March 28, 2014

ఉ(యు)గాది ...... పర్వదినం

ఉ(యు)గాది ...... పర్వదినం

మిత్రులందరికి  "జయ"  నామ సంవత్సర శుభాకాంక్షలు



"ఉగాది".......అని మనం జరుపుకుంటున్న ఈ పండుగరోజు-----ఉగాది అనే పేరు ఎలా వచ్చిందో కొన్ని వాక్యాల్లో మనం తెలుసుకుని , పండుగ ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాము........

శ్రీమహావిష్ణువు అవతరించిన దశావతారాలలో మొదటిదైన "మత్స్యావతారం" ఎత్తుతున్న వేళ, సృష్టి----స్థితి----లయ....అనే మూడింటిలోను మొదటిదైన సృష్టి కార్యాన్ని బ్రహ్మగారి ద్వారా ప్రారంభమైన రోజు ఈ రోజే ........యుగానికి మొదటిరోజు కావున........."యుగాది"........అని పిలవబడుతున్నది. ఈ కలియుగం చైత్ర శుద్ధ పాడ్యమినాడు మొదలైనది.

ఈ "యుగాది" నే కాలక్రమేణా "ఉగాది"గా .... తెలుగు నెలల ప్రకారం సంవత్సరమునకు మొదటిరోజు కావున "సంవత్సరాది"గా చెప్పుకుంటున్నాము.

చైత్ర- వైశాఖ మాసములు- వసంతఋతువు......ఈ ఋతువుకి మరొక విశేషము కూడా ఉన్నదని మన పెద్దలు చెప్పిన కొన్ని సంఘటనలు చెప్పుకుందాము.

సీతాపహరణం జరిగినది---ఈ వసంత కాలములోనే.

రాముడు తనని సంహరించటానికి రాగలడు అనే విషయం---రావణునికి తెలిసినది కూడా ఈ వసంత కాలములోనే.

ఆంజనేయుడు మొదటిసారిగా రాముని దర్శించినది---ఈ కాలంలోనే.

తనకంటే రాముడెంతటి గొప్పవాడో.. సుగ్రీవునికి అర్ధమైనది, రామునితో మైత్రి జరిగినది ఈ కాలములోనే.

రామునిచేతిలో వాలికి మోక్షము లభించినది, సీతమ్మ రాముని గూర్చి హనుమ ద్వారా.. మొదటిసారిగా విన్నది---ఈ కాలములోనే.

రావణవధ జరిగాక అయోధ్యలో--సీతాసమేతుడై రాముని పట్టాభిషేకము జరిగినది---ఈ కాలములోనే.

సాంప్రదాయములోని భావముతెలిసి, పండుగ జరుపుకుంటే---ఎంత ఆనందంగా ఉంటుందో కదా ! అందుకే అన్నారు మనపెద్దలు---పండుగలు--పరమార్ధం తలుసుకొని... ఆచరించుకోవాలి.

పండుగలు--పరమార్ధం:--

ఈ కాలంలో ఆకులు రాలి, మోడులా కనిపించే చెట్లు --- తిరిగి మళ్లీ చిగురించి ---- కొత్తచీరలుకట్టి ముస్తాబైన ముత్తైదువులవలే---దర్శనమిస్తాయి.

ప్రకృతిలోని వనరులన్నీ మననుంచి ఏమీ ప్రతిఫలాన్ని ఆశింకుండానే-----మనకివ్వకుండా ఉండలేక----మనకి కావలసిన పదార్థాలన్నిటినీ మనకు అందిస్తున్నాయి.

ఈ వసంతఋతువులోనే--- మామిడికాయలు, చింతపండు, బెల్లం, వేపపువ్వు, అన్నీ కొత్తకొత్తగా వస్తాయి. అన్నిరుచులను కలుపుకుని తింటే, అది ఒక కొత్త రుచి----మనజీవితంలో సంభవించే కష్టసుఖాలకు, ఆనందాలకు, బాధలకు ఉగాది పచ్చడికి చాలా పోలికఉంది.


ఈ కాలంలో చెట్లు చిగురించి, కాయలు, పండ్లుతో ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా ఉంటుంది--- పచ్చని ఆకుల మధ్య ఎంతో శ్రావ్యంగా వినిపించే కోకిలమ్మ గానాలు వింటుంటే మన మది ఆనందంతో పులకిస్తుంది......


ఈ పండుగ రోజున తెల్లవారుఝామునే నిద్రలేచి, తలకుస్నానం చేసే ముందు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళచే మాడుకు చమురు(నూనె) పెట్టించుకుని, నలుగుపెట్టి స్నానం చెయ్యాలి. స్నానాంతరము కొత్తబట్టలు కట్టుకుని, పెద్దలకు నమస్కరించాలి.... మనకి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చి, బాగా సంపాదించుకోగల బుద్ధి & శక్తినిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చెయ్యటంలో తప్పులేదుకదా ! ఇది ఒక సంప్రదాయమే---పెద్దల ఆశీస్సులు ఉన్నప్పుడే మనం ప్రగతిపథంలో ముందుకు వెళ్ళగలము...ఈ సాంప్రదాయమును మనం కాపాడుకుందాం.

సాయంత్రం సమయంలో పురోహితులు పంచాంగ శ్రవణం చేస్తారు... మన జాతకం, నక్షత్రం ప్రకారము సంవత్సర ఫలితం ఎలా ఉందో, పురోహితులవారు అందరికీ తెలియచేస్తారు.....

ఇన్ని ఆనందాల కలబోత అయిన.... ఆనందాల ఉగాదిని జరుపుకుని, అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ----మరొక్కమారు అందరికి.......... "జయనామ సంవత్సరశుభాకాంక్షలు"




1 comment:

  1. ఉగాది పండగ పర్వదినం గురించి తెలియజేసినందుకు మీకు అభినందనలతో పాటు ఉగాది
    శుభాకాంక్షలు
    ---అయ్యగారి రామకృష్ణ,నాగులవలస

    ReplyDelete