December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పదమూడవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పదమూడవ పాశురము
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై 
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్ 
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్ 
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు 
ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్ 
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే 
పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్ 
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్ !


భావం:-- 
పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని, మనలను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పదితలలను హేలగా చిగుళ్ళు తుంపినట్లు తుంపి పారేసిన శ్రీరాముని గానము చేయుచు పోయి, మనతోడిపిల్లలందరును వ్రతక్షేత్రమును చేరినారు. లోన తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులుగలదానా ! లేడివంటి చూపులుగలదానా! శుక్రుడు ఉదయించుచున్నాడు. గురుడు అస్తమించుచున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణ విరహతాపము తీరునట్లు చల్లగా అవగహనమొనర్చి స్నానమొనర్పక పాన్పుపై పడుకొని ఉండెదవేల ? ఓ సుకుమార స్వభావా ! ఈ మంచిరోజున నీవు నీ కపటమును వీడి మాతో కలసి ఆనందమును అనుభవించు. 

అవతారిక:-
ఈ పాశురమున మేల్కొల్పబడుచున్న గోపిక నేత్ర సౌందర్యమున విశిష్ట స్థానమును ఆక్రమించినది. కంటియందు అందము ఉండవలనేగాని, ఆ శ్రీకృష్ణుడు వెదుకు కుంటూ రాకుండా ఎలా ఉండగలడు -- అనే ధైర్యముతో తన నేత్ర సౌందర్యమును భావించి తన ఇంటిలోనే పడుకొని ఉన్నది. నేత్రము అంటే జ్ఞానము. అజ్ఞానమునకు అందము స్వస్వరూపము - పరస్వరూపము స్పస్టముగా తెలియుట. జీవుడు పరమాత్మకే చెందినవాడు. పరమాత్మ చేతనే రక్షింపదగినవాడు. పరమాత్మనే పరతంత్రుడు అని తెలుసుకొనుట స్వస్వరూపజ్ఞానము. ఈవిధంగా తెలుసుకొనినవారు పరమాత్మను పొందుటకు తమకు తామై ప్రయత్నమేమీ చేయరు. అతని సొత్తు ఐన నన్ను అతనే స్వీకరిస్తాడు అని నిర్భయంగా ఉందురు. నేటి గోపిక కృష్ణునితో కలియవలెనని కోరిక ఉన్నను కృష్ణుని పొందుటకు తాను ఏ ప్రయత్నమూ చేయక కృష్ణుడు ఒకనాడు పడుకొని వదిలిన శయ్యను వాసన చూస్తూ, దాని స్పర్శనే అనుభవించుచు మోహము పొంది, శయనించి ఉండెను. అట్టి గోపికను ఈనాడు మేలుకొలుపుతున్నారు. 


                        

2 comments:

  1. బాగుందండి పోస్టింగ్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఆచారి గారు ___//l\\___

      Delete