October 29, 2022

బారసాల, ఉయ్యాలలో వెయ్యటం, బావిలో చేద

బారసాల చేసేటప్పుడు  సంప్రదాయం 
ఒక్కో కులం, మతం ఆచారం ఒక్కో ప్రాంతంలో వారి సంప్రదాయాలు వేరు వేరుగా ఉంటాయి. కొంతమంది 11వరోజు, 21, 29, 3వ నెల, 5వ నెల ఈవిధంగా వారి వారి వీలునిబట్టి బారసాల చేసుకుంటారు.

చంటిపిల్లని ఉయ్యాలలో వేసేటప్పుడు '

పెళ్లినాటి మధుపర్కం ఉంటే దానినే ఉయ్యాల లాగ కట్టుకోవాలి. లేకపోతె చంటిపిల్ల యొక్క అమ్మమ్మ పట్టుచీరని ఉయ్యాలగా కట్టాలి. రుబ్బురాయి పొత్రాన్ని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఇద్దరు పెద్ద ముత్తైదువులు తూర్పు పడమరలలో నుంచుని పొత్రాన్ని ఉయ్యాల పైనుండి ఇచ్చి, కింద నుండి అందుకోవాలి. అలా మూడుసార్లు చేసి పొత్రాన్ని ఉయ్యాలలో పాడుకోబెట్టాలి. దీని అంతరార్థం ఏమిటంటే ఉయ్యాలలో పడుకునే పిల్లలు అంత గట్టిగా బలంగా తయ్యారవ్వాలని అర్థం అని పెద్దలు చెబుతున్నారు. తరవాత పొత్రాన్ని తీసి పిల్లని పాడుకోబెట్టి హారతి ఇచ్చి ముత్తైదువులు పాటలు పాడుతారు.

ఈ వేడుక తరవాతనే బావిలో చేద వేస్తారు. ఈరెండు వేడుకలు ఒకేరోజు చేసుకోవచ్చును.                

బావి(నుయ్యి)లో చేద వేసి కప్పని మొక్కించటం 
బావి దగ్గరికి బాలింతను తీసుకువెళ్ళాలి. బాలింతకు నడికట్టు కట్టి, చెవులమీద నుండి తలకి గుడ్డ కట్టాలి.
పెరట్లో మొక్కల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని మూడు ముద్దలుగా చేసుకొని మూడు తమలపాకులలో ఉంచుతారు. ఆ మట్టిముద్దలు కప్పలు అన్నమాట. ఆ కప్పల పైన వరిపిండితో ముగ్గులు వేసి, తాంబూలంలో వెల్లుల్లిరెబ్బ, బెల్లం ముక్కని పెట్టి  నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. తరవాత బావి(నూతి)లో వేసే చేదలో 3కప్పలని అంటే 3మట్టిముద్దలని ఉంచి 3 సార్లు బావి నీటిలో కలపాలి. కప్పాకప్ప నీలాగే నా పిల్లలు గెంతాలి, చలాకీగా ఉండాలి అని చెప్పాలి. బావిలో నుండి తీసిన చేద నీటిలో పిల్లల బట్టలు తడిపి ఆరబెట్టిస్తారు. ఆరోజు నుండి పసిబిడ్డ బట్టలు తల్లి ఉతుక్కోవచ్చును.
కప్పలకి పెట్టిన తాంబూలాలని(అంటే బెల్లం ముక్క వెల్లుల్లి రెబ్బని) పిల్లలు లేని స్త్రీలకి తాంబూలంగా ఇచ్చి వారిచేత తినిపించాలి, ఆ విధంగా తింటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్మకం మన పెద్దవారికి. ఈ తంతు అంతా బావిదగ్గరనే చెయ్యాలి.
ఈరోజుల్లో పట్నాలలో నివసించేవారికి బావి అంటేనే తెలియదు. అందుకని ఒక బకెట్టు నీటిలో కప్పలని కలిపి ఆ నీటిని మొక్కలకి పోస్తున్నారు. ఈవిధంగా చేయటం వెనుక అంతరార్థం ఏమిటంటే గంగమ్మతల్లీ నీటిలో పడినా నా బిడ్డకి ఏవిధమైన ఆపదా కలిగించకుండా చల్లగా చూడుతల్లి అని గంగమ్మని వేసుకోవటం అని పెద్దలు చెబుతున్నారు.

ఈతంతు అంతా జరిగిన తరవాత బాలింత ఒక చెంబుతో నీరు ఇంట్లోకి తీసుకొని రావాలి. ఇంట్లోకి వచ్చేముందు బాలింత మరియు తాంబూలం తీసుకున్న స్త్రీలు వారు భర్తల పేర్లు చెప్పి గడపలో అడుగుపెట్టాలి. ఇది ఒక వేడుక మాత్రమే.     

No comments:

Post a Comment