November 29, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ముప్పదవ రోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ముప్పదవ రోజు కథ

శ్రద్ధగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని, శౌనకాది ఋషులు మహాభాగా ! కలియుగ కల్మషగతులు, రాగాదిపాశయుక్త సంసారగ్రస్తులూ అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది ? అన్ని ధర్మాల్లోనూ అధికమైనది ఏది ? దేవతలందరిలోనీ దేవాది దేవుడు ఎవరు ? దేనివల్ల మోక్షం కలుగుతుంది. మొహం దేనివలన నశిస్తుంది ? జరామృత్యు పీడితులు, జడమతులు మందులూ అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి ? అని అడిగాడు. అనంతరం సూతుడు ఈ విధంగా చెప్పసాగెను మంచి ప్రశ్నలను వేశారు. ఇటువంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాలను దర్శించి, ఆయా క్షేత్రాలలో స్నానాదులు చేయడం వలన వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్లా  కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణువు  ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినీ కాను, సమయమూ చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి.

విష్ణుభక్తి కంటే తరుణోపాయము లేదు. విష్ణు గాథలను వినేవాళ్ళు విగతపాపులై, నరకానికి దూరంగా ఉంటారు. హరి ప్రీత్యర్థకంగా స్నాన, దాన జప, పూజ, దీపారాధనలను చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశియందు ఉండే నెలరోజులూ కూడా క్రమం తప్పకుండా కార్తీక వ్రతమును ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులౌతారు. కార్తీక వ్రతమును చేయనివాళ్ళు, కుల, మత, వయో లింగబేధము లేకుండా 'అంధతామిస్రము' అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీనదీ స్నానం చేసినవాళ్ళు దేవతలచే కీర్తింపబడి, విష్ణు లోకాన్ని చేరుతారు. కార్తీకస్నానం చేసి, విష్ణు అర్చన చేసినవాళ్లు వైకుంఠమును చేరుతారు. ఈ వ్రత ఆచరణ చేయనివాళ్ళు వెయ్యిసార్లు ఛండాలపు జన్మలపాలు అవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకమూ, పుణ్యకరమూ అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధానం ధన -ఫల -ధాన్య-గృహాది దానాలు అమిత పుణ్యఫలాలు. కార్తీకము ముప్పది రోజులూ కార్తీక మహాత్మ్యాన్ని వినినా - పారాయణ చేసినా కూడా సకల పాపాలూ నశించిపోతాయి. సంపదలు కలుగుతాయి. పుణ్యాత్ములు అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణ వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి.
                                                          
కార్తీకమాసం ముప్పదవ(ఆఖరి)రోజు కథ పారాయణం సమాప్తం



దీపతో లభతే విద్యాం - దీపదో లభతే శ్రుతమ్‌| 

దీపతో లభతే చాయు: - దీపతే దివమ్‌||

దీపంజ్యోతి పరంబ్రహ్మదీపం సర్వతమోపహం | 

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే || 


____//\\____  సర్వేజనా సుఖినోభవంతు _____//\\____

No comments:

Post a Comment