October 15, 2015

విజయనగరం పైడితల్లమ్మతల్లి అమ్మవారి చరిత్ర

విజయనగరం పైడితల్లమ్మతల్లి  అమ్మవారి చరిత్ర 

విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే విజయరామరాజు చెల్లెలు పైడితల్లమ్మ. తల్లిదండ్రులు లేని పైడితల్లిని అన్నగారే పెంచి పెద్ద చేసాడు. చిన్నప్పటి నుండి ఆమెకు దైవభక్తి ఎక్కువ. కనకదుర్గని పూజించేది.  విజయరామరాజు ఎప్పుడు, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా పైడితల్లి నుదిటిన బొట్టు పెట్టి పంపేది, విజయరామరాజు విజయంతో తిరిగివచ్చేవాడు. అదే విధంగా విజయనగరం- బొబ్బిలి(రామరాజు-తాండ్రపాపారాయుడు)కి యుద్ధం జరిగిన సమయంలో విజయరామరాజు యుద్ధానికి వెళుతుంటే పైడితల్లి నుదిటిన కుంకుమ బొట్టు దిద్దబోయింది. కానీ ఆమె మనసు ఎందుకో కీడు సంకించినట్టు అనిపించి అన్నగారిని యుద్ధానికి వెళ్ళవద్దని వారించింది. కానీ అందుకు రామరాజు నిరాకరించాడు. చివరికి చేసేదిలేక అన్నగారి నుదిటిన బొట్టు దిద్ది పంపింది పైడితల్లి. 



ఆ యుద్ధంలో రామరాజు మరణవార్త విని పైడితల్లి పెద్ద చెరువులోకి దూకి ఆత్మాహుతి అయ్యి, ఒక శిలలాగా మారిపోయింది. విజయనగరంలోనే ఉన్న పతివాడ అప్పలనాయుడుగారికి కలలో కనిపించి నేను ..... నా అన్నని కాపాడుకోలేకపోయాను, అందుకే ఆత్మాహుతి అయ్యాను. నేను శిలగా ఇక్కడ పెద్ద చెరువులో ఉన్నాను..... నాకు గుడి కట్టి, ప్రతిష్టించి, పూజలు జరిపించమని చెప్పింది. 



1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు. జాతరలో సిరిమాను ప్రధాన ఆకర్షణ. 






సిరిమాను చెట్టు ఆచూకీ గురించి అమ్మవారు ఆలయ ప్రధాన పూజారికి ఉత్సవానికి కొద్ది రోజులు ముందుగా  కలలో చెబుతుంది. ఆమె చెప్పిన గురుతులను బట్టి సిరిమాను వృక్షం ఎక్కడుందో గుర్తించి, దానికి పూజలు నిర్వహించి, నరికి పూజారి నివాసం ఉండే ఇంటికి బండ్ల మీద తీసుకువస్తారు. అక్కడ తరతరాలుగా  అనుసరిస్తూ వస్తున్న వడ్రంగులు ఈ వృక్షాన్ని సిరిమానుగా మలుస్తారు.








సుమారు 50 అడుగుల ఎత్తు ఉండే సిరిమాను చివరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనం మీద అమ్మవారి ప్రతిరూపంగా ఆలయ ప్రధాన పూజారి కూర్చొని ఉంటారు. ఈ సిరిమాను మూడులాంతర్లు దగ్గర ఉన్న చదురుగుడి నుంచి బయలు దేరి, కోట వరకు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తుంది. ఈ  ఉత్సవానికి లక్షలాది భక్తులు వస్తారు. భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ఈ సిరిమానోత్సవాన్ని నేటికీ పూసపాటిరాజవంశీయులు కోట బురుజుమీద కూర్చొని వేడుకలు చూస్తారు.


కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతోన్న ఈ ఉత్సవంలో ముందుగా 'పాలధార' అనే వాహనం ... ఆ తరువాత అయిదుగురు ముత్తయిదువులుగల 'అంజనరథం' ... అమ్మవారి ప్రతిమను వెలికి తీసిన జాలరుల 'వల' ... ఆ తరువాత సిరిమాను గల వాహనం నడుస్తుంటాయి. ఇవన్నీ పక్కనే ఉన్న చిత్రంలో చూడవచ్చు. 





ఈ సమయంలో భక్తులు సిరిమాను పైకి నైవేద్యంగా రకరకాల పండ్లను విసురుతూ వుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిమ లభించిన చెరువులో 'తెప్పోత్సవం' ఘనంగా నిర్వహిస్తూ వుంటారు. అమ్మవారిని దర్శించిన వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తూ వుంటారు.








అమ్మవారి సిరిమానోత్సవం ముందురోజు తొలేళ్ల ఉత్సవాన అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో కన్నుల పండువుగా అలంకరిస్తారు. తొలేళ్లు రోజుకే ఉత్తరాంధ్ర అంతటి నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తొలేళ్ల రోజున అర్థరాత్రి పూజారి ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజించి అమ్మవారి కథ చెప్పి విత్తనాలను ప్రజలందరికీ పంచుతాడు. ఈ విత్తనాలను కన్నులకద్దుకుని భద్రంగా ఇళ్లకు తీసుకొని వెళ్లి తమ పంట పొలాల్లో జల్లుతారు. పైడితల్లి అమ్మవారి కరుణాకటాక్షాలతో పంటలు బాగా పండుతాయన్నది రైతుల ప్రగాఢనమ్మకం.     



పైడిమాంబ లేదా పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల దైవం మరియు పూసపాటి రాజుల ఇలవేల్పు. అమ్మవారి దేవాలయం మూడు లాంతర్లు కూడలి వద్ద నిర్మించారు. విజయనగర సామ్రాజ్య కాలంలో సిడి అనే ఉత్సవం జరిగేది. భక్త్యావేశంలో తమను తాము హింసించుకుంటూ, మొక్కుబడులు చెల్లించేందుకు భక్తులు ఈ ఉత్సవం చేసేవారు. ఒక పెద్ద గడ (పొడవాటి, లావాటి కర్ర) కొనకు ఒక ఇనుప కొక్కెం (Hook) కట్టేవారు. ఆ కొక్కెం గడ చుట్టూ తిరిగే ఏర్పాటు ఉండేది. భక్తులు ఆ కొండిని తమ వీపు చర్మానికి గుచ్చుకుని, వేళ్ళాడేవారు. అలా వేళ్ళాడుతుండగా గడను గిరగిరా తిప్పేవారు. పురుషులే కాక స్త్రీలు కూడా ఇలా వేళ్ళాడేవారు. ఈ సిడిని సిడిమ్రాను అని కూడా అంటారు.          
              

No comments:

Post a Comment