November 19, 2013

కార్తీకమహాత్మ్యం పదునాల్గవరోజు కథ

కార్తీకమహాత్మ్యం పదునాల్గవరోజు కథ:-

ఆబోతును అచ్చుబోసి వదులుట(వృషోత్సర్గం)

కార్తీకమాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుక్తంగా కార్తీకవ్రతాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీకపౌర్ణిమ రోజున వృషోత్సర్గం చేస్తారో – వారియొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆవుయొక్క కోడెదూడను – అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే “వృషోత్సర్గం” అంటారు. ఈమానవలోకంలో ఏ ఇతర కార్యాచరణాల వలనా కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీకపౌర్ణమినాడు పితృదేవతా ప్రీత్యర్ధం ఒక కోడె(ఆవు)దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలాచేయుట వలన గయా – క్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రార్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది.

ప్రతీమనిషి యొక్క పూర్వీకులు – తమవంశమందు ఎవ్వరు అబోతుని దానమిస్తారో అని ఎదురుచూస్తూ ఉంటారు. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీకపౌర్ణమి రోజు వృషోత్సర్గం చేయనివాడు  ‘అంధతామిస్రము’ అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలనగానీ, ప్రతివర్షాబ్దికాల వలనగానీ, తీర్థస్థలాలలో తర్పణం వలనగాని,  వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పూర్వీకులు పొందరు. 
     
కార్తీకమాస వివిధ దానాలు – ఆహారనియమాలు

ఉసిరిక ఫలాన్ని దక్షిణాయుతంగా దానమిచ్చేవారు -- సార్వభౌములౌతారు.

పౌర్ణమి రోజున దీపదానము చేయటం వలన – త్రికరణ కృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని పొందుతారు. 

పౌర్ణమి రోజు లింగదానము వలన – సమస్త పాపహరము , అత్యంత పుణ్యదాయకం.  

ఈ దానాలు చేయుటవలన ఈజన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు.

ఇతరుల అన్నము
పితృశేషము
తినకూడనివి తినటము
శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళి భుజించుట
నువ్వులను దానము పట్టుట
ఈ ఐదు పనులు చేయకూడదు.

సంఘాన్నము, శూద్రాన్నాము, అపరిశుద్దాన్నము,  విధవ చేతి భోజనము తినకూడదు. ఆదివారము రోజు సూర్యచంద్రగ్రహణాల రోజులలోను , నిషిద్ధ రోజులలోను, రాత్రిపూట భోజనము నిషేదము. ఈనెలలో వచ్చే ఏకాదశి రోజు రాత్రి – పగలు రెండు పూటలూ కూడ భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము(అనగా తమ నీడ – శరీరము కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట) ఉత్తమమని పూర్వీకుల వాక్కు. 

ఈమాసంలో “తైలాభ్యంగనము- పగటినిద్ర – కంచుపాత్రలో భోజనము – పరాన్నభోజనము – గృహస్నానము – నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము – వేదశాస్త్ర నింద” ఈ ఏడింటిని జరపకూడదు.

సమర్థులై యుండీ కూడా నదీస్నానము చేయకుండా .....ఇంటివద్దే వేడినీటి స్నానము చేసినట్లయితే-----అది కల్లుతో స్నానము చేసినట్లు సమానమని బ్రహ్మశాసనము.

సూర్యుడు తులారాశిలో ఉండగా నదీస్నానము అత్యంత ప్రధానము. దగ్గరలో నదులు లేకపోయినట్లైతే .....చెరువులో గానీ, కాలువలలో గానీ, నూతి(బావి)వద్ద గానీస్నానము చేయవలెను. అటువంటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ స్నానము చేయాలి. ఎక్కడ చేసినా ప్రాతఃకాలమునే చెయ్యాలి.
అలా చేయనివారు నరకానికి పోయి, ఛండాలపు జన్మనెత్తుతారు. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని, సాయంకాలం మరల స్నానము చేసి, షోడసోపచారాలతో భగవన్నామ స్మరణ చేయాలి.     

షోడసోపచార పూజా సంకల్పం
1) ఓం నమః                        -- ధ్యానం సమర్పయామి (పుష్పాక్షతలు)
2) ఓం సధ్యోజాతాయ నమః        -- పాద్యం సమర్పయామి (నీటిచుక్కని చల్లాలి)
3) ఓం లోకేశ్వరాయ నమః          -- అర్ఘ్యం సమర్పయామి (నీటిని జల్లాలి)
4) ఓం వామదేవా నమః             -- ఆచమనీయం సమర్పయామి ( నీటిని జల్లాలి)
5) ఓం గంగాధరాయ నమః          -- స్నానం సమర్పయామి (
6) ఓం నీలకంఠాయ నమః           -- వస్త్రం సమర్పయామి (వస్త్రయుగ్మం)
7) ఓం త్రయంబికాయ నమః          -- ఉపవీతం సమర్పయామి (ఉపవీతం)
8) ఓం భాక్తవత్సలాయ నమః         -- గంధం సమర్పయామి (కుడిచేతి వ్రేలితో గంధం చిలకరించాలి)
9)  ఓం అంబికానాధ నమః            -- అక్షతాన్ సమర్పయామి (అక్షతలు)
10) ఓం త్రిలోకేశాయ నమః           -- పుష్పం సమర్పయామి (పువ్వులు)
11) ఓం విశేస్వరాయ నమః             -- ధూపమాగ్రాపయామి( అగరబత్తి లేక సాంబ్రాణి ధూపమీయాలి)
12) ఓం భూతపతయే నమః            -- దీపం సమర్పయామి ( ఒక వత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపాలి)
13) ఓం సర్వభూత దమనాయ నమః       -- నైవేద్యం సమర్పయామి (శక్తి కొలది నివేదన చేయాలి)
14) ఓం మనోన్మనాదాయ నమః           -- తాంబూలాదికం సమర్పయామి(5 తమలపాకులు, 2 పోక చెక్కలు సమర్పించాలి.)
15) ఓం భవాయ నమః                       -- నీరాజనం సమర్పయామి
16) ఓం దేవదేవాయ నమః                  -- నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాలి)

ఈ విధంగా మాసమంతా పూజించాలి.  అనంతరము యధాశక్తి దీపాలను వెలిగించి, బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈవిధంగా వ్రతాన్ని ఆచరించినవారు, వంద వాజపేయాలు, వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక చతుర్దశి రోజు బ్రాహ్మణులకు భోజనము పెట్టుటవల్ల, వారి పితృ(పూర్వీకు)లందరూ కూడా సంతృప్తులౌతారు...... ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వల్ల – పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. 

ఈరోజు (చతుర్దశి రోజు) ఉపవాసం ఉండి, శివారాధన చేసి, తిలలను దానం చేసిన వారు కైలాసమునకు క్షేత్రధిపతి అవుతారు. ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా, వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.

             -:కార్తీక మహాత్మ్యం పదునాల్గవ రోజు పారాయణం సమాప్తం:-


No comments:

Post a Comment