December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఆరవ పాశురము

తిరుప్పావై పాశురాలు

ఆరవ పాశురము
పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్ 
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో 
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు 
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి 
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై 
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్ 
మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్ 
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్. !



భావం:--
భగదనుభవము క్రొత్తదగుటచే ఈవ్రతముయొక్క వైభవము తెలియక తానొక్కతియే తన భవనములో పరుండి వెలికిరాకయున్న ఒకముగ్ధను లేపుచున్నారు. ఆహారము నార్జించుకొనుటకై లేచి పక్షులు కలకలలాడుచు పోవుచున్నది. ఆపక్షులకు నాయకుడైన గరుక్మంతునకు స్వామియగు శ్రీమహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము సమయమైనది సేవలకురండని పెద్దధ్వని చేయుచున్నది. ఆ ధ్వని వినుటలేదా !ఓ పిల్లా !లెమ్ము, మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహము కలుగవచ్చును. పూతన స్తనములందుడు విషమునారగించినవాడును, అసురావేశము కలిగి చంపనుద్యమించిన కృత్రిమ శకటమును కీలూడునట్లు, పాలకై ఏడ్చి కాలుచాచి పొడిపొడి యగునట్లు చేసినవాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషసయ్యపై లోకరక్షణచింతతో యోగనిద్ర అమరియున్న జగత్కారణభూతుడునగు ఆ సర్వేశ్వరుని తమ హృదయముల పదిలపరుచుకొని మెల్లగా లేచుచున్న మునులను, యోగులను హరి - హరి హరియనుచుండునపుడు వెడలిన పెద్దధ్వని మా హృదయములలో చొచ్చి, చల్లబరచి, మమ్ములను మేల్కొల్పినది - నీవు కూడా లేచిరమ్ము. 

అవతారిక:-
ఈవ్రతమున ప్రధానముగా పొందవలసిన ఫలము భాగవత్సమాగమము. భగవత్సమాగమము అనెడి ఫలమును సాధించుటకు సాధనము కూడా ఆ సర్వేస్వరుడే ! ఈవ్రతము ఆచరించుటకు భగవత్సమాగమము పొందవలెనన్న కోరిక కలవారు అందరు అర్హులే. అని మొదటిరోజున అందరకు తెలియచేసిరి. సర్వేశ్వరుడే ఉపాయము , ఫలము అని నమ్మి భగవత్ప్రాప్తినే కాంక్షించు వారైనను ఇంద్రియములు వ్యాపారరహితముగా ఉండవు కనుక కాలక్షేపమునకు పరిపూర్ణమగు అనురాగముతో ఈవ్రత సమయమున చేయదగిన కృత్యములు ఇట్టివి అని వివరించుట జరిగింది. ఈవ్రతమునకు పదిరోజుల ముందుగ ... పదిమంది గోపికలను మేల్కొలిపి, వారితో కలిసి వ్రతమునకు సాగుదురు.  


No comments:

Post a Comment