March 28, 2014

కాణిపాకం వరసిద్ధి వినాయకుని చరిత్ర

కాణిపాకం వరసిద్ధి వినాయకుని చరిత్ర

విఘ్నేశ్వరుడు అందరి దేవతలకి ప్రధమ గణాధిపతుడు. అతని పుట్టుక గురించి వివిధ పురాణాలు, వివిధ రకాలుగా చెబుతున్నాయి.

పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ ఒకరోజు వనవిహారము చేస్తూ ఉండగా, గజరాజు యొక్క శృంగారక్రీడలని,ఆసక్తిగా గమనించి, వారు కూడా గజరూపాలని ధరించి, శృంగారక్రీడ సలిపినప్పుడు, వారికి గజముఖ వినాయకుడు ఉద్భవించుట జరిగింది. అతడే సర్వ దేవతలకి నాయకునిగా నియమింపబడ్డాడు.(ఇది ఒక పురాణగాథ)

పూర్వము చిత్తూరు మండలానికి సమీపంలో, విహారిపురి అనే ప్రాంతం ఉండేది. సమస్త దేవతలు ఇక్కడ విహరించటం వల్ల, ఈ ప్రాంతానికి విహారిపురి అనే పేరు వచ్చినట్లు చెప్పబడుతున్నది. ఈ స్థలంలోనే వినాయకుడు "స్వయంభూగా" వెలసినాడంట.

ఈ ప్రాంతంలో పుట్టుకతోనే మూగ, చెవిటి, గుడ్డి ఐన ముగ్గురు నివసిస్తూఉండేవారు. వారు ముగ్గురు కాణీ పెట్టి, ఒక మాగాణి పొలాన్ని కొని, యాతాం బావి నీటితో ఆ పొలాన్ని సాగు చేస్తూ, పంటలు పండిస్తూ జీవించేవారు. ఒకసారి వానలు లేక ఆ ప్రాంతం ప్రజలు, త్రాగునీటికి కూడా ఇబ్బందుల పాలైనారు. ఒకనాడు ఈ ముగ్గురు వికలాంగులు ఆలోచించి, తమ పోలములోని బావిని, మరికొంత లోతుగా త్రవ్వగా, కొంత తడి తగిలింది. నీరు కొద్దికొద్దిగా ఊరుతున్నట్లు అనిపించి, నీరు తీయటానికి అని ఒక చేద(బాన)ని, బావిలోకి దించారు, అది భళ్ళున పగిలింది. అలా ఎన్నిసార్లు చేదలు దించినా పగిలిపోవుట వల్ల ఏదో ఒక బండరాయి అడ్డుగా ఉన్నదని భావించి, గునపాలతో పొడవటం మొదలుపెట్టారు. తవ్వుతున్న ప్రాంతంలో, ఖంగుమనే శబ్దం వినిపించింది. అలా 3 సార్లు వారు పొడవగా, చిన్నరాతిముక్క ఎగిరి బయటకు వచ్చింది, ఆ ముక్కతోపాటు, రక్తం బయటకు ఎగచిమ్మింది. ఆ రక్తంలో తడవటం వల్ల, ఆ ముగ్గురి అవిటితనం పోయింది. వెంటనే చూపు వచ్చినవాడు , విహారిపురి రాజువద్దకు వెళ్ళి, జరిగిన విషయం చెప్పగా, రాజుకి ముందు రోజు రాత్రి కలలో కనిపించిన వరసిద్ధి వినాయకుడు ఇక్కడే వెలసి ఉంటాడు అనుకుని, పరివారంతో బయలుదేరి, స్వామి ఆవిర్భవించిన ప్రాంతానికి చేరుకున్నాడు. అందరు స్వామిని శాంతింపచెయ్యటానికి, కొబ్బరినీటితో అభిషేకం చేసారు, ఆ విధంగా కొబ్బరినీటితో ఆ కాణీ మాగాణి అంతా, పావనమయ్యిందని, పవిత్రమయ్యిందని, ఈ ప్రాంతానికి "కాణిపాకం" అనే పేరు సార్థకమయ్యింది.

ఈ స్వామి విగ్రహం రోజురోజుకూ, కంటికికనిపించకుండా పెరుగుతున్నాదని , పరమసత్యం. స్వామివారి తల వెనుక తగిలిన, గునపపు దెబ్బ, నేటికి కూడా మనకు కనిపిస్తుంది. ఆ బావిలో ఉన్న నీటినే , భక్తులకు తీర్థంగా ఇస్తున్నారు. ఇటువంటి దైవం ఉన్న ప్రాంతం నిజంగా కలియుగ కైలాసమే కదా ! అందరూ ఆ గణనాధుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment