December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పదహారవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పదహారవ పాశురము
నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ 
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ 
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ 
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై 
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ 
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్ 
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్. !



భావం:-- 
అందరకును నాయకుడై ఉన్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా ! లోనికి విడుపుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వరమును కాపాడు ద్వారపాలకా ! మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము. గోప బాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడను అగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచే 'పర' అను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట ఇచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి ఇచ్చిన వారము కాము. పరిశుద్ధ భావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేలుకొలుపుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ ! ముందుగానే నీవు కాదు అనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదానిని ఒకటి చేరి బిగువుతో నిలిచి ఉన్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయు. అని గోపికలు భవన పాలకుని, ద్వార పాలకుని అర్థించిరి. 

అవతారిక:-
గోపికలు --- నిద్రపోతున్న ఆనందవ్రజమున కృష్ణసంశ్లేష యోగ్యత కల గోపికలను అందరిని మేలుకొలుపుకొని నందగోప భవనమును చేరుకొనిరి. భగవానుని ఆశ్రయించినపుడు మహాపురుషుల ద్వారా ఆశ్రయించాలి అని చెప్పుచుందురు. అందుకే తాము కూడా భవనపాలకుని, ద్వారపాలకుని ప్రార్థించి -- నందగోపుని ఆశ్రయించి కృష్ణపరమాత్మను పొందాలని యత్నించుచున్నారు. 

దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ క్షేత్రపాలకుని ముందుగా సేవించి --- ద్వారపాలకుని, అమ్మవారిని, ప్రధానదైవాలని సేవించాలి. అంతర్యామిని ఉపాసన చేయువారు ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును వశపరచుకొని బుద్ధిద్వారా ఆత్మా స్వరూప జ్ఞానముతో పరమాత్మను ఉపాసింతురు. ఇవి అన్నియు కలసివచ్చునట్లు ఆండాళ్ళు ఈ వ్రతమును ప్రతిపాదించుచు కృష్ణావతారమున గోపికలు ఏ విధంగా శ్రీకృష్ణుని చేరిరో, ఆలయంలో దైవమును సేవించుటకు ఏ విధంగా వెళ్ళెదరో , భగవత్ ఉపాసన చేయువారు ఏ విధంగా ఉపాసింతురో మనకు ఈపాశురంలో తెలియచేసెను.                  


               

2 comments:

  1. Replies
    1. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్ (మాబాబాయ్) గారు 30 పాసురాలకి గీతాలు రాసారు ..... అతని వద్ద పుస్తక రూపంలో ఉన్నాయి

      Delete