January 23, 2014

రథసప్తమి

రథసప్తమి



సూర్యుడు మాఘశుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.

విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య. ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున - యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంత కాలము భర్తకు దూరంగా ఉన్నసమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం చేత ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు(శని)  జన్మించాడు.

తాను ఉదయించి జగతిని చైతన్యపరచేవాడు, తన స్పర్శతో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, గతి తప్పని నిరంతర గమనశీలి, సమయపాలనకు చక్కని నిర్వచనంగా చెప్పదగినవాడు --- సూర్యభగవానుడు. 'సూర్య' అనే పదానికి 'ప్రేరేపించువాడు' అని అర్థము. చరాచర జగత్తు అంతా ప్రేరణ పొందేది, తమతమ కర్తవ్యాలను నిరాటంకంగా నిర్వహించే శక్తిని గ్రహించేదీ -- సూర్యుని ఉనికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడే. అందుకే సూర్యుడిని 'కర్మసాక్షి' అని అంటారు. సూర్యుని జన్మతిథి 'మాఘశుక్ల సప్తమి' . ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు రథాకారంగా కలిగి ఉంటాయంట. అందుకే ఈరోజుని రథసప్తమి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి.

సూర్యునికి... సప్త (ఏడు) సంఖ్యకు చాలా దగ్గర సంబంధం ఉన్నదంట. సూర్యుని జన్మతిథి సప్తమి, అతని రథానికి గుర్రాలు ఏడు, అతని పయనం సప్తద్వీప పర్యంతం, అతని కిరణాలలో ఉండే కాంతి యొక్క రంగులు ఏడు రంగులతో కూడుకొని ఉండే సమాహారం. అతని వెలుగులు సప్తసముద్రాలు దాటుతాయి. అందుకే సూర్యభగవానుని సప్తలోక ప్రదీపునిగా అందరూ స్తుతిస్తారు.

సూర్యుని ఏడు కిరణాల పేర్లు
1) సుషుమ్నo   2)హరికేశు  3) విశ్వకర్మ  4) విశ్వవ్యచ  5) సంపద్వసు  6) అర్వాదము  7) స్వరాడ్వసు  


భారతీయులకు శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్తకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. 
సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.

సౌరకుటుంబములో అన్ని గ్రహాలకు సూర్యుడే ఆధారం. సూర్యకాంతి వల్లనే స్వయం ప్రకాశం లేని చంద్రుడు, నక్షత్రాలు,  గ్రహాలు మొదలైనవి ప్రకాశిస్తున్నాయి. జీవుల యొక్క సృష్టి - స్థితి - లయలకు ఆధారం సూర్యుడే అని కొన్ని పురాణాలు తెలియచేస్తున్నాయి. విజ్ఞానశాస్త్ర దృష్ట్యా గమనించినట్లయితే ఈమాట నిజమే అని అనిపిస్తుంది. సూర్యుని చుట్టూ నిరంతరం అనేక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రాణి పుట్టుటకు, ఉనికికి, ఆధారమైన నీరు ఉన్నది --- ఒక్క భూగ్రహం మీదనే. ఆ నీటినుంచే ప్రాణికోటి ఆవిర్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల సృష్టికి ఆధారం సూర్యుడే అని మనకు తెలుస్తుంది.

సూర్యుడు ఏడు అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమే చీకటిమయంగా ఉంటుంది.       

కాలగణనలో ఒక్కొక్క మనువు పేరుతో ఒక్కొక్క  మన్వంతరం ఉంది. వాటిల్లో ముఖ్యమైనది ప్రస్తుతం జరుగుతున్నది -- వైవస్వత మన్వంతరం. ఈ పేరుకు మూలాధారుడైన వైవస్వత మనువు, వివస్వంతు(సూర్యు)ని కుమారుడే. తండ్రి జన్మదినమైన రథసప్తమి రోజునే ఈ మన్వంతరం మొదలై అమలులోకి వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధార భూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.

ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సూర్యునివల్లే జీవజాలమంతా ఆరోగ్యం పొందుతుందని మనకందరికి తెలుసును. సూర్యుని లేలేత కిరణాలు శరీరాన్ని తాలితె తేజస్సు పెరుగుతుంది - అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందుకే అనునిత్యం ఆదిత్యహృదయం చదవటం, సంధ్యావందనం ఆచరించటం, సూర్యనమస్కారాలు చేయటం, అర్ఘ్య ప్రదానం ఇవ్వటం వంటివి సూర్యుని ఎదురుగా నిలబడి చెయ్యాలి అని శాస్త్రాలు చాటుతున్నాయి, మన పెద్దలు చెబుతున్నారు. ఏదోఒక మిషతో నీరెండలో నిలబడటం ఆరోగ్యప్రదము అంటున్న విజ్ఞాన శాస్త్రం ఈ విషయాన్ని బలపరుస్తోంది. విదేశీయులు కూడా సూర్యస్నానం పేరుతొ నీరెండలో నిలబడుట ఆంతర్యం ఇదే. సూర్య భగవానుని ఈ రోజుల్లో ఆరాధించడం ఆరోగ్యాన్ని-ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ, ప్రతి ఆదివారం ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం (పాయసాన్నం) వండి సూర్యునికి అర్చించాలి.

రథసప్తమి నాడు పాటించవలసిన విధులు
రథ సప్తమినాడు ఆవు నేతితో దీపారాధన చెయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, పిడకలను వెలిగించి పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.


రథసప్తమి రోజున ఆచరించే అనేక కర్మలలోని మర్మం -- ఆరోగ్యానికి చాలా సూత్రాలు దాగి ఉన్నాయి. వాటిల్లో మొదటిగా ----- షష్ఠి నాడు రాత్రి ఉపవాసం చేసి,  సప్తమినాడు సూర్యోదయమున స్నానచేసినట్లైతే, ఏడు జన్మల పాపములు తొలగిపోయి, రోగశోకములు నశించి పోతాయని విశ్వాసం. ప్రాతఃకాలములోనే స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి, మట్టి ప్రమిదలలో, దేనిలోనైనా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీపజ్యోతులను తలపై పెట్టుకుని నదీ జలాల్లో గానీ, మనకు దగ్గరగా కాలువలో పారే జలాల్లోగానీ తటాకాదులకు గాని, వెళ్లి సూర్యుని ధ్యానించి, ఆ దీపమును నీటిలో వదిలి, రేగుపండు కాని , ఆకు కాని ..... జిల్లేడు ఆకులు కలిపి తలమీద పెట్టుకొని స్నానం చెయ్యాలి. ఈవిధంగా చెయ్యటం వలన సూర్యుని కిరణాలలోని ఆరోగ్య కారక లక్షణాలను, శక్తిని గ్రహించి శరీరానికి అందించే గుణం ఉందని ఆయుర్వేద నిర్వచనం. ప్రతీరోజూ ఈవిధంగా చేసినట్లయితే చాలా మంచిది. కానీ అది అందరికీ సాధ్యం కాదు. కనుక సూర్యజయంతి రోజున అర్క (జిల్లేడు) పత్రం శిరస్సు మీద ధరించి,
|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే || 
("సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.)
అని ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేసినట్లయితే, శుభ ఫలితాలు కలుగుతాయి - అని మన పెద్దల ఉవాచ. 

రెండవది ----- పాయసాన్ని నివేదన చెయ్యటం. ఈరోజు కొత్తబియ్యం + కొత్త బెల్లం కలిపి సూర్య కిరణాలు ప్రసరించే ప్రదేశంలో ఆవుపాలతో పాయసం వండుతారు. దాన్ని చిక్కుడు ఆకులమీద ఉంచి సూర్యునికి నివేదన చేస్తారు. అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. రథసప్తమి నాడు సూర్యకిరణాలలో ఉన్నశక్తి ఆ పాయసంలో చేరి, ఔషధగుణాలు కలిగి చిక్కుడు ఆకులతో కలిగిన రసాయనిక చర్యవల్ల ఆ ప్రసాదం తిన్నవారికి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. 
మూడవది ---- సూర్యుణ్ణి స్తుతించే 'అరుణం' 'మహాశౌరం' వంటివి చదవటం వలన ఆ ధ్వనితరంగాలు పరిసర ప్రాంతాలలో వ్యాప్తిచెంది, ఆ ప్రదేశమంతా ఆరోగ్య వాతావరణం కలిగి ఉంటుంది మన పెద్దల భావన. 

ఇప్పుడు కాలం మారింది దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సివచ్చింది. పొయ్యలు పోయి, గ్యాస్ స్టవ్ లు వచ్చాయి కాబట్టి వాటినే ముందుగా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టవచ్చు. రథసప్తమి నాడు దేముడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. 

వేదవిహితమైన గాయత్రీమంత్రం, ఋగ్వేదంలోని మహాశౌరం పేరున రుక్కులు, వాల్మీకి రామాయణంలో ఆదిత్యహృదయం, భారత భాగవతాలలోని సూర్య స్తుతులు ..... ఇవి అన్నీ సూర్యుని గొప్పతనాన్ని మహిమలను చాటి మనకి తెలియచేస్తున్నాయి. 


నవగ్రహలలోఅగ్రస్థానం సూర్యునిదే. దేశాలు, ప్రాంతాలు, ఆచారాలు, ఆరాధనా విధానాలు వేర్వేరుగా ఉన్న చాలా ఎక్కువ దేశాల ప్రజలు దేవుడు అని నమ్మేది, ఒప్పుకునేది, ఆరాధించి పూజించేది సూర్యభగవానుడినే. సూర్యుడు మనకందరికీ ప్రత్యక్షదైవం.   

సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రద్యానం కూడుకొని చేసే సంపూర్ణసాధనే సుర్యనమస్కారములు. బ్రహ్మముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలని ఇస్తాయి. సూర్య నమస్కారములలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలని జపిస్తూ సుర్యనమస్కారములు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. సూర్య నమస్కారముల వలన ఊపిరితిత్తులు, నాడీమండలం, జీర్ణశక్తి మొదలయిన అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదిత్య హృదయం సుర్యభగావానునికి సంబదించిన స్తోత్రం. రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు అలసట పొందినపుడు అగస్త్యమహర్షి యుద్దస్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం ఆనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన పిమ్మట శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం. 

భారత దేశంలో సూర్యునికి అనేక ప్రాంతాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయం ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయాన్ని గంగవంశం రాజు అయిన నరసింహ వర్మ నిర్మించారు. గుజరాత్ లోఅని మొధిర ప్రాంతంలో సూర్యదేవాలయం క్రి.శ.1026 సంవత్సరంలో భీం దేవ్ అనే రాజు ఈ దేవాలయాన్ని నిర్మిచారు. ఇంకా మన దేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా సూర్యదేవాలయాలు ఉండేవి. ముస్లింల పరిపాలనలో అవి నేలమట్టం కాబడ్డాయి. మన రాష్ర్టంలో కుడా సూర్యదేవాలయం కలదు. శ్రీకాకుళం పట్టణానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో సూర్యదేవాలయం కలదు. పూర్వం ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాల క్రమేణా అరసవల్లి గా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయం ప్రాచినమైనది. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రి.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడినదని తెలుస్తున్నది. క్రి.శ.17వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం నవాబు పరిపాలన కిందకు వచ్చింది. “షేర్ మహమ్మద్ఖాన్ అనే అతడు ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డారు. అతడు ఇక్కడ దేవాలయాలను ఎన్నింటినో ధ్వంసం చేసాడు. అలా ద్వంసం చేయబడిన దేవాలయాలలో అరసవల్లి దేవాలయం కుడా ఒకటి. క్రి.శ. 1778 లో ఎలమంచిలి పుల్లాజి పంతులు అనే ఆయన పూర్వం నిర్మింపబడిన చోటనే మళ్ళీ ఆలయాన్ని పునరుద్దరించి విగ్రహాలని వెలికితీసి ఆ దేవాలయంలో ప్రతిష్టించాడు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం అదే. ఈరోజున సూర్యోదయ సమయంలో  అరసవిల్లిలో వెలసిన సూర్యనారాయణుని విగ్రహంపైన సూర్యకిరణాలు పడతాయి. ఇది మనకు భగవంతునిపై ఉన్న నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం.  సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రమే సూర్యకిరణాలు స్వామిపై పడతాయి.  



కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా వైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్ లో జరిగే ఈ రథోత్సవాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు తండోపతండాలుగా వస్తారు.


రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలో శ్రీనివాసునికి ఈ రోజున ఏడు వాహనాల సేవలను టిటిడి పాలకమండలి నిర్వహించి తిరుమాడ వీథులలో ఊరేగిస్తారు. దీనినే ఒక్కరోజు బ్రహ్మొత్సవంగా కూడా అంటుంటారు. 
వాటి వివరాలు ఇలా ఉన్నాయి ... 
ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు 
ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనంపై ఊరేగిస్తారు 
ఉదయం 11 గంటలకు గరుడ వాహనంపై ఊరేగిస్తారు 
మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపై ఊరేగిస్తారు 
మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు 
మధ్యాహ్నం 4 గంటలకు కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు
 
సాయంత్రం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు 
సాయంత్రం 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగిస్తారు.
                                           రథసప్తమి యొక్క కథ :--
మన్వంతరము ప్రారంభమున సూర్యుడు మాఘ శుద్ధ సప్తమి రోజున తన రథమును ఎక్కి ఆకాశసంచారము ప్రారంభించాడు. అందువల్ల కాలచక్రము పరిభ్రమించుటకు కారణమైన సూర్యుని పూజించిన, వ్రతము - జపము - దానము మొదలగునవి చేసిన విశేషఫలితాలని ఇస్తాయి. 

పూర్వము యశోవర్మ అనే రాజుకు అంగవైకల్యముతో ఒక కొడుకు పుట్టెను. రాజుకు కొడుకు పుట్టినందుకు సంతోషము కలిగిన ...... అంగవైకల్యముతో ఉన్నందుకు బాధపడి, పండితులని పిలచి విచారించగా వారు ఈ విధంగా చెప్పిరి. "రాజా ! నీకుమారుడు గతజన్మలో ధనవంతుడు కానీ లోభత్వముతో ఉండెడివాడు. ఒక రోజున పక్కింటివారు రథసప్తమి వ్రతమును చేస్తుండగా చూసి, ప్రసాదమును స్వీకరించాడు. అందువల్ల అతను రాకుమరునిగా జన్మించాడు. కానీ దానము చేయక లోభత్వముతో ఉండిన వాడు కనుక అంగవైకల్యమును పొందాడు. ఇప్పుడు మీరు ఇతనితో రథసప్తమి వ్రతమును చేయించినచో తగు ఫలితము లభించును." అని చెప్పిరి. రాజు వారు చెప్పినట్లే తన కుమారునిచే రథసప్తమీ వ్రతమును చేయించెను. కొద్దికాలానికి రాకుమారునికి వైకల్యము తొలగిపోయి, పూర్తి ఆరోగ్యవంతుడయ్యెను.  

ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని పురాణ ప్రబోధము. ఆరోగ్యప్రదాత అయిన ప్రత్యక్ష నారాయణుని సూర్యభగవానుడుని  కొలిచి సర్వజనులు ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ
                                    సర్వేజనా సుఖినోభవంతు        

         
                                                           అరసవిల్లి కోవెల

3 comments:

  1. Replies
    1. ధన్యవాదాలు లతగారు

      Delete
  2. సూర్యుని యొక్క 13 రుక్కులు తెలియచేయగలరా దయచేసి.

    ReplyDelete