October 9, 2014

ముకుందమాల... 29 వ శ్లోకం

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******


29 వ శ్లోకం
నాథే న: పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి


యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం

సేవాయై మృగయామహే నరమహో మూకా వరాకా వయం 



భావం:-
ప్రభూ!మాకు నాథుడు, పురుషోత్తముడు, మూడులోకముల ఏకైకనాథుడు, మనసు మాత్రముచేత సేవింపజాలినవాడు, సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, దేవతామూర్తి అగు నారాయణుడుండగా, మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామములకో అధిపతి అగు వానిని, అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, ఒక మానవమాత్రుని సేవించుటకై తహతహలాడుచున్నాము. అహో! ఏమి మా జాడ్యము! నారాయణుని సేవింపక, నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పస్టముగా వివరించినారు. 

నారాయణుడు సర్వ నరసమూహమునకు ఆశ్రయుడై, సర్వ నరులలో అంతర్యామియై ఉండువాడు. అతడు లేనిదే నిలకడలేనివాడు ఈనరుడు. నారాయణుడు మనకు ప్రభువు. ఆ సంబంధము మనము తొలగించుకొందుమన్నను తొలగునది కాదు. నరునకు నరునితో సంబంధము కల్పితము. అతడు త్రిజగన్నాథుడు. ఇతడు కొలది గ్రామములకు అధినేత. వానిని మనసుతో సేవించిన చాలును. వీనికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేయవలెను. నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును. ఈ నరుడల్పాల్పములను ఈడేర్చును. అతడు పురుషోత్తముడు, వీడు పురుషాధముడు. అతడు దివ్యుడు, ఇతడు మర్త్యుడు. ఇంత బేధమున్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ములమగు మా సంగతి ఏమనుకోవలెనో తెలియదు. 




No comments:

Post a Comment