September 13, 2013

విజయదశమి (దసరా)

విజయదశమి (దసరా)  

ఏ పండుగ అయినా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ అమ్మవారి పండుగ సంవత్సరానికి రెండుమార్లు వస్తుంది. ఎలాగ అంటే, ----చైత్రమాసంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంతనవరాత్రులు ఒకసారి...... ఆశ్వీయుజ మాసంలో పాడ్యమి నుండి విజయదశమి వరకు శరన్నవరాత్రులు మరొకసారి ..... జరుగుతాయి.

మాసాల్లో మొదటిది చైత్రమాసం, నక్షత్రాలలో మొదటిది అశ్విని. చైత్రమాసంలో నవరాత్రులను వసంతనవరాత్రులు అని, నక్షత్రాలలో మొదటిది అయిన అశ్విని ప్రధానంగా ఉండే ఆశ్వీయుజమాసంలో నవరాత్రులను శరన్నవరాత్రులు అని,  రెండుమార్లు నవరాత్రులను జరుపుకుంటాము. ఒకటి ఉత్తరాయణంలో ...... మరొకటి దక్షిణాయనంలో రావటం మరొక విశేషం.

మరో విశేషం కూడా ఉంది. చైత్రమాసపు నవరాత్రులు అశ్వినీ నక్షత్రంతో ప్రారంభమైతే, అశ్వినీ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే ఆశ్వీయుజమాసపు నవరాత్రులు చిత్తా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మరొక విశేషం ఏమిటంటే ...... నక్షత్రాలు 27 లో మొదటిది అశ్విని అయితే సరిగ్గా మధ్యగా వుండే నక్షత్రం చిత్త. అలాగే మాసాల్లో 12 లో మధ్యగా వుండే మాసం ఆశ్వీయుజం. ఆరింటిలో మొదటిది చైత్రమాసం అయితే..... మధ్యగా ఉండే మాసం ఆశ్వీయుజం...... అదే విధంగా ఋతువులలో మొదటిది వసంతమైతే ... మధ్యది శరదృతువు.

ఇది అంతా ఎందుకు అంటే... అమ్మవారు ఆదిలోనూ, మధ్యలోనూ కూడా పూజింపబడే విధంగా ఏర్పాటుచేసుకొని మనల్ని అనుగ్రహించాలి అనే కరుణాబుద్ధి కలిగి ఉంది అని తెలియచేయటానికే. తిథులు 30 లో కూడా పూర్ణిమ వరకు పూజింపబడేది అమ్మ (ఆదిశక్తి) యే. (ప్రతిన్ముఖ రాకాంత తిథి మండల పూజితా).

ఇలా ఆయన -- ఋతువు -- మాస --- పక్ష --- తిథులలో రెండుమార్లు పూజింపబడుతూ తొమ్మిదిరోజులపాటు మరి ఏ ఇతర దైవానికీ పూజలు జరగనేజరుగవు.

యోగం అనేది మొత్తం కుండలినీశక్తికి సంబంధించి ఉంటుంది. "కుండలినీ" అనే శబ్దం సంస్కృతంలో స్త్రీలింగం. కాబట్టి ఈ కుండలినీ శక్తిని స్త్రీతో పోల్చి కుండలినీ శక్తినీ సాధించదలచి యోగాన్ని ప్రారంభించిన వ్యక్తికి కలిగే అనుభవాలన్నిటినీ క్రమంగా ఒక స్త్రీలో కలిగే మార్పులుగా వర్ణించి చెప్పారు మన (పూర్వీకులు) పెద్దలు.

అలంకారాల్లో యోగరహస్యం    

ఆ కారణంగా అమ్మవారి తొమ్మిది అవతారాల్లో సాధకునికి క్రమక్రమంగా జరిగే అభివృద్ధి తొమ్మిదిదశల్లో ఉంటుందని ప్రాచీనులు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ తొమ్మిది దశలు దాటిన సాధకుడు "దశ" అవస్థనాటికి విజయాన్ని సాధించి సిద్ధినిపొంది సిద్ధుడౌతాడు. ఆ సిద్ధినే "విజయ(దశమి)సిద్ధి"  అంటారు. 

నవరాత్రులలో ప్రతిరోజూ దేవికి వేసిన ఒక్కొక్క అవతారాన్ని(ఒక్కొక్క అలంకారాన్ని) సాధన చేసే సాధకుని ఒక్కొక్క మెట్టు అభివృద్ధుగా గమనించాలని మనం భావించాలి. ప్రతిరోజూ అమ్మవారి అలంకారాన్ని చూసి రావాలనే నియమాన్ని విధించింది  కూడా ఇందుకే..... సాధకుని ప్రతీ దశలోనూ అభివృద్ధిని గమనిస్తూ ఉండాలనే రహస్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికే ఇవన్నీను. 

ఆశ్వీయుజమాసం చిత్తా నక్షత్రం , పాడ్యమి కలసిన రోజున దేవినవరాత్రులు ప్రారంభించుతారు. ఏ సందర్భంలోనూ రాత్రిపూట కలశ స్థాపన రాత్రిపూట చేయకూడదు.                                    

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే ఉత్సవాలని దుర్గా నవరాత్రి ఉత్సవాలు అని అంటారు. అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారములలో మహిషునితో యుద్ధము చేస్తుంది. ఆఖరిరోజైన తొమ్మిదవరోజు మహిషుని సంహరించి, విజయం సాధించటంతో పదవరోజును విజయదశమి అని మనం పర్వదినాన్ని జరుపుకుంటాము.

 నవదుర్గ అవతార వైభవం 

ప్రధమా శైలపుత్రీచ -- ద్వితీయ బ్రహ్మచారిణీ ;
తృతీయా చంద్ర ఘంటేతి -- కుష్మాండేతి చతుర్థికీ ;
పంచమా స్కంద మాతేతి -- షష్టా కాత్యాయనేతి చ;
సప్తమా కాళ రాత్రిశ్చ -- అష్టామాచాతి భైరవీ;
నవమా సర్వసిద్ధిశ్చేతి -- నవదుర్గాః ప్రకీర్తితా ||



(1) శైలపుత్రీ: 

వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||            
   

దుర్గామాత తన మొదటి అవతారంలో శైలపుత్రి నామంతో అవతరించెను. పర్వతరాజు హిమవంతునికి పుత్రికగా జన్మించిన కారణముచే శైలపుత్రి అని నామం వచ్చెను. ఈమె వృషభముపై కూర్చొని యుండును. కుడిచేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము ధరించియుండును. నవదుర్గలలో ప్రధమదుర్గయైన శైలపుత్రి శక్తి అనంతము. నవరాత్రులలో ఈ ప్రధమదిన ఉపాసనయందు యోగులమనస్సు మూలాధారచక్రమునందు నిలిపియుంచెదరు. ఇప్పటినుండియే యోగుల యోగసాధన ప్రారంభమగును.

మొదటిరోజు అమ్మవారికి నైవేద్యం------ కట్టుపొంగలి........ ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/07/blog-post_18.html



(2) బ్రహ్మ చారిణి: 

దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||      

దుర్గామాత నవశక్తులలొ రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మ శబ్దమునకు అర్థం తపస్సు. బ్రహ్మచారిణి అనిన తపస్సును ఆచరించేది అని అర్థం. 'వేదస్తత్వం తపోబ్రహ్మ' వేదము, తత్వము, తపస్సు అని బ్రహ్మ శబ్దమునకు అర్థములు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్ణజ్యోతిర్మయమై అత్యంత మనోహరముగా ఉండును.  ఈమె తన కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరిస్తుంది. ఈ తల్లిని పూజించిన సర్వత్రా సిద్ధి, విజయం, సాధకుడికి మనస్సు స్వాధిష్టాన చక్రంలో స్థిరమవుతుంది. ఈమె కఠిన ఆహార నియమాలు ఆచరించి అపర్ణ అయింది.

రెండవరోజు నైవేద్యం -------- పులిహోర..... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post.html

(3) చంద్రఘంట: 

పిండజప్రవరూరుఢా చండకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా ||      


దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట. ఈమె స్వరూపము పరమశాంతిదాయకమై, శుభములు చేకూర్చునిదై యున్నది. ఈమె శరీరము పసిడి వన్నెతో మెరయుచుండును. ఈమె శిరస్సుపై అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు సార్థకమైనది. ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది. ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది. ఈ దినమున సాధకుని మనస్సు మనిపూరచక్రమునందు యుండును. ఈమెను ఆశ్రయించిన సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారు. ఇహలోకంలోనేకాక పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది. ఈమె వాహనము సింహము. 

మూడవరోజు నైవేద్యం ----- కొబ్బరి అన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_10.html

(4) కూష్మాండ:

సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||        

దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండాదేవి.  దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా సృష్టిస్తుంది. కాబట్టి ఈమెకు ఆ  పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని. రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈమెకు గుమ్మిడికాయను బలిగా సమర్పిస్తారు. ఈ దేవిని ఉపాసిస్తే సాధకుని మనసు అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. మనపురాణాలలో తెలిపిన విధంగా దుర్గామాతను మనం భక్తితో పూజించి ఒక అడుగు ముందుకు వేసినచో.... మనలను రక్షించుటకు ఆమె ముందుకు వచ్చును.సహృదయముతో ఈమెను శరణు వేడిన పరమపదము అతి సులభముగా లభించును.


నాలుగవరోజు నైవేద్యం ----- చిల్లులేని అల్లం గారెలు....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_755.html

(5) స్కందమాత 

సింహాసనాగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కంధమాతా యశస్వినీ||        

దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది.పద్మాసనాదేవి అనికూడా అంటారు. ఈమె వాహనం సింహవాహనం.ఈమెను ఉపాసించిన సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో  స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందుతారు. స్కందమాతను పూజించిన స్కందభగవానుని కూడా పూజించినట్లు అగును. సూర్యమండలమునకు అధిష్టానదేవి యగుటచే, ఈమెను పూజించిన ఉపాసకులు తేజోవంతులగుదురు. ఈ సంసారసాగర దుఃఖముల నుండి విముక్తి చెంది మోక్షమార్గము చేరుటకు వేరే ఉపాయము లేదు.

ఐదవరొజు నైవేద్యం ------ పెరుగు అన్నం. (దద్ధోజనం) ....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/07/4-12-5-4.html

(6) కాత్యాయని 

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్వాద్దేవీ దానవఘాతినీ||      

పూర్వం 'కతి' అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గోత్రీకుడే కాత్యాయన మహర్షి. ఇతడు ఈ దేవి తనకు కుమార్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. తపస్సు ఫలించింది. మహిషాసురుడిని సంహరించటంకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో దేవిని సృష్టించారు. మొదట కాత్యాయని మహర్షి తల్లిని పూజించాడు. కాబట్టే 'కాత్యాయని' అనే పేరు వచ్చింది. కాత్యాయని మహర్షి ఇంటిలో పుట్టింది. కాబట్టి కాత్యాయని అయింది అనే కథకూడా ఉంది. ఈమె చతుర్భుజి. ఎడమచేతిలో ఖడ్గం, పద్మాన్ని ధరిస్తుంది. కుడిచేయి అభయముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఉపాసించిన సాధకుడి మనసు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది. తన సర్వస్వమునూ ఈ తల్లి చరణాలలో పరిపూర్ణంగా సమర్పించాలి. అప్పుడు ఆమె అనుగ్రహించి రోగాలనూ, శోకాలనూ, భయాలనూ పోగొడుతుంది. ధర్మార్థకామమోక్షాలను ప్రసాదిస్తుంది.ఈమె వాహనం సింహము.  

ఆరవరోజు నైవేద్యం ----- రవ్వ కేసరి....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_8660.html


(7) కాళరాత్రి 

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణితైలాభ్యక్త శరీరిణి|
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ||  



ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు. ఈ తల్లిని గనక ఉపాసిస్తే మనస్సు సహస్రార చక్రంలో స్థిరంగా ఉంటుంది. సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు.ఈమె వాహనము గాడిద.   

ఏడవరోజు నైవేద్యం ------ కూరగాయలతో అన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)   

http://swetaabhiruchi.blogspot.in/2013/10/blog-post_3911.html

(8) మహాగౌరి 

శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః|
మహాగౌరిశుభం దద్వాత్‌, మహాదేవ ప్రమోధరా||  
     
ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను, త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగిఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసింది. అందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది. ఆమె తపస్సుకు సంతోషపడిన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా ఈమె శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. ఈమె వాహనము వృషభము.  

ఎనిమిదవరోజు నైవేద్యం ----- చక్కెర పొంగలి (గుడాన్నం)...... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/06/2-12-4-1-1-50-25.html

(9) సిద్ధిధాత్రీ దేవి

సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||          

మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి. 

ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు నెరవేరతాయి.

తొమ్మిదవరోజు నైవేద్యం ----- పాయసాన్నం....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2017/09/blog-post.html

చిద్విలాసిని రాజరాజేశ్వరి 

ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షససంహారం చేసింది. ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది.        

అలాగే సువాసినీ పూజ. ప్రతిరోజూ ఒక మల్లెపూవును అమ్మవారిగా భావనచేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి, వస్త్రం, ఫలం సమర్పించాలి. ఈ పది రోజులూ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుంది. దేవీభాగవత పారాయణం, శ్రీదేవీ సప్తశతీ నిత్యపారాయణం శ్రేష్ఠం. దుర్గా ద్వాత్రింశమాలాస్తోత్రం 108సార్లు పారాయణం చేస్తే అఖండఫలితాలు లభిస్తాయి, అలాగే కుమారీపూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చు. రోజుకొక బాలికను పూజించాలి. వివిధ వయస్సులవాళ్ళు ఉంటే మంచిది. కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలి. భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి రుణను కోరితే తప్పక ఆమె కరుణిస్తుంది.

నైవేద్యం ----- చిత్రాన్నం,(నిమ్మ పులిహోర),  లడ్డూలు ....... (ఈ క్రింది లింకులో ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది. గమనించగలరు)  

http://swetaabhiruchi.blogspot.in/2013/04/ll-ll-4-2-4-12-2.html



సర్వేజనా సుఖినోభవంతు

7 comments:

  1. దసరా ఉత్సవాలు తిలకించడం తప్పా అమ్మవారి అవతారాల కోసం తెలుసుకోలేదు. ఇవి చదివాక రోజుకో అవతారం...దాని విశిష్టత. నైవేద్యం వివరాలు తెలుసుకో గలిగాను. ఈ బ్లాగ్ వలన మన సంస్కృతి...సంప్రదాయాలు....మన దేవతా మూర్తులు...ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు......INDU RAMANA

    ReplyDelete
  2. ధన్యవాదాలు రమణ గారు

    ReplyDelete
  3. చాల బాగుంది , ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము

    ReplyDelete
  4. ధన్యవాదాలు గోపాల్ జీ

    ReplyDelete
  5. హిందూ సమాజానికి మీరు చేస్తున్న కృషి
    అనిర్వచనీయమైనది !!!
    మీకు ప్రతి హిదువూ బాసటగా ఉండాలని కోరిక !!!
    RADHA RAO ( పాలమర్రి.రాధా కృష్ణా రావు ) :-D

    ReplyDelete
  6. ilaanti vivarana iffati vaariki kaavaali chaala baagunnadi

    ReplyDelete