October 10, 2013

అమ్మవారి నామాల్లో మనకు గోచరించే స్ఫూర్తి

అమ్మవారి నామాల్లో మనకు గోచరించే స్ఫూర్తి 

దుర్గాదేవికి తెలిసిన సౌందర్యం లోకంలో మరెవరికీ తెలియదు. స్త్రీ తన శరీరంలో నలభైఏడు స్థానాల్లో అలంకరించుకోవచ్చని అ జగన్మాత నిరూపిస్తుంది. తలమీద ధరించే కిరీటం నుంచి కాలికి పెట్టుకొనే ఆభరణం వరకు ఏయే భాగాలలో ఏవి అలంకరించుకుంటే బాగుంటుందో అమ్మవారిని చూసి తెలుసుకోవచ్చును.

చేతికి గాజులు ధరించి అవి అటూఇటూ కదిలినప్పుడు మణికట్టుకి రాపిడి కలగాలి. ఇది సంతానప్రాప్తికి దోహదం చేసే అంశంగా ఉపయోగపడుతుందని లలితాసహస్రం మనకు తెలియచేస్తుంది.

"చంపకాశోక పున్నాగ,సౌగంధిక లసత్కచా"......అంటే లలితాదేవి చంపక, అశోక, పున్నాగ, సంపెంగ వంటి సువాసనలిచ్చే పువ్వులని అలంకరించుకుంటుంది. అశోకపువ్వు జుట్టులోని ఒత్తుదనాన్ని తగ్గించదు. పున్నాగ క్రిములూ, కీటకాలను దూరం చేస్తుంది. ఇలా సౌందర్యముతో పాటు, కేశ సౌందర్యానికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శ్లోకాలు తెలియచేస్తాయి. పూలు పెట్టుకోవటం, సహజ ఉత్పత్తులతో అలంకరణ చేసుకోవటం అనుసరణీయమని సూచిస్తాయి.

పసిడికాంతులకు ఓటు 

"తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా"......... ఆకాశంలోని నక్షత్ర కాంతి కన్నా దుర్గామాత ధరించే ముక్కుపుడక, నత్తు. ఈ రెండింటికే ఎక్కువ కాంతి అని అర్థం. నాసికకు బంగారు నగలు ధరించటం వల్ల, శ్వాసతీసుకొనేటప్పుడు ఇబ్బందులు ఉండవు. అలాగే పసిడి చర్మానికి తగలటం వల్ల చర్మసమస్యలు రాకుండా ఉంటాయి. దానికి ఒత్తిడిని నివారించే శక్తి ఉంటుంది. అందుకే వివాహితులైన స్త్రీలు మంగళసూత్రం ధరించాలి అంటారు.

ఇద్దరిదీ ఒకే మాట   

వేయినామాల్లో నీకు ఏది అత్యంత ప్రీతిపాత్రమైనది అని శంకరుడు పార్వతీదేవిని అడుగగా..... అమ్మవారు వెంటనే "కామేశ బుద్ధ మాంగల్యసూత్ర శోభిత కంథరా" అంటూ బదులిస్తుంది. అమ్మవారికి భర్తను ఎలామంచిచేసుకోవాలో తెలుసును. అందుకే తనకు ఇష్టమైన ఆభరణం మెడలోని మాంగల్యమని సమాధానమిచ్చింది. మాట్లాడేతీరుకి ఎప్పుడూ మంచి మార్కులుంటాయి. ముఖ్యంగా భర్తతో మాట్లాడే తీరు జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. శంకరుడు, పార్వతీ ఒకే దేహంలో చెరిసగం. అందువల్ల ఆలోచన నుంచి ఆచరణ దాకా ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట. సంసారాలు నిలబడాలంటే ఇదే సాధన అవసరం. 

ఆరోగ్య సూచనలూ అందులోనే 

గర్భం దాల్చి, నవమాసాలు సజావుగా సాగి, పండంటిబిడ్డను చేతుల్లోకి తీసుకోవాలంటే.... స్త్రీలు కొన్ని   రకాల ఆహారం తీసుకోవాలి. "పాయసాన్న ప్రియా" అంటే మొదటి నెలలో పాయసాన్నం తీసుకోవాలి. "వదనద్వయ సంయుత... స్నిగ్ధౌదన ప్రియా"...... రెండో నెలలో నేతితో తడిపిన అన్నం తినాలి. మూడో నెలలో "గూడాన్న ప్రీత మానసా"..... బెల్లపు అన్నం తినాలి. నాలుగో నెలలో "దధ్యాన్న సక్త హృదయా"..... పెరుగు అన్నం తినాలి. ఆరో నెలలో "హరిద్రాన్నైక రసికా".... పులిహోర, ఏడో నెల వచ్చేసరికి తీసుకొనే ఆహారం మోతాదు పెంచాలి. "సర్వౌదన ప్రీత చిత్తా"..... అన్నిటితో కలిపిన ముద్ద తినాలి. అప్పుడే ఆరోగ్యం బావుంటుంది.

ఓర్పు --- నేర్పు 

ఇల్లాలిగా మహిళ నిర్వహించే బాధ్యత ఎంతో విలువైనది. "హరనేత్రాగ్ని సందిగ్ధ కామ సంజీవనౌషధి"  అని లలితాసహస్రంలో శంకరుడు మన్మధుడిని మసిచేయటం గురించి చెప్పబడింది. భర్త చేసిన దానికి  పార్వతి నలుగురిలో చులకన చేయలేదు. అలాగని సాటి మహిళని రతీదేవిని వితంతువుగా చూడాలనుకోలేదు. అందుకే చాకచక్యంగా సమస్యను పరిష్కరించింది. కేవలం రాతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపించేలా చేసింది. దుర్యోధనుడు అమ్మవారివద్దకు వెళ్లి పూజించినప్పుడు "యతో ధర్మః , తతో జయః" అని దీవిస్తుంది. ధర్మం ఉన్నవైపే విజయం అని పరోక్షంగా తెలియచేస్తుంది.......   

               

    

No comments:

Post a Comment