ మోక్షస్థితిని జీవితంలో అనుభవించేందుకు ఆత్మానందంలో రమించేందుకు అద్వైతాన్ని అనుభవించాలి. అదే కదా 'అహం బ్రహ్మాస్మి'కి నిజమైన తార్కాణం. అన్నమయ్య కలగన్న శ్రీవేంకటేశ్వరుడు ఆయనకు చివరి దశలో 'అంతర్యామి'గా ప్రసన్నమయ్యాడు.

భౌతిక దృక్పథం నుండి ఆత్మ దృక్పథంలోకి మారడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందో చూడవచ్చు. అందుకే ఆత్మజ్ఞాన జిజ్ఞాసులు మొదట ఆత్మను జడమును అర్థం చేసుకోవాలి. తద్వారా మాత్రమే ఆత్మను, జడమును వేరుగా చూడటాన్ని మన ఆలోచనలలో నుండి తీసివేయగలం.

'మహోపనిషత్‌' భేద దృష్టియే అవిద్య అని చెప్పింది. దానిని విసర్జించమని ఆదేశించింది. సర్వమూ బ్రహ్మమేనన్న విషయం తెలుసుకోవడమే విద్య అని దానిని అనుభవించడమే అక్షయమని తేల్చిచెప్పింది.

దీనికి చిన్న ఉదాహరణగా సైన్స్‌ చెప్పే విషయాన్ని తీసుకోవచ్చును. భూమి మీద భూమిని మించిన బరువు ఉన్న జీవులు జన్మిస్తే భూమి తన భ్రమణ పరిభ్రమణ గతులను తప్పుతుందా అనేది ప్రశ్న. సమాధానం 'గతి తప్పదు'. ఎందుకు గతి తప్పదు? ఎందుకంటే ఆ జీవులన్నీ భూమండలంలోనుండే ఉద్భవించినవి కాబట్టి. ఇదే గమ్మత్తు. ఆశ్చర్యదాయకం. ఇదే చిన్న ఉదాహరణను ఆ సర్వాంతర్యామిలో పుట్టి, గిట్టే ఖగోళ పదార్థాలన్నింటి విషయంలోనూ అన్వయించుకోవచ్చు. ఈ విధంగా అంతర్యామిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం నిరంతర మానసిక చింతనతోనే ఆచరణ సాధ్యం.

జిజ్ఞాసులకు మనస్సు అత్యంత కీలక సాధనం. అది మాత్రమే అవిద్యను తొలగించి వేసే విద్యకు ఆధారమౌతుంది. ఆ మనస్సు స్థిరంగా, బలంగా ఆత్మతో మమేకమైతేనే ఆచరణ సాధ్యమౌతుంది. అప్పుడే నిష్కామకర్మ చేస్తూ మోక్ష స్థితిని అనుభవించగలం. తద్వారా మనచుట్టూ ఉన్న సమాజంలో, ప్రకృతిలో మనల్ని మనమే చూసుకోగలం. అంతటా ప్రేమను నింపగలం. ఆ స్థితియే 'అహం బ్రహ్మాస్మి' అప్పుడే భేద భావం వలన ఉత్పన్నమయ్యే అరిషడ్వర్గాలు నశించి ఆనంద మయ జగత్తు సాక్షాత్కారమౌతుంది. ఇది సాధన చేసిన వారికి అనుభవంలోకి వస్తుంది.

అసలు ఇంతకి ఆత్మ ఉందా? ఉంటే దానికి శాశ్వత మరణముందా? భగవద్గీత ప్రకారము చూస్తే ఆత్మ ఉంది! కాని ఋభుగీత ప్రకారము చూస్తే ఆత్మ లేదు! బ్రహ్మము లేదు! అలాగే భగవద్గీత ప్రకారము చూస్తే ఆత్మకి మరణము లేదు! కాని తత్వవేత్తల అభిప్రాయప్రకారము చూస్తే ఆత్మను ముక్కలుగా చేయవచ్చునని వాదన వుంది! వీటిలో ఏది నిజము...ఏది వాదన సత్యం...నాకు అయితే అర్ధమవ్వలేదు! ఇలా పలుసందేహలు నన్ను వేధించినాయి! దీనికోసము భగవద్గీత చెప్పిన కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలని యోగసాధన మార్గాలలో మేము ప్రయాణించడము జరిగినది! ఏడు చేపల కధను యోగార్ధముగా వినాలని వుందా? అలాగే ఒక నగ్నసాధువు నుండి ఈ విశ్వము ఎలా ఏర్పడినదో తెలుసుకోవాలని వుందా? ఇంక ఆలస్యమెందుకు! ఆయా సాధన అనుభవాలు తెలియలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

గమనిక:

కొన్ని సంవత్సరాల తర్వాత నా సాధన స్థాయి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు… నాకు ఆత్మకు సంబంధించిన ధర్మ సందేహాలు తగ్గ సమాధానాలుగా స్ఫురణ స్వానుభవాలు కలిగినాయి!

అందులో ఆత్మ అనేది దైవమా లేదా దెయ్యమా అన్నప్పుడు… ఆత్మకి ఒక శక్తి ఉంటుంది! దానిని ఆత్మశక్తి అంటారు! ఈ శక్తి రెండు విధాలుగా ఉంటుంది! ఒకటి ధనాత్మక శక్తిగానూ అనగా పాజిటివ్ శక్తిగా అలాగే మరొకటి రుణాత్మక శక్తిగాను అనగా నెగెటివ్ శక్తి గా ఉంటుంది! పాజిటివ్ శక్తి ఉన్న ఆత్మలను దైవాలుగా… సప్త ఊర్ధ్వ లోకాలలో… కాషాయ రంగులో గాని లేదా తెల్లని శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటాయి! అలాగే నెగిటివ్ శక్తి ఉన్న ఆత్మలను ప్రేతాత్మగా పిలవబడుతూ … సప్త అధోలోకములలో… నల్లటి శరీరముతో ఆవాసం చేస్తూ ఉంటాయి! అంటే దైవాత్మలకి ఇష్ట కోరికలు ఉంటే… ప్రేతాత్మలకి తీరని కోరికలు ఉంటాయి! ఇష్ట కోరిక అంటే ప్రేమ మాత్రమే ఉంటుంది! అదే తీరని కోరికలు అంటే మాయ, మోహా, వ్యామోహాలు ఉంటాయి! అందువలన ఆత్మశక్తికి దైవశక్తి కాస్తా ప్రేతశక్తిగా అలాగే ప్రేతశక్తి కాస్తా దైవశక్తి గా మారే అవకాశాలు ఉన్నాయి! దీనిని బట్టి చూస్తే ఆత్మ అనేది మన కోరికను బట్టి దైవాత్మగాను లేదా ప్రేతాత్మగాను మారుతుందని నేను తెలుసుకోవడం జరిగినది! అదే పరిశుద్ధ ఆత్మకి యెట్టి స్ధితి ఉండదని గ్రహించాను!

ఇక ఆత్మను నాశనం చెయ్యవచ్చునా? లేదా అన్నప్పుడు ఆత్మ యొక్క రకాల గురించి ముందుగా మనం తెలుసుకోవలసి ఉంటుంది! ఆత్మ అనేది సూక్ష్మాంశ పంచభూతాలతో ను పంచ శరీరాలతో ఆత్మ యొక్క ఆత్మ స్థాయి ఉంటుంది! అనగా మూలాధార చక్రము నందు స్థూల శరీరంతో 84 అంగుళాలతో జీవాత్మగా భూతత్వ శక్తితో ఉంటే…. అదే ఆజ్ఞా చక్రము నందు 83 అంగుళాలతో సూక్ష్మ శరీరముతో అంతరాత్మగా జల తత్వం తో ఉంటే .. ఇక సహస్ర చక్రమునందు బొటనవేలు పరిమాణముతో కారణ శరీరంతో పరమాత్మగా అగ్ని తత్వములో ఉంటే…. ఇక హృదయ చక్రమునందు అంగుళం పరిమాణంతో సంకల్ప శరీరముతో పూర్ణాత్మగా వాయుతత్వము తో ఉంటే… అదే బ్రహ్మరంధ్రము నందు రేణువంత పరిమాణములో ఆకాశ శరీరముతో విశ్వాత్మగా ఆకాశతత్వము తో ఉంటాయని నేను గ్రహించాను! అలాగే జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, పూర్ణాత్మకి ఆయుష్ ప్రమాణాలు ఉన్నాయి! వాటి వాటి ఆయుష్ పూర్తవ్వగానే అశాశ్వత మరణము పొందుతాయి! కానీ విశ్వాత్మ కి ఎట్టి మరణము లేదు! ఇది నాశనము కానిది! నాశనం చేయలేనిది! ఎందుకంటే అన్నీ కూడా దీని నుండి ఉద్భవించి… దీనిలోనే నశించిపోతాయి! అందుకే భగవద్గీతలో చెప్పిన ఆత్మ అనేది ఈ ఆకాశ శరీరంలో ఉన్న ఆకాశతత్వము తో ఉన్న విశ్వాత్మ గురించి అన్నమాట! దీనిని అగ్ని నాశనము చేయలేదు! నీరు తడుపజాలదు! వాయువు ఎండనీయదు! కారణము పంచ భూతాలలో ఆకాశము కిందనే మిగిలిన నాలుగు భూతాలు ఉంటాయి కదా! కాబట్టి మరణము లేనిది… ఏమీ లేనిది విశ్వాత్మ అని మాత్రమే అన్నమాట! మిగిలిన నాలుగు ఆత్మలకు మాత్రమే ఆయా కాలానుగుణంగా అంతరించి పోతాయని నేను తెలుసుకున్నాను! బల్లి నుండి తోక వేరే చేసినా కూడా బల్లి అలాగే తోక ప్రాణముతో ఉండటానికి కారణం ఈ ఆత్మ రకాల స్థాయిలను బట్టి జరుగుతుంటాయని గ్రహించే ఉంటారు!

అలాగే ఆత్మ అనేది ఒక శరీరం నుండి మరొక శరీరంలోనికి ప్రవేశించవచ్చును! దీనినే పరకాయప్రవేశ విద్య అంటారు! అనగా ఒక శరీరములోని జీవాత్మ తప్పుకుంటే మరొక శరీరంలోని సూక్ష్మ శరీరము ఈ శరీరం లోనికి రావచ్చును! దీనికి పరిపూర్ణ యోగ నిద్ర సిద్ధుడై ఉండాలి! యోగ నిద్ర లోనే మన ఆత్మలను సూక్మ యానం ద్వారా ప్రయాణింప చేయవచ్చును! అలాగే మరొకరి శరీరంలోనికి ప్రవేశించి వచ్చును! ఇందులకు ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం మంచి ఉదాహరణగా చెప్పవచ్చు! ఇదంతా మనకి స్వానుభవం అయ్యేదాకా నమ్మలేము! నమ్మకం రాదు!

ఇక భగవద్గీత ప్రకారం చూస్తే ఆత్మ ఉన్నది అది శాశ్వత మని చెబితే… ఋభుగీత ప్రకారంగా చూస్తే ఆత్మ లేదు… అది అశాశ్వత మని అన్నప్పుడు ఇందులో ఏది సత్యం అనుకున్నప్పుడు….. ఈ రెండూ కూడా సత్యాలే! ఎందుకంటే ఈ రెండూ కూడా ఆఖరిదైన విశ్వాత్మ గురించి చెప్పడం జరిగినది! విశ్వాత్మ అంటే ఆకాశ శరీరముతో ఆకాశ తత్వంతో ఉన్నదని తెలుసు కదా! ఆకాశమంటే శూన్యమే కదా! ఆకాశము మన కంటికి కనపడుతుంది అంటే ఆత్మ ఉన్నట్లే కదా! ఇది భగవద్గీత చెప్పినది ! కానీ అదే ఆకాశము అనగా శూన్యం! శూన్యం అంటే ఏమీ లేనిది… ఖాళీ అని అర్థం కదా! అంటే ఆత్మ లేనట్లే కదా! ఇదియే ఋభుగీత గీత చెప్పింది! ఆకాశము ఉంటే ఆత్మ ఉన్నట్లే! ఆకాశము లేదు అంటే ఆత్మ లేనట్లే అన్నమాట! నిజానికి ఆకాశము కంటికి కనిపించి ఉన్నట్లుగా అనిపిస్తున్నది ! కిందనుంచి చూస్తే ఆకాశం మన పైన ఉన్నట్లుగా కనపడితే… అదే మనము ఆకాశం లోనికి వెళితే మనకి ఆకాశం కనపడుతుందా … కనపడదు కదా! అంటే ఈ రెండు గీత లు చెప్పినవి సత్యానుభవాలే గదా! ఏమంటారు! జాగ్రత్తగా ఆలోచించండి! మీకే తెలుస్తుంది!

అంతెందుకు మోక్షప్రదాయిని అయిన ఆకాశ తత్వ చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ దర్శనం అయితే మోక్షమని స్వయంగా ఆదియోగి పరమేశ్వరుడు మనకి మహా శివపురాణము నందు బోధించి నాడు కదా! మరి ఆకాశలింగం అంటే ఆకాశంలో లింగమును చూడటం లేక ఆకాశమే లింగంగా భావించడమా… ఆలోచించండి! నిజానికి ఆకాశంలో లింగము కనిపించదు! ఆకాశమే లింగము అని అనుభవ అనుభూతి పొందితే… ఆకాశము, లింగము అనేవి లేవని… ఏమీ లేవని… సర్వం శూన్యమని ఎవరైతే అనుభూతి పొందుతారో వారే మోక్షగామి అని భూతనాధుడు అయిన పరమేశ్వరుడు స్వయంగా చెప్పడం జరిగిందని నేను గ్రహించాను! అంటే ఈ విశ్వంలో ఏమీ లేదు…. సర్వం శూన్యం అని అనుభవ జ్ఞాన అనుభూతి కల్గుటయే యోగసాధన పరిసమాప్తి అన్నమాట! ఈ లెక్కన చూస్తే ఆకాశములో లింగమును చూస్తే విశ్వాత్మ ఉన్నట్లుగానే… అదే ఆకాశమే లింగం అయితే విశ్వాత్మ లేనట్లుగానే… యత్ భావం తత్ భవతి అన్నమాట!

అలాగే మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? పురాణాల్లో చెప్పినట్టు స్వర్గం - నరకం లాంటివి ఉంటాయా? ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతుంటాయి. వీటికి సమాధానాలు నాకు అనాహతచక్రస్ధితి యందు మరణభయములో స్వానుభవాలు అయినాయి! అన్ని ఉన్నాయని తెలుసుకున్నాను! ఆ వివరాలు మీకు ఈ చక్ర సాధనానుభవములో చెప్పడము జరిగినది!

కపాలమోక్షం - 25 - సాధన అంటే…

అసలు యోగ సాధన అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అనే ధర్మ సందేహాలు మా ఇద్దరినీ వెంటాడింది!

వీటికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆరంభించినాను! అసలు మనిషికి ఆహారం ఎందుకు తినాలి అనుకున్నపుడు ప్రాణశక్తిని కాపాడుకోవడానికి అని తెలిసింది! అసలు ప్రాణశక్తి ఎందుకు కాపాడుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞానం పొందడానికి అని తెలిసినది! అసలు జ్ఞానము ఎందుకు పొందాలి అనుకున్నప్పుడు మాయ తొలగించుకోవటానికి అని తెలిసింది! అసలు మాయ ఎందుకు తొలగించుకోవాలి అన్నప్పుడు ఆనందము పొందటానికి అని తెలిసింది! ఈ ఆనంద స్థితి ఎందుకు పొందాలి అని అంటే జన్మ రాహిత్యమును పొందటానికి తెలిసినది! ఇది ఎందుకు పొందాలి అంటే మాయా జగన్నాటకములోని పాత్ర నుండి తప్పుకోవడానికి అని తెలిసింది! అంటే అన్నం తో మొదలై అన్నం తినేవాడు లేని స్థితికి చేరుకోవాలని తెలిసినది! అనగా అన్నపూర్ణాదేవి తో మొదలై విశ్వనాథుడిని చేరుకోవాలి అన్నమాట! ఇదే విషయం కాశీక్షేత్రము నిరూపణ చేస్తోంది! కాశీ క్షేత్రములో అన్నపూర్ణాదేవి అలాగే విముక్తి కలిగించే విశ్వనాథుడు ఉన్నారు కదా! అన్నము పెట్టే అన్నపూర్ణాదేవి అంటే అన్నము ద్వారా అన్నపూర్ణాదేవి మనల్ని బతికిస్తే…. విశ్వనాథుడు తన తారక మంత్రము తో మనల్ని మరణము ద్వారా తారక లోకాలకి చేరుస్తున్నాడని తెలుస్తోంది కదా!ఇది బాగానే ఉంది! ఇందులో ఎందుకు సాధన చేయాలో తెలిసింది! మాయ నుండి మాయం అవ్వాలని తెలిసినది! అసలు యోగ సాధన అంటే ఏమిటి అన్నప్పుడు

"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరునియందు లయం చేయుట! మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట! ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును! అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది! ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి!అసలు యోగ సాధన అంటే ఏమిటి అన్నప్పుడు కర్మలనుండి జననమరణాలు లేకుండా చేసేది అని తెలిసినది! ఈ కర్మలు ఎక్కడినుండి వస్తాయి అని అన్నప్పుడు మోహ, వ్యామోహాల నుండి వస్తాయని…. ఇవి ఎక్కడ నుండి వస్తాయి అంటే ఆశ, భయము, ఆనందం నుండి వస్తాయని తెలిసినది! ఇవి ఎక్కడినుండి వస్తాయి అంటే మన ఆలోచన, సంకల్పము, స్పందన అనే మూడు భావాల నుండి వస్తాయని తెలిసింది! మళ్లీ ఈ మూడు భావాలు ఎక్కడ నుండి వస్తాయి అంటే సత్వ రజో, తమో గుణాల నుండి వస్తాయి అని తెలిసినది! ఈ మూడు గుణాలు ఎక్కడ నుండి వస్తాయి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి నుండి వస్తాయని అని తెలిసింది! ఈ మూడు శక్తులు మనస్సు, బుద్ధి, అహంకారము నుండి వస్తాయని తెలిసింది! ఇవి మన ప్రాణశక్తి లో ఉంటాయని తెలిసింది! మన ప్రాణ శక్తికి ఆధారము ఆహారం అని తెలిసినది! స్వాతికాహారం తీసుకుంటే మన మనస్సు సత్వగుణము గా కలిగి ఉంటుంది! అదే నిషిద్ధ ఆహారము తీసుకుంటే మన మనస్సు కాస్త తమోగుణమును కలిగి ఉంటుందని…. అనగా ఆహారమును బట్టి మనుసు ఉంటుందని…. మనస్సును బట్టి గుణగుణాలు ఉంటాయని… వీటిని బట్టి మన భావాలు ఉంటాయని…. వీటిని బట్టి మన ఆలోచన విధానాలు ఉంటాయని… వీటిని బట్టి మన కోరికలు ఉంటాయని …వీటిని బట్టి కర్మలు ఉంటాయని.. వీటిని బట్టి జన్మలు ఉంటాయని తెలిసింది! ఇవేమీ లేకుండా ఉండటానికి యోగ సాధన చేయవలసి ఉంటుంది! అసలు ఎలా యోగసాధన ద్వారా ఇవన్నీ జరుగుతాయని అనుకున్నప్పుడు…. కర్మలు అనేవి మనము చేసే కార్యాలను బట్టి ఉంటాయని తెలిసింది! అవే పాపకర్మల గాను, పుణ్యకర్మలు గాను తెలిసినది! పాప కర్మల వలన జన్మలు పెరుగుతాయని …. పుణ్య కర్మల వలన జన్మలు తరుగుతాయని…. జరుగుతాయని తెలిసినది! అసలు సర్వ పాప కర్మలు చేసేది ఏమిటి అన్నప్పుడు …. మనస్సు, బుద్ధి, అహంకారము, శరీరము, మాట, కర్మ అనేది తెలిసినాయి! ఉదాహరణకు దొంగతనం, వ్యభిచారం లాంటివి శరీరంతో చేసే పాపాలు గా చెప్పవచ్చును! అలాగే అబద్ధం చెప్పటం, అపవాదులు వేయటం, దూషించడం అనేవి నాలుక అనగా మాట చేసే పాపాలు గా చెప్పవచ్చును! అసూయ, ద్వేషము, మోహము, వ్యామోహము ఇలాంటివి మనస్సు చేసేవన్నీ మనస్సు చేసే పాపాలు గా చెప్పవచ్చును! నేను మాత్రమే చేయగలను అని అనేది అహంకారం చేసే పాప విధిగా చెప్పవచ్చును! అస్థిర బుద్ధితో తప్పుడు ఆలోచన చేసి తప్పుడు కర్మలు చేయడం వలన వచ్చే టప్పుడు పాప కర్మ ఫలితాలను పొందడం అనేది బుద్ధి చేసే పాపాలు గా చెప్పవచ్చు అని తెలుసుకున్నాను! ఇలా ఇవి ప్రవర్తించడానికి కారణం కర్మ బంధం అని తెలిసినది! దీనికి కారణం మనము వారికి రుణ పడటం లేదా వాళ్ళు మనకి రుణ పడటం వలన జరుగుతుందని తెలిసింది! అనగా రుణ సంబంధాల వలన కర్మబంధాలు ఏర్పడతాయని మాట! అంటే మనకి ఉండే రుణ బంధాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాను!

అది కాస్త తల్లి - తండ్రి, బంధువు, సోదరుడు- సోదరి, గురువు, మిత్రుడు, భార్య- భర్త, సంతానము, అత్త- మామ, జంతువు, దైవము అనేవి ఉన్నాయని తెలిసింది! ఈ రుణ బంధాల వలన మనము వారికి తెలిసి లేదా తెలియకుండా చేసే పాపాలు చేస్తున్నామని గ్రహించాను! ఈ పాపాల వలన మనకి కర్మలు-జన్మలు ఏర్పడుతున్నాయని గ్రహించాను! మన పాపాలు దగ్ధం చేసుకోవటానికి యోగాగ్ని కారకమైన యోగ సాధన చేయవలసి ఉంటుందని తద్వారా పాపాలు నశించి పోయి…. ఈ కర్మబంధాల నుండి విముక్తి కలిగి పునర్జన్మ లేని జన్మరాహిత్యం కలుగుతుందని గ్రహించాను! అంటే ఎవరికి మనము ఇంకా రుణ పడటం అలాగే కర్మశేషం అనేది ఉండ కూడదని తెలిసినది! ఒకవేళ మనం రుణము ఉంటే… అది కర్మగా ఏర్పడుతుంది! ఈ కర్మ ఉంటే… జన్మ ఉంటుంది! జన్మ ఉంటే …. కోరిక ఉంటుంది! కోరిక ఉంటే మనస్సు ఉంటుంది! మనస్సు ఉంటే శరీరం ఉంటుంది! శరీరం ఉంటే పాపపుణ్యాల కర్మఫలితాలు అనుభవించవలసి ఉంటుంది! అనగా ఏడుపులు, బాధలు, కష్టాలు, సుఖాలు, ఆనందాలు అన్నమాట! దీనమ్మ జీవితం! ఇదంతా చూస్తుంటే…. చిన్నప్పుడు అమ్మ చెప్పిన రాజు గారి ఏడు చేపల కథ గుర్తుకువస్తోంది!

ఒకరోజు ఒక రాజు ఏడు చేపల తెచ్చి ఎండబెడితే….. అందులో ఒక చేప ఎండకపోవటం… దీనికి కారణం గడ్డివాము అడ్డు రావటం… దీనికి కారణం ఆవు దీనిని మేత మేయకపోవడం …. దీనికి కారణం గొల్లవాడు వచ్చి దీనికి గడ్డి వేయకపోవడం…. దీనికి కారణం గొల్లవాడు తల్లి ఇతనికి అన్నము పెట్టకపోవడం… దీనికి కారణం అన్నం పెట్టే లోపల ఒక చిన్న పిల్లాడు ఏడవటం… దీనికి కారణం వీడికి చీమ కుట్టడం… దీనికి కారణం తన పిల్లవాడు పుట్టలో వేలు పెట్టడం వలన అని చెప్పడంతో… కథ సుఖాంతం అవుతుంది! ఇది అందరూ చెప్పుకునే భోగ జీవిత కథ! ఇప్పుడు దీనిని యోగ జీవిత కథ గా ఎలా చెప్పుకోవచ్చు చూడండి… ఏడు చేపలలో ఎండిన చేపలు అరిషడ్వర్గాలను… ఎండనీ చేప మనస్సు గాను… గడ్డివాము అనేది అజ్ఞానము గాను… ఆవు అనేది జ్ఞానము గాను… గొల్లవాడు అనేది సద్గురువు గాను… అమ్మ అనేది జగన్మాత గాను… పిల్లవాడు అనేది కోరికలు మాయ గాను…. చీమ అనేది సుఖదుఃఖాల సంసారం గాను… పుట్ట అనేది మట్టి లాంటి జీవితమునకు సంకేతాలుగా మార్చి చూస్తే….. ఈ కథ ఎలా ఉంటుందో చూడండి! మనస్సు అనేది ఎండక పోవటానికి కారణం ఇది గడ్డివాము అనే అజ్ఞానం మాయ అడ్డంగా ఉండటం వలన అని తెలిసినది! ఈ అజ్ఞాన మాయ తొలగటానికి ఆవు అనే జ్ఞానము మనము పొందాలని తెలిసినది! ఈ జ్ఞానము ఇచ్చే గొల్లవాడు వంటి వాడు గురువు అనుగ్రహమును మనము పొందాలి! ఈ అనుగ్రహమును పొందాలి అంటే మనము గొల్ల వాడికి అన్నం పెట్టే తల్లి అనుగ్రహం అనగా జగద్గురువు అయిన జగన్మాత అనుగ్రహమును పొందవలసి ఉంటుంది! ఈమె అనుగ్రహమును పొందాలంటే చిన్న పిల్లవాడి లాగా మనము తపన తాపత్రయం పడవాలి అనగా జ్ఞానం పొందాలనే తపన తాపత్రయం ఉండాలి! వీడు ఎలాగైతే ఏడుస్తున్నాడో మనము కూడా ఈమె అనుగ్రహము కోసము అలాగే సద్గురు అనుగ్రహం కోసం తపన తాపత్రయం పొందాలి అన్నమాట! దీనికి మనము కోరికల మాయ నుండి బయటపడాలి అనగా పుట్టలో వేలు పెట్టాలని కోరిక నుండి తప్పుకోవాలని తెలుసుకున్నాను! పిల్లవాడు కావాలనే పుట్టలో వేలు పెట్టడం అనేది కోరిక మాయ కిందకే వస్తుంది! ఆ పుట్టలో కుట్టిన చీమ అనేది కర్మఫలితాలు సంకేతం అని తెలిసినది! అనగా పాపపుణ్యాలు, కష్టసుఖాలు, సుఖదుఃఖాలు అనేవి అన్నమాట! మట్టి పుట్ట విషయానికొస్తే మట్టి లాంటి జీవితం అని తెలిసినది! మనం తినే ఆహారము మట్టి నుండి పుడుతుంది కదా! మనం మట్టిలోనే తిరుగుతున్నాము కదా! చివరికి మనం మట్టిలోనే కలిసిపోతుంది కదా! అంటే కోరికల మాయలో పడిన వాడు మట్టిలో కలిసి పోతాడని తెలుస్తోంది! కాబట్టి ఇలా కాకుండా ఉండాలి అంటే మన కోరికలు లేని స్థితికి చేరితే… మన ఎండని చేప వంటి మనస్సు ఎండిపోతుందని… జన్మ రాహిత్యమును ఇస్తుందని…. దీన్నే మోక్షప్రాప్తి అని అంటారని తెలుసుకున్నాను! అంటే మనకు ఎలాంటి రుణ కర్మ జన్మ బంధాలు లేకుండా ఉండాలి అంటే మన పాపాలు హరించాలి…. దీనికి ఏమి చేయాలి అన్నప్పుడు తల్లిదండ్రులకు సేవలు, అత్తమామల సేవలు, గురుసేవ, గోమాత సేవ ,నిత్య గంగానది స్నానము, నిత్య తుంగభద్రానది పానము, నిత్య విభూది ధారణ, మన స్తోమతను బట్టి దానధర్మాలు, అన్నదానము, ప్రయాగ గయ పిండప్రదానాలు, సర్ప దోష నివారణ పూజలు, నారాయణ బలి క్రతువు, భూతదయ, నిత్య గణపతి పూజ, తులసీదళాల అర్చన, ఏకాదశి ఉపవాస వ్రతం, శివరాత్రి జాగరణ ,లింగార్చన, నిత్య బాణ లింగార్చన, నిత్య రుద్రాక్ష మాల ధారణ, ఎద్దులు ఆంబోతుగా వదిలి పెట్టడం , విశ్వ ఆరాధన మున్నగు వాటిని చేయాలని శాస్త్ర వచనం గా తెలుసుకున్నాను! తద్వారా మన మనస్సు పరిశుద్ధము అవ్వటం ప్రారంభిస్తుందని తెలుసుకున్నాను! పాప భారం తగ్గుతుందని తెలిసినది! అప్పుడు మనం మనస్సు లగ్నం చేయడమే సాధన అని తెలుసుకున్నాను! ఈ మనస్సుని వివిధ యోగ ప్రక్రియల ద్వారా లగ్నమవుతుంది!

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది! లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది. తాపసులు తమ తపస్సును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాథ్ శిష్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ యోగము అను యోగ శాస్త్ర గ్రంథమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను, ప్రాణాయామ పద్ధతులను, బంధములను, ముద్రలను మరియు క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు. అనేక వేల ఆసనములలో 84 ఆసనములను ముఖ్యమైనవిగా చెప్పబడినవి. ముఖ్యముగా ధ్యానమునకు కావలసిన సుఖాసనము, సిద్దాసనము, అర్ధ పద్మాసనము, పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడింది. ఇదే విధముగా పతంజలి యోగ శాస్త్రమున - స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము ఉంది. ప్రాణాయామ సాధనలో - సూర్య భేదన, ఉజ్జాయి, శీతలి, సీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావని, మూర్చ - ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను. జాలంధర బంధము, మూల బంధము, ఉడ్యాన బంధము - ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర, మహాబంధ, మహాభేధ - ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్, అంతర్ శుచి చాలా అవసరముగా ఈ హఠ యోగమున ప్రధాన అంశముగ చెప్పబడింది.- ధౌతి, నేతి, వస్తి, నొలి, త్రటకం, తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి - అని వివరణ గలదు.ఈ సాధన విధి విధానాలను చేయడం వలన మన మనస్సు యొక్క ఆలోచనలు ఏకీకృతం చేయడం జరుగుతుందని దీనినే ధ్యానం అని తెలుసుకున్నాను! ఇట్టి ధ్యాన స్థితిలో నిరంతరంగా కొనసాగితే అదియే సమాధి స్థితి అని గ్రహించాను! ఇలా మనస్సు లేని స్థితి పొందడమే పరిపూర్ణ ఆనంద స్థితి అని … పునర్జన్మ లేని జన్మరాహిత్యం మోక్షప్రాప్తి కలుగుతుందని…. తద్వారా మనకి పసిపాప లాంటి ఆత్మ శాంతి కలుగుతుంది అని… ఇదియే సాధనలో మహోన్నత స్థానం అని గ్రహించాను! అనగా గోచీ గుడ్డ లేని సాధువులాగా మారాలని గ్రహించాను!

అంటే ఒక రోజు ఒక నగ్న సాధువుకి(నగ్నత్వం) తన నగ్న మర్మాంగమును చూసి సిగ్గు పడి , భయపడి… ఎవరికీ కనిపించకుండా ఉండాలని… ఒక చిన్నగుడ్డను (కామత్వం)కప్పుకున్నాడు! దానిని ఎలుక కొరికి వేయడం జరిగినది! దీనిని చంపటానికి పిల్లిని పెంచాడు! దీని పాల కోసం ఆవును పెంచాడు! దీని ఆహారం కోసం గడ్డిని పెంచాడు! గడ్డి కోసం వ్యవసాయం చేయడం ప్రారంభించాడు! వ్యవసాయానికి తోడుగా ఇల్లాలిని తెచ్చుకున్నాడు! ఇల్లాలికి ఉండటానికి ఇల్లు ఏర్పరచుకున్నాడు! రక్షణ కోసం సంతానం కన్నాడు! ఈ సంతానం పోషణార్థం గ్రామమును ఏర్పరచుకున్నాడు! ఈ గ్రామాలు కాస్త పట్టణాలను… పట్టణాలు కాస్త రాష్ట్రాలుగాను… రాష్ట్రాలు కాస్త దేశాలు గాను … దేశాలు కాస్త ప్రపంచము గాను… ఈ ప్రపంచము కాస్త ప్రకృతి గాను… ప్రకృతి కాస్త అండ,పిండ, బ్రహ్మాండం కలిగిన విశ్వమే రూపాంతరం చెందినది! అంటే ఒక గుడ్డ ముక్క వలన ఈ విశ్వమే ఏర్పడినది కదా! అలా మన మనస్సు వలన మన దేహ నిర్మాణం ఏర్పడిందని తెలుసుకున్నాను! ఎప్పుడైతే తనకి గుడ్డముక్క అవసరం లేదని… సర్వం ఏమిలేదని...సర్వం శూన్యమని జ్ఞానము పొందుతాడో(దిగంబరత్వం)…. అప్పుడు వాడికి ఈ శరీరము ఏర్పడే అవకాశమే ఉండదు కదా! ఎప్పుడైతే మనము మన సాధన ద్వారా మనస్సు లేని స్థితి పొందితే… ఈ విశ్వంతో, ఈ శరీరంతో ఇంకా ఏం పని ఉంటుంది? ఆలోచించండి! నిజమే కదా! దీని కోసము మనము యోగ సాధన అనేది తప్పనిసరిగా చేయాలి కదా! ఇప్పుడు సాధన అంటే ఏమిటో… ఎందుకు చెయ్యాలో… తెలిసినది కదా! కాని ఎలా చెయ్యాలో… దానికున్న సాధన మార్గాలు ఏమిటో తెలియలేదు! అపుడు భగవద్గీత చదివితే ఏమి జరిగినదో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం! సాధన నా ప్రారంభ సాధన అనుభవాలు ఏమిటో చూడాలని లేదా… ఉంటే నాతో పాటు ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి! శుభం భూయాత్

కపాలమోక్షం - 26 - భగవద్గీత చదివితే…

అసలు యోగ సాధన అంటే ఏమిటో…. అది ఎందుకు చేయాలో చేస్తే… వచ్చే ప్రయోజనాలేమిటో మేమిద్దరం అనగా నేను అలాగే మరి మా యోగ మిత్రుడైన జిజ్ఞాసి తెలుసుకున్నాము! కానీ సాధన చేయటానికి ఉన్న విధివిధానాలు ఏమిటో మాకిద్దరికీ అర్థం కాలేదు! ఒక పెద్దాయనను అడుగగా “అన్ని రకాల ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కరించే భగవద్గీత ఉండగా…. చింత దేనికిరా… గీతా పారాయణం చేయండి! యోగ సాధన మార్గాలు ఏమిటో తెలుసుకోండి” అని చెప్పినారు! దీనితో మేమిద్దరం కూడా గీతా పారాయణం చేయడం ఆరంభించినాము! మొదట్లో నిజానికి ఏమీ అర్థం కాక చాలా విసుగు అనిపించేది! ఇది మా కున్న సమస్య కి ఎలా పరిష్కారం చూపిస్తుందో నాకు అయితే అర్థం చావలేదు! ఇలా కాదనుకుని చాలా ఓపికగా, శ్రద్ధగా, విసుగు, విరామం లేకుండా చదవడం ఆరంభించినాము! రాను రాను నాకు నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ వచ్చేసరికి…. విసుగు తగ్గి దాని మీద ఆసక్తి కలగటం ఆరంభమైనది! చదువుతున్నకొద్దీ పద్యాలు అర్థం కాకపోయినా ప్రతిపదార్ధభావాలు చదువుతుంటే నెమ్మది నెమ్మదిగా బుర్ర తిరగటం ఆరంభమైంది! కర్మ మార్గము మొదలై మోక్ష మార్గం దాక వచ్చే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మాకు అర్థమయింది! భగవత్ తత్వము అంటే ఏమిటో తెలిసింది! ఎలా ఉండాలో… ఎలా ఉండకూడదో…. ఏ విధంగా జీవించాలి…. ఏ విధంగా సమస్యలు వస్తే పరిష్కార మార్గాలు ఆలోచించుకోవాలి అని తెలిసింది! ఇలా ప్రతి విషయం చాలా సున్నితంగా, అర్థవంతంగానూ చేశారని తెలిసింది! అలాగే యోగ సాధనకు కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలినీ మార్గాలు ఉన్నాయని తెలిసింది! నీతో ఇంతటి మహత్తర గ్రంధ రాజ్యము మరొకటి ఉండదని గ్రహించినాము! అలాగే ఈ గీత కి సంబంధించి వివిధ రకాల భాష్యాలు ఉన్న గ్రంధాలు చదువుతూ… వారి అభిప్రాయాలు, భావాలు, చదువుతూ… నాకు నచ్చిన వాటిని సేకరించి ఒక నోట్స్ రాసుకోవడం జరిగినది! ఇది చాలా టూకీ గా ఉంటుంది! అంటే గీత యొక్క గీతా సారంశం లాంటిదన్నమాట! గీత పూర్తిగా చదవలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని…. అందరికీ గీత యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రభావం అందరి మీద ఉండాలని సదుద్దేశంతో…. ఈ అధ్యాయములో నేను రాసుకున్న గీత చెప్పడం జరుగుతోంది!

భగవద్గీత: మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.

భగవద్గీతలో భగవంతుడిని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ, పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుడిని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునుడినికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

భగవద్గీత ఎప్పుడు వ్రాయబడినదో పూర్తిగా నిర్ధారణ కాలేదు, లేదా నిరూపింపబడలేదు. మహాభారత ఇతిహాసమునందలి వివిధ ఖగోళ ఆధారాలను అనుసరించి, మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 గా చెప్పబడుతున్నాయి. ఈ తారీఖులు హిందువుల విశ్వాసమైన కలియుగారంభమై 5000 సంవత్సరాలు అయినాయి అనేదానికి అనుకూలంగానే ఉన్నాయి. పురాణాలను అనుసరించి మాత్రం క్రీస్తుపూర్వం 2500 గా చెప్పబడుతున్నాయి. పాశ్చాత్య విద్వాంసులు మాత్రం ఈ తారీఖులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలుగా చెప్పుచున్నారు.

భగవద్గీతలోని శ్లోకాల సంఖ్య గురించి చాలా పరిశోధన జరిగింది! ఇంకా జరుగుతూ ఉంది! దీన్నిబట్టి కృష్ణుడు 620 శ్లోకాలు, అర్జునుడు 57 శ్లోకాలు, సంజయుడు 67 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 745 శ్లోకాలు. కానీ వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి కృష్ణుడు 574 శ్లోకాలు, అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడు 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే మొత్తం 700. మరి కొన్ని ప్రతులలో 13వ అధ్యాయం "క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం" మొదట్లో అర్జునుడు అడిగినట్లుగా "ప్రకృతిం పురుషం చైవ ..." అని ఒక ప్రశ్న ఉంది. అది కనుక కలుపుకుంటే మొత్తం 701 శ్లోకాలు అవుతాయి. ఇవి కాకుండా రాజస్థాన్లోని కథియవాడ్‌లో భోజ (భూర్జర) పత్రాలపై రాసిన భగవద్గీత పాఠాంతరం ఒకటి బయటపడిందనీ, దానిలో ఏకంగా 755 శ్లోకాలు ఉన్నాయనీ, తమ 'గీతా మకరందం' (1963) రెండవ ముద్రణలో (చూడు పే. 13, 1964) విద్యాప్రకాశానందగిరి వారు (శుకబ్రహ్మాశ్రమము, కాళహస్తి) రాశారు. కానీ, దీనిని గురించి మరిన్ని వివరాలు అందుబాటులో లేవు. ఏది, ఏమైనా, మహాభారత శ్లోకం ప్రక్షిప్తం కాదనుకుంటే మరొక 44/45 అమూల్యమైన శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పచ్చు.

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు. 13 నుండి "జ్ఞాన షట్కము". ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.

అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.

సాంఖ్య యోగము:- ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.

కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.

జ్ఞాన యోగము:- నర, నారాయణల జన్మలు, భగవంతుడిని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.

కర్మసన్యాస యోగము:- కర్మల ఫలితాలను సన్యసించి భగవంతుడినికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.

ఆత్మసంయమ యోగము:- ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు, సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగణాల వర్ణన, భగవంతుడిని సర్వవ్యాపత్వము, యోగభ్రష్టత ఫలితాల వర్ణన.

జ్ఞానవిజ్ఞాన యోగము:- భగవంతుడిని ఉనికి, గుణగణాలు, ప్రకృతి, మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.

అక్షరపరబ్రహ్మ యోగము:-బ్రహ్మతత్వము, ఆధ్యాత్మికత, కర్మతత్వము, అధి దైవతము, అధి భూతముల వర్ణన.జీవుని జన్మలు, జీవ ఆవిర్భావము, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అంత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.

రాజవిద్యారాజగుహ్య యోగము:-మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము, స్వర్గలోకప్రాప్తి, దేవతారాధన వాటిఫలము, భక్తుల గుణగణాల వర్ణన.

విభూతి యోగము:- భగవంతుడిని చేరే మార్గము.భగవంతుడిని విశ్వ వ్యాపకత్వము వర్ణన.

విశ్వరూపసందర్శన యోగము:-విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.

భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుడిని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:- ప్రకృతి పురుషులు, క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.

గుణత్రయవిభాగ యోగము:- సత్వగుణము, రజోగుణము, తామసగుణము వివరణ, వారి ఆహారవ్యవహారాల వర్ణన.

పురుషోత్తమప్రాప్తి యోగము:- భగవంతుడిని స్వరూపము తత్వము పురుషోత్తమునిని చేరే మార్గము వివరణ.

దైవాసురసంపద్విభాగ యోగము:- దైవీగుణసంపద, అసురీగుణసంపద కలవారి ప్రవృత్తి, ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.

శ్రద్దాత్రయవిభాగ యోగము:-సత్వ, రాజసిక, తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.

మోక్షసన్యాస యోగము:-మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము, సన్యాసము గురించిన వర్ణన

అర్జునవిషాద యోగము:

"ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?" అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుడిని కోరికపై పార్ధసారథియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. - వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనస్సు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్థించాడు.

సాంఖ్య యోగము

సాంఖ్యము అనగా ఆత్మానాత్మ వివేచన. కర్తవ్య విమూఢుడైన అర్జునుడిని కృష్ణుడు మందలించాడు. తరువాత అర్జునుడినికి ఆత్మ తత్వాన్ని బోధించాడు. తానే చంపేవాడినన్న భ్రమ వద్దని తెలిపాడు. ఇది గీతలోని తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. దానికి శీతోష్ణ సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలు లేవు. ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతుంటాయి. సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాలపట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి. సుఖము పట్ల అనురాగము, దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు, ఇంద్రియాలను వశంలో ఉంచుకునేవాడు, అహంకార మమకారములు వీడినవాడు, బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితప్రజ్ఞుడు.

శరీరము అశాశ్వతము. దానిని తెలుసుకున్న శరీరి (ఆత్మ) శాశ్వతము. ఈ విషయానికి ప్రాధాన్యమిచ్చి కర్తవ్యపాలన చేయాలి. ఈ రెండిటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నా చింతలు, శోకాలు తొలగిపోవును.

కర్మ యోగము:

కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. కర్మలవలన సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. అందువలన

1. యుక్తమైన కర్మలు చేస్తూనే ఉండాలి. వాటి ఫలితాన్ని గురించి ఆశించరాదు. అలాగని కర్మలు చేయడం మానరాదు. ఫలితం ప్రియమైనా, అప్రియమైనా గాని దానిని సమబుద్ధితో స్వీకరించాలి.

2. కర్మల పట్ల సంగము (ఆసక్తి, వ్యామోహం) పెంచుకోకూడదు. కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా గాని సమభావం కలిగి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ. ఫలాపేక్షతో చేసే కామ్యకర్మలు నీచమైనవి.

3. లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతుడినికి ప్రీతికరమైనవి. ఇవి బంధం కలిగించవు. మోక్షప్రదాలు.

ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది. ఇదే కర్మ యోగము.

జ్ఞాన యోగము:

ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయానికి సరైన క్షేత్రం. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని ఇలా బోధించాడు -

" ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. మానవులు నన్ను ఏవిధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తుంటాను. రాగ భయ క్రోధాదులను త్యజించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు. కర్మ ఫలాసక్తిని విడచి, నిత్య తృప్తుడై, అహంకార మమకారాలను పరిత్యజించి, సుఖదుఃఖాలకు అతీతుడైన, సమదృష్టి కలిగిన, త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. జ్ఞానంతో సమానమైన పావనకరమింకొకటి లేదు. ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ కలిగి, ఆత్మ ధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు ఇహపరలోకాలలోనూ శాంతిని పొందలేడు."

కర్మసన్యాస యోగము:

ఇంతకూ కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం - "కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు"

ఆత్మసంయమ యోగము

ఈ అధ్యాయంలో వివిధ యోగసాధన విధానాలు చెప్పబడ్డాయి. ఇంద్రియ మనో బుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనస్సు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ధ్యానం సరిగా సాగాలంటే ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం వంటి విషయాలలో సంయమనం పాటించాలి. అతి ఎక్కడా కూడదు. మనస్సు చంచలం కనుక అది చెదిరిపోతూ ఉంటుంది. అభ్యాసం, వైరాగ్యం అనే బలమైన సాధనల ద్వారా మనస్సును నిగ్రహించుకొనవచ్చును. ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలను దూరంగా ఉంచాలి. సమస్త ప్రాణుల సుఖదుఃఖాలనూ తనవిగా తలచి వాటిపట్ల దయ, కరుణ, ఆర్ద్రత, సహాయత చూపాలి. ఒకవేళ యోగసాధన మధ్యలో ఆగిపోయినా దాని ఫలితం వలన ముందుజన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలడు.

జ్ఞానవిజ్ఞాన యోగము:

విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుడిని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుడిని తెలుసుకోగలుగుతాడు.

భగవంతుడిని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుడిని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతునినికంటే వేరుగా ఏదీ లేదు.

ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుడిని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తాడు! గనుక అతడు భగవంతుడినికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుడిని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్మ జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.

అక్షరపరబ్రహ్మ యోగము

బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడింది.

క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్మ విద్య. అంత్యకాలంలో భగవంతుడిని ధ్యానిస్తూ దేహన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుడిని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.

రాజవిద్యారాజగుహ్య యోగము

కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము " కృష్ణుడు తానే భగవంతుడినని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడింది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -

" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ ఙ్ఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."

"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొందుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది సమర్పించిన దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనస్సు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"

విభూతి యోగము:

ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుడిని పొందడానికి అవసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరములలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.

"నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతుల గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.,

విశ్వరూపసందర్శన యోగము:

శ్రీకృష్ణుడు విశ్వరూపములలోభగవానునిని దివ్యగుణ వైభవాల గురించి విన్న అర్జునుడు భగవానునిని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్థించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జునునకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.

"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతలు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్థించాడు.

అర్జునుడిని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.

భక్తి యోగము:

పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానునిని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుడిని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతుడినికి అర్పించాలి.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:

మానవుల శరీరము క్షేత్రము. ఆ క్షేత్రమును గూర్చి తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోను అంతర్యామిగానున్న క్షేత్రజ్ఞుడు పరమాత్ముడే. అని, అట్టి పరమాత్ముని స్వరూపమును కృష్ణపరమాత్ముడు తెలియజెప్పెను.

క్షేత్రమంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడుకొని యున్న శరీరము. క్షేత్రజ్ఞుడంటే క్షేత్రంలో ఉండే జీవుడు. అన్ని క్షేత్రాలలో ఉండే క్షేత్రజ్ఞుడను నేనే అని, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యనున్న యదార్ధ సంబంధం తెలిసికోవడం జ్ఞానమని కృష్ణుడు ఉపదేశించాడు. అలాంటి జ్ఞానం కలిగిన జ్ఞాని లక్షణాలు - తనను తాను పొగడుకొనకపోవడం, గర్వం లేకపోవడం, అహింసాచరణ, ఋజుత్వము, గురు సేవా తత్పరత, శుచిత్వము, స్థిర బుద్ధి, ఆత్మ నిగ్రహం, ఇంద్రియ విషయాలపై వైరాగ్యం కలిగి ఉండటం, ఇష్టానిష్టాల పట్ల సమభావం కలిగి ఉండడం, ఏకాంత ప్రియత్వం, తత్వ జ్ఞానం యొక్క ధ్యేయాన్ని గ్రహించడం, భగవంతుడినియందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం వంటివి.

ఇలాంటి జ్ఞానం లేని అజ్ఞాని తన ఆత్మ తత్వాన్ని తెలిసికొనలేక, క్షేత్రమే తాను అని భ్రమించిసంసార బంధాలకు లోనౌతాడు. అనేక జన్మలనెత్తుతాడు. యదార్ధంగా శరీరానికి భిన్నంగా, సాక్షీభూతంగా, ప్రభువుగా, భరించువానిగా భగవానుడున్నాడు.

గుణత్రయవిభాగ యోగము:

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజో తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుడిని కారణంగానే సృజింపబడుతుంది.

సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది. రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది. తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది. సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మల మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుడిని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.

పురుషోత్తమప్రాప్తి యోగము:

త్రిగుణాత్మకమైన సంసార వృక్షమును శ్రీకృష్ణుడు వర్ణించెను. జగత్తులో నాశనమొందువాడు క్షరుడు. వినాశరహితుడు అక్షరుడు. వీరిద్దరికంటే ఉత్తమమైనవాడు, అతీతుడు గనుక భగవంతుడు పురుషోత్తముడు.

పురుషోత్తమ ప్రాప్తి యోగమును ఆధ్యాయముయందలి 16వ శ్లోకము

శ్లో❘❘ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ ❘

క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్చతే ❘❘

ఇక్కడ క్షరుడు అనగా నాశనమొందు జీవాత్మ అని అర్థము, ఆక్షరుడు అనగా ఆత్మ, పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఇదే త్రైత సిద్ధాంతము. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ల వివరముతో కూడుకొన్న త్రైత సిద్ధాంతమే, సృష్టిఆది యందు దేవునిచే సూర్యునికి చెప్పబడింది. తిరిగి మరల ఆ జ్ఞానమే దేవుని యొక్క మానవరూపము అయిన భగవంతుడు శ్రీకృష్ణపరమాత్మ చే ద్వాపరయుగములో పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత రూపములో మరల ఈ లోకానికి చెప్పబడింది.

దైవాసురసంపద్విభాగ యోగము:

అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును భగవంతుడు వివరించెను. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవనం సాగించుటకు ఏ లక్షణములను అలవరచుకోవాలి మరియు ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములను తెలుసుకొనుటకు ఈ అధ్యాయము ఎంతగానో ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయములో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. దైవీ సంపద కలిగిన వారి లక్షణములు ఈ విధముగా వుంటాయి!

భయము లేకుండుట, అంతః కరణమందు నిర్మలత్వము, తత్వ జ్ఞానార్ధమై ధ్యానమందు నిరంతర దృఢ స్థితి, సాత్వికమైన దానము, ఇంద్రియ నిగ్రహము, దైవ, గురుపూజనము, అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేద శాస్త్రములు చదువుట మరియు చదివించుట, భగవంతుడిని గుణ నామ కీర్తనము, స్వధర్మ పాలనయందు కష్టముల యందు ఓర్పు, శరీరమున, అంతః కరణమున, ఇంద్రియములయందు సరళత్వము, మనోవాక్కాయముల నెవ్వరిని బాధింపకుండుట, సరళ సత్య భాషణము, అపకారి పట్ల కూడా ఎట్టి క్రోధము కలగకుండుట కర్మల యందు కర్తృత్వ అభిమానము లేకుండుట, ఎవరినీ నిందింపకుండుట, సకల ప్రాణుల యందు నిర్హేతుకమైన దయ కలిగి యుండుట, ఇంద్రియ విషయ సంయోగము కలిగినను దానియందు ఆసక్తి లేకయుండుట, కోమలత్వము, లోకవిరుద్ధమైన, శాస్త్ర విరుద్ధమైన కర్మాచరణ యందు లజ్జ కలిగి యుండుట వ్యర్ధమైన కర్మలు చేయకుండుట. తేజము, క్షమ, ధైర్యము, బాహ్య శుద్ధి, ఎవరి యందును శత్రు భావము లేకుండుట తన యందు పూజ్యత అభిమానము లేకుండుట అనునవన్నియు ఓ అర్జునా! దైవీ సంపద కలిగిన వారి లక్షణములు.

ఓ అర్జునా! దంభము, దర్పము, దురభిమానము, క్రోధము, పౌరుషము మరియు అజ్ఞానము మొదలగునవి అసురీ సంపదతో పుట్టిన వారి లక్షణములు.

శ్రద్దాత్రయవిభాగ యోగము:

వివిధమార్గాలలో పూజలు చేసేవారి శ్రద్ధ ఏ విధమైనది! ఎవరు ఏవిధంగా యజ్ఞాలు, దానాలు చేస్తారు!

మోక్షసన్యాస యోగము:

కనుక అన్ని సంశయములను పరిత్యజించి, తనయందే మనస్సు నిలిపి యుద్ధము (కర్మ) చేయమని భగవంతుడు ఉపదేశించెను. అర్జునుడు మోహవిరహితుడయ్యెను. యోగేశ్వరుడగు కృష్ణుడు, ధనుర్ధరుడైన పార్ధుడు ఉన్న చోట సంపద, విజయము తప్పక ఉంటాయని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు.

ఇంతటితో మా శబ్ధ పాండిత్యవిశ్లేషణ పూర్తి అయినది! మేము తెలుసుకున్న ఈ జ్ఞానముతో అనుభవపాండిత్యము కోసము యోగసాధన చెయ్యడము ఆరంభించినాము! అంటే మా ప్రారంభ యోగ సాధన “నేను ఎవరిని” అనే ప్రశ్నసాధనతో ప్రారంభమైనది! ఆపై ఏమి జరినదో మీకు తెలియలంటే... మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి!

కపాలమోక్షం - 27- నేను ఎవరిని?

నా జీవితంలోనికి యోగ మిత్రుడైన జిజ్ఞాసి అనే వ్యక్తి ప్రవేశించినాడని మీకు తెలుసు కదా! వాడు అడిగిన క్షణాలలో జాతకం చెప్పేసరికి… నాలో ఏదో తెలియని మహత్తరమైన శక్తి ఉన్నదని గ్రహించి… చిరునవ్వుతో “స్వామి! నేను ఎవరిని?” అని ప్రశ్నించాడు! నేను వెంటనే యధాలాపంగా “నీవు ఎవరో నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది… మిత్రమా” అన్నాను! దానికి అతను వెంటనే “అలా కాదు స్వామి! ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే యోగ సాధన పరిసమాప్తి అవుతుంది” అన్నాడు! నాకు చాలా ఆశ్చర్యం వేసింది! ఏమిటి “నేను ఎవరిని” అని తెలుసుకుంటే యోగసాధన అయిపోతుందా! అదేమన్నా బ్రహ్మవిద్యా తెలుసుకోవడానికి! నా బొందా, నా బూడిద! ఇది ఒక ప్రశ్న… దానికి నేను సమాధానం చెప్పాలా అనుకుంటూ… నేను ఫలానా వ్యక్తిని అన్నాను! దానికి అతను వెంటనే “నువ్వు ఎవరు” అని అడగటము లేదు! నేను అనేది ఏమిటి అని అడుగుతున్నాను! వెంటనే నేను “ఫలానా తల్లిదండ్రులు పుట్టిన వాడిని” అన్నాను! దానికి అతను “నువ్వు ఎవరికి పుట్టినావు అని అడగటం లేదు” అన్నాడు! దీనమ్మ జీవితం అనుకుంటూ… “నేను ఫలానా చదువుకున్న వ్యక్తిని” అన్నాను! నువ్వు “చదువుతున్నావా లేదా ఏమి చదువుతున్నావు అడగటం లేదు” అన్నాడు! నేను ఎవరిని అని చెప్పకుండా… కేవలం నేను అనేది చేసే పనులు… నేను ఏర్పడిన వ్యక్తుల గురించి మాత్రమే చెబుతున్నానని నాకు అర్థం అయింది! వామ్మో ఇది చిన్న ప్రశ్న కాదు చిక్కు ప్రశ్న లాగా ఉంది! వెంటనే అతనితో “అయితే దీనికి ఎవరైనా సమాధానం చెప్పినారా?” అని అడిగాను!

దానికి అతను అరుణాచలక్షేత్ర వాసి మౌనయోగి అయిన రమణ మహర్షి వారి “నేను ఎవరిని” పుస్తకం చేతిలో ఉంచి ఆయన ఈ ఒక ప్రశ్నకు సమాధానం వెతుక్కు ని పునర్జన్మ రహితమైన ముక్తిపధమును చేరుకున్నాడు” అని చెప్పి వెళ్లిపోయాడు! ఇది యే నా తొలి ఆధ్యాత్మిక సాధన గ్రంథం! చదవడం ఆరంభించాను! అయితే ఇది ఒక పట్టాన అర్థం కాలేదు! అర్ధమై అర్థం కానట్లుగా అనిపించింది! ఆ తరువాత కొన్ని రోజులకు జిజ్ఞాసి మళ్లీ నా దగ్గరికి వచ్చి “స్వామి! ఇప్పటికైనా నేను ఎవరిని తెలుసుకున్నారా” అన్నాడు! నేను వెంటనే “ఏమిటి తెలుసుకునేది నా బొంద! చిన్న ప్రశ్న అని చెప్పి జీవితానికి కట్టిపడేసే ముడి ప్రశ్న వేసినావు! నువ్వు ఇచ్చిన గ్రంథము చదివితే… అది అర్థమై అర్థం కానట్లుగా ఉంది! ఆయనేమో నేను ఎవర్ని అనుకోవద్దని… నేను గురించి తెలుసుకోవాలని అంటున్నారు! ఎలా తెలుసుకోవాలో మరింత వివరంగా చెప్పలేదు! అతను వెంటనే “ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే… అదే తెలుస్తుంది కదా! నేను అనే ప్రశ్న ఎక్కడ ఉద్భవించినదో … అదే ఎక్కడ పుట్టినది…. అసలు ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారో… మూలం తెలుసుకుంటే సరిపోతుంది కదా”… అని జిజ్ఞాసి నాతో అన్నాడు! అవును కదా ఇది కూడా నిజమే అనిపించింది! దానితో కొన్ని నెలల పాటు నేను ఎవరిని అనుకుంటూ… మేమిద్దరం విచారణ చేసుకుంటూ…. ప్రశ్నలు వేసుకుంటే… అది కాదు ఇది…. ఇది కాదు అని అనుకుంటున్నాము! కానీ అది అంతుచిక్కలేదు! ఎక్కడా కూడా ప్రశ్నలు ఆగటంలేదు! సమాధానాలు ఆగటంలేదు! ప్రశ్న లేని సమాధానం… సమాధానం లేని ప్రశ్న కి వెళ్లాలని మా తాపత్రయం! అప్పుడే కదా ప్రశ్నించేది ఎవరు అనేది తెలుస్తుంది! అది తెలిస్తే నేను అనేది తెలుస్తుంది కదా! కానీ అది మేము అనుకున్న అంత తేలికైన విషయం కాదని మా ఇద్దరికీ కొన్ని నెలల తర్వాత అర్థమయింది! ఈ ప్రశ్నకి నిజమైన అర్థవంతమైన సంతృప్తికరమైన సమాధానం దొరికే సరికి… మా జీవితం అనంతలోకాలకు పరిప్రశ్న లాగా మిగిలిపోయి వెళ్లిపోతుందని గ్రహించి…. యోగ సాధన ఇలా కాదనుకుని నేను ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ కర్మ- భక్తి- జ్ఞాన- ధ్యాన-కుండలిని మార్గంలో మొదటిది అయిన కర్మ మార్గం లోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము! ఇకపై ఏమి జరిగిందో మీకు తెలియాలంటే … మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

నేను అనేది తెలుసుకోవడం ఎలా అని భగవాన్ శ్రీ రమణ మహర్షి మాటల్లోనే విందాం! పరమాత్మ…. బింబం అయితే నువ్వు ఆయన ప్రతిబింబమని గుర్తుంచుకో! నువ్వు పక్కలకు చూడటం మాని… బ్రహ్మం అయిన పరమాత్మ వైపు చూస్తే…. నీ వైపు చూసినట్లు కదా! బ్రహ్మం వైపు చూస్తేనే తన్నుతాను చూసుకోవడం, చూడటం జరుగుతుంది కదా! అలా చూస్తే…. ఏం తెలుస్తుంది అనుకున్నప్పుడు…. బ్రహ్మమనగా పరమాత్మ ఎప్పుడు నీవైపే చూస్తున్నట్లుగా తెలిసి వస్తుంది! పరమాత్మ అనుగ్రహం నిరంతరం నీ మీద ప్రసరిస్తూనే ఉందని గ్రహింపు వస్తుంది! నువ్వు ఆయన ప్రతిరూపమని… ఆయన లేకపోతే నువ్వు ఉనికి లేదని తెలుసు కుంటావు! అంటే నేను అనేది లేదని గ్రహిస్తావు! అద్ధము ఉన్నంతసేపే కదా మనకి బింబము మరియు ప్రతిబింబం దర్శనాలు కనబడేది! అద్ధమే లేకపోతే ఈ రెండు దర్శనాలు ఉండవు కదా! అద్ధము అంటే మన మనస్సు! ఇదే మహామాయ అన్నమాట! మన అంత: కరణమైన మన మనస్సు మాయం అవితే మాయ మాయం అవుతుంది! తద్వారా బింబం బింబము గానే మిగిలిపోతుంది! బింబం … ప్రతిబింబం అనే భావం నాశనమవుతుంది! ప్రతిబింబం తన ఉనికి బింబం అని అనుకోవడం… తన చూపు బింబము అని అనుకోవడం అనేది ఉండదు! బింబము బింబముగానే ఉన్నప్పుడు ప్రతిబింబము మాట అనేది ఉండదు కదా! బింబము బింబముగానే ఉన్నది! కానీ మన మనస్సు చేసే మాయ వలన బింబము కాస్త ప్రతిబింబముగా ఉన్నదని భ్రమ, భ్రాంతి కలిగిస్తుంది! మన మనస్సుకున్న మాయ, మోహ, వ్యామోహలు తొలిగిపోతే బింబము బింబమే గదా! బింబము బింబముగా ఉండటమే స్వరూపస్థితి కదా! పరమాత్మ పరమాత్మ గా ఉండటమే స్వస్థితి! కానీ మనస్సుకున్న మాయ వలన పరమాత్మ కాస్త జీవాత్మగా కనబడుతున్నాడు! పరమాత్మ పరమాత్మగా ఎరుక అవుతుందో వారిని తెలుసుకోవడం అవుతుంది! నీవే పరమాత్మని ఎరిగినవాడు నీవే దేవుడు అని…. అహం బ్రహ్మస్మి స్థితి … ఇదియే మనో రహిత స్థితి! మనస్సు లేని స్థితి! శూన్యస్థితి! స్వస్థితి! నీ సహజ స్థితి అని గ్రహించు! సాధించు! మనస్సు అనే మాయ అద్ధమును తొలగించు! బింబము మరియు ప్రతిబింబము భావాలను తొలగించు! ఉన్నది ఒకటే బింబము! అగుపించేది బింబమేనని గ్రహించు! నీవే ఆ బింబమని తెలుసుకో! తెలుసుకో నువ్వే ప్రతిబింబం కాదని గ్రహించి… నేను అనేది పరమాత్మ అని గ్రహించు!

గమనిక: 

కొన్ని నెలల తర్వాత "నేను ఎవరిని?" అనే ప్రశ్న ఎంత సరళంగా అనిపిస్తుందో సరిగ్గా దానిని తెలుసుకోకపోతే అంత కష్టమైనది మరొకటి ఉండదని నా అభిప్రాయం! కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు నాకు స్ఫురణ భావాలు కలిగి నాయి! మనలో రెండు నేను లు ఉంటాయి! ఒకటి నేను! రెండోది నేను కానీ నేను! ఇందులో మొదటి నేను అనేది అహంకారపూరితమైన నాది ,నీది, మనది అనే భావన కలిగించే మనస్సు అని… ఇది మిథ్యనేను అని గ్రహించాను! ఇక రెండవది అయిన నేను కానీ నేను అనేది ఆత్మ! ఇదియే అసలు నేను అని గ్రహించాను! మొదటిది అయిన మిథ్యనేను అనేది అంటే అసలు నేను విస్మరించి మోహ, వ్యామోహ, ఆశ,భయం,ఆనందం,ఆలోచన, సంకల్ప, స్పందన అనే నానా రకాల బంధనాల్లో చిక్కుకుంటుందని గ్రహించాను! అసలు ఈ మిథ్యనేను అయినా మనస్సు ఎక్కడ ఉన్నది? ఎక్కడ నుండి పుడుతుంది అని తెలుసుకోవడమే రమణ మహర్షి చెప్పిన “నేను ఎవరిని” అనే ప్రశ్నకు సమాధానం అని గ్రహించాను! నేనెవర్ని ప్రశ్నకు సమాధానం వెతకడం అని గ్రహించాను! అంటే ఎల్లప్పుడూ నేనెవరిని అని ప్రశ్నించుకుంటూ… ఆత్మ విచారణ చేసుకుంటూ పోతే… ధ్యానములో ఎడతెరిపి లేకుండా ప్రశ్నించుకుంటూ పోతే…. దీనికి తగ్గ సమాధానం కోసం మన లోపల అన్వేషణ అనగా ఆత్మ విచారణ చేసుకుంటూ పోతే… నేను అనేది మనస్సు లోపలకు వెళుతూ…. క్రమేపీ లోపలకు వెళుతూ…. స్ధిరమై ఏకాగ్రత వస్తుంది! దాని పుట్టుక స్థానానికి చేరుతుందని…. అనగా మన సాధన పరిసమాప్తి స్ధానమైన హృదయచక్రానికి చేరుతుంది!అంటే నేను ప్రయాణము మూలాధార చక్రముతో బయలుదేరి హృదయచక్రము వద్ద ఆగిపోతుందని---అదియే మన ఆత్మ స్ధానమని … అప్పుడే నేను కానీ నేను అనేది ఎవరో సాధకుడికి అనుభవ అనుభూతి కలుగుతుందని…. దీనినే యోగ శాస్త్ర గ్రంథాలు బ్రహ్మ లేదా ఆత్మసాక్షాత్కార మని చెప్పినాయని అని నేను గ్రహించాను! అంటే మనస్సు లేని స్థితి పొందితే… నేను అనేది లేదని… ఇదంతా మిధ్య అని… ఉప్పు బొమ్మను నీటిలో వేస్తే ….అదే ఎలా అయితే నీటిలో కరిగి పోయి బొమ్మ అనేది ఉండదో… అలాగే నేనెవరు అని నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే…. మొదట ఫలానా ఆలోచన అనే సమాధానం వస్తుంది! ఈ ఆలోచన కలిగినది ఎవరికీ అని ప్రశ్నించుకుంటే… నాకు అనే సమాధానం వస్తుంది! ఇది ఎవరికి వచ్చింది అంటే…. నా మనస్సుకి అనే సమాధానం వస్తుంది! మరి మనస్సు అంటే ఏమిటి అని అడిగితే…. అంటే ఇలా ప్రతిసారి నేను ఎవరిని అని విచారణ చేస్తూ ఉంటే… ఏదో ఆలోచన సమాధానాలు వస్తాయి! వీటినన్నిటినీ మనము ఇది కాదు అనుకుంటూ ఖండించుకుంటూ పోతే… చివరికి మనకి ఆత్మ అనే సమాధానం వస్తుంది! అప్పుడు మనకి అలవికాని ప్రశాంతత ఆనంద స్థితి అనుభవించటం జరుగుతుంది!

ఇక్కడ ఈ ఆత్మ మాయలో పడకుండ ఉండగలిగి… అప్పుడు ఆగకుండా… ఈ ఆనందం ఎవరికి కలిగింది అని ప్రశ్నించ గల్గితే… తనకి తన ఆత్మకి భిన్నమైనది ఏమీ లేదని…. స్వానుభవ అనుభూతి పొందే దాకా నేను ఎవరిని అనే ప్రశ్నను కొనసాగించవలసి ఉంటుంది! దీని గురించి బాగా తెలియాలి అంటే… రమణ మహర్షి రమణాశ్రమ ప్రచురణ గ్రంధమైన "నీ సహజ స్ధితి ఉండు" చదివితే నేను ఎవరిని అను ప్రశ్నసాధనలో వచ్చే అన్ని రకాల సాధన సందేహలకి శ్రీ రమణామహర్షి వారు ఇచ్చిన సమాధానాలుంటాయి! చదవండి! ఈ సాధన లో వచ్చే అన్ని రకాల ధర్మ సందేహాలకు సమాధానాలు అందులో దొరుకుతాయి!

కపాలమోక్షం - 28- స్త్రీలు మాయలా?

(మా కర్మమార్గం)

నేను ఎవరిని అనే ప్రశ్నసాధన దెబ్బకి… మేమిద్దరం యోగ సాధన కోసం కర్మ మార్గం లోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము! నిష్కామ కర్మ అనగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మ విధి విధానము ద్వారా మాకు తోచిన సమాజ సేవ చేయాలని…. మానవసేవే మాధవ సేవ మార్గం లోనికి అడుగు పెట్టి …ఎవరో ఒక అమెరికన్ ఇండియన్ వ్యక్తి పేద ప్రజలకు ఉచిత సేవ తో ఆసుపత్రి పెట్టి సేవలు చేస్తున్నారని…. మా ఊరికి దగ్గర్లో ఉన్న చోటనే ఇది ఉందని తెలుసుకుని… ఆ ఊరి ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరడం జరిగింది! నా తొలి జీతం ఎంతో తెలుసా 325 రూపాయలు! ఇంతవరకు బాగానే ఉంది! నేను చేస్తున్న గాయత్రీ ఉపాసన వలన నాలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి….. నా చుట్టూ ఉండే ఆసుపత్రి నర్సులను ఆకర్షించటం మొదలైంది!

మొదటిలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు! ఎందుకంటే నా జీవితంలో జరిగిన తొలి ప్రేమలో అనుభవాలకి…. ఆడవాళ్లకు దూరంగా ఉన్నాను! వారిని ఎంత దూరంగా ఉంచినను…. వారికి తెలియకుండా వారు నా దగ్గరికి… ఏదో కావాలని మాటలు కలపడం మొదలుపెట్టినారు! ఒకేసారి సుమారుగా నలుగురు ఐదుగురు నర్సులు నా చుట్టూ చేరి… ఏవో కబుర్లు చెబుతూ… ఆసుపత్రులు పనులు చేసుకుంటూ ఉండే వాళ్ళం! మాటలు పెరిగితే స్నేహాలు పెరుగుతాయి కదా! స్నేహాలు పెరిగితే ప్రేమ భావాలు కూడా పెరుగుతాయి కదా! వాళ్ళలో కొంతమంది నా మీద ఆశలు పెట్టుకోవడం ప్రారంభించారు! ఆశలు పెట్టుకోవడం ఆరంభించినారని తెలిసి నాకేమో బుర్ర తిరిగేది! ఇక్కడేమో నిష్కామ కర్మ చేయాలని… ఆసుపత్రికి చేరితే …. ఈ నర్సుల వలనే ప్రేమ పాఠాలు, కామ పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది! తాటి చెట్టు కింద పాలు తాగుతున్నాను అంటే ఎవరు నమ్మరు కదా! ఖచ్చితంగా నువ్వు కల్లు తాగుతున్నా వు అని… నర్సులకి నాకు మధ్య స్నేహభావాలున్నప్పటికి… కొంతమంది నమ్మక మామధ్య ఇంకా ఏదో ఉన్నదని అంటూ ఏవో లేని పోని ప్రచారాలు చేయడం మొదలు పెట్టి నారు! అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో నేను ఉండగా మళ్లీ నా దగ్గరికి జిజ్ఞాసి వచ్చినాడు! విషయం తెలుసుకున్నాడు! వాడేమో నిష్కామ కర్మ కోసం ఉచితంగా ఏవో ఎడ్యుకేషన్ సిడిలు తయారు చేసి…. పేద విద్యార్థులకు ఉచితంగా పంచుతున్నాడని.... కాని కొంతమంది కంపెనీలు ఇలా ఉచితంగా పంచితే మేము నష్టపోతామని వీడిని బెదించడము చేస్తున్నారని తెలుసుకున్నాను! వీడి పని బాగుంది అనుకున్నాను! ఇంతలో వాడు రామకృష్ణపరమహంస జీవిత చరిత్ర పుస్తకం నా చేతిలో పెట్టి…. విషయం ఏమిటో తెలుస్తుంది అన్నాడు! వెంటనే చదవడము మొదలు పెట్టినాను! అప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే… యోగసాధనకు స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము ఆటంకాలుగా నిలుస్తాయని తెలుసుకున్నాను! వామ్మో! అంటే సాధనకి అనగా పురుష సాధకునికి స్త్రీలు…. అలాగే స్త్రీ సాధకు రాలికి పురుషులు మహా మాయగా నిలుస్తారని తెలుసుకున్నాను! ఇది ఎలా నిజమో నాకైతే అర్థం కాలేదు! స్త్రీలు మాయలు అయితే బ్రహ్మ దేవుడు ఎందుకు ఇంత అందంగా వీరిని కష్టపడి సృష్టిస్తాడు! అది నిజము కాదు అనుకుని నేను పప్పులో కాలు వేశాను! నర్సులతో స్నేహాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాను! అందులో ఒకటి కాలు కాల్చుకుని నా మీద ఎంత ప్రేమ ఉన్నదో చూపించేసరికి …. నా బుర్ర తిరిగినది! నిజం చెప్పాలి… ఎవరైనా ప్రేమలో లేదా స్నేహంలో ఉంటే…. అది ఒక్కటే వారికి కనపడుతుంది… మరొకటి ఏదీ కూడా గుర్తుకు రాదు! నేను కూడా వీరందరి నర్సుల స్నేహములో ఉన్నప్పుడు… నాకు దైవపూజలు గుర్తుకు రాలేదు! ప్రతి రోజూ చేసుకునే గాయత్రి మంత్రం డుమ్మా కొట్టే వాడిని! వాయిదాలు వేసే వాడిని! ఎప్పుడూ వారి కోసం ఎదురుచూపులు! ఆసుపత్రికి రోగులు ఎవరూ రాకుండా ఉంటే బాగుండును అని దైవ ప్రార్థనలుమాత్రం ఉండేవి! ఎందుకంటే రోగులు లేకపోతే నర్సులు ఖాళీగా ఉంటారు కదా! అప్పుడు ఎక్కడాలేని బోలెడు విషయాలు, బుంగ మూతులు, బండ బూతులు, కవ్వింపులు ఇలా జరుగుతూ ఉండేవి! నాతో పాటుగా మరి కొంతమంది పురుషులు కూడా ఈ నర్సులు కవ్వింపులు మాటల కోసం పడి చచ్చే వారు! రాను రాను వీరి జీవితమే నా జీవితంగా మారిపోయింది! నా మంత్ర సాధన గంగలో కలిసిపోయింది!

ఇంతలో ఒక రోజు అనుకోకుండా ఒక రోగి తన చేతికి లోతైన గాయం అయిందని…. మిట్టమధ్యాహ్నం వచ్చినాడు! గాయం చూస్తే చాలా లోతుగా ఉంది! ఖచ్చితంగా కుట్లు వేసే పరిస్థితి! కానీ అక్కడ ఉన్న నర్సుకు ఎలా కుట్లు వేయాలో తెలియదు! డాక్టర్ పైన ఉన్న ఆయన గదిలో నిద్రపోతున్నారు! ఏమి చెయ్యాలో మా ఇద్దరికీ పాలుపోలేదు! వెంటనే నర్సు ను… డాక్టర్ దగ్గరికి పంపితే… “ఇప్పుడు చూడను! చూసే సమయం దాటిపోయింది! సాయంత్రం రమ్మను! లేదంటే వేరే ఆస్పత్రికి వెళ్ళమని” చెప్పినాడు! ఇదే విషయం ఆ రోగికి చెబితే… “బాబు! వేరే ఆస్పత్రికి వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా! కనీసం రెండు గంటలైనా పడుతుంది కదా! ఈ లోపల ఈ గాయం నుండి రక్తం పోకుండా ఉంటుందా?” అన్నాడు! అది నిజమే అనిపిస్తుంది! రోగి రానురాను నీరసం పడిపోతున్నాడు! ఎన్ని కట్టులు వేసిన రక్తం ఆగటంలేదు! డాక్టర్ పై నుండి కిందికి రావటం లేదు! ఏమి చెయ్యాలో మా ఇద్దరికీ పాలుపోవడం లేదు! ఇంతలో ఆమె వెంటనే తనకు తెలిసిన సీనియర్ నర్సుకి ఫోన్ చేసి కుట్లు ఎలా వేయాలో… తెలుసుకుంటూ…. చివరికి ఆ రోగికి కుట్లు వేసినది! నాకు ఆనందమేసింది! ఈమె మీద కృతజ్ఞతాభావం కలిగినది! డాక్టర్ మీద అసహ్యం కలిగింది! వైద్యో నారాయణ హరి అంటారు కదా! రోగి వచ్చినప్పుడు రోగికి సేవ చేయకుండా…. ఆ సమయానికి రా… ఈ సమయానికి రా…. చెప్పినాడని నాకు విపరీతమైన కోపం వచ్చింది! సాయంత్రం ఇదే విషయాన్ని డాక్టర్ తో అన్నాను! దానికి ఆయన అవమానపడి “ఒక ఎమ్మెస్ డాక్టర్ తో మాట్లాడుతున్నావు అని తెలుసుకో! నీ అంతు చూస్తాను! నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను” అంటూ… ఆసుపత్రి చైర్మన్ దగ్గరికి వెళ్లి “అసలు విషయం చెప్పకుండా దాచి పెట్టి … మా ఇద్దరి మీద లేనిపోని విషయాలు” చెప్పినాడు! దాంతో ఆయన అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టడం… అందులో నాదే తప్పు ఉన్నదని…. అనుభవం ఉన్న డాక్టరిని గౌరవించకుండా... అనుభవములేని నర్సును ఎందుకు గౌరవిస్తున్నావో… మాకు తెలుసులే అని వ్యంగ్యముగా...అదో టైపుగా మాట్లాడేసరికి … అక్కడ ఉండలేక, ఇమడలేక నిష్కామ సేవ చేయాలని అనుకుంటే… అది కాస్త అహం మీద దెబ్బ తగిలినట్లుగా అనిపించి… ఉద్యోగానికి రాజీనామా చేసి…. మా ఊరికి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాను!

మా ఊరి బస్సు ఎక్కిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టినాను! ఆమె మీద నాకున్న స్నేహ మాయ వలన… ఆమె మీద కృతజ్ఞతా భావం ఏర్పడింది! దానితో ఆ రోగికి కుట్లు వేయడానికి కావలసిన వస్తువులు నేను ఇవ్వటం జరిగినది! అది కూడా డాక్టర్ అనుమతి లేకుండా ఇవ్వటం జరిగినది! అది తప్పే కదా! అనుభవం లేని నర్సు చేతిలో ఒక రోగి ప్రాణాలు ఉంచటం ప్రమాదమే కదా! నా అదృష్టం బాగుండి…. అది చిన్న గాయం కావడం వలన… అది తెలిసి తెలియకుండానే వేసిన కుట్లు సరిగ్గా పడటం వలన బాగానే ఉంది ! ఒకవేళ కుట్లు తప్పు పడితే… ఆ రోగికి చెయ్యి తీయ్యవలసిన పరిస్థితి వస్తే… వామ్మో ఊహించటమే చాలా కష్టంగా ఉంది! రామకృష్ణ పరమహంస చెప్పినది నిజమే కదా! సాధనలో ప్రతి పురుషుడికి ఒక స్త్రీ మూర్తి అలాగే ప్రతి స్త్రీ మూర్తి సాధకులకు పురుషుడు తప్పకుండా మాయ అవుతాడు అని నేను గ్రహించాను! ఈ మాయలో ఉన్నంతవరకు మన మనస్సు వేరే వాటి గురించి ఆలోచించదు! దైవాన్ని గురించి పట్టించుకోదు! సాధన గురించి అసలు పట్టించుకోదు! దానితో నాకు ప్రేమ వివాహం అయ్యే దాకా…. మరో స్త్రీ మూర్తిని చూడరాదని, చనువు ఇవ్వకూడదని, స్నేహము చేయరాదని, ఏకపత్నిధర్మముతో గృహస్థ ఆశ్రమ జీవితం గడపాలని… సంకల్పంతో నిశ్చయించుకుని ఆనందంగా మా ఊరికి బయలుదేరినాను!

ఇంతలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకోసం వస్తున్న జిజ్ఞాసి కనిపించగానే…. బస్సు ఆపించి వారిని ఎక్కించుకొని… మేము మా ఊరికి బయలుదేరినాను! అన్ని విషయాలు వాడితో చెప్పినాను! వాడు ఏమీమాట్లాడలేదు! ఆ తర్వాత వాడితో నేను “మిత్రమా… నువ్వు ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదా?” అన్నాను! దానికి వాడు “నేను అందరినీ ప్రేమిస్తాను! నా ప్రేమను పంచుకునే… తట్టుకునే వారే లేరు! ఎందుకంటే నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను! నా ప్రేమ ఒకరితో, ఒకరికోసం ఉండదు! ఆగదు! నేను అమ్మాయిని ప్రేమిస్తాను! అబ్బాయిని ప్రేమిస్తున్నాను! కుక్కని ప్రేమిస్తాను! కుర్చీని ప్రేమిస్తాను! నా ప్రేమలో లింగ భేదాలు, వస్తువు భేదాలు ఉండవు” అన్నాడు! “వామ్మో కొంపతీసి వీడు తేడా గాడు కాదు కదా…. అందర్నీ ప్రేమిస్తాం అంటాడు! పైగా అమ్మాయిలని కాకుండా అబ్బాయిలని కూడా ప్రేమిస్తాను అంటున్నాడు! వామ్మో! వీడికి స్వాతి వారపత్రిక లోని మధ్య పేజీ ఖచ్చితంగా చదివించాలి! లేదంటే వీడు కాస్త తేడాగా మారిపోయే ప్రమాదం ఉంది!” అనుకుని వాడితో “మిత్రమా! నువ్వు ఒకసారి ఎప్పుడైనా స్వాతి వారపత్రిక లోని మధ్యపేజీ చదువు” అన్నాను! దానికి వాడు వెంటనే “ఏముంటుంది అందులో! నేను ప్రతివారం చదువుతూ ఉంటాను! అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా! నాకు ఇది ఫలానా విషయం ఇది తెలుసుకోవాలి… ఫలానా విషయం తెలుసుకోకూడదు అని ఆలోచన ఉండదు! వాత్సాయన కామ శాస్త్రము చదివాను అలాగే వాల్మీకి రామాయణము చదివాను! వ్యాసుడు భారతం చదివాను! దేవదాసు సినిమా చూశాను! వారంతా వారి వారి విషయ పరిజ్ఞానము పొంది పరిపూర్ణు లైనారు! జయం పొందినారు! నీకు అవి కామ పాఠాలుగా, గుణపాఠాలుగా అని విడిగా కనపడతాయి! అన్నాడు! నేనయితే వెంటనే అతనితో “ఎప్పుడైనా ఒక స్త్రీమూర్తిని నగ్నంగా చూశావా?” అన్నాను! దానికి వాడు వెంటనే “నేను రోజూ చూస్తూనే ఉంటాను! నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు! నువ్వు నగ్నత్వం అనేది కేవలం స్త్రీ మూర్తి లోనేచూస్తున్నావు! నేను ప్రతి స్త్రీ జాతిలోనూ అనగా కుక్కలలోను, పిల్లిలలోను, ఆవులలోను, గెదేలలోను,మేకలోను,గొర్రెలోను నగ్నత్వం అనేది చూస్తున్నాను!” అన్నాడు! వామ్మో! వీడు ఏమిటి ఇంత తేడా గా మాట్లాడుతున్నాడు అనుకుని…. “మరీ చెపుతావు! కుక్క పిల్ల కి …ఆడపిల్ల కి తేడా ఉండదా”? అన్నాను! దానికి అతను వెంటనే “కుక్కపిల్ల బట్టలు వేసుకోదు! ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంది! అంతే తేడా! నా దృష్టిలో ఆడపిల్ల బట్టలు విప్పితే… నాకు ఆ కుక్క లో కనిపించే నగ్నత్వం ఆడపిల్ల లో కనపడుతుంది! నాకు తేడా కనిపించదు! రెండు కూడా స్త్రీ జాతి మూర్తులే కదా… అన్ని రకాల స్త్రీ జాతులలో నగ్నత్వం అనేది ఒకటే కదా!” అన్నాడు! వామ్మో! వీడు మాటలకి నా బుర్ర వేడెక్కింది! వాడికి ఏమి సమాధానం చెప్పి ఒప్పించాలో అర్థంకాక కళ్ళు మూసుకుని మౌనంగా నిద్రలోకి జారుకున్నాను! ఇక దానితో యోగసాధనలో కర్మ మార్గం…. ఇద్దరికి సరిపడదని… మేము భక్తి మార్గంలో అడుగు పెట్టినాము! ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే…ఏమి చెయ్యాలో మీకు తెలుసు గదా!

గమనిక: కొన్ని సంవత్సరాలకి జిజ్ఞాసి చెప్పిన నగ్నత్వం అనేది స్త్రీ పురుష జననాంగాలకి అతీతమైన దిగంబర తత్వం అని గ్రహించాను! అనగా దిక్కులనే వస్త్రాలు ధరించిన వారిని దిగంబరులు అంటారు! ఈ విశ్వంలో ప్రతి జీవి కూడా ఇలాంటి దిగంబర తత్వంలో ఉండేటట్లుగా ప్రకృతిమాత ఏర్పరచినదని గ్రహించాను! నా తప్పు తెలుసుకున్నాను!

షిరిడి సాయిబాబా అన్నట్లుగా “ప్రతి స్త్రీ మూర్తి లో బాహ్య సౌందర్యం చూడటము కన్నా దీనిని సృష్టించిన అంతర్యామి ఉండే అంతర సౌందర్యమును ఆ స్త్రీ మూర్తి లో చూడగలిగితే…. వారికి ఆ స్త్రీ మూర్తి బంధనము కాదని ముక్తికాంత అవుతుందని” చెప్పడం జరిగింది! నిజంగా ఎవరైనా ఒక స్త్రీ/పురుష మూర్తిని మనస్ఫూర్తిగా నిజ మైన పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమిస్తే వారికి మిగిలేది అసలుసిసలైన పరిపూర్ణ ఆనంద స్థితి! కానీ మనమంతా శరీర వాంఛతోను, అవసర ప్రేమతోను, ఆర్థిక ప్రేమతోను, ప్రేమించుకోవడం వలన…పైగా స్త్రీమూర్తులను సుఖము ఇచ్చే యంత్రాలుగాను, సంతానమును ఇచ్చే మరయంత్రాలుగాను అలాగే పురుషులను సంపాదన యంత్రాలుగాను చూడటము వలన … క్షణిక సుఖ ప్రాప్తి… ప్రేమగా పంచుకుంటున్నామని నేను గ్రహించాను! అదికాకుండా స్త్రీ/పురుష మాయలో పడితే… తొలిప్రేమ జ్ఞాపకాలు మర్చిపోవటానికి తుదిశ్వాస పడితే...తొలి తొడపరిచయ అనుభవము మర్చిపోవటానికి తొంభై ఏళ్ళు పడుతుందని నా ప్రగాఢ విశ్వాసము! దానితో మా జిజ్ఞాసి కాస్త ఈ విషయములో అరుణాచల నివాసియైన భగవాన్ రమణామహర్షి వారిని ఆదర్శముగా తీసుకొని సాధనకి స్త్రీమూర్తి బంధనంగా, ఆటంకంగా ఏర్పడుతుందని గ్రహించి …. ఆజన్మ బ్రహ్మచారిగా సాధన కొనసాగించాడు! నేనేమో ఈ విషయంలో రామకృష్ణ పరమహంసను స్ఫూర్తిగా తీసుకుని …. ఒక స్త్రీమూర్తిని వివాహం చేసుకుని నాతో పాటుగా ఆమె కూడా పునర్జన్మ లేని స్థితి కలిగించాలని గృహస్థాశ్రమం లోనికి అడుగు పెట్టడం జరిగింది!

అందుకే తాంత్రిక విధానములో స్త్రీ నగ్నత్వాని చేధించటానికి కామాఖ్య శక్తిపీఠము వద్ద అఘోరాలు,కాపాలుకులు,భైరవులు ఇప్పుడికి యోనిపూజలు(స్త్రీ సాధక గురువు యొక్క యోని) చేస్తూంటారు!తద్వారా నగ్నత్వము నుండి కామత్వమును చేధించి దిగంబరత్వమును అనగా లింగభేదము తెలియని అతీతస్ధితిని పొందడము జరుగుతుంది!అదే స్త్రీ యోగులు అయితే లింగరాధన (పురుష సాధక గురువు పురుషాంగము) చేసి తమకున్న కామత్వమును జయించి దిగంబరులు అవుతారు!ఇది అంతా తేలికయైన సాధన స్ధితి గాదని గ్రహించండి! అనగా పురుష యోగులైతే ఒక నగ్న స్త్రీ శవముతో వరుసగా 41 రోజులపాటు రోజుకి 36 సార్లు సంయోగ ప్రక్రియ చేయాలి! ఆ తర్వాతనే వీరు ఒక సాధక స్త్రీని గురువుగా ఎంచుకొని కామాఖ్య పీఠము వద్ద తనకి దిగంబరతత్వసిద్ధి వచ్చేవరకు ఈమె యోనిపూజ చేస్తూండాలి! దీనికి మించిన మహా నరకము మరొకటి ఉండదని నా అభిప్రాయము!

నిజానికి కర్మ మార్గ సాధనము అనేది కర్మ చక్రం మీద ఆధారపడి ఉంటుంది! ఇది కర్మ మీద ఆధారపడి పనిచేస్తుంది! అసలు కర్మ అంటే మదికి పుట్టినది మొదలు….. చచ్చేదాకా చేసే ఏదైనా పనిని కర్మ అవుతుందని నేను గ్రహించాను! కాకపోతే వీటిలో మనకు మేలు చేసే సుకర్మలు, మనకి కీడు చేసే దుష్కర్మలు అనే రెండు రకాల కర్మలు ఉన్నాయని గ్రహించాను! ఈ రెండు కర్మఫలం అనుభవించటానికి జీవుడు కాస్త కర్మ-జన్మ ఎత్తుతాడని… ఒకవేళ వీటిలో ఏదైనా కర్మ ఫలితం మిగిలిపోతే….. నిర్వహించడానికి పునర్జన్మ ఎత్తుతాడని…. ఇట్టి జీవి అనుభవించే కర్మని ప్రారబ్దకర్మ అని అంటారని గ్రహించాను! మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ ప్రారబ్దకర్మ అనుభవిస్తూ… జీవుడు తనకు తెలిసి తెలియక దుష్కర్మలు అనగా స్వార్థము, కోపము, అత్యాశ, కోప స్వభావము, అసూయ, ద్వేషము పగ, ఆవేశము ఇలాంటి వ్యతిరేక భావాలతో చేసే కర్మల కాస్త… అవి మనకి దుష్కర్మలుగా మారతాయని నేను తెలుసుకున్నాను! అలాగే ఇతరులకు హాని చేయకుండా, మంచి ఆలోచన, నిస్వార్ధముగా, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు సుకర్మలు అని అంటారని నేను గ్రహించాను! ఇలా సుకర్మలు, దుష్కర్మలను కలిపి ఆగామి కర్మలు అంటారని నేను తెలుసుకున్నాను! అంటే మనిషి జన్మ పుట్టటానికి కర్మలు అనగా సుకర్మ పుణ్యము 51 శాతం ఉండాలి అలాగే దుష్కర్మ అనగా పాపము 49% మిగిలిపోతే మళ్లీ దేవుడు కాస్త మనిషి ఇక పునర్జన్మ పుడతాడని గరుడ పురాణం చెబుతోంది! అంటే మనకి ఆగామి కర్మలు అలాగే ప్రారబ్ద కర్మలు కలిపితే సంచిత కర్మ గా వ్యవహరించబడుతుంది! అనగా ఈ కర్మ రాశి అంతా కూడా నాశనం అయ్యే దాకా ప్రతి జీవుడు కూడా పునరపి మరణం… పునరపి జననం తో పున:జన్మలు ఎత్తుతూనే ఉంటాడు!

మరి ఇలా పునర్జన్మ లేని స్థితి పొందాలి అంటే మనము ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మఫలాలు ఏనాటివో మనకి తెలియదు! వాటి ఫలితాలు ఏమిటో కూడా మనకి తెలియదు కదా! కాబట్టి మనము ఈ జన్మలో వివేక జ్ఞాన బుద్ధితో… ఏది చెడు కర్మ యో తెలుసుకొని… దానిని చేయకుండా జాగ్రత్తపడాలి! అలాగే భగవద్గీతలో చెప్పినట్లు గా ప్రతి కర్మను అనగా అది సుకర్మ అయినా, దుష్కర్మ అయినా కూడా మన ఇష్టదైవానికి అర్పించి… ప్రతిఫలాపేక్ష లేకుండా ఆశించకుండా… కర్మ ఫలితం ఆశించకుండా…. వచ్చిన దానితో సంతృప్తి చెంది కలిగితే…. అప్పుడు నువ్వు చేసే కర్మలు కాస్త బంధనాలు కాకుండా బంధ విముక్తి పొందుతారు! తామరాకు మీద ఎలా అయితే నీరు నిలవదో…. అలా మీకున్న అన్ని రకాల కర్మలు నాశనమవడం మొదలవుతాయి! అయితే ఈ కర్మలను మన దైవానికి కర్మ సమర్పణ చేయాలి అన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ ఇష్ట దైవ నామమును మూడుసార్లు స్మరించి “ఓ దేవా! సర్వాంతర్యామి! సర్వేశ్వరా! అంతర్యామి! ఈరోజు నేను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా…. కేవలం నీకోసం నేను చేసే కర్మలు లేదా చేసిన కర్మలు యొక్క కర్మ ఫలాలను అన్నిటినీ నీకు మనసా, వాచా, కర్మణా, మనస్పూర్తిగా, సంపూర్ణ శరణాగతితో సమర్పిస్తున్నాను! దయతో వాటిని స్వీకరించి నన్ను వాటి నుంచి కర్మబంధ విముక్తి గావించు! అని మనసారా ప్రార్థిస్తే చాలు! ఆ రోజు మీ ఖాతాలోనికి ఎలాంటి కర్మలు ఉండవు! వచ్చిన కర్మ బంధనాలు ఉండవు! కర్మ విముక్తి పొందటం ఆరంభమవుతుంది!

కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।

మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే।

— సాంఖ్య యోగము-భగవద్గీత

కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం మరియు దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, మరియు జైన మతం. ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.

కర్మ (సంస్కృతం: कर्म - "act, action, performance") అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది.

కర్మ సిద్దాంతము ప్రకారము : పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు.

అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి, చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు, కాని వాటి ప్రతి ఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు. ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా, స్వంతముగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాప పుణ్యాలు వారికి మాత్రమే పరిమితము. తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు.అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు.

కర్మవాదానికి ఉదాహరణలు:-

పునర్జన్మల పై నమ్మకం, స్వర్గ ప్రాప్తి, నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి. ఉదాహరణ: "నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను" అని కొందరు అంటుంటారు.

ఎన్ని విధాలైన కర్మలు:-

· సంచిత కర్మ: కర్మ యొక్క మొత్తం

· ప్రారబ్ధ కర్మ : సంచితం లోనుంచికొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత

· ఆగామి కర్మ : ప్రారబ్దం వల్ల జరిగే పనులను (మంచి-చెడు) లను నావల్లే జరిగాయని అహన్ని పొందడం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు

భగవద్గీతలో కర్మ:

కర్మ బ్రహ్మోద్భవం. ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి. కర్మలను ఆవరించి దోషం ఉంటుంది. కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు. కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలు వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు.

· కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉంది. అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి. కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు. తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి. అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు. గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు ఆ కర్మలలో చిక్కుకోడు. కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా! నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు. కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు. అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి. యోగం వలన కర్మలను వదిలించుకొని, జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిష్ఠుడిని కర్మలు బంధించలేవు.

బౌద్ధంలో కర్మ

కోరికే కర్మ. ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు. కర్మలు వారసత్వంతోనే పుడతారు.

హిందూ మతంలో కర్మకర్మ అంటే సరి అయిన అర్ధం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ చేసే ప్రతి పని కర్మయే. నిద్రించడం, శ్వాసించడం, ధ్యానింనించడం, తపస్సు, మౌనం, భుజించడం, ఉపవసించడం కర్మయే. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేరు. మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది. మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు. హిందూ ధర్మం కర్మ గురించి అనేక విధముల చింతన చేసింది. కర్మ అనేది హింధూ ధర్మంతో అనేక విధముల ముడివడి ఉంటుంది. మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం. మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది. కర్మసిద్ధాంతం ఆత్మతో ముడి పడి ఉంటుంది. హింధూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారం చేసుకుని ఉంటుందని చెప్తుంది. ఆత్మను జీవుడు అని కూడా అంటారు. జీవుడు శరీరంలో ప్రవేశించిన తరువాతే ప్రసవం జరుగుతుంది అని హిందూ మతం చెప్తుంది. కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలిన తరువాత కూడా అతడి వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం, నరకం ద్వారా అనుభవించాలని హిందూ ధర్మం వివరిస్తుంది. పుణ్యం, పాపం నశించే వరకూ ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్య పాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పీపీలికాది అనేక వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది. ప్రళయ కాలంలో కూడా పుణ్య పాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజ రూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది. కాని మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది. కనుక మనిషి కర్మలను ధర్మబద్ధంచేసి సత్కర్మాచరణ చేసి తనను తాను ఉద్దరించుకోవాలన్నదే కర్మ సిద్ధాంతం.

కర్మసన్యాస యోగం

వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవక్తమై అనేక రూపాలలో కర్మసిద్ధంతం ఉన్నా దానిని జనసామాన్యానికి ఎక్కువ ఎరుకపరిచింది భగవద్గీత. భగవద్గీతలో కృష్ణభగవానుడు కర్మసన్యాస యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం, కర్మ యోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు. జీవులు కర్మ చేయకుండుట ఆసంభవం. జీవుడు చేసిన పుణ్య కర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం, సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని. పాప కర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెడతాడని హిందూ ధర్మం వివరించింది. ఆ కర్మలు క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తుంది. పుణ్యలోకాలు, నరకలోకాలలో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెప్తుంది. మనుష్యలోకంలో ప్రాణులకు పాప, పుణ్య, విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరింవి ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాప పుణ్యాలకు అతీతములు. మానవ జన్మ మాత్రమే పాప పుణ్యకర్మలు మనస్సు యొక్క ప్రకోపంతో చేస్తుంటాడు కనుక మానవ జన్మ పాపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాని ఈ కర్మలను నిశ్శేషంగా చేయడం అసంభవం. పాపము, పుణ్యము ఎక్కువ తక్కువగా జీవుడిని వెన్నాడుతూ ఉంటాయి కనుక కర్మసన్యాస యోగం మనిషి యోగం, తపస్సు, ముని వృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మసన్యాసయోగం ఆచరించి పరమాత్మలో కలసి మోక్షం పొందవచ్చని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎలాగంటే కర్మసన్యాస యోగంద్వారా పాపపుణ్యములను నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు. అందువలన ఆత్మ పరమాత్మలో కలిసి పోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘ కాల ప్రయాణాన్ని ముగించ వచ్చని కర్మసన్యాస యోగం వివరిస్తుంది. కర్మసన్యాస యోగం ఆచరిస్తూ ముక్తి పొందవచ్చన్నది సారాంశం.

కర్మయోగం

"ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపు" అని అర్జునుడు అడిగితే శ్రీ కృష్ణుడన్నాడు:"కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది" అని పలికాడు. అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తుంది. ముక్తి లేక మోక్షం అన్నది హిందూ ధర్మ పరమావధి. కర్మపరిత్యాగం చేసి తపోమార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధనా మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు. పుట్టిన ప్రతి జీవి కర్మచేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు " అర్జునా ! ఉత్తముడు ఏకర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు. ఈ లోకంలో నాకు పొంద తగినది కోరతగినదీ ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మార్గం తెలపడానికి కర్మలను ఆచరిస్తున్నాను " అని చెప్పాడు. యజ్ఞము చేయడం అన్నది కర్మ. కాని యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి దాని ద్వారా వర్షమును పొంది. దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞములో దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు. లోక హితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం. కనుక మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది సారాంశం. కర్మ చేయక పోవడం, విద్యుక్త ధర్మాన్ని వదిలి వేయడం పాపంగానే పరిగణించ బడుతుందన్నది హిందూ ధర్మం వివరిస్తుంది.

కర్మ ఫలం

హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలి పోయే సమయంలో పాపపుణ్యాలను, వాసనలను వెంట తీసుకువెడతాడని వివరిస్తుంది. పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో " కర్మచేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కాని కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు " అంటే సత్కర్మ లేక పాప కర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలలో చేసిన పాప పుణ్య కర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తుంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అధిగమించవచ్చని హిందూధర్మం బోధిస్తుంది. అంతేగాక భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తుంది.

కపాలమోక్షం - 29-ఎవరిని పూజించాలి?

(నా భక్తి మార్గం)

కర్మ మార్గం మాకు సరి కాదని తెలుసుకుని అమ్మాయిల కన్నా అమ్మవారు మిన్న అని గ్రహించి మేము అనగా నేను మరియు నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి కూడా విగ్రహరాధన లోనికి అడుగు పెట్టినాము! నిత్యం పూజించే గుడిలోని లింగారాధన కన్నా మా ఇంటిలో మాకు కావలసిన విగ్రహల తెచ్చుకొని పూజించాలని నిర్ణయించుకున్నాము! ఎటూ గుడిలో ఉన్న లింగమూర్తి మాట్లాడడు!కనిపించడు! అందుకని కనీసం మేము తెచ్చుకొని పూజించిన విగ్రహమూర్తి అయినా మాతో మాట్లాడతాయోమోనని ఆశతో భక్తి మార్గం లోనికి ప్రయాణించాము! దీనికి ఒక కారణం ఉన్నది!

రామకృష్ణ పరమహంస కి, నామ దేవుడికి, రామదాసు కి, పోతన కి కబీరుదాసు కి, త్యాగయ్య కి ఇలా పలు మందికి వారి వారి ఇష్టదైవాలు మనిషి రూపేణా మాట్లాడే వారని వారి చరిత్ర లో చదివి… మా విగ్రహలు కూడా మాతో మాట్లాడతా యోమోనని పిచ్చి అమాయక భక్తి భ్రమలో విగ్రహరాధన మార్గమైన భక్తి మార్గం లోనికి అడుగు పెట్టడం జరిగింది! దానితో ఏ విగ్రహలు తీసుకోవాలి, ఎవరిని పూజించాలి అనే సమస్య మా ఇద్దరి మధ్యలో వచ్చినది! నేనేమో ఇన్నాళ్లుగా శివయ్యను లింగమూర్తి గా ఆరాధించిన ఉలకలేదు, పలకలేదు కదా కాబట్టి నేను అమ్మవారిని పూజించాలి అని నిర్ణయించుకున్నాను!

ఎందుకంటే అమ్మవారు ఈ కలియుగంలో కూడా మనుషుల్లాగానే మాట్లాడుతుందని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర అనుభవాల ద్వారా తెలుసుకోవటంతో అమ్మవారిని పూజించాలని నేను నిర్ణయించుకోవడం జరిగినది! కానీ ఏ అమ్మవారిని పూజించాలో అర్థమై చావలేదు! ఇదిలా ఉండగా జిజ్ఞాసి కైతే రామదాసుకి, కబీరుదాసు కి శ్రీ రామ దర్శనం జరిగినదని వారి జీవిత చరిత్రలలో చదివి ఉండటంతో వాడు కాస్త శ్రీరామభక్తుడై నాడు! ఆయన విగ్రహమూర్తి తెచ్చుకుని పూజించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు! కానీ నాకే ఏ అమ్మవారి విగ్రహరాధన చేయాలో అర్థం కాలేదు! నేను చేసే గాయత్రీ మంత్ర దేవత అయిన గాయత్రీ మాత ఎవరికి అంత తేలిగ్గా కనిపించదని తెలుసుకున్నాను! అలాగే బాల దేవత ఎన్నో కఠిన పరీక్షలుపెట్టి… వాటిని దాటిన వారికి మాత్రమే కనపడుతుందని ఈ మంత్రం ఉపాసన చేసిన వారి అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగినది! దాంతో ఎవరిని ఏ అమ్మవారిని పూజించాలో నాకు అర్థమవ్వలేదు!

కొన్ని రోజులకి మహా శివరాత్రి నాడు మేం మా ఊరి పక్కనే ఉన్న గ్రామంలో శివరాత్రి జాతర జరుగుతోందని వెళ్లినాము! అక్కడ ప్రభల ఊరేగింపు,రికార్డింగ్ డ్యాన్స్ లు జరుగుతున్నాయి! చాలా సందడి వాతావరణం లాగా కనపడినది! నాకు అదే మొదటి సారిగా మా ఊరి గుడి జాతర కాకుండా వేరే ఊరి గుడి జాతర చూడటం! బాగుంది అనిపించింది! అక్కడ పెట్టిన వివిధ రకాల బొమ్మలు కొట్లు చూసుకుంటూనే మేమిద్దరం ముందుకు సాగిపోతున్నాము! ఇంతలో ఒక ముసలావిడ రెండు అడుగుల ధ్యాన ముద్ర శివుడు మట్టి బొమ్మను అలాగే ఒక అడుగున్నతిరుపతి వెంకన్న మట్టి బొమ్మను…. మా ఇద్దరి దగ్గరికి చేతుల్లో పెట్టి “అయ్యా! పొద్దుటి నుండి ఇప్పటి దాకా అన్నీ మట్టిబొమ్మలు అమ్ముడుపోయాయి! కానీ ఈ రెండు మట్టి బొమ్మలు మాత్రం అమ్ముడు పోవడం లేదు! ఎవరిని అడిగిన వద్దు అని అంటున్నారు! ఈ రెండు బొమ్మలు ఇంటికి తీసుకుని వెళ్ళే ఓపిక నాకు లేదు! నాయందు దయ ఉంచి ఈ రెండు మట్టి బొమ్మలు కొనండి! మీకు తోచిన డబ్బులు ఇవ్వండి! కొననని చెప్పవద్దు” అంటూ డబ్బులు కోసం చేతులు చాచటం…. నేను వీటిని వినే స్థితిలో నేను లేనని…. నా జిజ్ఞాసి గ్రహించి 200 రూపాయలు చేతిలో పెట్టగానే ఆ ముసలావిడ సంతోషంగా నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళి పోతుంటే… నా చేతిలో ఉన్న ధ్యాన శివుడు బొమ్మ అలాగే మా వాడి చేతిలో ఉన్న వెంకన్న బొమ్మను చూసి ఆశ్చర్యపోతుండగా…. “నేనే నీ దగ్గరికి స్వయంభూగా వచ్చినాను” అని ఎవరో అన్నట్లుగా నాకు అనిపించేసరికి…. అది నిజమేనని అన్నట్లుగా గుడిగంటలు మోగి నాయి! ఆ గుడి యందు సుప్రభాత సేవ మొదలైంది! ముసలావిడ మా ఇద్దరి చేతుల్లోనే ఈ రెండు విగ్రహలు ఎందుకు పెట్టింది అని ధర్మసందేహము నాకు వచ్చినది! పైగా నేను శివభక్తుడు అని… మావాడు రామభక్తుడు అని ఆమెకు ఎలా తెలిసింది! విగ్రహలు మార్చకుండా పైగా మీకు తోచిన డబ్బులు ఇవ్వమని చెప్పింది కానీ ఈ బొమ్మలకు ఖరీదు చెప్పలేదు! డబ్బులు కావాలని పట్టుబట్ట లేదు !అంటే ఈమె నిజంగానే బొమ్మల అమ్ముకునే స్త్రీనా లేక ఎవరైనా దైవరూపమా అనుకోగానే మా వాడితో వెంటనే “ఆ ముసలి దాన్ని పట్టుకో! ఎక్కడైనా ఉందేమో చూడు” అంటూ నేను వాడిని కంగారు పెట్టేసరికి… నా డబ్బులు దొంగతనం చేసింది అని అనుమానంతో వాడు వెతకడం ప్రారంభించినాడు! సుమారు మేము నాలుగు గంటలు పైగా వెతికినా ఎక్కడా అగుపించలేదు! అక్కడే ఉన్న మట్టి బొమ్మలు అమ్మే వారిని ఈమె గురించి అడిగితే… ఈమెకి అసలు మట్టి బొమ్మల కొట్టు లేదని, బొమ్మల చూసి ఒక్కడు..ఇవి రాత్రి ఆ ముసలావిడ మా దగ్గర రెండు వందల రూపాయలు ఇచ్చి ఈ రెండు బొమ్మలు మాత్రమే కొన్నదని తెలిపినాడు! ఆ ముసలావిడ తను కొనుక్కున్న ఈ రెండు మట్టిబొమ్మలు మా ఇద్దరికీ ఖచ్చితంగా దైవారాధన తగ్గట్లుగా వాటికి అనుగుణంగా మా ఇద్దరి చేతిలో పెట్టడం ఉద్దేశం ఏమిటి?

ఈమె నిజంగానే మానవ ముసిల్ది కాదు… మానవ రూపంలో వచ్చిన దైవరూపం అయ్యుండాలి! అవునని చెప్పలేము కాదని చెప్పలేము… ఎటూ తేల్చుకోలేని పరిస్థితి లో విగ్రహలు తీసుకుని మా ఊరి బస్సు వైపు అడుగులు వేసినాము!

నాకు తెలీకుండానే నేను యోగపరంగా, దైవపరంగా తప్పు చేశాను! అది ఏమిటంటే దేవతలను మార్చటం, మంత్రాలను మార్చడం, పూజా విధానం మార్చడం ధ్యాన విధానాలు మార్చటం, విగ్రహములను సేకరించడం ఇలా ఎన్నో తప్పులు చేశాను! ఒకే దైవాన్ని, ఒకే మంత్రాన్ని, ఒకే ధ్యాన విధానమును పాటించకుండా చెయ్యకుండా ఏకత్వం నుండి భిన్నత్వం లోనికి వచ్చి… ఏక దైవము నుండి విభిన్న దైవమూర్తుల దాకా వెళ్లి …చివరికి మళ్లీ మొదలైన ఏక దైవం దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకోండి! ఇది అందరూ తెలిసీ తెలియక చేస్తున్న అతిపెద్ద తప్పు! దానితో ఏ దేవుడికి ఏ విధంగా పూజలు,హారతులు, నైవేద్యాలు ఆవిధంగా చేసుకుంటూ వచ్చేసరికి …. ఇంట్లో వాళ్ళు ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు మొదలవుతాయి! దానితో మనం కూడా ఏ ఒక దేవుడు మీద కూడా ఏకాగ్రత పెట్టకుండా అసంతృప్తిగానే పూజలు ముగించవలసి వస్తుంది!ఇంటికి వెళ్లి అక్కడ నుండి నేను తెచ్చిన శివమూర్తి విగ్రహన్ని చూసి మా అయ్య సంతోషపడి “దీనితోపాటు అమ్మవారి విగ్రహం తీసుకొని ఉంటే మరింత బాగుండేది! అయ్యవారి పక్కన అమ్మవారు తప్పనిసరిగా ఉండాలి! అమ్మవారు లేకపోతే అయ్య వారు లేనట్లే! అయ్యవారు లేకపోతే అమ్మవారు లేనట్లే! ఒకరినొకరు తోడుగా ఉండి అర్థ భాగాలతో అర్ధనారీశ్వర తత్వం తో ఒకే శరీరంలో రెండు సమభాగాలుగా జీవిస్తున్నారు! పూజింపబడుతున్నారు” అని చెప్పి గుడిలోనికి వెళ్ళిపోయినారు! ఇన్నాళ్లుగా నేను కేవలం అమ్మవారు లేని లింగమూర్తి ని పూజించడం వలన వారు నాకు కనిపించడం లేదేమో అని అనుమానం కలిగింది! మళ్లీ శివుడితో పాటు ఉండే అమ్మవారు ఎవరై ఉంటారో నాకు అర్థం కాలేదు! కొంతమంది పార్వతి మరికొంతమంది గంగాదేవి మరికొంతమంది బాలత్రిపురసుందరి ఇంకొంతమంది దుర్గాదేవి… సుమారు 50 మంది పేర్లు చెప్పడం జరిగింది! వామ్మో! ఈయన కోసం ఇంత మంది అమ్మవారి విగ్రహ మూర్తులని తీసుకుని వచ్చి పూజించాలా అని సందేహం వచ్చింది! తప్పదు కదా! ఆయన ఉన్నాడో లేదో తెలియాలంటే ఇంతమంది అమ్మవారి విగ్రహలు సేకరించి పూజించాలి అని అనుకుని విగ్రహలు సేకరించడం మొదలు పెట్టాను!

గమనిక: 

ఆ ముసలావిడాచ్చిన రెండు మట్టి విగ్రహలు కూడా ఎవరి ఇళ్లల్లో వారికి వరసగా 12 మరియు 15 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా విరిగిపోకుండా ఉన్నాయి! ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విగ్రహలు నెమ్మదిగా విరిగిపోవటం ఆరంభించినాయి!! కొన్ని సంవత్సరాల సాధన తర్వాత ఆ ముసలావిడ మానవ స్త్రీ కాదని శివుడినే భర్తగా పొందిన శివాని అని తెలిసి ఆనందపడ్డాను! పాద నమస్కారం చేయనందుకు అలాగే ఆవిడని గుర్తించినందుకు మా ఇద్దరిలోనూ ఇప్పటికీ మర్చిపోలేని బాధాకరమైన అనుభవంగా మిగిలి పోయింది! ఇలా ఎవరైనా మీ దగ్గరికి మీరు అడకుండానే దైవిక వస్తువులు గాని దేవతా విగ్రహలు గాని ఇస్తే వారు అడిగిన డబ్బులు కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకోండి! కాదు అని చెప్పవద్దు! వద్దు అని అనవద్దు! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు! ఏ విగ్రహంలో ఏ దైవిక శక్తి ఉన్నదో ఎవరికి ఎరుక! నిజమే కదా!ఆ తప్పు చేసాను!(నా భక్తి మార్గం)

నా నిత్య విగ్రహారాధన పూజ

ఈ బీజాక్షరాలను ఆయన ఒక బంగారు రేకు మీద గీసుకుని ఒక యంత్రము లాగా పూజించడం ఆరంభించినాడు! దానితో ఈయనకి మంత్రం, తంత్రం, యంత్ర రహస్యాలు సహజసిద్ధంగా వచ్చినది! తనకు వచ్చిన మంత్రశక్తితో ఈయన దుర్గాదేవిని ఆరాధన చేయడం ఆరంభించాడు! దానితో ఈయన కృష్ణాజిల్లాలోని పెదకళ్ళేపల్లి గ్రామములోని దుర్గాదేవి గుడి పూజారులుగా పనిచేసినారు! అమ్మవారు ఇచ్చిన మంత్రమునందు సిద్ధి పొంది గొప్ప దేవి ఉపాసనసిద్ధి పొందినారట! ఎంతగా అంటే ఎనిమిది సంవత్సరాల పాపగా ఆయనకి ప్రతినిత్యం దుర్గాదేవి ఆయన ఇంటి చుట్టూ అలాగే తన చుట్టూ తిరుగుతూ అందరికీ కనపడుతూ ఉండేది! శుక్రవారం ఈయన దగ్గరికి వచ్చి గారెలు అలాగే పులిహోర అడిగి చేయించుకుని తిని వెళ్ళేది! ఏమైనా పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు అందరికీ గానే ఎరుపు లంగా జాకెట్ తో ఎరుపు గాజులు కావాలని అడిగి తీసుకునేది! ఈయన గొప్ప మంత్ర, తంత్ర, యంత్ర ఉపాసకుడు అయినాడు! ఇంటి చుట్టు దైవశక్తి ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉండేది! తనకు వచ్చిన జ్ఞానముతో ఇతరుల జాతక సమస్యలు, ప్రేత సమస్యలు… వాటి పరిహారాలు చెప్పి… వాటిని వదిలించే వారు! దానితో ఈయన ఒక గొప్ప మంత్ర ఉపాసకుడుగా ఖ్యాతి పొందినారు! ... ప్రతిదినము ఎక్కువకాలము సమాధిలో ఉంటూ...అలాగే గృహస్ధాశ్రమునందు ఆదర్శవంతమైన జీవితమును గడుపుతూ...ఇలా ఉండగా… వీరి ధ్యాన నిమిగ్నతను చూసి ఆ ఊరి పండితుడు ఒకరు చూసి అసూయ చెంది వీరి ధ్యానపరీక్ష చేయాలని తలంచి...ఈయన వ్రాసిన గ్రంథములోని కొన్ని పేజీలు ఎక్కడ ఉన్నాయో వీరు ఎంత వెతికిన అవి కనిపించలేదు!అపుడు వీరు ఉమ్మన పంతులుగారిని సవాలు చేస్తూ...తన పుస్తకములోని పేజీలు ఎక్కడ ఉన్నాయో నువ్వు చెప్పగలిగితే... నువ్వు నిజముగానే ధ్యాన యోగివని నేను నమ్మి...అందరిని నమ్మిస్తాను” అన్నారుట!దానికి ఉమ్మన్న గారు ఒక చిరునవ్వు నవ్వి రెండునిమిషాలు కళ్ళుమూసుకుని...ఆపై కళ్ళు తెరిచి...మీ పుస్తకములోని పేజీలు మీ ఇంటి చావడి చూరులో ఉన్నాయని చెప్పగానే...నిజముగానే అవి అక్కడే ఉన్నాయట!

ఇది ఇలా ఉండగా తురుష్కలు వలన విజయవాడ మహిషాసురమర్ధిని దేవి అమ్మవారి విగ్రహము తునాతునకలు అయినది! దానితో ఈ అమ్మవారికి 32 కళల యధాశక్తిని ఎవరు తిరిగి తెప్పిస్తారా అని ఆలయ అర్చకులు వెతుకుచూయుండగా… పెద్దకళ్లేపల్లి గ్రామంలో ఉన్న మా ముత్తాత తాతగారైన ఉమాపతి గారి విషయం వారికి తెలిసింది! దానితో వీరిద్దరు అన్నదమ్ములు అనగా ఉమాపతి శాస్త్రి, చలపతి శాస్త్రి …. ఇద్దరూ కలిసి విజయవాడ ఆలయములో మకాం పెట్టి… ఆమెని పునర్జీవనం చేసి… ఆమెకి యధాశక్తి ఇవ్వటానికి మంత్ర ధ్యాన తపోశక్తి ఆరంభించినారు! విరిగిపోయిన అమ్మవారి విగ్రహం ముక్కలను ఒక చోట చేర్చి… వాటికి తేనె మైనము పూసి అతికించి… యధావిధిగా ప్రస్తుత మహిషాసురమర్ధిని అమ్మవారి రూపు రేఖల విగ్రహ మూర్తి గా తయారు చేసినారు! అమ్మవారు స్వయంభూ కాబట్టి మనము మళ్ళీ యధావిధిగా ప్రాణప్రతిష్ఠ చేయవలసిన అవసరం లేదని చెప్పి…నిత్యదైవారాధన స్ధితికి ఈ విగ్రహమూర్తిని తెప్పించినారుట! కొన్నిరోజులకి ఒక విచిత్ర సంఘటన జరిగినది! ఈ ఇంటి ఆడవాళ్ళు పండక్కి గాజులు అమ్మేవాడిని పిలిపించి...వారికి గావాలసిన గాజులు వేయించుకొన్నారుట! తీరా వాడికి డబ్బులు ఇవ్వబోయేసరికి... “అది ఏమిటి నేను అయిదురుకి గాజులు వేస్తే...మీరు నలుగురికే డబ్బులు ఇస్తున్నారని” ...గొడవ పడినాడు! నిజానికి ఆ ఇంటిలో నలుగురు ఆడవాళ్ళే ఉన్నది! మరి వీడి ఎవరికి క్రొత్తగా పైగా ఎరుపు గాజులు వేసినారో … పైగా లంగా జాకెట్ వేసుకొని ఉన్న ఎనిమిది సం!!రాల బాలికయని ఖచ్చితముగా చెపుతూండేసరికి... అక్కడున్న వారికి అర్ధముకాని సమయములో...ఒక స్త్రీమూర్తి మీద అమ్మవారు పూని..."వాడు చెప్పిన ఎరుపు గాజులు నేనే వేయించుకొన్నాను" అని చెప్పినది! దానితో ఉమ్మన్నగారు వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళిచూస్తే...అమ్మవారి విగ్రహమూర్తి చేతులకి ఎరుపు గాజులు ఉండటము చూసి...ఆనాటి నుండి అమ్మకి ఎరుపుగాజులు సమర్పించడము ఆచార ఆనవాయితిగా వస్తోంది!ప్రేత శక్తి వలన నేను బాధ పడినాను అని తెలుసు కదా! దీని నివారణ కోసం హనుమంతునిని పూజించడం మొదలు పెట్టాను! శివునిని పూజిస్తే ప్రేతాత్మలు, భూతాలు మన చుట్టూ తిరుగుతాయని… ఎందుకంటే ఆయన భూతనాధుడని ఇలా ఎవరో అజ్ఞాన పెద్దలు నాతో అనేసరికి…. అది నిజమా కాదా అని తెలుసుకునే వయస్సు నాకు లేనందున …. ఇది నిజమే అనుకొని… మాకున్న ప్రేతాత్మ బాధలు తొలిగించుకోవటానికి మనో ధైర్యం ఇచ్చే హనుమంతుని పూజ చేసుకోవాలని… వారు చెప్పడంతో సోమవారం పూజలు కాస్త మంగళవారం పూజలు గా మార్చబడినాయి! ఆంజనేయ స్వామి పూజలు ఇది కూడా కొన్నాళ్ళు బాగానే జరిగినది! ఆ తర్వాత చదువులో మంచి మార్కులు రావాలంటే చదువులో అఖండ విద్యా ప్రాప్తి కలగాలి అంటే…. సరస్వతి పూజలు చేయాలని చెప్పడంతో… మంగళవారం పూజలు కాస్త బుధవారం పూజలు గా అనగా సరస్వతి పూజలు గా మార్చబడినది! ఆ తర్వాత అన్ని రకాల జ్ఞానాలు కావాలంటే గురువులు అనుగ్రహం పొందాలి అని అందుకని దత్తాత్రేయస్వామిని గురువారం పూజించడం ఆరంభమైనది!

ఇక ఆపై అన్ని రకాల ధనప్రాప్తి కోసం, అదృష్టం కోసం మహాలక్ష్మిని పూజించాలని చెప్పడంతో… శుక్రవారం పూజలు మొదలైనవి! గ్రహ బాధలు కలిగించే శనిగ్రహ బాధలు తొలగించుకోవాలంటే శనివారాలు పూజలు మొదలైనాయి! ఇలా చేసే పూజలలోను, మనము చేసే పనులకు ఆటంకాలు, సంకటాలు లేకుండా ఉండాలి అంటే….. గణపతి పూజలు ఆదివారంనాడు మొదలైనాయి! ఇలా ఒక్క రోజు పూజలు కాస్త వార దేవతల పూజలు గా మారినాయి! నా పూజా విధానాలు మారినాయి! ఇంతవరకు బాగానే ఉన్నది!

ఆ తర్వాత పండుగల పేర్లు తో పూజలు మొదలైనాయి! శివరాత్రి పూజలు, దేవి నవరాత్రి పూజలు, ఏకాదశి పూజలు, దీపావళి, వినాయక చవితి, సత్యనారాయణ వ్రత పూజ ఇలా పండుగల పూజలు మొదలైనాయి ! వారాల పూజలతో ,పండుగల పేరుతో పాటు నా జీవితంలో మాస పూజలు మొదలైనాయి! ఇక ఆపై మాస పూజలు అనగా శ్రావణ మాస పూజలు, కార్తీకమాస పూజలు, ధనుర్మాస పూజలు మొదలైనాయి! వీటితో పాటు ఉపవాస దీక్షలు కూడా మొదలయ్యాయి! ఇలా ఈ పూజలకు సంబంధించి ఆయా దేవతా విగ్రహ మూర్తులు సుమారుగా 84 దాక నా దగ్గరికి చేరినాయి! ప్రతిరోజు వీటికి అభిషేకాలు, పూజలు, హారతులు, నైవేద్యాలు పెడుతూ ఉండే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది! ఏ పూజలు చేయకపోతే ఏ కష్టాలు వస్తాయేమోనని భయం ఒక పక్క…. మరోపక్క మనస్ఫూర్తిగా పూజలు చేయలేక పోతున్నానే బాధలు ! ఇలాంటి అయోమయ పూజలు చేస్తున్న సమయంలో కూడా నాకు గురుమంత్రం గా వచ్చే గాయత్రి మంత్రమును వీలునుబట్టి రోజు 1000 నుండి 11 వరకు తప్పకుండా చేసే వాడిని! ఇదే నాకు తెలియకుండా నేను చేసిన మంచి పని! ఎక్కడా కూడా గురుమంత్రం ఆపకుండా...వాయిదాలు వెయ్యకుండా...కేవలము నాకున్న వీలును బట్టి జపసంఖ్యను మార్చుకొని … ఏకధాటిగా 12 సంవత్సరాలు చేయగలిగి మంత్రసిద్ది పొందగలిగినాను! ఇది అయిన తర్వాత మిగిలిన 84 విగ్రహ మూర్తుల పూజలు చేసే వాడిని!

ఈ 84 దైవ విగ్రహ మూర్తులు పూజలు పూర్తయ్యే సరికి…. నా సామిరంగా నా పరిస్థితి… ఎలా ఉండేదంటే….. స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు- శ్రీ లక్ష్మి దంపతులు చేసే పూజలు లాగా ఉండేది! కాకపోతే వారికి నాకు తేడా ఏమిటంటే అందులో వాళ్ళు దేవుడు ఫోటోలకి హారతిచ్చి మసి పట్టిస్తే …. నేనేమో ఈ 84 దైవ విగ్రహ మూర్తులకు హారతిచ్చి మసి పట్టిచ్చేవాడిని! రానురాను ఏ దేవుడి విగ్రహం అది అని గుర్తుపట్టలేని స్థితికి నా పూజలు ఉండేవి! అలాగే రానురాను ఈ విగ్రహ పూజలు చేసే సమయం కూడా ఉండేది కాదు! పైగా నా మనస్సు ఈ పూజలు చేయడానికి వాయిదాలు కోరుకుంటూ ఉండేది! దానితో నేను నెమ్మది నెమ్మదిగా వార పూజలు, పండగ పూజలు, మాస పూజలు తగ్గించుకుంటూ వచ్చేవాడిని! అప్పుడప్పుడు ఏవో మానసిక సమస్యలు వచ్చేవి! వాటిని నేనే స్వయంగా పరిశీలించుకుని పరిష్కరించుకునే వాడిని!

దాంతో నేను మళ్లీ అయోమయ స్థితికి చేరుకున్నాను! విగ్రహారాధన అంటే విరక్తి వచ్చేసింది! అయ్యవారి పక్కన ఏ అమ్మవారిని పూజించాలి? ధర్మ సందేహం మళ్ళీ మొదలైంది! ఈసారి ఒక అమ్మవారిని మాత్రమే ఎంచుకుని వారిని పూజించాలి అని నిర్ణయం తీసుకున్నాను! కానీ 50 మంది అమ్మవార్లలోఎవరిని పూజించాలో అర్థంకాని అయోమయ స్థితికి వచ్చాను! నా స్థితిని గమనించిన మా అమ్మ నా దగ్గరకు వచ్చి… అసలు విషయం ఏమిటో అడిగి తెలుసుకున్నది! దానికి ఆమె చిరునవ్వు నవ్వి “దీనికి ఎందుకురా అంత కంగారు! మన కుల దైవం దుర్గాదేవి! ఆవిడ మల్లికార్జున సహిత దుర్గమ్మ అని ఆయనతో ఉంటుంది కదా! కాబట్టి మీ అయ్యవారి పక్కన అమ్మవారి గా దుర్గాదేవి విగ్రహ మూర్తి ని తీసుకుని పూజించు! నాలుగు రోజులలో మనం విజయవాడలో జరిగే పెళ్లికి వెళ్లాలి! అక్కడే దుర్గాదేవి స్వయంభూగా వెలిసినది కదా! ఆ క్షేత్రం లోనికి వెళ్లి అక్కడ నీకు నచ్చిన ఒక దుర్గమ్మ విగ్రహం మూర్తిని తెచ్చుకుని పూజించు! అప్పుడు అమ్మ వారి పక్కన అయ్య వారిని ఇద్దరిని కలిపి పూజిస్తే…. మీ సమస్య తీరినట్లే కదా!” అని చెప్పి వెళ్ళిపోయింది! దానితో మా కులదైవంగా దుర్గాదేవి ఉన్నప్పుడు… మరే ఇతర అమ్మవారి రూపాలు పూజించడం అవసరం లేదని గ్రహించి…. పెళ్లి కోసం…. రాబోయే దుర్గమ్మ విగ్రహం మూర్తి కోసం ఎదురు చూస్తున్నాను!

గమనిక: 

అదే మనస్ఫూర్తిగా, మనకి ఇష్టమైన, మన కంటికి నచ్చిన, మన మనస్సు మెచ్చిన ఏకైక దైవమును ఆ దైవం యొక్క విగ్రహ మూర్తి ని … ఆ దైవ మంత్రమును మనస్ఫూర్తిగా చేసుకుంటే… ఆయనే మనకున్న కష్టనష్టాలు లాభనష్టాలు తీరుస్తాడని… మన కోరికలు నివేదించుకుంటే కచ్చితంగా తీరుస్తాడని తెలుసుకోండి! అనేక దైవాలను నమ్ముకుంటే ఆ దేవుడు చూసుకుంటాడని ఈ దేవుడు… ఈ దేవుడు చూసుకుంటాడని ఆ దేవుడు…ఇలా ఎవరికి వారే అనుకుని…. మన కోరికలు తీర్చలేని అయోమయ పరిస్థితి వస్తుంది! దానితో కోరిక తీరక కోపతాపాలకు, వైరాగ్య భావాలు ఏర్పడే ప్రమాదం ఉంది! కాబట్టి మీ ఇష్టదైవమును మాత్రమే ఎంచుకోండి! వారే మీకు గురువు, తల్లి, తండ్రి, దైవము, స్నేహితుడు, ఆత్మబంధువు అనుకోండి! కష్టాలు చెప్పుకోండి! కోరికలు నివేదించండి! ఫలితాలు ఆశించకండి! వచ్చిన వాటిని స్వీకరించండి! అంతే యోగక్షేమాలు స్వయంగా ఆయనే మన దైవ శక్తి రూపంగా మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ తిరుగుతారు! అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు! అనగా రామకృష్ణ పరమహంసకి -కాళీమాత లాగా, నామ దేవుడికి -పాండురంగడు లాగా, రమణ మహర్షి కి- జ్ఞాన జ్యోతి స్వరూపంగా, శ్రీనివాస రామానుజన్ కి అఖండ జ్యోతి స్వరూపంగా, తాడేపల్లి రాఘవ శాస్త్రి గారికి బాలిక- బాల రూపంగా, త్రైలింగ స్వామికి మంగళ గౌరీ గా… ఇలా వారి ఇష్టదైవాలు సంచారం చేశారని వారి చరిత్రలు తెలుసుకోండి! వీరంతాగూడ వారి ఇష్టదైవముగా ఏకదైవము మాత్రమే పూజించినారని గ్రహించండి!దుర్గమ్మ ను చూడటానికి వెళ్తే(నా భక్తి మార్గం)మా బంధువులు పెళ్లి జరుగుతోందని దానికోసం మా కుటుంబ సభ్యులంతా పెళ్లి కి వెళ్లాలని తెలుసుకున్నారు కదా! అప్పుడు అక్కడి నుండి ఒక దుర్గా దేవి విగ్రహ మూర్తి ని కూడా తెచ్చుకోవాలని నేను అనుకున్నాను అని తెలుసు కదా! ఎందుకంటే శివయ్య లేని అమ్మవారిని…. అమ్మవారు లేని శివుడిని పూజించరాదని మా అయ్య చెప్పడంతో దుర్గాదేవి సమేతంగా శివుడుని పూజించాలని నిర్ణయించుకున్నాను! పెళ్లిలో బంధువులందరూ కలిసినారు! అందులో శ్రీశైలంలోని ఘంటామఠములో నాకు సహాయం చేసిన మిగిలిన వ్యక్తులు కూడా కలిసినారు! యధావిధిగా మా ముచ్చట్లన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు మరలినది! 20 సంవత్సరాల వయస్సు నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న వారంతా ఆ చర్చలో పాల్గొన్నారు! దైవం మీద ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతూ చెప్పడం జరుగుతోంది! నేను వీటిని అన్నిటినీ సావధానంగా వినడం జరుగుతోంది! వీటిని ఖండించేవారు ఖండిస్తున్నారు! ఆమోదించేవారు ఆమోదిస్తున్నారు! నేనయితే ఎటు ఉండాలో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నాను! నా శ్రీశైల ఆధ్యాత్మిక అనుభవాలు వారితో పంచుకోవడం జరిగింది! ఇది చాలామంది సత్యమని నమ్మితే …. మరికొంతమంది ఇది నా మానసిక మనోభావాలని కొట్టిపారేశారు!

ఇంతలో అక్కడికి సుమారుగా 24 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువకుడు వచ్చినాడు! వారిని నేను చాలా చిన్నప్పుడు చూసినట్లుగా గుర్తుగా ఉంది! ఆ వ్యక్తి మా అందరి వైపు తిరిగి “అయితే మీలో ఎవరికైతే దైవశక్తి చూడాలనిపిస్తే నాతో పాటుగా చింతామణి దుర్గమ్మ ని చూడటానికి రండి! నేను ఇంతవరకు ఆమె నిజ స్వరూపమును చూడలేదు! కేవలం ఈమెకి అనుసంధానము చేసిన మహిషాసురమర్ధిని విగ్రహ మూర్తి ని చూశాను! నేను ఇప్పుడు ఆమె నిజమూర్తి నిజ రూపాన్ని చూడాలని అనుకుంటున్నాను”! అనగానే నాకు ఏమీ అర్థం కాలేదు! విగ్రహమూర్తి ఏమిటో, సజీవ మూర్తి ఏమిటో నాకైతే అర్థం కాలేదు! ఇదే సందేహాన్ని వారిని అడిగితే దానికి అతను నవ్వుతూ “విగ్రహ మూర్తి అంటే ప్రస్తుతం దేవాలయంలో మహిషాసురమర్ధిని పూజింపబడుతున్న మూర్తి! అందరు చూస్తున్నారు, చూస్తారు, పూజలు చేస్తున్నారు! నిజానికి ఈ క్షేత్రములో రెండు దైవవిగ్రహమూర్తులున్నాయి!అందులో ఒకటి మానవుల పూజలకి అనుగుణముగా ఉన్న మహిషాసురమర్ధిని విగ్రహమూర్తి కాగా రెండవది అసలు సిసలైన సిద్దపురుషుల చేత పూజలందుకునే చింతామణి దుర్గ! నేను అనేది మహిషాసురమర్ధిని విగ్రహమూర్తి లోని దైవిక శక్తి స్వరూపమైన సజీవమూర్తియైన చింతామణి దుర్గమ్మను చూడాలని అనుకుంటున్నాను! అనగా సిద్ధపురుషుడు ప్రవేశపెట్టిన ఆధ్యాత్మిక శక్తి స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను! అది అంత తేలికైన విషయం కాదని గ్రహించండి! ఎంతోమంది దేవిఉపాసకులు ఈ చింతామణి దుర్గ గుడి ప్రాంతానికి వెళ్లేసరికి కొంతమందికి భైరవుడు ఇబ్బంది పెట్టినారని...మరికొంతమందికి తాంత్రికశక్తులు భయపెట్టినాయని...దానితో ఈ చింతామణి దుర్గమ్మను చూడలేక వెనుతిరిగినారని మాకు వివిధ గ్రంధాలు ద్వారా తెలిసినది! ఆ ప్రాణశక్తి ఉన్న ప్రాంతానికి వెళ్లాలి! అప్పుడే ఆవిడ కరుణించి మనకి కనపడుతుంది! ఈ మూర్తికి ప్రతినిత్యము అర్ధరాత్రిపూట దేవతలు, దేవమునులు, దేవమహర్షులు,దేవయోగులు,యక్షులు,కిన్నెరులు,గంధ్వరులు ఇప్పటికి సూక్ష్మశరీరాలతో వచ్చి ఆరాధన చేసి వెళ్ళుతున్నారని చెప్పడము జరిగినది!

ఆవిడ సజీవమూర్తిగా బాలిక రూపములో అనగా ఎనిమిది సంవత్సరాల వయస్సున్న బాలిక రూపంలో ఆ ప్రాంతంలో తిరుగుతుందని వివిధ మంత్ర గ్రంధాల ద్వారా తెలుసుకున్నాను! స్వయంభూమాత ఉన్న దేవాలయానికి వెళ్లాలనుకుంటున్నాను! కొండ చివర పైన చిన్న గుడిగా ఉన్నది అని తెలుసుకున్నాను! ఇప్పుడు మనం చూస్తున్న గుడి కాకుండా ఆ కొండపైన అగ్రభాగంలో సిద్ధ పురుషుడు చేత నిర్మించబడిన అతి చిన్న దేవాలయంలో అమ్మవారి యొక్క సజీవ రూపం అది కూడా ఒక అడుగు రాతి విగ్రహముతో తయారుచేయబడిన మూర్తి స్వరూపం ఉన్నదని ….. దానిని ఇంతవరకు ఎవరూ చూడలేదని, దాని దగ్గరికి ఇంతవరకు ఎవరూ కూడా వెళ్లే సాహసం చేయలేక పోతున్నారు అని తెలిసినది! నిజమైన దైవశక్తి అక్కడే ఉన్నదని,కేవలం కింద గుడిలో ఉన్న రేఖాచిత్రంగా తేనెమైనపు మహిషాసురమర్ధిని విగ్రహనికి దైవశక్తిని అనుసంధానం చేసినారని …చెబుతుంటే ఏమనాలో అర్థం కాలేదు! ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు! ఇది ఇలా ఉండగా అతను మళ్ళీ నిజానికి దుర్గాదేవి అనే ఆవిడ అమ్మవారు గాదని ప్రేత శక్తి అని, ఆ తర్వాత ఈ శక్తిని సిద్ధ పురుషులు తమ తపో శక్తితో దైవ శక్తి గా మార్చినారని…. దానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దైవ శక్తి బయటకు రాకుండా ఉండటానికి ఆదిశంకరాచార్యుడు శ్రీచక్ర ప్రతిష్ఠ గావించారని…. గావాలంటే శ్రీ పోతుకూచి సుబ్రమణ్యం గారు రచించిన “శ్రీ కనకదుర్గాదేవి మహిమ” అను గ్రంథమును చదివితే...ఈయన ఈ చింతామణి గుడికి వెళ్ళి భంగపడి ఎలా వచ్చినారో మీకే తెలుస్తుంది అంటూ ఈ గ్రంథమును చదివితే మీకే అర్థమవుతుంది అని చెప్పటం జరిగినది! ఈపేజిలో మాధవవర్మ యొక్క తోబుట్టువు చనిపోయి దుర్గాదేవిగా వెలిసినట్లుగా తెలుగు విజ్ఞానసారస్వతము నందు ఉన్నదని చెప్పడము జరిగినది!గమనించగలరు!

ఇక ఈ గ్రంథకర్త ఏవిధంగా చింతామణి దుర్గాదేవిని చూడలేకపోయినాడో తెలుసుకోండి!

అపుడు ఈ గ్రంథమును చదివితే... “ప్రేతశక్తి ఎలా దుర్గాదేవి అయినదో వివరంగా లేదని” నేను ఆ యువకుడితో అంటే..ఆయన వెంటనే మరో పుస్తకమును ఇచ్చి దీనిని చదివితే అసలు విషయము తెలుస్తుందని చెప్పడముతో…వెంటనే నేను ఆ పుస్తకం తీసుకుని ఆ విషయమును అందరికీ వినపడేటట్లు గా పెద్దగా చదవడం ఆరంభించాను! విషయం ఏమిటంటే కనకమ్మ అనే వైశ్య కూతురు ఉండేదని…. ఆమెకి మాంసము తినాలని కోరిక ఉండేదని… అప్పుడు ఉన్న ఆచారవ్యవహారాల వలన అవకాశము దొరకలేదని…. తినాలని కోరిక తీరకపోవడంతో… ఆమె కాస్తా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది! ఆపై ఈ మాంసమును తినాలని కోరిక కోసం ప్రేతాత్మగా మారి అక్కడ ఉన్న పశువులు, మనుషులు, కోళ్లు, మేకలు, గొర్రెలు తినటం ఆరంభించింది! ఈమె బాధ తట్టుకోలేక అక్కడ ఉన్న గ్రామ పెద్దలు కొంతమందికలిసి ఒక దేవాలయమును కట్టించి ఇస్తామని మొక్కుకున్నారు! ఈమె ప్రతిరూపముగా వేప చెట్టు తో తయారు చేసిన ఒక విగ్రహ మూర్తి ని పెట్టి…. ఆ విగ్రహ మూర్తికి కనకదుర్గమ్మ అని పేరు నామకరణం చేశారు! అయినా కూడా అప్పుడప్పుడు ఆ గ్రామ ప్రజల స్త్రీల మీద కి వచ్చి…. నానాయాగీచేస్తూ ఉండేది! అకారణంగా ఆ స్త్రీలు నదిలో దూకి ప్రాణాలు కోల్పోతూ ఉండేవాళ్ళు! ఈ కథనము ఉన్న పేజిని మీకోసం ఇక్కడ ఇవ్వడము జరుగుతోంది!గమనించగలరు!

ఇది గమనించిన కొంతమంది సిద్ధ పురుషులు ఈ ప్రేతశక్తిని తపోశక్తితో ఒక దైవ శక్తిగా మార్చి… రేఖాచిత్రంలో బంధనం చేసినారు! ఆ తర్వాత ఈ బంధం యొక్క శక్తిని ఒక అడుగు రాతి విగ్రహము లోనికి తీసుకు వచ్చినారు! ఈ రాతి విగ్రహం చింతామణి దుర్గ మూర్తిగా ఆరాధించడం మొదలు పెట్టినారు! ఈ విగ్రహము నుంచి ఈ దైవశక్తి ఎప్పుడు బయటకు రాకుండా ఉండటానికి శ్రీచక్ర ప్రతిష్ఠ గావించినారు! ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన…. సిద్ధ పురుషులు తపో ప్రతిష్ట విగ్రహశక్తిని భక్తులు తట్టుకోలేకపోవడముతో....ఆ గుడిని మూసివేసి...దీనికి దూరంగా... కొండమధ్యలో వేపచెట్టు కొమ్మతో చేసిన మరో ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గావించినారట! ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన…. ఈ చెక్కవిగ్రహనికి అభిషేకాలు చెయ్యలేని కారణముగా...మరో రాతి విగ్రహమును ప్రతిష్టించినారట! తురుష్కులు దండయాత్ర వలన ఈ విగ్రహము ముక్కలు చెయ్యడము...అపుడు మా వంశ మూలపురుషులలో ఒకరైనా బుద్ధు ఉమ్మన్న(ఉమాపతి)అనే సిద్ధపురుషుడు యోగ శక్తి వలన ముక్కలన్నీ చేర్చి… వాటికి తేనె మైనముతో అతికించినారని తెలిసినది! అతను ఈ విషయాలన్నీ చెబుతుంటే నెమ్మది నెమ్మదిగా నా మతి పోవటం మొదలైనది! ఏమిటి ఒక ప్రేతశక్తి …. దైవ శక్తి గా మారినదని అనగా కనకమ్మ కాస్త కనకదుర్గమ్మ గా మారినదని నాకు తెలియడముతో… అసలు ఏమి జరుగుతోంది…. ఒక ప్రేత శక్తి దైవ శక్తిగా ఎలా మారింది…. అందులో మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఇందులో ప్రమేయమున్న సాధ్యమేనా? ఏమీ అర్థం కావడం లేదు! ఏది నమ్మాలో… ఏది నమ్మకూడదో! వామ్మో! ఇప్పుడు ఏమి చేయాలి అని అనుకుంటున్న సమయంలో…. ఆ వ్యక్తి నా వైపు అదోలా చూస్తూ…

చింతామణి దుర్గ

“కావాలంటే ఈ మధ్యాహ్నం ఆది గుడి అయిన కనకమ్మ ఒక అడుగు రాతి విగ్రహ గుడికి వెళ్ళుతున్నాను! గావాలంటే వచ్చే వాళ్ళు నాతో రావచ్చును!” అన్నాడు! దానితో నాకు కూడా ఏదో ఒక విషయం తెలుసుకోవాలని అనిపించి… నేను కూడా ఆ చింతామణి దుర్గను చూడాలనిపించి… ఆరుగురుతో కలిసి ఆదిగుడి చూడటానికి బయలుదేరాను! యధావిధిగా మైనపు విగ్రహం ఉన్న గుడికి వెళ్లి దర్శనం చేసుకుని… కొండపైన అంతర్భాగంలో ఉన్న రేఖాచిత్రము తో కూడిన ఒక అడుగు రాతి విగ్రహము గుడి వైపుకి అనగా సిద్ధపురుషులు చేత పూజింపబడుతున్న చింతామణి దుర్గ విగ్రహం గుడికి బయలుదేరాము!

గుడి మాకు కనుచూపుమేరలో కనిపించి కనిపించగానే… ఎక్కడి నుండో ఒకసారిగా అతి తీవ్రమైన గాలి రావటం మొదలైంది! దీని తీవ్రత దెబ్బకి మేమంతా తలో ఒక దిక్కులో చచ్చిన శవాలు లాగా పడినాము! అందరూ సృహతప్పి నారు! కొన్ని గంటల తర్వాత మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చిన వ్యక్తికి మాత్రమే మొదట తెలివి వచ్చింది! అతను మేము ఎక్కడ పడినామో గుర్తించి… మాకు తిరిగి తన మంత్ర శక్తితో సృహ తెప్పించినాడు! ఇలా సుమారు యధావిధిగా రావడానికి కొన్ని గంటల పైనే పట్టింది ! అంటే ఈ విగ్రహం గుడి చుట్టూ సిద్ధపురుషుల మంత్రశక్తి వలయాలు ఉన్నాయని ….అందువల్ల మనం వీటి లోనికి ప్రవేశించ లేకపోయామని …. ఈ గుడికి మనము ప్రవేశిస్తున్నామని తెలుసుకుని… పంచభూతాలు మన మీదకు ప్రయోగించినారని… ఇక ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదమని…. మనకి ఆక్సిజన్ కూడా అందకుండా చేస్తారని…. అతను చెప్పుతున్నాడు!

మాకు జరిగిన ఈ విచిత్ర అనుభూతి ఎలా అర్థం చేసుకోవాలో … అర్థం కాక ప్రాణభయంతో…. కొండ నుండి కిందకి మౌనంగా దిగడం ఆరంభించే సరికి… నాకు దగ్గరలో ఉరుము మేఘము లేకుండానే ఒక పిడుగు పడి ఒక చెట్టు తగలబడిపోతుంటే … ఇదంతా మాకు అగుపించని సూక్ష్మ శరీరాలతో ఉన్న సిద్ధ పురుషుల పని గ్రహించి… వారికి మనస్సులో నమస్కారాలు చేస్తూ…. దైవశక్తికి రక్షణ కవచంగా ఉన్న వారికి కృతజ్ఞత భక్తితో ….కృతజ్ఞతలు చెబుతూ మౌనంగా ప్రాణభయంతో వడివడిగా వేగంగా… అక్కడ ఉంటే ఏమి చూడవలసి వస్తుందనే భయంతో…. కిందకి దిగడం ఆరంభించినాము! యధావిధిగా ఎవరికీ ఏమీ అనుమానం కలగకుండా పెళ్లి పనులు లో పాల్గొన్నాము! ఆ తర్వాత మా ముత్తాత ఉమ్మన్నగారికి దుర్గాదేవి తన భుజమును కానుకగా ఇచ్చినదని అక్కడున్నవారంతా చెప్పేసరికి… మేము ఆ తల్లిని చూడటానికి వెళితే రానీయని తల్లి….. ఈయనకి తన భుజమును కానుకగా ఎలా ఇచ్చిందో నాకు అర్థమై చావలేదు! ఎలా ఇచ్చినదో తెలుసుకోవాలని అనిపించి… అక్కడ ఉన్న ఆ వంశస్థులను వివరాలు సేకరించడం మొదలు పెట్టినాను!

గమనిక: 

కొన్ని సంవత్సరాల తర్వాత మా ముత్తాతలు పూజించిన బాలాదుర్గ యంత్రరాధన శక్తితో నేను ఒక్కడినే ఈ ఆదిగుడికి వెళ్ళడము... అక్కడ ఉన్న ఒక అడుగు ఉన్న రాతి చింతామణి దుర్గాదేవి విగ్రహమూర్తిని ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటము జరిగినది! కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆది గుడికి వెళ్లడానికి ఎలాంటి అవకాశాలు లేవని గ్రహించాను! అలాగే చల్లపల్లి రాజావారు ఈ చింతామణి దుర్గాదేవి ఆకారపు ఒక అడుగు బంగారు విగ్రహమూర్తిని మా ముత్తాతల సహాయముతో చేయించుకొని ఆరాధించేవారని మా అమ్మమ్మగారు దీనిని చూసినట్లుగా నాతో చెప్పడము జరిగినది! అలాగే ప్రేతశక్తులు కాస్త దైవ శక్తి దేవతలుగా ఈ ఆంధ్రదేశంలో 7చోట్లలో అనగా బుచ్చమ్మ దేవతగా, లింగమ్మ దేవతగా, సూరమ్మ దేవతగా, తోటకూర దేవతగా, వరద అచ్చమ్మ దేవతగా, కులగొల్లమ్మదేవతగా …. ఇలా ప్రేత శక్తులుగా ఉన్న వారు కాస్త దేవతలుగా కొనియాడబడుతున్నారని ఆ తర్వాత నాకు తెలిసినది! విచిత్రమేమిటంటే దేవాలయాల్లో జరిగే ప్రతిష్టలకు దైవ ప్రతిష్టలకు సరిగ్గా తాంత్రిక ఉపాసకుల రావటం నేను ఎన్నో ప్రతిష్టల సమయంలో స్వయంగా చూసేసరికి…. ప్రేత శక్తిని దైవ శక్తిగా మారుస్తారని రూఢిగా నమ్మకం ఏర్పడింది! అలాగే వరంగల్ జిల్లా లో పాత కాలం నాటి కట్టడాలు, ఇండ్ల మీద…. గొంతు కోసుకున్నట్లుగా బొమ్మల గుర్తులు ఉంటాయి! దీనికి కారణము అలనాటి కాలంలో…. ఒక మహారాజు ఆ ఊరిలో ఒక పెద్ద చెరువు తవ్వించాలని…. కూలీలకు బంగారం ఇస్తానని ఆశ చూపించి… ఒక అతి పెద్ద చెరువును తవ్వించాడు! తీరా వీళ్ళకి బంగారం బదులుగా వెండి ఇస్తానని చెప్పే సరికి…. వాళ్ళు తట్టుకోలేక ఆ కూలీలంతా…. తమ కత్తులతో తమ గొంతు కోసుకుని ప్రాణత్యాగం చేసి…. ప్రేతాత్మలుగా మారి ఆ రాజును, ఆ రాజ్య ప్రజలను నానా ఇబ్బందులు గురి చేయటం మొదలు పెట్టినారు! ఈ బాధలను భరించలేక ఆ రాజు కాస్తా తాంత్రిక గురువులను సంప్రదించినప్పుడు….. వారి సలహా మేరకు వీరి ప్రేతాత్మలను…. దేవతలుగా పూజించే సరికి వీరి ప్రేతశక్తి కాస్త దైవశక్తిగా మారి… ఇప్పటికీ పూజింపబడుతున్నారు! అలాగే ఈ ప్రేతశక్తి తట్టుకోవటానికి మహాస్మశాన వాసి అయిన భద్రకాళీ అమ్మవారిని స్థాపించడం జరిగింది! అంటే ఈ లెక్కన ప్రేతశక్తి కాస్త దేవి శక్తి అయినది కదా! అలాగే మరో విచిత్రం ఏంటంటే ఒక మతం వారు తమ దేవుడు భూతనాధుడు అని స్మశాన వాసి అంటారు! మరొక మతం వారు తమ దేవుడు శిలువకి బందీ అయ్యి...మరణమును పొంది...మూడు రోజుల తర్వాత సూక్ష్మశరీరముతో దర్శనమిచ్చినారని... అని చెబుతారు! మరొక మతం వారు తమ దేవుడు జీవసమాధి చెందటం వలన…. మేము ఆ సమాధిని పూజ చేస్తున్నామని చెబుతున్నారు! అంటే ఈ లెక్కన దేవుడు ఉన్నాడు అని చెప్పే ఈ మతాలు చివరికి వారి దైవాలు స్మశానమునకు ఎలా చేరినారో చెప్పడం జరుగుతుంది కదా! అంటే ప్రేతశక్తి కాస్త దేవి శక్తి గా మారిందని తెలుస్తోంది కదా! నా నమ్మకం నిజమో కాదో నాకే తెలియదు! అలాగే ఈ కథనాలు సత్యమో అసత్యమో కూడా నాకు తెలియదు! కేవలం ఇవి నా అభిప్రాయాలు మాత్రమే గ్రహించండి! ఇవి నిజమో గాదో మీకే వదిలేస్తున్నాను! నాకు ఈ విషయాలు చెప్పిన యువకుడు రాబోవు కాలములో మాకు నిజభౌతిక గురువైనారు!ఈ వివరాలు మీకు “విచిత్ర వేదాంతి” అనే అధ్యాయములో తెలుస్తాయి!భుజం ఇచ్చిన దుర్గాదేవి(నా భక్తి మార్గం)📷మా ఉమ్మన్న పంతులు గారుఉమ్మన్న పంతులు గారు ఈయన మా అమ్మగారి వంశమైన బుద్ధు వంశం యొక్క మూల పురుషులలో ఈయన ఒకరు! ఈయన 17వ శతాబ్ధమునకు చెందినవారు! వీరిని ఉమాపతి అని లేదా ఉమ్మన్న లేదా ఉమ్మన్న పంతులు గారు అని పిలిచేవారు! ఈయన చాలా అమాయకుడు! అసలు చదువుకోలేదు! లౌకిక జ్ఞానము గూడ లేదు! వీరు లక్షమ్మను వివాహామును చేసుకొని తన తమ్ముడి కుటుంబ సభ్యులతో ఉండేవారు! కాని వీరికి సంతానయోగము లేదు! వీరి తమ్ముడి గారి పేరు చలపతి శాస్త్రి! ఇది ఇలా ఉండగా పెద్దబావగారైన ఉమ్మన్నగారు పనీపాట లేకుండా ఇంట్లో తిరుగుతూ ఉండటం చూసిన ఇతని భార్య ఇతనిని ఉపాధి ధ్యాస దారి లోనికి తీసుకు రావాలని ఒకరోజు నానా తిట్లూ తిట్టింది! దానితో ఈయనకు జీవితం మీద విరక్తి కలిగి “ఈ జీవితం ఇచ్చినది అమ్మవారే కదా! ఆమె ఉన్న గుడికి వెళ్లి ఆమె కళ్ళ ముందరే ఆమె కాళ్ళ దగ్గర చనిపోవాలని…. గుడికి వెళ్లి తల బాదుకోవడం చేసినాడు!

ఇలా సుమారుగా ఆరు నెలలుపాటు నిద్ర, ఆహారము లేకుండా పిచ్చోడి మాదిరిగా ధూపదీప నైవేద్యాలు లేని ఆ అమ్మవారి గుడిలో ఏడుపు తో గడుపుతూ"అర్ధం లేని జీవితము వ్యర్ధమని...తనకి మరణము ప్రసాదించమని లేదా జ్ఞానమైన ప్రసాదించమని” వేడుకోవడము చేసినారట! అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై “ఏమిరా బిడ్డ! ఎందుకు ఏడుస్తున్నావు? చదువు లేని వాడు, సంపాదన లేని వాడు, దేనికి పనికి రాడు గదా! ఏందులోను గుర్తింపు ఉండదు కదా! ఇదే విషయం ఆమె చెప్పినది కదరా! నీ మంచి కోరే వారు మీకు శత్రువులు ఎలా అవుతారు? ఆమె మీద కోపంతో ఈ అమ్మ దగ్గరికి వచ్చావా? పైగా చావాలని వచ్చావురా? ఇదేమైనా న్యాయమా? నీ వలన లోకానికి జ్ఞాన ఉద్ధారణ జరగాలని ఉంది… అంటూ ఆయన నాలిక మీద బీజాక్షరాలు రాసినది! అనగా దుర్గ మంత్ర బీజాక్షరాలు పొందడం జరిగినది! దానితో ఆయన బ్రహ్మ జ్ఞానమును పొంది ఆత్మ, తత్వ, లౌకిక జ్ఞానాలు పొందడం జరిగినది!📷అమ్మవారు ఇచ్చిన దుర్గాదేవి యంత్రము

గమనిక: 

అందరికి తమ ఆఙ్ఞాచక్ర స్ధితి వద్ద దుర్గాదేవి ఆరాధన వస్తుంది! అలాగే ఈ ఆరాధన వలన మనం ఈమె అనుగ్రహమును పొందితే మనకి బ్రహ్మరంధ్రము వద్ద ఆదిపరాశక్తి యొక్క త్రివిధ రూపాలలో అనగా దీపదుర్గ, దీపకాళిక, దీపచండి రూపాలలో మనకి కపాలమోక్షము దీపదుర్గ ఇచ్చేఅవకాశము కలుగుతుంది! మాకు మాత్రము దీపదుర్గ ఇస్తే...మా జిజ్ఞాసికి దీపచండి కపాలమోక్షము ఇచ్చినది! ఎందుకంటే ఈ ఆఙ్ఞాచక్రము వద్ద వచ్చిన దుర్గాదేవిని మనవాడు పూజించలేదు!నేను చేసిన విగ్రహరాధన వలన నాకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో మీకు తెలుసు గదా! కొన్ని నెలలకి నేను నిత్యం చేసే గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు 24 గురువులు 24 అస్త్రాలు ఉన్నారని శబ్ద పాండిత్యము ద్వారా తెలుసుకుని…. ఈ 84 దైవ విగ్రహ మూర్తులలో నాకిష్టమైన రూపముగా మహా శివ లింగ మూర్తి ని…. ఇష్టదైవంగా దుర్గామాతను… గురువుగా శిరిడి సాయి బాబాను…. ఇష్టమంత్రముగా గాయత్రి మంత్రమును…. ఆరాధిస్తూ వచ్చేవాడిని! మిగతా దేవతామూర్తులను మూటకట్టి బీరువాలో ఉంచడం జరిగింది! రానురాను ఈ శివుడిని, దుర్గామాతను, శిరిడి సాయి బాబా వారిని కూడా పూజించడం మానివేసి…

ఏక స్వరూపముగా సకల దైవ స్వరూపముగా విశ్వ శక్తి, కాంతి శక్తి ఉన్న నవ పాషాణ ఇష్టలింగమును నా ప్రాణ లింగేశ్వరుడు గా మెడలో ధరిస్తూ …. నిత్య శివదీక్ష గా పూజించే స్థాయికి చేరుకున్నాను! అనగా మూలాధార చక్ర స్థితి గణపతి నుండి అంతిమ చక్ర స్థితి అయిన హృదయ చక్ర శక్తి అధిపతి అయిన ఇష్ట లింగేశ్వరుడు వరకు వచ్చినాను! అనగా సోమవారం పూజ తో అనగా శివపూజ తో మొదలైన నా పూజలు తిరిగి హృదయ చక్ర వాసిని ఇష్ట లింగేశ్వరుడితో ఆగిపోవటం విచిత్రమే కదా! కాబట్టి మీరు కూడా నేను చేసిన తప్పు చేయకండి! మీకు ఉన్న లేదా వచ్చే వాటి దేవతా విగ్రహమూర్తులను మీ పూజా మందిరంలో ఉంచండి! కాకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు చేయవలసిన అవసరము లేదు! ఇక అమితంగా ఇష్టపడే దైవ స్వరూపమును ఒకదానిని ఎంచుకోండి! దానికే ప్రతి రోజు పూజలు చేయండి! ప్రార్థించండి! నివేదనలు అర్పించండి! హారతిని ఇవ్వండి! ఆయనలోన లేదామీ లోనే సకల దేవతలు ఉన్నారు అని గ్రహించండి! ఒక గోమాత లోనే 36 కోట్ల విశ్వ దేవతలు ఉంటారని శాస్త్రవచనము కదా! అలాగే మీరు ఎంచుకున్న మీ ఇష్ట దైవము లో ఉండకుండా పోతారా ఆలోచించండి! ఖచ్చితంగా ఉంటారు కదా! ఉదాహరణకి మీ ఇష్టదైవం శివుడు అనుకోండి! వీరిని గణపతి లోనూ, అమ్మవారి లోనూ, బాబా వారిలోనూ, ఇలా మీకు కావాల్సిన రూపాలలో శివ రూపం చూసుకోవడం అలవాటు చేసుకోండి! అనగా శివ గణపతి గాను, శివాని గాను, శివ సాయి గాను, అన్నమాట! ఇలా మీరు అన్ని రూపాలలో మీ ఇష్ట రూపము చూడగలిగితే విగ్రహరాధన నుండి త్వరలోనే విశ్వారాధనకి వస్తారు! అనగా విగ్రహములో దేవుని చూసే మీరు కాస్త…. మానవుడిలో మాధవుడిని చూసే ఆత్మనివేదన భక్తి స్థాయికి రాగలుగుతారు! ఇవి మీకు సాధ్య పడాలి అంటే మీరు ఏకైక ఇష్టదైవమును మాత్రమే పూజించాలి… నమ్మకం ఉంచుకోవాలి… విశ్వసించాలి… ఆరాధించాలి! మీ ఏకైక ఇష్టదైవమునకు నిత్యపూజలు చేసుకోవాలి! నిత్య మంత్రాలను చేసుకోవాలి! నిత్య మంత్రారాధన చేసుకోవాలి! నిత్య దైవారాధన చేసుకోవాలి! నిత్యం ధ్యానం చేసుకోవాలి! తద్వారా మీకు దైవ అనుభవ అనుభూతులు కలుగుతాయి! తద్వారా మీకు మీ ఇష్ట దైవ అనుగ్రహమును పొంది మీ ఇష్ట దైవ సాక్షాత్కరమును పొందడము జరుగుతుంది! గాకపోతే ఇలాంటి ఏకత్వ భావస్ధితి అన్నింటయందు కల్గడము అంత తేలికైన విషయం కాదని గ్రహించండి!ఇది ఇలాయుండగా యధావిధిగా ఒకరోజు ఉమాపతిగారు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు క్రింద ధ్యానము చేసుకుంటుండగా అమ్మవారు వారికి ధ్యానములో కనిపించి "నీవు నాకోసము చేసిన మంత్ర తపస్సుకి మెచ్చి నీకు ఒక కానుక ఈ రోజు ఒకటి ఇస్తున్నాను”! అనిచెప్పి అదృశ్యమైందట! ఈయనకి ఆ కానుక ఏమిటో అర్ధము కాలేదట!

అదే రోజు తెల్లవారుజామున అమ్మవారి గుడి తలుపులు ఆలయపూజారులు తెరవగా… అమ్మవారి కుడి భుజస్కందము క్రింద పడిపోయి కనిపించినది! దానితో వారు భయపడిపోయి ఈ విషయాన్ని ఉమ్మన్నపంతులు గారికి చెప్పినారుట! అపుడు ఆయన వెంటనే గంధముతో ఊడిపోయిన భుజ స్ధానములో దీనిని అమర్చాలని విశ్వప్రయత్నము చేసినను… ఇది యధాస్ధానములో అమరకపోయేసరికి...దీనికి కారణము ఏమైంటుందని వీరు తిరిగి ధ్యానములోనికి వెళ్ళగా…. తిరిగి అమ్మవారు వీరికి కనిపించి “ఈ భుజమును తీసుకోమని...అదియే తన కానుకయని” ...అని చెప్పి......“దీనిని తన ప్రతిరూపముగా ప్రతినిత్యము పూజించుకొమ్మని...ఇలా చేస్తే మీ వంశమునందు సంతాన తాపత్రయం లేని బ్రహ్మజ్ఞానులు నా అనుగ్రహము వలన కలుగుతారని” అని చెప్పి...ఆమె ఒక ఔషధరసము గూర్చి చెప్పి...దానిని తయారుచేసి గంధముతో మా భుజము లేనిచోట రాసినచో మరో భుజము మొలుచునని చెప్పడముతో… ఆ విధముగా అమ్మకి చెయ్యగానే...భుజము కొత్తది వచ్చినది! అపుడు వారు ఈ విధముగా అమ్మవారి నుండి ఈయన పొందిన దక్షిణ భుజమును తీసుకొని తిరిగి తమ గ్రామమైన పెద్దకళ్ళేపల్లికి చేరుకున్నారని...ఈ భుజమును వారి జీవితకాలమంతా దీనిని పూజించడము జరిగినదని.... మంచెం వెంకట భాస్కర దత్తాత్రేయశర్మ రచించిన “శ్రీ కనకదుర్గా క్షేత్ర వైభవము” అను గ్రంథము నందు మీకు కనపడతాయి! అలాగే వీరు పూజించిన అమ్మవారి భుజస్కందమును ఇప్పటికి మనము కృష్ణాజిల్లాలోని పెదకళ్ళేపల్లి గ్రామములోని దుర్గాదేవి గుడి యందు చూడవచ్చును! దీనిని మేము స్వయంగా ఆ గుడికి వెళ్ళి ఈ అమ్మవారి భుజస్కందమును చూడటము జరిగినది! అలాగే ఫోటోలు తీయ్యడము జరిగినది! మీ కోసము వాటిని పెడుతున్నాము! చూసి తరించండి! అలాగే ఈ దేవాలయం గుడి స్తంభం మీద ఆయన శిలామూర్తి రూపము కూడా ఉన్నది!

తర్వాత మూడవ తరములో ఈ వంశము నందు పుట్టిన మహాబ్రహ్మజ్ఞాని అయిన బుద్ధు కుటుంబరావు గూర్చి తెలుసుకోవాలి! వీరు మాకు ముత్తాత అవుతారు! గాకపోతే వీరు బాలదేవి ఉపాసకులు గావడము విశేషము! వేద పండితులు, అశ్వమేధయాగం కూడా చేయించగలిగేవారుట! ఈయన నీటిమీద నడిచే శక్తిని పొందినాడు! ఎంతోమంది యోగులు, సాధకులు, గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, హిమాలయ గురువులు, కాశీక్షేత్ర వేదపండితులు వీరి దగ్గరికి వచ్చి ధర్మ సందేహాలు తీర్చుకునేవారుట! ఇలా వచ్చినవారు తమ సందేహాలు తీర్చుకొని వెళ్ళిపోతున్న వారిని చూసి తన పిల్లలతో"ఓరేయి! ఇపుడే హంస వచ్చి..తన సందేహామును తీర్చుకొని...ఎగిరిపోయినదని... అని అనేవారని మా అమ్మ చెప్పినది!ఈయన చిన్నవయస్సులో ఉండగా ప్రతిరోజు వెళ్ళే గుడికి వెళ్ళగా...ఒకరోజు ఈ గుడిలో ఒక సాధువు కూర్చునియుండగా… పిల్లలందరు ఈయన చుట్టు చేరగానే...ఈ సాధువు వీరి కోసము పటిక బెల్లం సృష్టించి ఇవ్వగా... మా ముత్తాత దీనిని తీసుకోకుండా అది ఎలా సృష్టించబడినదో చెప్పమని అడినారుట! అపుడు ఆ సాధువు చెపుతానని ఈయన తలమీద చెయ్యి పెట్టగానే శక్తిపాతము జరిగిందిట! అపుడు ఈ సాధువు ఈయనకి బాలమంత్రోపదేశము చెయ్యగా...దానిని ఈయన శ్రద్ధాభక్తితో చెయ్యగా...ఈ మంత్రదేవత అయిన బాలదేవి ఎనిమిది చేతులతో...ఎరుపురంగు చీరలో కనిపించి...వీరి నాలిక మీద బాలామంత్ర బీజాక్షరాలు వ్రాసి అదృశ్యమైనది! అపుడు నుండి వీరు తరుచుగా సమాధిస్ధితిలోనికి వెళ్ళడము జరుగుతూండేది!

అనుకోకుండా వీరి చేతికి మా ఉమ్మన్నతాత గారి దుర్గ బంగారపు యంత్రము రావడము...ఈయన దీని వెనుకవైపున తన నాలుక మీద అమ్మవారు వ్రాసిన బాలా బీజాక్షరాలు వ్రాయించడము జరిగినది! దానితో ఈ యంత్రము కాస్తా బాలాదుర్గ యంత్రమైనది! దీని ఆరాధనతో ఈయనికి సహజసిద్ధంగా బ్రహ్మజ్ఞానసిద్ధి కలిగి...ఎన్నో వేదాంత గ్రంథములు చదివి...వాటిని సరళభాషలో ఇతరులకి బోధ చేస్తూండేవారు! అనుకోని విధముగా వీరికి రెండసారి 40రోజులపాటు సమాధిలోనికి వెళ్ళడము...ఆపై స్మశానవైరాగ్యము కల్గి... చేస్తున్న హెడ్ మాష్టార్ ఉద్యోగమును అలాగే భార్యపిల్లలను వదిలేసి...కాలినడకన మద్రాసు మీదగా ట్రావంకూర్ వద్ధ ఉన్న అడవికి చేరుకొని...ఏడు సం!!రాలు పాటు అక్కడున్న సాధువులతో చేరి...ఎన్నో ఆధ్యాత్మికరహస్యాలు తెలుసుకొని...జలసిద్ధుడై తిరిగి స్వగృహమునకు వచ్చి...ఉపాధ్యాయుడిగా వృత్తిని సేకరించి... ప్రతిదినము ఎక్కువకాలము సమాధిలో ఉంటూ...అలాగే గృహస్ధాశ్రమునందు ఆదర్శవంతమైన జీవితమును గడుపుతూ...వీరు గ్రంథరచన చెయ్యడము చేసినారు! వీరు సైకాలజీ మీద రాసిన వ్యాసాలు “న్యూయార్క్ టైము” నందు ప్రచురించబడినాయి! అలాగే వీరు గీతాప్రపంచము, రామతత్వము, దేవాలయ విజ్ఞానము అను ముద్రిత గ్రంథములు రచించగా...అముద్రిత గ్రంథములుగా అనేక మంత్ర శాస్త్ర రహస్య వ్యాసాలు మనకి అందుబాటులో దొరకకుండా పోవడము జరిగినది! వీరు రచించిన “గీతాప్రపంచము” అను గ్రంథమును ఈ సైట్ యందు ఉంచడము జరిగినది! గమనించగలరు! అలాగే వీరు బందరులో 12-2-1967 లో జీవసమాధి చెంది స్ధూలకపాలమోక్షస్ధితిని పొందడము జరిగినది! ఆ తర్వాత ఇదే ప్రాంతము నందు 27-3- 1978 సరిగ్గా 11 సం!!రాలకి వీరి అంశతో మా జననము జరిగినది!

వీరికి లాగానే మేము బ్రహ్మజ్ఞాన సిద్ధికి వీరు పూజించిన బాలదుర్గ బంగారపు యంత్రమును తిరిగి పొందడము జరిగినది! అలాగే వీరికి లాగానే మేము యోగదర్శనం, జాతకప్రశ్న, సంపూర్ణ విశ్వగురుచరిత్ర, కపాలమోక్షం అను ముద్రిత గ్రంథములు రచించడము జరిగినది! అటుపై 11-3-2019 సం!! మహాశివరాత్రినాడు మాకు మా ముత్తాత అంశయైన మా సూక్ష్మశరీర కపాలమోక్షం పొందడము జరిగినది! అనగా మా మాడు మధ్యభాగ బ్రహ్మరంధ్రము నుండి తెల్లని పదార్ధము ఒక చారిక లాగా బయటికి వచ్చినది! మోక్షమంటే చనిపోవడము గాదని తెలుసుకొండి! ఆయా శరీరాలు ఆయా ప్రారబ్ధకర్మలను కర్మశేషము లేకుండా పూర్తిచేసుకుని...వాటి నుండి విముక్తి పొంది...ఆ శరీరము మనో నిశ్చలస్ధితి పొందినట్లు అన్నమాట! అనగా ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో...అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే అన్నమాట! ఇలా మన శరీరములో ఉన్న పంచశరీరాలు అనగా స్ధూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలకి మోక్షస్ధితిని పొందాలి అన్నమాట! అదే జీవసమాధి అంటే మరణించడము అన్నమాట! అనగా మన పంచశరీరాలు పంచకపాలస్ధితికి చేరుకొని ఏకకాలములో ఒకదానితర్వాత మరొకటి విభేదనము చెందుతూ పరమశూన్యము నందు ఐక్యం చెందడమే జీవసమాధి అవుతుంది! అనగా యోగసిద్ధి పొందటం అవుతుంది! అలాగే ఈ ముత్తాత కి ఆడసంతానము యొక్క పెద్ధకుమారుడు ఘంటసాల సాయిబాబా గూడ శబ్ద, అనుభవ బ్రహ్మజ్ఞాని అయ్యి మాకు భౌతిక గురువైనారు! వీరి గూర్చి మీకు విచిత్ర వేదాంతి అనే అధ్యాయములో వస్తుంది! నేనేమో ఈ ముత్తాత యొక్క ప్రధమ కుమారుడి యొక్క ప్రధమ కుమార్తె యొక్క ద్వితీయ పుత్రుడిని అన్నమాట!

ఇక ప్రస్తుత విషయానికి వస్తే విగ్రహరాధన కోసము దుర్గామాత విగ్రహమును తీసుకోవాలని నేను నిశ్చయించుకోవడము జరిగినది! విగ్రహలు అమ్మే కొట్టుకి వెళ్ళడము జరిగినది! అక్కడ అంగుళము నుండి ఆరు అడుగుల పంచలోహ విగ్రహమూర్తులు కనిపించాయి! అందులో ఏ విగ్రహనికి నిజ దైవత్వమున్నదో...ఎలా కనిపెట్టాలో అర్ధమవ్వక జుట్టు పీకుంటున్న సమయములో... ఒక 35 సంవత్సరాలు ఆవిడ ఎరుపు రంగు చీర- నల్ల జాకెట్టు వేసుకున్న ఆవిడ నా దగ్గరికి వచ్చి పది రూపాయలు అడిగి తీసుకుని… నావైపు అమాయకంగా చూస్తూ...ఒక అంగుళము ఉన్న పంచలోహ దుర్గావిగ్రహమును నా చేతిలో పెట్టగానే...ఎవరో ఆ సమయములో గుడి గంటలు మ్రోగించడము...అటుపై ఈ స్త్రీ మూర్తి కనిపించకపోవడము జరిగిపోయినాయి!ఆ తర్వాత నేను అమ్మవారికి ముత్తయిదువు వస్తువులు సమర్పించి... అమ్మవారు ఇచ్చిన ఈ అమ్మవిగ్రహమూర్తిని తీసుకొని మా ఇంటికి రావడము జరిగినది! దేవీ నవరాత్రులు చేయడం ఆరంభించినాను!

ఇలా దాదాపుగా మూడు దేవినవరాత్రులు జరుగగా...అనుకోకుండా మరుసటి దేవినవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సమయములో...ఒక విచిత్ర సంఘటన జరిగినది! అది ఏమిటంటే...మా ఇంటికి మా మామయ్య వచ్చి"ఓరేయ్! పవనా! నీకు ఒక విషయము చెప్పాలని వచ్చినాను! అది ఏమిటంటే మన ముత్తాతలు పూజించిన బాలదుర్గ బంగారపు యంత్రమును నా అవసరాలకి తాకట్టు పెట్టడము జరిగినది! దానికి ఈ రోజుతో గడువు ముగుస్తుంది! దానికి డబ్బులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు! ఈ బాకీ కట్టకపోతే ఆ యంత్రమును కరిగించి ఏవో వస్తువులుగా తయారుచేసి అమ్ముకుంటాడని నాతో చెప్పడము జరిగినది! నాకు అలా చెయ్యడము ఇష్టము లేదు! రాత్రి అమ్మవారు నా కలలో ఉగ్రస్వరూపముగా కనిపించి...చేతిలో చిన్న అంగుళమున్న దుర్గావిగ్రహమూర్తిని చూపించి...అటుపై నిన్ను చూపించినది అని చెప్పగానే...అసలు వాడు ఏ యంత్రము గూర్చి చెపుతున్నాడో నాకు మొదట అర్ధము కాలేదు! ఆ తర్వాత వాడి దగ్గర నుండి వాడికి తెలిసిన ఈ యంత్ర వివరాలు నాకు చెప్పేసరికి నాకు బుర్ర తిరగడము మొదలైంది!కేవలము 3వేల రూ!!లకి మన ముత్తాతలు తయారుచేసిన మహిమాన్వితమైన యంత్రమును తాకట్టు పెట్టినందుకు వాడిమీద వీర్రావేశము కలిగి నానాబూతులు తిట్టి...ఆ యంత్రము విడిపించటానికి సమయానికి నా దగ్గర గూడ డబ్బులు లేకపోతే ... మా అన్నయ్యని అడిగి… వాడు డబ్బులున్న ఇవ్వనని అనేసరికి బాధ వేసి...వెంటనే మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఫోన్ చేసి...ఆ మూడు వేలు వీడి దగ్గర అప్పుగా తీసుకొని...ఆ తాకట్టు నుండి ఈ యంత్రమును విడిపించడము జరిగినది! అపుడే ఈ యంత్రమును చూడటము జరిగినది! ఇలాంటి యంత్రము ఒకటి ఉన్నదని తెలుసుకోవడము అదే మొదటిసారి అన్నమాట! మా మామకి ఈ యంత్రమును తిరిగి ఇచ్చి ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యవద్దని చెప్పి...నేను ఇంటికి బయలుదేరినాను! నేను నా నవరాత్రి పూజ హడావుడిలో ఉండగా... సరిగ్గా దుర్గాష్టమి నాడు మళ్ళీ మా మామ నా దగ్గరికి ఈ యంత్రముతో వచ్చి... “దీనికి వారసుడు నేనేయని...రాత్రి అమ్మవారు కలలో కనిపించి చెప్పినదని” వాడు చెప్పితే…నేను నమ్మలేదు! “నా కలలో గాని, ఇలలో గాని ఈ అమ్మవారు కనిపించి చెప్పితే అపుడు నమ్ముతాను...అపుడిదాకా ఈ యంత్రమును నేను తీసుకోను” అని చెప్పినాను! ఆ రోజు దుర్గాష్టమి...పూజ కోసము అన్నీ సిద్దము చేసుకుంటుండగా...ఎవరో నా వీపుమీద గట్టిగా చాచి కొట్టి…. “వాడికి చెప్పినది చాలకా...నీకు గూడ చెప్పాలా...నేనే వచ్చినానమ్మవా?” అని అరిచినట్లుగా అనిపించినది! చుట్టూ చూస్తే ఎవరు కనిపించలేదు...కేవలము ఆశరీరవాణి మాత్రమే వినబడినది!ఆ సమయములో నా ముందున్న పూజపళ్లెములో నాకు వచ్చిన దుర్గమ్మవారి విగ్రహము ఎవరి ప్రమేయము లేకుండా కదులుతూండేసరికి...నాలో తెలియని భయమును చూసి మా మామ చిరునవ్వు నవ్వి"శంఖములో పోస్తే గాని తీర్ధము గానట్లుగా...ఆమె కొడితే గాని నీకు నేను చెప్పినది నిజమని నమ్మలేదు అంటూ...మా పూజపళ్ళెములో తను తెచ్చిన యంత్రమును పెడుతూ... “గత జన్మలలో ఎవరైతే దీనిని గీసి అర్చించినారో...మళ్ళీ ఈ జన్మకి వాళ్ళ దగ్గరికే చేరేటట్లుగా చేసినావా అమ్మ” అంటూ... ఆ యంత్రమును అందులో పెట్టి మౌనముగా తన ఇంటికి వెళ్ళిపోయినాడు! ఈ యంత్ర అనుభవాలు మీకు తెలియాలంటే...మా ఆఙ్ఞాచక్ర అనుభవాలు వచ్చేదాకా వేచిచూడక తప్పదు!

దానితో నేను దుర్గాదేవి మూర్తికి మా తాతలు ఆరాధించిన స్వయంభు బాలదుర్గా యంత్రమును అనుసంధానము చేసి ఆరాధించడం మొదలు పెట్టినాను! దేవీ నవరాత్రులు చేయడం ఆరంభించినాను! వీలున్నప్పుడల్లా ఆమెకు గారెలు, పులిహోర నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది! అలాగే ఎప్పుడైనా కావాలి అంటే ముత్తైదువు వస్తువులు సమర్పించడం జరుగుతుంది! కానీ విచిత్రం ఏమిటంటే ఇంటిలో నెలసరి రోజులు జరిగిన తర్వాత ఇంటిని శుద్ధి చేయకపోతే మా ఇంటి లోని వాటర్ ట్యాంక్ లోంచి నీళ్లు వాటంతట అవే బయటకు వచ్చి ఇంటిని శుద్ధి చేయటం మొదలవుతుంది! ఇదే ఆమె ప్రస్తుతం నాకు చూపిస్తున్న ప్రత్యక్ష అనుభవం! అలాగే దేవీ నవరాత్రులు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపములో ఒక స్త్రీ మూర్తిగా మా ఇంటికి వచ్చి అంటే తెలిసిన వారు లేదా తెలియని వారు రావచ్చును! ఆరోజు ప్రసాద నైవేద్యాలు తిని సంతోషంగా వెళ్లిపోవడం …. ఇది ఇప్పటికీ నాకు విచిత్ర సంఘటన లాగానే ఉన్నది!

నేను మహిమాన్వితమైన బాలదుర్గ యంత్రము ఆరాధన వలన మనస్సు శుద్ధి అవుతున్న కొద్దీ… మనలో దైవత్వ లక్షణాలు కనిపించడము మొదలైనాయి! వీటితో పాటుగా సమ్మోహన, ఆకర్షణ, తేజస్సు వంటివి మొదలైనాయి! తద్వారా స్త్రీమూర్తులు మళ్ళీ యధావిధిగా… నా మాటలకి, నా చూపులకి, నా చేష్టలకి ఆకర్షితులై…వారికి తెలియకుండానే నా సమ్మోహన మాయలో పడటం మొదలు పెట్టినారు! తిరిగి కర్మ మార్గం లో ఉన్నప్పుడు ఆడవాళ్ళ సమస్యలు, అవమానాలు, అనుమానాలు తిరిగి మళ్ళీ భక్తిమార్గంలో కనిపించడం మొదలైంది! దానితో నాకు ఈ భక్తి మార్గం కూడా నా వంటికి సరిపడదని గ్రహించాను! నా పరిస్థితి ఇలా ఉంటే మన జిజ్ఞాసి ఎంచుకున్న శ్రీరాముడు విగ్రహరాధన వలన …. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి! వాడిని చూస్తే శ్రీరాముడు నిజంగానే ఇలా ఉంటాడా అని అనిపించేది! కేవలం మూడున్నర సంవత్సరాలలో సాక్షాత్తు శ్రీరాముడు నోటి నుండి పుట్టిన వాడిలాగా వీడి ఉపాసన వలన ఆయన రూపం లోనికి మారిపోయాడు! కానీ నాకు ఆడవాళ్లు ఆకర్షితులు అయితే మన వాడికి మగవాళ్ళు ఆకర్షించటం మొదలుపెట్టినారు! పనిమాలా వీడి దగ్గరికి వచ్చి వీడి బుగ్గల నొక్కటం, స్పర్శ కోసం తపన పడటం చూసేసరికి… మనవాడిలో భయం మొదలైంది! ఇలాంటి చేష్టలు ఎవరైనా చూస్తే తను తేడా అనుకునే ప్రమాదం ఉందని గ్రహించి… నెమ్మది నెమ్మదిగా శ్రీరామ ఉపాసన అలాగే నేను బాలాదుర్గయంత్రోపాసనను తగ్గించడము మొదలు పెట్టినాము! శ్రీరామ ఉపాసన వలన తను కేవలం శ్రీరాముడు రూపమును పొందుతున్నాను గాని తన సాధన పరిసమాప్తి చేసే మార్గం దొరకటం లేదని పలు విధాలుగా బాధపడేవాడు! తను మరో రామావతారం గా మారినంత మాత్రాన సాధన పరిసమాప్తి కాదని అలాగే నేను మరో దేవి రూపంగా మారినంత మాత్రాన ఉపయోగం లేదని మా ఇద్దరికీఅర్థమైంది! భక్తిమార్గంలో ఉంటే వారి ఇష్ట దైవ రూపాలుగా వారి ఉపాసన స్థాయిని బట్టి మారతారని వివిధ దైవ ఉపాసకులను చూసి గ్రహించి నాను! ఇలా మారటం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు! ఎందుకంటే అసలు దైవ స్వరూపాలు సృష్టించింది ఎవరు? వారికి వారే ఏ కారణం చేత సృష్టించబడినారో తెలుసుకోవాలనే …. తపన మా ఇద్దరిలో ఆగటంలేదు! దాంతో మేము కూడా కర్మ, భక్తి మార్గాలకు తిలోదకాలిచ్చి జ్ఞానమార్గం వైపుకి అడుగుపెట్టి నాము! మరి ఇంకా ఆలస్యం ఎందుకు…. మీరు కూడా మాతో పాటు ముందుకు ప్రయాణం చేయండి!

కపాలమోక్షం - 30-మాయ అంటే…

(నా జ్ఞానమార్గం)

మా ఇద్దరికీ కూడా కర్మ ,భక్తి మార్గాలు కూడా మా సాధనా మార్గాలు గాదని తెలుసుకోవడంతో మూడవదైన జ్ఞానమార్గం వైపు ప్రయాణించాము! దీనికోసం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆరంభించాము! యోగుల చరిత్రలు చూస్తే సాధనలో ధన, స్త్రీ, పరస్త్రీ/ పరపురుష వ్యామోహాలు దాటాలని చెప్పడం జరిగినది! రామాయణము చూస్తే బ్రహ్మజ్ఞాని అయిన రావణబ్రహ్మ పరస్త్రీ అనగా సీతాదేవి వ్యామోహం వలన నశించినాడని తెలిసింది! ఇక మహాభారతానికి వస్తే సప్త వ్యసనాలు వలన ధర్మరాజు కాస్తా జూదవ్యసనము వలన అలాగే దుర్యోధనుడు అహంకారము వలన యుద్ధాలు వచ్చి వంశాలే నాశనం చేసుకున్నారని తెలిసింది! ఇలా ప్రతిదానిలోనూ, ప్రతిచోటా “మాయ” అనే పదము బాగా వినబడటం మా ఇద్దరికి ఆశ్చర్యం కలిగించింది! అసలు మాయ అంటే ఏమిటి? అనే ధర్మ సందేహం కలిగింది! కొంతమంది మాయ అంటే ఉన్నది లేనట్లు- లేనిది ఉన్నట్లుగానే చూపించేది అని, మరి కొంత మంది అయితే ఒక భ్రమ- భ్రాంతి అని, మరి కొంతమంది అయితే నిరంతరం రూపాంతరం చెందుతూ ఉండేదని… ఇలా పలు రకాలుగా పలు అభిప్రాయాలు చెప్పడం జరిగినది! కాకపోతే అది మాకు అర్థం అయ్యేది కాదు! అర్థమై అర్థం కానట్లుగా ఉండేది! దానితో ఇది తెలియాలి అంటే జ్ఞాన మార్గం లోనికి వెళితే తప్ప మాయ అంటే ఏమిటో తెలియదని మేమిద్దరం జ్ఞాన మార్గమును ఎంచుకోవడం జరిగింది! నా స్వామిరంగా… అక్కడనుండే ఆట మొదలైంది! మాయ అంటే జ్ఞానము తెలుసుకోవటం అని… అది పొందితే మాయ కాస్త మాయం అవుతుందని నేను చదివిన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్పేసరికి…. ఓస్ ఇంతే గదా… ఏముంది… మాయ తెలుసుకోవటం చాలా తేలికైన మాట అని… మాయ అని తెలుసుకుంటే మనకు మాయ ఉండదని… మేము భ్రమపడి… మాయలో పడినాము! దానితో మా కష్టాలు ఆరంభమయ్యాయి! అదేదో సినిమాలో బ్రహ్మానందం మనకు ఎదుటివారి మనస్సులో ఏముందో తెలుసుకోవాలి అనే వరమును పొందుతాడు! దానితో చీమల దగ్గర నుండి మనుషుల దాకా వారి మనస్సులోని భావాలు తెలియడంతో ఆనందమును కోల్పోయి నానా ఇబ్బందులు ఎలా పడతాడో… అలా మేమిద్దరం కూడా పడినాము!

ఒకరోజు నేను గుడికి వెళుతుంటే…. గుడి మెట్లు ఎక్కుతూ …ఒక అందమైన అమ్మాయి కనబడినది! ఇది మాయ అనుకుని భ్రమ, భ్రాంతి అనుకుంటూ… నేను గుడి లోపలకి వెళ్ళినాను! మనస్సు దైవం మీద లేదు! కానీ అమ్మాయి మీద ఉంది! ఈ అమ్మాయి ఎవరు? ఇంతవరకు చూడలేదు? ఊరికి కొత్త? ఫిగర్ బాగుంది! వామ్మో… ఇంతటి అందమా! నడుస్తూ వుంటే… ఆ కవ్వింపు చూపులు… నా సామి రంగా… మళ్లీ ఎలాగైనా మరొకసారి చూడాలి అని అంటూ… ఇవే ఆలోచనలు! అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అంటే… మనస్సు దైవం మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా ఉంది! ఉండలేకపోయాను! ఓ పక్క అది మాయ అని తెలుసు… మరి ఎందుకు నాకు ఆమె గురించిన ఆలోచన పోవటం లేదు! నాకు అర్థమయ్యేది కాదు! అప్పటికే అమ్మాయి వెళ్ళిపోయినది! ఆమె వెళ్ళిపోయిన నా మనస్సు నుండి ఆమె గూర్చే … ఆమెకి సంబంధించిన ఆలోచనలు పోలేదంటే… నా బొంద… ఇదే మాయ అనుకుంటూ తిట్టుకుంటూ ఊరుకున్నాను!

ఇది ఇలా ఉంటే నా ఖర్మ కాలి ఇదే సమయంలో మా స్నేహితులు ఒక్కొక్కరిగా కొత్త కొత్త విలువైన వస్తువులు కొనటం, వేసుకోవడం, పెట్టుకోవడం ఆరంభించారు! వాటిని కొనే ఆర్థిక పరిస్థితి నాకు అప్పట్లో లేదు! వాటిని చూసి ఆనందించడం తప్ప! అలాగని నా మనస్సుకి అవి అన్నియు మాయ, భ్రమ, భ్రాంతిలే అని చెప్పినప్పటికీ …. అది ఒక పట్టాన వినేది కాదు! ఎలాగైనా వాటిని పొందాలని, అనుభవించాలని పిచ్చి ఆలోచనలు విపరీతంగా వచ్చేవి! ఆ వయస్సు అటువంటిది! నిజానికి అనుభవించే సమయములో అనుభవించే వాటిని అనుభవించకపోతే… ఆ తర్వాత అవి వచ్చిన ఎలాంటి ఉపయోగం ఉండదని నా ప్రగాఢ విశ్వాసము! తీపి పదార్థాలు తినవలసిన సమయములో డబ్బులు ఉండేవి కావు! డబ్బులు వచ్చేసరికి ఒంటిలో షుగరు వస్తుంది! ఇప్పుడు డబ్బులున్న తీపి పదార్థాలు కొనే స్థోమత ఉన్నా కూడా తినలేను కదా! వాడి పరిస్థితికి ఏమనాలి! అదే నా పరిస్థితి కూడా! విలువైన వస్తువులు ఎంతకాదన్నా మాయలే అనుకున్న నా మనస్సుకు అర్థమయ్యేది కాదు! దానిని నా దారికి తెచ్చుకోవాలి అంటే కొన్ని నెలల పైనే పట్టేది! ఆ వస్తువుల గురించి మర్చిపోవడానికి నాకు కొన్ని నెలల పైగా సమయం పట్టేది! రూపం లేని మనస్సు… రూపం ఉన్న వస్తువులు కావాలని అనుకోవటమే నిజమైన మాయ కాబోలు అని నాకు అప్పుడప్పుడూ అనిపించేది!

నా పరిస్థితి ఇలా ఉంటే నా యోగ మిత్రుడైన మన జిజ్ఞాసి పరిస్థితి వేరేగా ఉంది! ఇతను కూడా జ్ఞాన మార్గం లోనే ఉన్నాడని తెలుసు కదా! వాడు తనకున్న మాయ తెలుసుకోవడానికి… తొలగించుకోవటానికి…. వాడు కాస్త నేను జీవుడిని కాదు… దేవుడిని అనుకుంటూ ఉండేవాడు! అనగా శివోహం అంటే అహంబ్రహ్మాస్మి అన్నమాట !నేనే దేవుడిని… నేనే శివుడిని అని నిరంతరం అనుకుంటూ ఉంటే …. మాయ వాడిని ఏమీ చేయదని వారి ప్రగాఢ విశ్వాసం! ఒక రోజు మన వాడు ఇంటికి రాత్రిపూట వెళుతున్నాడు! దారిలో ఒక పిచ్చి కుక్క ఎదురయింది! దానికున్న పిచ్చి వల్లనే అది వీడి వెంట పడింది! వెంటనే వీడికున్న కుక్క భయము వలన దానికి అందకుండా పరిగెత్తుతూ…. “ఒసేయ్ .. నేను దేవుడిని… నేను శివుడిని… నేను కాలభైరవుడిని… నన్ను నువ్వు కరవకూడదు! నువ్వు ఒక మాయ అని నాకు తెలుసు! నువ్వు లేవు… నువ్వు ఉన్నావని నాకు భ్రమ, భ్రాంతి కలిగిస్తున్నావు ! నాకు నీ మాయ తెలిసిపోయింది అనుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు! వాడి ఉద్దేశం ఏమిటంటే వాడికి ఇది మాయ అని తెలుసుకుంటే…. అది వీడిని కరవదని...వెంటపడదని వీడి నమ్మకం అన్నమాట! నా బొంద! వీడు దేవుడని వీడికి తెలుసు! పాపం ఆ కుక్క కి ఏమి తెలుసు! బాగా కరిచిపెట్టినది! కొన్నిరోజులు మంచం ఎక్కినాడు! తర్వాత నా దగ్గరికి వచ్చి … “స్వామి! కుక్క నాకు మాయ అని తెలిసినా కూడా అది నన్ను ఎందుకు కరిచినదని” అన్నాడు! దానికి నేను వెంటనే అతనితో “మిత్రమా! నువ్వు దానికి మాయ అని తెలియదు కదా! నువ్వు నిజమని అనుకొని అది నిన్ను కరిచినదని” అన్నాను! అవును కదా! ఇద్దరికీ ఇద్దరూ మాయలే కదా! ఇద్దరికీ మాయ జ్ఞానం తెలిసి ఉండాలి! ఒకరికి మాయ అని తెలిసి… మరొకరికి అది మాయ కాదని తెలియకపోయినా అది ప్రమాదమని మేమిద్దరం గ్రహించాము! ఇక దానితో మాయ అనుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని… మాయ అని మనకి కాదు…. మన మనస్సుకి అనుభవ అనుభూతి కలగాలని… అప్పుడే మనకున్న మాయ మాయం అవుతుంది తప్ప… అనుకోవడం వలన ఇది జరగదని గ్రహించటానికి మా ఇద్దరికీ చాలా నెలలు పట్టింది! ఎప్పుడైతే ఇలాంటి అనుభూతి పొందుతారో… అప్పుడు ఎదుటివారికి వీళ్ళు కూడా మాయ స్వరూపమే అనే జ్ఞానం కలుగుతుందని మేము గ్రహించాము! జ్ఞాన మార్గము అంటే అన్నప్రాశము రోజున ఆవకాయ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని… నేనే దేవుడిని అనుకున్నంత మాత్రాన ఏమీ జరగదని… అందరికీ మేము చెప్పకుండానే దైవ స్వరూపమని వారికి వారే మా గురించి అనుభవ అనుభూతి పొందితే గాని మాయ తొలగదని గ్రహించి… ఇలాంటి అనుభవ అనుభూతి కావాలి అంటే…. ధ్యాన మార్గం లోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము! ధ్యానము చేస్తే గాని మాకు ధ్యాన అనుభవానుభూతులు కల్గి మనస్సుకున్న మాయ మాయం అవ్వదని అని మేము గ్రహించి నాము! ఇకపై ఏమి జరిగిందో చూడాలి అంటే ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

గమనిక:

జ్ఞాన మార్గము లో ఉన్నవారికి ఏది మాయ, ఏది అజ్ఞానము, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది కర్మ బంధం, ఏది కర్మవిముక్తి అనేది తప్పకుండా తెలుస్తుంది! మనస్సుకి ఈ జ్ఞాన అనుభూతి లేనంత వరకు మనం ఎంత తెలుసుకున్న కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని మేము తెలుసుకున్నాము! కొన్ని సంవత్సరాల తర్వాత నిజానికి మాయ అంటే మనస్సు నిశ్చల స్థితిలో ఉండకపోవడమేనని అని గ్రహించినాము! దీనికి కారణము ఆలోచన, సంకల్పము, స్పందన అనే మూడు భావాలు వల్ల మనస్సు నిశ్చలముగా ఉండదని గ్రహించాము! ఎప్పుడైతే వాడి మనస్సు నిశ్చలస్థితి పొందుతుందో… అదే వాడికి మోక్ష ప్రాప్తి అని గ్రహించాము! ఇంతవరకు విశ్వంలో ఏ జీవికి కూడా ఇలాంటి పరిస్థితి లేదని గ్రహించాము! రాయి పైకి కనిపించడానికి నిశ్చలస్థితి ఉన్నా కూడా దానికి లోపల అది లోలోపల స్పందనకి స్పందిస్తూనే ఉంటుందని…

పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యాన సమాధి స్థితిలో ఉన్నప్పటికీ… పైకి స్పందించకపోయిన … ఆయన లోలోపల స్పందిస్తూనే ఉంటాడని… తమిళనాడు రాష్ట్రములోని శుచీంద్ర క్షేత్రములోని స్థానేశ్వర స్వామి ఆలయము ద్వారా తెలుసుకోవడం జరిగినది! ఈ విశ్వములో బలహీనత లేని బలవంతుడు ఇంతవరకు పుట్టలేదని గ్రహించినాము! ఇదియే సంపూర్ణ బ్రహ్మజ్ఞాన సాధన పరిసమాప్తి స్థితి అని గ్రహించినాము!

నిజానికి జీవన్ముక్తికి అతి తేలికైన మార్గం అలాగే అతి కష్టమైన మార్గము కూడా జ్ఞాన మార్గం అని కొన్ని సంవత్సరాల తర్వాత నేను గ్రహించాను! అనగా కనిపించేది అసత్యమని… కనిపించనిది సత్యమని ఆత్మవిచారణతో తెలుసుకోవడమే అసలైన జ్ఞాన మార్గం అర్థమవుతుందని గ్రహించాను! అనగా మనము నిద్రపోతున్నా కూడా మన పంచేంద్రియాలు నడిపించే శక్తి మనలో అంతర్యామిగా ఆత్మగా ఉన్నదని… అదే సర్వాంతర్యామిగా ఈ విశ్వశక్తితో విశ్వాత్మగా ఈ విశ్వమును నడిపిస్తోందని ఎవరైతే అనుభవపూర్వక జ్ఞాన అనుభవ అనుభూతి పొందుతారో వారికి ఈ సాధన మార్గ పరిసమాప్తి స్ధితియని అని గ్రహించాను! ఈ దివ్య జ్ఞాన అనుభూతి అనుభవానికి రాగానే మనలోని అన్ని రకాల కర్మలు, కర్మవాసనలు, సంస్కారాలు కర్మశేషం లేకుండా నాశనం అవుతాయని గ్రహించాను! దానితో పునర్జన్మ కి కారకమైన కర్మశేషము అనేది లేకుండా భస్మం అవటం వలన మనము జీవన్ముక్తి పొందుతామని గ్రహించాను! అంటే నేను ఎవరు?, ఎక్కడి నుంచి వచ్చాను?, నేను మరణించాక ఏమవుతానో?, అసలు దేని కోసం ఈ ప్రపంచం ఉంది? ఏది నాది? ఏది నీది? నేను ఎందుకు పుట్టాను? నేను ఏమి చేయాలి? నేను ఎందుకు మరణిస్తున్నాను అనే జ్ఞాన ప్రశ్నలకి… వివేక జ్ఞాన బుద్ధితో సంతృప్తి సమాధానాలు వెతకడమే జ్ఞాన మార్గం అవుతుందని రమణ మహర్షి యోగి జీవిత అనుభవం ద్వారా నేను తెలుసుకోవడం జరిగినది! అలాగే కర్మ, భక్తి మార్గాలు బాహ్యశుద్ధికి ఉపయోగపడితే… అంతర శుద్ధికి ఈ జ్ఞానమార్గము ఉపయోగపడుతుందని గ్రహించాను! అనగా నేను అనేది శరీరము కాదని ఈ శరీరమును అంటిపెట్టుకుని అంతర్యామిగా ఉన్న ఆత్మ అనేది అసలైన నేను అని ఎవరైతే అనుభూతి పొందుతారో వారికి ఆత్మ సాక్షాత్కరము కలిగి… అన్ని రకాల కర్మలు భస్మమై…. ఆత్మానంద స్థితి పొంది… మరు జన్మ లేకుండా ప్రశాంత స్థితిని పొంది…జీవన్ముక్తి పొందుతారు అని గ్రహించాను! అంటే జ్ఞాన మార్గం వలన మనలోని పాపకర్మలు క్షయంపొంది… మాయ పొరలు తొలుగుతూ… వివేక జ్ఞాన బుద్ధి పెరుగుతున్నకొద్దీ… మనలో జ్ఞానోదయం కలుగుతుందని గ్రహించాను! అనగా స్వార్థం, లోభం ,మోహం, వ్యామోహం, భయం, ఆశ, ఆవేశం, కోపం, అసూయ, కామం ఇలాంటి చెడు భావాలుతో మన జ్ఞానం కప్పబడి ఉంటుంది! ఎప్పుడైతే మనలో “నేనెవరిని” అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ఆరంభిస్తారో …ఆ క్షణము నుండి ఈ మాయపొరలు తొలగి… కర్మ నాశనం అవ్వడం మొదలవుతుంది! తద్వారా మనస్సు శుద్ధి అవ్వటం ప్రారంభమై… అది కాస్త స్థిరమై… ఏకాగ్రతను పొంది… లోపల జ్ఞానము స్ఫురణ ద్వారా బయటకు వస్తుంది! అనగా ఎన్నో కోట్లాను కోట్ల జన్మల నుండి అంతర్గతంగా ఉన్న జ్ఞానము అనగా అపస్మారక స్థితి వలన మర్చిపోయిన జ్ఞానము… స్ఫురణ వలన జ్ఞాపకము రావటం జరుగుతుంది! తద్వారా జీవుడు కాస్త శివుడు అవుతాడు! జీవాత్మ కాస్త పరమాత్మ అవుతుంది! గాకపోతే చాలామంది “నేను ఎవరిని” అనుకోవడము చేస్తున్నారు కాని ఎవరుగూడ ఆత్మవిచారణతో తెలుసుకోవడము చెయ్యడము లేదని నేను గ్రహించినాను! చివరికి మేమిద్దరం ఆఖరికి ఇదే మార్గము ద్వారా యోగసిద్ధి పొందటము జరిగినది! అది ఎలాగో రాబోవు అనుభవ అధ్యాయముల ద్వారా మీరు తెలుసుకుంటారు!

కపాల మోక్షం- 31 - మంత్రం మీద ధ్యానం

(మా ధ్యాన మార్గము)

ఇక మా ఇద్దరి వంటికి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు సరిపడవని గ్రహించి నాలుగవది అయిన ధ్యాన మార్గం లోనికి అడుగు పెట్టడం జరిగింది! ధ్యానం అంటే ఆలోచనలు తగ్గించుకోవడమేనని వివిధ గ్రంథాలు పుస్తకాలు చదవటం వలన మేము తెలుసుకోవడం జరిగినది! దానితో మన ఆలోచనలు తగ్గించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా! నా సామీ రంగా! నాకున్న ఆలోచనలు తగ్గిస్తే చాలు! సాధన అయిపోయినట్లే అన్నమాట అనుకుని… ఒకరోజు గుడిలో పనులు ముగించుకుని గుడి బయట ప్రశాంతంగా దర్భ చాప వేసుకుని జపమాల చేతిలో పెట్టుకుని కళ్లుమూసుకుని జపం చేయడం మొదలు పెట్టినాను! కొద్దిసేపటికి వరకు బాగానే సాగింది!

ఇంతలో ఒక సుమధురమైన ఆడ గొంతు తో “స్వామి! బావిలో నీళ్లు తోడు కోవటానికి చేత బక్కెట్టు కావాలని” మాట విన పడింది! అంతే నా కళ్ళు ఆత్రంగా తెరుచుకున్నాయి! నా జపము చేసే నోరు ఆగిపోయినది! ఆమె వంక అదోలా చూస్తూ … “అదిగో లోపల ఉంది! తీసుకో! దీనిని బావి దగ్గర పెట్టకుండా మళ్ళీ తీసుకుని వచ్చి లోపల పెట్టు” అని చెప్పి కళ్ళు మూసుకున్నాను! “సరే! స్వామీ” అంటూ ఆమె లోపలికి వెళ్లి చిన్న బకెట్ తెచ్చుకుని మంచినీళ్ల కోసం అని బావి దగ్గరికి వెళ్ళింది! మళ్లీ నా జప ధ్యానం మొదలయింది! కళ్ళు మూసుకున్నాను! ఇంతలో ఆలోచనలు రావటం మొదలయ్యాయి! “ అబ్బా ! ఆమె అమాయక ముఖం చాలా బాగుంది కదూ! ఫలానా వారి అమ్మాయి లేక ఫలానా వాడి చెల్లి లేదా అక్క అయి ఉండాలి అని అనుకున్నాను!అసలు ఎవరు కూడా చెప్పలేదే! ఈమె చదువుకునే అమ్మాయా లేదా ఉద్యోగం అమ్మాయా… ఏమి చదువుతుంది ఏమి చదువుకుంది! ఎంత వరకు చదువుకుంది… ఎక్కడ చదువుకుంది! పోనీ ఉద్యోగం చేస్తే …ఏమి ఉద్యోగం చేస్తోంది… ఎక్కడ చేస్తోంది! అసలు ఈ పిల్ల తాలుకా మనుషులు ఎవరు? నాకు తెలిసిన వారా లేక తెలియని వారా? అవును బకెట్ తీసుకుని వెళ్లి చాలాసేపు అయింది !అంటే అప్పటికి సుమారు ఐదు నిమిషాలు కూడా కాలేదు! నాకు మాత్రం ఈమె విరహ వేదన ఆమె కోసం గంట సేపు అయినట్లుగా అనిపించింది! కొంపతీసి బకెట్ తో పాటు తన ఇంటికి వెళ్లి పోయిందా? అనవసరంగా కళ్ళుమూసుకున్నాను అనుకుంటూ… కళ్ళు తెరిచి… గోడ వారగా చాటుగా చూస్తే … ఆమె అమాయకంగా గుడి చేతబక్కెట్టుతో నీళ్ళు తోడుకుంటూ కనిపించేసరికి… హమ్మయ్య అనుకుని మళ్ళీ మంత్రజపం చేయటం మొదలు పెట్టినాను! అంతలో ఆమె మాయ, భ్రమ,భ్రాంతి అని నా అంతరాత్మ గోల చేయటం మొదలు పెట్టేసరికి… నిజమే కదా అని మంత్రజపం ఆపివేసిన విషయం గుర్తు తెచ్చుకుని… మళ్లీ మర్చిపోయిన మంత్రమును జపమాలతో త్రిప్పుతూ చేయడం ఆరంభించిన… కొంతసేపటికి ఆమె గుడి లోపల చేతబకెట్ పెడుతున్న శబ్దం వినిపించే సరికి… నా ప్రమేయము లేకుండా కళ్ళు తెరుచుకోవడం… నోరు మూసుకోవటం జరిగినది! ఏముంది! కొద్దిసేపే కదా! ఆమె వెళ్ళి పోయే దాకా ఆమెను చూస్తే తప్పేంటి? బోడి ధ్యానము!అప్పటిదాకా ఆగదా? ఆమెను చూస్తే అరిగిపోతుందా… అనుకుంటూ ఆమె వెళ్లేదాకా చూడాలని కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉంటే.. ఆమె నా చూపులు గమనించి… నా ఖర్మ కొద్ది… “స్వామి! మళ్లీ వస్తాను! మీరు కళ్ళు మూసుకుంటే చేతబకెట్ అడగటానికి ఉండదు కదా” అని చెప్పి వెళ్ళిపోయింది! ఏదో తెలియని బాధతో మంత్రజపం మొదలయినది! కళ్ళు మూసుకున్నాను! మంత్రం మీద ఉండవలసిన మనసు కాస్తా ఆమె మీదకి వెళ్ళినది! అమ్మవారిని ఊహించుకోవలసిన నా మనసు కాస్త అమ్మాయిని ఊహించుకోవడం మొదలు పెట్టింది! అమ్మ ధ్యానం చెయ్యవలసిన వాడిని కాస్త అమ్మాయి ధ్యానంగా మారిపోయింది! కానీ ఆ విషయం నేను గమనించే పరిస్థితిలో లేను! “అవునా! మళ్లీ నిజంగానే వస్తుందా? ఎప్పుడు వస్తుంది! అసలే నన్ను అడగకుండా బకెట్ తీసుకొని వెళితే… ఆమెను చూడలేనేమో? ఏం చేయాలి? ఇంకా రాలేదేమిటి? ఇంట్లోవాళ్లు వద్దన్నారా? ఆమె వెళ్లి కూడా రెండు నిముషాలు మించి అవ్వలేదు! బిందెడు నీళ్ళుపోసి రావడానికి ఇంత సమయం తీసుకోవాలా? నా బొంద? ఆడవాళ్ళకి మరీ ఇంత బద్దకమా? ఇంట్లో తొందరగా పోసి వస్తే… నాకు ఈ బాధ ఉండదు కదా! చక్కగా ధ్యానం చేసుకునే వాడిని కదా! ఇలా నా ప్రారంభ ధ్యాన మంత్ర ధ్యాన స్థితి ఉండేది! ఇలా రానురాను ఆమె వచ్చే సమయం కోసం ధ్యానం పేరుతో గుడి ఆరు బయట కూర్చుని ఎదురుచూసే రోజులు వచ్చినాయి! ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె రావడం మానేసింది! ఆరా తీస్తే ….సెలవుల కోసం చుట్టాల ఇంటికి వచ్చిందని… ఆమెకి అప్పటికే వివాహము నిశ్చయమైనదని తెలిసేసరికి…. నా కొంగ జపము గంగపాలైనదని గ్రహించాను! ఇలాంటి జపాలు వలన ఆలోచనలు తగ్గటం దేవుడెరుగు.. ఇంకా పెరుగుతాయని నేను గ్రహించాను! అసలు నేను ఇన్నాళ్లు చేసినది అమ్మవారి ధ్యానం కాదని కేవలం అమ్మాయి ధ్యానం అవుతుందని గ్రహించడానికి నాకు 6 నెలల సమయం పట్టింది!

ఇది ఇలా కాదనుకుని గుడి బయట కాకుండా గుడి లోపల శివలింగము దగ్గర కూర్చుని ధ్యానం చేయడం ఆరంభించి నాను! ధ్యానంలో కూర్చోగానే ఎవరో పిలిచినట్లుగా… భక్తులు వచ్చి పూజలు చేయాలని , పెద్దగా గంటలు కొట్టడం తరచుగా చేసే సరికి నా ధ్యానమునకు అంతరాయం వచ్చేది! మళ్లీ వాళ్ల పని చేసుకుని వచ్చేసరికి కొత్తవాళ్ళు వచ్చేవాళ్లు! ఇలా చేస్తూ ఉంటే అంతరాయాల ధ్యానముగా ఉండేది! ఆలోచనలు తగ్గేవి కాదు! ఇంతలో భక్తులందరినీ పంపించే సరికి నైవేద్యం సమయం రానే వచ్చేది! దాంతో గుడి మూయ్యడము జరిగేది! దాంతో ధ్యానము ఆపివేయడం జరిగేది! ఇలా కాదనుకుని బడి లేదా కాలేజీ కి వెళ్ళినప్పుడు పై అంతస్తులోకి వెళ్లి ధ్యానం చేసుకోవడం ఆరంభించాను! కానీ సూర్యుడు తాపానికి నా ధ్యానము లో ఏకాగ్రత ఉండేది కాదు! ఇలా కాదనుకుని ఇంటిలో ఒక గదిలో కూర్చుని ధ్యానం చేసుకునే సమయానికి…. ఇంటిలోని వాళ్లకి అదే సమయంలో వారికి కావాల్సిన టీవీ సీరియల్స్ వచ్చేవి! దాంతో టీవీ శబ్దాలతో నా ధ్యానము ఎగిరిపోయింది! లేదంటే గొడవల శబ్దాలు, మాటలు శబ్దాలు, వంటసామగ్రి శబ్దాలు, బట్టలుతికే శబ్దాలు ఇలా పలు రకాల శబ్దాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేవి! దాంతో ఇలా కాదనుకుని మా ఇంటి పక్కనే ఉన్న తోటలోనికి వెళ్లి ధ్యానము చేసుకునే వాడిని! కానీ దీనిని మా ఊరి జనం కొంతమంది మలమును విసర్జించే ప్రాంతముగా(లెట్రిన్) ఉపయోగించుకొనేవారు!నాకు ఆ విషయము తెలిసిన అక్కడైన ధ్యానము చేసుకొనే అవకాశము కలుగుతుందనే ఆశతో ధ్యానము చెయ్యడము ఆరంభించాను! నా దృష్టిలో ధ్యానమునందు మనసు నిలపాలనే తపనతాపత్రయం ఉండేది గాని ప్రాంతానికి విలువ ఇచ్చేవాడిని కాను! నేను ధ్యానము చేసుకునే సరికి…. వాళ్ళు చెంబులతో కనపడేవారు! ఛ! నా బ్రతుకి ధ్యానము చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదా అని తిట్టుకుని… వారిని ఇబ్బంది పెట్టలేక తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్లి పోయేవాడిని! ఇలా కాదనుకుని మా ఊరికి దగ్గర్లో ఉన్న అడవి ప్రాంతమునకు చేరుకుని ఒక చెట్టు ఎంచుకొని ధ్యానము చేసిన పదినిమిషాలకి కల్లా… ఎవరో పిలిచినట్లుగా పక్షులు లేదా కోతులు ఈ చెట్టు మీద వాలడం..ఇవి చేసే శబ్ధాలకి నా ధ్యానము ఎగిరిపోయేది! దానితో నాకు ధ్యానము కుదిరేది కాదు! ఆలోచన లేకుండా కొన్ని క్షణాలు అవుతుందో లేదో ఏదో ఒక ఆటంకం వచ్చేది! దానివలన నాకు ధ్యాన భంగమయ్యేది! ఇలా పలుమార్లు జరిగేసరికి ఆ ప్రాంతమును వదిలి వచ్చేది! అసలు నాకు ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశం అనగా ఆటంకాలు లేని ప్రాంతం ఎక్కడా దొరికేది కాదు! కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగినది! పది నిమిషాలు ధ్యానములో ఉండేసరికి అవాంతరాలు వస్తూ ఉండేవి! దానితో నాకు ధ్యాన భంగమయ్యేది!

ఇలా కాదనుకుని శబ్దాలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన, అవాంతరాలు వచ్చినా పట్టించుకోకుండా మనసు వాటి మీదకి పోకుండా మంత్రం మీద ఉండేటట్లుగా ధ్యానము చేయటం ఆరంభించాను! కానీ మొదట్లో చాలా చుక్కలు చూపించింది! అంటే నాకు ఆవలింతలు రావడం మొదలైంది! రానురాను విపరీతంగా వచ్చేవి! తరవాత కునికిపాట్లు వచ్చేవి! ఇలా కాదనుకుని శవాసనంలో పడుకుని ధ్యానం చేయడం ఆరంభించాను! కొన్ని రోజులు బాగానే సాగింది! ఆ తర్వాత కష్టాలు మొదలైనాయి! శవాసనంలో ధ్యానం చేస్తూ నాకు తెలియకుండానే మంచి గాఢ నిద్రలోకి జారుకునే వాడిని! సుమారుగా రెండు లేదా మూడు గంటల పాటు ఏకధాటిగా నిద్రపోయేవాడిని! నిద్రపోతున్నాను అనే విషయమే నాకు తెలిసేది గాదు!అప్పటికి నాకు అంత జ్ఞానము లేదు గదా! హమ్మయ్య.. ఈ రోజు నాకు బాగా ధ్యానం కుదిరింది…. మూడు గంటలు చేసుకున్నానని ఆనందపడే వాడిని! అమాయకంగా ఆనందం పడేవాడిని!

ధ్యానములో నేను నిద్రపోవడము అమ్మ గమనించి నన్ను తిట్టేది! “ఒరేయ్ నాయనా! నువ్వు ధ్యానము చేయటం లేదురా! దున్నపోతా! ధ్యానము పేరుతో గురక పెట్టి నిద్ర పోతున్నావు రా! ఎక్కడ పడితే అక్కడ …ఎలా పడితే అలా” అని నన్ను తిట్టేది! నాకు ధ్యానములో ఎందుకు నిద్ర పడుతోందో అర్థమయ్యి చచ్చేది కాదు! నేను ధ్యానం చేస్తున్నానా లేక నిద్రపోతున్నానా… తెలియని అయోమయం.. ధ్యానం అంటే నిద్ర… ఏమో ఎవరికి తెలుసు అనుకుంటూ ఉండే వాడిని!నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి ఈ నా ధ్యానవిషయము తెలిసి… వాడికి తెలిసి తెలియని జ్ఞానముతో వాడికున్న వివిధ ఆధ్యాత్మిక పుస్తక జ్ఞానముతో... ఎంతో ఆశ్చర్యం చెంది “వామ్మో !నువ్వు ధ్యానంలో నిద్రపోయే స్థాయి కి వచ్చినావా? అది మామూలు నిద్రకాదు యోగ నిద్ర అంటారు! ఈ నిద్ర నాలుగు గంటలపాటు పోతే భోగ నిద్ర అనేది మూడు రోజులపాటు రాదని”… వాడు చదివిన ఒక సాధన గ్రంథంలో నిద్రకు సంబంధించిన విషయాలు నాకు చెప్పేసరికి నాలో తెలియని ఆనందం వేసింది! అంటే నాకు తెలియకుండానే నేను ధ్యానంలో యోగ నిద్ర పోతున్నానని వెర్రిమొర్రి అమాయక జ్ఞానంతో ఉన్నాను! కానీ కొన్నాళ్ళకి నేను ధ్యానములో నిజంగానే మామూలు నిద్రపోతున్నానని నేను తెలుసుకున్నాను! నిజానికి యోగ నిద్ర అనేది నిద్ర, మెలుకువ మధ్యభాగానికి బయట శబ్దాలు చాలా స్పష్టంగా వినబడుతూనే ఉంటాయి కానీ వాటికి మన మనసు అలాగే మన పంచేంద్రియాలు స్పందించకుండా ఉంటాయని ఆ తర్వాత తెలుసుకోవడం జరిగినది! నాకు ధ్యానములో గురక తో కూడిన గాఢ నిద్ర పట్టేది! దానితో నాకు బయట శబ్దాలు ఏవి వినిపించేది కాదు! కాబట్టి నాకు యోగ నిద్ర కాదని తెలుసుకుని చాలా బాధపడ్డాను! దానితో నేను నా వంటికి ధ్యాన మార్గము సరిపడదని తిలోదకాలు ఇచ్చాను!

ఇక మా జిజ్ఞాసి విషయానికొస్తే మంత్ర ధ్యానం చేసేటప్పుడు వాడికి నాలిక పిడచ కట్టుకొనిపోయి దాహం వేస్తోంది అని ….అందుకోసమే రాగి గోముఖ కమండలం తెచ్చుకున్నాడు! అందులో నీళ్లు పోసుకుని అవసరమైనప్పుడు లేవకుండా ఈ నీటిని తాగవచ్చని ఏర్పాటు చేసుకున్నాడు! దర్భ చాప వేసుకుని జపమాల చేతిలో పెట్టుకుని కళ్లుమూసుకుని జపం చేయడం మొదలు పెట్టినాడు! కొద్దిసేపటికి ఆలోచనలేని మంత్ర ధ్యానం బాగానే సాగింది! ఆ తర్వాతే కథ మొదలైంది! తను ఏకాగ్రతగా ధ్యానం చేసుకుంటూ ధ్యానము లోనికి వెళ్లి పోయినప్పటికీ… కళ్ళు మూసుకుని ఉండటం వల్లనే… ఎవరైనా ఇది గమనించి.. తన గోముఖ కమండలం ఎత్తుకుని వెళ్ళిపోతే…. అది లేకపోతే దాహం తీసుకోవడం చాలా కష్టం అవుతుందని… గోముఖ కమండలమునకు సంబంధించిన ఆలోచనలు… అతని వెంట

పడటం మొదలు పెట్టేది! దానితో స్థిర మనసు కాస్త ఈ చెంబు కోసం, దీని కాపలా కోసం, అస్థిరమై కళ్ళు తెరిచి ధ్యానము చేయడం ఆరంభించాడు! బయట కనిపించే దృశ్యాలు వలన, వివిధ రకాల శబ్దాల వలన, శరీరం జపం చేస్తోందని మనసు జపం చేయడం లేదని, ధ్యానము చేయడం లేదని అని తెలుసుకోలేక పోయినాడు! ఈ రాగి చెంబును ప్రతిరోజు చిలిమి పట్టకుండా ఉండటానికి చింతపండుతో తోమలేక నానా అవస్థలు పడేవాడు! దానితో వాడికి ధ్యానము అంటే విసుగు, చికాకు కలగటం ఆరంభించినది! నాకైతే అస్థిర ధ్యానము వలన మది ఆలోచన కాకుండా మంది ఆలోచనలు ఎక్కువవటం మొదలైనాయి! దానితో మేమిద్దరము మళ్లీ ధ్యాన మార్గానికి తిలోదకాలిచ్చి… ఇలా మా మనసులకు వచ్చే ఆలోచన తగ్గాలి అంటే మంత్ర ధ్యానము వలన ఉపయోగం ఉండదని గ్రహించి… దానికి మనసు స్ధిరమవ్వటానికి అందుకోసం వివిధ రకాల ప్రక్రియలు చేయవలసి ఉంటుందని… అదియే కుండలినీ యోగ మార్గము అని తెలుసుకున్నాము! ఈ మార్గానికి మూలపురుషుడు పతంజలి మహర్షి అని తెలుసుకుని…. ఆయన చెప్పిన పతంజలి అష్టాంగ యోగం చేయడానికి ఈ కుండలినీ యోగ మార్గము చేయాలని నిశ్చయించుకున్నాము! ఇక ఆలస్యం ఎందుకు! ఆ పై ఏం జరిగిందో తెలియాలంటే నాతో పాటు మీరు కూడాముందుకి ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి!

గమనిక :

నిజానికి ధ్యానమార్గమనేది ఎక్కడికైతే చనిపోయి వెళ్లాలో...అక్కడికి బ్రతికి ఉండగానే మరణించి వెళ్ళడమే నిజధ్యానమని గ్రహించాను! ఇలాంటి ధ్యానస్ధితిని పొందాలంటే మనసు లేని స్ధితికి వెళ్ళాలని గ్రహించాను!ఇలా ఈ స్ధితికి వెళ్ళితే...మన కర్మలు కర్మశేషము లేకుండా నశించే విధంగా మన ధ్యానాగ్ని చేస్తుందని... తద్వారా పున:జన్మ లేని జీవన్ముక్తి కల్గుతుందని నేను గ్రహించాను!ఒకటి గుర్తుంచుకోండి! మానవ మెదడు 48 నిమిషాల మించి తన ధ్యానశక్తిని తట్టుకోలేదు! వెంటనే అంతరాయం కలుగుతుంది! ఆ తర్వాత రెండు గంటల విశ్రాంతి నిచ్చి మళ్లీ ధ్యానము చేసుకోవాలి! రానురాను నీ మనసు స్ధిరమైతే నాలుగు గంటల నుండి 16 గంటల దాకా ధ్యానములో మునిగి పోయిన మీరు ఆశ్చర్యము అక్కరలేదు! కాకపోతే మీరు ధ్యానం చేసుకునేటప్పుడు వచ్చే అవాంతరాలకి ధ్యానము వాయిదా వేయకుండా ప్రతి రోజూ 20 నిమిషాల నుండి 48 నిమిషాలపాటు చేయగలిగితే…. రానురాను నీ మనసుకు ధ్యానము లోనికి సహజసిద్ధంగా అలవాటు పడి…. మీరు చేయకపోయినా అది మీ మనస్సు ధ్యానము చేయాలని, చేసుకోవాలని గుర్తుకుతెస్తుంది! అంటే సిగరెట్లకే, కాఫీలకు, మందుకి ఎలా అలవాటుపడితే…. సమయానికి అది పడకపోతే… ఎలా గుర్తు చేస్తుందో… ఎలాగోల చేస్తుందో… అలా మీరు ధ్యానం చేయకపోతే అలాగే గోల చేస్తుంది! ఇలా మీకు గుర్తుకు రావటం లేదు అంటే…. నీ మనసు మీకు ధ్యానానికి ఇంకా అలవాటు పడలేదని తెలుసుకోండి! అది అలవాటు పడే దాకా ఆపకుండా, వాయిదా వేయకుండా, క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా చేసుకుంటూ ధ్యానము చేసుకుంటూ పోండి! దీనెమ్మ! ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మీ మాట వినక తప్పదు! తప్పకుండా విని తీరుతుంది ! కాకపోతే మనసు మన దారికి వచ్చే దాకా అవాంతరాలు, ఆటంకాలు జాగ్రత్తగా ఓర్పుగా, సహనంగా దాటుకుంటూ రావాలి! భయపడిన, విసుగు చెందిన, విరక్తి చెందిన, కోపావేశాలు, చికాకులు పడిన, ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించండి! నీ మనసు నీకు ఆధీనమయింది అంటే ప్రకృతి మాత ఆధీనమై నట్లే! మరి ప్రకృతి మాత ఆధీనం అవటం అంటే ప్రకృతి ఆధీనం అవ్వాలి అంటే ఎన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కోవాలో ఆలోచించండి! కాకపోతే వీటిని భయపడకుండా, ఓర్పుగా, సహనంగా వాటిని దాటుకుంటూ… పాము చావకుండా… కర్ర విరగకుండా …. ఆటంకాలు కలిగితే నీ ధ్యానము ఆపకుండా మీకున్న ఆటంకాలు తొలగించుకోగలిగితే… మీ మనసు మీకు ఆధీనం అవటానికి అవకాశం ఏర్పడుతుంది! అంటే ఒక రోజు పది నిమిషాలు ధ్యానం లో కూర్చుంటే మరొక రోజు నాలుగు గంటలపాటు ధ్యానంలో కూర్చోవచ్చు! అంటే ప్రతి రోజు కనీసం పదినిమిషాల పాటైనా కూర్చోవాలి అన్నమాట! ఒక విషయం మనము ధ్యానము ఎక్కడ చేస్తున్నామని విషయమును పట్టించుకోవద్దు! మీ మనసు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి స్థితిలో ధ్యానములోకి వెళుతుందో ఎవరికి ఎరుక! బాత్ రూమ్ లో ఉన్న ,బెడ్ రూమ్ లో ఉన్న, చెత్త కుప్పల దగ్గర ఉన్న, పెంట కుప్పల దగ్గరున్న ,గుడి దగ్గర ఉన్న, అమ్మాయిల దగ్గర ఉన్న, అబ్బాయిల దగ్గర ఉన్న, ప్రయాణాల్లో ఉన్న, మనసు ఆధీనం అయితే నీకు ధ్యానం చేసే సమయానికి ధ్యానం చేయాలని గుర్తుకు చేస్తుంది! ధ్యానానికి మనసు, బుద్ధి ఉండాలి గానీ శరీర శుద్ధి తో అవసరం లేదని గ్రహించండి !మనసులో ఎలాంటి పాపపు ఆలోచనలు, పాపభయాలు, పాపకర్మలు లేకుండా చేసుకుంటే చాలు! గతం గత: అనగా గతములో చేసిన పాపాలు గూర్చి మీరు ఆలోచించవద్దు!భాదపడవద్దు!దానివలన ఎలాంటి ఉపయోగము లేదు!పైగా ధ్యానానికి అవాంతరాలుగా వచ్చే అవకాశాలున్నాయి!తప్పు.. పాపము చెయ్యకుండా ఆ భగవంతుని వల్లనే కాలేదు! ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడే ఇంతవరకు పుట్టించలేదు అని తెలుసుకొండి! ఒకవేళ కొత్తగా తెలిసి లేదా తెలియక చేసిన పాపపు ఆలోచనలు కాని పాపకర్మలు కాని చేస్తే వాటికి తగ్గ ప్రాయశ్చిత్త పశ్చాత్తాప పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది! అన్నదానము చేయడము, ఎక్కువసేపు ధ్యానం చేయటం, ఉపవాసము చేయటము, మౌనంగా ఉండటం, ఇతరులకు సేవ చేయడం లాంటి పనులను ప్రాయశ్చిత్త మార్గాలుగా ఎంచుకుని చేసుకోవచ్చును!

ఈ లోకంలో ఎవరు ప్రశాంతంగా జీవిస్తున్నారు అని అమెరికా శాస్త్రవేత్తలకి సందేహము వచ్చి… వారు సుమారుగా 36 లక్షల మంది వ్యక్తులను వివిధ రకాల వృత్తుల్లో వున్నవారిని అనగా అపర కుబేరుడు దగ్గర నుండి అపర దరిద్రుడు వరకు అలాగే సెలబ్రెటీ దగ్గరనుంచి ఊరు పేరు లేని వ్యక్తి వరకు వారి మీద వివిధ పరిశోధన చేయగా…. ఎవరైతే కేవలము ఆధ్యాత్మిక రంగములో ఉంటారో వారు మాత్రమే ప్రశాంతంగా ఉంటున్నారని… ఎవరైతే ధ్యాన మార్గములో ఉండి మనసును ఆధీనము చేసుకుంటారో వారు మాత్రమే ఆనందంగా ఉంటున్నారని తెలుసుకోవడం జరిగినది! ఆధ్యాత్మిక మార్గము ఎంత గొప్పదో తెలుసుకోండి! ఆచరించండి!ఆనందమును పొందండి!

కపాల మోక్షం- 32-పతంజలి యోగం చేస్తే…

వివిధ రకాలుగా వచ్చే ఆలోచనలు దెబ్బకి మాకు ధ్యాన మార్గం మార్గం సరిపడదని గ్రహించినాము! అసలు యోగసాధనకు సులువైన మార్గాలు ఇంకా ఏమైనా ఉంటాయేమోనని పరిశోధన చేయాలని నేను వివిధ రకాల యోగ గ్రంధాలు పుస్తకాలు చదవడం ఆరంభించాము! అందులో ఎక్కువగా బాగా ప్రచారంగా పతంజలి అష్టాంగ యోగ విధివిధానాలు బాగా కనిపించాయి! ఇదియే కుండలిని యోగ మార్గమని గ్రహించాము! ఈ విధానంలో కేవలం ఏనిమిది రకాల స్థితులు ఉపయోగించి దేవుడిని చూడవచ్చని, సమాధి స్థితి పొందవచ్చునని, ఆత్మ సాక్షాత్కారమును పొంది వివిధ రకాల యోగ స్థితులు, అష్టసిద్ధులు పొందవచ్చని గ్రహించినాము! దానితో కుండలిని యోగ మార్గమని చేయడానికి పూనుకున్నాను! వీరు చెప్పిన అష్టాంగాలు ఏమిటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అని ఏనిమిది రకాల స్థితులు అంగములు అన్నమాట! వీటిని పతంజలి అష్టాంగ విధివిధానము అంటారు! ఇందులో మొదటిది యమము అనే అంగములో అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఐదు అంశాలు ఉంటాయి! ఇక నియమము అనే అంగములో శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము,ఈశ్వర ప్రణీధానం అనే అంశాలు ఉన్నాయి! ఇక ఆసనం అనే అంగంలో గోముఖ, వీర, సింహ, భద్ర, ముక్త, స్వస్తిక, పద్మ, మయూర అని ఎనిమిది రకాల ఆసనాలు ఉంటాయి! ఇక ప్రాణామాయ అంగములో మూడు రకాల ప్రాణాయామం విధి విధానాలు ఉన్నాయి! ఇక ప్రత్యాహారం అనే అంగంలో అయితే అరిషడ్వర్గాలను జయించాలని ఉంది! ఇక ధారణ అంగములో అయితే పంచభూతాలు ధారణ చేయాలని ఉంది! ఇక ధ్యానమనే అంగంలో అయితే మూడు రకాల ధ్యానాలు అనగా స్థూల,సూక్ష్మ ,జ్యోతి దర్శన స్థానాలు ఉన్నాయి! ఇక ఆఖరిదైన సమాధి అని అంగములో అయితే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనే రెండు రకాల సమాధిల అంశాలు ఉన్నాయని మేమిద్దరము ద్వారా వివిధ గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగినది!

ఉన్న మాట నిజం చెప్పాలి కదా! నాకు ఊహ తెలిసినప్పటి నుండి చిలిపి దొంగతనాలు చేయడం అలవాటు! ఒకటో తరగతి నుండి పదో తరగతి స్థాయి వరకు నాకు ఈ అలవాటు ఉంది! నాకు నచ్చిన చిన్న వస్తువు నా కంట పడితే ఎదుటి వాడికి తెలియకుండా, ఆ వస్తువున్న వాడికి కూడా తెలియకుండా చాలా చాకచక్యంగా చిలిపి దొంగతనం చేసే వాడిని! ఈ విషయం మా అమ్మ కి మాత్రమే తెలుసు! నానా తిట్లు తిట్టేది! నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావని నేను కలలు కంటూ ఉంటే నువ్వు కన్నయ్య లాగా వెన్నదొంగ అవుతావా ఏమిటి? అనేది! మనకి పట్టేది కాదు! రోజూ చేయను! మనస్సుకు నచ్చిన వస్తువులు దొరికితే మాత్రం అది వాడి చేతిలో ఉండదు! నా చేతిలో ఉంటుంది! బలపాల దగ్గర నుండి గడియారాలు దాకా ఇలా ఎన్నో వస్తువులు నా ఖాతాలో ఉన్నాయి! అంత ఎందుకు తూనిక రాళ్ళు ఉన్నాయి కదా! అంటే ఒక గ్రామం, 5 గ్రాములు, పాతిక గ్రాములు,50 గ్రాములు, 100 గ్రాములు తూనికరాళ్ళు ఆ కాలంలో ఇత్తడితో తయారు చేసేవి ఉండేవి! బుజ్జి ముండలు! వాటిని చూస్తే నా మనస్సు ఆగేది కాదు! కావాలని చిల్లర కొట్టుకు ఈ తూనిక రాళ్ళ కోసం వెళ్లి… ఆ కొట్టు వాడికి లోపల ఉన్న వస్తువు పేరు చెప్పి… వాడు లోపలికి వెళ్ళగానే… వాడి గల్లాపెట్టి మీద ఉన్న ఈ చిన్న బుజ్జి ముండలను ఒక్కొక్కటిగా దొంగతనం చేసి తెచ్చుకునే వాడిని! చాలా గొప్పగా మా స్నేహితులకి ఆత్రంగా చూపించే వాడిని!

వాడిలో ఏవరో మా అమ్మకి ఈ విషయం చేరవేసే వాడు! ఆ తర్వాత ఆమె చేతిలో తిట్లపురాణం ఉండేది! పాపం మహాతల్లి కొట్టేది కాదు! కేవలం ఉగ్రంగా తిట్టేది! బాగా తిట్టి అలిసిపోయి నాకు కావాల్సినవి తినటానికి ఇచ్చి వెళ్ళిపోయేది! అందుకే అమ్మంటే నాకు అంత ఇష్టం! మళ్లీ మా అయ్యకి ఏనాడు నా మీద చెప్పేదికాదు! చెప్పి ఉంటే కథ మరోలాగా ఉండేది! చిన్న పిల్లవాడు ఎప్పటికైనా మారక పోతాడా అని పాపం చాలా ఓపిగ్గా ఎదురు చూసేది! చిలిపి దొంగతనం చేసినప్పుడల్లా ఏదో శాపము లాగా ఆమెకు ఎలా తెలిసేది నాకైతే అర్థం అయ్యేది కాదు! వస్తువులు పోగొట్టుకున్నాడికి మాత్రమే తెలియకుండా చేస్తున్నాను కానీ అమ్మ నుండి తప్పించుకోవటం నా వల్ల అయ్యేది కాదు! మా స్నేహితులు చెబుతున్నారని అనుమానంతో వాళ్ళకి చెప్పటం కూడా మానేశాను! అయినా కూడా మా అమ్మకి తెలిసిపోయేది! ఎలా తెలు స్తోందో నాకు అర్థమయ్యేది కాదు! కొన్ని సంవత్సరాలు అయిన తరువాత విషయం ఏమిటో తెలిసింది! దొంగతనం చేసి వచ్చినప్పుడు నా కళ్ళల్లో ఏదో తెలియని అనుమానము, భయము కనపడేది! దానితో నా మీద అనుమానం వచ్చి నన్ను తిట్టేది అని తెలుసుకున్నాను! ఇలాంటి చిలిపి దొంగ బుద్ధి ఉన్నవారికి ఈ పతంజలి యోగ మార్గం లో చెప్పిన మొదటిది యమము అనే అంగములో అస్తేయము అనగా దొంగ బుద్ధి లేకుండా ఉండటం అని తెలిసింది! మరి నాకు ఉన్నదే అది… చిన్నపాటి దొంగతనాలు చేయకపోతే ఎలా? వామ్మో నావల్ల కాదు అని అనుకున్నాను! పైగా ఇదే అంగము లో ఉన్న బ్రహ్మ చర్యము అనే అంశం అనగా శరీర వాంఛలను అదుపులో ఉంచుకోవాలని చెప్పడం జరిగినది! ఆవేశం వచ్చినప్పుడు నిద్రలో కూడా ఆ ప్రక్రియలు జరక్కుండా ఎలా ఆపటం నా వల్ల కాదని గ్రహించాను! పైగా అమ్మాయిలను చూడకుండా ఉండాలి అంటే మన వల్ల కాదని తెలుసుకున్నాను! ఇది కాకుండా ప్రతి రోజు ఆసనాలు వేయాలి అని ఆసన నియమము ఉన్నది! వామ్మో! అసలే తెల్లవారుజామున లేవాలంటే నాకు విపరీతమైన బద్ధకము! పైగా చన్నీటి స్నానము! చలిలో దుప్పటి మీద కూర్చుని ఆసనాలు వేయాలి! వామ్మో! ఇది కూడా నా వల్ల కాదని అర్థమైంది! దానితో కుండలిని యోగ మార్గమైన పతంజలి అష్టాంగ యోగము కూడా నా వంటికి సరిపడదని గ్రహించాను!

ఇక మా జిజ్ఞాసి విషయానికి వస్తే వాడికి నాకు ఉన్న లోపాలు ఏమీ లేవు! అన్నీ కూడా యధావిధిగా చక్కగా అష్టాంగాలు చేసుకుంటూ పోతున్నాడు! ముఖంలో తేజస్సు పెరుగుతుంది! మాటల్లో వాక్సుద్ధి కలుగుతుంది! పాపం వాడికి వచ్చిన సమస్యల్లా యమము అనే అంగములో సత్యము , అహింస అంశము అలాగే నియమము చెప్పిన తపస్సు మరియు ఈశ్వర ప్రణీధానం అనే అంశాలు బాగా ఇబ్బంది పెట్టాయి! ఎల్లప్పుడూ కూడా సత్యం పలకాలంటే మనం సత్య హరిశ్చంద్రుడు కాదు కదా! ఎప్పుడో ఒకప్పుడు మన కోసం కాకపోయినా పరుల కోసమైనా కనీసం చిన్నపాటి అబద్ధం చెప్పదు కదా! అనగా ధర్మరాజు లాగా… ఎప్పటికైనా చిన్నపాటి అబద్ధాలు చెప్పే పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి! అబద్ధం చెప్పకపోతే ఉద్యోగం పోయే పరిస్థితి! ఇది కాకుండా వాడి దృష్టిలో ఈగలు, దోమలు చంపడం కూడా అహింస కిందకే వస్తుందని…. అవి కుడుతున్న వాటిని చంపకుండా, పట్టించుకోకుండా బాధ భరించడము అలవాటు చేసుకున్నాడు! తర్వాత వాటి వలన వచ్చే వివిధ రకాల జ్వరాలకి, రోగాలకి ఆసుపత్రులు బిల్లులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డాడు! అలాగే కాలేజీలు చదివే సమయంలోనే మరియు ఉద్యోగాలు చేసే సమయాలలో మర్చిపోకుండా ప్రతినిత్యం ఈశ్వర ప్రధానము అనగా నిత్య భగవంతుని నామస్మరణ చేయడం అతనికి కుదిరేది కాదు! సాధ్యమైనంత వరకు అసలు చేసేవాడే కానీ మన వాడికి తెలియకుండానే కొన్ని క్షణాల పాటు ఆగిపోయేది! పైగా ఇందులో చెప్పిన ప్రాణాయామ విధి విధానం వలన వీడికి చెవుడు రావడం, మాట తడబడటం మొదలైనాయి! కారణం ఏమిటంటే ఈ విధానములో గాలిని ఎంతసేపు తనలో ఉంచుకోవాలో అలాగే గాలి పీల్చకుండా ఎంతసేపు ఉండాలో తెలియక పోవడం వలన నరాలు నెమ్మది నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభించే సరికి మన వాడికి చెవుడు వచ్చే ప్రమాదంలో పడిన కొన్ని నెలలకు గాని తెలియలేదు! ఈ విధానమును పరిపూర్ణుడైన యోగాచార్యుడు సమక్షంలో నేర్చుకుని అప్పుడే అభ్యాసం చేయాలని లేదంటే ప్రయోజనాల కన్నా ఎక్కువగా ప్రమాదాలు కలుగుతాయని ఆ తర్వాత మా ఇద్దరికీ తెలిసినది! మా ఊరికి సరిగ్గా బడిపంతులు లేడు! అలాంటిది ఇంకా యోగాసనాలు, ప్రాణాయామాలు నేర్పించే వాడు మనకి ఎక్కడ దొరుకుతారు అని అనిపించింది! దానితో మా ఇద్దరి ఒంటికి పతంజలి అష్టాంగ యోగము కూడా సరిపడదని గ్రహించి నాము!

ఇక నా చిలిపి దొంగతనాలు విషయానికి వస్తే ఒక రోజు నేను, అమ్మ కలిసి పక్క ఊరిలో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లినాము! 60 సంవత్సరాల వయస్సు! ఈ వైద్యం మీద మంచి అపారజ్ఞానం ఉన్న వ్యక్తి! అమ్మకి అంటే విపరీతమైన గౌరవ మర్యాదలు ఉండేవి! ఆయనకి కూడా అమ్మ అంటే సొంత కూతురు లాగా నన్ను మనవడి లాగానే చూసుకునేవాడు! తాతా… తాత… అంటూ ఆయన దగ్గర నాకు చనువుండేది! నాకు చిన్నప్పటి నుండి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆయన దగ్గరికి అమ్మ తీసుకుని వెళ్ళేది! తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో… ఒకసారి నాకు విపరీతమైన కడుపునొప్పి వస్తే… ఈయన దగ్గరికి తీసుకుని వెళ్ళింది! అప్పుడు ఈయన టేబుల్ మీద తారీఖులు మార్చుకునే వీలున్న ప్లాస్టిక్ క్యాలెండర్ కనిపించింది! బుజ్జి ముండ! చాలా చిన్నదిగా ఉంది! అందంగా ఉంది! పైగా చేతిలో ఇమిడిపోయే టట్లుగా ఉంది! ఇంకేముంది! అది కాస్త ఆయన టేబుల్ నుండి నాకు తెలియకుండానే, ఆయనకు తెలియకుండానే, ఎవరికీ తెలియకుండానే, నా లాగు జేబులోనికి చేరిపోయింది! అక్కడ ఎక్కువసేపు ఉంటే ఆయన కనిపెడతారేమోన నే అనుమానం నాలో, నా కళ్ళలోనూ మొదలైంది! మా అమ్మకి నా ప్రవర్తనలో మార్పు రావడం చూసి విషయం అర్థమై మౌనం వహించింది! ఆయనకి నమస్కారం చేసి మేమిద్దరం బస్సు ఎక్కి వచ్చినాము! ఆ తర్వాత చూడాలి! నా సామి రంగా! ఇంట్లోనికి రాగానే…. ఒక్క సారిగా పూనకం వచ్చిన దానిలాగా మారిపోయి… నా చేతిని పట్టుకుని ఆమె పూజ చేసుకునే మందిరం దగ్గరికి తీసుకుని వెళ్లి…. “ఏరా వెధవ! తింగరి! మళ్లీ ఏ వెధవ పని చేశావురా! ఏ దొంగతనము చేశావురా! నువ్వు మారతావు అని ఇన్నాళ్ళుగా తెలిసి ఎదురుచూశాను! నువ్వు మారలేదు! దేవుడులాంటి ఆయన దగ్గర దొంగతనం చేస్తావురా? ఇంత వయస్సు వచ్చింది! బుద్ధి లేదా? ఈ చిలిపి దొంగతనాలు చేయడం ఏమిటి రా? కొంపతీసి నిజంగానే దొంగ అవుతావా ఏమిటి? ఆయన దగ్గర ఏమి దొంగతనం చేశా వో చెప్పు… అంటూ నన్ను గట్టిగా చెంప దెబ్బ కొట్టినది! అదే నా జీవితంలో తొలి - ఆఖరి అమ్మ చేతి దెబ్బతినటం! బుగ్గ బాగా వాచి పోయినది! దొంగతనం చేసిన వస్తువును చూపించాను! అది నా దగ్గర నుండి లాక్కుని “మళ్లీ ఎప్పుడైనా దొంగతనం చేశావని తెలిస్తే… మీ అమ్మ చనిపోయిందని అనుకో! ఇంకెప్పటికీ దొంగతనం చేయనని మాట ఇవ్వు” అని నా దగ్గర నుండి మాట తీసుకుంది! లేని దేవుడు ముందు ఎన్నటికీ దొంగతనం చేయనని ప్రమాణం ఆవిడ మీద ఒట్టు వేయించుకుంది! ఒట్టు చెప్పితే ఎవరి మీద ఒట్టు వేస్తామో వారి ప్రాణాలు పోతాయని నానుడి ఉంది గదా! దానితో నాకు ఉన్న అమ్మ బలహీనత వలన ఆ క్షణము నుండి దొంగతనాలు చేయడం పూర్తిగా మానివేశాను! నేను చివరిసారిగా దొంగతనం చేసిన ఆ వస్తువును అదేరోజు సాయంత్రం కల్లా మళ్ళీ మేము ఇద్దరం వెళ్లి ఆ వైద్యుడు తాతకి అమ్మ ఇచ్చింది! నా చిలిపి దొంగతనం విషయము అప్పుడు పూర్తిగా ఆయనకి చెబితే… అప్పుడు ఆయన “అమ్మాయి! అది వాడి తప్పు కాదు! వాడికి తెలియకుండానే జరుగుతోంది! ఇది ఒక రకమైన మనోవ్యాధి! కంగారు పడకు! మందులతో నయమవుతుంది! నీమీద, నీ మాట మీద నమ్మకం వాడికుంటే చెప్పినట్లుగా వాడు నడుచుకుంటాడు! ఇదిగో ఈ మందులు వాడు! తాగే నీటిలో కలిపి ఇవ్వు! అన్నీ ఆరు నెలల్లో అన్నీ సర్దుకుంటాయి! వారికి ఇతరుల వస్తువులు తీసుకోవాలనే ఆలోచనలను, దొంగతనం చేయాలనే ఆలోచనలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయని” ధైర్యం చెప్పి పంపించారు! ఆ విషయం అప్పుడు నాకు తెలియదు! కానీ కొన్నాళ్ళకి తెలిసింది! కానీ నాకు మాత్రం అమ్మ మీద ఒట్టు ప్రమాణము వలన ఆమె మీద ఉన్న ప్రేమ, అభిమానం వలన నాలో ఈ మార్పు వచ్చిందని నా ప్రగాఢ విశ్వాసం! కానీ ఆనాడు అమ్మ మీద ప్రమాణం చేయకపోతే ఈ పాటికి ఈ దొంగతనాల వల్ల నేను శ్రీకృష్ణ జన్మస్థానం లో ఉండే వాడినేమో! ఎవరికి తెలుసు! అలవాట్లు కాస్త అవసరాలుగా మారుతాయి కదా! చిలిపి దొంగతనాలు కాస్త పెద్ద దొంగతనాలకి దారి తీస్తే ఏమి జరిగేదో కదా! చిన్నగా ఉన్నప్పుడే దొంగ తలంపులు మొలకెత్తుతున్నప్పుడే అణిచి వేయటం వలన జైల్లో ఉండవలసిన వాడిని కాస్త జనంలో ఉన్నాను!

ఇక మా ఇద్దరికీ పతంజలి అష్టాంగ యోగ విధానము చేయలేమని అర్థమయింది! అమ్మ కోసం నేను నాకున్న దొంగ బుద్ధి వదిలించుకున్నాను కదా! అలాగే మనస్సును యోగ సాధన వైపు మార్చే సరళ విధానం ఏదైనా ఉందేమోనని వివిధ గ్రంథాలు చదవడం ఆరంభించాము! అందుకు బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ విధానము కనబడింది ! దానిని చేస్తే ఎలా ఉంటుందో అని మేమిద్దరం నిర్ణయించుకున్నాము! దీనినే సరళ లేదా సహజ యోగం అంటారు! ఆ తరువాత ఏమి జరిగిందో మీకు తెలియాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా!

గమనిక:

మేము పతంజలి అష్టాంగ యోగ విద్య విధానం చేయవద్దని చెప్పటం లేదు! కాకపోతే అది మన వంటికి సరిపడదని… దానికి మేము ఖచ్చితమైన న్యాయం చేయలేదని నాకు అర్థమైనది! దానితో యోగము మనస్ఫూర్తిగా మేము చేయలేదని గ్రహించడం జరిగినది! అందరికీ మాకు లాగానే జరగాలని లేదు కదా! ఎవరికి ఎరుక! ఏ పుట్టలో ఏ పాముందో! ఎవరికి ఏ సాధన సరిపోతుందో… ఎవరికి తెలుసు! మీకు నచ్చింది నాకు నచ్చదు! నాకు నచ్చినది మీకు నచ్చాలనే నియమం లేదు కదా! ఏమంటారు నిజమే కదా! మాకు ఒంటికి సరిపడే మాకు నచ్చే సాధన కోసం వెతుకులాట అన్నమాట! అందువలన అందరికీ అందుబాటులో ఉండాలని పతంజలి అష్టాంగ యోగం గురించి గ్రంధాలలోనూ, పుస్తకాలను సేకరించి పెట్టుకున్న విషయ సమాచారమును మీ ముందు ఉంచుతున్నాను! ఇది మీరు మనస్పూర్తిగా చేయగలరని నమ్మకం కలిగితే ఈ సాధనా మార్గంలో ప్రయాణించి ఈ సాధన చేసుకోవచ్చు! ఆలోచన మీదే… ఆచరణ మీదే… నిర్ణయం కూడా మీదే! ఏమంటారు నిజమే కదా! ఇంకెందుకు ఆలస్యం! దీనిని చదవటం ఆరంభించండి!

పతంజలి యోగ శాస్త్రం: యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనస్సు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు.. క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.

యోగ సూత్రములు:

పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి. అవి క్రమముగ: సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు. కొందరి అభిప్రాయము ప్రకారము మొదటి మూడు మాత్రము పతంజలి విరచితములు మిగిలినది తరువాత చేర్పబడినదట. కాని ప్రాచీనులు దీనికి ఎక్కడ ఏకీభవించినటుల కనబడదు.

ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.

సమాధి పాదము:

సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి “ఇప్పుడు యోగాభ్యాసం గురించి” తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు.

మానవప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించేరు. మూడవ సూత్రంలో చెప్పిన “చిత్తవృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచి పెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించేరు. మిగతా మూడు పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునేవిధానం వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపిస్తుంది.

అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచికవిషయాలలో వైముఖ్యం ప్రయత్నంవల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పటుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది.

సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసట, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకు వంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవసరమైన ప్రశాంతత పొందవచ్చు.

చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.

వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.

సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.

ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునినియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతునిని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.

పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.

తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.

సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.

సాధనద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దము (వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు), అర్థము – ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి.

ఇది పరమపురుషునిగురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కికవివరణ, అవగాహనస్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరవాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.

ఇంతవరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తరభాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించేరు.

సాధన పాదము:

ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియావిశేషాలలో మొదటి రెండూ యమ నియమాలు. ఇవి మళ్ళీ ఐదు ఉప భాగాలుగా వర్ణించేరు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరులసొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూలకారణం. నిరంతర యోగసాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు.

ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులు కారు. క్లేశాలకు మూలకారణాలు తెలుసుకొని, వాటిప్రభావంనుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు.

ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలవంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశములమూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలు, క్లేశములు ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమయిన క్లేశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి.

సత్వ తమో రజోగుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.

ధారణ, ధ్యానం, సమాధి – అచంచలదీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటిమీద నడవడం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తులప్రభావాలకు లోను కాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవడం జరుగుతుంది.

విభూతి పాదము:

సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరవాతి స్థాయి విభూతి స్థాయి. విభూతిపాదంలో సంయమనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా, ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానంద్వారా మనోలయము (విభూతి) చేయడానికి కృషి చేయాలి. పతంజలి వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు. అయితే అతీంద్రయశక్తులే (సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి.

కైవల్య పాదము:

ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరేవరకు గల పరిణామస్థితిని వివరించేరు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, సాధకుడు వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించడంతో ఈ పాదము ముగుస్తుంది.

1. యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.

2. నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.

3. ఆసనం: ఆసనం అంటే యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ ఆసనాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)

4. ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు, అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.

5. ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.

6. ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింతన . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి). గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.

7. ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనస్సును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనస్సుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతనలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైకించుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.

8. సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.

ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.

భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంథాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.

కపాల మోక్షం-34-నాకు అర్ధము కాని విషయాలు…

నాకు ఇప్పటికీ విచిత్ర శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం! ఇది ఎలా మనిషి పుట్టుక, జీవన విధానము, వివాహము, సంతానము, ఆరోగ్యము, మన విషయాలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతుంది? నాకు అర్థమయ్యేది కాదు! కేవలము నవగ్రహాల ఆధారముగా జాతక చక్రం లో ఉండే గ్రహసంచార గ్రహస్థితుల ఆధారంగా ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరో చెప్పినట్లుగా అదే ఖచ్చితంగా జరగడం నాకు అర్థం కాని విషయం గా ఉండేది!

మనం పుట్టకముందే మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, మన రూపురేఖలు, మన లింగం ఏమిటో, మన పేర్లేమిటో, మన పూర్తి వివరాలు, మన జీవితాలు, ప్రమాదాలు దోషాలు ఇలా ఖచ్చితంగా...తు.చ.తప్పకుండా చెప్పే జ్యోతిష్యపండితులు ఒక్కపుడు ఉన్నారు! ఇప్పుడు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చును! కేవలం గ్రహాల ఆధారంగానే ప్రశ్న కాలము ద్వారా మన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు జ్యోతిష్య శాస్త్రము ద్వారా ఎలా చెప్పగలుగుతాం? నేను ఒకప్పుడు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే నా జాతకం చూసి ఆ గ్రహ పరిహారాలు చేసుకునే సరికి…. ఎవరో చెప్పినట్లుగా నా ఆర్థిక సమస్యలు అంతవరకు దొరకని పరిష్కార మార్గాలు దొరకడం నాకు అర్థం కాని విషయం! ఒక కేజీ న్నర నువ్వులు లేదా గోధుమలు లేదా నవధాన్యాలు ఎవరికో దానము చేస్తే అప్పటిదాకా మనకున్న మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎలా తొలగుతున్నాయో ఇప్పటిదాకా నాకు అర్థం కాని విషయం! అంతెందుకు నా జాతకంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఫలాన నెలలో వస్తాయని జ్యోతిష్కుడు ద్వారా తెలుసుకుని పరిహారాలు చేయకుండా ఏమి జరుగుతుందో చూడాలనే ఆసక్తి కలిగినది! వారు చెప్పిన నెలకి నాలుగు నెలల పాటు తీవ్రమైన పంటి నొప్పితో బాధ పడాల్సి వచ్చింది! వీటిని తట్టుకోలేక పోయాను! మందులు వాడి నేను కొంతమేర ఉపశమనం ఇచ్చింది! కానీ పూర్తిగా పరిష్కార మార్గం చూపించలేక పోయినాయి! కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి గ్రహస్థితి నాకు ఉన్నదని తెలుసుకుని అప్పుడు ఆ జ్యోతిష్కుడు చెప్పిన పరిహారాలు చేసుకోగానే ఒక రోగికి నేను సేవ చేసే యోగం వచ్చినది! అంటే రోగి కావాల్సిన చోట ఆ రోగికి నేను సేవ చేశాను అన్న మాట! పరిహారాలు చేస్తే ఇలా మన గ్రహస్థితి ఎలా మారుతుందో నాకు అర్థం కాని విషయం గానే ఉండేది! అలాగే గ్రహ దానాలు ద్వారా గ్రహ ప్రభావం వలన మనకు ఉన్న చెడు గ్రహబాధలు ఎలా తొలగుతాయో ఇప్పటికీ అర్థం కాని విషయం గానే ఉండేది!

అలాగే రాహుకాలము, నవమి ఘడియలు, అష్టమి తిథులు, మంగళవారం, శుక్ర, శని, వారాలలో చేయకూడని పనులు, ఇలాంటి విషయాలలో కావాలని నేను ఎన్నోసార్లు చేసి అవమానాలు పొందడం జరిగినది! ఉదాహరణకి నవమినాడు ప్రయాణం చేస్తే రెండు సార్లు అదే చోటికి ప్రయాణించ వలసి వస్తుంది అనేది నానుడి శాస్త్ర వచనం! ఇది నిజమా కాదా అనుకొని మా అక్క వాళ్ళ ఇంటికి కావాలని నేను నవమి వెళ్ళేవాడిని! ఏదో కారణాంతరం వలన మర్నాడు లేదా మూడు రోజుల తర్వాత మళ్లీ అనుకోకుండా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చేది! ఎన్నో సార్లు ఇది నవమి నాడు చేసిన ప్రయాణం తిరిగి రెండోసారి చేసేవాడిని! అంతెందుకు శనివారం నాడు నూనెలు కొనవద్దని శాస్త్రవచనం! కొంటే ఏం జరుగుతుందో చూద్దామని గావాలని ఇంటిలోనికి వంటకి కావలసిన నూనెలు కొనేవాడిని! అప్పటిదాకా బాగానే ఉండేది! వారానికల్లా టీవీ లేదా ఫోను లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరో చెప్పినట్లుగా రిపేరింగ్ కి వచ్చేవి లేకపోతే ఇనుప వస్తువులకు సంబంధించినవి రిపేరింగ్ వచ్చేవి! ఇలా పలుమార్లు జరిగేసరికి దానితో శనివారం ఎట్టిపరిస్థితుల్లోనూ నూనెలు కొనకూడదని అలాగే ఇతరులు వాడిన ఇనుప వస్తువులు తీసుకోకూడదని నా జీవితంలో మనోబలంగా నిశ్చయించుకోవడము జరిగినది!

అలాగే కొంతమేర వాస్తు శాస్త్ర విషయాలు నమ్మక తప్పలేదు! ఒక వాస్తు పండితుడు మా ఇంటి నుంచి ఆగ్నేయ మూల డబ్బులు ఉంటే ధన బీరువా ఉంచరాదని డబ్బులు కూడా అగ్ని లాగా ఆవిరై పోతాయని చెప్పడం జరిగింది! అప్పుడు నేను ఈ విషయం నమ్మలేదు పట్టించుకోలేదు! కావాలని ఆగ్నేయ మూలలో ధన బీరువా ఉంచిన ఆరు నెలలకి మా ఆవిడకి, నాకు ఉద్యోగాలు పోయినాయి! తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చినాయి! ఎక్కడికెళ్లినా అప్పుగా డబ్బులు దొరకలేదు! కనీసం కొత్త ఉద్యోగాలు దొరకలేదు! వ్యాపారాలు కలిసి రాలేదు! ఈ బీరువాని ఈసారి కుబేర స్థానం లో ఉంచి చూడమని చెప్పడముతో… దాంతో ఆ స్థానంలో పెట్టడం వలన అనుకోని విధంగా నాకు ధన యోగం కలిగింది! ఇది బీరువా వలన లేదా నా స్వయంకృషి వలన అనుకుని మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ఆగ్నేయ మూలలో ఉంచడంతో అదే విచిత్రం గా మళ్లీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో భయమేసి యధావిధిగా దానిని కుబేర స్థానం లో ఉండక తప్పలేదు! ఇది ఎలా జరుతుందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు! అసలు ఆగ్నేయ మూలకి నా ధనసంపాదన కి గల సంబంధం ఏమిటో నాకైతే అర్థం కాని విషయం గానే ఉండిపోయింది!

అలాగే విపరీత శబ్ద పాండిత్య గ్రంధాలు నేను బాగా చదవడం వలన అనేక ధర్మ సందేహాలు వచ్చేవి! ఉదాహరణకు విదురుడి నీతి శాస్త్రం తీసుకుంటే కోరి వచ్చిన ఆడదాని కోరిక తప్పకుండా తీర్చాలి లేదంటే అది మహాపాపం అవుతుంది అని చెప్పడం జరిగింది! అదే మనుధర్మశాస్త్రం తీసుకుంటే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండటం మహా పాపం అని చెప్పడం జరిగినది! మరి ఈ రెండు శాస్త్రాల్లో ఏది నిజం నాకు అర్థం కాని విషయం గానే ఉండిపోయింది! యోగ సాధనలో స్త్రీ,ధన వ్యామోహము సాధనకి అడ్డంకులని రామకృష్ణ పరమహంస చెప్పినారు! అదే రమణ మహర్షి అయితే సాధన లో ఉన్నా కూడా మనస్సు ఆధీనమైనవారికి మనస్సుకు నచ్చిన స్త్రీ తో సంయోగం చేయవచ్చు అని చెప్పడం జరిగినది! మరి ఈ రెండు భావాలలో ఏది నిజమో నాకు అర్థం కాలేదు! యోగివేమన మొదట స్త్రీలోలుడుకదా! మరి చివరికి ఆయన యోగసిద్ధి ఎలా పొందినాడో నాకు అర్థం కాలేదు! అలాగే తుకారాం భక్తుడికి పరస్త్రీ పరీక్షలు పెడితే వాటిని కాదని ఆమె తన శిష్యురాలిగా మారిందని వారి చరిత్ర ద్వారా తెలుస్తోంది! అంటే సాధనకి స్త్రీ/పురుష మాయవుతారా లేదా అనేది నాకు అర్ధముకానివిషయముగానే ఉంది! ఇంకా యోగసాధన విషయానికొస్తే కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలినీ మార్గాలు కూడా ఉన్నాయి! సాధనకు ఏదో ఒక మార్గం ఉంచకుండా ఇలా పలు మార్గాలు ఎందుకు ఏర్పాటు చేస్తారో నాకు అర్ధముకానివిషయముగానే ఉంది ! ఏదో ఒక దేవుడు ఏదో ఒక విధి విధానం ఉంటే చచ్చినట్లుగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ విధివిధానము చేసిన ఏకైక స్వరూపం నందు ఐక్యం చెందేవారు గదా! ఇలా పలు అవకాశాలు ఉండటం వలన మనస్సుకి నచ్చిన మార్గము అలాగే మనస్సుకి నచ్చిన దైవస్వరూపము తెలుసుకొని మనస్సు ఆధీనమైసరికి వాడి జన్మ అంతమవ్వడము లేదా మాయలో పడటము జరుగుతోంది గదా!అవకాశాలు, అదృష్టాలు అలాగే సుఖాలు లేదా కష్టాలు ఎక్కువైనా కూడా జీవుడు తట్టుకోలేడని నా ప్రగాఢ విశ్వాసం! కానీ కొన్ని మత విధానాలలో ఏకత్వం ఉన్నా కూడా వారు ఎందుకు మనస్సును స్థిరంగా నిలబెట్టలేకపోతున్నారో నాకు అర్థం కాలేదు !ఇంకా శకున విషయాలకు వస్తే ఫలాన శకునము ఎదురైతే ఫలానా ఫలితాలు కలుగుతాయని మన పూర్వీకులు ఎలా అంత ఖచ్చితంగా తెలుసు కున్నారో నాకు అర్థం కాలేదు ! అలాగే బంధువులు వస్తున్నారని కాకులకి ఎలా తెలుస్తుంది? తెల్లవారుజాము కోడి ఎలా కూత పెడుతుంది! దేవాలయాలలో వెలిగించే అఖండ దీపారాధన ఒకవేళ పొరపాటున కొండెక్కితే ఆరునెలలలో దొంగలు పడతారు అని చెప్పిన విషయాలు అలాగే శాస్త్రం ద్వారా, కలల శాస్త్రం ద్వారా ఫలానా భవిష్యత్తు సంఘటనలు జరుగుతాయని అంత ఖచ్చితంగా ఎలా చెప్పినారో నాకు అర్ధం కాని విషయాలు! ఇది ఇలాగే జరుగుతుందని మన పూర్వీకులు ఎలా తెలుసుకొని శాస్త్ర రచనలు చేసినారో నాకైతే అర్థం కాని విషయాలు! ఇవి ఇలా ఉంటే వివిధ క్షేత్రాలలో ఉన్న విచిత్ర విషయాలు అలాగే ఈ ప్రకృతిలో ఉన్న విచిత్రాలు తెలుసుకోవాలని ఉందా...అయితే దానికి మీరు ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

గమనిక:

భారతీయ శాస్త్ర విషయాలు నమ్మడం నమ్మకపోవడం మీ వంతు మీ ఇష్టం! కేవలం నా అనుభవాలు మీతో నేను పంచుకోవడం జరిగింది అని గ్రహించండి! నా దృష్టిలో భవిష్యత్తు పరిస్థితులకు ఎలా సిద్ధపడాలో జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుంటే… మన ఇల్లు ఎలా ఉంటే మనకు సౌకర్యంగా ఎలా ఉంటుందో వాస్తు తెలిపితే … చేయకూడని పనులు అలాగే చేయవలసిన పనులు తెలుసుకోవడం వలన మానసిక శారీరక సమస్యలు తగ్గుతాయి అని నాకు అర్థం అయింది! అలాగే యోగసాధనలో పాతివ్రత్య ధర్మమును తప్పకుండా పాటించాలి! ఎప్పుడైతే సాధకుడు ఇంద్రియనిగ్రహం కలిగి ఉంటాడో అప్పుడే వారికి ప్రకృతి వశం అవుతుంది! సాధకుడు జితేంద్రియుడు అయ్యాడో లేదో అని ప్రకృతిమాత ఇలా కామమాయ పరీక్షలు పెడుతుందని వాటిని దాటుకున్న వారికి మాత్రమే తను వశం అవుతుందని నేను తెలుసుకున్న సత్య జ్ఞానము! అలాగే ఎవరైతే ఇంద్రియనిగ్రహం శక్తిని కలిగి ఉంటారో అనగా రతి సమయంలో వీర్య స్కలనం కాకుండా నిలబడతారో వారికి స్త్రీ వ్యామోహం ఉండదు! ఇలాంటి వారు వివాహం చేసుకున్న పరస్త్రీ వ్యామోహం లో ఉన్న కూడా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు! ఎందుకంటే వీరు మనస్సుతో సంయోగం చేయరు! శరీరముతోనే రాసక్రీడలు చేస్తారు! ఇలాంటి ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉండటం చాలా చాలా అతి క్లిష్టమైన ప్రక్రియ అవుతుంది! ఇలాంటి నిగ్రహశక్తి లేని వాడు పరస్త్రీ వ్యామోహం లో పడితే మాత్రం స్త్రీ లేదా పరపురుష వ్యామోహంలోపడితే ఒక్క నిమిషం ఇంద్రియనిగ్రహం కూలిపోతే వారి జన్మ వృధా అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును! తద్వారా పాప భారం పెరిగి పోయి సాధనా శక్తిని కోల్పోయి అధోగతి పాలైయినవారిని నేను చాలా మందిని చూడటం జరిగింది! కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి! కాకపోతే ఇలాంటి యోగసాధకులు గృహస్థాశ్రమము లోనికి అడుగు పెట్టినప్పుడు తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా యోగ సాధన యందు ఆసక్తి సాధన యందు సాధనాల ప్రాప్తి కలిగి ఉండాలి లేనిచో ఒకరు యోగి మరొకరు భోగి అయితే వారి సంసారం అటు సంసార జీవితానికి పనికి రాకుండ ఇటు ఆధ్యాత్మిక జీవితానికి పనికి రాకుండా పోతుందని గ్రహించండి! ఈ గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు కూడా తప్పనిసరిగా యోగసాధకులు జీవితమును అనుభవించేవారిగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం లేదంటే నరకమే అవుతుంది లేదంటే ఒకరు యోగి మరొకరు భోగి అయితే వారికి నరకప్రాయమే అవుతుంది ! ఇలాంటివారు బ్రహ్మచర్య దీక్షతో ఏకాంతంగా సాధన చేసుకోవటానికి కూడా వీలు ఉండదు! ఇక సాధన విధానం అనేది మన మనస్సు ఏ విధానంలో మన వశమై...స్ధిరమై...నిశ్చలమవుతుందో...తెలుసుకోవాలి! అందుకు తగ్గట్లుగా వాటిని అదుపులో ఉంచేందుకు వివిధ రకాల విధివిధానాలు నేర్పడం జరిగినది నాకు అర్థమైంది! ఉదాహరణకి ఒకరికి తీపి ఇష్టం ఉంటే మరొకరికి కారం వేరే వారికి పులుపు ఇష్టం ఉంటే ఎలా ఉన్నాయో… ఒక మనస్సులో సుమారుగా 84 లక్షల కోరికలు ఉన్నాయి! ఎందుకంటే రూపము లేని మనస్సు రూపం ఉన్న వస్తువుల మీద వ్యక్తుల మీద మమకారాల పెంచుకోవడంవలన 84 లక్షల జీవులను 36 కోట్ల మంది దైవాలుగా పున:జన్మలు ఎత్తుతోంది! ఇంతటి మహా మనస్సుని మన ఆధీనంలో ఉంచుకోవాలని మనకి అన్ని సాధనాలు ఉన్నాయి! ఒక్క మనస్సు స్థితికి ఒక సాధన విధానం ఉన్నది! దానిని మన పూర్వీకులు కుదించి ఐదు మార్గాలలో అనగా కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన కుండలిని మార్గాలుగా ఏర్పరచినారు! వీటిలో ఏదో ఒక మార్గంలో మనం మనస్సు కాస్త మన మాయలో పడి మనకి వశము అవుతుందని నేను గ్రహించాను! ఇలా శాస్త్రాలను నమ్మండి! గుడ్డిగా నమ్మి మోసపోకండి! అవసరాలు తీర్చే వరకే నమ్మాలి! గుడ్డిగా నమ్మితే అవసరాలే అలవాటుగా మారితే శాస్త్ర పరిధులు దాటే ప్రమాదమున్నదని తెలుసుకోండి ! ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకోవడం అన్ని విధాల మనందరికీ మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం!

కపాల మోక్షం - 35 - నేను చూసిన సచిత్ర-విచిత్రాలు

నేను చూసిన విచిత్ర చిత్రాలు నాకు శ్రీశైలక్షేత్ర పరిధిలో జరిగిన వివిధ రకాల అనుభవాలు నాకు మాత్రమే ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాని విషయాలు! అలాగే మంగళగిరి అనే ప్రాంతంలో వెలసిన పానకాల లక్ష్మి నరసింహ స్వామి వారి నోట్లో పోసిన పానకము ఎంతపోస్తే అంతకు తగ్గట్లుగా సగము పానకము మాత్రమే అదేదో ఖచ్చితంగా ఎలా వెనక్కి తిరిగి వస్తుందో నాకు అర్థం కాని విషయం! అసలు ఇక్కడ ఎందుకు ఆయనకు పానకం పోస్తారో అర్థం కాని విషయం! పైగా ఇక్కడ ఎందుకు పానకాలు పోసినా కూడా ఆ పరిసరాలలో ఈగలు కాని దోమలు కాని ముసురులు కాని మనకి కనిపించకపోవడం మరి విచిత్రమే కదా!

అలాగే కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ అనే క్షేత్రంలో ఉన్న వడకనాధ్ పరమ శివలింగానికి పైపూతగా పేరు ఆవునెయ్యి పూస్తారు! ఏ కాలంలో అయినా ఈ నెయ్యి కరగకుండా అలాగే విగ్రహానికి ఉంటుంది! కానీ ఇక్కడ కూడా ఆ పరిసరాలలో ఈగలు కాని దోమలు కాని ముసురులు కాని మనకి కనిపించకపోవడం మరి విచిత్రమే కదా!

అలాగే తమిళనాడు రాష్ట్రములోని పళని క్షేత్రం లో వెలిసిన నవ పాషాణ నిర్మిత సుబ్రమణ్యస్వామి ఒక బాలుడు విగ్రహ రూపంలో మనకు అగుపిస్తాడు! నవపాషాణాలు అంటే తొమ్మిది రకాల విషాలు! వీటితో గూడిన విగ్రహమును భోగర్ అనే రససిద్ధపురుషుడు తయారు చేసినాడు! ఇలాంటి విగ్రహం మూర్తికి చేసిన అభిషేక జలాలను స్వీకరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందటం ఇప్పటికి విచిత్రంగా జరుగుతోంది! ఎక్కడైనా విషాలు ఆరోగ్యాన్ని హరిస్తాయి కానీ ఇక్కడ మాత్రం విషాలు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి! అదే విచిత్రం!

అలాగే కేదారనాథ్, బదరీనాథ్ ఆలయాలలో మూసేటప్పుడు అఖండ జ్యోతి వెలిగించి ఉంచుతారు! ఆరు నెలల తర్వాత ఈ దేవాలయాలు తెరిచి చూస్తే ఈ అఖండ జ్యోతి ఆరిపోకుండా అలాగే వెలుగు తున్నట్లుగా ఉండటం విచిత్రమే కదా! ఎందుకంటే రెండు దేవాలయాలు కూడా విపరీతమైన మంచు తో కప్పబడి ఉంటాయి! గాలి కూడా ఉండదు!పైగా మంచు యొక్క చల్లదనానికి ఈ అఖండ జ్యోతి కొండెక్కాలి!కాని అలా జరుగదు!కారణము తెలియదు! అదే విచిత్రం!

అలాగే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం దగ్గర్లో ఉన్న చెంగనూరు భగవతి దేవాలయం ఉన్నది! ఈ అమ్మవారికి విచిత్రముగా మానవ స్త్రీ మూర్తులకు వచ్చే నెలసరి అనగా బహిష్టు ఈ విగ్రహ మూర్తి కి ప్రతి నెల ఎలా వస్తుందో అర్థం కాని విచిత్రం! అలాగే అస్సాం రాష్ట్రములో గౌహతిలోని శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్యదేవి అమ్మవారికి యోనిభాగము నుండి నెలసరి రావడం నాకు అర్థం కాని విచిత్రమే! అంటే ఒక విగ్రహమూర్తి నుండి రక్తము ఎలా వస్తుందో ఇప్పటికీ అర్థం కాని చిత్రమే!

అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలి అనే క్షేత్రంలో ఉన్న జగన్మోహిని స్వామి వారి కాలి పాదము నుండి ఎలా నీరు వస్తుందో అర్థం కాని చిత్రం అలాగే ఘంటసాల క్షేత్రంలో ఉన్న జలపర్వతేశ్వరుడు శివలింగ నుండి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని విచిత్రం! అలాగే తిరుపతి వెంకన్న పాదాల చెంతన అలాగే విగ్రహమూర్తి వెనక వైపు నుండి ఎక్కడి నుండో నీళ్ళ శబ్ధాలు వినపడుతున్నాయి! ఎవరికీ అర్థం కాని విచిత్రం!

అలాగే యాగంటి క్షేత్రంలో మనకి ఒక కాకి కూడా కనిపించదు! ఇది కాకులు దూరని కారడవి అన్నమాట! ఇది ఒక విచిత్రమైతే అదే అన్నవర క్షేత్రములో మనకి ప్రతి క్షణము కాకుల గోల వినపడుతూనే ఉంటుంది! కనపడుతూనే ఉంటాయి! ఇది కాకుల క్షేత్రముగా ఉండటం మరీ విచిత్రం!

అలాగే యాగంటి క్షేత్రంలో నందీశ్వరుడు పెరుగుతూ ఉంటే ఏలూరు క్షేత్రంలో జలపహరేశ్వర స్వామి గుడిలో ఒక ఎద్ధు కాస్త సజీవమూర్తిగా జీవ సమాధి చెంది పూజలందుకుంటుంది! ఈ ఊరిలో మోక్షప్రదాత ఇచ్చే యోగం ఉన్న ఒక ఆంబోతును…. ఒకసారి ఒక సాధువు ఒక చేతి కడియం తో దీనిని బంధించి… ఆ ఊరిలోని జలాపహరేశ్వర స్వామి శివాలయం యొక్క శివ లింగ మూర్తి ముందు సజీవ సమాధి చెందేటట్లుగా చేసినారు! వంద సంవత్సరాల తర్వాత ఈ నందికి అమర్చిన కడియంకి మహత్తులు ఉంటాయని ఎవరో కొంతమంది దుండగులు…. ఈ మధ్యకాలంలో ఈ నంది విగ్రహం ఉన్న కడియము ని తీసుకోవడానికి దాని కాళ్లను కొయ్యగా… విచిత్రంగా ఆ విగ్రహ మూర్తి నుండి రక్త చారికలు, రక్తమాంస ముద్దలు కూడా ఆనవాళ్లు కనిపించినాయి! విచిత్రమేమిటంటే ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలలో ఆ ఊరిలో దాదాపుగా మూడు ఆంబోతులు ఆకారణంగా మరణించినాయి! ఒక సజీవ ఎద్దు ఎలా జీవసమాధి చెంది సజీవ విగ్రహమూర్తి గా మారినదో… నాకు ఇప్పటికీ అర్థం కాని విచిత్రంగానే ఉంది!

అలాగే నైమిశారణ్యంలో రుద్రవరం అనే చోట ఉంది! ఇక్కడ నీళ్లలో శివలింగాల కుండము ఒకటి ఉన్నది! శివలింగాలు నీటి అడుగున ఉంటాయి! విచిత్రమేమిటంటే ఈ నీటి మీద బరువైన జామకాయలు వేస్తే తేలతాయి! అదే తేలికైన బిల్వపత్రాలు వేస్తే మాత్రం విచిత్రంగా మునిగి పోతూ అడుగున ఉన్న శివలింగాల మీదకి చేరతాయి! ఇది ఎలా జరుగుతుందో అర్థం కాని విషయమే కదా! అలాగే నైమిశారణ్యములో అనేక వెదురు చెట్లు ఉంటాయి! ఈ వెదురు చెట్టు నుంచి ఏదో ఒక చెట్టు నుంచి ఇప్పటికి కూడా వేణునాదం వినపడటం జరుగుతుంది! అది చిత్రమే కదా! అలాగే బృందావన క్షేత్రములో రాత్రిపూట ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడు అలాగే గోపికల కలిసి చేసిన నృత్యగానము వినపడుతూ ఉండటం విచిత్రమే కదా!

ఇక అమ్మవార్లు విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ కామాక్షి దేవికి స్వప్నదేవత అని పేరుంది! అనగా మనకి ఏదైన సమస్య వచ్చినపుడు ఈ గుడికి వెళ్ళి అక్కడ నిద్రపోతే... ఇప్పటికి ఆవిడ మన స్వప్నములోనికి వచ్చి మనకి పరిష్కార మార్గము చూపుతుంది! విచిత్రమైన కదా! అలాగే కంచి యందు కామాక్షిదేవి ప్రతి శుక్రవారము దేవిపూజానంతరము నిజ భక్తునికి నిజరూపదర్శనం ఇవ్వడము ఇప్పటికి జరుగుతోంది!

నా దగ్గర ఉన్న ఏకముఖి రుద్రచిహ్నాలు

అలాగే ఎక్కడైనా పుచ్చిపోయిన విత్తనాలు నీటి మీద తేలతాయి కాని మంచి ఆరోగ్య విత్తనాలు నీటిమీద తేలడటం మీరు ఎక్కడైనా చూసారా? అదేనండి! నిజమైన రుద్రాక్షల విషయంలో ఈ విషయం కనపడుతుంది! నిజమైన రుద్రాక్షలు నీటి మీద ఎలా తేలుతాయి? అదే భద్రాక్షలు అయితే నీటిలోనూ లేదా పాలలోను మునిగిపోతాయి! మంచి విత్తనాలు అయినా రుద్రాక్షలు నీటి మీద తేలే గుణము పైగా వీటికి అయస్కాంత, విద్యుత్తుశక్తులు ఉంటాయని గమనించి వీటిని యోగసాధనలో జపమాలగా ధరించాలని మన పూర్వీకులు పెట్టినారు! కానీ ప్రస్తుత కాలంలో నిజమైన రుద్రాక్షలు అరుదుగా దొరుగుతూ ఉండే సరికి భద్రాక్షలు కాస్తా రుద్రాక్షలుగా చలామణి అవుతున్నాయి అని అందరికీ తెలియదు!

నాగలింగ పువ్వులు

ఇలా ప్రకృతి విచిత్రాలలో నాకు అర్థం కాని విషయం రుద్రాక్ష అయితే మరొకటి శివలింగ పువ్వులు! వీటినే నాగలింగ పువ్వులు అని కూడా అంటారు! ఈ పువ్వులు చూడటానికి సహస్ర తలలో నాగాభరణం మధ్యలో ఒక లింగము ఉండి నాగాభరణం పెట్టుకున్న శివ లింగం పువ్వుల నిర్మాణం లాగా అలా ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ అర్థం కాని విషయమే!

తెల్ల జిల్లేడు-గణపతి ఆకృతి

అలాగే 35 సంవత్సరాలు వయస్సు ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు యొక్క తల్లి వేరు కాస్త గణపతి ఆకృతి గాను లేదా హనుమంతుడి ముఖాకృతి గాను ఎవరో చెక్కినట్లుగా అది ఎలా ఏర్పడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విచిత్రమే! ఈ చెట్టు వేరుతో ఏర్పడిన స్వయంభూ శ్వేతార్క గణపతి దేవాలయం వరంగల్ జిల్లాలోని కాజీపేట లో ఉన్నది మీరు చూడవచ్చును!

సమీర పత్రాలు - సింధూర వర్ణములో ఆంజనేయ స్వామి

అలాగే మరి విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలో ను అలాగే నైమిశారణ్యములో మనకి చాలా అరుదుగా సమీర పత్రాలు కనపడతాయి! ఈ పత్రాల మీద సింధూర వర్ణములో ఆంజనేయ స్వామి మూర్తి పైగా ఇందులో ఎవరు వేసినట్లుగా కనపడుతుంది ! ఇవి అలా ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ అర్థం కాని విషయమే!

లింగ దొండకాయలు - పానుమట్ట లింగమున్నట్లుగా ఆకృతి

ఇక లింగ దొండకాయలు! వీటి గురించి ఎప్పుడైనా విన్నారా లేదా వీటిని చూసారా? సహజంగా ఈ చెట్లు పొలాల వెంట, గట్ల వెంట కనపడతాయి! ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా..పండుతున్నపుడు మంచి ఎరుపురంగులో ఉంటాయి! ఇవి చూడటానికి గుండ్రంగా తెల్లని గీతలతో ఉంటాయి! ఇవి రుచికి దొండకాయ లాగా ఉంటాయి! వీటిని పగలగొడితే వీటి లోపల విత్తనాలు ఉంటాయి! విచిత్రంగా ఏమిటంటే వీటి గింజలు పానుమట్టము ఉన్న లింగమున్నట్లుగా కలిగి ఉన్నట్లుగా ఆకృతిని కనపడతాయి! ఈ గింజల కి రెండువైపులా ఇలాగే ఉంటుంది! అందుకే ఈ కాయలను శివలింగ దొండకాయలు అని కూడా అంటారు! ప్రకృతి విచిత్రమని చెప్పవచ్చును!

అలాగే తమిళనాడు రాష్ట్రములోని తిరుకజికుండ్రం క్షేత్రములో పక్షితీర్ధం అనే నీటికొలను ఒకటి ఉన్నది!విచిత్రంగా ఇపుడికి ప్రతి 12సం!!రాలకి ఒకసారి ఈ కొలను అడుగునుండి ఒక అద్భుతమైన దక్షిణావృత మహా శంఖము కొలను ఒడ్డుకి కొట్టుకు వస్తుంది!ఆతర్వాత ఇది కొలనులో ఎక్కడ ఉన్నదో...ఆ ఆలయపూజారికి కలలో కనిపిస్తుంది!ఈయన తన కలలో కనిపించిన ప్రదేశములో వెతికితే ఈ శంఖము కనపడుతుంది!ఇలా వచ్చిన ఎన్నో శంఖాలు ఈ ఆలయములో భద్రపరిచినవాటిని మనము చూడవచ్చును!ఇలా ఒక శంఖము తయారు అవ్వడము ....పైగా అది ఎక్కడ ఉన్నదో స్వప్నము ద్వారా చెప్పడము… ప్రకృతి విచిత్రమని చెప్పవచ్చును!

నాకు జాతకాలు చెప్పిన జ్యోతిష్య వేదాంతి… నా భౌతిక గురుదేవుడైన బ్రహ్మశ్రీ ఘంటసాల సాయిబాబా గారు ఎప్పుడూ గ్రహ హోమాలు చేసి వాటి ద్వారా జాతక సమస్యలు పరిష్కరించే వారు! చిత్రమేమిటంటే ఈయన చేసిన హోమాలలో ఆయా హోమదేవతలు గాని హోమాలు చేయించుకొనేవారి కులదైవాలు కాని వారి ఇష్టదైవాలు కాని వారు చేయించే హోమాలయందు హోమాగ్ని కాస్తా హోమాదేవతలుగా చాలా సర్వసాధారణంగా కనిపించే విషయమని అని నేను తెలుసుకుని కావాలని వారు చేస్తున్న సమయంలో నేనే స్వయంగా ఫోటోలు తీస్తే అలాగే హోమకర్తల బంధుమిత్రులు తీసిన …. ఆయా హోమాదేవతలు అగుపించటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది! కావాలంటే వారు చేసిన హోమాల ఫోటోలు పెడుతున్నాను! వీటిని చూసి అవునో కాదో మీరే నిర్ధారణ చేసుకోండి!

అలాగే కాశీక్షేత్రంలో పంచకోశ ప్రాంతములో ఎక్కడా కూడా గ్రద్ధ గాలిలో ఎగరదు! బల్లి అరవదు! సువాసనాలు వచ్చే పూల చెట్లు బ్రతకవు! చనిపోయే ప్రతి జీవి కూడా కుడిచెవి ఆకాశంకేసి పెట్టి చనిపోవడం విచిత్రంగా ఉంటుంది! అలాగే మణికర్ణికా ఘాట్ లోని శవ దహన సమయములో ఎక్కడా కూడా శవ వాసన గాని కాలుతున్న జుట్టు వాసన గాని రాకపోవటం విచిత్రము! అలాగే విశాలాక్షి అమ్మవారి గుడి దగ్గర్లో ఉన్న మృత్యు బావిలో నీడ కనిపించకపోతే ఆరు నెలలో ముక్తి పొందటం ఎలా జరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం!

….ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతీయ దేవాలయాలలో ఉన్న అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి! ఇంతటి పుణ్యభూమిలో భారతీయులుగా పుట్టినందుకు భారతదేశములో భారతీయుడుగా జీవిస్తోన్నందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని నా ప్రగాఢ విశ్వాసం! మీరు భారతీయులు అయితే అది మీకు పూర్వజన్మలో చేసిన అపార పుణ్యం వలన లభించిన మహోన్నత అపూర్వ అవకాశం జన్మ ఇది అని తెలుసుకోండి! ఈ జన్మను సార్ధకత చేసుకోండి! ఎందుకంటే ప్రపంచమనేది దేవాలయం అయితే అందులో భారతదేశము అనేది విగ్రహమూర్తి ఉన్న గర్భాలయము అని గ్రహించండి! అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచము ఇల్లు అయితే భారతదేశము పూజగది వంటిది అన్నమాట! భారత దేశం గొప్పతనం తెలుసుకోండి! లోకానికి చాటండి! మనము భారతీయులమని గర్వంగా బతకండి!

ఇక నేను చూసిన నిజ సిద్ధపురుషులు చూపిన చిత్ర విచిత్ర సిద్ధలీలలు గూర్చి తెలుసుకోవాలంటే మీరు ఏమి చెయ్యాలో తెలుసు గదా!

గమనిక:

మన భారతీయ పూర్విక మహర్షులు మహోన్నత నిగూఢ రహస్యాలు ఈ దేవాలయాల్లో అంతర్గతముగా గుప్తంగా ఉంచినారని కొన్ని సంవత్సరాల సాధన శక్తి వలన తెలుసుకున్నాను! అంతెందుకు ఉదాహరణకి పానకాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయము ఉన్నచోటనే అగ్నిపర్వతం ఉన్నదనీ… దానిని చల్లబరచటానికి నిత్యం పానకము పోసే విధానమును పెట్టారని… ఈ పానకాలు ఎక్కువైనా కూడా ప్రమాదమే…. కాబట్టి సగము మాత్రమే లోపలికి వెళ్లే టట్లుగా మిగతా సగం బయటకు వచ్చేటట్లు గా ఈ విగ్రహ మూర్తి యొక్క నోటి నిర్మాణం చేసినారు! అలాగే ఇక్కడున్న అగ్నిపర్వత వేడిమి వల్లనే ఈ గుడి లోపల గాని బయట గాని ఈగలు కాని దోమల గాని కనిపించడం లేదని నేను తెలుసుకున్న జ్ఞానమును మీకు చెబితే… మీకు విగ్రహారాధన మీద భక్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కదా !అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్పడం లేదు! విచిత్రముగా అనిపించిన ప్రతి చోట మనకి తెలియని ఏదో నిగూఢ రహస్యాలు కూడా ఉన్నాయని నాకు తెలిసినది! కాకపోతే వాటినన్నిటిని నేను తెలుసుకునే సరికి నాకు విగ్రహారాధన మీద భక్తి పూర్తిగా దొబ్బింది! జ్ఞానం తెలిస్తే మర్మం ఉండదు కదా! అలాగే నాకు శ్రీశైల క్షేత్రం ప్రసిద్ధి లో జరిగిన అన్ని రకాల విచిత్ర అనుభవాలకు కారణం ఇవన్నీ కూడా నా గత జన్మ సాధన అనుభవాలని… నాకు వచ్చిన జన్మాంతర జ్ఞానసిద్ధి ద్వారా తెలుసుకోవడం జరిగినది! గత జన్మలో నాకు అర్థం కాని విషయాలు విచిత్రాలు ఈ జన్మలో శ్రీశైల క్షేత్రములో అవి దృశ్య రూపాలుగా సాక్షీభూతంగా అనుభవ అనుభూతులుగా వచ్చినాయి అని తెలుసుకున్నాను! దానితో నాకు ఉన్న మాయ కాస్త మాయం అయింది!

కపాల మోక్షం - 36 - నేను చూసిన సిద్ధలీలలు

అంజనా ప్రశ్న సిద్ధుడు :

నేను కాలేజీ చదువుకునే రోజుల్లో మన స్నేహితుడు గడియారం పోయినది. అది చాలా విలువైంది. పోలీస్ కేసు కూడా పెట్టినా కూడా ప్రయోజనం లేదు. గుర్తుకు దొరకలేదు. ఎవరో అంజనా ప్రశ్న వేసి పోయిన వస్తువులు జాడ చెబుతారని తెలుసుకొని మా స్నేహితులతో పాటు నేను కూడా ఈ చిత్రం ఏమిటో చూద్దామని వెళ్ళినాను. అక్కడికి వెళితే ఒక ముసలాయన ఒక తమలపాకు మీద ఏదో నల్లటి కార్మిక లాంటి పదార్థం వ్రాసి ఏదో వీడియో చూస్తున్నట్లుగా దానిలో ఏదో చూస్తూ జరిగిన దొంగతనం విధి విధానము అలాగే తీసిన వాడి పోలికలు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ వ్యక్తిని పట్టుకుని నాలుగు తన్ను తాను దొంగిలించిన గడియారం వెనక్కి తీసుకొని వచ్చాడు! ఇది ఎలా సాధ్య పడింది. నాకైతే అర్థం కాలేదు. అలాగే తప్పి పోయిన వ్యక్తుల గురించి, గుప్త నిధుల గురించి, తప్పిపోయిన పశువుల గురించి ఇలా ఎన్నో నిజాలు సంఘటనలు మనకు ఎదురైన అన్ని కూడా ఆయన చెప్పినట్లుగా జరగటం, దొరకటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. నిజంగానే అంజన సిద్ధుడు అన్నమాట.

నీళ్ల సిద్ధుడు :

ఈయన వయస్సు సుమారుగా 45 సంవత్సరాలు ఉంటుంది. చదువులేదు. పశువుల కాపరి. కానీ విచిత్రం ఏమిటంటే ఇతనికి నేలలో… ఏ ప్రాంతంలో… నీళ్లు పడతాయో కొబ్బరికాయ ద్వారా గుర్తుపట్టి చెబుతాడు. ఎంతోమంది జియాలజీ డిపార్ట్మెంటు ఆఫీసర్లు వల్లకానిపని కూడా ఈయన కనిపెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా జియాలజీ స్టూడెంట్ ని. మా సర్వేలో ఇతని గురించి తెలిసి మేము మా అధ్యాపకులు ఇక్కడ నీళ్లు పడమని చెప్పిన చోట ఆయన ఒక కొబ్బరికాయ సహాయంతో నీళ్లు పడే ప్రాంతాలను గుర్తించి మమ్మల్ని అందరినీ ఆశ్చర్య పరిచే వాడు. సహజ జ్ఞానము ముందు విజ్ఞానం ఎందుకు పనికిరాకుండా పోయేది అనిపించినది! విచిత్రంగా నీళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక చేతిలో కొబ్బరికాయ పెట్టుకుని ఏదో మంత్రం చదువుతూ వెతకవలసిన ప్రాంతంలో తిరుగుతూ ఉండగా విచిత్రంగా ఆయన చేతిలో ఉన్న ఉన్న కొబ్బరికాయ కింద పడటం గాని లేదా తిరగడం గాని లేదా నీళ్ల శబ్దంతో విపరీతంగా ఉండటం చేసేది. అది చేసే పనిని బట్టి ఆ చోట నీళ్లు పడే విధానం చెప్పేవాడు. నీళ్లు పడతాయా అని అడిగితే నీళ్లు పడతాయని ఇలా పలు సూచనలు ఇచ్చే వాడు. ఖచ్చితంగా నీళ్లు పడేవి. మంచినీళ్లు పడతాయో లేదా ఉప్పు నీళ్లు పడతాయో కూడా ముందే చెప్పేవాడు. విచిత్రమే కదా. అందుకే నేను నీళ్ల సిద్ధుడు అని పిలిచే వాడిని.

వాన సిద్ధుడు

ఇతను కూడా చదువుకోలేదు. గొర్రెలు, మేకలు కాచుకునే వాడు. విచిత్రంగా ఏదో స్పందన కలుగుతున్నప్పుడు వాన పడేది రోజులతో సహా సమయాలతో చెప్పేవాడు. అంటే వర్ష సూచన సమాచారాలు ఇచ్చేవాడు అన్నమాట. అతడు చెప్పినట్లుగా ఖచ్చితంగా అదే సమయానికి వానలు పడేవి. ఇంకా విచిత్రమేమిటంటే వాన లేని ప్రాంతంలో ఇతను మూడు రోజులపాటు నివాసం చేస్తే ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసేవి . ఇది తెలుసుకున్న వారు అతనిని తీసుకు వెళ్లి మళ్లీ మరీ వర్షాలు కురిపించుకొనేవారు! ఇలాంటి సిద్ధి దశరథ మహా రాజు అల్లుడికి కూడా అనగా శ్రీరాముడు యొక్క బావ గారికి వాన సిద్ధి ఉండేదని వాల్మీకి పురాణమందు ఉంది. దానితో ఇతనికున్న సహజసిద్ధ యోగమునకు వాన సిద్ధుడు అని పిలిచే వాడిని.

మంత్ర సిద్ధుడు

నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మా స్నేహితుడు ఉండే ఊరికి అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది. అది మండువేసవి రోజులు. మామిడికాయలు విరగబూసిన రోజులు. మా స్నేహితుడు తాత గారికి సుమారుగా 90 ఎకరాల మామిడితోట ఉన్నది. వాటిని చూడటానికి మేమిద్దరం మామిడి తోట కి వెళ్ళినాము. విచిత్రంగా అక్కడికి చెట్లకు ఎవరు కాపలాదారులు లేరు. చెట్ల కేమో మామిడికాయలు విపరీతం గా వేళ్ళాడుతున్నాయి. నోరును ఊరిస్తున్నాయి. ఎవరైనా దొంగతనం చేస్తే దిక్కు కూడా లేదనుకుని ఒక మామిడి పండు కోసుకుని తిందామని అనుకుంటున్నా సమయములో మా స్నేహితుడు వెంటనే “వద్దురా! వాటిని ఎవరూ తాకలేరు! దొంగతనము చేయలేరు. ఎవరైనా ఈ చెట్లకు ఉన్న కాయలకు దగ్గరికి వెళితే మా తాత వేసిన మంత్రము వలన స్తంభన అయిపోతారు అనగా శిలావిగ్రహంలాగ బిగిసుకొనిపోతారు. మళ్లీ మా తాత వచ్చి ఆ మంత్రము నుండి విముక్తి కలిగించే వరకు ఇదే పరిస్థితి” అన్నాడు! నేనా ఆశ్చర్యపోతుండగా ఇది ఎలా సాధ్యమని అనుకుంటుండగా కొన్ని నిమిషాల తర్వాత కొన్ని పక్షులు చెట్ల మీద వాడటం అవి కాస్త బొమ్మలు లాగ బిగిసుకొనిపోవడం అది చూసి నాలో తెలియని భయం మొదలవ్వడం ఏకకాలంలో జరిగిపోయాయి. కొద్దిసేపటికి ఈ విషయం తెలుసుకున్న వీడి తాత వీడి ఇంటిదగ్గర నుండి వచ్చి ఏదో మంత్రం చదివి వాటి కేసి నీళ్లు చల్లగానే నిద్రలో లేచినట్లుగా ఎగిరి పోవడం చూసి నాకు నోట మాట రాలేదు. అప్పుడు ఆయన నా వంక చూస్తూ “కంగారుపడకు! పూర్వకాలములో దొంగలు బారినుండి పంటలను ఇలాగే రక్షించుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో అంతరించిపోయింది. చేసేవాడు లేడు” అంటూ వెళ్లిపోయాడు. దానితో నేను ఈయనికి మంత్రసిద్ధుడని పిలిచేవాడిని. పాపం ఆయన నాకు ఈ మంత్రం విధానం నేర్పిస్తాను అన్నారు. కానీ నాకు గతంలో జరిగిన కర్ణపిశాచి దెబ్బ కి తాంత్రిక మంత్ర విద్యల జోలికి వెళ్లలేదు.

ప్రాణాలు తీసే పోసే సిద్ధుడు:

నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నేను ఉన్న గది కి దగ్గరలో ఒక మసీదు ఉండేది .ఇందులో 60 సంవత్సరాలు ఉన్న ఒక పేద మంత్ర పకీరు ఉండేవాడు. ఈయన రోగాలకి చిట్కా వైద్యం చేసేవారు. అలాగే భూత వైద్యం, మంత్ర వైద్యం చేసేవారు. నాకు ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించేది. ఆయన ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. చాలా సేపు మౌనంగా ఉంటూ ఎల్లప్పుడూ ఏదో మంత్రోచ్చారణ చేసుకుంటూ మసీదు అరుగు బయట తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తీసుకోవటం ఏదైనా ఏమైనా ఇస్తే వాటిని తీసుకుని మరి కొంత మంది పేద వారికి వాటిని ఇవ్వటం నేను కాలేజీ వెళుతున్నప్పుడు నేను చూసేవాడిని అన్నమాట. అప్పుడప్పుడు నా వంక చూసి నవ్వి ఊరుకునేవాడు. నేను పలకరించే వాడిని కాను. ఆయన పలకరించేవాడు కాదు. ఒక రోజు కాలేజీ కి వెళుతున్న సమయంలో ఆయన ఎదురయ్యాడు. అప్పుడు ఈయన మసీదు మీద వాలిన పావురాలను బలంగా రాళ్ల తో కొడుతున్నాడు. అవి కాస్తా నేలమీద వాలి ప్రాణాలు వదిలేవి! గమనించాను. నాకు చాలా బాధ వేసింది. ఎవరైనా మూగ జీవులను చంపినా గాని లేదా బాధపెట్టిన కానీ నాకు తెలియని వెర్రి కోపావేశాలు వస్తాయి. పరిస్థితులు గమనించను. నోరు అదుపులో ఉండదు. దానితో నేను వేగంగా ఆ ఫకీరు దగ్గరికి వెళ్లి “నువ్వు చేస్తున్న పని ఏమిటి? పావురాలను ఎందుకు చంపుతున్నావు. వాటిని చంపడం పాపం అని నీకు తెలియదా? ప్రాణం పొయ్యలేనివాడికి ప్రాణం తీసే హక్కు ఉండదని నీకు తెలియదా? అనగానే అతను విరగబడి నవ్వుతూ “నేను ఈ పావురాలను చంపుతున్నానా? చంపడం అంటే ఎమిటో నీకు తెలుసా? చూడు చూడు అంటూ కింద పడి విలవిల్లాడుతున్న ఒక పావురమును తీసుకుని దాన్ని మెడ విరిచి మొండెమును వేరు చేస్తూ ప్రాణాలు తీసేసి నాకు తెలుసు విరగబడి నవ్వుతూ ఇది చంపడం అంటే… ప్రాణం పోవడం అంటే… ఇది వికృతంగా నవ్వుతూ ఉండే సరికి… నాకు ఎక్కడ కాలాలో అక్కడ కాలి అతనిని కొట్టడానికి చెయ్యి ఎత్తే సరికి వెంటనే “ఆగు నాయనా! నేను ముసలివాడిని! నీ దెబ్బలు తట్టుకోలేను! పావురం కోసమే కదా నన్ను కొట్టాలి అనుకుంటున్నావు చూడు” అంటూ వేరుచేసిన తల మొండెం ఈ రెండిటిని కలి పేసరికి అది నిద్రలో లేచినట్టుగా పావురం లేచి కొట్టుకోవటం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. ఆయన నవ్వుతూ తన చేతుల్లో నుంచి పావురంను గాలిలోకి వదిలే సరికే ఎగిరిపోయినది! ఇదియే బ్రహ్మవిద్య నాయన…. చావటం లేదు… బ్రతకటం లేదు… ఇవి ఉన్నాయని అనుకోవడమే మాయ… నేర్చుకో మాయ పోతుంది… కూడు పెట్టే విద్యలు కొంతవరకు ఉపయోగం…. కూడుతో అవసరం లేని బ్రహ్మ విద్య నేర్చుకో...అది యోగం అవుతుంది అంటూ లోనికి వెళ్ళిపోయాడు. ఇలా పలుమార్లు ఆయన నా కళ్ల ముందు కోడిని, చీమను, పిచ్చుకను, పందిని, ఆవుని, చిలుకని చంపి వాటిని బతికించడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. దానితో నేను ఇతనిని ప్రాణం పోసే విధాత సిద్ధుడు గా పిలిచే వాడిని.

రస సిద్ధుడు

నేను అలాగే మా స్నేహితులు ఒక సారి రైల్వే స్టేషన్ లో రాత్రి పూట కూర్చుని ఉండగా ఎవరో బిచ్చగాడు మా దగ్గరికి వచ్చి “స్వామి! నా దగ్గర తులం బంగారం ఉంది దానిని మీకు రెండు వందల రూపాయిలకి అమ్ముతాను కొంటారా?”అన్నాడు మా ఇద్దరికీ ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది. కొంపతీసి దొంగ బంగారం అయితే మా పరిస్థితి ఏమిటని? ఒకవేళ పోలీసులకి తెలిస్తే మేముండేది శ్రీకృష్ణ జన్మస్థానం అని ….భయమేసి వాడితో మేము కొనమని చెప్పాను! దానితో వాడు అసలు విషయం తెలుసుకుని “స్వామి! భయపడకండి. ఇది దొంగ బంగారం కాదు. నేను స్వయంగా తయారు చేసిన బంగారం అనగానే నాకు నోట మాట రాలేదు. ఏమిటి బంగారం కూడా తయారు చేస్తారా? అదేదో ఖనిజం నుండి బంగారం అవుతుందని నేను చదివి ఉన్నాను. ఏమిటి అదేదో రసవిద్య ద్వారా బంగారం తయారు చేస్తానని అంటున్నాడు. ఆశ్చర్యము అనిపించి అయితే నువ్వు మా ముందు బంగారం తయారు చేస్తే మీకు కావాల్సిన డబ్బులు ఉచితంగా ఇస్తామని చెప్పగానే…. అతను మొహమాటపడుతూ “స్వామి! అయితే ఇప్పుడు తయారు చేయడం కుదరదు. రాత్రి 12 గంటల తర్వాత ఎవరూ లేని సమయంలో తయారు చేస్తాను” అనగానే మేమిద్దరం వాచీలను చూసుకుని మరో రెండు గంటలు కూర్చుంటే సరిపోతుంది అని గ్రహించి “సరే! మేము అప్పటిదాకా ఇక్కడే ఉంటామని మా ముందు నువ్వు బంగారం తయారు చేయాలి అనగానే వాడు వెళ్లిపోయాడు .రెండు గంటల తర్వాత ఆ బిచ్చగాడు మా దగ్గరికి వచ్చినాడు. మా ఇద్దరినీ పనికిరాని ఒక రైల్వే భోగి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు .అది వీడికి గది లాగా ఉన్నట్లుగా ఉంది. లోపలికి వెళ్ళాం. వాడు పొయ్యి మీద గిన్నె లాంటి దట్టమైన పాత్ర నుంచి కొద్దిగా పాదరసము పోయాడు. కొద్దిసేపటికి ఏవో వేరు ముక్కలు వేసినాడు. మరికొద్దిసేపటికి ఏవో ద్రవాలు పోసినాడు. ఆ తర్వాత లోపల నుండి ఒక గర్భసంచి తెచ్చి దానిలోంచి ఏదో నల్లని రాయి వంటి దానిని బయటికి తీసి దాని రజను కొంత తీసి ఇందులో వేసి కలుపుతూ సుమారు నాలుగు గంటల దాకా ఉడికించినాడు. ఆ తర్వాత ఆ పాత్రలో బంగారపు వర్ణము ఉన్న పదార్థము తయారైనది. అప్పటిదాకా అన్నం వండటం చూసిన మేము బంగారం వండటం తయారు చేయడం చూడటం అదే మొదటిసారి. ఆ తర్వాత ఈ బంగారం ను ఒక ముద్దగా చేసి మాకు ఇచ్చినాడు. దానిని తీసుకుని వెంటనే మా స్నేహితుడు ఒక రాయి మీద బలంగా రుద్దిన కూడా దీనికి ఉన్న బంగారు రంగు పోకపోయేసరికి మా వాడికి మతి పోయింది. పైగా ఈ ముద్ద కూడా బరువుగా ఉంది. అంటే ఇతను రసవిద్య తెలిసిన రససిద్ధిని నేను గ్రహించే లోపల మా దగ్గర నుండి ఆయన కావలసిన డబ్బులు తీసుకుని బయటికి వెళ్లిపోయాడు .ఆ చిన్నపాటి బంగారం మొత్తం అక్కడే వదిలేసి మేమిద్దరం బయటికి వచ్చేశాము!

కాగితాలను డబ్బులు గా మార్చే సిద్ధుడు

ఈయన వయస్సు సుమారుగా 60 సంవత్సరాలు ఉంటుంది. మంచి పట్టు ఉన్న మంత్ర సిద్ధ పురుషుడు. పైగా తాంత్రిక విద్యాపరుడు. భూత మంత్ర వైద్యగాడు. ఆయన దగ్గరికి ఎవరైనా కటిక పేదవాడు డబ్బుల కోసమని వస్తే వెంటనే తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కాగితం ముక్కలు చేసి వాటిని గాలిలో ఊపుతూ వాటిని డబ్బులు కాగితంగా మార్చి వారికి తిరిగి ఇచ్చేవాడు. అవి నిజంగానే డబ్బులు నోట్ల లాగానేచలామణి అయ్యేది. నాకు ఆశ్చర్యం వేసేది. ఆయన నా కోసం ఒకసారి వంద రూపాయల నోటును ఇలాగే సృష్టించి ఇస్తే…. దానిని బజారుకెళ్లి మారుద్దామని వెళ్లేసరికి… కొట్టువాడు ఏమాత్రం అనుమానించకుండా… నాకు కావాల్సిన వస్తువులు ఇచ్చేసరికి… నాకు నోట మాట రాలేదు. అంటే ఈయన ఒక పెద్ద స్కా నర్ లాంటివారిని…. ప్రింటింగ్ మిషన్ లాంటివారని… కొన్ని రోజులకు గానీ నాకు తెలియ రాలేదు. ఈయన కటిక పేదరికంలో ఉన్న వారికి మాత్రమే ఇలాంటి ధన సహాయం చేస్తూ ఉండే వారిని… పిల్లలకు అనారోగ్య అవసరాలకి, తీవ్రమైన అప్పులు వాళ్ళకి మాత్రమే సృష్టించిన డబ్బులు అందించి…. వారి ఆర్థిక అవసరాలు తీర్చే వారని నేను తెలుసుకున్నాను . ఈయన మింట్ మిషన్ అని తెలుసుకున్నాను.

అక్షయ సిద్ధుడు

ఈయన వయస్సు సుమారుగా 45 సంవత్సరాలు ఉంటుంది. వీరికి ఒక ఆశ్రమం వున్నది. విచిత్రం ఏమిటంటే వేళకాని వేళలో ఈ ఆశ్రమానికి ఎవరైనా ఎప్పుడైనా వచ్చినను భోజనం ఉండేది. అలాగే వండిన పదార్థాలను మించిన అతిథులు ఎందరో వచ్చినను అందరికీ ఈ పదార్ధాలు సరిపోవటం నేను చాలా సార్లు గమనించాను. ఇందులో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోవాలని చాలా సార్లు కావాలని ఈ ఆశ్రమానికి వెళ్లేవాడిని. విచిత్రమేమిటంటే వడ్డన చేసేముందు ఇది ఆయన ఆయా పదార్థాల మీద మంత్రము తో నీళ్ళు చల్లి వాటిమీద వస్త్రాలు కల్పించేవారు. వస్త్రాలు తీయకుండా వచ్చిన వారందరికీ వడ్డన చేయించేవారు. అందరికీ వండిన పదార్ధాలు సరిపోయేవి .అంటే ఈ మంత్రము వలన వండిన పదార్థాలు అందరికీ సరిపోయేవి అన్నమాట. దానికి నేను అక్షయ సిద్ధుడు అని పిలిచే వాడిని.

నీళ్ల మీద తేలే సిద్ధుడు

మా ముత్తాత గారైన బుద్ధు కుటుంబరావు నీళ్ల మీద నడిచే వాడని… నీళ్ల మీద వెళ్లే వాడని… నీళ్ల మీద పడుకునే వారని మా ముత్తాత గారైన బుద్ధు కుటుంబరావు గారి గురించి మా అమ్మగారు నాకు ఎప్పుడూ చెప్పడమే గాని నేను చూడలేదు. మా వంశంలో సిద్ధులు తెలిసిన సిద్ధపురుషులు ఉన్నారు అని…. ఆనాటి నుండి సిద్ధులు చూపించడము పూర్తిగా మానివేశాను. ఇప్పుడు సిద్ధులు చూపించే సిద్ధపురుషులను వెతకడం పూర్తిగా మానివేశాను. విచిత్రమేమిటంటే అష్టసిద్ధులు తగ్గట్లుగా అష్ట సిద్ధపురుషుల నా జీవితంలో నేను చూడటం జరిగింది. వారి సిద్ధ అనుభవాలను నేను చూడటం జరిగినది. వీరంతా గత జన్మలలో ఆయా చక్ర సాధనలు చేసి ఆ సిద్ధులను పొంది సహజసిద్ధంగా ఈ జన్మలో ప్రదర్శిస్తున్నారని నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను తెలుసుకోవడం జరిగినది.

ఆ తర్వాత నేను జ్యోతిష్యశాస్త్రము నందు గవ్వలప్రశ్న, దైవప్రశ్న, జాతకప్రశ్న, శకునప్రశ్న,పాచికప్రశ్న,రమలప్రశ్న….ఇలా 36 జ్యోతిష్య ప్రశ్న శాస్త్రములయందు మేము సిద్ధిపొందడము జరిగినది! అంటే సిద్ధులు వెంట తిరిగి నేను కూడా సిద్ధ పురుషుడుగా మారిపోయానని ఈపాటికే గ్రహించి ఉంటారు. ఎందుకంటే మీరు కూడా ఏదో ఒక జన్మలో సిద్ధపురుషులు అయ్యి ఉంటారు కదా! ఏమంటారు! నిజమే కదా! అలాగే ఈ సిద్ధులకోసము లేదా యోగసాధన కోసము ఒక భౌతిక సిద్ధగురువు తప్పనిసరిగా ఉండాలని...వారు ఇచ్చే గురుమంత్రోపదేశము వలన మనకి మంత్రసిద్ధి కలుగుతుందని వీరంతా తమకి వచ్చిన గురువుల గూర్చి నాతో చెప్పేసరికి… అసలు సాధనకి ఈ గురువులకి గల సంబంధము ఏమిటో తెలుసుకోవాలని అనిపించినది!మరి మీకు కూడ తెలుసుకోవాలని ఉందా? అయితే మీరుగూడ నాతోపాటుగా నా రెండవ అనుభవ విభాగమైన మంత్రదీక్ష సాధనానుభవాలలోనికి అడుగుపెడతామా మరి....

ఇంతటితో నా ప్రారంభ సాధన అనుభవాలు అనే ప్రధమ విభాగములోని 36 అధ్యాయాలు పూర్తి అయినాయి!ఇక ద్వితీయ విభాగమైన నా మంత్రదీక్ష అనుభవాలు లోని అధ్యాయాలు ప్రారంభమవుతాయి!

కపాల మోక్షం - 37 - సాధన కి గురువు అవసరమా..

ఇలా మేము ఎంచుకున్న వివిధ సాధన మార్గాలలో మాు కలిగిన అనుభవాల రీత్యా ఏవీ కూడా మాకు సరిగ్గా సరిపోకపోయేసరికి మా తల తిరగటం మొదలైంది! ఏమి చేయాలో…. ఎలా చేయాలో…. ఏవిధంగా సిద్ధి పొందాలో మాకు అర్థం కాని స్థితి! అందరికీ వారికి తగ్గట్టుగా మేము చేసిన విధానాలలో ఏదో ఒక విధానం సరిపోతే… మా ఇద్దరికీ మాకు ఎందుకు సరిపోవటం లేదో మాకు అర్థం కావటం లేదు! చాలా రోజులు దీనికోసం మధనపడ్డాను! ఫలితము శూన్యం… శ్రమ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు! ఇలా కాదనుకుని మేము మాత్రం మొదటి నుంచి మరొకసారి చేసిన విధివిధానాలు మళ్లీ చేసుకుంటూ వచ్చినాను! ఫలితాల్లో ఎలాంటి మార్పు రాలేదు! అవే మాయలు తిరిగి మిమ్మల్ని వెంటాడినాయి! వాటిని ఎలా వదిల్చించుకోవాలో తెలిసేది కాదు! మనస్సుని ఎలా ఆధీనము చేసుకోవాలో అర్ధమై చచ్చేది గాదు! నిద్రలేని రాత్రులు తో కూడిన రోజులు గడిచిపోతున్నాయి! అప్పుడు ఇలా కాదనుకుని ఆధ్యాత్మిక గ్రంథాలు తిరగవేయడం మొదలు పెట్టాను! అన్ని చోట్ల తప్పనిసరిగా గురువు ఉండాలని… వారు ఇచ్చే గురుమంత్రము వలన మనకి శక్తిపాతము కల్గి… మనలో కుండలినిశక్తిని జాగృతి చేసి… మనలో మాయ నశించడము జరుగుతుందని చెప్పడం జరిగింది! మాకైతే అర్థం కాలేదు!

కొత్తగా ఈ గురువు అంటే ఎవరు? ఈయన మన సాధనకు ఎలా సహాయపడతాడో నాకు అర్థం కాలేదు! ఇంతలో కొన్నిరోజులకి మేమిద్దరం కబీరుదాసు అనే భక్తి రస చిత్రం చూడటం జరిగింది! ఇందులో ఆయన గురువు కోసము అలాగే గురుమంత్రం కోసం ఎంత తపన పడతాడు తెలుసుకున్నాము! ఇందులో రామానుజాచార్యుడు నుండి మంత్రోపదేశం పొందటానికి ఆయన నడిచి వెళ్లే మెట్ల కింద ఒక మెట్టు గా ఈ కబీరుదాసు పడుకుని ఉండగా…. ఈ విషయం తెలియని రామానుజాచార్యుడు ఆయన నిత్యమూ రామనామస్మరణ మంత్రముతో మననం చేస్తూ ఉండగా… ఈయన తొక్కడము… వారు మూడు సార్లు రామా రామా రామా అనుకుని బాధపడటం… రామనామమే గురుమంత్రముగా భావించి…. కబీరుదాసు తీసుకున్నాడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను! దానితో యోగసాధనకి తప్పనిసరిగా గురువు అనుగ్రహం పొందవలసి ఉంటుంది అని గ్రహించాను! ఇంతవరకు బాగానే ఉంది! అసలు సాధనకి అలాగే గురువుకి గల సంబంధం ఏమిటన్నది నాకైతే అర్థం కాలేదు! గురువులు కోసం ఎందుకు సాధకుడు తపన పడాలో అర్థం కాలేదు! గురువు లేకపోతే సాధన లేదా? అనే ధర్మ సందేహం వచ్చినది! అప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే ఏ విద్య అయినా గురువు తప్పనిసరిగా ఉండాలని… అదే ఆధ్యాత్మిక విద్య కోసం అయితే ఆత్మ సాక్షాత్కారమును పొందిన పరిపూర్ణ గురువు అనుగ్రహం పొందితే కాని… సాధకుడికి తన ఆత్మ జ్యోతి వెలగదని… ఆత్మజ్ఞానము పొందలేడని… గురువు యొక్క సాధన స్థాయిని బట్టి… సాధకుడి సాధనస్థాయి ఉంటుందని… ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుకి మాత్రమే తను పొందిన విధానాలు, మాయలు, మర్మాలు, ఆటంకాలు, అవాంతరాలు తెలుసు ….కాబట్టి తను ప్రయాణించే మార్గంలో సాధకుడిని ప్రయాణింప చేసి తను పొందిన స్థితికి తన సాధకుడిని కూడా తీసుకు వెళతారని మేము గ్రహించాము!

సాక్షాత్తు అవతార పురుషుడైన శ్రీ రాముడికి- వసిష్ఠమహాముని, శ్రీకృష్ణుడికి- సాందీపుడు, రామకృష్ణ పరమహంస- తోతాపురి, నామ దేవుడికి- విఠోబా ,శిరిడి సాయిబాబా- వెంకూసా ,రమణ మహర్షి- అరుణాచలేశ్వరుడు మహా గురువులుగా ఉండి వారి సాధన పరిసమాప్తి చేసినారు అని తెలియగానే మా ఇద్దరికి నోట మాట రాలేదు! ఇంతవరకు బాగానే ఉంది! సాధనకి గురువు అవసరమని తెలిసినది! కానీ గురువు వలన సాధకుడి సాధన ఎలా పరిసమాప్తి అవుతుందో మాకు అర్ధము కాలేదు! అప్పుడు దీనిమీద పరిశోధన చేయగా… ఆదిలో తొలి మానవుడికి కుండలినీ శక్తి బ్రహ్మరంధ్రము వద్ద ఉండేది! దానితో ఆయన కాస్త ఆదియోగి గా ఆదిదేవుడిగా … కొన్నాళ్లు బాగానే సాగింది! కానీ ఆలోచన, సంకల్పము, స్పందన అనే భావాలు కలిగినప్పుడు… ఇంతటి లోకోత్తరమైన ప్రకృతి దృశ్యాలకు…. ఆయన మరచిపోయి ఆనందం పొందుతూ… ఒంటరిగా ఒంటరితనాన్ని భరించలేక…. తనతోపాటు ఎవరైనా తనలాంటి మరొకరు తోడు ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చేసినాడు! ఎందుకంటే తమ బ్రహ్మరంధ్రము వద్ద సహనశక్తి అనే మాయ ఉంటుంది! ఇది ఎప్పుడైతే కోల్పోవడం మొదలవుతుందో అప్పుడు జీవుడికి ఆలోచన మొదలైంది! అపుడు వీరి కుండలీనిశక్తి బ్రహ్మరంధ్రము నుండి హృదయచక్రమునకు చేరుకుంది! ఎప్పుడైతే తను కావాలని స్పందించాడో దానితో కాస్త రెండు సమాన భాగాలుగా అనగా అర్ధనారీశ్వర తత్వం గా విడిపోయి ఇష్టకామేశ్వరుడిగా...ఇష్టకామేశ్వరీ అనగా ఆదిదేవుడిగా- ఆదిపరాశక్తిగా ఏర్పడి నారు! ఎందుకంటే ఈ హృదయచక్రము వద్ద ఇష్టకోరిక మాయ ఉంటుంది గదా! ఆ తర్వాత వీరిద్దరికి సత్వ ,రజో, తమో గుణాల వలన వీరు తనతో పాటుగా అనేక మందిని సృష్టించాలి అని చెప్పి… అండపిండ బ్రహ్మాండాలను కలిగిన లోకమును సృష్టించడం జరిగినది! అనగా ఇష్టకామేశ్వరి కామేశ్వరి గా రూపాంతరం చెందినది అన్నమాట!


ఇంతవరకు బాగానే ఉంది!దానితో, దైవ కోటిని సృష్టించడానికి కోసం… వీరు సంకల్పము చేయగానే…. వీరి కుండలినీశక్తి హృదయ చక్రం నుండి సహస్రార చక్రమునకు చేరుకున్నది! దానితో వీరు 36 కోట్ల దైవ స్వరూపాలుగా! కోటి మంది పరమాత్మలుగా విడిపోయారు! ఆ తర్వాత జీవకోటి సృష్టించడానికి కోసం… వీరు సంకల్పము చేయగానే వీరి కుండలినీశక్తి సహస్రార చక్రము నుండి ఆజ్ఞాచక్రమునకు నకు చేరుకున్నది! ఆ తర్వాత84 లక్షల జీవజాతులుగా మంది విడిపోయారు! ఈ మూల ప్రకృతి యొక్క స్థితిగతుల ఆశపడటముతో …. వీరికి కుండలిని శక్తి కాస్త విశుద్ధి చక్రము నకు చేరుకున్నది! ఆ తర్వాత ఆదిదేవుడు కోపావేశాలకి ఈ సృష్టి వారికి తెలియకుండానే నాశనం అవ్వడం…. ఎందుకు నాశనం అవుతుంది తెలియక భయానికి గురి అవ్వడం జరగడంతో… వీరికి కుండలిని శక్తి కాస్త అనాహత చక్రమందు చేరుకోవడం జరిగింది! ఇలా కాదనుకుని సృష్టికి ఆది దేవతలను, అధిష్టాన దైవాలు, వారిగా విభజన చెందుతూ త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ ఏర్పరచుకుని జరగడంతో…. వీరి కుండలినీశక్తి కాస్త మణిపూరక చక్రానికి చేరుకున్నది!ఇవి సృష్టి యొక్క స్థితి కోసం పరిరక్షణ కోసం ఆదిదేవుడు ఆదిశక్తి ఉండాలని అనుకోవడం వీరు స్వాధిష్టాన చక్రానికి చేరుకున్నది! ఆపై మూల ప్రకృతికి మూలముగా తామే వుండాలని అనుకోవడం… వీరి కుండలినీశక్తి మూలాధారచక్రంలో చేరుకున్నది! అంటే కుండలినీ శక్తి యొక్క ప్రయాణం మొట్టమొదట బ్రహ్మరంధ్రము వద్ద మొదలై చివరికి మూలధార చక్రమునకు చేరుకోవడంతో కాస్త వీరు మహామాయలలో పడిపోవడంతో…. తాము పరమాత్మ అనే అపస్మారక స్థితి వలన మర్చిపోయి… జీవమాయ వల్ల జీవాత్మగా మారి పోయి… మూలాధారచక్రము చేరుకుని…. కుండలినీశక్తి నిద్రపోసాగింది! అంటే విశ్వాత్మ కాస్త జీవాత్మగా… ఆదిదేవుడు కాస్త ఆది మానవుడు గా...ఆదిపరాశక్తి కాస్తా ఆదిమానవురాలిగా మారినారని గ్రహించి ఉంటారు!ఇలా వీరిద్దరు కూడా తమకు అపస్మారక మాయ వలన తెలిసిన జ్ఞానం మర్చి పోవడం వలన మహామాయ కి ఆధీనమైనారు! అంటే యజమాని కాస్త పని వాడిగా సేవలు చేయడం ఆరంభించారు! వీరిద్ధరే ఆదిదైవాలని అనే విషయాన్ని మర్చిపోయి… మాయస్వరూపమే ఆదిదైవముగా వీరిద్దరూ పూజించే అధమ స్థాయికి చేరుకోవడం జరిగినది! దానితో ఈ మాయ కాస్త భయము, ఆనందము, కామము, క్రోధము, లోభము, మదము , మోహ , మాత్సర్యము అనే వ్యసనాలు గా విడిపోయి వీరిని… వీరు సృష్టించిన మూల ప్రకృతి ని స్వాధీనం చేసుకుని ఆడించటం మొదలు పెట్టింది !దానితో ఈ మాయ చెప్పినట్లుగా మూల ప్రకృతి నడుచుకోవడం ఆరంభమైనది! కొన్నేళ్ళు బాగానే సాగింది! ఈ మాయ పెట్టే బాధలు తట్టుకోలేక ఆదిదైవాలకి నెమ్మది నెమ్మదిగా తను సృష్టించిన విశ్వసృష్టి మీద విరక్తి తో కూడిన వైరాగ్య భావాలు కలిగి నాయి! దాంతో వీరికి తెలియకుండానే మళ్లీ బ్రహ్మ జ్ఞానం వైపు అడుగులు వేయడం ప్రారంభించారు! అనగా తాను దిగివచ్చిన మెట్లు పైకి ఎక్కడము అన్నమాట! ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వైపు వెళ్లడం ప్రారంభం అయినది! దానితో మాయను వదిలించుకోవటానికి వీరిద్దరూ నానా కష్టాలు పడ్డారు! నేను అంటే ఏమిటో ఎరుక పరుచుకోవడానికి ఎన్నో యోగ విధివిధానాలు ఏర్పరచుకున్నారు!అందులో ధర్మార్థకామమోక్షాలు, కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన,కుండలీని మార్గాలలో… మూలాధార చక్రము నుండి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చక్రమును దాటుకుంటూ ముందుకు వచ్చే సరికి…. తిరిగి బ్రహ్మరంధ్రమునకు వచ్చేసరికి…. తనతో ఇన్నాళ్లు ఆడుకున్న మహామాయ కాస్త వీరికి ఆధీనమైంది! దానితో యజమాని కాస్త యజమాని గానే ఉన్నాడు! పని వాడు కాస్త పని వాడి గానే ఉన్నాడు! జ్ఞానం పొందితే మాయ కాస్త మాయమవుతుందని వీరిద్దరూ స్వానుభవ జ్ఞానము పొందటంతో బ్రహ్మ జ్ఞాన ప్రదాతగా ఆదిదక్షిణామూర్తిగా ఆదిదేవుడు అలాగే జ్ఞాన ప్రదాతగా ఆదిశక్తి కాస్త వేదమాతగా అవతరించినారు! మళ్ళీ వీరిద్దరూ కలిసి విశ్వ గురువుగా శ్రీ దత్తాత్రేయ రూపంలో అవతరించి లోకా నికి ఉన్నారు! దానితో మాయ నుండి విముక్తి చెంది మోక్షం కోరుకునే వారి కోసం కాస్త ఆది గురువు గా అలాగే ఆదిగురువు కాస్త… దైవాలుగా మారుతూ… సాధకుడికి వారి సాధన స్థితిని బట్టి వారి యోగ చక్రాల యందు కుండలీని శక్తిని ఉంచుతున్నారని అని తెలిసింది! అంటే నిజ గురువు వలన మనం మర్చిపోయిన బ్రహ్మజ్ఞానం జ్ఞప్తికి తెస్తారని అలాగే నిద్రపోతున్న కుండలినీ శక్తిని శక్తిపాతసిద్ధి ద్వారా జాగృతం చేసి యోగ చక్రాలు యందు ప్రయాణింప చేస్తారని తెలుసుకుని ఆశ్చర్యం చెంది నాము! మాకు ఇలా ఎన్నాళ్లు ఇలాంటి నిజ గురువు దొరకక పోవడం వల్లనే మేము పూర్తిగా గ్రంథాల ద్వారా చేసిన కర్మ, భక్తి ,జ్ఞాన, ధ్యాన,కుండలినీ మార్గంలో ఎన్నో అవాంతరాలు వచ్చినాయని తెలుసుకుని నేను గతుక్కుమన్నాను! ఇన్నాళ్లు నిజ గురువు లేకుండా సాధన చేయడం ఎంతో తప్పు అని తెలుసుకుని బాధపడి నాము! దానితో అసలు గురువంటేఎవరు? గురువులు ఎంతమంది ఉంటారు? శక్తిపాతసిద్ధి అంటే ఏమిటి? దానితో మనకు ఎలా జాగృతి అవుతుందో? గురువు అనుగ్రహం ఎలా పొందాలి అనే ప్రశ్నలు మా మదిలో కి వచ్చి నాయి!


దానితో మళ్ళీ సద్గురువులు చరిత్రలు అనగా విశ్వ గురువులు దత్తాత్రేయస్వామి వారి దత్త గురు చరిత్ర పారాయణం చేయడం ఆరంభించినాము!

గురువు అంటే ఎవరు?

“గురువు...గురూపదేశం...గురుత్వాకర్షణ శక్తి”

గురు లేదా గురువు (సంస్కృతం: गुरु) విద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి (Mother) తొలి గురువు. గురుకుల విద్యా విధానంలో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.

ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు (Teachers) మరియు ఉపన్యాసకులు (Lecturers) వివిధ దశల్లో విద్యాబోధన చేస్తున్నారు.

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్

శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్

ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః

నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు. భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్థనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం. గురువులేనివాడు అంధుడితో సమానం అనే నానుడి ఉంది. వ్యక్తికి తొలి గురువు అమ్మే, కానీ గురువు మాత్రం రెండో తల్లి. మనిషి రెండు సార్లు జన్మిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. తల్లిదండ్రుల కలయికతో తొలిసారి... విశ్వసనీయమైన గురువును అంగీకరించడం ద్వారా రెండోసారి జన్మిస్తాడు. గాయత్రి మాత సహకారంతో వేద విజ్ఞానం, వ్యక్తిత్వం అలవరుచుకోవడంలో గురువు తండ్రి పాత్రను పోషిస్తాడు. జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి గురువు బోధనలు ఉపయోగపడతాయి. గురువే లేకపోతే అజ్ఞానం అనే చీకటిలోనే మనిషి కూరుకుపోతాడు. ఆచార్యుడు ప్రమాదం నుంచి మనల్ని కాపాడే వ్యక్తి కూడా.

ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది. గురు బ్రహ్మ, గురూర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని భారతీయుల విశ్వాసం! గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా ఙ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అఙ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలాపొందాలో నేర్పుతాడు. మనస్సు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనస్సు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనస్సు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మయే వాక్కు...ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు, మనస్సు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి. త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకూ ప్రతీకలు. గురువు మనలో మంచిని సృష్టించి, లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్నీ, మోహాన్నీ తుంచివేసే శక్తి సంపన్నుడు. గు కారో అంధకారస్య, రు కారో తన్నిరోధకః అంటే గు అంటే చీకటి. రు పారద్రోలేవాడు. గురువు అఙ్ఞానం అనే చీకటిని పారద్రోలి ఙ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు, భగవత్సమానుడు. భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజీవులైనారు. దత్తాత్రేయుడిని, షిర్డీ సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.


ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది హృదయోపాసన ద్వారా ముక్తిని సాధించే విద్యను ప్రవచించింది. దీనిలో మృత్యువే గురువు. ఇది మృత్యుంజయ విద్యను ఉపదేశించింది. శంకరాచార్యులు భాష్యం రాసిన పది ఉపనిషత్తులతో ఇది కూడా ఒకటి. వ్యక్తి తనకు తోచిన విధంగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన అనుభవం పొందుతాడు. మార్గంలో సూచనలు లేకపోతే ప్రయాణం దారి తప్పే అవకాశాలు ఎక్కువ. జ్ఞాన బోధ వల్ల జీవితానికి మార్గనిర్దేశం కలుగుతుంది. అది గురువు వల్లే సాధ్యం. అస్పష్టమైన ఆలోచనలుండే వ్యక్తి పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణం, అంధుడి ప్రయాణం లాంటిది. గురువు సమాచారం అందించి, మద్దతు ఇచ్చి సహాయం చేస్తాడు. మానవజాతి మొదలైనప్పటి నుంచి గురుశిష్య పరంపర ఆరంభమైంది. యోగశాస్త్రం ప్రకారం ‘సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే గురువులందరికీ గురువు. సమస్త జ్ఞానానికి, పరిపూర్ణతకు అతడే బీజం’. గురువు అనే తత్త్వం లేక సిద్ధాంతం గురువు రూపం ద్వారా పనిచేస్తుంది. పూర్వ కాలంలో శిష్యులకు గురువు బాధ్యతలను అప్పగించేవాడు. ఇక్కడ గురువు చెప్పిన పనిని, ప్రశ్నించకుండా శిష్యుడు చేయాలి. కాని నేటి తరంలో శిష్యులకు స్వతంత్రం ఎక్కువైంది. వేదకాలంలో గురువులను శిష్యులు నిత్యం ప్రసన్నం చేసుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయినంత వరకూ శిష్యుడు గురువు సంరక్షణలో ఉండేవాడు. గురువులను గౌరవించి, ఆరాధించే నిజమైన శిష్యుడు విద్యలో పురోగమించేవాడు.

విద్య బోధించేవారూ గురువులే. అయితే వారు జీవితానికి ఒక భాగాన్ని మాత్రమే అందించగలుగుతారు. జీవితానికి పరిపూర్ణత లభించేది మాత్రం పూర్ణ గురువు దగ్గరే. సంపూర్ణ జ్ఞానం పొందిన గురువే దాన్ని ఇవ్వగలుగుతారు. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే మనిషికి కూడా భౌతిక, ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి. నిద్ర లేచింది మొదలు రకరకాల వ్యాపకాలు, మానసిక ఒత్తిడులు, టెన్షన్లతో సమాజం స్పీడుగా వెళ్లిపోతూ ఉంటుంది. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతూ ఉంటారు. మనం ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో అది భౌతిక జీవితం. రెండవది ఆధ్యాత్మిక జీవితం. అది మనలోనే దాగి ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండి మనం గుర్తించక వదిలివేయబడిన చిన్న అణువు లాంటిది. అణువే అయినా దాన్ని చూడటం అంత తేలిక కాదు. దీన్ని కనుక్కోలేకపోతే, భౌతిక, ఆధ్యాత్మికాలు రెండూ ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని తెలుసుకోవటం? పరిపూర్ణ జీవితాన్ని ఎలా గడపటం? భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలో, ఏ మేరకు పాటించి జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలో చెప్పి నిజమైన జ్ఞానాన్ని అందించేవారే నిజగురువు. అలాంటి గురువు లభించిన వారి జీవితం ధన్యం.

శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారథి ఇలా వ్రాశాడు.

"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,

ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,

ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,

ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,

ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,

ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...

ఆ మహనీయుడే నీకు గురువు"

ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.

1. సూచక గురువు - చదువు చెప్పేవాడు

2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు

3. బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు

4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు

5. విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు

6. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు

7. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -

(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.


గురువును ఎందుకు స్మరించాలి? ఎందుకు దర్శించాలి? కృతఙ్ఞతలు ఎందుకు తెలపాలి? అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటి వాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై, సమాజానికి ఉపయోగపడతారు. అలా గురువు సమాజ సేవచేస్తున్నాడు. స్వర్ణకారుడు బంగారాన్ని సానబట్టి తయారు చేసిన ఆభరణం ధరించేవారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేలను చక్కగా చదునుచేసి మొక్కలు నాటి ఎరువువేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలనూ, పుష్పాలనూ ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు. గురువు మార్గదర్శకుడు, తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించగలడు.ఎన్నో జన్మల పుణ్యం వలన మానవజన్మ వస్తుంది. ఈ మానవజీవితం సార్ధకం కావాలి అంటే గురువును గురించి తెలుసుకోవాలి. గురువే తల్లి, తండ్రి, దైవం. గురువును మించిన దైవం లేదు. గురువు వాక్కే వేదవాక్కు. గురువు వాక్కును శిరసావహించిన వారిని చూసి శివకేశవులు కూడా ఎంతో సంతోషిస్తారు.

బాలకాండలో గురువు ఆజ్ఞను గురించి ఇలా చెప్పబడింది. యాగసంరక్షణార్ధం రామలక్ష్మణులు అడవిలో విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెడుతున్న సమయంలో విశ్వామిత్ర మునికి తమకెదురుగా ఒక స్త్రీ రావడం కనపడింది. విశ్వామిత్రులవారు రామునితో ఆమెను ఒక్క బాణంతో చంపమని ఆజ్ఞాపించారు.తమకు అపకారం చేయని ఒక స్త్రీని చంపడం పాపమని రాముడు మెుదట సందేహించాడు. ఒక్క క్షణమాగి, తరువాత గురువు ఆజ్ఞను పాలించడమే ముఖ్య కర్తవ్యమని తలంచి బాణానెక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ స్త్రీని వధించినాడు. తరువాత ఆ స్త్రీ తాటకి అనే రాక్షసి అని తెలుసుకున్నాడు. శ్రీరాముడు మరేమీ ప్రశ్నించకుండా తన గురువు యెుక్క ఆజ్ఞను పాలించాడు. మార్గ దర్శనము! ప్రజలు వారికి తోచిన విధముగా ప్రయాణము చేయుచూ దానికి సంబంధించిన అనుభవములను పొందుదురు. మార్గసూచనలు లేనిచో ప్రయాణమున దారి తప్పుటకు అవకాశములు ఎక్కువ కలవు. జ్ఞాన బోధల వలన జీవితమునకు మార్గనిర్దేశము కలుగును. అస్పష్టమైన ఆలోచనలు కలవాడు, పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణము, గుడ్డివాని ప్రయాణము వంటిది. గురువు సమాచారము అందించి, మద్దతు ఇచ్చి సహాయము చేయును. మార్గము తెలిసి, ఇతరులకు తెలియచేయగలవానిని “గురువు” అని పిలుతురు. ప్రస్తుతకాలములో ఈ పదము పూర్తిగా వక్రీకరింపబడినది. మనకు గురువు అనగా మోసగాడు, లేక దొంగ గురువు. కనుకనే చాలామంది ఎవరినీ కూడా గురువుగా అంగీకరింపక, అజ్ఞానముతో దారి తప్పుచుందురు. ఏ ఒకరిని గురువుగా అంగీకరించలేక ఒకరి తరువాత ఒకరిని మార్చుతూ తిరుగుచుందురు. ఎవరైతే పదార్థమునందు ఆసక్తి, భావోద్వేగమైన మానసిక ప్రవృత్తి కలిగినవారు ఎంత తెలిసిననూ గురువు దగ్గరకు చేరలేరు. గురువులు, పరమగురువులు లేరని కొందరు కపట వాదనలు చేయుదురు. తనను గురించి తెలుసుకొనవలెని తపించువారికి గురువు దర్శనమిచ్చును. ఎవరి సాన్నిధ్యములో మనలో సరియైన మార్పు కలుగుచున్నదో, ఎవరు నిరాడంబరమైన, ఆదర్శమైన జీవితమును జీవించుచున్నారో, ఎవరిని అనుసరించినచో శాంతి లభించునో వారిని సరియైన గురువుగా తెలుసుకొనవచ్చును. నిస్వార్థమైన సేవాతత్వము, పరిపూర్ణత చెందినవానికి గీటురాయి. నిరాడంబరత లోపించినచో ప్రచారము, స్వీయ-ఉన్నతిని కోరుట, డంభము, ధనార్జన మొదలగు వాటియందు బంధింపబడును. ప్రతి సద్గురువు ఒకే లక్ష్యము కలిగి ఉంటారు. తన చుట్టు చేరిన జీవులకు వారి నిజ స్వరూపమును గుర్తుచేసి, వారు అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవముద్వారా తెలుసుకొనునట్లు వారికి మార్గదర్శకత్వము వహించుటయే వారి లక్ష్యము.నిపుణత కలిగిన మార్గదర్శి పర్వతారోహణమునకు వలెనే, అంతరంగ ప్రయాణమునకు కూడా సరియైన సాధనములు, నిపుణత కలిగిన మార్గనిర్దేశకుడు ఎంతో అవసరము. గురువు కొరకు చూడవలసిన పనిలేదు, ఆయన గురించి మనకు తెలిసిన దానికంటే మనగురించి ఆయనకు ఎక్కువ తెలుసు. మనము గురువును గుర్తించగలిగినచో, మనము ఆయనంత గొప్పవారమే. గురువుయొక్క సాన్నిధ్యము సాధకుడు లేక శిష్యునిలో మార్పు కలిగించును, అది అయస్కాంతము వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పువంటిది. ధ్యానమునకు లేక అధ్యయనమునకు ముందు గురువును గురించిన ఆలోచన, ఆయన సాన్నిధ్యములో చేసిన ధ్యానము వంటిది. గురువుని గురించిన ఆలోచన ఆయన సాన్నిధ్యమును కలిగించును. ఆయన సాన్నిధ్యము మన ప్రజ్ఞను ఊర్ధ్వముఖము కలిగించి మనము చేయు పనిలో నాణ్యతను మెరుగుపరచును. గురువులకే గురువు! మానవజాతి మొదలైనప్పటినుండి జ్ఞానముకూడా ఉన్నట్లుగా, ప్రాచీన శాస్త్రముల ద్వారా తెలియవచ్చుచున్నది. అలాగే గురుశిష్య సాంప్రదాయము. జీవులు ఆవిర్భవించినప్పటినుండి ఇది ఉన్నది. యోగశాస్త్రం ప్రకారం “సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే సమస్త గురువులకు గురువు. సమస్త జ్ఞానమునకు, పరిపూర్ణతకు అతడే బీజము.” సంస్కృతమున అతనిని “గురు” వందురు. అదే జీవులయందలి దైవ-ప్రజ్ఞ.


అదిఒక తత్త్వము, మనిషి కాదు. మానవుల కంటే ముందే ఈ అంతరంగ గురువు ఉండి ఉన్నాడు. మనకన్నా ముందుగా వచ్చినవారిచే అతడు గురువుగా సేవింపబడినాడు.

గురువు-తత్త్వము(సిద్ధాంతము)

గురువు అనే తత్త్వము లేక సిద్ధాంతము గురువు యొక్క రూపము ద్వారా పనిచేయును. చాలా మందికి గురువుద్వారా పనిచేయుచున్న గురుతత్వము కంటే గురు రూపమే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అటువంటి వారు ఆ గురువు యొక్క వ్యక్తిత్వము చుట్టూ ఒక విధమైన ఆరాధనా విధానాన్ని, మతాన్ని తయారుచేసి ఇతరుల ఎడల అసూయ కలిగి ఉంటారు. కానీ నిజమునకు ప్రతి గురువు, జగద్గురు తత్వమునకు ప్రతినిధియై ఉండును. ఒకే ఒక గురుతత్త్వము అనేక మంది గురువుల ద్వారా పనిచేయును. ఆ గురుతత్త్వమునే జగద్గురువు అందురు. గురువు మరియు అతని బోధలు: శాశ్వతమైన జ్ఞానమును అందించు గురువులు, ఆదర్శవంతమైన సాధారణ జీవితము కలిగిఉంటూనే అంతరంగ సాధన ఎలా చేయవచ్చునో ఆచరించి చూపించగలరు. ఆధ్యాత్మిక పురోగతి ఆధారముగా, వారు ధ్యానము, ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనము, జీవుల సేవ మొదలైనవి మౌనముగా ఎటువంటి సంచలనము లేకుండా ఆచరించుటను ఉద్ఘాటించెదరు. ఆయా కాలమునకు సరిపోయేటట్లుగా వారు సత్యమును దాని జిజ్ఞాసులకు వారి బోధనల ద్వారా ఆవిష్కరించెదరు. వారి బోధనలు ద్వారా మానవజాతి యందలి ఏకత్వమును, దాని ఉనికికిని ఉన్న సమన్వయమును తెలియచెప్పుదురు. వారు మన జీవితములకు ఆదర్శప్రాయులగుదురు. మనము తరువాతి తరములకు ఆదర్శముగా ఉండుటకు ప్రయత్నించవలెను. ఆధ్యాత్మిక గురు పరంపర: ఆధ్యాత్మిక జ్ఞానము కాలానుగుణముగా తనంతట తాను బహిర్గతమవుతూ ఉంటుంది. కొన్నిసమయాలలో మరుగున ఉండి, కొన్నిసమయాలలో బయటకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ జ్ఞానమును ప్రసారము చేయు సద్గురువులు ఆధ్యాత్మిక గురుపరంపర అని పిలువబడతారు. ప్రాచీన కాలమునుండి వీరు మానవజాతికి వెలుగు మార్గములోనికి మార్గదర్శనము చేయుచున్నారు.

జ్ఞాన జీవనము:

సద్గురుపరంపర పైననూ, వారి బోధనల మీదను అనేక రకములైన స్పందనలు ఉంటూ ఉంటాయి, ఎలాఅంటే తిరస్కరణలు, పక్షపాతములు, ఊహాజనితములు అని, కొందరు అల్లరిచిల్లరిగా తమకు వారితో పరిచయాలు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారము చేస్తూఉంటారు. చాలా మంది ఈ గురు పరంపర కోసము వెతుకుతూ ఉంటారు, కానీ కనుగొనలేరు, ఎందుకంటే వారు కనీసము ఒక చిన్న సాధనను కూడా అనుసరించకుండుటచేత. సద్గురు పరంపరను అనుసరించువారు సాధారణముగా ఉండి, సామాన్య జీవులలో ఒకడిగా ఉండి, ప్రేమతో, మౌనముగా తన పని తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారికి ఆదర్శప్రాయుడై, వారికి స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాడు. తెలిసిన జ్ఞానమును ఎక్కువ మాట్లాడేవాని కంటే, దానిని జీవితమున ఆచరించి చూపించినవాడు ఆదర్శప్రాయుడవుతాడు. సద్గురువు ఆత్మకు అద్దము: సద్గురువు మనకు ఎవరో కాదు, మన ఆత్మకు అద్దము వంటివాడు. మార్గదర్శనము కోసము మనము మన వెలుపల వెతుకుచుండుటచేత, మనల్ని మనము తెలుసుకోవటము కోసం ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ణయించి గురుపరంపర మనల్ని నిర్దేశిస్తూ ఉంటుంది. గురువు ప్రతిపాదనలు చేయును, మనము వాటిని అందుకొని ఆచరించట కాని, ఆచరించకపోవుట కానీ చేయుదుము. గురువు కేవలము మార్గనిర్దేశము చేయును, ఇతరుల కోసము నిర్ణయములు తీసుకోడు. సాధకుని సమస్యలకు కావలసిన జ్ఞానమును అందించి, అతడే ఆలోచించి తగిన నిర్ణయములు తీసుకొనమని తెలియచేయును. సాధకుడు సూక్ష్మ బుద్ధి కలిగి, నిర్ణయ స్వేచ్ఛ కలిగి, దైవీ సంకల్పముతో ఏకత్వము కలిగి ఉండవలెనని సద్గురువు కోరుకొనును. స్వయం-బాధ్యత: పూర్వపు రోజులలో గురువు, శిష్యునకు బాధ్యతలను అప్పగించేవాడు, నిబంధన ఏమనగా గురువు చెప్పినదానిని ఏదైనా, ప్రశ్నించకుండా శిష్యుడు చేయవలెను. ప్రస్తుతము, శిష్యులు ఇంతకు ముందు కంటే ఎక్కువ స్వతంత్రులైనారు. ఆత్మ యెడల సరియైన బాధ్యతతో ప్రవర్తించేలా నేర్చుకొనవలెను. గురువు ఆత్మతో, ఆత్మ ద్వారా పనిచేయును. జ్ఞాన మార్గమును తెలుసుకొనుటకు కావలసిన స్వేఛ్ఛాయుత నిర్ణయములు తీసుకొనుటను మనము నేర్చుకొనవలెను. మనము చేస్తున్న అన్ని బాధ్యతలను అంగీకరించాల్సి ఉంటుంది. గురువు తన సాన్నిధ్యాన్ని తనకు తానుగా ఇవ్వడు, శిష్యుడు అంతరంగములో గురువుని ప్రార్థించవలెను. గురువుయొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి పొంది పనిచేసుకొనవలెను. అంతరంగము నుండి మార్గనిర్దేశము:గురువు సాధకుని అంతరంగము నుండి మార్గనిర్దేశము చేయును. కొన్ని ప్రాంతములకు వెళ్ళుటకును, కొన్ని నేర్చుకొనుటకును మనకు స్ఫూర్తి కలుగును - జ్యోతిషము, ఛందస్సు లేక హోమియోపతి. మనము ఇది మనకు కలిగిన స్ఫూర్తి అనుకొందుము, కానీ అది అంతరంగము నుండి గురువుచే నిర్దేశించబడినది. వేల సంవత్సరములనుండి ఉన్న పుస్తకము - అకస్మాత్తుగా దానికి ఒకరోజు ఆకర్షితులమవుతాము. ఏదైనా మనము మన అంతర్దృష్టితో ప్రయత్నించినచో దాని హృదయాన్ని అందుకొనగలము. ఈ విధముగా ఎన్నో విషయములు అవగాహన కాగలవు. పదిమంది కొరకు నిస్వార్థముగా పనిచేయగలిగేంతవరకు గురువు మనకు లోపలి నుండి కావలసిన ప్రేరణను అందించుచునే ఉండును.సాన్నిధ్యమును అనుభూతి పొందుట సద్గురువుద్వారా లభించు ఈశ్వర సాన్నిధ్యము జిజ్ఞాసువులో కావలసిన మార్పులను కలిగించును.


అయస్కాంత సమక్షములో ఇనుపరజను ఎలా అయితే ఒకరకమైన ఆకారమును పొందునో, ఆవిధముగా సద్గురు సాన్నిధ్యమున జీవితము, జీవిత సన్నివేశముల యందు చక్కని అనుకూలత కలిగి ఆనందభరితమగును. విద్యుత్తు కాంతిగా ఎలా గోచరమగునో, ఆవిధముగా సద్గురువు ద్వారా జ్ఞానము గోచరమగును. ఈ సాన్నిధ్యము వలన మనలో ప్రజ్ఞా వికాసము కలుగును. ఇది గురువు యొక్క భౌతికమైన సాన్నిధ్యము లేక ఆయన వ్యక్తిత్వము వలననో కాదు, గురువుయొక్క సాన్నిధ్యమును అనుభూతి పొందుటచేత.సద్గురు సాన్నిధ్యమును ప్రార్థించుటచేత, మనలను అయస్కాంతీకరించుకొనుటకు వీలగును. గురువుని ధ్యానములో ఊహించి దర్శించుట అనగా అయస్కాంతమును ప్రార్థించుటయే. గురుదర్శనము, ఆయన సాన్నిధ్యము వలన ధ్యానము కుదురును. గురు సాన్నిధ్యము వలన మనంతట మనము అందుకోలేని మూలము నుండి కావలసిన సహాయము అందును. ఇది కేవలము అనుభూతియే కాదు, ఆత్మానుభవమును పొందుట.మార్పులు లేక రూపాంతరము:దీర్ఘకాలము క్రమము తప్పకుండా ధ్యానము చేసినచో, అది మన జీవితములోని పూర్వపు అలవాట్లను తొలగించి, కొత్త తరంగములను స్థిరపరచి జీవితము నందు కావలసిన మార్పుల నిచ్చును. ప్రాథమిక సూత్రము ఏమనగా ప్రపంచమునందు ఎవరిని కలిసినా వారిని ఆత్మ స్వరూపులుగా దర్శించుట. ఏ సంఘటనను కాని, ఏ రూపము యొక్క ప్రవర్తనను కాని తిరస్కరించరాదు. భౌతిక, సూక్ష్మ లోకములందు సమర్థత కలిగి ఉండవలెను: “నేను ప్రపంచములో ఉన్నాను, కాని ప్రపంచము నుండి కాదు”. సద్గురు పరంపర మనకు ఒక ఉదాహరణ, గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారినట్లు మనల్ని మనము మార్పుచేసుకొనవచ్చును.ప్రయాణము:ఈ ప్రయాణము సుదీర్ఘము, అనేక జన్మలు పట్టును. ఒక జన్మలోనే ఇది పూర్తి అగునని అనుకొనరాదు. సరిగా కాల పరిమాణమును అవగతము చేసుకొన్నట్లయితే మన పురోగతి నెమ్మదిగా తప్పక జరుగును. గమ్యమును అర్థముచేసుకొని, మార్గము తెలుసుకొని ఒక్కొక్క అడుగు వేసుకొంటూ ముందుకు సాగవలెను.“ప్రయాణము యొక్క గమ్యము అవగతమైనచో, మానవుడు ఎన్ని అవాంతరాలనైనా దాటగలడు. దూరముగా నున్న వెలుగును దర్శించినచో ప్రయాణమున ఉన్న కష్టాలను లెక్కచేయక ముందుకు సాగును. ఆ వెలుగు ఎన్ని అడుగుల దూరమున్నదో కూడా లెక్కించడు, అతని హృదయము నందు వెలుగుతున్న వెలుగు కోసం!

గురువులు, పరమ గురువులు లేరని కొందరు వాదిస్తారు. తన గురించి తెలుసుకోవాలనే తపించువారికి గురువు దర్శనమిస్తాడు. ప్రతి సద్గురువు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. తన చుట్టూ చేరిన శిష్యులకు వారి నిజ స్వరూపాన్ని గుర్తుచేసి, అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకొనేటట్టు మార్గదర్శకత్వం చేస్తాడు. గురువు తన సాన్నిధ్యం శిష్యుడిలో మార్పునకు శ్రీకారం చుడుతుంది. అది అయస్కాంతం వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పు లాంటిది. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి ఆయన జన్మ తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం భారతీయ సంప్రదాయం. మామూలు రోజులలో కన్నా గురు పూర్ణిమ నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా లభిస్తాయి. అందుకే ఈ రోజు గురుపూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు. ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనస్సునూ, సూర్యుడు బుద్ధిని ప్రకాశింపజేస్తారు. మానవుల మనస్సులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి. గురు పూర్ణిమ హిందువులకు పవిత్రమైన రోజు. గురువులను అత్యంత భక్తి భావంతో పూజించేరోజు. ఈరోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. వ్యాసమహర్షి మానవజాతి అఙ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవతత్వాన్ని చూపే శ్రుతి, స్మృతి పురాణాలను, శాస్రాలను అందించిన గురువు. వశిష్టుని మనుమడు, పరాశరమహర్షి కుమారుడు, శుకమహర్షి తండ్రైన వ్యాసుడు భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు. వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు. గురు పూర్ణిమకు హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉంది. మన దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గురుపూర్ణిమ ఒకటి. ‘గురుపూర్ణిమ’ అంటే ఏమిటో ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. గురువు అంటే ఒక వ్యక్తికాదు, గురువు అంటే ఒక ప్రత్యేకమైన స్ధానం, స్థితి, ఒక ప్రత్యేకమైన శక్తి. గురువు ఒక శిల్పి వంటి వాడు. బండరాళ్లతో అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రఙ్ఞాశాలి గురువు. మంచి గురువు చేతిలోమలచబడేవారుఉత్తమమానవులై, సంస్కారవంతులై, సమాజానికి ఉపయోగపడతారు. ఎవరైతే మానవ జీవన ప్రస్థానంలో నిజమైన మేథస్సు, తెలివి, నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారో వారే పూర్ణ గురువులు.


మన సాధనలో మంత్రగురువు, దీక్ష గురువు, సద్గురువు, పరమగురువు, ఆది గురువు అనే పంచ గురువులు వస్తారు అని తెలుసుకున్నాము! అనగా మంత్ర గురువు ఇచ్చిన తన గురూపదేశ మంత్రము ద్వారా దైవానుగ్రహము కలిగి దీక్ష గురువు దర్శనం కలుగుతుంది అని నేను గ్రహించాను! నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తి ఈ గురూపదేశము వలన జాగృతి అవుతుందని గ్రహించాను! ఇలా జాగృతి అయిన కుండలినీశక్తిని మన యోగ చక్రాలు యందు ప్రవేశపెట్టడానికి దీక్ష గురువు వస్తారని గ్రహించాను! అలాగే ఆజ్ఞాచక్రము వద్ద ప్రకృతి మాత మాయను దాటించటానికి ఆత్మసాక్షాత్కారం పొందిన సద్గురువు వస్తారని అలాగే సహస్రారచక్రము వద్ద మూలప్రకృతి మాయను దాటించటానికి ఇతరులకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలిగే పరమ గురువు వస్తారని అలాగే హృదయ చక్రం వద్ద ఉండే ఇష్టకోరిక మాయను తొలగించడానికి ఆదిగురువు వస్తారని నేను గ్రహించాను! కాకపోతే ఇలాంటి పంచ గురువుల దర్శనం కోసం మనం మన ఇష్టదైవాల అనుగ్రహం తప్పక పొందవలసి ఉంటుంది అని…అలాగే జగత్ గురువులైన జగన్మాత లేదా విశ్వగురువైన దత్తాత్రేయస్వామి లేదా శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహమును… నేను మీకు యోగసాధన అంటే...అనే అధ్యాయములో చెప్పిన రాజు గారు ఏడు చేపల కథ ద్వారా తెలుసుకున్నారు కదా! అదేనండి గురువు అనుగ్రహం పొందాలి అంటే జగన్మాత అనుగ్రహం ఉండాలని…. గొల్ల వాడు అంటే గురువు అని ఆ కథలో చెప్పినాను కదా! గుర్తుకు రాలేదా! గుర్తుకు తెచ్చుకోండి! వస్తుంది! ఇలాంటి గురువు అనుగ్రహం కోసం వారి ఇష్ట దైవాలు వారి వద్దకు పంపించినారు అని రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర లో కాళీ మాత అనుగ్రహంతో సద్గురువు అనుగ్రహం పొందడం జరిగింది! అలాగే భక్త నామదేవుడు జీవిత చరిత్ర లో కూడా పాండురంగడు అనుగ్రహం వలన ఈయనికి ఒక సద్గురువు అనుగ్రహం పొందడం జరిగింది అని నేను తెలుసుకున్నాను! దానితో గురువు అనుగ్రహం కోసం తప్పనిసరిగా దైవానుగ్రహం కోసం మళ్ళీ దైవారాధన చెయ్యవలసి ఉంటుంది అనే నేను గ్రహించాను! దానితో మేము ఏ దైవారాధన చెయ్యాలో దానికి ఏమి చెయ్యలో అర్థం అవ్వలేదు!

“గురువు..గురూపదేశం..గురుత్వాకర్షణ శక్తి”

“గురువు” అంటే బరువైనవాడు” అని అర్థం

“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం ...” లఘువు”

“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థం

అధికమైన జ్ఞానం ఉంటే గురువు ... స్వల్పమైన జ్ఞానం ఉంటే లఘువు

లఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరి

క్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం చేసుకుంటూ గురుత్వాన్ని సాధించుకోవాలి

“కఠిన సాధన” ఉన్నప్పుడే గురుత్వం .. కఠిన సాధన లేనప్పుడు లఘుత్వం

“కఠిన సాధన” అంటే ప్రతి దిన, రోజువారీ సాధన

గురువులు ఎప్పుడూ లఘువులకు ఉదాహరణలుగా ఉంటారు

“ఒక వ్యక్తి సాధించింది ఏదైనా .. మరొక వ్యక్తి కూడా సాధించగలడు”

అన్న సత్యాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవాడే గురువు

“ప్రతి ఒక్కరిలోనూ ‘క్షమత’ ఉన్నది” అని నొక్కి చెప్పేవాడే గురువు

“ఎప్పుడూ సాధనకు తహతహలాడాలి” అని నొక్కి చెప్పేవాడే గురువు

“గురువుగా తయారు కా” అని చెప్పేవాడే .. గురువు

సకల విద్యల్లో, కళల్లో, ఆటలో, పాటల్లో గురువులు ఎప్పుడూ వుంటారు

గురువులు కాదలచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు

గురువు యొక్క సాన్నిధ్యమే “గురుకటాక్షం” .. గురువు యొక్క చిరునవ్వే “గురుకృప”

గురువులు కాదలచుకున్న లఘువులతో అనునిత్య సాధన చేయించేవాడే గురువు

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే గురువు దగ్గర కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది

భూ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి

భూమి యొక్క ఉపగ్రహం అయిన చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు ..

సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి

భూగ్రహం, మరి ఇతర గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు ..

గురువులుగా కావాలని నిశ్చయించుకున్న లఘువులు ..

గురువు యొక్క గురుత్వాకర్షణ శక్తిక్షేత్రంలో సదా తిరుగుతూ ఉంటారు

గురువులు కావడానికి సంకల్పించిన వారికే గురువులు కనబడతారు కానీ..

గురువులు కావడానికి సంకల్పించని వారికి గురువులు ససేమిరా కనబడరు

చూసే చూపును బట్టే చూడబడేది ఉంటుంది

దృష్టిని బట్టే దృశ్యం సాకారాం అవుతుంది

“యతో దృష్టిః .. తథా దృశ్యం”

గురువులుగా కాదలచుకున్న లఘువులకే గురువులు కావాలి

గురువులుగా కాదలచుకున్న లఘువులు చుట్టూ లేకపోయినా .. గురువులకు ఏమీ కొరత లేదు

గురువులుగా కాదలచుకున్న లఘువులు చుట్టూ ఉంటే .. గురువులకు సంతోషం మాత్రం ఉంటుంది

నిన్నటి కఠిన సాధనాపరుడయిన లఘువే .. నేటి గురువు

నేటి కఠిన సాధనాపరుడయిన లఘువే .. రేపటి గురువు

ఇదీ గురువుల, లఘువుల కథ ..

“గురుపౌర్ణమి” సందర్భంగా శ్రీగురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు

“వ్యాసపౌర్ణమి” సందర్భంగా ఆదిగురువులైన

శ్రీ వేదవ్యాసుల వారికిసాష్టాంగ ప్రణామాలు

*******************************************


గమనిక: అలాగే యోగ సాధనలో మనలోని కుండలినీశక్తిని జాగృతం ఎవరికివారే స్వయంగా జాగృతి చేసుకోలేరు! ఆత్మసాక్షాత్కారం పొందిన నిజ గురువు మాత్రమే మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేయగలరు! ధర్మము, అర్థము, కామము ఎవరికి వారే స్వయంగా ఒంటరిగా పొందగలరు కానీ మోక్షం పురుషార్ధం పొందాలి అంటే మనకి పంచ గురువులు అనుగ్రహమును పొందవలసి ఉంటుంది! ఒకటి గుర్తుంచుకోండి! దీపము ఎవరి సహాయం లేకుండా ఎలా వెలగదో అదే విధంగా సాధకుడు లో జ్ఞాన జ్యోతి వెలగాలి అంటే గురువు అనుగ్రహము అవసరం తప్పనిసరిగా ఉంటుంది! ఎవరి ఆ స్పర్శ మాత్రం చేస్తే తన శిష్యుడు ఈ మాయా ప్రపంచమంతాపరబ్రహ్మముగా దర్శనమిచ్చిన ఆ వ్యక్తి యే మన నిజ గురువని మనకి చెప్పడం జరిగినది! ఈయనే నిజ గురు బ్రహ్మ అని స్వయంగా గురు గీత ద్వారా సాక్షాత్తూ ఆదియోగి అయిన పరమశివుడు మనకి ఆది గురువు గురించి చెప్పడం జరిగినది! మనిషి జన్మ లభించడం ఎంతో కష్టం… అది పొందాక ముక్తి పొందాలని కోరిక కలగడం చాలా కష్టం…. అది వచ్చాక సద్గురువు అనుగ్రహం లభించాలని…. ఈ మూడు ప్రక్రియలు కూడా దైవానుగ్రహం వలన మాత్రమే లభ్యం అవుతాయి! అలాగే గురువు సేవకి, గురువు అనుగ్రహనికి దూరమైన వారు గంధర్వులైనను, పితృదేవతలైనను,ఋషులైనను,సిద్ధులైనను, దేవతలైనను,సాధకులైనను మోక్షమును పొందజాలరని మనకి గురుగీత చెప్పడము జరిగినది!

ఇక మా గురువుల విషయానికి వస్తే... అనగా తొలి గురువుగా శిరిడి సాయిబాబా , తొలి మంత్రగురువుగా మా తండ్రిగారు, తొలి భౌతిక దీక్ష గురువుగా శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహముతో... గాయత్రి మంత్రదీక్షతో...స్ధూలశరీరానికి ... పవన్ బాబా దీక్షనామముతో...విశుద్ధచక్రము వద్ధ ప్రారంభ సమాధి స్ధితి పొంది … ఆనంద స్ధితి పొందడము జరిగినది! అలాగే తొలి భౌతిక శబ్ధపాండిత్య గురువుగా విచిత్ర వేదాంతిగారి అనుగ్రహము వలన, విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో శ్రీ పవనానంద సరస్వతి దీక్షనామముతో… సూక్ష్మ శరీరంతో ఆజ్ఞా చక్రము వద్ధ యోగ సాధన చేసి సవికల్ప సమాధి స్థితి పొంది… దైవ సాక్షాత్కారం స్థితి పొందడం జరిగింది! అలాగే అనుభవ పాండిత్య గురువుగా శ్రీ సద్గురు శ్రీ త్రైలింగ స్వామి వారి అనుగ్రహము వలన శ్రీ పరమహంస పవనానంద దీక్షనామముతో కారణ శరీరంతో సహస్రార చక్రము వద్ద నిర్వికల్ప సమాధి స్థితిని పొంది… ఆత్మసాక్షాత్కారం స్థితి పొంది … తన సద్గురువు తన ఆదిజన్మ శ్రీ భీష్మాచార్యుడని ఎలా అయితే తెలుసుకొన్నారో అలా తన ఆదిజన్మ శ్రీ వేదవ్యాస అంశయని జ్ఞానానుభూతి పొందడము జరిగినది! తద్వారా ఆత్మానంద స్ధితి పొందడము జరిగినది! అలాగే హృదయ చక్రం వద్ద ఆది గురువు అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహమును పొంది ఇష్ట పవనానంద దీక్షనామముతో సంకల్ప శరీరముతో సాధన చేసి ఆనంద సమాధి స్థితిని పొందడం జరిగినది! అలాగే బ్రహ్మరంధ్రము వద్ద ఆదిపరాశక్తి అనుగ్రహాముతో...ఆకాశ శరీరముతో అనగా స్వప్న శరీరముతో...ఆనంద రహిత సమాధి స్ధితి కోసము సాధన చేస్తూ...తమ పంచ స్వప్నశరీరాలు అన్నియుగూడ ఇక్కడ ఉన్న చితాగ్ని యందు సంపూర్తిగా దహనమవుతూ...తన కన్నతల్లి ప్రేమ మాయను దాటడలేకపోవడముతో...స్ధూల శరీరము స్వప్న శరీరముగా మిగిలిపోయి...ఆపై మిగిలిన నాలుగు శరీరాలు అనగా సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరములు విభూధిగా మారడముతో... స్ధూల శరీరము కాస్తా స్వప్న శరీరముగా మిగిలి పోవడముతో…. బాబా విభూతినాథ్ గా నామముతో మారడము జరిగినదని…. ఈ విధంగా తమ యోగసాధన పరిసమాప్తి చేసుకున్నారని గ్రహించండి! అలాగే వీరు చేసే హోమములందు ఆయా హోమ దేవతలు కాస్తా హోమాగ్నిలో హోమాగ్ని రూపములతో కనిపిస్తారని సర్వసాధారణంగా జరిగే విషయమని భక్త, శిష్యులు గ్రహించడం జరిగినది! సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నిరూపించిన మౌన: బ్రహ్మ జ్ఞాన యోగి అని… ఎవరికీ తెలియకుండా… మంది గురించి ఆలోచించకుండా… మది గురించి ఆలోచన చేస్తున్న గుప్తయోగి అని ఎవరికీ తెలియదు! తను 27 సంవత్సరాలపాటు యోగ సాధన చేసి ఆత్మ పరిశోధకుడిగా మారి సత్యాన్వేషిగా తను తెలుసుకున్న సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవములను అందించడానికి సంపూర్ణ అద్వైత సిద్ధాంతకర్త గా మారి లోకానికి అందించడం జరిగింది!

గురువులను వెతకడానికి వెళితే


గురువు కోసం మేము కాస్తా దైవానుగ్రహం తప్పక పొందాలని తెలుసుకోవడంతో… ఏ దేవుడిని తిరిగి భక్తిగా పూజించాలో మాకు అర్థం కాలేదు! ఎందుకంటే అప్పటికే మాకు విగ్రహారాధన మీద వైరాగ్యం కలిగి ఉన్నది! విగ్రహారాధన అంటే ఒక విధమైన భయం మొదలయింది! మా విగ్రహారాధన బాధల గూర్చి ఇంతకు ముందు మీకు " ఎవరిని పూజించాలి" అనే అధ్యాయములో చెప్పడము జరిగినది గదా! దానితో దైవానుగ్రహము లేకుండా గురువు ను వెతకాలి అని మాకు మేమే ప్రయత్నించాము! మాకు మేమే గురువులను స్వయంగా వెతకటానికి నేను శ్రీశైల క్షేత్రం చేరుకోవడం జరిగినది! మా జిజ్ఞాసి మాత్రం యాత్రానుభవం కోసం గురువులను వెతకడానికి దేశ యాత్ర చేయడానికి బయలుదేరినాడు! నేను శ్రీశైలం చేరుకోవడం జరిగితే వాడేమో భద్రాచలం చేరుకోవడం జరిగినది! ఆపై కొన్నాళ్లపాటు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు !ఎవరికి వారే యమునా తీరే అన్న మాట! ఎవరి గురువును వారే స్వయంగా వెతుకోవడము ఆరంభించినాము! అదే మేము చేసిన అతి పెద్ద తప్పు అని మా ఇద్దరికి తెలియని స్థితి! అంటే గురువులో నిజ గురువులు అలాగే నకిలి గురువులు ఉంటారని మా ఇద్దరికీ అప్పటి దాకా తెలియదు!

నేను శ్రీశైల క్షేత్రానికి వెళ్లి… యధావిధిగా దైవ దర్శనం చేసుకుని…. అక్కడ కనిపించిన వాడిని ఇక్కడ ఎవరైనా సిద్ధగురువులు ఉన్నారా అని బిచ్చగాడి దగ్గరనుండి సాధువుల దాకా అడగటం ఆరంభించి నాను! కొంతమంది గురువు అంటే ఎవరో మాకు తెలియదు అని… గురువు అనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని… నాకు సమాధానాలు ఎదురయ్యాయి! ఏమిచేయాలో అర్థంకాని స్థితి! గురువు లేకపోతే సాధన ముందుకు వెళ్ళలేని స్ధితి! ఇక్కడేమో ఎంతటి మహత్తర క్షేత్రంలో కనీసం గురువైన కనిపించడం లేదు !గురువును వెతకడం చాలా కష్టమని రాను రాను నాకు బాగా అనిపించసాగింది! దానితో పంచమఠాల నుండి భీముని కొలను దాకా గురువు కోసం వెతకడం ప్రారంభించాను! ఒక చోట ఒక సాధువు వలన దట్టమైన అడవి లోపలకి వెళ్ళగలిగితే గాలిలో తేలే గురువు దొరుకుతాడని...వారి ఆశ్రమవివరాలు …. నాకు అందించే సరికి నా ప్రాణం లేచి వచ్చింది! దానితో నేను ఒక్కడినే ఒంటరిగా ఆశ్రమం వైపు బయలుదేరినాను!ఆ సాధువు చెప్పిన ఆ గురువు యొక్క ఆశ్రమానికి చేరుకోవడం జరిగినది! ఆశ్రమంలో నాలాంటి వాళ్లు చాలా మంది ఇలాంటి గురువు అనుగ్రహం కోసం అక్కడ అప్పటికే ఉన్నారని తెలిసి నేను ఆశ్చర్యమును పొందినాను! ఒకవేళ నేను కూడా గురువు అయితే నాకు కూడా ఇలాంటి గురు సేవలు చేసే శిష్యులను పెట్టుకోవాలని ఆశ కలిగింది! కొద్దిసేపటికి అసలు విషయం తెలిసినది! ఏమిటంటే గురువు దగ్గరికి వెళ్లాలంటే వారి దగ్గర ఉండే ప్రధమశిష్యుల వారికి కావాల్సిన సేవలు చేయాలని ….అప్పుడే అసలు గురువు దగ్గరికి తీసుకు వెళతారని ….అది వారి అనుగ్రహమును బట్టి ఉంటుందని…. సుమారుగా దీని కోసము 3, 5, 7, 9, 12 సంవత్సరాల పాటు వీరికి సేవలు చేస్తే….. అప్పుడు వారికి బుద్ధి కలిగితే…. అసలు గురువు దగ్గరికి తీసుకుని వెళ్ళతారని తెలుసుకుని గతుక్కుమన్నాను! అయినా తప్పదు కదా! గురువు లేకపోతే సాధన ఉండదు! సాధన లేకపోతే మాయ మాయం అవ్వదు! మాయ అవ్వకపోతే జ్ఞానం రాదు! జ్ఞానము రాకపోతే కర్మ క్షయం అవ్వదు! ఇది కాకపోతే పునర్జన్మ ఎత్తి జానెడు పొట్ట కోసం… బెత్తడు సుఖము కోసం…ఉండేది కూటికి పోయేది కాటికి లాంటి జీవితాలు… అనుభవించాలనే భయం మొదలైంది! దానితో ఎలాగైనా ఈ గురువు అనుగ్రహం పొందాలని ఆరు నెలల పాటు గురు సేవ చేయటం ఆరంభించాను! ఈ లోపల అసలు గురువు కోసం ఎంతోమంది ధనవంతులు రావటం…. విలువైన వస్తువులు ఇవ్వటం… ఈయన వారి కోసమే యాగాలు, హోమాలు చేయడం జరుగుతూ ఉండేది! కానీ ఎప్పుడూ కూడా అసలు గురువుని కళ్ళతో చూడడం తప్ప… ఎప్పుడు ప్రధాన శిష్యులు వారితో మాట్లాడనిచ్చేవారు గాదు! కానీ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు సుమారు 11 వేల మంది శిష్యులు సమక్షంలో కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరడం అలాగే నోటి నుండి ఆత్మలింగం తీయ్యడము చూసేసరికి… ఇలాంటి గురువు అనుగ్రహం కోసం ఎన్ని అవమానాలు, వేధింపులు కలిగిన కూడా వాటిని దాటుకుని వారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకునేవాడిని!


నేను ఒకటి తలిస్తే… దైవమొకటి తలచినట్లుగా… వారి ప్రధాన శిష్యులలో అకారణంగా మనస్పర్ధలు రావటం మొదలయింది! అపుడు అసలు విషయము బయటపడినది! అది ఏమిటంటే అసలు గురువు తన సాధన శక్తితో గాలిలో లేవటం లేదు అని… ఒక త్రాసు మీద కూర్చుని… అది కనిపించకుండా నల్లటి బట్ట వేసి … ఆయన వెనక వైపు కూడా నల్లని తెర ఉంచడము వలన ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా, ఎవరికీ కనిపించకుండా అసలు గురువు త్రాసులో కూర్చోగానే… నెమ్మదిగా రెండో దాని వైపు దాని దగ్గ బరువులు పెడుతూ …. సుమారుగా మూడు అడుగులు పైకి లేచే దాకా… రెండో వైపు తన ప్రధాన శిష్యులు పట్టుకుంటారు అని తెలుసుకునే సరికి నాకు ముచ్చెమటలు పట్టడం మొదలైంది! నా స్వామిరంగా! ఈ ముసలాడికి ఏమి తెలివి! ముండాకొడుకు… గురువు పేరుతో వ్యాపారం చేస్తాడా? వామ్మో! అవును కానీ మరి ఈయన ఎలా గాలి నుండి వస్తువులు లేదా నోట్లో నుంచి వస్తువులు సృష్టించి ఇచ్చాడో నాకు అర్థమవ్వలేదు! అప్పుడు గొడవ పడిన ప్రధాని శిష్యుడు దగ్గరికి వెళ్లి నాకున్న ధర్మ సందేహం వాడికి చెప్పే సరికి… వాడు నవ్వుతూ “తమ్ముడు! అదేమీ బ్రహ్మ విద్య కాదు కనికట్టు మాత్రమే! అది ఎలా అంటే మనలో కొంతమంది ఆయన భక్తులలో కలిసి పోతాము! అప్పుడు భక్తులు కోరికలు తీర్చాలని వినతి పత్రాలు ఇస్తున్నట్లుగా… వాడితో పాటు మీకు తెలియకుండా… బంగారపు ఉంగరాలు, గొలుసులు, శివలింగాలు, కుంకుమ ఉండలు,విభూది ఉండలు అప్పుడప్పుడు ఆయనకి మేమే లేచి అందిస్తాం! వీటిని ఆయన లాఘవముగా...చాకచక్యముగా ఎవరికి అనుమానము లేకుండా...ఏవరికి తెలియకుండా …మా దగ్గర నుండి తీసుకుని వాటిని వ్రేళ్ళమధ్య ఇరికించుకుని ఎవరికీ కనిపించకుండా ,ఎవరికి తెలియకుండా చేతులు గాలిలో ఊపుతూ వ్రేళ్ళ మధ్య నుంచి వీటిని తీసి… వారికి బాగా విరాళాలు ఇచ్చిన అమాయక భక్తుల చేతిలో పెడతాడు ! ఇక్కడ వీరికి విభూది… అక్కడేమో ఈయన కోట్లు పొందుతాడు! అంతెందుకు శివరాత్రి నాడు …నోటిలోనుండి ఆత్మలింగం పేరుతో బాణలింగం ఎలా తీస్తారో తెలుసా …. ముందుగానే నోటిలో ఈ బాణలింగ పెట్టుకుని… ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు! ఆ తర్వాత నీళ్లు తాగుతూ తన బుగ్గలు మధ్యనున్న లింగమును నోట్లోంచి బయటకి తీసి ఆత్మలింగాన్ని అందరికీ చూపిస్తూ… దాని రహస్యంగా శిష్యుల మధ్య పోటీ పెట్టి కోట్ల రూపాయలు పొందుతాడు! నిజానికి దాని ఖరీదు 40 రూపాయలు కానీ ఈయన నోటి నుండి రావడం వలన అదే 40 కోట్లు అవుతుంది! ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం అని జనాలున్నంత వరకు ఇలాంటి స్వాములు బతికే ఉంటారని….. వాడు ఒక్కొక్క రహస్యం బయట పెడుతూ ఉంటే నాకు చుక్కలు కనపడుతున్నాయి! ఇంతలో అసలు గురువు నుండి నన్ను తీస్కురమ్మని సందేశమును శిష్యుడు వచ్చి నాతో చెప్పే సరికి…వీడి బొంద! ముసలాడికి! నా సేవలు చేయటమే దండగా! పైగా ఇప్పుడు ప్రత్యేక సేవలకోసం రావాలా! వీడియమ్మ...దొరికితే నరకాలని అనిపించి …అక్కడ ఉన్న అమాయక భక్తులు నా మీదకి దండెత్తి వస్తారని అనుమానభయంతో, ఆవేదనతో, వాడికి, వాడి ఆశ్రమానికి, నమస్కారం చేసి గురువు విషయంలో మోసపోయినందుకు బాధపడుతూ దిగులుతో ఇంటిదారి పట్టాను!


నా పరిస్థితి ఇలా ఉంటే గురువులు కోసం వెళ్లిన జిజ్ఞాసి ఈ నకిలీ గురువులు దెబ్బకి అప్పుడే ఇంటికి చేరుకున్నాడు అని తెలిసి వారి అనుభవాలు తెలుసుకోవడం ఆరంభించాను! వాడు గురువు కోసం దేశ యాత్ర చేశాడని ఈపాటికి తెలుసు కదా! వాడు అనుభవాలేమిటో వారి మాటల ద్వారానే తెలుసుకుందాం! మనవాడు భద్రాచలము నుండి బయలుదేరి ఆపై హరిద్వార్ క్షేత్రమునకు చేరుకున్నాడు! అక్కడ కనిపించిన ఆశ్రమగురువులను సంప్రదించి “నేను ఎవర్ని” అని ప్రశ్నించేసరికి …వాళ్లు బిక్కమొహం వేసి మతి భ్రమణం చెందిన వ్యక్తి అనుకొని “మాకేమి తెలుసు! మరి నువ్వు ఎవరో… ఎవరి అబ్బాయో ఎలా నాకు తెలుస్తుంది” అని చెప్పి తప్పుకున్నారు! మనవాడి ఉద్ధేశ్యము ఏమిటంటే... అరుణాచల మౌనయోగి శ్రీ రమణ మహర్షి వారు చెప్పిన “నేను ఎవరిని” అని ప్రశ్నించుకోండి! తెలుసుకోండి! జ్ఞానం పొందితే… నీవెవరో తెలుసుకుంటే… భగవంతుని తెలుసుకున్నట్లు అవుతుంది… అని తెలుసుకుని… తను ఎవరో తెలిసిన వ్యక్తిని… తన గురువుగా భావించుకుని సాధన చేయాలని తపన తాపత్రయం అన్నమాట! అందుకే కనిపించే ప్రతి వారిని నేను ఎవర్ని అని ప్రశ్నించడము ఆరంభించాడు! అక్కడ కూడా ఎవరూ సమాధానం చెప్పకపోతే…. హిమాలయాల్లో ఉండే గురువుల దగ్గరికి వెళ్ళినాడు! అక్కడ అగుపించిన కొంతమంది అని అడిగితే… “నువ్వు ఎవరో మాకేం తెలుసు ….నువ్వే చెప్పాలి” అన్నారట! మరి కొంతమంది అయితే నేను అంటే ఏమిటి అని వీడు అడిగితే … దానికి వారు “నేను అంటే నేనే” అని సమాధానం చెప్పే సరికి మన వాడికి తల తిరిగింది! కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతి వాడు గురువు కాదని తెలుసుకున్నాడు! దానితో హిమాలయ ప్రాంతాల నుండి ఉజ్జయిని క్షేత్రమునకు వెళ్ళితే... అక్కడ ఉన్న కొంతమంది సాధువులు, సన్యాసులు అడిగితే … వారు కాస్త ఒక ఆశ్రమ గురువు గూర్చి చెప్పి వారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చినారు! ఈయన కాస్త ఆనందభైరవి సాధనలో ఉన్నాడు! సంయోగము నుండి సమాధి పొందవచ్చునని ఈ సిద్ధాంతం! అందుకే ఈయన ఆశ్రమంలో చేరిన ప్రతి స్త్రీ , పురుషులు సంయోగ ప్రక్రియను అదేపనిగా రోజుకి రెండు వేల మందితో సంయోగ ప్రక్రియలు పాల్గొంటూ ఉంటారట! ఇలాంటి ఆశ్రమంలో మా జిజ్ఞాసి తెలియకుండా చేరినాడు! ఇక్కడ జరిగే తంతు విషయము మన వాడికి తెలుసుకునేసరికి… ఇది కాదు అనుకుని ఆశ్రమాన్ని వదిలి పెట్టి …కాశీ క్షేత్రమునకు చేరుకున్నాడు!అక్కడ ఒక ఆశ్రమంలో చేరటానికి వెళ్ళేసరికి…. అక్కడ జ్ఞానవల్లీ పేరుతో మత్తు పదార్థాలు అనగా గంజాయి సేవించే విధంగా ఉంటాయని తెలుసుకునేసరికి మనవాడు గతుక్కుమన్నాడు! గురువు కోసం దాదాపు 48 విధివిధానాల సంప్రదాయాలను ఆశ్రమాలు చూడడం జరిగినది! నిజానికి వారంతా ఏదో మాయ లో ఉండి ధనము, కీర్తి, స్త్రీ వాంఛ, పేరు ప్రఖ్యాతలు, విలాస జీవితాన్ని అనుభవించే గురువులు గా ఉన్నారని తెలుసుకున్నాడు! గురువుల పేరుతో వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని వెనుదిరిగి వచ్చినాడు! గురువు వచ్చే యోగం ఉంటే… తనకోసం ఎక్కడో ఒకచోట తారసపడతాడు అనుకుని వెనక్కి తిరిగి వచ్చినాడు! ఆ తర్వాత ఈ విధంగా తన అనుభవాలను పంచుకోవడం జరిగినది! పాపం వీడు గురువు కోసం వెతికితే వీడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పిచ్చివాడిలాగా జమ కట్టినారు! నిజ గురువులు అనుకుంటే నకిలీ గురువులు తారసపడ్డారు! మా ఇద్దరికీ కలిగిన నకిలీ గురువుల అనుభవాల రీత్యా… అసలు నిజ గురువులను గుర్తించడానికి ఏమన్నా సూచనలు ఉంటాయేమోనని వివిధ పుస్తక గ్రంధాలు చదవడం మొదలు పెట్టాను!

నిజ గురువును గుర్తించడం ఎలా?

సాధకుడికి తన సాధన పరిసమాప్తి చేసుకోవటానికి గురువు తప్పనిసరిగా ఉండాలని గురువు అవసరం ఏర్పడుతుంది అని తెలుసుకున్నారు కదా! ఎందుకంటే కుండలిని జాగృతికి, కుండలినీశక్తిని అదుపులో ఉంచడానికి, షట్చక్రాలు, వివిధ గ్రంధులు జాగృతి, శక్తి ప్రవహించడానికి, ఈ సమయాల్లో వచ్చే యోగశక్తులను గుర్తించటానికి, వాటిని అధీనములో ఉంచుకోవటానికి గురువు ఖచ్చితంగా అవసరం అవుతాడు! గురువు లేకపోతే కుండలిని శక్తి జాగృతి వలన దీనిని తట్టుకోలేకపోతే... సాధకుడు రోగాలకు గురి కావడమో లేదా నయంకాని రోగాలకు గురి కావడమో లేదా పిచ్చివాడు కావటం లేదా ఉన్మాది కావడం కావచ్చు లేదా ఒకసారి ప్రాణాలే పోవచ్చును! కానీ ప్రతి మోక్షగామికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే పరిపూర్ణమైన యోగ్యుడైన ఆత్మసాక్షాత్కారం పొందిన నిజగురువును పొందటం ఎలా అనేది…. వారిని గుర్తుపట్టడం ఎలా అనేది… మనము గురువుగా స్వీకరించి వ్యక్తి నిజంగానే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవడం ఎలా అనే ధర్మ సందేహాలు వస్తాయి! దీనికి సమాధానంగా నేను వివిధ పుస్తక శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుసుకున్న విషయాలను యధావిధిగా మీ ముందు పెడుతున్నాను! జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి! మీ నిజగురువు ఎవరో తెలుసుకోండి! వారిని గుర్తు పట్టండి! వారికి గురు సేవ చేసి వారి అనుగ్రహము పొందండి! మీ కర్మలను క్షయం చేసుకొని పునర్జన్మ లేని స్థితిని పొందండి!

లక్షణాలు:

1. ఎవరి సమక్షంలో అయితే మనకి అకారణంగా ప్రశాంతత కలుగుతుందో ఉంటుందో…

2. ఎవరిని విడిచి దూరంగా వెళ్లలేని ఉండాలని అనిపించదో…


3. ఎవరిని చూస్తే ఎవరి మాటలు వింటే అకారణంగా కంటి వెంట నీళ్లు ధారాపాతంగా వస్తాయో …

4. ఎవరి దగ్గర నుండి దూరంగా వెళ్ళవలసి వస్తే మన గుండె విపరీతంగా నరకయాతన పడుతుందో…

5. ఎవరినైతే మళ్లీ మళ్లీ చూడాలని మనస్సు పరిపరివిధాలుగా తపన పడుతూ ఉంటుందో…

6. ఎవరైతే దేనికి అవమానంగా భావించరో…

7. ఎవరి మరణం కూడా తన దుఃఖాన్ని కలిగించదో…

8. ప్రాపంచిక భోగాలు యందు కోరిక లేనివారై కలిగి ఉంటారో!

9. ధనం మీద కీర్తిప్రతిష్టల మీద మమకారం వ్యామోహాలు ఎవరికైతే ఉండవో!

10. మీ మనస్సు ఎవరితో మాట్లాడాలని చూడాలని విపరీతంగా తపన తాపత్రయం పడుతుందో…

11. మీ మనస్సు ఎవరి వద్ద ప్రశాంతంగా, సంతోషంగా, ఏదో తెలియని ఉత్తేజ ఆనందమును పొందుతుందో…

12. ఈ మనస్సు ఎవరితో శృతి కలుపుతుందో…

13. ఎవరి వద్ద అయితే మన బాధలు చెప్పుకోవాలని అమితమైన భావోద్రేకాలు కలుగుతాయో…

14. ఎవరి దగ్గర అయితే అన్ని సహాయాలు కూడా ఆగకుండా చెపుతామో...

15. ఎవరి దగ్గర అయితే జీవిత రహస్యాలు ఇతరులకు తెలియని జీవిత రహస్యాలు కూడా ధైర్యము గా చెపుతామో...

16. ఎవరి దగ్గర అయితే ఆగకుండా ఏడుపు వస్తుందో…

17. ఎవరి యందు మనకి అమితమైన భక్తి విశ్వాసాలు కలుగుతాయో…

18. తన మాటలతో తన చూపులతో తన చేతుల తో తన చేష్టలతో ఓదార్పు కలిగిస్తాడో

19. ఇతరులను ఆకర్షించే పసిపాప మనస్సు ఎవరికి ఉంటుందో…

20. ఎవరి దగ్గర అయితే మన మనస్సు పనిచేయదో…

21. ఎవరు దగ్గర అయితే మన మనస్సు ఏకాగ్రత కలిగి ఉంటుందో…

22. ఎవరి పట్ల అమితమైన భయముతో కూడిన ప్రేమ గౌరవ మర్యాదలు కలుగుతాయో…

23. ఎవరి సమక్షంలో కాలము గంటలు కాస్త నిమిషాలుగా గడిచిపోతాయో…

24. ఎవరు సమక్షంలో నీ మనస్సు అమితమైన సంతోషము లేదా మనశ్శాంతి కలుగుతుందో…

25. ఎవరి సమక్షంలో అప్రయత్నంగా నీ మనస్సు నిశ్చలమై ప్రశాంతమై కలుగుతుందో….

26. ఎలాంటి ధర్మ సందేహం అయినా కూడా అనర్గళంగా చాలా తేలికైన పద్ధతిలో మనకు అర్థమయ్యే విధానంలో సమస్య పరిష్కారము చెబుతారో…

27. ఎవరి వద్ద అయితే మనలో అరిషడ్వర్గాలని అణిచి వెయ్యబడతాయో …

28. ఎవరి దగ్గర మనకి మనో ఇంద్రియనిగ్రహం కలుగుతుందో…

29. ఎవరి దగ్గర మన అస్థిర మనస్సు కాస్త స్థిర మనస్సుగా మారి పొందుతుందో….

30. ఎవరి దగ్గర అయితే మన మాట బయటకు రాకుండా మౌన స్థితి కలుగుతుందో…

31. ఎవరిని ఒకసారి దర్శించిన మీ మనస్సు పలుమార్లు ఆయనను దర్శించాలని తపన పడుతుందో...

32. ఎవరి దృష్టి యందు ధనము, మానము, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, విలువ ఉండదో…

33. సుఖదుఃఖాలు యందు సమదృష్టి, బేధభావం లేనివాడు ఎవరైతే ఉన్నారో…

34. ప్రతిఫలాపేక్ష ఆశించకుండా ఎవరైతే ఉన్నారో…

35. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడుతారో…. ఇలాంటి వారిని మంత్ర గురువులుగా భావించడం జరుగుతుంది!

ఇంకా దీక్షగురువుకి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చూద్దాం!

1. సమాధి స్థితికి వెళ్లిన ఖచ్చితమైన దాఖలాలు అనగా ధ్యాన అనుభవాలు పొందిన వ్యక్తి అయి ఉండాలి!

2. పంచభూతాల మీద ఆధిపత్యం కలిగి ఉండాలి!

3. ఖండ యోగసిద్ధి చెంది ఉండాలి!

4. నిజ అవధూత లక్షణాలు కలిగి ఉండాలి!

5. తినడానికి కొంచెమే లేకుండా దానికి చేతులు ఉపయోగించే వాడై ఉండాలి!

6. మంది గురించి ఆలోచించకుండా కేవలం మది గురించి ఆలోచించిన వాడై ఉండాలి!

7. ఒంటి మీద ధోవతి, చేతిలో తంబూర లేదా కమండలం, పంచముఖ రుద్రాక్ష మాలలు కలిగిన వాడై ఉండాలి!

8. తన దగ్గరికి వచ్చే వారిలో స్త్రీ, పురుష భేదం జ్ఞానం లేని వాడై ఉండాలి!

9. దానధర్మాల సేకరించి ఇతరులకు ఇచ్చిన వాడై ఉండాలి!

10. దాన భేద భావం లేనివాడై ఉండాలి!

11. శిష్యుల యొక్క ధన, మానాల మీద ఆధారపడని వాడై ఉండాలి!

12. మహత్తులు కలిగి ఉండాలి అనగా వీరి ఆశీర్వచనము వలన వివాహం కావడం, సంతానం కలగటం, ఇలాంటివి జరుగుతూ ఉండాలి!

13. ప్రతి కర్మను ప్రతిఫలాపేక్ష లేకుండా, లాభాపేక్ష లేకుండా చేసిన వాడై ఉండాలి!

14. చేసే ప్రతి కర్మలను దైవార్పణము చేస్తూ… చేసేది ఇచ్చేది పైవాడు…. ఫలితం పొందేది మీరే అనే వాడై ఉండాలి!

15. శబ్ధపాండిత్యము కన్నా అనుభవపాండిత్యము ఎక్కువ కలిగి ఉండాలి!

16. మౌనమే తన భాష గా ఉండాలి!

ఇక మంత్ర గురువుకు ఉండవలసిన రూపగుణ లక్షణాలు ఏమిటో చూద్దాం:

1. పొట్టి వాడు, పొట్ట ఉన్నవాడు, తిండిపోతు కాకూడదు!

2. చెవిటివాడు , కుంటివాడు కాకూడదు!

3. స్త్రీలోలుడు కాకూడదు!

4. అంగ లోపం ఉన్న వాడు లేదా అధికంగా అంగాలు కలిగి ఉన్నవాడు కాకూడదు!

5. ఎవరి వలన ఎలాంటి శాపము లేనివాడై ఉండాలి !

6. ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటే తన సంతతి లో మగ పిల్లవాడు కలిగి ఉండాలి లేదా సంతానమే లేనివాడై ఉండాలి!

7. దినచర్యను సరిగ్గా పాటించి నిత్య పూజాదికాలు, ఆచారవ్యవహారాల పాటించే వాడై ఉండాలి!

8. స్త్రీ నింద, గురునింద, బ్రాహ్మణ నింద, దైవనింద చేయకుండా ఉండే వాడై ఉండాలి!

9. దుష్ట ప్రవర్తన లేనివాడై ఉండాలి!

10. ఎక్కువ కోపతాపాలు లేనివాడై ఉండాలి!

11. పరస్త్రీలయందు మోహ లేనివాడై ఉండాలి!

12. ఇతరులను మాటలతో, చేతలతో, బాధపెట్టకుండా ఉండాలి!

13. తృప్తి కలిగి ఉండాలి!

14. పండితుల యందు, విద్యావేత్తలు యందు, శత్రుత్వం లేకుండానే మిత్రతత్వం కలిగి ఉండాలి!

15. తనను తాను గొప్ప వాడు అనుకుని భావించకుండా ఉండాలి!


16. అనవసరపు మాటలు, ప్రసంగాలు, ప్రలాపనాలు చేయకుండా ఉండాలి!

17. గర్వము, అసూయ, ద్వేషము, ఈర్ష్య లేనివాడై ఉండాలి!

18. సత్ప్రవర్తన కలిగి మంచి పేరు కలిగి ఉన్నవాడై ఉండాలి!

19. దరిద్రుడు, లోభి, దయ లేని వాడు, దుష్ట ప్రవర్తన, సోమరితనము, పిరికితనము లేనివాడై ఉండాలి!

20. మంత్రమును అపవిత్రము చేయువాడు లేదా మంత్రం ఉద్దేశించి వాడై ఉండకూడదు!

21. కుష్ఠురోగము లేదా నయం కాని రోగాలతో బాధ పడని వాడై ఉండాలి!

22. పరిశుభ్రమైన వస్త్రధారణ కలిగి ఉండాలి!

23. వినయం కలిగి బ్రాహ్మణుడై ఉండాలి!

24. సత్యవాది గా ఉండాలి!

25. ఇంద్రియాలను జయించిన వాడై ఉండాలి!

26. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వారికి సేవ చేస్తున్న వాడై ఉండాలి!

27. శాంత స్వభావం కలిగి నిత్య కర్మలను ఆచరిస్తూ ధార్మిక జీవితమును అనుభవించి వాడై ఉండాలి!

28. పళ్ళు, గోర్లు పరిశుభ్రంగా ఉంచుకొని వాడై ఉండాలి!

29. సంసారిక సుఖాలను యందు అనాసక్తి కలిగి ఉండి ఉండాలి!

30. పొగడ్తలకు లొంగకుండా వారికి దూరంగా ఉండగలిగితే ఉండాలి!

ఇలాంటి దైవిక లక్షణాలు వ్యక్తిని మంత్ర గురువుగా భావించుకుని… వారి నుండి గురుమంత్రమును గురూపదేశముగా పొంది మంత్రదీక్ష చేపడితే… అట్టి వారికి జీవన్ముక్తి కలుగుతుందని…. విశ్వసార తంత్ర రెండో భాగంలో మంత్రగురువుకి ఉండవలసిన లక్షణాలు పైన చెప్పినట్లుగా ఉంటే జరుగుతుంది అని చెప్పడం జరిగినది!

ఇప్పుడు ఇదే శిష్యుడికి లేదా సాధకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఏమిటో చూద్దాం:

1. మంచి నడవడిక కలిగి ఉండాలి అనగా సత్ ప్రవర్తన కలిగి ఉండాలి!

2. అన్నిటి యందు నిశ్చల మనస్సు కలిగి ఉండాలి!

3. అన్నిటి యందు శ్రద్దాభక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి!

4. సంతృప్తి జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి!

5. మంచి ప్రవర్తన కలిగి ఇంద్రియాల జయించుటకు ప్రయత్నించిన వాడై ఉండాలి!

6. అన్ని పనులు చేతియందు నేర్పరి, పట్టుదల, ఓపిక, సహనం కలిగిన వాడై ఉండాలి!

7. శాంత స్వభావి, మృదుస్వభావి, క్షమాగుణము, దయ, ప్రశాంతత చిత్తము కలిగి ఉండాలి!

8. మంచి వంశంలో పుట్టిన వాడై ఉండాలి!

9. దైవము నందు, గురువుయందు అమిత శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి!

10. నిర్మల మనస్సును కలిగి ఉండాలి!

11. మంత్రమును ద్వేషించకుండా, అపవిత్రము చేయకుండా ఉండాలి!

12. రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు లేని వాడై ఉండాలి!

13. సోమరితనము, పిరికి తనము లేనివాడై ఉండాలి!

14. అన్నిటి యందు సంతృప్తి కలిగి ఉండాలి!

15. విచారణ శక్తి, వివేక జ్ఞాన బుద్ధి కలిగి ఉండాలి!

16. స్త్రీ ,పురుష కామ వాంఛలకు దూరంగా ఉండాలి! గృహస్థుడు అయితే పాతివ్రత్య ధర్మంతో ఉండాలి!

17. దొంగతనం, దొంగ బుద్ధి ఉండరాదు!

18. సాధ్యమైనంతవరకు అబద్దాలు చెప్పరాదు!

19. వివాహేతర సంబంధాలు ఉండరాదు!

20. కోపతాపాలకు రాగద్వేషాలకు దూరంగా ఉండాలి!

21. సప్త వ్యసనాలకి, అరిష్వర్గాలకి దూరంగా ఉండాలి!

22. బాహ్య,అంతర శుద్ధి కలిగి ఉండాలి!

23. సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ధర్మ యుతమైన జీవితమును కలిగి ఉండాలి!

24. ధర్మ పరమైన కోరికలు, ధర్మ సంపాదన కలిగి ఉండాలి!

25. ఇతరుల నుండి ధనముగాని, వస్తువులు గాని, ఉచితంగా గాని పొందకూడదు!

26. ఉచితంగా ఏవి ఇతరుల నుండి తీసుకోకూడదు!

27. మూఢ భక్తి కలిగి ఉండరాదు! కోరిక లేని మధుర భక్తి కలిగి ఉండాలి!

28. నిత్య దైవ నామస్మరణ కలిగి ఉండాలి!

29. బద్ధకము, సోమరితనము, వాయిదా పద్ధతి, అమిత నిద్ర, అతి అనేది ఉండకూడదు!

30. ప్రతి కర్మఫలితమును తన ఇష్ట దైవానికి అర్పణము చేస్తూ ఉండాలి!

31. పాపము చేస్తే పశ్చాతాపం చెందాలి!

32. అన్ని కర్మలయందు, అన్ని విషయాలుయందు మనం కేవలం నిమిత్తమాత్రులం అనే భావం కలిగి ఉండాలి!

33. ఎవర్ని ఎప్పుడూ మాటలతో కానీ చేతులతో గాని మానసికముగా లేదా శారీకముగా భాదించకూడదు!

34. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి!

35. అన్ని జీవులపట్ల భూత దయ కలిగి ఉండాలి!

36. తెలిసి తెలిసి అన్యాయపు పనులు, ఇతరులకు హాని కలిగించే పనులు, ఇతరులకు బాధ కలిగించే పనులు, అలాగే పాపపు పనులు చేయరాదు!

37. అతి గాను మాట్లాడకుండా ఉండాలి!

38. కోరికలను తగ్గించుకోవాలి ! కోరికలు మితముగా ఉండాలి!

39. ధర్మం పట్ల అశ్రద్ధ చూపరాదు!

40. సజ్జనులతో సహవాసము చేస్తూ ఉండాలి! దుష్టులకు దూరంగా ఉండాలి!

41. ఎవరితో కటినంగా ఉండరాదు, మాట్లాడరాదు!

42. అసహనము, అస్థిర బుద్ధి లేకుండా చూసుకోవాలి!

43. శరీర ఆరోగ్యం కలిగి ఉండాలి!

44. మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి!

45. భ్రాంతి దర్శనాలకు దూరంగా ఉండాలి!

46. అన్ని రకాల భయాలను జయించగలగాలి!

47. అన్నిటి యందు ఆసక్తి, ఉత్సాహం, సాహసము, ధైర్యము, తత్వజ్ఞానము, స్థిరబుద్ధి కలిగి ఉండాలి!

48. అన్ని విషయాలు యందు వివేక జ్ఞానవైరాగ్య భక్తి భావాలు కలిగి ఉండాలి!

49. అసలైన భక్తి విశ్వాసాలు, సత్తా, ఓపిక, సహనం, సమబుద్ధి, సమదృష్టి, వివేక జ్ఞానము కలిగి ఉండాలి!

50. సిగ్గు వలన ,భయము వలన, లాభం వలన, ఆశించటము వలన, అనుచిత కార్యాలు చేయకుండా ఉండాలి!

51. అవసరానికి మించి వేటినీ స్వీకరించకుండా ఉండాలి!

52. అహంకారము లేనివాడై ఉండాలి! అహంకారానికి విరుగుడు శరణాగతి కలిగివుండాలి!

53. పాపకార్యానికి తప్ప దేనికి భయపడకుండా ఉండాలి!


54. వ్యవహారాలు యందు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి!

55. క్షమాగుణము, సహనము, ఓర్పు, నమ్మకం కలిగి ఉండాలి!

56. వేటి యందు కూడా నేనే గొప్ప అనే అహంకార అహం ఉండకూడదు!

57. మాన అవమానాలకు దూరంగా ఉండాలి!

58. ధన యందు, స్త్రీ యందు, మమకారం రహితుడిగా ఉండాలి!

59. చెడు కోరికలు, చెడు కర్మలు, చెడు ఆలోచనలు, చెడు భావాల, చెడు గుణాలు యందు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి!

అలాగే యోగసాధకులు పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం :

1. ఇతరులను పరిహాసం ఉండకూడదు! మాటలతో చేతలతో, చేతులతో బాధ పెట్టకూడదు!

2. ఇతరుల వస్తువులను దొంగలించకూడదు!

3. వస్తువులయందు కోరికలు, అభిమానం, ఆప్యాయత ఉండకూడదు!

4. వివాహేతర సంబంధాలు లేకుండా ఉండాలి!

5. ప్రతి పనియందు సంతోషము, తృప్తి, సంతృప్తి కలిగి ఉండాలి!

6. దైవము నందు గురువులు నందు సత్యమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి!

7. మానసిక, శారీరక సత్ ప్రవర్తన కలిగి ఉండాలి!

8. దైవ సంబంధిత విషయాలు యందు, సత్య గ్రంథాల పఠనము యందు అమిత శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి!

9. మంత్ర జపము నిరంతరంగా అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగా, మానసిక జపం చేస్తూ ఉండాలి!

10. ఎల్లప్పుడూ ధర్మమును పాటిస్తూ ఉండాలి అలాగే ఆచరిస్తూ ఉండాలి!

11. ఏది జరిగినా మన మంచికే అని దైవ నిర్ణయానికే వదిలేసి గుణము కలిగి ఉండాలి!

12. ఫలితాన్ని దైవానికి వదిలేయాలి!

13. అన్నిటి యందు స్థిరమైన మనస్సు స్థితితో, వివేక గుణముతో, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే వివేకం కలిగి ఉండాలి!

14. వేటియందు సోమరితనము, స్తబ్ధత లేకుండా ఉండాలి!

15. అవసరం లేకుండా శరీరానికి, మనస్సుకు విశ్రాంతి ఇవ్వకూడదు!

16. మాయా మనో భ్రాంతులకు మనస్సును దూరంగా ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి!

17. ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎలాంటి స్థితిలో, మనస్సు అచంచలము కాకుండా ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి!

18. దు:ఖహితమైన వాటికి మనస్సును దూరంగా ఉంచాలి!

19. ఒకసారి గురువుని స్వీకరించిన తరువాత జీవితాంతం మన ప్రాణం పోయేంతవరకు ఆయనే గురువుగా ఆరాధించాలి! అనుసరించాలి! పూజించాలి!

20. ఒకసారి గురువుగా ఒక వ్యక్తిని స్వీకరించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో గురువుని మార్చకూడదు!

21. ఇతరుల నుంచి ధనమును గాని వస్తువులు గాని సేవలు గాని ఉచితముగా,దానముగా తీసుకోవద్దు! పొందకూడదు!

22. మనలో కలిగే ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మనలోనే గుప్తంగా, గోప్యంగా ఉంచుకోవాలి! ఎందుకంటే మన దైవ అనుభవాలు వేరే వారికి చెబితే అవి వారికి అర్థం కాక పిచ్చివాడిగా జమక ట్టే అవకాశం ఉంది లేదా అసూయ పడే అవకాశం ఉంది లేదా పొగడ్తలలో ముంచే అవకాశమున్నది! తద్వారా మీలో మీకే తెలియని అహం పెరిగే అవకాశమున్నది!

ఇలాంటి నిజ యోగ సాధక శిష్యుల కోసం గురువు ఎప్పుడూ అర్హతలు కలిగిన వారి కోసం తహతహలాడుతున్న ఎదురుచూస్తూ ఉంటారట! మన సాధన సమయానికి గురువే స్వయంగా వచ్చి మన సాధన జరిగేటట్లుగా చేయవచ్చును! లేదా ఆయన ఉన్న చోటుకు శిష్యుల వచ్చేటట్లుగా చేయవచ్చును! రామకృష్ణ పరమహంస దగ్గరికి తోతాపూరి గురువే వచ్చి నట్లు గాను లేదా లాహిరి మహాశయులు తన గురువైన మహావతార్ బాబాజీ హిమాలయాలకి పిలిపించుకున్నట్లుగా పిలిపించుకోవచ్చును! మీకు నిజగురు దర్శనం అనుగ్రహం కలగాలి అంటే మీరు నిజ శిష్య పరమాణువు గా ఉండాలి! మీ ఇష్టదైవాన్ని నమ్మాలి! మీ దైవానుగ్రహాము కలిగేవరకు వదలకుండా చేసుకుంటూ పోవాలి! మీ దైవమే గురువు వెతికి… మీ దగ్గరికి ఆయన వచ్చేటట్లుగా చేయటం లేదా మీరు ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా చేయటం చేస్తుందని ఖచ్చితంగా నమ్మండి! గురువే దైవము మారుతుంది!

అలాగే సాధకుడు తన సాధనలో అవసరమైతే తప్పని పరిస్థితుల్లో కొన్ని పరిత్యాగము చేయవలసి వస్తోంది అనగా వదిలి పెట్ట వలసి పరిస్థితులు వస్తాయి! అది మానసికంగా గాని లేదా శారీరకంగా కాని చేయవలసి ఉంటుందని కొన్ని గ్రంథాలు చదివితే నాకు అర్థమైంది! ఏమిటంటే

1. ఈ సాధన అడ్డంగా నీ తండ్రి అడ్డువస్తే ప్రహ్లాదుడు లాగా అతని వదిలిపెట్టాలి !

2. నీ తల్లి అడ్డుగా నిలిస్తే భరతుని లాగ వదిలి పెట్టాలి!

3. నీ అన్న అడ్డగా వస్తే విభీషణుడి లాగా వదిలి పెట్టాలి!

4. నీ భార్య అడ్డంగా వస్తే భర్తృహరిలాగా వదిలి పెట్టాలి!

5. నీ భర్త అడ్డంగా వస్తే మీరాబాయిలాగా వదిలి పెట్టాలి!

6. నీ సంతానమే అడ్డంగా వస్తే గౌతమ బుద్ధుడు లాగే వదిలి పెట్టాలి!

7. నీ గురువు అడ్డంగా వస్తే భీష్ముని లాగా వదిలి పెట్టాలి!

8. నీ శిష్యుడు అడ్డంగా వస్తే ద్రోణాచార్యుడి లాగా వదిలి పెట్టాలి!

9. నీ దేవుడు అడ్డంగా వస్తే కబీర్దాస్ వదిలి పెట్టాలి!

10. తన సంపాదన అడ్డంగా వస్తే షిరిడి సాయిబాబా లాగే వదిలి పెట్టాలి!

11. నీకు భోగభాగ్యాలు అడ్డంగా వస్తే త్యాగయ్యలాగా వదిలి పెట్టాలి!

12. నీకు భయమే అడ్డంగా వస్తే హనుమంతుడిలాగ వదిలి పెట్టాలి!

13. నీకు చావే భయంగా వస్తే పరమశివుడు లాగే వదిలి పెట్టాలి!

14. నీకు మాయ లో అడ్డంగా వస్తే దత్త స్వామి లాగే వదిలి పెట్టాలి!

15. పరస్త్రీ వ్యామోహం అడ్డంగా వస్తే శ్రీరాముడి లాగా వదిలి పెట్టాలి!

16. స్త్రీ వ్యామోహం వస్తే యోగివేమన లాగా వదిలి పెట్టాలి!

17. నీకు అహం అడ్డం వస్తే నామదేవుడు లాగే వదిలి పెట్టాలి!


18. మరణ భయం అడ్డంగా వస్తే మార్కండేయ లాగా వదిలి పెట్టాలి!

19. నీకు జ్ఞానమే అడ్డంగా వస్తే శుకమహర్షి లాగా వదిలి పెట్టాలి!

20. నీకు మాటలే అడ్డముగా వస్తే దక్షిణామూర్తిలాగా మౌనముగా మారాలి!

21. నీకు కోరికల అడ్డంగా వస్తే శంకరాచార్యుడు లాగా వదిలి పెట్టాలి!

22. నీకు అతి అన్నిటియందు అడ్డంగా వస్తే కర్ణుడు లాగా వదిలి పెట్టాలి!

23. నీకు అతినిద్ర అడ్డంగా వస్తే భీముడు లాగా వదిలి పెట్టాలి!

24. నీకు బంధమే అడ్డంగా వస్తే ఘోర భక్తుడు లాగా వదిలి పెట్టాలి!

25. నీకు సిద్ధులు అడ్డంగా వస్తే రామకృష్ణ పరమహంస లాగా వదిలి పెట్టాలి!

26. నీ మాట అడ్డంగా వస్తే రమణమహర్షిగా లాగా వదిలి పెట్టాలి!

27. నీకు నేను అనే అహం అడ్డంగా వస్తే సదాశివమూర్తి లాగా వదిలి పెట్టాలి!

కపాల మోక్షం - 38 - మట్టి మోక్ష లింగం వచ్చింది!

నిజ గురువు యొక్క లక్షణాలు వివిధ గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకునేసరికి మేమిద్దరం గతుక్కుమన్నాము! ఎందుకంటే మానవ మాత్రుడికి ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలు ఉండవని, ఉండలేరని నాకు తెలుసు! దానితో గురువులను మేము వెతకడం కంటే మనకి యోగముంటే వారే మన దగ్గరకు వస్తారని లేదంటే వారికి దగ్గరికి మనల్ని రప్పించుకుంటారని…. మాకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర ద్వారా తన ప్రథమ శిష్యుడు అయిన సిద్ధయ్యను ఎలా తన దగ్గరికి రప్పించుకున్నాడో తెలుసుకున్నాము అలాగే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర లో ఆయనికి ఆయనే నిజ గురువు ని వెతుక్కుంటూ ఎలా వెళ్లారో తెలుసుకున్నాము! అలాగే వివేకానందుడు అప్పటికి 48 గురువులను కలిసి సంతృప్తి చెందక ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరి వారిని వారి అనుగ్రహం ఎలా పొందుతాడో తెలుసుకున్నాము! దానితో నా ఇష్టదైవాలు అనుగ్రహమును నిచ్చే మంత్ర ధ్యానం చేయడం అలాగే గురువు దర్శనం కోసం గురుచరిత్ర పారాయణం చేయడం ప్రారంభించినాము! కానీ ఒక సంవత్సరకాలంలో గురుచరిత్ర పారాయణము తొమ్మిది సార్లు పారాయణము పూర్తి చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం కనిపించలేదు! గురువు యొక్క దర్శనము మాకు లభించలేదు అన్నమాట!

దానితో అన్ని సమస్యలు పరిష్కరించే తిరుపతి వెంకటేశ్వర స్వామికి మాకు నిజ గురువు దర్శనము కలిగించమని మాకు మోక్షప్రాప్తి కలిగించమని వేడుకోవటం జరిగింది! దానితో మేమిద్దరమూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లడం జరిగింది! మేము దర్శనానికి వెండి వాకిలి దగ్గర దర్శనానికి ఎదురుచూస్తున్నాము! ఇంతలో ఎవరో ఉన్నట్టుండి 3 సార్లు “ఓం నమశ్శివాయ” అన్నారు! నేను యధాలాపముగా… నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నేను కూడా ఈ శివ నామమును మూడు సార్లు ఉచ్ఛారించాను! కానీ అదే నా సాధన దీక్ష మంత్రమని నాకు అప్పుడు తెలియదు! ఇంతలో నాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది! నిలువు నామాలు దేవాలయంలో ఉన్న వాడి ఉన్నచోట అడ్డనామాలున్న వాడి పేరు ఎందుకు ఎవరు ఉచ్ఛారించారో నాకు అర్థం కాలేదు! చుట్టూ చూస్తే నిలువు నామాలు ఉన్నవారు తప్ప అడ్డనామాలున్నవారు ఎవరు కనబడలేదు! దానితో తిరుపతి వెంకన్న స్వామి యే ఈ అడ్డ నామాల స్వామి నామమును ఉచ్ఛారించేటట్లుగా చేసినాడని … ఆనాటి నుండి శివపంచాక్షరీ మంత్రమును నా సాధన దీక్ష మంత్రముగా చేయడం ఆరంభించినాను! అలాగే విచిత్రముగా కొద్దిసేపటి తర్వాత రామనామ స్మరణం రామనామము మూడుసార్లు వినపడింది! నాతో పాటు ఉన్న జిజ్ఞాసి గూడ ఆ నామమును మూడుసార్లు ఉచ్చరించాడు! దానితో అతను తారకరామా మంత్రమును దీక్షా మంత్రము గా తీసుకుని చేయడం ఆరంభించారు! ఒకరకంగా చెప్పాలంటే మా దీక్షా గురువు తిరుపతి వెంకటేశ్వర స్వామి అన్న మాట ! ఆయన ఇచ్చిన రెండు నామాలను అనగా నాకు శివ పంచాక్షరీ మంత్రము అలాగే తారకరామా మంత్రమును శ్రద్ధగా చేయడం ఆరంభించినాము! తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన శివపంచాక్షరి మంత్రం తో పాటు నాకు గురుమంత్రముగా ఇచ్చిన గాయత్రీ మంత్రము శ్రద్ధగా చేయడం ఆరంభించినాను! అనగా శివ గాయత్రి మంత్రమును గురు మంత్రముగా ఆరాధన చేయడం ఆరంభించినాను!

నా మట్టి లింగము


ఈ మంత్రసిద్ధి జరుగుతున్న సమయంలో మా అమ్మగారు తన అర్చన చేసే పానమట్టం లేని ఒక మట్టి కుండతో చేసిన లింగమును నా చేతిలో పెట్టింది! ఎప్పుడూ ఇది అమ్మ పూజామందిరములో ఉండేది! కానీ దానిని నేను ఎప్పుడూ తాకలేదు! ఇంట్లో ఉన్న మట్టిలింగం నాకు ఇవ్వటం అర్థం ఏమిటి? ఇంటిలోని దైవిక వస్తువులు చేతిలో ఇస్తేనే దేవుడు ఉన్నాడని నమ్మే సత్తెకాలపు సత్తయ్య నేను కాదు అని అనుకుని ఈ మట్టి లింగమును పక్కన పెడు తూండగా …అక్కడే ఉన్న అమ్మ వెంటనే ఈ విషయం గమనించి “ఓరేయి!పవనా! ఈ లింగారాధన చేసుకోరా! నీకున్న గ్రహపీడలు తొలగిపోతాయి! ఇంకో వారం లో మహాశివరాత్రి రాబోతుంది! అప్పుడు దీనికి పంచామృత ఏకాదశరుద్రుల బిల్వార్చన చేసుకోరా! గ్రహ దోషాలు తొలగిపోతాయి! నీకున్న సందేహాలు తీరతాయి!” అని చెప్పి వెళ్ళిపోయింది! ఏంది! గుడిలో ఉన్న అతిపెద్ద ప్రాణప్రతిష్ఠ లింగమూర్తి ఇంతవరకు అగుపించలేదు! నీవు ఇచ్చిన ఈ చిన్నపాటి లింగమును పూజిస్తే అగుపడతాడా? ఎక్కడ ఉన్నాడో లేడో తెలియని శివయ్యని నాకు చూపించే గురువును చూపించలేక చస్తుంటే… మహా శివరాత్రి నాడు పైగా లింగమూర్తి ప్రత్యేక అర్చనలు, పూజలు అవసరమా? మెడకి డోలు కట్టుకోవడం అవసరమా? ఇక్కడ గురువుకి దిక్కు లేదు! కానీ శివయ్యకి పాల పాయసం కావాలా? నేను పూజలు చెయ్యను! ఏం చేసుకుంటావో చేసుకో” అని “యధావిధిగా ఈ మట్టిలింగం నీవే పూజించుకో! ఉన్న వాటిని ఎలా వదిలించుకోవాలా అర్థం కాక ఛస్తున్నాను!” అంటూ ఈ మట్టి లింగమును యధావిధిగా అమ్మ పూజామందిరంలో తిరిగి ఉంచడం జరిగినది! ఆ క్షణం నుండి నా మనస్సులో ఏదో తెలియని ఆరాటం మొదలైంది! ఏదో దానిని వదిలిపెడుతూ వెళ్తున్నానని… మనస్సుకు నచ్చిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉంటుందో… ఆ అనుభూతి కొన్ని క్షణాలపాటు ఈ మట్టి లింగము అక్కడ పెట్టి వెళ్తున్నప్పుడు కలిగినది! వామ్మో! ఇదేమిటి కొత్త గోల… వింత లీల అనుకుంటూ యధావిధిగా గుడికి వెళ్లి పూజాది కార్యక్రమాలు చేస్తున్నానే కానీ నా మనస్సు ఎందుకో అమ్మ ఇచ్చిన లింగమూర్తి మీద లగ్నం అయింది అని తెలుస్తోంది! కళ్ళు మూస్తే చాలు ఆ శివ లింగ మూర్తి రూపమే కనపడుతోంది! ఏమిచేయాలో అర్థంకాని పరిస్థితి! అప్పుడప్పుడు కూడా గుడిలో ఉన్న రాతి లింగమూర్తి కలలో కనిపించేవాడు కాని ఇంత ఆవేదన ఉండేది కాదు! పోయి పోయి ఎవడో సప్తసముద్రాలు దాటి ఇంటి పక్కనే ఉన్న మురికి కాలవలో చచ్చినట్లుగా… నేను కూడా ఈ మట్టి లింగానికి దాసోహమవు తానా? ఇలా జరగకూడదు! ఒక మట్టి లింగం నన్ను శాసించడమా? వీలు లేదు! అనుకుంటూ రోజులు గడుపుతున్నాను! ఇక్కడ ప్రతిష్ట లింగయ్య ఏం మాట్లాడట్లేదు! ఇంతలో మహాశివరాత్రి రానే వచ్చింది! నేను మాత్రం అమ్మ ఇచ్చిన మట్టి లింగమూర్తి కి పూజ చేయలేదు! అమ్మ చేస్తుంది! నేను యదావిధిగా గుడిలోని లింగమూర్తికి అభిషేకానికి వెళ్లిపోవడం జరిగింది! ఆ రోజంతా శివయ్యకి ఉపవాసం మాకు ఉపవాసం! రాత్రి మహా నైవేద్యం పెడతారు! రాత్రి పది గంటలకి మహా నైవేద్యం పెట్టి బయటకు వచ్చేసరికి జిజ్ఞాసి కనపడ్డాడు! అప్పుడు వాడికి అమ్మ ఇచ్చిన మట్టిలింగం విషయం గురించి చెప్పినాను! దానికి వాడు విని మౌనంగా ఊరుకున్నాడు! అమ్మకి ఈ మట్టిలింగం ఎలా, ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలని ఉందా?

అరచేతిలో శివలింగం ప్రత్యక్షం


మా నాన్నగారికి వచ్చిన స్వయంభూ బంగారు శివలింగమును వద్దు అన్నందుకు ఏం జరిగిందో ఎలా జరిగిందో అమ్మ మాటలలో మీకు చెప్తున్నాను! మా నాన్నగారు మంచి శివభక్తుడైన కానీ అమ్మవారంటే శక్తి మాత రూపం అంటే అమిత ఇష్టం. అమ్మవారి విగ్రహానికి ఈయన వస్త్రం కడితే విగ్రహాన్ని కట్టినట్లుగా ఉండదు. స్వయంగా అమ్మవారికి కట్టినట్లుగా ఉంటుంది. ఏవైనా సమస్యలు వస్తే మొదట అమ్మవారికి చెప్పుకుని ఆ తర్వాత అయ్యవారికి చెప్పుకునేవారట. ఇలాంటి స్ధితిలో ఆయన ఉండగా ఒకరోజు కర్ణాటక ప్రాంతం నుండి సంచార సన్యాసినుల సిద్ధుడు మా గుడి కి వచ్చినాడు. వారి గురువు ఆజ్ఞ ప్రకారం ఇతను ఏ ఊరిలో మూడు రోజులపాటు ఉండకుండా ఊరిని వదిలి పెడుతూ దొరికినది తింటూ ఆ ఊరిని వదిలిపెడుతూ సంచారము చేస్తున్నారని మన నాన్నగారు తెలుసుకున్నారట. దానితో ఈయనికి కావలసిన భోజన ఏర్పాట్లు మా నాన్నగారి చేయడం జరిగినది. గుడిలో ఉన్న మంత్ర ఉచ్ఛారణ దైవ శక్తి ప్రభావానికి ఈ సిద్ధుడు కొంతసేపు వశము అయ్యి శివ లింగ మూర్తి ని చూస్తూ ఆనంద స్థితిని పొందినాడు. ఇలాంటి ఆనంద స్థితి కోసమే నేను క్షేత్ర సంచార చేస్తున్నాను అని మా నాన్నతో చెప్పి భోజనానికి మా ఇంటికి వచ్చినారు. భోజనాలు సత్కార్యాలు సంతోషపడుతూ… మా నాన్నగారికి ఉన్న నిజమైన శివ శక్తి భక్తికి ఆనందపడుతూ… మా నాన్న ను చూస్తూ…ఆ సిద్ధుడు ఏవో మంత్రాలు చదువుతూ …తన అరచేతిని తెరవగానే ఒక అంగుళం ఉన్న బంగారు శివలింగం ప్రత్యక్షము అయినది. ఈ శివలింగం చూసినవారంతా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూండగానే …. మా నాన్నగారు వెంటనే వారితో “స్వామి! ఈ శివలింగమును నేను భరించలేను! నాకు అంత సాధనశక్తి గాని అలాగే మంత్రశక్తి గాని నాకు ఉంది అని నేను అనుకోను. ఎక్కడ నుండి ఎలా తెప్పించినారో అలాగే మళ్లీ వెనక్కి నాకోసం పంపించండి” అనగానే మౌనంగానే ఆ సిద్ధుడు వచ్చిన ఈ స్వయంభు బంగారు లింగమును తనకు ఇష్టం లేకపోయినా శివభక్తుడు బాధపడకూడదని ఒక కారణంతో ఆ కారణముగా అయిష్టంగా వెనక్కి పంపించి వేసినారట.

ఆ తర్వాత కొద్ది సేపటికి మా అమ్మమ్మగారికి ఈ బంగారు శివలింగం మీద ఆసక్తి కలిగి వెంటనే ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్లి “స్వామి! నేను కూడా శివ భక్తురాలినే కానీ నా దగ్గర పూజ చేసుకోవటానికి శివలింగం లేదు! మీరు ప్రసాదిస్తే దానిని పూజించుకుంటాను!” అనగానే వెంటనే “అమ్మాయి! పై వాడి నిర్ణయము ఎలాంటిదో నాకు తెలియదు. వాడు ఏమి ఇచ్చినా కూడా నువ్వు తీసుకోక తప్పదు. మళ్ళీ వెనక్కి పంపించే స్ధితి రానీయకు!” అంటూ ఏవో మంత్రాలు చదువుతూ తన అరచేతిని చాచగానే కుండపెంకుతో నిర్మితమైన పానమట్టము లేని మట్టి శివలింగము వచ్చినది! దానిని మా అమ్మమ్మ చేతిలో పెడుతూ “ఇదిగో నీకు శివ అనుగ్రహ ప్రసాద మని” చెప్పి ఇచ్చినాడు! వెనక్కి తిరిగి బంగారు శివలింగం వస్తుందని ఆశించిన మా అమ్మమ్మ వచ్చిన ఈ మట్టి లింగమును అయిష్టంగానే తీసుకుని వారికి నమస్కారం చేసి వంటింట్లోకి వెళ్లి అమ్మ పూజ మందిరంలో ఈ మహత్తర మట్టి శివలింగమును ఉంచినది! తర్వాత కొద్ది సేపటికి వచ్చిన సిద్ధుడు ఊరు వెళ్లిపోయినాడు !ఆయన ఎవరో ఏమిటో వివరాలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు. స్వయంగా శివయ్య అనే సందేహం కూడా ఎవరికి కూడా రాలేదు. కొన్ని రోజుల తర్వాత మా అమ్మమ్మ కూడా వెళ్ళి పోతూ ఈ మట్టి లింగమును అమ్మకే ఇచ్చి తీసుకోమని చెప్పి…. బంగారు శివలింగం ఇస్తాడని అనుకుంటే… నా చేతికి ఈ మట్టి లింగమును ఇచ్చి వెళ్ళినాడు. వాడు నిజమైన సిద్ధుడైనా లేక కనికట్టు నకిలిస్వామి అయ్యిండాలని అని చెపుతూ అమ్మ చేతిలో ఈ మట్టి శివలింగం పెట్టి తన ఊరు వెళ్లి పోయింది.శివలింగారాధన తెలియని అమ్మ ఈ లింగమును తీసుకుని తన పూజా మందిరంలో ఉన్న అన్ని దేవుళ్ళుతోపాటుగా పాటు ఈ శివలింగం మూర్తిని కూడా ఉంచినది! దాని మహత్తర విలువ తెలుసుకుని జ్ఞానశక్తి ఆమెకు తెలియదు. వచ్చిన వాళ్ళకి అంత సాధన శక్తి లేదు. కేవలం ఈ రెండు శివలింగాలు ప్రసాదించిన సిద్ధుడుకి మాత్రమే ఆ శివలింగం యొక్క విలువ తెలుసు! ఎందుకంటే తన లింగమూర్తి యొక్క విలువ తనకంటే ఈ లోకంలో ఎవరికి తెలుసు ఆ సిద్ధుడు ఎవరో కాదు స్వయంగా మహాశివుడు అయి ఉండాలి. ఎందుకంటే మా నాన్నగారి లింగారాధన 12 సంవత్సరాలు పూర్తి అయినాయి కాబట్టి స్వయంగా మహా శివుడు సిద్ధుడు రూపంలో ప్రసాదించాడని విషయం ఎవరికీ తెలియలేదు. ఈ విధంగా మట్టి మోక్షలింగ ఉద్బవము జరిగినది!చివరికి అమ్మద్వారా ఈ శివలింగమూర్తి నాదరికి చేరినది! ఇలా దేవుడు ప్రసాదించిన బంగారు శివలింగం కాదన్నందుకు మా నాన్నగారు అర్థ సాధకుడుగా ఎలా మిగిలిపోయా రో తెలుసుకోవాలి అంటే.....

అర్థ సాధకుడి కథ

(మా తల్లిదండ్రుల సాధన కథ)

ఈ అధ్యాయంలో మా అయ్య సాధన ఎలా పరిసమాప్తి అయినదో… ఆయన ఏ విధంగా మాయలో పడ్డాడో… ఆయన ఏ విధంగా త్రిపుర కామ మాయను దాటలేకపోయినారో తెలుసుకుందాం! ఇంతకు ముందు అధ్యాయములో మా నాన్నగారికి స్వయంభూ బంగారు శివలింగమూర్తిని ఒక సిద్ధుడు ప్రసాదించడము అలాగే దీనిని ఈయన కాదనటం చదివినారు గదా! ఆపై ఏమి జరిగినదో మీరే చదవండి! ఇలా కొన్ని నెలలు గడిచి పోయినాయి. ఎవరికి వారే తమ పనుల్లో మునిగిపోయారు. శివ సిద్ధుడు ఇచ్చిన లింగమూర్తి విషయమే మరిచిపోయారు. మా నాన్నగారికి ఇచ్చిన ప్రసాదించిన స్వయంభూ బంగారు శివలింగం తీసుకోలేదని మీకు తెలుసు కదా. అప్పుడే అసలు ఆట మొదలైంది. మా నాన్న సాధన స్థాయి బాలా-త్రిపుర-సుందరి- దేవి స్థాయిలో త్రిపుర స్థాయికి చేరుకున్నారు. త్రిపుర దేవి అంటే మూడు పదుల వయసు ఉన్న స్త్రీ మూర్తి అన్న మాట. బాల అంటే ఐదు సంవత్సరాల వయసులో ఉన్న పిల్ల అన్నమాట. ఇక సుందరి అంటే 65 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ మూర్తి అన్న మాట. ఇక దేవి స్వరూపము అంటే 85 సం!!రాలు వృద్ధమూర్తి అన్నమాట! సాధకులు వారి సాధన స్థాయి ఏ స్థాయిలో ఉందో ఈ బాలాత్రిపురసుందరిదేవి అవతారం వస్తాయని ఈపాటికే తెలుసుకున్నారు కదా. వారి స్థాయిని బట్టి అమ్మవారు ఈ నాలుగు రూపాల్లో ఆయా రూపం ధరించి అన్ని రకాల యోగమాయ పరీక్షలు పెడుతుంది! సాక్షాత్తు ఆదియోగి శివయ్యకి ఈ యోగపరీక్షలు తప్పలేదు!అందులో మనమెంత! వాటిని తట్టుకుని నిలబడిన వారికి వారి తమ సాధన స్థాయిని పెంచుతుంది. ఇలా ప్రతి సాధకుడికి ఈ త్రిపురసుందరిదేవి మాయ పరిస్థితి గురి కావాల్సిందే. అలా మా నాన్న కూడా తన సాధన స్థాయిలో రెండో దశకు చేరుకున్నప్పుడు పరీక్షించటానికి కామరూపము త్రిపుర దేవి కామ రూపములో వచ్చి ఉన్నది. ఈ విషయాలు ఏవీ తెలియని పట్టించుకునే స్థితిలో మా అయ్య సాధన స్థాయి ఉన్నది. అర్ధరాత్రులు మూసివున్న గుడిలోకి వెళ్లి తలుపులు తెరిచి అమ్మవారి గుడిలో అమ్మవారి తో ఏవో సంగతులు మాట్లాడుతూ ఉండటం మా అమ్మ గమనించినది! నెమ్మది నెమ్మదిగా ఊర్లో వాళ్లకి, గుడిలో వాళ్లకి ఈ విషయం తెలిసినది. మా అయ్య నిజ భక్తి కి అందరూ సంతోష పడుతున్న సమయంలో… రానే వచ్చింది… కామరూపములో యోగమాయ పరీక్షా కాలం! భర్తను వదిలేసి ఒక స్త్రీ మూర్తి రూపంలో… గుడిలోనూ, ఇంటిలోని పని చేయడానికి పని మనిషి రూపంలో కామరూపీ దేవి అనగా త్రిపుర దేవి తన మాయని చూపించడం మొదలు పెట్టింది. ఈయనికి సాధన స్థాయికి తీవ్రమవుతున్న కొద్ది సమయంలో దాన్ని తట్టుకోలేని తీవ్రమైన కామమాయకి గురి అవుతున్నాడు! ఇలాంటి సమయంలో మా అమ్మమ్మ ఇచ్చిన నాటి మట్టి శివలింగం మూర్తిని అమ్మ ఆరాధించటం మొదలైంది. అక్కడేమో మా నాన్నకి తీవ్రమైన కామవాంఛ మొదలయితే ఇక్కడేమో అమ్మ కి కామవాంఛ మీద తీవ్రమైన వైరాగ్యం మొదలైనది. ఎవరు కూడా అర్థం చేసుకోలేని అర్థం కాని మహామాయ పరీక్షకాలములో ఉన్నారని వీరిద్దరూ తెలుసుకోలేకపోయారు. మా నాన్నకి ఉన్న తీవ్ర కామ స్థాయికి ఒకేసారి వెయ్యి మందిని సంతృప్తిపరిచే స్థాయిలో ఉంటే మా అమ్మ కి ఏమో కామం అంటే పూర్తిగా వాంఛ లేని స్మశాన వైరాగ్యం స్థాయికి వెళ్లి పోయింది.

కపాల మోక్షం - 39 - బాబా ఫోటో రావడం

గురువు యొక్క లక్షణాలు వివిధ గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకునే సరికి మేమిద్దరం గతుక్కుమన్నాము.ఎందుకంటే మానవమాత్రునికి ఇలాంటి లక్షణాలు ఉండవని ఉండలేరని మాకు తెలుసు.దానితో గురువులను మేము వెతుక్కోవటం కంటే మనకు యోగం ఉంటే వారే మా దగ్గరకు వస్తారని లేదంటే వారి దగ్గరికి మమ్మల్ని రప్పించుకుంటారని మాకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రలో తన ప్రథమ శిష్యుడిని సిద్ధయ్యను ఎలా తనకి దగ్గరకు రప్పించుకున్నారో తెలుసుకున్నాము. అలాగే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఆయననే ఆయన గురువు వెతుక్కుంటూ ఎలా వెళ్ళినారో తెలుసుకున్నాం. అలాగే వివేకానందుడు ఇప్పటికే 48 మంది గురువులను కలిసి సంతృప్తి చెందక ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరి వారిని గురువుగా ఎంచుకొని గురువుగారు అనుగ్రహమును ఎలా పొందినారో తెలుసుకున్నాము! దానితో నా ఇష్టదైవాలు అనుగ్రహం నిత్యం మంత్రధ్యానం చేయటం అలాగే నిజ గురువు దర్శనం కోసం గురు చరిత్ర పారాయణం చేయడం ప్రారంభించాము. అప్పుడు ఒకసారి మా ఊరికి మా అమ్మమ్మ గారు రావడం జరిగినది. ఆమె నిత్యము ఏదో గ్రంథ పారాయణం చేయటం అలాగే ఎవరో సిద్ధ విగ్రహాన్ని పూజ చేయడం చూస్తుంటే సరికి నాకు ఆశ్చర్యమేసింది. అది ఎందుకంటే ఇప్పటిదాకా నేను వివిధ దేవతా విగ్రహాలను చూడటమే జరిగినది. ఒక మనిషి లాంటి వ్యక్తిని ఆరాధించే మొట్టమొదటిగా అమ్మమ్మ ని చూస్తున్నాను. పైగా అప్పటిదాకా నేను భగవద్గీత, గురు చరిత్ర గ్రంధ పారాయణాలు చేయటమే తెలుసు కానీ ఈవిడ దగ్గర షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అనే గ్రంథమును పారాయణం చేస్తుంది! ఎవరు? ఈ మనిషి లాంటి సిద్ధపురుషుడు విగ్రహము అని సందేహం వచ్చింది. అమ్మమ్మ ను అడిగితే దానికి ఆమె వారు “మహాయోగి అయినా షిరిడి సాయి బాబా వారని … గొప్ప సద్గురువు అని… 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిన వారని,అక్కడ వారంతా వీరిని నడయాడే పరమాత్మగా కొలుస్తారని…. సర్వమత స్థాపకుడని ఇలా షిరిడి సాయి బాబా గూర్చి చెప్పడం జరిగినది.

అప్పటినుండి బాబా గురించి తెలుసుకోవాలని తపన ఉండేది. మా ఊరిలో గాని ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో బాబా గుడి లేదు. అప్పట్లో జనాలకి వీరి గూర్చి అంతగా తెలియదు. దీనితో మాకు కూడా పూర్తిగా ఆయన గూర్చి తెలియకుండా పోయింది. ఒకసారి వేసవి సెలవుల కోసం అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళటం జరిగినది. ఒక గురువారం ఆమె బాబా గుడికి వెళుతూ నన్ను కూడా తీసుకొని వెళ్ళింది.

ఇక్కడ మూడు అడుగుల తెల్లని పాలరాతి విగ్రహం రాతి మీద కూర్చున్న భంగిమలో ఎదరు సిద్ధ పురుషుడి విగ్రహం ఉన్నది. ఆయనే బాబా అని అమ్మమ్మ చెప్పేదాకా నాకు తెలియదు. ఎదుట ఉన్న విగ్రహమూర్తి ని చూడగానే సజీవంగా చూస్తున్నట్లుగా అనిపించసాగింది.! వామ్మో ఇంతటి మహత్తర సిద్ధ మహనీయుడిని ఇంక ఎన్నటికీ వదలి పెట్టకూడదని నాలో నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో నా యోగ జీవితమును నడిపించే నావికుడు అని బలముగా చూసిన మొదటి రోజున అనిపించింది. చూపులు కలిసిన శుభవేళ శుభముహూర్తం మా ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. తాతా-మనవడులో తాతగా ఉంటాడని అనిపించింది . లింగమూర్తిని ఆరాధించిన కూడా నాకు ఇలాంటి ఆర్తి ఆయన విషయంలో కలగలేదు. ఈయన విషయంలో లో మాత్రం కలగకుండా ఉండలేదు.ప్రతిరోజు అక్కడ ఉన్నన్నాళ్ళు బాబా గుడి కి వెళ్ళడము జరిగింది. ఒకరోజు నేను బాబా గుడికి రాగానే పాము కరిచిన వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చి “బాబా !వైద్యులు ఇతడిని బ్రతికించలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దైవాన్ని నమ్ముకోమని చెప్పి వెళ్లిపోయారు. మా దృష్టిలో నిన్ను మించిన దైవము ఎవరూ లేరు కదా! బాబా! మా వాడిని రక్షించు రక్షించు” అంటూ దీనాతిదీనంగా బాబా కి హారతి ఇస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాడి ప్రార్ధన అలాగే పాముకాటు బాధ పడుతున్న ఆవేదన చూసి నా కళ్ళవెంట నీళ్ళు రావడం ప్రారంభమైనది. ఇంతలో ఆలయ పూజారి వచ్చి బాబా దగ్గరున్న ధుని ఊది ఈ పాము కాటు వద్ద రాసి… నోటిలో కొంత ఊది వేసి… బాబా వైపు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సుమారుగా మూడు గంటల తర్వాత పాము కాటు బాధితుడు పునర్జీవితుడయ్యాడు అని అమ్మమ్మ నాకు చెప్పేసరికి నా ప్రాణం వచ్చినంత ఆనందం వేసింది. ఈ అద్భుత సంఘటనతో ఆయన మీద మా తాతయ్య మీద గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు పెరిగినాయి. నా సెలవులు పూర్తి కావడంతో ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నము అయ్యేసరికి బాబాని వదిలి వెళ్తున్నందుకు నా మీద నాకే కోపం, బాధ కలిగినాయి. కానీ ఏమీ చేయలేము కదా! అప్పుడు మా అమ్మమ్మ నా చేతికి షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర గ్రంథం అలాగే బాబా వారు చెప్పిన జవాబులు పుస్తకమును నా చేతిలో పెట్టడం జరిగింది. వీటిని కనిపించని బాబా తాతయ్య ప్రసాదంలాగా దాచుకొని మౌన వేదన తో ఇంటికి రావడం జరిగినది. కానీ నా నుండి బాబా ఆలోచనలు పూర్తిగా పోయేవి కావు. బడిలో, గుడిలో లో జరిగిన సంఘటనలు అన్నీ బాబాకి చెప్పేవాడిని. ఆయన అన్ని వింటున్నాడని భావించేవాడిని. నన్ను చూసే వాళ్లకు నాలో నేను ఏకాంతంగా మాట్లాడుకోవడం మాత్రమే కనిపించేది.


ఆ జిఙ్ఞాసి కనపడని సమయంలో నేను బాబాతో అన్ని విషయాలు చెప్పుకునేవాడిని ఎలా అంటే రామకృష్ణ పరమహంస తన కాళీమాత తో ఎలా చెప్పుకునేవాడో అలాగన్నమాట.కానీ నాకు బాబా వారు సజీవమూర్తిగా కనిపించేవారు కాదు అన్న మాట. ఇది ఇలా ఉండగా నాకు తెలియకుండా నేను బాబా చరిత్ర పారాయణము ఆరు నెలలు పూర్తి చేసినాను.

మా బాబా సజీవమూర్తి ఫోటో

ఒకరోజు మా అన్నయ్య నాకోసం శ్యామ కర్ణ ఉన్న గుర్రం అలాగే వాఘే కుక్క కూర్చున్న సజీవమూర్తి ఉన్న బాబా వారి రెండు అడుగుల ఉన్న ఫోటో నాకు పుట్టినరోజు బహుమతి గా ఇచ్చినాడు. అది 1993వ సంవత్సరంలో అన్నమాట. బాబా సజీవమూర్తి ఫోటో చూడటం అదే మొదటిసారి. అలాగే ఇలాంటి ఫోటో నేను ఇంతవరకు మరి ఎక్కడ చూడకపోవడం మరీ విచిత్రం అన్నమాట. ఆ ఫోటో ఇప్పటికీ నా ప్రాణ ప్రదంగా నా దగ్గరే ఉన్నది. అది ఉంటే బాబా నాతో ఉన్నట్లే ఉండేది. ఇక ఆరోజు నుండి ఈ ఫోటో తో మాట్లాడుకోవడం ఆరంభించాను.ఒక ప్రక్క బాబా పారాయణాలు,హారతులు జరుగుతున్న సమయంలో నాకు ఏదైనా సమస్యలు వచ్చినా బాబా సూక్తులు పుస్తకము చూసేవాడిని.అందులో లో బాబా చెప్పిన మాటలు 777 సూక్తులు ఇవ్వబడినాయి. అందులోంచి కళ్ళు మూసుకొని ఒక నెంబరు లేదా పేజీని తాకి నాకు వచ్చిన సమస్యకు పరిష్కార సమాధానము ఖచ్చితంగా వచ్చేది నాకు ఎంతో ఆశ్చర్యం వేసేది. దానిని స్వయంగా బాబా ఆజ్ఞ అని భావించి ఆయన చూపించిన సమాధాన సూక్తిని అనుసరించేవాడిని. పాటించేవాడిని. ఆచరించేవాడిని. ఇప్పటిదాకా బాబా ఆజ్ఞలన్నియు ఈ పుస్తకం ద్వారా నాకు వచ్చేవి. ఇప్పటికి కూడా వాటిని పాటిస్తున్నాను.

గమనిక: బాబా వారు దేవుడా? దెయ్యమా? గురువా? లేదా జ్ఞాని? అజ్ఞాని? హిందువు? ముస్లిం? అనే చెత్త విషయాలు పక్కన పెట్టి సర్వమత సమ్మేళనం కోసం పాటుపడిన సిద్ధ మహాత్ముడు అని గుర్తించండి.ఎన్నో సం!!రాలుపాటు సిద్ద యోగ మార్గంలో సాధన చేసి ఎన్నో రకాల యోగమాయలను దాటుకుని పరిణతి చెందిన పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అని గుర్తించి…. మన కళ్ళముందు జీవించి మరణించిన నడయాడే పరమాత్ముడని గ్రహించి ఆరాధించండి. మీకు కావలసిన యోగము లేదా భోగము ఆయనే అందిస్తాడని విశ్వాసంతో విశ్వసించి విశ్వ ఆరాధన చేయండి.

సమాధానాలు చెప్పే బాబా పుస్తకము

కొన్ని రోజుల తర్వాత ఆనంద వదనంతో ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంతో నా దగ్గరికి జిఙ్ఞాసి వచ్చినాడు. ఈసారి మనస్సులో గురువుకు సంబంధించిన ప్రశ్నలు పెట్టుకొని బాబా ప్రశ్న జవాబు పుస్తకం ఇచ్చే సమాధానాలు చూడటానికి వచ్చినాడు.

1. సాధనకి గురువు అవసరమా? అనే ప్రశ్న అడగగా బాబా పుస్తకము జవాబుగా “గురువు సహాయము లేనిదే ఎవరికి కానీ ఆత్మసాక్షాత్కారము పొందుట చాలా కష్టం” అని వచ్చింది.

2. సాధనకు గురు మంత్రో పదేశం అవసరమా? అన్నప్పుడు బాబా పుస్తకము జవాబుగా “ఉపదేశాలు కొరకు, మంత్ర యంత్రాల కొరకు, ప్రయత్నాలు చేయకు! మీ ఆలోచనలో నన్ను గుర్తించు” ( నెం.83) అని వచ్చింది .

3. బాబా మీకు గురువులు ఏదైనా మంత్రోపదేశం చేశారా? అన్నప్పుడు బాబా పుస్తక జవాబుగా “నా గురువు చాలా గొప్ప యోగి. దయామయుడు. ఆయనకు చాలా కాలం సేవించినను నాకు ఎటువంటి మంత్రం ఉపదేశించలేదు!”( నెం.275) అని వచ్చినది.

4. బాబా నాకు మీరు ఏదైనా మంత్రోపదేశం ఇస్తారా? అని అడగగా బాబా పుస్తక జవాబుగా “నేను చెవిలో మంత్రాలు ఉపదేశించను! నా పద్ధతి వేరు! ( నెం.406) అని వచ్చింది.

5. బాబా! గురు సేవ చేయడం అవసరమా? అన్నప్పుడు జవాబుగా “నిజమైన సాధువు పాదాల మీద పడితే… మీరు చేసిన పాపాలు తప్పక తొలగిపోతాయి! ( నెం.535) అని వచ్చినది.

6. బాబా!మరి నిజ గురువు అంటే ఎవరు? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “నీవు నన్ను సరిగా గుర్తించడం లేదు! కానీ నేను నిన్ను గుర్తించి మీ గురించే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను! ( నెం.757) అని వచ్చింది.

7. బాబా! మరి నకిలీ గురువు అంటే ఎవరు? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పతనాన్ని చాటుకునే కపట గురువులు ఈ మధ్య చాలామంది తయారు అయ్యారు” ( నెం.194) అని సమాధానం వచ్చింది.

8. బాబా! నిజ గురువు తన శిష్యులు నుండి ఏమి ఆశిస్తాడు? అని అన్నప్పుడు దానికి జవాబుగా “నా గురువు నా నుంచి నమ్మకము, శ్రద్ధ తప్ప ఇంకేమీ ఆశించలేదు! ( నెం.470) అని వచ్చింది.

9. బాబా! ఆత్మసాక్షాత్కారం పొందటానికి ఏమి చేయాలి? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “బ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఐదింటిని వదిలివేయాలి! అవి పంచ ప్రాణాలు,పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి,అహంకారం” ( నెం.145) అని వచ్చింది.

10. బాబా! మీరు ఎందుకు అవతరించారు అని ప్రశ్నించినప్పుడు 840 సంఖ్య కోరుకొని చూడగానే దానిలో “మంచి వారిని కాపాడుతూ చెడ్డ వారిని మారుస్తూ ధర్మాన్ని నిలకడగా ఉంచటం దేవుడు నాకు అప్పగించిన పని” అని వచ్చింది.

11. బాబా! మీరు దేవుడా లేదా గురువా? అని ప్రశ్నించినప్పుడు 366 కోరుకుని చూడగానే “మీరంతా నన్ను దేవుడిగా పూజిస్తున్న నేను మాత్రం దేవుడిని సేవిస్తాను! ఆయనను నేనెప్పుడూ మరువను” అని వచ్చింది.


12. బాబా! అ మా ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు? అని ప్రశ్నించి మనస్సులో 377 నెంబరు అనుకుని పుస్తకంలో చూడగా దానిలో “అతడు పరిణతి చెందిన భక్తుడు! నువ్వు ఇంకా అంత పరిపక్వత చెందిన లేదు” అని వచ్చినది.

13. బాబా! నేనెందుకు పరిణతి చెందిన లేదని ఆవేదనతో జిఙ్ఞాసి ప్రశ్నించి 556 నెంబర్ పుస్తకంలో చూడగా “మీ తెలివితేటలు మీదనే ఆధారపడి ఉన్నావు! దానితో నీవు తప్పు దారి పట్టినావు! చిన్నధైన పెద్ద విషయమైనా సరైన దారి చూపుటకు గురువు తప్పక అవసరం” అని వచ్చినది.

14. మరి బాబా! నాకు నిజ గురువు దొరుకుతాడా? అని ప్రశ్నించి 72 అనుకొని పుస్తకము తీసి చూడగా “బ్రహ్మ సాక్షాత్కారం పొందుటకు కొన్ని అర్హతలు కావాలి”! అని వచ్చింది దానితో మన వాడికి కోపం వచ్చింది! ఇప్పటి దాకా అన్ని సరైన సమాధానాలు వచ్చినాయి కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు.

నాకు గురువు పొందటానికి అర్హత లేదా ఇంకా ఏమి అర్హతలు కావాలి అని నన్నే ప్రశ్నించాడు. వాడి ముఖం చూసి నేను నవ్వు ఆపుకోలేక పోయాను. వెంటనే వాడు “భయ్యా! ఇక చిట్టచివరి ప్రశ్నను అడుగుతాను! దీనికి బాబా జవాబు ఏమి వస్తుందో చూద్దామని “బాబా! ఇప్పటిదాక మీరు చెప్పిన జవాబుల సమాధానాలు నిజమేనా? అని ప్రశ్నించి 274 అనుకొని ఆ నెంబరు సమాధానం చూడగానే వాడి ముఖం వాడి పోయే సరికి నాకు నవ్వు ఆగలేదు. ఇంతకీ వాడికి వచ్చిన సమాధానం ఏమిటంటే “ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు” అని వచ్చింది! నాకైతే నవ్వు ఆగటంలేదు. వాడి ముఖంలో రంగులు మారడం ఆగలేదు. దానితో మేము పుస్తకం ద్వారా బాబాని విసిగించడం మానివేసి పుస్తకం మూసి వేసి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినటానికి బయటికి వెళ్ళాము.

గమనిక:ఇవన్నియు కూడా అక్షర సత్యాలే! అమ్ముల సాంబశివరావు గారు రాసిన “శ్రీ షిరిడి సాయి సూక్తులు” చిన్నపాటి పుస్తకములో సుమారుగా 888 దాకా బాబా సూక్తులు ఉన్నాయి.వాటిని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా అర్థము కానీ స్థితి వచ్చినప్పుడు మనస్సులో ప్రశ్న అనుకొని మనస్సుకు తోచిన నెంబర్లు అనగా 1 నుండి 888 మధ్యలో ఒక నెంబర్ అనుకొని మీ పుస్తకంలో ఆ నెంబర్ ఎదురుగా ఉన్న సమాధానం బాబా వారి జవాబుగా భావించుకోవాలి. ఇలానే పైన అడిగిన ప్రశ్నలకు బాబా పుస్తకం సమాధానాలు అలాగే మేము కోరుకున్న ప్రశ్న నెంబర్ కూడా ప్రక్కనే వ్రాసినాను. కావాలంటే మీరు కూడా ఈ మహత్తర పుస్తకం కొనుక్కుని మీ ప్రశ్నలకి బాబా జవాబులు గా సరైన సమాధానాలు వస్తున్నాయో లేదో ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేకుండా పరీక్షించుకోండి. తెలియని ఆనందాలు పొందండి. భౌతిక బాబా వారిగా చిరు పుస్తకం ఉంటుందని నా స్వానుభవాలు చెబుతున్నాయి. అన్నీ కూడా అక్షరసత్యాలే అవుతాయి. అందులో ఎలాంటి ఢోకా లేదు! ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా 1993 సంవత్సరం నుండి ఇప్పటిదాకా 2019 నాకు వచ్చిన ఎన్నో సమస్యలకు ఈ బాబా పుస్తకమే ఎన్నో సలహాలు, సూచనలు, సలహాలు, ఓదార్పులు, తిట్లు సమాధాన జవాబులుగా ఇచ్చినది. ఏమి వచ్చిన బాబా ఆజ్ఞగా భావించుకుని వాటిని చేసేవాడిని. భావించేవాడిని.ఎదురుచూసే వాడిని. ఆనందపడే వాడిని. బాధపడే వాడిని అన్నమాట.

షిరిడి కి పారిపోవడం

ఇంటికి దూరంగా ఉన్నత చదువుల కోసం మళ్లీ నేను మరో ఊరికి వెళ్లడం జరిగింది. అలాగే జిఙ్ఞాసి కూడా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళినాడు అని మీకు తెలుసు కదా. ఒంటరిగా తిరిగి నేను నా గదిలో సాయిబాబా చరిత్ర పారాయణం చేయడం ఆరంభించాను. బాబా పూజలు చేయటం, బాబా హారతులు ఇవ్వటం, బాబా గ్రంథం పారాయణం చేయడం నా నిజజీవితంలో నిత్యకృత్యమైంది. కేవలం నిజ భౌతిక గురువు చూపించమని ప్రార్థించే వాడిని. బాబా పూజలు అరగంట తో మొదలై 24 గంటలు సాగేవి. తిండి తిప్పలు అలాగే చదువులు అటకెక్కినవి. ఇంగ్లీషు చదువులు. పైగా అవి అప్పటిదాకా తెలుగు చదువులు చదివిన నాకు తెలియని ఇంగ్లీష్ చదువులో పడవేసినారు. దాంతో ఈ చదువు అర్థం కాక కాలేజీకి వెళ్లకపోవడం… గదిలో కూర్చుని ఒంటరిగా బాబా పూజలు చేయడం తప్ప మరే విషయం పట్టేది కాదు. దాంతో నాకు రాను రాను బాబా మీద భక్తి పిచ్చి ఎక్కువ అయినది. బాబా వచ్చి భోజనం చేసినాడని మనో భ్రాంతికి లోనయ్యేవాడిని. దాంతో నాకు ఏ పదార్థం రుచించేది కాదు .నాలో నేను గురువు కోసం మధన పడేవాడిని. పిచ్చి వాడిగా మారిపోయాను. ఏదో తెలియని అతి తీవ్రమైన మానసిక ఒత్తిడిలోనికి నాకు తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకరోజు పరీక్షలు దగ్గరికి వచ్చాయని తీవ్రమైన మనోవేదనకు గురికావటం, బాబా భక్తి పిచ్చి బాగా ముదిరిపోవడం నిజగురు కోసం ఆయన దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి అని ఏదో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లి…. ఎవరికీ చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోతున్నాను అని కూడా తెలియని స్థితిలో… షిరిడి ఎక్కడ ఉందో కూడా తెలియని స్థితిలో… అందరినీ అడుగుతూ చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులతో షిరిడి కి చేరుకోవడం జరిగినది.

షిరిడీలో బాబా వారి విగ్రహ మూర్తి ని చూడగానే కన్నీళ్లు వచ్చినాయి. సరైన నిజ గురువు చూపించమని అడగడం తప్ప ఏమీ చేయలేదు. ఇక్కడ చాలామందికి ఒక చిన్న ధర్మసందేహము రావచ్చును! అది ఏమిటంటే బాబాయే సద్గురువు అయినపుడు వారిని మరో గురువుని చూపించమని అడగటము దేనికి అన్నపుడు దీనికి సమాధానముగా బాబా గారు గురువే! కాని ప్రస్తుతము మనమధ్య భౌతికముగా లేరు గదా!ఏదైన సాధనలో సందేహాలు లేదా సమస్యలు వస్తే నిజభౌతిక గురువు దగ్గర ఉంటే...మనకి ఆధ్యాత్మిక సమస్యలు ఉండవు గదా!సాధకుడికి నిజ భౌతిక గురువు అనుగ్రహము తప్పనిసరిగా ఉండాలి!పొందాలి! అందుకు నేను అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకొని బాబా సన్నిధానంలో ఉండిపోవాలని అనుకుంటూ ఉండగా….

ఒక బిక్షగాడు నా దగ్గరికి వచ్చి దక్షిణ ఇవ్వమని అడిగారు. నా దగ్గర ఉన్న చిల్లర వాడికి వేసినాను. వాడు నా వైపు చిరునవ్వు నవ్వి నా ముందే పాలకోవా బిళ్లలను కొని అక్కడ ఆకలితోఉన్న ఒక నల్ల కుక్క కి ఆనందంగా పెడుతూ ఉండేసరికి… ఎందుకో నాకు వెంటనే శిరిడి సాయిబాబా మహత్యం సినిమాలోని బాబా వారు ఇలాగే ఒక కుక్కకు గోధుమ రొట్టెలు తినిపించే దృశ్యం నాకు స్పురణ రాగా ఆ బిక్షగాడు అలాగే ఆ కుక్క నాకు కనిపించలేదు. షిరిడీ పురవీధులు తిరిగాను.ఎక్కడ కనిపించలేదు. కొంతసేపు ఆ బిక్షగాడు బాబా అనుకునేసరికి నా ఆలోచన నిజమని చెప్పటానికి సూచనగా బాబా మందిరంలో హారతి ప్రారంభమైనది. అంటే బాబా స్వయంగా నన్ను చూడటానికి నా దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారని తెలియగానే ఏదో తెలియని వింత అనుభూతి కలిగింది.

మూడు రోజుల తర్వాత షిరిడిలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి బాబా ఫోటో మరియు సూక్తి ఉన్న పేజీని ఇచ్చి మౌనంగా వెళ్లిపోయినాడు. నేను ఆ వ్యక్తిని గమనించలేదు. కానీ బాబా ఫోటో కింద ఉన్న సూక్తి మంజరి ఏదో నన్ను బాగా ఆకర్షించినది. అది ఏమిటంటే అది చదవగానే నాలో ఏడుపు మొదలైనది. నేను ఏమో బాబా సన్నిధిలో ఉంటామని అనుకుంటే ఆయనేమో తల్లిదండ్రుల సన్నిధికి తిరిగి వెనక్కి వెళ్ళమని ఆ సూక్తి మంజరి ద్వారా నాకు అర్థంఅయినది. అప్పుడు నా చేతిలో పూర్తిగా డబ్బులు ఖర్చయిపోయాయి. గుడి పరిసరాలలో పడుకుంటూ… ద్వారకామాయిలో ధ్యానం చేసుకుంటూ… అన్నదాన సత్రంలో ఉచిత భోజనం చేస్తూ 11 రోజులు గడిపాను. ఇక అక్కడ ఉండలేని స్థితి.బాబా వారి కోప ఆవేశానికి గురికాకూడదని అనుకున్న సమయంలో ఒక వ్యక్తి ద్వారా మా ఇంటికి చేరుకోవడం జరిగినది. ఆ వ్యక్తి పేరు సాయిబాబా కావడం విశేషం. విచిత్రము ఏమిటంటే ఈ వ్యక్తియే నా రాబోవు కాలములో నిజభౌతిక గురువుగా విచిత్ర వేదాంతి పేరుతో వస్తారని ఆనాడు నేను గ్రహించలేకపోయినాను!బాబావారు ఇతనే నీకు రాబోవు కాలములో నీవు అడిగిన భౌతికగురువు అవుతాడని...నన్ను ఇతనితో ఈవిధంగా కలిపినారని నాకు అపుడు తెలియదు!ఇతను ఏవరో గాదు!నాకు జాతకము చెప్పిన వ్యక్తి అలాగే చింతామణి దుర్గాదేవి దర్శనానికి ప్రయత్నించిన వ్యక్తి ఈయనే అన్నమాట! ఇంటిలో మా అమ్మ నాకోసం దాదాపుగా 18 రోజుల నుంచి తిండి నిద్రాహారాలు మాని వేసి అఖండ ఉపవాస దీక్షకు కూర్చున్నది. ఇది తెలిసి బాబా నన్నెందుకు వెనక్కి వెళ్లిపొమ్మని తన సూక్తి మంజరి ద్వారా చెప్పినారో అర్థం అయినది. కానీ నా నిజ గురు దర్శనం కోసం పడే తపన నన్ను ఏ శక్తి ఆపలేకపోయింది. బాబా మీద నమ్మకం ఉంచుకొని తిరిగి మళ్ళీ వారి చరిత్ర పారాయణం చేయడం ఆపలేదు. కొత్తగా వచ్చిన విగ్రహాలను పూజించడం ఆపలేదు.గురువు కోసం తపించడం ఆగలేదు. మరి నాకు నిజ గురువు దొరికారో లేదా తెలియాలని ఉందా?

గమనిక:బాబా విషయములో ఇప్పటికి నాకు ఒక లోటు ఉన్నది! అది ఏమిటంటే బాబా వారి నిజ సమాధిని చూడలేదని,తాకలేదని,నమస్కారము చేయలేకపోయిననే బాధ మిగిలిపోయింది! ఇపుడు మనము షిరిడిలో చూస్తున్న సమాధి నిజమైన బాబా సమాధి యొక్క రక్షణకవచము మాత్రమే!అసలు సమాధి క్రింద అంతస్తులో భధ్రముగా ఉన్నదని చాలామందికి తెలియదు!దానిని ఒక నిత్యపూజారి మాత్రమే రోజూకి ఒకసారి వెళ్ళి పూజ చేసి వస్తారని తెలుసుకున్నాను!మీ కోసం నిజబాబాసమాధి ఫోటో పెడుతున్నాను!కనీసము దీనిని చూసైనా తృప్తి చెందుతాము!

నిదర్శనం… నీదర్శనం

నేను ఒక రోజు నా దగ్గర ఉన్న చిన్నపాటి బాబా విగ్రహాలను అలాగే బాబా పాదాలను, హారతి సామానులను కడుగుతూ “బాబా! నువ్వు సమాధి చెంది 90 సంవత్సరాలు కావస్తుంది. నా సమాధినుండి నా మానుష శరీరం మాట్లాడుతుందని అలానే ఈ భౌతిక దేహానంతరము నేను ప్రమత్తుడనే అని నీ ఏకాదశ సూత్రాలలో చెప్పినావు. నిజానికి అవి నిజమేనా? అది నిజమైతే మీ నుండి నాకు నీవు ఎప్పటికీ మానుష శరీరంలోఎప్పటికీ జీవించే ఉన్నావని నిదర్శనం కావాలి అనుకున్నాను. ఇక్కడే ఒక గమ్మత్తు విషయము జరిగినది. బాబా! నేను నీ దర్శనం కావాలని అడిగానని నేను అనుకున్నాను కానీ అది కాస్తా నిదర్శనము అనగా నాకు నువ్వు ఉన్నావని సాక్ష్యం కావాలి అని భావం గా మారిపోయింది. నీ అనే అక్షరం కొమ్ము లేకపోవటం నిదర్శనం. నీదర్శనం లో నీదర్శనం కాస్త నిదర్శనంగా మారిపోయిన విషయం కూడా నేను గమనించలేదు. ఏదో మేము పూజించే బాబా విగ్రహానికి చెప్పానా లేదా అనే కానీ ఏమి చెప్పాను నా భావం ఎలా మారిందో తెలుసుకోలేకపోయాను. నీ దర్శనం అంటే బాబా వారి నిజరూప దర్శనం అలాగే నిదర్శనం అంటే సాక్ష్యం! ఈ కొమ్ము నా జీవితంలో తట్టుకోలేని బాధాకరమైన సంఘటనకు నాంది అయినది. అది ఏంటో చూడండి.

ఒక బుధవారం రాత్రి నా కలలో ఒక భిక్షధారి బాబా అవతారి గా ఉన్న స్వప్న శరీరధారి కనిపించి “రేపు నేను మీ ఇంటికి ఆతిథ్యము కోసం వస్తున్నాను” అని ఎవరో నాతో చెప్పినట్లు కల వచ్చింది.ఎవరో నా గది నుండి నుండి బయటకు వెళుతూ అలికిడి వినిపించేసరికి నాకు మెలుకువ వచ్చింది. ఇది కల లేదా భ్రాంతియా లేదా నిజములాంటి కల అని ఆలోచన వచ్చేసరికి నాలో నిద్రాదేవత వెళ్ళిపోయింది. రేపు గురువారం కదా. ఒకవేళ బాబా స్వయంగా వస్తారేమో అనుకొని ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉన్నాను. నేను అడిగిన వరమును బాబా వారు ఇంత త్వరగా నెరవేరుస్తారని ఊహించలేదు. నా ఆనందానికి అవధులు లేవు. వామ్మో! రేపు నేను బాబా వారి నిజరూప దర్శనం చూస్తాను. ఈ చిన్నపాటి భక్తుడి కోరిక తీర్చడానికి బాబా వారే స్వయంగా షిరిడి నుండి నా దగ్గరికి వస్తున్నారా? వామ్మో! ఏమి చేయాలి? ఆయనకి ఏమి వండి పెట్టాలి? ఏమి కావాలి? అమ్మకి వెంటనే చెప్పాను. ఆయన భోజనానికి అన్ని రకాలు పదార్ధాలతో ఏర్పాట్లు చేయమని చెప్పాను.వెంటనే అమ్మ "ఒరేయ్ చిన్నోడా! ప్రతి గురువారం మన ఇంటికి భోజనానికి కానీ అల్పాహారమునకు కానీ జనాలు వస్తారు కదా. నువ్వు వారిని బాబాగారి అంశగా భావించి వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తావు కదా. చివరికి నీ పిచ్చి వలన పొరపాటున గురువారం రోజున ఏదైనా పాము గాని తేలు గాని ఎలుకలు గాని పిల్లులు గాని బల్లులు గాని కుక్కలు గాని పక్షులు గాని కొత్తగా కనబడితేచాలు! ఈ గురువారం బాబా వారు ఈ రూపంలో వచ్చినారని ఆ రూపంలో వచ్చినారని నన్ను అలాగే నీ యోగ మిత్రుడైన జిఙ్ఞాసిని కూడా చావకొడతావు కదరా”! అనగానే “అమ్మా! ఇన్నాళ్లు బాబా వారు మారు రూపాల్లో ఇంటికి వచ్చినారు. ఇప్పుడు నిజరూపంతో ఆయనే స్వయంగా మన ఇంటికి ఆతిథ్యంకు వస్తున్నానని నాకు రాత్రి కలలో కనిపించి చెప్పినారు. అది ఎప్పుడు ఇల గాను లీల గాను మారుతుందో ఎదురుచూస్తున్నాను రాజమాత” అని అనగానే “ఒరేయ్! నీ పిచ్చి గాని ఎప్పుడో సమాధి చెందిన మీ బాబా వారు ఇప్పుడు వారు స్వస్వరూపంగా మన ఇంటికి వస్తారా? అది నేను నమ్మాలా. నీకు బాగా బాబా పిచ్చి ముదిరి పోయింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నీ పిచ్చి వల్ల బాబా నువ్వే పరీక్ష రాయి అని చెప్పి తప్పించుకోకు. ఇప్పటికే నీ వలన మేము పొందిన అవమానాలు చాలు! నీ భక్తి పిచ్చి వలన నువ్వు ఎక్కడ మాకు దక్కకుండా పోతావేమోనని భయంగా ఉంది రా” అనగానే నవ్వేసి మౌనముగా అక్కడినుండి వెళ్ళిపోయాను. బాబా వారి రాక కోసం ఎదురు చూపులతో శివయ్య కు మహా నైవేద్యం పెట్టడానికి గుడిలోనికి వెళ్ళినాను. బాబా వారి విషయమే ఆ కొద్ది క్షణాలపాటు మరిచిపోయి శివయ్య మీద ఏకాగ్రత పెట్టినాను. అదే నా కొంప ముంచుతుంది అని నేను అనుకోలేదు.

మా ఇంటి ముందు బాబా గారి వేషధారి

నేను మహా నైవేద్యం తో గుడి లోనికి వెళ్లగానే వెంటనే మా ఇంటి ముందు బాబా గారి వేషధారి వచ్చి “అమ్మ! బాబా వచ్చాడు! బిక్ష పెట్టు” అన్నాడట.దానికి అమ్మ వెంటనే లోపల నుండి “వస్తున్నాను! బాబు కొంచెం సేపు ఆగు” అని చెప్పినది. కొన్ని క్షణాల తర్వాత మా అమ్మ ఆరోజు చేసిన గోధుమ చపాతీలు,పెరుగు పచ్చడి,హల్వా తీసుకొని ఎవరు వచ్చారు? ఎలా వచ్చారు? ఎలా ఉన్నారు? అని కనీసం తలెత్తి చూడకుండా ఆయన పాత్రలో అన్ని పెట్టి వెళ్ళిపోతుంటే “అమ్మా! నేను వచ్చానని, నేను ఉన్నానని, ఈ బిక్ష అందుకు నిదర్శనమని మీ వాడికి చెప్పు! అల్లా మాలిక్ అంటూ వెళ్లిపోయినాడు. ఇంతలో నేను మహా నైవేద్యం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి అమాయకంగా బాబా వారి కోసం ఆరుబయట కూర్చొని ఎదురుచూస్తున్నాను. ఇంకా రాలేదు బాబా వారు. ఎప్పుడు వస్తారు? ఒకవేళ వస్తే నేను మొదట ఏమి చేయాలి ?తాకాలా? పాదాలకి నమస్కారము చేయాలా? దండం పెట్టాలా?పాద సేవ చేయాలా? ఏమి చేయాలి? ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఎదురుచూస్తుంటే ఇంతలో అమ్మ బయటకు వచ్చి “అవును రా! ఇందాక ఒక వ్యక్తి బిక్షకు వచ్చినాడు! నేను అతనిని సరిగ్గా చూడలేదు. కానీ నీకు నేను వచ్చానని ఏదో కలలో నీ దర్శనం ద్వారా నిదర్శనం అయినదని నాకు అర్థం కాని తెలుగులో మాట్లాడి వెళ్లిపోయినాడు. ఆయనే మీ బాబా వారేమో ఆలోచించు” అని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పిన మాటలను డీకోడ్ చేసి అర్థం చేసుకోవటానికి నాకు అరగంట పైనే సమయం పట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటో తెలిసేసరికి నా గుండె ఆగినంత పని అయింది. నేను బాబా వారిని నీ దర్శనం కావాలి అని అడిగానని అనుకొని నిదర్శనం కావాలి అన్నాను అని నాకు అర్థమయ్యే సరికి నా మతి పోయింది. ఒక చిన్న కొమ్ము నా బ్రతుకు ఇంతగా నాశనం చేస్తుందని అని అనుకోలేదు నాకు ఏడుపే తక్కువ. నాకు బాబా మీద కోపం రాలేదు. కలలో కనిపించి ఆయన దర్శనం ఇచ్చారు. ఇలలో నాకు కనిపించకుండా అమ్మకి కనిపించి నేను ఉన్నానని నిదర్శనం ఇచ్చినారు. దాంతో నామీద నాకే కోపం వచ్చింది. వచ్చిన మహత్తరమైన అవకాశాన్ని చేజేతులారా నేనే పోగొట్టుకున్నాను గదా అని వస్తున్న ఏడుపును ఆపటం నా వల్ల కాలేదు. ఏం చేద్దాం? ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అదే జరుగుతుంది కదా. నా ధ్యాన అనుభవం రాస్తుంటే మళ్ళీ నాకు నాలో తెలియని ఏడుపు బయటకు తన్నుకు వస్తున్నది దాన్ని ఆపటం నావల్ల కాలేదు. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇది రాయటం ఆపి వచ్చే కన్నీటిధారను ఆపకుండా ఏడుస్తూ ఉంటాను.

గమనిక: ఇది నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన. ఆనందం బాధలతో కూడిన దైవ అనుభవం. బాబా వారిని కనీసం నేను చూడలేకపోయాను అనే ఏడుపుతో ఉంటే పక్కింటి కుర్రాడు వచ్చి “అన్నా! మీకు ఒకటి చూపించన. మీ ఇంటికి బాబా లాగ వేషం వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వెళ్తుంటే నేను మేడ మీద నుండి ఈ ఫోటోలు తీసినాను. చూడు! నువ్వు ఆయనను చూడలేదుగా. ఈ ఫోటో చూడు అంటూ సెల్లో ఉన్న ఫోటోలు వరుసగా చూపించసాగాడు! కాకపోతే వాడు చిన్న వాడు కావడం వలన అన్ని ఫోటోలు కూడా ఆయనను దాదాపుగా వెనక నుండి తీసినాడు. వస్త్రధారణ చూస్తే… నడిచే విధానం చూస్తే… బాబా వారి లాగానే ఉన్నాయి. ఆ ఫోటోలు చూడగానే నాలో మళ్లీ ఏడుపు ఆరంభమైనది. నా ఏడుపును చూసి ఆ పిల్లవాడు సెల్ తీసుకోకుండా నేను ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాక వెళ్లిపోయినాడు. అలాగే ఒకటి ఖచ్చితంగా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు భోగంలో ఉంటే భోగ పరమైన కోరికలు అడుగుతూ ఖచ్చితంగా మీకు కావలసిన కోరికను మీరు అడుగుతున్నారు లేదో ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించుకొని గాని నిర్ణయించుకొని గాని మీ దైవాలను అడగండి. మనసులో ఒక భావం ఉండి బయటకి మరో లాగా వస్తే అది జరిగిన తర్వాత మీకు కావలసినది జరగక…. జరిగినది మీకు నచ్చక… అందరూ బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త! ఇక ఒకవేళ మీరు యోగములో ఉంటే మాత్రమే మీ ఇష్టదైవాలను లేదా మీ ఇష్ట గురువులను “స్వామి! నాకు శాశ్వతమైన మరణమును ఇచ్చి నాకున్న సకల బంధాలనుండి విముక్తి కలిగించే పరమ ఉత్కృష్టమైన పరమపదసోపానమైన మోక్షప్రాప్తిని” నాకు అనుగ్రహించండి. దానికి కావలసిన గురువులను అనుగ్రహించండి. నేను మోక్షంపొందేట్లు నాకు మోక్ష ప్రాప్తి కలిగేటట్లుగా నన్ను దీవించండి. అనుగ్రహించండి అని మాత్రమే ప్రతినిత్యం వారి ముందు వేడుకోండి. ఈ మీ కోరిక తీరే విధంగా ఆ కోరిక వైపు అడుగులు వేయండి.

మా బాబా సజీవ విగ్రహమూర్తి

మా ఇద్దరి చదువులు అదే నాది అలాగే నా జిఙ్ఞాసి చదువులు పూర్తి అయినాయి. ఉద్యోగాల కోసం మేమిద్దరం ఒక ఊరికి బయలుదేరినాము. నేనేమో చిన్నపాటి ఆఫీసులో చిన్న ఉద్యోగిగా అదే మల్టీమీడియా డెవలపర్గా చేరితే,జిఙ్ఞాసి ఏమో పెద్ద ఆఫీసులో పెద్ద జీతంతో పెద్ద ఉద్యోగం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడినాడు. శని,ఆదివారాలు మాత్రం కలుసుకునే అవకాశాలు మా ఇద్దరికి కలుగుతాయి. అయినా కూడా ఆధ్యాత్మిక చింతన చావలేదు. చితి దాకా అది వీడిపోదని అని నాకు అనిపించింది. మాకు విసుగు లేదు. ఏదో తెలుసుకోవాలని తాపత్రయం. అది ఉన్నదో లేదో అనుభవాలు పొందాలని ఆరాటం తప్ప వేరే ధ్యాస లేదు. వేరే ప్రపంచం లేదు. ఇలాంటి సమయంలో ఒకసారి నాకు రోడ్డు మీద ఆరడుగుల పాలరాయి బాబా విగ్రహం పెట్టుకుని ఎవరో తీసుకొని వెళ్ళడం చూసాను. ఆ విగ్రహం చూస్తుంటే ఎంతో ముద్దు వచ్చినది . ఎంతో సజీవమూర్తిగా ఈ విగ్రహం ఉన్నది కదా! ఏ దేవాలయంలో దీనిని ప్రతిష్ట చేస్తున్నారు అనుకుని ఇలాంటి సజీవ రూపంతో నాకు కూడా ఒక విగ్రహమూర్తి లభిస్తే నేను కూడా నా హృదయదేవాలయంలో దాచుకుని ఆరాధించుకునే వాడిని కదా అని అనుకుంటూ మా మీటింగ్ స్పాట్ అయిన పార్క్ వైపు అనగా అక్కడ మా కోసం ఎదురు చూసే జిఙ్ఞాసిని కలవడానికి వెళ్ళినాను.

నా మొహంలో ఆనంద విషాద ఛాయలు చూసి మా వాడు వెంటనే “భయ్యా! ఏమి అయింది?ఏమి జరిగినది? నీ మొహం ఒక ప్రక్క మోహావేశంతో, మరోపక్క బాధ ఆవేశంతో ఉన్నది” అనగానే రోడ్డుమీద కనపడి కనిపించకుండా వెళ్లిపోయిన బాబా విగ్రహమూర్తి గురించి వాడికి చెప్పాను. వాడు దాంతో “భయ్యా! నీ దృష్టి దాని మీద పడింది అంటే అది ఎంత సజీవమూర్తితో ఉందో నాకు అర్థం అయింది.అది ఎంత డబ్బు అయినా సరే కొందాం పద” అన్నాడు.నేను వెంటనే వాడి తో “నీ బొంద! నీ బూడిద! అది ఆరడుగులు విగ్రహమూర్తి. దాన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకోవాలి. దేవాలయ ప్రతిష్ట కోసం వెళుతున్న విగ్రహం అది. దానిని నాకు కొని ఇవ్వడం ఏమిటి పిచ్చివాడా” అని నా బాధను మర్చిపోవడానికి లేని నవ్వు బలవంతంగా తెప్పించుకొని నవ్వడం ప్రారంభించాను.కొద్దిసేపటి తర్వాత తేరుకుని మా ఆధ్యాత్మిక పిచ్చిలో ఆ విగ్రహమూర్తి గూర్చి మేము మర్చిపోయాము కానీ బాబా వారు మాత్రం మర్చిపోలేదని అనడానికి నిదర్శనంగా ఒక సంఘటన జరిగినది.

మా పిచ్చాపాటి ఆధ్యాత్మిక విషయాలలో సమయము రాత్రి అయినది అనే విషయం మేము మర్చిపోయాము.ఆకలి కూడా పట్టించుకోలేదు.వారానికి ఒకరోజు దొరికే ఈ మహత్తర సమయములో దీని గురించి ఆలోచించని జ్ఞాన స్థాయికి మా ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటాం. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. సరే ఇంటికి వెళ్లాలని తిరిగి మేమిద్దరం ప్రొద్దున వచ్చిన రోడ్డుమీదకి వచ్చేసరికి నాకు ప్రొద్దున బండిమీద కనిపించిన బాబా సజీవ విగ్రహమూర్తి నా కళ్ళముందు నా మది యందు తచ్చాడటం జరిగినది.నేను మర్చిపోయిన విషయాన్ని బాబా వారు మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని అనిపించి ఇందులో ఏదో పరమార్ధం ఉన్నదని కారణం ఏమి లేనిదే కార్యం జరగదని అనిపించి వెంటనే నా వెంట ఉన్న జిఙ్ఞాసిని వెంటబెట్టుకుని మా ఇంట్లో ఉన్న నా పూజా మందిరం దగ్గరికి వెళ్లి బాబా జవాబులు పుస్తకము తెరచి “బాబా! నువ్వు నాకోసం సజీవ విగ్రహమూర్తిగా వస్తావా? అని ప్రశ్న వేసాను! ఒక నెంబరు 80 కోరుకున్నాను.దానిని బాబా పుస్తకంలో చూడగా “నీ దైవం వచ్చినాడు చూశావా? నీవు జాగ్రత్తగా లేనిచో తప్పించుకుని పారిపోయాడు! జాగ్రత్తగా హృదయంలో బంధించు” అని బాబా సమాధానం చూడగానే నాకు ఒక క్షణం నోట మాట రాలేదు.

నేను ప్రొద్దున బాబా వారి సజీవ విగ్రహమూర్తిని చూసి హృదయ దేవాలయంలో బంధించికోవటానికి నువ్వు రావచ్చు కదా అనుకున్నదానికి ఇప్పుడు బాబా వారు ఇచ్చిన సమాధానంతో పోల్చి చూసుకునేసరికి, అలాగే నా ప్రక్కన ఉన్న జిఙ్ఞాసికి చెప్పేసరికి వాడు కూడా కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా మారినాడు. వాడికి కూడా నోట మాట లేదు.కొంతసేపు తర్వాత వాడు తేరుకొని “భయ్యా! భయ్యా! నిజంగానే మనకోసం నీ ఇష్ట రూపంలో సజీవ విగ్రహమూర్తిగా వస్తాడంటావా?ఇంతవరకు ఈయన చెప్పిన సమాధానాలు అక్షర సత్యాలు.జరిగినాయి కదా! ఈ విషయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది.జరిగి తీరుతుంది. నీకు ప్రొద్దున ఎంత ఖర్చు పెట్టి అయినా బాబా విగ్రహమూర్తి కొని ఇస్తానని చెప్పాను కదా! మనకి వచ్చే ఈ సజీవ విగ్రహమూర్తి ఖర్చు నాదే భయ్యా. నాదే. నువ్వు ఏమీ మాట్లాడకు.మనకోసం వారు ఖచ్చితంగా వస్తారు! బాబా వస్తారు! వదలవద్దు” గట్టిగా మన హృదయంలో బంధనం చేద్దాం అంటూ “భయ్యా! అవును భయ్యా! నాకు ఒక సందేహం.బాబా వారు వస్తే మనం ఏమి చేయాలి? అని అనుకొని ప్రశ్న వేసుకొని నెంబరు 216 చెప్పి చూడగానే “నీవు ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ నా నామస్మరణ చేయుము” అని వచ్చినది! దానిని చూడగానే మావాడు ఎగిరి గంతేసినాడు. “భయ్యా! భయ్యా! మీ కొంప కొల్లేరయింది. మీ ఇల్లు గుడిగా మారటం ఖాయం. నువ్వు పూజారి వృత్తి మానివేసిన ఆ కర్మ వాసన నిన్ను వదిలి పెట్టడం లేదు. ఇప్పటిదాకా శివ పూజారి గా ఉన్న వాడివి కాస్త ఈరోజు బాబా దెబ్బతో బాబా పూజారిగా మారతావు.భయ్యా! జాగ్రత్త” అని నవ్వుతూ చెబుతున్నా వాడి మొహంలో బాబా లీలగా కనిపించేసరికి నాలో ఏదో తెలియని భయము మొదలై “బాబా! నిజంగానే గుడి కట్టాలా? అని ప్రశ్నించాను వెంటనే ఒక నెంబరు 752 అనుకొని చూడగానే దానిని చూసి నేను గతుక్కుమన్నాను ఎందుకంటే బాబా పుస్తక జవాబులో “ నీవు నా మందిరానికి యజమాని అవుతావు” అని చెప్పింది! దానిని చూసి.. వెంటనే “భయ్యా !నీకు వచ్చింది! నువ్వు బాబా గుడికి యజమాని అవుతావట.కొంచెం మాకు కూడా ఆ గుడి లో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వాలి సుమా” అంటూ నవ్వుతూ అనే వాడి మాటలలో సత్యం లేకపోలేదు. నేను బాబా గుడికి యజమాని అవటం ఏమిటి? నా దగ్గరికి సజీవ బాబా విగ్రహమూర్తి రావటానికి ఎదురుచూడటం ఏమిటి? నేను ఏమి అనుకున్నాను? భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అని తెలుసుకునేసరికి నాకు విపరీతమైన తలనొప్పి రావటం ప్రారంభం అయ్యే సరికి బాబా పుస్తకము లోపల పెట్టి మా జిఙ్ఞాసికి టాటా చెప్పి నా గదిలోకి వెళ్లి ఏమీ అర్థం కాని అయోమయం ఆశ్చర్యానందాలు స్థితిలో నిద్ర లోకి జారుకున్నాను.

ఆ తర్వాత మరుసటి రోజు యధావిధిగా ఉద్యోగ విధులలో ఇరుక్కుపోయాను. వారం రోజులు గడిచిపోయాయి.మా ఇద్దరి సభ జరిగే పార్క్ వైపు నా అడుగులు పడినాయి. అక్కడ ఎదురుచూస్తూ నా జిఙ్ఞాసి కూర్చున్నాడు. నన్ను చూడగానే “భయ్యా! ఏమిటి ఎప్పుడు బాబా గుడి కడుతున్నారు. మరి దానికి కావలసిన డబ్బులు బాగా సంపాదించాలి గదా. నువ్వు ఏమో నా అవసరాలకు సరిపడా డబ్బులు ఉంటే చాలు అంటావు. జీతాలు పెరిగే అవకాశాలు పెంచుకోవు. చివరికి గొర్రె తోక బెత్తెడు అన్నట్లు ఆ చిన్నపాటి ఉద్యోగ జీతంతో కాలం గడుపుతున్నావు. ఇప్పుడు బాబా వారేమో గుడి కట్టు అంటున్నారు?మరి ఎలా కడతారు.చందాలు పోగు చేస్తావా? పోగుచేసి వాటితో రామదాసు లాగా గుడి కడతావా? దానికి నేను చాలా ప్రశాంతంగా“ప్రియ మిత్రమా! నువ్వు అనుకొనే గుడిని నేను నా దేహంలోనే బాబా కోసం హృదయ మందిరం కట్టుకుంటాను! ఇది ఎవ్వరికీ కనిపించదు! నాకు మాత్రమే కనిపిస్తుంది. ఆయన అన్నారు కదా నా హృదయంలో బంధించు లేదంటే తప్పించుకుంటాడని అన్నారు కదా. ఇక ఎటూ తప్పించుకోకుండా ఉండటానికి నేను బాబా వారిని నా హృదయ మందిరములో బంధిస్తాను! ఏమంటావు!మిత్రమా! ఇలా కూడా చేయొచ్చు కదా” అనగానే వాడి మొహం చిన్నబోయింది. వెంటనే వాడు “అయినా నువ్వు పెద్ద జీతమిచ్చే ఉద్యోగం కొసం ప్రయత్నిస్తావు అని నాకు అనిపించడం దండగ! మీలాంటి విజ్ఞాన మూర్తికి వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చాలా తెలిసిన మహానుభావుడువు. భయ్యా!మరి మన సజీవ బాబా గారు ఎప్పుడు వస్తారు” అంటావు అని అడగ్గానే నేను వెంటనే “ఎవరికి తెలుసు! ఆయన ఎప్పుడు వస్తారో… ఏ రూపంలో వస్తారో వారికి తప్ప నరమానవుడికి తెలియదు! తెలిస్తే నీలాంటి వ్యక్తులకి నిజ భక్తులకు తెలియాలి! మీరేమో రత్నాలు ఏరుకునే వారు! మేము సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుకునే వాళ్ళం” అనగానే వాడు వెంటనే “అందుకే బాబా వారు మన ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు అన్నారు … నువ్వు మర్చిపోయిన నేను మర్చిపోలేదు. రత్నాలు ఎవరు ఏరుకుంటున్నారో… ఎవరు రాళ్లు ఏరుకుంటున్నారో మీకు తెలుసు నాకు తెలుసు బాబా కి తెలుసు. కొత్తగా కోతలు కొయ్యకు నాకు” అంటూ “భయ్యా ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది! బయటికి వెళ్లి బిర్యాని తిని ఏదైనా సినిమాకి వెళ్దాము” అనగానే ఒక తండ్రిని తన పిల్లవాడు అడిగినట్లు వీడు నన్ను అలా అడిగేసరికి నవ్వు ఆపుకోలేక సరే అన్నాను. మా ఇద్దరికీ ఏదైనా అర్థం కాని సమస్య వస్తే లేదా ఏదైనా అద్భుత సంఘటన జరిగే సూచనలు వస్తే బిర్యానీ, కూల్ డ్రింక్లు, మిరపకాయ బజ్జీలు ఏదైనా స్వీట్లు, మసాలా ఒకే రోజు వీటిని అన్నింటినీ తిని సినిమా చూసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోవటం అలవాటు. ఇలా ఎంజాయ్ చేసి ఒక సంవత్సరం పైన అయినదని వాడి మాటలలో నాకు గుర్తుకు వచ్చింది.

ఆ తర్వాత ఏముంది. బాస్ తో తిట్లు మాకు. మా జీవితంలో జీతంలో రోజులు డబ్బులు కటింగ్. ఇలా మరో మూడు నెలల పాటు గడిచిపోయినవి. ఒకరోజు మేము పార్కులో ఉండగా… వస్తాను అని చెప్పిన బాబా ఆచూకీ లేదు! అని మేమిద్దరం అనుకుంటూ ఉండగా…. అక్కడ ఏదో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతుందని ఎనౌన్స్ మెంట్ మాకు వినబడింది. ఇద్దరి నోటి నుండి ఒకేసారి ఏకకాలంలో దీనికి వెళ్దామా అనేసరికి ఏదో శుభం జరుగుతుందని నాకు శకున సూచన వచ్చినది. ఏమి జరుగుతుందోనని అనుకుంటూ ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ కి వెళ్ళని నేను ఎందుకు ఈరోజు వెళుతున్నానని… కారణం లేనిదే కార్యం జరగదని అనుకుంటూ మా వాడితో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ బయలుదేరినాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నాను. సుమారుగా అక్కడ 900 పైగా స్టాల్స్ ఉన్నాయి. వాటిని పూర్తిగా చూడాలంటే కనీసం ఎంత లేదన్నా మూడు రోజులు పైగా పడుతుంది. ఎక్కువశాతం బట్టలు షాపులు,చెక్క సామానుల షాపులు ఉన్నాయి. అన్ని షాపులు అవే కనబడుతున్నాయి. సరే ఒక చోట ఆగి అక్కడ నూనెలో కర కర వేయిస్తున్న మిరపకాయ బజ్జీలు చూడగానే మా ఇద్దరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే షాపు వైపు వెళ్లి కావాల్సిన వాటిని తిని చేతులు కడుక్కుంటూ ఉండగా మా ఇద్దరి చూపు ఎదురుగా ఉన్న షాప్ వైపు పడినది. ఎందుకంటే అక్కడ ఆరుబయట బల్లమీద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన మట్టి బొమ్మలు, దేవతా విగ్రహాలు కనిపించేసరికి మేము గతుక్కుమన్నాము.

ఇలాంటి సమయములో మా నాన్న మీద త్రిపుర దేవి తన కామమాయ చూపించడం మొదలు పెట్టినది అనగా మా ఇంటికి పనిమనిషి తో మాటలు, చూపులు కలిశాయి! అప్పుడు మా అమ్మ దృష్టికి ఈ విషయం వచ్చినది కానీ అప్పటిదాకా మా నాన్న ఎలాంటి తప్పూ చేయలేదు. ఏకపత్నీ ధర్మమును పాటిస్తూనే ఉన్నాడు కానీ మా అమ్మకి అనుమానాలు మొదలై అది చిలికిచిలికి గాలివానైంది. ఇది చిలికి గాలివాన సంసారసుఖమును దూరం చేశాయి. ఇదే గదా త్రిపురమాయకి గావాలసినది! మాయ దానికి కావాల్సిన పరిస్థితులు వీరిద్దరి మధ్య ఏర్పరచింది! మా నాన్న ఎంత మొత్తుకున్నా మా అమ్మ పట్టించుకునే స్థితిలో లేదు! మా అయ్యను అనుమానించే సరికి ఈయన చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా…. ఇంకా కామవాంఛ తట్టుకోలేని స్థితికి ఆయన పూర్తిగా చేరుకునే సరికి… ఆ పనిమనిషి మా నాన్న కి దగ్గర అయింది. దానితో ఎన్నో సంవత్సరాల పాటు పాటిస్తూ వస్తున్న ఏకపత్నీ ధర్మమునకు తిలోదకాలు ఇచ్చి… ఆమెతో సహజీవనం చేస్తూ … మగ పిల్లవాడిని కనే స్థాయికి వెళ్లిపోయినాడు! మా అమ్మను వంట మనిషిని చేసినాడు! ఆమెను లోకానికి భయపడి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తు ఇంటి మనిషి చేసుకున్నాడు! రెండు సంసారాల మధ్య, బంధుమిత్రుల అవమానాల మధ్య నలిగిపోతూ మంత్రసాధనకి తనకి తెలియకుండానే దూరమవుతూ…. అన్నీ చేసేవాడు పై వాడే… నేను చేయటంలేదు… చేసేది వాడే ,చేయించేది వాడే, అనుభవింప చేసేది వాడే ,ఆనంద పడేది వాడే, బాధపడేది వాడే, వేధించేది వాడే అనుకుంటూ శబ్ధపాండిత్యము నుండి మెట్టవేదాంతం వైపు అడుగులు వేస్తున్నాడు! అన్ని వాడే చేస్తే మరి నిన్ను ఎందుకు సృష్టించాడు? మరి ఎందుకు ఈ రెండు సంసారాల మాయను ఆయన కల్పించాడు అని మనోవిశ్లేషణ చేసుకుని వుంటే కథ మరోలా ఉండేది! అంత సమయము మా అయ్యకి ఎక్కడ ఉంది! ఆమె ఒక క్షణం కనిపించకపోతే...ప్రాణము పోయేటట్లుగా విలవిలాడి పోయేవాడు!విపరీతమైన కోపావేశాలు కలిగి కానిదానికి అందరిని ఎదో రకముగా తిడుతూ ఆమె మీద కోపమును అందరి మీద చూపిస్తూ తన మాటలతో...తన చేష్టలతో నరకము చూపించేవాడు!ఆమె కనపడిన మరుక్షణము మాములుగా ప్రేమికుడిగా మారిపోయేవాడు! మునిమనవళ్ళున్న గూడ మా ముసలాడికి ఆమె మీద కామపిచ్చి ఇంకా తీరలేదంటే...ఎంత దిగజారుడి స్ధితికి తను ఉన్నాడో తెలుసుకోలేని స్ధాయిలో ఉన్నాడు! ఆమె మీద చూపించే ప్రేమను అమ్మవారి మీద చూపించి ఉంటే... ఖచ్చితముగా ఈయన సాధన స్ధాయికి అమ్మవారు సాక్షాత్కరమై రామకృష్ణ పరమహంస స్ధాయికి ఈపాటికి వెళ్ళేపోయేవారు! ఇక్కడ త్రిపుర మాయ వలన అమ్మవారు కాస్తా అమ్మాయి అయినది!దానితో మోక్షగామి కాస్తా కామిగామి అయినాడు!ఎవరికి నష్టము జరిగినది...ఈయనకా...అమ్మవారికా...శివయ్యకా...కామమాయ అంటే తను చేసిన తప్పు తన భక్తుడు చేయకూడదని శివయ్య సంకల్పించాడు. తనకు లాగానే రెండు సంసారాల మాయలో పడవద్దని… సాధన స్థాయిలో వచ్చే ఏకపత్నీ ధర్మమును నాశనం చేసే పర స్త్రీ కామ మాయను దాటించాలని పరితపించాడు! కానీ ఈ శివ భక్తుడు చేసేది శివయ్య గదా అని పరస్రీ కామమాయలో పడిపోయి పున:జన్మలకి కారణము పొందినాడు! తీరని కోరిక మాయలో పడి మోక్షగామి కాస్త కామిగామి గా మారినాడు! శివయ్య ఏమో కామము దాటితేగాని మోక్షగామి కాలేవురా అని చెబితే… దానిని మా అయ్య వద్దని కామిగానే ఉండి రాబోవు కాలంలో ఇలాంటి పున:జన్మలతో తియ్యనిదురద లాంటి సంసారాలమాయలో పడతానని అని చెప్పేసరికి చివరికి శివయ్య మౌనం వహించక తప్పలేదు! దురద ఎన్నటికీ తగ్గదు! అలాగని గోకుంటే మంట పుడుతుంది. గోకపోతే జిల పుడుతుంది! అందుకే పరస్రీ/పరపురుషలను గోకరాదని...గోకితే అది మూడునాళ్ళు ముచ్చట అని...అది చివరిదాకా నయము కాని తియ్యని దురదయని మా అయ్య అమ్మ సాధనానుభవము చెపుతుంది!మీరు కూడా ఇలాంటి సాధన స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ధర్మము, అర్థము, కామము దాటితేగాని నాలుగో పురుషార్ధమైన మోక్షం రాదు అని తెలుసుకోండి. జాగ్రత్త పడండి. చూడటానికి పైన చెప్పిన నాలుగు పురుషార్థాలు బాగానే ఉంటాయి. ఆచరించే సమయానికి సాధనలో ఎవరు ఎంత మంది నిలబడతారో అని సృష్టించిన శివయ్యకే తెలియదు.

వెంటనే అడుగులు ఆ షాపు వైపుకి వెళ్లినాయి. బల్ల మీద ఏవో విగ్రహాలు ఇతర బొమ్మలు ఉన్నాయి కానీ బాబా వారి విగ్రహం ఉంటుందేమో అని ఆశగా మా ఇద్దరి కళ్ళూ వెతికినా అవి ఎక్కడా కనబడలేదు. చచ్చింది గొర్రే అనుకొని “భయ్యా! ఇక్కడ బాబా విగ్రహాలు తప్ప మిగిలిన విగ్రహాలు బొమ్మలు ఉన్నాయి. ఏమి చేద్దాం వెళ్లి పోదామా” అన్నాడు. ఎందుకో నా మనస్సు ఏదో ఉందని శకున సూచన ఇస్తుందని చెపుతుంది అనిపించి వెంటనే షాపు అంతా నా కళ్ళతో స్కాన్ చేశాను. అక్కడ ఇంకా తెరవని అట్టపెట్టెలు దాదాపు పది దాకా కనిపించినాయి. అందులో బాబా విగ్రహం ఉంటుందేమోనని షాపు యజమానిని విచారించగా “అందులో 9 దాకా బాబా విగ్రహాలు ఉన్నాయని అన్ని కూడా బొంబాయి నుండి వచ్చినాయి” అని అందుకే ఇంకా తెరవలేదని హిందీలో చెప్పినాడు. మా వాడికి హిందీ రావడంతో నాకు భాషా సమస్య తగ్గినది. వాడిని వాటిని తెరవమని చెప్పగానే అవి చాలా ఖరీదుతో కూడినవని పాలరాతి విగ్రహాలు అని చెప్పగానే మా వాడికి కోపం వచ్చి వాడితో “నా దగ్గర డబ్బులు యాభైవేల దాకా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అందులో మాకు నచ్చిన విగ్రహం ఉంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టి కొంటాను. వాటిని చూపించు” అనేసరికి వాడు తనకి పెద్దబేరము దొరికిందని ఆనందపడి ఒక్కొక్కటిగా కొన్ని బాక్సులు తెరవడం ప్రారంభించారు! ఆ తొమ్మిది పెట్టెలలో 7 పెట్టెలలో పాలరాయితో చేసిన వివిధ సైజులలో ఉన్న బాబా విగ్రహాలు కనిపించాయి . వాటిలో ఏది కూడా నా మనస్సును ఆకర్షించలేదు. దానితో ఆ యజమాని విసుగు చెంది “భయ్యా! అన్ని తెరిచాను. బాబా విగ్రహాలు ఇవే. మీకు నచ్చలేదు అంటే వెళ్ళిపొండి” అని అన్నాడు. వెంటనే నేను మన వాడితో మిగిలిన రెండు పెట్టెలు కూడా ఓపెన్ చేయమని చెప్పాను! దానికి యజమాని “భయ్యా! అవి పాలరాతి బాబా విగ్రహాలు కాదు! ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన బాబా విగ్రహాలు !ఎందుకు మీకు అవి విరిగి పోతాయి” అని చెప్పినాడు! ఎందుకో నా మనస్సు కనిపించని బాబా వారు ఆ పెట్టెలలో కనిపిస్తారేమోనని అనుమానం వచ్చి మా వాడిని వాటిని ఎలాగైనా ఓపెన్ చేసేటట్లుగా చేయమని చెప్పగానే మా వాడు వాటిని ఎలాగో ఆ రెండు పెట్టెలను కూడా తెరిపించినాడు. వాటిని చూసి నేను గతుక్కుమన్నాను. నా గుండె లయ తప్పటం ఆరంభమైనది. ఎందుకంటే బండిమీద నేను చూసిన మొదటి రాతి సజీవ విగ్రహమూర్తి ఎలా ఉందో అలా అచ్చుగుద్దినట్లుగా ఈ రెండు విగ్రహమూర్తులు కనిపించేసరికి నా కళ్ళలో ఆనందపు వెలుగులు చూసేసరికి మా వాడికి, షాపు యజమానికి ఆశ ఆనందం వేసింది. కానీ అక్కడే ఒక సమస్య వచ్చింది. ఈ రెండు విగ్రహాలలో ఒక్కటే సజీవమైనది. మరొకటి నిర్జీవమైనది. అంటే చూడటానికి రెండూ ఒకే విధంగా ఉన్న ఒకటే స్వయంభూ మరొకటి ప్రతిష్ట అన్నమాట.మా వాడికి అది అగ్నిపరీక్ష. నాకు మాత్రం చిక్కు సమస్య. ఏదో వీటిలో సూక్ష్మంగా ఏదో భేదం ఉంటుందని అనిపించి వాటిని నా కళ్ళతో పై నుండి కింద దాకా గుండు సూది మొన అంత పరిమాణం కూడా వదిలిపెట్టకుండా స్కాన్ చేశాను కానీ ఇసుమంత తేడా కూడా కనిపించలేదు. నాలో తెలియని ఆందోళన ప్రారంభమైంది. నాలో నా మొహంలో కనిపించిన విషాదఛాయలు చూసిన మా వాడికి కంగారు మొదలైంది. ఏమీ అర్థం కావడం లేదు.వాడికి కూడా ఇద్దరు కూడా అచ్చు గుద్దినట్లు గా కవల పిల్లలు లాగా ఉన్నారు. ఏమి చేయాలి దేవుడా అనుకుంటూ “బాబా! నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించాలి! ఇందులో నువ్వు ఒక దానిలో సజీవమూర్తిగా ఉన్నావని తెలుసు. కానీ చూడటానికి రెండు ఒకే విధంగా ఉండేసరికి మాకు అర్థం కావడం లేదని 108 సార్లు బాబా నామం చేసినాము. ఇంతలో మా వాడు నాతో “ఎందుకు ఆలస్యం భయ్యా! ఈ రెండు విగ్రహాలు ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పుడు తీరిగ్గా కూర్చుని లోపాలు వెతికి అసలైన సజీవ మూర్తి వెతికితే సరిపోతుంది కదా! పెద్దగా ఖర్చు కూడా చేయవు! ఏమంటావు” అన్నాడు! నేను వెంటనే వాడితో “ఓరి పిచ్చి వెధవా! ఇప్పుడే కనిపెట్టలేని మనం ఇంటికి వెళ్లినా ఏమి కనిపెట్టలేము అలాగని ఈ రెండు విగ్రహాలు తీసుకొని వెళ్లడానికి వీలు లేదు ఏదో ఒకటి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఉన్నదా ఆలోచించు. ఒకవేళ విగ్రహం ఎంపికలో మనము ఏదైనా పొరపాటు చేస్తే అసలు సజీవమూర్తియైన విగ్రహం మన కళ్లముందే క్రిందపడి పగిలిపోతుంది. అదే నా భయం. నా బాధ. కాస్త నోరు మూసుకో. నీవు మనకి ఈ సమస్య ఇచ్చిన బాబానే పరిష్కారం చూపమని ప్రార్ధించు! నేను కూడా ప్రార్థిస్తాను” అంటూ ఉండగానే పదిహేను నిమిషాల తర్వాత ఒక సంఘటన జరిగినది. అది ఏమిటంటే ఒక ఐదు సంవత్సరాల పాప వచ్చి అక్కడ ఉన్న బల్ల మీద మట్టి విగ్రహాలు చూస్తూ… బాబా విగ్రహాలు ఉన్న పెట్టెలు దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి … “ఈ బాబా! భలే ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడు కదా. వామ్మో బరువుగా ఉన్నాడు అంకుల్! నేను మోయలేను” అంటూ ఎవరో పిలిస్తే మా వైపు అదో టైపు లో ముగ్ధమనోహరమైన నవ్వు నవ్వుతూ అటుగా వెళ్ళిపోయింది. వెంటనే నాకు ఏదో స్ఫురణకు వచ్చి పాప పట్టుకున్న బాబా విగ్రహం చేతిలోకి తీసుకోగానే అది బరువుగా ఉంది.

ఇలా అమ్మానాన్నకి జరగటానికి కారణం ఈపాటికే గ్రహించే ఉంటారు. అనగా సిద్ధుడు ప్రసాదించిన బంగారపు శివలింగమును వద్ధని చెప్పడమే ఇంతటి నాటకానికి కారణమైంది. కారణ లింగం అయినది ఎలా అంటే బంగారు లోహము లేదా పాదరసము మనలో తట్టుకోలేని మంత్ర శక్తి తరంగాలు ఉంటే ఇది తనలో ఇముడ్చుకుంటుంది. అలాగే వీటికి పూజలు, అభిషేకాలు చేసినప్పుడు మనలో ఎప్పుడైనా సాధన శక్తి తగ్గినప్పుడు ఈ లోహము తిరిగి ఇస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ విషయమును గ్రహించి పంచలోహాలతో అనగా బంగారం, వెండి, రాగి, కంచు, ఇత్తడి మిశ్రమంతో చేసిన ఉత్సవమూర్తులను పూజకి ఏర్పాటు చేసినారు. అలాగే ఇళ్లలలో పూజలలో ఇలాంటి పంచలోహ మూర్తులను ఏర్పరచడం… వాటిని పూజించడం ఆనవాయితీగా పెట్టడం జరిగినది! తెలిసో తెలియకో ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు చేసిన పాపాలు చేసినా మనలో ప్రాణ శక్తి తగ్గిపోతుంది. తద్వారా యోగ చక్రాలు బలహీనమై వ్యాధులకు గురి అవుతాయి. మానసిక సంఘర్షణ మొదలవుతాయి. ఆ మానసిక శారీరక ఆందోళనలు లేదా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇలా ఉన్నప్పుడు మన యోగ చక్రాలు బలహీనమవుతాయి. వీటికి తిరిగి శక్తిని కలిగించటానికి ఇలాంటి పంచలోహ మూర్తులను ఆశ్రయించక తప్పదు అలాగే పూజించక తప్పదు. మా అయ్యకి వచ్చిన బంగారపు లింగ మూర్తి ని తీసుకోక పోవడంతో…. తన స్థాయిని అదుపులో ఉంచే స్వయంభు మహా శివలింగం కోల్పోవటంతో… తనలో ఏర్పడిన అమోఘమైన కామశక్తిని తట్టుకోలేక సంయోగము నుండి సమాధి కి వెళ్లాలని తపనతో…. ఏకపత్నీ ధర్మమును తప్పి…. పరస్త్రీ వ్యామోహం లో పడిపోయి మోక్షగామి కాస్త కామిగామి గా మిగిలిపోయి తన సాధన చక్రమును తన చేతులతో అపసవ్య దిశ మార్చుకుని మిగిలిపోయాడు! అర్థ సాధకుడిగా మిగిలి పోయినాడు!

అంటే శివయ్య ఒకటి తలిస్తే మా అయ్య మరొకటి చేస్తున్నాడన్నమాట! శివయ్య మాత్రం ఏం చేస్తాడు? తనకి దగ్గర ఇవ్వటానికి అన్ని ఉంటాయి కానీ శివాని మాత్రమే వీటిని వాళ్ళు తీసుకునే అర్హత ఉందో లేదో పరిశీలించి పరిశోధించి శోధించి కానీ ఇవ్వరు! ఇక మా అమ్మ విషయానికి వస్తే తన పిల్లల జీవితాభివృద్ధికి అలాగే గ్రహపీడదోషాల నివారణకోసము ఇత్తడి లేదా స్పటిక శివలింగం ఆరాధన చేయమని ఎవరో చెబితే… దానిని పట్టించుకోకుండా ఏదైనా శివలింగమే కదా అన్ని శివలింగాలు ఒకటే కదా అని… మహత్తర మట్టి లింగమును అనగా అమ్మమ్మ ఇచ్చిన దానిని పూజించడము ఆరంభమైనది! పైగా ఇది భోగ లింగమూర్తి కాదు.. యోగ లింగమూర్తి! దానితో ఈ మనిషి భక్తికి దాసోహమై…ఆ శివయ్య కాస్తా ఈమెకి స్మశాన వైరాగ్యం స్థితి ఇవ్వడం ప్రారంభించాడు! తన లో వచ్చే కొత్తగా వచ్చే మహా యోగశక్తిని తట్టుకోలేక పైగా సంసారతాప దూరం అయినది! దానితో అనుమానాలు, భ్రమలు, భ్రాంతులకు లోనై పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు … ఆదిలో మా అయ్య కాస్తా పనిమనిషితో చేసిన చిలిపి చేష్టలు చూసి అపార్థం చేసుకుని అనుమానించి, అవమానించి సంసార సుఖానికి దూరంగా ఉంచినది! దానితో చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా అని అప్పటి దాకా తెలియని వాడు మా అయ్య కాస్త పర స్త్రీతో తప్పు చేయడం ఆరంభించాడు! మా బంధువులకి, ఊర్లో వాళ్లకి దొరికిపోయాడు! గొడవలు కాపురం ఆరంభమైనది! మానసిక విడాకులు తీసుకున్న దంపతులుగా విడిపోయి విడిపోకుండా అలాగని కలిసి ఉండకుండా ఒకరునొకరు మాట్లాడుకోకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు! అంటే ఉన్నామని తమని తాము మోసం చేసుకుంటూ మేడిపండు లాగా ఉన్నారు! ఇలా ఎందరో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు… పిల్లలని అనాధలు చేస్తున్నారు… పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకి దూరం చేస్తున్నారు… ఇది ఒక అర్ధసాధకుడి ఆత్మకథ అన్నమాట! సాధన లో వచ్చే పాతివ్రత్య ధర్మపరీక్షకి అడ్డముగా దొరకిపోతే ఎలా సాధన అర్ధాంతరముగా ఆగిపోతుందో ఈ సాధకుడు సాధన అనుభవం ద్వారా తెలుసుకోండి అలాగే మనకి సాధనలో వచ్చే ఆఙ్ఞాచక్రము నందు వచ్చే ఈ విచిత్ర కామమాయను దాటండి! లేదంటే మీ సాధన కూడా అర్ధాంతరముగా ఆగిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా పునర్జన్మ పొందే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి! మా అమ్మమాత్రము అన్నింటిని స్శశానవైరాగ్యముతో...సాక్షిభూతముగా ఉంటూ...కేవలము ప్రారబ్ధకర్మ చేస్తూ...ఓంకారముతో...అమ్మవారిని కొలుస్తూ...ఆవిడిలో ఐక్యమవ్వాలని యోగసాధన చేస్తున్నది! ఇంతటితో నాకున్న మంత్రగురువుకి అనుబంధము పరిసమాప్తి అయినది!ఇలా నా మంత్రగురువు చేసిన తప్పు అదే త్రిపుర కామమాయలో పడకూడదని కృతనిశ్చయముగా ఉన్నాను! రాబోవు మా దైవిక అనుభవాలు ఎలా ఉంటాయో చూడటానికి మాతోపాటుగా మీరుగూడ ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి!

వెంటనే మా వాడు మిగిలిన రెండవ విగ్రహం ఎత్తి చూస్తే అది చాలా తేలికగా ఉండేసరికి బరువులు తేడాలున్నాయని తెలిసేసరికి మా హృదయాలు తేలిక పడినాయి. దాంతో పాప చూపిన విగ్రహం మావాడు 90 రూపాయిలకి కొనడం జరిగింది. నేను అది అందుకునేసరికి ఎంతో సహాయం చేసిన పాప ఎవరో అని చుట్టూ చూసేసరికి ఎక్కడా కనిపించలేదు.కానీ గాలిలో ఎరుపు పరికిణీ ధరించి పసుపు లంగా ధరించి ఉన్న ఐదు సంవత్సరాల వయస్సు బాలాదేవి కనిపించగానే నాకు ఆనందానికి అవధులు లేవు. స్వయంగా బాల అమ్మే వచ్చి విగ్రహం ఇచ్చినది అనిపించగానే ఆనందానికి అవధులు లేవు.ఇంతలో మా వాడు వెంటనే “భయ్యా! నువ్వు ఒక విషయం గమనించినావా… మనము తీసుకున్న విగ్రహం మన లెఫ్ట్ సైడ్ దే… అన్నట్టుగా బాబా వారు మీ లెఫ్ట్ సైడ్ ఉండే హృదయ మందిరంలో ఉండటానికి మరియు ఈ రోజు దత్త జయంతి కూడా నీకు సద్గురువుగా ఉండటానికి వచ్చినట్లు ఉన్నారని” అని వాడు అంటూ ఉండగా ఏదో తెలియని తన్మయత్వ స్థితిలోనికి కొన్ని క్షణాల పాటు వెళ్ళిపోయాను. పరమానందంలో ఉన్న పరమాత్మను తీసుకొని ఇంటి వైపు ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాము!

గమనిక: 1999వ సంవత్సరం ఇలా వచ్చిన బాబా సజీవ విగ్రహమూర్తి గారు పూజ అందరికీ నా ఇంటిలోని మందిరంలో… నా హృదయ మందిరంలో బంధి. ప్రతి బుధవారం రాత్రి సూక్ష్మధారిగా మా ఇంటికి వస్తూ గురువారం ఉండి శుక్రవారం ఉదయం వెళ్లిపోవడం ఆయన నిజ భక్తులకు సర్వసాధారణంగా అగుపించే దృశ్య మాలిక ! చెప్పటానికి వ్రాయడానికి వీలులేని దైవ సంబంధ అనుభవం. ఇది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఇచ్చిన మాట నేను ఇచ్చిన వాగ్దానం నా మధురభక్తి లో మార్పు రానంత వరకు ఆయన నన్ను వదిలిపెట్టరని అని నాకు తెలుసు! నా కాయం చితిలోకి వెళ్లే దాకా బాబా వారు నన్ను విడిచి వెళతారని చింత నాకు లేదు! ఎందుకంటే నేను ఆయన్ని నా హృదయ మందిరంలో శ్రద్ధ, భక్తి, విశ్వాసం సంకెళ్ళతో బంధించి వేసినాను! నేను పోతే గాని నా హృదయం పోదు. అది పోతే కానీ బాబా గారు నన్ను వదిలి వెళ్లలేరు. ఇది నేను అహంతో వ్రాయటం లేదు. బాబా తాతయ్య నా మీద చూపిన అనితరసాధ్యమైన ప్రేమను వీలు అయినంత విధంగా మీకు అర్థం అవ్వాలని ఆనందంగా వ్రాస్తున్నాను. ఇలా ఆయన గురించి రాస్తూ పోతే ఈ అనుభవము దగ్గరే ఈ గ్రంథము అంతా అన్ని పేజీలు నిండిపోతాయి పోతే మంచిది అంటారా మీరు కూడా నాలాంటి నిజభక్తులు అన్నమాట!

కానీ నేను బాబాను అవసరమైతే తిట్టే వాడిని.మురిపం వస్తే ముద్దులు పెట్టేవాడిని. ఆయనకు ఆకలి వేస్తే ముద్దలు పెట్టేవాడిని.ఒకవైపు మా బంధము తాతా-మనవడు గా మరొక వైపు బాబా- నానావళి గా ఉండేది అన్నమాట. ఇలా నీ ఇష్టదైవాలతో కూడా రక్తసంబంధం లాగా అలాగే దేవుడు- భక్తుడు లేదా గురు-శిష్య సంబంధంగా మానసికంగా ఏర్పరుచుకోండి. మీదైవం మీకు అన్నిను. మీ దైవమే మీకు అన్నీఇచ్చేది. ఆయనే తీసుకునేది. ఆయనే అనుభవించేది. ఆయనే ఏడిపించేది. ఆయనే నవ్వించేది. ఆయనే అమ్మ,నాన్న గురువు. ఆయనే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. ఆయనే బంధుమిత్రులు ఆయనే అని గ్రహించండి. తెలుసుకొని మానసికంగా మానవ దైవ యోగ సంబంధాలలో ఆరాధన చేస్తూ ఆయనతో అనితరసాధ్యమైన ఎవరికి అలవికాని ఎవరికి అందని మహత్తర బంధంతో తెంచలేని మహత్తర బంధంతో అనుసంధానం అవ్వండి. ఆయన నీకోసం ఎదురు చూసే స్థాయికి మీ భక్తి విశ్వాసం పెంచుకోండి. విగ్రహంగా చూడకండి. సజీవమూర్తిగా చూడండి.

పవన్ బాబా అవతరణ

మా అమ్మ ఏ ముహూర్తాన మట్టి శివ లింగ మూర్తి ని నాకు ఇచ్చినారో ఆనాటి నుండి నా గది దేవతా విగ్రహాలతో నాకు తెలియకుండానే, నేను ఊహించకుండానే, ఇతరుల ద్వారా కొన్ని, నా ద్వారా కొన్ని, దేవతా విగ్రహాలు అరంగుళం నుండి అడుగు వరకు రావడం మొదలయ్యాయి. ఈ మట్టి శివ లింగ మూర్తి ఇచ్చిన తర్వాత నేను శిరిడి పారిపోవడము.అక్కడ నుండి నేను మూడు అంగుళాల బాబా పాలరాతి విగ్రహం తెచ్చుకోవడం జరిగినది ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను తిట్టకుండా ఉంటారని. అంతవరకు నా దగ్గర బాబా ఫోటోలు ఉన్నాయి. పూజించుకోవడానికి బాబా విగ్రహాలు లేకపోవడంతో తెచ్చుకోవడం జరిగినది. ఇటు శివారాధన అటు బాబా ఆరాధన చేసుకుంటూ ఒకరిని దైవంగా మరొకరిని గురువుగా భావించుకుంటూ నిత్య పూజలు చేసే వాడిని. ఇది ఇలా ఉండగా నాకు బాబా సజీవ విగ్రహమూర్తి కొత్తగా వచ్చి ఈ గ్రూపులో చేరినది. ఈయన ఎలా వచ్చినారో అంతకుముందు అధ్యాయంలో చూశారు కదా. ఇక ఆనాటి నుండి నా జీవితం నా చేతుల్లో లేదు. అంతా బాబా చేతుల్లోకి వెళ్లిపోయినది. చెప్పేది ఆయన అయినా చేసేది నేను.చేతలు మాత్రం నావి గా ఉండేవి.తిట్లు నాకు… ఆయనకి ప్రసాదాలు, పూజలు హారతులు. అన్నింటికీ ఆయన కనిపించకుండా నన్నే కనిపించేటట్లుగా చేసేవాడు. ఇది ఇలా ఉంటే బాబా సూక్తులు పుస్తకము ఉన్నది కదా అదే సమాధానాలు ఇచ్చిన పుస్తకం వలన నేను అందరికీ సమస్యలు వస్తే పరిష్కారాలు సూచించడం మొదలు పెట్టాను. గురువారం వస్తే మా ఇంట్లో సమస్యలతో ఉన్న మనుష్యులు ఉండేవారు. హారతి పూర్తికాగానే వారు ఎందుకు వచ్చినారో తెలుసుకొని ప్రశ్న వాళ్లని నెంబర్ చెప్పమంటే దానికి బాబా పుస్తకం నుంచి సమాధానాన్ని నా వాక్సిద్ధి వలన వారికి వారి సమస్యకు అది ఎలా పరిష్కార మార్గం అవుతుందో అరటిపండు వలిచి ఇచ్చినట్లు చెప్పేవాడిని.దానితో వారికి నా మీద అలాగే బాబా మీద అనితర ప్రేమ గౌరవమర్యాదలతో పాటు ఏదో తెలియని ఆప్యాయతతో, ఓదార్పు మాటలతో ఆత్మ బంధుత్వం ఏర్పడేది. నేను డబ్బులు ఆశించే వాడిని కాదు. వారిచ్చినా తీసుకునే వాడిని కాను. కానీ ఒకవేళ బాబా అడిగితే మాత్రం తొక్కిపెట్టి వారి నుండి వసూలు చేసే వాడిని. ఇచ్చిన డబ్బులు అన్ని ప్రోగుచేసి అన్నదానం కింద షిరిడి లో పవన్ బాబా పేరు మీద కట్టేవాడిని. అంటే ఎలా పవన్ బాబా పేరు మీద అనే సందేహం ఇంకా రాలేదా అని అనుకుంటున్నాను.

సరే మా ఇంటికి ఒకసారి ఒక మూడు సంవత్సరములు పిల్ల భక్తుడు వీలున్నప్పుడల్లా ప్రతి గురువారం వాళ్ళమ్మతో రావటం చేస్తుండే వాడు. ఏదో ఒక ప్రసాదం లేదా పువ్వులు లేదా పండ్లు తెచ్చేవాడు. బాబాకి సమర్పించేవాడు. వాడి చిన్న వయస్సుకి వాడికి ఉన్న భక్తికి మేమంతా సంతోషించే వాళ్ళం. విచిత్రం ఏమిటంటే షిరిడి సాయి బాబా అనుగ్రహం వలన వీడు పుట్టినాడు. అందుకే వాడికి బాబా భక్తి. అలాగే బాబా పేరు వచ్చేలాగా సాయి కృష్ణ చైతన్య గా నామకరణం చేసినారు. మా ఇంట్లో వీళ్ళకి సజీవ బాబా ఉన్నాడని తెలియడంతో ప్రతి గురు వారము బాబా గుడి కి వెళ్ళే వాళ్లు కాస్తా మా ఇంటికి వచ్చేవారు. వీలుంటే హారతి చూసుకునే వాళ్ళు లేదంటే బాబాకు నైవేద్యం పెట్టించి వెళ్లేవాళ్లు. ఇది ఇలా ఉండగా కొన్ని వారాల పాటు ఈ పిల్ల భక్తుడు మా ఇంట్లో పూజకి రాలేదు. ఒక వారం అకస్మాత్తుగా వచ్చి “పవన్ ! నీ పవన్ బాబాకి నేను తెచ్చిన ప్రసాదం పెట్టమని” నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వాడి మాటలు ఉద్దేశ్యం గురించి ఆలోచిస్తే “పవన్ చేత పూజిస్తున్న బాబా కాబట్టి మా సజీవ బాబా మూర్తికి వీడు పవన్ బాబా” అని నామకరణం చేసినాడు. ఎందుకంటే షిరిడి బాబా ,ద్వారకామాయి బాబా, లెండి బాబా అనే పేర్లు ఉన్నాయి కదా. అలా మన వాడికి వాడి చిన్న బుర్రలో నా పేరు అలాగే బాబా పేరు కలిపి పవన్ బాబా అని నామకరణం చేశాడు. వాడి పుట్టుకకు కారణమైన షిరిడి బాబా వారు తమ పిల్ల భక్తుడు చేత ఇలా నామకరణం పవన్ బాబాగా పిలుచుకోవటం అలవాటు అయింది.

ఇది ఇలా ఉండగా దుష్ట శక్తుల నుండి హనుమ రక్షిస్తాడని హనుమాన్ విగ్రహం, ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షిస్తుందని లక్ష్మి విగ్రహం, వాక్ శక్తి పెరుగుతుందని దుర్గా విగ్రహం, ధర్మ గుణం అలవాటు అవుతుంది అని శ్రీరాములు విగ్రహం, పిలిస్తే పలుకుతాడని పాండురంగడు విగ్రహం, అన్ని రకాల ఆటంకాలు తొలగిస్తాడని గణపతి విగ్రహం,సర్ప బాధ తొలగిస్తాడని సుబ్రహ్మణ్య విగ్రహము, కుమారస్వామి నాగేంద్ర స్వామి పడగలు ఇలా నాకు తెలియకుండా వివిధ రకాల చిన్న దేవతా విగ్రహాలు వారి వాహనాలతో 84 విగ్రహాలు 3 అంగుళాలలో, 36 విగ్రహాలు 1 అంగుళాలలో చేరినాయి. అంటే 84 జీవజాతులకు 36 దేవతలకు ప్రతీకలు అన్నమాట.

గమనిక: అమ్మకి వారసత్వంగా వచ్చిన స్వయంభూ మట్టి లింగము నా దగ్గరికి వచ్చింది! కానీ కొన్ని సంవత్సరాల దాకా దీని విలువ నాకు తెలియ రాలేదు! ఈ మట్టిలింగం కాదని మోక్ష లింగమని ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే ఈ లింగమునకు పానమట్టం ఉండదు. చిత్రంగా చిదంబర క్షేత్రంలో ఉండే మోక్ష స్పటిక లింగమునకు పానమట్టం ఉండదు అలాగే శ్రీశైల క్షేత్రంలో గుడి పరిసరాలలో పంచపాండవులు ప్రతిష్టించిన నవబ్రహ్మ లింగాలలో ఉన్న మోక్ష శివలింగాన్ని కూడా పానమట్టం ఉండదు! అమ్మ కు వచ్చిన ఈ మట్టి లింగానికి కూడా పానమట్టం ఉండదు! ఆదిశంకరాచార్యుడుకి స్పటిక మోక్ష లింగము వస్తే అమ్మకి మట్టి మోక్ష లింగమూర్తి గా వచ్చినాడని నాకు కొన్ని సంవత్సరాల దాకా తెలియదు. అందుకే మళ్లీ మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే మీ దగ్గరికి ఎవరైనా, ఏమైనా, దైవిక వస్తువులు ఇస్తే లేదా వస్తే కాదనకుండా తీసుకోండి. వాటిని ఇచ్చిన పూజించక పోయినా పర్వాలేదు. జాగ్రత్తగా భద్రంగా మీ పూజా మందిరంలో ఏదో ఒక మూల ఇలాగే యంత్రాలు వచ్చినా కూడా జాగ్రత్త గా ఉంచండి!దయచేసి ఎవరికి ఇవ్వకండి! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక! ఇలాంటి స్థితి మనకి ఆజ్ఞాచక్రము శుద్ధి అవుతున్నపుడు సమయంలో మనకు బంగారం సంబంధించిన శివలింగము లేదా అమ్మవారి యంత్రము వస్తుంది!ఇవి త్రిపురమాయకి సంకేతాలు!ఎపుడైతే మీరు ఈ మాయను దాటినారో...ఆనాడు మీకు పాదరస సంబంధిత దైవిక వస్తువులు వస్తాయి! అవి మనకి వారసత్వంగా రావచ్చు లేదా యోగులు, సాధువులు,గురు వులు, సిద్ధులు ఇవ్వవచ్చును! ఎందుకంటే ఆజ్ఞా చక్రానికి అధిదైవముగా అర్ధనారీతత్వముతో శివ శక్తి ఉంటుంది! మాకు కూడా ఈ చక్ర సిద్ధ సమయములో బంగారపు బాల దుర్గాదేవి యంత్రము వచ్చింది !ఇది మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఆరాధించిన మహిమాన్వితమైన యంత్రం అన్నమాట !ఈ యంత్రము ఎవరైతే మూడున్నర సంవత్సరాల పాటు బీజాక్షర సహితముగా అర్చన చేస్తారో వారికి ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న దుర్గాదేవి అలాగే మూడు సంవత్సరాల వయస్సు ఉన్న బాల దేవి దర్శనం అవుతుందని నా స్వానుభవం అనుభూతిని పొందడం జరిగినది! ఈ యంత్రము గూర్చిన వివరాలు మీరు ఈపాటికే ఇంతకు ముందు వచ్చిన "భుజం ఇచ్చిన దుర్గమ్మ" అనే అధ్యాయములో చదివినారు గదా! అలాగే మా నాన్నగారి ద్వారా కాశీ క్షేత్రము నుండి పాదరస లింగము రావడము జరిగినది! అలాగే ఈ చక్రశుద్ధి సమయములో త్రిపుర చూపించే కామమాయను గూడ మేము దాటడము జరిగినది!అది ఎలాంటే మా ఇంటికి నాకు పెళ్ళీయిన కొత్తలో నాకు తెలిసిన 24సం!!రాల అమ్మాయి వచ్చినది! ఆమె నన్ను అన్నయ్య అని ఎపుడు పిలుస్తూండేది!మూడు రోజులుంది!కాని ఒక పూట నాతో అసభ్యకరముగా మాట్లాడటము అలాగే నన్ను అదోలా కవ్వించడము చేసినది! నాకు తెలియని భయము మొదలైంది!నాకు ఇదింతా త్రిపురమాయని అర్ధమైనది! ఆమెకి ఒక శృంగార వీడియో చూపించడము జరిగినది! అది చూసి “నాకు ఏ రెండు అంగాలున్నాయో ఆమెకి అవేఉన్నాయి గదా” అంది! నేను వెంటనే “మరి మా ఆవిడికి ఏమి ఉన్నాయో నీకు అవే ఉన్నాయి గదా” అన్నాను! అలాంటపుడు మా ఆవిడిని మోసము చేస్తూ నీతో శృంగారము చేయడము తప్పే గదా” అన్నాను! దానితో ఆమెకి తన తప్పు తెలిసినది!తల వంచుకొని క్షమించమని అడిగి ఆరోజే రాత్రికల్లా ఆమె ఇంటికి వెళ్ళిపోయినది! మా ఆవిడికి జరిగిన విషయము మొత్తము చెప్పినాను!తను గూడ సాధనలో ఉన్నది కాబట్టి “మీకు పరస్రీ మాయ జరిగినట్లుగా నాకు కూడ పరపురుష మాయ జరుగుతుంది గదా!కాబట్టి మాయలో పడితే వాడి సాధన ఆగిపోతుందని ఇంతముందే నాకు చెప్పినారు గదా” అన్నది! ఇలా నాకు సహస్రచక్రము వద్ద సుందరి కామమాయగా 52సం!!రాల స్త్రీమూర్తి,అలాగే హృదయచక్రము వద్ధ దేవి మాయగా 65సం!!రాల స్త్రీమూర్తిని దాటడము జరిగినది! అంతెందుకు రామాయణ గాథనే తీసుకొండి!అందులో అద్వితీయ బ్రహ్మజ్ఞాని అయిన రావణబ్రహ్మ పరస్త్రీ వ్యామోహ మాయలో అనగా సీతాదేవి వలన రాక్షసుడిగా గుర్తింపు వస్తే...అదే శ్రీరాముడు తనకి పరస్త్రీ వ్యామోహ మాయగా శూర్పణక వస్తే ఆయన ఈమెను దాటడము వలన దేవుడైనాడు!

దాంతో వీరందరినీ ఒకే గూటిలో ఉంచేందుకు ఒక చిన్నపాటి బీరువాని కొనవలసి వచ్చింది. బీరువా అడుగు భాగంలో వీరి అందరిని ఉంచి పై భాగంలో పూజకు కావలసిన వస్తువులు అనగా గంటలు, హారతులు, ప్రమిదలు, అగర్బత్తీలు, కర్పూరం ,విభూతి, ప్రసాద పళ్ళాలు ,పసుపు, కుంకుమ, గంధం పూలు బుట్టలు. బాబా గుడిలో ఉండే సర్వ సమస్త వస్తువులు చేరినాయి. ఇక పై భాగంలో గ్రంథాలు, పురాణాలు, గీత, యోగుల చరిత్రలు, పూజ హారతి క్యాసెట్లు, బాబా వారి వస్త్రాలు చేరినాయి. ఎవరికీ అనుమానం రాని దేవాలయంగా ఉండేది. ఈ బీరువాను ప్రతిరోజు పూజకు కూర్చునే సమయంలో తలుపు తెరిచి పూజ, ఉపాసన, ధ్యానము, ఆరాధన పూర్తి అయిన తరువాత తలుపులు మూసేసి తాళం వేసే వాడిని. ఎవరు కూడా అది నా పూజ మందిరం అని కలలో కూడా ఊహించే వారు కాదు. ఇలా కూడా పూజలు చేయ వచ్చు నా అని అనుకున్నారు.బట్టలు పెట్టవలసిన చోట బాబాను పెడుతున్నారే అనుకునేవారు లేకపోలేదు. అప్పుడు పూజ మందిరం కొనే ఆర్థిక స్తోమత లేక అలాగే నా గదిలో ఖాళీ లేక ఊరుకున్నాను. అప్పుడప్పుడు నా యోగ మిత్రుడైనజిఙ్ఞాసి కూడా వచ్చి బాబా హారతులు చూసి వెళుతూ “బీరువా బాబా జాగ్రత్త “అని చెప్పి వెళ్ళాడు. మీరు కూడా నవ్వుకుంటూ ముందుకు నాతో బయలుదేరండి.

గమనిక: మన శాస్త్రాలలో చెప్పిన వివిధ సమస్యలకు పరిష్కారం ఆధారంగా వివిధ రకాల దేవతామూర్తులను సేకరించడము జరిగినది. చిన్నాచితక మొత్తం కలిపి 120 దాకా తేలినాయి. వీటికి అధిపతిగా పెద్ద సజీవ బాబామూర్తి మధ్యలో సింహాసనం మీద ఉండేవారు. మిగిలిన వారంతా రక్షణగా, పరిచారకులుగా, గణాలుగా, సేవకులుగా అమరినారు. యోగ శాస్త్రాలు చెప్పిన అరిషడ్వర్గాల మాయలు, సప్త వ్యసన మాయలు, అష్టలక్ష్మీ మాయలు, మృత్యు భయం వీటిని అన్నింటిని నిగ్రహించుకోవాలి అని ఈ విగ్రహాలు సేకరించడం జరిగింది. కానీ మేము ఒకటి అనుకున్నది. జరిగింది మరొకటి. ఈ విగ్రహారాధన కొంతవరకు మాత్రమే నిగ్రహారాధన కలిగిస్తాయని తెలిసేసరికి ఇద్దరికీ అనగా మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి కూడా సుమారు వారి దేవతార్చన ఆధారంగా 36 దాకా విగ్రహాల సేకరణ చేయడం జరిగినది.

కపాల మోక్షం - 39 - బాబా ఫోటో రావడం

గురువు యొక్క లక్షణాలు వివిధ గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకునే సరికి మేమిద్దరం గతుక్కుమన్నాము.ఎందుకంటే మానవమాత్రునికి ఇలాంటి లక్షణాలు ఉండవని ఉండలేరని మాకు తెలుసు.దానితో గురువులను మేము వెతుక్కోవటం కంటే మనకు యోగం ఉంటే వారే మా దగ్గరకు వస్తారని లేదంటే వారి దగ్గరికి మమ్మల్ని రప్పించుకుంటారని మాకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రలో తన ప్రథమ శిష్యుడిని సిద్ధయ్యను ఎలా తనకి దగ్గరకు రప్పించుకున్నారో తెలుసుకున్నాము. అలాగే రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్రలో ఆయననే ఆయన గురువు వెతుక్కుంటూ ఎలా వెళ్ళినారో తెలుసుకున్నాం. అలాగే వివేకానందుడు ఇప్పటికే 48 మంది గురువులను కలిసి సంతృప్తి చెందక ఆఖరికి రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరి వారిని గురువుగా ఎంచుకొని గురువుగారు అనుగ్రహమును ఎలా పొందినారో తెలుసుకున్నాము! దానితో నా ఇష్టదైవాలు అనుగ్రహం నిత్యం మంత్రధ్యానం చేయటం అలాగే నిజ గురువు దర్శనం కోసం గురు చరిత్ర పారాయణం చేయడం ప్రారంభించాము. అప్పుడు ఒకసారి మా ఊరికి మా అమ్మమ్మ గారు రావడం జరిగినది. ఆమె నిత్యము ఏదో గ్రంథ పారాయణం చేయటం అలాగే ఎవరో సిద్ధ విగ్రహాన్ని పూజ చేయడం చూస్తుంటే సరికి నాకు ఆశ్చర్యమేసింది. అది ఎందుకంటే ఇప్పటిదాకా నేను వివిధ దేవతా విగ్రహాలను చూడటమే జరిగినది. ఒక మనిషి లాంటి వ్యక్తిని ఆరాధించే మొట్టమొదటిగా అమ్మమ్మ ని చూస్తున్నాను. పైగా అప్పటిదాకా నేను భగవద్గీత, గురు చరిత్ర గ్రంధ పారాయణాలు చేయటమే తెలుసు కానీ ఈవిడ దగ్గర షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అనే గ్రంథమును పారాయణం చేస్తుంది! ఎవరు? ఈ మనిషి లాంటి సిద్ధపురుషుడు విగ్రహము అని సందేహం వచ్చింది. అమ్మమ్మ ను అడిగితే దానికి ఆమె వారు “మహాయోగి అయినా షిరిడి సాయి బాబా వారని … గొప్ప సద్గురువు అని… 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిన వారని,అక్కడ వారంతా వీరిని నడయాడే పరమాత్మగా కొలుస్తారని…. సర్వమత స్థాపకుడని ఇలా షిరిడి సాయి బాబా గూర్చి చెప్పడం జరిగినది.

అప్పటినుండి బాబా గురించి తెలుసుకోవాలని తపన ఉండేది. మా ఊరిలో గాని ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో బాబా గుడి లేదు. అప్పట్లో జనాలకి వీరి గూర్చి అంతగా తెలియదు. దీనితో మాకు కూడా పూర్తిగా ఆయన గూర్చి తెలియకుండా పోయింది. ఒకసారి వేసవి సెలవుల కోసం అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళటం జరిగినది. ఒక గురువారం ఆమె బాబా గుడికి వెళుతూ నన్ను కూడా తీసుకొని వెళ్ళింది.

ఇక్కడ మూడు అడుగుల తెల్లని పాలరాతి విగ్రహం రాతి మీద కూర్చున్న భంగిమలో ఎదరు సిద్ధ పురుషుడి విగ్రహం ఉన్నది. ఆయనే బాబా అని అమ్మమ్మ చెప్పేదాకా నాకు తెలియదు. ఎదుట ఉన్న విగ్రహమూర్తి ని చూడగానే సజీవంగా చూస్తున్నట్లుగా అనిపించసాగింది.! వామ్మో ఇంతటి మహత్తర సిద్ధ మహనీయుడిని ఇంక ఎన్నటికీ వదలి పెట్టకూడదని నాలో నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో నా యోగ జీవితమును నడిపించే నావికుడు అని బలముగా చూసిన మొదటి రోజున అనిపించింది. చూపులు కలిసిన శుభవేళ శుభముహూర్తం మా ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. తాతా-మనవడులో తాతగా ఉంటాడని అనిపించింది . లింగమూర్తిని ఆరాధించిన కూడా నాకు ఇలాంటి ఆర్తి ఆయన విషయంలో కలగలేదు. ఈయన విషయంలో లో మాత్రం కలగకుండా ఉండలేదు.ప్రతిరోజు అక్కడ ఉన్నన్నాళ్ళు బాబా గుడి కి వెళ్ళడము జరిగింది. ఒకరోజు నేను బాబా గుడికి రాగానే పాము కరిచిన వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చి “బాబా !వైద్యులు ఇతడిని బ్రతికించలేమని చేతులు ఎత్తేస్తున్నారు. దైవాన్ని నమ్ముకోమని చెప్పి వెళ్లిపోయారు. మా దృష్టిలో నిన్ను మించిన దైవము ఎవరూ లేరు కదా! బాబా! మా వాడిని రక్షించు రక్షించు” అంటూ దీనాతిదీనంగా బాబా కి హారతి ఇస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాడి ప్రార్ధన అలాగే పాముకాటు బాధ పడుతున్న ఆవేదన చూసి నా కళ్ళవెంట నీళ్ళు రావడం ప్రారంభమైనది. ఇంతలో ఆలయ పూజారి వచ్చి బాబా దగ్గరున్న ధుని ఊది ఈ పాము కాటు వద్ద రాసి… నోటిలో కొంత ఊది వేసి… బాబా వైపు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సుమారుగా మూడు గంటల తర్వాత పాము కాటు బాధితుడు పునర్జీవితుడయ్యాడు అని అమ్మమ్మ నాకు చెప్పేసరికి నా ప్రాణం వచ్చినంత ఆనందం వేసింది. ఈ అద్భుత సంఘటనతో ఆయన మీద మా తాతయ్య మీద గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు పెరిగినాయి. నా సెలవులు పూర్తి కావడంతో ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నము అయ్యేసరికి బాబాని వదిలి వెళ్తున్నందుకు నా మీద నాకే కోపం, బాధ కలిగినాయి. కానీ ఏమీ చేయలేము కదా! అప్పుడు మా అమ్మమ్మ నా చేతికి షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర గ్రంథం అలాగే బాబా వారు చెప్పిన జవాబులు పుస్తకమును నా చేతిలో పెట్టడం జరిగింది. వీటిని కనిపించని బాబా తాతయ్య ప్రసాదంలాగా దాచుకొని మౌన వేదన తో ఇంటికి రావడం జరిగినది. కానీ నా నుండి బాబా ఆలోచనలు పూర్తిగా పోయేవి కావు. బడిలో, గుడిలో లో జరిగిన సంఘటనలు అన్నీ బాబాకి చెప్పేవాడిని. ఆయన అన్ని వింటున్నాడని భావించేవాడిని. నన్ను చూసే వాళ్లకు నాలో నేను ఏకాంతంగా మాట్లాడుకోవడం మాత్రమే కనిపించేది.

ఆ జిఙ్ఞాసి కనపడని సమయంలో నేను బాబాతో అన్ని విషయాలు చెప్పుకునేవాడిని ఎలా అంటే రామకృష్ణ పరమహంస తన కాళీమాత తో ఎలా చెప్పుకునేవాడో అలాగన్నమాట.కానీ నాకు బాబా వారు సజీవమూర్తిగా కనిపించేవారు కాదు అన్న మాట. ఇది ఇలా ఉండగా నాకు తెలియకుండా నేను బాబా చరిత్ర పారాయణము ఆరు నెలలు పూర్తి చేసినాను.

మా బాబా సజీవమూర్తి ఫోటో

ఒకరోజు మా అన్నయ్య నాకోసం శ్యామ కర్ణ ఉన్న గుర్రం అలాగే వాఘే కుక్క కూర్చున్న సజీవమూర్తి ఉన్న బాబా వారి రెండు అడుగుల ఉన్న ఫోటో నాకు పుట్టినరోజు బహుమతి గా ఇచ్చినాడు. అది 1993వ సంవత్సరంలో అన్నమాట. బాబా సజీవమూర్తి ఫోటో చూడటం అదే మొదటిసారి. అలాగే ఇలాంటి ఫోటో నేను ఇంతవరకు మరి ఎక్కడ చూడకపోవడం మరీ విచిత్రం అన్నమాట. ఆ ఫోటో ఇప్పటికీ నా ప్రాణ ప్రదంగా నా దగ్గరే ఉన్నది. అది ఉంటే బాబా నాతో ఉన్నట్లే ఉండేది. ఇక ఆరోజు నుండి ఈ ఫోటో తో మాట్లాడుకోవడం ఆరంభించాను.ఒక ప్రక్క బాబా పారాయణాలు,హారతులు జరుగుతున్న సమయంలో నాకు ఏదైనా సమస్యలు వచ్చినా బాబా సూక్తులు పుస్తకము చూసేవాడిని.అందులో లో బాబా చెప్పిన మాటలు 777 సూక్తులు ఇవ్వబడినాయి. అందులోంచి కళ్ళు మూసుకొని ఒక నెంబరు లేదా పేజీని తాకి నాకు వచ్చిన సమస్యకు పరిష్కార సమాధానము ఖచ్చితంగా వచ్చేది నాకు ఎంతో ఆశ్చర్యం వేసేది. దానిని స్వయంగా బాబా ఆజ్ఞ అని భావించి ఆయన చూపించిన సమాధాన సూక్తిని అనుసరించేవాడిని. పాటించేవాడిని. ఆచరించేవాడిని. ఇప్పటిదాకా బాబా ఆజ్ఞలన్నియు ఈ పుస్తకం ద్వారా నాకు వచ్చేవి. ఇప్పటికి కూడా వాటిని పాటిస్తున్నాను.

గమనిక: బాబా వారు దేవుడా? దెయ్యమా? గురువా? లేదా జ్ఞాని? అజ్ఞాని? హిందువు? ముస్లిం? అనే చెత్త విషయాలు పక్కన పెట్టి సర్వమత సమ్మేళనం కోసం పాటుపడిన సిద్ధ మహాత్ముడు అని గుర్తించండి.ఎన్నో సం!!రాలుపాటు సిద్ద యోగ మార్గంలో సాధన చేసి ఎన్నో రకాల యోగమాయలను దాటుకుని పరిణతి చెందిన పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అని గుర్తించి…. మన కళ్ళముందు జీవించి మరణించిన నడయాడే పరమాత్ముడని గ్రహించి ఆరాధించండి. మీకు కావలసిన యోగము లేదా భోగము ఆయనే అందిస్తాడని విశ్వాసంతో విశ్వసించి విశ్వ ఆరాధన చేయండి.

సమాధానాలు చెప్పే బాబా పుస్తకము

కొన్ని రోజుల తర్వాత ఆనంద వదనంతో ఆరోగ్యంగా ఎంతో ఉత్సాహంతో నా దగ్గరికి జిఙ్ఞాసి వచ్చినాడు. ఈసారి మనస్సులో గురువుకు సంబంధించిన ప్రశ్నలు పెట్టుకొని బాబా ప్రశ్న జవాబు పుస్తకం ఇచ్చే సమాధానాలు చూడటానికి వచ్చినాడు.

1. సాధనకి గురువు అవసరమా? అనే ప్రశ్న అడగగా బాబా పుస్తకము జవాబుగా “గురువు సహాయము లేనిదే ఎవరికి కానీ ఆత్మసాక్షాత్కారము పొందుట చాలా కష్టం” అని వచ్చింది.

2. సాధనకు గురు మంత్రో పదేశం అవసరమా? అన్నప్పుడు బాబా పుస్తకము జవాబుగా “ఉపదేశాలు కొరకు, మంత్ర యంత్రాల కొరకు, ప్రయత్నాలు చేయకు! మీ ఆలోచనలో నన్ను గుర్తించు” ( నెం.83) అని వచ్చింది .

3. బాబా మీకు గురువులు ఏదైనా మంత్రోపదేశం చేశారా? అన్నప్పుడు బాబా పుస్తక జవాబుగా “నా గురువు చాలా గొప్ప యోగి. దయామయుడు. ఆయనకు చాలా కాలం సేవించినను నాకు ఎటువంటి మంత్రం ఉపదేశించలేదు!”( నెం.275) అని వచ్చినది.

4. బాబా నాకు మీరు ఏదైనా మంత్రోపదేశం ఇస్తారా? అని అడగగా బాబా పుస్తక జవాబుగా “నేను చెవిలో మంత్రాలు ఉపదేశించను! నా పద్ధతి వేరు! ( నెం.406) అని వచ్చింది.

5. బాబా! గురు సేవ చేయడం అవసరమా? అన్నప్పుడు జవాబుగా “నిజమైన సాధువు పాదాల మీద పడితే… మీరు చేసిన పాపాలు తప్పక తొలగిపోతాయి! ( నెం.535) అని వచ్చినది.

6. బాబా!మరి నిజ గురువు అంటే ఎవరు? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “నీవు నన్ను సరిగా గుర్తించడం లేదు! కానీ నేను నిన్ను గుర్తించి మీ గురించే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను! ( నెం.757) అని వచ్చింది.

7. బాబా! మరి నకిలీ గురువు అంటే ఎవరు? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “ఎవరు ఎక్కువగా మాట్లాడుతూ తమ గొప్పతనాన్ని చాటుకునే కపట గురువులు ఈ మధ్య చాలామంది తయారు అయ్యారు” ( నెం.194) అని సమాధానం వచ్చింది.

8. బాబా! నిజ గురువు తన శిష్యులు నుండి ఏమి ఆశిస్తాడు? అని అన్నప్పుడు దానికి జవాబుగా “నా గురువు నా నుంచి నమ్మకము, శ్రద్ధ తప్ప ఇంకేమీ ఆశించలేదు! ( నెం.470) అని వచ్చింది.

9. బాబా! ఆత్మసాక్షాత్కారం పొందటానికి ఏమి చేయాలి? అని ప్రశ్నించినప్పుడు జవాబుగా “బ్రహ్మ సాక్షాత్కారం కొరకు ఐదింటిని వదిలివేయాలి! అవి పంచ ప్రాణాలు,పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి,అహంకారం” ( నెం.145) అని వచ్చింది.

10. బాబా! మీరు ఎందుకు అవతరించారు అని ప్రశ్నించినప్పుడు 840 సంఖ్య కోరుకొని చూడగానే దానిలో “మంచి వారిని కాపాడుతూ చెడ్డ వారిని మారుస్తూ ధర్మాన్ని నిలకడగా ఉంచటం దేవుడు నాకు అప్పగించిన పని” అని వచ్చింది.

11. బాబా! మీరు దేవుడా లేదా గురువా? అని ప్రశ్నించినప్పుడు 366 కోరుకుని చూడగానే “మీరంతా నన్ను దేవుడిగా పూజిస్తున్న నేను మాత్రం దేవుడిని సేవిస్తాను! ఆయనను నేనెప్పుడూ మరువను” అని వచ్చింది.

12. బాబా! అ మా ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు? అని ప్రశ్నించి మనస్సులో 377 నెంబరు అనుకుని పుస్తకంలో చూడగా దానిలో “అతడు పరిణతి చెందిన భక్తుడు! నువ్వు ఇంకా అంత పరిపక్వత చెందిన లేదు” అని వచ్చినది.

13. బాబా! నేనెందుకు పరిణతి చెందిన లేదని ఆవేదనతో జిఙ్ఞాసి ప్రశ్నించి 556 నెంబర్ పుస్తకంలో చూడగా “మీ తెలివితేటలు మీదనే ఆధారపడి ఉన్నావు! దానితో నీవు తప్పు దారి పట్టినావు! చిన్నధైన పెద్ద విషయమైనా సరైన దారి చూపుటకు గురువు తప్పక అవసరం” అని వచ్చినది.

14. మరి బాబా! నాకు నిజ గురువు దొరుకుతాడా? అని ప్రశ్నించి 72 అనుకొని పుస్తకము తీసి చూడగా “బ్రహ్మ సాక్షాత్కారం పొందుటకు కొన్ని అర్హతలు కావాలి”! అని వచ్చింది దానితో మన వాడికి కోపం వచ్చింది! ఇప్పటి దాకా అన్ని సరైన సమాధానాలు వచ్చినాయి కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు.

నాకు గురువు పొందటానికి అర్హత లేదా ఇంకా ఏమి అర్హతలు కావాలి అని నన్నే ప్రశ్నించాడు. వాడి ముఖం చూసి నేను నవ్వు ఆపుకోలేక పోయాను. వెంటనే వాడు “భయ్యా! ఇక చిట్టచివరి ప్రశ్నను అడుగుతాను! దీనికి బాబా జవాబు ఏమి వస్తుందో చూద్దామని “బాబా! ఇప్పటిదాక మీరు చెప్పిన జవాబుల సమాధానాలు నిజమేనా? అని ప్రశ్నించి 274 అనుకొని ఆ నెంబరు సమాధానం చూడగానే వాడి ముఖం వాడి పోయే సరికి నాకు నవ్వు ఆగలేదు. ఇంతకీ వాడికి వచ్చిన సమాధానం ఏమిటంటే “ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు” అని వచ్చింది! నాకైతే నవ్వు ఆగటంలేదు. వాడి ముఖంలో రంగులు మారడం ఆగలేదు. దానితో మేము పుస్తకం ద్వారా బాబాని విసిగించడం మానివేసి పుస్తకం మూసి వేసి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినటానికి బయటికి వెళ్ళాము.

గమనిక:ఇవన్నియు కూడా అక్షర సత్యాలే! అమ్ముల సాంబశివరావు గారు రాసిన “శ్రీ షిరిడి సాయి సూక్తులు” చిన్నపాటి పుస్తకములో సుమారుగా 888 దాకా బాబా సూక్తులు ఉన్నాయి.వాటిని మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా అర్థము కానీ స్థితి వచ్చినప్పుడు మనస్సులో ప్రశ్న అనుకొని మనస్సుకు తోచిన నెంబర్లు అనగా 1 నుండి 888 మధ్యలో ఒక నెంబర్ అనుకొని మీ పుస్తకంలో ఆ నెంబర్ ఎదురుగా ఉన్న సమాధానం బాబా వారి జవాబుగా భావించుకోవాలి. ఇలానే పైన అడిగిన ప్రశ్నలకు బాబా పుస్తకం సమాధానాలు అలాగే మేము కోరుకున్న ప్రశ్న నెంబర్ కూడా ప్రక్కనే వ్రాసినాను. కావాలంటే మీరు కూడా ఈ మహత్తర పుస్తకం కొనుక్కుని మీ ప్రశ్నలకి బాబా జవాబులు గా సరైన సమాధానాలు వస్తున్నాయో లేదో ఎలాంటి అనుమానాలు, సందేహాలు లేకుండా పరీక్షించుకోండి. తెలియని ఆనందాలు పొందండి. భౌతిక బాబా వారిగా చిరు పుస్తకం ఉంటుందని నా స్వానుభవాలు చెబుతున్నాయి. అన్నీ కూడా అక్షరసత్యాలే అవుతాయి. అందులో ఎలాంటి ఢోకా లేదు! ఎన్నో సంవత్సరాల నుండి సుమారుగా 1993 సంవత్సరం నుండి ఇప్పటిదాకా 2019 నాకు వచ్చిన ఎన్నో సమస్యలకు ఈ బాబా పుస్తకమే ఎన్నో సలహాలు, సూచనలు, సలహాలు, ఓదార్పులు, తిట్లు సమాధాన జవాబులుగా ఇచ్చినది. ఏమి వచ్చిన బాబా ఆజ్ఞగా భావించుకుని వాటిని చేసేవాడిని. భావించేవాడిని.ఎదురుచూసే వాడిని. ఆనందపడే వాడిని. బాధపడే వాడిని అన్నమాట.

షిరిడి కి పారిపోవడం

ఇంటికి దూరంగా ఉన్నత చదువుల కోసం మళ్లీ నేను మరో ఊరికి వెళ్లడం జరిగింది. అలాగే జిఙ్ఞాసి కూడా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళినాడు అని మీకు తెలుసు కదా. ఒంటరిగా తిరిగి నేను నా గదిలో సాయిబాబా చరిత్ర పారాయణం చేయడం ఆరంభించాను. బాబా పూజలు చేయటం, బాబా హారతులు ఇవ్వటం, బాబా గ్రంథం పారాయణం చేయడం నా నిజజీవితంలో నిత్యకృత్యమైంది. కేవలం నిజ భౌతిక గురువు చూపించమని ప్రార్థించే వాడిని. బాబా పూజలు అరగంట తో మొదలై 24 గంటలు సాగేవి. తిండి తిప్పలు అలాగే చదువులు అటకెక్కినవి. ఇంగ్లీషు చదువులు. పైగా అవి అప్పటిదాకా తెలుగు చదువులు చదివిన నాకు తెలియని ఇంగ్లీష్ చదువులో పడవేసినారు. దాంతో ఈ చదువు అర్థం కాక కాలేజీకి వెళ్లకపోవడం… గదిలో కూర్చుని ఒంటరిగా బాబా పూజలు చేయడం తప్ప మరే విషయం పట్టేది కాదు. దాంతో నాకు రాను రాను బాబా మీద భక్తి పిచ్చి ఎక్కువ అయినది. బాబా వచ్చి భోజనం చేసినాడని మనో భ్రాంతికి లోనయ్యేవాడిని. దాంతో నాకు ఏ పదార్థం రుచించేది కాదు .నాలో నేను గురువు కోసం మధన పడేవాడిని. పిచ్చి వాడిగా మారిపోయాను. ఏదో తెలియని అతి తీవ్రమైన మానసిక ఒత్తిడిలోనికి నాకు తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకరోజు పరీక్షలు దగ్గరికి వచ్చాయని తీవ్రమైన మనోవేదనకు గురికావటం, బాబా భక్తి పిచ్చి బాగా ముదిరిపోవడం నిజగురు కోసం ఆయన దగ్గరికి వెళ్లి తేల్చుకోవాలి అని ఏదో తెలియని ఉన్మాద స్థితిలోకి వెళ్లి…. ఎవరికీ చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోతున్నాను అని కూడా తెలియని స్థితిలో… షిరిడి ఎక్కడ ఉందో కూడా తెలియని స్థితిలో… అందరినీ అడుగుతూ చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులతో షిరిడి కి చేరుకోవడం జరిగినది.

షిరిడీలో బాబా వారి విగ్రహ మూర్తి ని చూడగానే కన్నీళ్లు వచ్చినాయి. సరైన నిజ గురువు చూపించమని అడగడం తప్ప ఏమీ చేయలేదు. ఇక్కడ చాలామందికి ఒక చిన్న ధర్మసందేహము రావచ్చును! అది ఏమిటంటే బాబాయే సద్గురువు అయినపుడు వారిని మరో గురువుని చూపించమని అడగటము దేనికి అన్నపుడు దీనికి సమాధానముగా బాబా గారు గురువే! కాని ప్రస్తుతము మనమధ్య భౌతికముగా లేరు గదా!ఏదైన సాధనలో సందేహాలు లేదా సమస్యలు వస్తే నిజభౌతిక గురువు దగ్గర ఉంటే...మనకి ఆధ్యాత్మిక సమస్యలు ఉండవు గదా!సాధకుడికి నిజ భౌతిక గురువు అనుగ్రహము తప్పనిసరిగా ఉండాలి!పొందాలి! అందుకు నేను అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకొని బాబా సన్నిధానంలో ఉండిపోవాలని అనుకుంటూ ఉండగా….

ఒక బిక్షగాడు నా దగ్గరికి వచ్చి దక్షిణ ఇవ్వమని అడిగారు. నా దగ్గర ఉన్న చిల్లర వాడికి వేసినాను. వాడు నా వైపు చిరునవ్వు నవ్వి నా ముందే పాలకోవా బిళ్లలను కొని అక్కడ ఆకలితోఉన్న ఒక నల్ల కుక్క కి ఆనందంగా పెడుతూ ఉండేసరికి… ఎందుకో నాకు వెంటనే శిరిడి సాయిబాబా మహత్యం సినిమాలోని బాబా వారు ఇలాగే ఒక కుక్కకు గోధుమ రొట్టెలు తినిపించే దృశ్యం నాకు స్పురణ రాగా ఆ బిక్షగాడు అలాగే ఆ కుక్క నాకు కనిపించలేదు. షిరిడీ పురవీధులు తిరిగాను.ఎక్కడ కనిపించలేదు. కొంతసేపు ఆ బిక్షగాడు బాబా అనుకునేసరికి నా ఆలోచన నిజమని చెప్పటానికి సూచనగా బాబా మందిరంలో హారతి ప్రారంభమైనది. అంటే బాబా స్వయంగా నన్ను చూడటానికి నా దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారని తెలియగానే ఏదో తెలియని వింత అనుభూతి కలిగింది.

మూడు రోజుల తర్వాత షిరిడిలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి బాబా ఫోటో మరియు సూక్తి ఉన్న పేజీని ఇచ్చి మౌనంగా వెళ్లిపోయినాడు. నేను ఆ వ్యక్తిని గమనించలేదు. కానీ బాబా ఫోటో కింద ఉన్న సూక్తి మంజరి ఏదో నన్ను బాగా ఆకర్షించినది. అది ఏమిటంటే అది చదవగానే నాలో ఏడుపు మొదలైనది. నేను ఏమో బాబా సన్నిధిలో ఉంటామని అనుకుంటే ఆయనేమో తల్లిదండ్రుల సన్నిధికి తిరిగి వెనక్కి వెళ్ళమని ఆ సూక్తి మంజరి ద్వారా నాకు అర్థంఅయినది. అప్పుడు నా చేతిలో పూర్తిగా డబ్బులు ఖర్చయిపోయాయి. గుడి పరిసరాలలో పడుకుంటూ… ద్వారకామాయిలో ధ్యానం చేసుకుంటూ… అన్నదాన సత్రంలో ఉచిత భోజనం చేస్తూ 11 రోజులు గడిపాను. ఇక అక్కడ ఉండలేని స్థితి.బాబా వారి కోప ఆవేశానికి గురికాకూడదని అనుకున్న సమయంలో ఒక వ్యక్తి ద్వారా మా ఇంటికి చేరుకోవడం జరిగినది. ఆ వ్యక్తి పేరు సాయిబాబా కావడం విశేషం. విచిత్రము ఏమిటంటే ఈ వ్యక్తియే నా రాబోవు కాలములో నిజభౌతిక గురువుగా విచిత్ర వేదాంతి పేరుతో వస్తారని ఆనాడు నేను గ్రహించలేకపోయినాను!బాబావారు ఇతనే నీకు రాబోవు కాలములో నీవు అడిగిన భౌతికగురువు అవుతాడని...నన్ను ఇతనితో ఈవిధంగా కలిపినారని నాకు అపుడు తెలియదు!ఇతను ఏవరో గాదు!నాకు జాతకము చెప్పిన వ్యక్తి అలాగే చింతామణి దుర్గాదేవి దర్శనానికి ప్రయత్నించిన వ్యక్తి ఈయనే అన్నమాట! ఇంటిలో మా అమ్మ నాకోసం దాదాపుగా 18 రోజుల నుంచి తిండి నిద్రాహారాలు మాని వేసి అఖండ ఉపవాస దీక్షకు కూర్చున్నది. ఇది తెలిసి బాబా నన్నెందుకు వెనక్కి వెళ్లిపొమ్మని తన సూక్తి మంజరి ద్వారా చెప్పినారో అర్థం అయినది. కానీ నా నిజ గురు దర్శనం కోసం పడే తపన నన్ను ఏ శక్తి ఆపలేకపోయింది. బాబా మీద నమ్మకం ఉంచుకొని తిరిగి మళ్ళీ వారి చరిత్ర పారాయణం చేయడం ఆపలేదు. కొత్తగా వచ్చిన విగ్రహాలను పూజించడం ఆపలేదు.గురువు కోసం తపించడం ఆగలేదు. మరి నాకు నిజ గురువు దొరికారో లేదా తెలియాలని ఉందా?

గమనిక:బాబా విషయములో ఇప్పటికి నాకు ఒక లోటు ఉన్నది! అది ఏమిటంటే బాబా వారి నిజ సమాధిని చూడలేదని,తాకలేదని,నమస్కారము చేయలేకపోయిననే బాధ మిగిలిపోయింది! ఇపుడు మనము షిరిడిలో చూస్తున్న సమాధి నిజమైన బాబా సమాధి యొక్క రక్షణకవచము మాత్రమే!అసలు సమాధి క్రింద అంతస్తులో భధ్రముగా ఉన్నదని చాలామందికి తెలియదు!దానిని ఒక నిత్యపూజారి మాత్రమే రోజూకి ఒకసారి వెళ్ళి పూజ చేసి వస్తారని తెలుసుకున్నాను!మీ కోసం నిజబాబాసమాధి ఫోటో పెడుతున్నాను!కనీసము దీనిని చూసైనా తృప్తి చెందుతాము!

నిదర్శనం… నీదర్శనం

నేను ఒక రోజు నా దగ్గర ఉన్న చిన్నపాటి బాబా విగ్రహాలను అలాగే బాబా పాదాలను, హారతి సామానులను కడుగుతూ “బాబా! నువ్వు సమాధి చెంది 90 సంవత్సరాలు కావస్తుంది. నా సమాధినుండి నా మానుష శరీరం మాట్లాడుతుందని అలానే ఈ భౌతిక దేహానంతరము నేను ప్రమత్తుడనే అని నీ ఏకాదశ సూత్రాలలో చెప్పినావు. నిజానికి అవి నిజమేనా? అది నిజమైతే మీ నుండి నాకు నీవు ఎప్పటికీ మానుష శరీరంలోఎప్పటికీ జీవించే ఉన్నావని నిదర్శనం కావాలి అనుకున్నాను. ఇక్కడే ఒక గమ్మత్తు విషయము జరిగినది. బాబా! నేను నీ దర్శనం కావాలని అడిగానని నేను అనుకున్నాను కానీ అది కాస్తా నిదర్శనము అనగా నాకు నువ్వు ఉన్నావని సాక్ష్యం కావాలి అని భావం గా మారిపోయింది. నీ అనే అక్షరం కొమ్ము లేకపోవటం నిదర్శనం. నీదర్శనం లో నీదర్శనం కాస్త నిదర్శనంగా మారిపోయిన విషయం కూడా నేను గమనించలేదు. ఏదో మేము పూజించే బాబా విగ్రహానికి చెప్పానా లేదా అనే కానీ ఏమి చెప్పాను నా భావం ఎలా మారిందో తెలుసుకోలేకపోయాను. నీ దర్శనం అంటే బాబా వారి నిజరూప దర్శనం అలాగే నిదర్శనం అంటే సాక్ష్యం! ఈ కొమ్ము నా జీవితంలో తట్టుకోలేని బాధాకరమైన సంఘటనకు నాంది అయినది. అది ఏంటో చూడండి.

ఒక బుధవారం రాత్రి నా కలలో ఒక భిక్షధారి బాబా అవతారి గా ఉన్న స్వప్న శరీరధారి కనిపించి “రేపు నేను మీ ఇంటికి ఆతిథ్యము కోసం వస్తున్నాను” అని ఎవరో నాతో చెప్పినట్లు కల వచ్చింది.ఎవరో నా గది నుండి నుండి బయటకు వెళుతూ అలికిడి వినిపించేసరికి నాకు మెలుకువ వచ్చింది. ఇది కల లేదా భ్రాంతియా లేదా నిజములాంటి కల అని ఆలోచన వచ్చేసరికి నాలో నిద్రాదేవత వెళ్ళిపోయింది. రేపు గురువారం కదా. ఒకవేళ బాబా స్వయంగా వస్తారేమో అనుకొని ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉన్నాను. నేను అడిగిన వరమును బాబా వారు ఇంత త్వరగా నెరవేరుస్తారని ఊహించలేదు. నా ఆనందానికి అవధులు లేవు. వామ్మో! రేపు నేను బాబా వారి నిజరూప దర్శనం చూస్తాను. ఈ చిన్నపాటి భక్తుడి కోరిక తీర్చడానికి బాబా వారే స్వయంగా షిరిడి నుండి నా దగ్గరికి వస్తున్నారా? వామ్మో! ఏమి చేయాలి? ఆయనకి ఏమి వండి పెట్టాలి? ఏమి కావాలి? అమ్మకి వెంటనే చెప్పాను. ఆయన భోజనానికి అన్ని రకాలు పదార్ధాలతో ఏర్పాట్లు చేయమని చెప్పాను.వెంటనే అమ్మ "ఒరేయ్ చిన్నోడా! ప్రతి గురువారం మన ఇంటికి భోజనానికి కానీ అల్పాహారమునకు కానీ జనాలు వస్తారు కదా. నువ్వు వారిని బాబాగారి అంశగా భావించి వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తావు కదా. చివరికి నీ పిచ్చి వలన పొరపాటున గురువారం రోజున ఏదైనా పాము గాని తేలు గాని ఎలుకలు గాని పిల్లులు గాని బల్లులు గాని కుక్కలు గాని పక్షులు గాని కొత్తగా కనబడితేచాలు! ఈ గురువారం బాబా వారు ఈ రూపంలో వచ్చినారని ఆ రూపంలో వచ్చినారని నన్ను అలాగే నీ యోగ మిత్రుడైన జిఙ్ఞాసిని కూడా చావకొడతావు కదరా”! అనగానే “అమ్మా! ఇన్నాళ్లు బాబా వారు మారు రూపాల్లో ఇంటికి వచ్చినారు. ఇప్పుడు నిజరూపంతో ఆయనే స్వయంగా మన ఇంటికి ఆతిథ్యంకు వస్తున్నానని నాకు రాత్రి కలలో కనిపించి చెప్పినారు. అది ఎప్పుడు ఇల గాను లీల గాను మారుతుందో ఎదురుచూస్తున్నాను రాజమాత” అని అనగానే “ఒరేయ్! నీ పిచ్చి గాని ఎప్పుడో సమాధి చెందిన మీ బాబా వారు ఇప్పుడు వారు స్వస్వరూపంగా మన ఇంటికి వస్తారా? అది నేను నమ్మాలా. నీకు బాగా బాబా పిచ్చి ముదిరి పోయింది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నీ పిచ్చి వల్ల బాబా నువ్వే పరీక్ష రాయి అని చెప్పి తప్పించుకోకు. ఇప్పటికే నీ వలన మేము పొందిన అవమానాలు చాలు! నీ భక్తి పిచ్చి వలన నువ్వు ఎక్కడ మాకు దక్కకుండా పోతావేమోనని భయంగా ఉంది రా” అనగానే నవ్వేసి మౌనముగా అక్కడినుండి వెళ్ళిపోయాను. బాబా వారి రాక కోసం ఎదురు చూపులతో శివయ్య కు మహా నైవేద్యం పెట్టడానికి గుడిలోనికి వెళ్ళినాను. బాబా వారి విషయమే ఆ కొద్ది క్షణాలపాటు మరిచిపోయి శివయ్య మీద ఏకాగ్రత పెట్టినాను. అదే నా కొంప ముంచుతుంది అని నేను అనుకోలేదు.

మా ఇంటి ముందు బాబా గారి వేషధారి

నేను మహా నైవేద్యం తో గుడి లోనికి వెళ్లగానే వెంటనే మా ఇంటి ముందు బాబా గారి వేషధారి వచ్చి “అమ్మ! బాబా వచ్చాడు! బిక్ష పెట్టు” అన్నాడట.దానికి అమ్మ వెంటనే లోపల నుండి “వస్తున్నాను! బాబు కొంచెం సేపు ఆగు” అని చెప్పినది. కొన్ని క్షణాల తర్వాత మా అమ్మ ఆరోజు చేసిన గోధుమ చపాతీలు,పెరుగు పచ్చడి,హల్వా తీసుకొని ఎవరు వచ్చారు? ఎలా వచ్చారు? ఎలా ఉన్నారు? అని కనీసం తలెత్తి చూడకుండా ఆయన పాత్రలో అన్ని పెట్టి వెళ్ళిపోతుంటే “అమ్మా! నేను వచ్చానని, నేను ఉన్నానని, ఈ బిక్ష అందుకు నిదర్శనమని మీ వాడికి చెప్పు! అల్లా మాలిక్ అంటూ వెళ్లిపోయినాడు. ఇంతలో నేను మహా నైవేద్యం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి అమాయకంగా బాబా వారి కోసం ఆరుబయట కూర్చొని ఎదురుచూస్తున్నాను. ఇంకా రాలేదు బాబా వారు. ఎప్పుడు వస్తారు? ఒకవేళ వస్తే నేను మొదట ఏమి చేయాలి ?తాకాలా? పాదాలకి నమస్కారము చేయాలా? దండం పెట్టాలా?పాద సేవ చేయాలా? ఏమి చేయాలి? ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఎదురుచూస్తుంటే ఇంతలో అమ్మ బయటకు వచ్చి “అవును రా! ఇందాక ఒక వ్యక్తి బిక్షకు వచ్చినాడు! నేను అతనిని సరిగ్గా చూడలేదు. కానీ నీకు నేను వచ్చానని ఏదో కలలో నీ దర్శనం ద్వారా నిదర్శనం అయినదని నాకు అర్థం కాని తెలుగులో మాట్లాడి వెళ్లిపోయినాడు. ఆయనే మీ బాబా వారేమో ఆలోచించు” అని చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పిన మాటలను డీకోడ్ చేసి అర్థం చేసుకోవటానికి నాకు అరగంట పైనే సమయం పట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటో తెలిసేసరికి నా గుండె ఆగినంత పని అయింది. నేను బాబా వారిని నీ దర్శనం కావాలి అని అడిగానని అనుకొని నిదర్శనం కావాలి అన్నాను అని నాకు అర్థమయ్యే సరికి నా మతి పోయింది. ఒక చిన్న కొమ్ము నా బ్రతుకు ఇంతగా నాశనం చేస్తుందని అని అనుకోలేదు నాకు ఏడుపే తక్కువ. నాకు బాబా మీద కోపం రాలేదు. కలలో కనిపించి ఆయన దర్శనం ఇచ్చారు. ఇలలో నాకు కనిపించకుండా అమ్మకి కనిపించి నేను ఉన్నానని నిదర్శనం ఇచ్చినారు. దాంతో నామీద నాకే కోపం వచ్చింది. వచ్చిన మహత్తరమైన అవకాశాన్ని చేజేతులారా నేనే పోగొట్టుకున్నాను గదా అని వస్తున్న ఏడుపును ఆపటం నా వల్ల కాలేదు. ఏం చేద్దాం? ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అదే జరుగుతుంది కదా. నా ధ్యాన అనుభవం రాస్తుంటే మళ్ళీ నాకు నాలో తెలియని ఏడుపు బయటకు తన్నుకు వస్తున్నది దాన్ని ఆపటం నావల్ల కాలేదు. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇది రాయటం ఆపి వచ్చే కన్నీటిధారను ఆపకుండా ఏడుస్తూ ఉంటాను.

గమనిక: ఇది నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన. ఆనందం బాధలతో కూడిన దైవ అనుభవం. బాబా వారిని కనీసం నేను చూడలేకపోయాను అనే ఏడుపుతో ఉంటే పక్కింటి కుర్రాడు వచ్చి “అన్నా! మీకు ఒకటి చూపించన. మీ ఇంటికి బాబా లాగ వేషం వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వెళ్తుంటే నేను మేడ మీద నుండి ఈ ఫోటోలు తీసినాను. చూడు! నువ్వు ఆయనను చూడలేదుగా. ఈ ఫోటో చూడు అంటూ సెల్లో ఉన్న ఫోటోలు వరుసగా చూపించసాగాడు! కాకపోతే వాడు చిన్న వాడు కావడం వలన అన్ని ఫోటోలు కూడా ఆయనను దాదాపుగా వెనక నుండి తీసినాడు. వస్త్రధారణ చూస్తే… నడిచే విధానం చూస్తే… బాబా వారి లాగానే ఉన్నాయి. ఆ ఫోటోలు చూడగానే నాలో మళ్లీ ఏడుపు ఆరంభమైనది. నా ఏడుపును చూసి ఆ పిల్లవాడు సెల్ తీసుకోకుండా నేను ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాక వెళ్లిపోయినాడు. అలాగే ఒకటి ఖచ్చితంగా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు భోగంలో ఉంటే భోగ పరమైన కోరికలు అడుగుతూ ఖచ్చితంగా మీకు కావలసిన కోరికను మీరు అడుగుతున్నారు లేదో ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించుకొని గాని నిర్ణయించుకొని గాని మీ దైవాలను అడగండి. మనసులో ఒక భావం ఉండి బయటకి మరో లాగా వస్తే అది జరిగిన తర్వాత మీకు కావలసినది జరగక…. జరిగినది మీకు నచ్చక… అందరూ బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త! ఇక ఒకవేళ మీరు యోగములో ఉంటే మాత్రమే మీ ఇష్టదైవాలను లేదా మీ ఇష్ట గురువులను “స్వామి! నాకు శాశ్వతమైన మరణమును ఇచ్చి నాకున్న సకల బంధాలనుండి విముక్తి కలిగించే పరమ ఉత్కృష్టమైన పరమపదసోపానమైన మోక్షప్రాప్తిని” నాకు అనుగ్రహించండి. దానికి కావలసిన గురువులను అనుగ్రహించండి. నేను మోక్షంపొందేట్లు నాకు మోక్ష ప్రాప్తి కలిగేటట్లుగా నన్ను దీవించండి. అనుగ్రహించండి అని మాత్రమే ప్రతినిత్యం వారి ముందు వేడుకోండి. ఈ మీ కోరిక తీరే విధంగా ఆ కోరిక వైపు అడుగులు వేయండి.

మా బాబా సజీవ విగ్రహమూర్తి

మా ఇద్దరి చదువులు అదే నాది అలాగే నా జిఙ్ఞాసి చదువులు పూర్తి అయినాయి. ఉద్యోగాల కోసం మేమిద్దరం ఒక ఊరికి బయలుదేరినాము. నేనేమో చిన్నపాటి ఆఫీసులో చిన్న ఉద్యోగిగా అదే మల్టీమీడియా డెవలపర్గా చేరితే,జిఙ్ఞాసి ఏమో పెద్ద ఆఫీసులో పెద్ద జీతంతో పెద్ద ఉద్యోగం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడినాడు. శని,ఆదివారాలు మాత్రం కలుసుకునే అవకాశాలు మా ఇద్దరికి కలుగుతాయి. అయినా కూడా ఆధ్యాత్మిక చింతన చావలేదు. చితి దాకా అది వీడిపోదని అని నాకు అనిపించింది. మాకు విసుగు లేదు. ఏదో తెలుసుకోవాలని తాపత్రయం. అది ఉన్నదో లేదో అనుభవాలు పొందాలని ఆరాటం తప్ప వేరే ధ్యాస లేదు. వేరే ప్రపంచం లేదు. ఇలాంటి సమయంలో ఒకసారి నాకు రోడ్డు మీద ఆరడుగుల పాలరాయి బాబా విగ్రహం పెట్టుకుని ఎవరో తీసుకొని వెళ్ళడం చూసాను. ఆ విగ్రహం చూస్తుంటే ఎంతో ముద్దు వచ్చినది . ఎంతో సజీవమూర్తిగా ఈ విగ్రహం ఉన్నది కదా! ఏ దేవాలయంలో దీనిని ప్రతిష్ట చేస్తున్నారు అనుకుని ఇలాంటి సజీవ రూపంతో నాకు కూడా ఒక విగ్రహమూర్తి లభిస్తే నేను కూడా నా హృదయదేవాలయంలో దాచుకుని ఆరాధించుకునే వాడిని కదా అని అనుకుంటూ మా మీటింగ్ స్పాట్ అయిన పార్క్ వైపు అనగా అక్కడ మా కోసం ఎదురు చూసే జిఙ్ఞాసిని కలవడానికి వెళ్ళినాను.

నా మొహంలో ఆనంద విషాద ఛాయలు చూసి మా వాడు వెంటనే “భయ్యా! ఏమి అయింది?ఏమి జరిగినది? నీ మొహం ఒక ప్రక్క మోహావేశంతో, మరోపక్క బాధ ఆవేశంతో ఉన్నది” అనగానే రోడ్డుమీద కనపడి కనిపించకుండా వెళ్లిపోయిన బాబా విగ్రహమూర్తి గురించి వాడికి చెప్పాను. వాడు దాంతో “భయ్యా! నీ దృష్టి దాని మీద పడింది అంటే అది ఎంత సజీవమూర్తితో ఉందో నాకు అర్థం అయింది.అది ఎంత డబ్బు అయినా సరే కొందాం పద” అన్నాడు.నేను వెంటనే వాడి తో “నీ బొంద! నీ బూడిద! అది ఆరడుగులు విగ్రహమూర్తి. దాన్ని ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకోవాలి. దేవాలయ ప్రతిష్ట కోసం వెళుతున్న విగ్రహం అది. దానిని నాకు కొని ఇవ్వడం ఏమిటి పిచ్చివాడా” అని నా బాధను మర్చిపోవడానికి లేని నవ్వు బలవంతంగా తెప్పించుకొని నవ్వడం ప్రారంభించాను.కొద్దిసేపటి తర్వాత తేరుకుని మా ఆధ్యాత్మిక పిచ్చిలో ఆ విగ్రహమూర్తి గూర్చి మేము మర్చిపోయాము కానీ బాబా వారు మాత్రం మర్చిపోలేదని అనడానికి నిదర్శనంగా ఒక సంఘటన జరిగినది.

మా పిచ్చాపాటి ఆధ్యాత్మిక విషయాలలో సమయము రాత్రి అయినది అనే విషయం మేము మర్చిపోయాము.ఆకలి కూడా పట్టించుకోలేదు.వారానికి ఒకరోజు దొరికే ఈ మహత్తర సమయములో దీని గురించి ఆలోచించని జ్ఞాన స్థాయికి మా ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటాం. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. సరే ఇంటికి వెళ్లాలని తిరిగి మేమిద్దరం ప్రొద్దున వచ్చిన రోడ్డుమీదకి వచ్చేసరికి నాకు ప్రొద్దున బండిమీద కనిపించిన బాబా సజీవ విగ్రహమూర్తి నా కళ్ళముందు నా మది యందు తచ్చాడటం జరిగినది.నేను మర్చిపోయిన విషయాన్ని బాబా వారు మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని అనిపించి ఇందులో ఏదో పరమార్ధం ఉన్నదని కారణం ఏమి లేనిదే కార్యం జరగదని అనిపించి వెంటనే నా వెంట ఉన్న జిఙ్ఞాసిని వెంటబెట్టుకుని మా ఇంట్లో ఉన్న నా పూజా మందిరం దగ్గరికి వెళ్లి బాబా జవాబులు పుస్తకము తెరచి “బాబా! నువ్వు నాకోసం సజీవ విగ్రహమూర్తిగా వస్తావా? అని ప్రశ్న వేసాను! ఒక నెంబరు 80 కోరుకున్నాను.దానిని బాబా పుస్తకంలో చూడగా “నీ దైవం వచ్చినాడు చూశావా? నీవు జాగ్రత్తగా లేనిచో తప్పించుకుని పారిపోయాడు! జాగ్రత్తగా హృదయంలో బంధించు” అని బాబా సమాధానం చూడగానే నాకు ఒక క్షణం నోట మాట రాలేదు.

నేను ప్రొద్దున బాబా వారి సజీవ విగ్రహమూర్తిని చూసి హృదయ దేవాలయంలో బంధించికోవటానికి నువ్వు రావచ్చు కదా అనుకున్నదానికి ఇప్పుడు బాబా వారు ఇచ్చిన సమాధానంతో పోల్చి చూసుకునేసరికి, అలాగే నా ప్రక్కన ఉన్న జిఙ్ఞాసికి చెప్పేసరికి వాడు కూడా కరెంట్ షాక్ తగిలిన కాకిలాగా మారినాడు. వాడికి కూడా నోట మాట లేదు.కొంతసేపు తర్వాత వాడు తేరుకొని “భయ్యా! భయ్యా! నిజంగానే మనకోసం నీ ఇష్ట రూపంలో సజీవ విగ్రహమూర్తిగా వస్తాడంటావా?ఇంతవరకు ఈయన చెప్పిన సమాధానాలు అక్షర సత్యాలు.జరిగినాయి కదా! ఈ విషయం కూడా ఖచ్చితంగా జరుగుతుంది.జరిగి తీరుతుంది. నీకు ప్రొద్దున ఎంత ఖర్చు పెట్టి అయినా బాబా విగ్రహమూర్తి కొని ఇస్తానని చెప్పాను కదా! మనకి వచ్చే ఈ సజీవ విగ్రహమూర్తి ఖర్చు నాదే భయ్యా. నాదే. నువ్వు ఏమీ మాట్లాడకు.మనకోసం వారు ఖచ్చితంగా వస్తారు! బాబా వస్తారు! వదలవద్దు” గట్టిగా మన హృదయంలో బంధనం చేద్దాం అంటూ “భయ్యా! అవును భయ్యా! నాకు ఒక సందేహం.బాబా వారు వస్తే మనం ఏమి చేయాలి? అని అనుకొని ప్రశ్న వేసుకొని నెంబరు 216 చెప్పి చూడగానే “నీవు ఎప్పుడు నన్నే ధ్యానిస్తూ నా నామస్మరణ చేయుము” అని వచ్చినది! దానిని చూడగానే మావాడు ఎగిరి గంతేసినాడు. “భయ్యా! భయ్యా! మీ కొంప కొల్లేరయింది. మీ ఇల్లు గుడిగా మారటం ఖాయం. నువ్వు పూజారి వృత్తి మానివేసిన ఆ కర్మ వాసన నిన్ను వదిలి పెట్టడం లేదు. ఇప్పటిదాకా శివ పూజారి గా ఉన్న వాడివి కాస్త ఈరోజు బాబా దెబ్బతో బాబా పూజారిగా మారతావు.భయ్యా! జాగ్రత్త” అని నవ్వుతూ చెబుతున్నా వాడి మొహంలో బాబా లీలగా కనిపించేసరికి నాలో ఏదో తెలియని భయము మొదలై “బాబా! నిజంగానే గుడి కట్టాలా? అని ప్రశ్నించాను వెంటనే ఒక నెంబరు 752 అనుకొని చూడగానే దానిని చూసి నేను గతుక్కుమన్నాను ఎందుకంటే బాబా పుస్తక జవాబులో “ నీవు నా మందిరానికి యజమాని అవుతావు” అని చెప్పింది! దానిని చూసి.. వెంటనే “భయ్యా !నీకు వచ్చింది! నువ్వు బాబా గుడికి యజమాని అవుతావట.కొంచెం మాకు కూడా ఆ గుడి లో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వాలి సుమా” అంటూ నవ్వుతూ అనే వాడి మాటలలో సత్యం లేకపోలేదు. నేను బాబా గుడికి యజమాని అవటం ఏమిటి? నా దగ్గరికి సజీవ బాబా విగ్రహమూర్తి రావటానికి ఎదురుచూడటం ఏమిటి? నేను ఏమి అనుకున్నాను? భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అని తెలుసుకునేసరికి నాకు విపరీతమైన తలనొప్పి రావటం ప్రారంభం అయ్యే సరికి బాబా పుస్తకము లోపల పెట్టి మా జిఙ్ఞాసికి టాటా చెప్పి నా గదిలోకి వెళ్లి ఏమీ అర్థం కాని అయోమయం ఆశ్చర్యానందాలు స్థితిలో నిద్ర లోకి జారుకున్నాను.

ఆ తర్వాత మరుసటి రోజు యధావిధిగా ఉద్యోగ విధులలో ఇరుక్కుపోయాను. వారం రోజులు గడిచిపోయాయి.మా ఇద్దరి సభ జరిగే పార్క్ వైపు నా అడుగులు పడినాయి. అక్కడ ఎదురుచూస్తూ నా జిఙ్ఞాసి కూర్చున్నాడు. నన్ను చూడగానే “భయ్యా! ఏమిటి ఎప్పుడు బాబా గుడి కడుతున్నారు. మరి దానికి కావలసిన డబ్బులు బాగా సంపాదించాలి గదా. నువ్వు ఏమో నా అవసరాలకు సరిపడా డబ్బులు ఉంటే చాలు అంటావు. జీతాలు పెరిగే అవకాశాలు పెంచుకోవు. చివరికి గొర్రె తోక బెత్తెడు అన్నట్లు ఆ చిన్నపాటి ఉద్యోగ జీతంతో కాలం గడుపుతున్నావు. ఇప్పుడు బాబా వారేమో గుడి కట్టు అంటున్నారు?మరి ఎలా కడతారు.చందాలు పోగు చేస్తావా? పోగుచేసి వాటితో రామదాసు లాగా గుడి కడతావా? దానికి నేను చాలా ప్రశాంతంగా“ప్రియ మిత్రమా! నువ్వు అనుకొనే గుడిని నేను నా దేహంలోనే బాబా కోసం హృదయ మందిరం కట్టుకుంటాను! ఇది ఎవ్వరికీ కనిపించదు! నాకు మాత్రమే కనిపిస్తుంది. ఆయన అన్నారు కదా నా హృదయంలో బంధించు లేదంటే తప్పించుకుంటాడని అన్నారు కదా. ఇక ఎటూ తప్పించుకోకుండా ఉండటానికి నేను బాబా వారిని నా హృదయ మందిరములో బంధిస్తాను! ఏమంటావు!మిత్రమా! ఇలా కూడా చేయొచ్చు కదా” అనగానే వాడి మొహం చిన్నబోయింది. వెంటనే వాడు “అయినా నువ్వు పెద్ద జీతమిచ్చే ఉద్యోగం కొసం ప్రయత్నిస్తావు అని నాకు అనిపించడం దండగ! మీలాంటి విజ్ఞాన మూర్తికి వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చాలా తెలిసిన మహానుభావుడువు. భయ్యా!మరి మన సజీవ బాబా గారు ఎప్పుడు వస్తారు” అంటావు అని అడగ్గానే నేను వెంటనే “ఎవరికి తెలుసు! ఆయన ఎప్పుడు వస్తారో… ఏ రూపంలో వస్తారో వారికి తప్ప నరమానవుడికి తెలియదు! తెలిస్తే నీలాంటి వ్యక్తులకి నిజ భక్తులకు తెలియాలి! మీరేమో రత్నాలు ఏరుకునే వారు! మేము సముద్రం ఒడ్డున రాళ్లు ఏరుకునే వాళ్ళం” అనగానే వాడు వెంటనే “అందుకే బాబా వారు మన ఇద్దరిలో ఎవరు పరిణతి చెందిన భక్తులు అన్నారు … నువ్వు మర్చిపోయిన నేను మర్చిపోలేదు. రత్నాలు ఎవరు ఏరుకుంటున్నారో… ఎవరు రాళ్లు ఏరుకుంటున్నారో మీకు తెలుసు నాకు తెలుసు బాబా కి తెలుసు. కొత్తగా కోతలు కొయ్యకు నాకు” అంటూ “భయ్యా ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది! బయటికి వెళ్లి బిర్యాని తిని ఏదైనా సినిమాకి వెళ్దాము” అనగానే ఒక తండ్రిని తన పిల్లవాడు అడిగినట్లు వీడు నన్ను అలా అడిగేసరికి నవ్వు ఆపుకోలేక సరే అన్నాను. మా ఇద్దరికీ ఏదైనా అర్థం కాని సమస్య వస్తే లేదా ఏదైనా అద్భుత సంఘటన జరిగే సూచనలు వస్తే బిర్యానీ, కూల్ డ్రింక్లు, మిరపకాయ బజ్జీలు ఏదైనా స్వీట్లు, మసాలా ఒకే రోజు వీటిని అన్నింటినీ తిని సినిమా చూసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోవటం అలవాటు. ఇలా ఎంజాయ్ చేసి ఒక సంవత్సరం పైన అయినదని వాడి మాటలలో నాకు గుర్తుకు వచ్చింది.

ఆ తర్వాత ఏముంది. బాస్ తో తిట్లు మాకు. మా జీవితంలో జీతంలో రోజులు డబ్బులు కటింగ్. ఇలా మరో మూడు నెలల పాటు గడిచిపోయినవి. ఒకరోజు మేము పార్కులో ఉండగా… వస్తాను అని చెప్పిన బాబా ఆచూకీ లేదు! అని మేమిద్దరం అనుకుంటూ ఉండగా…. అక్కడ ఏదో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ మేళా జరుగుతుందని ఎనౌన్స్ మెంట్ మాకు వినబడింది. ఇద్దరి నోటి నుండి ఒకేసారి ఏకకాలంలో దీనికి వెళ్దామా అనేసరికి ఏదో శుభం జరుగుతుందని నాకు శకున సూచన వచ్చినది. ఏమి జరుగుతుందోనని అనుకుంటూ ఎప్పుడూ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ కి వెళ్ళని నేను ఎందుకు ఈరోజు వెళుతున్నానని… కారణం లేనిదే కార్యం జరగదని అనుకుంటూ మా వాడితో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ బయలుదేరినాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకున్నాను. సుమారుగా అక్కడ 900 పైగా స్టాల్స్ ఉన్నాయి. వాటిని పూర్తిగా చూడాలంటే కనీసం ఎంత లేదన్నా మూడు రోజులు పైగా పడుతుంది. ఎక్కువశాతం బట్టలు షాపులు,చెక్క సామానుల షాపులు ఉన్నాయి. అన్ని షాపులు అవే కనబడుతున్నాయి. సరే ఒక చోట ఆగి అక్కడ నూనెలో కర కర వేయిస్తున్న మిరపకాయ బజ్జీలు చూడగానే మా ఇద్దరి నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటే షాపు వైపు వెళ్లి కావాల్సిన వాటిని తిని చేతులు కడుక్కుంటూ ఉండగా మా ఇద్దరి చూపు ఎదురుగా ఉన్న షాప్ వైపు పడినది. ఎందుకంటే అక్కడ ఆరుబయట బల్లమీద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన మట్టి బొమ్మలు, దేవతా విగ్రహాలు కనిపించేసరికి మేము గతుక్కుమన్నాము.

ఇలాంటి సమయములో మా నాన్న మీద త్రిపుర దేవి తన కామమాయ చూపించడం మొదలు పెట్టినది అనగా మా ఇంటికి పనిమనిషి తో మాటలు, చూపులు కలిశాయి! అప్పుడు మా అమ్మ దృష్టికి ఈ విషయం వచ్చినది కానీ అప్పటిదాకా మా నాన్న ఎలాంటి తప్పూ చేయలేదు. ఏకపత్నీ ధర్మమును పాటిస్తూనే ఉన్నాడు కానీ మా అమ్మకి అనుమానాలు మొదలై అది చిలికిచిలికి గాలివానైంది. ఇది చిలికి గాలివాన సంసారసుఖమును దూరం చేశాయి. ఇదే గదా త్రిపురమాయకి గావాలసినది! మాయ దానికి కావాల్సిన పరిస్థితులు వీరిద్దరి మధ్య ఏర్పరచింది! మా నాన్న ఎంత మొత్తుకున్నా మా అమ్మ పట్టించుకునే స్థితిలో లేదు! మా అయ్యను అనుమానించే సరికి ఈయన చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా…. ఇంకా కామవాంఛ తట్టుకోలేని స్థితికి ఆయన పూర్తిగా చేరుకునే సరికి… ఆ పనిమనిషి మా నాన్న కి దగ్గర అయింది. దానితో ఎన్నో సంవత్సరాల పాటు పాటిస్తూ వస్తున్న ఏకపత్నీ ధర్మమునకు తిలోదకాలు ఇచ్చి… ఆమెతో సహజీవనం చేస్తూ … మగ పిల్లవాడిని కనే స్థాయికి వెళ్లిపోయినాడు! మా అమ్మను వంట మనిషిని చేసినాడు! ఆమెను లోకానికి భయపడి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తు ఇంటి మనిషి చేసుకున్నాడు! రెండు సంసారాల మధ్య, బంధుమిత్రుల అవమానాల మధ్య నలిగిపోతూ మంత్రసాధనకి తనకి తెలియకుండానే దూరమవుతూ…. అన్నీ చేసేవాడు పై వాడే… నేను చేయటంలేదు… చేసేది వాడే ,చేయించేది వాడే, అనుభవింప చేసేది వాడే ,ఆనంద పడేది వాడే, బాధపడేది వాడే, వేధించేది వాడే అనుకుంటూ శబ్ధపాండిత్యము నుండి మెట్టవేదాంతం వైపు అడుగులు వేస్తున్నాడు! అన్ని వాడే చేస్తే మరి నిన్ను ఎందుకు సృష్టించాడు? మరి ఎందుకు ఈ రెండు సంసారాల మాయను ఆయన కల్పించాడు అని మనోవిశ్లేషణ చేసుకుని వుంటే కథ మరోలా ఉండేది! అంత సమయము మా అయ్యకి ఎక్కడ ఉంది! ఆమె ఒక క్షణం కనిపించకపోతే...ప్రాణము పోయేటట్లుగా విలవిలాడి పోయేవాడు!విపరీతమైన కోపావేశాలు కలిగి కానిదానికి అందరిని ఎదో రకముగా తిడుతూ ఆమె మీద కోపమును అందరి మీద చూపిస్తూ తన మాటలతో...తన చేష్టలతో నరకము చూపించేవాడు!ఆమె కనపడిన మరుక్షణము మాములుగా ప్రేమికుడిగా మారిపోయేవాడు! మునిమనవళ్ళున్న గూడ మా ముసలాడికి ఆమె మీద కామపిచ్చి ఇంకా తీరలేదంటే...ఎంత దిగజారుడి స్ధితికి తను ఉన్నాడో తెలుసుకోలేని స్ధాయిలో ఉన్నాడు! ఆమె మీద చూపించే ప్రేమను అమ్మవారి మీద చూపించి ఉంటే... ఖచ్చితముగా ఈయన సాధన స్ధాయికి అమ్మవారు సాక్షాత్కరమై రామకృష్ణ పరమహంస స్ధాయికి ఈపాటికి వెళ్ళేపోయేవారు! ఇక్కడ త్రిపుర మాయ వలన అమ్మవారు కాస్తా అమ్మాయి అయినది!దానితో మోక్షగామి కాస్తా కామిగామి అయినాడు!ఎవరికి నష్టము జరిగినది...ఈయనకా...అమ్మవారికా...శివయ్యకా...కామమాయ అంటే తను చేసిన తప్పు తన భక్తుడు చేయకూడదని శివయ్య సంకల్పించాడు. తనకు లాగానే రెండు సంసారాల మాయలో పడవద్దని… సాధన స్థాయిలో వచ్చే ఏకపత్నీ ధర్మమును నాశనం చేసే పర స్త్రీ కామ మాయను దాటించాలని పరితపించాడు! కానీ ఈ శివ భక్తుడు చేసేది శివయ్య గదా అని పరస్రీ కామమాయలో పడిపోయి పున:జన్మలకి కారణము పొందినాడు! తీరని కోరిక మాయలో పడి మోక్షగామి కాస్త కామిగామి గా మారినాడు! శివయ్య ఏమో కామము దాటితేగాని మోక్షగామి కాలేవురా అని చెబితే… దానిని మా అయ్య వద్దని కామిగానే ఉండి రాబోవు కాలంలో ఇలాంటి పున:జన్మలతో తియ్యనిదురద లాంటి సంసారాలమాయలో పడతానని అని చెప్పేసరికి చివరికి శివయ్య మౌనం వహించక తప్పలేదు! దురద ఎన్నటికీ తగ్గదు! అలాగని గోకుంటే మంట పుడుతుంది. గోకపోతే జిల పుడుతుంది! అందుకే పరస్రీ/పరపురుషలను గోకరాదని...గోకితే అది మూడునాళ్ళు ముచ్చట అని...అది చివరిదాకా నయము కాని తియ్యని దురదయని మా అయ్య అమ్మ సాధనానుభవము చెపుతుంది!మీరు కూడా ఇలాంటి సాధన స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ధర్మము, అర్థము, కామము దాటితేగాని నాలుగో పురుషార్ధమైన మోక్షం రాదు అని తెలుసుకోండి. జాగ్రత్త పడండి. చూడటానికి పైన చెప్పిన నాలుగు పురుషార్థాలు బాగానే ఉంటాయి. ఆచరించే సమయానికి సాధనలో ఎవరు ఎంత మంది నిలబడతారో అని సృష్టించిన శివయ్యకే తెలియదు.

వెంటనే అడుగులు ఆ షాపు వైపుకి వెళ్లినాయి. బల్ల మీద ఏవో విగ్రహాలు ఇతర బొమ్మలు ఉన్నాయి కానీ బాబా వారి విగ్రహం ఉంటుందేమో అని ఆశగా మా ఇద్దరి కళ్ళూ వెతికినా అవి ఎక్కడా కనబడలేదు. చచ్చింది గొర్రే అనుకొని “భయ్యా! ఇక్కడ బాబా విగ్రహాలు తప్ప మిగిలిన విగ్రహాలు బొమ్మలు ఉన్నాయి. ఏమి చేద్దాం వెళ్లి పోదామా” అన్నాడు. ఎందుకో నా మనస్సు ఏదో ఉందని శకున సూచన ఇస్తుందని చెపుతుంది అనిపించి వెంటనే షాపు అంతా నా కళ్ళతో స్కాన్ చేశాను. అక్కడ ఇంకా తెరవని అట్టపెట్టెలు దాదాపు పది దాకా కనిపించినాయి. అందులో బాబా విగ్రహం ఉంటుందేమోనని షాపు యజమానిని విచారించగా “అందులో 9 దాకా బాబా విగ్రహాలు ఉన్నాయని అన్ని కూడా బొంబాయి నుండి వచ్చినాయి” అని అందుకే ఇంకా తెరవలేదని హిందీలో చెప్పినాడు. మా వాడికి హిందీ రావడంతో నాకు భాషా సమస్య తగ్గినది. వాడిని వాటిని తెరవమని చెప్పగానే అవి చాలా ఖరీదుతో కూడినవని పాలరాతి విగ్రహాలు అని చెప్పగానే మా వాడికి కోపం వచ్చి వాడితో “నా దగ్గర డబ్బులు యాభైవేల దాకా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అందులో మాకు నచ్చిన విగ్రహం ఉంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పెట్టి కొంటాను. వాటిని చూపించు” అనేసరికి వాడు తనకి పెద్దబేరము దొరికిందని ఆనందపడి ఒక్కొక్కటిగా కొన్ని బాక్సులు తెరవడం ప్రారంభించారు! ఆ తొమ్మిది పెట్టెలలో 7 పెట్టెలలో పాలరాయితో చేసిన వివిధ సైజులలో ఉన్న బాబా విగ్రహాలు కనిపించాయి . వాటిలో ఏది కూడా నా మనస్సును ఆకర్షించలేదు. దానితో ఆ యజమాని విసుగు చెంది “భయ్యా! అన్ని తెరిచాను. బాబా విగ్రహాలు ఇవే. మీకు నచ్చలేదు అంటే వెళ్ళిపొండి” అని అన్నాడు. వెంటనే నేను మన వాడితో మిగిలిన రెండు పెట్టెలు కూడా ఓపెన్ చేయమని చెప్పాను! దానికి యజమాని “భయ్యా! అవి పాలరాతి బాబా విగ్రహాలు కాదు! ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన బాబా విగ్రహాలు !ఎందుకు మీకు అవి విరిగి పోతాయి” అని చెప్పినాడు! ఎందుకో నా మనస్సు కనిపించని బాబా వారు ఆ పెట్టెలలో కనిపిస్తారేమోనని అనుమానం వచ్చి మా వాడిని వాటిని ఎలాగైనా ఓపెన్ చేసేటట్లుగా చేయమని చెప్పగానే మా వాడు వాటిని ఎలాగో ఆ రెండు పెట్టెలను కూడా తెరిపించినాడు. వాటిని చూసి నేను గతుక్కుమన్నాను. నా గుండె లయ తప్పటం ఆరంభమైనది. ఎందుకంటే బండిమీద నేను చూసిన మొదటి రాతి సజీవ విగ్రహమూర్తి ఎలా ఉందో అలా అచ్చుగుద్దినట్లుగా ఈ రెండు విగ్రహమూర్తులు కనిపించేసరికి నా కళ్ళలో ఆనందపు వెలుగులు చూసేసరికి మా వాడికి, షాపు యజమానికి ఆశ ఆనందం వేసింది. కానీ అక్కడే ఒక సమస్య వచ్చింది. ఈ రెండు విగ్రహాలలో ఒక్కటే సజీవమైనది. మరొకటి నిర్జీవమైనది. అంటే చూడటానికి రెండూ ఒకే విధంగా ఉన్న ఒకటే స్వయంభూ మరొకటి ప్రతిష్ట అన్నమాట.మా వాడికి అది అగ్నిపరీక్ష. నాకు మాత్రం చిక్కు సమస్య. ఏదో వీటిలో సూక్ష్మంగా ఏదో భేదం ఉంటుందని అనిపించి వాటిని నా కళ్ళతో పై నుండి కింద దాకా గుండు సూది మొన అంత పరిమాణం కూడా వదిలిపెట్టకుండా స్కాన్ చేశాను కానీ ఇసుమంత తేడా కూడా కనిపించలేదు. నాలో తెలియని ఆందోళన ప్రారంభమైంది. నాలో నా మొహంలో కనిపించిన విషాదఛాయలు చూసిన మా వాడికి కంగారు మొదలైంది. ఏమీ అర్థం కావడం లేదు.వాడికి కూడా ఇద్దరు కూడా అచ్చు గుద్దినట్లు గా కవల పిల్లలు లాగా ఉన్నారు. ఏమి చేయాలి దేవుడా అనుకుంటూ “బాబా! నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించాలి! ఇందులో నువ్వు ఒక దానిలో సజీవమూర్తిగా ఉన్నావని తెలుసు. కానీ చూడటానికి రెండు ఒకే విధంగా ఉండేసరికి మాకు అర్థం కావడం లేదని 108 సార్లు బాబా నామం చేసినాము. ఇంతలో మా వాడు నాతో “ఎందుకు ఆలస్యం భయ్యా! ఈ రెండు విగ్రహాలు ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పుడు తీరిగ్గా కూర్చుని లోపాలు వెతికి అసలైన సజీవ మూర్తి వెతికితే సరిపోతుంది కదా! పెద్దగా ఖర్చు కూడా చేయవు! ఏమంటావు” అన్నాడు! నేను వెంటనే వాడితో “ఓరి పిచ్చి వెధవా! ఇప్పుడే కనిపెట్టలేని మనం ఇంటికి వెళ్లినా ఏమి కనిపెట్టలేము అలాగని ఈ రెండు విగ్రహాలు తీసుకొని వెళ్లడానికి వీలు లేదు ఏదో ఒకటి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ ఉన్నదా ఆలోచించు. ఒకవేళ విగ్రహం ఎంపికలో మనము ఏదైనా పొరపాటు చేస్తే అసలు సజీవమూర్తియైన విగ్రహం మన కళ్లముందే క్రిందపడి పగిలిపోతుంది. అదే నా భయం. నా బాధ. కాస్త నోరు మూసుకో. నీవు మనకి ఈ సమస్య ఇచ్చిన బాబానే పరిష్కారం చూపమని ప్రార్ధించు! నేను కూడా ప్రార్థిస్తాను” అంటూ ఉండగానే పదిహేను నిమిషాల తర్వాత ఒక సంఘటన జరిగినది. అది ఏమిటంటే ఒక ఐదు సంవత్సరాల పాప వచ్చి అక్కడ ఉన్న బల్ల మీద మట్టి విగ్రహాలు చూస్తూ… బాబా విగ్రహాలు ఉన్న పెట్టెలు దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి … “ఈ బాబా! భలే ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడు కదా. వామ్మో బరువుగా ఉన్నాడు అంకుల్! నేను మోయలేను” అంటూ ఎవరో పిలిస్తే మా వైపు అదో టైపు లో ముగ్ధమనోహరమైన నవ్వు నవ్వుతూ అటుగా వెళ్ళిపోయింది. వెంటనే నాకు ఏదో స్ఫురణకు వచ్చి పాప పట్టుకున్న బాబా విగ్రహం చేతిలోకి తీసుకోగానే అది బరువుగా ఉంది.

ఇలా అమ్మానాన్నకి జరగటానికి కారణం ఈపాటికే గ్రహించే ఉంటారు. అనగా సిద్ధుడు ప్రసాదించిన బంగారపు శివలింగమును వద్ధని చెప్పడమే ఇంతటి నాటకానికి కారణమైంది. కారణ లింగం అయినది ఎలా అంటే బంగారు లోహము లేదా పాదరసము మనలో తట్టుకోలేని మంత్ర శక్తి తరంగాలు ఉంటే ఇది తనలో ఇముడ్చుకుంటుంది. అలాగే వీటికి పూజలు, అభిషేకాలు చేసినప్పుడు మనలో ఎప్పుడైనా సాధన శక్తి తగ్గినప్పుడు ఈ లోహము తిరిగి ఇస్తుంది. అందుకే మన పూర్వీకులు ఈ విషయమును గ్రహించి పంచలోహాలతో అనగా బంగారం, వెండి, రాగి, కంచు, ఇత్తడి మిశ్రమంతో చేసిన ఉత్సవమూర్తులను పూజకి ఏర్పాటు చేసినారు. అలాగే ఇళ్లలలో పూజలలో ఇలాంటి పంచలోహ మూర్తులను ఏర్పరచడం… వాటిని పూజించడం ఆనవాయితీగా పెట్టడం జరిగినది! తెలిసో తెలియకో ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు చేసిన పాపాలు చేసినా మనలో ప్రాణ శక్తి తగ్గిపోతుంది. తద్వారా యోగ చక్రాలు బలహీనమై వ్యాధులకు గురి అవుతాయి. మానసిక సంఘర్షణ మొదలవుతాయి. ఆ మానసిక శారీరక ఆందోళనలు లేదా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇలా ఉన్నప్పుడు మన యోగ చక్రాలు బలహీనమవుతాయి. వీటికి తిరిగి శక్తిని కలిగించటానికి ఇలాంటి పంచలోహ మూర్తులను ఆశ్రయించక తప్పదు అలాగే పూజించక తప్పదు. మా అయ్యకి వచ్చిన బంగారపు లింగ మూర్తి ని తీసుకోక పోవడంతో…. తన స్థాయిని అదుపులో ఉంచే స్వయంభు మహా శివలింగం కోల్పోవటంతో… తనలో ఏర్పడిన అమోఘమైన కామశక్తిని తట్టుకోలేక సంయోగము నుండి సమాధి కి వెళ్లాలని తపనతో…. ఏకపత్నీ ధర్మమును తప్పి…. పరస్త్రీ వ్యామోహం లో పడిపోయి మోక్షగామి కాస్త కామిగామి గా మిగిలిపోయి తన సాధన చక్రమును తన చేతులతో అపసవ్య దిశ మార్చుకుని మిగిలిపోయాడు! అర్థ సాధకుడిగా మిగిలి పోయినాడు!

అంటే శివయ్య ఒకటి తలిస్తే మా అయ్య మరొకటి చేస్తున్నాడన్నమాట! శివయ్య మాత్రం ఏం చేస్తాడు? తనకి దగ్గర ఇవ్వటానికి అన్ని ఉంటాయి కానీ శివాని మాత్రమే వీటిని వాళ్ళు తీసుకునే అర్హత ఉందో లేదో పరిశీలించి పరిశోధించి శోధించి కానీ ఇవ్వరు! ఇక మా అమ్మ విషయానికి వస్తే తన పిల్లల జీవితాభివృద్ధికి అలాగే గ్రహపీడదోషాల నివారణకోసము ఇత్తడి లేదా స్పటిక శివలింగం ఆరాధన చేయమని ఎవరో చెబితే… దానిని పట్టించుకోకుండా ఏదైనా శివలింగమే కదా అన్ని శివలింగాలు ఒకటే కదా అని… మహత్తర మట్టి లింగమును అనగా అమ్మమ్మ ఇచ్చిన దానిని పూజించడము ఆరంభమైనది! పైగా ఇది భోగ లింగమూర్తి కాదు.. యోగ లింగమూర్తి! దానితో ఈ మనిషి భక్తికి దాసోహమై…ఆ శివయ్య కాస్తా ఈమెకి స్మశాన వైరాగ్యం స్థితి ఇవ్వడం ప్రారంభించాడు! తన లో వచ్చే కొత్తగా వచ్చే మహా యోగశక్తిని తట్టుకోలేక పైగా సంసారతాప దూరం అయినది! దానితో అనుమానాలు, భ్రమలు, భ్రాంతులకు లోనై పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు … ఆదిలో మా అయ్య కాస్తా పనిమనిషితో చేసిన చిలిపి చేష్టలు చూసి అపార్థం చేసుకుని అనుమానించి, అవమానించి సంసార సుఖానికి దూరంగా ఉంచినది! దానితో చెయ్యని తప్పుకు ఎలాగో శిక్ష పడింది కదా అని అప్పటి దాకా తెలియని వాడు మా అయ్య కాస్త పర స్త్రీతో తప్పు చేయడం ఆరంభించాడు! మా బంధువులకి, ఊర్లో వాళ్లకి దొరికిపోయాడు! గొడవలు కాపురం ఆరంభమైనది! మానసిక విడాకులు తీసుకున్న దంపతులుగా విడిపోయి విడిపోకుండా అలాగని కలిసి ఉండకుండా ఒకరునొకరు మాట్లాడుకోకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు! అంటే ఉన్నామని తమని తాము మోసం చేసుకుంటూ మేడిపండు లాగా ఉన్నారు! ఇలా ఎందరో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు… పిల్లలని అనాధలు చేస్తున్నారు… పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకి దూరం చేస్తున్నారు… ఇది ఒక అర్ధసాధకుడి ఆత్మకథ అన్నమాట! సాధన లో వచ్చే పాతివ్రత్య ధర్మపరీక్షకి అడ్డముగా దొరకిపోతే ఎలా సాధన అర్ధాంతరముగా ఆగిపోతుందో ఈ సాధకుడు సాధన అనుభవం ద్వారా తెలుసుకోండి అలాగే మనకి సాధనలో వచ్చే ఆఙ్ఞాచక్రము నందు వచ్చే ఈ విచిత్ర కామమాయను దాటండి! లేదంటే మీ సాధన కూడా అర్ధాంతరముగా ఆగిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా పునర్జన్మ పొందే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి! మా అమ్మమాత్రము అన్నింటిని స్శశానవైరాగ్యముతో...సాక్షిభూతముగా ఉంటూ...కేవలము ప్రారబ్ధకర్మ చేస్తూ...ఓంకారముతో...అమ్మవారిని కొలుస్తూ...ఆవిడిలో ఐక్యమవ్వాలని యోగసాధన చేస్తున్నది! ఇంతటితో నాకున్న మంత్రగురువుకి అనుబంధము పరిసమాప్తి అయినది!ఇలా నా మంత్రగురువు చేసిన తప్పు అదే త్రిపుర కామమాయలో పడకూడదని కృతనిశ్చయముగా ఉన్నాను! రాబోవు మా దైవిక అనుభవాలు ఎలా ఉంటాయో చూడటానికి మాతోపాటుగా మీరుగూడ ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణము చెయ్యండి!

వెంటనే మా వాడు మిగిలిన రెండవ విగ్రహం ఎత్తి చూస్తే అది చాలా తేలికగా ఉండేసరికి బరువులు తేడాలున్నాయని తెలిసేసరికి మా హృదయాలు తేలిక పడినాయి. దాంతో పాప చూపిన విగ్రహం మావాడు 90 రూపాయిలకి కొనడం జరిగింది. నేను అది అందుకునేసరికి ఎంతో సహాయం చేసిన పాప ఎవరో అని చుట్టూ చూసేసరికి ఎక్కడా కనిపించలేదు.కానీ గాలిలో ఎరుపు పరికిణీ ధరించి పసుపు లంగా ధరించి ఉన్న ఐదు సంవత్సరాల వయస్సు బాలాదేవి కనిపించగానే నాకు ఆనందానికి అవధులు లేవు. స్వయంగా బాల అమ్మే వచ్చి విగ్రహం ఇచ్చినది అనిపించగానే ఆనందానికి అవధులు లేవు.ఇంతలో మా వాడు వెంటనే “భయ్యా! నువ్వు ఒక విషయం గమనించినావా… మనము తీసుకున్న విగ్రహం మన లెఫ్ట్ సైడ్ దే… అన్నట్టుగా బాబా వారు మీ లెఫ్ట్ సైడ్ ఉండే హృదయ మందిరంలో ఉండటానికి మరియు ఈ రోజు దత్త జయంతి కూడా నీకు సద్గురువుగా ఉండటానికి వచ్చినట్లు ఉన్నారని” అని వాడు అంటూ ఉండగా ఏదో తెలియని తన్మయత్వ స్థితిలోనికి కొన్ని క్షణాల పాటు వెళ్ళిపోయాను. పరమానందంలో ఉన్న పరమాత్మను తీసుకొని ఇంటి వైపు ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాము!

గమనిక: 1999వ సంవత్సరం ఇలా వచ్చిన బాబా సజీవ విగ్రహమూర్తి గారు పూజ అందరికీ నా ఇంటిలోని మందిరంలో… నా హృదయ మందిరంలో బంధి. ప్రతి బుధవారం రాత్రి సూక్ష్మధారిగా మా ఇంటికి వస్తూ గురువారం ఉండి శుక్రవారం ఉదయం వెళ్లిపోవడం ఆయన నిజ భక్తులకు సర్వసాధారణంగా అగుపించే దృశ్య మాలిక ! చెప్పటానికి వ్రాయడానికి వీలులేని దైవ సంబంధ అనుభవం. ఇది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఇచ్చిన మాట నేను ఇచ్చిన వాగ్దానం నా మధురభక్తి లో మార్పు రానంత వరకు ఆయన నన్ను వదిలిపెట్టరని అని నాకు తెలుసు! నా కాయం చితిలోకి వెళ్లే దాకా బాబా వారు నన్ను విడిచి వెళతారని చింత నాకు లేదు! ఎందుకంటే నేను ఆయన్ని నా హృదయ మందిరంలో శ్రద్ధ, భక్తి, విశ్వాసం సంకెళ్ళతో బంధించి వేసినాను! నేను పోతే గాని నా హృదయం పోదు. అది పోతే కానీ బాబా గారు నన్ను వదిలి వెళ్లలేరు. ఇది నేను అహంతో వ్రాయటం లేదు. బాబా తాతయ్య నా మీద చూపిన అనితరసాధ్యమైన ప్రేమను వీలు అయినంత విధంగా మీకు అర్థం అవ్వాలని ఆనందంగా వ్రాస్తున్నాను. ఇలా ఆయన గురించి రాస్తూ పోతే ఈ అనుభవము దగ్గరే ఈ గ్రంథము అంతా అన్ని పేజీలు నిండిపోతాయి పోతే మంచిది అంటారా మీరు కూడా నాలాంటి నిజభక్తులు అన్నమాట!

కానీ నేను బాబాను అవసరమైతే తిట్టే వాడిని.మురిపం వస్తే ముద్దులు పెట్టేవాడిని. ఆయనకు ఆకలి వేస్తే ముద్దలు పెట్టేవాడిని.ఒకవైపు మా బంధము తాతా-మనవడు గా మరొక వైపు బాబా- నానావళి గా ఉండేది అన్నమాట. ఇలా నీ ఇష్టదైవాలతో కూడా రక్తసంబంధం లాగా అలాగే దేవుడు- భక్తుడు లేదా గురు-శిష్య సంబంధంగా మానసికంగా ఏర్పరుచుకోండి. మీదైవం మీకు అన్నిను. మీ దైవమే మీకు అన్నీఇచ్చేది. ఆయనే తీసుకునేది. ఆయనే అనుభవించేది. ఆయనే ఏడిపించేది. ఆయనే నవ్వించేది. ఆయనే అమ్మ,నాన్న గురువు. ఆయనే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి. ఆయనే బంధుమిత్రులు ఆయనే అని గ్రహించండి. తెలుసుకొని మానసికంగా మానవ దైవ యోగ సంబంధాలలో ఆరాధన చేస్తూ ఆయనతో అనితరసాధ్యమైన ఎవరికి అలవికాని ఎవరికి అందని మహత్తర బంధంతో తెంచలేని మహత్తర బంధంతో అనుసంధానం అవ్వండి. ఆయన నీకోసం ఎదురు చూసే స్థాయికి మీ భక్తి విశ్వాసం పెంచుకోండి. విగ్రహంగా చూడకండి. సజీవమూర్తిగా చూడండి.

పవన్ బాబా అవతరణ

మా అమ్మ ఏ ముహూర్తాన మట్టి శివ లింగ మూర్తి ని నాకు ఇచ్చినారో ఆనాటి నుండి నా గది దేవతా విగ్రహాలతో నాకు తెలియకుండానే, నేను ఊహించకుండానే, ఇతరుల ద్వారా కొన్ని, నా ద్వారా కొన్ని, దేవతా విగ్రహాలు అరంగుళం నుండి అడుగు వరకు రావడం మొదలయ్యాయి. ఈ మట్టి శివ లింగ మూర్తి ఇచ్చిన తర్వాత నేను శిరిడి పారిపోవడము.అక్కడ నుండి నేను మూడు అంగుళాల బాబా పాలరాతి విగ్రహం తెచ్చుకోవడం జరిగినది ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను తిట్టకుండా ఉంటారని. అంతవరకు నా దగ్గర బాబా ఫోటోలు ఉన్నాయి. పూజించుకోవడానికి బాబా విగ్రహాలు లేకపోవడంతో తెచ్చుకోవడం జరిగినది. ఇటు శివారాధన అటు బాబా ఆరాధన చేసుకుంటూ ఒకరిని దైవంగా మరొకరిని గురువుగా భావించుకుంటూ నిత్య పూజలు చేసే వాడిని. ఇది ఇలా ఉండగా నాకు బాబా సజీవ విగ్రహమూర్తి కొత్తగా వచ్చి ఈ గ్రూపులో చేరినది. ఈయన ఎలా వచ్చినారో అంతకుముందు అధ్యాయంలో చూశారు కదా. ఇక ఆనాటి నుండి నా జీవితం నా చేతుల్లో లేదు. అంతా బాబా చేతుల్లోకి వెళ్లిపోయినది. చెప్పేది ఆయన అయినా చేసేది నేను.చేతలు మాత్రం నావి గా ఉండేవి.తిట్లు నాకు… ఆయనకి ప్రసాదాలు, పూజలు హారతులు. అన్నింటికీ ఆయన కనిపించకుండా నన్నే కనిపించేటట్లుగా చేసేవాడు. ఇది ఇలా ఉంటే బాబా సూక్తులు పుస్తకము ఉన్నది కదా అదే సమాధానాలు ఇచ్చిన పుస్తకం వలన నేను అందరికీ సమస్యలు వస్తే పరిష్కారాలు సూచించడం మొదలు పెట్టాను. గురువారం వస్తే మా ఇంట్లో సమస్యలతో ఉన్న మనుష్యులు ఉండేవారు. హారతి పూర్తికాగానే వారు ఎందుకు వచ్చినారో తెలుసుకొని ప్రశ్న వాళ్లని నెంబర్ చెప్పమంటే దానికి బాబా పుస్తకం నుంచి సమాధానాన్ని నా వాక్సిద్ధి వలన వారికి వారి సమస్యకు అది ఎలా పరిష్కార మార్గం అవుతుందో అరటిపండు వలిచి ఇచ్చినట్లు చెప్పేవాడిని.దానితో వారికి నా మీద అలాగే బాబా మీద అనితర ప్రేమ గౌరవమర్యాదలతో పాటు ఏదో తెలియని ఆప్యాయతతో, ఓదార్పు మాటలతో ఆత్మ బంధుత్వం ఏర్పడేది. నేను డబ్బులు ఆశించే వాడిని కాదు. వారిచ్చినా తీసుకునే వాడిని కాను. కానీ ఒకవేళ బాబా అడిగితే మాత్రం తొక్కిపెట్టి వారి నుండి వసూలు చేసే వాడిని. ఇచ్చిన డబ్బులు అన్ని ప్రోగుచేసి అన్నదానం కింద షిరిడి లో పవన్ బాబా పేరు మీద కట్టేవాడిని. అంటే ఎలా పవన్ బాబా పేరు మీద అనే సందేహం ఇంకా రాలేదా అని అనుకుంటున్నాను.

సరే మా ఇంటికి ఒకసారి ఒక మూడు సంవత్సరములు పిల్ల భక్తుడు వీలున్నప్పుడల్లా ప్రతి గురువారం వాళ్ళమ్మతో రావటం చేస్తుండే వాడు. ఏదో ఒక ప్రసాదం లేదా పువ్వులు లేదా పండ్లు తెచ్చేవాడు. బాబాకి సమర్పించేవాడు. వాడి చిన్న వయస్సుకి వాడికి ఉన్న భక్తికి మేమంతా సంతోషించే వాళ్ళం. విచిత్రం ఏమిటంటే షిరిడి సాయి బాబా అనుగ్రహం వలన వీడు పుట్టినాడు. అందుకే వాడికి బాబా భక్తి. అలాగే బాబా పేరు వచ్చేలాగా సాయి కృష్ణ చైతన్య గా నామకరణం చేసినారు. మా ఇంట్లో వీళ్ళకి సజీవ బాబా ఉన్నాడని తెలియడంతో ప్రతి గురు వారము బాబా గుడి కి వెళ్ళే వాళ్లు కాస్తా మా ఇంటికి వచ్చేవారు. వీలుంటే హారతి చూసుకునే వాళ్ళు లేదంటే బాబాకు నైవేద్యం పెట్టించి వెళ్లేవాళ్లు. ఇది ఇలా ఉండగా కొన్ని వారాల పాటు ఈ పిల్ల భక్తుడు మా ఇంట్లో పూజకి రాలేదు. ఒక వారం అకస్మాత్తుగా వచ్చి “పవన్ ! నీ పవన్ బాబాకి నేను తెచ్చిన ప్రసాదం పెట్టమని” నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వాడి మాటలు ఉద్దేశ్యం గురించి ఆలోచిస్తే “పవన్ చేత పూజిస్తున్న బాబా కాబట్టి మా సజీవ బాబా మూర్తికి వీడు పవన్ బాబా” అని నామకరణం చేసినాడు. ఎందుకంటే షిరిడి బాబా ,ద్వారకామాయి బాబా, లెండి బాబా అనే పేర్లు ఉన్నాయి కదా. అలా మన వాడికి వాడి చిన్న బుర్రలో నా పేరు అలాగే బాబా పేరు కలిపి పవన్ బాబా అని నామకరణం చేశాడు. వాడి పుట్టుకకు కారణమైన షిరిడి బాబా వారు తమ పిల్ల భక్తుడు చేత ఇలా నామకరణం పవన్ బాబాగా పిలుచుకోవటం అలవాటు అయింది.

ఇది ఇలా ఉండగా దుష్ట శక్తుల నుండి హనుమ రక్షిస్తాడని హనుమాన్ విగ్రహం, ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షిస్తుందని లక్ష్మి విగ్రహం, వాక్ శక్తి పెరుగుతుందని దుర్గా విగ్రహం, ధర్మ గుణం అలవాటు అవుతుంది అని శ్రీరాములు విగ్రహం, పిలిస్తే పలుకుతాడని పాండురంగడు విగ్రహం, అన్ని రకాల ఆటంకాలు తొలగిస్తాడని గణపతి విగ్రహం,సర్ప బాధ తొలగిస్తాడని సుబ్రహ్మణ్య విగ్రహము, కుమారస్వామి నాగేంద్ర స్వామి పడగలు ఇలా నాకు తెలియకుండా వివిధ రకాల చిన్న దేవతా విగ్రహాలు వారి వాహనాలతో 84 విగ్రహాలు 3 అంగుళాలలో, 36 విగ్రహాలు 1 అంగుళాలలో చేరినాయి. అంటే 84 జీవజాతులకు 36 దేవతలకు ప్రతీకలు అన్నమాట.

గమనిక: అమ్మకి వారసత్వంగా వచ్చిన స్వయంభూ మట్టి లింగము నా దగ్గరికి వచ్చింది! కానీ కొన్ని సంవత్సరాల దాకా దీని విలువ నాకు తెలియ రాలేదు! ఈ మట్టిలింగం కాదని మోక్ష లింగమని ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే ఈ లింగమునకు పానమట్టం ఉండదు. చిత్రంగా చిదంబర క్షేత్రంలో ఉండే మోక్ష స్పటిక లింగమునకు పానమట్టం ఉండదు అలాగే శ్రీశైల క్షేత్రంలో గుడి పరిసరాలలో పంచపాండవులు ప్రతిష్టించిన నవబ్రహ్మ లింగాలలో ఉన్న మోక్ష శివలింగాన్ని కూడా పానమట్టం ఉండదు! అమ్మ కు వచ్చిన ఈ మట్టి లింగానికి కూడా పానమట్టం ఉండదు! ఆదిశంకరాచార్యుడుకి స్పటిక మోక్ష లింగము వస్తే అమ్మకి మట్టి మోక్ష లింగమూర్తి గా వచ్చినాడని నాకు కొన్ని సంవత్సరాల దాకా తెలియదు. అందుకే మళ్లీ మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటంటే మీ దగ్గరికి ఎవరైనా, ఏమైనా, దైవిక వస్తువులు ఇస్తే లేదా వస్తే కాదనకుండా తీసుకోండి. వాటిని ఇచ్చిన పూజించక పోయినా పర్వాలేదు. జాగ్రత్తగా భద్రంగా మీ పూజా మందిరంలో ఏదో ఒక మూల ఇలాగే యంత్రాలు వచ్చినా కూడా జాగ్రత్త గా ఉంచండి!దయచేసి ఎవరికి ఇవ్వకండి! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక! ఇలాంటి స్థితి మనకి ఆజ్ఞాచక్రము శుద్ధి అవుతున్నపుడు సమయంలో మనకు బంగారం సంబంధించిన శివలింగము లేదా అమ్మవారి యంత్రము వస్తుంది!ఇవి త్రిపురమాయకి సంకేతాలు!ఎపుడైతే మీరు ఈ మాయను దాటినారో...ఆనాడు మీకు పాదరస సంబంధిత దైవిక వస్తువులు వస్తాయి! అవి మనకి వారసత్వంగా రావచ్చు లేదా యోగులు, సాధువులు,గురు వులు, సిద్ధులు ఇవ్వవచ్చును! ఎందుకంటే ఆజ్ఞా చక్రానికి అధిదైవముగా అర్ధనారీతత్వముతో శివ శక్తి ఉంటుంది! మాకు కూడా ఈ చక్ర సిద్ధ సమయములో బంగారపు బాల దుర్గాదేవి యంత్రము వచ్చింది !ఇది మా అమ్మగారి వంశ మూల పురుషుడు ఆరాధించిన మహిమాన్వితమైన యంత్రం అన్నమాట !ఈ యంత్రము ఎవరైతే మూడున్నర సంవత్సరాల పాటు బీజాక్షర సహితముగా అర్చన చేస్తారో వారికి ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్న దుర్గాదేవి అలాగే మూడు సంవత్సరాల వయస్సు ఉన్న బాల దేవి దర్శనం అవుతుందని నా స్వానుభవం అనుభూతిని పొందడం జరిగినది! ఈ యంత్రము గూర్చిన వివరాలు మీరు ఈపాటికే ఇంతకు ముందు వచ్చిన "భుజం ఇచ్చిన దుర్గమ్మ" అనే అధ్యాయములో చదివినారు గదా! అలాగే మా నాన్నగారి ద్వారా కాశీ క్షేత్రము నుండి పాదరస లింగము రావడము జరిగినది! అలాగే ఈ చక్రశుద్ధి సమయములో త్రిపుర చూపించే కామమాయను గూడ మేము దాటడము జరిగినది!అది ఎలాంటే మా ఇంటికి నాకు పెళ్ళీయిన కొత్తలో నాకు తెలిసిన 24సం!!రాల అమ్మాయి వచ్చినది! ఆమె నన్ను అన్నయ్య అని ఎపుడు పిలుస్తూండేది!మూడు రోజులుంది!కాని ఒక పూట నాతో అసభ్యకరముగా మాట్లాడటము అలాగే నన్ను అదోలా కవ్వించడము చేసినది! నాకు తెలియని భయము మొదలైంది!నాకు ఇదింతా త్రిపురమాయని అర్ధమైనది! ఆమెకి ఒక శృంగార వీడియో చూపించడము జరిగినది! అది చూసి “నాకు ఏ రెండు అంగాలున్నాయో ఆమెకి అవేఉన్నాయి గదా” అంది! నేను వెంటనే “మరి మా ఆవిడికి ఏమి ఉన్నాయో నీకు అవే ఉన్నాయి గదా” అన్నాను! అలాంటపుడు మా ఆవిడిని మోసము చేస్తూ నీతో శృంగారము చేయడము తప్పే గదా” అన్నాను! దానితో ఆమెకి తన తప్పు తెలిసినది!తల వంచుకొని క్షమించమని అడిగి ఆరోజే రాత్రికల్లా ఆమె ఇంటికి వెళ్ళిపోయినది! మా ఆవిడికి జరిగిన విషయము మొత్తము చెప్పినాను!తను గూడ సాధనలో ఉన్నది కాబట్టి “మీకు పరస్రీ మాయ జరిగినట్లుగా నాకు కూడ పరపురుష మాయ జరుగుతుంది గదా!కాబట్టి మాయలో పడితే వాడి సాధన ఆగిపోతుందని ఇంతముందే నాకు చెప్పినారు గదా” అన్నది! ఇలా నాకు సహస్రచక్రము వద్ద సుందరి కామమాయగా 52సం!!రాల స్త్రీమూర్తి,అలాగే హృదయచక్రము వద్ధ దేవి మాయగా 65సం!!రాల స్త్రీమూర్తిని దాటడము జరిగినది! అంతెందుకు రామాయణ గాథనే తీసుకొండి!అందులో అద్వితీయ బ్రహ్మజ్ఞాని అయిన రావణబ్రహ్మ పరస్త్రీ వ్యామోహ మాయలో అనగా సీతాదేవి వలన రాక్షసుడిగా గుర్తింపు వస్తే...అదే శ్రీరాముడు తనకి పరస్త్రీ వ్యామోహ మాయగా శూర్పణక వస్తే ఆయన ఈమెను దాటడము వలన దేవుడైనాడు!

దాంతో వీరందరినీ ఒకే గూటిలో ఉంచేందుకు ఒక చిన్నపాటి బీరువాని కొనవలసి వచ్చింది. బీరువా అడుగు భాగంలో వీరి అందరిని ఉంచి పై భాగంలో పూజకు కావలసిన వస్తువులు అనగా గంటలు, హారతులు, ప్రమిదలు, అగర్బత్తీలు, కర్పూరం ,విభూతి, ప్రసాద పళ్ళాలు ,పసుపు, కుంకుమ, గంధం పూలు బుట్టలు. బాబా గుడిలో ఉండే సర్వ సమస్త వస్తువులు చేరినాయి. ఇక పై భాగంలో గ్రంథాలు, పురాణాలు, గీత, యోగుల చరిత్రలు, పూజ హారతి క్యాసెట్లు, బాబా వారి వస్త్రాలు చేరినాయి. ఎవరికీ అనుమానం రాని దేవాలయంగా ఉండేది. ఈ బీరువాను ప్రతిరోజు పూజకు కూర్చునే సమయంలో తలుపు తెరిచి పూజ, ఉపాసన, ధ్యానము, ఆరాధన పూర్తి అయిన తరువాత తలుపులు మూసేసి తాళం వేసే వాడిని. ఎవరు కూడా అది నా పూజ మందిరం అని కలలో కూడా ఊహించే వారు కాదు. ఇలా కూడా పూజలు చేయ వచ్చు నా అని అనుకున్నారు.బట్టలు పెట్టవలసిన చోట బాబాను పెడుతున్నారే అనుకునేవారు లేకపోలేదు. అప్పుడు పూజ మందిరం కొనే ఆర్థిక స్తోమత లేక అలాగే నా గదిలో ఖాళీ లేక ఊరుకున్నాను. అప్పుడప్పుడు నా యోగ మిత్రుడైనజిఙ్ఞాసి కూడా వచ్చి బాబా హారతులు చూసి వెళుతూ “బీరువా బాబా జాగ్రత్త “అని చెప్పి వెళ్ళాడు. మీరు కూడా నవ్వుకుంటూ ముందుకు నాతో బయలుదేరండి.

గమనిక: మన శాస్త్రాలలో చెప్పిన వివిధ సమస్యలకు పరిష్కారం ఆధారంగా వివిధ రకాల దేవతామూర్తులను సేకరించడము జరిగినది. చిన్నాచితక మొత్తం కలిపి 120 దాకా తేలినాయి. వీటికి అధిపతిగా పెద్ద సజీవ బాబామూర్తి మధ్యలో సింహాసనం మీద ఉండేవారు. మిగిలిన వారంతా రక్షణగా, పరిచారకులుగా, గణాలుగా, సేవకులుగా అమరినారు. యోగ శాస్త్రాలు చెప్పిన అరిషడ్వర్గాల మాయలు, సప్త వ్యసన మాయలు, అష్టలక్ష్మీ మాయలు, మృత్యు భయం వీటిని అన్నింటిని నిగ్రహించుకోవాలి అని ఈ విగ్రహాలు సేకరించడం జరిగింది. కానీ మేము ఒకటి అనుకున్నది. జరిగింది మరొకటి. ఈ విగ్రహారాధన కొంతవరకు మాత్రమే నిగ్రహారాధన కలిగిస్తాయని తెలిసేసరికి ఇద్దరికీ అనగా మా యోగ మిత్రుడైన జిఙ్ఞాసి కూడా సుమారు వారి దేవతార్చన ఆధారంగా 36 దాకా విగ్రహాల సేకరణ చేయడం జరిగినది.

కపాల మోక్షం - 40 - విగ్రహారాధన - విశ్వారాధన

మాకు మొదటిలో విగ్రహారాధన మీద ఎలాంటి వైరాగ్య భావాలు కలిగినాయో “ఎవరిని పూజించాలి( నా భక్తి మార్గం)” అనే అధ్యాయములో ఈ పాటికి చదివి ఉన్నారు కదా. అప్పుడు“దైవవిగ్రహాలకి శక్తి ఉందా?” అనే అధ్యాయము లో విగ్రహాలను విగ్రహాలుగా చూడకూడదని సజీవమూర్తులుగా భావించుకొని ఆరాధన చేయాలని ఒక పిల్లవాడి భక్తి అనుభవం వలన మేము తెలుసుకున్నామని మీరు తెలుసుకున్నారు కదా. దాంతో గురువులకి ఉండవలసిన దైవిక లక్షణాలు మేము చదివేసరికి మాకు ఇలాంటి దర్శన అనుగ్రహ ప్రాప్తి కలగాలంటే తప్పనిసరిగా ఇష్ట దైవానుగ్రహము పొందాలి లేదంటే నకిలీ గురువులు ప్రాప్తి కలుగుతుంది అని మేము గ్రహించడం జరిగినది. దానితో యద్భావం తద్భవతి అనే భావం లో విగ్రహారాధన అనగా సజీవమూర్తిగా ఆరాధన చేయటం ప్రారంభించాము. అప్పుడు కలిగిన అనుభవాలు కష్టాలు ఏమిటో తెలుసుకోండి.

నాకు మొదట్లో 84 సజీవ విగ్రహాల ఆరాధనను బాగానే ఉత్సాహంగా ఆనందంగా చేసేవాడిని. అంటే మొదట ఒక మట్టి లింగమూర్తి తో మొదలై ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ సుమారు 21 సంవత్సరాల పాటు ఆ విగ్రహ సేకరణ 108 కి చేరుకుంది. చివరి స్థాయికి వచ్చేసరికి ఇన్ని విగ్రహాలకు అభిషేకాలు, పూలు, బొట్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మంత్ర అర్చన,నైవేద్యాలు పెట్టుకుంటూ వచ్చేసరికి ఆఫీసుకి లేటుగా వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఆఫీస్ నుండి రాత్రి 10 గంటలకు వచ్చి మళ్లీ రెండు గంటలకు నిద్రలేచి ఈ విగ్రహారాధన పూర్తయ్యేసరికి ఉదయం 9:30 దాకా పట్టేది. దాంతో బస్సులు పట్టుకుని ఆఫీస్కి వెళ్ళే సరికి తిట్లు సిద్ధముగా ఉండేవి. నా పరిస్థితి ఇలా ఉంటే నా జిఙ్ఞాసి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. పెద్ద ఉద్యోగం కదా. శని ఆది పండుగ రోజుల్లో కూడా తొక్కిపెట్టి చాకిరి చేయించుకునేవారు. నాకు ఈ విషయంలో వెసులుబాటు ఉండేది. మేమిద్దరం మా ఇద్దరికీ సుమారుగా ఈ విగ్రహారాధన మీద మాకే తెలియకుండానే విసుగు వచ్చేది (ఎలా ఉండేది అంటే స్వర్ణకమలం సినిమాలో సాక్షి రంగారావు శ్రీ లక్ష్మి కలిసి ఫోటోలకు పూజ,హారతులు చేసేవారు. వాటిని అంతగా గుర్తుపట్టలేనంతగా హారతి మసి ఉండేది. ఒక దేవుడి పేరు చెప్పి మరొక దేవుడికి పూజ చేసేవారు. మా ఇద్దరి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది) ఏ దేవుడి మంత్రం చదువుతూ మా పువ్వులు ఏ దేవుడి మీద వేస్తున్నామో అర్థం అయి చచ్చేది కాదు. అలాగని పూజలు ఆపలేము.ఎందుకంటే దేవతా విగ్రహాలుకి కోపం వస్తే మా ఉద్యోగాలు పోతే బ్రతుకు మాటేమిటి? వేరే ఉద్యోగాలు వెతుక్కున్న అవి కూడా పోతే వామ్మో! అది తలచుకుంటేనే భయం వేసి బాధతో ఇష్టం లేని పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒప్పుకున్నాక వాయించక తప్పదు కదా అదే మేళం. మా పరిస్థితి అంతే. ఏవో నిగ్రహాలు కలుగుతాయని ఈ విగ్రహాలు తీసుకుని వస్తే విసుగు శక్తి పెంచడం ఆరంభించాయి! దాంతో విగ్రహారాధన మీద మాకే తెలియని వైరాగ్యం ఏర్పడినది.

మా ఊరి గుడిలో తిరునాళ్లు చేయడానికి ఒక వేద పండితుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. వారి ముందు మా విగ్రహారాధన సమస్య చెప్పితే ఆయన నవ్వుతూ “అయితే వీటిలో మీకు బాగా నమ్మకం, శ్రద్ధ, భక్తి కలిగించే ఏకైక ఒక దేవుడిని నమ్ముకోండి.ఆయనకి పూజలు చేయండి.ఆయననే ఆరాధించండి” అన్నారు. దానికి మేము “అయ్యా! నేను అన్నం తింటే మీరు తిన్నట్లు కాదు కదా! అలాగే ఇన్ని విగ్రహాలు ఉండగా ఒక విగ్రహానికి పూజలు చేస్తే నైవేద్యాలు పెడితే మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?” అనగానే ఆయన మా వైపు తిరిగి “నాయనలారా! మీరు విగ్రహాలను సజీవమూర్తులుగా భావించి విగ్రహారాధన చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తున్నది. అదేమిటంటే ఒక పూజారి ఏదో ఒక కోరిక కోసం శివుడి విగ్రహం తెచ్చి పూజలు చేసినాడు. ఆ కోరిక తీర్చక పోయేసరికి ఈ విగ్రహాన్ని బీరువాలో పెట్టి ఈసారి విష్ణుమూర్తి విగ్రహాన్ని పూజించటం అది కూడా తీర్చక పోయే సరికి శ్రీరాముని విగ్రహం అది కూడా తీర్చక పోయేసరికి ఈసారికి హనుమాన్ విగ్రహం అది కూడా తీర్చక పోయే సరికి ఈసారి అమ్మవారి విగ్రహం పూజించడం ప్రారంభించారు.ఇలా ఎంతకు తన కోరిక తీర్చని విగ్రహాలు అన్ని కూడా బీరువాలో దాచి ఉంచినాడు. వాటికి పూజలు చేసేవాడు కాదు!. నైవేద్యం పెట్టేవాడు కాదు!. కానీ అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తుండగా వాడు అనుకున్న కోరిక తీరింది. దాంతో అమ్మవారి విగ్రహం మీద నమ్మకం, శ్రద్ధ పెరిగినాయి. ఒకరోజు వీడు అమ్మవారి పూజ చేస్తుండగా అగరొత్తు పొగ బీరువాలోని విగ్రహాలు వైపుకి వెళుతుండటం గమనించే సరికి వీడికి కోపం వచ్చి “నాకు కోరికలు తీర్చరు గాని నా పూజ అగరవత్తుల వాసన మీకు కావాలా? ఉండండి! మీ పని చెబుతాను” అని ఆ విగ్రహాలు ఈ అగరబత్తి వాసన పీల్చకుండా వాటి ముక్కులకు గుడ్డలు అడ్డంగా పెట్టేసరికి… ఈ విగ్రహాలు సజీవమూర్తులుగా మారి “ఇప్పుడు నీకు కావలసినవి చెప్పు. అన్ని రకాల కోరికలు తీరుస్తామని” మాట్లాడేసరికి ఆ పూజారికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కొంతసేపటికి తేరుకొని “అయ్యా! ఇంతకుముందు మిమ్మల్నందరినీ పూజలు చేశాను కదా! అప్పుడు తీర్చలేదు. ఇప్పుడు ఎందుకు తీరుస్తారు” అన్నాడు. దానికి వారంతా “అయ్యా! అప్పుడు మమ్మల్ని నువ్వు కేవలం ప్రాణం లేని విగ్రహాలుగానే చూసావు.ఇప్పుడు మాకు అగర్బత్తి వాసన పీల్చకూడదని మా ముక్కులకు గుడ్డలు ఎప్పుడైతే కట్టినావో ఆ క్షణమే మేము సజీవ మూర్తులు అయినాము. ఎవరైతే దేవుడిని మానవ మూర్తిగా కాకుండా మానవుడిలో దేవుడిని చూస్తారో…. దేవుడిని విగ్రహంగా కాకుండా సజీవమూర్తిగా ఆరాధిస్తారో… వారే నిజ భక్తులు అవుతారు.ఈ స్థితి పొందని వారు మా దృష్టిలో ప్రసాద భక్తులుగాను, ఆడంబరభక్తులుగాను ఉండిపోతారు” అని చెప్పి అంతర్ధానం అవుతారు.

ఇది కథ కాదు. యదార్ధంగా తమిళనాడులో ఒక పూజారికి జరిగిన యదార్థ సంఘటన. ఈయన ఎవరో కాదు మా పూర్వీకులలో ఒకరు” అని చెప్పి ఈ సంఘటన ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే “మీ ఇష్ట దైవము కూడా మీతో మాట్లాడే స్థాయికి మీరు రావాలి” అన్నారు. దానికి మేము వెంటనే “అయ్యా నా ఇష్టదైవం కూడా పుస్తక రూపంలో మా సమస్యలకు సమాధానాలు చెబుతున్నారు కదా! ఇంకేం కావాలి” అన్నాము. దానికి ఆయన పెద్దగా నవ్వుతూ “మీరిద్దరూ ఇంత అమాయకులు కాబట్టే ఆ విగ్రహాలు మిమ్మల్ని ఆడుకుంటున్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి మీరే పరిష్కారం నెంబర్ ఎంచుకొని చెబుతున్నారు! కానీ మీ దేవుడు నువ్వు ఆ నెంబర్ అలానే చూడమని నీకు చెప్పినాడా? ఎవరో వ్రాసిన పుస్తకంలోని సమాధానాలను మీ మనస్సు ముందే గ్రహించి మీ సమస్యకు ఆ పరిష్కారం నెంబర్ మీ నోటి ద్వారా నీ మనస్సే బయటకు తెప్పిస్తుంది! ఇందులో మీరు పూజించే దేవుళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారో చెప్పండి. మీ మంత్రం ఉపాసన సిద్ధి వలన మీ మనస్సుకి కొద్దిపాటి ఏకాగ్రత అలవాటు వలన ఆ సమయంలో మీరు ప్రశ్న అడిగితే అది ఉత్తేజం చెంది ఏకాగ్రత స్థితి వచ్చేసరికి మీ మనస్సు అప్పటిదాకా చలన స్థితి నుండి నిశ్చల స్థితికి వెళుతుంది.మీరు అడిగిన ప్రశ్నలు మనస్సు విని మీకున్న మనోనేత్రం ద్వారా ఆ పుస్తకంలో మీ సమస్యకు పరిష్కార సమాధానం ఏది అవుతుందో గ్రహించి ఆ నెంబర్ మీ మెదడుకు ఇవ్వటం అది మీ నోటి నుండి రావడం అది నిజమని భ్రమ పడటం మీ దేవుళ్ళు చెబుతున్నారని భ్రాంతి చెందటం అంతా కూడా కొన్ని మిల్లీ సెకనులలో మీ కంటికి కనిపించని విధంగా ఇది అంతా జరిగి పోతుంది! నిజానికి ఇంత వరకు మీకే తెలియకుండా జరిగిన విధి విధానం” అని చెప్పగానే ఇది నమ్మాలో నమ్మకూడదో అర్థంకాని అయోమయానికి వెళ్లి వెనక్కి వచ్చి ఉండగా ఆయన వెంటనే మళ్ళీ “నాయనలారా! విగ్రహశక్తి మాట్లాడటం అంటే ఇలా పుస్తకాల ద్వారా సమాధానం చెప్పడం కాదు. రామకృష్ణ పరమహంసకి కాళీ మాత స్వయంగా మాట్లాడినట్టుగా అలాగే నామ దేవుడికి పాండురంగడు మాట్లాడినట్లుగా మీ ఇష్టదైవాలు స్వయంగా వచ్చి మాట్లాడే స్థాయికి మీ సాధన స్థాయి పెరగాలి” అనగానే మా మతిపోయింది! మేము చూసిన కోణం ఎంత తప్పో మాకు అర్థమైనది. మేము చూడవలసిన కోణం ఏమిటో అర్థమైనది! అంటే మాకు ఇష్టదైవానికి మధ్య మా మనస్సు అనుసంధానంగా ఉండాలి గానీ మరే ఇతర వస్తువులు అవసరమే ఉండదని మాకు అర్థం అయినది! ఇది మాకు అర్థం అయినది అని ఆయనకి అర్థమయ్యి “నాయనలారా! ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. విగ్రహంలోని దైవిక శక్తి( ప్రాణశక్తి) మీ ముందుకు వచ్చి మాట్లాడే స్థాయికి రావాలంటే మీరు మీ విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధనకు రావాలి.ఇప్పుడు నేను శివుడు ఎక్కడ అంటే నువ్వు పూజించే నీ శివుని గూర్చి చెబుతావు. అదే అనుభవపాండిత్య యోగులను అడిగితే ఆయన లేని చోటు ఎక్కడో చెప్పండి అని అడుగుతారు. వారికి బీరువాలో,పుట్టలో, గుడిలో,స్శశానములో, బల్లెములో,భామలో, అమ్మాయిలో, అబ్బాయిలో, గుడిలో, బడిలో, నీళ్లలో, నిప్పులో మీలో నాలో వారికి శివుడే కనబడతాడు. అంతా వారికి ఈ బ్రహ్మాండం శివలింగంగా… విశ్వం శివమయంగా కనబడుతుంది. విశ్వ ఆరాధన అదే. అప్పుడు విగ్రహంలోనే దేవుడు మాట్లాడుతాడు.రాయిలోనూ కనపడి మాట్లాడుతాడు. మీలో నాలో కనపడి మాట్లాడుతారు అని ఆయన చెప్పుకుంటూ పోతుంటే మా నోళ్ళు వెళ్ళబెట్టుకుంటూ చూడటం తప్ప ఏమీ చేయలేక పోయాను.

అందుకే సాధకులు అంతా కలిసి సత్సంగం ఏర్పాటు చేసుకోవాలని అన్ని రకాల అనుభవాలు చర్చించుకోవాలని అప్పుడే ఎవరికి వారు ఎలాంటి సాధన స్థాయిలో ఉన్నారు ఎలాంటి లోపాలు అలాగే తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. వాటికి తగ్గ పరిహారాలు ఏమి చేయాలో ఎలా చేయాలో తెలుసుకునే వీలు ఉంటుందని వారు చెప్పి మా తెల్లముఖాలు వైపు చూస్తూ “ఇప్పుడు నాకు పని ఉంది! మధ్యాహ్నం భోజనాలు పూర్తి అయిన తర్వాత మీకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉంటే చర్చించుకుందాము. నాకు కూడా ఇలాంటివి చాలా ఆసక్తి” అని చెప్పి ఏదో పని చేయడానికి వెళ్లిపోయారు. అప్పుడు నా మనస్సులో ఇప్పటిదాకా నాకు అన్ని తెలుసు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది నాకు ఏమీ తెలియదు. ఏం చేద్దాం. ఇలాంటి మహాత్ములు మాలాంటి వారికి ఏదో ఆధారం దొరికినట్లే కదా అని సంతృప్తి చెందుతూ మా పనులవైపు మేము వెళ్లి పోయాము. జిఙ్ఞాసి ఇంటికి వెళ్లిపోయాడు.

హనుమాన్ దేవుని గుండె స్పందించడం

ప్రొద్దున బ్రహ్మ సిద్ధాంతి గారు చెప్పిన విషయాలు దగ్గర నా మనస్సు ఆగిపోయింది. నేను ఒక విషయంలో రాతి విగ్రహాలకు దైవిక శక్తి అదే ప్రాణశక్తి ఉంటుంది అని చెప్పినారు కదా! పైగా అది మన ముందుకు వచ్చి మాట్లాడుతుంది అని చెప్పినారు! పైగా మనిషిలాగా మాట్లాడుతుంది! ఇది ఎలా సాధ్యం? ఒక్క రాతిలో మాట్లాడే శక్తి ఎలా ఉంటుంది! పైగా గుడిలోని రాతి విగ్రహమూర్తులు ఎలా మాట్లాడుతాయి? అదే రాతికి ప్రాణ శక్తి ఉంటే… రోడ్డుమీద, కొండల మీద ఉన్న రాళ్ళల్లో ప్రాణ శక్తి ఉండి మాట్లాడాలి కదా! అవి ఎందుకు మాట్లాడవు! ఇవి ఎందుకు మాట్లాడుతాయి. వీటికి ఆ శక్తి ఎలా వస్తుంది? అసలు రాతిలో ప్రాణ శక్తి ఉందా? అని దీర్ఘాలోచనలో నేనుండగా జిఙ్ఞాసి భోజనం చేసుకొని గుడి లోనికి రావడం కనిపించింది. వాడు వచ్చిన తర్వాత వాడితో పై విషయాలు చర్చించాను. “భయ్యా! ఇంకా ఎందుకు ఆలస్యం. మన మెదడుకు కావలసిన మేతలా ఇలాంటి సమస్య దొరికినది కదా! మనం అడిగే ఈ ప్రశ్నకి పూజలు చేయడానికి వచ్చిన పూజారి బుర్ర తిరిగి పోవాలి” అని వాడు అంటుండగా బ్రహ్మ సిద్ధాంతి గారు రానే వచ్చారు. ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నారని అంటూ పొద్దున మన చర్చ ఎంత వరకు వచ్చి ఆగిపోయినది అనుకుంటూ “విగ్రహాలకు ప్రాణ శక్తి ఉంటే అవి మాట్లాడతాయని అనుకున్నాము కదా” మేము మా ప్రశ్న అడగకముందే ఆయనే దానికి సమాధానం చెప్పటానికి సిద్ధమయ్యేసరికి ఆశ్చర్యపోవడం మా వంతు అయినది. నవ్వుతూ చెప్పటం ఆయన వంతు అయినది. దేవాలయంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట , వాయు ప్రతిష్ట, మంత్ర, తంత్ర ప్రతిష్ట లాంటి పదాలు మీరు వినే ఉంటారు కదా! ప్రతిష్ట అంటే నిలబెట్టడం అన్నమాట. ఏదైనా దేవాలయంలో విగ్రహం ప్రతిష్టించి పూజ చేయడం మన హిందూ ధర్మ సంప్రదాయం లో ఉన్నది. సుమారుగా 40 మంది ఋత్విక్కులు, వేద పండితులు, మంత్రసిద్ది పరులు, ఉపాసన సిద్దిపరులు ఇలా వారి వారి మంత్ర, తంత్ర, యంత్ర సాధన స్థాయిలను బట్టి విగ్రహ ప్రతిష్ట సమయంలో బ్రహ్మ పదవి నుండి పరిచారిక పదవుల దాకా కొన్ని రోజులపాటు జపాలు, హొమాలు చేసి తెచ్చిన విగ్రహాన్ని జల వాసం, ధాన్య వాసం ఇలా మున్నగు వాసాలు విధానాలలో దానిని శుద్ధి చేసి దానికి తగ్గ యంత్రమునకు వివిధ రకాల పూజాదికాలు చేసి సమర్పించి…అనగా ఈ యంత్రములో 21 అంగాలుంటాయి! అవి 1. జీవం,2. ప్రాణం, 3. జీవమంత్రం, 4. ఆత్మమంత్రం, 5. శక్తి నేత్రములు, 6. శ్రోత్రములు,7. జిహ్వ,8. కర్త,9. కర్మ,10. క్రియ,11. మంత్రగాయత్రి,12. ప్రాణప్రతిష్ట మంత్రము, 13. సూర్యబీజము, 14. యంత్రగాయత్రి ,15. రక్తావర్ణము, 16. మాతృకావర్ణములు,17. పంచభూత బీజములు,18. దిక్పాలిక బీజములు,19.మాయాపాశ బీజములు, 20. అంకుశ బీజములు,21. దైవ మూలమంత్రము ...ఇలా 21 అంగాలుంటాయి! ఇలా చేసిన జపం, హోమం ఫల భాగము విగ్రహానికి అలాగే యంత్రానికి సమర్పిస్తూ విగ్రహానికి కళ్ళకి తేనె మైనం పూసి దేవాలయానికి విగ్రహమును తెచ్చి సమయానికి ఎక్కడైతే ప్రతిష్టించాలని అనుకున్నారో దాని పీఠ భాగంలో పూజ యంత్రం ప్రతిష్టించి ఈ తేనె మైనం ఉన్న విగ్రహాలను పెట్టి ఆ విగ్రహం చుట్టూ సిమెంట్ వేసి దానిని విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగిన తర్వాత క్షుద్ర దేవతల ఉపాసకుడు (భద్రకాళి, వీరభద్రుడు) ప్రతిష్టించి విగ్రహానికి ఆలయ శిఖరం నుండి ఒక సన్నటి ఎర్రని పట్టు దారం కడుతూ…దానికి బీజాక్షర విశ్వశక్తిని అనుసంధానము చేస్తూ... దానిని ధ్వజస్తంభం శిఖరానికి అనుసంధానం చేసి… దాని నుండి ప్రతిష్టించిన విగ్రహానికి నడుముకు దారం కట్టి… ఉపాసకుడు ఆ సమయంలో అతను ఒక్కడే ఉండి ప్రతిష్టించిన విగ్రహం యంత్ర భాగమునకు మంత్ర శక్తి ఈ ఆలయ శిఖరం నుండి అనగా విశ్వంలో ఉన్న విశ్వశక్తిని సంగ్రహించి ఈ రెండింటినీ మిళితం చేసి తీరని కోరికతో ఉన్న దేవత ఉపాసకుడు లేదా ఉపాసకురాలి ఆత్మను బీజాక్షర ఆత్మమంత్రంతో అందులో బంధించి దానిని ఆత్మశక్తిగా ఈ విగ్రహం నందు ప్రతిష్టించి యంత్ర భాగానికి మంత్ర, తంత్ర, యంత్రాలకు ఈ విశ్వశక్తి ఆపాదించి విగ్రహం బంధించిన ఆత్మశక్తి బయటకు రాకుండా దానిని యంత్రంలో అష్టదిగ్బంధనం చేసి వంద సంవత్సరాలు యంత్రానికి అలాగే విగ్రహానికి అనుసంధాన శక్తిని ఇస్తూ విశ్వ శక్తి అలాగే మంత్ర శక్తి అలాగే ఆత్మశక్తితో ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది! ఆ తర్వాత ఈయన విగ్రహం వెనక్కి వెళ్లి తలుపు తీసి తీయించి ఉంచి విగ్రహం యొక్క మొట్టమొదటి కళ్ళ దృష్టి ఒక ముదుసలి ఆవు మీద పడేటట్లుగా అక్కడ విగ్రహానికి ఎదురు సజీవ ఆవును నిలబెట్టిన తరువాత ఉపాసకుడు విగ్రహ కళ్ళకి ఉన్న తేనె మైనము తీయగానే ఎవరో తనను గట్టిగా చావగొట్టినట్లుగా బంధించిన ఆవు కాస్త వెర్రి ఆవేశంతో బంధనాలు తెంచుకొని పారిపోవటం ఏకకాలంలో జరుగుతాయి! వీరావేశంతో ఎందుకంటే ఆవుకు ప్రేత శక్తి , అలాగే దైవశక్తిని ఏకకాలంలో చూడగలిగిన శక్తి అలాగే వాటిని భరించే శక్తి ఈ సృష్టిలో దానికిమాత్రమే ఉంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. ఇలాంటిది ఉన్నదని మన మహర్షులు తెలుసుకోవటం గొప్పతనం. విగ్రహానికి కళ్లకున్న తేనె మైనము తీసే సమయంలో ఎవరైనా విగ్రహానికి ఎదురు పడితే రక్తం కక్కుకుని చావటం నేను రెండు సార్లు పైగా చూశాను.

నేను ఒకప్పుడు భౌతిక రసాయన శాస్త్రాలలో Ph.d చేసిన వ్యక్తిని. లేని దేవుడిని ఉన్నట్లుగా చూపించే వేదాలు కన్నా లేని దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి ప్రయత్నించే సైన్స్ ను ఒకప్పుడు పిచ్చిగా నమ్మిన శాస్త్రవేత్తను. కానీ ఇప్పుడు శాస్త్రవేత్త కాస్తా అది కూడా నేనే వేదాంతిగా మారినాను. రెండూ ఉన్నాయి. కాకపోతే కొన్ని కోట్ల సంవత్సరాల తేడాలు.. ప్రస్తుతం సైన్స్ అనేది ఏమి తెలుసో తెలుసుకుని పరీక్షించే స్థాయిలో ఉన్నది. తెలుసుకున్న వేదాలు మనకి అది ఎందుకు ఎలా ఎప్పుడు ఏమిటి అంటూ అన్ని సవివరంగా చెప్పేసింది. కానీ సైన్స్ మాత్రం అది ఎందుకు ఉన్నదో ఎలా ఉందో ఉందో లేదో అని ప్రతి విషయమునందు అయోమయ స్థితిలో ఉండి దానికి ప్రత్యక్ష అనుభవం కంటికి అయ్యేదాకా నమ్మి చావదు.అంతెందుకు ఉదాహరణకి మన పూర్వీకులు పసుపు ఉపయోగాలు తమ మనోనేత్రం ముందు తెలుసుకొని దానిని వంటల్లో వాడే విధానం ఆయుర్వేద శాస్త్రం గాను, గుమ్మాల మీద వ్రాసే విధానం వాస్తు శాస్త్రం గానూ, పూజలో వాడే విధానం మంత్ర శాస్త్రం, వేదాలలో చెబితే సైన్స్ మొదట దీనిని నమ్మలేదు. ఎవడో తెల్లవాడు దీని మీద వంద సంవత్సరాలు పరిశోధనలు చేసి భారతీయ మహర్షులు చెప్పిన పసుపు ఉపయోగాలు నిజమని వాడు సర్టిఫికేషన్ ఇస్తే అప్పుడు మన వాళ్లు ఉపయోగించడం జరిగింది. ఇదే విషయాన్ని వంద సంవత్సరాల క్రితం అక్షర సత్యంగా మనవాళ్లు వేదాలలో పొందుపరిస్తే దానిని మనమే ఆచరించని దుస్థితి లో ఉన్నాము. కానీ తెల్లవారు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనవాళ్లు ఆచరించడం మన దౌర్భాగ్యం. వాళ్లు చెప్పినది నమ్మరు. వీళ్ళు తెలుసుకునేసరికి మన జీవితకాలం కొంత భాగం పూర్తయిపోతుంది. అలాగే మన సైన్స్ వాళ్లు ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాలపాటు ప్రయోగాలు చేసిన తర్వాత విమానాలు కనుక్కున్నారు. రామాయణ కాలంలోనే కుబేరుడు ఆధీనంలో మాయాసురుడు అనే రాక్షస శిల్పి చేత నిర్మించబడిన పుష్పక విమానం ఉండేదని ఆనాడే రామాయణంలో వాల్మీకి రాశాడు .అలాగే వేదాలలో గ్రహదేవతలను లేదా ఇష్టదైవాలు తమ వాహనాలుగా జంతువులను ఉపయోగించేవారని ఉన్నది కదా. అలాగే కొన్ని సీసపు రేకుల గరుడ పక్షి యంత్రం గీసి వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తే ఇంటికి నలువైపులా భూమిలో వీటిని పాతిపెడితే కనుచూపుమేరలో ఆ ఇంటికి చుట్టూసర్పాలు ఉండని స్థితిని నేను స్వయంగా కళ్ళారా చూశాను. నేను పాములు తీసుకుని వెళ్లి ఆ యంత్రాలు పాతి పెట్టిన చోట వాటిని వదిలితే అవి ఏదో చూసి భయపడినట్లుగా ప్రాణభయంతో పారిపోయినవి. నా శాస్త్రవేత్త పరిశోధనలు గమనించే సరికి ఇప్పుడు సైన్స్ ఎప్పుడో పూర్వం చెప్పిన వేదాల కన్నా చాలా వెనుకబడి ఉందని దీనిని నమ్మకుంటే నేను ఇంకా వెనకబడి పోతాయేమోనని భయంతో వేదాలలో ఉన్న శాస్త్ర విషయాలను అర్థం చేసుకుంటూ వేదాంతిగా మారాను. మనకి అర్థమైనది సిద్ధాంతము. మనకు అర్థం కానిది వేదాంతం. అర్థం అయ్యి అర్థం కానిది రాద్దాంతం అవుతుందని నా జీవిత అనుభవాలే అందుకు ఉదాహరణగా ఎన్నో విచిత్ర సచిత్ర సంఘటనలు నిలుస్తాయి. మీరు కూడా నాలాగే మీ యవ్వన వయస్సు వృధా చేసుకుంటారు ఏమో అని భయంతో నా అనుభవంలో తెలుసుకున్న గోరంత విషయాలు పిసరంత జ్ఞానముతో మీకు చెప్తున్నాను. తెలుసుకోవలసినది కొండంత… తెలుసుకున్నది గోరంత… అందులో మనం అనుభవించేది పిసరంత... వేదాలు ఆలోచనలు కలిగిస్తే భౌతిక శాస్త్రాలు దానిని అనుభవం క్రియారూపం ఇచ్చేందుకు ప్రయత్నించాయి.

ఈ రెండూ తప్పు కాదు. కాకపోతే ఈ వేదాలు మరియు సైన్స్ మధ్య సరిగా అనుసంధానం జరిగితే అనుకున్న సత్య ఫలితాలు మన కళ్లముందు ఆవిష్కరిస్తాయి. అంటే మన సైన్సు వాళ్ళు కష్టపడి విమానాలు నిర్మాణం చేస్తే దానిని వేదాంతులు పూర్వం మన మహర్షులు వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో విమానం వంటి వాహనాలను ముందుగానే ఉపయోగించే వారిని చెప్పేవారే ఎక్కువ ఉన్నారు గానీ ఆ పూర్వ మహర్షుల ఆలోచనలు ఎంతవరకు కార్యరూపం జరుగుతాయి మాత్రం ఈ వేదాంతులు చెప్పలేరు. అదే పెద్ద సమస్య. చిక్కు సమస్యగా మారినది. పైగా సైన్స్ కనిపెట్టిన తరువాత ఈ విషయం ఫలానా చోట వేదంలో ఉంది అంటారు గానీ వేదాల్లో ఉన్న అసాధ్యమైన సాధ్యమైన విషయ పరిజ్ఞానం ముందుగానే సైన్స్ వాళ్ళకి ఒక ఆలోచన విధానం కలిగిస్తే మనము ఎప్పుడో స్వయంగా విమానాలు కనుక్కొని నడిపే స్థాయికి వచ్చేవాళ్ళం. మన వేద విజ్ఞానం పరాయి దేశాల వాళ్లు చదివి పూర్వీకుల వారి ఆలోచనలను ఆకళింపు చేసుకుని ప్రయోగాలు చేస్తూ ఈ కాలానికి తగ్గట్లుగా వాటి నిర్మాణం లో మార్పులు చేస్తూ అనుభవం తెస్తున్నారు. దాన్ని మనం చూసి ఆనంద పడుతున్నాము. పేరు వాడికి దిబ్బ మనకి. పూర్వం వేదాల కాలంలో వాహనాలు ప్రాణ ప్రతిష్ట చేసిన మంత్ర శక్తి ఉన్న యంత్రాలతో నడిచేవని పరాయి దేశపు వాళ్ళు తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టి ఇప్పటి కాలానికి తగ్గట్టుగా వాహన నిర్మాణాలు చేసి వాటికి యంత్ర పరికరాలు తయారు చేసి మంత్ర శక్తి బదులుగా దహన శక్తి అనగా పెట్రోల్, డీజిల్, బొగ్గు మండించి వచ్చే శక్తితో నడుపుతున్నారు. మరి వీరికి ఆలోచన ఇచ్చినది వేదాలే కదా! కానీ ఆచరణ వచ్చేసరికి ఈ కాలానికి తగ్గ వస్తువులతో పదార్ధాలతో క్రియ రూపంగా మార్చినది ఎవరు మన శాస్త్రవేత్తలే కదా! నిజానికి వేదాలలో సైన్సు ఉంది. అది అందరికీ అర్థమయ్యే సరికి వాటిని అందరికీ అందుబాటులో తెచ్చేసరికి మన జీవిత కాలాలు కరిగిపోతాయి. సరే రేపు వచ్చే మంగళవారం మీ ఊరికి దగ్గరలో గుడిలో హనుమాన్ విగ్రహం ప్రతిష్ట జరుగుతుంది. దాని నిర్వహణ బాధ్యత నేనే తీసుకున్నాను. సుమారుగా నూట ఎనిమిది రుత్వికులు చేసే మహత్తరమైన ఈ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మీరు చూడండి. నేను చెప్పినది నిజమా అబద్దమా మీకే తెలుస్తుంది. ప్రత్యక్ష అనుభవం పొందండి. రాతి విగ్రహం కాస్త ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత అది ఎలా సజీవమూర్తిగా మారుతుందో మీరే ప్రత్యక్షానుభూతి పొందండి. నమ్మండి వేదాలను అందులో చెప్పిన అక్షరసత్యాలని. మన సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా లేదా అందుబాటులోకి వచ్చే విధంగా మీ వంతు సహాయం చేయండి. వేద జ్ఞానంను పండితజ్ఞానం నుండి పామరజ్ఞానంగా మార్చే స్థాయికి మీరు తీసుకురండి. మీరు తప్పకుండా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కి రండి” అంటూ ఆనాటి తో మా ఊరి తిరునాళ్లు పరిసమాప్తి అవడంతో శాస్త్రవేత్త అయిన సిద్ధాంతి గారు వెళ్లిపోయారు. మేము ఈ వారం రోజులు ఎప్పుడు గడుస్తాయో అని ఎదురు చూస్తూ కాలం గడిపినాము.

బ్రహ్మ సిద్ధాంతి చెప్పిన ముహూర్తపు రోజు గానే వచ్చినది. నేను అలాగే జిజ్ఞాసి ఆఫీసులకి డుమ్మా కొట్టి ఆయన చెప్పిన ఊరికి వెళ్లి ప్రతిష్ట జరగటానికి సిద్ధముగా ఉన్న దేవాలయానికి వెళ్ళినాము. అక్కడకు వెళ్లి అక్కడ ఉన్న మాకు తెలిసిన బ్రహ్మ సిద్ధాంతిని కలిసి మా అవతారాలు మార్చుకొని పూజారులుగా అవతరించాము. మేము ఈ ప్రతిష్ట భాగంలో దేనికి పనికి రాము. దేనికి ఉపయోగపడము. కేవలం మా అనుభవాలు కోసం మాత్రమే ఈ విగ్రహ ప్రతిష్ట కోసం వచ్చినాము. పూజారిగా అయితే మరింత దగ్గరగా బ్రహ్మ సిద్ధాంతి చెప్పిన విషయాలు నిజమో కాదో చూడవచ్చును కదా. ఏమో ఎవరికి తెలుసు. ఏది సత్యం ఏది అసత్యము. ఐదురోజుల ప్రతిష్ట సమయంలో మేము చివరి అంకముకు వచ్చినాము. బ్రహ్మ సిద్ధాంతి చెప్పినట్లుగా విగ్రహానికి అలాగే యంత్రానికి జపాలు, హోమాలు ఈ నాలుగు రోజులు జరిగినది. ఇక అసలైన ప్రక్రియ నిజంగా జరుగుతుందో లేదో తెలియని ఒక రాతి విగ్రహానికి ప్రాణం పోయడం అదే ప్రాణ ప్రతిష్ట విధానం మొదలైనది.ఆలయ శిఖరం కు ఏదో ఎరుపు పట్టు తాడు కట్టి దానిని గుడి ధ్వజస్తంభ శిఖరానికి కట్టి యంత్రము ఉన్న పళ్ళెమునకు చుట్టి పడుకొని బెట్టిన హనుమాన్ విగ్రహానికి కట్టడం మేము చూశాము. నేను మా వాడు మాకున్న ఉత్సాహం ఆపుకోలేక ఆ పట్టు త్రాడును పట్టుకొని లాగి చూశాము. ఏమీ అనిపించలేదు. మామూలు గానే ఉంది. వామ్మో! మనకి బ్రహ్మ సిద్ధాంతి లేనిపోని కథనాలు చెప్పారా? అనవసరంగా వారం రోజులు పైగా సెలవులు పెట్టి వచ్చాము .ఎంత జీతం పోతుందో! వామ్మో !అనుకుంటున్న మా యొక్క కుక్క బుద్ధి అనగా అనుమానం బుద్ధి పోనించుకోలేదు. ఇది ఏమీ పట్టనట్లుగా బ్రహ్మ సిద్ధాంతి తో పాటు పూజాదికాలు చేసిన ఇది 108 ఋత్విక్కులు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారని నా కనుదృష్టికి కనబడినది. ఇంతలో ఎంతో ఆర్భాటంగా భారీ దేహంగా గంభీర వదనంతో పెద్ద పెద్ద రుద్రాక్ష, స్పటిక, తాయెత్తులు ,చిన్నపాటి యంత్రాలు తగిలించుకున్న ఒక తాంత్రిక ఉపాసకుడు కారు దిగి రావడం… ఆయనకి వీరంతా పూర్ణకుంభంతో స్వాగతం పలకడం… వీరిని తీసుకుని వెళుతూ బ్రహ్మ సిద్ధాంతి మా ఇద్దరి వైపు తిరిగి ఈయనే ఆయన నేను చెప్పిన తాంత్రిక ఉపాసకుడు అని లో గొంతులో చెప్పి వెళ్లి పోవడం జరిగినది. నిజానికి ఆయనను చూస్తుంటే రామాయణం సీరియల్ లోని రావణబ్రహ్మ లాగా కనిపించాడు.గంభీర వదనం, భారీ దేహంను ఎవరైనా చిన్న పిల్లలు చూస్తే “వామ్మో! నిజంగానే అమ్మ చెప్పిన బూచోడు వచ్చాడేమో” అని మరి లేని ఏడుపు తెచ్చుకుని వెక్కివెక్కి ఏడవటం ఖాయమని అనిపించినది. మాకే కొద్ది క్షణాలుపాటు ఎదో తెలియని తత్తరపాటు మొదలైనది! కానీ ఈ విషయాన్ని మాకు మేమే మాకే తెలియనంతగా కనిపించనంతగా జాగ్రత్తలు తీసుకొని ఆయన వెళ్లిన వైపుకు మేము కూడా ఏమి జరుగుతుందో చూద్దామని క్రొత్త విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త లాగా వెళ్ళినాము.

ఆయన గుడి పరిసరాలు అంతా తిరుగుతూ అక్కడే ఉన్న ఆలయ పూజారి తో “ఇక్కడ స్మశానం ఏ దిక్కులో ఉన్నది? ఎటు వైపు ఉన్నది? అని పెద్దగా గంభీరంగా అడిగేసరికి ఆ పూజారి ఎంతో వినయంగా “స్వామి! ఉత్తర దిక్కులో ఫలానా ప్రాంతంలో ఉన్నది” అని చెప్పడం మేమిద్దరం విన్నాము. వామ్మో! ఏమిటి ఈయన రాగానే స్మశానం గురించి అడిగాడు. అక్కడికి వెళ్లి పూజలు చేస్తాడా లేదా పూజలు చేసుకోవటానికి అడిగాడా? చూస్తుంటే అన్ని రకాల పూజలు చేసుకుని వచ్చే వాడిలాగానే ఉన్నాడే అంటుండగా ఆయన హోమాలు చేసిన యాగశాల లోనికి వెళ్లడం జరిగింది. లోపల ఏం జరుగుతుందో మేము చూసే అవకాశం లేకుండా ఆ యాగ శాలకు ద్వారబంధాలు వేసినారు. లోపలికి వెళ్లి ఏదైనా టిఫిన్ తింటున్నారు ఏమో అని మేము అనుకొని బయట వేచి గంట దాకా ఉన్నాము. కానీ మాలో ఏదో తెలియని ఆత్రుత కంగారు మొదలైంది. టిఫిన్ తినేవారైతే లోపల ఇంత సేపు ఉంటారా? కొంపదీసి నేను చూడకుండానే అంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట విధానం జరుగుతుందా? విగ్రహాన్ని ప్రతిష్టించేది! యాగశాలలో కాదు కదా! గుడిలో కదా! పైగా ప్రతిష్ట విగ్రహం గుడి ద్వారం బయట పడుకొని ఉన్నది” అనుకుంటూ లోపల తాంత్రికుడు ఏమి చేస్తున్నాడో చూద్దామని ఉత్సుకతతో ఎవరికీ కనిపించకుండా మేమిద్దరం యాగశాల వెనుకవైపు వెళ్లి చుట్టూ బంధనం వేసి ఉన్న వస్త్రాలలో ఒక వస్త్రానికి గంత చేసి లోపల ఏమి జరుగుతుందో చూద్దామని ఒక కన్నుతో లోపల చూసేసరికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అనిపించేంతగా ఒక భయంకరమైన నమ్మలేని దృశ్యం కనబడింది. అదేమిటో నేను చెప్పే లోపలే మాజిఙ్ఞాసి కూడా ఆత్రం ఆపుకోలేక వాడు కూడా నేను చూసిన గంతలోనే ఆ దృశ్యం చూసి గతుక్కుమన్నాడు. అదేమిటంటే యాగశాలలో మధ్యలో అతి పెద్ద హోమగుండం దగ్గర బ్రహ్మ కర్త కూర్చునే స్థానంలో ఈయన కూర్చొని ఎరుపు అన్నం ముద్దలు గాలిలో ఈ హోమ కుండానికి నలువైపులా అష్ట దిక్కులలో ఏవో మంత్రాలు చదువుతూ ఎవర్నో రమ్మని పిలుస్తున్నారు. అప్పుడు మరింత బిగ్గరగా మంత్రాలు చదువుతూ వచ్చావా… వచ్చావా అంటూ ఏవో ముద్దలు తెల్లవి, ఎర్రవి, నల్లవి, అంటూ కాంతిపుంజము వైపు వేస్తూ ఉండగా అది మేము గమనించే లోపల దానిని ఒక కలశం లోకి ఆవాహన చేయడం లిప్తకాలంలో జరిగినది. అసలు ఏమి జరిగిందో మేము తెలుసుకునే లోపల ఆయన ప్రతిష్ట మందిరానికి చేరుకోవడం జరిగినది. మేము ఎక్కడ ఉన్నామో వెతుక్కుంటూ బ్రహ్మ సిద్ధాంతి మేము ఉన్న చోటికి వచ్చి మేం చేస్తున్న పని చూసి నానా తిట్లు తిట్టి “నేను మిమ్మల్ని ఆయన చేసే పూజా విధానం చూడమని చెప్పలేదని పూజ అయిన అదే ప్రాణ ప్రతిష్ట మైన తర్వాత విగ్రహాన్ని పరీక్షించమని చెప్పినాను” అని చెప్పటం జరిగింది. మమ్మల్ని ఎవరు గమనించలేదు అని తెలుసుకొని స్థిమితపడి మమ్మల్ని గుడివైపు తీసుకుని వెళ్లారు.

అక్కడ ఇంతలో తాంత్రిక ఉపాసకుడు ప్రతిష్ట చేయవలసిన యంత్రానికి కి ఏవో వేలిముద్రలతో ఏవో మంత్రాలు చదువుతూ మా కంట ఓర కంటితో చూసి కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో ధ్యానంలోనికి వెళ్లి పోవడం జరిగినది. ఈలోపల అక్కడికి ఒక వైద్యుడు తన స్టెతస్కోప్ తీసుకుని రావడం జరిగింది. మేము ఆయన్ని గమనించి ఈయన ఎవరికోసం వచ్చినాడు? అని భయపడుతూ మేము ఉండగా బ్రహ్మ సిద్ధాంతి వారిని కలిసి మా వైపు తిరిగి మమ్మల్ని పిలిచి వారిని విగ్రహం ఉన్న వైపు తీసుకొని వెళ్ళినారు. మాకు ఏం జరుగుతుందో అర్థం కాక మేము కూడా వాళ్లు ఉన్న వైపు వెళ్ళినాము. అప్పుడు డాక్టర్ కి ఈయనకి ఏదో వాదనలు జరుగుతున్నాయి.

డాక్టర్ ఏమో” స్వామి! చెప్పమంటారా! ఈ రాతి విగ్రహానికి మనిషిలాగా ఈ విగ్రహానికి హృదయ స్పందన చూడమంటున్నారు? ఇది ఎలా సాధ్యం. ఒక రాయికి ఎక్కడైనా గుండె ఉంటుందా? దానికి స్పందించే గుణం ఉంటుందా? అంటే నేను మీ కంటికి ఎలా కనబడుతున్నాను? అంటూ వాదనకు దిగాడు. వెంటనే బ్రహ్మ సిద్ధాంతి “నేను ఎవరో మీకు తెలుసా” అంటూ అసలు తన నిజమైన శాస్త్రవేత్త పేరు చెప్పగానే డాక్టర్ ఎంతో ఆశ్చర్యంగా వారి వైపు తిరిగి “సార్! నన్ను క్షమించండి! మీరు ఉన్న ఈ అవతారంలో మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీరు ఇలాంటి వేదాంత విషయాలు మీద పరిశోధన చేస్తున్నారని ఏదో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ నేను చాలా చదివాను. ఇప్పుడు నాకు అర్థమైంది. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయకముందు అలాగే చేసిన తర్వాత వచ్చే తేడాలు గమనించాలి అని మీరు అనుకుంటున్నారు కదా! అది ఏమంత పని కాదు అంటూ ఒక మనిషి హృదయస్పందన చూసినట్లు స్టెతస్కోప్ తో చూసి “సార్! నాకు ఎలాంటి నాడి కొట్టుకోవడం వినిపించడం లేదు” అన్నారు. మా వైపు తిరిగి “మీరు కూడా డాక్టర్ లాగా స్టెతస్కోప్ తో పరీక్షించండి” అన్నారు. వెంటనే మేము కూడా ఇద్దరం ఆ స్టెతస్కోపు తీసుకుని ఒకటికి పదిసార్లు ఆ రాతి విగ్రహానికి నాడి కొట్టుకోవడం లేదని హృదయ పల్స్ రేటు లేనేలేదని రూఢీ చేసుకున్నాము. దాంతో బ్రహ్మ సిద్ధాంతి చిరునవ్వు నవ్వుతూ మా ముగ్గురిని ఆ విగ్రహానికి దూరంగా వెళ్ళమని చెబుతూ ఆ కట్టిన ఎర్రని పట్టుదారము ఎట్టి పరిస్థితుల్లో తాక వద్దని హెచ్చరిక చేస్తూ యంత్రపూజ చేస్తున్న తాంత్రిక ఉపాసకుడి వైపు వెళ్లడం జరిగింది. అప్పుడు డాక్టర్ మాతో “మీకు ఈయన ఎలా తెలుసు?” అంటూ అన్ని వివరాలు అడిగి తెలుసుకుని “అయితే ఈ విగ్రహానికి యంత్రమును పెట్టి ప్రాణ ప్రతిష్ట చేస్తే మనిషి గుండె స్పందనలు ఉన్నట్టుగా విగ్రహం ఉంటాయా? అయితే అదేదో వింత నేను మళ్లీ చెకప్ చేసి చూస్తాను. విగ్రహాలకు ఎలా ప్రాణం అదే జీవము వస్తుందో మీతో పాటు నేను కూడా చూస్తాను” అని మాకు దూరంగా సత్యానికి దగ్గరగా కూర్చున్నాడు. ఇంతలో తాంత్రిక ఉపాసకుడు తను చేసిన యంత్రంతో విగ్రహ ప్రతిష్ట కోసం గుడిలోకి వెళ్లడం జరిగింది. తర్వాత బయట ఉన్న రాతి విగ్రహం లోపలకి తీసుకుని వెళ్లడం జరిగింది. దానితో పాటుగా సిద్ధాంతి ఒక నలుగురు ఋత్విక పరిచారికలు ఆయనతోపాటు లోపల ఉండిపోయారు. వెనువెంటనే ఆ గుడి ద్వార బంధనాలు మూసివేయడం జరిగినది. సరిగ్గా నలభై నిమిషాల తర్వాత ఆ గుడి తలుపులు తెరిచారు. యంత్ర ప్రతిష్ఠ అలాగే విగ్రహం నిలబెట్టి దానికి పెట్టినారు. గంతలు కట్టినారు. విగ్రహానికి అడుగుభాగంలో సిమెంట్ వేసిన గుర్తులు కనబడినాయి.ఇంతలో ఒక ఆవుని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పటం ఆ తర్వాత కూడా ఒక ఎర్ర దారం విగ్రహం నుండి దీనికి అనుసంధానం చేస్తూ ఎవరిని ఆ కట్టిన తాడును అనగా ధ్వజానికి గోవు కి కలశానికి కట్టిన త్రాడును తాకవద్దని దూరంగా జరగమంటూ ఏదో కలశం లో ఉన్న పసుపు నీళ్లు చల్లుతూ ఏవో మంత్రాలు చదువుతూ తాంత్రిక స్వామి గుడిలోనికి వెళ్ళి విగ్రహం వెనక్కి వెళ్లి తన రెండు చేతులు విగ్రహం కళ్ళ మీద వేసి కళ్ళు ఎవరు దయచేసి చూడవద్దని కళ్ళు మూసుకుని ఆజ్ఞ చేస్తూ తను కూడా కళ్ళు మూసుకుని ఆ నలుపు గుడ్డ తీయడం అలాగే ఆ కళ్లకు పెట్టి ఉన్న తేనే మైనపు ముద్దలు తీయటం ఏదో ఆవేశం వచ్చినదాని లాగా ఆవు భయపడి పారిపోవటం నా అర్థం నేత్రాలతో ఓరకంట చూస్తూ ఉండిపోయాను. అప్పుడు అచ్చం మన బ్రహ్మ సిద్ధాంతి చెప్పినట్లుగా జరుగుతోంది అంటే ఇంతవరకు ఆయన చెప్పినది నిజమే కాకపోతే ఎప్పుడూ కలలో కూడా ఊహించని విచిత్ర దైవ అనుభవం మేము కళ్లారా చూస్తామని అనుకోలేదు. కలలో కూడా ఊహించలేదు.

అదేమిటంటే ప్రాణ ప్రతిష్ట, పూజాదికాలు పూర్తయిన తర్వాత రెండు గంటల తర్వాత మా ముగ్గురినీ బ్రహ్మ సిద్ధాంతి గారు గుడిలోకి తీసుకుని వెళ్లి ఈ సారి మళ్ళీ స్టెతస్కోప్ తో ఆ విగ్రహానికి ఎడమవైపు ఉండే ప్రాంతంలో గుండె హృదయ స్పందన పరీక్షించమని డాక్టర్ ని అడిగితే ఆయన వెంటనే ఉత్సాహంతో స్టెతస్కోప్ తో చెకప్ చేసినాడు. ఏదో అనుమాన ఆశ్చర్యానికి గురి అవుతూ అనుమానం వచ్చిన వాడిలా పరిశోధించే వారిలాగా ఒకటికి పదిసార్లు చేస్తూ "వామ్మో! ఏంటి లీల! చాలా చిత్రంగా ఉంది! మొదట వినిపించి వినిపించనంత శబ్దంతో స్పందన లాగా వినిపించింది. అది నిజం కాదని నిజము ఒకటికి పదిసార్లు పరీక్షిస్తే అది ఇప్పుడు మనిషి గుండె స్పందన లాగా చాలా చక్కగా వినబడుతోంది. వామ్మో ఎవరైనా ప్రాణం ఉన్న మనిషి దూరారా? అబ్బాయిలు మీరు కూడా పరీక్షలు చేయండి మీకు గుండె స్పందన ఆగకపోతే నేను నా చెప్పుతో కొట్టుకుంటాను” అంటూ మాకు ఆయన స్టెతస్కోప్ ఇచ్చి పక్కకు తప్పుకొని మా ఇద్దరి హృదయ స్పందన భావాలు ఎలా ఉంటాయో చూడటం జరుగుతోంది. ఏముంది షరా మామూలే. మళ్లీ మా లిస్టులో కొత్తగా మరో కొత్త నమ్మలేని ప్రత్యక్ష అనుభవం చేరినది. మా హృదయ స్పందనలు తగ్గిపోవటం ఆ రాతి విగ్రహానికి… సారీ ఆ సజీవ విగ్రహమూర్తి హృదయ స్పందనలు పెరగడం…. మా ఇద్దరికి వినిపించేసరికి ఏదో తెలియని ప్రేమపూరితమైన ఆర్ద్రత తో కూడిన భావనలు మాకు తెలియకుండా కళ్ళవెంట నీళ్ళు రావడం జరిగినది.

మేము పక్కకు తప్పుకునే సరికి బ్రహ్మ సిద్ధాంతి ఆ విగ్రహానికి కలశంలోని పసుపు నీళ్ళతో విగ్రహమూర్తికి అభిషేకం చేసి ఆ సజీవ విగ్రహం మూర్తికి బంగారపు కళ్ళు అమర్చే మధుర సంఘటన చూస్తూ నిజమూర్తి దైవానికి నమస్కారం చెప్పాము. ఇలాంటి అనుభూతి కలిగించిన బ్రహ్మ సిద్ధాంతి పాదాలను తాకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి వద్ద సెలవు తీసుకుని ఉద్యోగాల కోసం బస్సులు వైపు కి వెళ్ళటం జరిగినది.

గమనిక: దేవాలయంలోని విగ్రహాలు, విగ్రహ యంత్రాలు ఎంతో పరిశుద్ధమైన మహత్తరమైన దివ్యశక్తితో కూడి ఉండుట చేత మైల ఉన్నవారిని, నెలసరి ఉన్నవారిని గుడికి దూరంగా రావద్దని చెప్పడం జరిగినది. ఎందుకంటేమైల ఉన్నవారికి వారి చనిపోయిన వారి ప్రేతశక్తి సుమారు 11 రోజులపాటు వారి వంశస్థులుకు ఉంటుంది. అలాగే నెలసరి వారికి వారి శరీర ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో శరీరమంతా వేడి ఆవిరిలతో, చెడు రక్తం తో కూడిన రుణాత్మక శక్తితో వారు ఉంటారు. ఈ రెండు శక్తులు కూడా ప్రాణ ప్రతిష్ట యంత్రాలకు ఉన్న పరిశుద్ధ మంత్ర శక్తిని దెబ్బ తీయడం జరుగుతుంది. ఈ ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కాని కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే జరిగితే తీవ్రమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ విగ్రహానికి ఉన్న శక్తి దెబ్బతింటుందో ఆనాటి నుండి ఆ విగ్రహం లో ఉన్న దైవ శక్తి ఆత్మ శక్తి గాను అటు పిమ్మట ప్రేతశక్తి గా అనగా సత్వ, రజో, తమో గుణాలలో సత్వము నుండి తమోగుణాన్కి చేరుకుంటుంది. అప్పుడు ఆ విగ్రహం ఉగ్రశక్తి లో నరబలులు, జంతుబలులు తీసుకోవడం జరుగుతుంది. ఊళ్లో అకాల మరణాలు, అనుకోని అగ్ని ప్రమాదాలు, యువకుల ఆత్మహత్యలు, అకాల జంతు మరణాలు విరివిగా జరుగుతాయి. కష్టనష్టాలకు నాంది పలుకుతుంది. తెలిసో తెలియకో ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే ఆ దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు చేయటం అలాగే 12 సంవత్సరాలకు ఒకసారి అష్టదిగ్బంధనం మహా సంప్రోక్షణ పూజలు పదిహేను రోజులపాటు చేయటం తిరుపతి వెంకన్న దేవాలయంలో, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయంలో, అమ్మవారి స్వయంభూ శక్తిపీఠాలలో అలాగే శివయ్య స్వయంభూ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ శుద్ధి పూజలు జరుగుతుంటాయి. ఇవి ఎలాను జరుగుతున్నాయి కదా అని తెలిసి కూడా తప్పులు చేస్తే మీ వంశమే నాశనమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త! ఎంతో స్వానుభవం మీద చెబుతున్నాను. నెలసరి 5 రోజుల వరకు అలాగే మైలపూర్తి అయిన తర్వాత వరకు మీ ఇంటిలోని దైవిక వస్తువులు, విగ్రహాలు, యంత్రాలు తాక వద్దు.అలాగే పరిసర దేవాలయంలోకి వెళ్ళవద్దు. ఆయా దేవతల ఆగ్రహానికి గురి కావద్దు. మీ జీవితాలు చేతులారా నాశనం చేసుకోవద్దు. ఈ రెండు రకాల ఇబ్బందులు లేని రోజుల్లో ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఆడ లేక మగ అయినా దేవాలయ దర్శనంకు వెళ్ళవచ్చు. తాకవచ్చు. స్పర్శ ఆనందం పొందవచ్చు.

విగ్రహాలు నైవేద్యాలు తింటాయా?

మేము మా ఉద్యోగ విధుల లో బిజీగా ఉంటూ విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధన ఎలా చేయాలో వివిధ రకాల పుస్తకాలు చదువుతూ అవి అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో ఉంటూ మాతో మా ఇష్టదైవాలు స్వయంగా ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాక మధనపడుతూ వాదనలు చేసుకుంటూ దానికి తగ్గ ఆలోచనలు చేస్తూ ఒక సంవత్సర కాలం మాకు తెలియకుండానే జరిగిపోయింది. దాంతో మళ్ళీ గుడికి తిరునాళ్లు ఉత్సవాలు రావటం, దీనికోసం వచ్చే బ్రహ్మ సిద్ధాంతి కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఆ రోజు రానే వచ్చింది. ఉదయం ఆయన దగ్గరకు వెళ్లి పాద నమస్కారాలు చేసి క్షేమ సమాచారాలు కనుక్కొని మా ఆధ్యాత్మిక చింతన సభ చర్చ మొదలైంది. పూజకి గుడిలో ఇంకా బాగా ఆలస్యం ఉండేసరికి ఆయన కూడా మాతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించడానికి ఆసక్తి చూపడంతో మా లో మాకే తెలియని ఏదో ఆనందం ఉత్సాహభరితంతో మా జిఙ్ఞాసికి వచ్చిన ఒక ధర్మ సందేహం ఆయన ముందు ఉంచారు. “స్వామి! రాతి విగ్రహాలు కాస్త సజీవ విగ్రహంలా ఎలా మారుస్తారు దాని విధి విధానాలు క్రిందటి సంవత్సరం చెప్పినారు. ఆ ప్రత్యక్ష దైవ అనుభూతి అందించారు. అది అక్షర సత్యమే కాని నాకు ఒక సందేహం వచ్చింది. ఈ సజీవ విగ్రహం మూర్తులకు పెట్టే నైవేద్యాలు అవి తీసుకోవు గదా. తినలేవు కదా. మరి వాటికి పెడుతున్నామని మనం తింటున్నాము కదా. అది తప్పే కదా. ఈ విగ్రహమూర్తులు నైవేద్యాలు తినని కాడికి వాటికి పెట్టడం ఎందుకు ప్రసాదాలు? వాటిని వెనక్కి తిరిగి మనము ఎందుకు తీసుకోవడం?” అని అన్నాడు. దానికి ఆయన చిరునవ్వు నవ్వి “నాయనలారా! విగ్రహాలు మీరు పెట్టిన నైవేద్యాలు తీసుకోవని ఎలా అనుకొన్నారు? మీ దృష్టిలో తినటం అంటే అవి మనిషి తిన్నట్లుగా తినాలి కదా అని అనుకుంటున్నారా? చాలా తప్పు. అలాగే ఇలా యంత్రాలతో ప్రాణ ప్రతిష్ట చేయబడిన విగ్రహాలకు దైవిక శక్తి ఏర్పడుతుంది అని మీకు తెలుసు కదా. ఈ దైవిక శక్తికి కూడా మనిషి లాగానే వాటికి కూడా ఆకలి నిద్రలు వస్తాయి. ఉంటాయి .కానీ మనము వాటిని గమనించే స్థితిలో ఉండము ఎందుకంటే మన దృష్టిలో అవి ప్రాణములేని విగ్రహ మూర్తులు కానీ నిజానికి అవి సజీవ మూర్తులే. మీరు పెట్టిన నైవేద్యాలు ఎలా తీసుకుంటాయో మీకు చూపిస్తాను రండి” అంటూ ఆయన

నిత్యపూజ చేసుకునే శివ పంచాయతమును బయటికి తీసినారు!అందులో మధ్యభాగములో ఉన్న అమ్మవారి విగ్రహం బయటికి తీసి బ్రహ్మ సిద్ధాంతి మా ఇద్దరిని కూడా లోపల గదికి తీసుకుని వెళ్లి గది తలుపులు మూసి వేసి ఏవో మంత్రాలు చదువుతూ మహా నైవేద్యానికి పెట్టడానికి ఉపక్రమిస్తూ మా కళ్ళ మధ్య మేము బొట్టు పెట్టుకునే ప్రాంతాన్ని తన బొటన వేలుతో వ్రేలు మా ఇద్దరినీ తాకీ తాకగానే నాకు ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లు మాలో ఏదో శక్తి ప్రవేశించినట్లుగా అనిపించినది. . మేము నిద్రమత్తులో జోగడం మొదలైంది. ఆయన మంత్రాలు చదువుతూ మహా నైవేద్యం అమ్మవారికి నివేదన చేస్తుంటే అక్కడ ఉన్న ఆహారపళ్లెం లో ఉన్న అన్ని రకాల పదార్థాలు వాటి ఆకారాలతో కూడిన సూక్ష్మ పదార్థాలు గాల్లోకి లేసి అమ్మవారి నోట్లోకి వెళ్ళటం కొంతసేపటి తర్వాత అమ్మవారి నోట్లోనుండి ఆ పదార్థాలు ఎంతో దివ్యకాంతులతో మళ్లీ తిరిగి అక్కడ ఉన్న ఆహారపళ్లెము లోనికి వెళ్లి పోవడం చూసేసరికి అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో అంటే మనం పూజించే మన ఇష్టదైవాలు మనం పెట్టే ఆహార పదార్థాల యొక్క సూక్ష్మరూపాలను అనగా వాటి పదార్థ ప్రాణ శక్తిని ఆహారముగా తీసుకుని తిరిగి వాటిని తమ ఎంగిలి ద్వారా వాటికి దైవ శక్తిని ఆపాదించి ఈ ఆహార పదార్థాలు దైవ ప్రసాదాలు గా మారుస్తాయి. దైవ ప్రసాదం అంటే దైవం ఎంగిలి చేసిన పదార్ధం అని నాకు లీలగా గుర్తుకు వచ్చే సరికి గది తలుపులు తెరిచేసరికి అప్పటిదాకా మమ్మల్ని ఆవరించిన యోగ నిద్ర లాంటి మత్తు వదిలి పోయింది. దాంతో మాకు విపరీతమైన ఆకలి వేస్తుండటంతో ఇంటి నుండి మహానైవేద్యం పెట్టడము పూర్తి అయినదని భోజనం కు రమ్మని పిలుపు రావడంతో మేమంతా ఇంటిలోనికి భోజనం చేయటానికి వెళ్ళాము. భోజనం పూర్తయిన తర్వాత కాసేపు నడుంవాల్సి తిరిగి మళ్ళీ గుడిలోకి వెళ్లాం. నాకు ఒక సందేహం వచ్చింది. మరి ఇన్నాళ్లు నేను అమ్మవారికి ఎన్నో రకాల నిత్య మహా నైవేద్యం పెట్టినాను. కానీ నాకు ఎప్పుడు ఇలాంటి ప్రత్యక్ష దృశ్య అనుభూతి కలగలేదు. ఈయన ఏమైనా కనికట్టు చేశాడా? ఏదో బొట్టు స్థానంలో బొటనవేలు పెట్టినాడు కదా! ఏమో చెప్పలేము! ఏదైనా జరగొచ్చు కానీ అలా చేసే మనిషి కాదు. మరి ఇన్నాళ్లు కనిపించనిది ఇవాళ ఎలా కనబడిందని నాకు వచ్చిన సందేహం ఆ బ్రహ్మ సిద్ధాంతికి చెప్పడం జరిగినది.

దానికి ఆయన పెద్దగా నవ్వుతూ “కనికట్టా పాడా! మీకున్నఉన్న మనోనేత్రం అదే (third eye) కొన్ని క్షణాలపాటు నా మంత్ర శక్తి ద్వారా బొటనవేలు పెట్టి తెరిపించాను. అంటే నా లెక్క ప్రకారము సైన్స్ చెప్పే పీనియల్ గ్రంథి తెరిపించడం అన్నమాట. ఎవరికైతే శాశ్వతంగా తమ మనో నేత్ర మైన త్రినేత్రం అదే పీనియల్ గ్రంథి సంపూర్తిగా తెరుచుకొని ఉంటే వారికి ఈ లోకంలో కనిపించని అదృశ్య శక్తి తో తిరిగే అన్ని రకాల వస్తువులు, జీవ జాతులు వాటిని ఆవరించి ఉన్న అరాశక్తి అలాగే వాటి ఆత్మ శక్తి అయిన సూక్ష్మ శరీర రూపాలు మనకి అగుపిస్తాయి. అలాగే భూత వర్తమాన భవిష్యత్తు లో జరగబోయే అన్ని రకాల సంఘటనలు అలాగే మీకు కావలసిన సంఘటనలు సుస్పష్టంగా మీరు సంకల్పించుకోకున్నా సంకల్పం ఉన్నా కూడా ఒక వీడియోలో దృశ్యం లాగా కనబడతాయి. అంటే టీవీలో సినిమా చూసినట్లుగా ఈ పీనియల్ గ్రంథి తెరుచుకుంటే అలాగే చూడవచ్చును అన్నమాట. తలచుకుంటే వామ్మో! ఇనాళ్ళు కేవలము కలలో లేదా ధ్యానములో ఏవో దృశాలు చూడటము జరిగినది!కాని ఇవి ఏమియు లేకుండా మనకు తెలియని విషయాలు, ఆత్మ శక్తులు సూక్ష్మ శరీరధారులను చూడవచ్చును. అలాగే భూత వర్తమాన భవిష్యత్తులో జరగబోయే అన్ని రకాల సంఘటనలు చూడవచ్చును. వామ్మో! ఇదేదో చాలా బాగుంది. అదేదో నాకు తెలిస్తే ఈ లోకాన్ని ఒక ఆట ఆడిపించవచ్చు కదా మరి ఉందని తెరుచుకొని ఇందాకటి నైవేద్యం సంఘటన ద్వారా తెలిసినది. మరి అది శాశ్వతంగా తెరుచుకోవాలంటే ఏమి చేయాలి? అలాగే తెరుచుకుని ఉన్నది అని మనకి ఎలా తెలుస్తుంది అని నాకే వచ్చిన అన్ని సందేహాలు ఆయన ముందు పెట్టాను.

అప్పుడు ఆయన మాతో వెంటనే “నాయనలారా! రామకృష్ణ పరమహంస, నామదేవుడు మీరాబాయి సక్కుబాయి, అక్కమహాదేవి ఇలా ఎందరో యోగిని యోగులు తమ సాధన శక్తి స్థాయిలను పెంచుకుని వారి త్రినేత్రాలను వారి సద్గురువు ద్వారా, దీక్ష గురువుల చేత శాశ్వతంగా తెరిపించి కొనే స్థాయికి చేరుకున్నారు. శ్రీ కృష్ణునికి సాందీపముని, శ్రీరాముడికి వశిష్ఠుడు, షిరిడి సాయి బాబా వారికి వెంకుసా ,నామ దేవుడికి విఠోబా సద్గురువుగా వచ్చి వారి శక్తి పాత సిద్ది ద్వారా వీరి మనోనేత్రమైన త్రినేత్రం తెరిపించడం జరిగినది. దాంతో వాళ్లు తమ ఇష్టదైవాలను సజీవమూర్తిగా, వారి ఆత్మ శక్తి స్వరూపాలను చూడటం, మాట్లాడటం వారికి తినిపించడం వారు ఆనందపడటం ఇలాంటివి అతి స్పష్టంగా అతి దగ్గరగా చూడడం జరిగినది. ఒక విషయం గమనించారా! క్రిందటి సంవత్సరం మీరిద్దరూ సజీవ హనుమాన్ విగ్రహమూర్తి యొక్క హృదయ స్పందన, నాడి కొట్టుకోవడమే గమనించారు కానీ ఆయన ఆత్మ శక్తి సూక్ష్మ శరీరమును చూడలేకపోయారు. ఆ విగ్రహంలో తాంత్రిక సాధకుడు యాగశాల లో చేసిన హోమాలు క్రతువుల ద్వారా వచ్చిన హోమ శక్తిని పిండ బలిహరణ ప్రక్రియ ద్వారా ఆత్మశక్తిగా మార్చడం జరిగినది. దానిని ఒక పూర్ణ కలశం లోనికి తీసుకుని రాతి విగ్రహం పెట్టి దానిని సజీవమూర్తిగా జీవకళ తెప్పించటం జరిగింది. కానీ మీరు ఆ విగ్రహంయొక్క నాడి కొట్టుకోవడమే గమనించారు గాని ఆనాటికి గల కారణమైన సూక్ష్మశరీరమును చూడలేకపోయారు చూసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. మీరు తిరిగి ఉద్యోగాలకు వెళ్లే వాళ్లు కారు. సన్యాసులుగా మారి దివ్య క్షేత్రం వెళ్లి యోగ సాధన చేసుకునేవారు అని చెప్పి ఈ విషయాలు మాకు అర్థమయ్యే దాక ఆయన మాట్లాడటం ఆపివేసి కొంతసేపు కళ్లుమూసుకుని నడుం వాల్చినారు.

ఇంతలో మాకు మరికొన్ని సందేహాలు కలిగాయి.అంటే ఇప్పటి దాకా మాకు వచ్చిన తొలి గురువులు కేవలం మంత్ర గురువులు అన్నమాట. మంత్ర సిద్ధి కలిగించడానికి ఆయా దైవ మంత్రములను ఉపదేశం చేసినారు. ఇప్పుడు ఈ త్రినేత్రం తెరవాలంటే దీక్ష గురువు అంటే సద్గురువు కావాలి. అసలు మంత్ర గురువు వెతకడానికి నానా తిప్పలు పడ్డాము. మరి కొత్తగా దీక్ష గురువు రావాలి అంటారు. ఆయనకి ఆయన మన సాధన స్థాయి అంత స్థితికి వచ్చేసరికి వారు ఎక్కడ ఉన్నారో తెలియటం జరుగుతుంది లేదా వారే మన దగ్గరికి రావడం జరుగుతుంది లేదా వారే మనల్ని తమ దగ్గరికి రప్పించుకునే అవకాశం ఉండొచ్చు.ఎలా అంటే శ్రీకృష్ణుడు ,శ్రీరాముడు వారి సద్గురువులను ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి వారికి గురు సేవ చేసి తమ త్రినేత్రం తెరిపించుకోవడం జరిగింది. ఇక రామకృష్ణ పరమహంస వారి సద్గురువులు వారి దగ్గరికి రావడం జరిగినది. ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన ప్రియ శిష్యుని కోసం ఎదురు చూస్తూ సిద్దయ్యకి తన ఆత్మజ్యోతి చూపించి తన దగ్గరికి స్వయంగా రప్పించుకోవడం జరిగినది. అన్నమయ్యకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సద్గురువుగా వచ్చినాడు. అలాగే భక్త పోతనకు త్యాగయ్యకు వారి ఇష్టదైవాలు మారువేషంలో స్వయంగా వచ్చి వారే శక్తి పాతం చేసినట్లుగా వారి వారి చరిత్రలలో సూక్ష్మంగా మనకు కనబడుతుంది. అంటే సద్గురువు కోసం మనం వెతుక్కోవాల్సిన పనిలేదు అని, మనము ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది. ఆ స్థాయిలో మన సాధన శక్తి ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఆ స్థాయికి మన సాధన శక్తి పెరిగిందని ఎలా తెలుస్తుంది అని నేను మధనపడుతుండగా నిద్రపోతున్న బ్రహ్మ సిద్ధాంతి అకస్మాత్తుగా నిద్ర లేచి “నాయనలారా ఏమీ లేదు. మీ సాధన స్థాయి గూర్చి బాల త్రిపుర సుందరి అంశ అయిన బాలాదేవి మీకు కనపడి చెబుతుంది”. అన్ని వివరంగా చెబుతాను అని సాయంత్రం అనుష్టానం వేళ అవుతుందని ఆయన వెళ్లి పోవడం జరిగినది. దాంతో మాకు ఎక్కడ లేని నిరుత్సాహం ఆవరించింది. కథ మంచి రసపట్టులో ఉండగా ఆయన పూజ అని చెప్పి వెళ్లిపోవడం మాలో అసహనం, విసుగు, కోపం వచ్చినాయి! కాని ఏమి చేయగలం! అలాగని మీరు కూడా వారి అనుభవాలు వినాలంటే ఎదురుచూడక తప్పదు. అంతదాకా మీరు కూడా మీ నిత్య అనుష్ఠానాలు చేసుకోండి. ఉంటాను. మాతో ముందుకు ప్రయాణించండి.

కపాల మోక్షం - 41 - సాధన స్థాయిలు చెప్పే అమ్మవారు

మా బాల త్రిపుర సుందరి

అంటే సద్గురువు కోసం మనం వెతుక్కోవాల్సిన పనిలేదు అని, మనము ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది. ఆ స్థాయిలో మన సాధన శక్తి ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఆ స్థాయికి మన సాధన శక్తి పెరిగిందని ఎలా తెలుస్తుంది అని నేను మధనపడుతుండగా నిద్రపోతున్న బ్రహ్మ సిద్ధాంతి అకస్మాత్తుగా నిద్ర లేచి "నాయనలారా! ఏమీ లేదు. మీ సాధన స్థాయి గూర్చి బాల త్రిపుర సుందరి అంశ అయిన బాలాదేవి మీకు కనపడి చెబుతుంది. మీరు ఆమెను పూజించిన పూజించక పోయినా లేదా మీ దేవత శక్తి అయిన పూజించినను లేదా మీ యోగ ప్రక్రియ ద్వారా మీ సాధన శక్తి పెంచుకున్న లేదా మీరు యంత్రాల ద్వారా యంత్రసిద్ది పెంచుకున్న జప సిద్ధి, ప్రాణాయామం సిద్ధి లేదా ఉపాసన సిద్ది పొందితే ఆమె మూడు రూపాల్లో ఖచ్చితంగా మీకు కనబడుతుంది. ఆమె కనపడాలంటే మీరు పైన చెప్పిన విధి విధానాలలో ఏదో ఒకదానిలో సిద్ధి పొంది ఉండాలి. అంటే పైన చెప్పిన వాటిని క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా, వాయిదా వేయకుండా, ఆత్మ నిష్ఠతో, కర్మిష్టి గా, నిష్కామ భక్తితో, అచంచల భక్తివిశ్వాసాలతో, శ్రద్ధతో , ఓపికగా, సహన శక్తి తో 12 సంవత్సరాలపాటు సాధన చేస్తే అప్పుడు మీరు ఎంచుకున్న విధానానికి మంత్ర సిద్ధి లభించినట్లే. అక్కడి నుండి మీరు వాక్సుద్ధి మాయలో, కామమాయలో పడకుండా మూడున్నర సంవత్సరాల పాటు ఉండగలిగితే మీ సాధన శక్తిని పరీక్షించడానికి బాల అమ్మవారే స్వయంగా మీ ఇంటికి వస్తుంది. మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. కానీ ఇతరులకు నేను ఉన్నానని మీ ఇంట్లో తిరుగుతున్నానని మాత్రమే సంకేతాలు ఇస్తోంది. ఆవిడ వచ్చే రూపం మీ సాధన స్థాయి ఏమిటో చెబుతుంది.

అంటే మీ సాధన స్థాయి బాల స్థాయిలోనే ఉంటే ఆవిడ 3-5-8 సంవత్సరముల వయస్సులో ఉన్న చిన్న ఆడపిల్లలాగా నిన్ను మీ ఇంటిలో నాన్న నాన్న అంటూ తిరుగుతూ ఆమెకు కావలసిన పదార్థాలు, సేవలు చేయించుకుంటుంది. సాక్షాత్తు పరాశక్తి ఈ బాలరూపంలో మీ కన్న కూతురు లాగా మెలుగుతుంది. తిరుగుతుంది. వెళ్లిపోతుంది. మళ్లీ వస్తూ ఉంటుంది. ఇక నీ సాధనా స్థాయి మధ్యమ స్థాయిలో ఉంటే అమ్మవారు కాస్త మధ్య వయస్సున్న స్త్రీ మూర్తి లాగా అంటే సుమారు 18-35 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ మూర్తిగా మీ ఇంటికి వచ్చి మీ పూజకు కావాల్సిన సేవలు చేస్తుంది. మీకు కావలసిన పూజా వస్తువులు, మహా నైవేద్యం అందిస్తుంది. ఇక మూడవ స్థితిలో అనగా మీ సాధన స్థాయి చివరి స్థితికి వచ్చేసరికి ఆవిడ కాస్త 45-65 సంవత్సరాల వృద్ధ స్త్రీ మూర్తిగా మీ దగ్గరకు వస్తూ మీకు కావలసిన సలహాలు, సహకారాలు అందిస్తూ బయటకు వెళుతూ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక నాలుగవ స్థితిలో అనగా మీ సాధన స్థాయి అంతిమ స్థితికి వచ్చేసరికి ఆవిడ కాస్త 85 సంవత్సరాల వయోవృద్ధ స్త్రీ మూర్తిగా ఆలంపుర జోగులాంబ లాగా ఒక మంత్రగత్తెలాగా దర్శనమిస్తుంది! ఈ మూడు స్థాయిలు ఏకకాలంలో జరగవు. అలాగే బాలాదేవి కూడా ఏకకాలంలో బాలా, త్రిపుర, సుందరి,గా ఏకకాలంలో కనపడదని తెలుసుకో. ఆవిడ మీ సాధన స్థాయికి 12 సంవత్సరాల మధ్యకాలం తీసుకుంటుంది. అంటే ఈసాధన బాల స్థాయి ఉంటే ఐదు సంవత్సరాలు గా కనపడుతూ వెళుతూ మూడున్నర సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ మీ సాధన స్థాయి పెరిగితే త్రిపుర గాను, తర్వాత మీ సాధన స్థాయి పెరిగితే సుందరిగాను కనబడుతూ ఈ మధ్యకాలంలో సాధన స్థాయిలలో అన్ని రకాల యోగ మాయలలో నువ్వు పడనంతవరకు ఆమె మీ సాధన స్థాయి ఏమిటో ఆయా రూపమును బట్టి చెప్తుంది. అంటే మీ సాధన స్థాయి బాల నుండి చివరి స్థాయికి వచ్చేసరికి 12+12+12=36 సంవత్సరాలు పడుతుంది అది కూడా నువ్వు ఎలాంటి యోగ మాయలలో పడకపోతే! పడితే అంతే సంగతులు. చిత్తగించవలెను. అంతటితో ఈ జన్మకి ఈ సాధన ఆగిపోతుందని భావించుకోవచ్చు.అప్పుడు మీ గురువులే వచ్చిన, సద్గురువువే వచ్చిన, నీ పరమ గురువు వచ్చిన, మీ ఇష్ట దైవాలు వచ్చిన, మీయోగసాధన మాత్రం ముందుకు వెళ్ళదు. అంతటితో స్వస్తి పలకడం జరుగుతుంది. అందుకే యోగ సాధన అనేది కత్తి మీద సాము లాంటిది. దీనికి రెండువైపులా పదును ఉంటుంది. ఒకవైపు పైకి లేపుతూనే మరోవైపు మాయలో పడవేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ రెండింటినీ సమన్వయం పరచుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మాయ మాయం అవుతుంది. అప్పుడే మన త్రినేత్రం సంపూర్తిగా తెరుచుకుని స్థాయికి వస్తుంది. అంటే బాల గా వచ్చి పసిపిల్లల వ్యామోహంలో పడేలా చేస్తుంది! అదే త్రిపుర రూపంలో వచ్చి యవ్వనవతి గా ఉండిమనలో తీవ్రమైన కామోద్రేక శక్తిని పరీక్షించును. ఇక సుందరి రూపంలో వృద్ధ స్త్రీ మూర్తి రూపంలో మన ఇష్టకోరిక శక్తిని పరీక్షిస్తుంది. ఇక దేవి రూపంలో ముసలి వృద్ధ స్త్రీ మూర్తి రూపంలో మన సహనశక్తిని ఓపికను పరీక్షిస్తుంది. వీటిలో నువ్వు పరిపూర్ణ సంపూర్ణ స్థాయిలో మీ ఈ సాధన స్థాయి ఉందని ఆమెకు అనిపిస్తే అప్పుడు నీకు నీ సాధనకి తగ్గట్లుగా మంత్రగురువు, సద్గురువు, పరమగురువు, ఆదిగురువు ప్రసాదించును.

నీవే ఆయన దగ్గరికి వెళ్లడం గాని లేదా నీ దగ్గరికి ఆయనే వచ్చేటట్లుగా చేయడం జరుగుతుంది.ఈ వచ్చే సద్గురువువులు మీకు తెలిసిన వారు లేదా తెలియని వారు కావచ్చు. వారు ఎక్కడ ఉన్నారో ఎలా ఉంటారో నీకు చూపించి ఆమె నీ దగ్గర నుండి అంతర్ధానమవుతుంది. బాలాదేవి యొక్క ఆఖరి నాలుగవ రూపమైన దేవిరూపముగా ఆదిపరాశక్తిగా కనపడితే...నీకు కపాలమోక్షమే! అంతటితో నీ సాధన సంపూర్ణముగా ద్విగిజయముగా పూర్తి అయినట్లే! ఇక ఎప్పటికీ మనకు కనపడదు. కానీ నా అనుభవం ప్రకారము సాధకుడు తన జన్మలో ఈ అమ్మవారిని ఒకటి లేదా రెండు రూపాలు మాత్రమే తన జీవిత కాలంలో చూడగలుగుతాడు అని వివిధ చరిత్రల ద్వారా నాకు అవగతమైనది. అంటే బాల గాను లేదా బాలా త్రిపురగాను లేదా త్రిపుర సుందరిగాను లేదా త్రిపుర లేదా సుందరి గాను చూడవచ్చును. ఆమె పెట్టే అన్ని రకాల యోగమాయ పరీక్షలు తట్టుకుంటే తమ స్థాయికి తీసుకొని వెళ్లే సద్గురువును చూస్తుంది. అంటే బాలాదేవి సాధకుడికి అవసరమయ్యే సద్గురువును ఆ సాధకునికి కలపడం అనుసంధానకర్త గా పనిచేస్తుంది.

కంచి పీఠాధిపతి అయిన చంద్ర శేఖర సరస్వతి మహా స్వామి వారికి అమ్మవారు బాలగాను, త్రిపురగాను కనిపించిందని వారు చెప్పడం జరిగినది. అలాగే వేద వ్యాసుల వారికి అమ్మవారు సుందరిగా అనగా కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఒక వృద్ధ స్త్రీ గా కనపడివారి సహనశక్తిని పరిశీలించి ఆ పరీక్షకు వేదవ్యాసుడు తట్టుకోలేకపోతే అంటే 13 రోజులకు ఆయన అలాగే ఆయన శిష్య బృందం భక్తులకు ఆహారం దొరకక పొయేసరికి ఆయన కాశీక్షేత్రంను శపించ పోతుంటే ఈ బాలాదేవి స్వయంగా ఆయనకి వృద్ధ అన్నపూర్ణగా కనపడి అన్నపూర్ణ క్షేత్రమైన కాశీలో అన్నంకు కొరత ఉండదని తెలిసిన మహా జ్ఞానివి కొన్ని రోజులకే ఆకలి బాధ తట్టుకోలేక మహా పవిత్రమైన కాశి క్షేత్రంను శపించే స్థాయికి వచ్చావా? తక్షణం నువ్వు ఈ కాశి క్షేత్రంను వదలి వెళ్ళమని హుంకారం చేస్తుంది. దాంతో ఆయనకు తను చేసిన ఘోర తప్పిదం తెలిసి ఎంత బ్రతిమాలినా ఆమె కరుణించదు. అలాగే ఆయన శివుడిని, విష్ణువుని, బ్రహ్మ దేవుడిని స్తుతించిన వారి నుండి మౌనమే సమాధానం వచ్చేసరికి చేసేదేమీ లేక కాశి క్షేత్రం వదిలి దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం చేరుకున్నారని వారి చరిత్రలో తెలుస్తుంది. ఒక ఆకలి బాధ వారి జీవితం ఎలా మార్చిందో ఒకసారి ఆలోచించండి. అమ్మవారు పెట్టే యోగమాయ పరీక్షలు వాటి ఫలితాలు ఇంకా ఎలా ఉంటాయో ఆలోచించండి. ఊహించుకుంటే దడ రావడం ఖాయం.

అంతెందుకు తపోనిధి బాబాజీ అను హిమాలయ యోగి “మహా మృత్యువు అంటే ఏమిటి? దానిని దగ్గరగా చూసి అనుభూతిని పొందాలని” తీవ్రమైన మనో వాంఛ కలిగినది. వెంటనే ఆయన నగ్నంగా అగ్ని సాధన చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒక వృద్ధురాలు వచ్చి ఈయనకు సహాయపడుతూ ఆకలి వేసినప్పుడు ఈయనకు అన్నం పెడుతుండేది. కానీ బాబా వారు ఈమె గురించి పట్టించుకునేవారు కాదు. ఈమెకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వీలున్నప్పుడల్లా చెట్టు కింద ఏర్పాటు చేసుకున్న ధుని వద్ద ఏకాంతం లో కూర్చొని అగ్ని సాధన చేస్తూ మహా మృత్యుదేవత కోసం ఎదురు చూస్తుండేవారు. ఆమె ఈ వృద్ధురాలు రూపంలో వచ్చి తనకు సహాయపడుతుందని ఆయన గమనించని స్థాయిలో యోగంలో అగ్ని సాధన ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. ఒక రోజు అనుకోకుండా ఈయన తీవ్రమైన ధ్యాన సమాధిలో ఉండగా ఒక అనన్య సౌందర్యవతి దర్శనం అయినది. నేను పిలుస్తున్న నీవు రాలేదు అంది. ఈయనకు అర్థం కాలేదు. ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి ఆవిడ ఏమని మనకు సందేశం ఇస్తుంది అర్థం కాక చండి స్తోత్రం చేసుకోగానే తనకు సేవలు చేయడానికి అలాగే తనకి ధ్యానంలో కనిపించిన దేవతా స్త్రీ మూర్తులు ఒక్కరేనని వారే మహా మృత్యువును ఇచ్చే బ్రహ్మ రంధ్రం లో ఉండే చితాగ్ని స్వరూపమైన దేవి రూపమైన ఆదిపరాశక్తియని గ్రహించి మౌనం వహించారు. బాలాదేవి ఈయనకి సుందరి గాను, దేవి గాను అగుపించింది. అమ్మ పిలిచినప్పుడు ప్రశ్నించకుండా వెళ్లి ఉంటే ఈయన యోగ జీవితం మహా మృత్యువు వలన పరిసమాప్తి అయ్యేది. మోక్ష ప్రాప్తి పొందేవాడు. కానీ అమ్మ నే ప్రశ్నించడం వలన మోక్షగామి గా మిగిలి పోవలసి వచ్చింది” అంటూ చెప్పడం ఆపినారు.

నేను వెంటనే అప్పుడు “స్వామి! మీరు చెప్పిన బాలాత్రిపురసుందరి లీలలు అన్ని కూడా దాదాపుగా పుస్తకాల్లో, గ్రంథాల్లో ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి బాలాదేవి అనుభవం పొందినారా? ఎవరైనా పొందిన వారిని చూశారా?” అని అడిగాను. దానికి వెంటనే “నాయనా! నేను అయితే కనీసం నా సాధన స్థాయి బాల స్థాయి కూడా చేరుకోలేదని అని తెలుస్తోంది. ఇప్పుడు నా వయస్సు సుమారు 65 సంవత్సరాలు. ఇక రాబోయే కాలంలో కూడా బాలమ్మ నన్ను కరుణిస్తుందని నాకైతే నమ్మకం లేదు. కానీ మా గురువుగారికి మాత్రమే బాల అమ్మవారు చిన్నపిల్ల గానూ, త్రిపుర అంటే యవ్వనవతి గా దర్శించుకోవడం జరిగినది. పైగా ఆయన చితిమంటలలో యవ్వన సౌందర్యవతి త్రిపురదేవి దేవత సాక్షాత్కారం జరగడం మరో విశేషం. ఆయన చితిమంటల్లో ఈ దేవతా స్వరూపం ఆంధ్రభూమి పత్రిక విలేఖరి ఫొటోస్ తీయటం జరిగినది. కావాలంటే రేపటికల్లా మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను. ఆ గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారే. రేపొద్దున ఈయన గురించి అన్ని వివరంగా చెబుతాను” అని సాయంత్రం అనుష్టానం వేళ అవుతుందని ఆయన వెళ్లి పోవడం జరిగినది. దాంతో మాకు ఎక్కడ లేని నిరుత్సాహం ఆవరించింది. కథ మంచి రసపట్టులో ఉండగా ఆయన పూజ అని చెప్పి వెళ్లిపోవడం మాలో అసహనం, విసుగు, కోపం వచ్చినాయి కాని ఏమి చేయగలం అలాగని మీరు కూడా వారి అనుభవాలు వినాలంటే ఎదురుచూడక తప్పదు. అంతదాకా మీరు కూడా మీ నిత్య అనుష్ఠానాలు చేసుకోండి. ఉంటాను.

గమనిక:

ఇలా అమ్మవారు వివిధ రూపాలలో వచ్చి మన సాధన గూర్చి చెప్పడము అనేది నేను మొదట నమ్మలేదు! ఇవన్నీ గూడ మనో భ్రాంతులేనని కొట్టిపారేశాను! నా సాధన విశుద్ధి చక్ర స్ధితికి- ఆజ్ఞా చక్ర స్ధితికి వచ్చినపుడు మా ఇంటిలో చిన్న పాప తిరగడము అందరికి కనిపించినది! నాకు మాత్రము కలలో చిన్నపాప లంగా,జాకెట్ వేసుకొని ఇల్లు అంతా తిరుగుతున్నట్లుగా కనిపించేది!అయినా నేను నమ్మలేదు! నా సాధన ఆజ్ఞా చక్ర స్ధితికి- సహస్ర చక్ర స్ధితికి వచ్చినపుడు నేను పూజించిన బాలదుర్గ యంత్రరాధన వలన దుర్గాదేవి కాస్తా త్రిపురదేవిగా నన్ను ఒక ఆట ఆడుకున్నది! నా సాధన సహస్ర చక్ర స్ధితికి- హృదయ చక్ర స్ధితికి వచ్చినపుడు మా గుడి అమ్మవారు సుందరిగా మారి నాతో ధ్యానములో మాట్లడము మొదలు పెట్టేసరికి కధ నాకు అర్ధమైనది! నా సాధన హృదయ చక్ర స్ధితికి - బ్రహ్మచక్ర చక్ర స్ధితికి వచ్చినపుడు దేవి కాస్తా ఆదిపరాశక్తి రూపమైన దీపదుర్గగా దర్శనమిచ్చి నన్ను ఒక ఆట ఆడుకున్నది! అంతెందుకు మా శ్రీమతి దీక్షాదేవి గూడ మా మూలధారచక్ర శుద్ధి సమయములో పరిచయము అయ్యినది.ఈమె కూడ త్రిపురమాయ అంశయే... అనగా మూలాధారచక్రానికి అనుసంధానముగా ఆజ్ఞాచక్రము ఉంటుంది గదా! దానితో ఈ త్రిపుర మాయ దాటలేక వివాహమును చేసుకున్న 12 సం!!రాలకి కాని దాటలేకపోయినాను! ఇవి అన్నియు గూడ ఎవరికి వారికి స్వానుభవము అయ్యేదాకా ఎవరు నమ్మరు!ఎందుకంటే నేను గూడ మొదటిలో అలాంటివాడినే గదా నమ్మ లేదు!నాకు కలిగిన ధ్యానానుభవాల వలన నమ్మక తప్పడము లేదు! నేనేమి మాయలో పడలేదు అనడము లేదు! నేను అందరికి లాగానే తెలిసి మరియు తెలియకుండా మాయలలో పడినాను!కాని నాకు వచ్చిన బాలదుర్గ బంగారపు యంత్రము వలన నాలో మాయ ఉద్రిత్తలు చాలా తగ్గించివేసింది! అలాగే నాకు వచ్చిన పాదరసలింగము వలన నేను మాయలయందు ఆశ,భయం,ప్రేమ, మోహ,వ్యామోహ, ఆలోచన,సంకల్పాలు,స్పందనలు లేకుండా చేసినది!అంటే పాదరసము అనేది మహశివుడి యొక్క వీర్యమని శాస్త్రవచనము కదా! పాదరస లింగారాధన వలన నాలో వీర్యస్తంభన కల్గి అన్ని మాయలు నా అదుపు ఆజ్ఞలలోనికి నేను తెచ్చుకోవడము అయినది! దానితో నాకు మాయ మాయం అవ్వడము ఆరంభమైనది!

అంత్యక్రియల్లో అద్బుతం-చందోలు శాస్త్రిగారు

బ్రహ్మ సిద్ధాంతి తన గురువు గారు గూర్చి చెపుతున్నారని క్రిందటి అధ్యాయములో తెలుసుకున్నారు!వీరి మాటలలోనే వారి గురువుగారి పూర్తిగా తెలుసుకుందాం! కానీ మా గురువుగారికి మాత్రమే బాల అమ్మవారు చిన్నపిల్ల గానూ, త్రిపుర అంటే యవ్వనవతి గా దర్శించుకోవడం జరిగినది. స్వయంగా నేను అనుభవాలు ప్రత్యక్షంగా అంటే బాల అమ్మవారి బాల రూపము, అలాగే త్రిపుర రూపము చూడడం జరిగినది. ఆయన పూజ చేసుకునే సమయంలో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ నాన్న నాన్న అంటూ ఆయన ఒడిలో కూర్చోవటం నేను చాలా సార్లు చూసాను! ఎన్నోసార్లు ఫోటోలు తీస్తే ఒక్కసారి కూడా సరిగ్గా వచ్చేవి కావు. చివరకు ఒక ఫోటో మాత్రం సంపాదించగలిగాను అలాగే ఆయన తన వాలుకుర్చీలో గాని, ఉయ్యాల మంచం పైన పడుకున్నప్పుడు కానీ లేదా ఆయన వెనుక వైపు తిరిగి ఉన్న అప్పుడు నాకు చాలా సార్లు సౌందర్య యవ్వనవతి స్త్రీ వెనుక భాగం కనపడేది! గురువుగారా? అమ్మవారా అని నాకే కాదు అక్కడున్న నాతోటి శిష్యులకు సందేహం కలిగేది. ఆయన అంతటి బాల ఉపాసకుడు. 16 సంవత్సరాల పాటు ఏకధాటిగా అదేపనిగా బాల మహా మంత్రం అక్షర లక్షలు చేసి ఆమె పెట్టిన అన్ని రకాల యోగ మాయలు అనగా ఆర్థిక ఇబ్బందులు, సంతానం లేకపోవడం, మానసిక సమస్యలు ఇలా ఎన్నో ఆయన జీవితంలో నేను దగ్గరగా ఉండి చూశాను. పైగా ఆయన చితిమంటలలో యవ్వన సౌందర్యవతి త్రిపురాదేవి దేవత సాక్షాత్కారం జరగడం మరో విశేషం. ఆయన చితిమంటల్లో ఈ దేవతా స్వరూపం ఆంధ్రభూమి పత్రిక విలేఖరి ఫొటోస్ తీయటం జరిగినది. కావాలంటే రేపటికల్లా మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను. ఆ గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారే. రేపొద్దున ఈయన గురించి అన్ని వివరంగా చెబుతాను” అని గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న చందోలు గ్రామంలో చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి శ్రీ రాఘవ నారాయణ శాస్త్రిగారనే మహాత్ములు ఉండేవారు.ఆయన్ని అందరూ "చందోలు శాస్త్రిగారు" అని పిలిచేవారు.ఆయన "బాలా త్రిపురసుందరీ" ఉపాసకులు. ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదట.

జననం, బాల్యం:

గుంటూరు జిల్లా లోని చందోలు (చందవోలు) గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు1896, ఆగష్టు 5 న జన్మించారు. తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి 1922లో శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్యము ప్రబంధాన్ని వ్రాసి ప్రచురించాడు. తిరిగి 1986లో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరఫున పునర్ముద్రించాడు.

విద్యాభ్యాసం:

రాఘవ నారాయణశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్యశాస్త్రి ఉపనయనం చేశారు. వెంకటప్పయ్యశాస్త్రి వద్దనే రాఘవ నారాయణశాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు. విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత, నిష్టతో చేయడం ప్రారంభించారు. విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం, అగ్నికార్యం సకాలంలో చేయడం ప్రారంభించి, సంప్రదాయానుసారం, శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు. అయితే వీరిచేత అక్షరాభ్యాసం చేయించి, లౌకిక విద్య తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు. ఆయన బాలాత్రిపురసుందరీ ఉపాసకులు. 12వ సంవత్సరంలోనే రాఘవనారాయణశాస్త్రికి వెంకటప్పయ్యశాస్త్రి అనుమతితో కేదారలింగం "బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని" ఇచ్చారు. బాల ఉపాసన 16 సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచింది. దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం, పొదిలి సీతారామశాస్త్రి వద్ద మంత్రం నేర్చారు.

సన్యసించేందుకు ప్రయత్నాలు, వివాహం:

రాఘవ నారాయణశాస్త్రికి యవ్వనం లోనే సన్యసించాలనే కోరిక కలిగింది. సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె రాఘవనారాయణశాస్త్రి సన్యసించేందుకు అనుమతినివ్వలేదు. కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్యశాస్త్రి కూడా వ్యతిరేకించారు. అయితే కొన్నాళ్ళకు వెంకటప్పయ్యశాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూండగా ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవనారాయణశాస్త్రి కనిపించారు. తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసివచ్చింది. శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో శాస్త్రి గారు సూర్య మండలాన్తర్వర్తి అయిన మహా సిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది. శాస్త్రి గారికి చిన్నతనంలో పిన తల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది. అందులో తాను ఒక సిద్ధుడు శ్రీ చక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకు రమ్మన్నది. వాళ్ళని మోసుకొని ఇద్దర్నీ తీసుకొచ్చాడు. అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది .19 వ ఏట అద్దేపల్లి మంగమ్మ, పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహ మైంది. పిన్ని చూపించింది కూడా ఈమెనే .ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు.

పాండిత్యం:

శాస్త్రి గారు తండ్రి గారి వేద పాఠశాల నిర్వహణలో తోడు ఉన్నారు. ఆయన పద్ధతి నచ్చిన చాలా మంది అమెరికాకు రమ్మన్నారు. వారికి ఇష్టం లేదు. పిన పాటి వీరభద్రయ్యతో నేత్రావధానం, ఎలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేశారు. అప్పటికే అనేక సభల వారు శాస్త్రి గారికి 400 కు పైగా సర్టి ఫికేట్స్ ఇచ్చారు. వ్యాకరణ గురువు గారు ముదిగొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి, ఆ డబ్బు అంతా గురువు గారికే సమర్పించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖర భారతీ స్వామి సన్నిధిలో జరిగిన అష్టావధానానికి వారు మెచ్చి ఉభయ శ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్ప మంటే ఆశువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు.

అమ్మ వారి సాక్షాత్కారం:

దేశ సంచారం చేస్తూ ఒక సారి ఇంటికి వస్తే ఇల్లు ‘’అయ్యవారి నట్టిల్లు ‘’లా ఉంది .ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు .తిండికి గడవని పరిస్థితి .మూడు రోజులు అంతా ఉపవాసమే .మూడవ రోజు రాత్రి 27 సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే త్రాగి అంగ వస్త్రము నేల మీద పరచి నిద్ర పోయారు .8 ఏళ్ళ బాలిక కలలో కన్పించి ‘’ఓయి ! ముష్టి పెడతాను .కొంగు పట్టు ‘’అన్నది. దోసెడు బియ్యం కొంగు లో పోసి ‘’బండి వస్తుంది .అందులో కావలసిన సామగ్రి అంతా వస్తుంది ‘’అన్నది. తెల్లారే సరికి ఖాజీ పాలెం సీతా రామ రాజుగారి బండి వచ్చింది. అక్కడ రాజు గారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు దగ్గర రాజు గారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాశి కన్పించింది . అప్పటి నుంచి శాస్త్రి గారింట లక్ష్మీ దేవి నిత్య సాక్షాత్కారమే . ఆయన "బాలా త్రిపురసుందరీ" ఉపాసకులు. ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే, అమ్మవారు చిన్న పిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదట.అనేక గ్రామాలలో భాగవతం ,హరి వంశం ,పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరే వారు .పరమ నిష్టా గరిష్టం గా జీవించే వారు . ప్రాణాయామం తపస్సు కొనసాగించారు .ఇంట్లో వేరుసెనగనూనె, వేరు సెనగ వాడ లేదు . దొండకాయ , టమేటా ,బంగాళా దుంప ,ముల్లంగి క్యాబేజీ నిషిద్ధం. కాశీ కి తప్ప ఎప్పుడు రైలు ప్రయాణం చేయ లేదు .శాస్త్రి గారికి మగ సంతానం లేదు! కూతురు లక్ష్మి ని చెరువు సత్య నారాయణ శాస్త్రి కిచ్చి వివాహం చేశారు .ఆయనే శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు.

అష్ట సిద్దులు కైవసం:

శాస్త్రి గారికి అష్ట సిద్ధులు వశ మైనాయి .వాటిని స్వంతానికి ఎప్పుడు వాడుకో లేదు .వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు.

ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ’వశ్యంకర ఔషధి ‘’ని ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "‘’నీకు ఈ మొక్క తో పని లేదు .నీ ముఖం చూస్తేనే అందరు వశు లౌతారు ‘’ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. బాలుడు మాయమయ్యాడు. శాస్త్రి గారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! పూర్వ జన్మ సఖుడైన ఒక యోగి కన్పించి సుఖ దుఃఖాలను సమానం గా భావించాలని చెప్పి మళ్ళీ 50 ఏళ్ళ కు కని పిస్తానని చెప్పి వెళ్లాడు .సరిగ్గా యాభై ఏళ్ళ తరువాత శాస్త్రి గారు అమరావతి వెళ్లి అమరేశ్వర స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తల క్రిందులు గా పడి పోతుంటే తల నేలకు తగిలే సమయాన ఆ యోగి వచ్చి చేయి అడ్డం పెట్టి కాపాడాడు .శాస్త్రి గారు నమస్కరించ గానే యోగి అదృశ్యుడైనాడు .

తండ్రి గారు మొదలు పెట్టిన ‘’శ్రీ రామ కధామృతం ‘’ను వారి మరణానంతరం శాస్త్రి గారు పూర్తి చేస్తున్నారు.అయోధ్యా కాండం లో గాయత్రీ మంత్రం లోని ‘’భకార’’వర్ణం తో పద్యం రావటం లేదు. అమ్మను ఉపాశించి నిద్ర పోయారు .కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా 30ఏళ్ళ గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు .శాస్త్రి గారు ఆ దృశ్యం చూస్తుంటే ‘’ఎందుకు నిల బడ్డావు ‘’?అని అడిగింది .’’నాకూ పాలు ఇస్తావా ?’’అని అడిగారు .మెలకువ వచ్చి ‘’భర్మ మయ రమ్య హర్మ్యము ‘’అనే భ వర్ణం తో పద్యం తేలిగ్గా వచ్చింది.తాడి కొండ వేద పాఠశాలలో దెయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రి గారు మంత్రం పఠించి పార ద్రోలారు.ఒక సారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటే సత్తెనపల్లి లో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవైయేళ్ళ యువతి కనిపించి ,నమస్కరించి లోపలికి వెళ్ళింది. ఆమె గ్రహ పీడి తురాలు. అందర్ని కొడుతూ , తిడుతూ ఉండేది . అలాంటిది శాస్త్రి గారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించటం ఇంట్లో వారందరికి ఆశ్చర్యం కలిగించింది .ఆమెను గ్రహ ప్రేరణ చేసి ‘’ఏం చేస్తే నువ్వు పోతావు ’’అని అడిగారు . ’’సహస్ర గాయత్రీ జప ఫలం ధార పోస్తే పోతాను ‘’అంది . శాస్త్రి గారు సహస్ర గాయత్రి జపం చేసి ధార పోశారు . ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. దెయ్యం వదిలింది .వేరొక సారి నాగుల చవితి రోజు కాలవ లో స్నానం చేసి వస్తుంటే నాగలి చాలులో పడుకొన్న నాగు పాము తోక పై ఆయన కాలు పడింది . అది బుసలు కొడుతూ పైకి లేచి కాటు వేయ బూనితే‘’గరుడ మంత్రం ‘’జపించారు . సర్పం తల నేల కు వాల్చింది .’’స్వామీ !నీ జోలికి నేను రాలేదు . నా జోలికి నువ్వు రావద్దు. పొరపాటున నా కాలు తగిలింది . వెళ్లి పొండి ‘’ అనగానే పాము వెళ్లి పోయింది. ఆ రోజంతా గరుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు .

శాస్త్రి గారు 90 ఏళ్ళ జీవిత కాలం లో 80 ఏళ్ళు ‘’బాలా మంత్రానుష్టానం ‘’చేసిన మహనీయులు .ఒక సారి కాశీ లో గంగా స్నానం చేస్తుంటే గంగా దేవి’గలగలా లాడే బంగారు గాజులున్న చెయ్యి చూపించి ‘’నాకేమి కానుక తెచ్చావు ?’’అని అడిగింది . శాస్త్రి గారికి ఏమీ పాలు పోక తన వ్రేలికున్న బంగారు దర్భ ఉంగరం తీసి ఆమె చేతి లో పెట్టారు .బసకు తిరిగి వచ్చి దేవతార్చన పెట్టె తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది .తానేమైనా పొరపడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్న మయ్యారు ..గంగమ్మ కనిపించి ‘’కానుక ఇమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చా వేరా ?’’అన్నది .’’అది నీకు పితృ తర్పణం చెయ్యటానికి ఉపయోగ పడుతుంది కాని నాకు ఆభరణం ఎలా అవుతుంది ?’’అని గద్దించింది .’’అమ్మా నేనేమీ నీ కోసం తేలేదు. ఆ సమయానికి అది స్పురించి ఇచ్చానంతే .’’అన్నారు .మళ్ళీ గంగమ్మ ‘’నీ భార్యదగ్గర నాకోసం తెచ్చిన నగ ఉంది. అది తెచ్చివ్వు ‘’అన్నది గంగ .శాస్త్రి గారు భార్యను అడిగి నగను తీసుకొని పోయి ‘’గంగార్పణం ‘’చేశారు .

ఒకసారి శాస్త్రి గారికి చిన్న ధర్మసందేహము వచ్చినది!ఆ ప్రక్కనే ఉన్న గుమ్మం మీద కూర్చుని ఉన్న అమ్మవారిని చూస్తూ..."అమ్మా! నాకు చిన్న ధర్మసందేహము...నీకు పెళ్ళికి ముందు సంతానము కల్గినదా.. లేక పెళ్ళి అయిన తర్వాత సంతానము కల్గినదా? ఎందుకంటే నీ పార్వతీదేవి కళ్యాణములో వినాయకుడి పూజ చేసినారు గదా!అంటే నీపెళ్ళికి ముందే నీ కొడుకు గణపతి ఉన్నట్లే గదా!నీకు పెళ్ళి అయిన తర్వాత నలుగు పిండితో గణపతిని నీ సంతానముగా సృష్టించినావు!మరిఎలా సాధ్యము? అనగానే అమ్మవారు వెంటనే “అయితే నీవే దీనికి సరియైన సమాధానము చెప్పు” అనగానే “అమ్మా!ఆదిలో పరమేశ్వరుడితోపాటుగా మహాగణపతి కూడా ఉన్నాడు!ఎందుకంటే పరమేశ్వరుడి మూలాధారచక్ర అధిపతిగా మహాగణపతి ఉన్నాడు! ఆతర్వాత ఈ గణపతి లోకకళ్యాణార్ధముగా వివిధ అవతారమూర్తులుగా ఆవిర్భవించినాడు!ఈ రూపమూర్తులే ఒక రూపమే నీ పెళ్ళి తర్వాత సంతానముగా ఏర్ఫడినది అని చెప్పినారట!

ఆయన తన కార్య క్రమాలన్ని ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో , పేరు పెట్టమనో అడిగే వారు . కాసేపు కళ్ళు మూసుకొని ముహూర్త నిర్ణయం చేసేవారు . అంతే. ఆ కార్య క్రమం శుభప్రదంగా జరిగి పోయేది. దానికి తిరుగు లేదు. అదీ వారి మంత్ర సిద్ధి .

చితి మంటల్లోంచి ఓ దేవతా రూపం

10-12-1990 ప్రమోదూత మార్గ శిర బహుళ నవమి నాడు శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మ వారి ఒడిలోకి శాశ్వతంగా చేరి పోయారు . ఆయన తనువు చాలించినప్పుడు, దహన సంస్కారాలకి స్మశానానికి తీసుకెళుతూ ఉండగా, ఎంతోమంది భక్తులూ , శిష్యులూ గ్రామస్తులూ కూడా స్మశానానికి వెళ్ళారట. వారితోపాటే న్యూస్ కవరేజ్ కోసం, ఆంధ్రభూమి, ఈనాడు మొదలైన పత్రికా విలేఖరులు కూడా వెళ్ళారు.వారి పార్ధివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు తీరా దహనం మొదలు పెట్టిన కొంతసేపటికి, అన్ని వేలమందీ కళ్ళారా చూస్తూ ఉండగా,చితి మంటల్లోంచి ఓ దేవతా రూపం బయటకి వచ్చి తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందట. (ఆయన ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్ఛారని జనాలు అనుకున్నారు)సరిగ్గా అదే సమయం లో అక్కడున్న పత్రికలవాళ్ళు ఆ దృశ్యాన్ని 'క్లిక్' మనిపించడం మన అదృష్టం.అమ్మ వారి ఆకారంగా చితి మంటలు ఆకాశానికి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు . అంత్యక్రియలు జరిగినపుడు ఆ చితి పై శ్రీ బాలా త్రిపుర సుందరి అందరికీ కనిపించుట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ తరువాత, 6th Oct 1991 ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్ లోనూ, ఇంకొన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది. ఆ పేపర్ కటింగుని స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను. శాస్త్రి గారు కారణ జన్ములు . వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి .

గమనిక:

నాకు ఈయన గూర్చి తెలిసిన తర్వాత సజీవమూర్తిగా చూడలేకపోయినాననే బాధవేసినది!దానితో ఈయనని ఎలాగైన చూడాలనే తపన మొదలైంది! దానితో ఈయన గూర్చి తీవ్ర ధ్యానతపస్సు మూడురోజులుపాటు చెయ్యగా అపుడు వీరు ధ్యానము నందు కనిపించినారు!గాకపోతే విచిత్రంగా ముందు వైపు ఆయన పురుషరూపము...వెనుక వైపు సుమారుగా 45 సం!!రాల ముదురు ఆకుపచ్చరంగు చీరె ధరించిన ఒక స్త్రీమూర్తి వెనుక భాగము కనపడినది!అంటే ఒకరకముగా చెప్పాలంటే జగన్మోహిని రూపములో కొన్ని క్షణాలు కనిపించి..ఏవో మాట్లాడాలని ప్రయత్నము చేస్తున్నారని అనిపించగానే నా ధ్యానభంగమైనది! దానితో నాకు ఈయన ఆత్మదర్శనము ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ నడిచే దేవుడైన సిద్ధపురుషుని గూర్చి నా సాధన అనుభవ అధ్యాయములో రాయడము జరిగినది!

కపాల మోక్షం - 42 - సంపూర్ణ యోగ సాధన విధి విధానము

మా బ్రహ్మ సిద్ధాంతి చెప్పిన వాళ్ల దీక్ష గురువుగారైన చందోలు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి స్వయంభూ అనుభవాలు విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆవేశం, విసుగు, చికాకు,అసహ్యము మొదలైనాయి. ఇన్నాళ్ళూ మనం కేవలం విగ్రహాలను విగ్రహాలుగా పూజించడం వలన వచ్చిన అరకొర వాక్శుద్ధి వలన ఏదో మహత్తర శక్తి నాకు వచ్చినది అని, నా అంత గొప్పవాడు ప్రపంచంలో మరొకడు లేడు అని అనుకునేవాడిని. కానీ బ్రహ్మ సిద్ధాంతి చూపించిన చెప్పిన గత అనుభవాలు విన్న తర్వాత అలాగే చూసిన తర్వాత మాలో మాకు తెలియని కసి మొదలైనది. ఎలాగైనా మేము కూడా ఒక రామకృష్ణ పరమహంస లాగా అలాగే నామ దేవుడు లాగా మాకు మా ఇష్టదైవాలతో మాట్లాడాలని విపరీతంగా ఏదో తెలియని ఆవేశం కలిగినది కానీ ఎలా అని అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ మంత్ర దేవత గ్రంథాలు, పుస్తకాలు,యోగుల మరియు దైవ భక్తుల చరిత్రలను చదవటం ఆరంభించాము.నిజానికి మన సాధన స్థాయిలో చెప్పడం అనేది బాల త్రిపుర సుందరి చేస్తుందని ఈ గ్రంధాలలో మేము చదవడం జరిగింది అంటే బ్రహ్మ సిద్ధాంతి గారు చెప్పిన ఈ బాలాదేవి అనుభవాలు నిజమేనని మాకు రూఢీ అయినది.దాంతో అసలు సాధన విధి విధానం ఎలా ఉంటుందని పుస్తకాల్లో పరిశోధన చేయడం ప్రారంభించాము. మొదట ఒక మంత్రగురువు మనకు రావాలి. ఆ తర్వాత ప్రతి రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా వాయిదా వేయకుండా ఇచ్చిన మంత్రము ఆయన చెప్పిన విధి విధానంలో చేయాలి. ఇలా 3,5,8,12,16,18,21,26 సంవత్సరాలు పాటు ఈ మంత్రము దీక్షగా చేసుకుంటూ పోతే ఆ మంత్ర దేవత మనకి ప్రత్యక్ష నిదర్శనాలు ఇచ్చే ముందు కొన్ని రకాల పరీక్షలు పెడుతుంది. వాటిని ప్రతి సాధకుడు దాటుతుంటే అప్పుడు ఆ మంత్రదేవత ప్రత్యక్షమై తాను ఉన్నానని నిదర్శనాలు అలాగే చిన్నపాటి యోగసిద్ధులు అనగా వాక్సుద్ధి రాబోవు రెండు రోజుల్లో జరగబోయే

సంఘటనలు, మనం అనుకున్న వ్యక్తులు కనబడటం, వచ్చే వ్యక్తి వివరాలు తెలియడం ఇలాంటి వస్తాయి. మీరు ఏదైనా మంత్రమును గురూపదేశంగా పొంది మంత్ర సిద్ధి పొందితే ఈ సిద్ధులు వస్తాయి. ఇలా వచ్చే సిద్దులమాయాలో మనము పడకుండా ఉంటే అప్పుడు మనకి భౌతిక దీక్ష గురువు వస్తాడు అన్నమాట. ఈయన తెలిసినవాడు కావచ్చు లేదా తెలియనివాడు కావచ్చు. ఈయనని మన మంత్ర దేవత చూపుతుంది. ఈయన ఒక రకంగా చెప్పాలంటే విజ్ఞాన గని అన్నమాట. మనకు ఎలాంటి ధర్మసందేహాలు అనగా యోగపరంగా, సాధనపరంగా, శాస్త్రాలు పరంగా, దైవాలు పరంగా, వేదాలు పరంగా,యోగ శక్తుల పరంగా, యోగమాయాలు పరంగా, భోగం పరంగా వివరంగా చెప్పాలంటే రక్తి, భక్తి ,ముక్తి మీద మంచి జ్ఞానం ఉంటుంది. ఎటునుంచి దేని నుంచి మీరు ఈయనను ప్రశ్నించిన మీకు అర్థమయ్యే భాషలో అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు ఓపిక సహనం గా విడమర్చి చెబుతారు. కానీ అందరూ ఇలాగే ఉండరు. కొందరు మౌనంగా ఉండి చాలా కొద్ది విషయాలు చెబుతారు. మిగతావి మనకి మనం తెలుసుకునేటట్లుగా చేస్తారు. ఇంకొందరు మనము అడుగుతున్న వాటికి సమాధానాలు చెబుతారు. ఇంకొందరు మనం అడిగిన వాటికి ఎదుటివారి మనస్సులో అంతర్గత సందేహాలకు ముందుగానే సమాధానం ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి దీక్ష గురువు మనకు వచ్చి ప్రాథమిక స్థాయిలో మనకి కుండలిని శక్తి జాగృతి చేస్తారు.అంటే అప్పుడు దాకా మంత్రగురువు ఇచ్చిన మంత్రోపదేశం వలన కుండలిని శక్తి నిద్ర లేచి తాను ఉన్నానని నిద్ర లేచాను అని అన్నట్లుగా మనలో కదలికలు ఇస్తుంది.అంటేబద్ధకముతో నిద్ర మత్తుతో వచ్చిన మెలుకువ లాంటిది అన్నమాట. ఒకవేళ మనకి మంత్ర సిద్ధి కాకపోతే వెంటనే నిద్ర లేచిన కుండలిని శక్తి మాత తిరిగి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. ఈ మహా తల్లి తిరిగి మళ్ళీ నిద్ర లేవాలంటే మరో మూడున్నర సంవత్సరాలు కాలం పడుతుంది.

మనకి దీక్ష గురువు అనగా భౌతిక గురువు రానంతవరకు ఆ కుండలినిమాత మీద నిద్రమత్తు, మెలుకువ నిద్ర స్థితిలో ఉంటుంది.సాధకుడికి మంత్రసిద్ది ప్రభావం బట్టి దీనిలో కదలికలు ఉంటాయి.ఎప్పుడైతే సాధకుడు మంత్ర దేవత దర్శనం పొందుతాడో వారు చూపించిన అన్ని రకాల సిద్ధమాయాలు దాటు కుంటాడో అప్పుడు మనకి దీక్ష గురువైన భౌతిక గురువును చూడటం జరుగుతుంది. ఈయన మనకు వచ్చే మనకున్న అన్ని రకాల సాధన సందేహాలను తీరుస్తూ మనలో నిద్ర మత్తుతో జోగుతున్న కుండలిని మాత తన మాటల శక్తి వలన లేదా తన బొటనివేలును భ్రూ మధ్య భాగం లో ఉంచి మనలో కుండలిని మాత పూర్తిగా తన నిద్ర మత్తు వదిలించుకుని మనం చెప్పిన దానిని వినడానికి అలాగే చేయడానికి సిద్ధంగా ఉంటుంది. దీనినే యోగ పరిభాషలో కుండలిని శక్తి జాగృతి అంటారు.ఇలా ఉన్న

కుండలిని మాత ఒకవేళ మళ్లీ నిద్రలోకి జారుకోవాలంటే 12 తర్వాత సంవత్సరాల తర్వాతనే సాధ్యపడుతుంది.ఈ సంవత్సరాలలో మనలోని 12 ద్వాదశ యోగ చక్రాలను ఈవిడ జాగృతి చేస్తుంది. అది కూడా మన సాధన స్థాయిని బట్టి ముందుకు, వెనక్కు వెళుతుంది. అంటే ఒక్కొక్క చక్రానికి తిరిగి ఒక మంత్ర దేవత, ఆ దేవత దైవిక వస్తువులు అలాగే ఆ దేవత క్షేత్ర దర్శనం ఆ దేవత బీజాక్షరం ఆ దేవత ఇచ్చే యోగమాయాలు అలాగే ఆ దేవత యోగశక్తిని ఈ సాధకుడు తట్టుకోవాలి.అందుకోవాలి.ఇలా పన్నెండు చక్రాలు యోగ శుద్ధి కార్యక్రమం ప్రారంభమవుతుందని అనగా మూలాధార చక్రము నుండి హృదయ చక్రం ఉన్న పన్నెండు చక్రాలు జాగృతికి సిద్ధపడే స్థితికి చేరుకుందని తెలిసిన మన బాలాదేవి వెనువెంటనే బాల రూపంలో రావడం జరుగుతుంది.అంటే రాఘవ శాస్త్రి గారి అనుభవాలు అన్నమాట. మనకి కూడా ఈసాధన స్థాయిలో జరుగుతాయి.అప్పుడు మనకి చక్ర జాగృతి ఆరంభమవుతుంది.ఇది గూడా 3,5,8, 12 సంవత్సరాలలో పూర్తవుతుంది ఒకవేళ మనకు ఎక్కడైనా ఏ చక్రము లో గాని మాయాలు లేదా యోగమాయాను దాటలేకపోతే లేదా యోగసిద్ధులు మాయాలో మనము పడిపోతే మనలో ఉన్న కుండలిని మాత అక్కడే ఆ చక్రంలో ఆగిపోతుంది.అంతటితో ఈ జన్మకి ఆ చక్రబంధనం తో ఆగిపోయినట్లే. ఒకవేళ మీరు అన్ని చక్రాలను 3 నుండి 12 సంవత్సరాల లోపల జాగృతి చేసుకుని అన్ని రకాల సకల చక్ర దేవతల యోగమాయాను దాటగలిగితే కలిగితే, తట్టుకోగలిగితే మీ యోగ సాధన స్థాయి రెండవది అయిన మధ్యమ స్థాయి కి చేరుకుంటుంది.

ఈ రెండవ దశ అయిన మధ్యమ స్థాయి అంటే మనలో ఉన్న యోగ చక్రాలు అన్ని కూడా చక్ర శుద్ధి మొదలవుతుంది.అప్పుడు బాలాదేవి తిరిగి యవ్వన సౌందర్యవతి రూపమగు త్రిపురగా మాయా స్త్రీ గా మనముందుకు వస్తుంది. త్రిపుర వచ్చింది అంటే మన యోగ సాధన 12 యోగ చక్రాల శుద్ధి ప్రక్రియ ప్రారంభమైందని సూచన.ఈ చక్రాలలో అనేక కోట్ల జన్మల తెలిసి చేసినా తెలియక చేసినా పాప కర్మలు ఉండిపోతాయి. వాటిని మనము ఈ చక్రాల నుండి భస్మం చేయాలి. దీనినే మనం చక్ర శుద్ధి అంటాము. దీనికి మనకి ఆత్మ సాక్షాత్కారము తాను పొంది ఇతరులకు ఇవ్వగలిగిన యోగం కలిగిన గురువును సిద్ధ సద్గురువు అంటారు. ఈయన జీవ సమాధి చెందిన యోగిపుంగవుడు అన్నమాట. ఈయన సూక్ష్మశరీరము మనకి దర్శనమిచ్చి మనము ఎక్కడైనా మాయా లో ఉన్నామో, మన సాధన స్థాయి ఆగిపోతుందో లేదా ముందుకు వెళుతుందో మనకి స్వప్నముల ద్వారా లేదా ధ్యానఅనుభవాలు ద్వారా మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు.ఎల్లవేళలా ఆత్మస్వరూపంగా మన వెంట ఉండి గమనిస్తుంటారు. ఒకవేళ ఈ చక్ర శుద్ధి విధానంలో మనము ఏదైనా యోగమాయా లో పడితే నువ్వు ఫలానా యోగమాయాలో పడినావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని మనకి టాటా చెప్పి వెళ్ళిపోతారు.ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. మనకు 12 యోగ చక్రాలను జాగృతి చేయటానికి భౌతిక దీక్ష గురువు వస్తాడు. అనగా మనకు ఈయన శబ్ద పాండిత్యము చెందినవాడు. ఈయన మన సందేహాలు అన్నింటిని తన పాండిత్యంతో వివరించి చెప్తాడు. ఈయన కేవలం తన ఇష్ట దేవత సాక్షాత్కారం తన ఉపాసన సిద్ధితో పొందిన వ్యక్తి అన్నమాట. ఈయన ఇతరులకి ఇష్ట దేవత సాక్షాత్కారం మాత్రమే ఇవ్వగలరు.ఆత్మసాక్షాత్కారము ఇవ్వలేడు గాని అది ఈయన ఇతరులకు మాత్రమే ఇవ్వలేడు కానీ పొందగలడు. సద్గురువు అంటే ఇక మన యోగ చక్రాలు శుద్ధి కార్యక్రమంలో వస్తాడు..ఈయన అనుభవ పాండిత్యమును ఇవ్వగలడు అంటే ఈయన ఏ చక్రములో ఏమాయా ఉన్నది? ఎలా తట్టుకోవాలి?ఎలా దానిని దాటు కోవాలి? దానిని దాటి పోవటానికి ఏమి పరిహారాలు చేసుకోవాలి? ఏ క్షేత్రదర్శనానికి వెళ్లాలో అక్కడ ఏమి చేయాలో ఎలాంటి యోగశక్తులు వస్తాయో ఎలాంటి యోగసిద్ధులు వస్తాయో ఎలాంటి యోగ మాయాలు వస్తాయో ఒక్కొక్కటి మనకి అనుభవపూర్వకంగా తెలిసేటట్టు చేస్తారు. ఒకసారి ఈయన మనకు ఏదో ఒక క్షేత్రంలో అనగా నువ్వుఏ చక్ర శుద్ధికోసం ఉన్నావో ఆ చక్ర దేవత ఉండే క్షేత్రంలో జీవ సమాధి చెందిన గురువు మనకుసూక్ష్మ శరీరధారిగా ఆత్మ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మన సాధన మధ్యమ స్థాయికి వచ్చినప్పుడు మన బాలాదేవి త్రిపురగా వచ్చిన తర్వాత జరుగుతుందని గ్రహించండి. అప్పుడు ఇలా మనకి ఆత్మ దర్శనం సద్గురువువు కనిపించిన ఆనాటి నుండి మనం ఆయనకి అనుసంధానం అవుతాము. ఆయన మనతో ఉన్నట్లుగా మనకి తెలియకపోవచ్చు గానీ మనల్ని ఎన్నటికీ వదిలిపెట్టడు. నువ్వు చనిపోయిన కూడా నిన్ను తన శిష్యుడుగానే గుర్తుపెట్టుకుని జన్మ జన్మల మీ వెంట ఉంటాడు. అప్పటిదాకా అంటే నువ్వు 12 ద్వాదశ యోగచక్రాల శుద్ధి విధానంలో ఈ చక్రాలు యోగ మాయాలో పడనంతవరకు ఆయన మనల్ని రక్షిస్తూనే వుంటాడు. గమనిస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు ఏదైనా యోగ చక్రశుద్ధి మాయాలో పడితే మాత్రం మారు మాట్లాడకుండా మీ నుండి తన ఆత్మ సంధానం తీసేసి ఆయన యధావిధిగా తను ఉండే క్షేత్రం కు వెళ్లి మళ్లీ మీలాంటి మధ్యమ స్థాయిలో అదే చక్ర శుద్ధిలో ఉన్న యోగసాధకుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీవు మరణించిన తర్వాత నీవే ఒకవేళ మళ్లీ యోగ జన్మలో వస్తే మాత్రం గత జన్మలో నువ్వు ఏ చక్ర యోగమాయా దగ్గర ఆగి పోయినావో ఆ చక్రమాయా నువ్వు దాటితే వెంటనే ఈయన మళ్లీ తిరిగి ఆత్మ అనుసంధానం అవుతారు.

అనగా మళ్లీ మీ యోగ సాధన అనగా మిగిలిన యోగ చక్రాల శుద్ధి అయ్యేటట్లుగా చూస్తారు. ఒకవేళ నీ ఖర్మ కాలి ఏదైనా ఒక చక్రం దగ్గర ఆగిపోతే మాత్రం ఆయన నీ నుండి ఆత్మ అనుసంధానము అనగా టెలిపతి తీసుకుని వెళ్లి పోతారు. ఇది అంతా అక్షర సత్యమే. ఎప్పుడైతే నువ్వు ఈ 12 ద్వాదశ చక్రాలు పరిపూర్ణ శుద్ధి అవుతుందో అప్పుడు ఈయన తను వచ్చిన పని పూర్తి అయినట్లుగా సంతోషంగా వెళ్లిపోతారు. నీకు అవసరమైనప్పుడు వస్తారు.

అప్పుడు ఆ తర్వాత నీవు నీ సాధన స్థాయి మూడవ దశ అయిన చివరి దశకు వస్తావు. అప్పుడు నీకు యోగ చక్రాలు ఆధీనం చేసుకోవటానికి లేదా అదుపులో ఉంచుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ చాలామందికి చిన్న సందేహము రావచ్చును!అది ఏమిటంటే ఆధీనమునకు లేదా అదుపుకి గల తేడా ఏమిటి అని? దీనికి సమాధానముగా పంచభూతాలు,అష్టసిద్ధులు ఆధీనము అంటే అవి మనమీద ఎలాంటి ప్రభవాలు చూపదు! ఉదా: గాలివాన వస్తోంది! అపుడు మీరు బయటికి వెళ్ళితే ఆగిపోతుంది. కాని దీనివలన ప్రకృతి చేయవలసిన పని మీ వలన ఆగిపోతుంది! అదే వీటిని ఆధీనము చేసుకోకుండా అదుపులో ఉంచుకున్నట్లయితే తీవ్రమైన గాలివానను మీ అదుపు ఆఙ్ఞ వలన దాని ఉధృతను కొంతమేర తగ్గించవచ్చును! దీనివలన ప్రకృతి పని ఆగిపోదు! నిజానికి ఆధీనము వలన నిరంతరము వాటి యోగమాయాలలో పడే అవకాశముంటుంది!అదే అదుపుఆఙ్ఞ వలన అయితే సాధకుడు ఎలాంటి మాయాలుండవు! దీనికి మళ్లీ మనకి విశ్వ గురువు లేదా జగద్గురువు అవసరం ఏర్పడుతుంది. ఆయన కూడా సహజంగా ఇలాంటి స్థితిలో విశ్వ గురువుగా శ్రీ దత్తాత్రేయుడు లేదా జగద్గురువుగా శ్రీకృష్ణుడు లేదా గురుదక్షిణామూర్తి వస్తారు. అంటే ఎవరైతే తమ చక్రాల ఆధీనం స్థాయికి చేరుకుంటారోవారికి దత్త స్వామి లేదా శ్రీకృష్ణుడు లేదా దక్షిణామూర్తి కనబడతారు. అప్పుడు చక్ర ఆధీనం లేదా అదుపు అయ్యే విధి విధానం ఉంటుంది. ఆధీనం లేదా అదుపు అయ్యే స్థాయిలో మళ్లీ తిరిగి ఈ యోగ చక్రాలు యోగమాయాలు అలాగే యోగ శక్తులమాయాలో నువ్వు పడకపోతే వీరి అనుగ్రహం వల్ల నువ్వు హృదయ చక్రం చేరుకోగలవు. ఈ అంతిమస్థాయికి నువ్వు వచ్చినప్పుడు మళ్లీ బాలాదేవి తిరిగి సుందర రూపంతో ఒక వృద్ధ స్త్రీ రూపంలో మీ దరికి చేరుకొని మీ ఇష్టకోరిక తీర్చడానికి వస్తుంది. లేదంటే ఒకవేళ నువ్వు ఏదైనా చక్ర మాయాలో పడితే ఆ చక్రంలో ఆగిపోవటం మరుజన్మ ఎత్తడం జరుగుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఒకవేళ నువ్వు అన్ని చక్రాల ఆధీన మాయాలు దాటినా ఈ విశ్వగురువు చూపించే యోగమాయాను దాటవలసి వస్తుంది. అప్పుడు ఆయన చూపించిన గురువు మాయా దాటితే మీరు హృదయ చక్రం లోకి చేరుకుంటారు లేదంటే సహస్రార చక్రం లో ఇరుక్కొని ఒక అణువుగా ఉన్నవారు కాస్తా 1000 పరమాణువులుగా విడిపోతారు. ఆయా లోకాలలో అనగా 1080 సూక్ష్మ లోకాలలో సూక్ష్మ రూపధారులుగా సూక్ష్మ లోకవాసులు గా ఉండి పోతారు. ఇక మీకు పునర్జన్మలు ఉండవు గాని ఇక ఈసాధన స్థాయిలో మాత్రమే కర్మలు అలాగే స్పందనలు ఉంటాయి. ఇతరులకు కోరికలు తీర్చే స్థాయికి మీరు చేరుకుంటారు. అంటే మీరే పరమాత్మ లు గా మారతారు అన్నమాట. ఇంతటితో బాలా త్రిపుర సుందరి ప్రాప్తి అవతార సమాప్తి అవుతుంది.

మీరు ఇక మీ సాధన స్థాయి చిట్ట చివరి స్థితి అయిన హృదయ చక్రం మాత్రం చేరుకుంటే అక్కడ ఈ చక్ర శుద్ధికోసం ఆదిగురువు రావాల్సి ఉంటుంది.

ఈయన రావాలంటే మీరు ఇష్ట లింగమైన నవపాషాణం నిర్మిత శివుడి ఆత్మలింగం పొందాల్సి ఉంటుంది.అప్పుడు శూన్య బ్రహ్మ అయిన ఆదిగురువు మీ దగ్గరికి వస్తాడు. ఒకవేళ ఈ చక్రంలో ఉండే ఏకైక మహా మాయా మీ ఇష్టకోరికను మీరు దాట వలసి ఉంటుంది. అప్పుడు మౌనదక్షిణామూర్తి వస్తారు. ఇది చాలా చాలా కష్టంతో కూడిన పని అని చెప్పాలి. వ్రాయటానికి అలాగే చెప్పటానికి ఈ మహామాయా చాలా చిన్నదిగా కనిపించినప్పటికీ చాలా పెద్దది అన్నమాట. అంటేఈ మహా మాయాలో తన ఇష్ట కోరికైన తమ ఇష్ట పదార్థాలు వదలలేక పోతారు అన్న మాట. మహాశివుడికి పాల అన్నము,దుర్గాదేవి గారెలు పులిహోర, విష్ణువు పరమాన్నం ఇలా దేవతలుగా మనం పూజించే వారంతా వారి ఇష్ట పదార్థమును దాటలేక మన ఇష్ట కోరికలు తీర్చే దేవతలుగా ఉండిపోయారు. దాంతో హృదయ చక్రం దాటలేక ఉండిపోయారు.. కారణలోకవాసులు గా ఉండి పోయారు. అయితే గాకపోతే వీరికి సూక్ష్మలోక వాసులతో, భూలోక వాసుల తో ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం మీరు తమ సంకల్పాలు వదిలిపెడితే దానిని ఆధారం చేసుకొని వాటిని క్రియ రూపం చేయటానికి సూక్ష్మ లోకవాసులు అలాగే భూలోకవాసులు ఉంటారు. ఒకవేళ మీరు మీ ఇష్టకోరిక మాయా దాటితే మీరు మీ హృదయ గ్రంధి విభేధనం జరిగి మహామృత్యువు అనగా మోక్షప్రాప్తిని ఇచ్చే బ్రహ్మరంధ్రం చితాగ్ని దేవతగా దేవి రూపములో ఆదిపరాశక్తి కాస్తా దీప దుర్గ, దీపకాళిక,దీపచంఢి దర్శనం మీకు కలుగుతుంది. అప్పుడు మీరు మీ ఆది జన్మ కపాలం మీకు అందుతుంది. మూల కపాలంలో 36 కపాలాలుఉంటాయి! వీటిలో ఏక మూల కపాలంలో ఉండే బ్రహ్మ రంధ్రం మధ్యలో వడ్ల గింజ పరిమాణంలో చితాగ్ని ఉంటుంది. ఈ చితాగ్నిలో మధ్యలో పిండిరేణువు పరిమాణములో సుడులు తిరుగుతూ తనలో అన్నింటిని కలుపుకుంటూ ఉన్న బ్రహ్మచక్రమనే కృష్ణబిలముంటుంది! ఇందులో మన పంచ శరీరములను నాశనం చేసుకుంటే, 36 కపాలాలు నాశనం చేసుకుంటే మీరు శాశ్వతమైన మరణమైన మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది. ఇదే సాధన అంతిమ స్థితి అంటే సంపూర్ణ కపాల మోక్షం సిద్ధి అన్నమాట. మన సైన్స్ ప్రకారం చూస్తే మన కపాలంలో మధ్యలో ఉన్న మెదడు మధ్య భాగంలోఉండే పిట్యూటరీ గ్రంధివిభేదం చెంది అందులో ఉన్న కారణ శరీర మానవ అస్థిపంజరం బ్రహ్మ రంధ్రంలో ఉండే అగ్నిలో ఆహుతి అయితే అనగా చిట్టచివరి మానవ అస్థిపంజర కపాలము కూడా నాశనమైతే మీరు కపాలమోక్షం పొందినట్లు అన్నమాట. అప్పుడు మనకి సత్యము లాగా కనిపించే అసత్యమైనఈ విశ్వ జగత్తు కూడా మాయం అవుతుంది. మనకున్న మాయా మాయం అవడం వలన మనము ఇలా నిజంలాంటి కలలోనే ఉన్నామని తెలుసుకోగానే మనము కపాలమోక్షం స్థితి పొందటం జరుగుతుంది.

యోగ చక్రాలు వివరాలు :

ఇపుడిదాకా మనము యోగ విధాన పరిసమాప్తి గూర్చి తెలుసుకున్నాము.ఇపుడు ఎలా ఈ యోగసాధన పరిసమాప్తి అవుతుందో తెలుసుకుందాము!అసలు కుండలిని శక్తి అంటే ఏమిటి? జాగృతి అంటే ఏమిటి? యోగచక్రాలు అంటే ఏమిటి? అవి ఎక్కడ ఎలా ఎన్ని ఉంటాయి? అవి జాగృతి చేస్తే ఏమి జరుగుతుంది?జాగృతి ఎలా చేయాలి?ఇలా జాగృతి చేసేటప్పుడు వచ్చే యోగమాయాలు ఏమిటి? యోగ శక్తులు ఏమిటి? సకల యోగ చక్రాలు దేవతలు అలాగే వీటి బీజాక్షరాలు అలాగే యోగ చక్రాలు ఉత్తేజం చెందే క్షేత్రాలు ఏవి? ఇలా మున్నగు ఎన్నో ధర్మసందేహాలు నన్ను వేధించసాగాయి. అసలు కుండలినీ యోగం గూర్చి వివరాలు తెలుసుకోవాల్సిందే అని వివిధ శాస్త్ర గ్రంధాలు యోగ పుస్తకాలు తిరగవేయడం జరిగినది. అప్పుడుశబ్ద పాండిత్యం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అని అనిపించేది.ఎందుకంటే ఒక పుస్తకంలో యోగ చక్రాలు 6 ఉన్నాయని, మరో పుస్తకంలో ఏడు అని, వేరొక పుస్తకంలో 12 అని ఇలా ఒకే ప్రశ్నకి పలు సమాధానాలు వివిధ పుస్తకాలు ఉన్నాయి. నిజానికి మనకు ఎన్ని యోగ చక్రాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయో కూడా ఖచ్చితంగా చెప్పే పుస్తకం ఏది లేదని గ్రహించి ఒక డైరీ తీసుకొని వాటిలో యోగ చక్రాలకు సంబంధించి వివరాలు వరుస క్రమంలో రాయటం జరిగింది. ఎవరు ఎక్కడ ఆగిపోయారు? ఎవరు ముందుకు వెళ్తున్నారు తెలుసుకొని

ఆ వివరాలు వరుసక్రమంలో క్రమం తప్పకుండా కుండలిని యోగమునకు సంబంధం ఉన్న అన్ని వివరాలు సంపూర్ణంగా రాసుకొని రావడం జరిగినది. ఇలా సుమారుగా 27 డైరీలు పూర్తయ్యేసరికి అప్పుడిక వ్రాయటం ఆపి ఇన్ని పుస్తకాలు చదివి నాకు అవసరమైన విషయాలు గుర్తించి ఈ డైరీలు నేనే రాసినానా అనిపించి ఇక ఆ తర్వాత నేను రాసిన డైరీలో వివరాలు ఒక వరుసక్రమంలో అమర్చుకొని చదవడం ప్రారంభించాను. నాకు నేను సేకరించి రాసుకొని నాకు నేనే చదవటం ప్రారంభించాను. ఇచ్చట వీటి యొక్క సారాంశం ముఖ్యవిషయాలు ఇందులో వ్రాయటం జరిగింది.

మన శరీరం ఐదు శరీరాలుగా స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప,ఆకాశంగా ఉంటాయి. ఇందులో స్థూల శరీరము నాలుగు నుండి 24 అడుగుల దాకా ఉంటే, సూక్ష్మ శరీరము 83 అంగుళాలు నుండిమూడు అడుగుల దాకా ఉంటే,కారణ శరీరం మూడు అడుగుల నుండి బొటనవేలు ఆకారం వరకు, సంకల్పం బొటనవేలు ఆకారం నుండి అంగుళం ఆకారం వరకు, ఆకాశ శరీరం అంగుళం నుండి రేణువు అంత పరిమాణంలో ఉంటుంది. అలాగే స్థూల శరీరము బయటికి కనిపించే శరీర స్వరూపంగా చెప్పబడుతుంది. ఇక సూక్ష్మశరీరము తెల్లని కాంతితో కంటికి కనిపించని ఆత్మశక్తితో ఉంటుంది.ఇంకా కారణశరీరము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇక కారణ శరీరము బొటనవేలు అంత ఉంటుంది. ఇక సంకల్ప శరీరము అంగుళం అంత ఉంటుంది. ఇక ఆకాశ శరీరము పిండి పరమాణువు అంత ఉంటుంది. ఇక యోగచక్రాలు విషయానికి వస్తే మన శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. అవి వరుసగా 1.మూలాధార చక్రం 2.స్వాధిష్ఠాన చక్రం 3.మణిపూరక చక్రము 4.అనాహత చక్రము 5.విశుద్ధి చక్రము 6.ఆజ్ఞా చక్రము 7.గుణ చక్రము 8.కర్మచక్రం 9. కాలచక్రం 10.బ్రహ్మ చక్రం 11.సహస్రార చక్రం 12.హృదయ చక్రం 13. బ్రహ్మచక్రము(బ్రహ్మరంధ్రం) ఇలా మన సూక్ష్మ శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. మన సూక్ష్మ శరీరంలో మూడు యోగ నాడులతో అనగా ఇడా పింగళ సుషుమ్న నాడులతో మూడు త్రివేణి గ్రంధులు అనగా బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులుతో అనుసంధానం అయి ఉంటాయి. మూలాధార స్వాధిష్ఠాన చక్రం పైన బ్రహ్మ గ్రంధి అలాగే మణిపూరక అనాహత చక్రాల పైన విష్ణు గ్రంధి అలాగే విశుద్ధి ఆజ్ఞా చక్రం పైన రుద్రగ్రంధి ఉంటాయి.అలాగే ఈ చక్రాలు కలిసి అనుసంధానం అవుతాయి.అనగా మూలాధార చక్రము - ఆజ్ఞాచక్రం తో అలాగే స్వాధిష్ఠాన చక్రం-విశుద్ధిచక్రంతో అలాగే మణిపూరక చక్రం- అనాహత చక్రం తో అనుసంధానమై ఉంటాయి. అలాగే ఈ చక్రాలు స్థూల శరీరం లోని వివిధ అంగాలతో అనుసంధానమై వాటి మీద ప్రభావం చూపుతాయి. చక్రాలు బలంగా ఉంటే అంగాలు బలంగా ఒకవేళ చక్రాలు బలహీన పడితే అంగాలు కూడా బలహీనపడి వివిధ రకాల వ్యాధులు వస్తాయి అని తెలుసుకున్నాను. అలాగే యోగ చక్రాలకి ఆయా చక్ర దేవతలుంటారని వాటికి బీజాక్షరాలు ఉంటాయని వీటికి క్షేత్రాలు ఉంటాయని ,వాటికి ఆయా చక్రాలు యోగ మాయాలు అలాగే యోగ శక్తులు ఉంటాయని తెలుసుకున్నాను.

చక్ర స్థితుల వివరణ:

ఒక విషయం తెలుసుకోండి. పన్నెండు యోగ చక్రాలు మొదట జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం జరగాలి. ఇందులో విభేదనం స్థితి అనేది సాధకుడు తన జీవ సమాధి స్థితిలోకి వెళ్లేముందు చేసుకుంటాడు. తర్వాత అతను జీవ సమాధి సిద్ధి పొందుతాడు. కానీ 13 యోగ చక్రాల జాగృతికి మూడు నెలల నుండి 12 సంవత్సరాలు ఒక్కొక్క చక్రం జాగృతి పడుతుంది. ఇది చక్రాల జాగృతి అయిన తర్వాతే చక్రాల శుద్ధి ఆరంభమవుతుంది. మళ్లీ ఇది ఆరు నెలల నుండి 12 సంవత్సరముల వరకు ఒక్కొక్క చక్రం శుద్ధి అవుటకు సమయం పడుతుంది. ఇది చక్రాల శుద్ధి అయిన తర్వాతనే యోగ చక్రాలు ఆధీనం స్థితికి వస్తాయి.ఆధీనం అవ్వాలంటే పన్నెండు చక్రాలు 12 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత నాలుగవ స్థితి అనేది కేవలం తీవ్రధ్యాన స్థితిలో సాధకుడు ఉంటే 48 నిమిషాల్లో విభేదనం చెంది సమాధి స్థితి పొందుతాడు లేదంటే 21 రోజుల సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత జరిగే విభేదనం విధానానికి శరీరము తట్టుకోలేక అకాల శరీరత్యాగం అనగా సమాధి స్థితి పొంద కుండా మరణం పొంద వలసి వస్తుందని రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. అంటే ఈ లెక్కన చూస్తే యోగ చక్రాలు జాగృతి,శుద్ధి, ఆధీనముకు వరుసగా 36 నెలలు (12X3),72 నెలలు(12X6),12సంవత్సరాలు పడుతుంది. మొత్తం కలిపి 36 నెలలు అంటే మూడు సంవత్సరములు, 72 నెలలు అంటే ఆరు సంవత్సరములు మరియు 12 సంవత్సరములు అనగా 3+6+ 12=21 సంవత్సరాలు పడుతుంది. అదే మీరుచక్రాల జాగృతి మరియు సిద్ది అలాగే ఆధీనంనకు ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటే 36 సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరంలో ఒక చక్రం జాగృతి కాకుండా ఎక్కువ సంవత్సరాలు పడితే ఆ లెక్కన చూస్తే ఈ మానవ జన్మ సరిపోదు.ఒకవేళ మీ అదృష్టం బాగుండి గత జన్మలో మీరు ఈ సాధన స్థాయిలో ఒక దానిని పూర్తి చేసి తర్వాత స్థాయికి వస్తే అక్కడ నుండి చక్రాల స్థితి ప్రారంభం అవుతుందని తెలుసుకోండి.ఉదాహరణకు మీరు క్రింద జన్మలోనే చక్రాలు జాగృతి చేసుకుంటే ఈ జన్మలో చక్రాల శుద్ధి నుండి ప్రారంభం అవుతుంది. మీరు ఒకవేళక్రిందటి జన్మ లోచక్రాల జాగృతి, చక్రాల శుద్ధి చేసుకుని ఉంటే ఈ జన్మలో మీ పరిస్థితి చక్ర ఆధీనంతో మీ సాధన స్థితి ఆరంభమవుతుంది. గత జన్మలో కేవలం కుండలినీ శక్తిని జాగృతం చేసుకుంటే ఈ జన్మలో చక్రాల జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం దాకా మీ ఈ సాధన స్థితి కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఈ స్థితిలో ఎక్కడైనా యోగ మాయాలో పడి వ్యామోహం చెందితే అంతటితో ఆ సాధన స్థితి వద్ద ఈ సాధన ఆగిపోయి మరుసటి జన్మలో ఎక్కడైతే ఆగిపోయారో అక్కడనుండి మీ సాధన స్థితి ఆరంభం అవుతుందని గ్రహించండి.

ఇక్కడ చిన్న సందేహం రావచ్చు అసలు మనం చక్ర జాగృతి లేదా చక్రశుద్ధి లేదా చక్ర ఆధీనం లేదా చక్ర విభేదనంలో ఎందులో ఉన్నామో ఎలా తెలుసుకోగలము.ఇది తెలియాలంటే మీకు వచ్చే గురువులు బట్టి మీరు ఏ చక్ర స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ మీకు మంత్ర గురువు వస్తే మీరు చక్ర జాగృతి లో ఉన్నట్లుగా అదే మీకు ఏదైనా పుణ్యక్షేత్రంలో మీకు దీక్ష గురువుగా వస్తే మీరు చక్ర శుద్ధిలో ఉన్నట్లుగా,అదే మీకు మోక్ష క్షేత్రాలలో పరమ గురువు వస్తే మీరు చక్రం విభేదనంలో ఉన్నట్లుగా భావించుకోవాలి. అలాగే మీకున్న నాలుగు రకాల గ్రంధులు అనగా బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి, హృదయ గ్రంధి జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం కు ఒక్కొక్క దానికి మళ్లీ ఒక నెల నుండి ఆరు నెలలు పడుతుంది.వీటి కోసం విశ్వ గురు దత్తాత్రేయ స్వామి అలాగే జగద్గురువులు శ్రీకృష్ణుడు వస్తారు.ఒకవేళ మీకు తాము వచ్చినట్లుగా ప్రత్యక్ష దైవం అనుభవాలు ఇస్తే మీరు చక్ర గ్రంధిలలో ఏదో ఒక గ్రంధిని జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం చేసుకోటానికి ఈ జన్మలో ఉన్నారని గ్రహించండి.

అలాగే మనము అసలు ఏ చక్రం లో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అని సందేహం రావచ్చు. దీనికి చిన్న పరిష్కార విధానం ఉన్నది. అదేమిటంటే మన శ్వాస సహాయంతో సాధకుడు తను ఏ చక్రానికి సంబంధించిన వ్యక్తో తెలుసుకోవచ్చు.ఇందుకు మనము సాధకుడు ముక్కు దగ్గర ప్రతిబింబం కనిపించే విధముగా పరిశుభ్రంగా చూసుకునే మంచి అద్దం ఉంచి అద్దం పైన సాధకుడు శ్వాసను గట్టిగా పీల్చి అద్దం మీద వదిలితే ఆ శ్వాస ఆవిరి అద్దం మీద పడి ఒక క్షణం పాటు ఒక ఆకారము ఏర్పడుతుంది.ఆకారాన్ని బట్టి సాధకుడు ఏక్కడ ఉన్నాడో తప్పకుండా తెలుస్తోంది. చక్ర తత్వంలో అనగా మన శ్వాస ఆకారాలు వరుసగా 1. నాలుగు పలకల ఆకారం అయితే మూలాధార చక్రము 2.అర్థచంద్రాకారము ఐతే స్వాధిష్ఠాన చక్రము3.త్రికోణాకారం అయితే మణిపూరక చక్రము 4. వృత్తాకారం అయితే అనాహత చక్రము5. చుక్కలు చుక్కలు అయితే విశుద్ధి చక్రము 6.ఏ ఆకారం ఏర్పడకపోతే ఆజ్ఞా చక్రము మనం ఇలా మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఏచక్ర తత్వంలో ఉన్నామో తెలుస్తుంది. ఇక పైన ఉండే సహస్ర, హృదయ చక్రాలు మనం తెలుసుకోలేం. ఆయా గురువులు వస్తేగానీ మనకు వచ్చే గురువులు బట్టి జాగృతి, శుద్ధి, ఆధీనం విధానము తెలుసుకొని ఈ స్థితిలో మనలో ఏ చక్రమునకుతత్వంలో ఉన్నాయో మన శ్వాస ఆవిరిపట్టి మన శ్వాస కలిపి చూస్తే ఇట్టే అర్థం అవుతుంది కదా! కానీ ఈ రెండు రకాల విధి విధానాలు నేను కనిపెట్టి తెలుసుకునేసరికి మూడు సంవత్సరాల పైన పెట్టినది. నేను నా జిఙ్ఞాసి సాధన చేస్తున్నప్పుడు అసలే చక్రం లో ఉన్నామో తెలిసేది కాదు. అలాగే ఏ చక్ర స్థితి లో ఉన్నామో అర్థమయ్యేది కాదు. చెప్పటానికి వివరించడానికి ఎవరూ కూడా అందుబాటులో ఉండేవారు కాదు.

కేవలం యోగ శాస్త్రాలువాటిమీద అవగాహన ఇచ్చేవిగానీ అనుభవం లో ఇవి పనికి వచ్చేవి కావు. మేమిద్దరం చాలా ఇబ్బందులు పడే వాళ్ళం. అసలు సాధన ముందుకు వెళుతుందో లేదో అని తెలిసేది కాదు. ఏది యోగ మాయో లేదా ఏది సాధన శక్తి ,ఏది ఏ దేవత దేనికి చెందినది అలాగే మాకు కనిపించే యంత్రాలు వాటి బీజాక్షరాలు మాకు అర్థమయ్యేవి కావు. అలా అయోమయ స్థితిలో మేము 12 సంవత్సరాలు మా కాలం వృధా చేసుకున్నాము. అలాంటి పొరపాటు మాలాంటి వారు చేయకూడదని యోగ శాస్త్ర గ్రంధాలు మరియు వివిధ రకాల యోగులు అనుభవాలు మరియు మా సాధన అనుభవాలు కలిపి ఏయే చక్రాలు, ఏ ఏ చక్రస్థితిలో ఏ ఏ యోగమాయాలు,ఈ చక్ర దేవతలు, వాటి యోగ శక్తులు, యోగసిద్ధులు ,వాటి బీజాక్షర మంత్రాలు తెలుసుకొని చాలా స్పష్టమైన అవగాహనను నేనే స్వయంగా అనుభవించి వాటన్నిటినీ క్రోడీకరించి మా డైరీలలో నింపి వేశాము. వాటి సారాంశం ఈ గ్రంథ రచన అన్నమాట. సాధన ఆరంభం నుండి అంతం వరకు అసలు ఏ ఏ స్థితులు వస్తాయి, ఏమాయా మర్మాలు వస్తాయి, వాటిని ఎలా దాటుకోవాలి వివరించడానికి ఈ గ్రంథ రచన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మేము ఇచ్చిన ఆయా చక్రాల అనుభవాల సమాచారాన్ని బట్టి మీరు ఏ చక్రంలో అలాగే ఏ చక్ర స్థితిలో చక్ర యోగసిద్ధులు,ఏ యోగ మాయా లో ఉన్నారో మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఈ గ్రంథము ఒకరకంగా మీకు మంత్ర, దీక్ష, సద్గురువువు, విశ్వ గురువు ,జగద్గురువు, పరమ గురువులు గా ఉండి మీరు ఏ ఏ గురువుల స్థితిలో అలాగే ఏ చక్ర స్థితిలో ఉన్నారో మీకు అన్ని విధాలుగా ఖచ్చితంగా నమ్మకంగా చెబుతుంది. ఎందుకంటే ఈ గ్రంథము ముగ్గురు యోగుల అనగా పురాణపురుషా లాహిరి,పరమహంస పవనానంద,వాసుదేవానంద యొక్క సాధనానుభవాల ఆధారముగా ఈ గ్రంథ రచన చేయడం జరిగినది. ఒక రకంగా చూస్తే ఈ గ్రంథం జ్ఞానగురువుగా ఉంటుందని గ్రహించండి.అంటే ఈ గ్రంథంలో యోగసాధనలో మోక్ష ప్రాప్తి సంబంధించి అన్ని విషయాలు ఇందులో చర్చించడం జరిగినది. గురువుల ప్రకారం చూస్తే మంత్ర గురువు నుండి చివరకు వచ్చే ఆదిగురువు దాకా, అలాగే చక్రాలలో చూస్తే మొదటిది మూలాధారం నుండి హృదయ చక్రం దాకా, అలాగే చక్రాల్లో వచ్చే జాగృతి నుండి ఆధీనం దాకా మరియు ఈ చక్రం లో వచ్చే దేవతలలో ప్రారంభ దేవత అయిన గణపతి నుండి చివరి దేవత అయిన దీప దుర్గ వరకూ, చక్రం లో వచ్చే ప్రారంభం అయిన యోగమాయా అయిన కామమాయా నుండి చివరిదైన ఇష్టకోరికమాయా దాకా అలాగే చక్రంలో వచ్చే యోగ శక్తులు ప్రారంభమైన ఖేచరి సిద్ది నుండి కపాలమోక్ష సిద్ది వరకు ఇలా అన్ని విషయాలు సంపూర్తిగా ఇందులో చర్చించడం విశ్లేషించటం దానికి తగ్గ అనుభవాలు అనుభూతులు సాక్ష్యాధారాలతో చెప్పడం జరిగినది.

మాకు అలాగే మా చక్ర దేవతలు అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడినది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అనిమేము అనుకుంటుండగా మా 280 సంవత్సరముల సజీవ సమాధి చెందిన సద్గురువువైన కాశీ వాసి త్రైలింగ స్వామి వారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనమిచ్చి మీ ఈ సాధన అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్షజ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని ఆదేశం ఇవ్వటం, మేము అప్పటిదాకా వ్రాసి ఉన్న 36 పుస్తక డైరీలు యొక్క సారాంశంగా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. అలాగేఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్టలింగము ధరించి అది ఇచ్చే ఇష్ట కామ్య సిద్ధితో ఎవరి యోగసాధన దేనివలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమై మోక్ష జ్ఞాన గ్రంథం వ్రాయాలని సంకల్పించుకుని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల మహాశక్తులు ఆపాదించటం జరిగినది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వడంతో మంత్ర శక్తి,,చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వడంతో యంత్ర శక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతా శక్తులు, దైవిక వస్తువులు ఫోటోలు ఇవ్వటంతో దైవికశక్తి, గురువును గూర్చి చెప్పడంతో శక్తి పాతం, యోగుల అనుభవ వివరాలు చెప్పటంతో యోగశక్తి ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది .అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటో కి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీ తోడు ఉంటుంది. మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది.మీకు గురువు లభించకపోయినా కంగారు పడవలసిన పని లేదు. మీకు ఇది మంత్ర గురువు నుండి ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి ,మధుర భక్తి,,నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథము మీకు భోగ కోరిక తీర్చదు.కేవలం మోక్ష కాంక్షమాత్రమే తీర్చును. అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండే వారికి మాత్రమే. వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకుని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గర అయినట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది.అది ఏమిటంటే ఇక్కడ ఇచ్చిన దేవతలలో ఏదో ఒక దేవతను మీ ఇష్టదైవంగా భావించుకుని వారిని అలాగే మీ ఇష్ట గురువుగా భావించికోండి.వారి దగ్గర ఉన్న బీజాక్షర మంత్రము గురు మంత్రంగా భావించి, మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజూ క్రమం తప్పకుండా వేళతప్పకుండా వాయిదాలు వేసుకోకుండా 108 నుండి 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకుని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే మీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువులు పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానంనందు స్థిరపడి విశ్లేషణ శక్తి పెంపొందించుకుని వివేకబుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కార కర్తగా మారుతుంది. అంతెందుకు ఎలాంటి గురువులు సహాయం లేకుండానే నేను అంటే ఏమిటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.అందువలన గురువులు వచ్చినను రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు లేదా మీ ఇష్ట దేవతను గురువు గావించుకుని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవము గురువుగా గురువే దైవము గానుమారుతుంది .కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తాపడి తమ యోగసాధనను ముందుకి కొనసాగించలేక ఎలా ఆ మాయాను చేధించాలో అర్థం కాక నానా అవస్థలు పడటం నేను కళ్ళారా చూసాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాటు చేయకూడదు. అది ఏమిటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్టభర్త/ఇష్ట భార్య గా భావించకూడదు. ఇది నా మనవి. ఈ వివరాలు మీకు మా ఆఙ్ఞాచక్రానుభవాలలో తెలుస్తుంది!

ఇప్పుడు మన యోగ చక్రాలు ఉండే శరీర స్ధానాలు:

1. మూలాధార చక్రము - వెన్నుపూస క్రింద

2.స్వాధిష్ఠాన చక్రము - వెన్నుపూస అంతమయ్యే చోట

3.మణిపూరక చక్రము - బొడ్డు వెనుక భాగములో

4.అనాహత చక్రం - హృదయ వెనుక భాగములో

5.విశుద్ధి చక్రము - కంఠము వెనుక

6.ఆజ్ఞా చక్రము - భ్రూమధ్యము

7. గుణ చక్రం - భ్రూమధ్య చతుర్ధ గుహ

8. కర్మచక్రం - భ్రూమధ్య చతుర్ధ గుహ

9.కాలచక్రం- భ్రూమధ్య చతుర్ధ గుహ

10. బ్రహ్మ చక్రం- భ్రూమధ్య చతుర్ధ గుహ

11.సహస్రార చక్రం – మెదడు వెనుక

12.హృదయ చక్రం- హృదయము

13.బ్రహ్మరంధ్రము- మాడు పై మధ్యభాగము

ఇప్పుడు మన యోగ చక్రాల ధాతువులు:

1. మూలాధార చక్రము - ఎముక

2.స్వాధిష్ఠాన చక్రము - కొవ్వు

3.మణిపూరక చక్రము - కండరాలు

4.అనాహత చక్రం - రక్తం

5.విశుద్ధి చక్రము - చర్మం

6.ఆజ్ఞా చక్రము - మజ్జ

7. గుణ చక్రం - ములుగు

8. కర్మచక్రం - ములుగు

9.కాలచక్రం- ములుగు

10. బ్రహ్మ చక్రం- ములుగు

11.సహస్రార చక్రం – శుక్రం

12.హృదయ చక్రం- రక్త ప్రసరణ

13.బ్రహ్మరంధ్రము- జుట్టు

ఇప్పుడు మన యోగ చక్రాల లక్షణాలు:

1. మూలాధార చక్రము - జీవన పోరాటం

2.స్వాధిష్ఠాన చక్రము - విషయలోలత్వం

3.మణిపూరక చక్రము - అధికారం కోసం పాటుపడటం

4.అనాహత చక్రం - ఇతరుల కోసం పాటుపడటం

5.విశుద్ధి చక్రము - ఇతరులపై ఆధారపడటం

6.ఆజ్ఞా చక్రము - పనులు అమలు చెయ్యడములో తొందరపాటు

7. గుణ చక్రం - గుణాల మార్పులలో తొందరపాటు

8. కర్మచక్రం - కర్మలు చెయ్యడములో తొందరపాటు

9.కాలచక్రం- అనుకోవడములో తొందరపాటు

10. బ్రహ్మ చక్రం- ఆలోచనలలో తొందరపాటు

11.సహస్రార చక్రం – ఆధ్యాత్మికం

12.హృదయ చక్రం- ఇష్ట కోరిక

13.బ్రహ్మరంధ్రము- సహన శక్తి

ఇప్పుడు మన యోగ చక్రాల శరీరాలు:

1. మూలాధార చక్రము - స్ధూల శరీరం

2.స్వాధిష్ఠాన చక్రము - స్ధూల శరీరం

3.మణిపూరక చక్రము - స్ధూల శరీరం

4.అనాహత చక్రం - స్ధూల శరీరం

5.విశుద్ధి చక్రము - స్ధూల శరీరం

6.ఆజ్ఞా చక్రము - సూక్ష్మ శరీరం

7. గుణ చక్రం - సూక్ష్మ శరీరం

8. కర్మచక్రం - సూక్ష్మ శరీరం

9.కాలచక్రం- సూక్ష్మ శరీరం

10. బ్రహ్మ చక్రం- సూక్ష్మ శరీరం

11.సహస్రార చక్రం – కారణ శరీరం

12.హృదయ చక్రం- సంకల్ప శరీరం

13.బ్రహ్మరంధ్రము- ఆకాశ శరీరం

ఇప్పుడు మన యోగ చక్రాల మానసిక పరిణామం:

1. మూలాధార చక్రము - అహంకారం

2.స్వాధిష్ఠాన చక్రము - చిత్తం

3.మణిపూరక చక్రము - బుద్ది

4.అనాహత చక్రం - మనస్సు

5.విశుద్ధి చక్రము - చైతన్యం

6.ఆజ్ఞా చక్రము - పూర్ణ చైతన్యం

7. గుణ చక్రం - పూర్ణ చైతన్యం

8. కర్మచక్రం - పూర్ణ చైతన్యం

9.కాలచక్రం- పూర్ణ చైతన్యం

10. బ్రహ్మ చక్రం- పూర్ణ చైతన్యం

11.సహస్రార చక్రం – శుద్ధ చైతన్యం

12.హృదయ చక్రం- పరిశుద్ధ చైతన్యం

13.బ్రహ్మరంధ్రము- సంపూర్ణ చైతన్యం

ఇప్పుడు మన యోగ చక్రాల తత్వాలు:

1. మూలాధార చక్రము - భూమి

2.స్వాధిష్ఠాన చక్రము - జలము

3.మణిపూరక చక్రము - అగ్ని

4.అనాహత చక్రం - వాయువు

5.విశుద్ధి చక్రము - ఆకాశము

6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలు

7. గుణ చక్రం - మనస్సు

8. కర్మచక్రం - బుద్ది

9.కాలచక్రం- కాలము

10. బ్రహ్మ చక్రం- అహంకారం

11.సహస్రార చక్రం – శబ్ధం

12.హృదయ చక్రం- కాంతి

13.బ్రహ్మరంధ్రము- శూన్యం

ఇప్పుడు ఈ చక్రాల బీజాక్షరాలు కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము - "లం" - 4 దళాలు

2.స్వాధిష్ఠాన చక్రము - "వం" - 6 దళాలు

3.మణిపూరక చక్రము - "రం" - 10 దళాలు

4.అనాహత చక్రం - "యం" - 12 దళాలు

5.విశుద్ధి చక్రము - "హం" - 16 దళాలు

6.ఆజ్ఞా చక్రము - "ఓం" - 2 దళాలు

7. గుణ చక్రం - "మః" -3 దళాలు

8. కర్మచక్రం - "న" - 3 దళాలు

9.కాలచక్రం- "శి" -3 దళాలు

10. బ్రహ్మ చక్రం- "వా"- 2 దళాలు

11.సహస్రార చక్రం - "య"- 1000 దళాలు

12.హృదయ చక్రం- "తుం'- 4 దళాలు

13.బ్రహ్మరంధ్రము - నిశ్శబ్ద నాదం - శూన్యం

ఇప్పుడు మీరు క్రింద చూపిన దైవాలలో ఎవరో ఒకరిని మనస్ఫూర్తిగా ఎన్నుకొని మార్చకుండా ఒకే రూపంతో ఒకే నామంతో ఆయనను ఆరాధించి వలసి ఉంటుంది. మన యోగ సాధనలో వీరే తారసపడే దైవాలు. కాబట్టి వారిని ముందు నుంచి మచ్చిక చేసుకుంటే మన సాధన పరిసమాప్తి చేయడానికి సహాయ పడతారు. వారే

1. మహాగణపతి -మూలాధార చక్ర దైవం

2. లక్ష్మీనారాయణులు- స్వాధిష్టాన చక్రం దైవము

3.మహావిష్ణువు/పాండురంగడు/బాల అమ్మవారు/మీ ఇష్టదైవము- మణిపూరక చక్రం దైవం

4.శివశక్తి (మహాకాలుడు/మహాకాళిక)- అనాహత చక్రం దైవం

5. గాయత్రి/సరస్వతి- విశుద్ధి చక్రము దైవము

6.అర్ధనారీశ్వర తత్వం (శివ కేశవ/శివ పార్వతి) ఆజ్ఞా చక్రం దైవం

7. శ్రీదత్తుడు - గుణ చక్రము దైవము

8. శ్రీరాముడు - కర్మ చక్రం దైవము

9. కాలభైరవుడు - కాలచక్ర దైవము

10. మహా బ్రహ్మ/ఏకపాదుడు- బ్రహ్మ చక్ర దైవము

11. మహాశివుడు - సహస్రార చక్ర దైవము, హనుమాన్ జీవనాడి మార్గం దైవం

12.ఇష్ట లింగము/అనంతపద్మనాభుడు/ఇష్టకామేశ్వరుడు/ఇష్టకామేశ్వరి- హృదయ చక్రం దైవం, ఉగ్రనరసింహస్వామి-బ్రహ్మనాడి దైవం

13. ఆది పరాశక్తి/దీపదుర్గ,దీపకాళిక,దీపచంఢి - బ్రహ్మ రంధ్రం దైవము

బ్రహ్మ విష్ణువు శివుడు - త్రిగ్రంధుల దైవాలు

ఈ పైన చెప్పిన 13 దైవాలు మనకున్న 13 యోగ చక్రాలు దేవతలు కాబట్టి వీరిలో ఒకరిని మనస్ఫూర్తిగా బాగా ఆసక్తి, అనురక్తి, మధుర భక్తితో మనల్ని కదిల్చే వారిని మీ ఇష్టదైవంగా ఎంచుకొని సాధన కొనసాగించండి.

ఇక ఈ యోగ చక్రాలలో వచ్చే యోగమాయాలను కూడా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడండి.

1. మూలాధార చక్రము - కామ మాయా

2.స్వాధిష్ఠాన చక్రము - ధన మాయా

3.మణిపూరక చక్రము - ఇష్ట దేవత మాయా

4.అనాహత చక్రం - చావు/మరణ భయం మాయా

5.విశుద్ధి చక్రము - జ్ఞాన మాయా

6.ఆజ్ఞా చక్రము - జీవమాయా, అహంకారము

7. గుణ చక్రం - త్రిగుణాల మాయా

8. కర్మచక్రం - కర్మ మాయా

9.కాలచక్రం- అకాల మృత్యు భయం మాయా

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మ జ్ఞాన అహంకారం మాయా

11.సహస్రార చక్రం - సర్వ సిద్ధుల మాయా

12.హృదయ చక్రం- ఇష్ట కోరిక మాయా,స్పందన మాయా

13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యువు భయము మాయా, సహన శక్తి మాయా

త్రి గ్రంధులు -త్రిమూర్తి మాయాలు

హృదయ గ్రంధి-బాలా త్రిపుర సుందరి మాయాలు

ఈ విధంగా మనకుండే యోగ చక్రాలలో మరియు ఈ పైన చెప్పిన యోగ మాయాలు ఉంటాయి

ఈ 13 యోగ చక్రాలలో ఉండే యోగ శక్తులు ముందుగానే తెలుసుకుంటే వాటిని దాట గలిగే స్థాయికి మన మనోస్థాయి మీ సాధన స్థాయి ఉంటుంది. అది

1. మూలాధార చక్రము - భూచర సిద్ధి

2.స్వాధిష్ఠాన చక్రము - అనుర్మిమ తత్వం సిద్ధి

3.మణిపూరక చక్రము - దూరశ్రవణం సిద్ధి

4.అనాహత చక్రం - దూరదృష్టి సిద్ధి

5.విశుద్ధి చక్రము - మనో జపంసిద్ధి

6.ఆజ్ఞా చక్రము - దివ్య దృష్టి సిద్ధి

7. గుణ చక్రం - కామరూప సిద్ధి

8. కర్మచక్రం - అపరాజయం సిద్ధి

9.కాలచక్రం- సహక్రుత్ సిద్ధి

10. బ్రహ్మ చక్రం- అద్వంద్వం సిద్ధి

11.సహస్రార చక్రం - అష్టసిద్ధులు సిద్ధి

12.హృదయ చక్రం- యధా సంకల్ప సిద్ధి

13.బ్రహ్మరంధ్రము - స్వచ్ఛంద మరణ సిద్ధి

రుద్రగ్రంధి - పంచభూతాలు అదుపులో ఉండటం సిద్ధి,విష్ణు గ్రంధి -ప్రాకామ్యశ్చ సిద్ధి,బ్రహ్మ గ్రంధి- పర చిత్తాది అభిజ్ఞత సిద్ధి,

హృదయ గ్రంధి- ఆజ్ఞా ప్రతిహత గతి సిద్ధి

ఈ విధంగా మీరు 13 యోగ చక్రాలు జాగృతి , శుద్ధి,ఆధీనం,విభేదనం స్థితిలు గురించి అలాగే ఈ చక్రాల దేవతల గురించి ఈ చక్రాల యోగమాయాలు గూర్చి ఈ చక్రాల యోగ శక్తుల గురించి తెలుసుకున్నారు కదా.అలాగే ఈ 13 యోగ చక్రాల లోని దైవ అనుగ్రహం పొందుటకు అలాగే వాటి యోగ మాయాలను దాటించుటకు పఠించవల్సిన స్తోత్రాలు తెలుసుకోండి. కానీ సిద్ధ మార్గంలో ప్రయాణించే వారికి వీటి అవసరం ఉండదు. కానీ మిగిలిన యోగ మార్గాలు ప్రయాణించే వారికి వీటి అవసరం పడే అవకాశాలున్నాయి. అనగా కర్మ, భక్తి,,జ్ఞాన, ధ్యాన ఇలా ఈ మున్నగు మార్గాలలో ప్రయాణించే వారికి ఈ స్తోత్ర పఠనము యోగ మాయాలను దాటిస్తాయని వివిధ యోగులు అనుభవాల ద్వారా తెలుసుకొని వాటిని సేకరించి ఒక వరుస క్రమంలో చేర్చడం జరిగింది. అవి

ఇప్పుడు మన యోగ చక్రాల కోసం పఠించవలసిన స్తోత్రాలు:

1. మూలాధార చక్రము - మహాగణపతి స్తోత్రాలు

2.స్వాధిష్ఠాన చక్రము - లక్ష్మీనారాయణులు స్తోత్రాలు

3.మణిపూరక చక్రము - మహావిష్ణువు స్తోత్రాలు/పాండురంగడు స్తోత్రాలు

4.అనాహత చక్రం - శివశక్తి స్తోత్రాలు,శివ స్తోత్రాలు పార్వతి స్తోత్రాలు

5.విశుద్ధి చక్రము - గాయత్రి/సరస్వతి స్తోత్రాలు

6.ఆజ్ఞా చక్రము - గురు స్తోత్రాలు,షిరిడి సాయి బాబా, దత్త స్వామి, గురు రాఘవేంద్ర స్తోత్రాలు

7. గుణ చక్రం - శ్రీదత్తుడు స్తోత్రాలు

8. కర్మచక్రం - సీతారామ స్తోత్రాలు

9.కాలచక్రం- కాలభైరవుడు/కాలభైరవి స్తోత్రాలు

10. బ్రహ్మ చక్రం- గాయత్రి/సరస్వతి/సావిత్రి స్తోత్రాలు

11.సహస్రార చక్రం - మహాశివుడు/శ్రీకృష్ణ/ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు

12.హృదయ చక్రం- ఇష్ట లింగము/అనంతపద్మనాభుడు/ఇష్టకామేశ్వరుడు/ఇష్టకామేశ్వరి/హనుమ స్తోత్రాలు,అర్గళా స్తోత్రం

13.బ్రహ్మరంధ్రము - ఆది పరాశక్తి కవచ స్తోత్రం - దీప దుర్గా కవచ స్తోత్రం - దీప కాళికా కవచ స్తోత్రం - దీప ఛంఢి కవచ స్తోత్రం

త్రి గ్రంధులు -బాలా త్రిపుర సుందరి స్తోత్రాలు

మనము ఏఏ చక్రాల్లో ఉన్నామో ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి. అవేమిటంటే:

1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు

2.స్వాధిష్ఠాన చక్రము – ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు

3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4.అనాహత చక్రం - ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం

5.విశుద్ధి చక్రము - వివిధ రకాల శబ్దాలు వినబడటం

6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదం వినబడటం

7. గుణ చక్రం - త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం

8. కర్మచక్రం - వివిధ రకాల ఆయుధాలు కనబడటం త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం

9.కాలచక్రం- ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం

10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం

11.సహస్రార చక్రం - కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం

12.హృదయ చక్రం- హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు, ఇష్టలింగం రావటం

13.బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు

త్రి గ్రంధులు -త్రిమూర్తులు దర్శనాలు

అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.

1. మూలాధార చక్రము - మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా గాలిలో ఎగరడం,శవ ఆసనాలు

2.స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం

3.మణిపూరక చక్రము - విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4.అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం

5.విశుద్ధి చక్రము - చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం

6.ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం

7. గుణ చక్రం - ఇదః శరీరం పరోపకారార్ధం ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం

8. కర్మచక్రం - ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం

9.కాలచక్రం- చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట

10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం

11.సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన

12.హృదయ చక్రం- ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస

13.బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం

త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం

అలాగే మనము ఏఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి.

1. మూలాధార చక్రము - గాలిలో ఒక అడుగు ఎత్తులో ఎగరటం

2.స్వాధిష్ఠాన చక్రము - నీటిమీద తేలియాడటం

3.మణిపూరక చక్రము - అగ్ని ప్రమాదాలు జరిగిన ఏమీ కాకపోవడం

4.అనాహత చక్రం - వాయు ప్రమాదాలు జరగకపోవడము

5.విశుద్ధి చక్రము - ఆకాశంలో ఎగరటం

6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలకు ఆజ్ఞలు ఇవ్వటం , సూక్ష్మ శరీర యానం చేయడం

7. గుణ చక్రం - దశేంద్రియాలు జయించడము

8. కర్మచక్రం - అన్నిటి యందు విజయం పొందడం

9.కాలచక్రం- భూత, వర్తమాన,భవిష్యత్తు సంఘటనలు చూడటం

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మాండంలో అన్ని లోకాల దర్శనాలు , బ్రహ్మాండ దర్శనాలు, గ్రహ నక్షత్ర మండలాల దర్శనాలు

11.సహస్రార చక్రం - పంచభూతాలను అదుపులో ఉంచుకోవడం,సర్వసిద్ధులు ఆధీనం అవ్వటం, ఇచ్చా మరణము పొందడము

12.హృదయ చక్రం- కావాలనుకునే కోరికలు తీరడం, ఇతరుల రోగాలు, వ్యాధులు నయం చేయటం

13.బ్రహ్మరంధ్రము - కోరుకునేవారికి మరణం ఇవ్వటం

అలాగే మనము ఏఏ చక్రాలకి విభేదనం చేయడానికి ఏఏ నాద శబ్దాలు కావాలో కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము - తుమ్మెదల నాదము

2.స్వాధిష్ఠాన చక్రము - వేణు నాదము

3.మణిపూరక చక్రము - చిన్న ఘంటానాదము

4.అనాహత చక్రం - దీర్ఘ ఘంటానాదము

5.విశుద్ధి చక్రము - వీణా నాదము /మేఘ గర్జన నాదము

6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదము

7. గుణ చక్రం - దుందుభి నాదము

8. కర్మచక్రం - కాంస్య నాదము

9.కాలచక్రం- శృంగ నాదము

10. బ్రహ్మ చక్రం- మేఘ గర్జన నాదము(ఏకపాదుడు)

11.సహస్రార చక్రం - శంఖం/డమరుకం నాదము

12.హృదయ చక్రం- తుంకార నాదము

13.బ్రహ్మరంధ్రము - నిశ్శబ్ద నాదము

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి తినవలసిన ఆహారపదార్ధాలు

1. మూలాధార చక్రము - పులగము

2.స్వాధిష్ఠాన చక్రము - పెరుగు అన్నము

3.మణిపూరక చక్రము - బెల్లం పొంగలి

4.అనాహత చక్రం - నెయ్యి కలిపిన అన్నము

5.విశుద్ధి చక్రము - పాలపాయసాన్నం

6.ఆజ్ఞా చక్రము - పులిహోర

7. గుణ చక్రం - పులిహోర

8. కర్మచక్రం - పులిహోర

9.కాలచక్రం- పులిహోర

10. బ్రహ్మ చక్రం- పులిహోర

11.సహస్రార చక్రం – పాలపాయసాన్నం

12.హృదయ చక్రం- ఇష్టపదార్ధాలు

13.బ్రహ్మరంధ్రము -మినప గారెలు

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన లోహములు:

1. మూలాధార చక్రము - బంగారము

2.స్వాధిష్ఠాన చక్రము - వెండి

3.మణిపూరక చక్రము -రాగి

4.అనాహత చక్రం - ఇనుము

5.విశుద్ధి చక్రము - జింక్

6.ఆజ్ఞా చక్రము – బంగారం

7. గుణ చక్రం – బంగారం

8. కర్మచక్రం – బంగారం

9.కాలచక్రం – బంగారం

10. బ్రహ్మ చక్రం – బంగారం

11.సహస్రార చక్రం - పంచలోహ ధాతువులు

12.హృదయ చక్రం - నవపాషాణ ధాతువు

13.బ్రహ్మరంధ్రము -శుద్ధ స్పటికం

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన రంగులు:

1. మూలాధార చక్రము - ఎరుపు

2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ

3.మణిపూరక చక్రము - కాషాయరంగు

4.అనాహత చక్రం - ఆకుపచ్చరంగు

5.విశుద్ధి చక్రము -నీలం

6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు

7. గుణ చక్రం - ముదురు వంకాయ రంగు

8. కర్మచక్రం - ముదురు వంకాయ రంగు

9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు

10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు

11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు

12.హృదయ చక్రం- లేతనీలం

13.బ్రహ్మరంధ్రము - తెలుపు

ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి వెయ్యవలసిన హస్తముద్రలు:

1. మూలాధార చక్రము - పృథ్వీముద్ర/అశ్వనీ ముద్ర/మహావేధముద్ర

2.స్వాధిష్ఠాన చక్రము – జలముద్ర/ ఖేచరీముద్ర

3.మణిపూరక చక్రము - సూర్యముద్ర/అగ్నిసారాముద్ర/అపానముద్ర/ఉడ్యానబంధముద్ర

4.అనాహత చక్రం - వాయుముద్ర/అపానవాయుముద్ర

5.విశుద్ధి చక్రము - ఆకాశముద్ర/ఉదానముద్ర

6.ఆజ్ఞా చక్రము - జ్ఞానముద్ర/

7. గుణ చక్రం - ప్రాణముద్ర/

8. కర్మచక్రం - అంజలిముద్ర/

9.కాలచక్రం- అగోచరీముద్ర/

10. బ్రహ్మ చక్రం- జ్ఞానముద్ర/

11.సహస్రార చక్రం – శూన్యముద్ర

12.హృదయ చక్రం- చిన్ముద్ర

13.బ్రహ్మరంధ్రము - షణ్ముఖ ముద్ర

ఇప్పుడు మన యోగ చక్రాల లో ఉన్నపుడు వచ్చే దైవిక వస్తువులు:

1. మూలాధార చక్రము - మహా గణపతి

2.స్వాధిష్ఠాన చక్రము - మహా లక్ష్మీనారాయణ

3.మణిపూరక చక్రము - మీ ఇష్టదైవము

4.అనాహత చక్రం - మహా కాలుడు/మహా కాళిక

5.విశుద్ధి చక్రము - మహా సరస్వతి/మహా గాయత్రి

6.ఆజ్ఞా చక్రము - శివశక్తి

7. గుణ చక్రం - దత్తాత్రేయస్వామి

8. కర్మచక్రం - సీతారామస్వామి

9.కాలచక్రం- కాలభైరవ స్వామి

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మదేవుడు

11.సహస్రార చక్రం – మహా విష్ణువు/మహా శివుడు/శ్రీ కృష్ణుడు

12.హృదయ చక్రం- నవపాషాణ ఇష్టలింగము

13.బ్రహ్మరంధ్రము- స్పటిక లింగాలు/ఓంకార చిహ్నము/ దక్షిణావృత శంఖము/ సుదర్శచక్రము//వామావృత శంఖం//గణపతి శంఖం/సుదర్శన చక్ర మాల/సుదర్శన సాలగ్రామ మాల/శూన్యబ్రహ్మ ముద్ర

ఇప్పుడు మన యోగ చక్రాలు ఏ ఏ క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయో కూడా తెలుసుకోండి.

1. మూలాధార చక్రము - గణపతి క్షేత్రం (కాణిపాకం)

2.స్వాధిష్ఠాన చక్రము - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)

3.మణిపూరక చక్రము - 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు

4.అనాహత చక్రం -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)

5.విశుద్ధి చక్రము - మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)

6.ఆజ్ఞా చక్రము - శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)

7. గుణ చక్రం - దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)

8. కర్మచక్రం - శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)

9.కాలచక్రం- కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)

10. బ్రహ్మ చక్రం- బ్రహ్మ దేవుడి క్షేత్రాలు ( పుష్కర్, చిదంబర క్షేత్రం)

11.సహస్రార చక్రం - మహాశివుడు క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)

12.హృదయ చక్రం- అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం) హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం క్షేత్రం(కర్ణాటక)

13.బ్రహ్మరంధ్రము - ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం

త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు

మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు

1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు

2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు

3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు

4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు

5.విశుద్ధి చక్రము –నీలం- శని

6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు

7. గుణ చక్రం - ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు

8. కర్మచక్రం - ముదురు వంకాయ రంగు- చంద్రుడు

9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు

10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు

11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు

12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు

13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం

మన ఏఏ యోగచక్రాల యందు ఏఏ గురువులు వస్తారో తెలుసుకోండి

1. మూలాధార చక్రము - మంత్రగురువు

2.స్వాధిష్ఠాన చక్రము - మంత్రగురువు

3.మణిపూరక చక్రము - దీక్ష గురువు

4.అనాహత చక్రం - దీక్ష గురువు /భౌతిక గురువు

5.విశుద్ధి చక్రము - దీక్ష గురువు /భౌతిక గురువు

6.ఆజ్ఞా చక్రము - సద్గురువువు

7. గుణ చక్రం - సద్గురువువు

8. కర్మచక్రం - సద్గురువువు

9.కాలచక్రం- సద్గురువువు

10. బ్రహ్మ చక్రం- సద్గురువువు

11.సహస్రార చక్రం – పరమగురువు/విశ్వగురువు/జగత్ గురువు

12.హృదయ చక్రం- ఆదిగురువు

13.బ్రహ్మరంధ్రము - నీకు నీవే ఆత్మగురుదేవుడు

ఇప్పటివరకు మీరు మీకు నేను వివిధ గ్రంథాలలో నుండి అక్కడ అక్కడ ఉన్న విషయాలను సేకరించిన వాటిని చూశారు కదా. కానీ ఇది అంతా శబ్ద పాండిత్యము. పుస్తక జ్ఞానానికి సంబంధించినది. కానీ ఈ శబ్ద పాండిత్యము నుండి అనుభవం పాండిత్యము అనగా ఈ చెప్పిన విషయాలు స్వానుభవంలోకి ఎలా వచ్చాయో వచ్చే రాబోవు అధ్యాయాలలో చూడండి.శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న. అది చాలా కష్టమని గ్రహించండి. ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా నాతో పాటుగా యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనం చేసుకోటానికి సాధన కొనసాగిస్తూ ముందుకు వెళ్ళండి. అంతకు ముందుమా మంత్రదేవత దీక్షానుభవాలు తెలుసుకోండి!

మాయాను దాటటం ఎలా?

ఇక్కడ చాలా మందికి చిన్న సందేహం రావచ్చు. అది ఏమిటంటే చక్రాలలో ఉండే మాయాలు, మర్మాలు, యోగ శక్తులు, యోగ మాయాలు గూర్చి బాగానే చెప్పినారు. కానీ మాయాను దాటటం ఎలా అనే సందేహం వస్తోంది. దీనికి సమాధానం ఏమిటంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర జీవితచరిత్రను చూస్తే తెలుస్తోంది. అనగా

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా కోరిక స్ధితి - మొదటిదశ

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా మోహము స్ధితి - రెండవ దశ

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా వ్యామోహము స్ధితి - మూడవ దశ

విశ్వామిత్రకి మేనక ద్వారా ఇంద్రియనిగ్రహ పరీక్షలు – మాయా అంతిమ స్ధితి- స్మశాన వైరాగ్య స్ధితి - నాలుగవ దశ

అన్నిరకాల మాయాలను జ్ఞానస్ఫురణతో జయించే స్ధితి - జితేంద్రియుడు స్ధితి

విశ్వామిత్రుడు జితేంద్రియుడై రామ-లక్ష్మణలకు సద్గురువువై బ్రహ్మర్షి అయినారు.

అంటే మన గురుడు విశ్వామిత్రుడు తన ధ్యాన తపస్సు ద్వారా బ్రహ్మర్షిపదవి పొందాలని తీవ్ర ధ్యానసమాధిలో ఉండగా...ఇంద్రుడికి ఈయన వలన తన ఇంద్రపదవికి చేటు కలుగుతుందని భయముతో...మేనకను పంపించి మన విశు యొక్క తపస్సు భంగము చెయ్యమని ఆదేశించాడు.పాపం ఈమె కొన్ని సం!!రాలు పాటు మనగురుడికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినది.కాని మన గురుడు ఎంతో నిగ్రహముగానే ఉన్నాడు. కాని ఒకరోజు అనుకోకుండా మన గురుడు కాస్త మేనక యొక్క నగ్నదేహమును చూడటం జరిగినది. దానితో మనవాడి ఇంద్రియం లేవడము మొదలైంది.ఆపై ఇంద్రియ నిగ్రహశక్తిని కోల్పోయి ఆమె యందు మోహము చెంది అటు పై వ్యామోహము చెంది సంతానమును పొందిన తర్వాత మనగురుడికి అసలు విషయము అర్ధమైనది.దానితో తను 10 లక్షల సం!!ల ధ్యానశక్తిని కోల్ఫోయినానని జ్ఞానస్ఫురణ పొంది...దానితో ఇంద్రియనిగ్రహశక్తితో తిరిగి ధ్యానతపస్సు చేస్తుండగా...ఈసారి రంభ రావడము...దానితో మన గురుడు కాస్త ఈమె యందు తీవ్ర కోపావేశాలు కల్గి శాపము ఇవ్వడము...తద్వారా మళ్ళీ 10 లక్షల సం!!రాల జపశక్తిని కోల్పోవడము జరిగినది. అటుపై అంతిమముగా దశేంద్రియాల నిగ్రహశక్తిని పొంది...జితేంద్రియుడై బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయినారు.

ఇంతకి అసలు మాయా అంటే ఏమిటి? ఒక దానిమీద కోరిక, మోహము, వ్యామోహము కలిగించటమే మాయా అవుతుంది. ఉదాహరణకి యుక్తవయస్సులో ప్రేమ పొందాలనే కోరిక కలిగి ప్రేమలో పడతారు. ఆ ప్రేమికుడు/ ప్రేమికురాలి మీద మొదటిలో ప్రేమ కలుగుతుంది. కొన్నాళ్ళకి ఈ ప్రేమ కాస్త ఆమె/ అతడి మీద మోహము గా మారుతుంది. అంటే ఆమె/ అతను చూడకుండా ఉండలేని స్థితి. మాట్లాడకుండా ఉండలేని స్థితి మోహము అన్నమాట.ఇది కాస్త కొన్నాళ్ళకి బాగా ముదిరి వ్యామోహంగా మారుతోంది. అనగా ఆమె/ అతను ఇక మీద కనిపించక పోతే ఉండలేని స్థితి. వాళ్ళు చనిపోతే బ్రతకలేని స్థితి. వాళ్లను క్షణము కూడా వదల లేని స్థితి. వాళ్లు లేకపోతే ఉండలేని స్థితికి చేరుకోవడమే వ్యామోహం అవుతుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఇలాంటి భావాలు కలిగించేవి మానవ శరీరంలోని దశేంద్రియాలే కదా. అనగా పంచ జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చర్మము, చెవి, నాలుక అలాగే పంచ కర్మేంద్రియాలు అనగా చూచుట, వాసన, స్పర్శ, వినుట, రుచి కదా. ఇవి చేసే పనుల వలన మనము మాయాలో పడుతున్నాము అంటే అమ్మాయి /అబ్బాయి మీద మనకి ప్రేమ మోహము వ్యామోహం కలగటానికి ఇవే కారకాలు అన్నమాట. అనగా అబ్బాయి/ అమ్మాయి అందముగా కనిపించేటట్లుగా కన్ను చేస్తే… అందమైన భావాలు పలికించేటట్లుగా నాలుక చేస్తే…. వివిధ రకాల స్పర్శ భావాలు చర్మం చేస్తే…. కవ్వింపు మాటలు వినే టట్లుగా చెవులు చేస్తే ….శరీరాల మీద పూసుకున్న సుగంధ వాసనలు మన మనస్సులను లయ తప్పేటట్లు గా ముక్కు చేస్తోంది. ఈ దశేంద్రియాలు ఈ ప్రేమ విషయంలో ఇలా ఉంటే మిగతా విషయాలలో ఎలా ఉంటాయో దైవానికే తెలియాలి కదా. అంటే అరిష్వర్గాలు అనగా కామం,క్రోధం,లోభం,మధం,మోహం,మాత్సర్యం ఇవి కలుగచేస్తాయి. ఇవి పని చేయడమే ప్రకృతి ధర్మం. కష్టాలకు నాంది పలికించడమే వీటి పని అన్నమాట. కష్టాలలో పడాలో వద్ధో నిర్ణయించుకోవటం మన పని అన్నమాట.

అంటే దశేంద్రియాలు అన్ని విషయాల్లో వాటి పనులు అవి చేస్తాయి. వాటిని నిగ్రహించుకుని నిలబడి ఉండటమే మాయాను ఎదిరించటం అవుతుంది. అనగా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి అన్నమాట. అనగా ప్రేమికులు గాకుండా ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటే వీరిద్దరి మధ్య ప్రేమ, మోహము, వ్యామోహం ఉండదు కదా. మనస్సు దెబ్బతినదు కదా. మనస్సుకి గాయాలు ఉండవు కదా. అవమానాలు అనుమానాలు ఉండవు గదా. కేవలము క్షణిక ప్రేమ మాయాకి లోనై ఐదు నిమిషాలు శారీరక సుఖానికి గురై ఖర్మకాలి విడిపోతే మనస్సు పడే నరకయాతన నరకంలో కూడా అలాంటి శిక్ష ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకున్న కూడా సుఖముగా ఉంటారని ఖచ్చితము లేదు. అనుమానాలు, అవమానాలు ,మనస్పర్ధలు, గొడవలు ఏర్పడతాయి. పోనీ పెళ్లి చేసుకోక పోయినా సుఖముగా ఉంటారా అంటే ఉండలేరు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని పాతివ్రత్య ధర్మమును గంగపాలు చేసి మాజీ ప్రేమికుడి/ ప్రియురాలు తో అక్రమ సంబంధాలు కొనసాగిస్తారు. వివాహ జీవితం దాంపత్య జీవితం నాశనం చేసుకుని విడాకులు తీసుకుని పిల్లలని అనాధలు చేస్తున్నారు. అంటే వ్యామోహం స్థాయికి దిగజా రుతున్నారు అన్నమాట. వీటి అన్నిటికీ కారణం మన మనస్సే కదా. దానికున్న దశేంద్రియాలే కదా. వీటిని ఆదిలోనే నిగ్రహించి ఉంటే మనస్సుకి ఈ ప్రేమ గోల నరకయాతనలు ఉండేవి కావు కదా. ఆదిలోనే నిగ్రహించుకోవటం మాయాను తొలగించుకోవటం అన్నమాట. ఆనాడే ఇంద్రియ నిగ్రహముతో మనస్సుతో వివేక బుద్ధితో నిశ్చలజ్ఞానముతో ఆలోచించుకొని పెళ్లి వయస్సు వచ్చేదాకా నిగ్రహముతో ప్రేమ వివాహము లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని సుఖపడే అవకాశమును మనము తెలిసీ తెలియని వయస్సులో చేసే తప్పు వలన మనశ్శాంతిని కోల్పోవటమే మాయా అవుతుంది. ఈ తప్పు చేయకుండా ఎంతో నిగ్రహంతో ఉండి దానిని దాటి పోవటమే మాయా దాటటం అవుతుంది.

కపాల మోక్షం - 43 - మంత్ర దేవత పరీక్షలు

క్రిందటి అధ్యాయంలో సాధన విధానాలు, గురువులు వచ్చే విధానం అంతా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నా యోగసాధన ప్రారంభ స్థాయి అయిన మంత్ర దేవత యొక్క మంత్రసిద్ధి నుండి ఎలా నా జీవితం ఆరంభమైనది. నా యోగ జీవితం నా యోగ చక్రాలు జాగృతి, శుద్ధి,ఆధీనం అవుతున్నప్పుడు నేను పొందిన అనుభవాలు, అనుభూతులు, యోగ మాయలు, యోగ శక్తులు, వచ్చిన దైవిక వస్తువులు, తిరిగిన దైవిక క్షేత్రాలు, చేసిన దైవిక ఆరాధనలు అన్ని కూడా పూర్తిగా ఆరంభమవుతాయి. ఒక్కొక్కటిగా ఇప్పటిదాకా వివిధ రకాల యోగుల చరిత్రలు అనుభవాలు, పుస్తక అనుభవాలు మాత్రమే చదవడం జరిగింది. అంటే కేవలం శబ్ద పాండిత్యమును పొందడం జరిగినది. కానీ నాకు రామకృష్ణ పరమహంస లాగా తన ఇష్టదైవమైన కాళీమాతను ఎలా అయితే దైవ సాక్షాత్కారం పొంది ఆమెతో మనుష్య రూపంగా ఎలా మాట్లాడినాడో అలా నేను కూడా నా ఇష్టదైవం తో మాట్లాడాలని నా యోగ జీవితం ఆరంభించాను..ప్రధమ స్థాయి అయిన అందులో మంత్ర గురువు ద్వారా నాకు వచ్చిన మంత్రోపదేశం తో మహా మంత్రమైన గాయత్రి మంత్రం చేయడం ఆరంభించాను. అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు(12X2లక్షలు=24లక్షలు) అక్షర లక్ష 24 లక్షల గాయత్రి శుద్ధ గాయత్రి అనుష్ఠానము పూర్తి చేస్తుండే సరికి మంత్రసిద్ది ఆరంభమైనది. గాయత్రి మహా మంత్రంలో 24బీజాక్షరాలు, 24 దేవతలు, 24 దేవతా శక్తులు, 24 గురువులు, 24 రుషులు ,24 అస్త్రశక్తులు అంతర్గతంగా ఉంటాయి. 24 అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి లక్ష చొప్పున 24 లక్షలు పూర్తిచేస్తే దానిని అక్షర లక్ష మంత్రజపము పూర్తి అయినట్లే లెక్క. అందరికీ గాయత్రి మంత్రం గురు మంత్రంగా రావాలని ఉండదు. కొందరు శివ పంచాక్షరి మరికొందరు అమ్మవారి మంత్రం, నారాయణ మంత్రము అలాగే మరికొందరికి విష్ణుమూర్తి ద్వాదశ మంత్రం అలాగే మరికొందరికి దేవీ దేవతల మంత్రాలు ఇవ్వటం జరగొచ్చు. వచ్చిన ఈ మంత్రం అక్షరాలు బట్టి అన్ని లక్షల జపం చేస్తే ఆ మంత్రం మంత్ర సిద్ధి పొందినట్లే అన్నమాట.ఏ మంత్రం మనకి గురువు ఇస్తాడో మనకి తెలియదు. అందుకే మంత్ర గురువు వచ్చేదాకా మన సాధన భక్తి కేవలం విగ్రహారాధనకే పరిమితం అవుతుంది.ఎప్పుడైతే మనకి మంత్రం గురువు సంప్రాప్తి అయ్యి మంత్రోపదేశం రావటం జరుగుతుందో ఆనాటి నుండి మన సాధన భక్తి విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధనకు వెళ్లడం ప్రారంభం అవుతుంది. మాకు శ్రీశైల క్షేత్రంలో ఒడుగు కార్యక్రమం 27 మంది బాల వేదపండితుల సమక్షంలో నాన్నగారి నుండి గాయత్రి మహా మంత్రం ఉపదేశంగా తీసుకోవటం జరిగినది అని ప్రస్తావించడం జరిగింది కదా. కానీ ఇప్పుడు 24 లక్షల మంత్ర జపము సిద్ధి మహా శుద్ధ గాయత్రి మంత్ర దేవత కోసం ఆమె సాక్షాత్కార అనుభవం కోసం నేను ప్రస్తుతం ఎదురు చూడటం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇంకొక ఆరు నెలలలో నా గాయత్రి మంత్రం మంత్ర జప సిద్ధి పూర్తి అవుతుంది అనగా ఆ మంత్ర దేవత అయిన గాయత్రి మాత తన దర్శనమునకు నాకు అర్హత ఉందా లేదా అని పరీక్షించడం అలాగే పరిశోధించడం మొదలు పెట్టడం జరిగింది. ఒకరోజు నేను తీవ్రమైన మంత్ర జపం లో ఉండగా నాకు విపరీతమైన ఆవులింతలు వచ్చినాయి.

నాకు తెలియకుండానే ఒక విధమైన నిద్ర మత్తులో జోగుతూ ఊగుతూ గాయత్రి మంత్ర జపం అక్కడక్కడా ఆగుతూ ఆపుతూ ఆగిపోయానని తిట్టుకుంటూ తల విదిలించుకొని మొదలు పెడుతూ మళ్లీ ఆవలింతలు రావడం ఇలా పలుమార్లు జరుగుతున్న సమయంలో నా కళ్ళముందు గాయత్రి మాత తన రాజహంస మీద కూర్చుని నీళ్లపై కనపడటం లీలగా ఒక నీడలాగా ఆరంభమైంది. కానీ పూర్తిగా కానీ నీడ ఆకారమే కనపడనిది. అంటే గాయత్రి మాత కనిపించలేదు కానీ ఆమె నీడ నాకు కనబడింది. దాంతో నాకు గాయత్రి మంత్ర సిద్ధి ఆరంభమైనదని తెలిసి నాలో నాకే తెలియని ఆనందం ప్రారంభమైనది .ఇది జరిగిన మూడు నెలల తర్వాత నాకు అనుకోకుండా రాబోయే మూడు రోజుల సంఘటనలు ముందుగానే తెలియటం ప్రారంభమైనది. అంతకు ముందే నాకు వాక్సిద్ది ఆరంభమైనది అని చెప్పాను కదా.ఇప్పుడు కొత్తగా జరగబోయే మూడురోజుల సంఘటనలు ప్రారంభమైనవి. ఎవరి ముఖం చూసినా చాలు వాడికి జరగబోయే మూడురోజుల సంఘటనలు నాకు లీలగా స్పురణకు వచ్చి త్వరలో వాడిని చూడగానే నా వాక్సిద్ధి వలన వాడికి ఆ సంఘటనలు వరుసగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగినది. దాంతో వారు కొద్దిగా నమ్మేవారు. మరికొంత జరిగినప్పుడు చూద్దామని ఊరుకునేవారు. కానీ నేను చెప్పిన వాడికి మూడు రోజుల్లో అన్ని సంఘటనలు అక్షర సత్యాలు జరగటం నాకే ఏదో తెలియని ఆనందం అలాగే ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని తెలియని ఆందోళన నన్ను వెంటాడేది. కానీ నేను ఎవరిని నుండి ఏమి గాని ధనము గాని, సహాయం గాని ఆశించకుండా అడిగిన వారందరికీ అలాగే అడగనివారికి నాకు స్పురణకు వచ్చిన మూడురోజుల భవిష్య సంఘటనలు అలాగే వారికి చెప్పడం,వారు ఇచ్చే పొగడ్తలలో పడటం జరిగింది.

ఇది ఇలా కొనసాగుతుండగా నాకు మరో దైవశక్తి వస్తుందని అన్నట్లుగా ఈసారి కూడా అమ్మవారి నీడ రూపంలో గాయత్రి మాత కనిపించేది కానీ ఈ సారి ఆమె నిజంగానే నీళ్లలో నీడ వెలుగుతూ కనిపించింది. మిగతా హంస మీద అన్ని రకాల ఆయుధాలతో పంచముఖ గాయత్రి మాత నీడ లాగానే కనిపించేది. కానీ నీళ్లు చక్కగా కనబడి మిగిలినదంతా ఎందుకు కనపడలేదో అర్థం కాక అయోమయానికి గురి అవుతూ ఉండేవాడిని.కానీ కొంతమేరైనా వెలుగు తను కనబడినందుకు సంతోషించేవాడిని. మనస్సుతో అప్పుడు విచారించి నాకున్న విశ్లేషణ వలన నా వివేక బుద్ధి వివేకంతో నీవు ఎవరి నుండి ధనము గాని, సహాయం గాని, ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా అలాగే తన మాయలో పడకుండ ఉన్నందుకు అంటే ఆమె ఇచ్చిన మూడురోజుల భవిష్య శక్తిని నా స్వార్థం కోసం ఉపయోగించకుండా ఉన్నందుకు ఇలా నీళ్ల మీద వెలుగుతూ నన్ను అనుగ్రహించిందని అలానే మిగిలిన ఆమె పెట్టే ఇలాంటి పరీక్షలు యోగ మాయ దాటుకుంటూ ఉంటే ఆమెను పూర్తిగా నీడ వెలుగు నుండి ఇష్ట మంత్ర దేవతగా నాకు దైవ సాక్షాత్కారం అనుగ్రహిస్తుందని తెలిసి ఒకవైపు ఆనందం మరొకవైపు తెలియని భయం నన్ను వెంటాడింది.ఏమో చెప్పలేం. ఆమె ఈ సారి ఏ సిద్ధి ఇస్తుందో జాగ్రత్తగా ఉండాలని ఎదురుచూడసాగాను.ఆ రోజు రానే వచ్చింది అదియే ఆత్మానుసంధాన సిద్ధి (టెలిపతి సిద్ది) అంటే ఏక కాలంలో ఇద్దరు వేరే ప్రాంతంలో ఒకే సమయం లో ఉండి ఏమి ఆలోచనలు చేస్తారో… అవి ఒకరి ఆలోచనలను మరొకరికి ఈ విధానం ద్వారా తెలుస్తాయని పుస్తక విధానం తెలిసినది. దాంతో నాకు అలాగే జిఙ్ఞాసికిఈ సిద్ది పరీక్షించాలని ఒకరోజు ఒక సమయంలో ఎవరి ఇండ్లలో వారు ఉండి ఏమి ఆలోచన చేస్తున్నాము ఎవరికి వారే కాగితం మీద రాసుకుని ఆ తర్వాత వచ్చి దీనిని గూర్చి చర్చించుకోవాలని నిర్ణయించుకున్నాము.అనుకున్నదే తడవుగా ఇద్దరము ఇండ్లకు వెళ్లి పోయి ఫలానా సమయంలో మా వేర్వేరు ఇంట్లో కూర్చొని వచ్చిన ఆలోచనలు, భావాలు కాగితం మీద రాసి మరుసటి రోజు ఎదురు చూడగా వాటిలో వాడి గూర్చి చెప్పిన 10 పాయింట్లు రాస్తే అందులో రెండు మాత్రమే నిజమైనాయి. అలాగే వాడు నా గురించి ఆలోచించి వ్రాసిన 15 పాయింట్లలో 5 పాయింట్స్ సరిగా ఉన్నాయి. దాంతో మాలో మాకే తెలియని చిన్నపాటి ఆనంద ఆవేశాలు కలిగి ఎదురుగా మాట్లాడుకోవడం మానేసి ఇలా టెలిపతి విధానం ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించాము. కొన్ని రోజుల తర్వాత ద్వారా టెలిపతిలో 98% ఆలోచనలు సరిగ్గా సరిపోయే స్థాయికి టెలిపతి సిద్ధి ఉండేది. ఆ తర్వాత ఈ టెలిపతి సిద్ధితో ఎవరితోనైనా నేను అనుసంధానం అయ్యి వారిఆలోచనలను గురించి ఫలానా సమయంలో లో ఏమి అనుకున్నారో మా యోగ, భోగ మిత్రులకు చెప్పి వారిని ఆశ్చర్యానందాలకు గురి చేసే వాడిని.వారి ఆనందం చూసి నాలో తెలియని చిన్నపాటి గర్వము అహంకారం వచ్చేవి. అది వస్తుందని తెలుసుకునే స్థితిలో నేను ఉండే వాడిని కాను.కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం, వారిని బాధపెట్టటం జరిగేది కాదు.ఎందుకంటే వాళ్ళు నన్ను ఏ సమయంలో తిట్టుకునే వాళ్ళో మెచ్చుకునేవారోతెలిసినా వాళ్లందరినీ సమదృష్టితో చూసే వాడిని.ఇలా ఉండటంతో ఈ సారి గాయత్రి మాత మాత్రమే నీడగా ఉండి రాజహంస వెలుగులతో కనబడేది.

ఇది ఇలా ఉండగా ప్రారంభ సంకల్పము సిద్ది నాకు వచ్చిందని తెలియటం జరిగినది.అంటే నేను తలచుకున్న వ్యక్తి నా దగ్గరికి రావాలని అనుకోగానే వాళ్ళు ఎవరో పిలిచినట్లుగా వచ్చేవారు.అదిగాక ఎవరు నాకోసం వస్తున్నారో నాకు ఒక గంట ముందుగానే వారి గురించి ఆలోచనలు వచ్చేవి.అలాగే వారు ఆ సమయంలో నా గురించి ఆలోచించిన ఆలోచనలు నా మెదడుకి వచ్చేవి.వాళ్ళు రాగానే ఫలానా సమయంలో నువ్వు నా గురించి ఇలా ఆలోచించినట్లు వాళ్లకు చెప్పే సరికి కొంతమంది నిజమని ఒప్పుకుంటే మరికొంతమంది మొహమాటంతో నిజమని ఒప్పుకునేవారు కాదు. అది అబద్ధమని తెలిపిన వారిని నేను ఇబ్బంది పెట్టే వాడిని కాను. కానీ ఈ సిద్ధితో వర్షం కురవాలంటే కురిసేది కాదు కానీ వారం రోజుల తర్వాత వర్షం పడేది.కానీ అది నా సంకల్పసిద్ధి వలనో కాదో నమ్మాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండే వాడిని.ఎందుకంటే నేను అనుకున్న మరుక్షణంలోవర్షం పడాలి కానీ అది జరగడం లేదు.ఎప్పుడో వారం పది రోజుల తర్వాత పడే వర్షం నావల్ల అని అనిపించేది కాదు. కానీ నాకు నా సిద్ధి సరిపోవడం లేదని అర్థం అయ్యేది. దాంతో నాకు ఆవేశం వచ్చింది. నేను అనుకున్న క్షణంలో వర్షం పడాలని వచ్చిన సిద్ధి కోసం తీవ్రంగా ఆలోచించేవాడిని.ఎలాగైనా సిద్ది ప్రాప్తి పొందాలని వివిధ పుస్తక గ్రంథాలలో ఉన్న విధి విధానాలు చేయడం మీద ఆసక్తి చూపటం జరుగుతుంది.అప్పుడు నాకు రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు గ్రంథము నా వద్దకు వచ్చింది. దానిని చదువుతూ ఉన్నప్పుడు ఒక కథనం అనుభవం నన్ను బాగా ఆకర్షించింది.అది ఏమిటంటే ఒకసారి ఒక సిద్ధుడు రామకృష్ణ దగ్గరికి వచ్చి నేను నీళ్లలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లి వెనక్కి రావటం చూసి ఈయన నవ్వారు.దానికి ఆ సిద్ధుడు “ఎందుకు నవ్వుతున్నావ్” అని అడిగేసరికి దానికి రామకృష్ణ వెంటనే “అయ్యా! మీరు ఈ సిద్ధి కోసం ఎంత కాలం కష్టపడినారు” అని అనగా దానికి అతను “సుమారు 28 సంవత్సరాలు కఠోర నియమాలతో సాధన చేస్తే ఆ సిద్ధిపొందడం జరిగింది” అని చెప్పగా దానికి ఆయన వెంటనే “అయ్యా! అంటే మీరు 28 సంవత్సరములు సాధన చేసి అర్థణా మాత్రమే సంపాదించారు అన్నమాట. బాబు! ఒక పడవ వాడు ఈ నది దాటించడానికి అర్థణా మాత్రమే తీసుకుంటారు కదా. అర్థణా ఖర్చుపెడితే అవతలికి వెళ్లే అవకాశం ఉంటే ఈ సిద్ది రావడం కోసం 28 సంవత్సరాలు ఎందుకు వృధా చేసినావో అర్థం గాక నాకు నవ్వు వచ్చింది” అనగానే ఆ సిద్ధుడు రామకృష్ణ పరమహంస పాదాలకు నమస్కరించి “అయ్యా! వచ్చిన ఈ సిద్ది వలన నాలో వచ్చిన సిద్ధ అహంకార మాయ తొలగించారు. అర్థణా కోసం నా 28 సంవత్సరాలు వృధా చేయటం నాకు సిగ్గుగా ఉంది.ఈనాటితో ఈ సిద్ధిని ఎవరు ముందు ప్రదర్శించను అని చెప్పి వెళ్ళిపోయాడు” అని చదివేసరికి నాకు ఆరు నెలలుగా వర్షము పడాలని చేస్తున్న సంకల్ప సిద్ధి ప్రయత్నం విరమించుకోవటం ఏకకాలంలో జరిగినాయి.ఆనాటి నుండి సిద్ధులు వచ్చినాయా లేదనికేవలం పరీక్షించుకుని వచ్చినాయి అని తెలియగానే వాటి గురించి మర్చిపోవడం ఇతరులకు ఉపయోగించుకోవడం లేదా నేను నా స్వార్థానికి వాడుకోవద్దని మానివేశాను.ఇలాంటి ఎన్నో సందర్భాల్లో నాకు రామకృష్ణ పరమహంస చెప్పిన ఎన్నో అనుభవాల కథలు నా యొక్క విఘ్నాలు దాదాపుగా తొలగించడం జరిగినది. అది ఎలాగో ఈ రాబోవు అధ్యాయంలో చూడగలుగుతారు.

ఇక నేను ఎప్పుడైతే ఈ సంకల్పసిద్ధి మాయ కూడా దాటేసరికి గాయత్రి మాత తన పూర్తి వెలుగుల కాంతి శరీరంతో ఒక ముఖంతో దర్శనం ఇవ్వటం జరిగినది.దాంతో ఈమె పెట్టిన అన్ని రకాల యోగ మాయలు దాటుకోవడం జరిగినదని అర్థమైంది కానీ పంచముఖ గాయత్రి అలాగే ఏకముఖ గాయత్రికి గలతేడా ఏమిటి అర్థం కాలేదు.ఒక రోజు అర్ధరాత్రి నిద్రలో ఉండగా నిద్ర లాంటి మెలకువలో ఉండగా నిజంలాంటి కలలో గాయత్రి మాత ఒకసారి పంచముఖాలతో మరొకసారి ఏకముఖముతో దర్శనమిచ్చింది.అప్పుడు నేను వెంటనే “అమ్మా!వీటి అర్థం ఏమిటో అర్థం చేసుకునే జ్ఞానము నాకు తెలియటం లేదు” అనగానే అమ్మ ఏదో అన్నది గాని నాకు వినబడలేదు. ఆమె కదులుతున్న పెదవులు మాత్రమే కనబడుతున్నాయి. అంటే నా సాధన ఆమె మౌనం స్వరూపాన్ని వెలుగు చూడటానికి మాత్రమే ఉందని ఆమె మాటలు వినే స్థితిలో లేదని తెలియగానే నాలో తెలియని ఆవేదన వచ్చేసరికి ఆ దైవ సంఘటన అదృశ్యమైంది.ఇది నిజమా అబద్దమా అర్థం కాలేదు. ఏదేమైనా నా సాధన స్థాయి ఎంతవరకు ఉందో తెలియజేసినందుకు అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకొని నిద్రలోకి జారుకోవడం జరిగినది.

సాధకుడు కూడా తన ఆది చక్రం అయిన మూలాధార చక్రము నుండి మొదలై అంతిమ చక్రమైన బ్రహ్మరంధ్రము దాక చూపించే అన్ని రకాల మాయాలు మర్మాలు శక్తులకు దేనికి కూడా స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేని గురించి సంకల్పించు కోకుండా నిలబడగలిగితే అదే ఇంద్రియనిగ్రహంతో స్థిర మనస్సుగా స్థిర ఏకాగ్రతతో స్థిరబుద్ధి జ్ఞానముతో ఉండగలిగితే వారి సాధన పరిసమాప్తి అయినట్లే. లేదంటే ఏ చక్రము వద్దనైనా ఆగిపోతే సాధన అసంపూర్తిగా ఆగిపోయినట్లే. అనగా ఏ చక్ర మాయాలోనైనా మోహము, వ్యామోహము చెందితే అంతటితో వాడి కర్మ ముగిసినట్లే కదా. కాకపోతే అందరూ మాయాలో పడతారు. మాయాలు దాటుకుని రావాలి అన్నమాట. ఉదాహరణకు మూలాధార చక్రము నందు మనకి కామ మాయా వస్తుంది. 8 సంవత్సరాల వయస్సు నుండి మొదలై 80 సంవత్సరాల వయస్సు వారి మీద దైవాల మీద ప్రేతాత్మల మీద దేవతల సేవకుల మీద ఇలా 13 రకాల జీవ జాతుల మీద ఈ చక్ర మాయా అయిన కామ మాయా చూపించడం జరుగుతుంది. అనగా నగ్న దేహములతో మొదలై రతిక్రీడల దాకా తీసుకొని వెళుతుంది. కానీ వీటిని సాధకుడు కేవలం సాక్షిభూతంగా ఒక శృంగార సినిమా చూసినట్లుగా చూడగలిగితే ఇంద్రియనిగ్రహము పొందటం అవుతుంది. లేదంటే వీరి నగ్న దేహ సౌందర్య మాయాలో పెడితే ప్రేమ మోహ వ్యామోహాలు పొందితే ఈ నగ్న దేహంతో వాడి ముందు సాక్షాత్కారమై వాటి రతి క్రీడలో కాలము అంతా గడిపి అధో గతి పొందుతాడు. నిగ్రహము అనేది సాధకుడు చేతిలోనే ఉంటుంది కదా. అంటే సాధన అనేది పూర్తి చేయాలని లేదా ఆగిపోవాలి అన్నది వాడిచేతిలోనే ఉంటుంది కదా.దేనికి మోహము, వ్యామోహము చెందకుండా ఉండగలిగే ఇంద్రియనిగ్రహము మన మనస్సుకి రావాలి. మన మనస్సు మన మాట వినే స్థితికి సాధకుడు తెచ్చుకోవాలి. దానికి సాధన చేసుకోవాలి. అనగా దానికి ఏది మాయో ఏది మర్మమో తెలిసేటట్లుగా చేయాలి. అది విషము అని తెలిస్తే మన మనస్సు త్రాగమన్న తాగదు కదా. అదే మత్తు పానీయం అని మన మనస్సు అనుకుంటే అది వదలమన్నా వదలదు. కాబట్టి ఈ ప్రకృతి చూపించే దశ ఇంద్రియాల మాయాలు అన్ని కూడా విషముగానే మన మనస్సుకి చూపించగలిగితే ఏమాయా మనల్ని ఏమీ చేయదు. ఎందుకంటే అమృతం సేవించిన దేవతలు కూడా ఎప్పుడో అప్పుడు మృత్యువాత పడతారు. అదే మహా కాల కూట విషమును సేవించిన నీలకంఠుడైన పరమేశ్వరుడు మాత్రం మృత్యుంజయుడు అయినట్లుగా మీరు కూడా ఈ దశ ఇంద్రియాల మాయాలను జయించి జితేంద్రియుడు అవుతారని గ్రహించండి. అంతా మనలోనే ఉంది. అంతా మనస్సు లోనే ఉంది. మాయా సహితము లేదా మాయా రహితము అవటం అనేది మన చేతుల్లో మన చేతలలో ఉంది. ఇంద్రియ నిగ్రహము మాయా రహితము, ఇంద్రియ లోలత్వం మాయా సహితము అన్నమాట .

సాధన అనేది ఆగిపోవటం లేదా పూర్తి కావడం అనేది మీ చేతుల్లోనే మీ చేతలలో మీ మనస్సు బట్టి ఉంటుంది. అంతేగాని గ్రహాలు, దైవాలు, పరమాత్మ, గురువులు,యోగుల చేతులలో ఉండదని గ్రహించండి. కాకపోతే ప్రకృతి మాయాలకి మీ మనస్సు మాయాలో పడకుండ చూసుకోవటమే అసలు సిసలైన యోగసాధన అవుతుంది. ఈ సాధనను ఆది చక్రమునుండి అంతిమ చక్రం దాకా మీరు ఇంద్రియ నిగ్రహముతో ఉండి మోహము, వ్యామోహము, భయము, ఆశ, ఆనందము పడకుండా సాక్షి భూతంగా ఉండగలిగితే అదియే సంపూర్ణ యోగ సాధనను పరిసమాప్తి చేసుకున్న మోక్షగామి అవుతారు. కాకపోతే ప్రకృతి మాత మనమీద ఈ మాయాలు చూపించడానికి కారణం మన ప్రారబ్ద కర్మలు కారణమని గ్రహించండి. ప్రారబ్ద కర్మ అంటే గత జన్మలలో చేసిన పాపము లేదా పుణ్య కర్మల ఫలితమే ప్రారబ్ద కర్మ అంటారు. ఏది ఎక్కువ ఉంటే అది ఫలితముగా ఈ జన్మలో మనము పొందుతాము అన్నమాట. గత జన్మలలో పాపాలు ఎక్కువ ఉంటే ఈ జన్మలో మనం మాయాలో పడతాము. అదే పుణ్యములు ఉంటే ఈ జన్మలో మాయా రహితము అవుతాము. ఇది ఎలా తెలుస్తుంది అంటే మన మనస్సు దేనియందైనా స్పందించిన అదే పనిగా ఆలోచించిన లేదా సంకల్పించుకున్న కూడా అది ప్రారబ్దకర్మ ఫలితమేనని గ్రహించండి. నిజానికి ఆదిలో మనకి శూన్యం నుండి 36 ప్రారబ్ద కర్మలు వచ్చినాయి. శూన్యం నుండి శూన్య బ్రహ్మగా మనము అవతరించి ఈ 36 కర్మలు చేయటానికి ఆది జన్మ ఎత్తడం జరిగినది. దానితో మరో 12 కర్మశేష కర్మలు తోడైనాయి అంటే

36 +12=48 ప్రారబ్ద కర్మలు ఏర్పడినాయి అన్నమాట. అందుకే ప్రతి 48వ జన్మ సాధన జన్మ లేదా యోగ జన్మ అని శాస్త్రవచనము.

ఇది జరిగిన నలభై ఒక్క రోజుల తర్వాత ఒక 45 సంవత్సరాలు స్త్రీ మూర్తి నా దగ్గరికి వచ్చి “రాత్రి అమ్మవారు తన పంచముఖ గాయత్రి విగ్రహమూర్తి మీకు ఇమ్మని” చెప్పడం జరిగింది. నాన్నగారు దీనిని నిత్యం పూజలో ఉంచుకొని ఈమె అనుష్టానము చాలా నిష్ఠగా చేసి ఈ మంత్ర శక్తి జపంతో మమ్మల్ని సంతానంగా పొందడం జరిగినది. కానీ వారు నెల రోజుల క్రితం పరమపదించడం జరిగింది. అది అక్కడనుండి ఇంట్లో ఏదో తెలియని గొడవలు, మనస్పర్ధలు రావటం ,కలహాలు, అగ్ని ప్రమాదాలు, ఏవో అనుకోని వాహన ప్రమాదాలు,విడిపోయే పరిస్థితి వరుసపెట్టి వస్తుండే సరికి నేను ఒక జ్యోతిష్య వేత్తను సంప్రదించగా వారు ఏవో కొన్ని ప్రశ్న చక్రాలు గీసి “అమ్మా! మీ ఇంటిలో అతి శక్తివంతమైన పంచముఖ గాయత్రి మాత విగ్రహం ఉన్నట్లుగా తెలుస్తోంది.దానికి పూజలు చేసేవారు లేకపోవడంతో అది ఉగ్రరూపం దాల్చింది.అందుకే అనుకోని సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి.మీ వంశస్థులు ఇంకా ఎవరు కూడా అంత మంత్ర శక్తి తట్టుకునే వారు లేకపోవడంతో దానిని మీరు ఎవరికైనా ఇవ్వండి అని సలహా ఇస్తూ మీ ఇంటికి పలానా దిశలో పలాన దిక్కులో ఫలానా ఇంటిలో ఫలానా ముఖకవళికలు ఉన్న వ్యక్తి ఉన్నారని వారు కూడా గాయత్రి మంత్రానుష్టానం సిద్ధులని మీ గురించి చెప్పడం జరిగింది. దాంతో ఈ పెద్దమ్మను మీకు ఇవ్వడానికి వచ్చాము.ఏమిటి నేను ఇవ్వడం ఏమిటి నా బొంద.ఆమెకు కావలసిన వారిని ఆమె తెలుసుకున్నది అంటూ నేను చెప్పేది వినకుండా నా ఒడిలో ఈ పంచముఖ గాయత్రి విగ్రహం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.ఈ విగ్రహం నన్ను కూడా భయపెడితే నా పరిస్థితి ఏమిటని మధనపడుతుండగా నాకు మళ్ళీ నిద్ర మెలకువ స్థితిలోనికి వెళ్లేసరికి ఈసారి కూడా ఏకముఖ గాయత్రి కనపడి “నాయనా! నేనే నీ భక్తికి మెచ్చి స్వయంగా వచ్చాను. మీ నిష్కామ భక్తి వలన నేను నీ భక్తికి దాసురాలను అయినాను. నేను నీ దగ్గరికి రావడానికి వాళ్లతో రుణానుబంధం తెంచుకోవటానికి అలా ప్రవర్తించవలసి వచ్చింది.కానీ నీ మీద నాకు ఎలాంటి కోపావేశాలు ఉండవు. నేను నీకు బ్రహ్మ జ్ఞానం అందించే వేదమాతనే గాని ఆవేశపడే అమ్మను కాను. నువ్వు నన్ను చూడు.నేను నిన్ను చూసుకుంటాను” అని అభయమిస్తూ అదృశ్యమైంది.ఈసారి ఆమె మాటలు నాకు స్పష్టంగా వినబడటంతో ఈ విగ్రహారాధనతో నా మంత్ర సిద్ధి సాధన స్థాయి పెరుగుతుందని అర్థమయ్యేసరికి నా దేహం అంతా రోమాలతో గగుర్పాటు చెందినది.కొన్ని రోజులకు నాకు నా బుద్ధికి విశ్లేషించే వివేక బుద్ధి అలవడింది.ఎలాంటి సమస్య అయినా సందేహమైన కొన్ని క్షణాలు ఆలోచించి ఆ సమస్యకు ఉన్న పలురకాల పరిష్కార మార్గాలు అలాగే వాటికి తగ్గ సమాధానాలు ఎంతో చాకచక్యంగా విశ్లేషించి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించేది కాదు.ఎందుకంటే ఇదంతా గాయత్రి మాత విగ్రహం-అనుగ్రహం వల్లే సాధ్యపడుతుందని, చెప్పేది ఆమె అని చూపించేది నన్ను అని నాకు మాత్రమే తెలుసు. ఆమె ఎందుకు అలా చేస్తుందో నేను ఆలోచించే వాడిని కాను .ఎందుకంటే అమ్మ తన వంతు సహాయంగా తన సహాయ సహకారాలు కోరిన వ్యక్తులకు వారికి కావలసిన వివరాలు చెబుతున్నదని నన్ను ఉపయోగించినందుకు ఆమెకి నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. అలాగే రుణపడి ఉండేవాడిని.ఏది ఏమైనా ఇలాంటి ప్రాథమిక సిద్దులు ఎవరు మంత్రరాధన పూర్తి చేసిన వస్తాయని గ్రహించండి. వాటి మాయలో పడకుండా ముందుకు వెళ్ళండి. లేదంటే మీరు కూడా అర్థణా అయ్యే ఖర్చు కోసం మీ జీవితమే నాశనం అవుతుందని గ్రహించండి.జాగ్రత్త పడండి.ఉంటాను.మీ ఇష్ట దేవత మంత్రము జపము చేసుకొని మళ్లీ నాతో ముందుకి ప్రయాణం చేయండి. నా మంత్రదేవత వేదమాత గాయిత్రిమాత ఏలాంటి దీక్ష గురువు ని చూపినదో మీకు తెలుసుకోవాలని ఉందా?

గమనిక:ఇక్కడ ఒక విషయము మనము తెలుసుకోవాలి అది ఏమిటంటే దైవదర్శనమునకు అలాగే దైవసాక్షాత్కరమునకు తేడా ఉంటుంది.అదే దైవ దర్శనము అంటే మన మంత్రదేవత స్వప్నమునందు కనపడి మనకి గావాలసిన సూచనలు ఇస్తుంది!అనగా ఇది కల లాంటిది! అదే దైవసాక్షాత్కరమంటే ధ్యానములో లేదా నిశ్చల సమాధి స్ధితిలో కనపడుతూ...ఇలలో మనుష్యరూపేణ కనపడుతూ...మనతో మాట్లాడుతూ మనవెంట ఉన్నట్లుగా కనపడతారు.అసలు నిజానికి మన సూక్ష్మశరీరమే మన మంత్రదైవముగా లేదా మన ఇష్టదైవముగా కనపడుతుంది.ఈ విషయము మన ఆఙ్ఞాచక్రములో ఉన్న జీవమాయ దాటేవరకు మనకి తెలియదు.దైవదర్శనం మొదలు అంటే బాల మాయ మొదలు అదే దైవసాక్షాత్కరం మొదలు అంటే త్రిపుర మాయ మొదలు అని తెలుసుకొండి! అందుకే ఈ దైవదర్శన,సాక్షాత్కరాలను మనోభ్రాంతులని...వీటిని దాటాలని మన సద్గురు వచ్చి చెప్పేదాకా మనకున్న జీవమాయ పోదు! అపుడే నేనే దేవుడిని అనుభూతి పొందడము అనగా అహం:బ్రహ్మస్మి.

స్కూటర్ నడుపుతున్న దత్తాత్రేయ స్వామి

ఈ 48వ జన్మలోనే జీవుడికి అన్ని రకాల కర్మలయందు వైరాగ్య భావాలు కలిగి మోక్షం పొందాలని ఆకాంక్ష మొదలవుతుంది. దాని కోసం తపనలు, పరి తపనలు, తాపత్రయం ఈ సాధన జన్మలో మనకి కలుగుతాయి. ఇవి ఉన్నాయి అంటే ప్రస్తుత జన్మ మనది 48 వ జన్మ అన్నమాట. అనగా ప్రారబ్ద కర్మను నివారించుకునే అవకాశం ఉన్న జన్మ అన్నమాట. కాకపోతే ఆదిలో ఈ ప్రారబ్ద కర్మలు 48 మాత్రమే కానీ అంతమునకు వచ్చేసరికి అవి కాస్త 48 లక్షల ప్రారబ్ద కర్మలుగా మారినాయి. వీటికి అధిదేవతలుగా బాల త్రిపుర సుందరి దేవి గా ఆదిపరాశక్తి అనగా ప్రకృతి మాత ఉంటుంది. అనగా బాలగా 10లక్షలు, త్రిపుర గా 12 లక్షలు, సుందరిగా 15 లక్షలు, దేవిగా 11లక్షలు కర్మలు…. విశుద్ధ చక్రము వద్ద 10 లక్షలు అనగా ప్రకృతి గాను అలాగే ఆజ్ఞాచక్రము వద్ద 12 లక్షలు ప్రకృతి గాను అదే సహస్రార చక్రం వద్ద నుండి హృదయ చక్రం సుందరిగా 15 లక్షలు మూలప్రకృతిగా అలాగే బ్రహ్మరంధ్రము వద్ద దేవిగా పదకొండు లక్షలు ఆదిపరాశక్తి గా ఉండి మన యోగచక్రాలలో మన ప్రారబ్ధ కర్మలనే యోగమాయాగా మన దశేంద్రియాలకు చూపించడం జరుగుతుంది. సాధకుడు వీటిని గ్రహించి ఆయా కర్మ ఫలితాలను వారి పంచ గురువులైన మంత్ర, దీక్ష, సద్గురువువు, పరమ గురువు, ఆదిగురువులు వారి వారి ప్రారబ్ధ కర్మల బట్టి దైవిక వస్తువులు వీరికి కావలసిన వస్తువులు,జప శక్తి వారి చెడు గుణాలు ఇలా వారిని గురుదక్షిణ పేరిట అడిగి వారి ప్రారబ్ద కర్మలు నాశనం చేస్తారు. దానితో సాధకునికి ప్రకృతిమాత కలిగించే సాధన మాయాలు తొలుగుతాయి. సాధకుడు స్వయంగా వీటిని తొలగించుకోలేడు. దానికి ఈ పంచ గురువుల అనుగ్రహమును తప్పక పొందవలసి ఉంటుంది. అలాగే ఆయా గురువులు వచ్చి వారికి కావలసిన గురుదక్షిణను ఇవ్వగలిగిన మాత్రమే తమ సాధనను పరిసమాప్తి చేసుకోగలుగుతాడు అని నా స్వానుభవం ద్వారా తెలుసుకోవడం జరిగినది. ఎందుకంటే 48 లక్షల ప్రారబ్ద కర్మలు అనుభవించాలంటే సాధకుడు కోటి నలభై రెండు లక్షల 372 జన్మలు అది కూడా 48వ సాధన జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అదే గురువులు అడిగిన గురుదక్షిణ మీరు సమర్పించారు అంటే 48 నిమిషాల నుండి 48 సంవత్సరాలలో ఈ 48 లక్షల ప్రారబ్ద కర్మలు నశించి కర్మరాహిత్యం పొంది కర్మశేషము లేని జన్మలు లేని మోక్షపధము పొందుతారు. సాక్షాత్తూ జగద్గురువైన శ్రీకృష్ణునిని తన గురువైన సాందీపమునికి గురుదక్షిణ క్రిందగా కుమారుడిని బ్రతికించి ఇవ్వటం జరిగిందని పురాణ వచనము గదా. మీరే ఆలోచించుకోండి. అంతెందుకు పరమాత్మ అయిన షిరిడి సాయి బాబా వారు తన సద్గురువువు గురుదక్షిణగా రెండు పైసలు అనగా శ్రద్ధ సబూరి ఇచ్చారని లోకవిదితమే కదా. కాబట్టి 48వ సాధన జన్మ రావటం, మోక్షము పొందాలనే కోరిక కలగడం, గురువుల అనుగ్రహము పొందటం అనేది మన ప్రారబ్ద కర్మ ప్రదాత అయిన జగద్గురువైన ప్రకృతి మాత అనుగ్రహమును బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ గురుదక్షిణ పేరిట మీ ప్రారబ్ద కర్మలు నివారణ చేసుకున్నారో ఆనాటి నుండి మీ యోగసాధన అభివృద్ధి చెందుతుంది. కాకపోతే నిజ గురువులకే గురుదక్షిణ సమర్పిస్తేనే ఈ ఫలితము ఉంటుంది. అదే నకిలీ గురువులకి సమర్పిస్తే అంతటితో మీ సాధన ఆగిపోయి వారి పాప భారం కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించండి. ఒక్కటి గుర్తుంచుకోండి. మీ మనస్సు దేనియందు మోహము, వ్యామోహము చెందుతుందో అది లేకపోతే ఉండలేని స్థితి పొందుతుందో అదియే మీ ప్రారబ్ద కర్మలు అవుతాయి. అలాగే మీ మనస్సుకి మీ నిజ గురువు ఎవరు నకిలీ గురువు ఎవరు గమనించి మీకు అంతరాత్మ గా మారి చెబుతుంది.అట్టి నిజ గురుదేవునికి ఆయన అడిగిన గురు దక్షిణ సమర్పించండి. ఆయా చక్ర ప్రారబ్ద కర్మను తొలగించుకొని ముందుకు కొనసాగించండి. ప్రారబ్ధ కర్మలు అంటే అర్హత యోగ్యతలను గ్రహించండి. ఐఏఎస్ కావాలంటే డిగ్రీ అర్హత ఉండాలి. అదే విధంగా ఐఏఎస్ ఇంటర్వ్యూ యోగ్యత ఉండాలి. ఒక ఐఏఎస్కే ఇలా ఉన్నప్పుడు మీకు ప్రకృతిమాత ఆధీనమై విశ్వాత్మ గా మారాలి అన్నప్పుడు

ఎన్ని అర్హతలు యోగ్యత ఉండాలో మీరే ఆలోచించుకోండి. ప్రారబ్ద కర్మలు అనేవి మన అర్హతను నిరూపించే యోగ పరీక్షలు అని గ్రహించండి. చిత్రం ఏమిటంటే ఈ 36 ప్రారబ్ద కర్మలు ఉన్న 36 కపాలాలు ధరించిన సదాశివమూర్తి నివసించే కైలాస పర్వతం పరిధి కూడా 48 కిలో మీటర్లు ఉండటం ప్రకృతి మాత చూపించే విచిత్రాలలో ఒకటి అన్నమాట.

నాకు గాయత్రి మంత్ర సిద్ధి అయినదని ఇంతకుముందు అధ్యాయం లో చదివి ఉన్నారు కదా.ఇలా ఉండగా గాయత్రి మాత కలలో కనిపించి “నాయనా!నా అనుగ్రహం వలన నీ దీక్ష గురువు నీ దగ్గరకి రేపు వస్తున్నారు.వారిని బాగా పరీక్షించి, పరీక్షలు పెట్టి, పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ దీక్ష గురువుగా వారిని ఎంచుకో.నీకు నచ్చితే వారే నీకు దీక్ష గురువుగా నువ్వు వారిని నీ జీవితాంతం భావించుకోవాల్సి ఉంటుంది.అవసరమైతే వారికి గురు సేవ చేయాల్సి ఉంటుంది.ఒకసారి నమ్మిన తర్వాత ఆయన ఎలాంటి వారైనా వదిలి పెట్టవద్దు. అలాగని గురువులను మార్చవద్దు. నీ ఈ సాధన స్థాయిని పెంచే నీకు వచ్చే 18 రకాలయోగ సాధన మార్గాలలో ఈయన జ్ఞాన మార్గంలో నడిచిన జ్ఞాన సిద్ధుడని తెలుసుకో. ఆయన నిన్ను ఏమార్చడానికి నిన్ను విసిగిస్తాడు. అజ్ఞానిగా ఉంటాడు. చాలా తక్కువగా మాట్లాడతాడు.పిచ్చి చేష్టలు చేస్తూ పిచ్చివాడి మాదిరిగా ఉంటాడు. కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత” అని గ్రహించు అని చెప్పి అంతర్ధానం అయినది. మరుసటి రోజు నేను యధావిధిగా మా గుడిలోని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఒక నడివయసు వ్యక్తి గుడి లోనికి రావడం జరిగినది. దేవాలయం అంతా తిరుగుతూ ఏవో చేస్తూ గాలిలో చేతులు ఊపుతూ అప్పుడప్పుడు పిచ్చివాడి మాదిరిగా పిచ్చి చూపులు ,వెర్రి నవ్వులు తనలో తాను నవ్వుకుంటూ చేస్తున్నారు.అప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి “స్వామి! నమస్కారం. రాత్రి అమ్మ మీ గూర్చి చెప్పినది. ఇదిగో దేవుని ప్రసాదం అంటూ ఆయన చేతిలో అరటిపండ్లు పెట్టినాను. వెంటనే ఆయన అమ్మ చెప్పిందా? మా అమ్మ చనిపోయింది కదా. చనిపోయింది ఎలా వచ్చి చెబుతుంది.లేని అమ్మను ఉందని, నీతో చెప్పిందని కథలు చెబుతున్నావా? నాతో లంజా కొడకా! నా దగ్గర దొంగతనం చేయడానికి వచ్చినావా ముండా కొడకా! ఏమిరా నాటకాలు ఆడుతున్నారు. మీ అమ్మ చెప్పినది విని మా అమ్మ చెప్పినది అని అంటావా వెధవ నాయాల! ఏమిరా నా దగ్గర ఉన్న వాటిని దోచుకు వెళ్లాలని ఎన్నాళ్ల నుంచి నువ్వు మీ అమ్మ కలిసి పథకాలు వేసినారు ముండాకొడుకుల్లారా. మీ అమ్మ ఒక వెధవ ముండ, నువ్వు పని లేని ముండాకొడుకు. బుద్ధిలేని సన్యాసి! వెధవ మాటలు మాట్లాడే వెధవ నాయాల! నీకు సిగ్గు శరం ఉన్నదా! దమ్ముంటే ఇదిగో నా ఎంగిలి తిను చూద్దాం!” అంటూ నేను ఇచ్చిన అరటిపండ్లలో ఒక పండు తీసి దానిలో పండు నా మీద కొట్టి తొక్క కొంత తిని నా నోట్లో పెడుతుంటేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. నిజంగానే ఈయన మతిభ్రమణం చెందిన వ్యక్తి అయి ఉంటారు.!ఈరోజు నిజముగానే బాలోన్మత పిశాచ అవస్ధ పొందిన అవధూతను చూస్తున్నానని నాకు అనిపించినది! “వామ్మో! తెలుగులో ఇన్ని పచ్చి బూతులు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. నన్ను ఇన్ని తిట్లు కూడా ఎవరూ తిట్టలేదు. వీళ్లు దీక్ష గురువు అని పొరపాటు పడినందుకు నా చంక నా చేత నాకిస్తున్నారు. పండు వదిలేసి తొక్క తినటం ఏమిటి కాకపోతే? అందులో సగం తొక్క నా నోట్లో పెట్టడానికి ప్రయత్నించడం ఏమిటి? వామ్మో! ఎటు పారిపోవటానికి అవకాశం లేకుండా వీడి దగ్గర ఇరుక్కుపోయాను” వెంటనే నాకు వచ్చిన మంత్రాలు చదువుతూ ఉండగా ఈయన పెట్టిన మరో భయం వలన మంత్రాలు కూడా సరిగ్గా ఉచ్చరించలేక ఒక మంత్రానికి మరొక మంత్రం కలుపుతూ కొత్త మంత్రాలు తయారు చేస్తున్నాను అని తెలుసుకొనే స్థితిలో నేను లేను. వెంటనే మట్టి లింగమూర్తి అలాగే సజీవ బాబా మూర్తిని అలాగే గాయత్రి మాతను తలుచుకుంటూ ఉండగా “ఏమిరా ఈ మాత్రానికే బాబాను, గాయత్రిని,లింగయ్యను ఈ మంత్రాలతో పిలుస్తావా! నీ మంత్రం అంత అవసరం లేదు. ఇదిగో ఈ ప్రసాదం అంటూ తను సగం తిన్న అరటిపండు భాగము నాకు ఇచ్చి నేను తినే దాకా ఎదురు చూస్తుండగా నాకు ఏదో తెలియని నిద్ర మత్తు ఆవహిస్తోంది అని తెలియగానే “వామ్మో! గురువుగారు కాదు. పాడు కాదు. వీరు నిజంగా దొంగ. ఈ గుడిలో దొంగతనం చేయడానికి వచ్చి అరటి పండ్లులో మత్తుమందు కలిపి దానిని తనచే తినిపించాడు. వామ్మో! దీనమ్మ! సమయానికి ఎవరూ కూడా లేకుండా పోయారు. అవసరానికి ఎవరు ఉండరు. అవసరం లేనప్పుడు వద్దన్నా ఉంటారు” అని తిట్టుకుంటూ నిద్రలోకి జారిపోవడం జరిగింది.మెలకువ వచ్చేసరికి మళ్లీ ఈయన నా ఎదురుగా ఉండి, “నేను దొంగను కాను. నీవే దొంగ.నా దగ్గర ఉన్న అమూల్య జ్ఞాన రత్నం నీకు ఇవ్వాలని వచ్చాను. ఇచ్చాను. అదియే శక్తిపాత సిద్దితో కూడిన నా ఎంగిలి అరటిపండు ప్రసాదం. ఈ నాటి నుండి మీలో కుండలిని శక్తి జాగృతి అయ్యి 13 యోగ చక్రాలు జాగృతి అవుతాయి. కంగారు పడకు. నెమ్మదిగా లే. మీ శరీరం ఈ శక్తి పాతమునకు తట్టుకోలేక పోయినది. అందువలన కళ్లు తిరిగి పడిపోయావు. కంగారు పడకు.నెమ్మదించు. భయపడకు. రాత్రి గాయత్రి చెప్పిన వ్యక్తిని నేనే. ఆ గాయత్రి ఎవరో కాదు నా కూతురే అంటుండగా “వామ్మో! సాక్షాత్తు మహా గాయత్రి మంత్ర దేవతను ఈయన స్వయంగా తన కూతురు గావించుకొని ఆరాధన చేసినారు అంటే ఖచ్చితంగా మహాత్ముడు అని” ఈయన కాళ్లకు నమస్కారం చేయగానే “అదేరా! మీతో వచ్చిన చిక్కు. చమత్కారాలు చేస్తే గాని నమస్కారాలు చేయరా! అవును కానీ నీకు ఏమి కావాలి రా! ఎవరి దర్శనం కావాలో చెప్పు. క్షణాలలో వారు నీ ముందు ఉంటారు” అనగానే

నాకు అకస్మాత్తుగా గురువులకే గురువైన విశ్వ గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చూడాలనిపించి ఇదే విషయాన్ని వారితో చెప్పాను. ఆయన నవ్వుతూ, దానికి “అదేమంత పెద్ద విషయం కాదు. ఆ టక్కరిదొంగ నా సన్నిహితుడే! నువ్వు కొన్ని నిమిషాలు ఎదురు చూడాలి. పద రోడ్డు మీదకు వెళ్లి చూద్దాం” అని చెప్పి రోడ్డు మీదకు తీసుకుని వెళ్లి అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఇంతలో నాకు “అవును! ఆయన ఇంత సులభంగా ఎవరికి దర్శనం ఇవ్వరు కదా! ఎన్నో యోగ పరీక్షలు పెట్టే పరీక్షదత్తుడు అని నేను విన్నాను. మరి ఈయన ఏమో నాకు చూపిస్తానని ఆ మనిషి కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఈయన పిలిస్తే ఆయన వచ్చేస్తారా! వామ్మో! ఈయన ఎంతటి గొప్ప యోగిపుంగవుడు అయ్యి ఉంటాడు. అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నాను. అసలు ఆయన మాయా రూపాలు ధరించే మాయావి. ధరించిన రూపం ధరించకుండా వచ్చే అఖండ మేధావి.మాయల కే మహా మాయగాడు” అనుకుంటుండగా

ఆయన వెంటనే “అదిగోరా! అలా స్కూటర్ మీద అదిగో వస్తున్నాడే మీ దత్త స్వామి జాగ్రత్తగా చూడు పారిపోతాడు” అన్నాడు. వెంటనే చాలా ఆసక్తిగా అటు వైపు చూస్తే ఎవరో ముగ్గురు వ్యక్తులు కలిసి స్కూటర్ మీద వెళ్తున్నారు కానీ వారిలో ఎవరికి కూడా దైవిక శక్తి లేదు. ఎందుకంటే వారిలో ఇద్దరు నాకు తెలిసిన వ్యక్తులే అని ఆయన తిరిగి వైపు “ వీళ్లు దత్తాత్రేయుడా? మీకు ఎలా కనబడుతున్నాను. వాళ్లలో నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.అప్పుడప్పుడు మా గుడికి వస్తూ ఉంటారు. ఇంతకంటే ఏమీ లేదా? నాకు చూపించడానికి…. మీకు నవ్వులాట లాగా ఉంది. ఎంతో ఆశగా దత్త స్వామి చూపిస్తారు అంటే మా ఊరి మనుష్యులను నాకు చూపిస్తున్నారు” అనగానే ఆయన వెంటనే “ఒరేయ్ పిచ్చోడా! దత్త స్వామి అంటే ఫొటోలో చూపిన విధంగా నాలుగు కుక్కలుతో, పసుపు రంగు వస్త్రాలతో, వివిధ రకాల రుద్రాక్ష మాలలు ఉన్న రూపంలో వ్యక్తి గానే వస్తేనే నువ్వు దత్త స్వామి అంటే ఎలా కుదురుతుంది. మీ దత్త స్వామి మూడు తలల ఆ స్వామి కదా.ఇందాక స్కూటర్ మీద వెళుతున్న వారిలో నడిపేవాడు ఎదురుగా చూస్తుంటే మిగిలిన ఇద్దరూ తమ తలలను కుడివైపు ఒక్కడు మరొకడు ఎడమవైపు నుంచి చూస్తూ వెళుతున్నారు కదా! మరి ఇప్పుడు ఈ ముగ్గురు తలలు కలిపి సరిగ్గా చూడు. మీ దత్త స్వామికి కూడా ఉన్న మూడు తలలు లాగానే ఈ ముగ్గురు తలలు ఉన్నాయి కదా. ఇంకా ఏమిటి? దత్తాత్రేయుడే కదా! వీళ్లు” అనగానే “వామ్మో అంటే ఈయన సాధన స్థాయి ఎంత మహోన్నతమైన స్థాయిలో ఉంది. ఈయన చెప్పినది నిజమే కదా. దత్తుడికి మూడు తలలు ఉన్నట్లుగా ఈ స్కూటర్ నడిపే వ్యక్తులు మూడు తలలు కలిపి చూస్తే మూడు తలల ఆ స్వామి కనపడేది అంటే నేను దేవుడిని ఒక మానవుడిలా భావించుకొని ఆరాధన చేస్తూ వచ్చాను కానీ ఈయన మాత్రం మానవుడిలో దేవుడు గావించుకొని ఆరాధన చేస్తున్నారు. నాది విగ్రహారాధన అయితే వీరిది విశ్వ ఆరాధన అవుతుంది. భక్తి మార్గంలో ఉన్న వారికి దేవుడు ఒక మానవుడు అయితే జ్ఞాన మార్గం ఉన్నవారికి మానవుడు మాధవుడిగా కనబడతాడు” అని నా వివేక బుద్ధి విశ్లేషించి వివరణ ఇచ్చేసరికి ఆ దీక్ష గురువు అక్కడి నుండి అదృశ్యం అయినారు అని గమనించలేదు.

నాకు కొంత బాధ,ఆవేదన,మనోవేదన కలిగించాయి. నిజానికి ఆయన నన్ను తిట్టలేదు నాలో ఉన్న లోపాలను, పాపాలను ఆయన తిట్ల రూపంలో బయటకు పంపించివేశారు.నాలో ఆవేశం కలిగించే అరటిపండు ప్రసాదం ద్వారా తమ యోగశక్తిని తమ శక్తి పాత సిద్ది ద్వారా నాలోనికి పంపించి యోగ గురువు అయ్యారు. ఆయన రూపురేఖలుమాత్రమే గుర్తున్నాయి. వీరిని నా చిన్నపుడు ఇదే గుడిలో ఉన్నపుడు చూడటం జరిగినట్లుగా...వారు శ్రీశైలములో నివసించే శ్రీపూర్ణానంద యోగిగా లీలగా గుర్తుకు వచ్చినది కాని సంపూర్తిగా గుర్తుకు రావడము లేదు. కాని వారి సాధన వివరాలు తెలియలేదు. యోగుల పూర్తి వివరాలు తెలుసుకోవటం చాలా అసాధ్యమని గుర్తుకు వచ్చే సరికి నా ప్రయత్నం విరమించుకుని ఇంతటి మహత్తర శక్తి ఉన్న నిజ దీక్ష గురువు నాకు ప్రసాదించినందుకు గాయత్రి మాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మౌనంగా గుడిలోనికి వెళ్ళి మిగిలిపోయిన పూజాది కార్యక్రమాలు పూర్తి చేయసాగాను. నా గురువు గురించి నా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.మహా నైవేద్యం గిన్నెను తీసుకొని ఇంటి వైపు వెళ్లి పోయాను.

అసలు ఈ మాయాలెందుకు...వాటిని తెలుసుకొని దాటడమెందుకు...నా బొంద...నా బూడిద అని మీలో కొందరికి అనిపించవచ్చును. దీనికి సమాధానము ఏమిటంటే ఒక తల్లి తన పిల్లవాడిని ఎల్లపుడు లాలించటానికి అవకాశముండదు గదా! వీడినే గాకుండా మిగిలిన పనులు లేదా ఇతర పిల్లకాయలను చూసుకొనే బాధ్యత ఈమెకి ఉంటుంది గదా! అపుడు వీడిని వదిలి పెట్టి వెళ్ళినపుడు మనవాడు ఏడుపు లంఘించుకుంటాడు గదా!అలాగని అమ్మ వీడి దగ్గర శాశ్వతముగా ఉండలేని పరిస్ధితి.అపుడపుడు అయ్య దగ్గరకి కూడ వెళ్ళాలి గదా!లేకపోతే ఆయన చిన్నపిల్లాడిలాగా గోల చేస్తాడు గదా! ఈ సమస్య పరిష్కారము కోసము పిల్లవాడికి తను లేకపోయిన ఏడ్వకుండా ఉండటానికి ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు ఇచ్చి వెళ్ళుతుంది.ఈ బొమ్మల మాయాలో పడినవాడు అమ్మను మర్చిపోతాడు.ఇవి బొమ్మలు ...అమ్మకాదని తెలుసుకొన్నవాడు నిరంతరముగా అమ్మ తన దగ్గరికి వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు.చచ్చినట్లుగా అమ్మ ఎక్కడున్న వీడి కోసము రాక తప్పదు గదా! అలాగే మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న ఆదిపరాశక్తి అమ్మ గూడ సాధన చేసే పిల్లవాడిని మరిపించటానికి మూలాధారచక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా చక్రమాయాల రూపములో,అరిష్వర్గాల రూపములో,వ్యసనాల రూపములో మాయాలు పెట్టినది.వీటి మాయాలో పడినవాడి దగ్గరకి అమ్మ వెళ్ళవలసిన పని ఉండదు గదా.ఎవడు అయితే ఇవి మాయాలని తెలుసుకొని వాటిని తన మనోఇంద్రియనిగ్రహశక్తితో దాటుకుంటాడో...వాడి దగ్గరకి అమ్మవారు వచ్చి వీడి సాధనను పరిసమాప్తి చేస్తుంది అన్నమాట.ఇలా అమ్మ పంచరూపాలలో అనగా భ్రమరి- బాలా- త్రిపుర- సుందరి- దేవి రూపాలలో అమ్మవారు వస్తుందని నా అనుభవాలే గాకుండా వివిధ యోగుల అనుభవాలలో అనగా ఉదా:ఈ గ్రంధములో చెప్పిన లాహిరి అనుభవాలు అలాగే తాడేపల్లి రాఘవా నారాయణ శాస్త్రి అలాగే చంద్రశేఖర శాస్త్రి అనుభవాలు సాక్ష్యం నిలుస్తున్నాయి. వీరందరికి అమ్మవారు వీరి సాధన స్ధితిని బట్టి ఈ పంచరూపాలలో ఆయా రూపములో దర్శనమిచ్చి వారి సాధనను పరిసమాప్తి చేసినదని లోకవిదితమే కదా! మరి మీరు అమ్మవారు ఇచ్చే బొమ్మలలాంటి చక్రమాయాలలో పడతారో...లేదా అమ్మవారు వచ్చేంత సాధన కోసము ఇంద్రియశక్తితో ఉండి అమ్మ వచ్చేదాకా సాధనను కొనసాగిస్తారో మీరే నిర్ణయించుకొండి.అమ్మగావాలా లేదా బొమ్మ గావాలా అనేది మీకున్న ఇంద్రియనిగ్రహమును బట్టి ఆధారపడి ఉంటుంది.బలహీనత లేని బలవంతుడు అలాగే మాయాలో పడని సాధకుడు ఇంతవరకు సృష్టించపడలేదు.కాని మాయాలలో పడి గూడ పైకి లేచి వచ్చి సాధనను ఇంద్రియనిగ్రహశక్తితో మాయాలను దాటుకొనేవాడి కోసము జగత్ గురువుగా ప్రకృతిమాత అయిన ఆదిపరాశక్తి ఎదురుచూస్తుందని గ్రహించండి. ఇందుకు ఉదా: బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అలాగే యోగివేమన్న జీవిత చరిత్రలు నిలుస్తాయని తెలుసుకోండి.మాయాలో అందరు పడతారు.కాని కొద్దిమంది మాత్రమే ఆ మాయాల యందు మోహము,వ్యామోహము చెందకుండా ఇంద్రియ నిగ్రహశక్తితో ఆ మాయాలను దాటి మానవుడు కాస్తా మాధవుడు అవుతున్నాడు.అలాగే ఈ మాయాలలో పడి ఇంద్రియలోలత్వమునకి లోనై మానవుడు కాస్త సాధనను గంగపాలు చేసి వానరుడు అవుతున్నాడని గ్రహించండి.

ఇప్పటిదాకా నాకు పుస్తక పఠనంతో శబ్ద పాండిత్యమే ఉన్నది గానీ చక్రాలు జాగృతి అయినప్పుడు ఏమి జరుగుతుందో స్వానుభవం అనుభవ పాండిత్యం కలిగి లేదు కదా! కాబట్టి శబ్ద పాండిత్యం వివరాలు నిజమే అని నేను నమ్మడానికి వీలు ఉండదు కదా! ఇక నేను అనుభవం కోసం సాధన చేయడం ప్రారంభించాను. కుండలినీ శక్తి లో కదలికలు ప్రారంభమవుతాయని దీక్ష గురువు చెప్పి వెళ్ళినారు కదా! చూద్దాం! అది జాగృతి అయినది అని మనకు ఎలా తెలుస్తుందో గమనించాలి అనుకొని యధావిధిగా మంత్రానుష్టానం చేసుకుంటుండగా నాలో ఏదో తెలియని ఆవేదన ఆరంభమైనది. ఎందుకు ఏదో తెలియని భయం ఆందోళన నాలో ప్రారంభమయ్యాయి. ఎందుకో తెలియదు. ఒక రోజు అర్ధరాత్రి సమయంలో మంచి నిద్రలో ఉండగా వెన్నుపూస క్రింద మూలాధార చక్ర ప్రాంతం క్రింద భాగంలో అడుగు భాగంలో ఏదో శక్తి కదులుతున్నట్లుగా అనిపించసాగింది. కలలో నాగుపాము తల తరచుగా కనపడసాగింది. ఇది ఎందుకు కనపడుతుందో నాకు అర్థం అయ్యేది కాదు. ఇందులో ఏదో తెలియని శక్తి ఉన్నదని అనిపించసాగింది. కదలికలు విపరీతంగా అవుతున్నాయి అని అనిపించసాగింది.ఈ అనుభవం ఏమిటో ఎందుకు కలుగుతుందో అర్థమయ్యే స్థితిలో నేను లేను. ఏమిచేయాలో అర్థంకాని స్థితి. రాత్రులు నిద్ర పోతుంటే తరచుగా నాగుపాము పడగ కలలో కనిపించేది. అది కనిపించినప్పుడల్లా ఏదో కదలికలు అనుకోకుండా కదులుతున్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్య దారితీస్తుంది ఏమోనని భయం మొదలైంది. ఈ క్రింది లక్షణాలు తరచుగా కనబడటం:1. ఇటు అయోమయ స్థితి ఉండటము 2.పలకరిస్తే పలక పోవడం 3.నా లోపల నేను ఉండటం.4. వేళకి భోజనము, నిద్ర లేని స్థితి 5. ఎక్కువగా ఏకాంతంగా మౌనంగా ఉండటం 6.ఎక్కువగా రాత్రిళ్ళు నిద్ర పోకుండా మెలుకువగా ఉండటం ! ఇలాంటి లక్షణాలు ఎందుకు కలుగుతాయో దేనివలన కలుగుతాయో అర్థం కాక అయోమయంలో పడి పోవడం జరిగినది. దాంతో నాకు దీక్ష గురువు వచ్చిన తర్వాతనే ఆయన ఇచ్చిన అరటి పండు తిన్న 12 రోజుల తర్వాత ఈ లక్షణాలు నాలో కనపడుతున్నాయని తెలియగానే నాలో మరో మూల భయం పట్టుకుంది. ఆయన నాకు నమ్మకం కలిగించడానికి శక్తిపాత సిద్ధితో నన్ను తన వశం చేసుకుని కనికట్టు గాని చేతబడి గాని గాని చేయలేదు కదా! క్షుద్ర ప్రయోగం లేదా ఏదైనా గుప్తనిధుల కోసం నన్ను నర బలి చేయడానికి ఏమైనా చేసి వెళ్ళినాడా అని అనుకుంటూ ఉన్నాను. వీటన్నిటిని చర్చించడానికి నాతో నా వెంట యోగి మిత్రుడైన జిఙ్ఞాసి కూడా లేడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. ఈ దీక్షగురువు రూపురేఖలు మాత్రమే గుర్తున్నాయి!కాని వారి వివరాలు తెలియవు. నాకు ఇలా వచ్చి శక్తిపాతము చేసిన ఈ దీక్షగురువు గూర్చి తెలుసుకోవాలని మళ్ళీ బాబా చరిత్ర పారాయణం చెయ్యడము ఆరంభించినాను!

గమనిక:వీరిని భౌతికముగా నేను ఏనిమిదివ తరగతి(1992) చదువుతున్నడు చూడటము జరిగినది! అంతే విచిత్రముగా నెలలు తేడాతో మా భౌతిక గురువును చూడడము జరిగినది!ఇదింతా నా ప్రారంభ సాధన సమయములొ నాకు తెలియకుండా జరిగినది!వీళ్ళే నాకు గురువులు అవుతారని తెలియదు!ఇదింతా నా పూర్వజన్మ సుకృతము అనుకుంటా! ఆతర్వాత వీరిని( దీక్షగురువు) పైన చెప్పిన విధానములో వారి సూక్ష్మశరీయానముతో నాదగ్గరికి సూక్ష్మశరీరముతో వచ్చి నాకు శక్తిపాతము చేసినారని నా సాధన పరిసమాప్తి సమయములో వీరిని నా సూక్ష్మశరీరయాన సిద్ధితో తెలుసుకోవడము జరిగినది!సిద్ధగురువులకి సాధ్యము కానిది ఏముంటుంది!

నిజ దీక్షగురువు దర్శనం

తీవ్రముగా శిరిడీసాయి బాబా చరిత్ర పారాయణం చేస్తున్న సమయంలో… నాకు వచ్చిన దీక్షగురువు ఎవరో అని తీవ్రమైన మనోవేదన పడుతున్న సమయంలో… ఒక రోజు అర్ధరాత్రి నా కలలో సూక్ష్మ శరీరధారి వెలుగులతో శరీర కాంతితో దివ్య సిద్ధపురుషుడు అగుపించి “మేము… బాబా వారు సమాన సాధన స్థాయి వాళ్ళమే! ఆయన కనిపించకుండా ఆయన కోసం పరితపించే వారి కోసం తపన పడతారు. మేము కనిపిస్తూ మాకు అగుపించే వారి కోసం మేము తపన పడతాము. మీ గురువు కోసం పడే తపన వలన నా మనస్సు ద్రవించింది. మేము యోగులం. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. మమ్మల్ని వెతుకు! అనుగ్రహం పొందు” అని చెప్పి అంతర్ధానం అయినారు. ఆయన ఎవరో తెలియదు .ఇది కల లేదా భ్రాంతి అని అర్థం కాలేదు. ఒకటి మాత్రం నాకు అర్థం అయింది. వారు నాకు వచ్చిన దీక్షగురువులని! వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే వారు పెట్టిన గురు పరీక్ష పూర్తి అవుతుంది అని పోలికలు గుర్తుకు తెచ్చుకుంటూ జిజ్ఞాసికి ఫోన్ చేసి సిద్ధ పురుషుడు పోలికలు చెప్పేసరికి…. అతను “నువ్వు చెప్పేదాన్ని బట్టిచూస్తే శ్రీశైల క్షేత్రం లో ఉన్న హఠకేశ్వరం గుడి పరిసరాలలో “పూర్ణానంద” అనే యోగి మౌనముద్రలో ఉంటున్నారని…వారి పోలికలతో నువ్వు చెప్పిన పోలికలు సరి పోతున్నాయని” చెప్పడంతో నాలో నాకే తెలియని ఆనందం వేసింది.

📷పూర్ణానంద యోగి

కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్లి ఈ పూర్ణానంద యోగి గురించి ఆరా తీసినప్పుడు నేను ఎనిమిదవ తరగతిలో (1991-1992) ఉన్నప్పుడు మా ఆలయం ట్రస్టీ వాళ్లు ఒకసారి ఈయనను గుడికి కూడా తీసుకొని వచ్చినారని… కేవలం ఆయన ఎవరితో మాట్లాడకుండా… ఎవరు ఇచ్చినా వాటిని స్వీకరించకుండా… ఎవరి వైపు తీక్షణంగా చూడకుండా… తనలో తాను ఏదో తెలియని అనుభూతికి లోనవుతూ… మూడు గంటలపాటు అలాగే మౌనంగా ఉంటూ… గుడి లోపలికి వచ్చి శివలింగ మూర్తిని చూసి “ఓం నమశ్శివాయ” అని అని ముమ్మారు పెద్ద గా అని…

మా నాన్నగారి వైపు తిరిగి ఆయనకు ఐదు రూపాయల నోటు అలాగే కొంచెం మంత్రించిన బియ్యం ఇచ్చి “వీటిని దాచుకో! ధనానికి ,అన్నపూర్ణ కి లోటు ఉండదని… ఆ సమయంలో నీవు అక్కడికి వచ్చేసరికి నిన్ను మాత్రం కొన్ని క్షణాలు దీక్షగా తీక్షణంగా చూసి తన బొటనవ్రేలు నీ బొట్టు స్ధానములో తాకించి ఏదో చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయినారని చెప్పడంతో… నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది! నాకు ఊహ తెలియని వయసులో వచ్చి ఊహ తెలిసేసరికి కనిపించని స్థాయికి వెళ్లిన సిద్ధ పురుషుడు ఆయన… నాకు కలలో కనిపించిన వ్యక్తి అలాగే నాకు శక్తిపాతము చేసిన అవధూత ఒక్కరేనని… ఒకరే అయితే ఇంతకుముందు ముందే నన్ను చూసేవాడిని అని చెప్పేవారు కదా… అలా చెప్పలేదు అంటే ఆయన ఈయన కాదేమో అని సందేహం వచ్చేసరికి నాలో తెలియని వణుకు మొదలైంది. ఈయన ఆయన కాకపోతే నాకు వచ్చిన దీక్షగురువు ఎవరో అని చేసిన పూజలు, తపనలు దేనికి పనికిరాకుండా పోతాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఏమి చేయాలి అనుకుంటూ నాలో నేను తిట్టుకుంటూ ఆవేశపడుతూ, ఆవేదన పడుతూ కొన్ని రోజులు ఆందోళనతో గడిపాను.

ఇది ఇలా కాదని ఏమి జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంతో శ్రీశైలం చేరుకున్నాను. సున్నిపెంట వద్ద ఉన్న పూర్ణానంద యోగి ఆశ్రమానికి చేరుకున్నాను.లోపలికి వెళ్లాలంటే ఏదో తెలియని భయం. వణుకు. ఈయన ఆయన కాకపోతే ఊహించుకోలేని పరిస్థితి. మళ్లీ మనస్సులో ఆందోళన మొదలైంది. అయినా కూడా అసంపూర్తి మనస్సుతో ఆశ్రమంలోనికి అడుగు పెట్టాను. ఇంకేముంది! ఎదురుగా ధ్యానముద్రలో ఆయన సజీవ విగ్రహమూర్తి కనిపించినది. ఇది అలాగే నాకు కలలో కనిపించిన అలాగే నాకు శక్తిపాతము చేసిన అవధూత ఆయన ఒక్కటేనని… నిజమేనని వారు వీరే అన్నట్లుగా ఆయన సజీవ సమాధి కూడా కనిపించేసరికి ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి బ్రధ్ధలైనట్లు అనిపించింది. “వామ్మో! నేను నాకు వచ్చిన దీక్ష గురువును కలుసుకున్నానా?” నన్ను నేను నమ్మ లేని స్థితి! ఎవరు గిల్లినా కూడా స్పర్శ లేని స్థితి! మాటలకు అందని అద్వితీయ స్థితి! ఇలాంటి స్థితిలో ఉండగా అక్కడ ఉన్నవారు ఆ విగ్రహమూర్తి దగ్గరగా కూర్చోమని 2 అరటి పండ్లు ప్రసాదంగా ఇచ్చినారు. అలా మూడు గంటలపాటు గడచిపోయినది… అని నాకు మాత్రం మూడు క్షణాలుగా గడిచి పోయినట్టు అనిపించింది. నేను తీవ్రధ్యానములో ఉండగా అక్కడ ఉన్నవారు అక్కడినుండి వెళ్ళమని నన్ను చూస్తూ సంఙ్ఞ చేసేసరికి… వారి సజీవ విగ్రహమూర్తి పాదాలకు నమస్కారం చేయగానే ఏదో కరెంట్ షాక్ తగిలి కాకిలాగా కొన్ని క్షణాలు నా శరీరము నాకు తెలియకుండా, నాకు అర్థం కాకుండా, నా ప్రమేయం లేకుండా ప్రకంపించడం మొదలైనది. వణుకు రోగం మొదలైందని అనుమానం వచ్చినది. ఒకవేళ ఫిట్స్ వస్తే ఎలా అని సందేహం వచ్చింది. వెంటనే సజీవ విగ్రహమూర్తి వైపు చూడగానే నా కళ్ళకేసి కొన్ని క్షణాలపాటు చూసి “ఓం నమ:శ్శివాయ” అని చిరునవ్వు నవ్వి వెళ్ళమని అనుఙ్ఞ ఇచ్చి నట్లుగా లీలగా అనిపించినది! కాకపోతే ఆయన సజీవ విగ్రహమూర్తి వదిలిపెట్టి వెళ్లడం సుతారామము ఇష్టం లెదు.కానీ గురువాఙ్ఞ పాటించక తప్పదు కదా! ఆయన ఇచ్చిన శివపంచాక్షరీ మంత్రమును మననం చేస్తూ ఆ సమయంలో నేను దానిని గురుమంత్రం గా భావించి ఆయనతోపాటు మనస్సులో ముమ్మార్లు చదువుకున్నాను. ఇప్పుడు గాయత్రి మంత్రం తో పాటుగా శివపంచాక్షరీ కూడా చేరింది. ఇంటికి వెళ్లి యోగ గ్రంథాలు తిరగేయటం ఆరంభించాను. అది కరెంటు షాక్ కాదని మనలో కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని… సిద్ధ పురుషులు కళ్ళ ద్వారా,స్పర్శ ద్వారా, పాద సేవ ద్వారా శక్తిపాతము చేస్తారని… తద్వారా మనలోని కుండలినీ శక్తి జాగృతం అయ్యి… యోగ చక్రాలు జాగృతి అవుతాయని తెలుసుకొని… నాకు కలిగిన అనుభూతి వీటికి సంబంధించినది అవ్వడంతో నా గుండెల మీద ఉన్న బరువు దూదిపింజలుగా ఎగిరిపోయింది. దాంతో నేను ఆనందం అనుభూతి పొందుతూ ఉండగా …కాకపోతే ప్రస్తుతానికి నిజ దీక్షగురువు దర్శనము కలిగినది అలాగే వీరి అనుగ్రహము వలన నాకు శక్తిపాతసిద్ధి ద్వారా కుండలినీశక్తిని జాగృతిగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడము తప్ప ఏమి చెయ్యలేకపోయినాను! కాని ప్రస్తుతము ఈయన భౌతికముగా లేకపోయేసరికి మళ్ళీ నిజ శబ్ధ,అనుభవ పాండిత్యమున్న సజీవ భౌతికగురువు కోసము నా మనస్సు తపన ఆగలేదు! ఇంకా తర్వాత జరిగిన విచిత్ర దైవ అనుభవాలు తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఆలస్యం ఎందుకు? నాతో ముందుకి ప్రయాణించండి.

గమనిక:

ఈ పూర్ణానంద యోగి ఇచ్చిన మంత్రించిన బియ్యము, 5 రూపాయల నోటు ఇప్పటికి అనగా 27 సంవత్సరాలపాటు భద్రంగానే ఉన్నాయి! విచిత్రమేమిటంటే ఆయన మంత్రించి ఇచ్చిన బియ్యం ఇప్పటికీ దాదాపుగా 27 సం!!రాలు గావస్తున్న పాడవకుండా, విరిగిపోకుండా, ముక్కు వాసన రాకుండా, పురుగు పట్టకుండా అలాగే భద్రంగా ఉన్నాయి. సిద్ధ పురుషుల మహత్యాలు ఇలాగే యోగ తత్వమును కనబరుస్తాయి. అదే నకిలీ స్వాములు చేసే మహత్యాలు మ్యాజిక్ నేర్చుకుని వారు చేసే కనికట్టును ప్రదర్శిస్తాయి.

కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అంటే 2000 సంవత్సరంలో పరమపదించిన గురువుగారు(1939-2000 (61సం!!)) ఇంకా ఇప్పటికీ (2019) సజీవమూర్తిగా ఉన్నారా? అనే ధర్మ సందేహం నన్ను వెంటాడింది. దీనిని నివృత్తి చేసుకోవటం కోసం మరల శ్రీశైలం వెళ్ళినాను. స్వామివారి సజీవ సమాధి అలాగే వారి విగ్రహ మూర్తి ని దర్శనం చేసుకున్నాను. అక్కడ యధావిధిగా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. నా సందేహ నివృత్తి కోసం అక్కడే ఉండి ధ్యానం చేసుకున్నాను. బహుశా 48 నిమిషాల తర్వాత నా ధ్యానంలో ఆయన ప్రియ శిష్యుడు స్వామి ప్రణవానంద సూక్ష్మ శరీరం కనబడినది. కాషాయ వస్త్రధారి గా ఉన్నాడు. ఈయన నన్ను చూసి “మీరేనా! స్వామి పరిపూర్ణానంద కోసం వచ్చిన వారు” అనగానే నా చుట్టూ అడవి ప్రాంతం ఉన్నట్టుగా, నా వెంట రండి అంటూ చెట్ల తోపులో తీసుకొని వెళ్ళినారు. అక్కడ ఉన్న ఒక రాతి మీద కూర్చొని ఉన్న తెల్లని వస్త్రాలు ధరించిన స్వామి వారు కనిపించారు. వారికి నమస్కరించే లోపే వారు చాలా వేగంగా లేచి అక్కడే ఉన్న చిన్నపాటి కొలనులో మునిగి అదృశ్యం అయినారు.అంతటితో నా ధ్యాన అనుభవం పూర్తి అయినది. కానీ అది ఖచ్చితంగా శ్రీశైల పరిసర ప్రాంతం అని చెప్పవచ్చు. కాకపోతే అది భీముని కొలను లేదా భైరవ సేల ప్రాంతము లేదా ఏదైనా ప్రాంతం కావచ్చును. ఖచ్చితముగా అక్కడ ఒక కొలను, రాతి బండ మాత్రము ఉన్నట్లుగా, చుట్టుపక్కల అడవి ప్రాంతం పరిసరాలు కనిపించినాయి. అంటే ఇప్పటికీ వీరు సజీవమూర్తిగా,సూక్ష్మ శరీరధారిగా శ్రీశైల పరిసర ప్రాంతంలో సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారని నాకు దివ్య ధ్యాన అనుభవం ఇచ్చినందుకు స్వామి వారికి కృతజ్ఞతలు చెప్పుకొని వారి జీవ సమాధికి పాదనమస్కారం చేసి మౌనంగా అక్కడ నుండి మౌనముగా బయటకు వచ్చాను.

నిజానికి శక్తిపాతము అంటే నిజగురువు తను కష్టపడి సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానశక్తిని తను ఎంచుకున్న ఏకైక ఉత్తమ ప్రియశిష్యుడికి తన స్పర్శద్వారా... లేదా చూపుద్వారా... లేదా తమ బొటనవ్రేలు శిష్యుడి త్రినేత్రము వద్ద ఉంచి తనలో ఉన్న శక్తిని అంతటిని ఈ శిష్యుడిలోనికి పంపి తద్వారా ఇతనికి కుండలినీశక్తిని జాగృతి చేసే విధానమునే శక్తిపాతము అంటారు! ఇలాంటి నిజగురువు ఒక నిజశిష్యుడికి మాత్రమే శక్తిపాతము చేస్తారు!ఒకసారి గురువు ఈ శక్తిపాతము అంటూ చేస్తే...ఆతర్వాత వీరు జీవ సమాధి పొందడము లేదా నయంకాని తీవ్రమైన వ్యాధి పొందడము జరుగుతుంది. రామకృష్ణపరమహంస నుండి ఈ శక్తిపాతమును ఒక వివేకానందుడు మాత్రమే పొందినాడు.ఆ తర్వాత ఈయన నయంకాని గొంతు కేన్సరుతో జీవసమాధి చెందినారని లోకవిదితమే గదా! అలాగే మౌన:యోగి అయిన అరుణాచలవాసియైన భగవాన్ రమణమహర్షి వారుగూడ తన ప్రియశిష్యుడైన కావ్యకంఠ గణపతి మునికి ఈయన శక్తిపాతము చేసిన తర్వాత ఈయనగూడ నయంకాని రాజపుండుతో జీవసమాధి చెందినారని లోకవిదితమే గదా! అలాగే పురాణాల ప్రకారము చూస్తే...శ్రీరాముడికి-వశిష్టుడు అదే శ్రీకృష్ణుడికి - సాందీపముని ఈ విధముగానే శక్తిపాతము చేసినట్లుగా తెలుస్తోంది!అంటే ఈ లెక్కనచూస్తే నిజగురువు తన జీవితకాలములో ఒక నిజశిష్యుడికి మాత్రమే శక్తిపాతము చేయడం జరుగుతుందని తెలుస్తోంది గదా! ఇలాంటి నిజ భౌతిక దీక్షగురువును ఏవరైతే పొందుతారో వారికి మాత్రమే కుండలినీశక్తి జాగృతి అవుతుంది! ఈవిధంగా తన గురువైన రాఖాడిబాబా నుండి శ్రీ పూర్ణానంద శక్తిపాతమును పొందితే…. అలాగే మేముగూడ మాకు శ్రీపూర్ణానంద ద్వారా వచ్చిన ఆధ్యాత్మిక శక్తిని మా అంతిమ సాధన పరిసమాప్తి సమయములో…. మా నిజప్రియశిష్యుడైన జిజ్ఞాసికి శక్తిపాతసిద్ధి ద్వారా ధారాపాతము చేసినాము. తద్వారా మేముగూడ నయంకాని ఊపిరితిత్తులవ్యాధిని పొందడము జరిగినది.ఆపై ప్రస్తుతము మేము జీవసమాధి కోసము ఎదురుచూస్తున్నాము! అదే ఈ మధ్య నకిలిగురువులు తనకి లేని ఆధ్యాత్మిక శక్తికి శక్తిపాతసిద్ధి పేరుతో డబ్బులు గుంజుతూ ఎంతో మంది అమాయక శిష్యుల జీవితాలతో ఆడుకోవడము జరుగుతోంది!కాబట్టి ఇలాంటి నకిలగురువుల విషయములో జాగ్రత్తగా ఉండండి!

కపాల మోక్షం - 44 - సైన్సు విజ్ఞాని అనుభవం

(పాల లింగము - మంచు లింగము దర్శనము)

ఈ సైన్సు విజ్ఞాని ఎవరో గాదు! స్వయనా మా అన్నగారు ఘంటసాల శశిధర్ శర్మ! వీరికి ఆధ్యాత్మిక విషయాలయందు అలాగే విజ్ఞాన శాస్త్ర విషయాలయందు మంచి పట్టు సాధించిన కర్మయోగి అన్నమాట!కాని దేనినైన గూడ సైన్స్ కి ముడిపెట్టి అది ఉన్నదని నిరూపిస్తే నమ్ముతాడు! అలాగే దేవుడి విషయము సైన్స్ నమ్మదు కాబట్టి మనవాడు నమ్మడు!కాని తనవాళ్ళ కోసము పూజలు చేస్తాడు! మా విచిత్ర వేదాంతి లాగానే వీడు గూడ నాకు అపుడపుడు అర్ధముకాడు! కాని వీరి జీవితములో నా పూజల వలన వీరికి కలిగిన విచిత్ర శివ అనుభవము ఏమిటో మీరే స్వయంగా తెలుసుకొండి!

మా మట్టి మోక్ష శివలింగం

మా అమ్మకి వారసత్వంగా మట్టి మోక్ష శివలింగం వచ్చినది అని మీకు తెలుసు కదా అలాగే దానిని పూజించమని ఇచ్చినప్పుడు దాని విలువ తెలియక వెనక్కి తిరిగి ఇచ్చేశాను కదా. అదే నిజగురువు వెతుక్కునే సమయంలో అమ్మ నాకు ఈ లింగమూర్తి ఇచ్చి శివ రాత్రి పూజ చేసుకోమని చెప్పింది కదా. అప్పుడు దాని విలువ తెలియక వద్దు అన్నాను. విలువ తెలిశాక వదలి పెట్టలేక పోతున్నాను. అమ్మ ప్రేమగానే ఇష్టంగానే లింగమూర్తి నాకు ఇచ్చినది. మా అయ్య చేసిన పొరపాటు నేను చేయకూడదని అమ్మ చేత రెండవసారి ప్రయత్నంలో నేను అడగకుండానే అమ్మ నాకు వారసత్వంగా ఈ మట్టి లింగమూర్తి ఇచ్చినది. ఈ సారి ఈ మహత్తర అవకాశం వదులుకోలేదు. దాన్ని భద్రంగా ప్రాణ లింగం గా చూసుకోవడం చేశాను.చేస్తున్నాను .ఇప్పటికీ నా దగ్గరే ఉన్నది. నాకు మోక్షం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మోక్ష లింగం అయిన శివుడి మట్టి ఆత్మలింగం. కొన్ని వారాల తర్వాత ఆ సంవత్సరమునకు మహాశివరాత్రి రానే వచ్చింది. ఆరోజుతో 3 సం!!రాల నుంచి చేస్తున్న 5 లక్షల శివ పంచాక్షరీ మంత్రరాధన పూర్తి అవుతుంది! అంటే శివమంత్ర సిద్ధి నాకు కలిగినట్లుగా శివ దైవానుభవము కలగాలని అనుకుంటూ …. నాకు ఇంతలో చిలిపి ఆలోచన వచ్చింది. అమ్మ నాకు ఇచ్చిన మహత్తర లింగమూర్తికి ఇంకా ఇప్పటికీ సిద్ధులు ప్రదర్శించే మహత్యం ఉన్నదా అనే సందేహం వచ్చింది. దీనికి సమాధానం వెతకాలని ఈ లింగమూర్తిని పరీక్షించి శోధించాలని మహాశివరాత్రి నాడు ఆ సమయంలో ఈ మట్టి లింగమూర్తికి మా అన్న గారి ఇంటిలో అభిషేకం చేయడం జరిగినది. ఎందుకంటే మావాడి ఇంట్లో ఉండి చదువుకుంటూ, ఉద్యోగం చేస్తున్నాను. ఇంతలో అభిషేకం పూర్తి అయినది. అభిషేక పాలు ఒక గిన్నెలో వంపుతుండగా క్రింద కొన్ని పాలు పడినాయి అని నేను గమనించలేదు.

పాలు... ఒక మహా శివ లింగమూర్తి ఆకారంగా

(పాల లింగము)

యధావిధిగా లింగమూర్తి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పైకి లేచే సమయానికి నేల మీద పడిన పాలు ఒక మహా శివ లింగమూర్తి ఆకారంగా మారాయి.నాకు ఎంతో ఆశ్చర్యం తో కూడిన ఆనందం వేసింది. నోట మాట రాలేదు. వామ్మో! ఈ లింగమూర్తి కి ఇంకా మహత్తర శక్తులున్నాయి….. తగ్గి పోలేదని…. తగ్గిపోయాయని భ్రమపడినందుకు…. నా అజ్ఞానం క్షమించమని…. శివయ్యను వేడుకోవటం తప్ప ఏమి చేయలేకపోయాను. వెనువెంటనే ఫోటో తీశాను. అలాగే ఈయన మీద ఉంచిన బిల్వ పత్రాలలో ఒక బిల్వపత్రం నాగపడగ ఆకారంలో ఉండటం దానిని కూడా ఫోటో తీసి భద్రంగా దాచుకున్నాను.

వెంటనే మా అన్న గారికి ఈ పాల లింగమూర్తి చూపించడం జరిగింది. దానికి వాడు వెంటనే “భలేవాడివి రా చిన్నోడా! సైన్స్ ప్రకారం చూస్తే నేల మీద పడిన ద్రవపదార్థమేదైనా ఇలాంటి ఆకారాలుగా మారుతుంది. పాలే కాదు నీళ్లు పోసిన లేదా నూనె పోసిన లేదా నెయ్యి పోసిన ఇలాగే కనబడతాయి. నీకు బాగా లింగారాధన పిచ్చి ఎక్కువ అవటం వలన ప్రతిది కూడా లింగమూర్తి లాగా కనబడుతోంది. ఇలాంటి వాటిని నేను నమ్మను. వీటిని ఎవరికీ చూపించకు. ఎవరికీ చెప్పకు” అని చెప్పి వాడు తన గదిలోనికి వెళ్ళిపోయాడు. కానీ నాకు మాత్రం వీడి మాటలు రుచించలేదు .అలాగని కోపం రాలేదు.యద్ భావం తత్ భవతి. ఎవరి భావం తగ్గట్లుగా వారికి అలా కనిపిస్తుంది అని నాకు లీలగా సామెత గుర్తుకు వచ్చినది. ఏమోలే అనుకుని మహాశివరాత్రి నాడు దివ్యమైన ప్రత్యక్ష దైవం అనుభవం కలిగినందుకు సంతోషపడుతూ మిగిలిన కార్యక్రమాలు చేయడానికి నేను వెళ్లడం జరిగింది. వారం రోజుల తర్వాత నిద్ర పోని మాదిరిగా వాడిపోయిన మొహంతో మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి “చిన్నోడా! నేను పడుకునే మంచానికి దయ్యము పట్టినట్లుగా ఉంది! ఆరోజు నిన్ను అని వెళ్లిన తర్వాత ఒక విచిత్రమైన అనుభవం నాకు ఎదురైనది. నేను ప్రతిరోజూ పడుకునే మంచం మీద యధావిధిగా పడుకున్నప్పుడు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నిజం లాంటి కల వచ్చింది. 28 సంవత్సరాల వయసున్న ఒక నగ్న యువకుడు తన భుజాన శవమును వేసుకొని స్మశానానికి తీసుకుని వెళ్లి చితి పెడుతుండగా గదినిండా శవాల వాసనతో, జుట్టు కాలిపోతున్న వాసనలతో భయంకరమైన జంతువుల అరుపులు నాకు విపరీతమైన భయంకర బీభత్సం వాతావరణం ఒక కలగా కనిపించింది. ఇంతలో నాకు మెలుకువ వచ్చింది. ఆ తర్వాత నేను ఆ మంచం మీద పడుకోవటానికి భయపడుతుంటే మీ వదిన వచ్చి పడుకుంది. నాకు వచ్చిన కలలాగే మీ వదిన కూడా వచ్చినది. ఇలా వారం రోజులపాటు ఇదే కల మా ఇద్దరికీ వచ్చింది. దాంతో మా ఇద్దరికీ నిద్ర లేదు. నిద్రపోతే ఈ కల తప్ప ఇంకేమీ లేదు. ఇలా ఆ మంచం మీద ఎవరైతే పడుకుంటున్నారో వారికి నాకు వచ్చిన కల రావటం వాళ్లు భయపడటంతో గత వారం రోజులుగా మాకు జరుగుతున్న తంతు ఇదే. మాకు ఎవరికీ నిద్ర లేదు. ఈ సమస్యకు నువ్వే ఏమైనా మార్గం చూపించు. పుణ్యం కట్టుకో” అని నాతో అన్నాడు. వాడి బాధ చూసి బాబా సూక్తులు పుస్తకము తీసి ఒక నెంబర్ కోరుకోమని చెప్పగానే వాడికి వచ్చిన సమాధానం "నేను లేనని నేను ఒక పిచ్చి వాడిని అని నన్ను పూజించే భక్తులును నువ్వు మూర్ఖులు అని అనుకుంటున్నావు కదా” అని సమాధానం వచ్చింది. అప్పుడు దీనిని పాల లింగ దర్శనం రోజు జరిగిన సంఘటన సంభాషణలు నాకు వెనువెంటనే గుర్తుకు వచ్చినాయి. అపుడు నేను వెంటనే దీనికి పరిష్కారమార్గము ఏమిటి? అని ప్రశ్నించినపుడు ఒక నెంబర్ చెప్తే అప్పుడు దానికి బాబా పుస్తకం సమాధానంగా “ఈ విభూతిని నా పేరుతో మంత్రించి ఆ పిల్లవానికి ఇచ్చి అతని జీవితం కాపాడు” అని ఆజ్ఞ సమాధానంగా వచ్చింది. వెంటనే నేను విభూతిని మంత్రించి ప్రసాదంగా మంచం మీద చల్లమని చెప్పినాను.అప్పుడు వెంటనే అతను దీనితో నాకు కష్టాలు తీరినట్లేనా అని ప్రశ్నించాడు. నెంబరు చెప్పటం సమాధానం చూపించేసరికి దానిలో “ఆందోళన చెందవద్దు. భయము లేదు. నిన్ను ఈ దయగల ఫకీరు రక్షించును.ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉండు. ఆదుర్దాగా తిరగవద్దు” అని సందేశం సమాధానంగా వచ్చింది. వెంటనే అన్నయ్య తను పాలశివలింగము గూర్చి తప్పుగా అన్నందుకు శివుడిని క్షమించమని అనడముతో నేను నాకు బాబా ఇచ్చిన ఆజ్ఞమేర మంత్రించిన విభూతితో వాడి గదిలోనికి వెళ్ళి ఆ మంచము చుట్టు దీనిని చల్లి వచ్చినాను! కొన్ని గంటల్లో స్వస్థత పొంది ఆ రోజు రాత్రి యధావిధిగా అదే మంచం మీద ఎలాంటి భయాలు లేని కలలు రాని గాడనిద్రలోకి జారుకున్నాడని నాకు తరువాత తెలిసింది.అప్పటిదాకా నాకు మాత్రమే బాబా జవాబులు సరిగ్గా వస్తాయి అని అనుకునేవాడిని. కానీ అన్నయ్య కు వచ్చిన బాబా జవాబులు చూసి ఆశ్చర్య పోవడం నా వంతు అయ్యింది. ఆయన మీద విశ్వాసంతో శ్రద్ధతో భక్తితో అడిగితే సరైన పరిష్కారాలు సమాధానాలు వస్తాయని ఈ అన్నయ్య ప్రశ్నలు అనుభవంతో నాకు అర్థం అయ్యి మౌనం వహించాను.

కొన్ని రోజుల తర్వాత టీవీలో అమర్నాథ్ లో స్వయంభూగా ఏర్పడే మంచు లింగం అనగా అమర్ నాథ్ లింగం గూర్చి కార్యక్రమం వస్తోంది. మంచు తో ఎలా లింగంగా ఏర్పడుతుందో అర్థం కాలేదు. అదే కాక మంచు కరగకుండా సుమారు కొన్ని రోజులపాటు ఉండటంతో ఇందులో ఏదో తెలియని మర్మము ఉన్నదని దీనిని ఎవరో ఇలా ఏర్పాట్లు చేస్తున్నారేమోనని ఎలా అంటే శబరిమల లో కనిపించే జ్యోతిని ఏర్పాటు చేసి చూపించినట్లుగా కూడా తయారు చేసే ఏర్పాట్లు చేసి ఉండవచ్చునని అనుమానం వచ్చింది. దీనిమీద పరిశోధన గ్రంథాలుచదివితే ఈ గుహలో రెండు నీటి పైపులు ఉన్నాయని వీటి నుండి నీరు బయటకు వచ్చి మంచు లింగముగా ఏర్పడే విధంగా అలాగే మంచు కరిగిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. బాధ వేసింది. మానవ మూఢభక్తి తో ఎలా వ్యాపారం చేస్తారు? ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు.

మా ఇంటి లోని డీప్ ఫ్రిజ్లో మంచు గడ్డలు మంచు లింగాలుగా ఏర్పడటం

(మంచు లింగం )

కానీ విచిత్రంగా కొన్ని రోజుల తర్వాత మా ఇంటి లో ని డీప్ ఫ్రిజ్లో మంచు గడ్డలు మంచు లింగాలుగా ఏర్పడటం మొదలు పెట్టినాయి. అచ్చంగా అమర్ నాథ్ లింగం లాగానే ఈ మంచు లింగంలు ఉండేవి. వీటిని చూసి నాకు మా కుటుంబ సభ్యులకు ఎంతో ఆశ్చర్యం వేసేది. విచిత్రం ఏమిటంటే శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చేసే మాసములో అయ్యవారు ఇలా మంచుశివలింగాలుగా ఏర్పడేవి. మిగతా కాలాలలో ఎలాంటి లింగాకారాలు లేని మంచుగడ్డలు ఉండేవి.దానితో మంచు లింగాకారాలు ఏర్పడే సమయంలో నేను వీటిని కొన్ని ఫొటోస్ తీయటం జరిగినది. మీకోసం ఇక్కడ ప్రచురించడం జరిగింది.అలా పాల లింగము, మంచు లింగం ఉన్న ఫోటోలు చూడండి. తరించండి.

అప్పుడు కాని నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏమిటంటే ఎవరి ప్రమేయం లేకుండానే నా ఫ్రిజ్లో మంచు లింగము ఏర్పడితే అమర్నాథ్ గుహ లో ఏర్పడే అమర్ నాథ్ మంచు శివలింగం కూడా నిజమే కదా కాకపోతే ఈ మంచు లింగం ఆదిలో స్వయంభూగా ఆ ప్రాంతంలో ఏర్పడి ఉండాలి. ప్రస్తుతము భూ వాతావరణంలోని మార్పుల వలన అధిక వేడిని, అధిక ఉష్ణోగ్రత , అధిక కాలుష్యం వాతావరణ పరిస్థితుల వలన ఈ లింగం ఏర్పడక పోయి ఉండవచ్చు. కానీ ఈ లోకానికి ఈ సత్ సంప్రదాయం కొనసాగించడానికి ప్రభుత్వం వారు ఏర్పడే విధంగా ఏర్పాట్లు చేసి ఉండాలి. అలాగే శబరిమల క్షేత్రంలో కూడా ఆదిలో స్వయంభూగా జ్యోతి దర్శనం కలిగి ఉండాలి. ఎందుకంటే యోగంలో ఉన్న ప్రతి సాధకుడికి తన సహస్ర చక్ర స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా శివకేశవ శక్తి అయిన పరంజ్యోతి సాక్షాత్కార అనుభూతిని పొందడం జరుగుతుందని యోగ శాస్త్రాలు చెప్పడం జరిగింది కదా. మన సహస్రార చక్రంలో ఈ పరంజ్యోతి స్థానమే ఈ విశ్వంలోని శబరిమల క్షేత్రమై ఉండి ఉండాలి. అందువలన ఆదిలో ఈ క్షేత్రంలో స్వయంగా పరంజ్యోతి దర్శనం జరుగుతుండేది. కానీ ప్రస్తుతం కలి ప్రభావం వలన ఈ జ్యోతి స్వయంభూగా దర్శనం ఇచ్చిన నమ్మలేని పరిస్థితి, అనుమాన స్థితిలో ఉండటం జరిగినది. దానితో స్వయంభూ జ్యోతి దర్శనం, పరంజ్యోతి దర్శనాలు ఆగిపోయి ఉండాలి.దానితో దీనికి గుర్తుగా ఈ లోకానికి ఈ సత్ సంప్రదాయం కొనసాగించాలని ఉద్దేశంతో స్వయంగా ప్రభుత్వం వారు స్వయంభూ పరంజ్యోతి ఏర్పడిన ప్రాంతంలోనే మానవ ప్రయత్నం ఏర్పాట్లతో ఈ పరంజ్యోతి ప్రజ్వలనం చేసే ఏర్పాటు చేసి ఉండాలి. ఈ సంప్రదాయాలను కొనసాగిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేను ఏమీ చేయలేక పోయాను. నిజమే కదా. ఎలా మహాశివుడు పాలలింగముగా, మంచు లింగముగా ఉద్భవించి స్వయంగా నన్ను తరింప చేసినందుకుఆ సర్వేశ్వరుని కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి. మీరు కూడా ఈ ఫోటోల ద్వారా ఆ సర్వేశ్వరుడి స్వయంభూ దర్శనాలు భాగ్యం మీకు కల్పించినాడు కదా. నేను ఈ గ్రంథం రాయకపోతే అందులో వీటి గురించి చెప్పకపోతే వీటిని మీరు చూసే వాళ్ళు కాదు కదా. ఏమంటారు. నిజమే కదా. ఈ విధంగా శివమంత్రసిద్ధి వలన ఈయన చూపించిన నిజ భౌతిక సిద్ధగురువు గూర్చి తెలుసుకోవాలని ఉందా?

గమనిక:

మన వేదాలలో సర్వ విజ్ఞాన,బ్రహ్మజ్ఞాన,తత్త్వజ్ఞాన,ఆత్మజ్ఞాన...ఇలా అన్నింటిని సమకూర్చినది!వీటిలో లేనిది..క్రొత్తది అంటూ ఏమిలేదు! వేదాలు సంపూర్ణముగా తెలుసుకొంటే...మన సైన్స్ అవి ఏమి తెలుసుకున్నాయో ఆలోచించకుండా...అవి చెప్పేవి నిజాలు అవునా గాదా అనే దానిమీద వ్యర్ధపరిశోధనలు చేస్తూ వేదాలు తెలుసుకున్న దానిని క్రొత్తదానిగా పేరు పెట్టి తిరిగి అదే చెపుతోంది! వేదాల జ్ఞానము కొండంత అయితే మన విజ్ఞానము గోరంత అని తెలుసుకొండి! వాయువు లాంటిది మన వేదాలు అయితే అదే వాయువును చూడాలనే విశ్వప్రయత్నము చేసేది మన సైన్స్ అన్నమాట! ఇది ఎన్నడికి సాధ్యపడదని మన విజ్ఞానశాస్త్రవేత్తలు ఎపుడు తెలుసుకుంటారో వారికే తెలియాలి!

విచిత్ర వేదాంతి: నా భౌతిక సిద్ధగురువు

నాకు శివ మంత్ర సిద్ధి అయినదని ఇంతకుముందు అధ్యాయం లో చదివి ఉన్నారు కదా.ఇలా ఉండగా శివుడి ఆకారము లాంటి నీడ ఒకటి నాకు కల నందు కనిపించి “నాయనా!నా అనుగ్రహం వలన నీ భౌతిక గురువు నీ దగ్గరకి రేపు వస్తున్నారు.వారిని బాగా పరీక్షించి, పరీక్షలు పెట్టి, పరిశోధించి నీకు నచ్చితే వారిని నీ భౌతిక గురువుగా వారిని ఎంచుకో. కానీ ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత అని గ్రహించు” అని చెప్పి అంతర్ధానం అయినది! నాకు శివుడి ఆకారము లాంటి నీడ కల నందు కనిపించి చెప్పిన నిజభౌతిక గురువుగా వచ్చిన ఇతను ఎవరో కాదు! నాకు కొండ మీద దుర్గాంబ నిజ స్వరూప దర్శనం చేద్దామని ప్రయత్నించినది ఇతనే ! నేను శిరిడి పారిబోయినపుడు మా ఇంటికి తీసుకొని వ్యక్తి గూడ ఇతనే గావడము విశేషము! ఇతను నాకు ఒక జ్యోతిష్యవేత్త జాతకము చెప్పిన వ్యక్తి. పైగా చింతామణి దుర్గాదేవి చూపించటానికి ప్రయత్నించిన

వ్యక్తి! ఇతను స్వయంగా నాకు వరసకు అన్నయ్య అవుతాడు. అనగా మా అమ్మకు పిన్ని కొడుకు అన్న మాట! ఇతని పేరు సాయినాథ్.ఇతను నా కన్నా 12 సంవత్సరాలు పెద్ద అలానే సాధనలో అనుభవము అప్పటికే సిద్ధి పొంది ఉన్నాడు. మంత్ర, తంత్ర, యంత్ర ,వేదాలలో అనుభవ సాధనలో వివిధ రకాల అనుభూతులు పొందినాడని అతడి మాటలలో, చేష్టల ద్వారా నాకు తెలిసినది. ఎందుకంటే ఈ వ్యక్తి ముఖము ఎంతో బ్రహ్మ తేజస్సుతో సమ్మోహనం వర్చస్సుతో బ్రహ్మ తత్వ విచారణ సిద్ది తో మాటలలో తన్మయత్వ శక్తితో ఉన్నాడు. ఇతను బాల మంత్ర ఉపాసన సిద్ధి పొంది మంత్ర శాస్త్రమును ఔపాసన పట్టి వేద జ్ఞానం పొంది అతి విచిత్ర సచిత్ర పనులు చేస్తూ నా దృష్టిలో విచిత్ర వేదాంతిగా ఉండిపోయాడు. ఈ సంఘటనలు అన్నిగూడ 12 సం!!రాలు పాటు జరిగినాయి! అంటే నేను ఒక వ్యక్తిని నా భౌతిక గురువుగా ఎంచుకోవటానికి ఆయనని పరిశీలించటానికి,ఆయనికి పరీక్షలు పెట్టటానికి నాకు 12సం!!పట్టినది! ఆయన నాకు చూపించిన ఏనిమిది యదార్ధ సంఘటనాలను ఏమాత్రము మార్చకుండా వ్రాయడము జరిగినది!దయచేసి ఎవరూ గూడ తప్పుగా భావించుకోవద్దని నా మనవి!నిజగురువు పరీక్షలు ఎలా ఉంటాయో మీకు చెప్పాలనే ఉద్ధేశ్యముతో వాటిని మీ వీలుకోసము వాటన్నింటిని ఒకచోట చేర్చి వ్రాయడము జరిగినదని గ్రహించండి!

నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఇతను మా ఊరి జాతరకు వచ్చినాడు. అప్పుడే చూడటమే మొట్టమొదటిసారి అన్నమాట! అంటే ఒకరకముగా సాధన ఆరంభదశలోనే ఈయన ఒక ఆత్మబంధువుగా ప్రకృతి పరిచయము చేసినది! ఎంతో తేజస్సుతో ఉండేవాడు. ముఖములో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉండేది. అప్పటికే అతను మంత్రాలను నేర్చుకున్నాడు. ఏదో దేవాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. నాకు లాగానే దైవము యొక్క నిజ స్వరూపం చూడాలనే తపన కసి గా ఉండేది.తెల్లవారుజామున నిద్ర లేచి నది ఒడ్డున గొంతు వరకు మునిగి మంత్ర సాధన చేసే వాడని అలాగే పాము, తేలు మంత్ర సిద్ధి పొందినాడని, పోయిన వస్తువులను తెలుసుకునే వాడని, జ్యోతిష్య శాస్త్రము లో దిట్ట అని, వాక్సిద్ది ఉన్నవాడని, చెప్పినట్లుగా జరుగుతుందని అతని గూర్చి అందరూ చెప్పటం మొదలుపెట్టినారు. అసలే ఇలాంటి విషయాలు అంటే చెవి కోసుకునే నాకు ఈ వ్యక్తి ఏదైనా చేస్తే చూడాలని, ప్రత్యక్షముగా చూడాలని అనుభవాలు పొందాలని అని నాలో తపన మొదలైంది. అతనితో స్నేహం మొదలైంది. అతను చాలా తక్కువగా మాట్లాడుతాడు. మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదో తెలియని వేదాంత ధోరణి ఉంటుంది. రాత్రిపూట మా గుడిలోకి వెళ్లి కాగితాల మీద అమ్మవారి బొమ్మలు గీయటం నేను చూశాను. అచ్చు గుద్దినట్లు గా ఫోటో తీసినట్లుగా అమ్మవారిని గీయడం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. చిత్రలేఖనము అంటే ఇదే కదా ఫోటోలో సజీవ కళ తెప్పించడం అంటే ఇదే కాబోలు అని అనిపించేది.

సంఘటన:1 

ఆ తరువాత మా నాన్న స్నేహితుడు యొక్క మైక్ సెట్ పోయినది. అది కూడా మా జాతర జరిగే సమయంలో పోయినది పోలీసులకు చెప్పిన ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి ఎందుకో ఈ విషయము మా అయ్య దగ్గర ఇతను ప్రస్తావించే సరికి దానికి మా అయ్య వెంటనే అతనితో కంగారు పడకు మన సాయి గాడు ఉన్నాడు కదా వాడు అంజనం వేసి ప్రశ్న వేస్తే ఎవరు తీసుకున్నారో క్షణాలలో తెలిసిపోతుందని వెంటనే ఈ దొంగతనం విషయం గూర్చి మా సాయికి చెప్పటం వెంటనే అతను కొన్ని కాగితాలు తీసుకుని ఒంటరిగా ఒక గదిలో వెళ్లిపోవడం క్షణాలలో జరిగినది అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఇది అంతా గమనిస్తున్న నాకేమీ అర్థం కావడం లేదు? ఏమిటి? పోలీసుల వలన కాని పనిని ఏదో అంజనం ప్రశ్న వేసి, దొంగ ఎవరో కని పెట్టొచ్చా? ఇంకా ఎందుకు పోలీసులు, పోలీస్ స్టేషన్లు? నా బొంద మరీ వెర్రి జనాలను చేస్తున్నారు వాడు ఏదో మంత్రసిద్ధి పొందినాడు అని అనుకోగానే మరీ జనాలను ఇలా నమ్మించి ఇలా మోసం చేస్తాడని చేస్తున్నాడని పోలీసులకు దొరకని దొంగ ఇతను వేసే అంజన ప్రశ్నకు దొరుకుతాడా ఏమో ఎవరికి తెలుసు? ఏ పుట్టలో ఏ పాముందో? దొరకవచ్చు దొరకక పోవచ్చు దొరికితే మంత్ర శాస్త్రం గొప్పతనం లోకానికి తెలుస్తుంది. లేకపోతే ఎటూ పోయిన వస్తువు దొరకదు కొద్దిసేపు ఆగితే ఏదో ఒక విషయం తెలుస్తుంది కదా! ఆ విచిత్రం ఏమిటో తెలుస్తుంది కదా అనుకుంటుండగా మా సాయి తన గది నుండి బయటకు వచ్చి ఏదో కాగితం రాసిన విషయం వస్తువు పోయిన వ్యక్తికి ఇచ్చినాడు. అందులో దొంగ వ్యక్తి యొక్క రూపురేఖలు, పుట్టుమచ్చలు, మనస్తత్వం, అవలక్షణాలు, అప్పుడు వేసుకున్న బట్టల వివరాలు, అతను వేసుకున్న చెప్పుల రంగు, సైజు ఇలా పలు విషయాలు వ్రాయటం జరిగినది. ఇది చదివిన వెంటనే ఆ వ్యక్తి ఎవరో వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి క్షణాలలో ఊహించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి గట్టిగా దబాయించి విచారించి బెదిరించగా ఆ వ్యక్తి దొంగతనం చేసినాడని అని తెలిసినది. విచిత్రం ఏమిటంటే పోయిన వస్తువు మీకు దొరకదని కేవలం దొంగ మాత్రమే దొరుకుతాడని చేతితో వ్రాసిన విషయము కూడా నిజమైనది. అతను ఆ వస్తువును తక్కువ ధరకే ఎవరికో అప్పటికే అమ్మేసి ఆ డబ్బులు ఖర్చు చేసినాడని తెలిసేసరికి వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి తో పాటు నేను కూడా గతుక్కుమన్నాను. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ఇది నాకు చాలా చిన్న విషయమని ఆ సాయి కాస్త క్రికెట్ ఆటకు వెళ్లిపోతుంటే వాడిని చూస్తూ ఏమనాలో నాకు అర్థం కాలేదు వామ్మో మంత్ర శాస్త్రానికి అంత శక్తి ఉంటుందా పోయిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చా అయితే సాయిని పట్టుకొని ఎలాగైనా ఈ మంత్రమును నేర్చుకోవాలని ఆసక్తి దురద నాలో మొదలైంది. సాయి మీద స్నేహ భావం ఇంకా పెరగటం ఆరంభమైంది. ఇది ఎందుకంటే నాకు తెలియని ఎన్నో రహస్య విషయములు ఉన్నాయని ఆనాడే నేను గ్రహించాను.

సంఘటన:2 

ఇది ఇలా ఉంటే ఒకసారి మా స్నేహితునికి ఏదో తేలు కుట్టినది. దాని బాధ తట్టుకోలేక వాడు నానా అవస్థలు పడుతుంటే వాడి బాధ చూడలేక వైద్యుడి దగ్గరకు మందు కోసం నేను పరిగెత్తుకు వెళ్లాలని అనుకుంటే మా అయ్య ఎదురై “అక్కడ సాయి గాడు లేడా? ఉంటే వాడికి చూపించు! మంత్రము వేస్తాడు తగ్గిపోతుంది? ఎందుకు పరిగెత్తుతావు?”అని చెప్తుంటే ఏమిటి మంత్రాలకు రోగాలు కూడా తగ్గుతాయా బాధలు కూడా పోతాయా ఇదేదో విచిత్రంగా ఉందే ఇలాంటి అవకాశం మరల రాదని వెంటనే సాయి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లాను. వెళ్ళితే వాడు నవ్వుతూ కళ్ళు మూసుకుని వేద మంత్రాలు చదువుతూ తను తాగుతున్న సిగరెట్ బూడిద నా చేతిలో పెడుతూ “తేలు కుట్టిన చోట ఇది రాయి! వెంటనే బాధనుండి ఉపశమనం లభిస్తుంది” అని చెప్తుంటే ఏమిటి? సిగరెట్టు బూడిదకి తేలు బాధ తగ్గితే విష బాధ తగ్గితే నొప్పి బాధ తగ్గితే… నా స్వామిరంగా… ఇంతకన్నా విచిత్ర విషయం మరొకటి ఉంటుందా? తగ్గితే మంచిదే చూస్తే పోలా? తగ్గకపోతే వీడి మీద కూడా కేసు పెట్టవచ్చు కదా” అనుకుని మళ్లీ తేలుకుట్టిన స్నేహితుడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి గాయం అయిన చోట నేను తెచ్చిన బూడిద రాసిన కొన్ని క్షణాలకే బాధ నుండి విముక్తి అయ్యేసరికి నాకు నోట మాట రాలేదు. దానికి మా స్నేహితుడు వెంటనే “స్నేహితుడు అంటే నీవే రా! నా బాధ చూడలేక వైద్యుడు నుండి తెచ్చిన మందు రాసినావు వెంటనే తగ్గింది రా! పోతే పోనీ గాని భలే మందు ఇచ్చినాడు” అంటే అంటుంటే అసలు విషయం వీటికి తెలిస్తే వాడు స్పృహ తప్పి పడి పోతాడేమో అని భయమేసి మౌనంగా నవ్వి ఊరుకున్నాను.మా సాయి తన ఊరికి వెళ్లిన వారం రోజులకు విషయం గూర్చి మా స్నేహితుడికి చెప్పితే వాడు వారం పాటు జడుసుకుని మంచం దిగలేదు.

సంఘటన 3:

కొన్ని సంవత్సరాల వరకు నేను మా సాయి ని చూసే అవకాశం రాలేదు. అప్పటికే జ్యోతిష్యశాస్త్రంలో ఉద్దండ పండితుడుగా మారాడని ఎంతో మంది ప్రముఖులు ఇతని దగ్గరకు వస్తూ వారి జాతక సమస్యలకు పరిష్కారాలు చూపించు కుంటున్నారని తెలిసినది.ఏదో దేవాలయంలో పూజారి గానే ఉంటూ ప్రవృత్తిగా జ్యోతిషవేత్త గా ఉంటున్నారు అని తెలుసుకున్నాను. నేను నా చదువు హడావుడిలో నేను ఉండిపోయాను. నాకు తెలియకుండానే మూడు సంవత్సరములు గడిచిన తర్వాత సాయి పనిచేస్తున్న గుడి ఉన్న ప్రాంతానికి వేసవి శెలవులు వస్తే వెళ్లడం జరిగినది. 36 సంవత్సరాల వయస్సు కి వచ్చినాడు. ముఖంలో ఎలాంటి తేజస్సు గాని తగ్గలేదు వర్చస్సు ఇంకా పెరిగినట్లు అనిపించింది. నన్ను చూడగానే నవ్వుతూ ఏదో మొన్ననే చూసినట్లుగా పలకరించి తన విధుల్లోకి వెళ్లిపోయినాడు. నేనేమో నాకు శ్రీశైలం క్షేత్రంలో జరిగిన అనుభవాలు గూర్చి దైవ చింతన గూర్చి మాట్లాడాలని వచ్చినాను. ఏదో గుడి ఆవరణలో పెద్ద గొడవ జరుగుతూ ఉండేసరికి ఏమిటని బయటకు వస్తే అమ్మవారి ఆభరణాలు ఉన్న భోషాణం తాళం గుత్తి కనిపించడం లేదని తెలిసినది. దానిని గుడిలో అలాగే అందరి ఇళ్లల్లో వెతకడం ఆరంభించారు. ఎంత వెతికినా ఎక్కడ వెతికినా తాళాల గుత్తి కనిపించలేదు. తాళాలు లేకపోతే భోషాణం తెరవలేరు. దీనిని తెరవకపోతే అమ్మవారికి ఆభరణాలు అలంకరించలేము. విచిత్రమైన పరిస్థితి! విపత్కర పరిస్థితి ఏమి జరుగుతుందో చూడాలని నాకు తీయని దురద మొదలైంది! ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యం చేసే సాయి ఉండగా నాకైతే ఆందోళన లేదు గాని దీనికి సాయి ఏమి చేస్తారో చూడాలని విచిత్ర కుతూహలం మాత్రం ఉంది! వెంటనే మా వాడు అక్కడ ఉన్న ఆలయ అధికారి తో “నాకు కొంత సమయం ఇస్తే ఈ భోషాణం తాళాలు లేకుండా తెరవటానికి వీలవుతుందో లేదో చూస్తాను” అంటూ ఆ పెట్టెను ఒక గదిలోనికి చేర్చి తను ఒంటరిగా అందులో ఉండే తలుపులు వేసుకున్నాడు. ఏమి చేస్తాడని ఆసక్తితో దొంగచాటుగా కిటికీ గుండా చూస్తే మనవాడు ఆ భోషాణం ఎదురుగా కూర్చుని ధ్యానముద్రలో కళ్ళు మూసుకునే ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత గాలి లోనికి చేతులు లేపి ఏదో తనకు తాళము దొరికితే తీసినట్లుగా భోషాణంను ఖాళీ చేతులతో అలా చేసి బయటకు వచ్చాడు. అసలు లోపల ఏమి జరిగిందో నాకైతే అర్థం కాలేదు. వీడు అర్థం కాడు. వీడి భయంకర చేష్టలు అర్ధమవ్వవని అని అనుకున్నాను.గది ముందరికి వచ్చేసరికి నాకు నోట మాట రాలేదు. ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది. అర్థం కాకపోవడానికి ఏముంది. నా బొంద! తాళం లేకుండానే భోషాణం తెరుచుకున్నది! తన మంత్ర శక్తితో వేసిన తాళం తీసి నాడని నాకు అర్థమైనది. మీకు కూడా అర్థం అయి ఉంటుంది.

సంఘటన:4 

ఇది ఇలా ఉంటే ఆ వూరి జనాల మాటలను బట్టి చూస్తే వీడు అప్పటికే స్త్రీ వ్యసనపరుడు అయినాడని అక్కడున్న వేరే ఉపాలయాల పూజారి పెళ్ళాన్ని గోకుతున్నాడని తెలిసినది. నాకైతే నమ్మబుద్ధి కాలేదు. ఏదో ఆడవాళ్ళతో మాట్లాడినంత మాత్రాన అక్రమ సంబంధాలు జనాలు కట్టి పడేస్తున్నారని అనుకొని ఊరుకున్నాను. ఇదే విషయాన్ని వాడిని అడిగితే “అది నిజమే! అబద్ధం కాదు” అనగానే నా బుర్ర తిరిగినది. తప్పు చేయడమే కాకుండా తప్పు చేస్తున్నానన్న భావన కానీ బాధ గాని అతని ముఖంలో కనిపించలేదు. పైగా తన తప్పును నిజంగా ఒప్పుకుంటున్నాడు. అంత గులగా ఉంటే వివాహం చేసుకోవచ్చు గదా! పోయి పోయి పక్క వాడి పెళ్ళాం మీద ఆశ పడటం ఎందుకు? ఇది ఏదో తేడాగా ఉంది. మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే వీడే కామమాయలో ఉన్నాడు. వామ్మో! ఇక్కడ ఉండలేము.ఇక ఈ నగ్న సత్యాలు తట్టుకోలేను! వామ్మో! ఎలాగైనా నేను ఊరికి వెళ్లి పోవాలని అనుకున్నాను.వెంటనే సాయి “ఆగు! తొందర పడకు! రెండు రోజుల్లో ఇక్కడ సహస్ర కుంభాభిషేకం జరగబోతుంది.వర్షాలు పడక పోతుంటే శివలింగానికి ఈ సహస్ర అభిషేకం చేయాలని సంకల్పించాను. అనగానే అప్పటిదాకా ఇతని మీద ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా ఎప్పుడైతే పర స్త్రీ వ్యామోహంలో ఉన్నాడని తెలియగానే పూర్తిగా పోయినది. అయినా ఇంటికి వెళ్లి చేసేది ఏమీ లేదు. రెండురోజులు ఉండి ఈ పూజ చూస్తే పోలేదా? పైగా ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఎవరు ఎలా పోతే నాకెందుకు? ఎవరు ఎలా ఉంటే నాకేంటి? ఏదో ఇతని దగ్గర దైవ శక్తి ఉందని ఇన్నాళ్లు నమ్మాను. కానీ పరస్త్రీ వ్యామోహ చేష్టలతో నా మనస్సుకు విపరీతమైన బాధ వేసింది! ఏడ్చేశాను! కానీ సాధనలో వచ్చే కామ మాయ గురించి నాకు తెలియదు. దాని మీద నాకు అవగాహన లేదు.రెండో రోజు తెల్లవారుజామున మన సాయి ఎక్కడా కనిపించలేదు. తల్లి కంగారు పడుతుంది.తోటి అర్చకులు కంగారుపడుతున్నారు. వీరి హడావుడికి నాకు మెలుకువ వచ్చింది. సమయము చూస్తే మధ్యరాత్రి మూడు గంటలు అయింది. ఏమి జరిగినది అని అడిగితే సాయి కనిపించటం లేదని చెప్పారు.ఉదయం 7 గంటలకే సహస్ర కుంభాభిషేకం ఉన్నదని ఇప్పటికే మూడు గంటలు అయినదని వీడు ఉన్నట్టుండి ఎటు వెళ్ళాడు అనుకొని అందరూ తలా ఒక దిక్కు వెళుతుంటే నాకు ఎందుకు సందేహం వచ్చి అప్పుడు వారితో రాత్రి 11 గంటలకు అమ్మవారి ఆలయానికి వెళ్ళడం చూశానని, చేతిలో ఏదో నీళ్ల వంటి సీసాను కూడా తీసుకొని వెళ్ళినాడు రేపు పొద్దున పూజ గదా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాలని వెళ్ళాడో ఏమో అని అనుకున్నాను అనగానే వారంతా వెళ్లి గుడిలోకి శివ లింగ మూర్తి గుడి తలుపులు తెరిచి చూస్తే ఏముంది? మీరు ఊహించగలరా? ఊహించలేరు. అక్కడ మనవాడు నగ్నంగా శివలింగం మీద కాళ్ళు పెట్టుకుని పక్కనే పూజారి భార్య ఒడిలో నిద్రపోతూ, మైధున ప్రక్రియ భంగిమలో పూర్తిగా తాగిన మైకంలో కనిపించేసరికి ఈ దృశ్యం చూసిన వారంతా మీరు మాకు షరా మామూలే కదా అనుకున్నంత తేలిక వారి దగ్గరకు వెళుతుంటే నాకైతే నోట మాట రాలేదు. త్రాగుబోతుకి, తిరుగుబోతుకి మంత్ర విద్య లో బ్రహ్మ జ్ఞానమా! నా స్వామిరంగా? ఇలాంటి చేష్టలు చేసే వ్యక్తి ఇంకొకడు దొరుకుతాడా! వీడు నిజంగానే దత్తాత్రేయుడిని మించిన చేష్టలు చేస్తున్నాడు! వామ్మో! వీడిని నమ్మి ఇక్కడిదాకా వచ్చినాను.వీడి చేష్టలు చూస్తుంటే మతి పోతుంది.ఖచ్చితముగా పిచ్చాసుపత్రికి చేరటము ఖాయం అనుకుంటుండగానే భక్తులు నెమ్మది నెమ్మదిగా రావడం మొదలయ్యే సరికి ఆ గుడిని వీడి చేత ఖాళీ చేయించి ఇంటి లోనికి తీసుకొని వెళ్ళినారు.పూజ సమయం వస్తుంది. మన వాడికి రాత్రి తాగిన మత్తు ఇంకా దిగలేదు! జోగుతూనే ఉన్నాడు మగతగానే ఉన్నాడు. ఏమి చేయాలో ఎవరికీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా సరిగా 6:40 కల్లా ఎవరో పిలిచినట్టుగా అసలు ఏమి జరిగిందో తెలియనట్టుగా వేగంగా నిద్రలేచి స్నానం కూడా చెయ్యకుండా విభూది పెట్టుకొని మడి బట్టలు కట్టుకుని యధావిధిగా పూజ కోసం గుడిలోనికి వెళుతున్న వాడిని చూసేసరికి నాకు నోట మాట రాలేదు. శరీర శుద్ధి లేదు.మనస్సు శుద్ధి, ఆత్మ శుద్ధి లేదు. కనీసం ఆచార వ్యవహారాలు పాటించడం లేదు. వీడి లాంటి వాడిని నమ్మి “నా స్వామిరంగా! ఈ పూజ చేస్తున్నారు. ఇంకా వర్షాలు ఏమి కురుస్తాయి. ఇలాంటి వాడు చేస్తే వర్షాలు పడతాయి సరే!నా బొంద నా బూడిద! మనకెందుకు !ఈ పూజ తంతు అయ్యేసరికి మనము మన ఇంటిలో అనుకుంటూ ఇష్టం లేని పూజలు చూడాలని నేను శుచిగా, మడిగా, గుడిలోకి వెళ్లడం జరిగింది.పూజ మొదలైంది. మనవాడి మంత్ర స్మరణ బిగ్గరగా సాగుతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. వాడు మంత్రాలు చదువుతున్న విధానం వలన నాకు ఏదో తెలియని తన్మయత్వం నాలో మొదలైంది. నాకే కాదు అక్కడ ఉన్న వారందరికీ కూడా మొదలైందని నాకు అర్థం అయింది. వేగంగా మంత్రాలు, అభిషేకాలు జరుగుతున్నాయి.అక్కడ గుడి అంతా వేద మంత్రాల ఘోష తో వినబడుతుంది. ఎంతో శ్రద్ధగా అనురక్తి, ఆసక్తిగా ఏకాగ్రతతో నిశ్చల స్థితి తో పరిసరాలు కూడా మరిచిపోయి ఎంతో బిగ్గరగా మంత్రాలు చదువుతూ కుండలతో శివలింగ మూర్తి అభిషేకము చేస్తుంటే నిజంగా కైలాసంలో పరమ లింగానికి లేదా పరమేశ్వరునికి అభిషేకం చేస్తున్నారా అని అనిపించింది.

నాకు కొన్ని క్షణాలపాటు పరమానందయ్య శిష్యుల కథలు లోని అప్పటిదాకా హీరో తన నర్తకి తో రాసలీలలు చేసి శివలింగం కోసం వెతికి ఎక్కడ దొరకకపోతే ఆ నర్తకి వక్షస్థలము శివలింగంగా భావించి ఎంతో తన్మయత్వంతో పూలతో పూజ చేస్తుంటే ఆ పూజ కాస్త కైలాసంలో ఉన్న శివుడు పాదాలకి ఎలా చేరతాయో…. అలా మన వాడు చేస్తున్న పూజలు కూడా ఆయన పాదాలకి చేరుతున్నాయా అనిపించసాగింది. అప్పుడిక వాడు చేసిన వెకిలి చేష్టలు గుర్తుకు రాలేదు.శివుడు ముందున్న నంది లాగా కనబడుతున్నాడు. అప్పటిదాకా రతీమన్మధులుగా కనిపించిన వాడు కాస్త కామేశ్వరుడుగా కనిపించసాగారు. వామ్మో అసలు నాకు ఏమి జరుగుతుంది. అసహ్యం పెంచుకున్న వాడి మీద అనూహ్యమైన దైవభక్తి కలగటం ఏమిటి? అనుకుంటుండగా అభిషేకం పూర్తి అయి గది నిండా నీళ్ళు నిండిపోయాయి. అప్పటిదాకా కనిపించే శివ లింగమూర్తి కనిపించకుండా ఆ సహస్ర నీళ్ళల్లో మునిగి పోవడం జరిగినది. ఆఖరి మంత్రం చదువుతూ ఒక బిల్వ పత్రం ఆ లింగమూర్తి మీద పెట్టి పెట్టగానే గత 31/2సంవత్సరాలుగా రాని వర్ష మేఘాలు ఈయన మంత్ర పూజ దెబ్బకి వచ్చి వారం రోజులపాటు అవిశ్రాంతిగా వర్షాలు కురిశాయని మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

అసలు అక్కడ ఏమి జరిగినదో నాకైతే అర్థం కాలేదు. ఒక ప్రక్క చెడు ప్రవర్తన తో ఉంటూ మరొక ప్రక్క దైవాన్ని పంచభూతాలను ఎలా ఆధీనంలో ఉంచుకున్నారో నాకైతే అర్థం కాలేదు దీనిని గూర్చి వారిని అడిగితే “నువ్వు కూడా నాకు లాగే పరిపూర్ణ జ్ఞాని అయితే అన్ని రకాల మర్మ రహస్యాలు తెలుస్తాయి. నేను ఏ వికట వేషంలో ఉన్న నేను వెకిలి చేష్టలు చేసినను ఇందులో శరీరం ఉంటుంది గానీ నా మనస్సు ఉండదు.ఎట్టిపరిస్థితులలోనూ నా మనస్సు జారదు. నేను నిశ్చల స్థితిలో ఉంటాను. నన్ను అనుకరణ చేయకు. కేవలము అనుసరించు. ఏ జ్ఞానిని అనుకరణ చేయకు.అలాగే అజ్ఞానిని అనుసరించకూడదు. అది గ్రహించు! మంత్ర విద్యల జోలికి వెళ్లకు. మంత్ర దేవతలు ఉన్నారో లేరో తెలుసుకో! అసలు ఇంతకీ నువ్వు ఎవరో తెలుసుకో! దీనికోసము నీ మనస్సుని గట్టిగా పట్టుకో! అది ఎక్కడ ఉందో నీకు ఒక కథ ద్వారా చెపుతున్నాను విను!అంటూ…

ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. ప్రపంచాన్ని సృష్టించాను.

పసుపక్ష్యాదులను సృష్టించాను. అయినా తృప్తిగా లేదెందుకని?

ఓ చిన్న ఆలోచన చేసి తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు.

మనిషి అని నామకరణం చేశాడు. అన్ని తెలివితేటలను,

సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం,

ముందుచూపు, ఆత్మ విశ్వాసం నిండా నింపేశాడు. భూమి మీద

వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది.

ప్రాణాంతకుడు, డు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు

అయిపోతాడేమో..వీడి మనోబలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు. "నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద. "మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు.

ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.

"పోనీ ...నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.

"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు." "నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక. "మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు." అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.

"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం.." అంది.

"భేష్....మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు. అన్నింటినీ గెలుస్తాడు.

కానీ తన లోపలికి వెళ్లడు. తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం" అన్నాడు బ్రహ్మ. అప్పటి నుంచీ మనోబలం

మనిషి తనలోనే ఉంచుకుని..బయట వెతుకుతూనే ఉన్నాడు.

అనగా సాధన అంటే బయటచూడకు!బయట చదవకు!లోపలకి వెళ్ళు!లోపల మనస్సు పొరలకి వెళ్ళు!లోపల ఏముందో తెలుసుకో!లోపల ఉన్నవాడు ఎవరో తెలుసుకో!వాడే ఆత్మయని గ్రహించు!వాడే నీవని ఆత్మాభూతిని పొందు! నిజమైన జ్ఞానం స్వయంగా తెలిసికోవలసిందే !నాకు మొట్టమొదట చేసిన హితబోధ! అవును! నిజమే కదా! తను స్త్రీ వ్యామోహం లో ఉంటే ఇతను చేసిన పూజకు వర్షాల పడేవి కావు కదా! వర్షం పడింది! నాకున్న మాయ తొలగినది. అంటే సాధనకు మనస్సు శుద్దిగా ఉండాలి. మనస్సు నిశ్చలస్థితి అవ్వాలి. అప్పుడే తను కూడా జ్ఞాని అవ్వటం. అనగా అన్నం తినాలి… దేనికోసం అంటే ప్రాణాలు కోసం… ఇది ఎందుకు అంటే జ్ఞానం కోసం …ఇది ఎందుకు అంటే ఆనందం కోసం …ఇది ఎందుకు అంటే మనస్సు నిశ్చలస్థితి కోసం. ఇది ఎందుకు అంటే మోక్ష ప్రాప్తి కోసమని శాస్త్రాలు చెప్పటం నేను చదివాను. ప్రస్తుతం అలాగే మన వాడు తన మనస్సును నిశ్చల స్థితికి ఎప్పుడో చేర్చాడు అన్నమాట. పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయినారు. చేష్టలు లోకానికి వింతగానూ, విచిత్రంగా అసహ్యంగానూ ఉండవచ్చు కానీ మనస్సు స్థిరమైన వాడు పసిపాప మనస్సు ఉన్న వారితో సమానం అన్నమాట.ఇలాంటి వాడికి తనే పరమాత్మ అను జ్ఞానం కలుగుతుంది. అంటే మనవాడు అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండి ఉండాలి. వామ్మో వీడి చేష్టలకు ఇంకా ఎప్పుడు భయపడకూడదు. అసహ్యించుకోకూడదు అనుకుంటూ వాడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ నా జీవితానికి ఆధ్యాత్మిక స్థితి కలిగించటానికి ఒకడు ఉన్నాడని ఆనందపడి నేను మా ఊరికి పయనమయ్యాను.సాయి విషయం అదే పర స్త్రీ వ్యామోహం కథనాలు బంధువులకి ప్రచారం అయినాయి. దాంతో అందరూ వీడిని దూరంగా పెట్టడం ప్రారంభించారు. పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు వీడి చూపుకోసం ఎదురు చూసే వారంతా వీడి కంటికి కనిపించకుండా దూరంగా తిరగటం ప్రారంభించేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన మొదలైనది! మంచి పదిమందికి చేరే లోపల చెడు మాత్రం క్షణాలలో లక్షల మందికి చేరిపోతుంది. ఒక చెడు జరిగితే అంతవరకు చేసిన మంచి మొత్తం కూడా క్షణాలలో తుడుచుకుని పోతుంది కదా! ఇదే విషయం మన వాడికి కూడా జరిగినది. సన్మానాలు చేసిన వారంతా అవమానాలు చేస్తుంటే తట్టుకోలేక నా పరిస్థితి ఇలా ఉంటే మరి వాడి పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించి వాడు ఉన్న ఊరికి వెళితే… మనవాడు దిగాలుగా బాగా బాధ పడుతూ కూర్చుంటాడు అని అనుకుంటే వాడు కాస్త చదరంగం ఆడుతూ తాపీగా కనిపించాడు. ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోయేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది ఏమిటని వాడిని అడిగితే దానికి నవ్వుతూ “మానవమానాలు, సన్మానాలు అనేవి నాకు రెండుగా ఉండవు. పొగడ్త అయినా విమర్శ అయినా నా దృష్టిలో ఒక్కటే. ఆనాడు వీరంతా పొగడి దైవ పుత్రుడని అన్నప్పుడు వారంతా ఇప్పుడు కామ పుత్రుడిని అని అన్నప్పుడు నాకు ఏమీ భేదం కనిపించడం లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. నా ఆనంద స్థితి ఎలాంటి స్థితి మారలేదు కదా. విమర్శించేటప్పుడు పొగిడేటప్పుడు అదే స్థితిలో ఉన్నాను కదా! దీనిని సమదృష్టి అంటారు! సమ దర్శనం అంటారు! దీనిని సాధించు! అన్నింటా జయం పొందుతారు” అని పంపించి వేసినారు.

సంఘటన:5 

కొన్ని నెలల తరువాత అనుకోకుండా వీడిని మళ్లీ కలవడం జరిగినది. అప్పుడు నేను వెంటనే వారితో “అలా పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండటం నాకు ఇష్టం లేదు” అనగానే దానికి వాడు నవ్వుతూ “నేను ఎక్కడ ఉన్నాను రా?నువ్వే ఆ స్త్రీల గురించి ఆలోచిస్తున్నావు.నేను ఎప్పుడో ఆ స్త్రీలను ఆ క్షణాన్నే గుర్తుపెట్టుకుని వదిలి వేశాను. కానీ నీవు ఆ స్త్రీల ఆలోచనలలో తిరుగుతున్నావు .నేను ఏమి అవుతానో అని ఆలోచిస్తూ నువ్వు ఏమి అవుతావో మర్చి పోతున్నావ్” అని గుర్తించు! నేను ఏమీ కాను! నేను నా సహజస్థితిలో నిశ్చలస్థితి కోసం ఉన్నాను! నేను దేనికీ స్పందించని, ఆలోచించని స్థితిలో ఉన్నాను” అనగానే నాకు కొన్ని అర్థం అయ్యి కొన్ని అర్థం కాలేదు. వాటిని అర్థం చేసుకునే వయస్సు, మనస్సు రెండు కూడా నాకు ఆనాడు లేవు.అప్పుడు నేను వెంటనే గురువా? దేవుడు ఉన్నాడా అంటే వెంటనే అతను “లేడు! కేవలం దేవుడు ఉన్నాడని నమ్మకం మాత్రమే ఉంది. ఈ విశ్వాసమే ఈ విశ్వమును నడుపుతుంది. కావాలంటే చూపిస్తాను రా నా వెంట” అని నన్ను ఊరి చివర కి తీసుకుని వెళ్లి అక్కడే పడి ఉన్న మైలురాయిని తీసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానికి ముందర కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద నిలబడి ఏమి జరుగుతుందో చూడు అనగానే ఒక రైతు ఇది చూసి మిగిలిన వారికి చెప్పటానికి వెళుతూ ఉండటం నేను ఓరకంట గమనించటం జరిగినది. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఈ ప్రాంతానికి చేరుకునేసరికి మా పసుపు కుంకుమ మైలురాయికి పూజలు చేసే జనాలతో వందలలో కనిపించేసరికి నాకు నోట మాట రాలేదు. పైగా అక్కడ దీనికి ఒక కొత్త గుడి కట్టించాలని అనుకుంటున్నారని తెలిసేసరికి గతుక్కుమన్నాను.దీనికి బొడ్డు దేవర అని నామకరణం చేసి పూజలు చేస్తున్న పూజారిని చూసేసరికి అసలు అక్కడ ఏమి జరుగుతుందో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు. అప్పుడు వాడు వెంటనే “ఆ రాయి ఏమిటన్నది మన ఇద్దరికీ తెలుసు. మనము ఇప్పుడు చెప్పినా వీరు నమ్మరు. పైగా కోపపడతారు. మనకు అంత అవసరమా? వీళ్ళ నమ్మకమే వీళ్ళకి మైలురాయి కాస్త బొడ్డు రాయి గా కనిపించింది. అలాగే దైవ విషయంలో కూడా జరిగినది. లేనివాడిని ఉన్నవాడిగా ప్రచారం చేసినారు. కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని తెలుసుకున్నావు కదా! కనిపించే బొడ్డురాయి అసత్యమని కనిపించని మైలురాయి సత్యమని అలాగే పరమ శూన్యమే సత్యమని కనిపించే నామరూపాలు అసత్యమని ఏ నాటికి నువ్వు తెలుసుకుంటావో ఆనాడే నువ్వు నిజ బ్రహ్మజ్ఞాని అవుతావు” అని హితబోధ చేశాడు.

సంఘటన:6 

అప్పుడు నేను ఇన్ని తెలిసిన మీరు ఇలా పర స్త్రీల వెంట పడటం పాపం కదా దానికి వాడు చిరునవ్వుతో అవి “నా ప్రస్తుత ప్రారబ్ధ కర్మలు. వాటిని తీర్చుకుంటున్నాను. గత జన్మలలో వీరికి నేను బాకీ ఉన్నాను లేదా వారు నాకు బాకీ ఉన్నారు వాటిని తీర్చుకుంటున్న ఈ విషయాలు నీకు ఇప్పుడు అర్థం కావు. జ్ఞానంలో వయస్సుకు వచ్చిన తర్వాత అర్థం అవుతాయి. మా నాన్న ఇదే పరస్త్రీ ప్రారబ్ద కర్మ కోసం అమ్మను అలాగే తన ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి వెళ్లిపోయినాడు. వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు తండ్రి అయిన తరువాత కూడా మా నాన్న ఈ పరస్త్రీ వ్యామోహం లో పడి నడిరోడ్డు మీద మా కుటుంబమును వదిలిపెట్టి వెళ్లిపోయినాడు. లేత వయస్సులో నేను నా కుటుంబ బాధ్యతలు మోయవలసి వచ్చింది. పుస్తకాలు ఉంచవలసిన చేతిలో మంత్రాలు ఉంచినారు. పూజారి గా మారి నా కుటుంబ పోషణ చేసినాను. అయినను నాకు బాధ లేదు. ఎంత చేసినా నాకు నాన్న మీద కోపంగాని, కసిగాని, పగగాని, ద్వేషముగాని లేదు. ప్రారబ్ద కర్మ కు ఆయన బలి అయినారని గ్రహించాను. అందుకే అన్నిటియందు రాగద్వేషాలు వదిలేశాను. దేనికి స్పందించటం మానివేశాను. అలా నా వారికి ఈ పరిస్థితి రాకూడదని నాకున్న అన్ని కుటుంబ బాధ్యతలు తీర్చేసుకుని నా వివాహం అయ్యే సరికి అన్ని రకాల ప్రారబ్ద కర్మలు సంపూర్తి చేసుకొని కట్టుకున్న ఆలికి అన్యాయం చేయకూడదని కృతనిశ్చయంతో ఉన్నాను” అని చెబుతుంటే నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా మన వాడు కాస్త బ్యాట్ పట్టుకొని చిన్నపిల్లాడిలా గా క్రికెట్ ఆడటానికి బయలుదేరుతుంటే చిన్న పిల్లవాడో పెద్ద పిల్లవాడో అర్థం కాక కృష్ణుడో నికృష్టుడో అర్థం అవ్వక అలా చూస్తూ ఉండిపోయాను.

సంఘటన:7

సాయంత్రం వేళ ఒక సందేహము వారిని అడిగాను. అది ఏమిటంటే “ఈ విశ్వములో ఏమి ఉంది” అనగానే “ఏమీ లేదు! త్రాడు చూసి పాము ఉన్నదని భ్రమ పడుతున్నారు. కావాలంటే రాత్రికి జరిగే లలితా సహస్రనామ పూజలో జరిగే విచిత్రం గమనించు. నిజం తెలుస్తుంది అనగానే మళ్లీ మన గురుడు ఎలాంటి మాయ చూపుతాడో అనుకుంటూ సాయంత్రం దాకా ఎదురు చూశాను. మనవాడు శ్రీ చక్ర పూజ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన స్త్రీ మూర్తులు అంతా లలితా సహస్రనామాలు చదువుతున్నారు. వీడు ఏమి చేస్తాడో అని నా చూపు అంతా మనవాడి మీదనే పెట్టినాను. కొన్ని నిమిషాల వరకు ఏమీ జరగలేదు. ఇంతలో కరెంటు పోయింది. గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో మన వాడి నీడ గోడ మీద తన నీడ పడవలసిన చోట లలితా దేవి రూపం నీడలో కనిపిస్తుండే సరికి నాకు నోట మాట రాలేదు. అమ్మవారి విగ్రహం ఖచ్చితముగా కాదని అలాగని ఉత్సవ విగ్రహ మూర్తి నీడ కాదని తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ గోడ మీద సాయి నీడ కనిపించాలి. కానీ విచిత్రంగా లలితాదేవి నీడ కనపడుతుంటే ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదని ఎక్కడైనా ఏ మూలనైనా అమ్మవారి విగ్రహం ఉందేమో అని చుట్టూ పరికించి చూసి శోధించి వెతికిచూసినా అలాంటిది ఏమీ లేదని రూఢీ అయింది. అంటే సాయి మనిషి రూపం స్థానంలో లలితా దేవి రూపము నీడగా పడుతుందని నేను గ్రహించే లోపుగా ఇదేమీ తనకు సంబంధం లేనట్లుగా శ్రీ చక్ర అర్చన ఏకాగ్రమైన మనస్సుతో చేస్తున్నాడని గ్రహించాను.అంటే ఉదయం మన వాడు చెప్పిన సాయి మనిషి రూపం పాము అని, ఈ త్రాడు అనేది అమ్మవారని నాకు అర్థం అయింది. ఇలాంటి అనుభవాలు ప్రత్యక్షంగా చూస్తే మతి పోవటం ఖాయం! కానీ ఇలాంటి వాటిని ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మలేం గదా అనుకుంటుండగా కరెంటు రావడం… మనవాడు ఏమీ తెలియనట్లుగా యధావిధిగా అందరికీ ప్రసాదం పంచుతూ ఉండేసరికి వాడిని ఏమి అనాలో నాకు అర్థం అవ్వక సతమతమయ్యాను.

సంఘటన:8 

ఒకరోజు ఉన్నట్టుండి గుడిలో పంచవలసిన తీర్థము అయిపోయినది. వాడు ఈ విషయము గ్రహించి గుడి వెనక్కి వెళ్లి తన మూత్రము తీర్థ గిన్నెలో పోసి తీసుకొని రావటము నేను గమనించి ఆశ్చర్యం చెందలేదు. ఎందుకంటే పవిత్ర గోమూత్రం తాగి పవిత్రముగా పరిశుద్ధం అవుతుంటే నిజ బ్రహ్మజ్ఞాన అనుభూతి పొందిన అవధూత స్థితి ఉన్న మన సాయి మూత్రము కూడా గోమూత్రం సమానమని నాకు స్పురణ వచ్చేసరికి వాడు దానిని అందరికీ తీర్థముగా పంచటం కనిపించినది. వారికి తీర్థములో ఎలాంటి రుచి మార్పులు గమనించక పోయేసరికి నా మతి పోయింది! ఇలాంటి లీలలు చూస్తే కచ్చితంగా నా మానవ మెదడు దెబ్బతిని నాకు పిచ్చి ఎక్కడం ఖాయమని నాకు భయము వేసి వారికి నమస్కారం చేసి నేను నా ఇంటికి బయలుదేరాను. వారు చూపించిన విచిత్ర చేష్టలు వ్రాయటానికి ఈ గ్రంథం సరిపోదు. అందువలన వారు చేసే విచిత్ర చేష్టలు వలన వీరిని నేను మరింత ప్రేమగా విచిత్ర వేదాంతి అని నామకరణం చేసినాను. ఇక ఇంతటితో నాతొలిగురువుగా జీవసమాధి చెందిన శిరిడిసాయిబాబా వారు అలాగే జ్ఞానగురువుగా జీవసమాధి చెందిన శ్రీ భగవాన్ రమణమహర్షి వారు మరియు శ్రీ రామకృష్ణ పరమహంస ఉన్నారని అలాగే మంత్రగురువుగా మా నాన్నగారు అలాగే నా దీక్షగురువుగా జీవసమాధి చెందిన శ్రీశైల పూర్ణానందయోగి అలాగే నిజ భౌతిక సిద్ధగురువుగా మా సాయి అన్నయ్య ఉన్నారని తెలుసుకోండి!

నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాలు అన్నియు మా జిఙ్ఞాసికి చెప్పినాను. వాడు వెంటనే “నీవు శివ గాయత్రి మంత్రం చేసినప్పటి నుండి నీ యోగ సాధన స్థాయిలో మెరుగు పడుతున్నావు. దైవ అనుభవాలు పొందుతున్నావు. ఇప్పుడేమో సిద్ధ పురుషుడు తన అరచేతి లో సృష్టించిన మహత్తర యోగం పొందిన యోగ లింగం పొందినావు. అంతవరకు ఉన్నాడో లేడో తెలియని లింగమూర్తిని ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలుసుకున్నావు. నేను మాత్రం నా సాధన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ముందుకు వెళ్లటం లేదు అలాగని వెనక్కి వెళ్లడం లేదు. మాయలో పడటం లేదు. అనుభవాలు పొందడం లేదు. మీకు లాగా నాకు ఎప్పుడూ దైవ అనుభవాలు కలుగుతాయి చూద్దాం? అని అనుకుంటుండగా ….. మా వాడికి దీక్ష గురువు గురించి, దీక్ష గురువు వచ్చి చేసిన విషయాలు చెప్పడం… వాడికి ఏకకాలంలో విపరీతమైన కోపానికి గురై “భయ్యా! నీకు మంత్ర గురువు అలాగే దీక్ష గురువు వచ్చి వారి శక్తి మీకు ఇస్తున్నారు కానీ నాకోసం ఇంతవరకు మంత్ర గురువే రాలేదు. బాబాని అడిగితే నీ సొంత తెలివితేటలు మీద ఆధారపడటం వలన జరిగినదని బాబా పుస్తక జవాబు వచ్చింది. నాలో అంత తెలివితేటలు ఉన్నాయా? మీ భక్తిలోనూ నా భక్తిలోనూ అసలు ఏమి తేడా ఉన్నది. నువ్వు ఎలా ఏవిధంగా అర్చనలు, స్తోత్రాలు చదువుతున్నావో అదేవిధంగా నేను కూడా తూచా తప్పకుండా చేస్తున్నాను.మరి నాకెందుకు గురువులు రావటం లేదు? నీకు ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. నేను ఖచ్చితంగా నా భక్తిలో ఎలాంటి లోపం లేదు. ఎందుకంటే నీ భక్తి విధానాలే నేను పాటిస్తున్నాను. ఒక్కటే మన ఇష్టదైవాలు వేరు అంతే తేడా. కానీ నిజానికి వీరు కూడా ఒకటే కదా! ఆ మాటకు వస్తే నీకు వచ్చినట్లే నాకు కూడా గురువు రావాలి కదా! మరి నాకు ఎందుకు రావడం లేదు? లేదు భయ్యా! ఇలా కాదు నేను గురువుల కోసం స్వయంగా వేట మొదలు పెడతాను.నా గురువులు ఎక్కడ ఉన్నారో నేను స్వయంగా తెలుసుకుని వారి నుండి మంత్ర సాధన అలాగే దీక్ష శక్తి తీసుకొని ఆరు నెలలో వస్తాను. ఒకవేళ నాకు ఈ గురువులు కనపడకపోతే కాశీ క్షేత్రానికి వెళ్లి శరీర త్యాగం చేస్తాను. అక్కడ చనిపోతే పునర్జన్మ లేకుండా జీవన్ముక్తి కలుగుతుంది కదా! వస్తే గురువుల శక్తితో వస్తాను లేదంటే చస్తాను అనే విషయం మీకు తెలిసేటట్లు చేస్తాను. మరి “నేను- నువ్వు కూడా ఒకే సమయంలో వేరు వేరుగా గురు గ్రంధం పారాయణాలు ఎంతో శ్రద్ధ భక్తులతో చేశాము గదా! మరి నిన్ను సాయిబాబా అనుగ్రహించినట్లు… నన్ను దత్త స్వామి ఎందుకు అనుగ్రహించలేదు. నాకు ఎందుకు గురువుని ప్రసాదించలేదు. ఒకవేళ నాకు నిజగురుదర్శనము కాకపోతే…. ఆనాటి నుండి నా దృష్టిలో దేవుడు లేడు అలాగే గురువు లేడు. ఏమాయ బంధనం నా యోగ సాధనకు అడ్డు వస్తుందో నేను చూస్తాను. గురువు లేకుండానే యోగ సాధన ఆరంభిస్తాను! నువ్వు మోక్షం పొందుతావో … నేను పొందుతావో చూద్దాం అని ఆవేశపడుతూ ఏదో తెలియని కోపంతో నా దగ్గర నుండి వెళ్లిపోయినాడు! అతని కోపం నాకు అర్థమైనది. గురువు కోసం పడే తపన ఇద్దరు సమానమే గాని గురువును వెతుక్కునే మార్గాలు వేరు అయినాయి. నేను శిరిడి సాయిబాబాని పట్టుకుంటే అతడు దత్తస్వామిని పట్టుకున్నాడు.

ఈయనేమో పరీక్షల పెట్టే యోగ పరీక్ష దత్తుడు గదా! ఒక పట్టాన ఎవరికీ పట్టుబడడు! నానా చంకలు నాకించి నవ్వుతూ కనబడతాడు! సామాన్యుడు లాగా కనిపించే అసామాన్య వ్యక్తి… అందరి వాడిలాగా కనిపించే అందని వాడిని… అందుకోవటానికి మరికొంత కాలం జిఙ్ఞాసికి పడుతుందేమో అని నాకు అనిపించింది! మౌనంగా అతడు వెళ్లే వైపు చూస్తూ ఉండిపోయాను!” అని…. వీరావేశంలో శపథం చేసి నేను ఏమి చెప్పేది కూడా చెబుతున్నది వినిపించుకోకుండా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వాయువేగంతో గురువులను చూడాలనే కసితో ఇంటి వైపు వెళ్లిపోతున్నారని చూస్తూ కళ్ళు అప్పగించి చూడడమే తప్ప ఏమీ చేయలేక పోయాను.ఎందుకంటే వాడు కూడా మోక్షగామి. మోక్ష ప్రాప్తి పొందాలని తీవ్రంగా తపిస్తున్న కారణజన్మ యోగి. కానీ గురువుల దర్శనం లేకపోవటం వారి యోగసాధన ఆగిపోతుంది ఏమో అని… అనేక జన్మలు ఎత్తుతూనే ఉండాలనే వారి ఆవేదన తెలియజేస్తోంది. ఇక్కడ నాకేమో సాధన స్థాయి పెరుగుతుంటే వాడికేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు గా ఉన్నది. ముందుకు వెళ్లటం లేదు అలాగని వెనక్కి వెళ్లడం లేదు.మాయలో పడటం లేదు. అసలు మాయ పరీక్షలు జరిగితే గాని మన సాధన స్థాయి పెరుగుతుందో లేదో తగ్గుతుందో తెలిసేది. వాడు మహా మొండి. పట్టుపట్టాడు అంటే అది పూర్తయ్యే దాకా వదిలిపెట్టడు. దాని అంతు చూసేవరకు వాడికి ఆకలి, నిద్ర, భయం, అన్నపానీయాలు పట్టించుకోడు. అనుకున్నది జరగకపోతే ఎంత దాకా అయినా వెళ్లిపోతాడు. వెనకా ముందు ఆలోచించడు. అప్పు అన్న, అప్పులు ఇవ్వాలన్న తీసుకోవాలన్న వాడికి తట్టుకోలేని మనస్తత్వం. అలాంటి వాడు ఇలా ఉగ్రంగా మారిపోయి తీవ్ర భీష్మ ప్రతిజ్ఞ చేసే స్థాయికి వచ్చాడు అంటే ప్రకృతి ఏదో విషయం వీడిద్వారా లోకానికి తెలియజేయాలని అనుకుంటోందని అది మనకు తెలిసే దాకా వీడు మనకు కనిపించడు అని అవగతమై భారమైన హృదయంతోచెప్పి ఆవేదనతో ఇంటికి వెళ్లిపోయాడు. వాడు చెప్పినది నిజమే కదా. నాకు గురు మంత్రం అనుగ్రహం వలన దైవ అనుభవాలు కలగటం ఆరంభమైనది. పాపం వీడికి ఇంకా గురు మంత్రం కలగడం లేదు. దైవ అనుభవాలు ఎందుకు కలగడం లేదు. నేను నా సాధనలో ముందుకు వెళుతున్నాను. వాడు సాధనలో ఆగిపోతున్నాడో అర్థంకాని అయోమయ స్థితి.మా సమస్యకు ఎవరు సమాధానం ఇచ్చే వారు లేరు. వాడికి ప్రత్యక్ష భౌతిక గురువు అనే వారు లేరు. కేవలం నా గురువులు ఇప్పటిదాకా నాకు తారసపడినారు.పాపం జిఙ్ఞాసికి అది కూడా ఇంతవరకు కలగలేదు. ఏమి చేద్దాం? ఏమి చేయాలో? ఎలా చేయాలో? రాబోవు కాలమే నిర్ణయించాలి. నిర్ణయించటానికి అనుకోవటానికి నేను ఎవరిని అనుకుంటూ గుడి లోపలికి వెళ్లి పోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకి జిఙ్ఞాసి తన గురువుల కోసం ఉన్న ఉద్యోగం, ఉన్న ఊరును, ఉన్న వారిని అందరిని వదిలేసి ఎవరితో చెప్పా పెట్టకుండా పారిపోయినాడు అని తెలిసి…. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియక… ఏమి చేయాలో… ఏమి అనాలో…. అర్థం కాక…. వాడు తిరిగి వచ్చేటట్లుగా నా ఇష్ట దైవాన్ని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేక పోయాను. గాకపోతే వీడు వెళ్ళుతూ నా జీవితమును మలుపు తిప్పే సంఘటనలో ఏమి చేసి వెళ్ళినాడో తెలుసుకోవాలని ఉందా... ఇంక ఆలస్యమెందుకు! నాతోపాటు గా ముందుకు పదండి.

గమనిక:

మీరు ఈ అధ్యయములో ఒక విషయము గమనించారా? మా గురుదేవుడు నాకు ఎనిమిది(😎 రకాల విచిత్ర సంఘటనలు చూపించడము జరిగినది! ఈ ఎనిమిది ప్రతి ఒక శిష్యుడిలో ఉండే అష్టపాశాలకి సంకేతము! అవి ఏమిటంటే...1.సంశయం 2.అసహ్యం 3.భయం 4.బలం 5. శీలం 6. మోహం 7. దయ 8. అజ్ఞానం. ఇవి ప్రతి నిజ గురువు అయితే వీటిని నాశనము చేస్తాడు! అలాగే నిజగురువు అయితే తన శిష్యుడికి పరమానంద ప్రశాంత స్ధితిని కల్గిస్తాడు! ఎనిమిది పాశాలు అనగా ఇందులో దయ అనేది రాగ లక్షణము అయితే అసహ్యం ద్వేష లక్షణము అలాగే నా వంశమే నాకు బలము...నేను శీలవంతుడిని...ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక పోవడమే సంశయము…. నాకు అన్నియు తెలుసన్న అజ్ఞానం, మనస్సులో ఉండే వివిధ రకాల భయాలను, అన్నింటి మీద మమకారాలు పెంచుకోవడమే మోహం అవుతుంది! వీటిని ఈయన నా విషయములో ఎలా నాశనము చేసినారో మీకు వివరంగా చెప్పటానికి అనగా సంఘటన:1- సంశయం, సంఘటన:2- భయం, సంఘటన:3- బలం, సంఘటన:4- మోహం, సంఘటన:5- అజ్ఞానం, సంఘటన:6- శీలం, సంఘటన:7- దయ, సంఘటన:8- అసహ్యం! అనగా నాలో ఉన్న అష్టపాశములను ఈయన ఈ ఎనిమిది విచిత్రసంఘటనలు ద్వారా నాలో నాశనము చేసినారు! ఆతర్వాత మా విచిత్రవేదాంతి నాకు ఏవిధంగా పరమానందమును కల్గించినారో తెలుసుకోండి!

కొన్ని సంవత్సరముల తరువాత ఈ నాకు ఈయన భౌతిక దీక్ష గురువుగా మరి నా ఆధ్యాత్మిక జీవితానికి పునాది వేసినారు. జ్ఞాన జ్యోతి నాలో వెలిగించారు.తన మాటలతో, తన చేష్టలతో, నా ఆధ్యాత్మిక స్థితిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వచ్చినారు. తనకి లాగా మంది గురించి ఆలోచించకుండా మది గూర్చి ఆలోచించటం అలవాటుగా చేసినారు. నా స్వాధిష్టాన చక్రంలో మహాలక్ష్మి ధన మాయ వలన నేను ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నేను తీసుకున్న ఇంటికి EMI కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, నేను చదువుకున్న కంప్యూటర్ చదువులు నాకు అవసరానికి ఉపయోగం పడనప్పుడు వారిని సంపూర్తిగా అఖండ విశ్వాస భక్తితో నమ్మేసరికి…. నాకు జీవిత మార్గదర్శి అయ్యి…. కేవలం నిమిషాలలో జ్యోతిష్య శాస్త్ర మెళుకువలను నేర్పించి అనగా వాడికి ఉన్న జ్యోతిష్య జ్ఞానం నాకు శక్తిపాత సిద్ధితో ప్రసాదించి నన్ను జ్యోతిష్యవేత్తగా మార్చి నా ఆర్థిక స్థితిని, నా విషయ స్థితిని, నా ఆధ్యాత్మిక జీవిత స్థితిని సమూలంగా మార్చివేసి వెనుతిరగని స్థితికి చేర్చినాడు.

తను చేసిన అన్ని రకాల హోమాలు చేయించుకున్న వారి కుల దైవాలను, వారి ఇష్టదైవాలను వారికి హోమ దేవతలుగా హోమాలలో చూపించి వారికి జాతక సమస్యలు నివారించడంలో నాకు ఎనలేని సహాయ సహకారాలు అందించినారు. నాకు ఈ విధంగా పరమానందమును కల్గించినారు.

వీరు నా జీవితంలో లేకపోతే నాకంటూ ఆధ్యాత్మిక జీవితం ఉండేది కాదు. ఇలా మీ ముందు జ్ఞాన బిక్షువుగా ఉండే వాడిని కాదు. రోడ్డుమీద బిక్షం ఎత్తుకునే వాడిని. నిజ జ్ఞానం పొందిన వారు అవధూత స్థితిలో, పరమహంస స్థితి లేదా సిద్ధ యోగి స్థితి పొందిన వారు తమ మాయ చేష్టలు ఇలాగే ఉంటాయని దత్తాత్రేయ జీవిత గాథ తెలుపుతుంది. అలాగే దశ దత్త గురువుల జీవిత చరిత్రలను చదివిన తర్వాత కూడా నాకు తెలిసినది. దేనికి స్పందించకుండా, దేని గురించి ఆలోచించకుండా, దేనికి సంకల్పించుకుని ఉండకుండా తన మనస్సు నిశ్చల స్థితి పొందటానికి ఇలాంటి వారు తన చుట్టూ ఉండే ప్రసాద భక్తులను దూరం చేసుకోటానికి అలాగే నిజ భక్తులను అక్కున చేర్చుకోవడానికి ఇలాంటి చేష్టలు చేయాల్సి వస్తుందని నేను ఇలా చేసే స్థాయికి వచ్చినప్పుడు ఇంతకంటే భయంకరమైన చేష్టలు నేను కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఆనాడు వాడి చేష్టలు చూసి నేను ఎలా భీతి చెందినానో ఈనాడు నేను చేసే చేష్టలకు అలాగే నా చుట్టూ ఉన్న ప్రసాద భక్తులు భయపడుతుంటే నాకు నవ్వు ఆగలేదు. ఆగటంలేదు. వినోద క్రీడ లాగా అనిపించసాగింది. ఇంతకీ సాయి ఎవరో తెలుసా? "గీతా ప్రపంచం" అనే మహత్తర గ్రంథము రచించిన బుద్దు కుటుంబరావు గారి కూతురి బిడ్డ అన్నమాట. నేను కూడా వీరి వంశములోని వాడినే కావటం వలన నాలో కూడా ఆధ్యాత్మిక బీజాలు పడినాయి. వాటిని మొక్కలుగా మార్చినవాడు మన వాడైనా సాయినాథ్ అన్నమాట. విచిత్రమేమిటంటే నా తొలి గురువు షిరిడి సాయినాథ్ అయితే నా మలి గురువు మా అన్నయ్య అయిన సాయినాథ్ అన్నమాట! వీరు కొన్నాళ్ళకి వివాహం చేసుకొని సంతానం కనటం తేలికే కానీ వారిని సాకటం చాలా కష్టమని ముందే తెలుసుకుని ఉండటంతో సంతానము వద్దని ఏకపత్ని ధర్మంతో మనస్సుకు నచ్చిన విధంగా ఉంటూ… రాత్రి సినిమాలకు వెళుతూ, పది నిమిషాలకు ఒక సిగరెట్టు కాలుస్తూ… సర్వ సుఖ భోగాలు అనుభవిస్తూ, రాత్రిళ్లు గుప్తంగా యోగ సాధనలు చేసుకుంటూ… తన విచిత్ర చేష్టలకు స్వస్తి పలికి అందరినీ దూరంగా ఉంచుతూ…. ఏకాంతంగా మంది గురించి ఆలోచించకుండా…. మదిలో అద్వైత సిద్ధి సాధన కోసం అహర్నిశలు మానసికంగా కష్టపడుతూ… తన నిజ యోగ సాధకులకు తన సహాయ సహకారాలు అందిస్తూ… భోగులకు మహామాయ స్వరూపంగా కనిపిస్తూ… యోగులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానిగా కనిపిస్తూ… భోగంలో తల్లి మాయ దాటలేక… యోగములో పరమ శివుడి యోగమాయ దాటలేక…. ధ్యాన బ్రహ్మగా సాధన చేస్తూ… శాశ్వత మరణం కోసం నీలి ఆకాశం వంక చూస్తూ విచిత్ర వేదాంతిగా కొనసాగుతున్నారు! ఈ విధంగా ఏ మహాత్ముడు తన శిష్యునికి యొక్క అష్టపాశములను కరుణ అనే ఖడ్గముచేత ఛేధించి నాశనము చేసి మనకి శాశ్వత బ్రహ్మానందమును కలుగుచేస్తారో వారే మనకి నిజ భౌతిక సిద్ధగురువని ఆదిగురువైన మేధాదక్షిణమూర్తి తన గురుగీత ద్వారా లోకానికి చెప్పడముతో ఆనాటి నుండి వీరిని నా భౌతిక సిద్ధగురువుగా ఎంచుకోవడము జరిగినది!

కపాల మోక్షం - 45- మలి ప్రేమ- వివాహము

మేము యోగ సాధన చేస్తున్నప్పుడు మాలో కుండలిని జాగృతి అనుభవ అనుభూతులు కలగటం ప్రారంభమయ్యాయి. అలాగే మాలో విపరీతమైన స్త్రీ కామ వాంఛ మొదలైంది. ఒకేసారి వెయ్యి వయాగ్రా బిళ్ళలు వేసుకుంటే ఎంతటి కామ శక్తి కలుగుతుందో అంతటి శక్తి మాలోఉద్రేకం అవ్వటం మొదలైంది అని అర్థమైంది. తట్టుకోలేని పరిస్థితి కి చేరుకున్నాను. ఒకేసారి వంద మంది స్త్రీలు కూడా వచ్చిన ఏ మాత్రం జంకకుండా సుఖ ప్రాప్తి కలిగేటట్లుగా చేస్తామని అనిపించసాగింది. ఎవర్ని చూసినా దేనిని చూసినా కామ దృష్టి తప్ప మరొకటి కనిపించని స్థితి. 12 సంవత్సరాల వయస్సు నుండి 120 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు కూడా నాకు అందంగా, కామముగా కనిపించడం ఆరంభమైనది. ఇలాగాకుండా ఇష్ట దేవతా స్వరూపాలు, వివిధ దేవతా విగ్రహ మూర్తులు కూడా అమ్మ కి బదులుగా అమ్మాయి గా కనపడటం మొదలైంది. దానితో ప్రణవ మంత్రము కాస్త ప్రణయం మంత్రముగా మారింది. ఏమి చేయాలో తెలియని స్థితి. ఏమి చేసుకోవాలో తెలియని పరిస్థితి. తలను దేనికి కొట్టుకోవాలో అర్థంకాని స్థితి.ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఉండగా బాబా వారిని అడగగా అనగా సమాధానాలు చెప్పే బాబా పుస్తకం తీసి అడగగా ఆయన దానికి “మీకు త్వరలో గౌరీతో వివాహం నిశ్చయమైనది” అని సమాధానం చెప్పగానే నేను గతుక్కుమన్నాను. ఒక ప్రక్క యోగసాధనలో దింపుతూ మరో ప్రక్క సంసార బాధ్యతలు అనగా గృహస్థ జీవితం లోకి వెళ్ళమని చెబుతున్నాడు. “వామ్మో! దీనెమ్మ జీవితం. ఖచ్చితంగా నా యోగసాధన చంక నాకినట్టే.ఎందుకంటే గృహస్థ జీవితంలోకి వెళ్తే పిల్లలు వారి చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్లు సంతానం వారితో తిట్లు చివాట్లు పడటం అవసరమా! ఇంకా మన జీవితం మన చేతుల్లో ఉండదు. వారి కోసం మన జీవితం మన జీతం అన్నట్లుగా తయారవుతుంది. ఇక్కడ నాకే దిక్కులేదు మరి వచ్చే మహాతల్లికి ఏమి పెట్టాలి.నా బొంద నా బూడిద” అనుకుంటూ నా యోగ సాధన కొనసాగిస్తూ ప్రతి గురువారం వచ్చే జాతక సమస్య ఉన్నవాళ్లకి పరిష్కార మార్గాలు చెబుతూ కాలం గడుపుతున్నాను.

ఇలాంటి సమయంలో మా బంధువుల ద్వారా నాకు అంత వరకు వరుస అయ్యే అమ్మాయి వస్తుందని తెలిసి గతుక్కుమన్నాను. కాకపోతే అంత వరకు చాలా మంది పెళ్లికాని అమ్మాయిలు,బంధువుల అమ్మాయిలు వచ్చారు కానీ ఈమె వివరాలు తెలుసుకున్న దగ్గర నుంచి నాలో తెలియని ఆందోళన మొదలైంది. అంటే వచ్చే ఈమెకు మాత్రమే నాకు శ్రీమతి అయ్యే యోగం ఉన్న స్త్రీ అని అర్థమైంది. పైగా ఈమె కూడా బాబా భక్తురాలు అవటం విశేషం. దానితో మా బంధువుల ద్వారా ఈమెను రావద్దని చెప్పినా కూడా వాళ్లు ఈ విషయం ఈమెతో చెప్పకుండా తప్పుకున్నారు. జరిగే యోగం ఉన్నప్పుడు జరగక తప్పదు కదా. వివాహ యోగం ఉంటే వివాహం కాకుండా తప్పదు కదా.ఆ అమ్మాయి ఒక గురువారం తన జాతక సమస్యలు గూర్చి నన్ను అడగటానికి ఒక జ్యోతిషవేత్త దగ్గరికి వచ్చినట్లుగా వచ్చింది. చూస్తే బొద్దుగా ముద్దుగా బాగానే ఉంది. అందంగా ఉంది. ముఖంలో ఏదో తెలియని అమ్మవారి దైవిక శక్తి కనబడుతుంది. రమ్మని కూర్చోమని బాబాకి నిత్య హారతి పూజ నైవేద్యం కార్యక్రమాలు చేస్తున్న కూడా నా మనస్సు ఈమె గూర్చి ఆలోచన చేయడం చేస్తూనే ఉంది. ఈమె నా భార్యనా? ఈమే కదా. ఎందుకంటే బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది. మంచి మనస్సు ఉంది. అమాయకత్వంగా కనబడుతుంది. మంచి తెలివితేటలు ఉన్నాయి. మంచి అధిక స్తోమత ఉన్న కుటుంబ వ్యక్తి లాగా ఆమె వేసుకున్న దుస్తులు చెబుతున్నాయి. అలాగే ఆమె మాట్లాడే తీరు అందర్నీ ఆకర్షించే విధంగా ఉన్నాయి. మంచి అణకువ విధేయత గౌరవ మర్యాదలు కనబడుతున్నాయి. ఎటు చూసిన నేను ఖచ్చితంగా ఈమెకి తలతూగను.బాబా చెప్పిన వ్యక్తి ఈమె ఖచ్చితంగా కాదు అనుకున్నాను. కానీ ఈమె ఆమె అని కొన్ని క్షణాల తర్వాత నాకు అర్థమయ్యే సరికి నా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలైనాయి.

యోగి గా కావాలని నేను అనుకుంటే బాబా వారు నన్ను కాస్తా కామ భోగిగా మారుస్తున్నారని మనస్సులో ఆవేదన, బాధ, భయం, ఆందోళన మొదలయ్యాయి. నాకు కూడా పూజ పూర్తి అయినది. నా పూజా విధానానికి ఆమె తన్మయత్వం చెందినట్లు అనిపించింది. ఆమెను దగ్గరకు పిలిచి ఒక జ్యోతిషవేత్త గా ఆమెతో “ఏమి కావాలి? ఎందుకు వచ్చారు చెప్పండి” అనగానే తన M.Sc ప్రాజెక్ట్ కు సంబంధించిన రిపోర్టు వివరాలు ఏడుస్తూ బాధపడుతూ చెప్పగానే ఆమెతో “చూడండి మీకు M.Sc పూర్తి కాదు. ఈ ప్రాజెక్టు దగ్గర ఆటంకాలు ఉన్నాయి. చాలా కష్టపడవలసి వస్తుంది. మీ ప్రొఫెసర్ అందుకు సహకరించడు. వాడు మీ దగ్గర ఏదో ఆశిస్తున్నాడు అని మాకు అర్థం అయినది” అని చెప్పేసాను. ఇంకా దానితో తను పని చేస్తున్న ఉద్యోగం ప్రమోషన్ గురించి, తన వివాహం గురించి, తన బంధు మిత్రుల గురించి ఇలా మూడు గంటల పాటు నన్ను అడిగింది. ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ చివరకు “చూడండి మీకు రెండు వివాహ విధి విధానాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ వివాహం. మరొకటి పెద్దలు కుదిర్చిన వివాహం. ఇందులో ప్రేమ వివాహానికి 80% అవకాశాలు ఉన్నాయి. ఈ వివాహం తో మీరు స్వేచ్ఛ గా మీకు కావలసిన విధంగా జీవించగలుగుతారు.అదే పెద్దలు కుదిర్చిన వివాహం అయితే మీరు కాస్త బంగారు పంజరంలో బంధించిన రామచిలుక లాగా బ్రతుకుతారు. అన్ని రకాల సుఖాలు భోగభాగ్యాలు అందుతాయి కానీ మీకు తృప్తి ఉండదు. బంగారు పళ్లెంలో అన్నం తింటారు కానీ మీ ప్రక్కనే ఎవరూ ఉండరని ఏకాంత స్థితి. తృప్తి లేని బంధీ జీవితం అవుతుంది. కాబట్టి మీకు ఎలాంటి జీవితం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ తేదీన మీకు వివాహ యోగ కాలము నాకు తెలుస్తుంది” అని చెప్పి చెప్పగానే ఆమె విని మౌనంగా కూర్చొని భారంగా ఊరుకొని కొన్ని నిమిషాలు తర్వాత ఏవైనా సమస్యలను అడగటానికి నా ఫోన్ నెంబర్ కావాలని అని అడిగి తీసుకొని బాధగా వెళ్లి పోవడం జరిగినది. ఆ తర్వాత కొన్ని రోజులకు మీరు ఫ్రీగా ఉంటే మీతో మాట్లాడాలని మెసేజ్ చేసింది. ఏమై ఉంటుందా అని చెప్పి నా మనస్సు లాగడం మొదలు పెట్టంది. దానితో ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది. ఫోన్ మాటలు కాస్త పార్క్లు దాకా వెళ్లి మాటలు మాట్లాడుకునే స్థాయికి మేమిద్దరం చేరుకున్నాం.

ఒక ప్రక్క నా మనస్సు చెబుతూనే ఉంది ఇది చాలా తప్పు! ఆమె నీకు సరిజోడి కాదని నువ్వు ఆమెకి సరిపోవని చెబుతుంటే ఒకసారి అదే విషయం ఆమెతో చెప్పగా అయితే నేనేమో భోగంలో ఉన్నత స్థితిలో ఉంటే మీరేమో యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నారు.నేను ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నాను. మీరు బాబా భక్తి లో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇంకా ఎన్ని ఈ పాప మానవ జన్మలు ఎత్తాలి? నాకు ఇష్టం లేదు. నాకు జననం లేని జన్మ స్థితి కావాలి. అందుకు మీరే సరైన వ్యక్తి అని బాబా గారు నాకు వివిధ అనుభవాల ద్వారా తెలియజేసినారు. నేను మిమ్మల్ని వదులుకోను. మీరు నన్ను వదిలి ఉండిన నేను అలా ఉండలేను అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కానీ నిన్ను వివాహం చేసుకోవాలంటే లేచిపోయి పెళ్లి చేసుకోవాలి. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఒప్పుకోరు అని చెప్పగానే నా గుండెలో రాయి పడినట్లయింది. వామ్మో! పోయి పోయి లేచిపోయి పెళ్లి చేసుకోవాలా? ఇంకా ఏమైనా ఉందా. నా బ్రతుకు “ప్రేమిస్తే” సినిమా హీరో పరిస్థితి అనగా ప్రేమ పిచ్చితో రోడ్డు మీద పడితే పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. పిచ్చివాడిగా యోగం అవధూత స్థితి పొందాలని నేను అనుకుంటే ఈమె కాస్త నన్ను తన ప్రేమ వలన భోగి పిచ్చి వాడిగా మార్చాలని అనుకుంటుందా… అసలు దీనంతటికీ కారణం ఆ ముసలాడు వల్లనే అదే షిరిడి బాబా వల్లనే వచ్చినది అనుకుంటూ మౌనంగా ఏదో తెలియని ఆందోళనతో, భయంతో ఇంటికి చేరుకున్నాను. అర్ధరాత్రి 12 గంటలకు ఆమె నుండి ఫోన్ వచ్చింది. ఒకటే ఏడుపు.నాకు బాధగానే ఉంది. కానీ ఆమెను ఇలా వివాహం చేసుకోవటమే నాకు ఇష్టం లేదు. అలాగని ఆమె తల్లిదండ్రులను అడిగే స్థాయి నాకు లేదువాళ్ళ పిల్లను ఎలాగైనా తమ కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇచ్చుకోవాలని ఘనంగా వివాహం చేసుకోవాలని, ఉన్నత ఉద్యోగికి ఇవ్వాలని, విదేశీ వ్యక్తికి ఇవ్వాలని వాళ్ల కోరికలు వాళ్ళకి ఉంటాయి కదా. పోనీ ధైర్యం చేసి ఈమె అడిగితే మన విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను కట్టడి చేస్తారు. నన్ను ఉద్యోగం మానిపిస్తారు. నన్ను వివాహం చేసుకోవాలంటే లేచిపోయి పెళ్లి చేసుకోవాలి లేదంటే నన్ను మర్చిపోకండి. నేను నీ పెళ్లి కి రాను. అలాగే మీరు నా పెళ్ళికి రావద్దంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె బాధ ఆమెది నా బాధ నాది. కొన్ని గంటలు గడిచినాయి. అర్ధరాత్రి 2 గంటలకు ఆమెకు ఫోన్ చేసి సరే నీ ఇష్టప్రకారమే వివాహం చేసుకుందాము అనగానే చాలా థాంక్యూ! నల్ల బంగారం!ఐ లవ్ యూ అంటూ ఆనందంగా ఫోన్ పెట్టేసింది. ఆమెకు ఆనందం నాకు ఆందోళన మిగిలాయి. ఈ రకంగా నా పరిస్థితి తియ్యని దురద లాగా తయారైంది. అటు ఆమెను కాదనలేను.ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఇంట్లో మా అన్న వాళ్ళకి అక్క వాళ్లకి విషయం చెప్పగానే వాళ్లు గతుక్కుమని మేము నీ పెళ్లి విషయంలో ఎలాంటి సహకారం అందించమని తప్పుకున్నారు. వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి.ఆ క్షణం నుండి మానసికంగా నాకు సోదర ప్రేమ మోహ వ్యామోహాలు పోయినాయి. నేను సమస్యల్లో ఉన్నప్పుడు సహకరించ లేనప్పుడు ఇంకా వీళ్ళు నాకెందుకు అనిపించసాగింది. దాంతో మానసికంగా దూరం అయ్యాను. మా తల్లిదండ్రులకు చూచాయగా విషయం చెప్పాను. వారు మౌనం వహించారు. ఏమిచేయాలో అర్థంకాని స్థితి. అపుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి అన్ని విషయాలు చెపితే...వాడు పెద్దగా నవ్వి"స్వామి!అది ఏమిటి?తమరు భార్యబాధితుల సంఘం పెట్టాలని...దానికి తమరు అధ్యక్షుడిగా ఉండాలని...దీనికోసము బ్రహ్మచారిగా ఉంటానని నాతో చెప్పినట్లుగా గుర్తు అన్నాడు!వెంటనే వాడితో"ఇపుడు జోకులు అవసరమా?ఇక్కడ నా బొంద నా జీవితమే నా చేతులలో లేదు!ఇపుడు నా పెళ్ళి సంగతి ఏమి చెయ్యాలో చెప్పు"అన్నాను! దానికి వాడు వెంటనే "మా అమ్మ అయిన మీ ఆవిడగారు ఏమి చెపితే అలా చెయ్యడము తప్ప మనచేతులలో ఏమి లేదని తెలుసుకో ...నీకు ఆమెతో బాబావారు వివాహాము చెయ్యాలని బలంగా అనుకున్నారు..ఖచ్చితముగా చేస్తారు…. పైగా ఇందులో నా సహాయసహకారాలు ఎపుడూ ఉంటాయని " అన్నాడు. ఇదే విషయం ఆమెతో చెబితే “మన వివాహం అయిన తర్వాత అన్ని విషయాలు సర్దుకుంటాయని మన వెంట వీళ్లు లేకపోయినా బాబా గారు ఉన్నారు” అని నాలో లేని ధైర్యం పోసింది. అనుకున్న సమయానికి ఇంట్లో నుంచి ఒక రోజు మేమిద్దరం జంపు అయ్యి ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాము. సాక్షి సంతకాల కోసము మా జిజ్ఞాసి ఉన్నాడు!నా తెలిసినవాళ్ళు వచ్చి తమ సహాయసహకారాలు అందించి దగ్గర ఉండి మా పెళ్ళికి వీళ్ళే పెళ్ళిపెద్దలు ఉండి ఇక్కడ చేయించినారు! అటు వాళ్ళ వాళ్ళకి ఇటు నా వాళ్ళకి మా వివాహ విషయం తెలిసే సరికి గతుక్కుమన్నారు. ఒక ప్రాంతంలో ఆమె తరపు బంధువులు ఆమె తల్లిదండ్రులు కలిసి సమావేశపరిచారు. ఆమెను నానా తిట్లు తిట్టినారు. కొట్టినారు. వెంటనే నేను అడ్డుగా వెళ్లి వాళ్ళని అడ్డగించి ఈమెను నా ప్రాణ ప్రదంగా చూసుకుంటానని అక్కడ వాళ్ళకి మాట ఇచ్చాను. దానితో అక్కడ నుండి మౌనంగా వేదనతో వెళ్లిపోయారు.

మేము కూడా మా ఇంటికి సత్యనారాయణ వ్రతం కోసం చేరుకున్నాము.ఈ వ్రతానికి మా అన్న, అక్క సభ్యులు లేరు. ఉన్న తల్లిదండ్రులు మేము అలాగే నాకు తెలిసిన ఊర్లోని వారంతా ఉన్నారు. మరియు నా జిజ్ఞాసి చివరిదాకా నా తోడుగా రక్షకుడిగా ఉన్నాడు!మా సొంత అన్న వదిన,అక్కబావ భయపడితే...వీడు మాత్రము నాతో ఎలాంటి రక్తసంబంధము లేకపోయిన...కేవలము ప్రాణస్నేహం కోసము నా కోసము నా సంరక్షణ కోసము ఉన్నాడు! వారి సమక్షంలో మరొకసారి చిన్నపాటి విధముగా పెళ్లి చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. వ్రతం సమయానికి వాళ్ళ కుటుంబ సభ్యులు రావటం కొద్దిపాటి వాదనలు జరగటం వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లి పోవడం జరిగినది. శోభనం రాత్రి రానే వచ్చింది.పాలు తీసుకుని రావలసిన మా శ్రీమతి బదులు మా కార్య ముహూర్తము పెట్టిన పండితుల వారు పాలు తీసుకుని వచ్చేసరికి గతుక్కుమన్నాను. ఇంతలో మా శ్రీమతి వచ్చింది. మేము బాధలు చెప్పుకున్నాము. ఆనందాలు పంచుకున్నాము అటుపై యోగ సాధనకి అడ్డుగా వచ్చే సంతాన మాయలో పడకూడదని అందుకే పిల్లలు వద్దని మేము ఇద్దరం కలిసి స్థిరనిశ్చయం ఆ రోజే తీసుకొని మా వివాహ దాంపత్య జీవితం ప్రారంభించే సరికి బాబా వారు ఎందుకు ఈమెను నాకు శ్రీమతి గావింపజేసినారో అప్పుడు గాని అర్థం కాలేదు. ఎందుకంటే ఈమెకు నాకు అలాగే ఈ వివాహం అనే ప్రారబ్ధకర్మ మాత్రమే ఉంది. అలాగే ఈమె కాకుండా మరో స్త్రీ అయితే భోగభాగ్యాలు కావాలని, సంతానం కావాలని నానా చంకలు నాకించడం జరిగేది. ఖచ్చితంగా భోగ మాయలో పడి పోయే వాళ్ళం. అటు బ్రతకలేక చావలేక జీవితాలను అసంపూర్తిగా అనుభవిస్తూ, ఎందుకు బ్రతుకుతున్నామో, దేనికోసం బ్రతుకుతున్నామో అర్థం కానీ అయోమయ స్థితిలో నేను ఉండేవాడిని. కాకపోతే పెళ్లి చేసుకోవడం వల్ల మేమిద్దరం కూడా రామకృష్ణ పరమహంస శారదాదేవి లాగా ఉండిపోయి యోగ సాధన చేయాలని బాబా వారు అనుకున్నారని నేను ఊహించలేదు. దంపతులుగా కాకుండా యోగ సాధకులుగా యోగ సాధన చేయాలని ఆమెకి ఎందుకు కలిగిందో మీకు తెలియాలంటే ఇంకా ఎందుకు ఆలస్యం ముందుకు మాతో పదండి!

మా ఆవిడ మోక్ష గామి కావడం

నేను గృహస్థ ఆశ్రమం లో ఉన్నాను అని మీకు తెలుసు కదా. నా యోగ సాధన అనగా కుండలినీశక్తి జాగృతి ప్రారంభ రోజులు. అలాగే నా వివాహ రోజులు ప్రారంభమైనాయి. వివాహమైన ఆరు నెలల వరకు నేను ఏం చేస్తున్నానో నా ఇష్టాలు ఏమిటి? నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాయి అని కలవరపడుతూ ఆనందపడుతూ గడిచి పోయినాయి. ఆ తర్వాత నేను ఎక్కువగా సొంత ఊరికి వెళ్ళినప్పుడు గుడిలో ఎక్కువగా ధ్యానజపాలు చేయడం, ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట మూడు లేదా నాలుగు గంటలపాటు మంత్ర జపం చేయడం, శని ఆదివారాలలో ఏడు లేదా ఎనిమిది గంటలపాటు జపం చేయడం, గ్రహణ సమయములో, పండుగల సమయంలో అనగా మహాశివరాత్రికి అలాగే కార్తీక పౌర్ణమి రోజులలో ఎక్కువ జప తపాలు చేయడం కూడా తను బాగానే గమనించినది. అలాగని తను దాంపత్యం వదిలి పెట్టడం లేదని తనను ప్రేమగా చూసుకుంటున్నానని తనకి తెలుసు. అలాగే అన్ని రకాల గృహసంబంధ భార్య బాధ్యత బంధాలు చక్కగా చేస్తున్నానని తనకి మానసిక శారీరకంగా చక్కగా సుఖ ఆనందంలో ఉంచుతున్నాను అని తెలుసుకొని అందరికి లాగా ఈయన ఉండటం లేదని జపధ్యానాలు చేయటమే తనకి కొత్తగా వింత గానే ఉండేది. దాంతో ఒక రోజు రాత్రి తను గమనించిన విషయాలు అన్ని నాతో చెప్పడం జరిగినది. అప్పుడు దానితో “సఖి!ఇల్లాలా!నేను ఎవరో తెలుసుకోవాలని నా ప్రయత్నం. నన్ను సృష్టించిన వారు ఎవరో నాకు తెలియాలి. నేను అనేది ఎలా నశిస్తుందో తెలుసుకోవాలి” అనగానే ఆమె “అదేమిటి మీరు మీరే కదా! ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏమిటి? మిమ్మల్ని సృష్టించినది అత్త మామయ్య గారులే కదా. ఇంకా ఏముంది మీరు మరణం పొందితే మీరు ఉండరు కదా” అని చెప్పేసరికి నాకు నవ్వు ఆగలేదు. నేను నవ్వేసరికి మొఖం మీద పెదవులతో బుంగమూతి రావడం నేను గమనించి “అమ్మా! తల్లి! పెళ్ళామా! నేను అంటే ఫలానా వ్యక్తి పేరు కాదు. ఫలానా వృత్తి కాదు.ఫలానా కొడుకును కాదు. అసలు నువ్వు ఎవరో ఒకసారి ధీర్ఘంగా ఆలోచించు. నువ్వు అంటే అమ్మాయివా? కూతురివా? తల్లివా? చెల్లివా?అక్కవా? స్నేహితురాలివా? బంధువా? భక్తురాలివా ఇలా వీటిలో నువ్వు ఎవరివి దానిని ముందుగా తెలుసుకో. ఈ జన్మకి నా తల్లిదండ్రులు వీరు. మరివీళ్ళని సృష్టించిన వాళ్లు ఎవరు వాళ్ల తల్లిదండ్రులు. మరి వాళ్ళని సృష్టించింది ఎవరు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడే ఆఖరి ఆది తల్లిదండ్రులను సృష్టించినట్లు మనకు తెలుస్తుంది. మరి దేవుడును సృష్టించిన దెవరు? నాలోనూ దేవుడు ఉన్నాడు నీలోనూ దేవుడు ఉన్నాడు అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మనలో దేవుడిని ఎవరు సృష్టించారో తెలియదు కదా మరి.అంటే ఒక రకంగా చూస్తే నిన్ను సృష్టించినది ఎవరో నీకు తెలియదు. అలాగే నీవు (నేను) అంటే ఏమిటో తెలియదు. ఎందుకు పుడుతున్నావో ఎందుకు చస్తున్నావో తెలియదు. ఎవరి వలన పుడుతున్నావో ఎవరి వలన మరణిస్తున్నావో నీకు తెలియదు. ఇలా తెలియని దానిని తెలుసుకోవాలని నా యోగ ప్రయత్నమే నీవు చూస్తున్న ధ్యాన విధానాలు. అంటే మోక్షగామిగా మారి నేను ఎవరో నాకు తెలియాలి అని నన్ను సృష్టించిన దెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రయత్న వాదిని. ఉన్నదో లేదో తెలియని దానిని తెలుసుకోవాలని నా మనస్సు చెప్పిన విధానంతో ఒక జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాను” అని చెప్పగానే దాని చిన్న బుర్రకి మొదట ఏమీ అర్థం కాలేదు. అర్ధమయ్యి అర్ధం కాలేదని నాకు అర్థమయ్యే సరికి దానిని కదల్చటం అవసరమని… ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఒకవేళ ఆ పాము కుండలిని పాము అయితే దానికి కర్మవాసనలు పూర్తి అయ్యే సమయం దగ్గర పడటంతో తనకి నా జప ధ్యాన ప్రక్రియలు ఆకర్షించాయి. నా విగ్రహారాధనలు పిలుస్తున్నాయి. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాయి. యోగం ఉండటం వల్లే నన్ను వివాహం చేసుకుంది. భార్య అయినది. యోగ మార్గం వైపు తన మనస్సు తనకు తెలియకుండానే అడుగులు పడుతున్నాయి” అని నాకు అర్థం అయింది. శివపార్వతులు లాగా తను ఈమెకు గురువుగానూ ,భర్త గాను ఉండి యోగము, భోగం యోగాలను పరిసమాప్తి చేయాల్సి ఉంటుందని గ్రహించి మౌనం వహించి నిద్రలోకి జారుకోవడం జరిగినది.

ఆమె నిద్ర పోకుండా మెలకువగా ఉండి “నేను” అంటే ఏమిటో? నాకు సమాధానం చెప్పాలని తనకి తోచిన సమాధానాలు కాగితము మీద రాసుకుంటూ పది పేజీలు నింపే సరికి అవేవీ నేను కాదని తెలుసుకొని నా వంక ఆర్తిగా, అయోమయంగా చూస్తూ నిద్రలోకి జారుకోవడం నా ఓరకంట నేను గమనిస్తున్నాను” అని ఆమె తెలుసుకోలేక పోయింది. ప్రొద్దునే లేచి కాఫీ ఇస్తూ “ఏమండీ! రాత్రంతా కూర్చుని నేను ఆలోచించి కాగితాల మీద నేను గూర్చి వ్రాసినాను. కానీ నేను అనేవి అవి ఏవీ కావని నాకు అర్థమైనది.మరి నేను అంటే ఏమిటి?” అని అడిగింది. నేను వెంటనే “దీక్షా! నేను అంటే అనేది తెలుసుకోవడం సాధ్యం కాదు. అలాగని అసాధ్యం కాదు. నేను అనే దానిని పట్టుకుని అరుణాచల రమణ మహర్షి జీవన్ముక్తి పొందినారు. ఇది తెలుసుకోవాలని రామకృష్ణ పరమహంస వివిధ యోగ సాధన ప్రక్రియలు, వివిధ మత సంప్రదాయాలు చెప్పిన విధి విధానాలు చేసి నేను తెలుసుకొని అవి నిజమే చెబుతున్నాయి” అని లోకానికి తన అనుభవాలను కథల రూపంలో చెప్పి మోక్ష ప్రాప్తి పొందినారు. నేను అనేది తెలుసుకోవాలని బుద్ధుడు గృహస్థ ఆశ్రమం వదలి అడవుల వెంట పిచ్చి వాడిగా మోక్షగామి అయ్యి ఙ్ఞాన సిద్ధుడు గా మారి మోక్ష ప్రాప్తి పొందినాడు. అంతెందుకు మహాశివుడు తన సతీదేవి మరణ విరహవేదనను తట్టుకోలేక పిచ్చివాడై ఆదియోగి గా మారి యోగసాధనతో నేను అనేది తెలుసుకొని లోకానికి చెప్పటానికి ఆయనే ఆది గురుమూర్తిగాను మరో ప్రక్క ఆయనే ఆదిదేవుడు లింగమూర్తి గా మారినాడు” అని వేదశాస్త్రాలు చెబుతున్నాయి.ఇలా ఎన్నో లక్షల కోట్ల మందిని నేను అనే మహా మాయ భోగ ప్రపంచం నుండి సత్య ప్రపంచం వైపు కి సత్యాన్వేషి గా మార్చడానికి యోగ ప్రపంచం వైపు ప్రయాణింప చేసినవి” అని చెప్పగానే దానికి మా ఆవిడ “స్వామి! నేను కూడా నేను అనేది ఏమిటో? మీతో కలసి తెలుసుకోవాలని ఉంది. అందుకు నాకు కావలసిన జ్ఞానప్రాప్తి మీరే ఇవ్వవలసి ఉంటుంది. నాకు మాయలు, మర్మాలు, మార్గాలు ఏమీ తెలియవు. మీ వెంట మీరు అన్నట్లు నేను అడుగులు వేస్తాను.నేను అనేది ఏమిటో నన్ను సృష్టించినది దేనికి నేను కూడా నేనుగా తెలుసుకోవాలని ఉంది” అనగానే వెంటనే నేను “దీక్షా! అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు. అలాగని అసాధ్యం కాదు. కానీ ప్రస్తుతం గృహస్థాశ్రమంలో ఉన్నాము. డబ్బులు సంపాదించాలని పిల్లలు వృద్ధిలోకి వచ్చిన తర్వాత అప్పుడు యోగ సాధన గురించి ఆలోచిద్దాం. నీవు నేను అందాక మన ఇష్టదైవాలను పూజలు, జపములు చేసుకుందాం. మనకు కావలసిన కోరికలు తీర్చుకుందాం. మన ఆనంద జీవితానికి కావలసిన ఇల్లు, కారు, అనేక సదుపాయాలు, మంచి ఉద్యోగం, మంచి జీతంతో మన భోగ జీవితం అనుభవించి ఆ తర్వాత చివరికి మన అంతిమ స్థితిలో మన పిల్లలు అందరూ అభివృద్ధిలోకి వచ్చిన తరువాత తీవ్రమైన యోగ సాధన చేద్దాము” అనగానే” ఏమండీ! ఎన్ని కోట్ల జన్మల పాటు ఈ సంసార మాయలో పడిన మీకు బుద్ధి రాలేదా? మనము పుట్టడం దండగ అనుకుంటే మనకే తోకలు అవసరమా! మన జీవితానికి అర్థం పరమార్థం తెలియటం లేదా? పైగా లేనిదానిని కొత్తగా సృష్టించుకొని లేనిపోని బంధాల మాయలో పడి అవమానాలు, అపనిందలు, అవహేళనలు, ఆనందాలు, కష్టాలు పడుతూ లేస్తూ మునుగుతూ తేలుతూ ఉండటం ఇక నావల్ల కాదు. నిన్నటిదాకా మీరు నేను అనేది ఒకటి ఉన్నదని చెప్పేంతవరకు నాకు నేను ఎలాంటి మాయా ప్రపంచం లో ఉన్నానో అని అర్థమై చావలేదు.నేను అనేది తెలుసుకోవడానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టినదా? అని చులకనగా అనిపించి రాత్రి అంతా అది ఏమిటో తెలుసుకొని తెల్లవారేలోగా మీకు నేను అంటే కేవలం ఫలానా అది అని చెప్పాలని పది పేజీల కాగితాల మీద వ్రాస్తూపోతే చెత్త పెరుగుతుందే గాని నేను అనే దానికి సరైన అర్థం, భావము, ఆలోచన నాకు స్ఫురణకు రాలేదు. ఓరిని! ఒక నేను అనేది తెలుసుకోకపోతే ఎందుకు నా బతుకు అనిపించింది. ఒకటి అండి నేను అనేది తెలుసుకుని చావాలని రాత్రి నిశ్చయించుకున్నాను. అందరూ వెళ్లే మార్గాలలో నేను వెళ్ళను. ఇప్పటిదాకా అందరూ కూడా గృహస్థ ఆశ్రమంలోనికి వెళ్లి పిల్లలని కని వారికి ముడ్డీలు కడిగి వారికి కావలసిన వాటిని పెట్టి భయపెట్టి బుజ్జగించి నా నా చంకలు నాకి చదివించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లిళ్ల పేరుతో, ఉన్నత ఉద్యోగాల పేరుతో, విదేశాలకు వెళ్లి మనకు చింతలు మిగిల్చి చితికి వెళ్ళే దాకా రాకుండా ఉండటం మనకు అవసరమా? అన్నప్రాసాలు,అంత్యక్రియలు వాళ్ళకి చేయడము అవసరమా? నిజంగా చెప్పండి. ఏమి సాధిస్తారు.ఏమీ లేదుగా. మనకు మనమే ఊహాప్రపంచం ఏర్పర్చుకుని ఆనందాలు, కష్టాలలో పడుతూ లేస్తూ ఎన్నో కోట్ల సంవత్సరాలు చేస్తూనే ఉన్నాము.అది తీయని దురదలాగా నుండి తీరని కోరికగా మిగిలిపోతుంది. కామము ఎన్నటికీ ఆగదు. దానిని మనమే అదుపులో ఉంచుకోవాలి. కామ గుఱ్ఱమునకు ఆధీనమై హయగ్రీవ శక్తిని ఇస్తుంది. సంయోగ మందులు అమ్మే పెట్టెల మీద బొమ్మల గుర్తుకు మిగిలిపోతుంది. అది మనకి అవసరమా చెప్పండి” అనగానే ఈమెకు ఇంతటి జ్ఞాన ప్రవాహం ఎలా వస్తుంది? ఎక్కడ నుండి వస్తుంది? ఖచ్చితంగా మామూలు స్త్రీ కాదు. గత జన్మ లో ఎక్కడో సాధన మాయకు గురి అయ్యి ఈ జన్మలో దానిని పరిసమాప్తి చేసుకోటానికి కొంపదీసి వచ్చిన కారణ జన్మురాలుకాదు కదా. నా కొంప కొల్లేరే!

ఎందుకంటే ఎలాగైనా కామ మాయలో పడితే సంసారం మాయలో పిల్లలు పీచు, బాధలు, ఉద్యోగాలు అంటూ పనికి మాలిన పనులలో పడితే నా మనస్సు ఆధ్యాత్మికత వైపుకు సంపూర్తిగా వెళ్లకుండా ఉంటుంది. ఎలాగో నేను అనేది తెలుసుకోవడానికి జిఙ్ఞాసి ఉండనే ఉన్నాడు ఎలాగో సమాధి ముందు నా దగ్గరకి వస్తాను” అన్నాడు! కాబట్టి వాడిని అడిగి ఆ 13 యోగ చక్రాలు ఎలా జాగృతి ,శుద్ధి,ఆధీనం విభేదనం చేసుకోవటానికి ఎవరిని పూజించాలి? ఏఏ క్షేత్రాలకు వెళ్ళినాడో? తెలుసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే… ఈ మహాతల్లి నా జీవితాన్ని మార్చడానికి వచ్చినట్లుంది. కామేశ్వరి కామేశ్వరుడు లాగా భోగ మాయలో ఉండాలనుకుంటే ఈశ్వరి ఈశ్వరుడు లాగా యోగములో ఉందామని అంటుంది. వామ్మో! నా జీవితం చంక నాకి పోయింది.

పైగా బాబా వారు తన ప్రశ్న పుస్తకంలో “మీకోసం గౌరీ ఎదురుచూస్తుందని వివాహం చేసుకో” అని చెప్పి నా దగ్గరకు పంపించాడు అనుకుంటే ఇది ఏకంగా పార్వతి గా మారి నేను తెలుసుకోవాలి అని అంటున్నారు. వామ్మో! కామమే లేకపోతే ఎలా? పైగా ఇప్పుడు తెలిసో తెలియకో చక్రాల జాగృతి అంటూ ప్రయోగాలు మొదలు పెట్టాను. అదేదో చక్రమునందు కామమాయ బలీయంగా పెరుగుతుందని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి.ఇది ఇచ్చిన షాక్ కి అసలు ఆ చక్రం పేరు గుర్తుకు వచ్చి రావటం లేదు. వామ్మో! నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నా కామ కోరిక గాల్లో కలిసిపోతుంది. పెళ్లి అయినా బ్రహ్మచారిగానే చచ్చిపోవాలా. ఇంకా పెళ్లి చేసుకోవడం ఎందుకు. అది ఇచ్చే మూడు నిమిషాల సుఖం కోసమే కదా. వామ్మో! చాలా కష్టం! ఇప్పటికే నా జీవితం సగం బాత్ రూమ్ కి అంకితమైనది. ఇక మిగిలిన జీవితం బాత్ రూమ్ కే అంకితం అయితే ఇంకా పెళ్లిఎందుకు? పెళ్ళాము ఎందుకు? అంటూ దాని వైపు దీనంగా చూస్తూ “అవును దీక్షా! చిలక పలుకులు బాగానే చెప్పావు. కామిగాని వాడు మోక్షగామి కాదు అన్నారు కదా. కాబట్టి మనము ఈ జన్మలో భార్యాభర్తల గా ఉండి సంసార సుఖాలు అనుభవిస్తూ కామవాంఛలు తీర్చుకున్న కూడా మోక్షం వస్తుంది కదా” అనగానే వెంటనే అది “ఎప్పుడు వచ్చిందో చెబుతారా? మాకు కడుపులు చెయ్యడానికి వస్తారు గానీ కడుపుకు కారణమైన దానిని అంతు చూడాలని అదే కామ మాయ దాటాలని మాత్రము చూడరు కదా. పంది ఎప్పుడు అశుద్ధము ఎలా అయితే ఇష్టపడుతుందో ఇన్ని తెలిసిన మీరు కూడా అశుద్ధము వైపు కి వెళితే ఎలా? కొత్తగా ఆలోచించండి. కొత్త మార్గం వైపు వెళ్ళండి. ఏదో ఒక విషయం తెలుసుకోండి. అంతేగాని చేసిన పని చేస్తూనే మురికి గుంటలో పడిపోతారని అంటున్నారు. మీరు సేకరించిన పుస్తకాల్లో కామ శాస్త్రాలు ఉన్నాయి అలాగే వాటిని దాటడానికి ఉపయోగపడే యోగి వేమన సూక్తులు ఉన్నాయి. మీరు అనుభవించి దానిని దాటగలరని మీ నమ్మకం. అది నిజం కాదని నా నమ్మకం. ఒకసారి అలవాటు పడితే అది అవసరమై వ్యసనంగా మారుతుంది. దానిని దాటటం అనేది ఉండదని సంసారం మాయ అనేది తీయని దురద అని గోక్కుంటే పుండు పుడుతుంది కాకపోతే జిల పుడుతుంది.ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అని కామిగాని వాడు మోక్షగామి అనేది నాకు తెలిసి కామి అంటే కామం ఒక్కటే అని కాదు కోరిక అని కూడా. అది సంసారసుఖం కావచ్చును లేదా మరే ఇతర కోరిక కావచ్చును. మరి మీరు ఎందుకు ఈ కామ కోరిక గా తీసుకుంటున్నారు”అనగానే వెంటనే నా మనస్సులో “పెళ్లి చేసుకున్నాను కదా! అందుకే నేను కామమును కామ కోరికగా తీసుకున్నాను తల్లి! దీనమ్మ! నాకు గడ్డాలు మీసాలు వచ్చే సమయం నుండి నాలో నాకే తెలియని భావాలు రావడం ఏమి జరుగుతుందో అర్థం కాక కంగారు పడే సమయంలో ప్యాంట్లులో ఏదో తెల్లని జిగురు పదార్థంతో తడిసి పోవడం చూసేసరికి ఇంకా వాటిని ఎవరైనా చూస్తే తిడతారు ఏమో అని చాటు మాటుగా ఉతకలేక కడుక్కోలేక నేను పడిన అవస్థలు నాకే తెలుసు తల్లి. మహాతల్లిగా ఉండి బాగానే కథలు మాటలు చెబుతున్నావు. పడే వాడికి తెలుసు ఆ బాధలు. దాని గూర్చి నానా బాధలు సంకలు నాకి అన్ని పుస్తకాలు తిరగేసి అది శృంగారమని అది చేస్తే ఆనందం వస్తుందని దానికి వివాహం అనే ప్రక్రియ ఉంటుందని తెలుసుకునేసరికి పెళ్లి వయస్సుకు వచ్చాను. వెంటనే పెళ్లి చేస్తారు అని అనుకుంటే ఇప్పుడే చదువు పూర్తి అయినది. మంచి జీతం మంచి ఉద్యోగం సంపాదించుకోమని మా వాళ్ళు చెబితే తొక్కలో ఉద్యోగానికి అన్ని రకాల ఇంటర్వ్యూ లకు వెళ్లి అవమానాలు పొంది ఏదో చివరికి ఒక ఉద్యోగంలో స్థిరపడితే అది కాస్తా పోయి భవిష్యత్తు అర్థం కాక పిచ్చి వాడిగా మారుతున్నానేమోనని పిచ్చి మార్గము నుండి మార్చుటకు పెళ్ళి సంబంధాలు చూస్తుంటే మంచి జీతం ఉద్యోగాలు లేవని అవన్నీ వెనక్కి పోతుంటే ఏదో బాబాగారు చూపించారు కదా అని దీనిని కష్టపడి పెళ్లి చేసుకుంటే వామ్మో ఇది పెళ్లయిన ఆరు రోజులకే చుక్కలు చూపిస్తుంది కదా? అంటే నా ఆనంద సుఖ బ్రతుకు కేవలం రోజులేనా. మిగిలిన భవిష్యత్ అంతా ఇంకా బాత్రూమ్ నేనా. అది సుఖము ఉండదు ఆనందం ఉండదు. చేసుకోకపోతే మనస్సు స్థిరంగా ఉండదు. వామ్మో అది తలుచుకుంటే భయమేస్తోంది అనుకుంటుండగా….

“ఏవండీ! ఏవండీ! ఏమి ఆలోచిస్తున్నారు? అని ఆవిడ గొంతు విని ఈ లోకానికి వచ్చి “దీక్షా! ఏమీ లేదు! పెళ్లి అయి పిల్లలు పుట్టకపోతే నాలోను అలాగే నీలోను ఏదో లోపం ఉన్నదని లేదా నాకు మగతనం లేదని, మీకు సంతానం లేదని, లోకులు కాకులై పొడుస్తారు! పెళ్లిళ్లకు,పేరంటాలకు పిలవరు! నిన్ను ఒక గొడ్రాలు గా చూస్తారు! అంత సీన్ మనకు అవసరమా ?ఒకరో ఇద్దరో పిల్లల్ని కని వారి బాగోగులు చూసుకుంటూ… నిత్యం దైవారాధన చేసుకుంటూ… ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం! “నేను తొక్క” అంటూ తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు! ఆ సాధన శక్తిని మనం తట్టుకోవాలి లేకపోతే అంగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. చక్కగా పెళ్లి పిల్లల బాధ్యతలు పంచుకుందాం. ఆనందాలు పంచుకుందాం కష్టాలు దాటుకుందాం” అనగానే అది వెంటనే “స్వామి! మీకు కామశాస్త్ర పాండిత్యము అలాగే మీకు తెలిసిన శృంగార భంగిమలు ఏ స్థాయిలో ఉంటాయో నాకు తెలుసు కదా! మీరు సంసార సుఖం లో అరేబియన్ గుర్రము అయితే నేనేమో పంచకల్యాణి గుర్రంలాంటి దానిని మీరే చెప్పారు కదా! మీకున్న శృంగార శక్తి నేను తప్ప మరో స్త్రీ తట్టుకోలేదని నాకు తెలిసేటట్లు చేసినారు కదా! ఉదృతంగా పరమానంద అనుభూతిని ఇచ్చినారు కదా! మీకు నాకు సంతాన యోగం జాతకం అని మీకు తెలుసు కదా! కాకపోతే దానికి పరిహారంగా సంతానప్రాప్తి మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని నాకు కావాలంటే ఉంటుందని లేదంటే ఉండదని మీరే కాదు నా చిన్నప్పుడునేను జాతకం చూపించుకున్న ఒక జ్యోతిషవేత్త చెప్పాడు. మహత్తర అవకాశం మనకు ఉన్నప్పుడు మనము శృంగార జీవితం అనుభవిస్తూ పిల్లలు లేని సంసారజీవితం ఇద్దరం కలిసి ఆనందంగా అనుభవిద్దాము. కామ ఉధృతమును తట్టుకోవాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ కామమును అనుభవిద్దాము. దాని ద్వారా వచ్చే సంతాన మాయలో పడొద్దు అని నా ఆలోచన. ఒకరికి ఒకరు కలిసి ఉంటూ నేను అనేది మన సాధన స్థాయిని పెంచుకుంటూ అది ఎక్కడి దాకా తీసుకొని వెళితే అక్కడి దాకా మనం వెళ్దాము. ఒక చిరు ప్రయత్నమే మహా ప్రయత్నం గా మారి అది విజయవంతం కావచ్చు కదా. మనకు కావలసిన జ్ఞానప్రాప్తి పొంది తద్వారా వచ్చే మోక్ష ప్రాప్తి పొందవచ్చు. పిల్లలు, బాధ్యతలు తర్వాత దైవం గురించి 60 సంవత్సరముల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటాము. ఆ వయస్సు వచ్చేసరికి శరీర ఆరోగ్యం సహకరించదు. అంత కష్టపడి కని పెంచిన పిల్లలు సహకరించరు.ఇంకా ఎందుకు కష్టపడటం. ఇన్నాళ్లు తెలియక మాయలో పడింది చాలు. తెలిసిన తర్వాత కూడా పడితే అది ఎప్పుడు అవుతుందో మీరు చెప్పగలరా? అనగానే నా మనస్సు కొంతమేరకు కుదుటపడి దానితో “దీక్షా! అయితే సంసార సుఖం ఉండాలిగానీ సంతానం వద్దు అనుకుంటున్నావు. మనస్ఫూర్తిగా ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయం మన ఇద్దరిదీ కాదు. రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు కావాలంటే పిల్లలు పుడతారు. ఇక ఆ తర్వాత మన సాధన స్థాయి పెరుగుతున్న కొద్దీ అన్నిటి మీద మనకి మనకే తెలియకుండా వైరాగ్య భావాలు పెరుగుతూ వస్తాయి. బహుశా సంసారసుఖం మాయగా వస్తుందని అది దూరమే కావచ్చును. అప్పుడు నేను అలాగే నువ్వు ఏక పత్ని ఏక పతి ధర్మము దాటరాదు. ఉంటే సుఖాలూ నేను నువ్వు పొందాలి. కామ మాయ ఏ పరీక్ష చేయటానికి సిద్ధపడితే ఆ మాయ పరీక్షలు తట్టుకోవడానికి మనమిద్దరం సిద్ధపడాలి. ఒకవేళ కామ పరీక్ష మొదలు పెడితే నాకు ఎవరి మీదనైనా చెడు భావాలు కలిగితే నీకు చెబుతాను మీకు ఎవరి మీద అయినా చెడు భావాలు కలిగితే మొహమాటం లేకుండా, భయపడకుండా, ఉన్నది ఉన్నట్లుగా నాతో ధైర్యంగా, ఏకాంతంగా, ఒంటరిగా చెప్పు. అప్పుడు మనం ఇద్దరం కలిసి దానిని దాటి పోవటానికి అలాగే దానిని తట్టుకోవటానికి ఏమి చేయాలో విధివిధానాలు తెలుసుకుందాం. మనోధైర్యంతో ధర్మం తప్పకుండా ప్రయాణించి ముందుకు వెళదాం. ఇది ఎలాంటి కామ మాయో మీ అత్తమామల జీవితాలే అందుకు ఉదాహరణ కాబట్టి మనమిద్దరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పాతివ్రత్యం ధర్మమును దాటవద్దు. తప్పించుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మనలో ఈపాతివ్రత్యధర్మ గీతను దాటినారో తెలిస్తే మరుక్షణం వారు తమ జీవితం నుండి వెళ్ళవలసి ఉంటుంది. పాప కర్మచేస్తే ప్రాయశ్చిత్తం కూడా అంతే విధముగా నా దృష్టిలో ఉండాలని నా సిద్ధాంతం. అలాగే నాకు నా తల్లి ప్రేమ మాయ మాత్రమే నన్ను ఆపగలిగేది. ఈ భోగ ప్రపంచంలో నన్ను ఉంచేది. ఎందుకంటే నేను ఒకసారి అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా షిరిడి పారిపోతే “పిచ్చిమొహం! అది మాత్రమే నాకోసం తిండి నిద్రాహారాలు మాని వేసి దీక్షా చేసి గుమ్మం కేసి చూస్తూ ఎదురుచూస్తూ నిరాహారిగా ఉండిపోయింది. తల్లి మనస్సు అలాగే తల్లి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో నాకు తెలిసినవి. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఆనాటి నుండి మనస్సులో ఆమె నా కోసం ఇంత ప్రాణ త్యాగానికి సిద్ధపడితే ఆమె జీవితాంతం అవసరమైతే నేనే బాగోగులు చూసుకోవాల్సి వస్తే మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరించాలి! ఎలాంటి ఇతర మోహ, వ్యామోహంలో పడి దానిని నా నుండి దూరం చేసుకోకూడదని, అది నా నుండి వేరు అయితే ఒక మృత్యుదేవత వేరు చేయాలని సంకల్పించాను.

మా అయ్య అయితే నా కోసం ప్రయత్నాలు చేస్తే దొరికితే మంచిదే దొరకకపోతే నాలుగు రోజులు బాధపడి ఈ జన్మకి ఇంతే అని నేను వచ్చేదాకా ఎదురుచూడకుండా తన భోగ ప్రపంచంలో క్షణిక ఆనందాలుకు వ్యామోహం చెందేసరికి అన్ని బంధాల మీద వైరాగ్యం చెందిన కూడా ఈ పెళ్లి కూడా మా అమ్మ అలాగే నాకు ఇష్టమైన బాబా గారు చెప్పినారు కాబట్టి చేసుకున్నాను. చేసుకున్న ఇప్పటికి నాకు అర్థమైంది.

నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాయ స్త్రీ కాదని మాయను దాటడానికి వచ్చిన యోగిని అని నాకు అర్థమయ్యే సరికి ఇంత కాలం పట్టింది. ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉండవు కదా. నాకున్న గతజన్మలలో కొద్దిపాటిగా మిగిలిపోయిన వివాహ జీవిత కర్మఫలం పూర్తి చేసుకోవడానికి నీవు వచ్చినట్లుగా ఉన్నావు. అది పూర్తయ్యేసరికి నేను అనే దానిని వెతుక్కునే స్థాయిలో నువ్వు ఉంటావని నాకు ఇప్పుడు అర్థం అయింది. అలాగే మా అమ్మగారు మరణం తర్వాత నేను ఎట్టి పరిస్థితులలో భోగ ప్రపంచంలో ఉండను. నాకు ఇష్టమైన యోగ ప్రపంచం నాంది అయిన మహా కాశి క్షేత్రం చేరుకోవడం జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా మహా మాయలో పడి నాతో రాకపోతే నువ్వు ఎవరికోసమైనా ఎట్టి పరిస్థితుల్లో అయిన ఇరుక్కుపోతే నేను మాత్రం ఒంటరిగా అయినా కాశీవాసం చేయటానికి వెళ్ళిపోతానని నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను. అలాగే నువ్వు కూడా అన్ని రకాల మాయలు దాటుతుంటే నేను కూడా నిన్ను నాతో పాటుగా కాశీలో ఉండటానికి తీసుకుని వెళ్తాను. మహా యోగి శ్రీ శ్యామా చరణ్ లాహిరి లాగా నేను సంసార బాధ్యతలు చేస్తూ వారి లాగా పిల్లలు వద్దు అని అంటున్నావు కాబట్టి పిల్లలు లేకుండా నేను గృహస్థ ఆశ్రమ ధర్మం తో మోక్షగామిగా మారటానికి ఈ రోజు నుండే నా ప్రయత్నాలు మొదలు పెడతాను. అలాగే నేను కూడా నీకు అన్ని విధాలుగా యోగ సాధనలో సహకరిస్తూ నీకు తెలియని వాటిని నేను నేర్చుకుంటూ నీకు అర్థమయ్యే విధంగా చెబుతూ నా భర్త మాయ అలాగే సంసారం మాయ అనేది సాధ్యమైనంతవరకు నీకు కలగకుండా నా వలన నీ సాధనకు ఆటంకాలు రాకుండా జాగ్రత్తలు పడతానని నీకు మాట ఇస్తున్నాను. కానీ నీవు మా అమ్మ లాగా నన్ను నాకు ఇష్టము లేని భోగ ప్రపంచంలో ఉంచుతావేమోనని భయము నన్ను ఇన్నాళ్లు వెంటాడేది. నన్ను నడిపించే వాడు శివయ్య కాబట్టి ఆయనే ఏదో మార్గం చూస్తాడని నా గట్టి నమ్మకం. ఆ నమ్మకం ఆయన నీ మాటలను బట్టి చూస్తే వమ్ము చేయలేదని నాకు అర్థం అయింది అనగానే దీక్షాదేవి నా కాళ్ళ మీద పడి “నన్ను ఈ రోజు ఒక ప్రక్క భార్యగాను మరొక ప్రక్క మోక్షగామిలా చూస్తూ నన్ను మీరు మాయా భోగ ప్రపంచం నుండి విముక్తి కలిగించడానికి మరల జన్మ లేని స్థితి కి నన్ను తీసుకుని వెళ్లడానికి మీరే సహకరిస్తారని స్వయంగా చెప్తుంటే ఇంతకంటే నాకు ఏమి కావాలి. ఇన్నాళ్ళు నేను చూసిన ప్రపంచం వేరు.మీరు చూపించే సత్య ప్రపంచం వైపు అసలుసిసలైన సత్యాన్వేషిగా నా ప్రయత్నాలు నేను మనస్ఫూర్తిగా చేస్తాను. అలాగే నేను ఎట్టి పరిస్థితులలోను ఏకపతి ధర్మమును దాటను. ఎందుకంటే మోక్షం కావాలంటే ధర్మ, అర్ధ, కామ పురుషార్థాన్ని పాటించాలని నాకున్న కొద్దిపాటి జ్ఞానము ద్వారా తెలుసు. ఒకవేళ నేను ఈ ధర్మం దాటితే కాశీ క్షేత్రంలో ఉన్న పవిత్రమైన గంగలో నా అపవిత్రమైన దేహమును త్యాగం చేయడానికి వెనుకాడని నేను మీకు మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.అలాగే ఎవరికి వారే కామ మాయ పరీక్షలు వస్తే పరస్త్రీ/పురుష వ్యామోహంలో పడే పరిస్థితులు వస్తే తగిన జాగ్రత్తలు తగిన హెచ్చరికలు ఒకరికొకరు తీసుకుంటూ వాటిని దాటాలి అని నా మనవి. అంతేగాని శారీరక వ్యభిచారం చేస్తే తెలుస్తుందని పర స్త్రీ/ పర పురుషులతో మానసిక వ్యభిచారం చేసిన కూడా పాతివ్రత్యం ధర్మం నాశనము చేసినట్టేనని మనం తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. మన ఇంటి పెద్ద కుటుంబ సభ్యులు ఈ కామ మాయ దాటలేక అందులో పడి సంసార జీవితానికి నాంది అయ్యారని మీరు వ్రాసుకొన్న డైరీలలో చూస్తే నాకు అర్థమైనది .మీరు వాళ్లు చేసిన తప్పు మనం చేయకూడదని అలాగని వాళ్లను తక్కువగా చులకనగా చూడాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అంత స్థాయి సాధన శక్తిని పెంచుకున్నవారు వారిద్దరు. ఎంత కష్టపడి ఉండి ఉంటారు కదా. ఒకరు రాతి శివలింగం మూర్తిని ఆరాధిస్తే మరొకరు మట్టి శివలింగం ఆరాధించి ఆ స్థాయికి వచ్చేసరికి ఏక పత్ని ధర్మానికి కట్టుబడి ఉండలేకపోయారు. పెళ్లి చేసుకున్నరాధ పెళ్ళికాని శ్రీకృష్ణునిని ప్రేమించలేదా? కామించ లేదా? కామము ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. విశ్వామిత్రుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుడు పంపించిన దేవత పరిచారిక స్త్రీల మోహంలో పడలేదా.ఆలోచించండి.కాబట్టి మీరు తప్పు పట్టడానికి లేదు. ఒప్పుకోవటానికి లేదు.త్రాగుడికి అలవాటు పడినవాడు త్రాగటానికి ఏదో ఒక కారణం చెబుతాడు. వీళ్ళిద్దరూ చేసిన తెలిసి తెలియక చేసిన మహా ఘోరమైన తప్పు మీరు భోగ జీవితం నుండి శాశ్వతంగా యోగ జీవితం వైపు మీ ఈ మనస్సును ఎలా మార్చేసుకున్నారో దానికి ఎంత కష్టపడవలసి వచ్చింది మీకు తెలుసు. మీ వ్యక్తిగత పుస్తకాలు చదివిన నాకు తెలుసు. వీరు భోగం నుండి యోగానికి మారటానికి కారకులే వీళ్ళిద్దరినీ తెలుసు.

కానీ లోకానికి దానిని తెలియనీయకుండా మీకు మీరే శిక్ష వేసుకుంటూ పరీక్షలు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు చచ్చిపోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసిన విధానాలు నాకు తెలిసినాయి. మీ హృదయము దెబ్బతినే సరికి అన్నిటియందు వైరాగ్యం ఏర్పడినది. అదియే మీ యోగ ప్రస్థానానికి నాంది అయినది. వారి కామ మాయే అంతర్గతంగా మీలో ఉన్న కామమును చంపేసింది.అది వాళ్లకు జరగాలి కానీ మీకు జరిగేటట్లు చేసినది.మీ యోగ మిత్రుడైన జిఙ్ఞాసి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతం వారు శ్రీశైల క్షేత్రం నందు యోగసాధన చేస్తున్నారని తెలిసి ఆనంద పడుతున్నాను. ఈ జన్మ వృధా చేసుకోకుండా మోహ మాయలో పడకుండా తనకున్న మాయలను మాయం చేసుకోవటానికి ఆయన చేస్తున్న ఒక మంచి యోగ ప్రయత్నానికి నా వైపు నుండి ఎప్పుడు కృతజ్ఞత పూరిత ద్వారాలు తెరిచే ఉంటాయి. వాడు నాకు దేవుడిచ్చిన దత్తపుత్రుడు అని అనుకుంటూ ఆయన ఎప్పుడు నాతో మాట్లాడిన ఒక బిడ్డ తన తల్లిని పిలిచినట్లుగా అమ్మా!అమ్మా! అంటూ ప్రేమపూరితంగా మాట్లాడటం నాకెంతో ఏదో తెలియని పుత్ర ఆనందం కలిగించేది. అందరూ కూడా ఆడ దానిలో ఆడతనం చూస్తే ఆయన మాత్రం అమ్మతనాన్ని చూస్తున్న నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తి బహుశా ఆయనేమో కావచ్చును. అతను నాకు చిన్నవాడైన యోగంలో నాకన్నా పెద్దవాడు కావటం వలన అతనికి బదులుగా ఆయన అనేది వస్తుంది. అలా నన్ను కూడా మీ యొక్క మిత్రుడుని ఎలాగైతే యోగం వైపుకి నీ వలన ప్రయాణింపచేసినారో అలా నన్ను కూడా యోగంలోకి తీసుకుని వెళ్ళండి. అందుకు ఏమి చేయమన్నా ఎలా చేయమన్నా ఏమీ త్యాగం చేయమన్న ఎక్కడికి వెళ్ళమన్న వెళతాను! నాకు ఈ జన్మ వృధా కాకుండా చూడండి. పతి దేవా! గురుదేవా” అని నా కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసే సరికి మా ఆవిడ కళ్ళల్లో యోగానికి వెళ్లడానికి ఉన్న ఆతృత,ఆర్తీ గమనించే సరికి నా మనస్సు ద్రవించి “దీక్షాదేవి! నీవు ప్రస్తుతము నేను పూజించి ఆరాధించే బాబా వారి సజీవ విగ్రహమూర్తి విగ్రహారాధన వాటి విధి విధానం గురించి చెబుతాను.నీ యోగ భక్తితో ఎలాంటి భోగ కోరికలు ఆయనను కోరకుండా కేవలము యోగ పరిసమాప్తి కి కావలసినవి ఇవ్వమని మొదటగా మంత్ర గురువు ప్రసాదించమని అడిగి వారి అనుగ్రహ ప్రాప్తి ని ముందు పొందు. ఆ తర్వాత ఏమి జరగాలని మనకి రాసి ఉంటే అదే జరుగుతుంది. నీకు యోగం ఉంటే యోగినీ కాకుండా ఎవరు ఆపలేరు కదా.ఈ యోగము నీవు ఉపయోగంగా మార్చుకుంటావో నిరుపయోగంగా మార్చుకుంటావో నీ చేతలను బట్టి ఉంటుందని చెబుతూ అప్పటిదాకా నేను ఆరాధించే బాబా విగ్రహ మూర్తిని ఆమెకి సంతోషంగా ఇచ్చినాను. నా దైవం గా నా గురువు గా అమ్మ ఇచ్చిన మట్టి లింగేశ్వర స్వామిని నాటినుండి భావించుకోసాగాను. ఈ అధ్యాయం నుండి ఒకస్త్రీ మూర్తి తన సాధనతో యోగినిగా ఎలా పరివర్తన చెందినదో మా ఇద్దరి అనగా నావి అలాగే జిఙ్ఞాసి అనుభవాల మధ్య దీక్షాదేవి అనుభవాలు కూడా జతకూడుతున్నాయి అని తెలుసుకోండి. మరి అంత దాకా సెలవా మరి. నాకు నిద్ర వస్తోంది. మా ఆవిడకి పరమానందముతో నిద్ర దూరమవుతుంది. మీరు ఏం చేయగలరు కదా. పదండి ముందుకు. నేను ఈ లోపల చిన్న కునుకు తీసి మీతో కలుస్తాను. ఉంటాను. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. నాకు చేసిన శక్తిపాతసిద్ధి వలన అది నామీద ఎలాంటి ప్రభావాలు చూపినదో తెలుసుకోవాలని ఉందా?

గమనిక:

ఈ అధ్యాయము రాసే సరికి మా శ్రీమతి అయినా దీక్షా దేవి సహస్ర చక్ర జాగృతి చేసుకుని శుద్ధి చేసుకోవడం కోసం దీని క్షేత్రమైన మానససరోవర సహిత కైలాస పర్వతానికి చేరుకోవడం జరిగినది.అక్కడ అర్ధరాత్రి పూట నుండి తెల్లవారుజామున ఆకాశం నుండి వచ్చే ఉల్కల రూపంలో ఉన్న కొన్ని దివ్య జ్యోతుల వెలుగులు సరోవరం వైపు దూసుకొని వస్తూ నీటిలో దిగి నీటి శబ్దం చేసుకుంటూ (స్నానాలు చేయడం) మళ్లీ ఆ వెలుగులు ఆకాశం వైపు వెళ్లే విధానము ప్రత్యక్ష అనుభూతిగా చూడాలని అలాగే కైలాస పర్వత దర్శనంతో స్వయంభూ పరమేశ్వర స్వామిని చూడటానికి ఆదేశం రావడంతో అక్కడికి బయలుదేరింది. మరి ఈవిడ కి అక్కడ ఎలాంటి దైవ అనుభవాలు కల్గినాయో కల్గలేదో నేను చెప్పలేను.ఎందుకంటే నాకే తెలియదు. ఆవిడ వచ్చిన తర్వాత ఎలాంటి అనుభవం కలిగినదో తెలుసుకుని మీతో చెప్పటానికి ఎక్కడైనా రాబోవు అధ్యాయాల్లో వ్రాయగలను.ఆ శివయ్య ఎక్కడ వ్రాయమని ఆదేశిస్తే అక్కడ వ్రాస్తాను. ఆయన ఆజ్ఞ లేనిదే చీమ అయినా నడవదు కదా. నేను కూడా ఒక బుల్లి చలిచీమనే కదా. కాదా. మీరే ఆలోచించుకోండి. ఆమె తన సాధనలో ఇంతటి ఉన్నత స్థాయికి చేరింది అంటే మరి నా సాధనస్థాయి ఏమిటో అనే సందేహం మీకు వచ్చినదా?అబ్బా ఆశ దోశ అప్పడం కాదు. నేను ఏ విధంగా నా నా చంక నాకి ఎలాంటి స్థాయికి చేరుకున్నానో మీకు తెలియాలంటే నాతో పాటుగా మీరు కూడా నా ఆధ్యాత్మిక యాత్ర లో ప్రయాణించక తప్పదు. మా శ్రీమతి తన ధ్యానఅనుభవాలు ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేకపోయినా బలవంతంగా నేనే వ్రాస్తున్నాను. ఎందుకంటే అసలు వాళ్ళు యోగ సాధనకి స్త్రీమూర్తులు అసలు పనికిరారని వాళ్ళు తమ యోగ మాయను దాటలేరని చాలామంది యోగ ప్రబుద్ధులు అనుకుంటున్న సమయంలో మా ఆవిడను తన ఇష్ట కోరిక మేర యోగము వైపు మళ్ళించి అనతి కాలంలో ఉన్నత స్థితి వైపు ప్రయాణింప చేసి ఈ లోకంలో దేనికి గూడ స్త్రీ మూర్తులకు పురుషులకు ఎలాంటి భేదం ఉండదని తెలియజేయాలని నా విశ్వ ప్రయత్నం.అలాగే ఆమెకి కల్గిన ధ్యాన అనుభవాలు అలాగే స్త్రీ పరంగా ఆమెకి వచ్చిన యోగ శక్తులు ఎదురైన యోగమాయలను యధాతధంగా మీకు తెలిస్తే రాబోవుకాలంలో ఈమెను చూసి కనీసం పది మంది ఆడపిల్లలు సాధన వైపు దృష్టి పెడతారని ఆశతో ఈ అధ్యాయములో అనుభవాలు వ్రాయడం జరిగింది.మీరు కూడా ఒక ఇష్టకామేశ్వరి దేవి లాగా, అక్కమహాదేవి లాగా, ఒక సతీసక్కుబాయి లాగా, ఒక మీరాబాయిలా వారిలో ఉన్న మోక్షకాంక్ష ను బయటకు తీసి వారిలాగా మోక్షగామి గా మారి మోక్ష ప్రాప్తి పొందడానికిప్రయత్నించగలరు అని ఆశిద్దాం. నేను వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినటానికి వెళుతున్నాను. మరి మీరు నాతో ఈ విషయం లో రాలేరు కదా. కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి. నేను ఆ బజ్జీలు సంగతి చూసి వస్తాను. దానికి ఏదైనా అర్థం కానీ ఆధ్యాత్మిక విషయం వచ్చినప్పుడు నా శ్రీమతి ఇలా నా ఇష్టమైన కోరిక బలహీనతను అడ్డుపెట్టుకుని బజ్జీలు వేసి అవి నా చేత తినిపిస్తూ ప్రేమగా తన ధర్మ సందేహాలు తీర్చుకొంటుంది.మగవాడి బలహీనతలు ఆడపిల్లలకు తెలిసినంతగా బ్రహ్మకే తెలియదు! ఏమంటారు నిజమే కదా! మీకు నా విషయంలో వచ్చిన సందేహానికి డైరెక్టుగా నా సాధన స్థాయి చెప్పటం రాయటం జరిగితే అది ఎక్కడ ఉందో తెలిసిన అర్థంచేసుకునే స్థితిలో మీరు ఉండరు అని నాకు తెలుసు . అలాగే ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితానికి నా స్వానుభవం ప్రకారం చూస్తే పురుష జన్మ కంటే స్త్రీ జన్మ శ్రేష్టమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పురుషులపై ఉన్నంతగా మాయ ప్రభావం స్త్రీ మూర్తిపై ఉండదు.ఎలా అంటే పురుషులు కాలం అంతా గృహ బాధ్యతలతో, ఉద్యోగ బాధ్యతలతో, ధన సంపాదనతో వివిధ రకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. కానీ అదే స్త్రీల విషయానికి వస్తే భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్ కి వెళ్తే వీరికి కావాల్సినంత సమయం ఉంటుంది. పైగా వీరికి బయటకు సంబంధించిన ఉద్యోగ, వ్యాపార, వృత్తి విషయ వాంఛలు అస్సలు ఉండవు. పైగా పూజలు ఎక్కువ చేయడం వలన కావలసిన పవిత్రత అలాగే సత్వగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీరికి విచారణ చేయడానికి కావలసిన సూక్ష్మాతిసూక్ష్మ బుద్ధి అదే వివేక బుద్ధి బాగుగా అభివృద్ధి చెందుతుంది. దీని వలన వీరికి అంటే పురుష సాధకుల కంటే తొందరగా దైవ అనుభవాలు పొందుతారు. అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని కూడా తొందరగా ఆకళింపు చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వివేక బుద్ధి వలన వీరికి సహజసిద్ధంగా ఏకాగ్రత కూడా అలవడుతుంది. నన్ను కూడా ఒక స్త్రీ మూర్తి పరమ గురువుగా చేసినది. దైవ పరంగా చూస్తే వేద మాత గాయత్రి దేవి అయితే వ్యవహారిక పరంగా మా అమ్మగారు గాయత్రి అన్నమాట. నాకు వచ్చిన మంత్రోపదేశం కూడా మహా గాయత్రి మంత్రమే. మరి ఈ లెక్కన చూస్తే స్త్రీమూర్తులు కూడా బ్రహ్మజ్ఞానం మోక్షప్రాప్తి పొందగలరు అని తెలుస్తుంది కదా.

మనస్సులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ఇష్టదైవ మంత్రము మీ తల్లి తండ్రి లేదా ఇంటి పూజారి నుండి లేదా మీ కులదైవం పూజారి నుండి మూడు సార్లు ఆ మంత్రము చెప్పించుకుని మననం చేసుకోండి. ఒకే ఇష్ట దైవాన్ని కొలవండి. ఆ దైవానికి ఒకే నామమును పొందండి. ఆ దైవానికి ఒకే మంత్రంను తీసుకోండి. ఏక కాలంలో పలు కోరికలు కోసం దైవాలను కొలవకండి.ఒక గురువు అలాగే ఒక దైవమును మీరు మనస్పూర్తిగా విశ్వాసంతో నమ్మి ఎంచుకోండి. వారిని ఎన్నటికి మార్చండి. దైవాలను మార్చవద్దు. మీ మనస్సులో మీ ఇష్ట దైవం రూపం ఉండాలి. మీ నాలుక మీద ఆ దైవానికి సంబంధించిన మంత్రం అజప జపం మాత్రమే ఉండాలి. మీ ఇష్ట దైవం లో అన్నిటిని అందరినీ అన్ని దైవాలుగా చూడండి. ఉదాహరణకు మీకు దత్త స్వామి దేవుడైతే శివుడిని చూసినప్పుడు శివ దత్తుడిగా, విష్ణువును చూసినప్పుడు విష్ణు దత్తుడిగా,బ్రహ్మను చూసినప్పుడు బ్రహ్మదత్తుడిగా అమ్మవార్లను చూసినప్పుడు దేవి దత్తుడిగా అదే ఇతర గురువులను చూసినప్పుడు గురు దత్తుడిగా ఒకే దేవుడిలో ఇలా అన్ని రకాల రూపాలను చూడాలి.ఉదాహరణకు ఒక కుండలో నీరు, ఒక గ్లాసులో నీరు,చెంబులో నీరు ఇలా వివిధ రకాల పాత్రలు ఉన్నప్పటికీ వాటిలో ఉండే నీరు ఒకటే కదా. అలా మీ ఇష్ట దైవ స్వరూపంలో మీరు చూడబోయే వివిధ రకాల దేవతల రూపాలు ఒకే విధంగా చూడండి. అదియే మంత్రసిద్ధి అవుతుంది. ఇది సాధించిన కొన్ని నెలలకి స్వయంగా మీ ఇష్ట దైవముఏదో ఒక రూపంలో మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాడు. అలా రప్పించుకునే శక్తి మీ సంకల్పశక్తి మీద మీ అచంచల భక్తి విశ్వాసాలు యోగ భక్తి మీద ఆధారపడి ఉంటుంది అని గ్రహించండి.వేదాలు సృష్టించిన గాయత్రి ఒక స్త్రీ మూర్తి అని తెలుసుకోండి. ఆవిడ ఇచ్చిన బ్రహ్మ జ్ఞానము స్త్రీమూర్తులు ఎందుకు పొందకూడదో ఒకసారి ఆలోచించండి.అది ఎంత హాస్యాస్పదమో ఆలోచించండి. అమ్మ ఇచ్చిన జ్ఞానానికి అమ్మాయిలు ఎందుకు పొందకూడదో ఒకసారి ఆలోచించండి. అన్ని మీకే అర్థం అవుతాయి. మీరు ఎంతటి మాయలో మిమ్మల్ని ఎంతటి మాయ మోహావేశంలో ఉంచినారో మీకే తెలుస్తుంది.తద్వారా మీరు మోక్షగామిగా మారితే నీ మాయ మాయం అవుతుంది. ఈ జన్మ అయినా వృధా కాకుండా జీవన్ముక్తికి ఉపయోగపడుతుంది. ఏమంటారు నిజమే కదా. నిజాన్ని నిజం అని చెప్పటానికి ఒప్పుకోవటానికి నేను ఎవరిని మీరు ఎవరు.

నా మీద ప్రభావాలు:

యుక్త వయస్సు ఉన్నవారు అందరికీ లాగానే నా మీద సినిమాలు, పుస్తకాలు, వీడియోలు, వీడియో గేమ్స్ ప్రభావం చూపడం మొదలు పెట్టాయి. అందరికీ లాగే నడిస్తే నేను ఎందుకు ఇలా ఉంటానో చెప్పండి. ప్రేమదేశం, ప్రేమికుల రోజు, తొలిప్రేమ సినిమాలు నడుస్తున్న కాలంలో నేను వీటితోపాటుగా ఆధ్యాత్మిక సినిమాలు అయిన అన్నమయ్య, యోగివేమన, భక్తతుకారామ్, త్యాగయ్య లాంటి సినిమాలతో పాటు గా ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, గమ్యం, మేము, మాయాబజారు, పరమానందయ్య శిష్యుల కధ ఇలాంటి సినిమాలు కూడా చూసేవాడిని. అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలు, పుస్తకాలు చదివేవాడిని. మీరు ఏమి చూస్తే మాకెందుకు అంటారా! ఒక్క నిమిషం ఆగండి. నాకు దీక్షగురువు చేసిన శక్తిపాతము పుణ్యమా అని మాములుగా చూసే సాంఘిక సినిమాలలో గూడ నాకు ఆధ్యాత్మిత భావాలే కనిపించేవి.నిజగురువు హస్తస్పర్శవలన నాకు ఈ మాయాపూరిత ప్రపంచముకాస్తా పరబ్రహ్మ స్వరూపముగా కనపడే భాగములో నేను చూసిన సినిమాలలో నాకు అంతా ఆధ్యాత్మికమే కనపడేది!అది ఎలా ఉంటుందో మీకు తెలియచెయ్యలనే తపనతో దీనిని వ్రాయడము జరిగినది!నేను చూసిన లేదా చదివిన వాటిలో నాకు ఆధ్యాత్మిక భావాలు కనిపించేవి.నేను అందరి లాగానే సినిమాలు చూసిన వాటిలో నాకు కొత్తగా ఆధ్యాత్మికత కనబడేది. అంతెందుకు సుస్వాగతం( పవన్ కళ్యాణ్) సినిమా చూద్దాం. అందులో ప్రేమికుడు తన ప్రేమకోసం పడే తపన తాపత్రయం ఉంటే అది నాకు ఒక యోగి లేదా సాధకుడికి స్త్రీ వ్యామోహం ఎలా ఉంటుందో చెప్పినట్లుగా అనిపించేది. అంటే నా దృష్టి అంతా నాకు తెలియకుండానే ఆధ్యాత్మికత వైపు వెళుతూ ఉండేది. అలా నేను ఏ సినిమాలో లేదా పుస్తకంలో నాకు ఏమీ భావాలు కలిగిన మీతో చెప్పాలని అనిపించింది అందుకే ఇది వ్రాయటం జరిగింది.

అన్నమయ్య (నాగార్జున): ఈ సినిమా అంతా ఆధ్యాత్మికమే. అందులో మాకు సృష్టి చేయడానికి తల్లిదండ్రులు పడే వ్యధ, ధన కాంత అనే మాయలు, మరదళ్ళును వదిలించుకున్న సాధకుడు ఒక నిజ భక్తుడికి ఏమి కావాలో ఏమి వదిలించుకోవాలో ఏమి పొందుతాడు. దైవానికి భక్తునికి మధ్య అనుబంధం ఎలా ఉంటుందో, కీర్తి ,ధన, కాంత వ్యామోహాలలో పడితే సాధకుడికి వచ్చే కష్ట నష్టాలు సుఖభోగాలు ఎలా ఉంటాయో, తన భక్తితో ఇష్టదైవమే వచ్చి తన మాయా మోహం లో ఎలా పడతాడో, ఆయనకు సేవలు చేయాల్సిన చోట ఆయన సేవలు ఎలా చేస్తాడో, తన భక్తుని కోసం ఒక దైవము ఏ విధంగా తపన తాపత్రయం పడతాడో నాకు కనబడింది. మీకు ఇలాగే కనబడినదా లేదు కదా! ఇలాంటి రివ్యూలెక్కడా కూడా చదివి ఉండరు కదా.

పరమానందయ్య శిష్యుల కథ( రామారావు): ఈ సినిమాలో నాకు ఒక అంశం బాగా నచ్చింది. అదేమిటంటే అప్పటిదాకా ఒక స్త్రీమూర్తిని కామ దృష్టితో చూసిన వక్షస్థలంలో శివలింగ ఆరాధన సమయం కల్లా హీరో కి కాస్త ఆ వక్షస్థలంలో శివలింగము చూడటం దానినే పూజించటం ఎందరికి సాధ్య పడుతుందో ఒక్కసారి ఆలోచించండి.అలాగే మానసికంగా కూడా స్త్రీ భావనలు చెయ్యని రుషులకు కూడా శాపాలు రావడం చూస్తుంటే సాధకుడు ఎంతటి జాగ్రత్తగా ఉండాలో తెలిసినది. అలాగే క్రమం తప్పని,వేళ తప్పని శివ పూజ చేస్తే ఎలాంటి పూజా ఫలితం కలుగుతుందో తెలిసినది. పూజకు కావలసినది దేహశుద్ధి కాదని మనస్సు శుద్ధి ప్రధానమని అందుకే స్త్రీ వక్ష స్థలము ఒక లింగమూర్తిగా భావించుకుని కథానాయకుడు చేసిన పూజ కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు కి చేరిన విధానం చూస్తుంటే నాకు అర్థమైనది.

ఆ నలుగురు (రాజేంద్రప్రసాద్): ఈ సినిమాలో కుటుంబ బంధాలు ఎలా ఉంటాయో చెప్పటం జరిగినది. వాటిని కేవలం బాధ్యతగా నిర్వహించాలని లేదంటే వారిని ప్రేమించిన లేదా మోహించిన లేదా వారి యందు ప్రేమ ఆప్యాయతలతో వ్యామోహం చెందితే ఆ తండ్రి పడే తపన కష్టాలు ఎలా ఉంటాయో తెలిసినది.వేటియందు కూడా అతిగా ఉండరాదని కేవలం బాధ్యతగా సాక్షిభూతంగా ఆధారభూతంగా చూడాలని తెలిసినది.

యోగివేమన( నాగయ్య): ఈ సినిమా ద్వారా సాధకుడికి స్త్రీ వ్యామోహంలో పడితే వచ్చే బాధలు, రసవిద్య ద్వారా బంగారం తయారు చేసి బైరాగి గా మారటం, తన అన్నయ్య కూతురు చనిపోతే స్మశాన వైరాగ్యం కలగటం, గురూపదేశము ద్వారా సిద్ధి పొందటం, సిద్దులయందు కూడా ఎలా వైరాగ్యం కలిగి ఉండాలో చెప్పటం, నిజమైన బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటాడో ఎలా తింటాడో ఎలాంటి తత్వాలు చెబుతారు వివరంగా చూపించడం జరిగింది.

ఘోర(ఏయన్నార్): ఈ సినిమాలో భక్తి పారవశ్యం ఎలా ఉంటుందో, భార్యల విరహవేదనలు ఎలా ఉంటాయి. నిజ భక్తుడికి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు, అహంకారం పోయిన భక్తుడు నామ దేవుడికి బుద్ధి చెప్పడం, యోగ శక్తులు ఎలా ఉంటాయో జ్ఞాన దేవుడు ద్వారా చూపించటం, నిజ గురువు ఎలా ఉండాలో చూపించటం చాలా బాగుంది.

భక్త తుకారాం(ఏయన్నార్): ఈ సినిమాలో ఒక సాధకుడు తన నిజ భక్తి లోకి ప్రవేశించినప్పుడు వచ్చే కష్టాలు, మాయలు,మర్మాలు, కీర్తి, పరస్త్రీ వ్యామోహం పరీక్షలు, ఇతరుల అసూయ ద్వేషాలు, కుటుంబ బాధ్యతలు, తపన, తాపత్రయం, స్పందన లేని స్థితి ఎలా ఉంటుందో నాకు తెలిసింది.

విప్రనారాయణ(ఏయన్నార్): ఎంతటి మహా భక్తుడైన రవ్వంత స్త్రీ వ్యామోహం కలిగితే వచ్చే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అలాగే నవ విధ భక్తి విధానాలలో అర్చన భక్తి ఎలా ఉంటుందో కూడా గ్రహించాను.

అభినందన( కార్తీక్): ఒక స్త్రీని ప్రేమిస్తే వచ్చే ప్రేమ విరహ వేదన ఎలా ఉంటాయో ఈ సినిమా పాటల ద్వారా చాలా తెలుసుకున్నాను.

సంసారం ఒక చదరంగం (గొల్లపూడి): ఉమ్మడి కుటుంబంలోని కష్టనష్టాలు వారి మధ్య ఏర్పడే సున్నిత భావాలు,సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడం జరిగినది.

ప్రేమిస్తే( భరత్): కులాంతర వివాహం చేసుకుంటే ఆ ప్రేమికులకి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాను.

దీర్ఘ సుమంగళీభవ( రాజశేఖర్): భార్యాభర్తల సంసార జీవితం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేను తెలుసుకున్నాను.

బాబా( రజినీకాంత్): ఒక యోగి సాధనలో సిద్ధులు వచ్చినప్పుడు వాటిని తన స్వార్ధానికి ఉపయోగించకుండా లోకకళ్యాణార్థం ఎలా ఉపయోగించాలో సిద్ధులు వచ్చినా కూడా అహం లేకుండా తన సహజ స్థితి లో ఎలా ఉండాలో హిమాలయ గురువులు ఎలా ఎక్కడ ఏ రూపంలో ఉంటారో తెలుసుకున్నాను. అరుణాచలం(రజనీకాంత్): విపరీతమైన ధనకాంక్ష కలిగి ఉంటే అధిక ధనం వస్తే వచ్చే కష్టనష్టాలు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకున్నాను.

ముత్తు( రజనీకాంత్): యజమాని అయిన సేవకుడు ఎలా ఉంటాడు. వివిధ రకాల వ్యామోహంలో పడి వైరాగ్యం చెందిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకున్నాను.

మాతృదేవోభవ: ఒక తల్లి ప్రేమ బంధం దాని విలువ ఏమిటో తెలుసుకున్నాను.

దశావతారాలు( కమలహాసన్): ఒక వ్యక్తి ఏ విధంగా పది అవతారాలు ఎత్తితే ఎలా ఉంటుందో ఈ సృష్టిలో ఏకైక ఆత్మ కూడా అలాగే వివిధ దైవ,జీవ స్వరూపాలలో విశ్వాత్మ గా ఉండి జీవాత్మగా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను

ఇలా చెప్పుకుంటూ పోతే నేను చూసిన సుమారుగా 200 సినిమాలు పైగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపి వేయడం జరుగుతుంది.

ఇక పుస్తకాల విషయానికి వస్తే:

జయం (మల్లాది వెంకట కృష్ణమూర్తి): యోగ సాధకుడు అంటే ఎవరు? ఎలా సాధన చేయాలి? సాధన చేస్తే వచ్చేసిద్ధులు స్థితులు, పరిస్థితులు చదివి నేను కూడా ఎలాగైనా యోగి గా మారాలని నిశ్చయించుకున్నాను .దీని ఫలితమే ప్రస్తుతం మేము జ్ఞాన యోగిగా మౌనముగా మారడం జరిగినది.

పురాణపురుష( శ్యామా లాహిరి): ఈయన సాధన అనుభవాలు చదివిన తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా నిజమేనని నమ్మకం కలిగినది. ఆయనకి లాగానే నేను కూడా డైరీలో రాసుకోవడం మొదలు పెట్టినాను. ఈ డైరీల ఫలితమే యోగ దర్శనం గ్రంథము,కపాల మోక్షం గ్రంథం రాయటం జరిగినది.

నీ సహజ స్థితి లో ఉండు( రమణ మహర్షి): సాధన లో ఉన్నప్పుడు సాధకునికి వచ్చే సాధన సందేహాలు సాధన స్థితి అనుభవాలు మౌనబ్రహ్మ స్థితి పొందిన వారి అనుభవాలు చదువుతున్నప్పుడు మేం కూడా ఇలాంటి పరిస్థితి ఎలాగైనా ఎప్పుడైనా పొందాలని నిశ్చయించుకోవటం జరిగినది. కొన్ని సంవత్సరాలకి దానిని పొందడం జరిగినది.

గీతామకరందము( విద్యాప్రకాశానందగిరి): ఈ గ్రంథం చదివితే 18 రకాల యోగాల స్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది.

ఋభు గీత( రమణ మహర్షి): బ్రహ్మ తదాకార స్థితి ఎలా ఉంటుందో తెలిసింది. నిజ సమాధి స్ధితి పొందినవారి స్ధితి ఎలా ఉంటుందో తెలిసినది!

దత్త గురువుల చరిత్ర: దత్త స్వామి, శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్ కోట స్వామి. షిరిడి సాయిబాబా, తాజుద్దీన్ బాబా మహారాజ్, ధునివాలా బాబాజీ, టెంబే స్వామి, శ్రీత్రైలింగ స్వామి ఇలా వీరి చరిత్రలను చదవటం వల్లే నిజ గురువులు అంటే ఎవరు? ఎలా ఉంటారు?ఎలా ఉండాలో తెలిసినది. నేను కూడా ఎప్పటికైనా ఇలాంటి స్థాయికి చేరుకోవాలని అనుకున్నాను. పరమ గురువుగా మారిపోయాను. సాధన అంటే ఏమిటో తెలియని నా చేత సరికొత్త సాధన విధానం పవనానంద నవబ్రహ్మ యోగము,శూన్యబ్రహ్మ యోగ సిద్ధాంతము విధి విధానము జ్ఞాన అనుభవ అనుభూతులు తెలుసుకొని రచన చేయడం జరిగినది.

అధినేత( రమేష్ చంద్ర మహర్షి): ఒక వ్యక్తి ఎలా కాలంలోని అన్ని డైమన్షన్స్ కి వెళ్ళవచ్చునో దీనిని చదివిన తర్వాత తెలిసింది. అప్పుడు దీనిని చదువుతున్నప్పుడు ఒక కథలా తోచిన ఇప్పుడు అది కథ కాదని నిజమేనని నా సాధనలో కాలచక్ర స్థితికి వచ్చినప్పుడు 46 డైమన్షన్స్ లో 14 డైమన్షన్స్ కి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది.

యోగుల చరిత్ర: శ్రీ రామకృష్ణ, శారదా దేవి,వివేకానంద, భక్తతుకారం, నామ దేవుడు,జ్ఞాన దేవుడు, నిత్యానంద బాబా( గుజరాత్), శ్రీ చంద్రశేఖర సరస్వతి యోగులు,ఒక యోగి ఆత్మకథ ఇలా ఎందరినో జీవిత చరిత్రలు చదవడం జరిగినది.ఉత్తేజం పొందడం జరిగినది. ఎలాగైనా యోగి కావాలని నిశ్చయించుకోవటం, యోగి కావాలని యోగం ఉంటే అవ్వక తప్పదు.

తాంత్రిక ప్రపంచం( శ్రీ సిద్దేశ్వర స్వామి): ఇందులోవామాచార, దక్షిణాచార విధి విధానాలు, వివిధ తాంత్రిక విధానాలు ఎలా ఉంటాయి. చేస్తే ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో తెలుసుకున్నాను.చేసి ఇబ్బందులు పడ్డాను.

మంత్ర పుస్తకాలు: శ్రీ లలితా దేవి సహస్ర నామాలు భావాలు తెలుసుకొని సాధన అంటే ఏమిటి? దాని స్థితులు పరిస్థితులు షట్చక్రాలు అంటే ఏమిటి? దాని స్థితులు ఏమిటో అవి బలహీన పడితే ఏమి నైవేద్యాలు తినాలి? మణిద్వీప వర్ణన తెలుసుకున్నాను. మా సాధనలో ఇవి అన్నియు కూడా అక్షర సత్యమని తెలుసుకోవడం జరిగినది. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం ఎలా సాధకుడు ఉండాలో తెలుసుకున్నాను.అర్గళా స్తోత్రం ద్వారా మన హృదయంలోనికి మాయలు,మర్మాలు, కోరికలు, బంధాలు రాకుండా ఎలా నిరోధించుకోవాలో తెలుసుకున్నాను. నిత్య గాయత్రి మంత్రం అనుష్టానం వలన వచ్చే స్థితులు, సిద్ధులు, శక్తులు 24 అస్త్రాలు 24 దేవతల శక్తులు 24 గురువుల అనుగ్రహం గురించి తెలుసుకోవడం జరిగినది.

ఇలా నేను చదివిన పుస్తకాలు గురించి 477కు పైగా చెప్పవలసి ఉంటుంది. అందువలన కొంతమేర వీటిని గురించి చెప్పడం జరిగినది. యోగ సాధన కి ఉపయోగపడే పుస్తకాల జాబితాను ఉపయుక్త గ్రంధాలు పేరుతో ఇవ్వడం జరిగినది. వాటిని చూడండి. చదవండి. స్ఫూర్తి పొందండి.ఏదో ఒకటి సాధించండి. అప్పుడే ఆ పుస్తకాలు రచించిన మాలాంటి గ్రంథకర్తలకు ఉత్సాహం కలుగుతుంది. మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని కొత్త గ్రంథాలు రాసే అవకాశం కలుగుతుంది.తద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు మీకు కలుగుతాయి. పుస్తకాలు చదవండి. జ్ఞానము పెంచుకోండి. ఆధ్యాత్మికమైన, సాంఘికమైన, నవలైనా ఏదో ఒక దానిని చదవటం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా అందులో మీకు తెలియని ఏదో ఒక విషయం ఉంటుంది. దానిని తెలుసుకోండి. జ్ఞాన స్ఫూర్తి పొందండి.

ఇపుడు మన జిజ్ఞాసి పారిపోయినాడని...అదే తన నిజ గురువు కోసం వెళ్ళిపోయినాడని ఈపాటికే తెలుసుకున్నారు గదా!ఆరు నెలలు తర్వాత తన తల్లి కోరికమేర కాశీ నుండి ఇంటికి తిరిగి వచ్చినాడు!నాతో మాట్లాడటానికి వచ్చినాడు!వాడిని చూస్తే బాధవేసినది!దర్జగా సూట్ బూట్ లో ఉండవలసినవాడు ...చిరిగిపోయిన కాషాయవస్త్రముతో...చాలా ఓత్తుగా పెరిగిన గడ్డముతో,చింపిరి జుట్టుతో... బాగా పీక్కుపోయిన మొహముతో...కాని కళ్ళలలో ఏదో తెలియని ఒక విధమైన సమ్మోహనశక్తితో నాకు ఎదురుపడినాడు!మాటలలో నిదానం...చూపులలో ప్రశాంతత...నిర్మల మనస్సుతో..ఆవేశము,అహంలేని స్ధితిలో తన అనుభవాలు నాతో పంచుకోవడము ఆరంభించినారు.మరి మీరు గూడ వినాలంటే ఏమి చెయ్యాలో మీకు తెలుసు కదా!

కపాల మోక్షం - 46-భయపెట్టే భక్తుడు

నాకు నా ప్రారంభ సాధనలో కాపాలికుడు దర్శనం అయినట్లుగా కపాల భోజనం అనే అధ్యాయంలో ఇప్పటికే మీరు చదివి ఉన్నారు కదా. అలాగే తనకు నిజ గురువు దర్శనం కోసం అవిముక్త క్షేత్రము అయిన కాశీ క్షేత్రమునకు నా యోగ మిత్రుడైన జిజ్ఞాసి చేరుకున్నాడని మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు అతను నిజ గురువు కోసం ఈ క్షేత్రము నందు సుమారు ఆరు నెలల పైన ఉన్నాడు. అనుకోకుండా ఒక రోజు ఇతనికి అర్ధరాత్రి పూట మణికర్ణికా ఘాట్ నందు వయోవృద్ధులుగా ఉన్న నిజ అఘోర సాధకులు కనిపించారు. వాళ్ల మాటల్ని బట్టి ఈరోజు అమావాస్య కావటంవలన స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఘాట్ నందు అర్ధరాత్రి పూట అఘోర సాధన చేస్తారని దానిని చూసే మనోధైర్యం కానీ, చూసే భాగ్యం కానీ అందరికీ దొరకదని, ప్రాణం మీద ఆశ వదిలేసిన కోటి మంది జీవులలో ఏదో ఒక జీవుడికి మాత్రమే దక్కుతుందని మన వాడు విన్నాడు.ఒకవేళ తనకు నిజ గురువు దొరకకపోతే ఈ క్షేత్రంలోనే శరీరత్యాగం చేసుకోవాలని ముందుగానే నిశ్చయించుకొని రావడంతో అది ఏదో ఈ అఘోర సాధన చూసి ఆపై నిజ గురువు దొరకకపోతే శరీరత్యాగం చేయవచ్చు కదా అని నిర్ణయించుకున్నాడు. ఇంతలో అక్కడ ఉన్న అఘోర సాధకులు అంతా మౌనంగా ఈ ఘాట్ వదిలి వెళ్ళి పోవడం ప్రారంభించినారు.

అక్కడ ఎవరూ లేరు. కాలుతున్న శవాలు తప్పితే. వెంటనే మన జిజ్ఞాసి అక్కడే ఉన్న కట్టెలమోపు వెనకాల నక్కి అఘోర సాధన చేసే అఘోరమూర్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో సమయం అర్ధరాత్రి గావస్తుంది.కీచురాళ్ళ రొద వినిపిస్తోంది. దూరం నుంచి కుక్కల అరుపులు రోదనగా వినబడుతున్నాయి. గబ్బిలాల శబ్దాలు, గుడ్లగూబ శబ్దాలు వినబడుతున్నాయి. ఇవి కూడా జరగబోయే ఈ తాంత్రిక కార్యక్రమం చూడటానికి మన జిజ్ఞాసితో పాటుగా ఎదురు చూస్తున్నాయి. అక్కడికి కపాలమాలలు ధరించి ఒక చేతిలో మానవ ఎముక ధరించి చూడటానికి భయంకరంగా బీభత్సంగా ఉన్న వ్యక్తి ఈ ఘాట్ యందు ప్రవేశించినాడు. చుట్టూ చూశాడు. అక్కడ అప్పుడే కపాలం పేలిన 'ఠఫ్' మని శబ్దం వినబడిన శవాగ్ని దగ్గరికి చేరుకొని ఇతను చుట్టూ చూస్తూఎవరూ లేరని నిర్ధారించుకుని “ఓం నమశ్శివాయ” అంటూ మండుతున్న శవ చితి నుంచి తగలబడుతున్న ఆ శవం యొక్క ఒక కాలి తొడని బయటికి తీశాడు. దానిని గదలా భుజం మీద పెట్టుకుని ఈ ఘాట్ మధ్య ఖాళీ ప్రదేశమునకు చేరుకున్నాడు.అప్పుడు తన సంచిలో నుంచి ఒక చిన్న రేకు డబ్బాను బయటికి తీసి అందులో నుంచి నల్లటి బొగ్గుపొడి, తెల్లటి ముగ్గు, ఎర్రటి కుంకుమ, పసుపు పొడి బయటికి తీసి బొగ్గుతో నేలమీద అష్టదళ పద్మము ఒకటి గీసి దానిమీద పసుపు కుంకుమలు వేసి అందులో సంస్కృత భాషలో బీజాక్షరాలు వేసి ఒకయంత్రం లాగా గీసినాడు. అప్పుడు ఈ యంత్ర మధ్యభాగంలో చితుకులు పోపు గా చేసి అగ్ని స్థాపన మంత్రాలు చదవడం ప్రారంభించినాడు. వెనువెంటనే చితుకులు వాటి అంతట అవే మండటం ఆరంభించాయి. నిమిషాలలో ఒక పెద్ద మంటగా రాజుకుంది. ఆ తర్వాత ఓ మనిషి కపాలం తీసుకొని దానిమీద ఒక మనిషి ఎముక నుంచి దానిని ప్రమిదలా చేసి అందులో మనిషి కొవ్వుతో దానిని వెలిగించడం మన జిజ్ఞాసి చూసేసరికి నెమ్మది నెమ్మదిగా మన వాడిలో భయం తాలూకు సూచనలు మొదలయ్యాయి. ఆపైన తను తెచ్చిన గదలాంటి మనిషి తొడ ఎముకను గుండ్రముగా అప్రదక్షిణంగా గాలిలో త్రిప్పుతూ "ఓం రక్త చాముండాయై నమః ,ఓం హ్రీం స్మశాన భద్రకాళ్యై నమః,ఓం హ్రీంకపాల మాలికాయై నమః,ఓం హ్రీం స్మశాన మాతంగియై నమః,ఓం ఠం ప్రత్యంగిరా భూతధాత్రై నమః అంటూ భయంకరమైన తాంత్రిక దేవతలను ఆవాహన చేస్తూ మానవ చర్మంతో చేసిన చర్మ ఆసనం మీద కూర్చుని అప్పుడే మనిషి పుర్రెలో పట్టిన మానవ రక్తంను తన ముందు ఉంచుకొని చిన్నపాటి పుర్రెల దంతాలమాల మెడలో వేసుకుంటూ చితి మీద ఉన్న బూడిదను విభూతి రేఖలుగా శరీరమంతా పూసుకొని నగ్నంగా మారి తన భుజంపై వ్రేలాడుతున్న కొమ్ము బూరను ఒక పెద్ద సింహగర్జన లాగా నాలుగు దిక్కుల వైపు తిరిగి పూరించాడు.ఈ శబ్దానికి స్మశానం ఘాట్ చుట్టూ ఉన్న గ్రద్దలు, గుడ్లగూబలు, రాబందులు, పక్షులు సందడిగా ఈ సాధకుడు ముందున్న శవం చుట్టూ వాలినాయి. ఆ తర్వాత అక్కడికి కుక్కలు, నక్కలు చేరడం మొదలయింది. ఇంతలో అతను పెద్దగా మంత్రాలు చదువుతూ మరణించిన వారి ప్రేతాత్మలను పిలుస్తూ అప్పుడు వాటిని ఆహ్వానించసాగినాడు.

అప్పుడు అక్కడికి చేరిన వారిని సంతృప్తి పరచడానికి ఇతను తాండవ నృత్యం చేస్తూ అప్పుడప్పుడు తను తెచ్చుకున్న కల్లు త్రాగుతూ తన చేతిలో ఉన్న మానవ తొడ ఎముక తో తన శరీరమును బాధ పెట్టుకో సాగినాడు. మధ్యమధ్యలో మనిషి కపాలంలో ఉన్న రక్తం త్రాగుతూ కొంత వంటికి పూసుకుంటూ తన శరీరం నుండి కారే రక్తం పట్టుకుంటూ తన శరీరం నుంచి కొంత కొంత మాంసం ముక్కలు గా కోసి అక్కడున్న పక్షులకు భూతాలకి భూత బలిగా వేయటం ప్రారంభించేసరికి జిజ్ఞాసికి నెమ్మదిగా కళ్లు తిరగటం ఆరంభించాయి. నెమ్మదిగా ఏదో తెలియని మగత నిద్ర ఆవహించడం గమనించాడు. అయినా కూడా బలవంతంగా కళ్ళు తెరుచుకొని భయంతో, ఆవేదనతో, బాధతో, జరగబోయే తంతును చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తన ప్రమేయం లేకుండా బలవంతంగా కళ్ళు మూతలు పడుతున్నా తెరుచుకొని చూడటం ఆరంభించాడు. ఇవేమీ పట్టించుకోని అఘోరమూర్తి మైకం లాంటి తన్మయత్వంతో భయంకరమైన తాండవ నృత్యం చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ శివతాండవం చేస్తున్నాడు.ఇంతలో అతను అక్కడ తన ప్రక్కనే ఉన్న తెల్లని గుడ్డ ఒక ముసుగు తొలగించగానే అందులో నిద్రపోతున్న నగ్న స్త్రీ మూర్తి మన వాడికి కనిపించినది. అప్పుడు ఈ అఘోర మూర్తి వెంటనే ఆమెను తన చేతిలో ఉన్న మానవ ఎముక తో గట్టిగా బాది ఆమెను బలవంతంగా చేసే తను చేసే పూజ దగ్గరికి బర బరా లాక్కొని వచ్చి ఆమె నోటిలో మానవ రక్తం అలాగే బలవంతంగా కల్లు పోస్తూ ఉండేసరికి మన వాడికి వీరావేశము మొదలైంది. వీడి అమాయక పిచ్చిలో ఆమెను ఏమిచేస్తాడో అనుకునేలోగా ఆమె తల మీద తన ఎముకతో దడేలు అంటూ బాదటం ఆపై ఆమె కాస్త విపరీతమైన బాధతో ఆర్తనాదం చేయడం అటుపిమ్మట వీడు ఆమె కాళ్లు పట్టుకొని మెరుపులా ఆకాశంలో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టడం ఏకకాలంలో జరిగిపోయాయి.

మన వాడికి అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్ధమయ్యే లోపలే నేల మీద నేలకేసి ఈమెను కొట్టిన చోట ఆ శవము బదులుగా భగ్గున జ్వాల వంటిది రావటం ఆపై ఈ ఘాట్ అంతా కూడా తెల్లని పొగతో వ్యాపించటం, పొగ మధ్యలో అనగా అష్టదళ పద్మము నందు మూడు ముఖాలతో రుద్రాక్షమాలలతో వివిధ చేతులతో ఆయుధాలతో నాలుగు కుక్కలతో ఉన్న ఒక దివ్య పురుషుడు లీలా మాత్రుడిగా కనబడటం ఇంతలో ఒక మహా శంఖ ధ్వని ఆపై దిక్కులు మారుమ్రోగేల వెనకనుంచి ఏవో వేదమంత్రాలు వేదపండితులు చదువుతున్నట్లుగా శ్రావ్యంగా వేద ఘోష వినిపించేసరికి ఈ దివ్య పురుషులు మన దత్తాత్రేయస్వామి లాగా ఉన్నాడని మన జిజ్ఞాసికి స్ఫురణ వచ్చి ఆయనను దర్శించుకునే లోపలే మన వాడికి అమితమైన మగత నిద్ర ఆవరించింది. ఆ తర్వాత మన వాడికి మూడు రోజుల తర్వాత గాని మగత నిద్ర నుంచి మెలకువ రాలేదు. నిద్ర లేచిన తర్వాత తను చూసిన దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని వాటిని కాగితం మీద రాసుకుని ఈ విధంగా దత్తాత్రేయ దర్శనం అయినందుకు ఆనందపడుతూ ఖచ్చితంగా తనకి నిజ గురువు అనుగ్రహం ప్రాప్తి కలుగుతుందని ఆనందపడుతూ అక్కడే ఉన్న గంగానదిలో స్నానం చేయడానికి బయలుదేరినాడు. ఇంతకీ మన వాడికి నిజ గురువు దొరికినాడో లేదో తెలుసుకోవాలంటే ....

రోడ్డు మీద ముగ్గురు అమ్మల దర్శనము

(జిఙ్ఞాసి గురు దర్శనం):

నిజ గురువు కోసం మా జిఙ్ఞాసి కాస్త మహిమాన్వితమైన కాశీ క్షేత్రమునకు చేరుకొని మణికర్ణికా ఘాట్ కి చేరుకొని అఘోర దత్తత్రేయస్వామి చేసే అఘోర సాధన విధానము చూసినారని ఇంతకు ముందు అధ్యాయములో తెలుసుకున్నాము గదా!ఇపుడు వారి మాటలలోనే తనకి నిజగురుదర్శనప్రాప్తి ఎలా కలిగినదో విందాం!. ఈసారి కూడా నిజ గురువు దొరకకపోతే ఘాట్లోని చితాగ్నిలో చనిపోవాలని కృత నిశ్చయించుకొని శివ పంచాక్షరి మంత్రము మహా మంత్రము శ్రద్ధగా చేయటం ప్రారంభించాడు. ఇలా దాదాపుగా మూడు గంటల పైన అయినది. ఎవరో ఒకాయన ఈ ఘాట్ నందు మధ్యాహ్న గంగా స్నానము చేయటానికి రావడంతో మన వాడి దృష్టి ఈయన మీద పడటంతో ధ్యాన భంగం అయినది. ఆయన యధావిధిగా స్నానం చేసి బయటకు వస్తుంటే ఇంతలో ఎవరో ఆయన దగ్గరికి వచ్చి దేని గూర్చో చెప్పగానే ఈయన వెంటనే తన చేతికి ఉన్న ఒక బంగారపు ఉంగరం ఇచ్చివేయడం చూసేసరికి మా జిజ్ఞాసి ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. ఆయన మాత్రం ఇవేమి పట్టించుకోకుండా కొంతసేపు ధ్యానం చేసుకుని బయలుదేరి వెళ్ళి పోతూ మా వాడి వైపు ఒక క్షణం పాటు తీక్షణంగా చూసి “ నువ్వు ఎవ్వరివి అని వెతక్కుండా ఇలా నది ఒడ్డున కూర్చుంటే ఏమీ లాభం లేదు రా! నువ్వు ఎవరివో నువ్వే తెలుసుకోవాలి. అందుకు సాధనలో ప్రయత్నించాలి” అనగానే వెంటనే మన వాడు ఆశ్చర్యం చెందుతూ నా మనస్సులో ఉన్న సందేహం నేను అడగకుండానే చెబుతున్నారంటే ఈయన నిజంగా గురువు అయ్యి ఉండాలి అనుకుంటూ “స్వామి! మీరు ఎవరు?” అనగానే దానికి ఆయన వెంటనే “నేను నేనే. పంచ భూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువులో అంతర్లీనంగా నేనే ఉన్నాను. నేను లేనిది నేను కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. సకల సృష్టికి గురు స్వరూపం కూడా నేనే” అని చెప్పగానే మన వాడికి విషయం ఏమిటో అర్థమైంది. వెంటనే “అయితే అన్ని నీవే అయినప్పుడు ఈ లోక జీవులకు కష్టసుఖాలు ఎందుకు కలుగుతున్నాయి” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన వెంటనే “నీలోను నేనే ఉన్నాను.నీలో ఉన్న నేను జీవుడు రూపం లో ఉన్నాను. కానీ నేనే అనే అహం మాయ లో ఉన్నాను. అలాగే ఈ జీవుడు రూపంలో నేను కాని నేనుగా నేనే ఈ పరమాత్మ రూపంలో జీవుడి హృదయ కమలంలో ఉన్నాను. కానీ తనకున్న జీవ మాయ వలన నేను అనేది నేను కానీ నేనును గుర్తించడం లేదు. ఇలా నేను అనే భావన ఉన్నంత వరకు జీవాత్మగాను పరమాత్మ అనే భేదభావంతో కనిపిస్తాను.తద్వారా జీవాత్మగా ఉన్నంతవరకు ఈ కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటాను.కానీ ఆ నేను అన్న భావన తొలగిపోతే నీవే నేనుగా మారిపోతావు. నాకు లాగే సచ్చిదానంద స్వరూపుడుగా ఉండిపోతావు. పద నాయనా! నీకు తారకరామ మంత్రోపదేశం చేస్తాను” అంటూ మన జిజ్ఞాసను గంగ లోకి తీసుకుని వెళ్లి తారక రామ మంత్రం ఉపదేశం చేసిన తర్వాత ఆయన కాస్త గంగా నీళ్ళలోనే అంతర్ధానమయ్యారు.బహుశా ఇలా ఈయన రూపంలో నడయాడే కాశీ విశ్వనాథ్ శ్రీత్రైలింగ స్వామి వారే వచ్చి వీడికి గురుమంత్రం ఉపదేశం చేసి ఉంటారని వాడి అనుభవం చెబుతుంటే నాకు ఈయన సద్గురువుగా వస్తే...మన వాడికి మంత్రగురువుగా రావడము జరిగినదని మాకు అర్థం అయినది. ఇలా ఆయన ఒక్కరే ఈ కాశీక్షేత్రంలో ఇప్పటికీ సశరీరంలో సంచారం చేస్తూ అవసరమైన వారికి అవసరమైన వాటిని ఇస్తూ నిత్య సత్యుడుగా తిరుగుతూనే ఉంటున్నారని కాశీ వాసులు అనేక సత్య అనుభవాలు కోకొల్లలుగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఆయన ఇచ్చిన మంత్రము మనవాడు నిత్యము చేసుకుంటూ మూడున్నర సంవత్సరాల తర్వాత శ్రీరామ సాక్షాత్కారము పొంది ఆపై ఈ మంత్ర దేవత ఇచ్చే అన్నిరకాల సిద్ధులు మాకు లాగానే (గాయత్రి మాత సిద్ధులు) పొంది వాటిని నానా కష్టాలు పడి వదిలించుకుని అదుపులో ఉంచుకున్నాడు.

శ్రీరామ సాక్షాత్కారం అనుగ్రహం వలన దీక్ష గురు వివరాలు తెలుసుకొని శ్రీశైల క్షేత్రమునకు బయలుదేరినాడు. క్షేత్రానికి చేరుకొని మెట్ల మార్గంలో పాతాళ గంగ చేరుతున్న సమయంలో లింగాల గుట్ట ప్రాంత గుడి పరిసరాలలో ఒక వ్యక్తి చేసే పూజ వీడి దృష్టిలో పడింది. ఈయన చూస్తే నల్లటి వస్త్రాలు ధరించి కాపాలికుడు గా ఉండి చేతిలో కపాలం పెట్టుకుని ముందు వైపు బాలాదేవి విగ్రహం ఆరాధన చేస్తున్నట్టుగా అగుపించింది. దక్షిణాచారంలో ఉన్నబాల దేవతను వామాచారంలో ఇలా ఎందుకు చేస్తున్నాడు అర్థం అవ్వక ఆ స్వామిని అసలు విషయం అడుగుదామని అనిపించి అడిగే ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఈ కాపాలిక స్వామి వీడు వైపు తిరిగి “ఆచారాలు లేని వారితో నీకు ఏమి పని. నువ్వు వచ్చిన పని చూసుకో. గంగలో దూకి శరీర శుద్ధి చేసుకో.ఆత్మశుద్ధి ఉన్నవాడికి ఆచార వ్యవహారాలతో పని ఉండదు. దేహశుద్ధి ఉన్నవాడికే ఆచారవ్యవహారాలు కావాలి. నాకెందుకు ఆచారాలు. ఆత్మశుద్ధి కోసం చేసే ప్రయత్నంలో ఉన్నాను. నువ్వు చూస్తే నాకు లాగానే అటూ ఇటూ కాకుండా నీ మనస్సులో ఉన్నావు. కాశీ క్షేత్రంలో దేహశుద్ధి మంత్రమును పొందిన తృప్తి చెందలేదా!.ఇప్పుడు ఆత్మశుద్ధికై బయలుదేరినావా” అనగానే మన వాడికి కథ అంతా అర్థమైనది.

తనకు దీక్ష గురువు తానే అయి ఉంటాడని బలం గా అనిపించసాగింది. కానీ ఎందుకో తెలియని ఏదో మూల అసంశయ బుద్ధి వలన సందేహంగా ఉంది. ఏమి చేయాలి అనుకుంటూ “స్వామి! మీరు చూస్తుంటే అమ్మవారి ఉపాసకుడు గా కనబడుతున్నారు. మరి మీకు అమ్మ దర్శనం అయినదా! నాకు దర్శనం ఇప్పించగలరా” అని అన్నాడు. దానికి ఆయన పెద్దగా నవ్వుతూ “పిచ్చోడా! అమ్మ లేని చోటు ఉందా! అమ్మ కనిపించని రేణువు ఉందా! చూసేవాడు ఉంటే అమ్మ కనిపించకుండా ఉంటుందా! అయితే అక్కడ రోడ్డు మీద చూడు. బాలమ్మ, త్రిపురమ్మ, సుందరి అమ్మ వెళ్తున్నారు. ఏకకాలంలో త్రి మాతలను చూసే అదృష్ట జాతకుడివిరా! అటు చూడు. అమ్మలను చూడు. అనగానే మన వాడు ఎంతో ఆశగా ఆయన చూపించిన దిక్కు కేసి చూస్తే రోడ్డు మీద ఐదు సంవత్సరాల పాప, 35 సంవత్సరాల స్త్రీ 65 సంవత్సరాల వృద్ధ స్త్రీ కలిసి మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వృద్ధ స్త్రీ అమ్మమ్మ, స్త్రీ మూర్తి కూతురు, ఐదు సంవత్సరముల పాప మనవరాలు అయి ఉండాలి. మీరు చూపించే వీరి ముగ్గురిని చూపించి త్రి మాతలు అంటున్నారు నిజమేనా? అనే సందేహం రాగానే వెంటనే ఆయన పెద్దగా నవ్వి “ఏమిరా అలా కనిపించడం లేదా! ఆభరణాలు లేని ఆ త్రిమాతలను నువ్వే గుర్తించ లేనప్పుడు మేము చూపినా వారి మీద నమ్మకం లేనప్పుడు విగ్రహమూర్తిని రూపాలుగా నమ్ముతావా! ప్రాణం ఉన్న వాటిని నమ్మవు గాని ప్రాణం లేని వాటిని ఎలా నమ్ముతున్నావురా! బాలమ్మ అంటే ఐదు సంవత్సరాల పాప కదరా! త్రిపుర అమ్మ అంటే 35 సంవత్సరాల స్త్రీమూర్తి అని , 65 సంవత్సరాలు ఉంటే సుందరి అని హైందవ మత గ్రంధాలు చెప్పిన వాటిని మీద కూడా నమ్మకం లేదు లేదురా! విగ్రహారాధనను దాటి విశ్వ ఆరాధనకు రా! జీవాత్మను దాటి విశ్వాత్మ గా మారు! అప్పుడే పదార్ధము దాటితేగాని యదార్థము బయటికి రాదు” అనగానే మనవాడు కాస్త ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. ఇది ఆయన గమనించి వీడి చెవిలో శివశక్తి కి సంబంధించి మూల మంత్రం చెప్పటం ఆ క్షణమే వీడి శరీరంలో కుండలిని శక్తి కదలికలు ఏర్పడటం ఆరంభమయ్యాయి. ఇక వాడు మూడు రోజులపాటు ఆయన సమక్షంలో మెలకువ రాని యోగనిద్రను మూడు రోజులు నిద్రపోయాడు.ఆ తర్వాత మెలుకువ వచ్చి నిద్రమత్తులో ఆయనకి నమస్కారం చేసి ఆ శివయ్య దర్శనం చేసుకోకుండా తానే శివుడు అనే బ్రహ్మ జ్ఞాన అనుభవ అనుభూతి పొందటానికి అనగా మేము జ్ఞానమార్గంలో యోగ సాధన మొదలు పెడితే మా జిఙ్ఞాసి కాస్తా సిద్ధ మార్గంలో మొదలు పెట్టినాడు.

భక్తి లేని భక్తురాలు:

ఈవిడ ఎవరో కాదు స్వయానా మా అక్క గారైన కళ్యాణి గారు. తనకు తన అన్న లాగా సైన్స్ విజ్ఞానం అలాగే ఆధ్యాత్మిక విషయాలు అంతగా తెలియవు. ఏది ఏమైనా అవసరం ఉన్నంతవరకే తెలుసుకుంటుంది . తనకు ఉపయోగ పడేలా చేసుకుంటుంది. పూజలు కూడా తనకోసం చేయదు. తన కుటుంబ అవసరాల దృష్ట్యా చేస్తుంది. ఏది ఎంతవరకు తెలుసుకోవాలో ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేస్తుంది. తనకి ఉపయోగపడని దానిని పట్టించుకోదు. అభిమానం, అవమానం ఒకేరకంగా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే శారీరకంగా పూజలు చేయకపోయినా మానసికంగా మనస్సులో 20 నిమిషాలైనా స్థిరత్వం నిలబెడుతుందని నాకు అర్థమైనది. నా బొంద! నా బూడిద! ఇక్కడ నేను నిత్య పూజారిని. కానీ మనస్సు లగ్నం చేసే సమయంలో కొన్ని లిప్తకాలాలే ఉండటంతో మా అక్క లాంటి మనస్సు భక్తిని అలవర్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండేవాడిని. అది అనుకున్నంత తేలిక అయిన విషయం కాదని నాకు అర్థమైనది.

పూజలు చేయని ఈమెకి ఎలా ఈ భక్తి వచ్చినదో అడిగితే దానికి ఆమె “అవేమీ నాకు తెలియదు రా… విగ్రహం ముందుకు వెళ్లి ఏ కోరిక కోరకుండా కేవలం నమస్కారం పెట్టి వస్తాను. ఇది పెట్టుకునేటప్పుడు నా మనస్సులో ఎలాంటి ఆలోచనలు, కోరికలు రావు. ఉండవు. కొన్ని నిమిషాల పాటు నా మనస్సును మీరు పూజించే దైవం మీద పెడతాను. అంతే! ఆ తర్వాత నా పనులను నేను చూసుకుంటాను. ఇలా ప్రతి రోజూ కూడా చేయను. నా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను. నాకు ఆయనని ఏమీ అడగాలని ఉండదు. మనల్ని పుట్టించినవాడికి మనకు ఏమి కావాలో తెలిసే ఉంటుంది కదా” అని చెప్పి అక్కడ ఉన్న దైవానికి మరోమారు నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు లీలగా నవవిధ భక్తిలలో నమస్కారం భక్తి అనేది ఒకటి ఉంటుందని బాబా వారు చెప్పిన ఈ భక్తి అంటే ఇదే కాబోలు అనుకుని నేను ఈమెకు నమస్కారం చేసుకున్నాను. ఇప్పుడు నమస్కారం భక్తి చూసినారు కదా!అలాగే అమాయకత్వ భక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా!

గమనిక:ఈమె ద్వారా భక్తి అంటే విగ్రహపూజ కాదని మనస్సును నిలబెట్టడం అని తెలుసుకున్నాను. మనస్సుకు స్థిరత్వం ఇవ్వటానికి విగ్రహం నుండి సర్వాంతర్యామిగా మారటానికి ఎన్నో సాధన ప్రక్రియలు విగ్రహారాధన నుండి విశ్వఆరాధన దాకా అంతర్యామి నుండి సర్వాంతర్యామి దాకా మారటానికి ఎన్నో సాధనలు ప్రక్రియలు ఉంచినారని అనగా భక్తి మార్గాలలో ఈ మొదటిదైన శ్రవణ భక్తి అలాగే చివరిదైన ఆత్మనివేదన భక్తి చేరుకోవాలని విగ్రహారాధన దగ్గరే ఆగిపోకూడదని దీనిని దాటాలని ఈమె దగ్గర నేర్చుకున్నాను. తెలుసుకున్నాను. నా సాధన పరిసమాప్తి సమయంలో నా సాధన శక్తి సహస్రార చక్రమునందు ఉండగా మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట ఆమెకి మా ఇంట్లో ముదురు ఆకుపచ్చ చీర కట్టుకుని ఉన్న ఒక 65 సంవత్సరాల స్త్రీ మూర్తి తిరుగుతూ కనిపించేసరికి అది కలగాదని నిజంగానే తన భౌతిక కళ్ళతో చూసినట్టుగా ఉంది అని నాతో చెప్పగానే అప్పుడు ఈమె సుందరి రూపంతో మాకు యోగ మాయ పరీక్ష పెట్టటానికి అమ్మవారు తిరుగుతూ సిద్ధమవుతుందని తెలిసినది. ఆనాటి నుండి సుందరి మాత అమ్మవారి కోసం ఎదురుచూడటం జరిగినది. మా అక్క లాగానే మా బావ గారు కూడా అవసరమైతే పూజలు అవసరం లేదంటే నమస్కారాలతో సరిపెడతారు. కాకపోతే ఈయనకి దైవ రహస్యాలు అన్నా అలాగే దేవాలయాల్లో వింతలు, అద్భుతాలు జరిగినాయి లేదా జరుగుతున్నాయి అంటే మాత్రము ఆ గుడిలోకి వెళ్లి తన కళ్ళతో చూసి వచ్చినాక ఆ వింతలు విశేషాలు పదిమందికి చెప్పేదాకా నిద్రపోడు. భక్తికి కూడా హద్దులు ఉండాలని ఆయన నమ్మకం. కాకపోతే ప్రతి సంవత్సరము నాకు తెలిసి ఈ దంపతులు వినాయక పూజ చేస్తారు అంతే. మిగతా పండుగలలో నమస్కారం భక్తితో నడిపిస్తారు. నా దృష్టిలో ఎవరి భక్తి తక్కువ కాదు అలాగే ఎక్కువగా కాదు. ఎవరి మనస్సు స్థాయిని బట్టి వారికి తగ్గ భక్తి ఉంటుంది. ఎవరి కోరికలను బట్టి వారి భక్తి పూజా విధానాలు ఉంటాయి. పిండి కొద్దీ రొట్టె. డబ్బులు ఉన్నవాడు పీఠాధిపతులతో పూజలు చేయించుకుంటారు. డబ్బులు లేని వారు తనకి తానే స్వయంగా పూజలు చేసుకుంటారు. ఎవరి భక్తి వారిది ఎవరి పద్ధతి తగ్గట్లుగా వారి భక్తి బట్టి ఫలితం ఉంటుంది.

అమాయకత్వ భక్తుడు:

వీడు స్వయంగా నాకు తమ్ముడు వరస అవుతాడు. మా పెదనాన్నగారి అబ్బాయి. పేరు యజ్ఞ కిషోర్. పాపము అమాయకంగా కనిపించే అతి తెలివైన వాడు. వీడికి అన్ని విషయాలు కావాలి. అవసరం లేని విషయం అంటూ ఏదీ ఉండదు. అలాగే అందరూ కావాలి. ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో అప్పుడు వారిని ఉపయోగించుకోవడంలో మంచి దిట్ట. అందరితో సత్సంబంధాలు ఉంచుకుంటాడు. ఎవరు ఏమి తిట్టినా అవమానించిన బయటపడడు. మనస్సులో ఉంచుకుంటాడు. అవసరమైనప్పుడు దానిని బయటకు తీసి దెబ్బ కొడతాడు. మనుష్యులలో ఇలాగా కూడా ఉంటారని వీడి ద్వారానే నేను తెలుసుకున్నాను.పాపము వీడికి దేవుని యందు అమాయకత్వ భక్తి ఉంది. మా గుడి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చేవాడు. చిన్న పూజారిగా నాకు తోడుగా సహాయం చేయటానికి అవతారం ఎత్తేవాడు. పాపము వీడి అమాయకత్వ భక్తితో నన్ను చాలా ఇబ్బంది పెట్టే వాడు. అది ఎలా అంటే వీడికి పసుపుతో గణపతిని పూజ లో ప్రథమ పూజ చేస్తారు అని కూడా వీడికి తెలియదు.

మా గుడిలో జరిగే జాతర సమయంలో స్వామి వారికి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవములు చేస్తారు. మొదటి రోజు పెళ్లి కొడుకును చేసే తంతు ఉంటుంది. గుడి బయట అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఒకసారి ఈ తంతు ప్రారంభమయ్యే సమయానికి మా నాన్నగారికి పసుపు గణపతి కావలసి వచ్చింది. అది గుడి లోపల శివుడి దగ్గర ఉంది. అక్కడ నాకు ఏదో పని తగిలి నేను ఇంటికి వెళ్ళినాను. మా నాన్నగారు అక్కడే ఉన్న వీడికి “ఒరేయ్! గుడి లోపల గణపతి ఉంటాడు. దానిని తీసుకొని రా” అన్నాడు.వీడు గుడి లోపలికి వెళ్ళినాడు ఎంతసేపటికి బయటికి రావడం లేదు. దాంతో మా నాన్నకి కోపం వచ్చి పెద్దగా మైక్ లో అరుస్తున్నాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న నాకు గుడిలో ఏదో గడబిడ జరుగుతోందని గబగబా మా అయ్య దగ్గరికి వెళితే ఆయన వెంటనే “మన వాడికి గణపతి ని తీసుకొని రమ్మని చెప్పాను. 10 నిమిషాల పైన అయినది. మన వాడు బయటికి రావడం లేదు చూడు. వాడు లోపల ఏమి చేస్తున్నాడో చూడు. పూజకి ఆలస్యమవుతోందని” అనగానే లోపల ఉన్న పసుపు గణపతిని తీసుకోవటానికి వీడికి ఇంత సమయము అవసరమా? అని అనుకొని లోపలకి నేను వెళ్లి చూస్తే అసలు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం అవ్వక కొన్ని క్షణాలు బిత్తరపోయినాను.

ఎందుకంటే మనవాడు పసుపుతో చేసిన గణపతిని కాకుండా అక్కడ ఉన్న మూడు అడుగులు రాతితో చేసిన గణపతి విగ్రహం మూర్తిని కదిలించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే వాడిని ఏమనాలో అర్థం అవ్వక వాడి చేత ఆ పని ఆపించి గుడిలో శివుడి దగ్గర ఉన్న పసుపు గణపతిని వాడి చేత మా అయ్య కి పంపించి పూజ ఆరంభమైనదని తెలుసుకొని కొంత స్థిమితపడి మన వాడిని దగ్గరికి పిలిచి అసలు ఏమి జరిగిందని అనగానే దానికి వాడు అమాయకంగా "ఏముంది బాబాయి! గణపతి ని తీసుకుని రమ్మన్నాడు. గుడి లోపల ఈ గణపతి విగ్రహం కనిపించింది. చూస్తే కదలటం లేదు. రావటం లేదు. అక్కడేమో “బాబాయి! ఏమిరా గణపతిని తీసుకుని వస్తున్నావా లేదా నన్ను రమ్మంటావా?” అంటాడు.ఇక్కడేమో ఈ విగ్రహం రావడం లేదు. దీనిని ఎలా బయటకు తీసుకొని రావాలో అర్థం అవ్వ చావలేదు" అనగానే “అది కాదురా! అంత పెద్ద విగ్రహమూర్తి తో బయట ఏమి పూజ చేస్తారో ఆలోచించవద్దు” అన్నప్పుడు వాడు వెంటనే “నాకు ఏమి తెలుసు? బయట ఊరేగింపు ఉత్సవ విగ్రహం మూర్తులు ఉన్నారు కదా అలాగే ఇది కూడా బయటపెడతారు అనుకున్నాను” అనగానే వాడిని ఏమి అనాలో అర్థం అవ్వలేదు. వాడు వెంటనే “బాబాయి నాతో ఒరేయ్! నాకు పసుపు గణపతి కావాలని నాకు అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటే పసుపు గణపతిని తెచ్చి పెట్టేవాడిని. ఆయనేమో గణపతిని తీసుకొని రమ్మని చెప్పినారు అంతే నాకు గణపతి కనిపించింది కాకపోతే ఇది సమయానికి బయటకి రాలేదు. నువ్వు వచ్చి చెప్పేదాకా ఇది బయటికి రాదని నాకు తెలియదు. ఏమైనా పని నాతో చేయించుకోవాలంటే నాకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్పాలి” అని అంటుంటే వాడి అమాయకత్వ భక్తికి నాకు నవ్వు ఆగలేదు. నేను రావటం కొంత ఆలస్యం అయినట్లయితే ఈ రాతి విగ్రహ మూర్తి ని ఎలాగైనా పెకలించి బయటికి తీసుకుని వస్తే బయట ఉన్న వారి పరిస్థితి చూసి ఊహించిన నాకు నవ్వు ఆగలేదు.భక్తి విషయంలో ఆధ్యాత్మిక విషయాలలో ఇలాంటి అమాయకత్వానికి తావు ఇవ్వరాదని, ఉండరాదని ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో వీడి ద్వారా తెలుసుకున్నాను నాకు నేను జాగ్రత్త పడ్డాను. ఇంక నా నిజ గురువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా...ఇంక ఆలస్యమెందుకు...ముందుకి నాతో ప్రయాణించండి.

కపాల మోక్షం - 47-నా ఆధ్యాత్మిక గురువులు

రామకృష్ణ పరమహంస: ఈయన వివిధ రకాల యోగ సాధన ప్రక్రియలు చేస్తూ వివిధ మత విధానాలు అవలంబించి ఈ విశ్వంలో దైవశక్తి అన్నింటిలోనూ అన్ని విధానాల ద్వారా పొందవచ్చునని తెలుసుకున్న ఆధ్యాత్మిక పరిశోధకుడని నేను గ్రహించాను. అలాగే ధనం అంటే విపరీతంగా భయపడే మహోన్నత వ్యక్తి అని గ్రహించాను. సాక్షాత్తు భార్యని జగన్మాతగా భావించుకొని ఆరాధన చేసిన మహనీయుడు అని తెలుసుకున్నాను. మొదట తాను ధ్యానం ద్వారా తపస్సుద్వారా అనుభవాలు అనుభూతులు పొందిన తర్వాతనే వాటిని తన దగ్గరికి వచ్చిన వారికి కథల రూపంలో లౌకిక భాషలో ఆధ్యాత్మిక రహస్యాలను విడమర్చి చెప్పేవాడు అని తెలుసుకున్నాను.ధనకాంక్ష లేదు. కీర్తిప్రతిష్టలు కాంక్ష లేదు. స్త్రీ వ్యామోహం లేదు. అహం లేదు. ఆత్మాభిమానం లేదు. అవమానాలు పొగడ్తలు ఒకటే. వ్యాధి భయము లేదు మృత్యు భయము లేదు. ఒకటే తపన ఒకటే ఆలోచన నిత్యం అమ్మ స్మరణ తప్ప మరో కర్మ లేదని మరో కార్యం లేదని ప్రతినిత్యం అమ్మ స్మరణ దైవ స్మరణ చేస్తూ ఉండేవారు. మఠాలు ఆశ్రమాలు ఆలోచన లేదు. లోకానికి జ్ఞానమును అందించాలని నిరంతర తపన తాపత్రయం ఉండేవి. తన ఇష్టదైవమైన కాళీమాతను దక్షిణాచారంలోను తాంత్రిక విధానమైన వామాచారంలో కూడా ఆరాధించి శాంత,ఉగ్ర రూపాల సాక్షాత్కార దర్శన అనుభవం పొందిన పరమ యోగి అని తెలుసుకున్నాను.

రమణ మహర్షి:ఎలాంటి యోగసాధన ప్రక్రియలు చేయకుండా కేవలం నేను ఎవరిని అనే ప్రశ్నకి నిత్యము దానికి సమాధానం కనుగొనటంద్వారానే సిద్ధి పొందిన జ్ఞాన యోగి అని గ్రహించాను.వస్త్రాలతో అరుణాచలం చేరి గోచీ గుడ్డ కూడా లేని పరిపూర్ణ యోగ పరిసమాప్తి సాధన స్థితికి చేరుకున్న మహనీయుడు అని గ్రహించాను అహం లేని మనస్సు పసిపాప మనస్సు నా అనే వాళ్ళ మీద మమకారాలు లేని మనస్సు మూగజీవాల మీద ఆర్తి ఉన్న మనస్సు సాధన సందేహాలను సాధన సందేశాలను మౌనంగానే సమాధానాలు ఇచ్చే మహా మౌనముని గా మారిన మహాత్ముడు అని గ్రహించాను. అరుణాచల పర్వత అంతర గుహ యందు ఉన్న దక్షిణామూర్తి నిజస్వరూపం చూడటానికి ప్రయత్నించిన ప్రయత్న వాది అని గ్రహించాను. తేనెటీగల తుట్టెలను కదల్చటం ఇష్టం లేక ఆ స్వామిని చూడటానికి వెళుతూ వీటికోసం వెనుదిరిగిన అతి సున్నిత మనస్కుడు అని గ్రహించాను. తల్లితో పాటుగా మూగజీవాలు అయిన లక్ష్మి ఆవుని జాకీ కుక్కను, కాకికి ఒక లేడీకి కూడా ముక్తి ప్రసాదించి తల్లి సమాధి తో పాటుగా వీటికి కూడాసమాధులు కూడా కట్టించి అన్నిటియందు సమదృష్టి కలిగిన సమదర్శి అని గ్రహించాను. పొగడ్తలు తిట్లు సమభావంతో ఏక భావంతో తీసుకొని పట్టించుకోని మహాత్ముడు అని గ్రహించాను. విరూపాక్ష గుహ యందు నిరంతరంగా వినిపించే ఓంకార ధ్వని శబ్దము శబ్ద బ్రహ్మ గా వింటూ ఏకదాటిగా 18 సంవత్సరములు అక్కడ నివసించిన నిశ్చలయోగి అని గ్రహించాను. యోగ సాధన అనేది సహస్రార చక్రంలో పరిసమాప్తి కాదని జీవ నాడి ద్వారా హృదయ చక్రంలోకి సాధన శక్తి చేరితేగాని కానీ అక్కడ సాధన పరిసమాప్తి కాదని తెలుసుకున్న ఆధ్యాత్మిక పరిశోధకుడని గ్రహించాను.దశ ఇంద్రియాలు జయించిన జితేంద్రియుడు అని గ్రహించాను. సాధన పరిసమాప్తిలో మేధా దక్షిణామూర్తి గా మౌన బ్రహ్మగా మారతారు అని అనుభవపూర్వకంగా అయ్యేసరికి అతను కూడా మౌన బ్రహ్మ గా మారి చూపించిన మౌన యోగి అని గ్రహించాను. యోగ సాధనకు తప్పనిసరిగా ఆధ్యాత్మిక గురువులు ఉండాలని వారి అరుణాచలేశ్వరుడు జ్ఞాన జ్యోతిగా మహా గురువు గా ఉన్నాడు అని లోకానికి చాటిచెప్పిన మహా గురువు అని గ్రహించాను. ప్రకృతికి ఏనాడు జీవులు దూరము కాకూడదని తన ఆశ్రమంలోనే ప్రకృతి నిలయం గా మార్చిన ప్రకృతి బిడ్డని గ్రహించాను. ప్రతి నిత్యం క్రమం తప్పకుండా వేళ తప్పకుండా అరుణాచల పర్వత పరిక్రమము చేస్తూ లోకానికి ఆ పర్వత పరిక్రమము గొప్పతనం చాటిచెప్పిన ఆధ్యాత్మిక పర్వత పరిక్రముడని గ్రహించాను. ధనము మీద స్త్రీల మీద ఆకాంక్షను వదిలి పెట్టిన మహా జ్ఞాని అని గ్రహించాను. అన్ని విచారాలలో కెల్లా ఆత్మవిచారం మిన్న అని నేనెవర్ని విచారం చేస్తే అన్ని విచారములు అందులో పోతాయి అని తను నిరంతరం చేసి లోకానికి ఇదే తన సందేశం అని చాటిచెప్పిన మౌనస్వామి అని గ్రహించాను. ఈయన చెప్పిన యోగ విధానము ఏ పురాణ గ్రంధంలో అలాగే ఏ యోగి అనుభవ చరిత్రలో చెప్పనటువంటిదని గ్రహించాను. కానీ నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వెతకటానికి సరళంగా కనిపిస్తుంది కాకపోతే అది గాని సరిగ్గా పట్టుబడకపోతే అంత కష్టమైనదిగాను తోస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.

కపాల మోక్షం - 48 - I.A.S కాస్త S.A.I అవటం

అసలు నేను I.A.S అవ్వాలని అను కునేవాడిని. దానికి సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్స్, పరీక్ష విధివిధానాల గురించి, కోచింగ్ సెంటర్లు గూర్చి, ఫీజుల వివరాలు గురించి ఆరా తీసి అన్నీ సిద్ధం చేసుకునే సమయానికి కొత్తగా నాలో ఏదో తెలియని వెన్నుపాము క్రింద కదలికలు అనుభూతి వలన నా మనస్సులో అన్నిటియందు వైరాగ్య భావాలు ఏర్పడి ఏకాంతవాసిగా మౌనమునిగా ఉండటానికి… ఏ పని చేయాలన్నా ఆసక్తి గానీ ఏదో చేయాలని ఆసక్తి లేకపోయేది. అప్పటిదాకా నేను అంటూ ఒకడు ఉన్నానని సమాజానికి తెలియాలని… ఈ సమాజంలో ఉన్నత స్థాయిలో బ్రతకాలని ఆశ ఉండేది.అందుకే నా లక్ష్యంగా ఐఏఎస్ పెట్టుకొని చదువు కొనసాగించబడింది. కానీ నేను నా లక్ష్యంకు దూరమవుతూ మరొక లక్ష్యం గా అది మారుతుంది అని నేను ఊహించలేకపోయాను. లేని వాడి కోసం ప్రయత్నాలు చేస్తూ నేను వాడిలాగా నాకు తెలియకుండానే నేను మారిపోతున్నానని నేను తెలుసుకునేసరికి ఐఏఎస్ లక్ష్యం కాస్త సాయి గా మారిపోయింది. ఇది తిరగబడి నా జీవితమును తిరగబడే టట్లుగా చేసినది. నేను మంత్ర అనుష్టానం ఆరాధన వలన దీక్ష గురువు రావడం జరిగినది అని మీకు తెలుసు కదా. నాలో కుండలిని యోగము వైపుకి నా యోగసాధన ఆరంభమైంది. ఇది ఇలా ఉండగా ప్రతి గురువారం ఇంట్లో సాగే సాయిబాబా పూజల వలన భక్తుల తాకిడి పెరగటం ఆరంభమైనది. వారి సమస్యలను పరిష్కరించే మార్గాలు ఆలోచనలు చేసినంతగా నా చదువు మీద కూడా ఏకాగ్రత పెట్టలేక పోయేవాడిని. ఎన్నో సార్లు ఈ విషయం లో దిగులు పడేవాడిని. కానీ అది నా చేతుల లో నా చేతల్లో లేదని అర్థం అయ్యేది.పూజలు ఆపలేని పరిస్థితి. అలాగే పూజలు కొనసాగించలేని స్థితి.ముందు గొయ్యి వెనుక నుయ్యిలా ఉండేది. అప్పుడప్పుడు అసలు నేను ఆధ్యాత్మిక సాధనలోకి ఎలా వచ్చినానో అర్థమయ్యేది కాదు.

అసలు అలాగని ఆపలేని పరిస్థితి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ నాకు తెలియకుండానే నేను యోగసాధన వైపుకి.. వివేక వైరాగ్య భావాలు నాలో మొదలు అవుతున్నాయి అని గ్రహించినాను. కానీ ఇలా పంచ గురువుల కోసం కఠినమైన నియమాలతో అసాధ్యమైన సాధన స్థాయిలను మేము పొందగలమా అనే ధర్మ సందేహం నాలో మొదలైంది. అసలు జీవుడు ఎందుకు యోగ సాధన చేయాలి అనే ధర్మ సందేహం వచ్చింది. అన్నిటిని వదిలిపెట్టి సుఖాలు అనుభవించ కుండా ఎందుకు యోగ సాధన చేయాలి అనిపించసాగింది. ఖరీదైన సూట్ వేసుకోకుండా గోచి గుడ్డతో ఎందుకు ఉండాలి. అసలు యోగ సాధన చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని అనిపించింది.దానితో యోగ సాధన విధివిధానాలు గూర్చి పుస్తకాలు గ్రంధాలు తిరగ వేయటం మొదలు పెట్టినాను. అప్పుడు జీవాత్మ గా ఉండి నిజములాగా కనిపించే కష్టసుఖాలు అనుభవిస్తున్నామని, ఇవి శాశ్వత ఆనందం ఇవ్వలేవని కేవలం క్షణిక ఆనందాలే ఇస్తాయని ఇందులో నేను చేస్తున్నాను అనే అహం ఉండటం వలన కష్టసుఖాలు కలుగుతున్నాయి అని ఇలా కాకుండా సాధన ద్వారా నేను అనే దానిని తొలగించుకుంటే జీవాత్మ కాస్త విశ్వాత్మ అని తద్వారా శాశ్వతమైన ప్రశాంత స్థితి కలుగుతుందని తద్వారా కర్మరాహిత్యం, జన్మరాహిత్యము, పునః జన్మ రాహిత్యం, ముక్తి రాహిత్యము పొందవచ్చునని ఎల్లప్పుడూ బ్రహ్మ తదాకార స్థితిలో దేని గురించి ఆలోచించని స్థితిలో, దేనికి స్పందించని స్థితిలో, దేనికి చంకల్పించని స్థితిలో నిశ్చలంగా ఉండ కలగటానికి యోగ సాధన అవసరం ఉందని నాకు అర్థం అయింది. అంటే ఇన్నాళ్ళు ఈ విశ్వంలో నడిచే జగన్నాటకమందు పాత్రధారిగా సూత్రధారిగా ప్రేక్షకధారిగా అన్ని కూడా నేనే అనేది చేస్తూ నానా కర్మలు చేస్తూ నానా రకాల కర్మ ఫలితాలు అనుభవిస్తూ నానా జన్మలు ఎత్తుతూ నానా చంక నాకుతోంది అని… ఇలా ఈ జగన్నాటకమందు ఒక లైటు లాగా దేనికి స్పందించకుండా ఉండాలి అనగా… నాటకాలు వేసే స్టేజి ముందు ఫోకస్ లైట్ పెడతారు. దీనికి పాత్ర వేసే వాళ్ళు ఎవరో తెలీదు. అలాగే దీనికి వేయించే సూత్రధారి ఎవరో తెలియదు. అలాగే చూసే ప్రేక్షకులు ఎవరో తెలియదు. కేవలం అన్నింటికీ సాక్షిభూతంగా ఈ జగన్నాటకంలో తన వంతు సహాయ సహకారాలు అందించడానికి యోగ సాధన ఉపయోగపడుతుందని దానితో మన జన్మలు, కర్మలు, మరణాలు, జననాలు లేని అద్వితీయమైన బ్రహ్మానంద స్థితిలో శాశ్వతంగా ఒక లైటు లాగా ఒక దివ్య జ్యోతిగా సాక్షీభూతంగా ఉండి పోవచ్చునని నాకు అర్థమైనది.దానితో మా లక్ష్యం IAS నుండి తప్పుకొని SAI గా మారటానికి మనస్సు ఇష్టపడసాగింది. ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మలలో కుబేరుడిగా, మంత్రిగా, కోటీశ్వరుడుగా, కలెక్టర్ గా, డాక్టర్ గా, యాక్టర్ గా, వ్యాపారవేత్తగా ఇలా ఎన్నో రకాల పాత్రలు వేసి వేసి విసుగు వచ్చింది. సూత్రధారిగా, పాత్రధారిగా, ప్రేక్షక ధారిగా ఉంటే కలిగే క్షణిక ఆనందాల కోసం నానా జన్మలు ఎత్తి నానా చంక నాక వలసి వచ్చినా కూడా అందులో శాశ్వతమైన ఆత్మశాంతి కానీ ఆత్మ తృప్తి కలగడం లేదని అసలు జన్మ లేని, కర్మ లేని, ఆలోచన లేని, స్పందన లేని, చంకల్పం లేని, దానిలో శాశ్వతమైన ప్రశాంత స్థితి కలుగుతుంది అని తెలిసినప్పుడు అశాశ్వతమైన పదవి కన్నా శాశ్వతమైన బ్రహ్మ తదాకారం మిన్న అని నేను గ్రహించాను.

కపాల మోక్షం - 49 - మా ఇద్దరి తొలి సాధన అనుభవాలు

నేనేమో జ్ఞానమార్గం ద్వారా మోక్షగామి అయితే జిఙ్ఞాసి అయితే సిద్ద మార్గము ద్వారా మోక్షప్రాప్తికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు.నా యోగ సాధన కుండలిని జాగృతికి జ్ఞాన దీక్ష గురువు దర్శనం లభించి వారి శక్తి పాత సిద్ధి ద్వారా నాలో కుండలిని శక్తి కదలికలు ఏర్పరచినారని మీకు విదితమే కదా. అలాగే జిఙ్ఞాసికి వారి సిద్ధ గురువు యొక్క శక్తి పాత సిద్ధి వలన వాడిలోని కుండలిని మాత కదలికలు ఏర్పడినాయని మీకు విదితమే కదా. నేనేమో యోగ శక్తులు అలాగే యోగసిద్ధులు అలాగే పంచభూత ఆధీనాలు వైపు వెళ్లకూడదని మోక్షఙ్ఞానం పొందాలని నా యోగసాధన ఆరంభమైతే మా జిజ్ఞాస కి యోగసాధనలో అసలు ఏ ఏ యోగ శక్తులు వస్తాయి వాటి ద్వారా వచ్చే యోగసిద్ధులు ఏమిటి వాటిని పొందితే వచ్చే పంచభూతాల శక్తులు ఎలా ఆధీనాలు అవుతాయని ప్రత్యక్ష అనుభూతి అలాగే ప్రత్యక్ష అనుభవాలు పొందాలని వాడేమో సిద్ధ మార్గంలో ప్రయాణించడం జరిగినది. అంటే నేను జ్ఞానసిద్ధుడుగా వాడేమో యోగ సిద్ధుడుగా యోగ సాధన ప్రారంభమైనది అన్నమాట. మాకు వచ్చిన టెలిపతి విధి విధానం ద్వారా ఒకరికొకరు తమ తమ అనుభవాలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాము. వాడేమో శ్రీశైల క్షేత్రం లో కూర్చుని తన సాధన శక్తితో పన్నెండు చక్రాలు జాగృతి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేనేమో చక్రాలు జాగృతి అవుతున్న సమయంలో కనిపించే బీజాక్షరాలు సాధన చేస్తే వచ్చే మంత్ర దేవతలు చూపించిన ఆయా క్షేత్రాలకు వెళ్లి చక్రాల జాగృతి చేసుకోవాలని అనుకున్నాను. ఒక దివ్య ముహూర్తం చూసుకొని వాడేమో కర్మ సన్యాసిగా ఏకాకిగా మోక్ష ప్రాప్తి కోసం సిద్ధ మోక్షగామిగా శ్రీశైలం వెళ్లిపోయినాడు. నేనేమో గృహస్థ ఆశ్రమ ధర్మము లో మోక్ష ప్రాప్తి కోసం మానసిక సన్యాసిగా జ్ఞాన యోగిగా ఇంటి వద్దనే ఉండి యోగ సాధన చేసుకుంటూ చక్రాల జాగృతి కోసం ఆయా క్షేత్రాలు తిరిగి రావాలని అనుకున్నాను.ఇలా మా ఇద్దరి యోగ చక్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనము అయిన తర్వాత విభేదనం సమయానికి ఒకరికొకరు ఎదురుపడాలి అని అప్పటిదాకా మాట్లాడుకోవడం అన్ని కూడా టెలిపతి ద్వారా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాము.

ఈ రాబోవు అధ్యాయములలో మా ఇద్దరి అనుభవాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్క దానికి అనగా జాగృతి, శుద్ధి, ఆధీనము ఒక వరుసక్రమంలో వస్తాయి. జ్ఞాన యోగిగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయో సిద్దయోగిగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయో వ్రాయటం జరిగినది. ప్రస్తుతానికి ఈ అధ్యాయంలో ప్రారంభ కుండలినీశక్తి అనుభవాలు మూలాధార చక్ర జాగృతి లో మా ఇద్దరి అనుభవాలు రాస్తున్నాను. తికమక పడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవండి. ఇలాంటి అనుభవాలు మీకు కల్గినాయో లేదా కలుగుతున్నాయో లేదో మీరు పరీక్షించుకోండి సుమా.జిజ్ఞాసి తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా మొట్టమొదటగా శ్రీశైల క్షేత్రమునకు చేరుకున్నాడు. వాడి సిద్ధ దీక్ష గురువును తలచుకుని తన గురు మంత్రమును ఏకాంతంగా కూర్చుని తీవ్రంగా చేసుకోవడం ప్రారంభించాడు. తనకి దాహం అయినప్పుడు త్రాగటానికి ఒక ఇత్తడి చెంబు నీళ్ళుతో పెట్టుకుని సాధన చేయడం ఆరంభించాడు.కళ్ళు మూసుకొని మంత్ర సాధన చేస్తుండగా అతడికి ఇత్తడి చెంబు మీద మనస్సు పోవటం ప్రారంభమైనది. నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుండగా ఎవరైనా దొంగతనం చేస్తే తనకి నీళ్లు త్రాగటానికి చాలా ఇబ్బందులు వస్తాయి కదా అంటూ మధ్యమధ్యలో కళ్ళు తెరిచి చెంబు ఉన్నదా లేదా అనిచూసుకుని మళ్లీ కళ్ళు మూసుకోవడం కొన్ని క్షణాలు అనగా 15 నిమిషాల తర్వాత మళ్ళీ చెంబును చూసుకోవడంతో ఆ రోజంతా చెంబుతో మంత్ర ధ్యానము గడిచిపోయింది. ఆకలిగా వేయడంతో గుడిలోని భోజనాలు పెట్టే చోటికి వెళ్లి భోజనం చేసి రావడం జరిగినది. గుడి బయట ఉన్న గదులులాంటి స్థలాల్లో నిద్ర పోవడం జరిగినది. మరుసటి రోజు గాని కూడా ఉదయం నాలుగు గంటలకు లేచి పాతాళగంగ దగ్గరికి వెళ్లి స్నానాదికాలు పూర్తిచేసుకుని విభూది పెట్టుకొని శ్రీ మల్లన్న భ్రమరమ్మ దర్శనం చేసుకొని ఈసారి సాక్షి గణపతి ఆలయము నకు వెళ్లి అక్కడ ఉన్న గుడి బయట వైపున ఒక బండరాయి మీద కూర్చొని గురు మంత్రమును కళ్ళు మూసుకొని తీవ్రంగా చేయడము, మధ్యాహ్నానికల్లా వాళ్ల తల్లిదండ్రులు గుర్తుకు రావటం వారితో గడిపిన విషయాలు గుర్తుకు రావడంతో ధ్యానానికి విపరీతమైన అడ్డంకులు వచ్చేసరికి దానితో మనస్సు లేని ధ్యానం చేస్తే ఏమి లాభం అని దీనికి ప్రాయశ్చితంగా ఆ రోజు అన్నం తినకుండా కేవలం రెండు అరటి పండ్లు తిని నిద్ర పోయినాడు. ఎప్పటికో మధ్య రాత్రి మెలుకువ వచ్చింది. దాంతో ఇప్పటికైనా ధ్యానం చేయగానే కుదురుతుంది ఏమో అని ధ్యానం చేయగానే ఈసారి బంధుమిత్రులు గుర్తుకురావడం పనికిమాలిన విషయాలను మనస్సు ఎందుకు గుర్తుకు చేసుకుంటుందో అర్థం కాక దానిని తిట్టుకుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆ ప్రక్కనే ఉన్న కొలను వైపు వెళ్ళినాడు.

ఇలా వీడు సుమారుగా నెల రోజులపాటు ధ్యాన సమయంలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల విషయాలతో వారిని మర్చిపోలేక దృష్టికి రాకుండా చేసుకోలేక గుర్తుకి రాకుండా ఎలా ఆపాలో అర్థం కాక అనవసరంగా శ్రీశైలం వచ్చినాను అని అనుకుంటూ తిరిగి వెనక్కి వెళ్లి పోతే బాగుంటుందేమోనని అనుకుంటూ ఆ ఆలోచన కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా నేను కూడా ఇదే ముహూర్తానికి మా గుడిలో మల్లన్న శివ లింగ మూర్తి ఎదుట కూర్చుని సాధన చేయటం ఆరంభించాను. గురు మంత్రారాధన చేస్తుండగా నాకు మొదటి రోజు విపరీతంగా ఆవలింతలు వచ్చేవి. ఆపుకోలేక పోయేవాడిని. దిష్టి తగిలినట్లుగా ఆగకుండా ఆవులింతలు వచ్చేవి. ఏమి చేయాలో అర్థం కాక వీటిని ఎలా ఆపుకోవాలో అర్థం కాక ఇంటికి వెళ్లి మిగిలిన పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాను. రాత్రికి తీరికగా ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ పోవడం మొదలు పెట్టగానే ఆవలింతలు మళ్లీ మొదలయ్యాయి. దీనెమ్మ జీవితం!తొక్క జీవితము ఆవలింతలుకే ఆ యోగ బ్రతుకు ఆగిపోతుందా? ఏమి చేయాలి దేవుడా! నువ్వు కనిపించవు నువ్వు ఎలా ఉంటావో చూడాలని నా ప్రయత్నం. దిక్కు మొక్కు లేకుండా నడుస్తుందని అనుకుంటూ ఇలా వారం పది రోజుల పాటు ఆవలింతలతో నడిచి పోయినది. ఆ తర్వాత నిద్ర దేవత మొదలైనది. జపము చేస్తుండగా నిద్ర రావటం మొదలయింది. రాత్రి రమ్మన్న వచ్చేది కాదు. కేవలం ఏదో శాపంలాగా మంత్రజపము చేసుకునే సమయంలో విపరీతమైన నిద్ర వచ్చేది . సుమారుగా మూడు లేదా నాలుగు గంటలు నిద్ర పట్టేది. ఇది సరిగ్గా నేను ఎంత సేపు జపము చేయాలని అనుకునే వాడినో అంత సమయంలో ఈ నిద్రాదేవత ఆవహిస్తుందని తెలియగానే అడ్డంకులు ఎలా కలుగుతాయో నాకు అర్థమయ్యేసరికి మరో 15 రోజులు గడిచిపోయాయి. మొత్తం మీద 15 రోజులు నిద్ర మత్తు, ఆవలింతలుతో అలాగే గడిచి పోయినాయి. అసలు నా పరిస్థితి ఇలా ఉంటే మరి శ్రీశైల క్షేత్రంలో ఉన్న జిఙ్ఞాసి పరిస్థితి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ వాడికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో లేవో తెలియదు. ఒకవేళ ఉంటే ఎలాంటివి వచ్చినాయో నాకు తెలియదు. ఒకవేళ రాకపోతే వాడు అయినా సాధనలో ముందుకు వెళతాడు కదా అనుకుంటూ రాత్రికి వాడితో టెలిపతి సిద్ధితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇంటికి వెళ్లి నిద్రకి ఉపక్రమించాను. కానీ మనకి అవసరమైనప్పుడు నిద్ర వస్తే దాని విలువ ఏముంటుంది కదా. నాకు వద్దు అనుకున్న సమయానికి రావాలి కదా అనుకుంటూ ఎటూ నిద్ర రావటం లేదు గదా. టెలిపతి ద్వారా ఏకాగ్రతతో జిఙ్ఞాసి గురించి ఆలోచించడం ఆరంభించాను. సుమారు ఒక గంట తర్వాత వాడి నుండి నాకు ఆలోచనలు రావటం మొదలయ్యాయి.

వాడి వివరాలు తెలుస్తున్నాయి. నా వివరాలు వాడితో చెప్పాను. దాంతో “భయ్యా! నాకేమో ఇత్తడి చెంబు గురించి ఇంటి వారి గురించి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి. నీకేమో నిద్రమత్తు ఆవలింతలు వస్తున్నాయని తెలుస్తుంది. సాధన ఆరంభంలోనే ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా? నాకు ఏమి చేయాలో అర్థం కావడంలేదు. పోనీ నీ సాధన ముందుకు వెళుతుందని అనుకుంటే నీవు కూడా ఇబ్బందులు పడుతున్నావు అంటే ఏమి చేయాలి. దీనికి ఏమైనా ఆలోచించు అని టెలిపతి ద్వారా వాడు మననము చేసిన విషయాలు నాకు అందసాగినాయి. వెంటనే వాడితో “సిద్ధా! చెంబు అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ముందుగా ఆలోచించడం తగ్గించుకో. నీవు ఇంటికి దూరంగా ఉన్నావు కాబట్టి సహజంగా వారికి గూర్చిన ఇలాంటి ఆలోచన రావటం సహజం. ఇంటికి వెనక్కి మాత్రం వస్తే ఇలా ఎన్నో కోట్ల జన్మలు ఎక్కడ ఆగిపోయావో అక్కడే ఆగిపోతుంది.మరి ఎప్పుడు ముందుకి వెళతావు? ఒక్కసారి ఆలోచించు ఈ బంధాలు కూడా పూర్వజన్మ కర్మ వాసనలే కదా. ఇది శాశ్వతంగావని తెలుసుకో” అని వాడికి నా మననము ద్వారా ఈ సూచనలు పంపడం జరిగినది. ఆ తర్వాత వాడి నుండి “నిజమే భయ్యా! మరి మీరు కూడా ఆవలింతలు అలాగే నిద్ర మత్తు నుండి తప్పుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించుకోండి. నాకు తెలిసి మీరు చాలా ఏకాగ్రతతో కసిగా పట్టుదలగా ఆవేశంగా జపము చేస్తున్నట్లు గా ఉన్నారు.దాని వలన మెదడుకు తగినంత ఆక్సిజన్ మీకు అందటం లేదు. దాని వలన నిద్ర మత్తు ఆవలింతలు రావడం మొదలైనట్లు గా ఉంది కాబట్టి హడావుడిగా జపము సంఖ్య పూర్తిచేయాలని వేగంగా చేయకండి. నెమ్మదిగా ఆసక్తిగా తగినంతగా ఆక్సిజన్ తీసుకుంటూ ధ్యానం చేయండి” అని వాడు మననము చేసిన ఆ విషయాలు నాకు చేరినాయి. విశేషం ఏమిటంటే ఒకరికొకరు గురువులు అలాగే శిష్యులు అన్నమాట. ఒకప్పుడు నేను వాడికి గురువుగా ఉంటే వాడు నా విషయంలో నాకు గురువు గా ఉంటాడని నాకు అర్థం అయ్యే సరికి ఏమిటో ఈ లీల అని అనుకుంటూ నిద్ర వచ్చేసరికి నిద్రాదేవత కి స్వాగతం పలుకుతూ నాకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగినది.మరుసటి రోజు నేను జిజ్ఞాసి చెప్పినట్లుగా జపము గురించి పట్టించుకోకుండా మంత్ర జపం చేసుకోవడం ప్రారంభించాను. ఒక గంట తర్వాత ఆవలింతలు తగ్గుముఖం పడుతున్నాయని తెలియగానే నాకే తెలియని ఆనందం తో కూడిన చిరునవ్వు నా మొహంలో మొదలైంది.

అలాగే జిజ్ఞాసి కూడా ఆలోచనలు చేస్తున్నాడు. గత జన్మ వాసనలు వలన వాళ్ళని గురించి ఈ తలంపులు వస్తుంటాయి. ఇత్తడి చెంబు విలువ 500 రూపాయలు లేదు. 500 రూపాయలు పోతాయి అని ఈ చెంబు గూర్చి ఆలోచన చేస్తే సాధన ఆటంకం ఏర్పడుతుంది. ఈ మానవ జన్మ యొక్క సాధన శక్తి 500 రూపాయలా?ఛీ! పాడు బ్రతుకు! వెధవ రూపాయల కోసం ఆలోచనలే దాటలేకపోతే రాబోవు మాయ పరీక్షలు ఎలా దాటగలను. రాములు వారు సీతాదేవి జడ చూసి ఈ శివధనస్సు ఎత్తలేకపోతే మరి సీత జడను ఎలా ప్రక్కన పెట్టగలను అనుకొని శివధనస్సును ఎత్తినాడని ఎక్కడో చదివిన విషయం లీలగా ఇతనికి గుర్తుకు వచ్చింది. అలాగే తల్లిదండ్రుల గురించి ఆలోచన దాటాలంటే ఒక రకంగా వాళ్లను నేను వదిలి వచ్చినాను అంటే వాళ్ల దృష్టిలో నేను చచ్చిపోయాను కదా. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగి పోయి ఉంటే వాళ్లకు కనీస సమాచారం అందే అవకాశం లేదు కదా. నేను ఇల్లు వదిలి వెళ్ళడం నా తల్లిదండ్రులకు ఒక పెద్ద బాధ గానే మిగిలిపోతుంది కానీ నేను చచ్చిపోయి ఉంటే పడే బాధ కన్నా ఈ బాధ చాలా పెద్దది ఏమి కాదు.కానీ ఏమి చేయగలను? ఎవరికి వారే యమునా తీరే. వాళ్లంతా ఈ ప్రపంచమే నిజమని బ్రతుకుతున్నారు.నిజంలాంటి కలలో ఉంటున్నారు. జీవిస్తున్నారు. ఈ భ్రమ భ్రాంతి మాయా మోహితమైన ఈ నాటక ప్రపంచము నుండి నేను విముక్తి పొందాలని మరి మోక్షగామిగా వచ్చినాను. ఉన్నది నేను ఒక్కడినే. కాకపోతే దానిని నేను మర్చిపోయాను.దానిని గుర్తు చేసుకోవడానికి ఈ అవతారం ఎత్తవలసి వచ్చినది. ఉన్నది నేనే అయినప్పుడు మరొకరు లేనప్పుడు నాలోన శివుడు నీలోన శివుడే అయినప్పుడు ఉన్న ఒక్క శివుడు మరో శివుడి కోసం ఏడవటం ఏమిటి? బాధపడటం ఏమిటి? మాయ అంటే ఇదే కదా.మాయ లేని వాటిని ఉన్నవాటి గాను ఉన్నవాటిని లేని వాటి గా మార్చి చూపిస్తుంది. మరి ఈ మాయ స్వరూపమును దాటితేగాని స్వస్వరూపం ఏమిటో తెలియదు కదా. అంటే మనకున్న మాయ మాయము అవ్వాలి కదా. అందుకు నేను ఎంచుకున్న మార్గమే సిద్ద యోగ సిద్ధుడు గావటమే కదా. మరి ఇత్తడి చెంబు, తల్లిదండ్రుల గురించి ఆలోచనలు అనవసరమే కదా. లేనివారిని ఉన్నవారుగా ఆలోచించడం ఏమిటి అని వైరాగ్య భావాలు వస్తూఉండేసరికి క్రమేపీ వస్తువు ఆలోచనలు తగ్గి ధ్యానములో మనస్సు కుదురుగా కూర్చోవటం ఆరంభమైనది. అలా కొన్ని గంటలు గడిచాయి.జిఙ్ఞాసికి మోక్షం కోరి సాక్షాత్తుగా తన మాయాపూరిత తల్లిదండ్రులను వదిలి వస్తే ఒక ఇత్తడి చెంబు మీద ఉన్న ఆపేక్ష వలన మోక్ష కాంత తనని వదిలి పెడితే ఈ బంధము వలన ముక్తి కాంత తనని అసహ్యించుకొని వదిలి పెడితే..ఛీ! నా బ్రతుకు అనుకుంటూ నారు పోసిన వాడు నీరు పోస్తాడు.పోసే నీరు కోసం చెంబు అవసరం లేదు. చేతులు ఉన్నంత వరకు మనకి దేనికి దిగులు అనుకుంటూ దానిని అక్కడే వదిలేసి నీళ్లు తాగాల్సి వస్తే చేతులు లేదా భక్తులు ఇచ్చిన కొబ్బరి చిప్పలతో నీళ్లు త్రాగటం అలవాటు చేసుకున్నాడు అని నేను టెలిపతి ద్వారా తెలుసుకున్నాను. నెలలో రెండు రోజులు మాత్రమే అనగా సాధనలో అవాంతరాలు వస్తే అమావాస్యరోజు అలాగే సాధనలో పురోభివృద్ధి వస్తే పౌర్ణమి రోజు టెలిపతి లోకి రావాలని మేమిద్దరం అనుకొని సాధన కొనసాగిస్తున్నాము. ఇంకా ఆలస్యం ఎందుకు…. మీరు కూడా ఈ రోజులలో మాతో టెలిపతి లోనికి రండి. మరి ముందుకు వెళదాము. ఏమి జరుగుతుందో చూడాలని లేదా. మరి ఆలస్యం దేనికి బయలుదేరండి.

గమనిక:

నిజానికి నాకు కర్మ, భక్తి, జ్ఞాన, కుండలిని మార్గాలు నా వంటికి సరిపడటం లేదని ఈపాటికే తెలుసుకున్నారు కదా. అప్పుడు నేను ఒకసారి నాలో వచ్చేనాదం వంటి శబ్దాలు వింటుంటే అది కూడా ఏ మంత్రం లేకుండా ఎలాంటి ప్రక్రియలు చేయకుండా కేవలం ఏకాగ్రతతో నా మనస్సుతో ఆ శబ్దం వినేటట్లు గా చెయ్యగానే నాలో కుండలిని శక్తి కదలికలు ప్రారంభమయ్యాయి. అనగా శక్తిపాతం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అప్పుడు నేను శివ మహా పురాణం చదివితే మహా శివుడు చేసే శబ్దబ్రహ్మ నాదయోగమని అలాగే వేదవ్యాసుడు కూడా నాదయోగం ద్వారా యోగసిద్ధి పొందినాడు అని తెలుసుకొని ప్రతి రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా 20 నిమిషాల నుంచి 48 నిమిషాల పాటు శవాసనంలో పడుకొని అర్ధరాత్రి పూట నాలో వచ్చే శబ్ద నాదమును భౌతిక చెవులతో కాకుండా మనస్సుతో వినటం అభ్యాసం చేసినాను. చెవులలో బయట శబ్దాలు ఏమీ వినిపించకుండా దూది లేదా చూపుడు వేలు లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని (బయట శబ్దాలు వినిపించకుండా చేసే వాటిని) సాధన చేసినాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన పాటలు వింటూ ఊపు వస్తే చిందులు వేస్తూ గంతులు వేస్తూ ఉండే వాడిని. బాబా హారతులు విన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని కదలికలు ప్రారంభమయ్యాయి. ఇలా నా కుండలినీశక్తి జాగృతి చేసుకుంటూ మూలాధార చక్రము నుండి బ్రహ్మ చక్రం వరకు అనగా తుమ్మెదల నాదం నుండి నిశ్శబ్ద నాదం వరకు ఉన్న 13 రకాల శబ్దాలు వినటం అభ్యాసం చేసినాను.ఈ యోగము ద్వారా సిద్ది పొందినాను. అదే జిఙ్ఞాసి అయితే సిద్ద గురువు సహాయంతో కుండలినీ మార్గం ద్వారా వారి కుండలినీ శక్తిని జాగృతం చేసుకొని ప్రకృతిని జగద్గురువుగా భావించుకొని ఆత్మ జ్ఞానము ద్వారా సిద్ధి పొందాడు.

పాల మోక్షం - 50 - పాము నీళ్ళలో దూకటం: (కుండలిని శక్తి జాగృతి)

కుండలినీ శక్తి జాగృతి అనుభవాలు నా డైరీలో:

నా కుండలీని శక్తి జాగృతి సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.

జనవరి 1: ఈరోజు నాకు బాగా ధ్యానం కుదిరినది అలాగే ఈ రోజు ఒక పాము తల మాత్రమే ధ్యానంలో కనిపించినది ఎందుకో తెలియదు కళ్ళు మూసుకుంటే పాము తల ఎలా కనబడుతుందో అర్థం కావడం లేదు.

జనవరి 2: ఈరోజు ధ్యానంను ఎక్కువసేపు చేయలేక పోయాను కారణం నా వీపు వెనుక వెన్నుముక అడుగుభాగంలో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఒకవేళ బాక్ ఎక్ అదే వెన్నుపూస నొప్పి అని జబ్బు గాని వచ్చిందా? ఏమో ఎవరికి తెలుసు.

జనవరి 10: గత వారం రోజుల నుండి నేను ధ్యానంను సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. వెన్ను నొప్పి తీవ్రంగా ఉంది. దానితో నాకు ఎలాంటి ధ్యాన అనుభవాలు కలగడం లేదు.

జనవరి 12:ఈ రోజు వెన్నునొప్పి నన్ను అంతగా బాధించలేదు కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు లేవు.

జనవరి 15: అసలు ధ్యానం చేసేది ఎందుకు? ధ్యాన అనుభవాల కోసమా లేక మరేదైనా దానికోసమా ఏమో నాకు ఏమీ తెలియడం లేదు.

జనవరి 22:ఈ రోజు మళ్ళీ నాకు ధ్యానంలో ఒక నాగు పాము తల మాత్రమే కనపడసాగింది. ఒకవేళ నాకు సర్ప దోషాలు ఉన్నాయో ఏమో

జనవరి 25: ఈ రోజు ధ్యానంలో పాము తల అటూ ఇటూ ఊగుతుంటే నాకు వెన్నుపాము క్రింద ఏదో కదులుతున్న అనుభూతి కలగ సాగింది. పాము తల కి వెన్నుపాముకి గల సంబంధం ఏమిటో మొదట తెలుసుకోవాలి.

జనవరి 27: వామ్మో!దీనెమ్మ! ధ్యానంలో ఈ పాము తల తప్ప నాకు ఏమీ కనిపించడం లేదు. అసలు నాకు ఏమి జరుగుతోంది.

ఫిబ్రవరి 4: వామ్మో! ఈ రోజు ఈ నాగుపాము నన్ను కాటు వేయాలి అని చూస్తోంది. బుసలు కొడుతూ కనిపించినది. వామ్మో! దీని కాటు వలన నేను చనిపోతే.. ఈరోజు విచిత్రంగా ఏక తల ఉన్న నాగేంద్రుని విగ్రహమూర్తి వచ్చినది.

ఫిబ్రవరి 6: ఈరోజు నాకు ధ్యానం చేయాలని అనిపించడం లేదు. బోర్ గా ఉంది. ఏదైనా సినిమాకి వెళ్ళాలి. అంతే.

ఫిబ్రవరి 10: ఈ మధ్య నా మనస్సు ధ్యానం నందు ఉండటం లేదు. పాము తల కనిపించేసరికి ధ్యాన భంగం అవుతుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో పుస్తకాలు చదివి తెలుసుకోవాలి.

ఫిబ్రవరి 13:నా స్వామిరంగా! ఈరోజు నాకు ధ్యానంలో ఒక అడుగు ఉన్న నల్లని తెల్లని మచ్చలు పాము కనిపించసాగింది. ఇన్నాళ్ళు పాము తల కనిపిస్తే ఈ రోజు ఏకంగా పామే కనపడ సాగింది. ఈ పాముల గోల ఏమిటో అర్థం అయ్యి చావటం లేదు.

ఫిబ్రవరి 22: వామ్మో! ఈ రోజు ధ్యానంలో నా చిటికెన వేలు మీద పాము కాటు వేసినట్లుగా కనిపించినది కదా. మరి నాకు ఏమీ కాలేదు. నేను చనిపోలేదు కదా. కళ్ళు మూసుకుంటే పాము ఎందుకు ఇలా కనబడుతోంది.

నాకు వెండితో చేసిన పంచముఖ నాగేంద్రుడి విగ్రహమూర్తి

ఫిబ్రవరి 28: ఈ పాము కాటు దగ్గర నుండీ నాకు ధ్యానంలో బాగా కుదురుతుంది.ఏదో తెలియని ఆనంద క్షణాల స్థితి కలుగుతుంది. చెప్పలేని స్థితి. రాసుకోలేని స్థితి. ఇది భలే మజా ఇస్తోంది. ఈరోజు నాకు వెండితో చేసిన పంచముఖ నాగేంద్రుడి విగ్రహమూర్తి వచ్చినది.

మార్చి 3: ఈరోజు నాకు ధ్యానంలో ఎటువంటి అనుభవాలు కలగలేదు కానీ నా వెన్నుపాము క్రింద విపరీతంగా ఏదో కదులుతున్న పైకి లేస్తున్న అనుభవ అనుభూతి కలగ సాగింది.

మార్చి 4: ఈరోజు వెన్ను నొప్పి ఉన్న బాధ గా అనిపించడం లేదు. ఉన్నదని చెప్పలేను. లేదని చెప్పలేను. ఏదో తీయని దురదగా ఉంది.

మార్చి 6: ఈరోజు నాకు ధ్యానంలో ఆలోచనలు తగ్గటం నాకే తెలుస్తుంది. పాము కాటు అయిన దగ్గర నుండి నా ధ్యానం లో విపరీతమైన మంచి స్థితి కలుగుతుంది. ఇదేమి చిత్రమో నాకు అర్థం అవడం లేదు.

మార్చి 13: ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన ఆవలింతలు వచ్చినాయి. బాగా అలసిపోయినట్లుగా బాగా నీరసంగా ఉంది. ఎందుకో తెలియదు.

మార్చి 27: ఈ రోజు నా పుట్టినరోజు. కానీ సంబరాలు చేసుకోవాలని లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండాలనిపిస్తుంది. అలా వీలు పడుతుందా..

మార్చి 31: ఈ రోజు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. ధ్యానం చేయాలని లేదు. పడుకోవాలి అని అనిపిస్తోంది. గుడి కి వెళ్లాలి కదా!

ఏప్రిల్ 2: ఈ రోజు ఏదో తెలియని విషయాన్ని బాగా ఆలోచిస్తున్నట్లుగా మధన పడుతున్నట్లు ఉన్నానని నా స్నేహితులు చెబుతున్నారు, కానీ నిజానికి నేను ఏమీ ఆలోచించడం లేదు.

ఏప్రిల్ 5: ఈరోజు ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా ఉండాలని బాగా అనిపిస్తోంది. ఒకవేళ నాకు మానసిక వ్యాధి కానీ రాలేదు కదా. ఏమో ఎవరికి తెలుసు.

ఏప్రిల్ 8: ఈ రోజు అసలు ఏమి చేస్తున్నానో నాకేమీ తెలియటం లేదు. పాముకాటు పడిన దగ్గర నుండి నేను స్తబ్దతగా ఉండిపోతున్నానని నాకు తెలుస్తోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎదురు చూడాలి.

ఏప్రిల్ 15: ఈ రోజు నిద్ర రావటం లేదు. ఆకలి అనిపించడం లేదు.రోగం లేదు. మరి నాకెందుకు ఈ సమస్యలు...

ఏప్రిల్ 20: ఈరోజు నేను శివలింగారాధన బాగా చేసినానని అలంకారాలు బాగా చేసినానని అందరు చెబుతున్నారు. నాకేమీ అలా అనిపించడం లేదు. రోజు లాగానే చేశాను కదా ఈ రోజు కూడా! మరి వీళ్ళకి ఎందుకు ఈ తేడా కనిపించినదో ఎవరికి తెలుసు.

ఏప్రిల్ 22: ఈ రోజు నిద్ర పోకుండా వీధుల వెంట తిరగాలని బలంగా అనిపిస్తోంది. తిరిగితే పోలా.

ఏప్రిల్ 25: ఈ మధ్య చీకటి అంటే భయం దొబ్బినట్లుగా ఉంది. రాత్రిపూట ఉచ్ఛ పోయాలంటే విపరీతంగా భయపడే నాకు రాత్రిళ్లు నిద్ర పట్టకుండా నగర సంచారాలు ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు.

ఏప్రిల్ 27: ఒకవేళ నాకు ధ్యానంలో పాము కాటు వేయటం వలన నాకు పాము లక్షణాలు రావటం లేదు గదా. ఏమో ఎవరికి ఎరుక.

ఏప్రిల్ 28: ఈ మధ్య నేను బాగా పూజలు చేస్తున్నాను అని అందరూ అంటున్నారు. ఎందుకో ఏమో.

ఏప్రిల్ 30: ఈ రోజు ధ్యానంలో నాకు చిన్న బిందువు వంటి తేజస్సు ఉన్న జ్యోతి మినుకుమినుకు మంటూ కనపడసాగింది.

మే 1: ఈ మధ్య నాకు భోజనం చేయాలనే తపన ఉండటం లేదు. అజీర్తి చేసిందా లేదా ఏదైనా కారణమా ఎవరికి ఎరుక.

మే 3: ఈ రోజు అసలు స్నానమే చేయలేదు. స్నానం చేయాలని అనిపించడం లేదు. కానీ ధ్యానం బాగా కుదురుతుంది. స్నానం చెయ్యకుండా ధ్యానం చెయ్యవచ్చా తప్పు గదా!

మే 6: ఈమధ్య నాకు ఏ విషయాల యందు ఆసక్తి దొబ్బింది. సినిమాలు చూడటం దొబ్బినది. కూల్ డ్రింక్స్ త్రాగడం దొబ్బింది. ఎందుకో నాకు ఇష్టమైన పనులు ఒక్కోక్కటి నాకు దూరం అవుతున్నాయి. ఎవరైనా దూరం చేస్తున్నారా.

మే 8: ఈరోజు నాకు అన్నిటియందు అన్ని విషయాలలో విపరీతమైన కోపావేశాలు కలుగుతున్నాయి.క్రొత్త రోగమా? ఇదేమీ అర్థం కావటం లేదు.

మే 15: ఈరోజు నేను దేని యందు స్థిరముగా లేను. స్థిరమైన నిర్ణయం తీసుకోలేక పోతున్నాను. నాకు అసలు ఏమవుతుంది. ఇది ఏమైనా మెదడుకు సంబంధించిన జబ్బా! ఎవరికి ఎరుక.

మే 18: ఈ మధ్య నాలో నేను మాట్లాడుకోవడం ఎక్కువైంది. నా ఎదురుగా ఎవరూ లేరు. కానీ ఎవరితో మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. వామ్మో! నాకు ఏదో అయినది.

మే 20: ఈరోజు నా ధ్యానం దొబ్బింది. మిరపకాయ బజ్జీలు తినాలి అప్పుడే కానీ నా మనస్సు శాంతిపడదు.

మే 22: ఈరోజు ఏమిటో ధ్యానం చేస్తున్నంత సేపు నాకు తెలియకుండానే విపరీతంగా ఊగి పోతున్నాను. వామ్మో రోగం కాదు కదా. ఒకవేళ మూర్ఛ వ్యాధి లేదా పూనకపు వ్యాధి కానీ రాలేదు కదా.

మే 25: ఈరోజు కూడా నేను ధ్యానం లో భాగంగా ఊగి పోతున్నాను నా శరీరము దేనివో కదలికలకు తట్టుకోవడం లేదని నాకు అర్థమైనది.

మే 28: వామ్మో! ఈ రోజు మరీను. శరీరం ఉల్టా పల్టా అవుతుందేమోనని భయం వేసింది. వామ్మో! ఏదో వెన్నుపాము క్రింద కదలికల వలన నా శరీరం తట్టుకోలేక పోతుంది. దీనిని ఎలా తట్టుకోవాలి. పుస్తకాలు చదివి తెలుసుకోవాలి.

జూన్ 1: ఈరోజు నాకు ధ్యానంలో కాళ్లు చేతులు బాగా లాగి వేయబడినట్లుగా లోపలికి ఏదో ప్రవహిస్తున్నట్టుగా లాగుతున్నట్టుగా ఏదో తెలియని భయం తో కూడిన అనుభవం కలిగినది. ప్రాణ భయం మొదలైంది. దానితో నాకు ధ్యానం భంగమైనది.

జూన్ 2: ఈరోజు కూడా ప్రాణభయం మొదలైనది. ఏది జరిగితే అది జరుగుతుందని ధ్యానము ఆపకుండా చేసినాను. భయము నెమ్మదించింది.

జూన్ :3 ఈరోజు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అంతర ప్రపంచం లోకి వెళుతున్న అనుభవ అనుభూతి కలగ సాగింది. అసలు ఏమి జరుగుతోంది.

జూన్ 4: శరీరము ఊగటం లేదు. వెన్నునొప్పి లేదు. ప్రాణభయం లేదు. ఏదో తెలియని ప్రశాంతత స్థితి కలిగినది.

జూన్ 5: ఈ రోజు నా శరీరం విపరీతమైన వేడిని చూపించినది. ఒకవేళ డెంగ్యూ మలేరియా గాని చికెన్ గున్యా జ్వరాలు రాలేదు కదా. జ్వరాలుగా అనిపించటంలేదు. కాని వేడిమి తగ్గటం లేదు.

జూన్ 6: ఈరోజు నేను ధ్యానంలో ఎంతసేపు ఉన్నానో సమయం తెలియరాలేదు.ధ్యానం చేస్తున్నాను అని ఆలోచన లేదు. విచిత్రంగా ఉంది.

జూన్ 10: ఈరోజు విచిత్రంగా నా వెన్నుపాము వెనుక నుండి క్రింద నుండి పైకి అనగా తల భాగం వరకు ఏదో శక్తి ప్రవహించినట్లుగా ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి కలగ సాగింది. ఇదియే కుండలిని శక్తి ప్రవాహం కాదు గదా.

జూన్ 12: ఈరోజు నా వీపు వెనుక ఏదో పాము పాకుతున్నట్లుగా నా లోని శక్తి క్రింద నుండి పైకి ప్రవహించినట్లు గా అనుభవ అనుభూతి కలగ సాగింది. ఇది భలేగా ఉంది.

జూన్ 15: ఈరోజు విచిత్రంగా ఏదో కప్ప గంతులు వేస్తున్నట్లుగా ఏదో శక్తి నా వీపు వెనక నుండి క్రింద నుండి పైకి ప్రవహిస్తోంది. ఇది కూడా భలేగా ఉంది.అచ్చంగా భూమి మీద గంతులు వేస్తున్నట్లుగా ఉంది.

జూన్ 16: ఈరోజు శక్తి ప్రవాహము క్రింద నుండి పైకి ఏదో చీమలు పాకుతున్నట్లుగా నెమ్మది నెమ్మదిగా ప్రవహించసాగింది. ఇది కూడా భలేగా ఉంది. వంటి మీద చీమ పాకితే ఎలా జిలగా ఉంటుందో అలా ఉంది.

జూన్ 18: ఈరోజు పుస్తకాలు చదివితే ఇదంతా కూడా నాకు కలిగిన ఈ అనుభవాలు అన్నీ కూడా కుండలిని శక్తి జాగృతి అనుభవాలు అని తెలిసినది. అంటే నాకు తెలియకుండానే నాకు కుండలినీశక్తి జాగృతి అయినది అన్న మాట. అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ శక్తి ప్రవాహం తట్టుకుంటే పర్వాలేదు లేదంటే మూర్చ లేదా పూనకము లేదా మెదడు వాపు వ్యాధి వస్తాయి అని తెలుసుకున్నాను.

జూన్ 20: నాకు ధ్యానం చేస్తున్నంతసేపు విపరీతమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు కల్గినాయి.

జూన్ 23: ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన వేడి ఆవిర్లు నా శరీరము నుండి బయటకి వెళుతున్న అనుభవం కలిగినది.

జూన్ 24: ఈరోజు మా భౌతిక గురువుని కలిశాను. ఆయనకి నా ధ్యానం అనుభవ బాధలు చెబితే వెంటనేనా తల మీద చెయ్యి పెట్టి ఏదో శక్తిని నా లోనికి పంపించినట్లుగా నాలోని శక్తిని జాగృతి చేసినారు.విషయము అడిగితే శక్తి పాతము ద్వారా నాలో ఉన్న నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్న కుండలినీశక్తిని జాగృతి చేసినారట. విచిత్రంగా ఉందే.

జూన్ 25: ఈరోజు నాకు ధ్యానంలో ఏదో ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పొగ వంటిది నా వెన్నుపాము నుండి మెదడులోని నరాల లోనికి ఒక పాము పాకుతూ వెళుతున్నట్లుగా ప్రవేశించడం నాకు అనిపించినది. అసలు భౌతిక కళ్ళు చూడకుండా నాలో ఉన్న దృశ్యాలు నాకు ఎలా కనబడుతున్నాయి. వీటిని గురించి గురుదేవుని అడగాలి.

జూన్ 26: గురుదేవుణ్ణి అడిగితే ఆయన నాతో “నాయనా! మనలో సప్త యోగ చక్రాలుంటాయి. అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రస్తుతము నువ్వు మొదటి చక్రం అయిన మూలాధార చక్ర జాగృతి లో ఉన్నావు. దీనికి అనుసంధానమై ఆరవది అయిన ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఈ చక్రము నందు త్రినేత్రం ఉంటుంది. దీనినే మన సైన్స్ వాళ్లు పీనియల్ గ్రంథి అంటారు. త్రినేత్రం నిలువుగా ఉంటుంది. ఇది తెరచుకొనే ప్రారంభ సమయమున ఒక చిన్న బిందువు వంటి జ్యోతి దర్శనం అవుతుంది.ఎప్పుడైతే నీకు ఉపనయన ప్రక్రియ జరిగినదో ఆనాటి నుండి త్రినేత్రం నెమ్మది నెమ్మదిగా తెరచుకోవడం ఆరంభమైనది. ఎప్పుడైతే నీ సాధన ఆజ్ఞా చక్రము నందు చేరుకుంటుందో అప్పుడూ త్రినేత్రం సంపూర్తిగా తెరచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నీవు చూసే దృశ్యాలు అన్నియు కూడా వెలుతురికి అవతల అన్నమాట. వీటిని చూడటానికి భౌతిక నేత్రాలు సరిపోవు. అందుకే నీవు ఎప్పుడైతే ఈ నేత్రాలు మూసుకుంటావో అప్పుడు త్రినేత్రం ద్వారా నీకు ధ్యాన అనుభవ దృశ్యాలు కనపడతాయి. అని అన్నారు.

జూన్ 27: అంటే నాకు త్రినేత్రం తెరుచుకోవడము ప్రారంభమైందని నాలో కుండలినీ శక్తి జాగృతి అయినదని మా గురు దేవుడు చెప్పిన దగ్గరనుండి నాలో నాకే తెలియని ఆనందం వేస్తుంది. ఈరోజు ఎలాగైనా మిరపకాయ బజ్జీలు, కూల్ డ్రింక్ తాగాల్సిందే. వామ్మో! ఈ ఆనంద క్షణాలు తట్టుకోలేకపోతున్నాను. ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి దీని కోసమే ఎదురు చూస్తున్నానని ఆనంద అనుభూతి కలగ సాగింది.

ఇంతటితో నా కుండలీని శక్తి జాగృతి అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!

కుండలిని జాగృతి - మా సాధనానుభవాలు

ఒకరోజు నేను రాత్రి పూట తీవ్ర ధ్యానంలో ఉండగా నా జ్ఞాన దీక్ష గురువు యొక్క తెల్లని శరీర కాంతి పుంజము నాకు ధ్యానములో నెమ్మది నెమ్మదిగా అగుపించసాగినది. అప్పుడు వామ్మో! ఈయన మళ్లీ ఎందుకు అగుపించారు.అరటిపండు సగభాగము పెట్టి శక్తి పాతం చేశారని చెప్పి వెళ్లిపోయారు. ఒకవేళ ఆయన చనిపోయారా? అందుకేనా ఆయన ఆత్మ అనగా సూక్ష్మ శరీరం నాకు కనపడుతుందా? అలా జరిగి ఉండదు.ఏమి జరిగినదో తెలుసుకునే లోపల వారి సూక్ష్మశరీరము అంతర్ధానమై ఒక నల్లటి నాగు పాము తల సజీవంగా కనబడసాగింది. అంతా సజీవమూర్తిగా కనబడుతోంది. వామ్మో! ఏమిటి ఇది క్రొత్తగా. అది కదలదు. కాటు వేయడానికి కానీ వచ్చిందా లేక పగ తీర్చుకోవటానికి ఏమైనా వచ్చిందా? ఈ జన్మలో ఎప్పుడుపామును చంప లేదు. ఎప్పుడు నాకు పాముల పుట్టలో అమ్మ నా చేత నాగులచవితికి పుట్టలో ఆవుపాలు చలిమిడి పెట్టించి పుట్టలో పోయించేది. మరి ఈ పాముల గోల ఏమిటి?ఒకవేళ గత జన్మలో ఏమైనా పామును చంపినానా? అది గాని సర్ప శాపంగా నన్ను చంపటానికి వచ్చిందా? వామ్మో ఈ దిక్కుమాలిన యోగసాధన కాదు గాని ఈ పాముల గొడవ ఏమిటి? మనకిఎవరు కూడా సలహాలు కూడా ఇవ్వలేదు. ఇది మాత్రం పోవటం లేదు అనుకుంటూ కళ్ళు తెరిచి చూసిన ఎదురుగా పాము తల మాత్రమే కనబడుతుంది. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా పాము తల మాత్రమే కనబడుతుంది.అది ఫోటోలో లాగా కానీ విగ్రహంలా గాని లేదు. నిజమైన పాముతలగా కనబడుతోంది. దీని దెబ్బకి నా కళ్ళు దొబ్బినాయా?భ్రమ భ్రాంతులకు వెళ్ళిపోయానా? ఏమి చేయాలిరా దేవుడా అంటూ నిద్రకు ఉపక్రమించే సరికి అక్కడ కలలో కూడా కేవలం పాము తల మాత్రమే కనపడేది. ఇలా ఒక మూడు నెలల పాటు కనపడినది. ఒకరోజు ఉన్నట్టుండి నా వెన్నుపాము క్రింద కదలికలు ప్రారంభమైనాయి. ఏదో తెలియని చిన్నపాటి ఆనంద క్షణాలు కలుగుతుండేది. ఈ పాము తలకి అలాగే ఈ కదలికలకి గల సంబంధం ఏమిటో అర్థం అయ్యేది కాదు.ఇదివరకు ఇలాంటి కదలికల అనుభూతి ఒకటి రెండుసార్లు మాత్రమే కలిగితే ఇప్పుడు తరచుగా అదే పనిగా కదులుతున్న కదలికలు అనుభూతి వెన్నుపూస అడుగు భాగంలో గుద స్థానము క్రింద భాగము అంటే మన యోగ పరిభాషలో చెప్పాలంటే మూలాధార చక్రము క్రిందభాగంలో అన్నమాట.ఈ మధ్య తరచుగా పాము తల కనిపించటం కదలికలు ఏర్పడటం జరుగుతుండేది కానీ ఎలాంటి బాధ గాని నొప్పి గాని అనిపించేది కాదు.

ఆనందం వేసేది ఏదో భారము తొలగినట్లు అనిపించసాగింది. ఇది ఇలా ఉండగా ఒక రోజు ఇదే పాము తల కాస్త ధ్యానంలో ప్రాణము వచ్చినట్లుగా అటు ఇటు తల ఊపుతూ ఉండేది. దానితో నాలో కదలికలు కూడా వేగంగా కదిలేవి. ఈ బాధంతా దేనికి. అసలు తనకి ఏమి జరుగుతుందో అర్థమయ్యే స్థితి లేదు. ఎవరిని అడిగినా నాకు ఏమైనా సర్ప దోషాలు ఉంటే ఇలా కనపడుతున్నాయని అవి చేయించుకోకపోతే సర్ప కోపానికి గురై అవి కాటు వేసి చంపివేస్తాయి అని చెప్పేసరికి ప్రాణ భయంతో ఈ పాముల గోడు అంతా మా అమ్మ చెవిలో ఊదేసరికి ఆవిడ వెళ్లి మా అయ్య చెవిలో ఊదటం వెంటనే ఎవరైనా ఒక జ్యోతిష్య పండితుల సలహా తీసుకొని ఏదైనా పరిహారాలు చెప్పితే చేద్దాం అని అనడం నా చెవిలో పడినవి.హమ్మయ్య! ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గము దొరికినది. దానితో ఈ పాము గోల తగ్గిపోతుంది అనుకొని యధావిధిగా ధ్యానములో కూర్చునే సరికి కదులుతున్న పాముతల కనిపించే సరికి….. కళ్ళు తెరుచుకుని లేచి వెళ్లి నా పనులు చేసుకోవటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

ఒకరోజు ధ్యానంలో ఉండగా కదులుతున్న పాము కాస్త ఏదో దేవాలయంలోని పుట్టలోనికి వెళ్ళినట్లుగా కనిపించింది. కానీ ఆ గుడి గాలి గోపురం చాలా ఖచ్చితంగా కనబడి మనస్సులో దాని ముద్ర పడినట్లుగా అయినది.ఇలా వరసగా ఇదే దృశ్యం కనపడ సాగింది. వామ్మో! ఇది ఏమిటి కొత్తగా. ఒకవేళ నాకు కనిపించిన పాము యొక్క గుడి కాబోలు. ఒకవేళ అక్కడికి వెళితే నన్ను కాటు వేయడానికి సిద్ధంగా ఉంటే నేను ఏమి చేయాలి. గుడి ఎక్కడ ఉంది? ఎవరికి తెలుసు? అనుకుంటూ ఇంటికి వచ్చి యధావిధిగా ఎందుకో టివి పెట్టేసరికి నాకు కలలో కనిపించిన గుడి వివరాలు ఉన్న యాత్ర ప్రోగ్రామ్ నడుస్తోంది. నాకు మూడు రోజులుగా కనబడుతున్న గుడి వివరాలు ఈ గుడి వివరాలతో సరి పోయేసరికి మా అయ్యతో ఈ వివరాలు చెప్పగానే “మంచిది! ఇక ఆలస్యం ఎందుకు? ఆ పుట్టలో వెండితో చేసిన పాము కళ్లు, చెవులు, పాము తోక వేసి వస్తే ఏమైనా సర్పదోషాలు ఉంటే మన కాళ్ళకి చేతులకి చర్మమునకు రోగాలు రావు అంటూ మర్నాడు మా ఊరిలో దగ్గరలో ఉన్న ఆ గుడి వైపు కి వెళ్లడం జరిగింది. యధావిధిగా గుడిలోనికి వెళ్ళి గాలి గోపురము ను చూసి ఇదే నాకు కలలో కనిపించినదని నిర్ధారణ చేసుకొని చెప్పినట్లుగా అక్కడ వెండితో చేసిన పాము చెవులు కళ్ళు తోక తీసుకొని ఆవుపాలతో చలిమిడితో కలిపి పుట్ట కళ్ళాలలో వేసి దండం పెట్టి ఓ నాగ దేవా! నువ్వు ఎందుకు కనబడినావో తెలియదు.ఎందుకు ఈ దేవాలయము చూపించినావో తెలియదు. ఏవో సర్పదోషాలు ఉంటే ఈ పరిహారాలు చేశాను కానీ నువ్వు ఎందుకు ఇలా నాకు చేసావో తెలియదు. ఎందుకు వచ్చినావో చెప్పుము అనుకుంటూ విగ్రహమూర్తికి నాగ పూజ చేసి బయటకి వచ్చేసరికి ఆ గుడి పూజారి ఎంతో కంగారుపడుతూ అయ్యో! ఏదో అపచారం జరిగిపోయినట్లు ఉంది.ఎవరో మైల దోషం ఉన్నవారు ఈ గుడికి వచ్చారు.దాంతో నాగేంద్ర స్వామి వారికి ఉగ్రావేశము కలిగింది.స్వామి వారు కోపముతో బయటికి వెళ్ళిపొతున్నారు. అందరూ రండిరండి అంటూ కేకలు పెద్దగా వేసేసరికి అయ్యో! స్వామి మమ్మల్ని క్షమించు.మాలో ఎవరు ఈ తప్పు చేశారో మాకు తెలియదు.మమ్మల్ని వదలిపెట్టి వెళ్ళవద్దు. తగిన ప్రాయశ్చితము చేసుకుంటాము అని అక్కడున్న భక్తులు వేడుకొనేసరికి అక్కడున్న దేవాలయం బావిలో ఎదో పెద్ద బండరాయి పడితే వచ్చే శబ్ధముతో నీళ్ళు పైకి వచ్చినాయి. వెంటనే పూజారి ఒరేయ్! పెద్ద బుట్టలు తీసుకొని రండిరా! దానికి పసుపు కుంకుమలు పెట్టండిరా! నా స్వామికి కోపం వచ్చి బావిలోనికి దూకేశారురా! రండిరా! రండి అంటూ వచ్చిన బుట్టలను నీటిలో దింపినారు. దింపేటపుడు అవి చాలా తేలికగా ఉన్నాయి.ఎవరో కిందకి లాగి వేసినట్లుగా ఏమీ లేని ఖాళీ బుట్టలు నీటిలో మునిగిపోవడం సుమారు 80 మంది భక్తులు కలిసి ఎంతో అతి బరువు గా మారిన ఈ ఖాళీ బుట్టలను పైకి చాలా బలముగా లాగుతూ ఉండే సరికి అసలు అక్కడ ఏమీ జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. ఒకవేళ నేను చేసిన పూజ వెంటనే ఈ గందరగోళం జరిగినది అంటే నా వలన ఏమైనా తప్పులు జరిగినాయా? వామ్మో క్రొత్తగా ఇదేమీ సమస్య. ఉన్న సమస్యలు చాలవు అన్నట్లుగా ఇలా విచిత్ర సంఘటన జరగటం ఏమిటి అనుకుంటుండగా ఈ ఖాళీ బుట్టలు ముందుగా పుట్ట ఉన్న గుడి లోనికి తీసుకొని వెళ్ళి పూజలు చేసి కొద్దిసేపటి తర్వాత నాగేంద్ర స్వామి విగ్రహమూర్తి ఉన్నమరో పుట్టలాంటి గుడిలోనికి తీసుకొని వెళ్లటం నా ఓరకంట చూసాను. అప్పుడు నా విచిత్రమైన భావాలు చూసి మా అయ్య ఏమీ లేదురా! ఈ గుడిలో బంగారు వన్నెతో మెరిసిపోయే దైవిక జాతి నాగుపాము సజీవంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఎవరైనా మైలతో నెలసరి రోజులతో వస్తే వెంటనే ఈ పాముకు వీర ఆవేశం వచ్చి దాని కనిపించని సూక్ష్మ శరీరంతో బావిలో దూకుతుంది.వెంటనే ఈ పూజారి ఖాళీ బుట్టలను నీటిలోనికి దిగి రాగానే అవి చాలా బరువుగా మారి అందులోకి ఈ నాగేంద్రుడు చేరటంతో పైకి తీసి యధావిధిగా పుట్టలోనికి తిరిగి ప్రవేశింప చేస్తారు.ఇది ప్రతి నిత్యము ఏదో ఒక సమయంలో ఇలా జరుగుతుంది. ఇది నీకు ఆశ్చర్యం కలిగించవచ్చును. కానీ ఇక్కడున్న వారికి ఇది షరా మామూలే అంటూ గుడి బయటకి వచ్చినాము అది ఏమిటి ఒక పాముకు ఇంతగా పూజ చేస్తారా.నాకు కనిపించే నాగు పాము తల ఈ పాము యొక్క సూక్ష్మ శరీరం కాదు కదా అదే నిజమైతే అనుకుంటుండగా అది నిజమని ఆ గుడి గంటలు మ్రోగేసరికి ఇది నిజమని నాగేంద్ర స్వామి వారు చెబుతున్నారు అని అనిపించి ఇలాంటి ప్రత్యక్ష దైవ అనుభవము ఇచ్చినందుకు కృతజ్ఞత భక్తితో నమస్కరించి నాకు కలలో వచ్చిన ఆయనే ఖచ్చితంగా ఏదో సందేశం ఇస్తారని అమిత నమ్మకము నాలో కలిగే సరికి మా ఊరు వెళ్లే బస్సు ఎక్కిన విషయమే నేను గమనించలేదు.

ఇది జరిగిన మూడు రోజుల తర్వాత నేను గాఢ నిద్రలో ఉండగా ఒక అడుగున్నర నల్లటి కృష్ణసర్పం ఎదురుగా ఉన్నది.నిజమో లేదా అబద్ధమో తెలియని స్థితి. తెల్లని శరీర కాంతి వెలుగులతో మెరుస్తూ కనబడుతూ వేగంగా నా వైపు కి కాటు వేయడానికి చరచర పాకుతూ కనబడసాగింది.కొంపదీసి ఈ పాము నేను పూజ చేసిన దేవాలయం పాము కాదు గదా. అక్కడే ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని అడిగి వచ్చాను కదా. మరి ఎందుకు ఇంత పిచ్చి వీరావేశంతో కాటువేయడానికి వస్తోంది. వామ్మో! దీని కాటు పడితే కొన్ని సెకన్లలో నా ప్రాణం పోవడం ఖాయం.ఎవరికి ఏమీ చెప్పకుండానే ఎవరికి కారణం తెలియకుండానే ఒక సర్పం చేత అర్ధాంతరంగా చావాలని విధి వ్రాత గాబోలు.ఏమో ఎవరికి తెలుసు. మా అయ్య తెలియక పొరపాటున మైల వచ్చిన రోజులలో నన్ను గాని గుడికి గాని తీసుకొని వెళ్ళ లేదు గా.వామ్మో! వాయ్యో! ఆ చిన్న తప్పు కి ఇంత శిక్షా? శక్తిపాతము చేసిన దీక్ష గురువు ఏమైనాడో తెలియదు. నిత్య పూజలు అందుకునే దేవతలు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. అవసరానికి మనుషులే ఉపయోగపడరని అనుకున్నాను. చివరికి దేవతలు కూడా ఉపయోగపడరా. ఈ పాము దెబ్బకి వాళ్ళు ఎప్పుడో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటూ ఉండగానే నా దగ్గరికి వచ్చి కుడి చెయ్యి మొదట్లో కాటేసి వెళ్ళిపోయింది.అపుడు చావు భయము అలాగే ప్రాణభయము ఏమిటో ఆ క్షణం ప్రత్యక్షానుభూతి పొందినాను. ఈ రెండు యోగ సాధనలో ఎందుకు మాయగా అడ్డు వస్తాయో అర్థమయ్యేసరికి మెలుకువ వచ్చి కూర్చున్నాను.అది నిజం లాంటి కల అని నాకు తెలిసేసరికి వామ్మో! నిజంగానే పాము కాటు వేసినదేమోనని భయపడి చచ్చాను.భయముతో నిజముగా చచ్చేవాడిని అనుకుంటూ నిద్రపోదామని అనుకున్నా గాని నిద్ర పట్టలేదు.

దానితో ఏమీ చేయలేక నాకు కలిగిన ఈ విచిత్ర సాధన అనుభవాలు శ్రీశైల క్షేత్రం లో ఉన్న యోగ మిత్రుడైన జిఙ్ఞాసికి టెలిపతి ద్వారా ఈ వివరాలు అన్నీ మననము చేస్తూ వాడికి చేరవేయ సాగాను. ఒక అరగంట తర్వాత వాడి నుండి సూచనలు రావడం ప్రారంభమయ్యాయి. “భయ్యా! నీకు వచ్చిన అనుభవాల లాంటివే నాకు కొంత కాలంగా జరుగుతూ ఉన్నాయి. అవి ఎందుకు దేనికోసం జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. నా అనుభవాలు నీకు వివరిస్తాను” అంటూ “భయ్యా!నేను చెంబు అలాగే కుటుంబ సభ్యులు గూర్చి తీవ్రంగా ఆలోచించి నెమ్మది నెమ్మదిగా వారిని మర్చిపోవటం జరిగినది. వారిని పూర్తిగా మర్చిపోయిన సమయానికి నాకు ధ్యానంలో తీవ్రమైన ఏకాగ్రత నా మనస్సు స్థిరంగా మారి ధ్యానంవైపు మళ్లుతుంది.ఇలాంటి తీవ్ర ధ్యాన సమయంలో నేనుండగా ఒకరోజు నాకు సిద్ధ దీక్ష గురువు యొక్క నాకు ధ్యానంలో సూక్ష్మ శరీర కాంతి కనిపించి “నాయనా! నేను నీలో ప్రవేశపెట్టిన శక్తిపాత సిద్ధి వలన నీలో కుండలినీ శక్తి జాగృతమై చక్రాలను జాగృతిని త్వరగా చేస్తుంది. కంగారుపడకు. భయపడకు.శక్తిపాత సిద్ది వలన అంతదాకా నువ్వు చేసిన రామ మంత్రము శక్తి కాస్త లక్షల కోట్లు శక్తి పెరిగి నీలోని కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. ఇది ఆరంభం అవుతుంది. ఒక్కటి గుర్తు పెట్టుకో. నీ ఈ శరీరముతోనే ఈ శరీర దేవాలయంలో ఉన్న ఆత్మారాముని వెతుకు. ఎన్నో లక్షల కోట్ల జన్మల పుణ్య ఫలం వలన ఇలాంటి యోగ జన్మము మనకి లభిస్తుంది.దీనిని శ్రద్ధగా సంరక్షించుకో లేకపోయినా అలాగే నీ మోక్షప్రాప్తి పొందాలనే లక్ష్య సాధన పూర్తిగాకుండా నీవు శరీర త్యాగం చేస్తే మళ్ళి జన్మించవలసి ఉంటుందని గ్రహించు.తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని యోగ మాయలు అలాగే యోగసిద్ధులుశక్తుల మాయలు దాటుకో. నీ ఈ జన్మను వృధా చేసుకోకుండా తరించు అని చెప్పి అదృశ్యమయ్యారు.ఎక్కడో కాశీ క్షేత్రములో ఉన్న ఈయనకు ఇక్కడ శ్రీశైలంలో నేను ఉన్నానని ఎలా తెలుసు.ఇక్కడికి ఎలా రాగలిగినారో నాకు అర్థం కాలేదు. నిద్ర వస్తే నిద్ర పోయాను.ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు నాకు ధ్యానంలో నాగు పాము తల కనిపించసాగింది. అలాగే మరి కొన్ని రోజుల తర్వాత ఈ పాము తన తలను అటు ఇటు ఊపుతూ కనిపించసాగింది.ఇది ఎందుకు అని విచారించగా కుండలినీశక్తికి నాగుపాము సంకేతమని కుండలిని శక్తి జాగృతి సమయంలో ఇలా దేవత నాగుపాము దృశ్యాలు కనపడతాయి అని ఎక్కడో యోగ శాస్త్రాలు చదివిన విషయాలు లీలగా గుర్తుకు వచ్చే సరికి నాకు తెలియని ఆనందం కలగసాగింది.

ఇది జరిగిన వారం పది రోజుల తర్వాత అనుకుంటా తినడానికి ఏమీ దొరకకపోతే ఆకలి బాధను తట్టుకోలేక కోనేరులోని నీళ్లు కడుపునిండా త్రాగి వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉండగా మూడున్నర అడుగుల పొడవుతో తెల్లని శరీర కాంతి వెలుగులతో శ్వేత సర్పము నాకు ధ్యానం లో కనిపించి నన్ను కాటు వేయడానికి వేగముగా నా వైపు వస్తుంటే “స్వామి! నాకున్న బాధని తీర్చడానికి నీకున్న ఆకలిని తీర్చుకోడానికి నన్ను ఆహారం గా మార్చుకోవటానికి వస్తున్నావా స్వామి ధన్యుడను. ఇలాంటి వారి ఆకలి తీర్చడం కోసం నా శరీరము ఉపయోగపడుతుంది అంటే నేను మనస్ఫూర్తిగా నా ప్రాణాలు ఇస్తాను. స్వామి! నాకు ఎలాంటి చావు భయముగాని ప్రాణ భయముగాని మరణ భయం గాని లేవు. నా అంతట నేనే మీకు సమర్పించుకుంటున్నాను కాబట్టి మీకు ఎలాంటి దోషం అంటదు. నన్ను స్వీకరించి నాకోసం నా ఆకలి తీరకపోయినా మీ ఆకలి తీర్చుకో” అని అనుకుంటూ ఉన్న సమయంలో అది దగ్గరికి వచ్చి చటుక్కున కుడి చేతి నా చిటికెన వేలు మీద కాటువేసి పోయినది. నేను ఆనందంగా కళ్ళు మూసుకున్నాను. తెల్లవారేసరికి ఎవరో నన్ను తట్టి లేపుతున్నారని అనిపించి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఒక భక్తుడు కనిపించి మీరు చూస్తే బాగా ఆకలిగా ఉన్నట్టు గా ఉన్నారు. అమ్మవారి పులిహోర ప్రసాదం నా దగ్గర మిగిలిపోయింది. ఏమీ అనుకోకపోతే మీరు తీసుకుంటారా దానిని చూస్తూ వదిలిపెట్టి వెళ్ళలేక పోతున్నాను అంటూ వారు మాట్లాడకుండా నా చేతిలో అమ్మ ప్రసాదం పెట్టి వెళ్లిపోయాడు. అప్పుడు నాకు వెంటనే “అమ్మా! ఏమి లీల. నేను నువ్వు పెట్టిన ఆకలి పరీక్షలో విజయం పొందినాను కదా. నిన్న ఏమి పెట్టలేదు. బాగా ఆకలి ఇచ్చావు.ఈరోజు నాకు ఏమి ఆకలి అనేది లేకుండా చేసి ఆహారము ఇస్తున్నావు కదా. ఏమి నీ లీల తల్లి. నువ్వు నిజంగానే కన్న తల్లివి. నా ఆకలి తీర్చడానికి నువ్వు ఇంతగా కష్టపడి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.నా కోసం నువ్వు నీ కొండ దిగి వచ్చేటట్లుగా చేసినందుకు నన్ను క్షమించు తల్లీ. ఆకలి మాయ ఎంతటి మాయ శరీరానికి కారణం అవుతుంది కదా. శరీరం ఉన్నంతవరకు దైవానికి కూడా ఆకలి బాధలు తప్పవు కదా. అలాంటి ఆకలి బాధ నీకు తెలుసు కాబట్టి నా ఆకలి తీరుస్తున్నావు” అనుకుంటూ ముఖము చేతులు కడుగుకోవడానికి దగ్గరలో ఉన్న కోనేరు వైపు వెళ్ళినాను.అక్కడ ముఖ ప్రక్షాళనం చేసుకుని నీరు తాగుతున్న సమయంలో ….

ఎన్నడూ లేనిది ఆ కోనేరు ఒడ్డున ఉన్న చిన్న పొదలు వంటి చెట్ల మధ్యలో చాలా అరుదుగా కనిపించే తెల్లటి శ్వేతనాగు కుబుసం విడుస్తూ కనిపించిం.ది దాని మీద కృష్ణ పాదాలు కనిపించినాయి. దాంతో నాలో తెలియని ఆనందం వేసింది. ఎందుకంటే నా సిద్ధ గురువు చెప్పినట్లుగా నాలో పాము కాటు లాంటి నిజము లాంటి కలలో నాలో ఉన్న కుండలినీశక్తిని జాగృతం చేయడం జరిగినది. అది నిజమని తన రూపము సాదృశ్యముగా నాకు అగుపించినది. నేను ఎన్నో నెలలు నుండి ఈ ప్రాంతంలో ఉన్న కూడా నాకెప్పుడూ ఈ పాము కనిపించలేదు. అప్పుడప్పుడు తరచుగా నీటి పాములు బురద పాములు మాత్రమే కనిపించేవి. చాలా చాలా అరుదుగా కనిపించే శ్వేత నాగుపాము కనిపించేసరికి సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆది నాగ శేషువు ఈ రూపంలో వచ్చినాడు అన్నమాట. నన్ను కాటువేసి నాలో కుండలినీ శక్తిని జాగృతం చేసినారు అన్నమాట. కుండలినీ శక్తి జాగృతి ఆరంభమైనది ఇకమీదట నాలో పన్నెండు చక్రాలు కూడా జాగృతి ప్రారంభమవుతుందని నా విశ్లేషణ బుద్ధికి తోచింది.మీకు కూడా ఇలాంటి అనుభవాలే కలిగి ఉన్నాయి కాబట్టి మీలో కూడా శక్తి జాగృతి అయినదని శుభ సూచన అన్నమాట. నాకు ఈ కోనేరులో శ్వేతనాగు కనబడితే అదే మీకు గుడిలో కనపడినది. నాకు కుడిచేతి చిటికెన వేలు మీద కాటువేస్తే మీకు కుడి చెయ్యి మధ్య వేలు మీద కాటు వేసింది.కాబట్టి మన ఇద్దరి లోని కుండలినీశక్తి జాగృతి అయినది. కంగారుపడకు. ఇది సాధన ఆరంభానికి శుభ సూచన అని మా సిద్ధగురు మాకు సూచన సూచించారు. అది నిజం అని నాకు అర్థం అయింది అనుకుంటుండగా అతడి నుండి నాకు ఇంకా ఎలాంటి సూచనలు అంద లేదు.

ఇంతలో తెల్లవారు అయినట్లుగా అనిపించినట్లుగా సూచనగా గడియారం అలారం మ్రోగింది కానీ విచిత్రంగా నిద్ర లేవ లేక పోతున్నాను.ఒళ్లంతా నొప్పులు. శరీరమంతా సూదులతో ఆక్యుపంచర్ చేస్తున్నట్లుగా అనిపించసాగింది. మనసంతా అశాంతిగా మారింది. శరీరమంతా ఏదో తెలియని బాధ. చాలా బద్దకంగా ఉంది. ఇక ఈ రోజు ఆఫీసుకు ఎగనామం అని బలపడగా లేచి వెళ్లి ఫోన్ చేసి సెలవు కావాలని చెప్పి ఎన్నడూ లేనిది బారెడు ప్రొద్దేక్కే దాకా లేవబుద్ధి కాలేదు. లేచినా బద్ధకంగా అనిపించి పడుకోవడం మళ్ళీ లేవటం మళ్లీ పడుకోవడం ఇలా వరుసగా మూడు రోజుల సెలవు మీద పడుకున్నాను.నాకు ఏదో తెలియని అనారోగ్య సమస్య వచ్చిందని మా ఆవిడ ఆందోళన చెందుతుంటే అప్పుడు నాకు టెలిపతితో చెప్పిన జిఙ్ఞాసి విషయాలు ఆమెకి చెప్పగానే అయితే మీరిద్దరికి యోగశాస్త్రంలో చెప్పినట్లుగా కుండలిని శక్తి జాగృతి అయినది అన్నమాట. అంటే ఒక రకంగా మీరిద్దరికి యోగ జీవితానికి నాంది ఆరంభమైనది.యోగ ప్రస్థానము మొదలైనది అన్నమాట. అయితే నేను కంగారు పడను. మీరు కూడా కంగారు పడవద్దు అంటూ నాకు ఎప్పుడూ ఇలాంటి పాము వచ్చి నన్ను ఎప్పుడు కాటు వేస్తుందో తద్వారా నాకు కుండలినీశక్తి జాగృతి ఎప్పుడు అవుతుందో అనుకుంటూ అంతా బాబా వారి దయ అనుకుంటూ వంట చేయటానికి వంట ఇంటిలోనికి వెళ్ళిపోయినది.

ఇంతలో నాకు చిన్న ధర్మ సందేహం వచ్చింది. మన జిఙ్ఞాసికి తన సిద్ధగురువు కనబడి కుండలిని శక్తి జాగృతి అవుతుందని వాడికి చెప్పగానే వాడు అర్థం చేసుకొని జరిగిన సాధన అనుభవాలు బేరీజు వేసుకుని ఒక అంచనాకి వచ్చినాడు. మరి నాకేమో జ్ఞాన దీక్ష గురువు వచ్చి ఇలాంటి సందేశం ఏమి ఇవ్వలేదు. అంటే నాకు కుండలిని శక్తి జాగృతి అయినదా లేదా ఎలా తెలుస్తుంది.ఎందుకంటే అనుభూతులు అనేది అందరికీ ఒక్కటే ఉండవచ్చును కానీ అనుభవాలు ఒక్కటే అవ్వాలని లేదు. నా అనుభవాలు సరిగ్గా జిఙ్ఞాసితోపోలి ఉన్నాయి అని అనుకొని ఊరుకోలేదు. లేదు! వాడికి వచ్చినట్లుగా నాకు ఏదైనా అది ఈ అనుభవాలు కుండలిని శక్తి జాగృతివే అని నమ్మకం వచ్చే సంఘటనలు జరిగే దాకా నేను ఈ విషయాన్ని నమ్మటానికి వీలులేదని అనుకొని యధావిధిగా నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తున్నాను.ఇలా రెండు వారాలు గడిచిన తర్వాత నాకు స్వయంభూ కుమారస్వామి క్షేత్రమైన పళని నుండి ఒక అంగుళం పరిమాణం ఉన్న కుమార మంగళ స్వామి విగ్రహం అక్కడ నుండి నా కోసం కొని నాకు తెచ్చి ఇచ్చినారు. నాకు అప్పుడు 50 శాతం మాత్రమే నమ్మకం వచ్చినది.మరి ఇలాంటి అనుభవాలు ఈపాటికే సిద్ది పొందిన మహాయోగులకు వారి జీవితంలో ఇది నిజమైతే జరిగి ఉండాలి కదా అనుకొని ఈ సత్యమును నిరూపించే సంఘటన కోసం ఎదురుచూస్తూ నా ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తుండగా ఒక వారం రోజుల తర్వాత మహారాష్ట్రలోని గణేష్ పురి ప్రాంత వాసి అయిన సద్గురువు నిత్యానంద బాబా గారి జీవితచరిత్ర గ్రంథము మా అన్నయ గారు నా చేతిలో పెట్టారు.

ఇది ఎందుకు వచ్చినదని గ్రంథ ప్రశ్న వేసినాను. అంటే మన మనస్సులో ఒక ప్రశ్న అనుకొని కళ్ళు మూసుకుని పుస్తకంలో ఒక పేజీ తెరచి కుడివైపున పేజీలో ఉన్న విషయం చదివితే మనము అనుకున్న ప్రశ్న కి సమాధానం వస్తుంది. ఇది 80% సరిగ్గా సరిపోతుందని ఇలా ఎన్నో రకాల స్వానుభవాల ద్వారా తెలుసుకున్నాను.ఇలాంటి సమయాలలో నేను ఎక్కువగా భగవద్గీత గ్రంథమును దగ్గరగా పెట్టుకొని ప్రశ్న అడిగి కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరచి కుడివైపు ఉన్న శ్లోకమును చదువు కొని దానిని నాకు ఎలా అన్వయం చేసుకోవాలో అర్థం చేసుకునే వాడిని.ఇప్పుడు కూడా ఈ యోగి గూర్చి పుస్తకములో నాకు కలిగిన పాము తల పాముకాటు ధ్యాన అనుభవాలు దేనికి సంకేతము అని ప్రశ్నించగా ఆయన తన ప్రారంభ సాధనలో కృష్ణ పాదాలున్న నల్లటి కృష్ణ సర్పం కనబడిందని ఆ తర్వాత తన కుడి చేతి మధ్య వేలు మీద కాటు వేసినట్లుగా ధ్యాన అనుభవం కలిగిందని ఒక చిన్న శ్వేతనాగు దర్శనం దాని తర్వాత కుండలిని శక్తి జాగృతి అయినట్లుగా వారి సిద్ధ గురువు ధ్రువీకరించారని ఆ పేజీ సారాంశము. దీనిని చదవగానే నా మనస్సు గాలిలో తేలిపోయింది అని అనిపించసాగింది. వంటింట్లో నుంచి భోజనానికి రండి అని పిలుపు వచ్చే సరికి నేను వెళ్ళినాను.

మరి మీరు కూడా వంట చేసుకోవడానికి లేదా భోజనం చేయటానికి వెళ్ళండి. భోజన కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత అందరూ కలిసి ముందుకు ప్రయాణం చేద్దాం.

గమనిక:

ూశారు గదా. మనలో కుండలినీ శక్తి కదలికలు ఏర్పడినప్పుడు ఒక నాగుపాము తల కనబడుతుంది. అలాగే మన కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు అది వచ్చి కాటు వేసి వెళ్లిపోయినట్లు కనబడుతుంది. అది నిజముగా కాదు. కాని నిజం లాంటి కల వంటి ధ్యాన అనుభవము మనకి తప్పనిసరిగా కలుగుతుంది! తద్వారా శరీరమంతా మొద్దు బారిపోయి బద్ధకము ఆవరించును. కంగారు పడకండి. లేనిపోని మందులు వేసుకొని తీవ్ర అనారోగ్య సమస్యలు తెప్పించుకోకండి.అలాగే ఆరోగ్య చిట్కాలతో శరీరములో వాతమును పెంచుకుని అనారోగ్యం తెచ్చుకోకండి.

యోగ సాధన అనేది కత్తిమీద సాము లాంటిది. దీనికి ఇరు వైపులా పదును ఉంటుంది. ఒకవైపు యోగ శక్తుల పదును మరోవైపు యోగమాయల పదును ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా నెట్టుకొని రావాల్సి ఉంటుంది. మనకి గురువులు సహాయ సహకారాలు కావలసి ఉంటుంది. వారి అనుగ్రహమును పొందవలసి ఉంటుంది.అది కూడా నిజ గురువుల సహాయం అని గ్రహించండి. నకిలీ గురువుల సేవలు చేసినంత మాత్రమున ఎలాంటి ఉపయోగం లేక పోగా యోగము కాస్త నిరుపయోగంగా మారుతుంది. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించలేడు కదా. ఒక సంవత్సరం తరువాత మా శ్రీమతి అయిన దీక్షాదేవి కూడా ఇలాగే తనకి వచ్చిన గురు మంత్రమును సాధన చేస్తే పాముతల రావటం అలాగే పాము వచ్చి కాటు వేయటం అది కూడా ధ్యానం లో జరిగిపోయాయి. తద్వారా జాగృతి అయిన కుండలినీశక్తికి తట్టుకోలేక వారం, పది రోజుల పాటు మంచంకు అంకితమైనది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని యధావిధిగా సంసార బాధ్యతలు చేయటం ఆరంభించినది.కాలాలు,పాము జాతులలో తేడాలు ఉన్నప్పటికీ మా ముగ్గురికి కుండలిని జాగృతి అనుభవాలు దాదాపుగా ఒకే విధంగా కలిగి ఉన్నాయి. అనగా నాగు పాము తల అలాగే పాము కాటు వేయటం అలాగే నిజరూప దర్శనం కలగటం జరిగితే మీలో శక్తి కదలికలు ఏర్పడి జాగృతి అయినట్లుగా ఎలాంటి సందేహం లేకుండా గ్రహించండి. ఎవరి కోసం మీరు ఎదురు చూడనక్కరలేదు. మీ అనుభవాలు దీనితో సరిపోలితే అదే నాగుపాము నిజరూప దర్శనం ఇస్తే ఈ స్తోత్రమును పట్టించండి.

శ్లో||నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర

నమస్తే సర్వ నాగేంద్ర ఆదిశేష నమోస్తుతే!!

కుండలిని జాగృతి గురించి

మనలో కుండలినీ శక్తి జాగృతి ఎలా జరుగుతుందో ఎలా చేసుకోవాలని దీనికి ఏమి చేయాలని తికమక పడుతూ ఉంటారు. నిజానికి కుండలిని శక్తి జాగృతి అనేది మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏ పని చేస్తే మన మనస్సు ఎందులోనికి లయం చెంది విపరీత ఆనందమును పొందుతుందో దాని వలన కుండలినీ శక్తి జాగృతి అవుతుంది అని గ్రహించండి.అంటే సినిమా పాటలు వింటుంటే మీ మనస్సు బాగా ఆసక్తి చూపే వాటి పాటలలో నీ మనస్సు లీనం అయితే ఇలా ఏ పాట అయితే మీ మనస్సు లీనం అవుతుందో అదే పాటను ప్రతి రోజు క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు వినండి. నెమ్మది నెమ్మదిగా మీ మనస్సు ఆ పాటయందు తన్మయత్వంలోకి వెళుతుంది. అప్పుడు ఏదో తెలియని ఆనంద స్థితి కలుగుతుంది.నెమ్మది నెమ్మదిగా మనశ్శాంతి పొందటం ప్రారంభమవుతుంది. అప్పుడు మీ వెన్నుపాము నాడుల కింద ఏదో కదులుతూ పైకి ఎగబాకుతున్న అనుభూతి మీకే తెలుస్తుంది.అంటే మీ వీపు వెనక వైపు క్రింద నుండి పైకి వెన్నుపూస నాడి లో ఏదో కదిలి నెమ్మది నెమ్మదిగా పైకి ప్రవహిస్తున్న అనుభవ అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే మీకు ఒక పాము తల అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. అంటే మీకు కుండలినీ శక్తి జాగృతి అయినట్లే అన్న మాట. కొన్ని నెలల పాటు మీరు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా కనీసం 20 నిమిషాల నుండి 48 నిమిషాల వరకు ఒకే సిద్ధాసనంలో కూర్చుని చేసుకునే స్థాయికి వస్తే అప్పుడు వీపు వెనక క్రింద నుండి పైకి ఏదో శక్తి నెమ్మదినెమ్మదిగా ప్రవహిస్తున్నట్లుగా అనుభవ అనుభూతి కలుగుతుంది. అప్పుడు మీకు ధ్యానంలో నలుపు తెలుపు కృష్ణసర్పము కాటు వేసినట్లుగా అనుభవం కలుగుతుంది. అంటే మీ కుండలిని కదలికలు ఏర్పడినట్లుగా ప్రకృతి మనకి అనుభవం ద్వారా తెలియజేస్తుంది అని గ్రహించండి.ఈ విధముగా ఈ రెండు రకాల ధ్యాన అనుభవాలు అనగా పాముతల కనిపించడం వలన కుండలినీ శక్తి కదలికలు అలాగే పాము కాటు వేయటం కనబడితే కుండలిని శక్తి ప్రవాహము జరుగుతోందని అర్థం అని గ్రహించండి. ఈ విధముగా ఈ రెండు అనుభవాలు కలిగితే మీకు ఎటువంటి అనుమానమూ సందేహం లేకుండా కుండలినీశక్తి జాగృతి అలాగే ప్రవాహం మొదలైనదని గుర్తు .ఈ ధ్యాన అనుభవాలు ప్రతి యోగ సాధకులకు తప్పనిసరిగా కలగాలి. కలిగి తీరుతుంది.ఈ అనుభవాలు మీకు కలగనంత వరకు మీ కుండలినీశక్తి జాగృతి అవ్వలేదని గ్రహించండి.

ఇక మీ మనస్సు దేనియందు తన్మయత్వం పొందుతుందో మీరు మొదట తెలుసుకోవాలి. చాలా మందికి అనగా సంగీతము దగ్గరే అనగా భక్తి పాటలు, మంత్రాలు, యుగళ గీతాలు, ప్రేమ గీతాలు, విరహ గీతాలు, ఓంకారము ఇలా వీటిని వింటూ ఉండటం వలన వారి మనస్సు తన్మయత్వంలో కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కొంతమందికి సమాజ సేవ చేస్తున్నప్పుడు, మరికొంతమందికి విగ్రహారాధన చేస్తున్నప్పుడు, మరికొంతమందికి ఇతరులకు సహాయ సహకారాలు చేస్తున్నప్పుడు, మరికొంతమంది వారి ఇష్టదేవత మంత్రారాధన చేస్తున్నప్పుడు, మరికొంతమందికి జపతపాలు, ఉపాసనలు, హోమాలు చేస్తున్నప్పుడు, మరికొంతమందికి పాటలు వింటూ గెంతులు వేస్తున్నప్పుడు, మరికొంతమందికి నాట్యం చేస్తున్నప్పుడు, మరికొంతమందికి ఆసనాలు వేస్తున్నప్పుడు, కొంతమందికి స్థిర ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా వారి మనస్సు తన్మయత్వం స్థితిని బట్టి వారి కుండలినీ శక్తిని జాగృతం అవుతుంది. మీకు తన్మయత్వం తెలియని పక్షంలో ఒక నిజ భౌతిక గురువును పట్టుకొని వారి నుండి మీ ఇష్ట దైవం యొక్క మూల మంత్రమును గురు మంత్రముగా పొంది దానిని మంత్ర సిద్ధి పొందేదాకా చేయండి.అంటే మీ మనస్సు ఈ మంత్రము నందు తన్మయత్వం చెందడం అన్నమాట. అంతెందుకు రామకృష్ణ పరమహంస ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తున్నప్పుడు ఆయన మనస్సు తన్మయత్వంలోకి వెళ్ళినది. అప్పుడు ఆయనకి ఆనాటి నుండి కుండలిని శక్తి జాగృతి అయినది.ఏ విషయం దేని దగ్గర మీ మనస్సు తన్మయత్వం పొందుతుందో మీకే తెలియాలి. కొంతమందికి బొమ్మలు గీస్తే, మరికొంతమందికి కవితలు రాస్తే, మరికొంతమంది పాటలు పాడితే, మరికొంతమందికి పాటలు వింటే ఇలా మీ మనస్సు తన్మయత్వ స్థితి పొందటానికి 84 లక్షల మార్గాలున్నాయని గ్రహించండి. అందులో మీ మనస్సు దేనికి తన్మయత్వం పొందుతుందో మీరు తెలుసుకుంటే సగం యోగసాధన ప్రారంభమైనట్లే అని గ్రహించండి.అలాగే మాకు మొదట్లో మంత్రాలు వింటుంటే చిన్నపాటి తన్మయత్వం కలిగేది. అటుపైన సినిమా పాటలు, విరహ గీతాలు, ప్రేమ పాటలు ఇలా వీటిని వింటుంటే తన్మయత్వంలోనికి వెళ్ళేది.

అటుపై షిరిడి సాయి బాబా వారి మధ్యాహ్న హారతి వింటుంటే నా మనస్సు తన్మయత్వంలో కి వెళ్ళేది.అప్పుడు వెన్నుపాము వెనుక ఏదో శక్తి కదులుతున్న అనుభవం అయినది. ఆ తర్వాత వెంటనే శవాసనంలో పడుకొని శివపంచాక్షరీ మంత్రమును 48 నిమిషాల పాటు కదలకుండా వదలకుండా చేయటం చేసేవాడిని.అటుపై శబ్దనాదం వినటం ప్రారంభించే వాడిని అనగా నాలో వచ్చే వివిధ రకాల నాదములను నెమ్మది నెమ్మది గా వినటం అభ్యాసం చేసుకుంటూ వస్తున్న సమయంలో క్రింద నుండి పైకి ఏదో శక్తి ప్రవాహం ప్రవహిస్తున్న అనుభవ అనుభూతి పొందటం తరచుగా జరిగేది. ఆ తర్వాత పాము తల కనిపించడము కొన్ని నెలలకి ఒక నల్లని కృష్ణసర్పం నా మధ్యవేలు మీద కాటు వేసినట్లుగా ధ్యాన అనుభవాలు కలగటం నాలో కుండలిని శక్తి జాగృతి అయినది అని నాకు అర్థమైనది. ఇలా నా సాధన ప్రారంభ స్థితి జరిగినది. ఇలా అందరికీ జరగాలని లేదు.ఎందుకంటే నాకు తీపి అంటే ఇష్టం మరి మీకు కారం లేదా మసాలాలు ఇష్టం ఉండవచ్చు కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మీ సాధనలో ఎవరిని అనుసరించవద్దు. అనుకరణ చేయవద్దు. మీ మనస్సుకి బాగా ఇష్టమైన దానిని మాత్రమే చేయండి.అది మీ మాట విని మీకు ఆధీనం అవుతుంది. ప్రక్కవాడికి అలా చేస్తే కుండలినీశక్తిని జాగృతం అయ్యింది అని అది మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ మనస్సు చేత చేయించిన ఎన్ని సంవత్సరాలు గడిచిన మీరు మీ సాధన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది అని గ్రహించండి.కాబట్టి ఙ్ఞానిని అనుకరణ చేయవద్దు. అఙ్ఞానిని అనుసరణ చేయవద్దు.

ఇలా చేస్తే ఈ రెండూ కూడా చాలా ప్రమాదం అని గ్రహించండి. ఎందుకంటే ఙ్ఞానికి కనిపించే విశ్వమంతా అసత్యమని జ్ఞాన అనుభూతిని పొందటం వలన ఆయన ఆచారవ్యవహారాలు పాటించడు.ఎందుకంటే వీరికి సర్వమూ బ్రహ్మమయంగా కనబడుతోంది. అదే అజ్ఞానికి తనకున్న బద్దకము వలన, సోమరితనం వలన, అనుమానం వలన, సందేహం వలన దేవుడిని నమ్మడు.దేవుడు లేడు అనే నాస్తిక వాదంలో ఉంటాడు. అందువలన ఇతనిని అనుసరిస్తే మనకి లేనిపోని ప్రమాదం అనగా మెట్టవేదాంతము అబ్బే అవకాశాలున్నాయని గ్రహించండి.అందువలన సాధనామార్గం ఎవరి దారి వారిది గా ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండాలి. ఒకరిని అనుసరించటం లేదా అనుకరణ చేయటం మంచి పద్దతి కాదని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.ఆ తర్వాత మీ ఇష్టం. నీ మనస్సు దేనియందు తన్మయత్వం పొందుతుందో దానిని ప్రతి రోజు మీకు వీలు ఉన్న సమయం లో చేసుకోగలిగితే ఖచ్చితంగా నమ్మకంగా మీ శక్తి జాగృతి అవుతుంది అని నేను ఘంటాపధంగా చెబుతున్నాను.తన్మయత్వం అంటే అదేదో అనుకోకండి. మీరు పాట వింటున్నప్పుడు ఆ పాటయందే నీ మనస్సు లగ్నం అవ్వటం అన్నమాట. లగ్నము అనగా స్థిరమైన ఏకాగ్రత పొందటం.ఏకాగ్రత అంటే వేరే ఆలోచనలు లేకుండా అదే పాట మీద మీ మనస్సు ఉండటం అన్న మాట. మనస్సు వినే స్థితిలో ఉన్నప్పుడు ఏదో తెలియని ప్రారంభ సంతోషం స్థితి పొందటమే తన్మయత్వం అంటారని తెలుసుకోండి.మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే మీ పాట వింటున్నప్పుడు మీకు తెలియకుండా కాళ్లు, చేతులు, నడుము ఊగడం చేస్తుంటే అది ఆ పాటయందే తన్మయత్వం పొందటం అంటారు.ఇలా ఈ తన్మయత్వం మీకు తారాస్థాయికి చేరుకునే స్థితి ఉంటే అంటే పాటలో మీరు పూర్తిగా లీనమైతే మీకు బయట వారి మాటలు వినిపించవు.బయట శబ్దాలు వినిపించకపోవటం పరిసరాలలో ఏమి జరుగుతుందో గమనించని స్థితిలో మీరుంటే అదే తన్మయత్వం తారాస్థాయికి చేరుకోవడం అవుతుంది. అంటే మీ పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్ళటం అన్నమాట. అప్పుడే మీ కుండలిని శక్తి లో కదలికలు అటుపై జాగృతి ప్రారంభమవుతాయని తెలుసుకోండి.తద్వారా మీ మనస్సు దేనియందు వేటి యందు ఏ పని యందు ఏ సాధన మార్గమునందు లీనం అవుతుందో తన్మయత్వం పొందుతుందో స్థిరమైన ఏకాగ్రత పొందుతుందో అటుపై మనోనిశ్చలత స్థితి పొంది పరమ ప్రశాంతంగా ఉండటమే సంపూర్ణ మోక్ష స్థితి అవుతుంది. ఇదియే సాధన మార్గం విధి విధానం అని తెలుసుకోండి.

కపాలమోక్షం - 51 - తిరుపతి వెంకన్న పిలిచాడు

నాకు వచ్చిన కుండలిని శక్తి జాగృతి అనుభవాలు నిజమైన దైవ అనుభవాలు అని తెలిసిన తర్వాత నా యోగ సాధన మీద అమిత భక్తి విశ్వాసాలు,శ్రద్ధ, ఓపిక పెరగటానికి అవకాశం ఏర్పడింది. దీనితో నా యోగ సాధన చేస్తుండగా ఇలా మూడు నెలలు పాటు కొనసాగిన తరువాత ఒక రోజు అర్ధరాత్రి ధ్యానంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలువు నల్లరాతి సాలగ్రామ శిల మూర్తి విగ్రహం మెల్లమెల్లగా కనపడసాగింది. కళ్ళు మూసిన అలాగే కళ్ళు తెరిచిన ఈ విగ్రహం కనపడసాగింది. సంపూర్ణ విగ్రహమూర్తి అంటే తిరుపతి వెంకన్న విగ్రహానికి ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు దండలు వస్త్రాలు లేకపోతే ఎలా ఉంటాడో అలా ఈ విగ్రహమూర్తి కనపడసాగినాడు.ఇలా సుమారు మూడు వారాల పాటు తరచుగా తీవ్రమైన ధ్యానంలో కనబడేవారు. ఇలా ఈయన ఎందుకు కనబడుతున్నాడో నాకు అర్థమయ్యేది కాదు.ఒకవేళ ఆయనకు చెల్లించవలసిన మ్రొక్కుబడులు ఉన్నాయేమోనని అమ్మని విచారిస్తే మీకు సంబంధించి నేను మ్రొక్కుకున్న అన్ని రకాలమ్రొక్కుబడులు తీర్చేసినట్లుగా నాకు బాగా గుర్తు. నాకు తెలిసి ఏమీ లేవు.అనగానే ఈయన మాయం అవకుండా ధ్యానంలో యధావిధిగా కనిపించేవారు. నాకు అర్థమై చచ్చేది కాదు. ఈయన కనబడగానే నాకు ధ్యాన భంగం అవ్వటం తరచుగా అగుపించేది.దానితో అకస్మాత్తుగా నాలో ఏదో తెలియని ఆవేశం చికాకులు మొదలయ్యాయి. ఏమిటి విషయం అని మా ఆవిడ అడిగితే దానితో అన్నీ వివరించి చెప్పగా వెంటనే ఆయన మీకు ఏమైనా సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారేమో అని ఊరుకుంది. ఆయన మాట్లాడడు. నాకు అర్థమవదు. ఏమి చేయాలో అర్థం కాదు.

పోనీ నా జ్ఞాన గురువును అడుగుదామంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ఏమి చేయాలో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి. ఒక ప్రక్క కుండలిని శక్తి జాగృతి అయినందుకు ఆనందపడాలో లేక ఈయన ఇలా ఎందుకు కనబడుతున్నారో అర్థం కాక బాధపడాలో అర్థం కాని స్థితి. నా ఇష్టదైవాలు కూడా ఎలాంటి సహాయాలు చేయటం లేదు. ఇలా మరో 15 రోజులు గడిచిపోయాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు నాకు ధ్యానంలో ఎవరో నీడ లాంటి ఆకారం ఒకటి కనిపించి రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను నేను అడిగినది చేయాలి సుమా అనే మాటలు లీలగా వినిపించాయి. వామ్మో! ఇది ఏమిటి క్రొత్తగా? కనిపించే వాడు మాట్లాడటం లేదు కనిపించని వాడు మాట్లాడుతున్నాడు.పైగా ఆయన అడిగింది ఇవ్వాలట. ఒకవేళ ప్రాణం అడిగితే? ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఆయన ఎవరు ఏమిటో తెలియకుండానే ఇవ్వాలా. పోనీ డబ్బులు అడిగితే? నా బొంద నా దగ్గర అంత సీన్ లేదు. నేను ఉద్యోగం చేస్తూ ఒకరి దగ్గర అడుక్కుంటున్నాను. నా దగ్గర గీరుకోవటానికి ఏముంది. ఎందుకు కంగారు. రేపు పొద్దున వస్తాను అన్నారు కదా. ఆయనే ఎవరు ఏమిటో తెలుసుకుని ఆ అడిగేది ఏమిటో తెలుసుకుని అది ఇవ్వాలా వద్దా ఆ తర్వాత ఆలోచిద్దాం అనుకుంటూ గాఢ నిద్రలోకి జారుకున్నాను.ఒక గురువారము ఉదయం ఎవరో ఇంటి ఆరు బయట నిలబడి అయ్యా! అయ్యా! లోపల ఎవరైనా ఉన్నారా అంటూ పిలుస్తున్నారు. నేను బయటికి వస్తూ ఎవరిది అంటూ చూడగానే ఎదురుగా వెంకన్న భక్తుడు లాగా ఆకార వేషధారణలోఒక వ్యక్తి నిలబడి ఉండి “అయ్యా! నేనే మిమ్మల్ని పిలిచాను. ఇక్కడ గురువారం జాతకాలు చెప్పే ఆసామి ఎవరు అంటూ నన్ను” అడిగారు. దానికి నేనే అనగానే వెంటనే అతను “నన్ను క్షమించండి. నేను ఎవరో మీకు తెలియదు. మీ గురించి నాకు బాగా తెలుసు. మా కాలనీలో వారిలో ఎక్కువ మంది మీ దగ్గర జాతకాలు చెప్పించుకొని వారి సమస్యలు తొలగించుకున్నారు. ఆ విషయాల ద్వారా తెలుసుకున్నాను. కానీ మిమ్మల్ని చూసే అవకాశం ఇంతవరకు కలుగలేదు.కానీ ఈ మధ్య మా ఇంటిలో విచిత్ర సమస్యలతో బాధపడుతున్నాను. కానీ నేను వారితో “అయ్యా! ఇందాకటి నుండి నిలబడి మాట్లాడుతున్నారు. కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం. మీరు నిల్చుంటే నా కాళ్లు నొప్పులు పుడుతున్నాయి” అనగానే “నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను” అంటూ క్రింద వేసిన చాప మీద కూర్చొని “అయ్యా! ఈ మధ్య మా అమ్మగారు కాలం చేశారు.ఆనాటి నుండి మా ఇంటిలో విచిత్రమైన సంఘటన జరుగుతోంది. అది ఎందుకు జరుగుతుందో చెప్పగలరా? అనగానే నేను వెంటనే “మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. జాతకం గీసి చూసి చెబుతాను” అనగానే ఆయన వెంటనే “ఆ వివరాలు మా అమ్మకి తెలియదు. వారు పెద్దగా చదువుకోలేదు.పాతకాలపు మనిషి. నేనే ఇంటికి పెద్ద కొడుకు.పోని మిగిలిన నా తోబుట్టువుల పుట్టిన తేదీ వివరాలు కూడా తెలియవు.” అనగానే నేను వెంటనే “కంగారు పడకండి. మీ పుట్టిన తేదీ వివరాలు లేకపోతే గవ్వలతో దైవ ప్రశ్న వేస్తాను. ఖచ్చితంగా సమస్య ఏమిటో తెలుస్తుంది. అలాగే దాని పరిష్కార మార్గం తెలుస్తుంది.” అంటూ గవ్వలతో దైవ ప్రశ్న వేయటం ప్రారంభించాను. పడిన సంఖ్యను బట్టి చూసి నేను వెంటనే వారితో “అయ్యా! ఈ ప్రశ్న పడిన విధానం చూస్తే మీ ఇంట్లో దైవానికి సంబంధించిన సంఘటనలు జరుగుతున్నాయి అని చెబుతోంది నిజమేనా” అని అన్నాను. అతను వెంటనే “నిజమే స్వామి !ఆయన ఎవరో చెప్పగలరా?” అన్నాడు.నేను వెంటనే “మీకు తెలిసి నన్ను పరీక్షిస్తున్నారా” అన్నాను. ఆయన వెంటనే “లేదు స్వామి!

గవ్వలతో మీరు ఎలా సమాధానాలు కనిపెడతారో చూడాలని ఉత్సుకతతో ఉన్నాను” అన్నారు.ఇలాంటివారు తగిలితేనే వేద శాస్త్రములకి అందులో ఉన్న గొప్ప రహస్య విధివిధానాలు లోకానికి తెలుస్తాయి అని అనుకుంటూ మళ్ళీ గవ్వలతో ప్రశ్న వేయగానే ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.ఎందుకంటారా ఎందుకో మీరే చూడండి.గవ్వల ప్రశ్న ఇచ్చిన సంఖ్యఆధారంగా చూస్తే కొన్ని నెలలుగా వారి ఇంటిలో తిరుపతి వెంకన్న స్వామి వారు స్వప్న దర్శనం ఇస్తున్నారు.నాకు ఇక్కడ ఉండాలని లేదు నాకు ఇష్టమైన చోటికి నేను వెళ్ళిపోతాను నేను చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయని ఒక మనిషి చెప్పినట్లుగా చెప్తున్నాడు అని నా వాక్ శుద్ధి ద్వారా బయటికి వచ్చినది. ఆయన ఆశ్చర్యపోతూ “మరి ఆ విగ్రహమూర్తి ప్రస్తుతం ఎక్కడ ఉంది.ఇంత వరకు మీరు చెప్పినది నిజమే” అనగానే

నాకు వచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహ మూర్తి

“అయ్యా! ఆ విగ్రహమూర్తి బంగారు వన్నెలో పంచలోహ మూర్తులుగా ఒకవైపు వెంకన్న రూపంతో వెనుక వైపు జగన్మోహిని రూపంతో తెల్లని, నల్లని రాళ్లతో మూడు అంగుళాల పరిమాణంలో మనము ఉన్నచోటనే ఉన్నాడు” అని చెబుతోంది అనగానే ఆయన వెంటనే “స్వామి! మీకున్న జ్యోతిష్య పరిజ్ఞానానికి అలాగే దివ్య ఉపాసనతో సిద్ధింపజేసుకున్న వాక్ శుద్ధి ద్వారా వచ్చిన విషయాలు అక్షర సత్యాలే.ఆ విగ్రహమూర్తి ప్రస్తుతం నా చేతి సంచి లోనే ఉంది. అందుకే ప్రశ్న అలా పడినది అంటూ వెంకటేశ్వర స్వామి విగ్రహ మూర్తి నా చేతిలో పెడుతూ రాత్రి ఈయన మళ్ళీ కనబడి “ఎవరైతే నన్ను తన సోది ద్వారా కనిపెడతారో వారి చేతికి నన్ను అప్పగించమని” చెప్పారు. అందుకే మిమ్మల్ని పరీక్షించాను. దైవ నిర్ణయం నాకు శిరోధార్యము.అలాగే ప్రతి సంవత్సరము ఏకాదశి రోజున మా అమ్మగారు తిరుపతికి ఉత్తర ద్వార దర్శనం తిరుమల వెంకన్నను చూసి ఇంటికి వస్తారు. కాబట్టి తమరు కూడా ఈ విధి విధానము తప్పకుండా పాటిస్తానని నాకు మాట ఇవ్వగలరా అన్నారు.దానికి నేను ఆశ్చర్యపోతూ రాత్రి నన్ను ఒక నల్లటి శరీర ఆకారం అడిగినట్లుగా అనిపించి “తప్పకుండా స్వామి! మీరు ఎందుకు వస్తున్నారో నా మట్టి బుర్రకు అందకపోవచ్చు. కారణము లేకుండా కార్యము జరగదు అని నా గట్టి నమ్మకం అంటూ చేతిలో ఉన్న వెంకన్న స్వామి తో చెప్పటంతో ఆ వచ్చిన ఆసామీ నవ్వుతూ నాకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఈ వేంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వరస్వామిని మీకోసం ఎందుకు తీసుకొని వచ్చినారో కాలనిర్ణయానికి వదిలి పెడుతున్నానని అంటూ వెళ్లిపోయారు.అంటే ఈయన కోరినది ఒక సంవత్సరం లో ఒక సారి వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతికి వెళ్లడమా అని నాకు నవ్వు ఆగలేదు. ఏవేవో అనుకొని అనవసరంగా కంగారుపడినందుకు నా మీద నాకే జాలి వేసింది.

ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత కుడి అరచేతిలో ఈ వెంకన్న విగ్రహమూర్తి పెట్టుకొని తీవ్ర ధ్యానం చేయగానే “నేనే వచ్చినాను కదా ఇంకా ఎందుకు కంగారు పడతావు నేను ఎందుకు వచ్చినానో విచారించు” అనగానే నాకు ధ్యాన భంగమై ఈయన ఏమిటి ఇలా పిలిస్తే అలా పలుకుతున్నాడు.వామ్మో! ఈ విగ్రహం స్వయంభూ విగ్రహమా? అత్యంత శక్తివంతమైన దానిని నేను భరించగలనా?ఎంతో శ్రద్ధా భక్తులు అలాగే మడి ఆచారాలు, నియమ నిష్ఠలు ఉండాలి.అయ్యా! చచ్చింది గొర్రె. ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే పెనుప్రమాదం ఎదురు చూస్తుంది అని జాగ్రత్త తీసుకోవాలి అని అనుకుంటూ బాబా సజీవ విగ్రహమూర్తి ప్రక్కన ఈ సజీవ వెంకన్న విగ్రహమూర్తి ని పెట్టి ఆరాధన చెయ్యడము ఆరంభమైనది. ముక్కోటి ఏకాదశి రానే వచ్చినది. స్వామి వారికి ఇచ్చిన మాట ప్రకారం నేను తిరుపతి చేరుకోవడం జరిగినది. కానీ అక్కడ ఉన్న జనసందోహం వలన నాకు ఆ రోజు దర్శనం అవ్వదు అని అనిపించి బాధతో ఆవేదనతో ఆవేశంతో బేడి ఆంజనేయస్వామి గుడి దగ్గర కూర్చొని ఉండగా “అసలు నన్ను ఎందుకు ఇక్కడికి స్వామి వారు రమ్మన్నారు. అసలు ఎందుకు ఇంటికి వచ్చినారు. నాకు ఎందుకు కనిపించారు” అని పెను ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి. అసలు దర్శనం లభించలేదని వేదనతో నేనుంటే ఈ సమాధానం లభించని ప్రశ్నల వల్ల నాలో ఏదో తెలియని తీవ్రమైన కోపం,ఆవేదన నన్ను ఒక్కసారి చుట్టుముడుతుండగా నా గురుమంత్రం చేస్తుండగా నా వెనుక నుంచి వెన్నుపాము క్రింద ఒక దివ్య అదృశ్య శక్తి ఉన్న విద్యుల్లత పైకి అనగా మాడు దాకా ఏదో వేగంగా ప్రవహించిన అనుభూతి కలిగినది.ఇలా పలుమార్లు సుమారు 12 సార్లు పాటు అనుకుంటా ఇలా జరిగింది అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉన్న సమయంలో ఏడుకొండలవాడా వెంకన్న అంటూ ఎవరో భక్తితో ఆర్తిగా అరుస్తూ వెళుతుండగా నాకు ఏదో విషయము స్ఫురణకువచ్చినది. అంటే మనలో ఉన్న సప్తచక్రాలు ఈ సప్త కొండలు అలాగే సమాధిలోనిచ్చేఆనందం వెంకన్న ఉండే ఆనంద నిలయమని అంటే వెంకన్న తనలో ఉన్న అన్ని 12 రకాల యోగ చక్రాలను తన సన్నిధిలో జాగృతి చేశారని అందుకే తనకి కుండలిని శక్తి క్రింద నుండి పైకి సుమారుగా 12 సార్లు ప్రవహించినదని తెలియగానే నేను వెంటనే వెంకన్న యురేకా( కనిపెట్టాను) యురేకా నాకు తెలిసినది. నీ మర్మము అర్థమైనది. కుండలినీశక్తితో సప్త యోగ చక్రాలు జాగృతి చేసినందుకు చాలా కృతజ్ఞతలు అనుకోగానే ఇది నిజమేనని అన్నట్లుగా వెంకన్న స్వామికి రాత్రివేళ ఏడు గంటలకు మహా నైవేద్యం సమయములో మ్రోగించే ఘంటానాదం వినబడేసరికి ఇది ఆయన సందేశం అని అనుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాను. ఉదయం లేచి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి మా ఊరు వెళ్లి పోయాను.

ఇలా నాకా విధముగా 12 యోగ చక్రాలు జాగృతి అయితే అదే మా జిఙ్ఞాసికి మరో విధంగా జరిగిందని వాడి టెలిపతివిధానం ద్వారా తెలిసినది.వాడికి కుండలినీశక్తి జాగృతి అయినదని తెలుసుగదా. దాంతో వాడు కూడా మూడు రోజుల తర్వాత మామూలు మనిషి అయ్యాడు. ఆ తర్వాత బాగా ఆకలివేస్తుంది అని దగ్గర్లో ఉన్న అరటి పండు కోసుకొని తిని ధ్యానానికి కూర్చోగానే తిరుపతి వెంకన్న దర్శనం ఇచ్చి ఆయన అంతర్ధానం అయిన తరువాత వాడు పద్మాసనంలో కూర్చోలేక పోయినాడట.తల వాడి ప్రమేయం లేకుండా పాము పడగ లాగ తల అటు ఇటు ఊగ సాగిందట.వాడు మెడ బలవంతంగా ఆపితే బెణకడం తప్పదు. ఒకవేళ తను కావాలని మెడ ఇలా ఊపితే మెడ ఖచ్చితంగా చేతికి వచ్చేదట. తన ప్రమేయం లేకుండానే ఈసారి చేతులు కాళ్ళు కూడా వేగంగా కదులుతున్నాయి. ఏవో ఆసన భంగిమలలో తన శరీరము చేత తన మెదడు ప్రమేయం లేకుండా ఎవరో దగ్గర ఉండి చెప్పి చేస్తున్నట్లుగా శరీర భంగిమలు ఏర్పడుతున్నాయి. అసలు ఈ శరీర భంగిమలు ఎందుకు వస్తున్నాయో ఈ శరీర ఆసనాలు వేటిగా పిలుస్తారో అతనికి అర్థమయ్యే సరికి శ్వాసలో మార్పు రాసాగింది.శ్వాస దీర్ఘంగా సాగుతోంది. తన ప్రమేయం లేకుండానే శ్వాస లోపలికి వెళితే ఓ పట్టాన బయటికి రావటం లేదు. ఈ లోపల తన పొట్ట ఉబ్బుతోంది.ఆ తర్వాత ఎవరో పీల్చి నట్టు గా బయటికి వస్తుంది ఇలా బయటకి వెళితే శ్వాస ఒక పట్టాన లోపలికి వెళ్లడం లేదు.శ్వాస లేకపోతే తను చచ్చిపోతానేమోనని భయం కలిగినది. పైగా కాళ్లు చేతులు చాలా మొద్దుబారిపోయినాయి అవి కదలలేని స్థితి.అవి కదల్చలేని స్థితి.ఇలా సుమారు 3 గంటల పైగా అతని ప్రమేయం లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆసనాలు నుంచి బయటికి రాగానే కొద్దిసేపటి తర్వాత లేచి దాహం వేయడంతో నీళ్లు తాగి వచ్చాడు. అప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తుండగా ఇదంతా తనలో శక్తిపాతము వలన జాగృతి అయిన అయిన కుండలిని శక్తి వలన తనలో ఉన్న వివిధ యోగ చక్రాలులో ఉన్న పూర్వ కర్మలు అన్నింటినీ దగ్ధం చేసి ఉంటుందని అంటే ఇంత సేపు ఈ ఆసన ప్రక్రియ వలన తనలో చక్రాలు జాగృతి అయ్యాయి అని వాడికి అర్థమయ్యేసరికి సిద్ధగురువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తనపై కరుణ చూపినందుకు ఆనందపడి నాడు.కానీ మనస్సు ఉత్సాహంగా లేదు. ఏ వస్తువు మీద లగ్నం కావడం లేదు. అశాంతిగా ఉండేది.ఒళ్ళంతా పొగలు సెగలు కక్కుతున్నట్లుగా కడుపులో అగ్నిపర్వతం ప్రేలినట్లుగా మంటగా వేడిగా అనుభూతి పొందినాడు.ఎవరో తనని తడిబట్ట పిండినట్లుగా తనలోని నరాలన్నిటిని పిండుతున్న భావన నెమ్మదిగా బలపడసాగింది. స్థిరముగా కూర్చోలేక పోయేవాడట. అలాగని నిల్చునిలేక పోయేవాడట. నడవలేక పోయేవాడట.నడుస్తుంటే పడుకోవాలి అని అనిపించేదట. పడుకుంటే మళ్లీ లేవాలనిపించేదట. అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుండేది.ఇలా కొన్ని వారాలు జరిగిపోయాయి. ఆ తర్వాత ఈ ఆసనాలు ఏమిటని విచారించగా అవి గోముఖ, స్వస్తిక, పద్మ, వీర, సింహ, భద్ర, ముక్త, మయూర,సుఖ,, సిద్ధ అనే పది యోగాసనాలు అని స్ఫురణకు వచ్చినాయి.ఎందుకంటే తను చిన్నప్పుడు ఆరోగ్యం కోసం ప్రతి రోజు యోగాసనాలు, యోగముద్రలు వేసేవాడు. కానీ ఇప్పుడు తన ప్రమేయం లేకుండా ఈ ఆసనాలు వేస్తున్నాడట. అదే విచిత్రంగా ఆశ్చర్యంగా ఉందని అనిపించిందట. ఎప్పుడూ ఈ ఆసనాలు వస్తాయో అతనికి అర్థం కాని స్థితి అట.ఉన్నట్టుండి శరీరం నేల మీద పడి పోయి ఏవొ ఆసనాలు వెయ్యడం తన ప్రమేయం లేకుండా జరిగిపోయేది.సుమారు ఇలా మూడు లేదా ఐదు గంటలపాటు చేయాల్సి ఉంటుంది. తిరిగి మామూలు మనిషిగా రావాలంటే మళ్ళీ మూడు రోజులు పట్టేది. అంటే తను పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలోని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ,ప్రత్యాహార ,ధారణ, సమాధి లో మూడవ యోగము (ఆసనం) లో ఉన్నాను అని వాడికి స్ఫురణ వస్తున్న సమయంలో మళ్లీ తల పాము పడగలాగా విపరీతంగా ఊగడము,ఆ తర్వాత మెడ తల శరీరం ఒక సరళరేఖలో ఉండునట్లు ఉండే భంగిమలో వచ్చీరాగానే ఇరవై నిమిషాల తర్వాత ఏదో తెలియని విద్యుల్లత వంటి శక్తి తన వెన్నుపాము క్రింద నుండి నెమ్మది నెమ్మదిగా అప్పుడప్పుడు కప్పగంతులు వేస్తున్నట్లుగా చీమలు పాకుతున్నట్లుగా,పాము పాకుతున్నట్లుగా ఏదో విద్యుత్ అయస్కాంత శక్తి మొదట మల ద్వారము వద్ద, మర్మాంగం వద్ద, బొడ్డు వద్ద, వక్షస్థలము మధ్యలో ,గొంతు వద్ద, భ్రూమధ్యంలో, మెదడు మధ్య భాగంలో, హృదయములో,మాడు ప్రాంతంలో ప్రవేశించినట్లుగా అనిపించేసరికి ఏదో తెలియని అలవిగాని దివ్య ఆనందం అనుభూతి పొందుతుండగా మనస్సు లేని స్థితి అంటే ఇదే కాబోలు అనుకుంటూ ఎంతటి మృదుమధురమైన మహోన్నతమైన స్థితి అనుకుంటుండగా ఎవరో తనని వెనక్కి పిలుస్తున్నారనిఈ శక్తి ఎలా అయితే పైకి వెళ్ళినదో అంతే వేగంగా క్రిందకి అలా వచ్చేసింది.ఇది అంతా ఒక రెప్పపాటు కాలంలో జరిగినట్లు గా అనిపించింది కానీ నిజానికి ఇది అంతా సుమారుగా మూడు గంటల పైన ఈ విధి విధానము జరిగిందట. ఆ తర్వాత ఈ భాగాలలో ఏమున్నాయని విచారించగా 12 యోగ చక్రాలు ఉంటాయి అని అంటే కుండలినీశక్తి యోగ చక్రాలను జాగృతి చేసిందని తెలుసుకొనే లోపలే అలవిగాని నిద్ర వచ్చేసరికి గాఢ నిద్రలోకి జారుకున్నాడట. మరి ఆలస్యం ఎందుకు.ఇప్పటికే మీకు కూడా బాగా ఆలస్యమైనది కదా. మీరు కూడా బాగా నిద్ర లోనికి వెళ్లండి. నిద్ర లేచిన తర్వాత మనమంతా కలిసి ముందుకి వెళదాం.

గమనిక :

ఈ సిద్ద మార్గంలో ప్రయాణించే వారికి మొదట యోగాసనాలతో శరీర శుద్ధి జరిగిన తర్వాత కుండలినీ శక్తి జాగృతి వలన యోగ చక్రాలు జాగృతి అవుతాయి. అదే జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికి కొన్ని క్షణాల పాటు అన్ని యోగ చక్రాలు జాగృతి అవుతాయి. తర్వాత ఇది శాశ్వతంగా ఉండేందుకు యోగ చక్రాలలో కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క చక్రము నెమ్మదిగా నెమ్మదిగా జాగృతి అవుతూ పైకి చేరతాయి. ఒక్కొక్క చక్రంలోనికి ఈ శక్తి వెళుతున్నప్పుడు జాగృతి అయ్యి ఒక్కొక్క అనుభవంను ఇస్తాయి. అవి ఏమిటో రాబొవు అధ్యాయాలలోచూడండి.

కపాలమోక్షం - 52 - మా ఇంటికి గణపతి వచ్చాడు

(నా మూలాధార చక్ర అనుభవాలు)

మూలాధార చక్ర అనుభవాలు నా డైరీలో:

ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు,అనుభవాలు నిజాయితిగా నా డైరీలలో వ్రాసుకోవడము జరిగినది.అందరికి తెలియాలనే ఉద్ధేశ్యముతో వాటిని యధాతధముగా ఇక్కడ ఇవ్వడము జరిగినది. తప్పుగా అనుకోవద్ధు. వీటి వలన ఎవరికైన ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి.

అలాగే ఈ చక్రానుభవాలు,ఈ దైవికవస్తువులు అనేవి మీకు మీ ఆరాధన బట్టి వస్తాయి.మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్రానుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహరాధన అయితే ఈ చక్రానుభవాలతోపాటుగా ఈ చక్రదైవికవస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్రదర్శనాలైన కలుగుతాయని గ్రహించండి. కాని తప్పని సరిగా ఈచక్రానుభవముతోపాటుగా ఈ చక్రదైవిక వస్తువు ఏదో ఒకటి తప్పని సరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్రానుభవాలు అలాగే ఈ చక్రదైవికవస్తువులు అనేవి మీ గతజన్మ సాధన బట్టి ఈ చక్ర జాగృతి,శుద్ధి,ఆధీన,విభేదనలకి సంబంధించి ఆయా సాధన స్ధితిని బట్టి వస్తాయని గ్రహించండి.

జులై 1: ఈరోజు నాకు ధ్యానములో ఏదో తెలియని పదార్ధ వాసన వస్తుంది. దానితో నాకు ధ్యాన భంగమైనది. తీరా కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు.

జులై 8: ఈరోజు నాకు ధ్యానములో మలము వాసన బాగా వచ్చినది. ఎక్కడైనా డ్రైనేజీ దెబ్బతిని ఉన్నదా లేదా ఇంట్లో దెబ్బతిన్నదా.దాని వాసనకి వాంతులు వచ్చేటట్లుగా ఉంది అనుకోగానే నాకు ధ్యాన భంగమైనది.

జులై 12: ఈరోజు నాకు ధ్యానములో జుట్టు కాలుతున్న వాసనలు విపరీతంగా రావటంతో నాకు ధ్యాన భంగమైనది.తీరా కళ్ళు తెరిచి చూస్తే ఎలాంటి వాసన లేదు. కేవలం నాకు ధ్యానంలోనే ఈ వాసనలు వస్తున్నాయి అని తెలుస్తోంది.

జులై 15: ఈరోజు విచిత్రంగా చీము వాసన వస్తుంది. వామ్మో!చీములాంటి మాగురు వాసన ఇది. వామ్మో!నా వల్ల కాదు అనుకుంటూ ధ్యాన భంగము చేసుకున్నాను.

జులై 16: ఈరోజు గుద స్థానము లోపల విపరీతమైన నొప్పి రావటం మొదలైంది. ఇది దేనికి సంకేతం.

జులై 20: ఏదో శక్తి గుద స్థానంలో సుడులు తిరుగుతున్నట్లుగా అనుభవ అనుభూతి కలగ సాగింది. చెడు వాసనలు రావటం తగ్గినాయి.

జులై 22: విచిత్రంగా నాకు ధ్యానములో నాకు తెలియకుండానే కొద్దిపాటి చుక్కలు చుక్కలుగా మూత్రము బయటికి వచ్చింది. నాకు ఏమైనా మూత్ర వ్యాధులు వచ్చినాయా లేదా వస్తున్నాయో ఏమో

జులై 27: ఈరోజు నాకు తెలియకుండానే నాకు ధ్యానములో కొద్దిపాటి వీర్యం కూడా బయటకి వచ్చింది. వామ్మో అసలు నాకేమి జరుగుతోంది. నేను పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. భయం వేస్తోంది.

జులై 29: ఈరోజు నా మూలాధార చక్ర స్థానంలో ఏదో శక్తి విపరీతంగా సుడులు తిరుగుతోంది. తద్వారా నా ప్రమేయం లేకుండా నా మర్మాంగం ఉద్రేకం చెందుతోంది. అసలు నాకేమీ జరుగుతుందో తెలుసుకోవాలి. పుస్తకాలు చదవాలి. ఈరోజు విచిత్రంగా నాకు నా స్నేహితుడు నా కోసం విజయవాడ నుండి ఒక అంగుళం ఉన్న పంచలోహ గణపతి విగ్రహం తెచ్చినాడు. దానిని నా పూజ మందిరంలో పెట్టుకొని పూజించడం ఆరంభించినాను.

ఆగష్టు 1: ఈరోజు పుస్తకాలు చదివితే ఇప్పటిదాకా నాకు జరిగిన అనుభవాలు మూలాధార చక్ర జాగృతి సంబంధించినవి అని తెలిసినది.అంటే కుండలినీ శక్తి ప్రవాహం మూలాధారచక్రము లోనికి ప్రవేశించడానికి ప్రయత్నాల్లో ఈ అనుభవాల భాగం అని తెలుసుకున్నాను..

ఆగష్టు 5: ఈ మూలాధార చక్ర శుద్ధికి నేను ధ్యానము ముందు ఏదైనా పూల వాసన చూసి వాసనను జ్ఞాపకం ఉంచుకొని ధ్యానమునకు కూర్చుంటే మూలాధారచక్రము శుద్ధి అవుతుందని మా గురుదేవులు చెప్పినాడు.ఇలా ఆరునెలలపాటు చేయాలంట.

ఆగష్టు 7: ఈ మూలాధార చక్ర శుద్ధి అవుతున్న సమయంలో నాకు ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు అనగా తల్లిదండ్రుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ,బంధుమిత్రుల గురించి ఆలోచనలు అది కూడా ధ్యానంలోనే రావడం గమనించాను.

ఆగష్టు 12: నాకు ధ్యానములో వచ్చే వివిధ రకాల చెడువాసనలు అనేది నా గత జన్మలలో నేను చేసిన పాప కర్మ ఫలితాలని నా గురుదేవుడు చెప్పినారు. ధ్యానంలో ఉండగా మన దగ్గర లేని ఏదైనా పదార్థం వాసన అది మంచిదే గాని చెడుదే గాని వచ్చిన కూడా వాసనను గురించి ఆలోచించకుండా, పట్టించుకోకుండా కళ్ళు తెరవకుండా ధ్యాన భంగము కాకుండా చేసుకోమని నా గురుదేవుడు చెప్పినాడు.

నాకు వచ్చిన శోణా నది నుండి గణపతి శిల

ఆగష్టు 15: ఇలాంటి చెడు వాసన వస్తుంటే మూలాధార చక్ర శుద్ధి ప్రారంభమైనట్లేనని ఈరోజు నా గురుదేవుడు చెప్పినారు. ఈరోజు నాకు శివ పంచాయతనంలోని శోణా నది నుండి గణపతి శిల నాకు వచ్చినది.

ఆగష్టు 18: ఈరోజు నేను విచిత్రంగా ధ్యానము చేసుకుంటున్నా ఆసనము నుండి నా ప్రమేయం లేకుండా క్రింద పడి పోయాను. గురు దేవుడిని దీనిని గూర్చి అడగాలి.

ఆగష్టు 20: మూలాధార చక్ర శుద్ధి సమయంలో కుండలిని శక్తి ప్రవాహం ధాటికి తట్టుకోలేక పోవటం వలన ఇలా జరుగుతుందని నా గురుదేవుడు చెప్పినారు.దానితో ఆయన మూలబంధం ఎలా వేయాలో నేర్పించి అభ్యాసం చేయించారు.

ఆగష్టు 28: నాకు ధ్యానంలో శరీరం ఊగడం, పడిపోవడం యొక్క తీవ్ర ఉధృతి తగ్గిస్తున్నట్లు అనుభూతి కలగ సాగింది.

నాకు వచ్చిన శ్వేతార్క గణపతి విగ్రహం

సెప్టెంబర్ 2: విచిత్రంగా ఈ మధ్య నేను ఏదైనా దేవాలయం క్షేత్రాలకి వెళుతుంటే నాకు విపరీతంగా నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. దీనిని గూర్చి గురుదేవునిని అడిగితే ఈ చక్రములోని ప్రారబ్ద కర్మలు నివారణ ఫలితమని ఈ విధంగా చక్ర శుద్ధి అవ్వడం ఒక భాగం అని చెప్పినారు.ఈ రోజున నాకు కాణిపాక క్షేత్రం నుండి శ్వేతార్క గణపతి విగ్రహం తీసుకొని వచ్చి ఇచ్చినారు.

సెప్టెంబర్ 10: ఈరోజు నాకు ధ్యానములో నా శరీరం బాగా తేలికై గాలిలో ఎగురుతుందేమో అన్నట్లుగా అనుభవ అనుభూతి కలగ సాగింది. దీనిని గూర్చి గురుదేవుడుని అడగాలి.ఈరోజు శ్వేతార్క గణపతిని పూజిస్తుంటే నా చేయి వేలు తెగి రక్తం ఈ విగ్రహం మీద పడినది. అంటే ఈ మూర్తికి నా రక్తముతో ప్రాణప్రతిష్ట జరిగినది అన్నమాట.

సెప్టెంబర్ 13: ఈరోజు నా గురుదేవునిని కలిసి నాకు కలిగిన అనుభవం గురించి చెబితే “నాయనా! పూర్వజన్మ కర్మ వాసనలు తొలగుతూ ఉన్నప్పుడు మీ ప్రారబ్ధ కర్మల కి సంబంధించిన వ్యక్తులు ఆలోచనలు వస్తుంటాయి.తర్వాత వారి రుణాలు బంధాలు తీరుతూ ఉండేసరికి అప్పటిదాకా వాటిని మోస్తున్న నీ మూలాధార చక్రం శుద్ధి అవుతూ వచ్చినది. దాంతో మీ శరీరం తేలికగా అవ్వటం మొదలైంది. దీనిని తట్టుకోవాలి.లేదంటే ఎప్పుడైనా ఈ చక్రము ఉత్తేజం పొందితే నువ్వు కూడా పక్షిలా గాలిలో ఎగురుతూ ఉంటావు జాగ్రత్త” అని చెప్పినారు.

సెప్టెంబర్ 20: ఈరోజు నేను నా ధ్యానంలో ఒక అంగుళం మేర గాలిలో లేచిన అనుభవం నా కళ్ళతో నేనే చూసుకునేసరికి గుండె ఆగినంత పని అయింది. దానితో నేను నేల మీద దబ్బున పడి ఉన్నాను.వెంటనే గురుదేవుని కలవాలి అనుకున్నాను. ఈరోజు శ్వేతార్క గణపతి కోసం ముత్యాల మాల వచ్చినది.ఆయనికి వేసినాను.

సెప్టెంబర్ 21: నా విషయం చెబితే ఆయన నా శరీరము తట్టుకోవటానికి ఎనిమిది రకాల ఆసనాలు అదే పతంజలి అష్టాంగ యోగము చెప్పిన ఆసన అంగంలోని ఎనిమిది రకాల ఆసనాలు నాచేత చేయించి అభ్యాసం చేయించారు.

సెప్టెంబర్ 22: నాకు ధ్యానము నందు మనస్సు స్థిరమై తీవ్రమైన ధ్యానం చేస్తున్నానని అనుభవ అనుభూతి కలగ సాగింది.

సెప్టెంబర్ 30: ఈరోజు వినాయక చవితి. పూజ శ్రద్ధగా చేశాను. విచిత్రంగా పూజ అయిన తర్వాత గణపతిలాంటి లావున్న ఒక వ్యక్తి మా ఇంటికి బిక్షకు వచ్చి ఉండ్రాళ్ళు,పానకము వడ పప్పు తిని వెళ్ళినాడు. ఇదేమి విచిత్రమో నాకు అర్థం కాలేదు.

అక్టోబర్ 1: ఈరోజు విచిత్రంగా నేను ధ్యానంలో ఉండగా నా శరీరం నా ప్రమేయం లేకుండా ఒక అడుగు గాలిలోకి పైకి లేవటం లేస్తుందేమో అనుకోనేసరికి నాకు ధ్యాన భంగమైనది.

అక్టోబర్ 5:ఈరోజు కూడా నేను గాలి లోనికి లేవటం జరుగుతుంది.ఆసనాలు వేస్తున్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది.వామ్మో! మా మామయ్య లాగానే నేను కూడా చనిపోతానా? ఆయన కూడా శ్రీశైలంలోని ఘంటా మఠంలో ఆకాశ సిద్ధికి ప్రయత్నం చేస్తూ గాలిలో ఒక అడుగు మేర లేచిన ఆరు నెలలకి మూత్రపిండాల వ్యాధితో మరణించారు అని తెలిసింది.

అక్టోబర్ 10: నేను గాలిలో లేవటం గూర్చి మా గురుదేవులుని అడిగితే “కంగారుపడకు. నీకు భూచరసిద్ధి వచ్చినది అంటే భూమి మీద ఆధిపత్యం వహిస్తావు. అది నీకు ఆధీనమైంది” అని చెప్పినారు.

అక్టోబర్ 12: నాకు ఈ రోజు ఒక ఆశ పుట్టినది. నాకు భూమి మీద ఆధిపత్యం వచ్చినది. నేను చెప్పినట్లుగా ఈ భూమి నా మాట వింటుందని ఇలాంటి విపరీతమైన ఆలోచనలు నన్ను వెంటాడినాయి. నాకు ధ్యానము కుదరలేదు.

నాకు వచ్చిన క్షిప్ర గణపతి రాతి విగ్రహమూర్తి

ఈరోజు నాకు క్షిప్ర గణపతి రాతి విగ్రహమూర్తి అడుగు పరిమాణము ఉన్న విగ్రహం వచ్చినది.ఇది ఎంతో సజీవ కళతో ఉండటంతో ఈయన కళ్ళకి వెండి కళ్ళు అమర్చాను.

అక్టోబర్ 18: ఈ రోజు నాకెందుకో ఆడపిల్లల మీద విపరీతమైన కామవాంఛలు కలుగుతున్నాయి. అదికూడా ధ్యానములో. విచిత్రంగా ఉంది. ఈ విషయం గూర్చి గురుదేవుని అడిగితే.. ఆయన నా గురించి చెడుగా అనుకుంటే.. వద్దు. అడగవద్దు.

అక్టోబర్ 20: ఈ రోజు దుర్గాష్టమి. కానీ అమ్మవారి ధ్యాస కన్న అమ్మాయి ధ్యాసయే నాకు ధ్యానములో అవుతుంది. వామ్మో ఏం జరుగుతోంది.

అక్టోబర్ 30: ఈ రోజు నాకు ధ్యానంలో విపరీతంగా నా మర్మాంగము ఎందుకో ఉత్తేజం పొందినది. వామ్మో కామవాంఛలు తట్టుకోలేమా?

నవంబర్ 2: ఈ రోజు నాకు పంచముఖ గణపతి ఫోటో బహుమతిగా వచ్చినది.

నవంబర్ 5: ఈరోజు నాకు షిరిడి నుండి విద్యా గణపతి పాలరాతి విగ్రహ మూర్తి వచ్చినది.

నవంబర్ 8: ఈరోజు గుడి మీద ఉన్న పావురాల సంయోగము చూశాను. అలాగే చిలుకల సంయోగము చూశాను. దానితో కామ ఉద్రేకము పెరిగినది.

నవంబర్ 10: వామ్మో! ఈ రోజు నా మర్మాంగం ఉద్రిక్తత దెబ్బకి ఏ ఆడపిల్లయినా దొరికితే అనుభవించాలనే కోరిక విపరీతంగా కలుగుతోంది.

నవంబరు 20: వామ్మో! కనీసం ఒక్క ఆడ కుక్క అయినా దొరికితే బాగుండును. ఈ కామవాంఛలు  తట్టుకోలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు.

నవంబర్ 27: వామ్మో! ధ్యాన సమయంలోనే నా ప్రమేయం లేకుండా ఎందుకు నా మర్మాంగము ఉత్తేజం చెందుతుంది.ఏది అయితే అది అయింది.దీనిని గూర్చి గురుదేవునినిఅడగాలి.లేదంటే ఆడ జాతికి నా వలన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఈరోజు యోగివేమన సినిమాను మా బంధువుల అమ్మాయితో కలిసి చూశాను. ఈ రోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న ఫోటో చూశాను. నాకు చాలా ఆశ్చర్యమేసినది.

నవంబరు 28: వామ్మో! 80 సంవత్సరాల ముదుసలి మీద కూడా కామవాంఛలు ఉండటం ఏమిటి? అసలు నాకు ఏమి జరుగుతుంది. ఈ రోజు యోగి వేమన శతకాల పుస్తకం కొని చదివాను.పద్యాలు చదువుతున్నంతసేపు స్త్రీల మీద, కామము మీద వైరాగ్య భావాలు కలిగినాయి. పుస్తకము మూయగానే నాలో కామ వాసనలు తెరుచుకునేవి.

నవంబర్ 30: ఈరోజు ఎద్దు ఆవు, గేదె దున్నపోతు, కాకుల సంయోగం చూశాను. దానితో నాలో మన్మధుడు నిద్రలేచాడు.

డిసెంబరు 1: పాపం రా! ఐదు సంవత్సరాల చిన్న పిల్లల మీద కూడా ఏమిటిరా నీ కామవాంఛలు ఆలోచనలు. అసలు నీకు బుద్ధి లేదు రా.

డిసెంబర్ 5:పాపిష్టి వెధవ! చివరికి కన్న తల్లి మీద కూడా నీకు కామవాంఛలు కలగటం ఏమిటిరా. మనసా! నీ మెదడు దొబ్బినదా.అసలు నాకు ఏమి జరుగుతోంది. గురుదేవునిని అడగాలి.ఈరోజు పుండరీకుడి సినిమా చూశాను. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలుసుకున్నాను.

ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం

ఈ రోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న పంచలోహ విగ్రహమూర్తి చూడటము జరిగినది. నాకు చాలా ఆశ్చర్యమేసినది.

డిసెంబర్ 7: వెధవ నాయాల! అక్క, చెల్లి మీద కూడా కామవాంఛలు రావడం ఏమిటి రా. ఈరోజు భక్తతుకారం సినిమా చూసి అందులో ఆయన ఎలా అయితే తనకు వచ్చిన కామమాయ పరీక్ష దాటినారో తెలుసుకున్నాను.

డిసెంబర్ 10: అందమైన అబ్బాయి ల మీద కూడా నీ మనస్సు పోవడం ఏమిటి రా. మనసా! అసలు నీకు ఏమి జరుగుతోంది. రానురాను తేడాగా మారతావా ఏమిటి. నాకైతే అర్థం కావడం లేదు.

డిసెంబర్ 15:ఆడ గేదెను అనుభవించాలని విపరీతమైన ధోరణికి ఎలా వెళుతున్నావు? మనుషులు జంతువులతో సంయోగం చేయటం ఏమిటి రా. మనసా! అసలు నీకు ఈ రోజు ఏమి జరుగుతోంది.

డిసెంబర్ 20: వామ్మో నాకు ధ్యానంలో కలిగే విపరీతమైన కామవాంఛలు ధోరణి గూర్చి ఎలాగైనా నా గురుదేవుడుని అడిగి తెలుసుకోవాలి. లేదంటే నాకు నయం కాని ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మర్మాంగము దెబ్బకి తట్టుకోలేకపోతున్నాను. ప్రణవ మంత్రము కాస్త ప్రణయమంత్రము అయ్యేటట్లుగా ఉంది.

ఈ రోజు ఉచ్ఛిష్ట గణపతి శృంగార దృశ్యం ఉన్న రాతి విగ్రహమూర్తి చూడటము జరిగినది. నాకు చాలా ఆశ్చర్యమేసినది.

జనవరి 1:నా దీనావస్థ పరిస్థితి చూడగానే నా గురుదేవుడు చిరునవ్వు నవ్వి “కంగారుపడకు. నువ్వు ఈ చక్ర భూచర సిద్ద మాయలోని అహములో పడినావు.ఎప్పుడైతే నాకు ఈ భూమి ఆధీనము అయినదని అనుకున్నావో తక్షణమే ఈ చక్రం బలహీన పడటం మొదలైంది. దానితో ఈ మర్మాంగము యొక్క కామ వాంఛ కాస్తా విపరీతమైన ధోరణి లోకి వెళ్ళింది. తిరిగి ఈ చక్రము బలం చేకూర్చడానికి ఒక ఆరు నెలల పాటు పెసరపప్పు తో కూడిన అన్నము అనగా పులగము తినాలి. ఆతర్వాత నేను శృంగార ఉచ్చిష్ట గణపతి గూర్చి అడిగితే దానికి ఆయన వెంటనే “ భక్తుల అభీష్టానికీ, ఊహలకూ అనుగుణంగా తమ ఇష్టదేవతను వివిధ రూపాలలో పూజించుకోవడం అంతటా ఉండేదే! అలాగే గణపతిని కూడా 32 రూపాలుగా కొలుచుకునేవారని శ్రీతత్వనిధి వంటి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. వారిలో ఒక భిన్నమైన రూపమే ఉఛ్చిష్ట గణపతి..

ఉచ్ఛిష్ట గణపతి రూపం తంత్రోపాసనకు ప్రసిద్ధం. వామాచారానికి అనుగుణంగానే ఈ గణపతి నగ్నంగా కనిపిస్తాడు. ఆ గణపతి తొడ మీద శక్తి స్వరూపిని అయిన దేవత కూడా నగ్నంగానే కనిపిస్తుంది. అలాగే ఈ గణపతి తన ప్రక్కన ఉన్న అమ్మవారి రహస్య మర్మాంగమైన యోని భాగమును తన తొండముతో తాకుతూ ఉంటే...ఆ అమ్మవారు అయితే తన భర్త రహస్య మర్మాంగమును పట్టుకొని ఉంటుంది. చాలా గ్రంథాలలో ఈ గణపతిని నీలం రంగులో ఉన్నవాడిగా వర్ణిస్తారు. సాధారణంగా ఆరు చేతులతో కనిపించే ఈ గణపతి దానిమ్మపండు, వీణ, అక్షమాల, నీలపు పద్మాలను ధరించి దర్శనమిస్తాడు. ఈయన ఉచ్ఛిష్ట గణపతి కాబట్టి, తాంత్రికులు ఏదో ఒకటి (తాంబూలము, మోదకము..) నములుతూ ఈయనను ఆరాధిస్తారు. సాధారణ జనాలని దూరంగా ఉంచేందుకు తాంత్రికులు ఈ ఎంగిలి, నగ్నత్వం వంటి అసభ్యంగా తోచే లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారని కొందరి నమ్మకం. తమ ఆచారానికి అనుగుణంగానే వారు ఉచ్ఛిష్ట గణపతిని రూపొందించుకొని ఉండవచ్చు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు మొదలుకొని కోర్టుకేసులని పరిష్కరించుకోవాలనుకునే వారి వరకూ ఈ ఉచ్ఛిష్ట గణపతిని పూజిస్తూ ఉంటారు. అలాగే సంతాన సమస్యలున్నవారు ఈయనను పూజిస్తే త్వరలో సంతానవంతులవుతారు. నిరంతరం ఏవో ఆపదలు, అవాంతరాలతో కోరుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయేవారు, ఈ గణపతిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఉచ్ఛిష్ట గణపతి మంత్రం ఆయన ప్రతిరూపాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. అది...

నీలాబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్

దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః

ఉచ్ఛిష్ట గణపతి రూపాలు ఉన్న ఆలయాలు చాలా తక్కువే. వాటన్నింటిలోకీ పెద్దది, ప్రముఖమైనదీ తమిళనాడులోని తిరువన్వేలిలో ఉంది. ఇక్కడి ఆలయంలో ఉన్న గణపతి తన తొడ మీద కూర్చుని ఉన్న శక్తి ఉదరభాగాన్ని, తొండంతో తాకుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ భంగిమ సంతానప్రాప్తిని సూచిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకనే సంతానాన్ని కోరుకునేవారు, ఈ ఆలయంలోని గణపతిని పూజిస్తే వారి కడుపు పండుతుందని తమిళులు నమ్ముతారు అని … అలాగే ఏ సాధకుడైతే  ఈ గణపతి విగ్రహమూర్తి దర్శనము పొందుతారో వారికి కామజయం కలుగుతుంది.అనగా ఇంద్రియ మనోనిగ్రహమును పొందుతాడు! కాబట్టి నీకు త్వరలో ఇంద్రియనిగ్రహము కల్గి కామజయం కలుగుతుందని సూచనగా ఈ చక్రము కల్గించే కామమాయ యందు జయం పొందాలని ఈ ఉచ్చిష్ట గణపతి అనేక రూపాలలో కనిపించి సూచన ఇచ్చాడని గ్రహించు! అని చెప్పడము జరిగినది.

జనవరి 10: నెమ్మదిగా గా నాలో విపరీత పశు ధోరణి కామపు ఆలోచనలు తగ్గటం మొదలైనాయి అని ఈరోజు నాకు అనిపించసాగింది.

జనవరి 15: ఈ రోజు ఎందుకో నాకు స్వార్ధ గుణము, తెలియని భయం నాలో కనబడ్డాయి.

జనవరి 20: ఈరోజు అందరినీ మూర్ఖపు పట్టుదలతో ఎదిరించడము జరిగినది. అది నాకు తెలుస్తుంది. కానీ ఆపుకోలేకపోతున్నాను.

జనవరి 28: ఈరోజు విచిత్రంగా అందరితో అనాగరిక మనస్తత్వంతో మూర్ఖంగా ప్రవర్తించాను. ఇలా ఎందుకు జరుగుతుందో గురుదేవుడుని అడగాలి.

ఫిబ్రవరి 3: నా మానసిక రుగ్మతలు గూర్చిగురుదేవుడుని అడిగితే “మూలాధార చక్రం బలహీన పడుతున్నప్పుడు వచ్చే సమస్యలని… వీటిని ఇప్పుడే అదుపు చేయాలని లేదంటే ఈ చక్రం మరింతగా బలహీనపడుతుందని తద్వారా మనకి ఎముకల వ్యాధులు,కీళ్ళ వాతము, నయంకాని కురుపులు, చర్మవ్యాధులు, కంటి చూపు తగ్గటం ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వీటి నివారణ కోసం కొన్ని రకాల చేతి ముద్రలు చేయాల్సి ఉంటుందని అనగా అశ్విని ముద్ర, పృద్వి ముద్ర, మహాముద్ర అలాగే మూలబంధనము చేయాల్సి ఉంటుందని చెప్పి అవి ఎలా చేయాలో, ఎలా వేయాలో చెప్పి నా చేత చేయించారు.

మార్చి 4: ఈరోజు నాకున్న మానసిక రుగ్మత లక్షణాలు క్రమేణా నా నుండి దూరం అవుతున్నాయని నాకు ధ్యానంలో అనిపించసాగినది.ఈ రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా జాగరణ చేస్తున్నాను. అనుకోకుండా ఈ రోజు పరమానందయ్య శిష్యుల కథ సినిమా చూశాను. అందులో హీరో గారు స్త్రీ మూర్తి స్తన్యమును లింగమూర్తిగా భావించుకొని ఆరాధించడము ఈ దృశ్యము నాకు బాగా నచ్చినది. అందుకే కాబోలు మహా శివుడికి ఈ పూజా విధానము నచ్చి మెచ్చినారు గదా అని అనిపించినది.

మార్చి 10: ఈరోజు నాకు ధ్యానంలో తుమ్మెదల ఝుంకార నాదము విచిత్రంగా వినిపించసాగింది. కొంపదీసి నా కడుపులో తుమ్మెదలు కూడా గూడు పెట్టలేదు కదా అనే సందేహం వచ్చే సరికి నాకు ధ్యాన భంగమైంది.ఇది ఏమిటి క్రొత్తగా. ఈ నాదం వినబడటం ఏమిటో అర్థం కావడం లేదు.

మార్చి 27: ఈ రోజు నా పుట్టిన రోజు.అయినా ఆనందము గా లేను. నా ధ్యానములో తుమ్మెదల నాదముకి నా చెవులు దెబ్బతిని చెముడు వస్తుందో ఏమో అని భయంగా ఉంది. దీనిని గూర్చి నా గురుదేవుడుని అడగాలి.

ఏప్రిల్ 1: ఈ నాదము ఈరోజు బాగా చాలా స్పష్టంగా వినబడుతోంది.ఎవరో నా లోపల కూర్చుని ఈ నాదం చేస్తున్నట్లుగా నాకు అనిపించినది.

ఏప్రిల్ 3: ఈ నాదమును బాగా జాగ్రత్తగా వింటుంటే ఏదో ప్రాణం కదలిక వలన అలలుగా విడిపోతూ ఈ శబ్దము వస్తుందని నాకు అనిపించసాగింది.

ఏప్రిల్ 15: ఏదో నీటి అలలు బాగా కదిలితే వచ్చే శబ్దం లాగా ఈ ఝుంకారనాదం రానురాను వినబడసాగుతోంది. అసలు నాలో నాకు ఏమి జరుగుతుంది.

ఏప్రిల్ 16: ఖచ్చితంగా ఈ శబ్ద నాదము నా మూలాధారచక్రము లోని ఏదో అలల మాదిరిగా వస్తుందని నాకు అర్థం అవసాగింది.

ఏప్రిల్ 18: ఈ రోజు విచిత్రంగా ఈ అలల నుండి 'లం' అనే శబ్దం వినబడుతోంది. ఇదేమి విచిత్రం.

ఏప్రిల్ 20: నేను ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు విచిత్రంగా నా మనస్సు అంతా ఈ 'లం' అనే శబ్దంతో లయం అయిపోయినట్లుగా అనిపించసాగింది.

ఏప్రిల్ 25: రానురాను ఈ చిన్న శబ్దం కాస్త చాలా పెద్దదిగా చాలా స్పష్టంగా 'లం' అనే శబ్దనాదం వినబడుతుంది అని నాకు అనిపించసాగింది.

ఏప్రిల్ 28: ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో నాలుగు దళాలు ఉన్న ఏదో కమలంగా దాని మధ్యలో 'లం' అనే సంస్కృత బీజాక్షరము ఉన్నట్లుగా అలాగే నాలుగు దళాల మీద వం,శం,షం,సం అనే అక్షరాలు ఉన్నట్లుగా ఎరుపు వర్ణంలో కొన్ని క్షణాల పాటు కనబడినది.

మే 1: ఈ రోజు విచిత్రంగా 'లం' అనే బీజాక్షరము బదులుగా శివలింగం దాని చుట్టూ ఏదో పాము చుట్టుకుని ఉన్నట్లుగా కనిపించింది.

మే 5:ఈ రోజు విచిత్రంగా మట్టి రంగులో వున్న ఒక ఏనుగు తల కనబడింది. పైగా అది తన తొండము అటు ఇటు ఊపుతూ నాకేసి చూస్తున్నట్లు గా కనిపించింది. వామ్మో ఈ ఏనుగు ఏమిటి?ఈ శివలింగం ఏమిటి? పద్మము కనిపించటం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.దీనిని గూర్చి గురుదేవుని అడగాలి అనుకున్నాను.ఈ రోజు చింతామణి గణపతి గూర్చి వివరాలు చదవడం జరిగినది.

మే 11: నాకు కలిగిన ఈ చక్రము అనుభవాలు గూర్చి మా గురుదేవునిని అడిగితే దానికి ఆయన “నాయనా! అవి అన్నీ కూడా శుభసూచకాలే.నీకు మూలాధారము చక్రము జాగృతి, శుద్ధి, ఆధీనమైంది. ఈ చక్రమునకు అధిపతి మహాగణపతి. దీనికి నిదర్శనమే ఏనుగు దర్శనం అన్నమాట. అలాగే ఈ చక్ర అధిష్టాన దైవం పరబ్రహ్మము. దీనికి నిదర్శనమే శివ లింగ మూర్తి దర్శనం. అలాగే ఈ చక్రం యొక్క పద్మము 4 దళాలతో 'లం' అనే బీజాక్షరము కలిగి ఉంటుంది. ఇక ఈ లింగమూర్తిని చుట్టుకున్న పాము సంగతికి వస్తే అది ఈ బ్రహ్మాండమును మోసే ఆదిశేషుడు అని గ్రహించు. పైగా ఈ ఆదిశేషుడు అంటే సర్పమే కదా. అందుకే మన కుండలిని శక్తి సర్పాకృతిలో ఉంటుందని శాస్త్ర వచనము.ఈ సర్పము యొక్క కదలిక శబ్దనాదమే 'లం' అనే బీజాక్షరము నాదం అని గ్రహించు..ఈ విశ్వ సృష్టిలో ప్రతి పదార్థానికి ఒక శబ్దం ఉంటుంది. ఈ శబ్దమే అన్ని అణువులను కలిపి ఉంచటం వలన అది మనకు పదార్థంగా కనబడుతుంది. లేకపోతే పదార్థం ఏర్పడదు. అణువులుగా విడిపోతాయి. కనబడతాయి. అలా ఈ విశ్వ సృష్టికి మూల పదార్థం ఈ మూలాధార చక్రము గావడము వలన అందులో  'లం' అనే బీజాక్షర నాదమే ఈ మూల పదార్థం అణువులను కలిపి ఉంచుట వలన మనకి ఈ బ్రహ్మము కాస్త బ్రహ్మ పదార్థంగా బ్రహ్మాండంగా కనబడుతుంది.అందుకే మూల ఆది పరబ్రహ్మముగా రేణువు వంటి మహా గణపతి ఉన్నాడని ఈపాటికి గ్రహించి ఉంటావు.ఈయన నుండి ఈ సకల జీవ స్వరూపాలు ఏర్పడినాయి. వాటి స్థూల శరీరములు ఏర్పడినాయి. అందుకే వీరికి ఏనుగు తల, ఎలుక వాహనం, పాము జంధ్యం మున్నగు వాటిని ఉంచినారు అని చెప్పడంతో నా మనస్సు కుదుటపడింది.

మే 18: ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో ఒక ఏనుగు తల కనిపించి తొండముతో ఏదో తీసుకుని లోపలికి పెట్టుకున్నట్లుగా లీల మాత్ర దర్శన అనుభవం కలిగినది. అది ఏనుగు తల లేదా గణపతి తల ఏదో మాత్రం తెలియరాలేదు.

మే 21: ఈరోజు నాకు ధ్యానంలో ఉండగా నిజంగానే నాకు భూమి మీద ఆధిపత్యం వచ్చినదో లేదో తెలుసుకోవాలనే చిలిపి ఆలోచన వచ్చింది.

మే 26: ఈ రోజు అనుకోకుండా 100 కేజీల బరువు ఉన్న దేవత విగ్రహలను నేనొక్కడినే దూదిపింజలాగా మోయడము నాకు ఆశ్చర్యం వేస్తోంది. కొంపతీసి భూమి ఆకర్షణ శక్తిని తట్టుకునే శక్తి నాకు వచ్చినదా ఏమో ఎవరికి ఎరుక.

మే 30:ఈ రోజు దేవతా విగ్రహలు ఉన్న పల్లకిని ఒక వైపు నుండి మోసాను. నాకు అంత బరువు గా అనిపించలేదు. విచిత్రంగా ఉన్నది.

జూన్ 2:ఈ రోజు అనుకోకుండా నా కాళ్ళ మీద బండ రాయి పడినను నాకేమీ కాకపోవటం విచిత్రంగా ఉంది. ఇదేనేమో భూచరసిద్ధి అంటే.

జూన్ 5: భూమి మీద ఆధిపత్యం పరీక్ష కోసం మరో ఆరు నెలలపాటు ఈ మూలాధార చక్ర ధ్యానం చేయాలని నిశ్చయించుకున్నాను.

జూన్ 18: ఈరోజు విచిత్రంగా నాకు ధ్యానంలో ఎవరో కాంతి శరీరమున్న నగ్న స్త్రీ మూర్తులు కనిపించి కవ్వించడం మొదలు పెట్టారు.నాలో మన్మధుడు నిద్ర లేస్తున్నాడని అనిపించింది.

జూన్ 25: ఈరోజు పార్వతి అమ్మవారు నగ్నంగా కనబడసాగింది. ఇదేమి ఖర్మయో అర్థం కావడం లేదు. వామ్మో!  నాకు ఏమి జరుగుతోంది. మళ్లీ ఈ మూలాధార చక్రం కాస్త బలహీన పడుతుందా? అర్థం కావడం లేదు.

జూన్ 27: ఇలా నాకు నగ్న స్త్రీ మూర్తులు, దేవతా స్త్రీ మూర్తులు కనిపించడం సర్వసాధారణం అయింది.దానితో నా మర్మాంగం ఉత్తేజం చెందడం ప్రారంభమైంది.కామ దేవత నాలో ప్రవేశించినట్లుగా అనిపించసాగింది.

జూలై 1:ఎప్పుడూ లేనిది ఈ రోజు అమ్మవారి విగ్రహమూర్తి మీద నాకే విపరీతమైన కామవాంఛ మొదలైంది. నాకు ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు.

జూలై 10: ఈరోజు తెగించి నాకు కలుగుతున్న మళ్ళీ కామ అనుభవాలు మా గురుదేవునిని అడిగితే దానికి “ఆయన మంచిదే కదా నీ చక్రం బలంగానే ఉంది. కాకపోతే ఇందులో నీవు చేసిన తప్పు ఏమిటంటే ఈ చక్రం ఇచ్చే యోగసిద్ధి పొందాలని అనుకోవడమే. అలా ఎప్పుడైతే అనుకున్నావో ఆ క్షణమే ఈ ప్రకృతి మాత తన భాగమైన భూతత్వ సిద్ధికి నీకు అర్హత ఉన్నదో లేదో పరీక్షించటానికి యధావిధిగా నీకు కామ యోగ పరీక్షలు పెట్టటం ఆరంభించినది. ఇన్నాళ్లు మానవ స్త్రీ మూర్తులు దర్శనమిచ్చారు. ఎప్పుడైతే ఈ సిద్ధి కోసం సాధన చేయటం ప్రారంభించినావో ఆ క్షణమే ప్రకృతి దేవతా శక్తి మాతలు నగ్నంగా కనబడి కామ పరీక్షలు పెట్టడం జరుగుతోంది.ఇది రానురాను వివిధ ఊర్ధ్వలోకాల నుండి నిజంగానే దేవతా స్త్రీలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు ఇలా 13 రకాల జాతి స్త్రీమూర్తులు నీ దగ్గరకి ప్రత్యక్షంగా వచ్చి నీ కామ సుఖం కోసం పరీక్షలు పెడతారు. ఎలా అంటే విశ్వామిత్రుడికి మేనక వచ్చి ఎలా అయితే పరీక్షలు పెట్టి వారి మాయలో వీరిని ఉంచి వీరి 10 లక్షల సం!!లు తపోశక్తిని నాశనం చేసినారో. అలా నీ సాధన శక్తిని నాశనం చేసి నిన్ను పంచభూత సిద్ధుల మాయలో ఉంచుతారు. నీకు సాధన ముందుకు వెళ్లాలంటే సాధన యోగసిద్ధులు వదులుకోవాలి. లేదంటే ఈ 13 రకాల జాతి దేవతల మాయలో పడి పోవాలి. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. ఇదే చేయమని నేను చెప్పను. ఒకటి గుర్తుంచుకో. ఎప్పుడైతే ఒక సిద్ధి నువ్వు పరీక్షించాలని అనుకున్నప్పుడు ఒక పరీక్షతో అది ఆగిపోదు.అనేక పరీక్షలకి దారితీస్తుంది. దానితో ఈ సాధన శక్తి తరిగిపోతుంది. అప్పుడు కుండలినీశక్తి నిద్రావస్థ కి చేరుకుంటుంది. నువ్వు తిరిగి మాయలో పడతావు. పునః జన్మలు ఎత్తుతావు అని చెప్పినారు.

జూలై 18: ఈరోజు రజనీకాంత్ నటించిన బాబా చిత్రం చూశాను. దానితో యోగ శక్తుల జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాను.

జూలై 25: ఈరోజు విచిత్రంగా లీలామాత్రంగా నా మహాగణపతి విగ్రహమూర్తి కనిపించి నవ్వుతున్నట్లుగా తొండం ఊపుతున్నట్లుగా, చెవులు కదుపుతున్నట్లుగా కళ్ళు కదుపుతున్నట్లుగా, చేతివేళ్లు కాలివేళ్లు కదుపుతున్నట్లుగా ఎలుక తోక ఊపుతున్నట్లుగా లీలగా సజీవమూర్తిగా కొన్ని క్షణాలు కనపడి శూన్యంలో అదృశ్యమైంది. ఇది దేనికి సంకేతమో అర్థమై చావట్లేదు.

నాకు వచ్చిన కాణిపాక గణపతి

ఇలా కనపడిన ఐదవ రోజు కల్లా కాణిపాక క్షేత్రం నుండి ఆయన లాంటి ఒక నల్లటి గణపతి విగ్రహం సజీవ మూర్తిగా మా ఇంటికి వచ్చింది. ఈయన శూన్యంలో అదృశ్యమవ్వడము వలన గణపతి మూర్తి శాశ్వతం కాదని నాకు అర్థమైంది.

వినాయక చవితి పండగ సమయమున నేను ఎప్పుడూ కూడా ఒక అడుగు మట్టి గణపతి విగ్రహం కొని దానిని పూజలో ఉంచి మూడో రోజు నిమజ్జనం చేయటం అలవాటు. నాకు ఎప్పుడైతే గణపతి విగ్రహంమూర్తి కాస్త సజీవమూర్తిగా దర్శనమిచ్చినారో ఆ సంవత్సరం నుండి ఈ రోజు దాకా ప్రతి వినాయక చవితి పండుగకి విగ్రహం కొనే ముందు ఆయన ఏనుగు తల సజీవమూర్తిగా ఒక లిప్త కాలము పాటు కనిపించడము అలాగే ఏ విగ్రహం మూర్తిని తీసుకోవాలని  అనుకుంటున్నానో ఆ విగ్రహమూర్తి ఒక లిప్త కాలము పాటు  సజీవమూర్తిగా కనిపించటం సర్వసాధారణమైనది.ఇది నేను అహముతో చెప్పటం లేదు. అణకువతో చెబుతున్నాను. దైవ శక్తిని నమ్మితే అది ఉన్నదని ఆయన నిరూపించినారు అని చెబుతున్నాను.విచిత్రం ఏమిటంటే ఈయన పూజ చేసిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి కావాలని ఆ రోజు గణపతికి నివేదించిన ప్రసాదాలు మాత్రమే తిని వెళ్ళటం ఇప్పటికి జరుగుతోంది.అలాగే ఎడమ తొండమున్న గణపతి మట్టి విగ్రహమూర్తులు చచ్చినా కూడా నిమజ్జనానికి వెళ్లకుండా ఇంట్లోనే తిష్ట వేసేవి.అప్పుడప్పుడు నేను తెలిసో తెలియకో ఏమైనా తప్పుడు ఆలోచనలు లేదా తప్పుడు పనులు చేస్తే మరుక్షణమే ఈ విగ్రహములు కాస్త నాకు కళ్ళముందు లిప్త కాలము కనబడి ఉగ్ర స్వరూపంగా చూస్తున్నట్లుగా కనబడతాయి. దానితో నేను చేసిన తప్పును గుర్తించి ప్రాయశ్చిత్తము చేసుకునే వాడిని.

నాకు వచ్చిన బాల గణపతి

అలా 32 గణపతులలో ఫోటో మొదలై ఆత్మలింగమును కాపాడే బాల గణపతి విగ్రహం వచ్చేదాకా ఈ గణపతి విగ్రహ మూర్తులు వచ్చినాయి. అంటే మూలాధార చక్ర గణపతి నుండి హృదయ చక్రం స్థాన పతియైన బాల గణపతి దాకా ఈ విగ్రహ సజీవ మూర్తులు నా పూజా మందిరంలో చేరి పూజలందుకుంటున్నాయి. ప్రస్తుతం మేము నిత్య పూజలు చేయలేక వినాయక చవితి పూజ మాత్రమే చేస్తున్న కూడా ఆ మహాగణపతి సంతృప్తి చెందటం నాకే ఆశ్చర్యం వేస్తోంది.కొండంత గణపతికి నా పిసరంత భక్తి ఆయనకి ఎందుకు తృప్తిని ఇస్తుందో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయమే.

ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి,ఆధీన,విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి.కాని ఈ అనుభవ భావాలు కలిగినపుడు నాకు వివిధ రకాల ధ్యాన,ప్రత్యక్ష అనుభవాలు, అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి.వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను.జాగ్రత్తగా చదివి అర్ధము చేసుకోండి!

మూలాధార మా సాధనానుభవాలు

నేను ఇంటిలో అలాగే మా జిజ్ఞాసి ఏమో శ్రీశైల క్షేత్రంలో మా యోగ చక్రాల జాగృతి చేసుకోవడానికి యోగసాధన కొనసాగిస్తున్నాము. కానీ ఇక్కడ చిన్న విషయం గమనించండి. ఈ అధ్యాయములో మీకు సౌలభ్యం కోసం మూలాధార చక్రము యొక్క అన్ని స్థితులు అనగా జాగృతి, శుద్ధి, ఆధీనము, విభేదన చేసుకొనేటప్పుడు నాకు కలిగిన దైవ ధ్యాన అనుభవాలు మీకు యథాతథంగా ఇవ్వటం జరుగుతుంది. కానీ నిజానికి మాకు అన్ని చక్రములు జాగృతి అయిన తర్వాతనే శుద్ధి ప్రారంభమయ్యాయి.ఆ తర్వాత ఆధీనము అయినాయి. ఇది అంతా కూడా సుమారు 2 సంవత్సరాల కాలం పట్టింది. అంటే నాలుగు స్థితులకి 6 నెలలు చొప్పున 2 సంవత్సరాలు పైగా పట్టినది. మీ కోసం వాటిని వెంటవెంటనే ఇవ్వడం జరుగుతోంది.అంటే మూలాధార చక్రానికి సంబంధించిన అన్ని రకాల అనుభవాలు అన్ని ఒకే అధ్యాయములో అనగా జాగృతి, శుద్ధి, ఆధీనము స్థితులు ఇస్తే సాధకులు అయోమయంలో పడకుండా శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటారని ఈ విధంగా రాయటం జరిగింది.అన్ని చక్రాలు జాగృతి పూర్తి అయిన తర్వాతనే….. శుద్ధిస్థితి రావడం ఇది అన్ని చక్రాలు పూర్తి అయిన తర్వాతనే…. ఆధీన స్థితి రావటం జరిగిందని తెలుసుకోండి.అర్థం చేసుకోండి. అలాగే మా జిజ్ఞాసి తన యోగ చక్రాలను శ్రీశైలం క్షేత్రమందు జాగృతి చేసుకుంటే తిరిగి మహా కాశీ క్షేత్రమునకు చేరుకొని అక్కడ చక్రాలను శుద్ధి చేసుకున్నాడు.ఆ తర్వాత తమ చక్రాల ఆధీనం కోసం మౌన ముని ఆవాసమైన రమణ మహర్షి ఆశ్రమము ఉన్న అరుణాచలమందు 18 సిద్ధ యోగుల సమక్షములో యోగ శక్తులతో తమ యోగ చక్రాలను ఆధీనము  చేసుకున్నాడు.

మరి నేనేమో నాకు కనపడిన ఆయా దేవతల క్షేత్రాలకు వెళ్లి జాగృతి, శుద్ధి, ఆధీనము చేసుకోవడం జరిగినది. వాడేమో కేవలము మూడు స్వయంభు క్షేత్రాలు మాత్రమే (శ్రీశైలం, కాశీ, అరుణాచలం) తిరిగి జాగృతి, శుద్ధి, ఆధీనము చేసుకుంటే నేనేమో ఒక్కొక్క దానికి 3 క్షేత్రాలు చొప్పున (13 చక్రాలు+ 3 గ్రంధులు) 16x3=48 క్షేత్రాలు జాగృతి, శుద్ధి, ఆధీనము కోసం తిరగవలసి వచ్చింది.జ్ఞానమార్గానికి అలాగే సిద్ధ మార్గానికి నాకు తెలిసిన తేడా ఇదే. రెండవది జ్ఞాన యోగి యోగ శక్తులు వచ్చినను పెద్దగా పట్టించుకోడు అనగా రామకృష్ణ పరమహంస లాగా అన్నమాట. అదే సిద్ధ యోగి కి మాత్రమే సిద్ధులు, శక్తులు వస్తే వాటిని ప్రదర్శించకుండా ఉండలేరు. అనగా శ్రీత్రైలింగ స్వామి లాగా అన్నమాట.నాలో కుండలినీ శక్తి జాగృతి అవుతున్నప్పుడు ఏకాగ్రతతో కూడిన తీవ్ర ధ్యాన స్థితి కూడా ఆరంభమైంది.ఆలోచనలు తీవ్రతరం తగ్గుతూ వస్తున్నాయి. మనస్సు స్థిర స్థితిలోకి రావటం అలాగే ధ్యానానికి సహకరించడం చేస్తోంది.

ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నాకు ధ్యానమునందు ఒక నల్లటి పెద్దగా వెడల్పుతో ఉన్న రాతి విగ్రహమూర్తి బావి నుండి బయటకి సగం మాత్రమే వచ్చినట్లుగా అగుపించినది.కానీ ఆ విగ్రహం నీడ మాత్రమే లీలగా కనబడింది. అది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇలా సుమారు 21 రోజులపాటు కనిపించి తర్వాత వెలుగుతూ విగ్రహమూర్తి కాస్త సజీవమూర్తిగా కళ్లు ఆర్పుతూ తెరుస్తూ కనబడుతూ అది కాణిపాక గణపతి విగ్రహం మూర్తిగా కనబడసాగింది! ఇది భలేగా ఉంది. సజీవమూర్తిగా ఉన్నాడు అనుకొని సాధన చేస్తుండగా ఆ విగ్రహమూర్తి అదృశ్యమైనది. నాకేమీ అర్ధం గాక ఆయన ఎందుకు కనిపించాడు ఎందుకు అదృశ్యమైనాడు అనుకొని ఆవేదనతో ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చాను. ఇలా వరుసగా మూడు రోజులు ఇదే సాధన స్థితి జరిగినది. ఇది ఇలా ఉండగా మా స్నేహితుడు మా ఇంటికి వచ్చి “భయ్యా! నేను ఈ మధ్యనే కాణిపాకంకి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు నీ గురించి ఏమీ ఆలోచించని వాడిని ఒక కొట్టులో ఈ విగ్రహము నీకోసం తీసుకోవాలని బలంగా అనిపించింది. తీసుకొని వచ్చినాను.” అనగానే ఎంతో ఆశపడి కాణిపాకం విఘ్నేశ్వరుడే స్వయంగా వచ్చాడు కదా అనుకుంటుండగా వాడు ఒక అంగుళం సైజులో ఉన్న వేరే ఆకార గణపతి విగ్రహమూర్తిని చేతిలో పెట్టినాడు.  అంటే వీడు ఆ క్షేత్రానికి వెళ్లి ఆ క్షేత్ర దేవుడి విగ్రహమూర్తి కాకుండా మామూలుగా సహజంగా దొరికే సాధారణ గణపతి విగ్రహం నాకోసం తెచ్చాడు అనుకునేసరికి తీవ్రమైన ఆవేదన, బాధ ,కోపం కలిగినాయి. నాకు ధ్యానములో కనిపించిన విగ్రహమూర్తిగా ఆయన మా ఇంటికి వస్తే ఏమి సొమ్ము పోతుందని ఏదో ఒక రూపంలోనైనా వచ్చినాడని అసంతృప్తి కూడిన ఆనందంతో ఆ విగ్రహ మూర్తిని తీసుకొని పూజలో ఉంచినాను. ఎవరికి తెలుసు ఏ విగ్రహంలో ఏముందో?

మూలాధార చక్ర శుద్ధి:

నాకు నెమ్మది నెమ్మదిగా వాంతులు ఆగిపోయాయి కానీ వాసనలు తగ్గుముఖం పట్టలేదు. ఈ వాసన భరించలేక వాంతులు అవుతాయేమోనని కడుపులో తిప్పటం మాత్రమే జరిగేది.కానీ వాంతులు అవటం జరిగేది కాదు. ఈ కడుపులో తిప్పటం ఆపటానికి మందులు వేసుకున్నా అది పెరగటమే తప్ప తగ్గేది కాదు. ఇది మందులతో తగ్గదని దానికి అంతట అది తగ్గుతుందని అనిపించేది. అయినా ధ్యానం వదిలి పెట్టకుండా ఆపకుండా, వాయిదా వేయకుండా చేసుకుంటూ ఉండే వాడిని.  ఎందుకంటే ధ్యానం నుండి మన మనస్సుని మళ్ళించడానికి తన మాయ చేత ప్రకృతి మాత ఇలా చేస్తుందేమోనని భయముతో భక్తితో నా ధ్యానం ఆపకుండా చేస్తుండేవాడిని. ఇది ఇలా ఉండగా ఈ రోజు నాకెందుకో ఆడపిల్లల మీద విపరీతమైన కామవాంఛలు కలుగుతున్నాయి. అదికూడా ధ్యానములో. విచిత్రంగా ఉంది. ఈ విషయం గూర్చి గురుదేవుని అడిగితే.. ఆయన నా గురించి చెడుగా అనుకుంటే.. వద్దు. అడగవద్దు. వామ్మో! ఈ రోజు నా మర్మాంగం ఉద్రిక్తత దెబ్బకి ఏ ఆడపిల్లయినా దొరికితే అనుభవించాలనే కోరిక విపరీతంగా కలుగుతోంది. వామ్మో! కనీసం ఒక్క ఆడ కుక్క అయినా దొరికితే బాగుండును. ఈ కామవాంఛలు  తట్టుకోలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు. వామ్మో! ధ్యాన సమయంలోనే నా ప్రమేయం లేకుండా ఎందుకు నా మర్మాంగము ఉత్తేజం చెందుతుంది.ఏది అయితే అది అయింది.దీనిని గూర్చి గురుదేవునినిఅడగాలి.లేదంటే ఆడ జాతికి నా వలన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది.

ఒకరోజు నాకు ధ్యానంలో ఒక అంగుళం ఉన్న లింగం లాంటి జేగురు రంగులో ఉన్న సాలగ్రామం అదేపనిగా కనబడసాగింది. అందులోనికి కాణిపాక వినాయకుడు ప్రవేశించినట్లుగా ధ్యానములో కనిపించేది. అలాగే ఎప్పుడూ స్వయంగా వెళ్లి చూడని కాణిపాక క్షేత్ర ఆలయం కనిపించేది.ఎప్పుడూ కూడా టీవీలలో ఈ గుడిని గూర్చి చూడటమే తప్ప నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. కానీ జరిగేది జరగక మానదు కదా.మా బంధువులు ఫంక్షన్ తిరుపతిలో పెట్టుకున్నారని దానికి తప్పకుండా నన్ను రమ్మని ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించారు. వెళ్లకపోతే బాగుండదని నా దేవత పూజ సామాగ్రి తో కలిసి తిరుపతి చేరుకొని హోటల్ గదికి వెళ్లి స్నానాలు పూర్తి చేసి ధ్యానం చేసుకుంటుండగా మళ్లీ అదే సాలగ్రామము కాణిపాక వినాయక దర్శనం కనిపించసాగింది. ఒకవేళ కాణిపాకం రమ్మంటున్నాడు అని ఈ పంక్షన్ పూర్తి అయిన తర్వాత నేను బయలుదేరినాను. అక్కడికి వెళ్లి గుడిలో ఉన్న కాణిపాక గణపయ్యను దర్శించుకుని బయటకు వస్తుండగా ఒక సాధువు కనిపించి “నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నం పెట్టించగలవా” అన్నాడు.విచిత్రమేమిటంటే డబ్బులు కావాలని అడగలేదు. అన్నము కావాలని అడిగారు. ఆ విషయము నేను గమనించలేదు అనుకోండి .వెంటనే అతడిని ఒక హోటల్ కి తీసుకొని వెళ్ళి భోజనాలు తిని బయటికి రాగానే ఆయన వెంటనే “స్వామి! మీరు నన్ను ఒక బిచ్చగాడిలా కాకుండా సాటి మనిషిగా నన్ను గుర్తించి మీతోపాటుగా నన్ను కూర్చోబెట్టుకుని మారు మాట్లాడకుండా అన్నం పెట్టిన మీ మనస్సుకి ఏమి చేసినా ఏమి ఇచ్చినా తక్కువే” అంటూ తన చిరిగి పాడైపోయిన విపరీత కంపు తో కూడిన సంచిలో నుండి ఒక చిన్న రాయి వంటి సాలగ్రామం బయటికి తీసి “నాయనా! ఇది గణపతి శిల. శివ పంచాయతనం లో గణపతి స్థానంలో ఇది వాడతారు. ఇది నాకు ఈమధ్యనే నది ఒడ్డున దొరికినది. డబ్బులకు దీనిని అమ్మాలని నాకు అనిపించలేదు.నా మనస్సుకి నచ్చిన వ్యక్తికి ఇవ్వాలని అనిపించి జాగ్రత్తగా నా దగ్గరే ఉంచినాను. నీ కంటే ఎవరు దొరుకుతారు. ఆ దైవమే ఇలా వచ్చినాడు అనుకొని పూజలో అట్టిపెట్టుకో.అంతా మంచే జరుగుతుంది” అంటూ దానిని నా చేతిలో పెట్టి మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. అది ఏమిటని చూసేసరికి నేను గతుక్కుమన్నాను. అది ఏమిటంటే నాకు ధ్యానంలో కనిపించిన గణపతి సాలగ్రామ శిల ఇదేనని తెలుసుకున్నాను. మరి ఇందులో కాణిపాక గణపతి ఉన్నట్లుగా కనిపించినది కదా అది నిజమేనా అని శిల లింగమూర్తి ని పరీక్షగా నెమ్మదిగా శోధించడం మొదలు పెట్టినాను. ఎక్కడ నాకు ఎలాంటి గుర్తులు ఆ లింగం మీద కనిపించలేదు. నాకు పొరపాటున అలా ధ్యానంలో కనిపించి ఉండవచ్చు అని దానిని జాగ్రత్త చేసుకొని నా హోటల్ గది కి వెళ్ళినాను.

నేను బాగా అలసి పోవటంతో తీవ్రమైన నిద్ర ఆవహించింది. అలా నిద్రపోతున్న సమయంలో కలలో నిజం లాంటి కలగా “నేను నీ దగ్గరికి వచ్చాను. అయినా నన్ను నీవు సరిగ్గా గుర్తించలేదు. నేను ఉన్నాను నన్ను గుర్తు పట్టు” అని ఎవరో అన్నట్టుగా అనిపించేసరికి నాకు అంతటి గాడ నిద్రలో కూడా మెలుకువ వచ్చింది. ఎవరా అని చూస్తే ఎవరు లేరు అని తెలిసేసరికి మళ్లీ నిద్రపోదామంటే నిద్ర పట్ట లేదు. అసలు కలలో మనకు వచ్చిన సందేశం ఏమిటి అని ఆలోచించి ఇందులో ఏదో మర్మము ఉన్నది అని గ్రహించి వచ్చిన గణపతి లింగమును జాగ్రత్తగా పరిశీలించటం మొదలు పెట్టే సరికి నా ముఖం మీద చిరునవ్వు తో నేను యురేకా!యురేకా! కనిపెట్టాను. ఇందులో ఎలా ఎక్కడ ఉన్నావో తెలిసినదని అనుకున్నాను.ఈ లింగమూర్తి మీద ఎలుక ఆకృతి ,లింగము లోపల నీటి బుడగలు వంటివి కలిపి కూర్చిన ఆరు కోణాల గణపతి ఆకారం చాలా స్పష్టంగా కనపడేసరికి ఇలా కూడా ఈ లింగ మూర్తులు ఉంటాయా అని అనుకునేసరికి నాకు ఆశ్చర్యానికి హద్దులు లేవు. అంటే నా చక్రం శుద్ధి అయ్యే అవకాశం ఉన్నదని తెలియగానే చెప్పలేని ఆనందం వేసింది. ఇది ప్రసాదించిన ఆ గణపతికి బిచ్చగాడికి మనఃపూర్వకముగా కృతజ్ఞతలు చెప్పుకుంటుండగా ఆ దేవాలయంలో ఎందుకో గుడిగంటలు పెద్దగా మ్రోగించడం నాకు లీలగా వినిపించేసరికి ఇదియే ఆయన నుండి మనకి వచ్చిన సూచనని అనుకుని ఇంటికి బయలుదేరాను.

ఇంటికి వచ్చిన వారం రోజుల తర్వాత కొత్తగా వచ్చిన గణపతి లింగము విగ్రహమును కుడి చేతిలో పెట్టుకొని ఆరాధన చేసుకుంటుండగా ధ్యానములో ఏదో నాలుగు దళాలు ఉన్న పద్మము దాని మధ్యలో 'లం' అనే బీజాక్షరం ఈ దళాలు మీద లోపల కూడా ఏవో బీజాక్షరాలు ఉన్న కూడా అవి లీలగా కనపడసాగింది. ఇది ఎందుకు ఇలా కనపడిందో నాకు అర్థం కాలేదు.ఇలా సుమారుగా నాలుగు నెలలకు పైగా ఇదేవిధంగా ధ్యానంలో తరచుగా కనపడేది. నాకు అర్థమై చచ్చేది కాదు. అసలు అంత స్పష్టంగా  'లం' అనే హిందీ బీజాక్షరాలు ఎందుకు కనబడుతోందని దానిని ఒక్కదానినే శ్రద్ధగా చేస్తూ వచ్చే సరికి నాకు తెలియకుండానే నా దగ్గర లేని సువాసనలు రావటం మొదలైంది. అప్పటిదాకా చెడు వాసనలు వచ్చేవి కాస్త సువాసనలు రావడంతో నాకున్న శబ్ద పాండిత్యంతో నేను ఈ చక్రం శుద్ధిలో ఉన్నాను అని అర్థమయ్యేసరికి మరింత శ్రద్ధగా ధ్యానము చేయడం ప్రారంభించాను. ఇలా ఒక సంవత్సరం పాటు  ఈ చక్రం శుద్ధికి సమయం తీసుకోవటం జరిగినది. ఇలా మిగిలిన అన్ని చక్రాలు కూడా శుద్ధి చేసుకుంటూ మళ్ళీ క్రిందకి నా కుండలిని శక్తి వచ్చి ఈసారి మూలాధార చక్ర ఆధీనము కోసం ప్రవేశం చేయడం జరిగినది. అంటే ఈ స్థితికి రావటానికి నాకు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత జరిగినది అని గ్రహించండి.

మూలాధార చక్ర ఆధీనము:

ఇలా ధ్యానమునందు నాకు సువాసనలు సహజసిద్ధంగా వస్తూ ఉండే సరికి నా మనస్సుకి ఏదో తెలియని యోగమత్తు ఆవహించసాగినది.ఇంతలో నా ప్రమేయం లేకుండానే నేను నా చేతులతో ఏవో ముద్రలు వేయడం ఆరంభించాను. అలాగే ఆసనాలు వేయటం అనగా సిద్ధాసనం లేదా వజ్రాసనం వెయ్యడము జరిగేది. ఇదంతానేను తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మన ప్రమేయం లేకుండా నాకు తెలియకుండా నా చేతులతో ముద్రలు వేయడం అలాగే నా శరీరం కాస్త ఆసనాలు వేయడం జరిగేది. ఇలాంటి సమయంలో అసలు కథ ఆరంభమైనది. అదేనండి బాబు! మహామాయ. ఈ చక్రంలో కామ మాయ ఉంటుందని తెలుసు కదా.ఈ చక్రానికి అధిదైవము గణపతి అయితే అధిష్ఠాన దైవం ఇంద్రుడు అన్నమాట. ఇంకా ఏముంది ఎక్కడ సాధకుడికి మూలాధార చక్రము ఆధీనము అవుతుందో ఏమోనని భయంతో తన ఇంద్ర తెలివితేటలు  కామ మాయ రూపములో పరీక్షలు ప్రారంభించాడని నాకు తెలిసేసరికి నోట మాట రాలేదు.అదే ఇంతవరకు చక్ర జాగృతి,శుద్ధి మాత్రమే జరిగాయి. కానీ ఈ చక్ర మాయ దాటితేగాని ఆధీనము కాదని ఆలోచించి నా ధ్యానం ఆపకుండా కొనసాగిస్తున్నాను. ఇలా మూడు నెలల పైగా జరిగినది.ఒకరోజు నాకు తెలిసిన బంధువుల అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో మా ఇంటికి పెళ్లి కోసమని వచ్చినది. తొలి చూపులు కలిశాయి. మాటలు కలిశాయి. అదే కామ మాయ అని తెలుసుకోలేని పరిస్థితి. ఇంకా ఏముంది. నా స్వామిరంగా! ఆమెతో మాటలే మాటలు. కవ్వింపులు. బుజ్జగింపులు. ఆటలు పాటలు. నా ప్రపంచమే ఆమెగా ఉండేది. ఆమె కూడా అలాగే ఉండేది. మా ఇద్దరి మధ్య కాఫీలు, టిఫిన్లు మాత్రమే మిగిలిపోయాయి. మాటలు ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా జరిగినాయి.పెళ్లిళ్లు దాకా మేము ఇద్దరము వెళ్ళిపోయాము. కానీ మ్రొక్కుబడి గా నా ధ్యానం చేసుకోవటం ఆపలేదు. క్రమం తప్పకుండా వేళ తప్పకుండా చేసుకుంటూ ఉండే వాడిని. ఇలాంటి సమయంలో యోగివేమన సినిమాను టీవీలో మేమిద్దరమూ చూడటం జరిగింది. కానీ ఆమెకి మొదట అర్థం కాలేదు. నచ్చలేదు. కానీ నా మనస్సు ఏదో శంకించడం మొదలు పెట్టినది. ఈ సినిమాలో నా కోసం ఏదో సందేశం ఇస్తోందని చెప్పడం జరిగినది. అయినా అది అర్థం కాలేదు. మా ఇద్దరి మధ్య టిఫిన్లు అయ్యేలోపు ఆమె వాళ్ళ ఊరికి తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి పోవడం జరిగినది.కొన్ని రోజులపాటు ఏదో తెలియని బాధ. దగ్గరివాళ్ళు దూరమయ్యినారని ఆవేదన. ఎవరికీ చెప్పుకోలేను. అలాగని భరించలేను. ఏమిచేయాలో అర్థంకాని స్థితి. ఆమె ఉన్న చోటికి వెళ్లాలంటే అది రాష్ట్రాలు దాటి వెళ్ళాలి. అది జరిగే పని కాదు. అలాగని మనస్సు ఆగే స్థితిలో లేదు. కనీసం టిఫిన్ కూడా జరగలేదని ఒకవైపు బాధ. అంత అందగత్తెను చూడకుండా ఉండలేని పరిస్థితి. అయినా కూడా నాకు తెలియకుండానే మొక్కుబడిగా నా ధ్యానం చేస్తూనే ఉన్నాను. వచ్చే ముద్రలు, ఆసనాలు వేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఏమి ఆగ లేదు. కానీ నా మనస్సు మాత్రమే అక్కడ ఆగిపోయినట్లుగా విపరీతంగా అనిపించేది. ఇలా మరో ఆరు నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. కానీ ఆమె ఆలోచనలు నన్ను దాటి వెళ్ళలేవు కదా. ఇది ఇలా ఉండగా మరొక సారి ఏదో ఫంక్షన్ ఉన్నదని మా దగ్గర ఊరిలో  ఉన్న బంధువుల ఇంటికి ఆమె కూడా వచ్చిందని తెలియగానే “గోవిందా! ఇంకా ఏమైనా ఉందా. వెళ్లిపోవాలి. ఆమెను చూడాలి. ఆమెను తిట్టాలి. ఆమెతో ముద్దుగా తిట్టించుకోవాలి” అనుకుంటూ బస్సు ఎక్కాను.

పేపరు చదువుతూ ఉండగాఈసారి యోగి వేమన సూక్తి ఒకటి కనబడింది. ఇది చదివేసరికి నా మనస్సుకి ఏదో స్ఫురణ వచ్చినట్లు అనిపించింది.లోగడ యోగివేమన సినిమా ఈమె వచ్చిన సమయానికి వచ్చినది. అలాగే ఈ సూక్తి కూడా ఇప్పుడే ఈమె వచ్చిన సమయానికి వచ్చినది అంటే ఇందులో ఏదో మర్మం ఉన్నది. ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను దూరంగా ఉండమని యోగివేమన ఏదైనా సందేశం ఇస్తున్నాడా? ఆయన సకల సుఖాలు అనుభవించాడు కదా. మరి నన్నుఎందుకు వెళ్ళమని సందేశం ఇస్తున్నాడు. ఒకవేళ ఈమె ఈ చక్ర కామ మాయ కాదు గదా. ఒకవేళ అది అయితే ఈ చక్రం ఆధీనం అవటం దేవుడెరుగు. దేనికి పనికిరాకుండా పోతాను అనుకొని బస్సు దిగి ఇంటికి వెనక్కి వెళ్ళినాను. నేను వెళ్ళినాను కానీ నా మనస్సు రాలేదు కదా. నా శరీరమే మా ఇంటికి వచ్చింది కానీ నా మనస్సు ఆమెను చూడాలని తహ తహ లాడుతూ ఉంది.అన్నీ తెలిసిన తెలిసి వలచి విలపించుటలో ఉన్న ఆనందం ఎవరికి తెలుసు అన్న పాట లీలగా వినబడుతుంటే గాఢ నిద్రలోకి జారుకున్నాను. నేను నిద్ర లేచే సరికి ఎదురుగా చిలిపిగా నవ్వుతూ ఆమె కనబడినది. ఇది కలా నిజమా అనుకొనే లోపల “బావ! ఏంటి నా మీద కోపమా? నన్ను చూడటానికి తమరు బయలుదేరి కూడా వెనక్కి వచ్చేశారట. ఏమి జరిగినది. ఒంట్లో బాగాలేదా? అత్తయ్య చెప్పినది” అనగానే నాకు మాట రాలేదు. “వామ్మో! మాయ అంటే ఇదే కాబోలు వదిలించుకుందామని అనుకున్న వదలడం లేదు. నావల్ల కావడం లేదు. ఏమి చేయాలిరా దేవుడా” అని అనుకుంటూ ఆమెకి నా సాధన విషయాలు చెప్పలేను. చెప్పిన ఆమెకి అర్థమవుతాయని ఖచ్చితంగా తెలియదు. నేను పూజలు చేసుకునే పూజారిగా మాత్రమే ఆమెకి తెలుసు. ఏమి చేయాలి రా భగవంతుడా కామి కానీ వాడు మోక్ష గామి కాలేడని అని అందుకే అన్నారు కాబోలు అనుకుంటూ ఆమెతో వచ్చి రాని భావంతో కూడిన మాటలతో నాకే అర్థం కాని పదాలతో ఆమెకు నచ్చజెప్పి “ఈ సమయంలో నీతో సంయోగం చెందిన లేదా పెళ్లి చేసుకున్న కూడా నేను కామ మాయలో పడినట్లు అవుతుందని తద్వారా  నా జాగృతి అయిన కుండలినీశక్తి వెనక్కి తిరిగి నిద్రలోకి జారిపోతుందని తద్వారా మీ మోహంలో పడి వ్యామోహంగా మారి నీ మోహ మాయలో నేను ఉండిపోతానని కాబట్టి నేను యోగ సాధనలో ముందుకు వెళ్లాలని” ఆమెకి చెబితే అయితే “బావ! నీవు ఎన్నటికీ పెళ్లి చేసుకోవా? నన్ను చేసుకోవా?” అని అమాయకంగా అడిగేసరికి బాధ వేసి ప్రస్తుతము నేను నా చక్ర ఆదీనస్థితిలో ఉన్నాను.ఈ స్థితిలో నేను ఎవరితోనూ సంయోగం చెందిన లేదా పెళ్లి చేసుకున్న నా సాధన శక్తి అధోగతి పాలవుతుంది. అలాగని నేను నీ ప్రేమలో ఉండలేను. నేను నా చక్ర ఆధీనం అయిన తర్వాత వివాహం చేసుకుంటే ఆమె ప్రేమకే అంకితమవుతాను. ఆమె మోహ, వ్యామోహంలలో నేను బంధీ కాను. ఆమె ఉన్నంత వరకు నాకు ప్రేమ బాధ్యతలు ఉంటాయి. ఆమె లేకపోతే మహాశివుడు లాగా వ్యామోహం చెందను.ప్రస్తుతానికి నేను ఎవరికీ మోహంలో పడరాదు అని ఆమెకు చెప్పి అక్కడ నుండి ఆమె మాట్లాడేది కూడా వినకుండా మౌనంగా వెళ్ళి పోయాను. కొన్ని రోజులు ఆమె ముభావంగా ఉండి నాతో చెప్పకుండానే ఆమె ఊరికి వెళ్ళిపోయినది. దాంతో ఆమె నుండి కామ మాయను దాటినాను అని సంతోష పడే లోపల నా స్నేహితుడి చెల్లెలు నన్ను అదోలా చూడటం మొదలు పెట్టే సరికి నా గుండెలు దడదడ లాడాయి. మాయ అంటే ఇదే కాబోలు. ఇలా ఎంతమందిని దాటాలి అని అర్థం కాలేదు.ఆమె తొలకరి వయస్సులో ఉండటం వలన వయస్సు అలాగే మనస్సు చేసే మర్మాలు ఆమెకి తెలియదని ఆ స్నేహితుడి ఇంటికి పూర్తిగా వెళ్లడమే మానివేశాను.

ఇలా సుమారు ఇట్టి స్థితిలో 12 సంవత్సరాల వయస్సు నుండి 65 సంవత్సరాల పైన వయస్సు ఉన్న స్త్రీమూర్తులు తమ కామ భావాలతో 143 అంటూ నన్ను ఆడుకున్నారు. కానీ ఎవరితోనూ సంయోగం  చెందకుండా జాగ్రత్తలు తీసుకునే సమయంలో నన్ను కొత్తగా చంపటానికి కాబోలు అన్నట్లుగా ఒక బంపర్ ఆఫర్ రావడం మొదలైంది. నాకు ధ్యానంలో తెలిసిన వారివి తెలియని వారివి ఎవరివి కావాలన్న వారి రతి క్రీడా దృశ్యాలు ఏవో వీడియోలు చూస్తున్నట్లుగా నా కళ్ళముందు కనపడటం మొదలైనది. వామ్మో! ఇది ఏమిటి గోల? ఉన్నది చాలక ఈ మాయ కూడానా అనుకుంటూ ఉండగా ధ్యానములో నా ప్రమేయం లేకుండా నా మర్మాంగం గట్టిపడి పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది. వామ్మో! ఇలా అయితే నా పరిస్థితి చంకనాకి పోయినట్లే.అయిపోయింది నా జీవితం చంక నాకి పోయినట్టే అనుకుంటూ నా ధ్యాన భంగమై కళ్ళు తెరవడం జరిగేది. కానీ విచిత్రమేమిటంటే ఈ చక్ర జాగృతికి అలాగే శుద్ధికి కేవలం ఒకటిన్నర సం!!లు మాత్రమే పడితే ఆధీనస్థితి కి వచ్చి అప్పుడే సుమారుగా 11నెలలు గావొస్తోంది.వామ్మో ఏమి చేయాలి రా భగవంతుడా! గురువు కనిపించడు. దేవుళ్లు ఏమీ చేయరు. నా చావు నన్ను చావమని ఎవరు కూడా పట్టించుకోవడం లేదని నాకు అర్థం అయింది. ఆగ్రహంతో పిచ్చిపట్టినట్లు అయింది. దానితో నాలో వచ్చిన తెలియని చెప్పుకోలేని వేడిని తగ్గించుకోవటానికి చన్నీటి స్నానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ధ్యానానికి కూర్చోగానే నా కోసం ఎదురుచూస్తున్నానని మాయ నా మీద కామ బాణాలు వేయడం, దాంతో నా మర్మాంగం నిద్రలేవటం అన్ని కూడా షరా మామూలుగానే నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మనలో రేతస్సు(వీర్యం) బయటకు రాకుండా ఈ స్థితిలోచాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే 1000 వయాగ్రా బిళ్ళలు వేసుకుంటే ఎంతటి కామప్రకోపం వస్తుందో అనగా మనిషి తట్టుకోలేనంత స్థితి పొందాల్సి ఉంటుందని నాకు అర్థం అయింది. కానీ ఏమి చేయాలి?ఎలా ఈ మాయలో పడకుండా ఉండాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ చక్రానికి అధిపతి అయిన గణపతికి ఈ కామానికి గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు.అందుకే లక్ష్మీ గణపతి అన్నారు కదా. అంటే ఈయన ధన మాయ చూపించాలి కానీ కామ మాయ ఎందుకు చూపిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అపుడు నాకు విచిత్రముగా ఉచ్చిష్ట గణపతి శృంగార దృశాల ఉన్న విగ్రహమూర్తులు,పటములు నేను చూడటము జరిగినది.దానితో ఈ చక్ర కామమాయగా ఈయనే ఉంటాడని గ్రహించాను!

నా పరిస్థితి ఇలా ఉంటే అరుణాచలంలో ఈ చక్ర ఆధీనము కోసం వెళ్లిన జిఙ్ఞాసి పరిస్థితి తల్చుకొని బాధ, ఆనందంతో కూడిన నవ్వు వచ్చింది.వాడు కూడా శ్రీశైలంలో ఈ చక్ర జాగృతి అలాగే కాశీక్షేత్రంలో ఈ చక్ర శుద్ధి చేసుకున్నాడు. త్వరలో ఈ చక్ర ఆధీనము కోసం అరుణాచలం వెళుతున్నాడని టెలిపతి ద్వారా చెప్పడం జరిగినది.తనకి ఈ చక్ర ఆధీనము అయిన తర్వాత తన అనుభవాలు అన్నీ కూడా చెబుతానని టెలిపతి ద్వారా సూచనలు పంపినాడు. చూడాలి మరి మన వాడి పరిస్థితి.ఇక్కడేమో అదేదో సినిమా లో చెప్పినట్లు చూస్తే చాలు అమ్మాయిలు పడిపోతున్నారు. నాలో వారికి ఎలా అంత కామత్వం కనబడుతుందో అర్థం కావడం లేదు. కానీ నిజానికి నాలో కూడా వారి యందు కామత్వం ఉన్నప్పటికీ ఆపుకుని నగ్నత్వం చేధించి యోగత్వము పొందాలని నా తాపత్రయం.కానీ ఏమి చేద్దాం. ఇది ఇలా ఉండగా ఒకరోజు తెలిసినవాడు ఒకడు గుడికి వచ్చి అయ్యా! నాకు పెళ్లయి 5 సంవత్సరములు అయినది కానీ పిల్లలు పుట్టలేదు. ఏవైనా మంత్రాలు లేదా పూజలు చేయించుకుంటాను అన్నాడు. నేను వాడి ముఖం వైపు దీనంగా మొహం పెట్టి “బాబు! నీవు ఇలా సంసారం చేస్తే ఎలా పుడతారు. నిన్న ఇలా సంయోగం చెందినావు. మొన్న అలా చేసినావు. అంతకు మొన్న అలా చేసినావు” అంటూ నేను ధ్యానంలో చూసిన వారి సంయోగ వివరాలు గురించి పూస గ్రుచ్చి చెప్పే సరికి వాడికి నోట మాట రాలేదు.నాకు గుండెల్లో దడ ఆగలేదు. ఎక్కడ మా అయ్యకి చెబుతాడో. దానికి ఆయన ఎక్కడ నన్ను అపార్థం చేసుకుని వాళ్లు శృంగారం చేసుకుంటే చూస్తావా అని బడిత పూజ చేస్తారేమోనని అనుకుంటూ ఉండగా వాడి ముఖం అదోలా పెట్టి దేవుడికి కూడా నమస్కారము కూడా చేయకుండా నన్ను కన్నెత్తి చూడకుండా మౌనముగా వాడి కామ రహస్యాలు బయటికి వచ్చేసరికి ముఖము మీద నెత్తురు చుక్క లేకుండా పాలిపోయిన ముఖముతో వెళుతుంటే నా బాధ వలన వాడి  బాధ ఎక్కువైంది కదా. చచ్చినాడు కదా. అనుకొని నిత్య పూజ కి వెళ్లడం జరిగింది.

ఇది ఇలా ఉండగా మరో బంపర్ ఆఫర్ మరొకటి వచ్చినది. మానవ నగ్న స్త్రీమూర్తులు కనిపించటం పోయి దేవత స్త్రీమూర్తులు కనబడి కవ్వించడం  ప్రారంభమైనది. వామ్మో! ఈసారి కామ దేవతలు మొదలైనారా? అంటే విశ్వామిత్రుడు ధ్యానం చేసే సమయంలో ఉండగా ఈ కామమాయలోనే మేనక రావడం ఆమె మోహ మహా మాయకి లోనై శకుంతల జన్మకి కారకుడైనాడు కదా. ఆ తర్వాత 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైనదని తెలుసుకొని వైరాగ్యం చెంది ఈసారి తీవ్రమైన ధ్యానం చేస్తుండగా మళ్ళీ కామమాయ వచ్చే సమయమునకు ఈసారి రంభ వచ్చేసరికి ఆయనకి కోపం వచ్చి ఆమెను శపించేసరికి మళ్లీ 10 లక్షల సంవత్సరాల జపశక్తి నాశనమైందని గుర్తుకురాగానే వామ్మో అంతటి జపశాలికే ఇంతటి పరీక్షలు ఉన్నాయని అనుకొన్నాను కానీ ఎప్పుడైతే మానవ స్త్రీ మూర్తులను దాటినానో ఆనాటి నుండి రతి క్రీడా దృశ్యాలు ఆరంభమయ్యాయి.వీటిని కూడా దాటేసరికి ఇప్పుడు దేవతల నగ్న దేవతలు దర్శనాలు ఆరంభమయ్యాయి. వామ్మో! ఇప్పుడు గాని నాకు కలలో కూడా వీర్యస్కలనం అయినా కూడా నా సాధన శక్తి అది కూడా ఎన్నో కోట్ల జన్మల నుంచి చేస్తూ వచ్చిన శక్తి గంగలో కలిసిపోయినట్లే. ఈ జన్మ ఇంతటితో సాధన ఆగిపోయినట్లే.మళ్ళీ ఆకలి కోసం జన్మ తప్పదు కదా అనుకుంటుండగా ధ్యానం  భంగమై అప్పుడు నిద్ర లేచాను.ఉవ్వెత్తున లేచిన నా మర్మాంగము ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పూజ గది నుండి నా గదిలోనికి వెళ్లి ఏడవటం తప్ప ఏమి చేయలేకపోయాను. ఇలా కొన్ని వారాలు గడిచేసరికి నా ధ్యానంలో నగ్న దేవతా స్త్రీలు,గంధర్వ స్త్రీలు,ప్రేతాత్మలు, కామ పిశాచాలు ఎవరికి వీలు పడితే వారు వరుసగా నన్ను కవ్వించడం  ప్రారంభించినారు. అసలు వీళ్ళతో ఎలా శృంగారం చేస్తామో అర్థం కాని స్థితిలో ఉండగా ఒక పేపర్ కటింగ్ నన్ను బాగా ఆకర్షించింది.

ప్రేతాత్మతో శృంగారదృశ్యం

తమిళనాడులో ఒక నంబూరి అనే తాంత్రిక యోగి తన ఉపాసనలో ఉండగా ఒక ప్రేతశక్తి ఉన్న కామిని ఆయనను నానారకాలుగా కవ్వించడం  మొదలు పెట్టింది.ఇలా ఆయన నిగ్రహంగా ఆరు సంవత్సరములు ఉన్నారట. ఆ తర్వాత కామిని శక్తి తట్టుకోలేకపోతే ఆమె ఈయన ఒంటి మీద సూక్ష్మ శరీరధారిగా వచ్చి ఆయనతో శృంగారం జరిపేది. కానీ ఈమె ఈయనకి మాత్రమే కనిపించేది. ఇంకా ఎవరికీ కనిపించేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఆడపిల్లను కన్నాను అని చెప్పి ఆ పిల్ల పిశాచిని కూడా ఈయనకి చూపించినదని ఆయన అనుభవములో తెలిసినది. ఆయన చనిపోతూ తనకి మాత్రమే కనిపించే కామినికి, ఆమె పిల్లకి తన ఆస్తిలో భాగం కూడా రాసి చనిపోవడం జరిగినదని వీలునామా బయటపడటంతో అసలు విషయం లోకానికి తెలిసిందని చదవగానే నాకు నోట మాట రాలేదు. వామ్మో దీనమ్మ జీవితం. అందరూ కూడా ఈ కామ మాయలో పడిన వారే వరుసగా కనబడుతున్నారు. అంటే నేను కూడా ఈ కామ మాయ దాటలేనా?కాదు. నేను దాటాలి. ఎలాగైనా దాటాలి అనుకొని ఎలా దాటాలో అర్థం కాక ఏమి చేయాలో అర్థం కాక ఇలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.రానురాను ప్రణవ మంత్రము కాస్త ప్రణయ మంత్రముగా మారసాగినది. కామ స్మరణే ధ్యానంగా మారే సరికి విపరీతమైన దుఃఖం రాసాగింది. దాంతో ఏదో తెలియని దిగులు, విచారము దానితో పాటు ఎలాంటి పాపం కూడా తెలియని ఈ స్త్రీ మూర్తులను చూసేసరికి నాలో తెలియని భయం మొదలైంది. నిగ్రహం కోల్పోయి వాళ్ళతో ఎలా ఉంటానో నాకే అర్థం కాని స్థితి. తను ఈ స్థితిలో ఇలాగే కొనసాగితే ఏదో ఒకటి చేసి కాని ఊరుకునే స్థితి కాదు.అనర్థం తప్పదు.వెంటనే కామ దేవుడైన మన్మధుడు గుర్తుకు వచ్చేసరికి “స్వామి! నా మీద ప్రయోగించిన మానవ, దేవత,రాక్షస, గంధర్వ,  పిశాచ స్త్రీ మూర్తులు కామ బాణాలు ఉపసంహరించు. మానవమాత్రులమైన నా మీద దయ చూపించు. నన్ను కరుణించు. ఒకవేళ నేను ఈ మాయలో పడితే మళ్లీ ఈ సాధన స్థితికి రావాలంటే మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని నాకు తెలుసు. అలాగే మీకు తెలుసు. తెలిసి కూడా నన్ను ఎందుకు ఈ మాయలో పడ వేస్తావు.అంతగా అయితే ఈ చక్ర ఆధీనము అయిన తర్వాత నేను ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు నువ్వు చూపే కామ బాణం స్త్రీమూర్తిని వివాహం చేసుకుంటాను. వివాహం అయిన నాకు నీకు ఇబ్బంది ఉండదు కదా.ఒకవేళ ఇప్పుడున్న స్థితిలో నేను కామ మాయలో పడితే పునర్జన్మ లే నాకు మిగులుతాయి. నన్ను వదిలిపెట్టు. జనన చక్రం నుండి బయటపడాలని అనుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఈ జనన చక్రంలో పడవేస్తే నీకు ఏమి మిగులుతుంది. నేను ఇప్పటికే ఎన్నో లక్షల జన్మల పాటు నేను ఈ కామ మాయను దాటలేక జన్మలు ఎత్తినాను కదా. నాతో ఇలా ఆడుకున్నది చాలు. ఇకనైనా నన్ను కరుణించి ఈ జన్మ నాకు ఆఖరి జన్మ అయ్యేటట్లుగా చేయటం అనేది మీ చేతలలో నా చేతుల్లో ఉంది.స్వామి నన్ను కరుణించమని ఎంతగా వేడుకున్నా ఆయన  కరుణించలేదు. కామ బాణాలతో నన్ను చంపడానికి సిద్ధపడే వాడిని చంపద్దు అంటే చంపకుండా ఊరుకుంటాడా. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.

మన ప్రయత్నాలు మనం చెయ్యాలి అనుకుంటూ ధ్యానానికి కూర్చునేసరికి sex వీడియోలు ప్రారంభమయ్యాయి.నాకు ధ్యాన స్థితి కి భంగం కావటము జరగటంతో నేను బలవంతపు నిద్రలోకి జారుకోవడం జరిగినది. ఇది ఇలా ఉన్న రోజులలో ఒకసారి టీవీలో భక్త తుకారాం సినిమా నడుస్తుంది. అందులో తుకారాంను తన శరీర సొంపులతో కామ మాయలో పడ వేస్తానని ఒక నర్తకి శపధం చేయటం,ఆ తర్వాత ఆయనని తన ఇంటికి పాండురంగ పూజ చేయడానికి రమ్మని చెప్పడము ఆయన రావడం ఆమె ఈయనని కవ్విస్తూ కామ పాట పాడటం అది పూర్తి అయిన తరువాత తుకారాం ఆమెతో అమ్మా అని సంబోధించి 80 సంవత్సరాల తర్వాత నీవు నిజం అనుకునే అందచందాలు ఎలా ఉంటాయో అని ఆయన తిరిగి పాట పాడేసరికి ఆమెకి అంతా అర్థమయ్యి ఆయన కాళ్ళమీద పడి క్షమించమని చెప్పి ప్రాయశ్చిత్తంగా పాండురంగ భక్తురాలిగా మారటం దృశ్యం చూసేసరికి నాలో ఏదో తెలియని ఆనందం వేసింది. ఈ సినిమాను ఈ దృశ్యం కోసం 20 సార్లు చూశాను. ఆ తర్వాత మహా శివరాత్రి నాడు పరమానందయ్య శిష్యుల కథ సినిమా రావటం అందులో హీరో తన ఇష్ట నర్తకి తో సుఖలాపాలు పూర్తి  అయ్యి ఉండగా మెలుకువ వచ్చి “ఈ రోజు మహాశివరాత్రి. తను నిత్యం చేసే క్రమం తప్పని వేళ తప్పని శివారాధన గుర్తుకు రావటం ఆ గది తలుపులు బిగించి ఉండటం చేత సమయానికి శివలింగ మూర్తి ఎక్కడ కనిపించకపోయేసరికి తీవ్రమైన మనోవేదన చెందుతూ తను చేసిన పాడు పనికి బాధపడుతూ వుండగా అప్పటిదాకా ముగ్ధ మనోహరంగా కనిపించిన స్త్రీ మూర్తి యొక్క వక్షోజము కాస్త కొండ మీద ఉన్న లింగమూర్తి గా కనపడేసరికి మనస్సు కుదుటపడి దానిని మహా శివ లింగమూర్తి గా భావించుకొని పూలతో ఆరాధన చేస్తూ మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా ఈ పూజ మహా కైలాసము లోని కైలాసపతి పాదాల మీద పడుతూ ఉన్న దృశ్యం చూసేసరికి నాలో నాకే తెలియని మహదానందం వేసింది.ఏదో స్ఫురణ కలిగినది. అంటే ఇప్పటి దాకా హీరోకి ఆమె వక్ష స్థలము శృంగార భాగంగా కనబడితే ఎప్పుడైతే శివలింగారాధన కోసం తపన పడినాడో ఆ క్షణమే శృంగారభాగం కాస్త కామ లింగముగా కనపడేసరికి అది లింగార్చన కాస్త కైలాసపతి కి చేరింది. అంటే పశుపతి కాస్త కైలాసపతి గా ఎలా మారినాడు అంటే యద్భావం తద్భవతి అనేసరికి అసలు ఇన్నాళ్లు నాకు అగుపించే వారిని నేను ఆ కామత్వముతో చూస్తుంటేసరికి వారు నాకు కామమును కలిగించే వారిగా కనబడుతున్నారు.వారి నగ్నత్వం బదులుగా దిగంబరత్వం అనగా ఆడతనం కాకుండా అమ్మతనం చూడ గలిగితే చాలు కదా. అన్ని రకాల మాయలు మాయం అయిపోతాయి కదా.కామ మాయ ఉండబట్టి తల్లిదండ్రులకి మనము పుడుతున్నాము. అదే కన్నతల్లి మూడు నిమిషాల పాటు ఎలాంటి కామ ఉద్రేకానికి గురికాకపోతే ఎవరు కూడా మనల్ని కనే శక్తి ఉండదు కదా.అంటే ఇన్నాళ్ళు నేను చేస్తున్న తప్పు ఏమిటో అర్థమయ్యేసరికి మాయ మాయం అవ్వటం మొదలైంది. ఇప్పుడు రండి. నా స్వామిరంగా! ఇప్పుడు ఎవరు వస్తారో ఏమి చేస్తారో చూద్దామని తీవ్ర ధ్యానములో ఉండేసరికి యధావిధిగా మొదట వివిధ రకాల స్త్రీ మూర్తులు కనిపించేసరికి వెంటనే వారితో “అమ్మా! మిమ్మల్ని నేను ఇంతవరకు అమ్మగా కాకుండా అమ్మాయి గా గుర్తించడం వలన నా మీద కామ బాణాలు వేసినారు. కానీ ఇప్పుడు నేను మీ బిడ్డను అయ్యాను కదా. బిడ్డ మీద ఎక్కడైనా తల్లికి కామము కలగదు కదా” అనగానే వారు అదృశ్యమయ్యారు. అంటే అప్పటిదాకా మహాశివుడికి శృంగార దేవతగా కనపడిన పార్వతి దేవి కాస్త తారా దేవిగా మారినప్పుడు ఆయనకే తన చనుబాలు పట్టించి తల్లిగా మారింది కదా.అంటే మనము కామత్వము గా చూస్తే భార్యగా అదే ఆమెలో దైవత్వం చూస్తే తల్లి గా కనబడుతుంది అనే నగ్నసత్యం నాకు తెలిసేసరికి ఆరు సంవత్సరములు పట్టినది. ఇక ఆనాటి నుండి అప్పటిదాకా ప్రణయ మంత్రం కాస్తా నెమ్మది నెమ్మదిగా ప్రణవ మంత్రంగా మారింది.ఈ స్త్రీ నగ్న తత్వమును ఛేదించటానికి మహాశివుడు కాపాలికుడుగా మారి నానా కష్టాలు పడినాడు అని గుర్తుకు వచ్చే సరికి ఎన్నో రోజుల తర్వాత ఆనందంతో కూడిన నిద్ర మత్తు ఆవహించింది.ఈ మూలాధార చక్రము ఇచ్చే కామమాయ చేదించినందుకుగాను అలాగే దానిని దాటినందుకు గాను నాకు కాణిపాకం నుండి తెల్ల జిల్లేడు వేళ్ళు అయినా స్వయంభూగా వెలసిన శ్వేతార్క గణపతి రావడం జరిగినది.వీటితో పాటుగా ఆయన నిజ రూప విగ్రహమూర్తి, ఏనుగు తోక వెంట్రుకలు రావడం జరిగినది. 35 సంవత్సరముల పాటు ఒక తెల్ల జిల్లేడు చెట్టు బ్రతికితే వేళ్ళు గణపతి ఆకారంగా లేదా హనుమత్ ఆకారంగా మారతాయి.వీటినే స్వయంభూ శ్వేతార్క గణపతి అంటారు. ఇది మీ ఇంటికి వచ్చినది అంటే మీరు మీ సాధన స్థాయిలో మీ మూలాధార చక్ర ఆధీనమునకు కావలసిన సాధన ఆయన ఇస్తాడు. వారిని నిత్యపూజలో ఉంచి అర్చన చేస్తే సకల వాస్తు దోషాలు తొలగి సకల ఆటంకాలు తొలగిస్తాడు.అదే ఈయన మీద ధ్యానంలో కనిపించిన బీజాక్షరాలు(శుద్ధి సమయం )సహితము మంత్రముతో సిద్ధి పొందితే  మనకి భూచర సిద్ధి వస్తుంది. ఒక అంగుళం ఎత్తునుండి 30 అడుగుల ఎత్తు వరకు భూమి నుండి గాలిలో లేస్తారట.అలాగే ఎప్పుడైనా మన కాళ్ళ మీద పెద్ద బండరాళ్ళు దొర్లినను మనకేమీ కాదట.

కానీ నేను మాత్రము తీవ్ర ధ్యానంలో ఉండగా గోరు పరిమాణం అంత ఎత్తు గాలిలో ఉత్తేజము చెందుతూ మాయలు తొలగిపోయి గాలిలోకి ఎగిరిపోవ పోతే భయము వేయడంతో క్రిందకు వచ్చినాను. ఇంకా ఎప్పుడు ఈసిద్ధి  గురించి నేను ప్రయత్నించ లేదు. ఎందుకంటే ఈ చక్ర సిద్ధి మాయ లో ఉంటే మిగిలిన చక్రాలలోనికి నేను ప్రవేశించలేనని అనిపించి ఆపి వేశాను.ఇది చేసిన 21 రోజుల తరువాత కాణిపాకం నుండి నల్లటి రాతి విగ్రహమూర్తి కాణిపాకం వినాయకుడి లాగా మా ఇంటికి వచ్చారు.ఇక దానితో ఈ చక్ర సిద్ధ మాయను దాటటం జరిగినదని నాకు అర్థమైంది. మరో చక్రమైన స్వాధిష్ఠాన చక్రం కోసం తీవ్ర ధ్యానం చేయడం ప్రారంభించాను.

జిఙ్ఞాసి కి ఈ చక్రానుభవాలు

ఇక శ్రీశైలము,కాశి,అరుణాచల క్షేత్రములో తన మూలాధార చక్ర జాగృతి, శుద్ధి,ఆధీనము ఎలా చేసుకున్నాడో నా జిఙ్ఞాసి మాటలలోనే చూడండి. “భయ్యా! నాలో కుండలినీశక్తి జాగృతి అయిన తరువాత నాకు తీవ్ర ధ్యానం చేసే శక్తి లభించినది. ఏకధాటిగా 10 గంటల దాకా ధ్యానములో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం జరిగినది.ఒకసారి శ్రీశైల క్షేత్రం లో ఉండగా నాకు ధ్యానం లో మొట్టమొదటి సారిగా స్వయంభూ గణపతి కనిపించారు. ఆయన ఏమి మాట్లాడడు. అలాగని ధ్యానంలో కనిపించకుండా ఉండడు.ఇది దేనికి సంకేతమో నాకు అర్థం కాలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీరావేశంతో ఉన్న నల్లని ఏనుగు కనపడసాగింది.నా మీదకి ఉగ్రంగా తొండమును ఎత్తి కుమ్మటానికి వచ్చినట్లుగా అనిపించడంతో కళ్ళు తెరిచేవాడిని.మళ్లీ కళ్ళు మూసుకోగానే ఇదే దృశ్యం కనిపించేది. క్రిందటి జన్మ లో ఎప్పుడైనా నేను ఏనుగును బాధ పెట్టడం జరిగి ఉంటుంది అనుకొని అలాగే ధ్యానం కొనసాగిస్తూ ఉండేవాడిని.ఒకసారి నేను తీవ్రమైన ధ్యానంలో ఉండగా నాకు మాగుడు వంటి దుర్వాసన నా ముక్కుల కి సోకడం మొదలైనది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టుపక్కల ఏమీ ఉండేది కాదు. నాకు ఏమీ అర్థం అయినది కాదు.కానీ మళ్ళీ ధ్యానములో కూర్చోగానే ఇలాంటి తీవ్రమైన కంపు వాసన వచ్చేది. దానిని భరించలేక మూడు రోజులపాటు నాకు తీవ్రమైన వాంతులు అయినాయి.వాటితోనే నేను పోతానేమో అని అనిపించేది. ఎవరూ లేకుండానే ఎవరిని చూడకుండానే ఏమి జరగకుండానే ఏమి పొందకుండానే చచ్చిపోతానేమో అని తీవ్ర భయం వేసింది. ఇది జరిగిన రోజులలోనే అనుకుంటా. నాలో నాకే తెలియని తీవ్రమైన కామవాంఛ మొదలైనది. తరచుగా నిద్రలో నాకు తెలియకుండానే వీర్య స్కలనం జరిగేది.

దానితో నేను సిగ్గుతో బాధపడేవాడిని. రాను రాను నాకు ధ్యానము కామవాంఛ తప్ప వేరే స్మరణ ఉండేది కాదు. ఇంద్రియానికి మనస్సు లోబడి కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని విపరీతంగా గోల చేసేది. ధ్యానములో నగ్న స్త్రీ దర్శనము సిగ్గుపడుతూ కనిపించటం ఆరంభమైనది. ఇలాంటి స్త్రీ మూర్తులు నేను చిన్నప్పుడు భౌతికముగా మా ఇంటి చుట్టు ఉన్న చూసిన వారే నాకు నగ్నంగా కనిపించి కవ్విస్తుంటే క్రమంగా నాకు ధ్యాన సమయం తగ్గుతూ ఈ కనిపించిన నగ్న స్త్రీల గురించి ఆలోచించటం ఎక్కువ అయినది. దాదాపుగా నా నిగ్రహం కోల్పోయి ప్రమాదస్థాయికి నేను చేరుకున్నానని నాకు అర్థమైనది. దానితో స్త్రీలను చూడాలంటే సిగ్గు భయం వేసి స్త్రీలే కనిపించని చోటుకి వెళ్లాలని శ్రీశైలం అడవుల్లో లోపల ఉండే తండా గూడెమునకు వెళ్ళిపోయాను.అక్కడ నాలాంటి మనిషి ని చూడటం వాళ్లకి మొదటే కాబోలు ఆడ మగ అనే తేడా లేకుండా నా దగ్గరకి వచ్చి నన్ను వింత జంతువును చూసినట్లుగా చూసి నా వలన వారికి ఎలాంటి ప్రాణాపాయం ఉండదని గ్రహించుకొని నన్ను కూడా వారి గూడెం లోని ఒక గుడిసెలో ఉండటానికి అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా యధావిధిగా ఒక గూడెపు నగ్న స్త్రీ నాకు ధ్యానములో కనిపించి కవ్వించి సైగ చేయడంతో నేను కళ్ళు తెరిచి ధ్యానం ఆపేసే వాడిని. నా ధ్యానం ఇంకా ముందుకు వెళ్లేది కాదు.అలాగని ఈ నగ్న స్త్రీ ఆలోచనలు ఉండకుండా పోయేవి కావు.

ఇలా ఎందుకు కన్పించి కవ్విస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. తిరిగి ధ్యానానికి కూర్చోగానే నగ్న స్త్రీ దర్శనము దానితో నా ఇంద్రియము విజృంభించి నా మర్మాగం పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది.దాంతో నాకు విపరీతమైన ఆవేశంతో పిచ్చిపట్టినట్లు గా అనిపించేది. ఏ పాపం తెలియని చెంచుస్త్రీలు కూడా నగ్నం గా కనిపించే సరికి నేను అక్కడే ఉంటే వారిలో ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేసి గాని ఊరుకోలేనని బలంగా అనిపించడంతో కాశి క్షేత్రంకు వెళ్ళి మరణం పొందాలని నిర్ణయించుకుని ఆ క్షేత్రమునకు వెళదామని అనుకుంటుండగా సుప్రభాత సేవ మొదలైనదని సూచనగా గుడిగంటలు మ్రోగే సరికి మల్లన్న సూచనగా భావించుకొని అక్కడి నుండి కాశీ క్షేత్రమునకు బయలుదేరినాను. నేను ఈ క్షేత్రమునకు చేరుకొని విశ్వనాధుని దర్శించుకుని శ్రీ త్రైలింగస్వామి మఠమునకు చేరుకొని నాకు కొత్తగా వచ్చిన నగ్న స్త్రీ దృశ్యాలు గూర్చి ఆయన విగ్రహనికి చెప్పి నన్ను రక్షించమని చెప్పి పంచగంగా ఘాట్ నందు ధ్యానం చేస్తుండగా ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మణి కర్ణిక ఘాట్ లో అప్పుడే అక్కడికి స్త్రీ శవమూర్తి వచ్చినది. ఎందుకో అక్కడికి వెళ్లాలని దగ్గర ఉండి ఆమె దహన సంస్కారాలు చూడాలని బలముగా అనిపించినది. వెంటనే వెళ్లి చాలా దగ్గరగా ఆమె దహనసంస్కారాలు చూశాను. తడిసిన ఆమె శరీర భాగాలు చాలా స్ఫుష్టంగా  కనిపించేవి.జీవము లేని చూపులు, అందములేని శరీరము నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్న సమయములో దహనం చేయడం ఆరంభించారు. అప్పటిదాకా ఈ దేహము కాస్త విగత దేహముగా మారగానే బ్రతికున్నప్పుడు కామాగ్ని లోనూ చనిపోయినప్పుడు చితాగ్నిలోనూ తగలబడుతోంది కదా. అంటే ఈమె స్త్రీ అని పురుషుడని నగ్నం గా ఉన్నది అని అతను నగ్నంగా ఉన్నాడు అని భావము లేని స్థితికి తను వెళ్లాలని అంటే నగ్నత్వం నుండి దిగంబరత్వం వైపు ముందుకు వెళ్లాలని స్ఫురణకు రాగానే విశ్వనాథుడికి, శ్రీ త్రైలింగస్వామికి కృతజ్ఞతలు చెప్పి ధ్యానం చేస్తుండగా నగ్న స్త్రీలలో ఈ సారి కామము అలాగే నగ్నత్వం తగ్గి వారి స్థానంలో దిగంబరత్వం గా కనిపించసాగింది.ఇలా కొన్ని రోజులు ధ్యానంలో ఉండగా అక్కడికి సాధువులకు సాధకులకు కావలసిన బియ్యం ఇతర వంట సామాగ్రి వస్తువులను ఒక నడివయస్సు ఉన్నస్త్రీ మూర్తి ఇవ్వడం నేను గమనించాను.మా బోటి వారికి కి ఆమె చేస్తున్న సేవ గూర్చి ఆనందమేసింది. ఆమె నన్ను చూడగానే ఆమె మనస్సు చెదిరినట్లై ఆమె నేను ఏ యే ఘాట్ నందు ఎక్కడ ఉంటే పని పెట్టుకొని ఆ ఘాట్ కి వచ్చి అక్కడున్న సన్యాసులకు వస్తువులు ఇస్తున్న నెపంతో నన్ను కామవాంఛతో చూడటం చూసేది. దొరికే చిన్న అవకాశం కూడా మాయ వదులుకోలేదని నాకు అర్థమైంది.

ఇలా ఆమె చేస్తున్న సేవలు పూర్తిగా అప్పటికే నాకు తెలిసి ఉండటంతో నా మనస్సు ఆమెకు కృతజ్ఞతగా ఈ విధంగా ఆమెకు కామ కోరిక తీరిస్తే మంచిదే కదా అని ఒక క్షణం నేను నా మనస్సు జారిపోయింది. వెంటనే అంతలో మణికర్ణికా ఘాట్ స్త్రీ దేహం  యొక్క అంతిమ సంస్కారం గుర్తుకు వచ్చినది. దానితో బ్రతికియున్న ఈ దేహమును మానసికంగా చర్మము ఒలిసి దర్శించి చూశాను. మాంసము, నెత్తురు,చీము, నరాలు,అంగాలు,మలము మూత్రమున్న భాగాలు … ఇవి అన్నియిలేని చివరికి మిగిలిపోయే ఆస్ధిపంజరమును దర్శించే సరికి నాలో ఆమె మీద ఉన్న కామోద్రేకం పూర్తిగా క్షణాలలో నశించిపోయింది.దానితో నా కోసం ఎదురు చూస్తున్న ఆ స్త్రీ మూర్తి వైపు తిరిగి “తల్లి! కామం తీర్చు కోవడం అనేది నా దృష్టిలో కేవలం సంతానోత్పత్తి కి మాత్రమే ఉపయోగించే విధి విధానము. అది నేను తల్లిదండ్రులు చేసే సృష్టి యఙ్ఞంగా భావిస్తాను. నాకు ఎన్నడూ నగ్నత్వం మాత్రం కనిపించదు. కేవలం దిగంబర తత్వము మాత్రమే అగుపించును. అంటే దిక్కులనే వస్త్రములుగా ధరించి చూసేవాడు దిగంబరి అన్నమాట. అలాంటప్పుడు నాకు నగ్నత్వం కనిపించదు .బాహ్యంగా మీరు వస్త్రాలు తీసినప్పటికీ నాకు మీ చుట్టూ ఈ దిక్కులే వస్త్రాలు ధరించి నాకు అగుపించును. మంచికి చెడుకి కారణము మనస్సు అని గ్రహించి దానిని అదుపులో పెట్టుకునేవాడు దేవుడు దానిని అదుపులో పెట్టుకో లేనివాడు జీవుడు అవుతాడు.మోక్షము ఉన్నచోట భోగాలుఉండవు. భోగాలు ఉన్నచోట మోక్షము ఉండదు. కాబట్టి నా చర్మమును వలిచి చూడండి. దుర్గంధ పూరితమైన శరీర భాగాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకో తల్లి. నీవు చేయాలనే తప్పు దేనితో చేస్తున్నావో గుర్తించండి. ఈ జీవము కాస్త శవమే కదా. ఇది శవము అయ్యే లోపల శివము అవ్వాలని ప్రయత్నంలో ఉండగా మీలాంటి మాయలో పడితే నా గతి అధోగతియే గదా”. ఏమనుకుందో ఏమో నాకు దండం పెట్టి మౌనంగా వెళ్ళి పోయింది.ఆ క్షణం నుండి నా శరీరములో ఏవో కర్మలు కూడా తొలగిపోతున్నాయి అని అనిపించ సాగుతుండగా నేను నెమ్మదిగా గాలి లో ఒక అంగుళం ఎత్తు ఎగిరే సరికి నాకు ఆనందం వేసింది. అంటే తన మూలాధార చక్ర జాగృతి శుద్ధి మొదలై ఆధీన స్థితికి చేరుకున్నానని నాకు అర్థమై కాశీ లో ఉంటే ఇలాంటి స్త్రీ మూర్తుల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేకపోయినా వారు ఇచ్చే వస్తువుల సేకరణ వలన వారి కర్మలు తీసుకొని ఈతి బాధలు పడాల్సి వస్తుందని స్ఫురణకు రాగానే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అనుకోగానే ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది సాధువులు నా దగ్గరికి వచ్చి “స్వామి! మీరు ఆమెకి చేసిన హితబోధ విన్నాము. మీరు మూలాధార చక్ర ఆధీనంలో ఉన్నారనిమాకు అర్థమైనది.మీ లాంటి యువ సాధకులను చూసేసరికి మాకు తెలియని ఆనందం చేసినది. మేము అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి వెళుతున్నాము. మీరు కూడా వస్తారా?” అనగానే విశ్వనాధుని ఆఙ్ఞగా భావించుకుని వారితో కలసి అరుణాచలం వెళ్ళినాను.

అక్కడికి వెళ్ళి అరుణాచలేశ్వర స్వామి ని దర్శించుకుని అవతల వైపు అడవిలాంటి ప్రాంతమునకు చేరుకొని ఏకాంతంగా ఒక రాతి మీద కూర్చొని ధ్యానం చేస్తుండగా “లే! లేరా! నా మీద కూర్చుని ఎలా ధ్యానం  చేస్తున్నావురా. ఇక్కడ నుండి పో” అని ధ్వని వినబడింది. కళ్లు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. అలాగే నేను ధ్యానం చేసుకునే రాతి మీద అంతవరకు ఎవరూ కూడా కూర్చోలేదు. ఏమోలే! నా ఆలాపన అనుకుని తిరిగి ధ్యానంలో ఉండగా మరల ఇవే మాటలు చాలా కటువుగా వినబడేసరికి “స్వామీ! మీరు ఎవరో నాకు తెలియదు.నేను మీ మీద ఎప్పుడు ఎలా ఎక్కడ కూర్చున్నానో తెలియదు. దయచేసి చెప్పండి” అనగానే “పిచ్చివాడా! నీవు కూర్చున్న రాతి మీద సూక్ష్మధారిగా ఇక్కడే కూర్చుని ధ్యానం చేస్తున్నాను.నువ్వు నన్ను చూడగలిగితే ఇక్కడికి ఎందుకు వస్తావు” అనగానే నేను దడాలున లేచి అప్పటి దాకా ఖాళీగా ఉన్న రాయి మీద సూక్ష్మధారి ధ్యానం  చేసుకుంటున్నారని నేను ఊహించనందుకు ఎంతో సిగ్గుతో బాధపడుతూ “నన్ను క్షమించండి” అనగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు?నువ్వు ఎవరివి అనగానే నేను వెంటనే “స్వామి! అది తెలుసుకుందామని… కామ మాయను కూడా దాటి ఇక్కడికి వచ్చాను” అనగానే గాలిలో లేద్దామని అనుకుంటున్నావా అయితే నన్ను చూడు అంటూ ఉండగానే ఆ రాతి మీద స్థూల శరీరము జడదారి అయిన సాధువు కనిపించి గాలిలో లేవడము అతడు సుమారుగా 30 అడుగుల ఎత్తులో గాలిలో లేచిన తర్వాత నెమ్మది నెమ్మదిగా క్రిందకి దిగినాడు.అది చూసే సరికి నాకు ఆశ్చర్యం వేయగా “నువ్వు వస్తావని నాకు తెలుసు రా. నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రా.శ్రీశైల రత్న గణపయ్య నాకు ముందే చెప్పి ఏర్పాట్లు చేయించినాడు రా. నువ్వు ఎప్పుడైతే ఆయన తండ్రి చోటులో జయం పొందినావో నిన్ను చూసుకొమ్మని నన్ను పురమాయించాడు. రా వెళ్దాం” అంటూ ఒక దివ్య జ్యోతి దారి చూపుతూ దట్టమైన అడవిలో కారు చీకటి ఉన్న చిన్నపాటి గుహలోకి వచ్చేసరికి ఆ కాంతి పుంజము కాస్త స్థూల శరీరధారిగా మారినది. అప్పుడు ఇక్కడికి 15 మంది దాకా సాధువులు వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించి తీసుకుని వెళ్లి జామకాయలు,అరటి పండ్లు త్రాగడానికి నీళ్ళు ఇచ్చి మౌనముగా తమకేమీ పట్టనట్లుగా తిరిగి వారంతా ధ్యాన నిమగ్నులైనారు.ఆ వాటిని ప్రసాదంగా భావించి తీసుకొని ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చోగానే నా శరీరం నాకు తేలికగా అనిపించి గాలిలోనికి తేలిపోతానేమోననే అనుభూతి కలగటము

దానితో మళ్లీ ఏదో తెలియని భయం నన్ను ఆవహించటం జరగటంతో ధ్యానం భంగమైనది. ఇలా కొన్ని వారాలు జరిగిన పిమ్మట నా శరీరం ఒక అడుగు ఎత్తున గాలిలో తేలడము మళ్ళీ తిరిగి నేను ఎప్పుడైతే భయపడతానో అప్పుడు నెమ్మదిగా క్రిందకి రావడం జరిగినది.అక్కడున్న మిగిలిన వారంతా ఇది అంతా చూసి ఏమీ తెలియనట్లుగా అసలు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించడం నాకు వింతగా అనిపించేది. ఇలా వారి సమక్షంలో 14 నెలల పాటు ఉండేసరికి నేను సుమారుగా పది అడుగుల ఎత్తు గాలిలో ఉండే వాడిని.కానీ నాకు మొదట ఆనందము వచ్చేది కానీ రాను రాను విసుగు అనిపించేది. ఎందుకంటే నా ప్రమేయం లేకుండా ధ్యానంలో కూర్చోగానే గాలిలో లేవటం జరుగుతుండేది.కొన్నాళ్ల తర్వాత నా ధ్యానము లేకపోయినా నేను ఎవరితోనైనా చాలా తీవ్రంగా మాట్లాడుతుండగా నాలో ఉత్తేజం వచ్చి నా ప్రమేయం లేకుండా నేను వారితో మాట్లాడుతూ ఉండగానే గాలిలోనికి వెళుతుండేవాడిని.మళ్లీ కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా క్రిందకి దిగడం జరిగేది. ఇది నాకు చాలా ఇబ్బందిగా,సిగ్గుగా చికాకుగా అనిపించింది.అనవసరముగా ఈ భూచర సిద్ధిని పొందినాను అని నాకు అనిపించింది. కానీ నా ప్రమేయం లేకుండా గాలిలో ఎగరడం చూసిన సూక్ష్మధారి నన్ను పిలిచి “నాయనా! నువ్వు మూల బంధనము వేయటం నేర్చుకో.అప్పుడు నీ ప్రమేయం లేకుండా గాలిలోనికి ఎగరలేవు” అని చెప్పగానే కొన్ని నెలలపాటు ఈ ఆసనాలు వేసి సిద్ధి పొందటంతో కావాలి అనుకున్నప్పుడు గాలిలో ఎగరడం వచ్చినా కూడా నాలో ఆనందం కలగలేదు.శాశ్వత ఆనందస్థితి పొందాలని ఆరాటపడుతున్నాను. నీ టెలిపతి ద్వారా నీ సాధన వివరాలు నాకు తెలుస్తున్నాయి. మీరు కూడా మూలాధార చక్రము ఆధీనము చేసుకొని నల్ల గణపయ్యను ఇంటికి పిలిపించుకొన్నావని తెలిసినది.మంచిది. తర్వాత నా స్వాధిష్ఠాన చక్రం అనుభవాలు త్వరలో మీకు తెలియజేస్తాను ఎందుకంటే గాలిలో లేచే సమయం ఆసన్నమైంది” అంటూ తన టెలిపతి ముగించాడు. దానితో మేమిద్దరము కూడా స్వాధిష్ఠాన చక్రం జాగృతి, శుద్ధి, ఆధీనము గురించి రాబోవు అధ్యాయములలో చూడండి. ఉంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు. మీరు కూడా గాలిలో లేచే సిద్ధి కోసం లేదా మీ ఇంటికి  నల్ల గణపయ్య వచ్చే విధంగా ప్రయత్నించండి.

గమనిక:

దయచేసి చక్ర జాగృతి అయ్యే సమయంలో వచ్చే గణపతి విగ్రహన్ని అలాగే చక్రం శుద్ధి సమయంలో వచ్చే గణపతిని అలాగే చక్ర ఆధీన మాయ దాటే సమయంలో వచ్చేగణపతిని ఎక్కడా కొనకండి.కొని మీరు తెచ్చుకున్న ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే మీ బంధువులతో కావాలి అని చెప్పి తెప్పించుకున్న ఉపయోగం లేదు.లేదా ఎవరి దగ్గర నుండైనా దొంగతనము చేసినను ఎవరి దగ్గర నుండి తీసుకున్నను లేదా సేకరించిన ఉపయోగం లేదు. వాటంతట అవే మీ ఇంటికి రావాలి అది తెలిసిన వారితో లేదా తెలియని వారితో నైనా రావచ్చును.అవి వచ్చేదాకా నీకే తెలియకూడదు. అలానే అవి వచ్చేవి ధ్యానములో కనపడి ఫలానా రోజున వస్తున్నామని చెప్పి వస్తాయని గ్రహించండి.మీకు ధ్యానం లో కనిపించకుండా వచ్చిన వాటి వలన మీకు ఉపయోగము లేనట్లే. మీ టెలిపతి ద్వారా మీ భక్తి తరంగాలు కైలాసంలో ఉండే గణపతి దాకా వెళ్లాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని గుర్తించి మీకు కావలసిన రూపాలలో మీకు ధ్యానంలో కనిపించినట్టుగానే వస్తాడు.చిన్న అంగుళముతో గణపతి పంచలోహ విగ్రహంతో మీ సాధన మొదలై పంచాయతనములోని గణపతిశిల, శేతార్కగణపతి, నల్లరాతి అరచేతి పరిమాణము ఉన్న విగ్రహం వచ్చే దాకా మూలాధార చక్రములో జాగృతి,శుద్ధి, ఆధీనము స్థితులలో మీరు ఉన్నట్లేగా భావించండి. ఇలా వచ్చిన విగ్రహములను దయచేసి ఎవరికీ ఇవ్వకండి. కేవలం మీ ఇంటి కుటుంబ సభ్యులకే అవి చెందాలని తెలుసుకోండి. ఒకవేళ మీకు వారసులు లేకపోతే వాటిని మీ మరణావస్థలో దగ్గరలో ఉన్న దేవాలయమునకు సమర్పించండి. అక్కడ వాటికి నిత్య దూప దీప నైవేద్యం పూజలు జరుగుతాయి. మా ఆవిడకి తన ధ్యానంలో తనకు సంబంధం లేని వాసనలు వస్తున్నాయి అనగానే ఈ చక్రంలో నాకు వచ్చిన దైవిక వస్తువులు ఇచ్చి పూజించుకోమని ఇవ్వటం జరిగినది.ఆమెను ఈ చక్ర సాధన పరిసమాప్తి చేసుకొమ్మని అనుజ్ఞ ఇవ్వటం జరిగినది.

అలాగే మన మూలధారచక్రము నందు మరియు మన ఆజ్ఞాచక్రము నందు గూడ శృంగార దృశ్యాలే మహామాయని గ్రహించండి.ఎందుకంటే ఈ రెండు చక్రాలు ఒకదానికొకటి అనుసంధానమై ఈ మాయలు చూపుతాయి. మూలధారచక్రములో మనకి ఈ శృంగార మాయ దృశ్యాలు కలలయందు,ధ్యానమునందు కనపడితే...అదే ఆజ్ఞాచక్రము నందు అయితే ఇలలో అనగా మానుష్యరూపేణ ప్రేతాత్మలు,శృంగార దేవతలు,గంధర్వులు,మోహిని,యక్షిణి,...ఇలా 13 రకాల జీవజాతులు ఇలలో కనపడి మనతో శృంగార మాయలో పడవెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తాయని నేను గ్రహించాను!

అసలు నాకులాగా ఈ చక్రము నందు గణపతిదర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైన ధ్యానానుభవము పొందినారా అని పరిశోధన చేస్తే...నాకు శ్రీ శ్యామాలాహిరీ ధ్యానానుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజ శ్రీ శ్యామ చరణ లాహిరి పుస్తకము కనిపించినది. అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికిగూడ కలిగినాయని తెలుసుకొని నేను ఆనందము పొందినాను. నిజ సాక్ష్యం ఉంటేనే గదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసము కలిగేది.

నా సాధన పరిసమాప్తి సమయములో

ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయములో నేను కాశీ క్షేత్రమునకు వెళ్ళినపుడు నాకు అక్కడ అనగా కేధార్ ఘాట్ వద్ద ఒక 28 నుండి 30 సం!!రాల వయస్సు ఉన్న సాధకుడు కనిపించాడు. వాడిని చూడగానే నాకు సాధనకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని గ్రహించి వాడి దగ్గరకి వెళ్ళి"నువ్వు సాధన సమస్యతో బాధపడుతున్నావని” నాకు అర్ధమైంది.అనగానే దానికి వాడు వెంటనే “నాకు ఒక నిజ గురువు గావాలి” అన్నాడు.నేను వెంటనే “దేనికి” అన్నాడు.దానికి వాడు “నాకున్న ఉగ్రమైన కామమాయ సమస్యను తొలగించటానికి” అన్నాడు.అప్పటికి నాకు వీడి కధంతా అర్ధమై వాడితో “నాయన!ఇక్కడున్న మణికర్ణిక ఘాట్ యందు ఏమి చేస్తారు” అనగానే వాడు వెంటనే “చితాగ్నిలో శవదహనాలు చేస్తారు” అన్నాడు.అపుడు నేను వెంటనే “అయితే శవము అంటే” అనగానే దానికి వాడు “ప్రాణము లేనిది” అన్నాడు. ఈ లెక్కన చూస్తే “కామప్రక్రియ వేటి మధ్య జరుగుతోంది” అనగానే “ప్రాణమున్న జీవుల మధ్య” అన్నాడు.దానికి నేను వెంటనే “శవాల మధ్య సంయోగము జరగదని అర్ధమవుతోంది గదా!ఇన్నాళ్ళు నీవు కామమును రెండు ప్రాణమున్న తోలుతిత్తులున్న శరీరాల మధ్యగానే చూశావు.అలాగే భావించావు.కాని నిజానికి ఈ మైధునము అనేది రెండు అస్ధిపంజరాల మధ్య జరుగుతోందని తెలుసుకో.ఈ తోలు తీసివేస్తే మిగిలేది అస్ధిపంజరాలే గదా.మరి వీటి మధ్య జరిగే సృష్టియజ్ఞం నీకు కామమాయ ఎలా అవుతుంది.జాగ్రత్తగా ఆలోచించు.మర్మము నీకే బోధపడుతుంది.పదార్ధశరీరాలు దాటు.యదార్ధము నీకే తెలుస్తోంది.” అనగానే వాడు నాకు మౌనముగా నమస్కారము చేసి “నాకు ఈ జన్మ వృధాగాకుండా చేసినారని” ఆనందముగా చెపుతూ అక్కడనుండి...కామమాయ నుండి తప్పుకొని...వెళ్ళిపోయాడు.

(తరువాయి భాగం రేపు ప్రచురితం అవుతుంది)

No comments:

Post a Comment