October 6, 2014

ముకుందమాల

******కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల******







1 వ శ్లోకం
ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే
తమహం శిరసా వందే రాజానం కులశేఖరంll   



భావం:-

పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన కులశేఖర మహారాజు శ్రీరంగనాథుని సేవించుటకు, భక్తులందరినీ తన వెంట తీసుకుపోవుచూ రంగయాత్రను గూర్చి తెలుపుచున్నారు. శ్రీరంగనాథుని గుణకీర్తనము చేయుచూ, భక్తి తన్మయులై ఈ యాత్రా విశేషాలు తెలుపుతూ ఉంటే సమయము గడిచిపోవుచున్నది. ఇదే విధంగా ప్రతీరోజూ జరుగుచున్నది. ఈవిధంగా శ్రీరంగనాథుని గుణానుభవముననే సమయము గడిపెడి భక్త కులశేఖర మహారాజుకు సాష్టాంగపడి నమస్కరించుచున్నాను.  


        

2 వ శ్లోకం
శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి
భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాథేతి నాగాశయనేతి జగన్నివాసేతి  
ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద 



భావం:-

మహాభక్త శేఖరుడైన శ్రీకులశేఖర మహారాజు ముందుగా తన స్తోత్రారంభమున ముకుందుని గూర్చి ఈవిధంగా ప్రార్థించిరి. ...... ఓ ముకుందా! శ్రీవల్లభ! వరద! దయాపర! భక్తప్రియ! భవభంజన కోవిద! నాథ! నాగశయన! జగన్నివాస! నా మొరకు సమాధానము   ఇవ్వవయ్యా. 


           

3 వ శ్లోకం

జయతు జయతు దేవో దేవకీనందనోయం

జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద:

భావం:-
ఓ దేవా! దేవకీనందన! నీకు జయము. వృష్ణివంశ మంగళ దీపమా! కృష్ణా నీకు జయము. సుకుమార శరీర, మేఘశ్యామా! నీకు జయము. భూ భార నాశక! ముకుంద! నీకు జయము జయము. 


             
4వ శ్లోకం
ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేస్తు భవత్ప్రసాదాత్

భావం:-
(శ్రీకులశేఖర మహారాజు - మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము  పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీకులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు. ఈ శ్లోకం "ముకుంద"తో ప్రారంభమగుట వలన "ముకుందమాల" అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరీమంత్రము నిక్షిప్తమై ఉన్నాడని పెద్దలు చెప్పుదురు.)

ఓ ముకుందా! నీ పాదారవిందములను జన్మజన్మమూల నేను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నీ ఎదుట శిరస్సు వంచి, మోకరిల్లి ఈ కోరికను కోరుకుచున్నాను.   


           


5 వ శ్లోకం
నాహం వందే తవ చరణయోర్ద్వంద్వహేతో:
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం  

భావం:-
ఓ కృష్ణా! ద్వంద్వాతీతస్థితిని అందవలెనని కాని, కుంభీపాకనరకమును తప్పించుకొనవలెనని కాని, లావణ్యవతులగు అప్సరసలను స్వర్గములో అనుభవింపవలెనని కాని,  నేను నీ పాదారవిందములకు నమస్కరించుటలేదు. ఎట్టి దేహము ఇచ్చినను సరే, నాకు అభ్యంతరము లేదు. కానీ సర్వదా మనసులో నిన్నే స్మరించునట్లు ఉండవలెననియే నమస్కరించుచున్నాను.   


       

6 వ శ్లోకం
నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు 

భావం:-
ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించవలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించవలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగవలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే  కూడా, కృష్ణభక్తినే ముఖ్యముగా ప్రార్థించుచున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమని వారి ఆశయము.)   


               


7 వ శ్లోకం
దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి

భావం:-
(వెనుకటి శ్లోకంలో భగవంతుని తలచుట కంటే ఇతరములైన ఫలములను వేటినీ తాను కోరనని(కాంక్షించనని) చెప్పిన కులశేఖరులు ఈ శ్లోకంలో, ఈ ప్రదేశముననే ఉండవలెనను కోరిక కూడా నాకు లేదు అనుచున్నారు.) 

ఓ నరకాంతక! కృష్ణా! స్వర్గమునందున్నను, లేదా ఈ భూమి యందే ఉన్నను నాకేమీ బాధ లేదు. కానీ శరత్కాల పద్మసుందరములగు నీ చరణారవిందములనే మరణ సమయమున కూడా ధ్యానించుచుందును.  


          

8 వ శ్లోకం
కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్వ్యైవ మే విశతు మానస రాజహంస:
ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై:
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే 

భావం:-
కృష్ణా! మరణ సమయమున స్మరింతునని అంటిని కానీ, ఆవేళ కఫవాతపైత్యములచే కంఠము మూతపడినప్పుడు నీ స్మరణ కలుగునో కలుగదో కదా! కావున ఇప్పుడే నా మానసరాజహంసము విరోధులెవ్వరూ చేరలేని వజ్రపంజరమువలె ఉండు నీ పాదపద్మమధ్యమున చేరుగాక!    



9 వ శ్లోకం
చింతయామి హరిమేవ సంతతం
మందమంద హసితాననాంబుజం
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితం  

భావం:-
నారదాదిమునీశ్వరులచే సేవింపబడుచుండు వానిని, పరాత్పరుని, నందగోపకుమారుని, నవ్వు రాజిల్లెడి మోమువానిని, కృష్ణుని ఎల్లప్పుడూ నేను ధ్యానించు చుందును. 

(నాల్గవ శ్లోకం నుండి ఇంతవరకు అనన్య ప్రయోజనముగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు అవిచ్ఛన్నముగా ఆటంకములు లేక హరిస్మరణమే తనకు కావలెనని కులశేఖరులు కోరినారు. ఆ కోరికను అనుసరించి లభించిన హరిని అనుభవించి తృప్తితో ఈ శ్లోకమును చెప్పుచున్నారు)     

      

10 వ శ్లోకం
కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే
శ్రమముషి భుజవీచివ్యాకులేగాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్న: ఖేదమద్యత్యజామి 

భావం:-
నేను ఈ సంసారము అనెడి ఎడారిలో ప్రయాణము చేసి, చేసి బడలిక చెంది, నేడు ఈ హరి సరస్సును చేరితిని. ఆహా! ఎంత సుందరమూ ఈ సరస్సు! ఆ హరి కరచరణములే   మిలమిలలాడు చేపలు. భుజములే అందు కదలాడు కెరటములు. అది శ్రమలనన్నిటిని హరించును. ఆ రేవులు అవగాహనము (స్నానము)చేయుటకు అనుకూలముగా లోతు కలవై ఉండును. అందులోకి పోయి, ఆ తేజస్సు అనెడి జలమును కడుపు నిండుగా త్రాగి, నా బడలికను తీర్చుకొనుచున్నాను.  


              

11 వ శ్లోకం
సరసిజనయనే సశంఖచక్రే
మురభిధి మా విరమస్వ చిత్త రంతుం
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణ స్మరణామృతేన తుల్యం 

భావం:-
ఓ మనస్సా! ఏకాలమందైనను హరిచరణము అను అమృతమువలె సుఖప్రదమైనది, వేరొకటి లేదు. కావున ఆ పుండరీకాక్షుడు, శంఖ చక్రధరుడు అగు మురారిని సేవించి, రమించుటను మానకుము.   


     

12 వ శ్లోకం
మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనా:
నామీ న: ప్రభవంతి పాపరిపవ: స్వామీ నను శ్రీధర:
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమా:   

భావం:-
ఓ మూఢమైన మనసా! యమ యాతనలను పలువిధముల చిరకాలము చింతించి భీతినొందకుము. మన ప్రభువగు శ్రీహరి ఉండగా ఈ పాపములనెడి శతృవులు మనలను ఏమియూ చేయలేవు. కావున భక్తిచే సులభముగా పొందదగు నారాయణుని జాగుచేయక ధ్యానింపుము. లోకములో అందరి ఆపదలను తీర్చువాడు, తనదాసుని ఆపదలు తొలగింపలేడా !    



13 వ శ్లోకం
భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకళత్ర త్రాణభారార్ధితానాం

విషమవిషయతోయే మజ్జతామప్లవానాం

భవతు శరణమేకో విష్ణుపోతో నరాణాం 



భావం:-
ఈ నరులు సంసార సముద్రములోపడి, సుఖదుఃఖములు మొదలగు జంటలను గాలిచే కొట్టుకొనిపోవుచున్నారు. బిడ్డలు, భార్య మొదలగువారి బరువు వారిని మరింత క్రిందకు ముంచుతున్నది. ఆ బరువుతో ఈ విషయములు అనెడి జలమున మునుగుతున్న నరులను కాపాడుటకు ఏ తెప్పయు కనబడకున్న సమయమున వారిని కాపాడు నౌక ఒక్క శ్రీమహావిష్ణువు మాత్రమే.  
   





14 వ శ్లోకం
భవజలధిం అగాధం దుస్తరం నిస్తరేయం

కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం

సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా

నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం 



భావం:-
ఓ మనసా! ఈ సంసార సముద్రము ఎంత లోతైనదే! దాటుటకు శక్యము కానిదే! నేనెట్లు దాటగలనని పిరికితనము పడకుము. పుండరీకాక్షుడగు కృష్ణభగవానుని యందు నీవు అనన్యమగు భక్తిని నిలిపినచో నీ ప్రయత్నము లేకుండానే అది నిన్ను దాటించును. ఇది నిశ్చయము.   



     

15 వ శ్లోకం

తృష్ణాతోయే మదనపవనోద్ధూతమోహోర్మిమాలే

దారావర్తే తనయసహజగ్రాహసంఘాకులే చ
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ 
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ 

భావం:-
(సంసారమను సముద్రములోపడి, మునుగుచు, తెలుచూ, దాటలేక బాధపడుచున్న వారికి విష్ణువే నౌక అని, విష్ణుభక్తియే నౌక అని వెనుకటి 2 శ్లోకములలో పేర్కొని, ఆ నౌకను ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలెనని తెలుసుకొని, ఈ శ్లోకంలో ప్రార్థించుచున్నారు.) 

ఈ సంసారమను సముద్రములో ఆశయే జలము. ఆ జలము కామమను పెనుగాలిచే కదిలింపబడుచున్నది. ఆ విధంగా కదులుటచే మొహమను కెరటములు వరుసగా సాగుచుండును. ఈ సముద్రములో భార్య సుడిగుండమువలె పట్టి తిప్పి, అందు పడినవారిని బయటకు పోనీయక ముంచివేయును. బిడ్డలు, బంధువులు- మొసళ్ళు మొదలగు జంతువులవలె కబళింప ప్రయత్నించుచుందురు. ఇట్లు భయంకరమగు సంసార మహాసముద్రమున పడి, దాటు ఉపాయము లేక మునుగుచున్న మాకు, ఓ వరద! ఓ త్రిధామ! నీ పాదపద్మభక్తి అనెడి నౌకను ఇచ్చి దరిజేర్చుమయ్యా.      


               
16 వ శ్లోకం
మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపిభవతో భక్తిహీనాన్ పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబంధం తవచరిత మపాస్యా నన్యదాఖ్యాన జాతం
మాస్మార్షం మాధవత్వామపి భువనపతేచేత సాపహ్నువానాన్ 
మాభూవం త్వత్సపర్యావ్యతికర రహితో జన్మ జన్మాంతరేపిll   

భావం:-
(భక్తినొసంగుమని ప్రార్థించి, కులశేఖరులు ఆ భక్తి కలుగుటకు ప్రతిబంధకముగా ఉండు పాపములను తొలగించుటకై, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనస్సులచే సాధింపదగు శమ దమాది సంపత్తిని ఇందు వివరించుచున్నారు.) 

హే జగన్నాథా! మాధవ! నీ పాదారవిందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనులను కంటితో చూడను. చేవికింపైన బంధముకలదయినను చరిత్రము తప్ప వేరొక కథాసందర్భమును చెవితో వినను. (ఈ రెండింటిచేత జ్ఞానేంద్రియ నిగ్రహమును సూచించిరి.) మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను (అసత్పురుషులను) నేను స్మరింపను. దీనిచే మనోనిగ్రహము సూచింపబడినది.) జన్మజన్మాంతరములందును నీ కైంకర్యములేని మనుగడను కలిగియుండును.(దీనిచే కర్మేంద్రియ నిగ్రహము సూచింపబడినది.)     


                   
17 వ శ్లోకం
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం

జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్ నమాధోక్షజంll  

భావం:-
(ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయవలసిన వానిని చేయుట. వెనుకటి శ్లోకమున జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే విడువదగినవానిని చెప్పి, ఇందు చేయదగనివానిని చెప్పుచున్నారు.) 

ఓ పాద ద్వంద్వమా! నీవు భగవదాలయమునకు నడుచుచుండుము. ఓ హస్తద్వంద్వమా! నీవు భగవదర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా! నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా! నీవు భగవంతుని నమస్కరించుచుండుము.(ఇట్లు కర్మేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ నేత్రద్వంద్వమా! శ్రీకృష్ణభగవానునే చూడుము. ఓ శ్రోత్రద్వంద్వమా! ఆ శ్రీకృష్ణుని లీలలనే ఆకర్శింపుము.(ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ మనసా! ఆ శ్రీధరునే ధ్యానింపుము.(ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)    


                          
18 వ శ్లోకం
హేలోకాశ్శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సా మిమాం

యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ:

అంతర్జ్యోతి రమేయ మేక మమృతం కృష్ణాఖ్య మాపీయతాం

తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యంతికంll  



భావం:-
రెండు శ్లోకములలో ముందు తెలియక బాధపడుచున్న సంసార వ్యాధిగ్రస్తులకు, కులశేఖరులు తాను తెలుసుకున్న చికిత్సను వివరించుచున్నారు. 

ఓ లోకులారా! చావు పుట్టుకలను వ్యాధికి యోగమెరింగిన యాజ్ఞవల్క్యాదులగు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినడు, వారు కనుగొనిన మందు కృష్ణామృతము. దానిని సేవించినచో ఈవ్యాధి శాశ్వతముగా తొలగిపోవును. ఆమందు ప్రకాశవంతము, అద్వితీయము, ఇట్టిదని చెప్పనలవికానిదియునై వెలయు చుండును.  


          

19 వ శ్లోకం
హే మర్త్యా: పరమం హిత శృణుత వో వక్ష్యామి సంక్షేపత:

సంసారార్ణవమాపదూర్మిబహుళం సమ్యక్ప్రవిశ్య స్థితా:

నానాగ్నానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం

మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు: 



భావం:-
మర్త్యులు అమృతత్వము పొందుటకు ఉపాయము ఇందు ఉపదేశిస్తున్నారు. ఉపాయములు కర్మజ్ఞాన భక్తి యొగములుగా పేర్కొనబడినవి ఎన్నియో ఉన్నవి. కాని అవి ప్రయాససాధ్యములని సంక్షేపముగ ఒక ఉపయమును ఉపదేశించుచున్నారు. 

ఆపదలనెడి కెరటములతో నిండిన సంసారమనెడి సముద్రములో చొచ్చియున్న ఓ మర్త్యులారా! వినుడు. మీకు సంగ్రహముగా ఒక ఉపయమును చెప్పెదను. అనన్యమగు భక్తితో తదితర చింతనములను విడచి మనసున "నమో నారాయణాయ" అను ఈ మంత్రమును ఓంకార పురస్సరముగా జపించండి.     



                                           

20 వ శ్లోకం
పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: ఫల్గుస్ఫులింగోనల:

తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ:

క్షుద్రా రుద్రపితామహప్రభృతయ: కీటాస్సమస్తాస్సురా:

దృష్టే యత్ర స తావకో విజయతే భూమావధూతావధి: 



భావం:-
పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు. ఈ జగము నీటి తుంపర. తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము. వాయువు నిస్శ్వాసము. ఆకాశము సన్నని చిన్నరంధ్రము. రుద్రా పితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్రకీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లుచున్నది.    


    

21 వ శ్లోకం
బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమై:

కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా

నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృయాస్వాదినాం

అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం  



భావం:-
ఓ పుండరీకాక్ష! నీకై మొగిడ్చిన దోసిలి, వంగిన శిరస్సు, గగుర్పొడిచిన యవయవములు, గద్గదస్వరము గల కంఠము, కన్నీటితో నిండు కన్నులు కలిగి ఎల్లప్పుడూ నీ పాదారవింద ధ్యానామృతమును ఆస్వాదించుచునే మా జీవితమంతయు సాగునట్లు అనుగ్రహింపుము.   



   

22 వ శ్లోకం

హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ

హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం

హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా



భావం:-
ఓ గోపాలా! కరుణాసముద్ర! లక్ష్మీపతి! కంసారి! గజేంద్ర రక్షకా! మాధవ! రామానుజ! జగన్నాథ! పుండరీకాక్షా! గోపీజనవల్లభ! రక్షింపుము. నీవే తప్ప ఇహపరంబు నేను ఎరుంగను.   
  


        

23 వ శ్లోకం
భక్తాపాయభుజంగగారుడమణి: త్త్రైలోక్యరక్షామణి:

గోపీలోచనచాతకాంబుదమణి: సౌందర్యముద్రామణి:

య: కాంతామణిరుక్మిణీఘనకుచ ద్వంద్వైకభూషామణి:

శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణి:  



భావం:-
సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి. వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామణి. లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ, మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను దరిచేరకుండ తొలగించును.  


                 

24 వ శ్లోకం

శత్రుచ్చేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్య మంత్రం

సంసారోత్తారమంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణమంత్రం
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జపజప సతతం జన్మసాఫల్యమంత్రం  

భావం:-
ఓ జిహ్వా! శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము. అదియే జన్మకు సాఫల్యము ఇచ్చునది. కామాది శత్రువులను భేదించుటలో ప్రధానసాధన మా మంత్రము. సర్వోపనిషద్వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి. జననమరణములనెడి సంసారము నుండి తరింపచేయగల మంత్రమది. రాశీభూతమైన అవిద్యాంధకారమును నశింపజేయు మంత్రము. ఆ మంత్రమే సర్వైశ్వర్యములను ఇచ్చెడిది. వ్యసనములనెడి సర్పములు కాటువేసినప్పుడు కాపాడగల మంత్రము. కనుక శ్రీకృష్ణ మంత్రమును జపింపుము.      


      
25 వ శ్లోకం
వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిజగతాం సంజీవనైకౌషధం
భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం
శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:శ్రీకృష్ణదివ్యౌషధం

భావం:-
ఓ మనసా శ్రేయస్సును కలిగించు శ్రీకృష్ణ దివ్యౌషధమును సేవింపుము. ఆ ఔషధము మోహమును శమింపచేయును. మునుల మనోవృత్తులను ప్రవర్తింప చేయును. రాక్షసేంద్రులలకు బాధలను కలిగించును. మూడులోకములను మరణము నుండి కాపాడును. భక్తులకు అత్యంతము హితము చేకూర్చును. సంసార బంధమును బాపును.    


    
26 వ శ్లోకం
ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్చేదఫలాని పూర్తవిధయ: సర్వే హంతం భస్మని
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వాంభోరుహసంస్మృతీ: విజయతే దేవస్య నారాయణ:  

భావం:-
శ్రీ నారాయణ పదాంభోరుహ స్మరణమును విడిచి కేవలము వేదములు వల్లెవేయుట అరణ్య రోదనము. వేదోక్త నియమములను పాటించుట కండలు కరుగుటకు చేయు వ్యాయామ సదృశము. యజ్ఞాది కర్మలు బూడిదపాలు. గంగాది పుణ్యతీర్థ స్నానము గజస్నానము వలె ప్రయోజన శూన్యము. కనుక నిత్యము ఆ నారాయణుని స్మరిస్తూ సర్వకర్మలు ఆచరింపుము.   


   
27 వ శ్లోకం
శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కే న ప్రాపు ర్వాంచితం పాపినోపి
హా న: పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్ 
తేన ప్రాప్తం గర్భవాసాదిదు:ఖం 

భావం:-
పాపాత్ములైనను శ్రీమన్నారాయణ అను నామమును ఉచ్చరించి తమ కోర్కెలను తీర్చుకొనిరి కదా! అయ్యో నా వాక్కు ఆ నామమును ముందు ఉచ్చరించినది కాదు. అందులకే నాకీ జన్మము. ఈ గర్భవాసము మున్నగు దుఃఖములు సంభవించినవి.   


  
28 వ శ్లోకం
మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే
మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ
త్వద్భృత్యభృత్యపరిచారక భృత్యభృత్య
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ

భావం:-
దైత్యసంహారక! లోకనాథ! ఈ నా కోర్కెను తీర్చుము. నన్ను అనుగ్రహింపుము. నీ భ్రుత్యు భ్రుత్యు పరిచారక భ్రుత్య భ్రుత్యునాకు భ్రుత్యుడనుగా నన్ను తలంచుము. ఆవిధంగా నీ భ్రుత్య పరంపరలో ఒకనిగా నన్ను తలంచుటఏ ప్రభూ! నాజన్మకు ఫలము.     


    
29 వ శ్లోకం
నాథే న: పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి

యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం

సేవాయై మృగయామహే నరమహో మూకా వరాకా వయం 



భావం:-
ప్రభూ!మాకు నాథుడు, పురుషోత్తముడు, మూడులోకముల ఏకైకనాథుడు, మనసు మాత్రముచేత సేవింపజాలినవాడు, సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, దేవతామూర్తి అగు నారాయణుడుండగా, మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామములకో అధిపతి అగు వానిని, అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, ఒక మానవమాత్రుని సేవించుటకై తహతహలాడుచున్నాము. అహో! ఏమి మా జాడ్యము! నారాయణుని సేవింపక, నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పస్టముగా వివరించినారు. 

నారాయణుడు సర్వ నరసమూహమునకు ఆశ్రయుడై, సర్వ నరులలో అంతర్యామియై ఉండువాడు. అతడు లేనిదే నిలకడలేనివాడు ఈనరుడు. నారాయణుడు మనకు ప్రభువు. ఆ సంబంధము మనము తొలగించుకొందుమన్నను తొలగునది కాదు. నరునకు నరునితో సంబంధము కల్పితము. అతడు త్రిజగన్నాథుడు. ఇతడు కొలది గ్రామములకు అధినేత. వానిని మనసుతో సేవించిన చాలును. వీనికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేయవలెను. నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును. ఈ నరుడల్పాల్పములను ఈడేర్చును. అతడు పురుషోత్తముడు, వీడు పురుషాధముడు. అతడు దివ్యుడు, ఇతడు మర్త్యుడు. ఇంత బేధమున్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ములమగు మా సంగతి ఏమనుకోవలెనో తెలియదు. 



                                   

30 వ శ్లోకం
మదన పరిహర స్థితిం మదీయే

మనసి ముకుందపదారవిందధామ్ని

హరనయన కృశానునా కృశోసి

స్మరసి న చక్రపరాక్రమం మురారే: ll 



భావం:-
ఓ మదనా! నా మనసులో ముకుంద చరణారవిందములు పాదుకొనిఉన్నవి. నీవు అచటకు చేరుకొన ప్రయత్నింపకుము. పురారి నేత్రాగ్ని చేతనే కృశించితివి. ఇంకా మురారి చక్ర పరాక్రమము గూర్చి తెలుసుకొని మసలుకొనుము.   



31 వ శ్లోకం

తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్ 

మధు క్షరంతీవ సతాం ఫలాని

ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి  

భావం:-
ఓ జిహ్వా! దోసిలియొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వమగు నారాయణుని ప్రతిపాదించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన నామములను మరల మరల ఉచ్చరింపుము.   



32 వ శ్లోకం
ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ

భావం:-
ఓ మూఢా! దుర్బుద్ధి! ఈ శరీరము క్రమముగా జీర్ణించిపోవునది. సంధులెడలి సడలిపోవునది. ఎప్పుడో ఒకనాడు తప్పక నశించును. దీనిని ఔషధములతో నిలబెట్టుటకు క్లేశపడెదవేల ? వ్యాధిగ్రస్తము కానీక కాపాడు కృష్ణ రసాయనమును త్రాగుము.     


     
33 వ శ్లోకం
దారా వారాకరవరసుతా తే తనూజో విరించి:
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గ: ప్రసాద:
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీతే 
మాతా మిత్రం వలరిపుసుతస్త్వయ్యతోన్యన్న జానే 

భావం:-
కృష్ణా! జలనిధి పుత్రియగు లక్ష్మి నీ భార్య. బ్రహ్మ నీ కుమారుడు. వేదము స్తోత్రపాఠకుడు. దేవతాగణము నీ భ్రుత్యకోటి. మోక్షము నీ అనుగ్రహము. ఈ జగత్తు నీమాయ. దేవకీదేవి నీ తల్లి. ఇంద్రపుత్రుడగు అర్జునుడు నీ మిత్రుడు. అట్టి నీకంటే ఇతర దైవమును ఎవరిని నేను ఎరుగను.  



         
34 వ శ్లోకం
కృష్ణో రక్షతు నో జగత్త్రయగురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం 

భావం:-
(ఈ శ్లోకమున చమత్కారముగ విభక్తులన్నిటిలోను --- అనగా ప్రథమా విభక్తి మొదలు సప్తమి విభక్తి వరకును, సంబోధన ప్రథమావిభక్తితో సహా -- కృష్ణ శబ్దమును నిర్దేశించి స్తుతించుచున్నారు.)  

కృష్ణుడు జగత్రయ గురువు. మమ్ములను రక్షించుగాక! కృష్ణుని నేను నమస్కరించుచున్నాను. కృష్ణుని చేత రాక్షసులు చంపబడిరి. కృష్ణుని కొరకు నమస్కరించుచున్నాను. కృష్ణుని నుండి ఈ జగత్తు బయటపడినది. కృష్ణునకు నేను దాసుడను. కృష్ణుని యందే ఈ సర్వజగత్తు నిలిచియున్నది. ఓ కృష్ణా! నన్ను రక్షింపుము.    


    
35 వ శ్లోకం

తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే
విష్ణో కృపాం పరమకారుణిక: కిల త్వం

సంసారసాగరనిమగ్నమనంత దీనం

ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి  



భావం:-
సర్వేశ్వరా! అనాధుడనగు నాయెడల దయచూపుము. అనుగ్రహింపుము. నీవు పరమదయామయుడవు కదా! హరే! అనంత! ఈ సంసార సాగరంలో మునుగు దీనుడను ఉద్ధరింపుము. నీవు పురుషోత్తముడవు కదా!  


        

36 వ శ్లోకం
నమామి నారాయణ పాదపంకజం

కరోమి నారాయణ పూజనం సదా

వదామి నారాయణ నామ నిర్మలం

స్మరామి నారాయణ తత్త్వమవ్యయం  



భావం:-
శ్రీమన్నారాయణుని పాదపద్మములకు నమస్కరింతును. నారాయణుని సదా పూజింతును. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును. శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.     




37 వ శ్లోకం

శ్రీనాథ నారాయణ వాసుదేవ

శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే
శ్రీపద్మనాభాచ్యుతకైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే 

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ
గోవింద దామోదర మాధవేతి
వక్తుం సమర్థోపిన వక్తి కశ్చిత్ 
అహో జనానాం వ్యసనాభిముఖ్యం 

భావం:-
శ్రీనాథ! నారాయణ! వాసుదేవ! శ్రీకృష్ణ! భక్తప్రియ! చక్రపాణి! శ్రీపద్మనాభ! అచ్యుత! కైటభారీ! శ్రీరామ! పద్మాక్ష! హరీ! మురారీ! అనంత! వైకుంఠ! ముకుంద! కృష్ణ! గోవింద! దామోదర! మాధవ! అని పలుకగలిగిన మనుజుడు కూడా పలుకుటలేదు. అయ్యో! ఈ వ్యాసాన లంపటత్వమెంతటిది!   


                    
38 వ శ్లోకం
ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం
సమాహితానాం సతతాభయప్రదం
తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం

భావం:-
సతతము హృదయ పుండరీకమధ్యమున సుస్థిరముగ నిలిచి ఉన్నవాడును. తనను ధ్యానించు వారలను సతతము అభయ మొసంగువాడును, ఆద్యంతములు లేనివాడును, శాశ్వతుడును అగు ఆ విష్ణువును ఎవరు ధ్యానింతురో వారు విష్ణు సంబంధమనెడి పరమసిద్ధిని పొందుదురు.   


   
39 వ శ్లోకం
క్షీరసాగర తరంగశీకరా-
సారతారకిత చారుమూర్తయే
భోగిభోగ శయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమ: 

భావం:-
క్షీరసాగరమున తరంగముల జల్లులచే అచ్చటచ్చట నక్షత్రములు పొడమినట్లున్న సుందర విగ్రహుడు, శేషభోగశయ్యపై పవళించిన మధుసూదనుడగు మాధవునికి నమస్కారము. 


  
40 వ శ్లోకం
యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మవరపద్మ శరావభూతాం
తేనాంబుజాక్ష చరణాంబుజ షట్ పదేన
రాజ్ణా కృతా కృతిరియం కులశేఖరేణ 

భావం:-
వేదవిద్యా ప్రతిష్ఠాపకులు, కవిలోక వీరులు అగు "ద్విజన్మ పద్మశరులు" ఎవరికీ మిత్రులై ఉండిరో, ఆ పుండరీకాక్ష పదాంబుజ భ్రుంగమగు కులశేఖర మహారాజు ఈ కృతిని నిర్మించెను. 

కులశేఖరునకు ద్విజన్మవర, పద్మశరులను ఇద్దరు మిత్రులుండిరి. ఆ ద్విజన్మవరుడు వ్యాసుడో, వాల్మీకియో అయి ఉండివలెననియు, పద్మశరుడు శగోపులనెడి ఆళ్వారు(నమ్మాళ్వారు) అనియు పెద్దలు చెప్పుచుందురు. అందు కవిలోకవీరుడనుటచే ఆదికవియగు వాల్మీకియే ద్విజన్మవరుడని, ఆయన శ్రీరామాయణమున వేదోపబృంహణము చేయుటచే శృతిధరుడు అనియు చెప్పవచ్చును. తమిళమున, సంస్కృతమున ప్రసిద్ధులగు కవులలో శగోప, వాల్మీకులు ఆద్యులు కనుక వారినే ఇక్కడ పెర్కొనెనని చెప్పవచ్చును. శగోపునకు "మారన్" అని తమిళ నామము. మారుడనగా మన్మథుడు కనుక దానికి సంస్కృత పర్యాయమగు పద్మశరుడు అని ఇందులో ప్రయోగింపబడినది.    


                    

||ఇతి శ్రీముకుందమాలా సంపూర్ణం||

2 comments:

  1. నమస్కారం... ముకుందమాల తాత్పర్యం అద్భుతం గా ఉంది.

    ReplyDelete