July 23, 2013

మహాభారతం లో భీష్ముని పాత్ర (సూక్ష్మంగా)

మహాభారతం లో భీష్ముని పాత్ర (సూక్ష్మంగా)

నవదేవతావసువులలో తొమ్మిదవవాడైన "ద్యౌ" అను వసువు, వశిష్ఠుని శాపకారణంగా భూలోకంలో మానవ అవతారంలో భీష్మునిగా అవతరించెను. బాల్యంలోనే సాంగోపాంగవేదవిద్యలను అభ్యసించిన వేదవిదుడు. అస్త్రవిద్యను అభ్యసించే రోజులలోనే ఇతను బాణములను ప్రయోగించి గంగా ప్రవాహాన్ని కూడా నిరోధించగల్గిన అస్త్ర విద్యా పారంగతుడు. ఇతని అసలు పేరు దేవవ్రతుడు.

శంతన మహారాజు, దాశరాజు కుమార్తె సత్యవతిని మోహించి, వివాహమాడవలెనన్న కాంక్షతో ఉండగా, సత్యవతి తండ్రి దాశరాజు విధించిన షరతుకు అంగీకరించి, తాను శాశ్వత బ్రహ్మచర్యమును ఆచరించెదనని పలికిన భీషణ ప్రతిజ్ఞా దురంధరుడు. ఆ కఠోర శపథానికి సంతసించిన శంతనుడు  స్వేచ్ఛా మరణాన్ని వరంగా భీష్మునకు ప్రసాదించాడు.

తండ్రి కొరకు రాజ్యాన్ని, గృహస్థ జీవన సౌఖ్యాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు భీష్ముడు. సత్యప్రతిజ్ఞాపాలనను, శపథాన్ని చిత్తశుద్ధితో ఆచరించినవాడు. అస్త్రవిద్యను నేర్పిన గురువైన పరశురామునితో కూడా యుద్ధము చేసిన ప్రతిజ్ఞా పాలకుడు భీష్ముడు.

మహాభారతయుద్ధంలో  భీష్ముడు నిష్పక్షపాత బుద్ధితో చేసిన యుద్ధము అర్జునుని, శక్తిని క్షీణింపచేయగా, ఆయుధం చేపట్టనని ప్రతినబూనిన శ్రీకృష్ణుడు కూడా భీష్ముని పట్ల ఆగ్రహంతో, చక్రం ధరించి, కొరడాను ఝుళిపించి మరియొకసారి యుద్ధమునకు తలపడగా, భీష్ముడు కరములను జోడించి "పరమాత్మా ! పరంధామా ! రావయ్యా ! నన్ను సంహరించు, నీ కరములలో అస్తమించటం నాకు మహద్భాగ్యం." అంటూ మోకరిల్లాడు భీష్ముడు.

అపారజ్ఞానమును పొందిన భీష్ముడు అజ్ఞానం ఇతరతరాలకు అందాలన్న తపనతో ధర్మరాజుకు వర్ణాశ్రమ ఫలాలు, రాజధర్మాలు, మోక్షధర్మాలు, ఆపద్ధర్మాలు వంటి ఎన్నో అద్భుతవిషయాలను బోధించిన ధీశా. రాజసూయయాగ సందర్భంలో అగ్రపూజ విషయంలో శ్రీకృష్ణభగవానుడే ఆదిపూజకు తగినవాడని తెలిపిన జ్ఞాని.

ధర్మరాజుకు బోధించిన విష్ణుసహస్రనామస్తోత్రంలో ప్రతి అక్షరంలో భక్తి కనిపిస్తుంది. అన్ని వర్ణాలవారికి, వర్గాలవారికి ఆదర్శప్రాయుడై పితృకర్మల సమయంలో అందరినుండి తర్పణాలను స్వీకరిస్తున్న ఆర్తధర్మరక్షకుడు.

ఆయనకు గల అపారభక్తి వల్లనే అంత్యదశలో శ్రీకృష్ణులవారి విశ్వస్వరూపాన్ని దర్శించి, తరించి, పరమపదాన్ని పొందిన ధన్యజీవి భీష్ముడు. పరాక్రమము, పట్టుదల, త్యాగనిరతి, ప్రతిజ్ఞాపాలన, పరమేశ్వరుని యందు అపారమైన భక్తి కలిగిన భీష్ముడు చరితార్ధుడు.

  

No comments:

Post a Comment