November 22, 2013

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైమూడవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం ఇరవైమూడవరోజు కథ

దైవకృప వలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రునివలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యాశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ - ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై, విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణువుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరమూ కూడా శ్రీహరి పూజప్రియుడై - ఏ దేశాలలో, ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏఏ విధాలుగా పూజించటం వలన తన జన్మ తరిస్తుందా - అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా - ఒకనాడు ఆకాశవాణి -"పురంజయా ! కావేరీతీరంలో శ్రీరంగక్షేత్రం వుంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసియున్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి .... జనన - మరణాల నుంచి కడతేర్చమని ప్రభోదించడంతో , రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి - తగినంత చతురంగ బలయుక్తుడై - అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ , కావేరీనదిలో స్నానాదులని, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ, ప్రతీక్షణమూ కూడా 'కృష్ణా ! గోవిందా ! వాసుదేవా ! శ్రీరంగనాథా ! అని హరినే స్మరిస్తూ జపదానాది విధ్యుక్త ధర్మాలన్నిటినీ నిర్వర్తించి, కార్తీకమాస వ్రతం పూర్తిచేసుకొని - పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదులను పొంది, కొన్నాళ్ళకు సర్వభోగ వివర్జితుడై, భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి - కార్తీక వ్రతాచరణ - విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠమును చేరుకున్నాడు.

కార్తీకమాసం ఇరవైమూడవరోజు కథ పారాయణం సమాప్తం

    

No comments:

Post a Comment