October 29, 2013

దీపావళి పర్వదినం (పండుగ) విశేషాలు

దీపావళి పర్వదినం (పండుగ) విశేషాలు



హిందువుల (భారతీయుల) పండుగులలో ముఖ్యమైనది దీపావళి పండుగ. వయోభేదం లేకుండా, కులమతాలకతీతంగా యావత్భారతదేశం అంతా ఐకమత్యంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపావళి పండుగ.
నరకాసురుడు అనే రాక్షసుని సంహారంతో, ప్రజలు ఈతిబాధల నుండి విముక్తి పొందటంవల్ల, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగే ఈ దీపావళి పండుగ. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి రావటంతో, సీతమ్మ ఒక దీపాన్ని వెలిగించటంతో, ఆ రాజ్యంలోని ప్రతీ ఇంటిలోనూ దీపాలు వెలిగించి అందరు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ చేసుకున్నారు అని ఒక కథనం. జగతిలోని చీకటిని పారద్రోలి, దీపాలతో అంతటా వెలుగును నింపే పండుగ కనుక ఈ పండుగను దీపావళి పండుగ అని అంటారు. ఈ పండుగను ప్రతీ సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీనినే నరక చతుర్థశి అంటారు.

దీప + ఆవళి = దీపాల సమూహం అని అర్థం.

ఈ దీపాలని పెట్టడంలో రెండు అర్థాలు దాగి ఉన్నాయి. చీకటితో నిండి ఉండేది నరకం కాబట్టి, చీకటి నిండియున్న  ఈ అమావాస్యలో పితృదేవతలందరికీ త్రోవని చూపించేందుకు దీపాలని పెడతారు అని ఒక విశేషం. ఇక రెండోది -- లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ప్రీతి. ఇంటినిండుగా దీపాలున్న గృహమంటే ఆమెకు ఎంతో ఇష్టం.


పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషపడి, ఒక విలువైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని అహంభావముతో తన దగ్గర ఉన్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కినుజ్జు నుజ్జు చేసింది. అది చూసిన దుర్వాసమహర్షి ఆగ్రహముతో  దేవేంద్రుని శపిస్తాడు. శాప ఫలితంగా  దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని ఏం చెయ్యాలో పాలుపోక  మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. విషయం గ్రహించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సలహా ఇస్తాడు.ఇంద్రుడు విష్ణువు చెప్పినట్లే చేయగా,   లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. నిన్ను ఏ విధంగా పూజిస్తే నీ కృపకు పాత్రులమవుతాము?? అంతట మహాలక్ష్మి " త్రిలోకాథిపతీ.!. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి కోర్కెలకు  అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, సంతానాన్ని కోరే వారికి సంతానలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునిఅవుతాను" అని   సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.



నరకాశురుని చరిత్ర...

ఆశ్వయుజ బహుళ చతుర్థశినే నరక చతుర్థశి అంటారు.పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు సామాన్యులను, ఋషులను, మునులను అందరినీ హింసించి, వేధిస్తూఉండేవాడు. కృతయుగం నాటి మాట. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని ఎత్తుకొని వెళ్ళి సముద్రం అడుగున దాగుకొనగా, విష్ణుమూర్తి వరాహఅవతారమున వచ్చి, హిరణ్యాక్షుని సంహరించి, భూదేవిని సముద్రంలోనుండి పైకి తెచ్చెను. ఆ సమయమున వరాహ అవతారుడైన విష్ణువుకి-- భూదేవికి అసురసంధ్యా సమయంలో జన్మించినవాడే నరకాసురుడు.  అసురసంధ్యా సమయమున జన్మించుట వలన.... నరకునికి అసుర లక్షణాలు కలిగియుండుట వలన, నరకుడు లోకకంటకుడై... ప్రజలను, ఈతిబాధలకు గురిచేసేవాడు. అతడు లోక కంటకుడైనా కానీ మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా మహావిష్ణువు నుండి వరం పొందుతుంది భూదేవి. నరకుని బాధలు తాళలేక ఇంద్రాదిదేవతలంతా వెళ్ళి  విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించారు. భూదేవి సత్యభామగా  అవతరించింది. శ్రీకృష్ణుడు నరకుని సంహారమునకై వెళుతుండుట గమనించి,  సత్యభామాదేవి కూడా  రణరంగానికి వెళ్ళింది. భూదేవికి -- నరకునికి మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. అందుకే ప్రజలు ఈ రెండు రోజులు  ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.




విశేషాలు 

 అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు. పుత్రులు లేని వారికి పున్నామనరకం నుండి తప్పించటానికి, దీపావళి నాటి ఈ దీపాల వెలుగే దారి చూపుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.



సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించి, దిబ్బు దిబ్బు దీపావళి.......మళ్ళీ వచ్చే నాగులచవితి...అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి, లేదా ఆముదం కొమ్మలకి  చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి,  దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజామందిరంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి, దీపాలకి నమస్కరించి, లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజిస్తారు. (లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలంటే చాలా ఇష్టం. అందుకని దీపావళి నాడు తెల్లని బట్టలని ధరించాలని శాస్త్రం చెబుతున్నది.) పూజానంతరం అందరూ ఉత్సాహంగా రకరకాల బాణాసంచా కాల్చుతారు.ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి మన పురాణాలలో ఒక ప్రయోజనం చెప్పబడింది.  ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశించి,  వాతావరణం ఆహ్లాదంగా ఏర్పడుతుంది. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి వారు కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.


పిల్లాపెద్ద వయోభేదం లేకుండా అందరూ కలసి ఆనందంగా జరుపుకొనే ఆనందాల దీపావళి మతాబులు          
      

అమావాస్యనాడు వెన్నెల వెలుగులు 



మిత్రులందరికీ దీపావళి పర్వదిన (పండుగ) శుభాకాంక్షలు :) 

No comments:

Post a Comment